• facebook
  • whatsapp
  • telegram

టెన్త్ పాసయ్యారా..? ఇదుగో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం !

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల‌ భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల

ఇంటర్వ్యూలు లేవు

రాత పరీక్ష మెరిట్ ఆధారంగా ఎంపికలు

లింగ సమానత్వ సాధనలో భాగంగా మహిళలకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్న కేంద్ర ప్రభుత్వం

ఏ ఆఫీసులో అయినా పనులు సక్రమంగా, సజావుగా సాగాలంటే పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహించే ఆఫీసర్, మధ్య స్థాయి సిబ్బందితోపాటు కిందిస్థాయి ఉద్యోగులు కూడా చాలా అవసరం. కార్యాలయ నిర్వహణ, శుభ్రత, ఉన్నత స్థాయి ఉద్యోగులకు సేవలందించడం, రికార్డులు భద్రపరచడం వంటి రకరకాల విధులు నిర్వర్తించేందుకు వీరి ఆవ‌శ్య‌క‌త‌ ఉంటుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా, ప్రత్యేకంగా ఈ సిబ్బంది నియామకాలు చేపడుతుంటాయి. కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో గ్రూప్-సి  విభాగం కిందకు వచ్చే ఈ ఉద్యోగాల ఖాళీలను ఏటా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సీ) భర్తీ చేస్తుంటుంది. ఇందుకోసం మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం సంబంధిత ప్రకటన విడుదలైంది. ఖాళీల వివరాలు నోటిఫికేషన్ లో లేకపోయినప్పటికీ ప్రతి సంవత్సరం సుమారు పది వేల వరకు ఎంపికలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా నియామాలు ఉంటాయి. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. 

చిన్న వయసులోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించుకోడానికి యువతకు ఇదో గొప్ప అవకాశం. కేవలం టెన్త్ లేదా తత్సమాన అర్హతతో ఈ కొలువు సంపాదించుకోవచ్చు. జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-సి (నాన్-గెజిటెడ్), నాన్-మినిస్టీరియల్ పోస్టులను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.16,000 నుంచి రూ.22,000 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు ఉంటాయి. వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను ప్రోత్సహించడానికి ఎప్పటికప్పుడు డిపార్ట్ మెంటల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తారు.   

ఇవీ అర్హతలు

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వగుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి)/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.  వివిధ విభాగాలను అనుసరించి వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఎలా?

అవసరమైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 21, 2021. దరఖాస్తు రుసుం రూ.100 చెల్లించాలి. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మాజీ సైనిక ఉద్యోగులు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ఎంపిక తీరు

అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా 100 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలడుగుతారు. జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25), న్యూమరికల్ ఆప్టిట్యూడ్ (25), జనరల్ అవెర్‌నెస్‌(25) ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. తప్పుగా గుర్తించిన సమాధానికి 1/4 మార్కులు కోత విధిస్తారు. పరీక్షా సమయం తొంభై నిమిషాలు. సంబంధిత విభాగాల్లో పోస్టులను వయసు (18-25, 18-27)ను బట్టి విభజించారు. అందుకు అనుగుణంగా పేపర్-1లో కేటగిరీలు, ప్రాంతం, వయసుల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు. పేపర్‌-1లో నిర్ణీత అర్హత మార్కులు సాధిస్తేనే పేపర్‌-2 పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ పద్ధతి (పెన్ను, పేపర్)లో నిర్వ‌హిస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం 30 నిమిషాలు. పేపర్-2లో అన్‌రిజ‌ర్వుడ్‌ అభ్యర్థులకు 40 శాతం, రిజర్వుడ్ కేటగిరీ వారికి 35 శాతం మార్కులను క‌టాఫ్‌గా  నిర్ణయించారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. చివరగా పేపర్-1లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. తర్వాత తుది ఎంపికలు ఉంటాయి. 

ప్రిపరేషన్ విధానం

మ‌ల్టీ టాస్కింగ్‌ ప‌రీక్ష‌ పేపర్-1 లో జనరల్ అవెర్‌నెస్, ఇంగ్లిషు, జనరల్ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగంపై పట్టు సాధించాలంటే మొదట సిలబస్, అందులోని అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగంలో అరిథ్‌మెటిక్, మ్యాథమేటిక్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు అరిథ్‌మెటిక్‌ నుంచే వస్తాయి. డేటా అనాలిసిస్, డేటా ఇంటర్‌ప్రిటేషనలÂ నుంచీ అడుగుతారు. ముఖ్యంగా వీటి నుంచి వచ్చే ప్రశ్నలు గ్రూప్‌ (3 నుంచి 5)గా వస్తాయి. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని అశ్రద్ధ చేయకూడదు. ప్రశ్నలో ఇచ్చిన సమాచారం నుంచి అవసరమైనదాన్ని ఎలా తీసుకోవాలో తెలిస్తే ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం గుర్తించవచ్చు. ఈ విభాగంలోని ప్రశ్నలకు తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు గుర్తించాలంటే సూక్ష్మీకరణపై పట్టు ఉండాలి. సంప్రదాయ పద్ధతులతో కాకుండా చివరి అంకెను గుర్తించడం, గుణకాలు, ఆప్షన్‌ నుంచి సమాధానం గుర్తించడం వంటి సులభమైన పద్ధతుల ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
అరిథ్‌మెటిక్‌ అంశాల్లో ‘శాతాలు’ కీలకమైన చాప్టర్‌. శాతాలకు అనుసంధానంగా నిష్పత్తి- అనుపాతం, లాభనష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ ప్రశ్నలుంటాయి. ఈ అంశాలన్నీ ఒకే తర్కం ఆధారంగా ఉంటాయి. వీటి నుంచి కచ్చితంగా ప్రశ్నలుంటాయి.
గసాభా/ కసాగు చాప్టర్‌కు అనుసంధానంగా కాలం-పని, పైపులు-బోల్టులు ఉంటాయి. కాలం-పని నుంచి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. వీటితోపాటు కాలం-దూరం, రైలు మీద ప్రశ్నలు, పడవలు- ప్రవాహాలు ముఖ్యమైన చాప్టర్లు. సరాసరి, నంబర్‌ సిస్టమ్, వ్యాపార భాగస్వామ్యం, వయసులపై వచ్చే ప్రశ్నలు సులభంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని విడిచిపెట్టకూడదు.
ఆల్జీబ్రా నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వైశాల్యాలు, ఘనపరిమాణాలు, త్రికోణమితి, ఎత్తు-దూరాలు ముఖ్యమైన చాప్టర్లు. రేఖాగణితం నుంచీ ప్రశ్నలు అడిగే అవకాశముంది. ముఖ్యంగా అభ్యర్థులు మ్యాథ్స్‌ ఫార్ములాలను పట్టిక రూపంలో తయారు చేసుకుని, ఎక్కువసార్లు చదువుకుని గుర్తుంచుకోవాలి. ఫార్ములాలు తెలియకుండా సమాధానాలు గుర్తించే అవకాశం లేదు. ఆల్జీబ్రా ప్రశ్నల్లో ఎక్కువ ప్రశ్నలు ఆప్షన్‌ నుంచి నంబర్‌ తీసుకుని ప్రశ్నలో వాడి (సబ్‌స్టిట్యూట్‌ మెథడ్‌) సమాధానం గుర్తించవచ్చు.

జనరల్‌ ఇంగ్లిష్‌ 

ఇంగ్లిష్‌ గ్రామర్‌ నియమాలు తెలిస్తే 40 నుంచి 50 శాతం ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎర్రర్‌ లొకేషన్, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్, సెంటెన్స్‌ కరెక్షన్‌ ప్రశ్నలు ఈ నియమాలపై ఆధారపడి ఉంటాయి. ఒకాబులరీ, యాంటనిమ్స్, సిననిమ్స్‌ నుంచి 10 ప్రశ్నల వరకు వస్తున్నాయి. రూట్‌ వర్డ్స్‌ లేదా మైండ్‌ మ్యాప్‌ విధానాలు పాటిస్తూ సన్నద్ధత కొనసాగించాలి. కాంప్రహెన్షన్, క్లోజ్‌ టెస్ట్‌ల నుంచి సుమారు 40% ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులకు ముఖ్యంగా కావాల్సిన లక్షణం- తక్కువ సమయంలో ఇచ్చిన సమాచారాన్ని చదివి, అందులో ముఖ్యమైన లేదా అవసరమైన సమాచారాన్ని గుర్తుంచుకోవడం. కాంప్రహెన్షన్‌ ప్యాసేజ్‌లో  ముందుగా ప్రశ్నలను చదివి, గుర్తుంచుకుని తరువాత ప్యాసేజీలో ఇచ్చిన సమాచారాన్ని చదివితే అవసరమైన సమాచారమేదో గుర్తించడం సులభమవుతుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా  ఆంగ్ల దినపత్రిక చదవాలి. ఇందులో ఎడిటోరియల్‌ కాలమ్స్, బిజినెస్‌ పేపర్, స్పోర్ట్స్‌ పేజీలు చదివితే ఒకాబులరీ, గ్రామర్, కరెంట్‌ అఫైర్స్‌తోపాటు ఇంగ్లిష్‌ భాష మీదా పట్టు వస్తుంది.

ఇంగ్లిష్‌ విభాగాన్ని అతి కీలకమైనదిగా గుర్తించాలి. అభ్యర్థులు ఉద్యోగులుగా మారాలంటే ఈ విభాగంలోని మార్కులే కీలకం. ఎక్కువమందికి దీనిలో తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి, ఎక్కువ మార్కులు పొందినవారు ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌లో ముందుంటారు.


జనరల్‌ అవేర్‌నెస్‌

భారతదేశం, పొరుగు దేశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. చరిత్ర, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బడ్జెట్, భారతదేశం పాల్గొన్న సమ్మిట్స్, వాటి ముఖ్యాంశాలు, ఆయాదేశాలు, వాటి రాజధానులు, కరెన్సీ, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, యునెస్కో గుర్తించిన ప్రదేశాలపై పట్టు పెంచుకోవాలి. పొడవైన/లోతైన/ ఎత్తైన నదులు, పర్వతాలు, వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్‌ సంబంధిత అంశాల్లో ప్రస్తుతం జరిగిన ఆటల్లో విజేతలు, పుస్తక రచయితలు, కరోనా వైరస్, బాక్టీరియా, కెమికల్‌ ఫార్ములాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, భారత్‌ ప్రయోగించిన అంతరిక్ష ప్రయోగాలు, శాటిలైట్స్, వాటి వాహనాలు, భారత్‌ ఆర్థిక రంగ విధానాలు, ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసిన ఆర్మీ పరికరాలు, వాహనాలు, కొత్త ప్రాజెక్టులు, సంబంధిత సమాచారాన్ని సేకరించాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా దినపత్రికలు చదవడం ద్వారా పరీక్షకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. 


జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌

పేపర్‌-1లో ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. 50 మార్కులు కేటాయించారు. వెర్బల్, నాన్‌ వెర్బల్, క్రిటికల్, అనలిటికల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 

సృజనాత్మకత, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండేలా ఆలోచించడం, కామన్‌ సెన్స్‌తో ఆలోచిస్తే 25 ప్రశ్నల్లో 20 ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. ఎక్కువమంది అభ్యర్థులు ఈ విభాగం నుంచి 50 మార్కులు సాధిస్తారు.

నంబర్లు, లెటర్లు, పదాలు, చిత్రాలమీద ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. సిరీస్, అనాలజీ, ఆడ్‌మాన్‌ అవుట్, చిత్రాన్ని పూర్తిచేయడం, మిర్రర్‌ ఇమేజ్, వాటర్‌ ఇమేజ్‌ నుంచి 10 ప్రశ్నలకుపైగా వస్తాయి. నంబర్, సింబల్, ఆపరేషన్స్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌ ఫోల్డ్, కటింగ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. పజిల్స్, రక్తసంబంధాలు, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, గ్రూప్‌గా వచ్చే ప్రశ్నలపై శ్రద్ధ చూపితే 10 ప్రశ్నల సమాధానం గుర్తించవచ్చు. సిలాజిజం, స్టేట్‌మెంట్‌- కన్‌క్లూజన్, స్టేట్‌మెంట్‌- అసంప్షన్‌ల నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. సాధనతో 25 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించి 50 మార్కులు పొందడానికి అవకాశమున్న విభాగమిది.

పేపర్-2పై ప్రత్యేక శ్రద్ధ

తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూతో పాటు రాజ్యాంగం గుర్తించిన ఏ భాష‌లోనైనా ఈ ప‌రీక్ష రాసుకునే వీలుంది. ఇందులో ప్రధానంగా ఎస్సే, లెట‌ర్ రైటింగ్‌ ప్రశ్నలు ఉంటాయి. అక్షరదోషాలు, పద ప్రయోగాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి. వాక్య నిర్మాణం, విరామ చిహ్నాల వినియోగంపై శ్రద్ధ వహించాలి. ఆంగ్లంలో జవాబులు రాస్తే క్యాపిటల్, స్మాల్ లెట‌ర్‌ల‌ను ఉపయోగించడంపై కూడా అవగాహన కలిగి ఉండాలి. పెద్ద పేరాల్లో ఉన్న విషయాన్ని కుదించి సొంత వాక్యాల్లో రాయడాన్ని అభ్యసించాలి.

ఈ జాగ్రత్తలు అవసరం

మోడల్ పేపర్ల ప్రాక్టీస్, వాస్తవ పరీక్షలో అభ్యర్థులు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. 

ప్రశ్నపత్రంలో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం కష్టం. అందుకే ఏ ప్రశ్నలను ముందు వరుసలో సమాధానాలు గుర్తించగలమో వాటినే ఎంచుకోవాలి.

ప్రశ్నకి సమాధానం గుర్తించలేకపోయినా, వచ్చిన ఆన్సర్ఆప్షన్లలో లేకపోయినా, ప్రశ్న చదివినప్పుడు అర్థం కాకపోయినా, ఆయా ప్రశ్నలను విడిచి వేరే ప్రశ్నను ఎంచుకోవాలి.

ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం వృథా చేయకూడదు.

అభ్యర్థికి పట్టున్న అంశాల సంబంధిత ప్రశ్నలను ముందు ఎంచుకోవాలి.

ఏ అంశాల్లో మార్కులు రావడం లేదో గమనించి, ఆ చాప్టర్లలోని ప్రశ్నలు ఎక్కువ సాధన చేయటం మేలు.

అంశాల వారీగా షార్ట్కట్స్, ఫార్ములాల్లో ముఖ్యమైన వాటిపై పాయింట్ల రూపంలో నోట్స్రాసుకోవాలి.

రోజూ ఒక మాదిరి ప్రశ్నపత్రం చేయడం అలవాటు చేసుకోవాలి.

తప్పులు పోయిన ప్రశ్నలపై ప్రత్యేక శ్రద్ధ చూపి, మళ్లీ ఆ తప్పులు చేయకుండా ఉండాలి.

పరీక్షలో వస్తున్న మార్కులను అంశాల వారీగా విభజించి పట్టిక రూపంలో రాసుకుంటూ, పురోగతి చూసుకోవాలి.

అభ్యర్థులు తాము బలహీనంగా ఉన్న అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తూ మెరుగుపర్చుకోవాలి.

వెబ్ సైట్: https://ssc.nic.in/

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌