ప్రిలిమినరీలోని విభాగాలన్నీ మెయిన్స్ లోనూ ఉన్నాయి. కాబట్టి ప్రిపరేషన్ రెండింటికీ కలిపే ఉండాలి. ఎక్కువ సాధన అవసరమైన ఆప్టిట్యూడ్, రీజనింగ్లకు సమయం కూడా కేటాయించాలి. మొదటిరోజు నుంచే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టులకు సన్నద్ధత మొదలుపెట్టాలి. అదేవిధంగా ప్రతిరోజూ మోడల్ పరీక్షలు రాయడం తప్పనిసరి. దాని ద్వారా ఏ విభాగంలో పట్టు ఉందో, లేదా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉంది. అదే విధంగా నిర్దేశిత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో కూడా తెలుస్తుంది. అది పెరిగేలా వారి సాధన ఉండేలా చూసుకోవాలి.
ఎస్బీఐ పీఓ ఎందుకు ప్రత్యేకం?
* జీతభత్యాలు ఏ ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల కన్నా కూడా అధికం. ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం వార్షిక వేతనం రూ.8.20 లక్షల నుంచి రూ.13.08 లక్షల మధ్య ఉంటుంది. ముంబయి వంటి రీజయన్లో దాదాపు రూ.లక్షకుపైగా నెల వేతనం ఉంటుంది.
* ఎస్బీఐ దేశంలో నంబర్వన్ స్థానంలో ఉండటమే కాకుండా ప్రపంచంలో ప్రముఖ 50 బ్యాంకుల్లో ఒకటిగా ఉంది.
* ఎస్బీఐ తన ఉద్యోగులకు అతి తక్కువ వడ్డీతో వివిధ రుణాలు, ఆర్థిక సదుపాయాలు అందజేస్తుంది.
* మరే ఇతర బ్యాంకుల్లో లేని విధంగా ఉద్యోగంలో చేరే సమయానికి నాలుగు ఇంక్రిమెంట్లు ఉంటాయి.
* ఎస్బీఐకు ఇతర దేశాల్లో అనేక శాఖలు ఉన్నందున విదేశాల్లో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది.
* బ్యాంకులో ఉన్నా అద్భుతమైన పదోన్నతి ప్రక్రియ కారణంగా అభ్యర్థులు తక్కువ కాలంలోనే ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి తమ ప్రతిభ చూపుతూ ఉంటే ఎస్బీఐలో అత్యున్నత స్థానమైన ఛైర్మన్ హోదా వరకూ చేరుకునే అవకాశం ఉంది.
* బ్యాంకుల్లో పీవోలుగా ఎన్నికైన అభ్యర్థులు రెండు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ తరువాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారు స్కేల్-1 ఆఫీసరుగా నియమితులవుతారు. అయితే ఈ పరీక్షలో అత్యున్నత ప్రతిభ చూపిన అభ్యర్థులు నేరుగా స్కేల్-2 ఆఫీసర్లుగా నియమితులయ్యే అవకాశం ఎస్బీఐ కల్పిస్తోంది.