Asked By: Anitha
Ans:
Click on the following link and go through the stories, you will get the required information.
https://pratibha.eenadu.net/admissions/index/icet/telangana/2-2-19-410
Asked By: బీవీడీ రమణమూర్తి, విశాఖపట్నం
Ans:
ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సుని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో అతితక్కువ యూనివర్సిటీలు మాత్రమే అందిస్తున్నాయి. సాధారణంగా ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేయాలంటే, డిగ్రీలో స్టాటిస్టిక్స్ చదివి ఉండాలన్న నిబంధన అమల్లో ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ విభాగంలో మాత్రం ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేయాలంటే డిగ్రీలో మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. కాబట్టి, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొ. జి. రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సుని ప్రైవేటుగా చేయొచ్చు. భవిష్యత్తులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 పూర్తి స్థాయిలోకి అమల్లోకి వచ్చాక మరిన్ని యూనివర్సిటీలు యూజీ/పీజీ కోర్సుల ప్రవేశాలకు విద్యార్హతలను మరింతగా సడలించే అవకాశం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: డి.సతీష్
Ans:
ఎంబీఎ మార్కెటింగ్ చేశాక మార్కెటింగ్ రంగంలో ఉద్యోగం పొందాలంటే డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, బ్రాండింగ్, అడ్వర్ట్టైజింగ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్, కస్టమర్ సెంట్రిక్ మార్కెటింగ్, డేటా మైనింగ్, మార్కెటింగ్ అనలిటిక్స్, వెబ్ అనలిటిక్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ రీసెర్చ్ లాంటి కోర్సుల్లో మీకు ఆసక్తి ఉన్నవి చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగుపర్చుకోవచ్చు. సాధారణంగా ఎంబీఏ మంచి కళాశాలలో చేస్తే క్యాంపస్ రిక్రూట్మెంట్లోనే ఉద్యోగం వస్తుంది. అలా రానిపక్షంలో, పైన చెప్పిన కోర్సుల్లో కనీసం రెండు చేసే ప్రయత్నం చేయండి. వీటిని ఐఐఎం, మైకా లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి చేస్తే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. అవకాశం ఉంటే, ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నించండి. మీ పనితీరు నచ్చితే, అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: తేజస్వి
Ans:
- ఎంబీఏ తర్వాతŸ పీహెచ్డీ చేయాలనే ఆలోచన అభినందనీయం. కానీ, ఎంబీఏ, పీహెచ్డీలు అత్యుత్తమ విద్యాసంస్థల్లో చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతర్జాతీయ ర్యాంకుల్లో మెరుగైన స్థానంలో ఉన్న మేనేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ చేసినవారు విదేశాల్లో నేరుగా పీహెచ్డీ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎంబీఏ చదివిన కళాశాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లేనట్లయితే, విదేశాల్లో మరో పీజీ చేసి, పీహెచ్డీ చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో పీజీ... ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి, మీరు ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేసి, ఆర్థికంగా స్థిరపడ్డాక విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఐరోపా దేశాల్లోని కొన్ని యూనివర్సిటీలు మాత్రం మన పీజీతో కూడా పీహెచ్డీ చేసే అవకాశం కల్పిస్తున్నాయి.
సాధారణంగా విదేశాల్లో పీహెచ్డీ చేసేవారికి చాలా ఫెలోషిప్లు అందుబాటులో ఉంటాయి. కొన్ని ఐఐటీలు, ఐఐఎంలు విదేశీ యూనివర్సిటీలతో కలిసి జాయింట్ పీహెచ్డీ చేసే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. అందులో భాగంగా కనీసం రెండు సంవత్సరాలు విదేశీ యూనివర్సిటీలో పరిశోధన చేసుకోవచ్చు. అలా కాకుండా, మనదేశంలోనే ఏదైనా యూనివర్సిటీలో ప్రముఖ ప్రొఫెసర్ పర్యవేక్షణలో కనీసం రెండు నాణ్యమైన పరిశోధన పత్రాలను అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించి, మంచి పరిశోధనాంశంతో విదేశాల్లో పీహెచ్డీకి దరఖాస్తు చేసినట్లయితే మరో పీజీ చేయకుండానే, పూర్తి ఫెలోషిప్తో పరిశోధన చేయవచ్చు. ఎంబీఏ తరువాత మీరు ఇక్కడే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం యూజీసీ నిర్వహించే నెట్ పరీక్షలో ఉత్తీర్ణత అవసరం. ప్రైవేటు రంగానికొస్తే- ఎంబీఏలో మీ స్పెషలైజేషన్కు అనుగుణమైన కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సురేష్
Ans:
బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులను రెగ్యులర్గానే చదవాలి. ఒకవేళ రెగ్యులర్గా చదవడం కుదరకపోతే ఆన్లైన్లో చదివే ప్రయత్నం చేయండి. డిస్టెన్స్ మోడ్లో సర్టిఫికెట్/డిప్లొమా కోర్సుకు బదులు, ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సుల నాణ్యత- వాటిని అందించే సంస్థల విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అందించే సర్టిఫికెట్లకు మార్కెట్లో ఎక్కువ గుర్తింపు ఉంటుంది. జనరల్ బిజినెస్ మేనేజ్మెంట్లో కంటే, ఏదైనా స్పెషలైజేషన్ లో సర్టిఫికెట్/డిప్లొమా కోర్సు చేస్తే ఎక్కువ ఉపయోగకరం.
మీరు సేల్స్ విభాగంలో పనిచేస్తున్నారు కాబట్టి, సేల్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్ట్టైజింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, బ్రాండింగ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ్స మేనేజ్మెంట్, రీటెయిలింగ్, ఈ-కామర్స్, సర్వీసెస్ మార్కెటింగ్ లాంటి కోర్సులు చేసినట్లయితే మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ అనుభవం, ఉద్యోగ మెలకువలతో పాటు మెరుగైన విద్యాసంస్థ నుంచి పొందే సర్టిఫికెట్ సహాయంతో, మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కరియర్ కౌన్సెలర్
Asked By: ఎ. సాయిపవన్
Ans:
మీరు బీఎస్సీ చదివేప్పుడే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో పనిచేయాలని ఆలోచించడం అభినందనీయం. బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీలు రెండూ పరిశోధనకు బాగా అవకాశమున్న రంగాలే. లైఫ్ సైన్సెస్లో ముఖ్యమైన విభాగాలే. రెండు కోర్సుల్లో చదివే సిలబస్లో సారూప్యం ఉంటుంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో రెండు నుంచి మూడు సెమిస్టర్లు.. ఈ రెండు కోర్సులవారు ఒకే తరగతి గదిలో కలిసే చదువుతారు. ఈ రెండు విభాగాల్లో పరిశోధనాంశాలు కూడా చాలావరకు ఒకేలా ఉంటాయి. మీకు అమితాసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని, ప్రాథ]మికాంశాలు, అప్లికేషన్స్ బాగా నేర్చుకొని మేలైన పరిశోధనలు చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: మురళీ కిరణ్
Ans:
ఎమ్మెస్సీలో కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ, మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ల్లో ఏ కోర్సు చదివినా కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మాత్రమే అర్హత పొందుతారు. ఈ రెండు కోర్సులూ విభిన్నమైనవీ, ప్రత్యేకమైనవీ. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారు అనే విషయాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. పరిశోధన, బోధన రంగాల్లో ఆసక్తి, విదేశాల్లో స్థిరపడాలన్న అభిలాష లాంటివీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. ఏ యూనివర్సిటీల్లో చదవాలనుకొంటున్నారో, ఆ వర్సిటీల సిలబస్ను గమనించి ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోండి.
కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ అప్లైడ్ సైన్స్ కోర్సు అయితే మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ అనేది కొంతవరకు బేసిక్ సైన్స్ అని చెప్పవచ్చు. రెండు కోర్సుల్లోనూ పరిశోధనకు విస్తృత అవకాశాలున్నాయి. రెండు కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: - ఎం.సునీత
Ans:
మీటీయొరాలజీ కోర్సులో వాతావరణ పరిశీలనల రికార్డింగ్, వాతావరణ డేటాను విశ్లేషించడం, వాతావరణ వ్యవస్థల అంచనాకు కావాల్సిన సాంకేతికత పరికరాలపై శిక్షణ అందిస్తారు. వీటితో పాటుగా ఉష్ణమండల తుపానులు, పట్టణ వరదలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు, కరువు, భూకంపాలు, వేడి తరంగాలు, చల్లని తరంగాలు, రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్), వాతావరణ రాడార్లు, వాతావరణ ఉపగ్రహాల ప్రత్యేకత, రోజువారీ వాతావరణ మార్పులు, భూతాప ప్రభావాల గురించీ నేర్చు కొంటారు. మీరు డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్ చదివారు కాబట్టి మీటీయొరాలజీ కోర్సులో పీజీ/ డిప్లొమా చదవడానికి అర్హులే.
వాతావరణ శాస్త్రం లాంటి ప్రొఫెషనల్ కోర్సులను దూరవిద్యలో కాకుండా రెగ్యులర్గా చదవడమే మంచిది. డిప్లొమా కంటే పీజీ చదివితే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. మీటీయొరాలజీలో పీజీ కోర్సు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్ర యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ, బెర్హాంపుర్ లాంటిచోట్ల అందుబాటులో ఉంది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. ఎమ్మెస్సీ చదివారు కాబట్టి గేట్ రాసి ఎంటెక్ కోర్సు చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీటీయొరాలజీలో ఎంటెక్ కోర్సు ఐఐఎస్సీ బెంగళూర్, ఐఐటీ దిల్లీ, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ భువనేశ్వర్, సావిత్రిబాయి ఫూలే పుణె వర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీలాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో అందుబాటులో ఉంది. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎ. సాయి పవన్
Ans:
సాధారణంగా ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ చదవడానికి డిగ్రీలో అగ్రికల్చర్/ హార్టికల్చర్/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ/ సెరికల్చర్ లాంటి సబ్జెక్టులు చదివివుండాలి. మీరు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీలతో డిగ్రీ చదివారు కాబట్టి, చాలా యూనివర్సిటీల్లో ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ చదవడానికి మీరు అర్హులు కారు. కానీ జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలో ప్రవేశానికి రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ వారు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్- బయోటెక్నాలజీ (GAT-B) పరీక్ష రాయవలసి ఉంటుంది. రామకృష్ణ మిషన్ వివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల్లో కూడా అగ్రికల్చర్ బయోటెక్నాలజీ పీజీకి అర్హత ఉంది. ఎంఎస్సీ అగ్రికల్చర్ మైక్రోబయాలజీ చదవాలంటే డిగ్రీలో అగ్రికల్చర్/ హార్టికల్చర్/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ/ సెరికల్చర్, డైరీ సైన్సెస్/ బీవీఎస్సీ/ హోమ్ సైన్స్ లాంటివి చదివివుండాలి. అందుకని మీరు ఎంఎస్సీ అగ్రికల్చర్ మైక్రోబయాలజీ చదవలేరు.
ఎంఎస్సీ ప్లాంట్ బయోటెక్నాలజీ చదవడానికి మీరు అర్హులే. ఈ కోర్సు ఎంజీఎం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లతో పాటు కొద్ది ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉంది. మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవాలంటే ఎంఎస్సీ బయోటెక్నాలజీ కోర్సు ఎంచుకోండి. ఎంఎస్సీ సీడ్ సైన్స్ టెక్నాలజీ చదవాలంటే డిగ్రీలో అగ్రికల్చర్ సంబంధిత కోర్సులు చదివివుండాలి. బీఎస్సీ అర్హతతో కొన్ని ప్రైవేటువర్సిటీల్లో మాత్రమే ఈ కోర్సును చదివే అవకాశం ఉంది. ఆయా విద్యాసంస్థల్లో చేరేముందు, ఆ సంస్థల విశ్వనీయతను తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఆర్. కీర్తి
Ans:
ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) చదివినవారికి ప్రైవేటు ఫార్మా, ఫర్టిలైజర్, ఆగ్రో కెమికల్, ఆయిల్, గ్యాస్, బయోటెక్నాలజీ లాంటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇస్రో, డీఆర్డీఓ, ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఆయిల్ ఇండియా లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రయోగశాలల్లో, కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని కెమిస్ట్రీ ప్రయోగశాలల్లో చేరవచ్చు. సైంటిస్ట్, సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, రిసెర్చ్ అసిస్టెంట్గా విధులు నిర్వహించవచ్చు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. బోధనరంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్గా, టీజీటీగా, పీజీటీగా పాఠశాలల్లో ఉద్యోగాలు దొరుకుతాయి. ఇవే కాకుండా జూనియర్ కళాశాలల్లో కెమిస్ట్రీ లెక్చరర్గా స్థిరపడవచ్చు. నెట్/సెట్లో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ సహాయ ఆచార్యులుగా ఉద్యోగం లభిస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసి విద్యాసంస్థల్లో సహాయ ఆచార్యులుగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీకు పరిశోధనలపై ఎక్కువ ఆసక్తి ఉంటే విదేశాల్లో పోస్ట్ డాక్టొరల్ పరిశోధన కోసం కూడా ప్రయత్నించవచ్చు. ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్ర్టీ) తరువాత గేట్ రాసి ఐఐటీ, ఎన్ఐటీల్లో ఎంటెక్ చేసి ఇంజినీరింగ్ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు.