• facebook
  • whatsapp
  • telegram

భారతీయ విద్యా చరిత్ర, వివిధ కమిటీలు - కమిషన్లు

విద్య - నిర్వచనం: 'విద్య' అనే పదం 'విద్' అనే మూలపదం నుంచి ఆవిర్భవించింది. విద్య అంటే తెలుసుకోవడం అని అర్థం.

* Education అనే ఆంగ్ల పదం Educare, Educer అనే లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది.
 

తత్వవేత్తలు, విద్యావేత్తలు, మనోవైజ్ఞానిక వేత్తలు ఇచ్చిన నిర్వచనాలు
*  మనిషిని స్వార్థరహితుడిగా, స్వావలంబన సాధించేలా తయారుచేసేది విద్య - రుగ్వేదం
*  ముక్తి లేదా మోక్ష సాధనకు తోడ్పడేదే విద్య - ఉపనిషత్తులు
*  ఆత్మ సాక్షాత్కారమే విద్య - భగవద్గీత
అజ్ఞానాన్ని తరిమివేసే సత్యాన్వేషణే విద్య - సోక్రటీస్
*  ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య - అరిస్టాటిల్
*  మానవుడి బుద్ధి దేని ద్వారా వికసిస్తుందో, మనశ్శాంతి పెంపొందుతుందో, శీలం ఏర్పడుతుందో, మానవుడు స్వశక్తితో నిల్చుంటాడో అదే విద్య - స్వామి వివేకానంద
*  మానవుడు పుట్టినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయం ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచులను సుస్థిరపరచేదే విద్య - రూసో
*  మనిషిలోని అత్యుత్తమమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేదే విద్య - మహాత్మా గాంధీ
* గతం మన పునాది, వర్తమానం మన ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. ఏ విద్యావిధానంలోనైనా భూత, వర్తమాన, భవిష్యత్తులకు సముచిత స్థానం ఉండాలి. -  స్వామి అరవిందుడు

 

విద్యా ధ్యేయాలు
* విద్య వ్యక్తి పరిపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడాలి.
* విద్య వ్యక్తిలో సృజనాత్మక శక్తిని, వృత్తి నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి.
* విద్య వ్యక్తి స్వావలంబనకు, స్వయంసమృద్ధికి, సామాజిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి.
* మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని కాలాల్లో అందరికీ ఉపయోగపడేలా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వ్యక్తిగత, సామాజిక సంపూర్ణ అభివృద్ధిని కాంక్షించే ధ్యేయంగా విద్య ఉండాలి.
* సంస్కృతి, వారసత్వాలను తర్వాతి తరాలకు అందించే ప్రక్రియగా విద్య కొనసాగాలి.
* విద్యార్థిని విజయపథంలో నడిపే విధంగా విద్య ఉండాలి.
* విద్యార్థిలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక విలువలను పెంపొందించే విధంగా విద్య కొనసాగాలి.

 

విద్య - రకాలు
విద్యార్జన ప్రధానంగా మూడు పద్ధతుల్లో జరుగుతుంది.
అవి: 1) నియత విద్య
     2) అనియత విద్య
     3) యాదృచ్ఛిక విద్య

నియత విద్య: విద్యార్థి ప్రవర్తనను సంస్కరించి, సత్ప్రవర్తనను అలవరచడానికి పాఠశాల, కళాశాలల్లో నియమ నిబంధనలతో క్రమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన విద్యను నియత విద్య అంటారు.
* ఈ నియత విద్యలో వయోపరిమితిని అనుసరించి బోధనా కార్యక్రమం జరుగుతుంది.
* ఇది కృత్రిమమైన ప్రక్రియ.
* ఇందులో వనరులు పరిమితం.

అనియత విద్య: పాఠశాల, కళాశాలల్లో చదువుకునే అవకాశం లేనివారికి, మధ్యలోనే చదువు మానేసినవారికి ప్రత్యేక అభ్యసన అనుభవాల ద్వారా ఏర్పాటు చేసిన బహుముఖ విద్యా విధానాన్ని అనియత విద్య అంటారు.
* ఈ విధానంలో లక్ష్యాలు, ప్రణాళికలు ఉంటాయి. కానీ నియమ నిబంధనలు సరళంగా ఉంటాయి.
* కరెస్పాండెంట్ కోర్సులు, పోస్టల్ కోచింగ్, ఉపగ్రహ కార్యక్రమాలు, వేసవి విద్యా కోర్సులు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు లాంటి వాటిని వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు.

యాదృచ్ఛిక విద్య: విద్యార్థి తనకు తెలియకుండానే కుటుంబం, సంఘంలో జీవిస్తూ ఆర్జించే విద్య ఇది. అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకోవడాన్ని యాదృచ్ఛిక విద్య అంటారు.
* ఈ విద్యకు ఎలాంటి సమయపాలన, నియమ నిబంధనలు ఉండవు.
* కుటుంబంలోని సభ్యులు, సమాజంలోని వ్యక్తుల ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటారు. తన ప్రవర్తనలోని లోపాలను సరిదిద్దుకుని, ఆత్మపరిశీలన ద్వారా ఒక మంచి సామాజిక వ్యక్తిగా తయారు కావడానికి ఈ విద్య ఉపయోగపడుతుంది.
* కుటుంబం, దేవాలయం, చర్చి, మసీదు, గ్రంథాలయం, ఆటస్థలం, మత సంబంధ కార్యక్రమాలను దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.

 

విద్య - ప్రక్రియలు
* మనసులో నిగూఢంగా దాగి ఉన్న అంతర్గత శక్తులను బహిర్గతం చేసే ప్రక్రియే విద్య.
* విద్యను ఒక ప్రక్రియగా నిర్వచిస్తే అది మానవుడిలో ఉన్న సామర్థ్యాలను బయటకు వెలికితీసి అభివృద్ధి చేయాలి.
* విద్య అనేది ఒక లక్ష్యంతో ఫలితాన్ని ఆశించి చేసే ప్రక్రియ.
* విద్య స్థిరమైంది కాదు. గతిశీలమైంది. చైతన్యపూరితమైంది.
* అనుభవాల సారమే విద్య.
*  విద్యా ప్రక్రియలోని కేంద్ర బిందువుల ఆధారంగా ఈ విద్యా ప్రక్రియను 3 రకాలుగా పేర్కొనవచ్చు. అవి:
    1. ఏకధృవ విధాన ప్రక్రియ
    2. ద్విధృవ విధాన ప్రక్రియ
    3. త్రిధృవ విధాన ప్రక్రియ

ఏకధృవ విధాన ప్రక్రియ 
* ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు కీలకం, కేంద్ర బిందువు.
* ఈ ప్రక్రియ పురాతనమైంది.
* ఈ ప్రక్రియలో విద్యార్థి స్తబ్ధుగా, నిష్క్రియాత్మకంగా ఉంటాడు.
* ఇందులో బోధనే ముఖ్యం. విద్యార్థుల అవగాహన, ప్రతిస్పందనలతో సంబంధం లేదు.
* ఈ ప్రక్రియలో విద్యార్థి ప్రగతిని కనుక్కోవడం కష్టసాధ్యం. ఈ విధానంలో విద్యార్థి కొన్నిసార్లు ప్రతిస్పందించవచ్చు కానీ అవగాహన చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు.

ద్విధృవ ప్రక్రియ 
 

* ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు బోధిస్తే విద్యార్థి వింటాడు.
* దీనిలో ఉపాధ్యాయుడు ఒక ధృవం కాగా విద్యార్థి మరో ధృవం.
* ధృవాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి.
* ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
* అభ్యసన సఫలీకృతం అవుతుంది.
* ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ క్రియాత్మకంగా ఉండి బోధనాభ్యసన కృత్యాలు నిర్వహిస్తారు.
* విద్యార్థి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రశ్నలు వేస్తే ఉపాధ్యాయుడు సమాధానాలు ఇస్తాడు.
* ఈ ప్రక్రియలో విద్యార్థులు, ఉపాధ్యాయుడు పరస్పర ప్రతిచర్యల ద్వారా బోధనాభ్యసన కృత్యాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు.
* ఇదొక ప్రయోగాత్మక ప్రక్రియ. ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరి పరస్పర కృషి ద్వారా విద్యా గమ్యాలను సాధించవచ్చు.
* ఈ ప్రక్రియను రూపొందించినవారు జాన్ ఆడమ్స్.

త్రిధృవ విధాన ప్రక్రియ 
 
* త్రిధృవ విధాన ప్రక్రియను ప్రతిపాదించిన విద్యావేత్త జాన్ డ్యూయీ.
* ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజాన్ని మూడు ధృవాలుగా చేర్చారు.
* ఈ ప్రక్రియలో సమాజ అవసరాలను తీర్చి, సమాజం కోరుకునే విధంగా పౌరులను తయారుచేయడమే విద్యా లక్ష్యంగా ఉంటుంది.
* ఉపాధ్యాయుడు సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థికి బోధనాభ్యసన కృత్యాలను నిర్వహిస్తాడు. అతడిని ఉత్తమమైన పౌరుడిగా తీర్చిదిద్దుతాడు.
* పరిసరాల అవగాహన, సర్దుబాటు చాలా ముఖ్యమైంది. పరిసరాలు అనుకూలంగా లేకుంటే విద్య సరిగా సాగదు.
* ఈ ప్రక్రియ మంచి విద్యా ఫలితాలను అందించగలదు.

విద్యాభివృద్ధి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణలు
అధికరణ 21 ఎ: 6 - 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం. ఏ వ్యక్తికీ విద్యా సంబంధిత హక్కు, స్వేచ్ఛను హరించకుండా ఉండటం.
అధికరణ 23: పిల్లలతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించడం, సంబంధిత పనుల్లో నియమించడం నిషేధం. పిల్లలతో ఎలాంటి పని చేయించకుండా విద్యను అభ్యసించే విధంగా చూడటం.
అధికరణ 41: పని, విద్యను పొందే హక్కు ద్వారా ప్రజలు కొన్ని సందర్భాల్లో సహాయం పొందే అంశాలను పొందుపరచడం.
అధికరణ 45: 14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ కుల, మత, లింగ, జాతి వివక్ష లేకుండా సార్వత్రిక ప్రాథమిక విద్యా హక్కు ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అందించడం.
అధికరణ 51 (ఎ): 6 - 14 సంవత్సరాల్లోపు పిల్లలను బడికి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది.
అధికరణ 350 (ఎ): మాతృభాషలోనే విద్యా బోధన చేయాలి.

 

విద్యా చరిత్ర

భారతీయ విద్యా విధాన చరిత్రను 4 భాగాలుగా విభజించవచ్చు.
 1. ప్రాచీన కాలంలో విద్యా విధానం (చరిత్ర ప్రారంభం నుంచి క్రీ.శ.12వ శతాబ్దం వరకు)
 2. మధ్యయుగంలో విద్యా విధానం (క్రీ.శ.12వ శతాబ్దం నుంచి క్రీ.శ.16వ శతాబ్దం వరకు).
 3. ఆధునిక యుగంలో విద్యా విధానం (క్రీ.శ.17వ శతాబ్దం నుంచి క్రీ.శ.19వ శతాబ్దం వరకు).
 4. స్వాతంత్య్రం అనంతరం విద్యా విధానం
1. ప్రాచీన కాలంలో విద్యా విధానం
చరిత్ర ప్రారంభం నుంచి క్రీ.శ.12వ శతాబ్దం వరకు విద్యా పరిణామ క్రమాన్ని ప్రాచీన కాలంలోని విద్యా విధానంగా భావించవచ్చు.
* ఈ కాలంలో భారతదేశంలో విలసిల్లిన వ్యవస్థీకృత విద్యను మూడు రకాలుగా విభజించవచ్చు.
   A. వేద విద్య
   B. బౌద్ధ విద్య
   C. జైన విద్య

A. వేద విద్య
ప్రపంచ చరిత్రలో విద్యా దానం చేసిన మొదటి దేశం భారతదేశం. మను శ్లోకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
భారతదేశంలోని బ్రాహ్మణోత్తములు సత్ప్రవర్తన కలిగి, విజ్ఞాన సముపార్జన చేసి విద్యా దానాన్ని మానవత్వంతో చేశారు.
చాంద్యోగ ఉపనిషత్తు నారద మహాముని గురించి వివరిస్తూ నారదుడికి 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 4 వేదాలు, రెండు ఇతిహాసాలను పఠించినట్లు పేర్కొంది.

వేదకాలంలో వేద విద్యా కరికులమ్‌లో అధ్యయనం చేసిన వేదాల వరుస క్రమం
1) రుగ్వేదం 2) సామవేదం  3) యజుర్వేదం 4) అధర్వణ వేదం
రుగ్వేదం: భారతదేశంలో మొదట రాసిన గ్రంథం.
         ఆర్యుల సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి వివరించింది.
సామవేదం: దీన్ని సంగీతశాస్త్రంపై రాశారు.
యజుర్వేదం: యజ్ఞయాగాలు, క్రతువుల గురించి వివరించింది. మత విషయాలకు సంబంధించింది.
అధర్వణ వేదం: ఆయుర్వేదం గురించి వివరించింది.

వేద విద్య లక్ష్యాలు
* సంపూర్ణ మూర్తిమత్వం సాధించే లక్ష్యంతో విద్యా ప్రక్రియ కొనసాగేది.
* విద్య అంతిమ లక్ష్యం ముక్తి లేదా మోక్షాన్ని పొందడం.
* మనిషి తన శరీరం, ఆత్మపై ఏకాగ్రతతో పట్టు సాధించడం.
* ఆలోచనా శక్తిని, ప్రజ్ఞను పెంపొందించడంతోపాటు గృహస్థాశ్రమం, వానప్రస్థానంలోని నియమాలు బ్రహ్మచర్యంలో ప్రయోగాత్మకంగా పరీక్షించడం. సంక్షిప్తంగా చెప్పాలంటే విద్య లక్ష్యం శీలం, సత్ప్రవర్తన.

పాఠ్యాంశాలు
1. వేద పుస్తకాలు (రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం) వీరి పాఠ్యపుస్తకాలు.
2. భాష, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు లాంటి సమాజానికి పనికొచ్చే విద్యను అందించేవారు.

వేద విద్య ఉద్దేశం
వేద కాలంలో విద్యార్జన ఉద్దేశం జనన మరణ రహస్యాల అన్వేషణ.
* ఇది రెండు రకాలుగా జరుగుతుంది.

1. అపర విద్య: ఇది ఐహికమైంది. భూలోకంలోని శరీరానికి సంబంధించింది. అంటే సమాజంలోని వ్యక్తి ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనం గడపడానికి ఉపయోగపడేది.
2. పరావిద్య: ఆయుష్మీకమైంది. అంటే ముక్తి, మోక్షం పొందడానికి ఉపయోగపడేది. పరలోకంలోని ఆత్మకు సంబంధించింది.
వేద విద్య ఆశయం: వేద కాలంలో విద్య ముఖ్య ఆశయం చిత్తవృత్తి నిరోధం అంటే బుద్ధిని క్రమబద్ధంగా అభివృద్ధి చేసుకోవడం.
* వేద విద్యలో హిందూ మత సిద్ధాంతాలను బోధించేవారు.
* వేద కాలపు విద్యా విధానంలో భోజపత్రాలను రాత సాధనాలుగా ఉపయోగించారు.

 

వేద విద్యలోని బోధనాంశాలు
  1. చాతుర్వర్ణ వ్యవస్థ
  2. చతుర్విధ పురుషార్థాలు
  3. చతురాశ్రమ ధర్మాలు
  4. కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు
చాతుర్వర్ణ వ్యవస్థ: కుల వృత్తుల గురించి వివరించింది.
* రుగ్వేదం 10వ భాగం పురుష సూక్తం దీన్ని తెలుపుతుంది.
* నాడు కులాలను అనుసరించి వారి జీవన విధానానికి ఉపయోగపడే విధంగా విద్యా బోధన జరిగేది.
* బ్రాహ్మణులకు యజ్ఞయాగాది క్రియలు, కర్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం బోధించేవారు.
* క్షత్రియులకు రాజనీతి, శస్త్రాస్త్ర ప్రయోగం, ధర్మ రక్షణ, దేశ రక్షణతో పాటు ధర్మ శాస్త్రాలను బోధించారు.
* వైశ్యులకు వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం బోధించారు.
* శూద్రులకు విద్యను నిరాకరించారు.
చతుర్విధ పురుషార్థాలు: విద్య వ్యక్తి ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించడానికి, చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి దోహదపడే విధంగా ఉండాలని భావించారు.
* ప్రతి వ్యక్తి తన జీవిత కాలాన్ని నాలుగు ప్రధాన ఆశ్రమాల్లో గడుపుతాడు. అవి:
  ఎ) బ్రహ్మచర్యం
  బి) గృహస్థాశ్రమం
  సి) వానప్రస్థం
  డి) సన్యాసం
 ఈ నాలుగు ప్రధాన ఆశ్రమాల్లో నాలుగు పురుషార్థాలు సాధించాలని ఉద్ఘాటించారు.
పురుషార్థాలు: 1) ధర్మం - అంటే సత్ప్రవర్తన
             2) అర్థం - సంపద
             3) కామం - సంతోష వాంఛ
             4) మోక్షం - జీవితం నుంచి విముక్తి
* హిందూ మతం ప్రకారం కర్మలు అనేకం. కర్మానుసారం పునర్జన్మ ప్రాప్తిస్తుంది.
* పుణ్యం చేసిన హిందువు స్వర్గానికి చేరుతాడు.
* పుణ్యం చేసిన బౌద్ధులు తుషి లోకానికి చేరుతారు.
* పుణ్యం చేసిన క్రైస్తవులు హెలెన్‌కు చేరుతారు.
* పుణ్యం చేసిన గ్రీకులు ఈలిజియన్ ఫీల్డ్‌కు చేరుతారు.

 

వేద విద్యా విధానం
* విద్య అనేది స్వచ్ఛందం.
* బ్రాహ్మణులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా విద్యాదానం చేసేవారు.
* బోధన సంస్కృత భాషలో జరిగేది.
* తొలి వేద కాలంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ విద్యా దానం చేశారు.
* మలి వేద కాలం నాటికి వర్ణ వ్యవస్థ బలపడి విద్యా ప్రవేశంపై నిషేధాజ్ఞలు వచ్చి చేరాయి.
* గురుకులాల్లో బ్రాహ్మణులు విద్యా దానం చేసేవారు. ఇది వేద విద్యా లక్షణం.
* 5 ఏళ్ల వయసులో 'ఓం నమఃశివాయ' అనే మంత్రంతో విద్యా విధానాన్ని ప్రారంభించేవారు.
* అప్పటి నుంచి ప్రతి రోజూ 'ఓం నమఃశివాయ' అనే శాంతి పాఠాన్ని ఆలపిస్తూ ప్రతి బాలుడు దినచర్యను ప్రారంభించాలి.

 

శిశు విద్య ప్రారంభం
ఉపనయనం:  ఉపనయనం అనే ఉత్సవంతో విద్యార్థి దశ ప్రారంభమవుతుంది.
* ఉపనయనం సమయంలో గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రాన్ని బోధిస్తాడు.
* ఉపనయనం అనంతరం విద్యార్థిని అంతేవాసి, అవతలవాసి లేదా గురువులవాసిగా పిలుస్తారు.
* ఉపనయనం అనంతరం విద్యార్థి గురు ఆశ్రమంలో నివసిస్తూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భిక్షాటన చేసి తీరాలి.
* గురువులకు సపర్యలు చేయాలి. గురువును సంతృప్తిపరచాలి. సత్ప్రవర్తన కలిగి గురువును తన సేవలతో సంతృప్తిపరిచిన విద్యార్థికి గురువు వాచక పద్ధతిలో జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు.
* వేదకాలంలో సమస్త జ్ఞాన కేంద్రం గురువు.
* వాచకం అంటే ప్రశ్నోత్తరాలు, చర్చ, సంభాషణ.
* వేద విద్యా పద్ధతి అయిన వాచక పద్ధతిలో 3 దశలుంటాయి.
  అవి:  1) శ్రవణం   2) మననం  3) నిధిధ్యాసనం
1. శ్రవణం: గురువు చెప్పినదాన్ని విని దాన్ని అనుకరించడం. గురువు మౌఖికంగా బోధించిన విషయాన్ని శిష్యులు వల్లె వేస్తారు. దీన్నే 'సంత చెప్పడం' అంటారు.
2. మననం: గురువు బోధించిన విషయాలపై గోష్ఠిని నిర్వహించడం. ఇక్కడ శిష్యులు విన్న పాఠ్యాంశాన్ని ఏకాంతంగా నెమరవేస్తూ వచ్చిన సందేశాలను చర్చా పద్ధతి ద్వారా నివృత్తి చేసుకోవడం. ఈ క్రమంలో బోధన అర్థవంతంగా సాగుతుంది.
3. నిధి ధ్యాసనం: విద్యార్థి తాను నేర్చుకున్న విషయాలను తన జీవితానుభవాలతో, ఇతర శాస్త్ర అధ్యయనాలతో, స్వయంప్రతిభతో జ్ఞానం సముపార్జించుకుని ధ్యానంలో నిమగ్నమవడానికి ప్రయత్నిస్తాడు. అత్యున్నత స్థానం లేదా మోక్షం పొందడాన్ని నిధి ధ్యాసనం అంటారు.
పూర్వం గురు ఆశ్రమాలుగా ప్రారంభమై విశ్వవిద్యాలయ స్థాయికి చేరి అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచినవి వారణాసి, తక్షశిల.
 ప్రశ్నించడం, సందేహాలను తీర్చుకోవడం అనే పద్ధతుల ద్వారా విద్యాభ్యాసం జరిగింది.
విద్య పూర్తయిన తర్వాత ఆశ్రమాన్ని విడిచి వెళ్లేటప్పుడు విద్యార్థికి గురువు ఎల్లవేళలా సత్యాన్ని పలుకు, నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు అని హితబోధ చేసేవారు.
వేద కాలంలో నియత పాఠశాల లేదా నియత విద్యా ప్రణాళిక లేవు. శిష్యుడు గురువు వద్దనే ఉంటూ ఆచరణాత్మక విద్యను గడించేవాడు.
ఆచరణాత్మక విద్య అంటే Practical Education. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు విద్యను నేర్పేవారు. దీన్ని 'భెల్ సిస్టమ్‌'గా పేర్కొంటారు. 'భెల్' అనే ఇంగ్లండ్ విద్యావేత్త చెన్నైలో సార్వజనీన విద్యావ్యాప్తి, తక్కువ ఖర్చుతో సాధించగలమని భావించి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం వల్ల దీన్ని భెల్ సిస్టమ్‌గా పేర్కొన్నారు
ఉపనయనం వయసు
  1. బ్రాహ్మణులకు - 8 సంవత్సరాలు
  2. క్షత్రియులకు - 10 సంవత్సరాలు
  3. వైశ్యులకు - 12 సంవత్సరాలు
  4. శూద్రులు ఉపనయనానికి అనర్హులు.

శిశు విద్య ముగింపు
సమవర్తనోత్సవం:
18 ఏళ్లు వచ్చిన తర్వాత 'సమవర్తనోత్సవం' అనే ఉత్సవాన్ని నిర్వహించిన తర్వాత విద్యార్థి దశ ముగుస్తుంది.
వేదకాలంలో విద్యా సంస్థలు
ఈ కాలంలో గురుకులం, పరిషత్, సమ్మేళన అనే మూడు రకాల విద్యాసంస్థలు ఉండేవి.
1. గురుకులం: ఉపనయనం అనంతరం విద్యార్థి గురువులు/ రుషుల ఆశ్రమాల్లో నివసించాలి. భిక్షాటన చేయాలి.
 గురువును సంతృప్తిపరచాలి. గురువు అనుగ్రహం పొందిన విద్యార్థికి గురువు జ్ఞానోపదేశం చేస్తారు.
2. పరిషత్: ఇవి ఉన్నత విద్యాలయాలు.
* గురుకుల అభ్యసనం అనంతరం చర్చలు, సంభాషణల ద్వారా విద్యార్థులు పరిషత్‌లో ఉన్నత విద్యను అభ్యసించేవారు. ఇక్కడికి పండితులను ఆహ్వానించేవారు.
3. సమ్మేళన: ఇది రాజాస్థానంలోని చర్చాగోష్ఠి.
* రాజు గొప్ప తత్త్వవేత్తలను, పండితులను ఆహ్వానించి గోష్ఠులు ఏర్పాటు చేసి గౌరవించేవారు.
వేదకాలంలోని బోధనా భాష: సంస్కృతం
వేద కాలంలో గురువు హోదా: గురుబ్రహ్మ (గురువు దైవసమానులు)
వేదకాలంలో గురుశిష్యుల సంబంధం: ప్రత్యక్ష సంబంధం, అవినాభావ సంబంధం.
వేదకాలంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు: వారణాసి, తక్షశిల.

వేదకాలంలో స్త్రీ విద్య
* తొలి వేద కాలంలో స్త్రీలకు ఉపనయన సంస్కార అర్హత ఉండేది. మలివేద కాలం నాటికి దీన్ని నిషేధించారు.
* వీరు ఆశ్రమానికి అనర్హులు. కానీ వివాహానికి ముందు తండ్రి, వివాహం అనంతరం భర్త విద్యాదానం చేసేవారు.
* వేద కాలంలో విద్యను అభ్యసించిన స్త్రీలు గార్గి, మైత్రేయ.
వేద విద్యలో లోపాలు
1. వర్ణ వివక్ష
2. లింగ భేదాలు
3. గురువు హోదా ఒక వర్గం వారికే సొంతం (బ్రాహ్మణులకు మాత్రమే)
వేదకాలం అనంతరం విద్యా విధానం:
* కేవలం సంఘంలోని మూడు వర్గాలకు మాత్రమే విద్య పరిమితమైంది. శూద్రులకు విద్యా హక్కు ఉండేది కాదు.
* ఉపనిషత్తుల్లో 2 మార్గాలు సూచించారు.
1. ద్రియాస జీవిత మార్గం: కర్మధర్మాల ద్వారా సాధించడం.
2. శ్రేయాస జీవిత మార్గం: మంచితనం, ఏకాగ్రత ద్వారా సాధించడం.
* ఈ కాలంలో సత్యం, వాస్తవం అనేవి మననం, నిధిధ్యాసన నుంచి మాత్రమే సాధ్యపడతాయని నమ్మేవారు.

బౌద్ధ విద్యాభ్యాసం
* బ్రాహ్మణత్వంలోని లోపాల కారణంగా బౌద్ధ మతం 6వ శతాబ్దంలోనే భారతదేశంలో విస్తరించింది. అప్పటివరకూ గురువు కేంద్రంగా సాగిన విద్య బౌద్ధ సన్యాసుల చేతిలోకి వెళ్లింది. ఈ కాలంలో వర్ణశ్రమ ధర్మాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి విద్య అందుబాటులోకి వచ్చింది.
* గురుకులం నుంచి ఆశ్రమ పాఠశాల స్థాయి వరకు విద్యా వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత బౌద్ధ విద్యావిధానాలదే.
* విశ్వవిద్యాలయాలు స్థాపించి ప్రపంచ విద్యార్థులను ఒకేచోట చదువు కోసం సమావేశపరచిన ఘనత బౌద్ధ విద్యా విధానానికి దక్కుతుంది.
* బౌద్ధ విద్యా విధానం వృత్తి విద్య, పారిశ్రామిక విద్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించింది.
* మెడిసిన్, సర్జరీ అనేవి బౌద్ధ విద్యా విధానంలో మనకు కనిపిస్తాయి.
* వైద్య విద్యలో తక్షశిల అత్యంత గౌరవపాత్రమైన విద్యాపీఠంగా రూపొందింది.
* ఇందులో విద్యనభ్యసించడానికి కావాల్సిన వయసు 8 సంవత్సరాలుగా ఉండేది.

బౌద్ధ విద్యా విధానం లక్షణాలు
    1) విముక్తి
    2) జీవికకు సిద్ధం చేయడం
    3) నైతిక అభివృద్ధి
1. విముక్తి: అవిద్య, కోర్కెలు, దుఃఖం నుంచి విముక్తి చేయడం.
2. జీవికకు సిద్ధం చేయడం: సమాజ అవసరాలను గుర్తించి, విద్యార్థులను వారి జీవితానికి సన్నద్ధం చేయడం.
3. నైతిక అభివృద్ధి: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం.
విద్యా ప్రవేశం: విద్యా ప్రవేశం సార్వజనీనమైంది.
        అన్ని వర్గాల వారు విద్యను అభ్యసించడానికి అర్హులు.
* బౌద్ధ విద్యా విధానంలో విద్యా దశలు 3. అవి:
     1. పబ్బజ (ప్రాథమిక విద్య)
     2. ఉపసంపద (ఉన్నత విద్య)
     3. ఉప సదస్సు (స్నాతకోత్సవం)
1. పబ్బజ: ప్రాథమిక విద్య 'పబ్బజ' అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది.
* 'పబ్బజ' అనేది పాళీ భాషా పదం. దీని అర్థం ముందుకెళ్లడం.
* 8 సంవత్సరాల వయసులో అన్ని వర్గాలవారు ఈ బౌద్ధ విద్యాలయ ప్రవేశ ఉత్సవానికి అర్హులు.

ప్రాథమిక విద్యాభ్యాస కాల వ్యవధి: 12 సంవత్సరాలు (అంటే 8 నుంచి 20 సంవత్సరాల వయసు వరకు)
* 'పబ్బజ' ఉత్సవం అనంతరం విద్యార్థిని 'సమనేరులు' అని పిలిచేవారు.
2. ఉప సంపద: ఇది ఉన్నత విద్యా దశ.
* ఈ ఉత్సవం అనంతరం విద్యార్థి సన్యాసిగా మారుతాడు.
* ఈ దశ 10 సంవత్సరాలు.
* ఈ దశలో అత్యున్నత విద్యను అభ్యసించిన విద్యార్థి బౌద్ధంలో ఉపాధ్యాయుడు అవుతాడు.
3. ఉప సదస్సు: బౌద్ధమతంలో స్నాతకోత్సవాన్ని ఉపసదస్సు అంటారు.
బౌద్ధ విద్యాలయాలు
* ఆరామాలు, విహారాలు, మఠాల్లో విద్యా బోధన జరిపేవారు.
* విద్యకు వ్యవస్థాగత రూపం ఇచ్చిన ఘనత బౌద్ధానికి చెందుతుంది.
* నాగార్జున, నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలను బౌద్ధం మనకు అందించింది.
* నలంద విశ్వవిద్యాలయంలో చదువుతోపాటు భోజనం, ఆవాసం, దుస్తులు, వైద్యం ఉచితంగా అందించేవారు.
* ఆయుర్వేదం, ధనుర్వేదం, న్యాయ విద్యలకు - తక్షశిల
* తత్వశాస్త్రానికి, సంగీత శాస్త్రానికి - ఉజ్జయిని, కాశీ.
* ఎన్నాయరమ్, ధర్, మలకాపురమ్, తిరుముక్కడాల విద్యా కేంద్రాలుగా మారాయి.
* ఈ కాలంలో వైద్య రంగంలో విశేష కృషి జరిగింది.

బోధనా భాష
* మాతృభాష (ప్రజల భాష) అయిన పాళీ లేదా ప్రాకృతం.
* భారతదేశంలో తొలిసారిగా మాతృభాషలో విద్యాబోధన చేసినవారు బౌద్ధులు.
బౌద్ధ విద్యా ప్రణాళిక
* బౌద్ధులు నైతిక, లౌకిక విద్యను బోధించేవారు.
* నైతిక అంశాలు బుద్ధుడి అష్టాంగ మార్గాన్ని తెలియజేస్తాయి.
* భౌతిక లేదా లౌకిక అంశాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయి.
బోధనా విధానం
1. వాచిక పద్ధతి: ప్రశ్నోత్తరం, చర్చ, సంభాషణ.
2. రాత పద్ధతి
3. ఆచరణాత్మక పద్ధతి (Practical Method).
* బౌద్ధ ఉపాధ్యాయులు మానిటోరియల్ పద్ధతి ద్వారా రూపొందేవారు. బౌద్ధ కాలంలో ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు
   1) తక్షశిల        2) నలంద         3) విక్రమశిల        4) నాగార్జున

బౌద్ధ విద్యలో లోపాలు
1. మత విద్యకు ప్రాధాన్యం
2. సైనిక విద్య లోపించడం
3. విద్యాలయాలు ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించడంలో అవి స్త్రీ, పురుషుల క్రీడా నిలయాలయ్యాయి.

జైన విద్యా విధానం
* జైనులు ప్రజల భాషయైన ప్రాకృతంలో లౌకిక విద్యను బోధించారు.
జైనమత విద్య ప్రధాన తత్వం
   1) సత్ప్రవర్తన
   2) ఆధ్యాత్మిక చింతన
   3) కఠిన క్రమశిక్షణ
* జైన విద్య ప్రధాన ఆశయం త్రిరత్నాలను అనుసరించడం.
జైన మత సూత్రాలు త్రి రత్నాలు
    1. సమ్యక్ దర్శనం - సరైన విశ్వాసం
    2. సమ్యక్ జ్ఞానం - సరైన జ్ఞానం
    3. సమ్యక్ ప్రవర్తన - సరైన క్రియ
* సమ్యక్ ప్రవర్తనకు పంచ వ్రతాలు అనుసరించాలి.
పంచ వ్రతాలు
   1) సత్యం      2) అహింస     3) అస్థేయ      4) అపరిగ్రహ     5) బ్రహ్మచర్యం
బోధనా విధానం
 1) వల్లెవేయడం     2) అనుకరణ         3) వైయక్తిక అభ్యసనం
* జైన విద్య అంతిమ ధ్యేయం నిర్యాణం.

2. మధ్యయుగంలోని విద్యా విధానం

క్రీ.శ.13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు భారతదేశంలోని విద్యా పరిణామ క్రమాన్ని మధ్యయుగంలోని విద్యా విధానంగా పేర్కొనవచ్చు.
* 8వ శతాబ్దంలో మహమ్మదీయులు భారతదేశానికి రావడంతోనే భారతీయ సంస్కృతి మారిపోయింది.(క్రీ.శ.712లో అరబ్బుల దండయాత్ర)
* క్రీ.శ.1000 - 1026 మధ్య కాలంలో మహమ్మద్ గజనీ భారత్‌పై 17 సార్లు దండయాత్ర చేసి హిందూ దేవాలయాలు, విద్యాలయాలను నాశనం చేసి ముస్లిం విద్యను ప్రారంభించాడు.
ఇస్లాం విద్యా లక్ష్యాలు
  1) జ్ఞాన వ్యాప్తి                                 2) మత వ్యాప్తి                   3) జీవన అవగాహన
 4) నైతిక విలువలు పెంపొందించడం   5) రాజకీయ అవగాహన
* ఇది వైదిక విద్యల మత సంబంధమైంది.
* నియమబద్ధమైన మహమ్మదీయులను తయారుచేయడం దీని ముఖ్య లక్ష్యం.
 ఇస్లాం విద్యా ప్రవేశం

బిస్మిల్లా: 'బిస్మిల్లా' అనే ఉత్సవంతో విద్యాభ్యాసం ప్రారంభమయ్యేది. ముస్లిం బాలుడికి 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు నిండిన రోజు 'బిస్మిల్లా' అనే ఉత్సవాన్ని జరిపి విద్యాలయంలో చేర్చుతారు.
* బాలికల విషయంలో ఈ ఉత్సవాన్ని 'జార్ఫిపాని' అంటారు.
ఇస్లాం విద్యా ప్రణాళిక
* విద్యా ప్రణాళిక మత సంబంధమైంది.
* స్థాయిని బట్టి విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక ఉంటాయి.
ఇస్లాం విద్యాలయాలు
     1) మక్తబ్          2) మదరసా         3) మదరసా ఐలా
1. మక్తబ్:
* ముస్లిం విద్యా విధానంలోని ప్రాథమిక స్థాయి పాఠశాలను 'మక్తబ్' అంటారు.
* ఇది ఇస్లాం విద్యా వ్యవస్థలో తొలి పాఠశాల.
* 'మక్తాబ్' అనే పదాన్ని 'కుతూబ్' అనే అరబిక్ భాష నుంచి గ్రహించారు. 'కుతూబ్' అంటే రాయడం నేర్పే ప్రదేశం.
* మహమ్మద్ ఘోరీ క్రీ.శ.1102లో మన దేశంలో అజ్మీర్‌లో మక్తబ్ అనే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశాడు.
* మక్తాబ్‌ను మసీదుకు అనుసంధానంగా మత జ్ఞానం కోసం మత పెద్ద నిర్వహిస్తాడు.

* ఈ స్థాయిలోని ముస్లిం విద్యార్థికి అరబిక్ అక్షరమాల, ఖురాన్ సూక్తులు, క్రమం తప్పని నమాజు నేర్పుతారు.
* ఈ స్థాయిలో బోధనా విధానం కంఠస్థం.
* ఈ స్థాయిలో విద్యాప్రణాళిక ప్రధాన ఉద్దేశం మత వ్యాప్తి, సంస్కృతి వ్యాప్తి.
2. మదరసా
* ఇస్లాం విద్యా విధానంలో ఉన్నత పాఠశాల మదరసా.
* వీటిని రాజులు, సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు పోషించేవారు.
* ఇది మాధ్యమిక, ఉన్నత పాఠశాల వ్యవస్థ.
* దీనిలో విద్యను ఉపన్యాస పద్ధతిలో బోధించేవారు.
* బోధనా మాధ్యమం అరబిక్, పర్షియన్, ఉర్దూ.
* ఈ మదరసాల్లో చదివినవారిని రాజాస్థానంలో ఉద్యోగులుగా నియమించేవారు.
* మదరసాలలో 12 సంవత్సరాల విద్య ఉండేది.
* దియోబండ్, లక్నోలో మదరసాలు ప్రసిద్ధి చెందాయి.
* మానిటర్ సిస్టమ్ అమల్లో ఉండేది.
* లౌకిక మత విద్యలు, అరబ్బీ, వ్యాకరణం, సాహిత్యం, తర్కం, న్యాయశాస్త్రం, ఖగోళ, గణిత, చరిత్ర, వైద్య విద్యలు అరబ్బీ మాధ్యమంలో నేర్పేవారు. మదరసాల్లో ఉపన్యాస పద్ధతి ఉండేది. విద్యార్థులు తబ్సి (వైద్యశాస్త్రం), రియాబీ (విజ్ఞానశాస్త్రం), ఇలాహి (ఆధ్యాత్మిక చర్చ) లాంటి వాటిలో ప్రయోగాలు చేసేవారు.

వ్యాఖ్యాన గ్రంథాలు: సంస్థాన్, బోస్థాన్.
బోధనా భాష: పర్షియన్, అరబిక్.
* ఔరంగజేబు ప్రజల మాతృభాషను బోధన భాషగా ప్రవేశపెట్టాడు.
3. మదరసా ఐలా
* ఇవి విశ్వవిద్యాలయాలు.
* ఈ స్థాయిలో బోధనా మాధ్యమం అరబిక్, పర్షియన్.
* ఈ స్థాయిలో విద్యా బోధన ఉపన్యాస పద్ధతిలో కొనసాగేది.
* మదరసా ఐలాలను సాధారణంగా విశ్వవిద్యాలయానికి బదులుగా రాజప్రసాదంలో వెలసిన విద్యా, మత సంబంధ గోష్ఠులుగా నిర్వచించవచ్చు.
* మదరసా ఐలాలలో చదివినవారిని రాజుల సలహాదారులుగా నియమించేవారు.
బోధనా పద్ధతులు
* వాచిక పద్ధతిని అవలంబించేవారు.
    ఉదా: విశ్లేషణ, చర్చలు, ప్రశ్నోత్తరాలు, వాదోపవాదాలు, సంభాషణలు.

గురుశిష్యుల సంబంధం
* జ్ఞాన సంబంధం
* మతపరమైన నైతిక సంబంధం
శిక్షలు - బహుమతులు
* ముస్లిం విద్యా విధానంలో శిక్షలు, బహుమతులు ప్రవేశపెట్టారు.
* గజనీ మహమ్మద్ హిందూ విద్యాలయాలను నాశనం చేసి ముస్లిం విద్యను భారతదేశంలో స్థాపించాడు.
* తర్వాతి కాలంలో మొగల్ చక్రవర్తులు ఇస్లాం విద్యను అభివృద్ధి చేశారు.
* భారత్‌లో మాతృభాషలో విద్యను బోధించమని ఆదేశించిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబు.
* అక్బర్ పరమత సహనంతో కూడిన విద్యను (లౌకిక విద్య) ప్రవేశపెట్టాడు.
* సంగీత విద్యలో గొప్ప పేరుపొందినవారు తాన్‌సేన్.
ఇస్లాం కాలంలో స్త్రీ విద్య
* మక్తబ్‌లలో బాలబాలికలు ప్రాథమిక విద్యను అభ్యసించేవారు. కానీ మహ్మదీయ స్త్రీలకు మదరసాల్లో విద్యనభ్యసించే అవకాశం ఉండేది కాదు. ధనవంతులైన పట్టణ స్త్రీలు విద్య నేర్చుకునేవారు.
* ఉన్నత స్థానంలోని స్త్రీలకు విద్యావకాశాలు ఉండేవి.

ఉదా: గుల్‌బదన్ బేగం, రజియాసుల్తానా, నూర్జహాన్, ముంతాజ్‌మహల్, మహానగామా లాంటి మహిళలు విద్యనభ్యసించారు.
* వీరు గృహ నిర్వహణ, సంగీతం, సాహిత్య విద్యలు నేర్చుకునేవారు.
* బీజాపూర్, గోల్కొండ, మాల్వా, ఖండేష్, జాన్‌పూర్, ఆగ్రా, బీదర్, ముల్తాన్, లక్నో, దిల్లీ ప్రముఖ ఇస్లామిక్ విద్యా కేంద్రాలయ్యాయి.
మదరసాల్లో విద్యా ప్రణాళిక
  1. భాషాశాస్త్రం - ఉచ్ఛారణ, వ్యాకరణం, అలంకారాలు
  2. తాబీ - భౌతికశాస్త్రం
  3. రియాజి - గణితశాస్త్రం
  4. యునాని - వైద్యశాస్త్రం
  5. ఇలాహి - వేదాంతం
ఇస్లాం విద్యలోని సద్గుణాలు
* భౌతిక, ఆధ్యాత్మిక, మత విద్యలను సమ్మేళనం చేయడం ఒక సుగుణం. దీనివల్ల వృత్తి విద్యకు ప్రాధాన్యం సంతరించుకుంది.
* ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చారు.
* భారతీయ రచనలు ఇతర భాషల్లోకి ఈ కాలంలోనే తర్జుమా అయ్యాయి.
* విద్యలో వర్ణ వ్యవస్థను, వర్ణ వివక్షను పాటించలేదు.

ఇస్లాం విద్యలో దోషాలు
* స్త్రీ విద్యను నిషేధించారు.
* ఉన్నత వర్గానికి మాత్రమే విద్యను పరిమితం చేశారు.
* కేవలం వల్లెవేయడం విద్యా పద్ధతిగా ఉండటం.
* కఠిన దండనను పాఠశాలలో అమలు పరచడం.

C. ఆధునిక కాలంలో విద్యా విధానం

        భారతదేశంలో 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు జరిగిన విద్యా పరిణామ క్రమాన్ని ఆధునిక విద్యా విధానంగా పేర్కొనవచ్చు.
* దీన్ని స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతర విద్యా విధానంగా విభజించవచ్చు.
స్వాతంత్య్రానికి పూర్వం (బ్రిటిష్ విద్యా విధానం)
* భారతదేశంలో విదేశీ విద్య యూరోపియన్ క్రైస్తవ మిషనరీలతో ప్రారంభమైంది. మత వ్యాప్తి కోసం ఈ పాఠశాలలను స్థాపించారు.
* భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసిన మొదటి క్రైస్తవ మత బోధకుడు పోర్చుగీసుకు చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్.

* సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ క్రీ.శ.1575లో బొంబాయి దగ్గర ఉన్న బాంద్రాలో సెయింట్ ఆన్స్ కళాశాలను
స్థాపించాడు.
* పోర్చుగీసుకు చెందిన రాబర్ట్ నోబుల్ మచిలీపట్నంలో నోబుల్ కళాశాలను స్థాపించాడు.
* అనంతరం భారతదేశంలో ఆధునిక విద్యా వ్యాప్తికి క్రిస్టియన్ మిషనరీలు కృషి చేశాయి.
* ఈ క్రిస్టియన్ మిషనరీలు ప్రపంచంలో వివిధ దేశాల్లో తమ మత వ్యాప్తి కోసం పాఠశాలలను స్థాపించాయి.
* భారతదేశంలో మొదటగా విద్యా వ్యాప్తికి కృషిచేసిన పాశ్చత్యులు పోర్చుగీసువారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో విద్యా విధానం
* క్రీ.శ.1600 డిసెంబరు 31న భారతదేశానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది.
* భారతదేశానికి ప్రధానంగా వ్యాపారం చేయడానికి వచ్చింది. అయినా నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మత ప్రాదిపదికన రూపొందించింది.
* కంపెనీ కార్యకలాపాల విస్తరణ దృష్ట్యా భారతీయులకు ఆంగ్ల విద్యను బోధించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
* భారతదేశంలో ఇంగ్లిష్ విద్య ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పిన మొదటి వ్యక్తి కంపెనీ ఉద్యోగి అయిన చార్లెస్ గ్రాంట్. ఇతడిని భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడిగా పేర్కొంటారు.

* చార్లెస్ గ్రాంట్ 'అబ్జర్వేషన్స్' అనే గ్రంథంలో భారతీయుల అతి నీచమైన దౌర్భాగ్య జీవితాన్ని బాగుచేయడానికి రెండు మార్గాలే శరణ్యమన్నాడు. అవి:  1) ఇంగ్లిష్ భాష       2) క్రైస్తవ మత వ్యాప్తి.
* ఆంగ్ల భాష నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిదని చార్లెస్ గ్రాంట్ పేర్కొన్నాడు.
బ్రిటిష్ కాలంలో విద్య - వివిధ కమిటీలు, సిఫార్సులు
* భారతదేశంలో ఆంగ్లాన్ని బోధన భాషగా చేయాలని చార్లెస్ గ్రాంట్ వాదించాడు. బ్రిటిష్ పార్లమెంటులో సభ్యుడైన విల్‌బర్‌ఫోర్స్‌ను దీనిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టమని కోరాడు.
* గ్రాంట్ సూచనలకు అనుగుణంగా 1813లో బ్రిటిష్ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది.
* విల్‌బర్‌ఫోర్స్ చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించడంలో సహాయపడ్డాడు.
1813 చార్టర్ చట్టం:
* గ్రాంట్ సూచనల మేరకు బ్రిటిష్‌వారు 1813 చార్టర్ చట్టాన్ని రూపొందించారు.
* ఇందులో భారతదేశంలో విద్యా వ్యాప్తికి లక్ష రూపాయలు కేటాయించారు. దీని ద్వారా మొదటగా బ్రిటిష్‌వారు మన విద్యా విధానంలో అధికారికంగా జోక్యం చేసుకున్నట్లు చెప్పవచ్చు.

ఈ చట్టంలోని ప్రధానాంశాలు
* క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వాలి.
* భారతీయులను విద్యావంతులను చేయడం, శాస్త్రవిజ్ఞాన సాహిత్యాలను అందించే బాధ్యత కంపెనీ స్వీకరించాలి.
* విద్య కోసం వార్షిక కేటాయింపు లక్ష రూపాయలు.
* ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పర్యవేక్షణలో కలకత్తాలో అనేక బాలికల పాఠశాలలను స్థాపించారు.
* జర్మన్ మిషనరీకి చెందిన 'స్కావర్జ్' మద్రాస్ ప్రావిన్సులో స్వదేశీ విద్య కోసం రెండు పాఠశాలలను ప్రారంభించాడు.
* జాన్ సులీవాన్ ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు.
* క్రీ.శ.1786లో శ్రీమతి కాంఫ్‌బెల్ అనాథ మహిళల కోసం మద్రాసులో ఒక పాఠశాలను ప్రారంభించారు. ఇందులో మానిటోరియల్ పద్ధతిలో బోధన జరిపించారు.
* బొంబాయి గవర్నరు ఎల్ఫిన్‌స్టన్ 'స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ'ని స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేశాడు.
* కెప్టెన్ కేండీ పూనా సంస్కృత కళాశాలను స్థాపించాడు. కాలక్రమేణా పూనా సంస్కృత కళాశాల పూనా కళాశాలగా మారింది. బొంబాయిలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలను ఎల్ఫిన్‌స్టన్ స్థాపించారు.
* ఆంగ్లేయుడైన జార్విన్ అనే కంపెనీ ఉద్యోగి (ఇంజినీర్) ఇంజినీరింగ్ తరగతుల్లో భారతీయులకు అర్థమయ్యేలా ప్రాంతీయ భాషల్లోకి ఇంజినీరింగ్ టెక్నాలజీని తర్జుమా చేసి బోధించడానికి ప్రయత్నించాడు. భారతదేశంలో ఇంజినీరింగ్ విద్యకు ఎంతో కృషి చేశాడు.
* రాజారాం మోహన్‌రాయ్ 1817లో హిందూ కాలేజీని స్థాపించారు.

ప్రాక్ పశ్చిమ వివాదం
* జార్విన్, కెప్టెన్ కేండీ లాంటి ఆంగ్లేయులు భారతీయత గొప్పదని, భారతీయ భాషలను పునరుద్ధరించడానికి చార్లెస్ గ్రాంట్ ద్వారా కేటాయించిన లక్ష రూపాయలను ఖర్చు చేయాలని వాదించారు.
* పెర్రి, ఎల్విన్ లాంటివారు భారతీయ విజ్ఞానం కంటే పాశ్చాత్య విజ్ఞానం గొప్పదని వాదించారు. దీన్నే ప్రాక్ పశ్చిమ వివాదం అంటారు.
ఆంగ్లిస్టు - క్లాసిస్టు వివాదం
* పాశ్చాత్య విజ్ఞానం భారతీయులకు ఏ భాషలో బోధించాలనే విషయంపై జరిగిన వివాదమే ఆంగ్లిస్టు క్లాసిస్టు వివాదం.
* రాజారాం మోహన్‌రాయ్ హిందూ సమాజంలో ఉన్న అజ్ఞానం, దురాచారాలను తొలగించాలంటే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని పేర్కొన్నాడు.
* భారతీయ చరిత్రలో 1813 - 1834 మధ్య కాలం ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తింపు పొందింది. ఇది ఆశించిన మార్పులు సాధించిన కాలం. ఈ కాలంలో 3 రకాల భావవాదాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.
1. విప్లవాత్మక భావవాదం - విద్య ద్వారా మతరహితంగా ప్రజల్లో మార్పు తీసుకురావడం.
2. విజ్ఞాన సముపార్జన, నూతన విజ్ఞాన విస్తరణ, పాశ్చాత్య విజ్ఞాన వ్యాప్తి ద్వారా హిందూ విధానంలో మార్పు తీసుకురావడం.
3. విప్లవ వ్యతిరేకవాదం - దీని ప్రకారం విద్యను జీవనోపాధి కల్పించేదిగా భావించారు. ఆంగ్లభాష మాట్లాడటం, రాయడం నేర్చుకుని ప్రభుత్యోద్యోగాల్లో చేరడమే విద్య లక్ష్యంగా భావించారు. దీనికి ప్రాణం పోసినవారు లార్డ్ మెకాలే.

లార్డ్ మెకాలే విధానం - 1835
    1835లో లార్డ్ మెకాలే భారతదేశంలో అవలంబించాల్సిన నూతన విద్యావిధానంపై చర్చించారు. నాటి గరవ్నర్ జనరల్ విలియం బెంటింక్‌తో 'విద్య ప్రస్తుతం మనకు, భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక మార్గాన్ని తయారుచేసేలా ఉండాలి. భారతీయులు రంగులో, రక్తంలో భారతీయులై ఉన్నా వారి ఆలోచనలు, ప్రజ్ఞ ఆంగ్లం వైపు ఉండాలి' అని చెప్పాడు. ఇతడి ప్రకారం భారతీయులందరినీ విద్యావంతులను చేయనవసరం లేదు. ముందుగా ఉన్నత, మాధ్యమిక వర్గాల వారిని విద్యావంతులను చేయడం ద్వారా భారతీయ సంస్కృతిని వడబోసి చివరి స్థాయి ప్రజల వద్దకు విద్యను తీసుకెళ్లవచ్చని భావించారు. దీన్నే అధో ముఖ వడపోత సిద్ధాంతం అంటారు.
* ఇతడి ప్రకారం ఇంగ్లండ్ పునరుద్ధరణకు గ్రీకు, లాటిన్ తోడ్పడినట్లు భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది.
* విద్యా సంస్థల్లో తటస్థ మత విధానాన్ని అనుసరించాలని సూచించాడు.
* లార్డ్ మెకాలే దేశీయ విద్యా సంస్థలను మూసివేయాలంటూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తూ కింది వ్యాఖ్యా చేశాడు.
A single shelf of a good European literature was worth the whole native literature of India and Asia.
* ఈ కమిటీ 1835, ఫిబ్రవరి 8న భారతీయ విద్యపై చారిత్రాత్మకమైన ప్రతిపాదనలు చేసింది.

ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు
* ఆంగ్లాన్ని బోధనా భాషగా చేయాలి.
* ఆంగ్లం నవీన విజ్ఞానానికి తాళం చెవి. భారతీయ భాషలైన సంస్కృతం, అరబిక్, పర్షియన్ ఇందుకు పనికి రావు.
* కంపెనీ పాలనకు అవసరమయ్యే గుమస్తా వర్గాన్ని తయారుచేయడం భారత విద్యాలయాల లక్ష్యంగా ఉండాలి.
* విద్యా సంస్థల్లో తటస్థ మత విధానం అనుసరించాలి.
* స్త్రీలకు విద్యార్హత లేదు.
* భారతదేశం, అరేబియాలోని మొత్తం సాహిత్యం యురోపియన్ సాహిత్యానికి సరితూగదు.
* విజ్ఞానశాస్త్రాలను భారతీయ భాషల్లో బోధించలేరు.
* ఉన్నత తరగతి వారికి మాత్రమే విద్య అందించాలి. తర్వాతి కాలంలో దానంతటదే మధ్య తరగతికి, అట్డడుగు వర్గాలకు అందుతుంది. దీన్నే 'అధోముఖ వడపోత సిద్ధాంతం' అంటారు.
మెకాలే ప్రతిపాదనల లక్ష్యాలు
* దుబాసీ వర్గాన్ని తయారుచేయడం.
* గుమస్తా వర్గాన్ని తయారుచేయడం.
* వలస పౌరుడిని సృష్టించడం.
* రక్తంలో భారతీయుడు, మేధస్సులో ఆంగ్లేయుడిగా ఉండే కొత్త వర్గాన్ని తయారుచేయడం.
* మెకాలే ప్రతిపాదనలను బెంటింక్ ఆమోదించడంతో భారతీయ విద్యా చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది.

ఈ ప్రతిపాదనల ఫలితాలు
* ఈ సిఫారసుల మేరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు.
* 1844లో గవర్నర్ జనరల్ అయిన లార్డ్ హార్డింజ్ ఆంగ్ల విద్యను అభ్యసించినవారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆజ్ఞాపించడంతో ఆంగ్లానికి మరింత ప్రోత్సాహం లభించింది.
* తర్వాతి కాలంలో బ్రిటిష్ శాసనసభ కోరిక మేరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ భారతదేశంలో ఒక సమగ్ర విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
* దీనికి అనుగుణంగా నాటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడు చార్లెస్ ఉడ్ ఒక తాఖీదును 1854లో భారతదేశానికి పంపాడు. దీన్నే 'ఉడ్స్ తాఖీదు' అంటారు.

విద్యా కమిషన్లు - వాటి ఫలితాలు

ఉడ్స్ నివేదిక - 1854
దీన్ని ఏర్పాటు చేసినప్పుడు భారతదేశపు గవర్నర్ జనరల్ డల్హౌసీ.
* 1854లో ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధ్యక్షుడైన చార్లెస్ ఉడ్ ఈ నివేదికలో అనువైన విద్యా విధానాన్ని సూచించాడు.

ముఖ్యాంశాలు
* భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి.
* విద్యా వ్యవహారాలను క్రమబద్ధీకరించడానికి ప్రతి రాష్ట్రంలో విద్యా శాఖను ఏర్పాటు చేయాలి. విద్యాధికారులను నియమించాలి.
* విద్యను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయుల్లో నిర్ణీతమైన శ్రేణుల్లో విభజించి బోధించడం, నిర్వహించడం.
   1. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు.
   2. ఉన్నత పాఠశాలలు, కళాశాలలు.
   3. విశ్వవిద్యాలయాలు.
* భారతదేశంలో విద్యా సంస్థలను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, కళాశాల, విశ్వవిద్యాలయలుగా విభజించాలని సూచించినవారు ఉడ్స్.
* బొంబాయి, మద్రాసు, కలకత్తా నగరాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఫలితంగా 1857లో విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
* 1857లో ఏర్పడిన మొదటి విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం.

రెండో విశ్వవిద్యాలయం బొంబాయి విశ్వవిద్యాలయం.
మూడో విశ్వవిద్యాలయం మద్రాసు విశ్వవిద్యాలయం.
* స్వదేశీ భాషల్లో పుస్తకాల కొరత వల్ల బోధనా భాషగా ఆంగ్లం ఉండాలి.
* ఆంగ్ల భాషపై అభిరుచి ఉన్నవారికి ఆంగ్లంలో బోధించాలి. మిగతా విద్యార్థులకు వారి మాతృభాషలో విద్యనందించాలి.
* మతబోధనపై తటస్థ విధానం.
* స్త్రీ విద్యను, బాలికా విద్యను అందించే సంస్థలకు, వ్యక్తులకు ప్రోత్సాహం కల్పించాలి.
* నిష్ణాతులైన ఉపాధ్యాయులను తయారుచేయడానికి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించాలి.
* ఉపాధ్యాయ శిక్షణ ప్రాముఖ్యం, మాతృభాషను బోధనా భాషగా నిర్లక్ష్యం.
* సార్వత్రిక విద్యావిధానం ప్రవేశపెట్టి విద్యను ఉచితంగా అందించాలి.
* ప్రైవేటు యాజమాన్యంలో నడిచే విద్యాసంస్థలకు గ్రాంట్ - ఇన్ - ఎయిడ్ ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాలి.
* ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు.
* విద్య లక్ష్యం భారతీయులను సేవకులుగా రూపొందించడమే కాకుండా భారతీయ ప్రజ్ఞను, నైతిక విలువలను పెంచుతూ అభివృద్ధికి తోడ్పడటం.

* విశ్వవిద్యాలయాలు విద్యా బోధన చేయకుండా అవి విద్యా ప్రమాణాలను కాపాడటానికి కృషి చేయాలి. కళాశాలలను పర్యవేక్షించాలి, పరీక్షలు నిర్వహించాలి, పట్టాలు ప్రదానం చేయాలి.
* పైన పేర్కొన్న ప్రతిపాదనల వల్ల భారతదేశ విద్యా చరిత్రలో ఉడ్స్ నివేదిక ప్రముఖ స్థానాన్ని పొందింది.
* ప్రస్తుత దేశీయ విద్యా విధానానికి దీన్ని ప్రాతిపదికగా చెప్పవచ్చు.
* పై కారణాల వల్ల హెచ్.ఆర్.జేమ్స్ ఉడ్స్ నివేదికను భారత విద్యా విధానానికి మాగ్నాకార్టాగా అభివర్ణించారు.
* ఉడ్స్ నివేదిక ఫలితంగా స్త్రీ విద్యా సాధనలో భారతదేశం కొంత ముందడుగు వేసింది. ఆనాడు ఇంగ్లండులో సైతం మహిళలకు విశ్వవిద్యాలయాల ప్రవేశ అర్హత పరీక్షలు రాయడంపై నిషేధం ఉండేది. కానీ ఇంగ్లండ్ కంటే ముందుగా భారత్‌లో మహిళలకు విశ్వవిద్యాలయ ప్రవేశార్హత కల్పించారు. ఈ విధంగా భారత్‌లో మొదటిసారిగా పట్టభద్రురాలైన మహిళ 'చంద్రముఖి బసు'.
* 1871లో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖను ఏర్పాటు చేశాయి. అంతకు ముందు విద్యాశాఖ విదేశీ వ్యవహారాల శాఖలో భాగంగా ఉండేది.
* ఆగ్రా ప్రాంతంలో నెలకొల్పిన స్వదేశీ పాఠశాలలు హలక్ బంది పాఠశాలలు.
* ఉడ్స్ నివేదికలోని సిఫారసుల్లో అనేకం 1882 వరకు అమల్లోకి రాలేదు.
* ప్రజల విద్యా అవసరాలను నిర్లక్ష్యం చేశారు. అందువల్ల ఉడ్స్ నివేదిక సిఫారసులను సక్రమంగా అమలు పరచడానికి వైస్రాయి లార్డ్ రిప్పన్, హంటర్ అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించాడు. దీన్నే హంటర్ కమిషన్, తొలి భారతీయ విద్యా కమిషన్ అని అంటారు.

హంటర్ కమిషన్ - 1882
దీన్నే ప్రథమ భారతీయ విద్యా కమిషన్ అంటారు.
* 1882లో లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్‌గా రాగానే విలియం హంటర్ అధ్యక్షతన మొదటి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
ఉద్దేశం: ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తేవడం. ఈ కమిషన్ ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టింది. కాబట్టి దీన్ని ప్రాథమిక విద్యా కమిషన్ అని పేర్కొంటారు.
* ఈ కమిషన్ ప్రతిపాదనల మేరకు ప్రాథమిక పాఠశాలలు స్థాపించారు. యాజమాన్య బాధ్యతను ప్రభుత్వమే చేపట్టింది.
* మాధ్యమిక విద్య నిర్వహణ నుంచి ప్రభుత్వం తప్పుకుని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది.
* ఉన్నత విద్య నిర్వహణను విశ్వవిద్యాలయాలకు బదలాయించింది.
* మతపరమైన అంశాలను, బోధనలను పాఠశాలలో చేర్చరాదని సూచించింది.
* నిత్య జీవితానికి పనికొచ్చే భౌతికశాస్త్రం, వ్యవసాయం, క్షేత్రగణితాలను ప్రాథమిక విద్యా ప్రణాళికలో చేర్చింది.
* ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలలో నియమించారు.
* వెనుకబడిన వర్గాల వారికి, గిరిజనులకు, స్త్రీలకు ఉచితంగా విద్యాలయాల్లో ప్రవేశం కల్పించారు.
భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ - 1902
* 1897 నుంచి 1902 వరకు మధ్య ఉన్న కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో 'నిశ్శబ్ద కాలం' అంటారు.
* లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్‌గా వచ్చిన తర్వాత ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కమిషన్ ముఖ్యాంశాలు
* విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై అజమాయిషీ ఉండాలి.
* పరీక్షా విధానాన్ని సంస్కరించాలి.
* కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించకుండా ఉన్నవాటినే సంస్కరించాలి.
* విదేశాంగ శాఖలో ఉన్న విద్యా శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలి.
* ఇంటర్మీడియట్ తరగతులను ఎత్తివేసి 3 సంవత్సరాల డిగ్రీ తరగతులను ప్రవేశపెట్టాలి.
* విశ్వవిద్యాలయాలను విద్య, విజ్ఞాన సముపార్జనతో పాటు శీల నిర్మాణం జరిగే విద్యాసంస్థలుగా రూపొందించడానికి నియమించిన కమిషన్ 'భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్'.
* ఈ కమిషన్ సూచించిన చాలా అంశాలు లండన్ యూనివర్సిటీ యాక్ట్‌పై ఆధారపడి ఉన్నాయి. ఈ కమిటీ సూచనల మేరకు 1904లో భారతీయ విశ్వవిద్యాలయ చట్టం వచ్చింది.
గోఖలే తీర్మానం - 1911
      1910లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న గోపాలకృష్ణ గోఖలే భారతదేశంలో ప్రాథమిక విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.

తీర్మానంలోని ముఖ్యంశాలు
* 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలి.
* ప్రాథమిక విద్య నిర్వహణ కోసం స్థానిక సంస్థలు, ప్రభుత్వం 1 : 2 నిష్పత్తిలో ఖర్చులను భరించాలి.
* కేంద్రంలో ప్రాథమిక విద్యాశాఖను ఏర్పాటు చేయాలి.
* ప్రాథమిక విద్యావ్యాప్తికి కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి.
* ఏటా బడ్జెట్‌లో ప్రాథమిక విద్యా ప్రగతికి సంబంధించిన ప్రస్తావన ఉండాలి.
శాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ (1917)
      1917లో కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యతో పాటు ఇతర విద్యా సమస్యలపై సూచనలు చేయడానికి లీడ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ శాడ్లర్ అధ్యక్షతన ఈ కమిటీని నియమించారు. తర్వాత ఈ కమిషన్ సూచనలను అన్ని విశ్వవిద్యాలయాలకు విస్తరించారు.
* దీన్ని ఏర్పాటు చేసిన వైస్రాయి లార్డ్ చేమ్స్‌ఫర్డ్.
* పాఠశాల స్థాయిలో పరీక్షల నిర్వహణకు బోర్డ్ ఆఫ్ సెకండరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేయాలి.
* ఈ కమిషన్ సూచించిన ఇంటర్ యూనివర్సిటీ బోర్డు తర్వాతి కాలంలో యూజీసీగా రూపాంతరం చెందింది.

ఈ కమిటీ చేసిన సూచనలు
* విశ్వవిద్యాలయాల నుంచి ఇంటర్మీడియట్ విద్యను వేరుచేయడం.
* 10 + 2 + 3 విద్యా విధానాన్ని అమలుచేయడం.
* దేశంలోని విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ఇంటర్ యూనివర్సిటీ బోర్డు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్థాపన.
* ప్రస్తుత విశ్వవిద్యాలయాల నిర్వహణకు ఈ కమిషన్ సూచనలే మార్గదర్శకంగా ఉన్నాయి.
* ఈ కమిషన్ నివేదిక తర్వాత మైసూర్, పట్నా, హైదరాబాద్ లాంటి చోట్ల విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి.
* 1916లో హిందూ విశ్వవిద్యాలయం, 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించారు.
* ఈ కమిటీ సూచనల మేరకు యూనివర్సిటీల్లో సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులను ప్రారంభించారు.
* శాడ్లర్ సూచనల తర్వాత విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగింది. కానీ వాటిలో విద్యా ప్రమాణాలు తగ్గాయి.
హర్టాద్ కమిటీ - 1929
    1927లో పరిపాలనా వ్యవహారాల సమీక్షపై నియమించిన సైమన్ కమిషన్‌లో భాగంగా నాటి విద్యా పరిస్థితుల పరిశీలనకు సైమన్ కమిషన్ సభ్యుల్లో ఒకరైన సర్ ఫిలిప్ హర్టాగ్ అధ్యక్షతన ఒక ఉప కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ సూచనలు
* గుణాత్మకతను సాధించడం కోసం పర్యవేక్షణను పెంచి ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందజేయాలని సూచించింది.
* ప్రాథమిక విద్యా వ్యాప్తిలో ఉన్న అపవ్యయం (వృథా), నిలుపుదల (స్తబ్ధత) అరికట్టడానికి వేసిన కమిషన్ ఇది.
A) అపవ్యయం (వృథా): ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో బడి మానివేయడాన్ని అపవ్యయం అంటారు.
B) నిలుపుదల (స్తబ్ధత): ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడాన్ని నిలుపుదల అంటారు.
* హర్టాగ్ కమిటీ సూచనలు చాలావరకు అమలు కాలేదు. దీనికి కారణం ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం.
* ఈ కమిటీ సిఫారసుల మేరకు ఉపాధ్యాయ శిక్షణ, దృక్పథం గల పాఠ్యప్రణాళికలు, పర్యవేక్షకుల సంఖ్యను పెంచారు.
* ఈ కమిటీ నివేదిక అనంతరం విద్యారంగంలో కొన్ని ముఖ్య పరిణామాలు సంభవించాయి.
* 1921లో CABE స్థాపన జరిగింది. కానీ 1929లో ఆర్థిక మాంద్యం ఫలితంగా దీన్ని మూసివేశారు. 1935లో తిరిగి పునరుద్ధరించారు.
* 1929లో గాంధీ ప్రతిపాదించిన 'బేసిక్ ఎడ్యుకేషన్‌'ను చేర్చారు.
* 1929లో ఆర్థిక మాంద్యం ఫలితంగా ప్రభుత్వం విద్యపై ఖర్చు తగ్గించింది.
* దీంతో భారతీయుల్లో నిరసనలు మొదలయ్యాయి. దీన్ని గమనించిన ప్రభుత్వం 1937లో అబాట్, ఉడ్ నాయకత్వంలో మరో కమిటీని వేసింది.
* ఈ కమిటీ వృత్తి విద్యను సిఫారసు చేసింది.

అబాట్ - ఉడ్స్ నివేదిక - 1937
ముఖ్య సూచనలు

* బాలికల విద్యపై నిర్లక్ష్యం ఉంది. ఈ విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
* శిశు విద్యకు ప్రాధాన్యం, మహిళా ఉపాధ్యాయుల నియామకం.
* ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలి.
* విద్య సాంకేతికపరమై ఉండి, నిత్యజీవితానికి ఉపయోగపడేలా ఉండాలి. కృత్యాల ద్వారా విద్యను బోధించాలి.
* ఉన్నత, మాధ్యమిక పాఠశాలలను వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.
* వృత్తి విద్యా మండళ్లను స్థాపించాలి.
జాతీయ విద్యా ఉద్యమం (1905 - 1938)
     జాతీయ విద్యా ఉద్యమం పుట్టుకకు కారణం లార్డ్ కర్జన్ లాంటి ఆంగ్లేయులు విద్యా విధానంలో భారత జాతీయ వ్యతిరేక విధానాలను అమలు చేయడం.
* మాతృభాషను నిర్లక్ష్యం చేసి ఆంగ్ల భాషకు ప్రాధాన్యం ఇవ్వడం.
* పాఠ్యప్రణాళికలు కేవలం ఆంగ్లేయులకు అవసరమైన ఉద్యోగస్వామ్యాన్ని పెంచేలా ఉండటం.
* మెకాలే వడబోత సిద్ధాంతం ఉన్నత, మధ్యతరగతి వారికి మాత్రమే విద్య, ఉద్యోగావకాశాలు కల్పించడం.
* విద్యా పరిపాలన పూర్తిగా యూరోపియన్ల చేతిలోనే ఉండటం.

ఈ ఉద్యమాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.
మొదటి దశ (1905 - 1910): ఇది బెంగాల్ ఉద్యమం (స్వదేశీ ఉద్యమం)లో ప్రారంభమైంది. 'ఈ విద్య మాకొద్దు' అనే ఆవేశ భావనతో ప్రజలు నిరసన భావాలు తెలిపారు. స్వదేశీ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి.
రెండో దశ (1911 - 1922): 1920లో భారత జాతీయ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళాశాలలు, పాఠశాలల నుంచి పిల్లలను చదువు మాన్పించి జాతీయ భావం పెంపొందించే భారతీయ విద్యా సంస్థలను నెలకొల్పి వాటిలో పిల్లలను చేర్పించారు.
మూడో దశ (1930 - 1938): ఈ దశలో భారతీయులకు కావాల్సిన విద్యా విధానం, ప్రణాళికలు రూపొందాయి. గాంధీజీ బేసిక్ విద్యా విధానం, వృత్తిపరమైన శిక్షణా విధానం ప్రాచుర్యం పొందాయి. (1923 - 1929 నిశ్శబ్ద కాలం)
* 1937లో గాంధీజీ ప్రాతిపదిక విద్య (Basic Education) ను ప్రవేశపెట్టారు. దీన్నే వార్ధా పద్ధతి అంటారు. ఇది 1945 సమయంలో నయీ తాలీమ్ అనే పేరుతో కొన్ని ప్రాంతాల్లో అమలైంది.
సార్జంట్ నివేదిక (1944)
ఈ ప్రణాళికను భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించి మొదటి ప్రణాళికగా చెప్పవచ్చు.
* కేంద్ర విద్యా సలహా సంఘం(CABE) సిఫారసు మేరకు సార్జంట్ అధ్యక్షతన ఈ కమిటీని రూపొందించారు.

ఈ కమిటీ ముఖ్యాంశాలు
* 3 - 6 సంవత్సరాల మద్య ఉన్న పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను కల్పించడం.
* 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను 1984 నాటికి సాధించడం.
* ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాల ఏర్పాటు.
* వికలాంగులకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయడం.
* నిరక్షరాస్యత నిర్మూలనకు గ్రంథాలయాల స్థాపన, వయోజన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం.
* ఇంటర్మీడియట్‌ను ఎత్తేసి మొదటి సంవత్సరాన్ని ఉన్నత పాఠశాలలకు, రెండో సంవత్సరాన్ని డిగ్రీకి చేర్చాలి.
* సాంకేతిక, వాణిజ్య, ఇతర విద్యా కోర్సులను ఏర్పాటు చేయడం. 'అఖిల భారత సాంకేతిక మండలి'ని దిల్లీలో ఏర్పాటు చేశారు.
* రెండో ప్రపంచ యుద్ధానంతరం రూపకల్పన చేశారు. కాబట్టి ఈ నివేదికను 'యుద్ధానంతర విద్యా పథకం' అని కూడా అంటారు.

స్వాతంత్య్రానంతరం విద్యా విధానం
రాధాకృష్ణన్ కమిషన్/ విశ్వవిద్యాలయ కమిషన్ 1948:

* విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి, ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి రూపొందించిన కమిషన్.
* స్వాతంత్య్రానంతరం నియమించిన మొదటి కమిషన్.
* విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలని అభిప్రాయపడింది.
ముఖ్య ప్రతిపాదనలు
* విశ్వవిద్యాలయ అధ్యాపకుల పని గంటలను, పని దినాలను, ఆర్థిక వనరుల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)ను ఏర్పాటు చేశారు.
* విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను 3 రకాలుగా వర్గీకరించారు.
    1) ప్రొఫెసర్         2) రీడర్                 3) ఉప లెక్చరర్
* వీరికి ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పించాలి.
* మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి.
* విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసేవారికి ఆర్థిక సహాయం అందించాలి.

* పరీక్షల నిర్వహణ పద్ధతి మార్పు, వ్యాసరూప ప్రశ్నలను ఆబ్జెక్టివ్ పరీక్షలతో సమన్వయం చేయాలి.
* విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలి.
* మాధ్యమిక విద్యలో విద్యా ప్రమాణాలు పెంచాలి.
* వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం, మహిళా కళాశాలల ఏర్పాటు.
* గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి.
* దీన్ని విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా అంటారు.
మొదలియార్ కమిషన్/ సెకండరీ (మాధ్యమిక) విద్యా కమిషన్
     CABE నియమించిన రెండో కమిషన్ మొదలియార్ కమిషన్.
* రాధాకృష్ణన్ కమిషన్ సూచనలకు అనుగుణంగా మాధ్యమిక విద్యలో ప్రమాణాల పెంపునకు అప్పటి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి.లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన నియమించిన కమిషన్.
* ఈ కమిషన్ విద్యా లక్ష్యాలను సూచించింది.
విద్యా లక్ష్యాలు:
  1) పౌరసత్వ శిక్షణ
  2) నాయకత్వ శిక్షణ
  3) మూర్తిమత్వ అభివృద్ధి
  4) ప్రజాస్వామ్య విలువల అభివృద్ధి
  5) వృత్తి సామర్థ్యాలు పెంపొందించే విధంగా విద్యా లక్ష్యాలు ఉండాలి.

విద్యా లక్ష్యాల సాధనకు ఈ కమిటీ సూచించిన ముఖ్యాంశాలు
     మాధ్యమిక విద్యా కాలపరిమితి 7 సంవత్సరాలుగా ఉండాలని సూచించింది. అంటే 5 + 3 + 4 + 3 గా విద్యా విధానం ఏర్పాటు చేయడం.
  ఎ) 1 నుంచి 5వ తరగతి - ప్రాథమిక
  బి) 6 నుంచి 8వ తరగతి - మాధ్యమిక
  సి) 9 నుంచి 12వ తరగతి - మాధ్యమికోన్నత దశ
  డి) మిగిలిన 3 సంవత్సరాలు డిగ్రీ విద్యగా ఉండాలి.
* బోధన శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి.
* హిందీని తప్పనిసరిగా బోధించాలి.
* గురుకులాలను ఏర్పాటు చేయాలి.
* గ్రామీణ పాఠశాలల్లో వ్యవసాయ కోర్సులు ఏర్పాటు చేయాలి.
* పాఠ్యప్రణాళిక వాస్తవ జీవితానికి ఉపయోగపడే విధంగా ఉండాలి.
* బహుళార్థ పాఠశాలలు ఏర్పాటు చేసి వైవిధ్యంతో కూడిన కోర్సులు, కళలు, విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా విద్యావిధానం ఏర్పాటు.

* బోధనా పద్ధతిగా క్రియా పద్ధతి, ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టాలి.
* పాఠశాలలో క్రీడలు, స్కౌట్‌లు నిర్వహించాలి.
* గైడింగ్, కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.
* పరీక్షల్లో లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలి.
* మాధ్యమిక స్థాయిలో పబ్లిక్ పరీక్షను ప్రవేశపెట్టాలి.
* మాధ్యమిక విద్యను సమన్వయపరచడానికి కేంద్రీయ మాధ్యమిక పరిషత్‌ను ఏర్పాటు చేయాలి.
* కో - ఎడ్యుకేషన్ పాఠశాలలో బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. అవసరమైతే ప్రత్యేక బాలికా పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
* ఉపాధ్యాయులకు మూల్యాంకనంలో ప్రాధాన్యం ఇవ్వాలి.
* 12వ తరగతి పూర్తయిన వారిని వృత్తి విద్యా కోర్సులైన మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు అర్హులుగా నిర్ణయించింది.
* ఈ కమిషన్ సూచనల ఫలితంగా ప్రభుత్వం బహుళార్థసాధక ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసింది.
* 1953లో కేంద్ర మూల్యాంకన సంస్థ ప్రారంభమైంది.
* అఖిల భారత మాధ్యమిక విద్యా సంఘం ఏర్పాటైంది.

జాతీయ విద్యా కమిషన్/ కొఠారీ కమిషన్/ భారతీయ విద్యా కమిషన్ (1964 - 66)
       అన్ని విద్యా స్థాయుల్లో సంస్కరణలు తీసుకురావడానికి 1964లో యూజీసీ ఛైర్మన్‌గా ఉన్న డాక్టర్ దౌలత్‌సింగ్ కొఠారి అధ్యక్షతన ఈ క‌మిష‌న్‌ను ఏర్పాటు చేశారు.
* ఈ కమిషన్ తన నివేదికను 'విద్య జాతీయ వికాసం/ జాతీయ విద్యాభివృద్ధి' అనే పేరుతో 1966, జూన్ 29న నాటి మానవ వనరుల శాఖ మంత్రి అయిన ఎం.సి.శాంగ్లాకు సమర్పించింది. ఈ నివేదికలో మొదటి వాక్యం 'భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది'.
* ఈ కమిషన్ ఉద్దేశం మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం.
ఈ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలు
* విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి.
* జాతీయ సామాజిక సమగ్రతను సాధించాలి.
* సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంచడం.
* ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం.
* సమాజ ఆధునికీకరణను వేగవంతం చేయుడం.

ఈ కమిటీ ముఖ్య సూచనలు
* మన జాతీయ విద్యావ్యవస్థ రూపం 10 + 2 + 3 గా ఉండాలి.
* బాలికల విద్యను ప్రోత్సహించాలి. వసతి గృహాలను ఏర్పాటు చేయాలి.
* ప్రాథమిక స్థాయిలో ఒక కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
* ఉచిత పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం ఏర్పాటు.
* సామాన్య పాఠశాలల (కామన్ స్కూల్ సిస్టమ్)ను ఏర్పాటు చేయాలి.
* ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలి. పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి.
* మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి.
* సవరించిన త్రిభాషా సూత్రాన్ని పాటించాలి.
* అన్ని స్థాయుల్లో మాతృభాషలో బోధన జరగాలి.
* అనియత కేంద్రాలను స్థాపించి బడి మానేసిన వారిని అందులో చేర్పించి విద్యా బోధన చేయాలి.
* వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
* పాఠశాలలో పూర్తిగా హాజరు ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలి.
* వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* పాఠ్యప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకన విధానాలను మెరుగుపరచాలి.
* మహిళా ఉపాధ్యాయుల నియామకం, అపవ్యయం, నిలుపుదలను తగ్గించాలి.
* దేశ బడ్జెట్‌లో 6% నిధులను విద్యకు కేటాయించాలి.
* తోటపని, చేనేత, పుస్తకాల బైండింగ్, కుట్టుపనులు లాంటి సాంఘిక ప్రయోజన కార్యక్రమాలకు, పని విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఉపాధ్యాయుల ఆర్థిక, సాంఘిక, వృత్తిపర అంతస్తు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
* ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణా కాలం 2 సంవత్సరాలుగా, మాధ్యమిక ఉపాధ్యాయ శిక్షణా కాలం ఒక సంవత్సరంగా సూచించింది.
* భారతీయ విద్యారంగంపై అత్యంత ప్రభావం చూపిన కమిషన్‌గా దీన్ని పేర్కొంటారు. ఈ కమిషన్ నివేదికను భారతీయ విద్యారంగానికి ఒక విజ్ఞాన సర్వస్వంగా అభివర్ణిస్తారు.
ప్రాధాన్యం: ఈ కమిటీ సిఫారుసులకు అనుగుణంగా 1968లో మొదటి జాతీయ విద్యావిధానం ఏర్పడింది.
జాతీయ విద్యా విధానం - 1968:
* కొఠారి కమిషన్ సూచనల మేరకు ఈ జాతీయ విద్యా విధానం రూపుదిద్దుకుంది.
ఈ విద్యా విధానం ముఖ్యాంశాలు
* 10 + 2 + 3 గా విద్యా విధానాన్ని రూపొందించాలి.
* 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం.

* ఉపాధ్యాయులకు అర్హతను బట్టి తగిన వేతనాలివ్వడం.
* పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం.
* శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం.
* పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రారంభించడం.
* సమాన విద్యావకాశాలు కల్పించడం.
* పని అనుభవం, జాతీయ సేవా కార్యక్రమాల ఏర్పాటు.
* పారిశ్రామిక విద్య అభివృద్ధి కోసం ఐటీఐ, పాలిటెక్నిక్ శిక్షణాసంస్థల ఏర్పాటు.
* ప్రతి రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి.
* విద్యా విషయకంగా వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవడానికి పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ కోర్సులను ప్రవేశపెట్టాలి.
* నిరంతరం మూల్యాంకనం చేసే పరీక్షావిధానం అమలు.
* వృత్తి విద్యలు, సాంకేతిక విద్యలను సెకండరీ స్థాయి తర్వాత నుంచి అమలు చేయడం.
* వయోజన విద్య, అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించడం.
* జాతీయ ఆదాయంలో విద్యకు 6% నిధులను కేటాయించడం.

* ఉపాధ్యాయులకు అర్హతను బట్టి తగిన వేతనాలివ్వడం.
* పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం.
* శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం.
* పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రారంభించడం.
* సమాన విద్యావకాశాలు కల్పించడం.
* పని అనుభవం, జాతీయ సేవా కార్యక్రమాల ఏర్పాటు.
* పారిశ్రామిక విద్య అభివృద్ధి కోసం ఐటీఐ, పాలిటెక్నిక్ శిక్షణాసంస్థల ఏర్పాటు.
* ప్రతి రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి.
* విద్యా విషయకంగా వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవడానికి పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ కోర్సులను ప్రవేశపెట్టాలి.
* నిరంతరం మూల్యాంకనం చేసే పరీక్షావిధానం అమలు.
* వృత్తి విద్యలు, సాంకేతిక విద్యలను సెకండరీ స్థాయి తర్వాత నుంచి అమలు చేయడం.
* వయోజన విద్య, అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించడం.
* జాతీయ ఆదాయంలో విద్యకు 6% నిధులను కేటాయించడం.

* విద్యను నియత, అనియత పద్ధతుల ద్వారా అందించాలి.
* స్థానిక అవసరాలకు అనుగుణంగా పాఠశాలల పని వేళలు మార్చాలి.
* బడి మానేసిన పిల్లలను బడిలో చేర్చడానికి బహుళ ప్రవేశ విధానం అమలు చేయాలి.
* ఒకటి నుంచి 5వ తరగతి వరకు టైమ్ టేబుల్ దృఢంగా ఉండనవసరం లేదు.
* పిల్లలకు తరగతి గది ఒక్కటే అభ్యసనం కాకూడదు. విద్యార్థులకు స్వీయ అలవాట్లను పెంపొందించాలి.
* సమాజానికి ఉపయోగపడే పనిని దేశంలో అన్ని విద్యా స్థాయుల్లో ప్రవేశపెట్టాలి.
డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ - 1978:
* ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ.
* 1978లో లెర్నింగ్ టు డు (Learning to do) అనే శీర్షికతో ఈ కమిటీ తన సిఫారసును అందజేసింది.
ఈ కమిటీ ముఖ్య సూచనలు:
* విద్యతో పాటు వృత్తిపరమైన బోధనకు ప్రాధాన్యం.
* ప్రాంతీయ భాషలో విద్యా బోధన జరగాలి.
* రాష్ట్ర, జాతీయ స్థాయిలో వృత్తి విద్యా పరిషత్‌ల ఏర్పాటు.
* రాష్ట్ర స్థాయిలో +2 విద్యను, ఉన్నత మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి.
* సెమిస్టర్ పద్ధతిని అమలు పరచాలి.
* గ్రామీణ పరిసరాలకు అనుగుణంగా వ్యవసాయం, వాణిజ్యం, ఆరోగ్యం, వైద్య కోర్సులను ప్రారంభించాలి.

జాతీయ విద్యావిధానం - 1986 (National Policy on Education - 1986)
* విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి 'విద్యా సవాళ్లు - విధానదృక్పథం' అనే పేరుతో 1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 'నూతన జాతీయ విద్యా విధానాన్ని' ప్రతిపాదించింది.
* ఈ నివేదికను 'రాజీవ్‌గాంధీ వీలునామా' గా పేర్కొంటారు. ఆ సమయంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పి.వి.నరసింహారావు.
ఈ విద్యా విధానంలోని ముఖ్యాంశాలు:
* విద్యను ప్రస్తుతం, భవిష్యత్తులో పెట్టుబడిగా పరిగణించాలి.
* 10 + 2 + 3 గా విద్యా విధానాన్ని రూపొందించాలి. ఈ విద్యా నిర్మాణాన్ని దేశమంతటా అమలు పరచాలి.
* ప్రాథమిక స్థాయిలో OBB (Operation Black Board) పథకాన్ని అమలు చేయాలి.
* ఆంగ్లాన్ని అంతర్జాతీయ భాషగానే కాకుండా గ్రంథాలయ భాషగా అమలు చేయాలి.
* అందరికీ గుణాత్మక విద్యను అందించాలి, సమాన విద్యావకాశాలు కల్పించాలి.
* పాఠశాల అన్ని దశల్లో కనీస అభ్యసన స్థాయులను రూపొందించాలి.
* కనీస అభ్యసన స్థాయిల రూపకల్పన, అమలు కోసం నియమించిన కమిటీ ఆర్.హెచ్.దవే కమిటీ.
* గ్రామీణ విశ్వవిద్యాలయాలను గాంధీజీ బేసిక్ విద్యావిధానం ఆధారంగా రూపొందించాలి.
* ప్రాథమిక విద్యను నిర్బంధం చేస్తూ నాణ్యతను పెంపొందించాలి.

* బట్టీ పట్టే చదువుకు స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యంకనం (CCE) అమలు చేయాలి.
* బడి మానేసిన పిల్లలకు అనియత విద్యాకేంద్రాలను ఏర్పాటు చేయాలి.
* ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబించే విద్యావిధానం, శిశువిద్యను సాధించడానికి సంరక్షణ కేంద్రాలను స్థాపించాలి.
* ఐసీడీఎస్ (Integrated Child Development Scheme − 1975) ను పటిష్ఠపరచాలి.
* ప్రస్తుత అవసరాలకు తగిన వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించాలి. శారీరక ధారుడ్యత పెంచే విధంగా ఆటపాటలతో విద్యా విధానం ఉండాలి.
* గ్రామీణ ప్రతిభావంతులకు నవోదయ పాఠశాలలు స్థాపించాలి.
* స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ వారికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కల్పించాలి.
* బహుళ భాషా నిఘంటువులను ప్రచురించాలి.
* విలువలకు విద్యా సముపార్జనలో స్థానం కల్పించాలి
* జిల్లా విద్యా శిక్షణా సంస్థ(DIET) లను స్థాపించాలి. (వీటిని 1986లో స్థాపించారు)
* దేశవ్యాప్తంగా దూరవిద్య విధానాన్ని ప్రారంభించాలి.
* త్రి భాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి.
* ఎస్సీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
* 1990 నాటికి 11 సంవత్సరాలు నిండే పిల్లలందరూ 5 ఏళ్ల పాఠశాల విద్యను గడపాలి.

* 1995 నాటికి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి.
* బడి మానిన పిల్లలందరినీ గుర్తించి బడిలో చేర్పించి 14 సంవత్సరాల వయసు వరకు బడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి.
* కంప్యూటర్ అక్షరాస్యతను కల్పించాలి.
* నేషనల్ లెవెల్ పరీక్షలను, సర్వీసులను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలి.
* అఖిల భారత సర్వీసుగా Indian Education Serviceని స్థాపించాలి.
* ఉపాధ్యాయ విద్య ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి కాలానుగుణంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.
* ఈ జాతీయ విద్యా విధానాన్ని 1986, ఏప్రిల్ 20న ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని 'రాజీవ్‌గాంధీ వీలునామా'గా పేర్కొంటారు.
ప్రాముఖ్యం: రాజీవ్ ఆశయాలకు అనుగుణంగా భారత్‌ను 21వ శతాబ్దంలో శక్తిమంతంగా తయారుచేయడం.
* 1986 జాతీయ విద్యావిధానంలో భాగంగా కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించారు.
1986 జాతీయ విద్యావిధానం - ఆచరణ కార్యక్రమం (POA-1992):
       1986 విద్యా విధానాన్ని అమల్లో పెట్టడానికి 1992లో ఆచరణ కార్యక్రమాన్ని(Programme of Action) రూపొందించి పార్లమెంటులో ఆమోదించారు.

ముఖ్యంశాలు:
* పంచాయతీరాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణను వికేంద్రీకరించడానికి రాజ్యాంగాన్ని సవరించడం (72వ రాజ్యాంగ సవరణ).
* కేంద్రంలోని కేంద్ర విద్యా సలహా మండలి (CABE) తరహాలో రాష్ట్రంలో రాష్ట్ర విద్యా సలహా మండలిని (SABE) ఏర్పరిచి రాష్ట్ర విద్యా ప్రణాళికల తయారీ, అమలు బాధ్యతలను అప్పగించాలి.
* జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో ఒక District Board of Education (DBE) ఏర్పరచాలి.దానికి ముఖ్య విద్యాధికారిని (Chief Education Officer − CEO) నియమించి అనియత, వయోజన విద్య, +2 స్థాయి విద్యా కార్యక్రమాల రూపకల్పన, అమలు బాధ్యతలను అప్పగించాలి.
* గ్రామ విద్యా కమిటీలను ఏర్పరచి పాఠశాల నిర్వహణలో వాటికి భాగస్వామ్యం కల్పించడం.
1986 నూతన జాతీయ విద్యా విధానం - మౌలిక లక్ష్యాలు:
1. శాస్త్రీయ దృక్పథం.
2. సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం.
3. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు.
4. చిన్న కుటుంబ భావన.

5. భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర.
6. జాతీయ భాషా వికాసం.
7. స్త్రీ, పురుషుల సమానత్వం.
8. హక్కులు - బాధ్యతలు.
9. పరిసరాల పరిరక్షణ.
10. సాంఘిక పరిధుల తొలగింపు.
ఆచార్య రామ్మూర్తి కమిటీ - 1990
* 1986 నూతన విద్యా విధానం అమలు జరుగుతుండగా ఆ విధానాన్ని సమీక్షించాలనే ఉద్దేశంతో 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ కాలంలో 1990లో ఆచార్య రామ్మూర్తి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటుచేశారు.
* ఈ కమిటీ తన నివేదికను 1991 జనవరిలో కేంద్రానికి సమర్పించింది.
* ఈ నివేదిక పేరు Towards An Enlightend and Human Society.
ఈ కమిటీ సిఫారసులు:
* దేశం మొత్తం సామాన్య పాఠశాలలు (Common School System) ను ఏర్పాటు చేయాలి.
* 9 నుంచి 12వ తరగతి వరకు వృత్తి విద్యా బోధన తప్పనిసరి చేయాలి.
* ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరచాలి.
* బాలిక, స్త్రీ విద్యా వ్యాప్తి కోసం అంగన్‌వాడీ కేంద్రాలను నెలకొల్పి వీటిని విద్యా కమిటీల పర్యవేక్షణలో ఉంచాలి.

* ప్రాంతీయ భాషలో విద్యా బోధన జరగాలి.
* మనిషిని జాతీయ వనరుగానో లేదా లాభదాయకమైన ఆస్తిగానో చూడకుండా అతడిలోని మానవతను మేల్కొలిపి ఉదాత్త వ్యక్తిగా, సాంస్కృతిక శక్తిగా; సంఘం, దేశం పట్ల తన బాధ్యతను గుర్తించడానికి విద్య తోడ్పడాలి.
* నిరంతర మూల్యాంకన పద్ధతిని ప్రవేశపెట్టాలి.
* ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్యను అందించడానికి నిధులను కల్పించి మైనారిటీ, వికలాంగుల విద్యపై శ్రద్ధ పెట్టాలి.
* మహిళా ఉపాధ్యాయులను ఎక్కువగా నియమించాలి. బడి మానేసిన వారిని తిరిగి చేర్పించడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
* అమల్లో ఉన్న నవోదయ విద్యాలయాలను అభివృద్ధిపరచి, వాటి నిర్వహణను రాష్ట్ర యాజమాన్యాలకు ఇవ్వాలి.
జనార్ధన్‌రెడ్డి కమిటీ - 1992
* 1986 నూతన విద్యా విధానాన్ని పరిశీలించడానికి కేంద్ర విద్యా సలహా సంఘం సిఫారసు మేరకు 1992లో ఎన్.జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీని వేశారు.
* అంతేకాకుండా ఆచార్య రామ్మూర్తి కమిటీ నివేదికను పరిశీలించి, దానిలోని ఆచరణాత్మక సూచనలను విశ్లేషించింది.
* ఈ కమిటీ తన నివేదికను 1992లోనే సమర్పించింది.

ఈ కమిటీ ప్రతిపాదించిన సూచనలు:
* 21వ శతాబ్దపు విద్యా లక్ష్యాలను సాధించాలంటే ఒక కి.మీ. పరిధిలోపు పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
* గుణాత్మక విద్యాభివృద్ధికి కనీస అభ్యసన స్థాయులను అమలుపరచాలి.
* ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నిష్పత్తిని 4 : 1 నుంచి 2 : 1 కి పెంచాలి.
* OBB (Operation Black Board) పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించాలి.
* స్త్రీ విద్యకు సంబంధించిన కోర్సులను, మార్గదర్శక పాఠశాలలను నెలకొల్పడం, సూక్ష్మప్రణాళికను తయారుచేసి అమలుపరచడం.
* పాఠశాల వసతులు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలను సమకూర్చడం.
* ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలను అందజేయడం.
* 21వ శతాబ్దంలోపే దేశంలో ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలని సూచించింది.
గమనిక: ఆచార్య రామ్మూర్తి కమిటీ, జనార్ధన రెడ్డి కమిటీ సిఫార్సుల ఆధారంగా 1986 జాతీయ విద్యా విధానానికి తగిన మార్పులు చేసిన భారత ప్రభుత్వం National Policy on Education 1992ను రూపొందించింది. దీన్నే సవరించిన కార్యాచరణ పథకం అంటారు.

యశ్‌పాల్‌కమిటీ - 1992
* పిల్లలు పాఠశాలకు మోసుకుపోయే పుస్తకాల బరువులపై వేసిన కమిషన్.
* CABE సలహా మేరకు NCERT, CBSE ల పనితీరును పరిశీలించడానికి యశ్‌పాల్ కమిటీని నియమించారు.
* 1993, జులై 15న తన నివేదికను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సమర్పించింది.
* ఈ కమిటీ తన నివేదికను "Learning Without Burden" (అభ్యసనం భారయుతంగా ఉండకూడదు) పేరిట సమర్పించింది.
ఈ కమిటీ ముఖ్య సూచనలు:
* పూర్వ ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలలో పిల్లలు పాఠశాలకు మోసుకుపోయే పుస్తకాల సంచిని, దాంతో పాటు హోంవర్క్‌ను నిషేధించాలి.
* విద్యా శాఖ ప్రారంభించిన ఛానల్ ద్వారా దృశ్య, శ్రవణ పరికరాలతో విద్యా కార్యక్రమాలు నిర్వహించాలి.
* నర్సరీ తరగతిలో చేరే పిల్లలకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదు.
* సంప్రదాయక పద్ధతులైన రాయడం, వల్లెవేయడం, గణించడం లాంటి వాటిని హింసగా పరిగణించి నిషేధించాలి.
* బహుమతులు గెలుచుకునే పోటీలను పాఠశాలలో నిర్వహించకూడదు.
* పాఠశాలల్లో విద్యార్థుల మధ్య వ్యక్తిగత పోటీలను విరమించి, సామూహిక పోటీని ప్రోత్సహించాలని సూచించింది.
* పాఠ్యపుస్తకాల్లో వాడుక భాషను ఉపయోగించాలి. కృత్యాధార బోధనను ప్రవేశపెట్టాలి. పుస్తకాల మోత భారాన్ని తగ్గించాలి.

చతుర్వేది కమిటీ - 1993
* యశ్‌పాల్ కమిటీ సూచనల సాధ్యాసాధ్యాలపై నియమించినదే చతుర్వేది కమిటీ.
* ఇది యశ్‌పాల్ కమిటీపై ఆచరణాత్మకమైన నివేదికను సమర్పించింది.
సూచనలు:
* పిల్లల పుస్తకాల బరువును తగ్గించాలి.
* ప్రాథమిక స్థాయిలో ఇంటిపనిని నిషేధించాలి.
* కృత్యాధార, దృశ్య శ్రవణ పద్ధతుల ద్వారా విద్యను అందించాలి.
ఛటోపాధ్యాయ కమిషన్ - 1983
* పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ ఛటోపాధ్యాయ కమిషన్.
* ఇది తన నివేదికను 1985లో సమర్పించింది.
ఈ కమిటీ ముఖ్య సూచనలు:
* ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఇతర ఉద్యోగుల కంటే హెచ్చుగా ఉండాలి.
* ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

స్వాతంత్య్రం అనంతరం విద్యావిధానం - వివిధ కమిటీలు
1. రాధాకృష్ణన్ కమిషన్ 1948 - 49
2. మొదలియార్ కమిషన్ 1952 - 53
3. కొఠారి కమిషన్ 1964 - 66
4. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977
5. మాల్కం ఆదిశేషయ్య కమిటీ 1978
6. జాతీయ విద్యా విధానం 1986
7. ఆచార్య రామ్మూర్తి కమిటీ 1990
8. జనార్ధన్ రెడ్డి కమిటీ 1991
9. యశ్‌పాల్ కమిటీ 1992
10. చతుర్వేది కమిటీ 1993
11. ఛటోపాధ్యాయ కమిటీ 1983

విద్యారంగంపై కమిటీలు - కమిషన్లు - ప్రాముఖ్యం

శ్రీ ప్ర‌జ్ఞ కాంపిటీటివ్ స్ట‌డీ స‌ర్కిల్‌, తిరుప‌తి

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌