Asked By: ఉమా శ్రీకాంత్
Ans:
ఫిజికల్ కెమిస్ట్రీ కోర్సు మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీల సమ్మేళనం. దీనిలో ఎక్కువగా అనలిటికల్ కెమిస్ట్రీ, కంప్యుటేషనల్ కెమిస్ట్రీలను నేర్చుకొంటారు. ఈ కోర్సులో ముఖ్యంగా పరిశ్రమల్లో కెమిస్ట్రీ వినియోగం తెలుసుకుంటారు. ఫిజికల్ కెమిస్ట్రీ రంగంలో రాణించాలంటే గణితంలోని ప్రాథమిక సూత్రాలపై మంచి అవగాహన ఉండాలి.
ఎంఎస్సీ (ఫిజికల్ కెమిస్ట్రీ) చదివితే ప్రైవేటు ఫార్మా, ఫుడ్, కాస్మొటిక్స్, బయో టెక్నాలజీ లాంటి కంపెనీల్లో, బోధన రంగంలో చాలా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇస్రో, డీఆర్డీఓ, ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ప్రయోగశాలల్లో, కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని కెమిస్ట్రీ ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు/సైంటిఫిక్ ఆఫీసర్/ టెక్నికల్ ఆఫీసర్/ సైంటిఫిక్ అసిస్టెంట్/ ల్యాబ్ అసిస్టెంట్/ రిసెర్చ్ అసిస్టెంట్గా ఉద్యోగాలు పొందొచ్చు.
బోధన రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్/ టీజీటీ/ పీజీటీగా పాఠశాలల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఇవే కాకుండా ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కెమిస్ట్రీ లెక్చరర్గా స్థిర పడవచ్చు. నెట్/సెట్ లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీలో సహాయ ఆచార్యుడిగా ఉద్యోగం పొందవచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసి కేంద్ర/ రాష్ట్ర/ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుడిగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పరిశోధనలపై ఎక్కువ ఆసక్తి ఉంటే విదేశాల్లో పోస్ట్ డాక్టొరల్ పరిశోధన కోసం ప్రయత్నించవచ్చు. ఎంఎస్సీ (ఫిజికల్ కెమిస్ట్రీ) తర్వాత గేట్ రాసి ఐఐటీ, ఎన్ఐటీల్లో ఎమ్టెక్ చేసి ఇంజినీరింగ్ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీ కోర్సు చేసినవారికి కెమికల్ ఇంజినీరింగ్ పరిశ్రమల్లో అధిక ప్రాధాన్యం ఉంటుంది. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎం. నాగరాజు
Ans:
ఇంటర్లో ఎంఈసీ చదివిన చాలామంది సీఏ చేస్తూ బీకాం లేదా బీకాం చదువుతూ సీఏలో చేరతారు. అయితే వీరిలో ఎక్కువమంది బీకాం మాత్రమే పూర్తి చేయగలుగుతున్నారు. కొద్దిమందే సీఏ కోర్సుని విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నారు. మరికొద్దిమంది సీఏ (ఇంటర్)తోనే ఆపేస్తున్నారు. బీకాం పూర్తయిన తర్వాత ఎంబీఏ లేదా ఎంకాం ఎంచుకోవచ్చు. సీఏ కోర్సు ప్రైవేటు, బహుళజాతి సంస్థల్లో కాస్టింగ్, అకౌంటింగ్ రంగాల్లో అవకాశాలు కల్పిస్తుంది. ఇది పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇన్కమ్ టాక్స్, ఆడిట్ రంగాల్లో ఉపాధి లభిస్తుంది. ఎంబీఏ చదువుకున్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత ఉద్యోగావకాశాలున్నాయి. ఎంకాం కోర్సు పూర్తిచేసినవారు అకౌంటింగ్ విభాగాలు, బోధన రంగంలో ఉపాధి పొందుతున్నారు.
ఇటీవలికాలంలో డేటా సైన్స్/ బిజినెస్ అనలిటిక్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి. వివిధ సర్వేల ప్రకారం రాబోయే 20 ఏళ్లలో ఈ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం తగినంత మంది అర్హులు లేనందున చాలా కళాశాలలు బిజినెస్ అనలిటిక్స్ కోర్సుని బీకాం, బీబీఏ, ఎంబీఏల్లో అందిస్తున్నాయి. ఈ కోర్సు స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ల సమ్మేళనం. దీన్ని పూర్తిచేయడానికి ప్రాబ్లం సాల్వింగ్పై అవగాహన, గణితంపై ఆసక్తి అవసరం. బీకాం బిజినెస్ అనలిటిక్స్ కోర్సు చేశాక మంచి ఉద్యోగాలు పొందాలంటే వ్యాపారపు ఫంక్షనల్ పరిజ్ఞానం, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్లపై పట్టు అవసరం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీ అబ్బాయి అభిరుచిని బట్టి కోర్సును ఎంచుకోమని చెప్పండి. ఫంక్షనల్, టెక్నికల్ (అనలిటిక్స్) రంగాల్లో పూర్తి అవగాహన ఉన్నవారు మార్కెట్లో తక్కువగా ఉన్నందున సీఏతోపాటు బీకాం అనలిటిక్స్ని చేయగలిగితే దేశ విదేశాల్లో మేటి అవకాశాలు పొందవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎం.వరప్రసాద్
Ans:
బీటెక్ పూర్తిచేసిన ఏడేళ్ల తర్వాత సంస్కృత భాషను నేర్చుకోవాలనుకుంటున్న మీ ఆసక్తి అభినందనీయం. సంస్కృత భాషలో సామాన్య పరిజ్ఞానం కోసం కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం దిల్లీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) దిల్లీ, నేషనల్ సాన్స్క్రిట్ యూనివర్సిటీ (రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం) తిరుపతిల్లో ఆరు నెలల సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సు చేయవచ్చు. ఇగ్నోలో ఈ కోర్సు ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉంది. ఏ వయసువారైనా ఇందులో చేరవచ్చు. సంస్కృతంలో ప్రాథమిక అర్హత ఉన్నవారు ఇవే సంస్థల ద్వారా పీజీ కూడా చేయవచ్చు. భారతీయ విద్యాభవన్ వారి సంస్కృత విశారద, సంస్కృత భారతిల్లో ప్రవేశ, పరిచయ, శిక్షా, కోవిద కోర్సులు ఉపయోగపడతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ కూడా చాలా కోర్సులను అందిస్తోంది. డిగ్రీలో ద్వితీయ భాషగా సంస్కృతం చదువుకున్నవాళ్లు ఉస్మానియా, ఆంధ్రా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో దూరవిద్య ద్వారా ఎంఏ సంస్కృతం కోర్సు చదవవచ్చు. ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: షేక్ బాబా జీలన్
Ans:
డిప్లొమా ఇన్ సేఫ్టీని దూరవిద్యలో చదవొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (UPES), దెహ్రాదూన్లో అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ (హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్)ని దూరవిద్య ద్వారా అందిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ (NIFSE), హైదరాబాద్ వారు సర్టిఫికెట్ ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్, ఫైర్ ఆఫీసర్ కోర్సులను రెగ్యులర్ పద్ధతిలో అందిస్తున్నారు.
ఇవే కాకుండా దూరవిద్యలో డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్, డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజినీరింగ్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజినీరింగ్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజినీరింగ్, ఫైర్ అండ్ సేఫ్టీలో ఎంబీఏ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్, పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్, హైదరాబాద్ వారు అందిస్తున్నారు.
వీటితో పాటు NIFSC, LSOS UK కలిసి అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్, అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హైజీన్, మాస్టర్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హైజీన్, ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సులను అందిస్తున్నాయి. అన్నామలై యూనివర్సిటీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ హైజీన్లను దూరవిద్యలో అందిస్తోంది. ఈ కోర్సులు చదివినవారికి కెమికల్, పెట్రోకెమికల్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్, ఎన్విరాన్మెంట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.- ప్రొ.బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వేమూరి నరేష్
Ans:
స్టాటిస్టిక్స్ చదివినవారికి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లో చాలా ఉద్యోగావకాశాలున్నాయి. రాష్ట్ర స్థాయిలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, కేంద్ర స్థాయిలో నేషనల్ శాంప్లింగ్ సర్వే లాంటి సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. ఇవే కాకుండా, సాప్ట్వేర్ కోర్సులు నేర్చుకొని ఆ రంగంలోనూ ప్రవేశించవచ్చు.ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్) కోర్సు దూరవిద్యలో ప్రొఫెసర్ రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్- ఉస్మానియా యూనివర్సిటీ; సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్- ఆచార్య నాగార్జున యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్) కోర్సు ఆన్లైన్లో అందుబాటులో లేదు. భవిష్యత్తులో అందుబాటులోకి రావొచ్చు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ కోర్సు ఉంది. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: హరీష్ వర్మ
Ans:
మీరు బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రో బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఇమ్యునాలజీలలో ఏదో ఒకదానిలో పీజీ చేయవచ్చు. ముందుగా మీరు ఏ సబ్జెక్టులో పీజీ చేయాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. సాధారణంగా అన్ని విశ్వవిద్యాలయాలూ ఎంట్రన్స్ పరీక్షల ద్వారానే ప్రవేశాలను పూర్తి చేస్తున్నాయి. కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పీహెచ్డీ కోర్సు కూడా అందిస్తునాయి. లైఫ్ సైన్సెస్లో పీజీ చేసినవారికి బోధన, పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పీజీ చేశాక బీఈడీ చేసి 11, 12 తరగతులు బోధించే పీజీ టీచర్ ఉద్యోగాన్ని పొందవచ్చు. బీఈడీ లేకుండా జూనియర్ కళాశాలల్లో బోధన వృత్తిని చేపట్టవచ్చు. నెట్ లేదా సెట్ లో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా ఉపాధి పొందటానికి వీలుంటుంది. పీహెచ్డీ చేసి యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం, కేంద్రీయ, రాష్ట్రీయ పరిశోధన సంస్థల్లో సైంటిస్ట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ప్రైవేటు రంగానికొస్తే ఫార్మా, బయోటెక్ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. అగ్రికల్చర్లో పీజీ చేయాలంటే డిగ్రీలో అగ్రికల్చర్ కచ్చితంగా చదివివుండాలి. మైక్రో బయాలజీ సబ్జెక్టులో పీజీ చేసినవారికి అగ్రికల్చర్లో పీహెచ్డీ చేసే అవకాశం ఉంది. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: జి.అరుణ
Ans:
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) అనేది దేహ్రాదూన్లో 1982 వ సంవత్సరంలో స్థాపితమైన స్వయం ప్రతిపత్తి గల విద్యా శిక్షణ సంస్థ. దీనికి భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణతో పాటుగా బయోడైవర్సిటీ రంగంలో కూడా పరిశోధనలు జరుగుతాయి. ఈ సంస్థ వైల్డ్ లైఫ్ సైన్సెస్లో ఎంఎస్సీనీ, హెరిటేజ్ కన్సర్వేషన్ అండ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్నూ అందిస్తుంది. వీటితో పాటు పీ‡హెచ్డీ కోర్సు కూడా అందుబాటులో ఉంది. వైల్డ్లైఫ్ సైన్సెస్లో ఎంఎస్సీ కోర్సు చదవాలంటే సైన్స్, మెడికల్, ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ల్లో ఏదైనా సబ్జెక్ట్లో డిగ్రీ చేసివుండాలి. ఇంజినీరింగ్, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ ల్లో డిగ్రీ చేసినవారు హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్లో బయాలజీ చదివి ఉండాలి. ప్రవేశపరీక్ష రాయడానికి డిగ్రీలో కనీసం 50 శాతంతో ఉత్తీర్ణత పొందివుండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది. ఈ కోర్సు చదవాలంటే 25 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ విభాగాల్లో పనిచేస్తున్నవారికి 10 సంవత్సరాల సడలింపు ఉంది.
ఈ అర్హతలున్న అభ్యర్థులు జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను ఆన్లైన్ లో రాయాలి. ఈ పరీక్ష 100 మార్కులకు 2 గంటల వ్యవధిలో జరుగుతుంది. పరీక్షలో మూడు విభాగాలుంటాయి. మొదటి విభాగంలో కరెంట్ అఫైర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్; రెండో విభాగంలో వైల్డ్ లైఫ్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, కన్జర్వేషన్; మూడో విభాగంలో వైల్డ్లైఫ్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, కన్జర్వేషన్ల్లో ఒక ఎస్సే ఉంటుంది. మొదటి రెండు విభాగాల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రవేశపరీక్ష లో పొందిన మార్కుల ఆధారంగా ఇంటర్వూలు నిర్వహిస్తారు. రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూ కి 30 శాతం వెయిటేజి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో పొందిన మార్కుల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. సాధారణంగా ప్రవేశ ప్రకటన జనవరి/ ఫిబ్రవరి నెలలో వస్తుంది. అర్హత పరీక్ష, ఇంటర్వూలు మే నెలలో నిర్వహిస్తారు. జూన్ నెలలో అడ్మిషన్లు పూర్తిచేసి జులైౖలో తరగతులు ప్రారంభిస్తారు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎన్. శివప్రియ
Ans:
నేరాలు, క్రిమినల్ కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్ సైన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కోర్సులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ, సోషియాలజీ సబ్జెక్టుల అంశాలను నేర్పిస్తారు. ఈ కోర్సు ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్లో ఆసక్తి ఉన్నవారికి బ్యాచిలర్స్, మాస్టర్స్ స్థాయిలో కోర్సులు ఉన్నాయి, బ్యాచిలర్స్ స్థాయిలో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ (ఆనర్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు చదవడానికి 10+2 లేదా ఇంటర్మీడియట్ను సైన్స్ గ్రూపుతో ఉత్తీర్ణులవ్వడం కనీస అర్హత. మాస్టర్స్ స్థాయిలో ఫోరెన్సిక్ సైన్స్లో ఎం.ఎస్.సి. ఫోరెన్సిక్ సైన్స్, ఎం.ఎస్.సి.ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ¨, ఎం.ఎస్.సి.ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్ లాంటి కోర్సులు ఉన్నాయి. బ్యాచిలర్స్ స్థాయిలో బయాలజీకి సంబంధించిన బ్రాంచితో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అవ్వడం ఈ కోర్సుకు కనీస అర్హత. చాలా కళాశాలలు ప్రవేశ పరీక్ష లేకుండా మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు ఆయా విశ్వవిద్యాలయాల ద్వారా జారీ అవుతాయి. బ్యాచిలర్స్ స్థాయిలో ఈ కోర్సు చేసిన తరువాత ఉద్యోగావకాశాలు లభించడం కష్టంగా ఉంటే, మాస్టర్స్ చెయ్యడం వల్ల కెరియర్ను మొదలుపెట్టడం శ్రేయస్కరం. ఫోరెన్సిక్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసినవారికి, ఫోరెన్సిక్ సైంటిస్ట్, ప్రైవేటు ఇన్వెస్టిగేటర్స్, డ్రగ్ అనలిస్ట్, క్రైం ల్యాబ్ అనలిస్ట్, ఫోరెన్సిక్ ఆర్కిటెక్ట్, ఫోరెన్సిక్ ఇంజినీర్, పోలీస్ శాఖ, ఫోరెన్సిక్ కన్సల్టెంట్ లాంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: శ్రీహర్షిత
Ans:
ఒకే సమయంలో ఒక రెగ్యులర్ కోర్సు, ఒక దూరవిద్య/ఆన్లైన్ కోర్సు చదువుకోవడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) 2020లో ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మీరు రెగ్యులర్ మోడ్లో ఏ కోర్సు చదువుతున్నా కానీ, దూరవిద్య/ఆన్లైన్ ద్వారా నచ్చిన కోర్సులో చేరే అవకాశం ఉంది. మీరు బీబీఏ డిగ్రీ రెగ్యులర్గా చదువుతూ, ఇగ్నో ద్వారా బీఏ డిగ్రీని కూడా పూర్తిచేసుకోవచ్చు. అయితే ఒకే సమయంలో రెండు డిగ్రీలను రెగ్యులర్ మోడ్లో చదవడం కుదరదు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్