‣ ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు
‣ ఎంపికైతే ఉచితంగా ఇంజినీరింగ్ విద్య
‣ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం
ఇంటర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యతోపాటు లెఫ్టినెంట్ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారికి జులై 2018 నుంచి శిక్షణ తరగతలు ప్రారంభమవుతాయి. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీలు: 90 (నియామక సమయానికి ఖాళీల్లో మార్పులు ఉండవచ్చు)
అర్హత: అవివాహిత పురుషులై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 జనవరి 1 కంటే ముందు , జనవరి 1, 2002 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు.
ఎత్తు: కనీసం 157.5 సెం.మీ. ఉండాలి.
ఎంపిక ఇలా:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. ఎంపికైనవారికి అయిదు రోజులుపాటు రెండు దశల్లో అలహాబాద్, బెంగళూరు, భోపాల్, కపుర్తలా వీటిలో ఏదో ఒక చోట ఎస్ఎస్బీ సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తొలిరోజు స్టేజ్-1 పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని స్టేజ్-2కు అనుమతిస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని మెడికల్ టెస్టుకు పంపుతారు. అందులోనూ విజయవంతమైతే తుది శిక్షణకు ఖరారుచేస్తారు.
శిక్షణ ఇలా...
కోర్సులో చేరినవాళ్లకి అయిదేళ్లపాటు శిక్షణ కొనసాగుతుంది. తొలి ఏడాది ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ - గయలో బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ నిర్వహిస్తారు. అనంతరం సాంకేతిక శిక్షణ (టెక్నికల్ ట్రైనింగ్) నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో ఫేజ్-1 కింద ప్రీ కమిషన్ ట్రైనింగ్ మూడేళ్లపాటు కొనసాగుతుంది. ఫేజ్-2లో భాగంగా ఏడాదిపాటు పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఉంటాయి. ఫేజ్-1, ఫేజ్-2 శిక్షణలు సీఎంఈ-పుణె, ఎంసీటీఈ-మావ్, ఎంసీఈఎంఈ-సికింద్రాబాద్లో ఏదో ఒక చోట నిర్వహిస్తారు. మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టయిపెండ్ చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ అనంతరం పూర్తి వేతనం అమలవుతుంది. లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. కెరీర్ ఆరంభంలోనే అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని నెలకు లక్ష రూపాయల వరకు సీటీసీ రూపంలో అందుకోవచ్చు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి దిల్లీలోని జేఎన్యూ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో పూర్తిచేసి పంపించిన దరఖాస్తు నకళ్లను ఎస్ఎస్బీ పరీక్షలు, ఇంటర్వ్యూ సమయంలో తీసుకెళ్లాలి.
చివరి తేది: నవంబరు 29 (ఉదయం 10 గంటలు)
వెబ్సైట్: http://www.joinindianarmy.nic.in/