‣ ఈఎస్ఈ-2022 ప్రకటన
ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే.. ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) నోటిఫికేషన్ ఇటీవలే వెలువడింది. దీని ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసెస్లో 247 ఖాళీలను పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఈ పరీక్ష ప్రాధాన్యం, సన్నద్ధత వ్యూహం, ఇతర ముఖ్యాంశాలను వివరంగా తెలుసుకుందాం!
జాతీయ స్థాయిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ లాంటి గ్రూప్-ఎ ఉద్యోగాల భర్తీ కోసం సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ విభాగాల్లో ఏటా యూపీఎస్సీ ఈఎస్ఈని నిర్వహిస్తుంది. తుది ఎంపిక తర్వాత సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్, సెంట్రల్ పవర్, నేవల్, బార్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా సర్వీసెస్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఇండియన్ టెలి కమ్యూనికేషన్ సర్వీసెస్, జూనియర్ టెలికాం ఆఫీసô, ఇండియన్ రేడియో రెగ్యులేటర్ సర్వీసెస్ లాంటి వివిధ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి.
ఇందులో ఉద్యోగం పొందినవారికి సమాజంలో గౌరవం, ఉద్యోగ భద్రత లభిస్తాయి. దేశంలోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో పనిచేసే మంచి అవకాశం దక్కుతుంది. రాజకీయాల జోక్యం చాలా తక్కువగా ఉంటుంది. నిబద్ధతతో పనిచేయగల అవకాశం లభిస్తుందని చెప్పవచ్చు. పదోన్నతులతో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం, ఉద్యోగ సంతృప్తి ఉంటాయి. వీటితోపాటు 7వ పే కమిషన్ లెవెల్ 10 మూలవేతనం రూ.56,100తో మొదటి నెల నుంచే సమారు రూ.90 వేల వరకు పొందగలుగుతారు.
దరఖాస్తు ప్రక్రియ
ఆన్లైన్లో www.upsconline.nic.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ-అడ్మిషన్ కార్డ్ను పరీక్షకు మూడు వారాల ముందు జారీ చేస్తారు. దీన్ని యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
పరీక్ష రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు పరీక్ష రుసుము చెల్లించనవసరం లేదు.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 12 అక్టోబరు, 2021 సాయంత్రం 6.00 గంటల వరకు.
విద్యార్హతలు: ఇంజినీరింగ్లో ఏదైనా డిగ్రీ/ తత్సమాన అర్హత. ఎంఎస్సీ/ తత్సమానం. కానీ ప్రతిపాదించిన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి.
వయః పరిమితి: జనవరి 1, 2022 నాటికి 21 నుంచి 30 సంవత్సరాలు. కొన్ని కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫిబ్రవరిలో ప్రిలిమ్స్
ప్రిలిమ్స్/స్టేజ్-1 పరీక్ష తేదీ: 20 ఫిబ్రవరి, 2022
మెయిన్స్/ స్టేజ్-2 పరీక్ష తేదీ: 26 జూన్, 2022
తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు (ప్రిలిమ్స్, మెయిన్స్):
1. హైదరాబాద్
2. విశాఖపట్నం
3. తిరుపతి
‣ ఓయంఆర్ షీట్లో సమాధానాలు మార్క్ చేయడానికి బ్లాక్ బాల్పెన్నును మాత్రమే ఉపయోగించాలి.
‣ ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కుకు 1/3 (0.33) మైనస్ మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించడం వల్ల ఒక సమాధానం తప్పుగా రాస్తే 0.66 మార్కులు తగ్గిపోతాయి.
‣ ఈ రెండు పేపర్లలో అర్హత మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం యూపీఎస్సీకి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ స్టేజ్ మాత్రమే కాదు. ఇందులో సాధించిన మార్కులను అంతిమ సెలక్షన్లో పరిగణనలోకి తీసుకుంటారు.
స్టేజ్-2 (మెయిన్స్) కన్వెన్షనల్
ప్రిలిమినరీ పరీక్ష ద్వారా 1:6 లేదా 1:7 నిష్పత్తిలో మెయిన్స్కు అర్హత కల్పిస్తారు. ఈ సంవత్సరం మొత్తం 247 ఖాళీలున్నాయి. అంటే 1482 నుంచి 1729 మంది మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. దీనిలో పేపర్-1, 2 సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టుకు సంబంధించిన పేపర్లు. రెండు పేపర్లూ కలిపి 600 మార్కులకు ఉంటాయి. క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ (క్యూసీఏబీ) విధానంలో సమాధానాలు రాయడానికి నిర్ణీత స్థలాన్ని కేటాయించారు. వీలైనంత సూటిగా జవాబు రాయడం మంచిది.
స్టేజ్-3 పర్సనాలిటీ టెస్ట్ (200 మార్కులు)
రెండు స్టేజిల్లో సాధించిన మార్కుల ఆధారంగా (1100 మార్కులకుగాను) అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో స్టేజ్-3 (పర్సనల్ ఇంటర్వ్యూ)కి అనుమతిస్తారు. అంటే ఈ సంవత్సరం 494 మందిని ఈ మౌఖిక పరీక్షకు అనుమతిస్తారు. ఫైనల్ సెలక్షన్ మూడు స్టేజిలలో కలిపి 1300 మార్కులకు వచ్చిన మార్కుల ఆధారంగా, ఉన్న ఖాళీలకు అనుగుణంగా జాబితాను రూపొందిస్తారు.
ఏ స్టేజికి ఎలా తయారవ్వాలి?
స్టేజ్-1 ప్రిలిమినరీ:
పేపర్-1: జనరల్ స్టడీస్, ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్. ఇది అన్ని విభాగాలకూ ఉమ్మడిగా ఉంటుంది. దీనిలో కూడా కనీస అర్హత మార్కులు సాధించాలి. అందుకే టెక్నికల్ సబ్జెక్టుతోపాటు ఈ జీఎస్ కూడా చాలా కీలకం. జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ, జాగ్రఫీలాంటివి కాకుండా ఇంజినీరింగ్కు సంబంధించిన అంశాలుంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్తోపాటు అభ్యర్థులు తమకు సంబంధించిన విభాగంలో మెరుగ్గా ఉంటే కనీస మార్కులు సులువే.
పేపర్-2: ఈ పేపర్ అభ్యర్థులకు సంబంధించిన ఇంజినీరింగ్ (కోర్) సబ్జెక్టుకు సంబంధించినది. దీనిలో మంచి మార్కులు తెచ్చుకోవడం కష్టమేమీ కాదు.
స్టేజ్-2 మెయిన్స్: ఇందులో ఇంజినీరింగ్ సిలబస్ను రెండు పేపర్లుగా విభజించారు. రెండూ అభ్యర్థి సంబంధిత కోర్ సబ్జెక్టులకు సంబంధించినవే. ఇందులో బేసిక్స్తోపాటు అడ్వాన్స్ విషయాలపై పూర్తిస్థాయి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. చేతిరాత (హ్యాండ్ రైటింగ్) అనేది అత్యంత కీలకం. దీన్ని మెరుగుపరుచుకోవాలి. ఇందులోని ప్రశ్నలకు రాయాల్సిన సమాధానాలు నిడివిగా ఉంటాయి. సమయపాలనతో సమాధానాలు రాయాలి. థియరీ ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు నేరుగా బుల్లెట్ పాయింట్లలో రాయడానికి ప్రయత్నించాలి. న్యూమరికల్ ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు మ్యాథమేటికల్ స్టెప్తో దశలవారీగా పూర్తిచేయాలి.
స్టేజ్-3 మౌఖిక పరీక్ష (పర్సనాలిటీ టెస్ట్): దీనిలో అభ్యర్థుల ఆలోచనా విధానం, శక్తి సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు, నీతీ నిజాయతీలను అంచనా వేస్తారు. వ్యక్తిగత విషయాలకూ, అభిరుచులకూ కొంత ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు అడగొచ్చు. వీటితో పాటు సామాజిక, వర్తమాన విషయాల గురించి అడిగే అవకాశమూ ఉంది. అభ్యర్థి ఉద్యోగం లేదా ఎంటెక్ చేస్తుంటే సంబంధిత విషయాలపై ప్రశ్నలు అడగొచ్చు. కాబట్టి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి ఒక ప్రణాళిక ప్రకారం వెళితే మౌఖిక పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు.
1. సిలబస్ను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగా బేసిక్స్పై పట్టు సాధించాలి.
2. ప్రిలిమ్స్లో ప్రశ్నలు ఎక్కువ, సమయం తక్కువ. అందుబాటులో ఉన్న పరీక్ష సమయంలో ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించామనేది ముఖ్యం.
3. ప్రిలిమ్స్లో కాలిక్యులేటర్కు అనుమతి లేనందువల్ల, న్యూమరికల్ ప్రశ్నలకు కాలిక్యులేటర్ ఉపయోగించకుండా సమాధానాలు రాబట్టాలి.
ఇదీ సన్నద్ధత వ్యూహం
‣ ఈఎస్ఈ సిలబస్ను వీలైనన్ని సార్లు పరిశీలించి అందులోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సిలబస్ను బట్టి ఏ అంశాల్లో బలంగా ఉన్నామో, వేటిలో బలహీనంగా ఉన్నాయో తెలుసుకుని తగ్గట్టుగా పఠన ప్రణాళిక రూపొందించుకోవాలి.
‣ సాధారణంగా అభ్యర్థులు తమకు నచ్చిన అధ్యాయాలను చదవడానికి సుముఖతతో ఉంటారు. కానీ ఈ పరీక్షలో వెయిటేజిని దృష్టిలో ఉంచుకుని ఆయా అధ్యాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. .
‣ సన్నద్ధతలోనూ సమయపాలన కీలకమే. ప్రణాళిక ప్రకారం ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తి చేయాలి.
‣ ఎన్టీపీఎల్ పాఠాలు ప్రాథమిక అంశాల అవగాహనకు బాగా ఉపయోగపడతాయి. విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికీ తోడ్పడతాయి.
‣ ప్రాథమిక అంశాల ప్రిపరేషన్ తర్వాత గత ఈఎస్ఈ, గేట్, సివిల్ సర్వీసెస్, ఇతర స్టేట్ సర్వీసెస్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఏయే అంశాలపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అర్థమవుతుంది.
పునశ్చరణ
‣ సన్నద్ధతలో పునశ్చరణ (రివిజన్) చాలా ముఖ్యం. చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. పునశ్చరణతోపాటు ఆన్లైన్లో నిర్వహించే మాదిరి ప్రశ్నపత్రాలను (మాక్ టెస్టులు) రాయడం, నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల మన సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
‣ చాప్టర్వైస్ టెస్టులు, మాక్ టెస్టులు రాసేటప్పుడు, నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేసేటప్పుడు తప్పుగా సమాధానం రాసిన ప్రతి ప్రశ్ననూ సవరించుకుని వాటిని ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి. దీనివల్ల ఆ తప్పిదాలు పరీక్ష సమయంలో పునరావృతం కాకుండా ఉంటాయి.
తొలి ప్రయత్నంలోనే...
‣ ఈఎస్ఈని మొదటి ప్రయత్నంలోనే సాధించవచ్చు. ఇప్పటివరకు ఎందరో విద్యార్థులు తమ మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించారు. దీనికి తగిన ప్రణాళిక, కృషి అవసరం.
‣ పరీక్ష సిలబస్ పరిధి చాలా విశాలం. ఎక్కువ ప్రశ్నలు సులభంగానో, మధ్యస్థంగానో ఉంటాయి. 20- 25 శాతం ప్రశ్నలు కొంత కఠినంగా ఉంటాయి.
‣ కొద్ది సంవత్సరాల నుంచి ఆచరణాత్మకమైన (ప్రాక్టికల్) ప్రశ్నలు చేర్చడం వల్ల ప్రశ్నపత్రం కఠినత్వం పెరిగింది. ఈ పరీక్షకు పోటీతత్వం ఎక్కువే.