భాషాంశాలు
పదజాలం
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
2. ఈ పాఠంలో శబ్దాలంకారం ఉన్న వాక్యాలను గుర్తించి రాయండి.
ఉదా: ''అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు.
తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు" - అంత్యానుప్రాస.
→ పై వాక్యాల్లో 'ఆడవద్దన్నారు, ఆడవచ్చన్నారు' అనేవి చివరలో ఉన్నాయి. వాటిని గమనిస్తే 'ప్రాస' కనిపిస్తుంది. పదాల చివర కానీ, పాదాల చివర కానీ వచ్చిన అక్షరాలు మళ్లీ తర్వాతి పదాల/ పాదాల చివరలో వస్తే అంత్యానుప్రాస అలంకారం అంటారు.
→ పాఠంలో శబ్దాలంకారం కలిగిన వాక్యాలు
అంత్యానుప్రాస అలంకారం
3. పాఠం ఆధారంగా కింది జాతీయాలను ఏ సందర్భాల్లో వాడతారో వివరించండి.
అ. గుండెలు బరువెక్కడం
జ: గుండెలు బరువెక్కడం అంటే తీవ్ర బాధగా పరిణమించడం. ఎవరైనా తాము పడ్డ కష్టం చెప్పినప్పుడు మన మనసులో కలిగిన బాధను చెప్పే సందర్భంలో వాడతారు. తీవ్రమైన సమస్యలను ఎదుర్కొని నిలిచినవారు చెప్పే మాటలు విన్నప్పుడు మనలో కలిగే భావాలను వ్యక్తం చేసే సందర్భంలో వాడతారు.\
ఆ. నీరుకారిపోవడం
జ: నీరుకారిపోవడం అంటే ఉత్సాహం తగ్గిపోవడం.
మనం ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎవరైనా మాటలతో మనల్ని ఆ పని చేయకుండా నిరుత్సాహపరిచే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. చేసే పనులకు ఆటంకాలు కలిగినప్పుడు మనం ఆ పనిని ఆపేస్తాం. ఆ సమయంలో ఈ జాతీయాన్ని వాడతాం.
ఇ. కనువిప్పు
జ: కనువిప్పు అంటే జ్ఞానోదయం.
తెలియని విషయాన్ని తెలుసుకునే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. వినడం, చదవడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే సందర్భంలో ఉపయోగిస్తారు.
ఈ. కాలధర్మం చెందడం
జ: కాలధర్మం చెందడం అంటే మరణించడం.
ఎవరైనా మరణించిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
ఉ. తునాతునకలు
జ: తునాతునకలు అంటే ముక్కలు ముక్కలుగా కావడం.
జరగాల్సిన పనికి కొన్ని సంఘటనల మూలంగా ఆటంకం ఏర్పడే సందర్భంలో దీన్ని వాడతారు. కష్టపడి పనిచేసినా గుర్తింపు రాని సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
4. కింది పదాల గురించి వివరించండి.
అ. సామాజిక మార్పు
జ: సమాజంలో వచ్చే మార్పులను సామాజిక మార్పు అంటారు. కాలం గడిచిన కొద్దీ సంఘంలో ఉన్న మూఢవిశ్వాసాలు, ఆచారాలు, పద్ధతులన్నీ వివిధ కారణాల వల్ల మారుతూ ఉంటాయి. అలా పరిణతి చెందడాన్నే 'సామాజిక మార్పు' అంటారు.
ఆ. విజయోత్సవం
జ: లక్ష్యాలను చేరేందుకు ఎంతో శ్రమిస్తారు. అలా విజయం సాధించిన ఆనందంలో ఉత్సవం జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్నే విజయోత్సవం అంటారు.
ఇ. సామాజికాభివృద్ధి
జ: ప్రజల సమూహమే సమాజం. సమాజం అన్ని రకాలుగా ఎదగడాన్ని 'సామాజికాభివృద్ధి' అంటారు. ఈ అభివృద్ది బాధ్యత అందరిపై ఉంటుంది.
ఈ. సాంస్కృతిక వారసత్వం
జ: మనందరం సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, జీవనవిధానాలను ముందుతరాల నుంచి వారసత్వంగా స్వీకరించి అనుసరిస్తాం. తాత నుంచి తండ్రి, తండ్రి నుంచి కొడుకు తమ ఆస్తులను స్వీకరించినట్లుగానే సాంస్కృతిక అంశాలను కూడా వారసత్వంగా స్వీకరిస్తాం.
ఉ. అగ్రతాంబూలం
అధిక ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు 'అగ్రతాంబూలం' ఇచ్చారని అంటారు. అందరికంటే, అన్నింటిలో కంటే గొప్పవారిని/ విషయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం 'అగ్రతాంబూలం' అనే పదాన్ని వాడతాం.
వ్యాకరణాంశాలు
1. కింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలో గుర్తించి రాయండి.
అ. మీరు రావద్దు
జ: నిషేధార్థక వాక్యం
ఆ. దయచేసి నన్ను కాపాడు
జ: ప్రార్థనార్థక వాక్యం
ఇ. మీరు రావచ్చు
జ: అనుమత్యర్థక వాక్యం
ఈ. వారందరికీ ఏమైంది?
జ: ప్రశ్నార్థక వాక్యం
ఉ. నేను తప్పక వస్తాను
జ: నిశ్చయార్థక వాక్యం
ఊ. ఆహా! ఎంత బాగుందీ!
జ: ఆశ్చర్యార్థక వాక్యం
ఐ. వారు వెళ్ళవచ్చా?
జ: సందేహార్థక వాక్యం
2. కింద ఇచ్చిన సంధులు - పదాల మధ్య సంబంధాన్ని గుర్తించి, వాటిని జతచేసి సూత్రాలు రాయండి.
అ. ఇత్వసంధి, గుణసంధి, సవర్ణదీర్ఘసంధి, ఉత్వసంధి, విసర్గసంధి,
సహస్రాబ్దం, నిరాశ, జీవనోపాధి, మేమంతా, ఆనందాన్నిచ్చిన
జ: 1) ఆనందాన్నిచ్చిన - ఇత్వసంధి
ఆనందాన్నిచ్చిన = ఆనందాన్ని + ఇచ్చిన
సూత్రం: ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికం.
2) జీవనోపాధి - గుణసంధి
జీవనోపాధి = జీవన + ఉపాధి
సూత్రం: 'అ' కారానికి ఇ, ఉ, ఋ పరమైతే ఏ, ఓ, అర్ ఆదేశంగా వస్తాయి.
3) సహస్రాబ్దం - సవర్ణదీర్ఘసంధి
సహస్రాబ్దం = సహస్ర + అబ్దం
సూత్రం: అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది.
4) నిరాశ - విసర్గసంధి
నిరాశ = నిః + ఆశ
సూత్రం: అంతః, దః, చతుః, అశీః, పునః, నిః మొదలైన పదాల విసర్గ రేఫగా మారుతుంది.
3. కింద ఇచ్చిన సమాసాలు - పదాలు వేటికి ఏవి వర్తిస్తాయో గుర్తించి ఆయా పదాలకు సంబంధించిన సమాసాలను, విగ్రహ వాక్యాలను రాయండి.
4. కింది ఉదాహరణలు ఏయే అలంకారాలకు సంబంధించినవో గుర్తించండి. సమన్వయం రాయండి.
అ. సుదతీ నూతన మదనా!
మదనా తురంగ పూర్ణ మణిమయ సదనా!
సదనా మయ గజ రదనా!
రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహా!
జ: పై పద్యం 'ముక్తపదగ్రస్త' అలంకారానికి చెందింది.
ముక్తపదగ్రస్త అలంకారం: ఒక వాక్యం/ పద్యపాదంలో పూర్తయిన చివరి పదం తర్వాతి వాక్యంలో/ పద్యపాదంలో మొదటనే గ్రహిస్తే ముక్తపదగ్రస్త అలంకారం అంటారు.
సమన్వయం: పైపద్యంలో మొదటిపాదం చివర ఉన్న 'మదనా' అనే పదం రెండో పాదం మొదట్లోనే వచ్చింది. రెండో పాదం చివర ఉన్న 'సదనా' మూడో పాదం మొదట్లో వచ్చింది. మూడో పాదం చివర ఉన్న 'రదనా' అనే పదం నాలుగో పాదం మొదట్లో వచ్చింది. అంటే పాదాల చివర ఉన్న పదాలు/ పాదాల మొదటనే వచ్చినందున ముక్తపదగ్రస్త అలంకారం అయ్యింది.
ఆ. మానవా! నీ ప్రయత్నం మానవా?
జ: పై వాక్యంలో 'యమకం' అలంకారం ఉంది.
యమకం: ఒక వాక్యంలో ఒక పదం అర్థ భేదంతో వెనువెంటనే కాకుండా పునరావృతం అయితే 'యమకం' అంటారు.
సమన్వయం: పై వాక్యంలో 'మానవా' అనే పదం రెండు సార్లు వచ్చింది. కానీ అర్థాలు వేరుగా ఉన్నాయి. మొదటి 'మానవా' అంటే ఓ 'మానవుడా' అని అర్థం. రెండోసారి వచ్చిన 'మానవా' అంటే 'ఆపవా?' అని అర్థం. ఇలా ఒక పదం అర్థ భేదంతో వెనువెంటనే కాకుండా వచ్చింది కాబట్టి ఇది 'యమకం'.
ఇ. హరి జేరుమనియెడి తండ్రి తండ్రి
జ: పై వాక్యం 'లాటానుప్రాస' అలంకారానికి చెందినది.
లాటానుప్రాస అలంకారం: ఒక వాక్యంలో ఒక పదం అర్థ భేదంతో కాకుండా తాత్పర్య భేదంతో వెంటవెంటనే పునరావృతమైతే లాటానుప్రాస అలంకారం అంటారు.
సమన్వయం: వాక్యం చివర 'తండ్రి' అనే పదం రెండు సార్లు వచ్చింది. అర్థ భేదం లేకపోయినప్పటికీ తాత్పర్యంలో భేదం ఉంది. 'హరిని చేరమనే తండ్రే నిజమైన తండ్రి' అనే భావంలో దీన్ని ఉపయోగించారు.
5. కింది సమాస పదాలను, వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి.
అ. ప్రతిదినము
జ: దినము దినము
ఆ. యధాశక్తి
జ: శక్తి ఎంతో అంత (శక్తిననుసరించి)
ఇ. ఆబాల గోపాలం
జ: బాలుడి నుంచి గోపాలుడి వరకు
ఈ. అనువర్షం
జ: వర్షముననుసరించి
→ పై పదాలన్నింటిలో అవ్యయాలు (అవ్యయం అంటే లింగ, వచన, విభక్తి కానివి) పూర్వ పదాల్లో ఉన్నాయి. వాటిలో పూర్వ పద ప్రాధాన్యం ఉంది. కాబట్టి అవి 'అవ్యయీభావ సమాస' పదాలు.
6. కింది ఉదాహరణలకు విగ్రహ వాక్యాలు రాయండి.
అ) అనుకూలం - కూలమును అనుసరించి - అవ్యయీభావ సమాసం
ఆ) యథామూలం - మూలమును అనుసరించి - అవ్యయీభావ సమాసం
ఇ) ప్రతిమాసం - మాసం, మాసం - అవ్యయీభావ సమాసం
భాషాంశాలు
పర్యాయపదాలు
1) స్త్రీ = వనిత, పడతి, మహిళ
2) స్మరణ = జ్ఞప్తి, స్మృతి, తలపు
జాతీయాలను ఏ సందర్భంలో వాడతారో వివరించండి?
1) గుండెలు బరువెక్కడం: తీవ్ర బాధ కలిగిన సందర్భంలో వాడతారు.
2) కనువిప్పు: జ్ఞానోదయం కలిగిన సందర్భంలో వాడతారు.
వ్యాకరణాంశాలు
పదాలు - సమాసాలు - విగ్రహ వాక్యాలు
సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
1) భారతదేశం - భారత అనే పేరు గల దేశం
2) గంగానది - గంగా అనే పేరు గల నది
ద్విగు సమాసం
1) ముప్పయి సంవత్సరాలు - ముప్పయి సంఖ్య గల సంవత్సరాలు
అవ్యయిభావ సమాసం
1) యథాశక్తి - శక్తిననుసరించి
అలంకారాన్ని గుర్తించడం
అ. సుదతీ నూతన మదనా!
మదనాగతురంగ పూర్ణమణిమయసదనా!
సదనామయ గజరదనా!
రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహా!
జ: పై పద్యంలో 'ముక్తపదగ్రస్త' అలంకారం ఉంది.
పాదం చివర వచ్చిన పదాన్ని తర్వాతి పాదం మొదటనే గ్రహించడాన్ని ముక్తపదగ్రస్త అలంకారం అంటారు.
సమన్వయం: మొదటిపాదంలో వచ్చిన 'మదనా' రెండో పాదం మొదట్లో వచ్చింది. రెండో పాదం చివర వచ్చిన 'సదనా' అనే పదం మూడో పాదం మొదట్లో వచ్చింది. మూడో పాదం చివర వచ్చిన 'రదనా' నాలుగో పాదం మొదట్లో వచ్చింది.
సూక్తి
''పురుషుడు అనేక తరాలుగా ఏదో ఒకవిధంగా స్త్రీపై ఆధిపత్యం వహిస్తున్నాడు. దీంతో స్త్రీ ఆత్మనూన్యతా భావాన్ని పెంచుకుంది. స్త్రీ పురుషుడి యొక్క సహచరి. ఆమెకు కూడా అమోఘమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పురుషులతో సమానమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, సమాన హక్కులు ఉన్నాయి''. - గాంధీజీ