దేశ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, పలు విభాగాలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్ - సి, డి స్టెనోగ్రాఫర్ల ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలను త్వరలో ప్రకటిస్తారు. సాధారణంగా వందల సంఖ్యలో పోస్టులు వెలువడుతుంటాయి. వేగంగా, కచ్చితంగా సమాచారాన్ని రికార్డ్ చేయడంలో ఈ స్టెనోగ్రాఫర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.
ఎవరు అర్హులు?
ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు గ్రూప్ - సి పోస్టులకు 1-8-2020 నాటికి 30 ఏళ్లు దాటకూడదు. గ్రూప్ - డి కి 27 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం
దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాలి. ఫీజు రూ 100. చివరి తేదీ నవంబరు 4, 2020.
పరీక్ష విధానం
కంప్యూటర్ ఆధారితంగా ఆన్ లైన్ లో జరిగే ఈ పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. మొదటిది జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్, రెండోది జనరల్ అవేర్ నెస్, మూడోది జనరల్ ఇంగ్లిష్ అండ్ కాంప్రహెన్షన్. మొత్తం రెండు వందల మార్కులకు రెండు వందల ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంది.
స్కిల్ టెస్ట్
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంచుకున్న భాషను అనుసరించి ఇంగ్లిష్, హిందీ భాషల్లో 10 నిమిషాల డిక్టేషన్ ఇస్తారు. గ్రూప్-డి పోస్టులకు దరఖాస్తు చేసిన వారు నిమిషానికి 80 పదాలు, గ్రూప్-సి అభ్యర్థులు నిమిషానికి 100 పదాలు రాయగలిగి ఉండాలి. డిక్టేషన్ ను టైప్ చేయడానికి గ్రూప్-డి ఇంగ్లిష్ అభ్యర్థులకు 50 నిమిషాలు, హిందీ అభ్యర్థులకు 65 నిమిషాల సమయం ఇస్తారు. అదే గ్రూప్- సి ఇంగ్లిష్ అభ్యర్థులకు 40 నిమిషాలు, హిందీ అభ్యర్థులకు 55 నిమిషాలు కేటాయించారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. అంతిమ సెలక్షన్ రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వూలు ఉండవు.