విశాల మైదానాలు... విలువైన దీవులు
సారవంతమైన నేలలతో మైదానాలు, పర్యావరణ సమతౌల్యతకు దోహదపడుతూ దీవులు దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. భారతదేశ నైసర్గిక స్వరూపాల అధ్యయనంలో భాగంగా తీరప్రాంత మైదానాలు, సముద్రాలు-ద్వీపాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ఆ భూస్వరూపాలు ఏర్పడిన విధానం, అవి విస్తరించిన తీరుపై అవగాహన పెంచుకోవాలి. పరీక్షల్లో తరచూ వీటిపై ప్రశ్నలు అడుగుతున్నారు.
భారత ద్వీపకల్పానికి తూర్పు వైపున తూర్పు తీరమైదానం, పశ్చిమాన పశ్చిమ తీరమైదానం ఉన్నాయి. ఈ రెండు తీరమైదానాలకు కొంత తేడా కనిపిస్తుంది.
తూర్పు తీర మైదానం
తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానం కంటే ఎక్కువ విశాలంగా, వంపులు తిరిగి ఉంటుంది. ఈ మైదానం 16 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉత్తర దిశకు బదులు ఈశాన్యంగా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ వర్షపాతం తక్కువ. అనేక నదుల డెల్టాల వల్ల ఈ మైదానం దిగువ భాగం వెడల్పు ఎక్కువగా ఉంటుంది. చిల్కా సరస్సు, పులికాట్ సరస్సులు ఈ తీరమైదానంలోనే ఉన్నాయి. కన్యాకుమారి అగ్రం నుంచి గోదావరి డెల్టా వరకు దీని పొడవు 1,100 కి.మీ., వెడల్పు 100 నుంచి 130 కి.మీ. బాలనూర్ తీర మైదానంలో మహానది డెల్టా ప్రాంతం కలుస్తుంది. ఈ ప్రాంతంలో అనేక లాగూన్లు (సరస్సులు) ఉంటాయి. వాటిల్లో ఒకటి ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న పులికాట్ సరస్సు.
ఒడిశాలో తీర మైదానాన్ని ఉత్కళ మైదానం అంటారు. దీని పొడవు 400 కి.మీ. ఇది ఉత్తరాన సువర్ణరేఖ నుంచి దక్షిణాన రుషికుల్య నది వరకు వ్యాపించి ఉంది. మహానది ఈ డెల్టా ప్రాంతంలో ఉంది. మహానది డెల్టాకు దక్షిణాన చిల్కా సరస్సు 70 కి.మీ. పొడవుతో ఉంది. దీనిలో ఉదయ, భార్గవి నదులు కలుస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రా మైదానం ఉత్కళ మైదానం దక్షిణ చివర నుంచి పులికాట్ సరస్సు వరకు వ్యాపించి ఉంది. గోదావరి, కృష్ణా నదులు ఈ మైదానం నుంచి ప్రవహించి డెల్టాలను ఏర్పరిచాయి. కొల్లేరు సరస్సు కృష్ణా, గోదావరి నదుల మధ్య ఏర్పడింది. గోదావరి నది పాపికొండల్లో పెద్ద గార్జి ద్వారా ప్రవహించి పోలవరం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఈ నది ధవళేశ్వరం వద్ద గౌతమి గోదావరి, వశిష్ట గోదావరిగా చీలిపోతుంది. సముద్రంలో కలిసేచోట ఈ రెండు పాయలు ఏడుపాయలుగా చీలిపోతాయి. కృష్ణానది కూడా గార్జి మీదుగా ప్రవహించి విజయవాడ వద్ద మైదానంలో ప్రవేశించి 90 కి.మీ. తర్వాత హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. తమిళనాడు మైదానాలు పులికాట్ సరస్సు దిగువ నుంచి 675 కి.మీ. పొడవు, వెడల్పు సగటున 100 కి.మీ. మేర ఉంటాయి. కావేరి డెల్టా ఈ మైదానంలో భాగమే.
తూర్పు ఖండ తీరపు అంచు
ఇది పశ్చిమ ఖండ తీరపు అంచు కంటే ఎక్కువ వెడల్పుతో ఉంటుంది. గంగా ముఖద్వారం వద్ద మన్నారు సింధు శాఖ వెడల్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ భాగంలో రెండు సన్నని భాగాలు ఉండగా ఒకటి సముద్రం కింది నుంచి శ్రీలంక వైపు, మరొకటి భారత్ వైపు వ్యాపించి ఆడమ్స్ బ్రిడ్జి అనే పేరుతో నిమజ్జితమై ఉన్న భిత్తిని కలుస్తాయి. ఆడమ్స్ బ్రిడ్జి సముద్ర మట్టానికి 4 మీటర్ల లోతులో ఉంటుంది.
పశ్చిమ తీర మైదానం
ఈ మైదానం చాలా సన్నగా ఉండి 10 నుంచి 25 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. కచ్, కథియవాడ్ అనే రెండు ద్వీపకల్పాలు దీని ఉత్తర సరిహద్దు భాగంలో ఉంటాయి. పశ్చిమ తీర మైదానాన్ని కొంకణ్, కేరళ, కర్ణాటక అని మూడు భాగాలుగా విభజించారు. పశ్చిమ తీర మైదానంలో వర్షపాతం ఎక్కువ (200 - 400 సెం.మీ.). కచ్కి ఉత్తరాన ఉప్పుతో కూడిన సమతల మైదానం ఉంటుంది. దీన్ని గ్రేట్రాన్ అంటారు. దక్షిణాన విడిపోయిన భాగాన్ని లిటిల్ రాన్ అని అంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో బనాస్, తాని నదుల వరదలకు రాన్ మునుగుతుంది. సౌరాష్ట్ర అనేది అగ్నిపర్వత ద్వీపం. కాలానుగుణంగా నదుల నిక్షేపణ క్రియ వల్ల ప్రధాన భాగం దీనితో కలిసిపోయింది. దీన్నే ‘వాడ్వాన్ గేట్వే’ అంటారు. కథియవాడ్ ద్వీపకల్ప దక్షిణ భాగంలో గిర్ కొండలు ఉన్నాయి. వీటిలో ఎత్తయిన శిఖరం గోరఖ్నాథ్ (1,117 మీ.).
బనాస్, సరస్వతి నదులు ఈ మైదానం ఉత్తర ప్రాంతం నుంచి రాణ్ ఆఫ్ కచ్లోకి ప్రవేశిస్తాయి. కాంబే సింధూ శాఖలో సబర్మతి, తపతి, నర్మద కలుస్తాయి. పశ్చిమ కనుమల్లో కొంకణ్ తీర ఉత్తర భాగంలో (గోదావరికి దగ్గరగా) వైతరణి నది పుట్టి పశ్చిమంగా ప్రవహిస్తుంది. ఉల్హాస్ అనే మరో నది బొర్ఘాట్కి ఉత్తరంగా ప్రవహించి 130 కి.మీ. తర్వాత కల్యాణి దగ్గరగా అరేబియా సముద్రంలో కలుస్తుంది.
కర్ణాటక మైదానం 275 కి.మీ. వ్యాపించి ఉంది. ఇది ఉత్తరాన సన్నగా, దక్షిణాన వెడల్పుగా ఉంటుంది. ఇక్కడ శరావతి నదిపై గోర్సెప్పా జలపాతం ఉంటుంది. మంగుళూరు ఓడరేవు కూడా ఈ తీరంలోనే ఉంది. కేరళ మైదానం కన్ననూర్ (ఉత్తర భాగం) నుంచి కన్యాకుమారి అగ్రం (దక్షిణం) వరకు 500 కి.మీ. పొడవు, వెడల్పు 10 - 20 కి.మీ. వాలుతో ఉంది. ఈ తీరంలో అనేక సరస్సులు, పృష్టజలాలు (చీలికల ద్వారా సముద్ర జలాలు భూభాగంలోకి వచ్చిన జలాలు) ఉన్నాయి. 80 కి.మీ. పొడవు ఉన్న వెంబనాడ్ సరస్సు కూడా ఇక్కడ ఉంది.
పశ్చిమ ఖండ తీరపు అంచు: ఇది సముద్రంలో 100 మీ. లోతుతో ముంబయి నుంచి 350 కి.మీ. వ్యాపించి ఉంది. రెండు సోపానాలు ఈ ఖండ తీరపు అంచులో కనిపిస్తాయి. కన్యాకుమారి అగ్రం వరకు ఈ ఖండ తీరపు అంచు వ్యాపించి ఉంది.
సరిహద్దు సముద్రాలు, ద్వీపాలు
క్రిటేషియన్ యుగం చివర్లో గోండ్వానా మహాఖండం చీలిపోయినప్పుడు బంగాళాఖాతం, అరేబియా సముద్రం వివిధ భాగాలుగా విడిపోయాయి. అందులో కొంత భాగం దిగువకు వెళ్లగా హిందూ మహాసముద్రం ఆ ప్రాంతాలను ఆక్రమించడంతో ఇవి ఏర్పడ్డాయి. సముద్ర మట్టం నుంచి 100 మీ. లోతు వరకు ఉన్న ప్రాంతం ఖండతీరపు అంచు. ఇది పశ్చిమ దిక్కున కథియవాడ్కు దక్షిణంగా 350 కి.మీ., తూర్పున గంగానదికి దక్షిణాన 220 కి.మీ. వ్యాపించి ఉంది. మిగతా ప్రాంతంలో పశ్చిమాన 50 కి.మీ., తూర్పున 100 కి.మీ. ఉంది
దీవులు: దీవులు పర్యావరణ సమతౌల్యాన్ని పరిరక్షించడంతోపాటు, అనేక రకాల నిక్షేపాలను కలిగి ఉండి ప్రగతికి తోడ్పడతాయి. భారతదేశానికి రెండువైపులా సముద్రాల్లో అనేక దీవులు ఉన్నాయి. వీటిలో తూర్పు దిక్కున బంగాళాఖాతంలో ఉన్న దీవుల్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు. బంగాళాఖాతంలోని దీవులు సముద్ర గర్భం నుంచి సముద్ర ఉపరితలానికి వ్యాపించిన పర్వతాలు. అరేబియా సముద్రంలోనివి పగడపు దీవుల వల్ల ఏర్పడిన ప్రవాళ భిత్తికలు. పోర్ట్బ్లెయిర్కు ఈశాన్యంగా 140 కి.మీ. దూరంలో బేరన్ ద్వీపం, దీనికి 150 కి.మీ. దూరంలో నార్కోండం ద్వీపం ఉన్నాయి. ఈ రెండూ విలుప్త అగ్నిపర్వతాలు.
అండమాన్ దీవులు: వీటిని ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ దీవులుగా విభజించారు. వీటి చుట్టూ ఉన్న దీవులతో కలిపి అండమాన్ దీవుల సమూహం అంటారు. ఉత్తర, దక్షిణ అండమాన్ దీవుల మధ్య డంకన్ మార్గం ఉంది. ఉత్తర అండమాన్ ద్వీపం పొడవు 80 కి.మీ., వెడల్పు 20 కి.మీ. మధ్య అండమాన్ ద్వీపం పొడవు 70 కి.మీ., వెడల్పు 30 కి.మీ. మధ్య అండమాన్ దీవుల్లో ముఖ్య రేవు పట్టణం పోర్ట్బ్లెయిర్. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తయిన శిఖరం సాడిల్ శిఖరం. ఇది ఉత్తర అండమాన్లో ఉంది. దక్షిణ అండమాన్లో ఎత్తయిన శిఖరం మౌంట్ హరియెట్.
నికోబార్ దీవులు: నికోబార్ ద్వీప సమూహంలో 19 దీవులు ఉండగా 12 దీవుల్లో మనుషులు నివసిస్తున్నారు. 862 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న గ్రేట్ నికోబార్ దీవి ఈ దీవుల్లో పెద్దది. నికోబార్ దీవుల్లో ఎత్తయిన శిఖరం మౌంట్ తుల్లియర్. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న భారత భూభాగం గ్రేట్నికోబార్ దీవి.
లక్షదీవులు: ఇవి అరేబియా సముద్రంలో 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు వ్యాపించి ఉన్నాయి. 11 డిగ్రీల నుంచి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ప్రధానంగా దీవులు ఉన్నాయి. లక్షదీవుల రాజధాని కవరట్టి. అధికార భాషలు మళయాళం, ఇంగ్లిష్.
రచయిత: డాక్టర్ గోపగోని ఆనంద్
మరిన్ని అంశాలు ... మీ కోసం!
‣ భారత నైసర్గిక స్వరూపం - హిమాలయాలు
‣ ప్రతిభ ప్రత్యేక పేజీలు - 2022
‣ ప్రతిభ ప్రత్యేక పేజీలు - 2015