Asked By: శివకుమార్
Ans:
సాధారణంగా బీఈడీ ప్రోగ్రాం వ్యవధి రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మీరు బీఈడీ మూడో సంవత్సరం చదువుతున్నానన్నారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్/ బీఏఎడ్ ప్రోగ్రాం చదువుతున్నారని అనుకుంటున్నాం. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఎంఈడీ కోర్సును దూరవిద్యా విధానంలో అందించకూడదు. ఒకవేళ ఎవరైనా, అలా అందించే ప్రయత్నం చేస్తే ఆ ప్రోగ్రాంకు ఎన్సీటీఈ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోండి. మీకు టీచర్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో బోధించే ఆసక్తి ఉంటే, ఎంఈడీకి సమానమైన ఎంఏ ఎడ్యుకేషన్ చదివే ప్రయత్నం చేయండి. ఇగ్నో సంస్థలో ఎంఏ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. ప్రొఫెషనల్ కోర్సులను దూరవిద్య ద్వారా కాకుండా.. రెగ్యులర్గా చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: కరీమున్నీసా
Ans:
మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదువుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో సోషియాలజీ/ సోషల్ వర్క్ చదివినవారికి సోషల్ వర్క్లో పీజీ చేయడానికి ప్రాధాన్యం ఉంటుంది. డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినప్పటికీ మీకు సోషల్ వర్క్ సబ్జెక్టుపై ఆసక్తి ఉంటే, పీజీ సోషల్ వర్క్లో ప్రవేశం పొందవచ్చు. సోషల్ వర్క్ చేసినవారికి ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి. ఈ కోర్సులో పీజీ చేసినవారు ప్రైవేటు రంగంలో సోషల్ వర్కర్, ఫ్యామిలీ కౌన్సెలర్, హాస్పిటల్ కౌన్సెలర్, డీ అడిక్షన్ కౌన్సెలర్గా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగావకాశాలు ఉంటాయి.
పీజీలో ఇండస్ట్రియల్ సైకాలజీ చదవాలంటే, ముందుగా ఎంఏ/ ఎమ్మెస్సీ సైకాలజీలో ప్రవేశం పొంది, ఇండస్ట్రియల్ సైకాలజీని ఒక స్పెషలైజేషన్గా చదవాలి. చాలా యూనివర్సిటీల్లో పీజీలో సైకాలజీ చదవాలంటే, డిగ్రీలో సైకాలజీ కచ్చితంగా చదివి ఉండాలి. కొన్ని యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలో సైకాలజీ చదవకపోయినా పీజీ సైకాలజీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇండస్ట్రియల్ సైకాలజీ చదివినవారికి ప్రైౖవేటు రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విద్యార్హతతో హ్యూమన్ రిసోర్సెస్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ మేనేజర్, టాలెంట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, బిహేవియర్ అనలిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ ప్రాక్టీస్ మేనేజర్, ఎంప్లాయీ రిలేషన్షిప్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ కోచ్, ఇండస్ట్రియల్ సైకలాజికల్ కౌన్సెలర్, కన్సల్టెంట్, రిసెర్చ్ అనలిస్ట్ లాంటి కొలువులకు అర్హత ఉంటుంది. ఇండస్ట్రియల్ సైకాలజీ చదివినవారికి ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో అతి తక్కువ ఉద్యోగాలే అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: రవితేజ
Ans:
ఇంజినీరింగ్ అయ్యాక మనదేశంలోనే ఉద్యోగం చేయాలా? విదేశాల్లో ఎంఎస్ చేయాలా? అనే ప్రశ్న చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు నిత్యం ఎదుర్కొనేదే! ముందుగా మీరు విదేశాలకు ఎందుకు వెళ్ళాలనుకొంటున్నారు అనే విషయంపై స్పష్టత అవసరం. చాలామంది మెరుగైన విద్య, ఉపాధి కావాలనో, డబ్బు, విలాసవంతమైన జీవితం కోసమనో, కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడానికో, విదేశాల్లో స్థిరపడాలనే కల నెరవేర్చుకోవడం కోసమనో.. ఇలా వివిధ కారణాలు చెప్తుంటారు. పైన చెప్పినవాటిలో మీరు ఏ కారణంతో విదేశాలకు వెళ్లాలనుకొంటున్నారనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి.
పిల్లల్ని విదేశాలకు పంపడం చాలామంది తల్లిదండ్రులు ఒక హోదాగా భావిస్తున్నారు. విదేశాలకు వెళ్లకుండా మనదేశంలోనే స్థిరపడాలనుకునే చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పే కారణాలు ఇలా ఉంటాయి: విదేశీ(( విద్య ఖర్చుతో కూడుకున్నది, విదేశాల్లో కూడా ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంది, ఇక్కడే ఉండి మన దేశాభివృద్ధికి తోడ్పడాలి, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తోడుగా ఉండాలి, విలాసాలు, సౌకర్యాల విషయంలో మనదేశం కూడా విదేశాలతో పోటీ పడుతోంది, ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు, దూరపు కొండలు నునుపు..ఇలా! ఇవి రెండూ కాకుండా కొంతమంది ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ కొంత అనుభవం గడించి, వెనక్కి వచ్చి భారత్లో స్థిరపడటం కూడా గమనిస్తున్నాం. విదేశాలకు వెళ్ళడం, లేదా ఇక్కడే స్థిరపడటం అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. విదేశీ విద్య కొంత ఆర్థికభారంతో కూడుకొంది కాబట్టి మీరు, మీ కుటుంబ సభ్యులూ కలిసి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అంశమిది.
ప్రస్తుతం మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడం, గేట్లో మెరుగైన ర్యాంకు పొందడం అనేవి... విదేశాల్లో ఎంఎస్ సీటు తెచ్చుకోవడం కంటే కూడా ఎక్కువ కష్టంగా ఉన్నాయి. విదేశాల్లో చదువుతున్న చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో ఉద్యోగాలు పొందడం కష్టంగా ఉంది కాబట్టి కొంతకాలం విదేశీ విద్య ఆలోచనల్ని పక్కనపెట్టడం మంచిదని సలహాలు ఇస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు తగ్గుతున్న ఈ సందర్భాల్లో కూడా చాలామంది విదేశీ విద్యపై మోజు పడుతూనే ఉన్నారు. మీకు ప్రతిభ, విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలుంటే ఎక్కడైనా ఉద్యోగం పొందవచ్చు. డిగ్రీల ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు పొందే రోజులు పోయాయి. మారుతున్న పరిస్థితుల్లో డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం, వ్యక్తిత్వం, భావప్రకటనా సామర్థ్యం, సృజనాత్మకత, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, ప్రోగ్రామింగ్, కోడింగ్, కృత్రిమ మేధపై అవగాహన లాంటివి మంచి ఉద్యోగం పొందడానికి దోహదపడుతున్నాయి.ఇవి దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సాయి సంకీర్తన, హైదరాబాద్
Ans:
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లో మైక్రో బయాలజీతో పాటు ఇతర పీజీ ప్రవేశాలు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)- పీజీ స్కోరు ఆధారంగా జరుగుతాయి. జులై 2024లో విద్యాసంవత్సరం మొదలవుతుంది.
సీయూఈటీ నోటిఫికేషన్ ఇటీవలే వెలువడింది. ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 24 వరకు స్వీకరిస్తారు. పరీక్షలు మార్చి 11 నుంచి 28 వరకు రోజూ 3 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. సీయూఈటీలో సాధించిన స్కోరుతో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లో, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలూ, డీమ్డ్ యూనివర్సిటీలూ, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ చదువుకోవచ్చు.
మైక్రోబయాలజీ పీజీ కోర్సును అందించే దేశంలోని ఇతర ప్రముఖ విద్యాసంస్థలు..
* పాండిచ్చేరి యూనివర్సిటీ
* దిల్లీ యూనివర్సిటీ
* మదురై కామరాజ్ యూనివర్సిటీ
* యూనివర్సిటీ ఆఫ్ కోల్కతా
* ప్రెసిడెన్సీ యూనివర్సిటీ
* అమృత యూనివర్సిటీ
* ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: అశోక్
Ans:
బీఎస్సీ (బీజడ్సీ) చదివినవారు వైద్య/ ఆరోగ్య రంగానికి సంబంధించి పీజీలో బయోకెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్, మాలిక్యులర్ బయాలజీ, లైఫ్ సైన్సెస్, హ్యూమన్ జెనెటిక్స్, బయో థెరప్యూటిక్స్, బయో మాలిక్యులర్ ఫిజిక్స్, జీనోమ్ టెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, సిస్టమ్స్ బయాలజీ, టిష్యూ సైన్స్ లాంటి కోర్సులు చేయవచ్చు. మీకు మేనేజ్మెంట్ రంగంపై ఆసక్తి ఉంటే ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్, హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సుల గురించి ఆలోచించవచ్చు. ఇవేకాకుండా అడ్వాన్స్డ్ కోర్సులైన స్టెమ్ సెల్ టెక్నాలజీ, ట్రాన్స్లేషనల్ ఇమ్యునాలజీ, ట్రాన్స్లేషనల్ న్యూరోసైన్స్, క్లినికల్ వైరాలజీ లాంటి కోర్సులు కూడా చదివే అవకాశం ఉంది. మీ ఆసక్తిని బట్టి ఏది చదవాలో నిర్ణయించుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎ.సాయిపవన్
Ans:
మైక్రో బయాలజీ ప్రోగ్రాంలో సూక్ష్మ జీవుల గురించి విపులంగా చదువుతారు. ఫంగీ, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఆల్గే లాంటివి. మైక్రో బయాలజీలో వైరాలజీ, బ్యాక్టీరియాలజీ, మైకాలజీ, ప్రోటో జువాలజీ, పారాసైటాలజీ లాంటి స్పెషలైజేషన్లు ఉంటాయి. మీరు ఎమ్మెస్సీ మైక్రోబయాలజీలో చదివిన స్పెషలైజేషన్ ఆధారంగా ఏ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకొని, అవసరమైన నైపుణ్యాలు పెంచుకోండి. మైక్రోబయాలజీ చదివినవారికి ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్ కేర్, బయోమెడికల్ రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఫార్మా, బయోటెక్.. రెండు రంగాల్లో మైక్రో బయాలజిస్ట్గా ఉద్యోగం పొందవచ్చు. ప్రస్తుతం ఫార్మా, బయోటెక్ పరిశ్రమలు రెండూ హెల్త్కేర్ రంగంతో పాటు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. మీ ఆసక్తిని బట్టి దేనిలో స్థిరపడాలో నిర్ణయించుకొని ఆ రంగాన్ని ఎంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: హరిచందన
Ans:
సాధారణంగా మెడికల్ కోడింగ్ రంగంలో ప్రవేశించాలంటే, డిగ్రీలో లైఫ్ సైన్సెస్/ హెల్త్కేర్ సబ్జెక్టులు చదివి ఉండి, వివిధ వ్యాధులూ, వాటి చికిత్సల గురించీ, మానవ శరీరపు పనితీరు గురించీ ప్రాథమిక అవగాహన ఉండాలి. మీరు డిగ్రీలో చదివిన లైఫ్ సైన్సెస్ సబ్జెక్టుతోపాటు మెడికల్ కోడింగ్ శిక్షణతో మెడికల్ కోడింగ్ రంగంలో ప్రవేశించడానికి అర్హత లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ అదనపు అర్హత అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఈ అదనపు విద్యార్హత ఉద్యోగం పొందడంలో ప్రతిబంధకం కూడా అవ్వొచ్చు.
మెడికల్ కోడింగ్ కోర్సులో వైద్య రికార్డులను జాగ్రత్తగా చదివి సరైన కోడ్స్ ఇవ్వడం, వివిధ వ్యాధుల చికిత్సా విధానాలు, మానవ శరీరం పనితీరు, డేటాను సరిగా విశ్లేషించి కావాల్సిన సమాచారాన్ని అందించడం ఉంటాయి. ఫండమెంటల్స్ ఆఫ్ మెడికల్ టెర్మినాలజీ, అనాటమీ స్ట్రక్చర్, కాంప్రహెన్సివ్ మెడికల్ టెర్మినాలజీ, మెడికల్ ఎథిక్స్, కోడింగ్ మాన్యువల్స్పై పూర్తి అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణ పూర్తయ్యాక మెడికల్ కోడర్గా, మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్గా, మెడికల్ రికార్డ్స్ కోఆర్డినేటర్గా, కోడింగ్ స్పెషలిస్ట్గా, కోడింగ్ ఎడ్యుకేటర్గా, కోడింగ్ ఆడిటర్గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదివినవారికి డ్రగ్ అండ్ ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ సంస్థలు, బయోటెక్ కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, బయో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, వ్యవసాయ రంగం, క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ సంస్థలు, బోధన - పరిశోధనా రంగాల్లో ఉద్యోగాలుంటాయి. మీరు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మెడికల్ కోడింగ్లను రెండింటినీ కలిపి కానీ, విడివిడిగా ఉపయోగించుకొని కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎల్.సమ్మయ్య నాయక్
Ans:
సాధారణంగా ఏదైనా యూనివర్సిటీలో ఒక కోర్సులో చేరినప్పుడు ఆ కోర్సు పూర్తిచేయడానికి కనిష్ఠ, గరిష్ఠ కాల పరిమితులు ఆ సంస్థ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించివుంటాయి. ఉదాహరణకు ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం లాంటి పీజీ కోర్సులను కనిష్టంగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఇక గరిష్ఠ వ్యవధి విషయానికొస్తే- ఒక్కో యూనివర్సిటీ ఒక్కో కాల పరిమితిని నిర్ణయిస్తోంది. చాలా యూనివర్సిటీలు పీజీ కోర్సుకు గరిష్ఠ పరిమితిని నాలుగు సంవత్సరాలుగా, కొన్ని యూనివర్సిటీలు మాత్రం ఐదు సంవత్సరాలుగా నిర్ణయించాయి.
మీ విషయానికొస్తే- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యలో రెండు సంవత్సరాల పీజీ కోర్సును గరిష్ఠంగా ఐదు సంవత్సరాల్లో పూర్తిచేయాలి. మీరు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 2007లో చేరారు కాబట్టి, 2012లోగా కోర్సును పూర్తి చేసి ఉండవలసింది. చాలా యూనివర్సిటీలు కోర్సులో చేరిన సంవత్సరంతో సంబంధం లేకుండా మానవతా దృక్పథంతో బ్యాక్లాగ్ పేపర్లను రాయడానికి అప్పుడప్పుడూ ఒకే ఒక్క అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ అవకాశం కోసం వేచి చూడండి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం విద్యార్థి వ్యక్తిగత దరఖాస్తును ఆధారం చేసుకొని, సహేతుకమైన కారణాలుంటే ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. మీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం సంచాలకులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: మనోహర్బాబు
Ans:
జర్నలిజం కోర్సు విదేశాల్లో చాలా యూనివర్సిటీల్లో ఉంది. వీటిలో యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్- ఆస్టిన్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ - మాడిసన్, మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ ముఖ్యమైనవి. ఇవే కాకుండా- ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, హాంకాంగ్ల్లో కూడా ప్రముఖ విశ్వవిద్యాలయాలు జర్నలిజం కోర్సును అందిస్తున్నాయి. ఉద్యోగావకాశాల విషయానికొస్తే జర్నలిజం చదివినవారు జర్నలిస్ట్, కంటెంట్ క్రియేటర్, రేడియో జాకీ, పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషనల్, కాలమిస్ట్, ఎడిటర్, క్రిటిక్, కాపీ రైటర్, ఫిల్మ్ మేకర్..ఇలాంటి హోదాల్లో ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు. ఇవే కాకుండా బోధన, అడ్వర్టైజింగ్, బ్రాడ్ కాస్టింగ్ అండ్ ప్రొడక్షన్ రంగాల్లోనూ వివిధ రకాలైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్