భూహక్కులకు భరోసా!
సమ సమాజ నిర్మాణంలో భాగంగా భూములపై అందరికీ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూసంస్కరణలను చేపట్టింది. ఆ హక్కులకు భరోసానిచ్చేందుకు కొన్ని చట్టాలు చేసింది. భూగరిష్ఠ పరిమితినీ విధించింది. ఈ అంశాలపై పరీక్షల కోణంలో అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.
భారతదేశంలో భూసంస్కరణ చట్టాలు
ఏ దేశంలోనైనా భూమి ముఖ్యంగా వ్యవసాయ యోగ్యమైన భూమిపై అందరికీ హక్కు కల్పించడం సమానత్వ సూత్రానికి ప్రాతిపదిక అవుతుంది. భూ యాజమాన్యం కొంత మందికి మాత్రమే పరిమితమైతే భూమి లేనివారు (పేదలు, కూలీలు, ఇతర బలహీన వర్గాలు) భూస్వామ్య వర్గాలపై తిరుగుబాటు చేసినట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సామాజిక సమానత్వం పాటించే ఎక్కువ మందికి కనిష్ఠ స్థాయి కమతాలపై హక్కులు కల్పించడానికి భూసంస్కరణలు అవసరం.
పంటల పండించే రైతుకు భూమిపై హక్కు కల్పించాలి. అంతేకాకుండా రైతులు పరపతి సౌకర్యాలను పొందడానికి వారికి భూమిపై హక్కు అవసరం. చిన్నకారు, సన్నకారు రైతులకు భూమి హక్కు తగిన భద్రతను కల్పించి ఉత్పాదకతను సాధించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. పెద్దకమతాల కంటే చిన్నకమతాలను సమర్థంగా సాగు చేయవచ్చు.
భారత ప్రభుత్వం భూసంస్కరణలు అమలు చేయడానికి అనేక చట్టాలను రూపొందించింది. వాటిలో ముఖ్యమైనవి...
* మధ్యవర్తుల తొలగింపు చట్టం
* కౌలుదారీ చట్టాలు
* భూగరిష్ఠ పరిమితి చట్టం
* కమతాల సమీకరణ లేదా ఏకీకరణ
మధ్యవర్తుల తొలగింపు చట్టం: మధ్యవర్తుల తొలగింపు చట్టాన్ని తొలిసారిగా 1948లో మద్రాస్ రాష్ట్రంలో అమలుచేశారు. ఈ చట్టాన్ని మధ్యవర్తుల దోపిడీ ఎక్కువగా ఉన్న పశ్చిమ బెంగాల్లో 1954 - 55లో అమలుచేశారు. 1960 నాటికి దేశమంతా మధ్యవర్తుల తొలగింపు పూర్తయింది.
కౌలుదారీ చట్టాలు: భూస్వాముల నుంచి చిన్నరైతులు, వ్యవసాయ శ్రామికులు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారు. పండించిన దానిలో నిర్ణీత భాగం వీరు భూస్వాములకు కౌలుగా చెల్లిస్తారు. బ్రిటిష్ కాలంలో మూడు రకాల కౌలుదార్లు ఉండేవారు
1) శాశ్వత కౌలుదార్లు: వీరికి భూమి యాజమాన్యంపై శాశ్వత హక్కు ఉంటుంది. నిర్ణీత శాతం కౌలుగా చెల్లిస్తారు. వారసత్వపు కౌలు హక్కు కలిగిన వీరికి భద్రత ఉండేది.
2) ఏ హక్కులు లేని కౌలుదార్లు: వీరికి భూయాజమాన్యంపై ఎలాంటి అధికారం లేకుండా భూస్వాముల దయాదాక్షిణ్యాలపై జీవిస్తూ వారు నిర్ణయించిన కౌలు మొత్తాన్ని చెల్లిస్తుంటారు. వీరికి భద్రత లేకపోగా దోపిడీకి గురయ్యేవారు.
3) ఉప కౌలుదార్లు: వీరు కౌలుదార్ల నుంచి భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారు. వీరిని ఎలాంటి షరతులు లేకుండా తొలగించవచ్చు. ఉప కౌలుదార్లు కూడా ఎలాంటి భద్రత లేకుండా భూస్వాముల దోపిడీకి గురయ్యేవారు.
పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కౌలు సంస్కరణల చట్టాలు సత్ఫలితాలు చూపాయి. కౌలు సంస్కరణలు అంటే కౌలుదారుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు.
* కౌలు సంస్కరణల్లో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి.
ఎ) కౌలు పరిమాణ నిర్ణయం: భారత ప్రభుత్వం చట్టం ద్వారా కౌలు మొత్తాన్ని నిర్ణయించింది. మొదటి ప్రణాళిక (1951 - 56), రెండో ప్రణాళికల్లో (1956 - 61) ఈ కౌలు మొత్తం పంట ఉత్పత్తిలో నాలుగు లేదా అయిదు వంతుల కంటే ఎక్కువ ఉండకూడదని సూచించింది. అంతేకాకుండా ఈ కౌలు మొత్తాన్ని ద్రవ్యరూపంలో చెల్లించాలని నాలుగో ప్రణాళికలో (1969 - 74) సూచించింది. కౌలు పరిమాణం వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా నిర్ణయించారు.
* పంజాబ్, జమ్మూకశ్మీర్లో 33.3%
* తమిళనాడులో 33.3% - 40% వరకు
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల భూమికి 25%, మిగిలిన భూములకు 20%
* కేరళలో 25% - 50% వరకు కౌలు మొత్తంగా చెల్లించాలని నిర్ణయించారు.
బి) కౌలుదారులకు భద్రత కల్పించడం: కౌలుదారులను తరచూ తొలగించకుండా వారికి భూమిపై శాశ్వత హక్కులను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వీటి ముఖ్య ఉద్దేశం .....
* చట్టంలోని నిబంధనల ప్రకారం మాత్రమే కౌలుదారుల తొలగింపు జరిగేలా చూడటం.
* యజమాని సొంతంగా వ్యవసాయం చేయాలనుకున్నప్పుడే కౌలుకు ఇచ్చిన భూమి నుంచి కౌలుదారును తొలగించేందుకు వీలు కల్పించడం.
* సొంతంగా వ్యవసాయం చేయాలనుకొని కౌలుదారును భూమి నుంచి తొలగించేటప్పుడు కొంత పరిమాణంలో భూమిని కౌలుదారులకు తప్పనిసరిగా ఉంచడం.
ఉదా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కౌలు పరిమితి 6 సంవత్సరాలుగా నిర్ణయించారు.
సి) కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు: కౌలుదారులకు వారు సేద్యం చేస్తున్న భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రణాళిక ముసాయిదా పత్రాల్లో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. భూస్వాముల నుంచి భూములు తీసుకున్న కౌలుదారులు నష్టపరిహారాన్ని సులభమైన వాయిదాల్లో చెల్లించాలని, ఈ వాయిదాల పరిమాణం మొత్తం ఉత్పత్తిలో నాలుగో భాగానికి మించకూడదని ప్రణాళికా సంఘం సూచించింది.
* యాజమాన్య హక్కును చట్టబద్ధం చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1993 అక్టోబరు 31న ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాలున్న వారికి మాత్రమే యాజమాన్య హక్కు ఉంటుంది.
భూగరిష్ఠ పరిమితి చట్టం
ఒక కుటుంబం ఎంత పరిమాణంలో భూమిని తమ అధీనంలో లేదా యాజమాన్యంలో ఉంచుకోవచ్చు అనేది భూగరిష్ఠ పరిమితి చట్టం. దీనికి సంబంధించి యూనిట్ అంటే కుటుంబం అని అర్థం. ఒక కుటుంబం అంటే 5 మంది వ్యక్తులు (భర్త, భార్య, ముగ్గురు పిల్లలు). 1950 దశాబ్దం చివరలో, 1960 దశాబ్దం ప్రారంభంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూగరిష్ఠ పరిమితి చట్టాలను ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని తొలిసారిగా జమ్మూకశ్మీర్లో, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, హిమాచల్ప్రదేశ్లో, 1961లో మహారాష్ట్రలో తీసుకొచ్చారు.
1972 జులైలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో భూగరిష్ఠ పరిమితులకు సంబంధించి కింది నిర్ణయాలు తీసుకున్నారు.
* నీటిపారుదల వసతి ఉండి సంవత్సరానికి రెండు పంటలు పండే భూమి ఒక కుటుంబానికి 10 - 18 ఎకరాల వరకు ఉండవచ్చు.
* సంవత్సరానికి ఒకే పంట పండే భూమి అయితే 18 - 27 ఎకరాల వరకు ఉండవచ్చు.
* భూసారం ఒకేవిధంగా ఉండని భూమి అయితే 54 ఎకరాలు ఉండవచ్చు.
* కుటుంబంలోని వ్యక్తుల సంఖ్య అయిదు మంది కంటే ఎక్కువ ఉంటే భూగరిష్ఠ పరిమితిని మించి అదనంగా భూమి కలిగి ఉండే వీలు కల్పించారు.
మినహాయింపులు: టీ, కాఫీ తోటలు, ఇతర పండ్ల తోటలు, వ్యవసాయేతర అవసరాల కోసం పారిశ్రామిక, వాణిజ్య సంస్థల అధీనంలో ఉన్న భూములకు భూగరిష్ఠ పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. చక్కెర కర్మాగారాలు 100 ఎకరాల వరకు భూమిని అధీనంలో ఉంచుకునేందుకు అనుమతించారు.
మిగులు భూమి పరిమాణం: భూగరిష్ఠ పరిమితి చట్టం ప్రకారం 1961 - 71 మధ్య కాలంలో దేశంలో కేవలం 23 లక్షల ఎకరాల భూమిని మిగులు భూమిగా ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన మొత్తం విస్తీర్ణంలో ఇది కేవలం 2 శాతం. బిహార్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో మిగులు భూమి లేదని పేర్కొన్నారు. 1972 జాతీయ నిబంధనల సూచిక ప్రకారం రెండు పంటలు పండే సాగు నేలకు 4.05 నుంచి 7.28 హెక్టార్లుగా, ఒక పంట పండే సాగు భూమికి 10.93 హెక్టార్లుగా మెట్ట భూముల గరిష్ఠ పరిమితి విధించారు.
కమతాల సమీకరణ చట్టం
భూకమతాల పరిమాణం తక్కువైతే వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉంటుందని భావించిన ప్రభుత్వం కమతాల సమీకరణ చట్టాన్ని అమలు చేసింది. కమతాల సమీకరణ అంటే ఒక గ్రామంలోని భూములన్నింటినీ ఒక క్షేత్రంగా మార్చి లాభసాటి కమతాలుగా విభజిస్తారు. విఘటన జరిగిన కమతాలను ఒకేచోట ఉండేలా ఏర్పాటుచేసే పద్ధతిని కమతాల ఏకీకరణ లేదా కమతాల సమీకరణ అంటారు.
* కమతాల సమీకరణను రెండు విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు.
1) ఒక గ్రామంలోని కమతాలన్నీ ఒక బ్లాకుగా ఏర్పాటుచేసి ఒక్కో వ్యక్తికి అతడి భూమి విలువకు సమానంగా ఉండేలా ఒకేచోట ఇస్తారు.
2) ఒకరికొకరు స్వచ్ఛందంగా తమ భూములను మార్పు చేసుకొని భూమి అంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
కమతాల సమీకరణ చట్టాన్ని మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలుచేశారు. ఈ విధానంలో భాగంగా సహకార వ్యవసాయాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రణాళికలో చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చట్టాలు అమలుచేయలేదు. బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని నిలిపివేశారు.
* భూకమతాల విభజన అంటే కుటుంబంలోని సంతానం మధ్య మొత్తం భూమి ఆస్తుల విభజన.
* భూకమతాల విఘటన అంటే ప్రతి స్థలంలో ఉన్న భూమిని కుటుంబంలోని సంతానం మధ్య పంపిణీ చేయడం.
* ‘ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో భూపునఃవిభజన తప్పనిసరి అయింది’ అని డి.ఆర్.గాడ్గిల్ భూసంస్కరణల కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.
భూగరిష్ఠ పరిమితి విధానం ఆశయాలు:
* భూమి లేని వారి అవసరాలు తీర్చడం.
* భూయాజమాన్యంలో ఉన్న అసమానతలు తగ్గించి, గ్రామీణ ప్రాంతాల్లో సహకార పద్ధతిని అభివృద్ధి పరచడం.
* భూయాజమాన్యం ద్వారా స్వయం ఉపాధిని విస్తరించడం.
భూమి రెవెన్యూ రికార్డు - అడంగల్/పహాణి: భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డును అడంగల్ లేదా పహాణి అంటారు. ప్రతి గ్రామానికి ఒక అడంగల్ ఉంటుంది. దీన్ని గ్రామాధికారులు నిర్వహిస్తారు. భూమికి సంబంధించిన సర్వే సంఖ్య, సబ్ డివిజన్ సంఖ్య, భూమి విస్తీర్ణం, సాగుకు పనికి వచ్చే విస్తీర్ణం, పనికిరాని విస్తీర్ణం, భూమి స్వభావం, శిస్తు భూమి వివరణ, జలాధారం, ఆయకట్టు విస్తీర్ణం, ఖాతా సంఖ్య, పట్టాదారు పేరు, అనుభవదారు పేరు, అనుభవ విస్తీర్ణం, అనుభవ స్వభావం లాంటి వివరాలు ఇందులో ఉంటాయి. ఈ వివరాలన్నీ కంప్యూటరీకరించినప్పుడు నకలు పొందడానికి వీలవుతుంది.
రచయిత: బండారి ధనుంజయ
మరిన్ని అంశాలు ... మీ కోసం!