భాషా కార్యకలాపాలు/ ప్రాజెక్టు పని
వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన మహిళల ఫొటోలను, జీవిత విశేషాలను సేకరించి ఒక మోడల్ మహిళావరణం పుస్తకాన్ని తయారుచేయండి. ప్రదర్శించండి.
మొదటి మహిళా మంత్రి రాజ్కుమారీ అమృత్ కౌర్
అమృత్ కౌర్ 1889 ఫిబ్రవరి 2న రాజా హరమ్సింగ్, రాణి హరమ్సింగ్లకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించారు. వారిది సంప్రదాయ పంజాబీ కుటుంబం. కౌర్ విద్యాభాస్యం ఇంగ్లండ్లోని షేర్బోర్న్ స్కూల్ ఫర్ గర్ల్స్లో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పూర్తయింది. తన తండ్రికి గోపాలకృష్ణ గోఖలే ఆప్తమిత్రుడు. భారత్ వచ్చాక ఆమెకు స్వాతంత్య్ర ఉద్యమం మీద మక్కువ పెరిగింది. మహాత్మాగాంధీతో కలిసి పనిచేశారు. ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ను ఏర్పాటుచేసి, దానికి అధ్యక్షురాలుగా పనిచేశారు. 1934 నుంచి సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ సెక్రటరీగా పదహారు సంవత్సరాలు సేవలు అందించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, జైలుకు వెళ్లారు. స్వాతంత్య్రం అనంతరం జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. 1950లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన మొదటి మహిళా నాయకురాలు కౌర్. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి చైర్ పర్సన్గా 14 సంవత్సరాలు సేవలందించారు. నర్సింగ్ కాలేజీని స్థాపించి తన ఆస్తినంతా ధారపోశారు. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సమయంలో 1964వ సంవత్సరంలో కన్నుమూసింది.
అరుందతీ భట్టాచార్య
కలకత్తాలోని బెంగాలీ కులీన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె బాల్యమంతా భిలాయ్లో గడిచింది. తండ్రి ప్రద్యుమ్న్ కుమార్ భిలాయ్ స్టీల్ ప్లాంట్లో పనిచేసేవారు. అరుంధతీ 1977లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)గా ఎస్బీఐలో చేరారు. 36 ఏళ్ల సర్వీసులో... ఫారిన్ ఎక్స్ఛేంజ్, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగాల్లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఎస్బీఐ మొదటి మహిళా ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు. పిల్లలు, వృద్ధుల సంరక్షణ కోసం మహిళా ఉద్యోగులు రెండు సంవత్సరాలు సెలవు తీసుకునేలా ఆమె ఎస్బీఐలో ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. 2014 ఫోర్బ్స్ పత్రికలో శక్తిమంతమైన మహిళల జాబితాలో 36వ స్థానంలో నిలిచారు. మహిళా బ్యాంక్ స్థాపనలో ఆమె కృషి మరవలేనిది.
థెస్సీ థామస్
భారతదేశంలో క్షిపణి పరీక్షకు నేతృత్వం వహించిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన థెస్సీ థామస్ 1963లో జన్మించారు. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల 'అగ్ని-5' ప్రాజెక్టు డైరెక్టరుగా ఆమె పనిచేశారు. 1988లో డీఆర్డీవోలో సైంటిస్ట్గా చేరారు. అబ్దుల్కలాంతో కలిసి పనిచేశారు. మన్మోహన్సింగ్ ఒకసారి థెస్సీని ''నీలాంటి మహిళా శాస్త్రవేత్తలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అరుదైన ముద్ర వేయడం అభినందనీయం" అని పొగిడారు.
అనౌషే అన్సారీ
1966లో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తిచేశారు. 1993లో టెలికామ్ టెక్నాలజీస్ను స్థాపించారు. 2006లో స్పేస్ సెంటర్కు పయనమవుతున్న వ్యోమనౌకలో ప్రయాణించాల్సిన ఓ వ్యోమగామి అనారోగ్యానికి గురి కావడంతో అన్సారీకి వెళ్లే అవకాశం దక్కింది. రక్తహీనతకు సంబంధించిన కారణాలను, స్పేస్ స్టేషన్లోని వ్యక్తులపై మైక్రోబ్స్ ప్రభావాన్ని ఆమె పరిశోధించారు. తొలి మహిళా స్పేస్ టూరిస్ట్గా రికార్డు నెలకొల్పారు.