భారతీయ తీర గస్తీ దళం (ఇండియన్ కోస్టు గార్డు) నావిక్ (జనరల్ డ్యూటీ) 10+2 ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఇంటర్ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి ఫిబ్రవరి నుంచి శిక్షణ మొదలవుతుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ.35,000 వరకు వేతన రూపంలో పొందవచ్చు.
యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఎంపీసీ గ్రూప్) ఉత్తీర్ణులైనవారు నావిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మ్యాథ్స్, ఫిజిక్స్ల్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం సరిపోతుంది.
వయసు కనిష్ఠంగా 18 ఏళ్లు, గరిష్ఠంగా 22 ఏళ్లు ఉండాలి. అంటే ఫిబ్రవరి 1, 1998- జనవరి 31, 2002ల మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.
పరీక్షల్లో నెగ్గి ఎంపికైనవారికి ప్రాథమిక శిక్షణ ఐఎన్ఎస్ చిల్కలో ప్రారంభమవుతుంది. ఇక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టింగు ఇస్తారు. విధుల్లో చేరినవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు అదనం. వేతనంతోపాటు ఇతర ప్రయోజనాలు (క్యాంటీన్, వసతి, దుస్తులు, ఎల్టీసీ...మొదలైనవి) ఉంటాయి. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని రూ.35 వేల వరకు వేతన రూపంలో పొందవచ్చు. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా వరకూ చేరుకోవచ్చు.
రాత పరీక్ష ఇలా..
సెప్టెంబరులో పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీలతోపాటు ఆంగ్లభాషా పరిజ్ఞానం అంశాల్లో ప్లస్ 2 (ఇంటర్మీడియట్) స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ల నుంచీ ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో అర్హత సాధించినవారికి శరీరదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
అభ్యర్థుల వివరాలను రాతపరీక్ష సమయంలో పరిశీలిస్తారు. పరీక్షకు వెళ్లేటప్పుడే పదోతరగతి, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫొటోలు, ఏదైనా ఐడీ, సర్టిఫికెట్ల నకళ్లు తీసుకెళ్లాలి.
శరీరదార్ఢ్య పరీక్ష (పీఈటీ): ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చకముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. ఉండాలి. ఈ విభాగంలో అర్హత సాధించడానికి 7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్అప్లు తీయగలగాలి. పీఈటీలో అర్హత పొందితే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్పష్టమైన కంటిచూపు ఉండాలి, వినికిడి లోపం ఉండకూడదు.
తుది ఎంపిక: రాతపరీక్ష, పీఈటీ, మెడికల్ టెస్టుల్లో ఉత్తీర్ణులైనవారితో తుది నియామకాలు చేపడతారు. ఎంపికైనవారి వివరాలను కోస్ట్గార్డు వెబ్సైట్లో ఉంచుతారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 26.08.2019
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.09.2019
పరీక్ష కేంద్రం: ఏపీ విద్యార్థులకు విశాఖపట్నం. తెలంగాణ అభ్యర్థులకు సికింద్రాబాద్.
వెబ్సైట్: https://www.joinindiancoastguard.gov.in/