‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ప్రకటన వివరాలు
బీటెక్ విద్యార్హతతో ఆర్మీలో సేవలందించే అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్నవారినీ, చివరి ఏడాది చదువుతున్నవారినీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ)ల్లోకి ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఆర్మీ టీజీసీ ప్రకటన పూర్తి వివరాలు..
ఆసక్తి ఉన్నవారు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం లేదు. వచ్చిన దరఖాస్తులను బీటెక్ మార్కుల మెరిట్ ప్రకారం వడపోస్తారు. ఇందులో నిలిచినవారిని సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ), బెంగళూరు ఆధ్వర్యంలో.. ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటిని సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేపడతారు. తొలిరోజు స్టేజ్-1 స్క్రీనింగ్ (ఇంటలిజెన్స్) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారినే స్టేజ్-2కి ఎంపిక చేస్తారు. వీరికి నాలుగు రోజులపాటు పలు విభాగాల్లో పరీక్షించి, అందులో రాణించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. ఇంటర్వ్యూకు హాజరైనవారికి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.
శిక్షణ
కోర్సులోకి ఎంపికైనవారికి ఇండియన్ మిలటరీ అకాడెమీ, దేహ్రాదూన్లో జులై, 2024 నుంచి సుమారు ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత లెవెల్-10 రూ.56,100 మూల వేతనంతోపాటు రూ.15,500 మిలటరీ సర్వీస్ పే అందుతాయి. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అందువల్ల తొలి నెల నుంచే సుమారు రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు.
తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయి హోదాలు సొంతం చేసుకోవచ్చు. రెండేళ్ల సర్వీసుతో కెప్టెన్, ఆరేళ్లు కొనసాగితే మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్ కల్నల్ కావచ్చు. ఇవి పూర్తికాల పోస్టులు. పదవీ విరమణ వయసు వరకు విధుల్లో కొనసాగవచ్చు. అనంతరం పింఛను అందుకోవచ్చు.
ఖాళీలు: 30.
విభాగాలవారీ: సివిల్ పరిధిలో 7, కంప్యూటర్ సైన్స్ 7, ఎలక్ట్రికల్ అనుబంధ విభాగాల్లో 3, ఎలక్ట్రానిక్స్ అనుబంధ విభాగాల్లో 4, మెకానికల్ 7, ఇతర విభాగాల్లో 2 ఉన్నాయి.
అర్హత: నిర్దేశిత/ అనుబంధ బ్రాంచీల్లో ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్/ఐటీ విద్యార్హతలతోనూ అవకాశం ఉంది. అన్ని ఖాళీలకూ అవివాహిత పురుషులే అర్హులు.
వయసు: జులై 1, 2024 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1997 - జులై 1, 2004 మధ్య జన్మించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు: అక్టోబరు 26 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.
వెబ్సైట్: https://joinindianarmy.nic.in/Authentication.aspx
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!