రాష్ట్ర ప్రభుత్వం పదోతరగతి పరీక్షా పత్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి మార్పులు చేసింది. అంతర్గత మూల్యాంకనాన్ని (20 మార్కులు) తొలగించారు. అంటే గతంలో ఒక్కో పేపర్ 40 మార్కుల చొప్పున మొత్తం 80 మార్కులకు రాత పరీక్ష ఉండేది. కానీ ప్రస్తుతం ఒక్కో పేపర్ 50 మార్కుల చొప్పున 100 మార్కులకు నిర్వహించనున్నారు. ప్రశ్నల సంఖ్య (33) మారలేదు. కానీ గతంలో పార్ట్ - ఎలో 13 ప్రశ్నలు, పార్ట్ - బి లో 20 ప్రశ్నలు ఉండేవి. ప్రస్తుతం బిట్పేపర్ను (పార్ట్ - బి) తొలగించి మొత్తం 33 ప్రశ్నలను ప్రశ్నపత్రంలోనే ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్, అతి లఘు, లఘు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి.
వ్యాసరూప ప్రశ్నలు (5 × 4 = 20)
పదో తరగతి భౌతిక రసాయనశాస్త్ర పరీక్షలో 10/10 సాధించడానికి పాఠ్యపుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. సొంతంగా నోట్సు తయారుచేసుకొని ప్రణాళిక ప్రకారం చదవాలి. అర్థం కాని భావనలను ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోవాలి. గ్రహించిన విషయాలను సహ విద్యార్థులతో చర్చించాలి.
జవాబులు కనీసం ఎనిమిది వాక్యాల్లో రాయాలి. అంతర్గత ఎంపిక ఉంటుంది. ఇందులో విషయ అవగాహన, ప్రయోగాలు, విశ్లేషణ నైపుణ్యం, పట నైపుణ్యం, విద్యా ప్రమాణాల్లోని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. పాఠ్యపుస్తకంలోని (పటాలు, వాటి భాగాలకు సంబంధించిన ప్రశ్న) ప్రయోగ కృత్యం వివరణ అనే ప్రశ్నలు తప్పనిసరి కాబట్టి వీటిని బాగా నేర్చుకోవాలి.
లఘు సమాధాన ప్రశ్నలు (8 × 2 = 16)
* కనీసం నాలుగు వాక్యాల్లో సమాధానం రాయాలి. ఛాయిస్ ఉండదు. ఇందులో బొమ్మలు గీయడం లాంటివాటికి అవకాశం తక్కువ. ముఖ్యంగా ప్రశ్నించడం, పరికల్పన చేయడం ప్రశ్నలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలపై ఒక ప్రశ్న, భౌతికశాస్త్ర సమస్య వచ్చే అవకాశం ఉంది.
అతి లఘు సమాధాన ప్రశ్నలు (8 × 1 = 8)
* కనీసం ఒకటి లేదా రెండు వాక్యాల్లో జవాబులు రాయాలి. భౌతిక రసాయన శాస్త్రంలోని 12 పాఠ్యాంశాల్లో ప్రతిదానిలో కనీసం 4 నుంచి 5 భావనలు ఉన్నాయి. ప్రతి భావన అంటే ఏమిటి, వాటి సూత్రాలు, సమీకరణాలు, అనువర్తనాలకు సంబంధించినవన్నీ ఒకచోట రాసుకొని నేర్చుకుంటే స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలు సులువుగా రాయవచ్చు.
ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (12 × 1/2 = 6)
ఒక పదంలో సమాధానం రాయాలి. ఈ ప్రశ్నలను కొత్తగా ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టారు. అంటే ప్రమాణాలు, విలువలు, నియమాల పేర్లు, ఉదాహరణలు, భావన - కారణాలకు సంబంధించిన ప్రశ్నలు, జతపరచడం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది.
- నౌషాద్