కొత్త తరహా సవాల్!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారతీయ స్టేట్బ్యాంకు తీపికబురు అందించింది. 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకే కాకుండా పైనల్ ఇయర్/సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులకు కూడా పరీక్ష రాసుకునే సౌలభ్యం కల్పించింది. బ్యాంకు ఉద్యోగాల్లో ఎక్కువ క్రేజ్, ఎక్కువమంది అభ్యర్థులు పోటీ పడేది ఎస్బీఐ పీఓ పరీక్షే. ప్రతి పరీక్షలోనూ ఈ సంస్థ కొన్ని నూతన తరహా మోడల్ ప్రశ్నలను ప్రవేశపెడుతుంది. మిగిలిన అంశాలతో పాటు వీటిని అవగాహన చేసుకుని కచ్చితంగా సాధించటం ముఖ్యం. ఆ దిశలో సన్నద్ధత సాగాలి!
పీఓ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్లో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థుల్లో ఖాళీల సంఖ్యకు 10 రెట్ల అభ్యర్థులు (20,000) మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. దానిలో ప్రతిభ చూపిన అభ్యర్థుల్లో ఖాళీలు సంఖ్యకు 3 రెట్లు అభ్యర్థులు (3,000) గ్రూప్ ఎక్సర్సైజ్- ఇంటర్వ్యూకు అర్హులవుతారు.
మెయిన్స్ పరీక్ష, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇండర్వ్యూల మొత్తంలలోని ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దానిలోని మార్కులను తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.
సబ్జెక్టులు - అవగాహన
ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలో మొత్తం ఏడు సబ్జెక్టులు ఉన్నప్పటికీ ప్రిలిమినరీలోని సబ్జెక్టులు మెయిన్స్ పరీక్షలో ఉన్న సబ్జెక్టుల్లో అంతర్భాగంగానే ఉన్నాయి. మొత్తంగా చూస్తే 5 విభిన్న సబ్జెక్టులున్నాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/ డేటా ఇంటర్ప్రిటేషన్
ప్రిలిమినరీ పరీక్షలో సాధారణంగా అరిథ్మెటిక్ ప్రశ్నలు, సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్, అప్రాక్సిమేట్ వేల్యూస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి. మెయిన్స్ పరీక్షలో ఎక్కువగా డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రశ్నలుంటాయి. టేబుల్స్, లైన్గ్రాఫ్స్, బార్ డయాగ్రాం, ఫైచార్ట్లు మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి. ఒకటి కంటే ఎక్కవ గ్రాఫ్లు ఇవ్వడం ద్వారా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు చాలా హెచ్చుస్థాయిలో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగిన సాధన అవసరం.
రీజనింగ్
ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు రెండింటిలోనూ ఉన్న విభాగమిది. ప్రశ్నలు హెచ్చుస్థాయిలో ఉంటాయి. ఎక్కువ సమయం పట్టే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ప్రశ్నలు ఎక్కువ. దీంతోపాటు, కోడింగ్-డీకోడింగ్, సిలాజిజమ్స్, ఆల్పబెట్ సీక్వెన్సెస్, బ్లడ్ రిలేషన్స్, స్టేట్మెంట్స్, పజిల్ టెస్ట్, ఎలిజిబిలిటి టెస్ట్, ఇన్పుట్-అవుట్పుట్ మొదలైనవి బాగా నేర్చుకోవాలి. త్వరగా సాధించగలిగేలా సాధన చేయాలి. మెయిన్స్ పరీక్షలో ఈ విభాగంలో కలిపే కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఉంది. దాని నుంచి 5-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దానిలో ఫ్లోఛార్ట్ సంబంధమైనవి బాగా చూసుకోవాలి.
జనరల్/బ్యాంకింగ్/ఎకానమీ ఎవేర్నెస్
దీనిలో బ్యాంకింగ్, ఆర్థిక రంగాల తాజా పరిణామాలపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సంస్థలపై దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్బీఐ, స్టాక్ మార్కెట్, ప్రాముఖ్యమున్న విషయాలు తెలుసుకోవాలి. విషయం పట్ల కుణ్ణమైన అవగాహన ఉంటే దానిపై ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. సరిగా చదివితే ఎక్కవ మార్కులు తెచ్చుకోగలిగే విభాగమిది.
ఇంగ్ల్లిష్ లాంగ్వేజ్
ఇది ఈ పరీక్షలో చాలా ముఖ్యమైన విభాగం. ప్రిలిమినరీ పరీక్షతో పాటు మెయిన్స్ పరీక్షలోని ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండింటిలోనూ ఈ విభాగం ఉంది. ఎక్కువమంది అభ్యర్థులు విఫలమయ్యే విభాగం కూడా. కాబట్టి జాగ్రత్తగా సిద్ధమవ్వాలి. గ్రామర్ సంబంధమైన ప్రశ్నలు 40% దాకా ఉంటాయి. దానితో పాటుగా రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీల నుంచి ప్రశ్నలుంటాయి. డిస్క్రిప్టివ్ టెస్ట్లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్లుంటాయి. ఏదైనా ఒక విషయంపై 150-200 పదాల వరకు విస్తరిస్తూ ఎస్సే రాయగలిగేలా అభ్యాసం చేయాలి. వివిధ రకాల లెటర్స్ రాయడం కూడా సాధన చేయాలి. గ్రామర్పై పట్టుంటే ఈ విభాగం తేలికే.
ప్రిపరేషన్ ఏ విధంగా?
ప్రిలిమినరీ పరీక్ష జూన్ మొదటి వారంలో, జులై 20న మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ ఉండాలి. తొలిసారి పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది చాలా ముఖ్యం. ప్రిలిమినరీలోని విభాగాలన్నీ మెయిన్స్ లోనూ ఉన్నాయి. కాబట్టి ప్రిపరేషన్ రెండింటికీ కలిపే ఉండాలి. ఎక్కువ సాధన అవసరమైన ఆప్టిట్యూడ్, రీజనింగ్లకు సమయం కూడా కేటాయించాలి.
మొదటిరోజు నుంచే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టులకు సన్నద్ధత మొదలుపెట్టాలి. అదేవిధంగా ప్రతిరోజూ మోడల్ పరీక్షలు రాయడం తప్పనిసరి. దాని ద్వారా ఏ విభాగంలో పట్టు ఉందో, లేదా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉంది. అదే విధంగా నిర్దేశిత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో కూడా తెలుస్తుంది. అది పెరిగేలా వారి సాధన ఉండేలా చూసుకోవాలి.
ఎస్బీఐ పీఓ ఎందుకు ప్రత్యేకం?
* జీతభత్యాలు ఏ ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల కన్నా కూడా అధికం. ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం వార్షిక వేతనం రూ.8.20 లక్షల నుంచి రూ.13.08 లక్షల మధ్య ఉంటుంది. ముంబయి వంటి రీజయన్లో దాదాపు రూ.లక్షకుపైగా నెల వేతనం ఉంటుంది.
* ఎస్బీఐ దేశంలో నంబర్వన్ స్థానంలో ఉండటమే కాకుండా ప్రపంచంలో ప్రముఖ 50 బ్యాంకుల్లో ఒకటిగా ఉంది.
* ఎస్బీఐ తన ఉద్యోగులకు అతి తక్కువ వడ్డీతో వివిధ రుణాలు, ఆర్థిక సదుపాయాలు అందజేస్తుంది.
* మరే ఇతర బ్యాంకుల్లో లేని విధంగా ఉద్యోగంలో చేరే సమయానికి నాలుగు ఇంక్రిమెంట్లు ఉంటాయి.
* ఎస్బీఐకు ఇతర దేశాల్లో అనేక శాఖలు ఉన్నందున విదేశాల్లో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది.
* బ్యాంకులో ఉన్నా అద్భుతమైన పదోన్నతి ప్రక్రియ కారణంగా అభ్యర్థులు తక్కువ కాలంలోనే ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి తమ ప్రతిభ చూపుతూ ఉంటే ఎస్బీఐలో అత్యున్నత స్థానమైన ఛైర్మన్ హోదా వరకూ చేరుకునే అవకాశం ఉంది.
* బ్యాంకుల్లో పీవోలుగా ఎన్నికైన అభ్యర్థులు రెండు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ తరువాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారు స్కేల్-1 ఆఫీసరుగా నియమితులవుతారు. అయితే ఈ పరీక్షలో అత్యున్నత ప్రతిభ చూపిన అభ్యర్థులు నేరుగా స్కేల్-2 ఆఫీసర్లుగా నియమితులయ్యే అవకాశం ఎస్బీఐ కల్పిస్తోంది.
ఎస్బీఐలో పదోన్నతుల క్రమం
* ప్రొబేషనరీ ఆఫీసర్/అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1 - జేఎమ్జీఎస్)
* డిప్యూటీ మేనేజర్ (స్కేల్-2 - ఎమ్ఎమ్జీఎస్)
* మేనేజర్ (స్కేల్-3 - ఎమ్ఎమ్జీఎస్)
* చీఫ్ మేనేజర్ (స్కేల్-4 - ఎస్ఎమ్జీఎస్)
* అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (స్కేల్-5 - ఎస్ఎమ్జీఎస్)
* డిప్యూటీ జనరల్ మేనేజర్ (స్కేల్-6 - ఎస్ఎమ్జీఎస్)
* జనరల్ మేనేజర్ (స్కేల్-7 - టీఈజీఎస్)
* చీఫ్ జనరల్ మేనేజర్
* డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్
* మేనేజింగ్ డైరెక్టర్
* ఛైర్మన్
Posted on: 2-4-2019