Post your question

 

    Asked By: వంశీకృష్ణ

    Ans:

    సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించేముందు మీరు కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలైన ఆపరేటింగ్‌ సిస్టమ్, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, కోడింగ్‌లతో పాటు ఎంఎస్‌ ఆఫీస్‌పై పట్టు సాధించాలి. బీకాం చదివినవారు సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించాలంటే చాలా రకాల కోర్సులు చదివే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా- బిజినెస్‌ అనలిటిక్స్, డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఎస్‌క్యూఎల్‌ డీబీఏ, సిక్స్‌ సిగ్మా, డిజిటల్‌ మార్కెటింగ్, వెబ్‌ డిజైనింగ్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, గ్రాఫిక్‌ డిజైన్, హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌ వర్కింగ్, వీఎఫ్‌ఎక్స్‌ అండ్‌ యానిమేషన్, ఐఓఎస్‌ డెవలప్‌మెంట్, ఎస్‌ఏపీ, ఈఆర్‌పీ లాంటి వాటికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు వివిధ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ కూడా నేర్చుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పైన పేర్కొన్నవాటిల్లో నచ్చిన కోర్సు ఎంచుకని, కనీసం ఒక సంవత్సరం పాటు కృషి చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎస్‌.రవిశంకర్‌

    Ans:

    మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలో మీరు ఆపరేషన్స్‌ ఇంజనీర్‌గా పనిచేసిన కాలంలో మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ లాంటి వివిధ అంశాలపై అవగాహన పొంది ఉంటారు. ఇప్పుడు మీరు సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌సీఎం) రంగంలోకి వెళ్లాలనుకోవడం సరైన నిర్ణయమే. ఎస్‌సీఎంకు సంబంధించిన ప్రొక్యూర్‌మెంట్, వేర్‌ హౌసింగ్, రవాణా, పంపిణీ లాంటి వివిధ విభాగాలతో మీరు పరోక్షంగా పనిచేస్తూనే ఉండివుంటారు. ఈ రంగాలతో ఉన్న పరిచయం, ప్రావీణ్యం మీరు మెరుగైన సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌గా రూపుదిద్దుకోవడానికి    తోడ్పడతాయి. 
    సర్టిఫికేషన్‌ కోర్సుల విషయానికొస్తే- ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎంఐటీ, మిషిగన్‌ యూనివర్సిటీలు సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌లో వివిధ కోర్సులు అందిస్తున్నాయి. అమెరికన్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఇన్వెంటరీ కంట్రోల్‌ సొసైటీ (ఏపీఐసీఎస్‌).. సర్టిఫైడ్‌ సప్లై చైన్‌ ప్రొఫెషనల్‌ (సీఎస్‌సీపీ) కోర్సునూ, అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌.. సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ (సీపీఎల్‌ఎస్‌)నూ, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌.. సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ (సీపీఎస్‌ఎం)నూ అందిస్తున్నాయి. వీటితో పాటు కోర్స్‌ ఎరా, ఎడెక్స్, యుడెమీ, ఎన్‌పీటెల్,  స్వయం లాంటి ఆన్‌లైన్‌ అభ్యాస వేదికల్లో కూడా ఈ కోర్సులు చేసే అవకాశం ఉంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎల్‌.సంతోష్‌

    Ans:

    ఫిజియోథెరపీ ప్రోగ్రాంలో ఎప్పుడు చేరారు? హాజరు శాతం ఎంత ఉంది? మొదటి సెమిస్టర్‌ పరీక్షలు రాశారా? రాస్తే ఎన్నింటిలో ఉత్తీర్ణత సాధించారు? రెండో సెమిస్టర్‌ కు ప్రమోట్‌ అయ్యారా? ఏ కారణంతో కోర్సును వదిలివేయాల్సి వచ్చింది? ఇలాంటి సమాచారం లేకుండా మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. సాధారణంగా, ఏదైనా రెగ్యులర్‌ డిగ్రీ మధ్యలో వదిలేస్తే, తగిన కారణాలు చూపించి అదే కళాశాలలో రీ అడ్మిషన్‌ తీసుకోవాలి. ఆ తరువాత అదే యూనివర్సిటీ పరిధిలో, మీరు చేరాలనుకొంటున్న కాలేజీలో ఏవైనా సీట్లు ఖాళీగా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి.  మీరు ప్రస్తుతం చదువుతున్న కళాశాల, చదవబోయే కళాశాల ప్రిన్సిపల్‌లు ఇద్దరూ అనుమతిస్తే, సంబంధిత యూనివర్సిటీ నియమాలకు  లోబడి మిమ్మల్ని బదిలీ చేసే విషయంలో యూనివర్సిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ముందుగా మీరు మీ యూనివర్సిటీకి వెళ్లి సంబంధిత అధికారులను సంప్రదించి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: బి.రాము

    Ans:

    ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నియంత్రిస్తుంది. బీపీఈడీని దూరవిద్య  ద్వారా అందించడానికి ఎన్‌సీటీఈ నిబంధనలు అనుమతించవు. అందువల్ల మనదేశంలో ఏ యూనివర్సిటీ కూడా బీపీఈడీని దూరవిద్య ద్వారా అందించడం లేదు. మీకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ అవ్వాలన్న కోరిక బలంగా ఉంటే.. ప్రస్తుతం చేస్తున్న కేంద్రప్రభుత్వ ఉద్యోగానికి రెండు సంవత్సరాలు సెలవు పెట్టి, బీపీఈడీని రెగ్యులర్‌ విధానంలో చదవండి.
    బీఈడీ, బీపీఈడీ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, జర్నలిజం, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గా చదివితేనే వృత్తి నైపుణ్యాలు పెరుగుతాయి. మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇక ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ అర్హతల విషయానికొస్తే- ఏదైనా డిగ్రీ చదివాక, బీపీఈడీ శిక్షణ పొంది, టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టులో మంచి ప్రతిభ కనబర్చాలి. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ అవ్వాలంటే.. వీటన్నింటి కంటే ముందు క్రీడల పట్ల విపరీతమైన ఇష్టంతో పాటు పిల్లలకు క్రీడలు నేర్పడంలో ఆసక్తి ఉండటం చాలా ముఖ్యం.
    - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ. మహేష్‌ చంద్ర

    Ans:

    మీరు ఒకే సమయంలో పీజీ, బీఈడీ చేస్తున్నాను అన్నారు. యూజీసీ 2022 నిబంధనల ప్రకారం రెండు పీజీలూ, రెండు డిగ్రీలూ ఏకకాలంలో చేయవచ్చు. అందులో ఒకటి రెగ్యులర్‌గా అయితే, మరొకటి డిస్టెన్స్‌/ ఓపెన్‌/ ఆన్‌లైన్‌ పద్ధతిలో చేయవచ్చు. డిగ్రీ, పీజీలు యూజీసీ పరిధిలో ఉంటాయి కాబట్టి రెండు పీజీలూ, రెండు డిగ్రీలూ ఒకేసారి చేయడంలో ఇబ్బంది లేదు. కానీ ఒక డిగ్రీ యూజీసీకి సంబంధించి, మరొకటి ఏదైనా రెగ్యులేటరీ సంస్థ పరిధిలో ఉన్న డిగ్రీ అయితే, ఆ రెండు డిగ్రీలూ చెల్లుబాటు అవుతాయా అనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు.
    ఉదాహరణకు ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థి, ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి బి.ఎ. చదివే అవకాశం ఉందా? ఎల్‌ఎల్‌బీ చదివే విద్యార్థి అదేసమయంలో ఎంబీఏ కూడా చదవొచ్చా? ఇలాంటి సందేహాలు చాలామందిని వేధిస్తున్నాయి. మీ విషయానికొస్తే- ఎంఏ (తెలుగు) యూజీసీ పరిధిలో ఉంటే, బీఈడీ ప్రోగ్రాం ఎన్‌సీటీఈ పరిధిలో ఉంది. కానీ, ఇటీవల కొన్ని యూనివర్సిటీలు ఏఐసీటీఈ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్‌ కోర్సుతో పాటు యూజీసీ పరిధిలో ఉన్న బీబీఏ (ఈ సంవత్సరం నుంచి బీబీఏ కూడా ఏఐసీటీఈ పరిధిలోకి వచ్చింది)లను కలిపి ఒకే సమయంలో చదివే వెసులుబాటు కల్పించారు. ఈ విషయాల్లో స్పష్టత వచ్చేలోగా అవకాశం ఉంటే, బీఈడీ పూర్తిచేశాక మరో యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు మరోసారి చదివే ప్రయత్నం చేయండి. టెట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం డీఈడీ…/ బీఈడీ చివరి సంవత్సరం చదివేవారు టెట్‌ రాయడానికి అర్హులు. మీరు టెట్‌ క్వాలిఫై అయింది బీఈడీ మొదటి సంవత్సరంలోనా, రెండో సంవత్సరంలోనా అనేది చెప్పలేదు. ఏదైనా కోర్సులో చేరేముందు ఆ కోర్సుతో లభించే ఉద్యోగ నోటిఫికేషన్లను పరిశీలించి, అందులో ఉన్న అర్హతలను బట్టి మీ కెరియర్‌ నిర్ణయాలను తీసుకోండి. చివరిగా- యూజీసీ రెండు కోర్సులు ఏకకాలంలో చేసే వెసులుబాటు కల్పించినా, ప్రొఫెషనల్‌ కోర్సులతో పాటు మరొక కోర్సు చదవకపోవడం వల్ల ప్రొఫెషనల్‌ కోర్సుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఆ రంగంలో బాగా రాణించే అవకాశం ఉంది. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: షేక్‌ మెహరజ్‌

    Ans:

    మీకు బీకాం డిగ్రీ, సీఏ ఇంటర్‌తో పాటు, అకౌంటెంట్‌గా పది సంవత్సరాల వృత్తి అనుభవం ఉంది. ఈ అర్హతతో ఐటీ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం పొందడం కష్టం కాకపోవచ్చు. ఐటీ కంపెనీలో అకౌంటెంట్‌ ఉద్యోగం చేయాలంటే- ఎంఎస్‌ ఎక్సెల్‌పై మంచి పట్టుతో పాటు, ట్యాలీ లాంటి అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మెరుగ్గా వాడగలిగే సామర్థ్యం ఉండాలి. సాధారణంగా ఐటీ కంపెనీల్లో అకౌంటింగ్‌ విభాగంలో ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్, ఈఆర్‌పీ లాంటి సాఫ్ట్‌వేర్లను వాడుతూ ఉంటారు. మీరు ఐటీ రంగంలో అకౌంటెంట్‌గా రాణించాలంటే పే సర్టిఫికేషన్, కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్, ఎంఐఎస్, డీబీఎంఎస్‌ లాంటి సర్టిఫికెట్‌ కోర్సులతో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కూడా అవసరం. అవకాశం ఉంటే ఎంకాం (కంప్యూటర్స్‌) కోర్సును ఆన్‌లైన్‌/ దూరవిద్య ద్వారా చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: డి.సుజాత

    Ans:

    మీకు కోడింగ్‌ అంటే ఇష్టం లేదు కాబట్టి, సాప్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం పొందడం కష్టం. మీ వయసు ప్రకారం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేదు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగాలకు గరిష్ఠ వయసు తెలంగాణలో 44 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 42 సంవత్సరాలుగా ఉంది. సామాజిక రిజర్వేషన్లు ఉన్నవారికి మరో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు పది సంవత్సరాల వెసులుబాటు ఉంటుంది.
    ముందుగా మీకు కెరియర్‌లో విజయం పొందడం అనే విషయంపై స్పష్టత అవసరం. సాధారణంగా కెరియర్‌ నిర్ణయాలు వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి, విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, వయసు, విషయ పరిజ్ఞానం, భావప్రకటన సామర్థ్యం, కుటుంబ సహకారం, ఆర్థిక స్థోమత లాంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. మీ దృష్టిలో కెరియర్‌ అంటే ఉద్యోగమా? వ్యాపారమా? సామాజిక సేవా? దీనిపై స్పష్టత తెచ్చుకోండి. ఒకవేళ ఉద్యోగం అయితే, ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటుదా? ఈ వయసులో మీరు పోటీ పరీక్షలు రాయాలంటే, మీకంటే కనీసం 15 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న అభ్యర్థులతో పోటీ పడాల్సిఉంటుంది. ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి  కావాలి. మీరు ప్రస్తుతం నివసిస్తున్న ఊళ్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని, వాటిలో మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోండి. ఆ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీకు ఆసక్తి ఉంటే, సైకాలజీలో పీజీ చేయండి. ఆపై కౌన్సెలింగ్‌లో డిప్లొమా చేసి, కౌన్సెలర్‌గా స్థిరపడొచ్చు. తక్కువ పెట్టుబడితో బేబీ కేర్‌ సెంటర్‌ కూడా ప్రారంభించవచ్చు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి ఉంటే ఎంచుకున్న కెరియర్‌లో వయసుతో సంబంధం లేకుండా రాణించవచ్చు. 
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: శివకుమార్‌

    Ans:

    సాధారణంగా బీఈడీ ప్రోగ్రాం వ్యవధి రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మీరు బీఈడీ మూడో సంవత్సరం చదువుతున్నానన్నారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌/ బీఏఎడ్‌ ప్రోగ్రాం చదువుతున్నారని అనుకుంటున్నాం. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఎంఈడీ కోర్సును దూరవిద్యా విధానంలో అందించకూడదు. ఒకవేళ ఎవరైనా, అలా అందించే ప్రయత్నం చేస్తే ఆ ప్రోగ్రాంకు ఎన్‌సీటీఈ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోండి. మీకు టీచర్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలల్లో బోధించే ఆసక్తి ఉంటే, ఎంఈడీకి సమానమైన ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివే ప్రయత్నం చేయండి. ఇగ్నో సంస్థలో ఎంఏ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. ప్రొఫెషనల్‌ కోర్సులను దూరవిద్య ద్వారా కాకుండా.. రెగ్యులర్‌గా చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కరుణ

    Ans:

    ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం.. మేనేజ్‌మెంట్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అవ్వాలంటే- ఎంబీఏలో 60 శాతం మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతో పాటు రెండు సంవత్సరాల వృత్తి అనుభవం ఉండాలి. కానీ బోధన రంగంలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల చాలా యూనివర్సిటీలు/ బిజినెస్‌ స్కూల్స్‌ పీహెచ్‌డీ ఉన్నవారినే మేనేజ్‌మెంట్‌ విభాగంలో అధ్యాపకులుగా నియమిస్తున్నాయి. పీహెచ్‌డీతో పాటు అత్యుత్తమ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురించినవారికీ, జాతీయ/ అంతర్జాతీయ సమావేశాల్లో పరిశోధన పత్రాలు సమర్పించిన వారికీ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టులో యూజీసీ-నెట్‌లో ఉత్తీర్ణత సాధించడం అదనపు అర్హత అవుతుంది. కానీ, చాలా ప్రైవేటు కళాశాలలు ఎంబీఏ విద్యార్హతతోనే బీబీఏ/ ఎంబీఏలో బోధించే అవకాశాలు కల్పిస్తున్నాయి.
    మీకు బోధన రంగంలో స్థిరపడాలన్న ఆలోచన బలంగా ఉంటే.. ముందుగా ఏదైనా యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఫుల్‌ టైమ్‌ పీహెచ్‌డీ చేసి, బిజినెస్‌ స్కూల్‌/ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ప్రయత్నించండి. ఫుల్‌ టైమ్‌ పీహెచ్‌డీ చేసే అవకాశం లేకపోతే.. ఏదైనా ఎంబీఏ/ బీబీఏ కళాశాలలో లెక్చరర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరండి. పార్ట్‌ టైం పీహెచ్‌డీ పూర్తి చేసి మెరుగైన విద్యాసంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


     

    Asked By: కరీమున్నీసా

    Ans:

    మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదువుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో సోషియాలజీ/ సోషల్‌ వర్క్‌ చదివినవారికి సోషల్‌ వర్క్‌లో పీజీ చేయడానికి ప్రాధాన్యం ఉంటుంది. డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినప్పటికీ మీకు సోషల్‌ వర్క్‌ సబ్జెక్టుపై ఆసక్తి ఉంటే, పీజీ సోషల్‌ వర్క్‌లో ప్రవేశం పొందవచ్చు. సోషల్‌ వర్క్‌ చేసినవారికి ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి. ఈ కోర్సులో పీజీ చేసినవారు ప్రైవేటు రంగంలో సోషల్‌ వర్కర్, ఫ్యామిలీ కౌన్సెలర్, హాస్పిటల్‌ కౌన్సెలర్, డీ అడిక్షన్‌ కౌన్సెలర్‌గా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే,  కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి.
    పీజీలో ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదవాలంటే, ముందుగా ఎంఏ/ ఎమ్మెస్సీ సైకాలజీలో ప్రవేశం పొంది, ఇండస్ట్రియల్‌ సైకాలజీని ఒక స్పెషలైజేషన్‌గా చదవాలి. చాలా యూనివర్సిటీల్లో పీజీలో సైకాలజీ చదవాలంటే, డిగ్రీలో సైకాలజీ కచ్చితంగా చదివి ఉండాలి. కొన్ని యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలో సైకాలజీ చదవకపోయినా పీజీ సైకాలజీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదివినవారికి ప్రైౖవేటు రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విద్యార్హతతో హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆర్గనైజేషనల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్, టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్, బిహేవియర్‌ అనలిస్ట్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ ప్రాక్టీస్‌ మేనేజర్, ఎంప్లాయీ రిలేషన్‌షిప్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ కోచ్, ఇండస్ట్రియల్‌ సైకలాజికల్‌ కౌన్సెలర్, కన్సల్టెంట్, రిసెర్చ్‌ అనలిస్ట్‌ లాంటి కొలువులకు అర్హత ఉంటుంది. ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదివినవారికి ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో అతి తక్కువ ఉద్యోగాలే అందుబాటులో ఉన్నాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌