‣ 500 జేఏఎం ఖాళీలకు నోటిఫికేషన్
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ).. పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. దేశవ్యాప్తంగా 500 ఖాళీలున్నాయి. ఇలా అవకాశం వచ్చినవారు విజయవంతంగా కోర్సు పూర్తిచేసి, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ హోదాతో ఐడీబీఐలో చేరిపోవచ్చు. వీరికి ఏడాదికి రూ.6.5 లక్షల వేతనం చెల్లిస్తారు!
చాలా బ్యాంకులు ప్రత్యేక విధుల నిమిత్తం కొంతమందిని ఎంపికచేసి, కోర్సు తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఈ తరహా అవకాశాలకు తాజా గ్రాడ్యుయేట్లు, తక్కువ వయసు ఉన్నవారు ప్రాధాన్యమివ్వవచ్చు. ఒకవైపు ఉన్నత విద్య, మరోవైపు ఉద్యోగం రెండూ సొంతమవుతాయి. ఇలా కోర్సులో చేరినవాళ్లు ఏడాది కోర్సు తర్వాత ఉద్యోగం చేస్తూనే, మరో ఏడాది చదువునూ ఆన్లైన్ ద్వారా పూర్తిచేసుకుని ఎంబీఏ పట్టా అందుకునే అవకాశం ఉంది. పీజీడీబీఎఫ్ కోర్సులో ఎంపికకు ముందుగా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ రెండింటి ప్రతిభతో అవకాశమిస్తారు.
ఆన్లైన్ పరీక్ష
మొత్తం 200 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వీటికి 200 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రెటేషన్లో 60, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగంలో 60 ప్రశ్నల చొప్పున వస్తాయి. వీటిని ఆబ్జెక్టివ్ తరహాలోనే అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలుంటాయి. సెక్షన్ల వారీ సమయ నిబంధన లేదు. అయితే అర్హత సాధించడానికి సెక్షన్ల వారీ, మొత్తం మీద కనీస మార్కులు పొందడం తప్పనిసరి.
ఇంటర్వ్యూ, తుది ఎంపిక
పరీక్షలో అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారీ ఒక్కో ఖాళీకి కొంత మందిని చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను ఐడీబీఐ నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూకి వంద మార్కులు. ఇందులో 50 మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 45 మార్కులు రావాలి. ఇలా అర్హత మార్కులు పొందినవారి జాబితాకు ఆన్లైన్ పరీక్షలో వారు సాధించిన మార్కులు కలుపుతారు. పరీక్షలో సాధించిన స్కోరులో 3/4 వంతు, ఇంటర్వ్యూ స్కోరులో 1/4 వంతు కలిపి కేటగిరీల వారీ మెరిట్ జాబితా రూపొందించి, కోర్సులోకి తీసుకుంటారు.
కోర్సులో ఇలా..
మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, బెంగళూరులో పీజీడీబీఎఫ్ కోర్సు పూర్తిచేయాలి. ఏడాది కోర్సులో.. 6 నెలల తరగతి గది శిక్షణ, 2 నెలలు ఇంటర్న్షిప్, 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటాయి. చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు రూ.3 లక్షలు. దీనికి జీఎస్టీ అదనం. అవసరమైనవారికి ఐడీబీఐ రుణం మంజూరు చేస్తుంది. విధుల్లో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకుని, విధుల్లో కొనసాగితే అప్పటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు సమాన మొత్తంలో (రూ.60 వేలు చొప్పున) ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. ఉద్యోగంలో చేరినవారు మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి. ఈ వ్యవధిలోపు వైదొలిగితే రూ.2 లక్షలతోపాటు, రుణం తీసుకుంటే అప్పటికి చెల్లించాల్సిన కోర్సు ఫీజు మొత్తాన్ని వడ్డీతో కలిపి వసూలు చేస్తారు.
స్టైపెండ్, వేతనం
కోర్సులో ప్రతి నెలా రూ.5000 చొప్పున మొదటి 6 మాసాలు చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు రూ.15,000 చొప్పున ఇంటర్న్షిప్లో రెండు నెలలు ఇస్తారు. చివరి నాలుగు నెలలు బ్యాంకులో వృత్తిగత శిక్షణ ఉంటుంది. ఈ సమయంలోనూ ప్రోత్సాహకం అందుతుంది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా బ్యాంకింగ్ డిగ్రీ ప్రదానం చేసి, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో ఏడాదికి రూ.6.5 లక్షల వేతనం అందుతుంది. అలవెన్సులూ దక్కుతాయి. మూడేళ్ల తర్వాత గ్రేడ్ ఏ అధికారి (అసిస్టెంట్ మేనేజర్)గా అవకాశమిస్తారు.
సన్నద్ధత ప్రణాళిక..
‣ పరీక్షకు సుమారు 35 రోజుల వ్యవధే ఉంది. ఈ తక్కువ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటేనే అవకాశం దక్కుతుంది. ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికిది మంచి అవకాశం.
‣ పరీక్షలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
‣ విభాగాల వారీ ఉన్న అంశాలను 25 రోజుల్లో పూర్తిచేసుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. చివరి పది రోజులు మాక్ టెస్టులకు కేటాయించాలి. ప్రతి పరీక్ష తర్వాతా ఫలితాలు సమీక్షించుకుని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వీటిని ఒకవైపు రాస్తూనే ఐబీపీఎస్, ఎస్బీఐ పీవో, పీజీ డిప్లొమా ఎంట్రీ పాత ప్రశ్నపత్రాలనూ బాగా సాధన చేయాలి.
‣ 200 ప్రశ్నలకు 120 నిమిషాలు అంటే ప్రతి ప్రశ్నకూ కేవలం 36 సెకన్ల వ్యవధే ఉంటుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ల్లో పలు ప్రశ్నలకు ఈ సమయం సరిపోదు. అందువల్ల ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్ విభాగాలను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేసి, అక్కడ మిగిల్చిన సమయాన్ని ఈ విభాగాలకు కేటాయించగలిగితేనే ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలరు.
‣ తక్కువ వ్యవధిలో సమాధానం ఇవ్వగలిగే ప్రశ్నలే ముందు ప్రయత్నించాలి. ఆ తర్వాత కాస్త సమయం తీసుకున్నప్పటికీ కచ్చితంగా జవాబు గుర్తించగలిగేవాటి సంగతి చూడాలి. జవాబు గుర్తించడమెలాగో తెలిసినప్పటికీ ఎక్కువ సమయం తీసుకునేవాటిని చివరలోనే ప్రయత్నించాలి.
‣ రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి అసలేమాత్రం తెలియనివాటిని పూర్తిగా వదిలేయాలి. సమాధానం గుర్తించడంలో కచ్చితత్వానికే ప్రాధాన్యమివ్వాలి. అంచనాతో జవాబులు రాస్తే నష్టమే.
ప్రశ్నలు ఏ అంశాల్లో?
లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రెటేషన్: నాన్ వెర్బల్ సిరీస్, అనాలజీ, కోడింగ్-డీకోడింగ్, ఆడ్మన్ అవుట్, క్లాక్, క్యాలెండర్, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్, డైస్, వెన్ చిత్రాలు, కౌంటింగ్ ఫిగర్స్, పజిల్స్, సిలాజిజమ్, ర్యాంకింగ్, సీక్వెన్స్, సింబాలిక్ ఆపరేషన్స్, నంబర్ అనాలజీ, ఫిగర్ అనాలజీ, వెన్ డయాగ్రమ్స్, నంబర్ క్లాసిఫికేషన్, సిరీస్, వర్డ్ బిల్డింగ్... తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. వీటికి సమాధానం గుర్తించాలంటే గణితంలోని ప్రాథమికాంశాలపై అవగాహన ఉండాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.
జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్: బ్యాంకులు, ఆర్థిక వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం. అందువల్ల.. ఆర్బీఐ, బ్యాంక్ పదజాలం, బీమా, రెపో, రివర్స్ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు - ప్రధాన కార్యాలయాలు - అధిపతులు.. ఇవన్నీ తెలుసుకోవాలి. జనరల్ అవేర్నెస్లో భాగంగా రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్స్ల్లో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు.. ఈ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎకనామిక్స్లో ప్రాథమికాంశాలు చదువుతూ, ఆర్థిక ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: శాతాలు, నిష్పత్తి - అనుపాతం, లాభ - నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం - దూరం, కాలం - పని, పడవలు - ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం ఇలా ప్రతి అంశం నుంచీ ఒక ప్రశ్న వస్తుంది. సమాధానం త్వరగా గుర్తించడానికి లాజిక్, షార్ట్ కట్స్ ఉపయోగించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధన ద్వారా జవాబు త్వరగా గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది.
ఇంగ్లిష్ లాంగ్వేజ్: వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యాలు పెంపొందించుకుంటే కాంప్రహెన్షన్లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆంగ్ల దినపత్రికలు చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్టు, జంబుల్డ్ సెంటెన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్/ కరెక్షన్ నుంచి కొన్ని, వ్యాకరణాంశాల నుంచి.. వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సిననిమ్స్ - యాంటనిమ్స్, వాయిస్, డైరెక్ట్, ఇన్డైరెక్ట్ స్పీచ్ల్లో ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్య సమాచారం..
ఖాళీలు: 500. విభాగాల వారీ.. అన్ రిజర్వ్డ్ 203, ఓబీసీ 135, ఎస్సీ 75, ఎస్టీ 37, ఈడబ్ల్యుఎస్ 50 ఉన్నాయి.
విద్యార్హత: జనవరి 31, 2024 నాటికి ఏదైనా డిగ్రీ పూర్తవ్వాలి.
వయసు: జనవరి 31, 2024 నాటికి 20 - 25 ఏళ్ల లోపు ఉండాలి. అంటే జనవరి 31, 1999 - జనవరి 31, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్లైన్ పరీక్ష తేదీ: మార్చి 17.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200. మిగిలిన అందరికీ రూ.1000.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 26.
వెబ్సైట్: https://www.idbibank.in/
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!