• facebook
  • whatsapp
  • telegram

డిప్లొమాల్లోకి పాలీసెట్‌ దారి

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు విడుదల

తెలుగు రాష్ట్రాల్లోని సాంకేతిక విద్యా శిక్షణ సంస్థలు పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్‌)-2022 ప్రకటనలు విడుదలచేశాయి. వీటిద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. సాంకేతిక అంశాలపై మక్కువ ఉండి, చిన్న వయసులోనే కెరియర్‌లో స్థిరపడాలనుకునేవాళ్లు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఉన్నత విద్య దిశగానూ అడుగులేయవచ్చు. కొన్ని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి.

పది తర్వాత ఉన్న దారుల్లో డిప్లొమా కోర్సులు ముఖ్యమైనవి. ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్య... అన్నింటికీ ఇవి అనువైనవిగా చెప్పుకోవచ్చు. గణితం, భౌతిక రసాయన శాస్త్రాల్లో కొంత పట్టు ఉన్నవారు వీటిలో చేరి రాణించవచ్చు. ప్రశ్నలన్నీ ఈ అంశాలపైనే ఉంటాయి. చదువుకున్న బ్రాంచీని బట్టి కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి ఎక్కువ అవకాశాలున్నాయి. అందువల్ల ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నవారూ, ఇప్పటికే పూర్తయినవారూ ఆసక్తి ఉంటే పాలిటెక్నిక్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్రాంచీలెన్నో..

విస్తృత సంఖ్యలో బ్రాంచీలు ఉండడం డిప్లొమాల ప్రత్యేకత. అందువల్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకునే అవకాశం దక్కుతుంది. సివిల్, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఎంబడెడ్‌ సిస్టమ్స్, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెదర్‌ టెక్నాలజీ.. తదితర బ్రాంచీలను ఎంచుకోవచ్చు. వీటిని మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.

అవకాశాలిలా..

డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలతోపాటు ప్రభుత్వ అనుబంధ సంస్థలు, విభాగాల్లో ఉద్యోగాలు విరివిగా ఉంటాయి. వీరికి ఎక్కువగా మహారత్న, నవరత్న, మినీరత్న, ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువులు లభిస్తాయి. రైల్వేల్లో జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) పోస్టులను డిప్లొమా విద్యార్హతతో భర్తీ చేస్తున్నారు. కేంద్రానికి చెందిన వివిధ విభాగాల్లో జేఈ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి ప్రకటనలు వెలువరిస్తోంది. పరీక్షలో ప్రతిభ చూపినవారికి లెవెల్‌-6 ప్రకారం రూ.35,400 మూలవేతనం అందుతుంది. అంటే విధుల్లో చేరిన మొదటి నెల నుంచే అన్ని ఆలవెన్సులూ కలుపుకుని రూ.యాభై వేలకుపైగా వేతనం వీరు అందుకోవచ్చు. రాష్ట్ర స్థాయుల్లో అయితే... రహదారులు, భవనాలు; పంచాయతీరాజ్, నీటిపారుదల... తదితర శాఖల్లో డిప్లొమాతో దూసుకుపోవచ్చు.

ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ప్రైవేటు రంగంలో విస్తృతంగా అవకాశాలు అందుతున్నాయి. నిర్మాణ రంగం, ఆటోమొబైల్, పవర్‌ ప్లాంట్లు, ఇంజినీరింగ్‌ ఫర్మ్‌ల్లో వీరు సులువుగానే నిలదొక్కుకోవచ్చు. పేరొందిన పాలిటెక్నికల్‌ కళాశాలల్లో కొన్నేళ్ల నుంచి ప్రాంగణ నియామకాలూ చేపడతుతున్నారు. పలు విభాగాల్లో సేవలు అందిస్తోన్న కార్పొరేట్‌ సంస్థలు వీరిని ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. రైల్వోలో వేల సంఖ్యలో లోకో పైలట్‌ ఉద్యోగాల భర్తీకి రెండుమూడేళ్లకు ఒకసారి ప్రకటనలు వెలువడుతుంటాయి. వీటికి సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు పోటీపడొచ్చు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ బ్రాంచీలవారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి.

విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో ఎలక్ట్రికల్‌ విభాగం వాళ్లు రాణించగలరు. సివిల్‌ అభ్యర్థులు నీటిపారుదల శాఖ, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగంలో సేవలు అందించవచ్చు. కొన్ని బ్రాంచీల వారికి రక్షణ రంగంలోనూ కొలువులు ఉన్నాయి. ఏర్‌ ఫోర్సులో ఎక్స్, వై ట్రేడులు; కోస్టుగార్డులో యాంత్రిక్‌ పోస్టులకు డిప్లొమా అర్హతతో పోటీ పడవచ్చు. ఈ ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు వెలువడుతున్నాయి. డిప్లొమాతోనే సౌదీ, యూఏఈ, దుబాయ్, సింగపూర్, మలేషియా... తదితర చోట్ల మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

ఉన్నత విద్య

డిప్లొమా అనంతరం ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని భావించినవాళ్లు ఈసెట్‌తో నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. వీరు ఎంసెట్, ఐఐటీ-జేఈఈ పరీక్షలూ రాసుకోవచ్చు. డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవాళ్లు ఇంజినీర్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అందించే అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఏఎంఐఈ) పూర్తిచేసుకోవచ్చు. ఇది బీటెక్‌తో సమాన స్థాయి కోర్సు. ఆ తర్వాత ఎంటెక్‌ దిశగానూ అడుగులేయవచ్చు. లేదా డిప్లొమా అర్హతతోనే బీఎస్సీ, బీఏ...తదితర కోర్సులూ చదువుకోవచ్చు.

రాతపరీక్ష ఇలా..

ప్రవేశపరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. 

ఏపీలో నిర్వహించే పరీక్షలో... మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. వ్యవధి 2 గంటలు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి పదో తరగతి సిలబస్‌ ప్రకారం ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-ఎ: మ్యాథ్స్‌ 50, సెక్షన్‌-బి: ఫిజిక్స్‌ 40, సెక్షన్‌-సి: కెమిస్ట్రీ 30 ప్రశ్నలు ఉంటాయి. 

తెలంగాణ పాలీసెట్‌లో మ్యాథ్స్‌ 60, ఫిజిక్స్‌ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. రెగ్యులర్‌ డిప్లొమా, ఆరేళ్ల బీటెక్‌లో ప్రవేశం ఆశించేవారు బయాలజీ రాయనవసరం లేదు. అన్ని కోర్సులకూ ప్రయత్నించాలనుకున్నవారు, ప్రత్యేక పాలిటెక్నిక్‌ల్లో చేరాలని భావించేవారు బయాలజీనీ రాయాలి.  

తెలంగాణ పాలీసెట్‌తో పాలిటెక్నిక్‌ కోర్సులతోపాటు ఆర్‌జీయూకేటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లోకీ అవకాశం ఉంటుంది. అలాగే అగ్రికల్చర్‌ డిప్లొమాలు, వెటర్నరీ అండ్‌ హార్టికల్చర్‌ డిప్లొమాల్లోకీ దీనిద్వారానే చేర్చుకుంటున్నారు. అందువల్ల ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారు పాలీసెట్‌ రాయడం తప్పనిసరి.

తెలంగాణ

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 4

పరీక్ష తేదీ: జూన్‌ 30

ఫలితాలు: పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత వెలువడతాయి

వెబ్‌సైట్‌: https://polycetts.nic.in/

ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 18

పరీక్ష తేదీ: మే 29

ఫలితాలు: జూన్‌ 10న ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: https://polycetap.nic.in/Default.aspx
 

స్టడీమెటీరియల్
 

మ్యాథమెటిక్స్
ఫిజిక్స్
కెమిస్ట్రీ
బయాలజీ
పాత ప్రశ్నప‌త్రాలు
నమూనా ప్రశ్నపత్రాలు

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐఐఎంలో ఐదేళ్ల ఎంబీఏ

‣ షిప్పింగ్‌ కోర్సుల్లో చేరతారా?

‣ గ్రూపు- 1, 2ల సన్నద్ధత... ఏక కాలంలోనా? వేర్వేరుగానా?

‣ రెండు డిగ్రీలతో రెట్టింపు లాభం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-04-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌