Asked By: బి.మణికంఠ మహారాజ్
Ans:
ఆప్టోమెట్రీలో డిప్లొమా చేసినవారికి భారతీ విద్యాపీఠ్- పుణె, డీ.. వై పాటిల్ యూనివర్సిటీ- పుణెల్లో, బీఎస్సీ ఆప్టోమెట్రీలో లేటరల్ ఎంట్రీ ఉంది. ఇంటర్మీడియట్/ ఆప్టోమెట్రీ డిప్లొమా విద్యార్హతతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో నాలుగేళ్ల తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీతో బయటికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్తోపాటు హైదరాబాద్లో మరో రెండు ప్రైవేటు యూనివర్సిటీలు ఆప్టోమెట్రీలో డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సు చదివినవారికి ప్రభుత్వ రంగంతో పోలిస్తే, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో, వైద్య కళాశాలల్లో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే ఆప్టోమెట్రీలో పీజీ/ పీహెచ్డీతో బోధన, పరిశోధన రంగాల్లో స్థిరపడవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: డేవిడ్
Ans:
ఫిజియోథెరపీ కోర్సు చదవాలంటే మీరు ముందుగా ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తరువాత ఈ కోర్సు నోటిఫికేషన్ వచ్చాక దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్మీడియట్లో పొందిన మార్కుల ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. మంచి బోధన ఉన్న కళాశాలను ఎంచుకొని, కోర్సును బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలి. ఆపై స్పోర్ట్స్ స్పెషలైజేషన్తో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు చేయాలి. నిమ్స్లో ఫిజియోథెరపీ కోర్సులకు ఆ సంస్థ నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్ష రాయాలి.
స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ - ఒడిశా, ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్- ముంబై లాంటి జాతీయ విద్యాసంస్థల్లో ఫిజియో థెరపీలో యూజీ/ పీజీ కోర్సు చదవాలంటే, ఆ సంస్థలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనపర్చాలి. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీలో స్పోర్ట్స్ స్పెషలైజేషన్ పూర్తిచేసి ఏదైనా స్పోర్ట్స్ సెంటర్లో ఫిజియోథెరపిస్ట్గా కొంతకాలం పనిచేసి, మంచి నైపుణ్యాలు పొందితే.. మీరే సొంతంగా ఫిజియోథెరపీ కేంద్రం స్థాపించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వంశీ
Ans:
ఇంటర్మీడియట్ పాసైనవారికి ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఆర్మీ, నేవీ, పోస్టల్ విభాగం, రైల్వేస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లలో ఉద్యోగావకాశాలుంటాయి. మీరు స్టెనోగ్రఫీ/ కంప్యూటర్/ ఆఫీస్ మేనేజ్మెంట్లో సర్టిఫికెట్, డిప్లొమా లాంటి కోర్సులు చేసినట్లయితే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సాధారణంగా ఇంటర్మీడియట్ విద్యార్హతతో లోయర్ డివిజనల్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సార్టింగ్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ లోకో పైలట్ లాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వీటి కోసం ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ పరీక్షలు, ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాంటివి రాయవలసి ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: నీరజ
Ans:
సంస్కృత విభాగంలో ఇంటర్మీడియట్ స్థాయిలో బోధించడానికి లెక్చరర్ అవ్వాలంటే ఎంఏలో కనీసం 55% మార్కులు పొందివుండాలి. డిగ్రీ కళాశాల/ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలంటే- అదనంగా సంస్కృతంలో యూజీసీ నెట్/ సెట్ ఉత్తీర్ణత కూడా సాధించాలి. నెట్/ సెట్లో ఉత్తీర్ణత సాధించలేకపోతే, పీహెచ్డీ అయినా చేసి ఉండాలి. యూజీసీ నియమాలు పాటించే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవే నిబంధనల ప్రకారం నియామకాలు చేపడతారు. ఈ మధ్యనే నెట్ పరీక్షలో హిందూ స్టడీస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని రెండు కొత్త సబ్జెక్టులను కూడా చేర్చారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం ఆయా విభాగాలకు సంబంధించిన శాస్త్ర విషయాల్లో పూర్తి పరిజ్ఞానం ఉండాలి. ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్ అవ్వాలంటే.. సంబంధిత పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే రాత పరీక్షలో మెరుగైన ప్రతిభ కనపర్చి, ఆ తర్వాత ఇంటర్వ్యూలోనూ విజయం సాధించటం అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: రవితేజ
Ans:
ఇంజినీరింగ్ అయ్యాక మనదేశంలోనే ఉద్యోగం చేయాలా? విదేశాల్లో ఎంఎస్ చేయాలా? అనే ప్రశ్న చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు నిత్యం ఎదుర్కొనేదే! ముందుగా మీరు విదేశాలకు ఎందుకు వెళ్ళాలనుకొంటున్నారు అనే విషయంపై స్పష్టత అవసరం. చాలామంది మెరుగైన విద్య, ఉపాధి కావాలనో, డబ్బు, విలాసవంతమైన జీవితం కోసమనో, కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడానికో, విదేశాల్లో స్థిరపడాలనే కల నెరవేర్చుకోవడం కోసమనో.. ఇలా వివిధ కారణాలు చెప్తుంటారు. పైన చెప్పినవాటిలో మీరు ఏ కారణంతో విదేశాలకు వెళ్లాలనుకొంటున్నారనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి.
పిల్లల్ని విదేశాలకు పంపడం చాలామంది తల్లిదండ్రులు ఒక హోదాగా భావిస్తున్నారు. విదేశాలకు వెళ్లకుండా మనదేశంలోనే స్థిరపడాలనుకునే చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పే కారణాలు ఇలా ఉంటాయి: విదేశీ(( విద్య ఖర్చుతో కూడుకున్నది, విదేశాల్లో కూడా ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంది, ఇక్కడే ఉండి మన దేశాభివృద్ధికి తోడ్పడాలి, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తోడుగా ఉండాలి, విలాసాలు, సౌకర్యాల విషయంలో మనదేశం కూడా విదేశాలతో పోటీ పడుతోంది, ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు, దూరపు కొండలు నునుపు..ఇలా! ఇవి రెండూ కాకుండా కొంతమంది ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ కొంత అనుభవం గడించి, వెనక్కి వచ్చి భారత్లో స్థిరపడటం కూడా గమనిస్తున్నాం. విదేశాలకు వెళ్ళడం, లేదా ఇక్కడే స్థిరపడటం అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. విదేశీ విద్య కొంత ఆర్థికభారంతో కూడుకొంది కాబట్టి మీరు, మీ కుటుంబ సభ్యులూ కలిసి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అంశమిది.
ప్రస్తుతం మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడం, గేట్లో మెరుగైన ర్యాంకు పొందడం అనేవి... విదేశాల్లో ఎంఎస్ సీటు తెచ్చుకోవడం కంటే కూడా ఎక్కువ కష్టంగా ఉన్నాయి. విదేశాల్లో చదువుతున్న చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో ఉద్యోగాలు పొందడం కష్టంగా ఉంది కాబట్టి కొంతకాలం విదేశీ విద్య ఆలోచనల్ని పక్కనపెట్టడం మంచిదని సలహాలు ఇస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు తగ్గుతున్న ఈ సందర్భాల్లో కూడా చాలామంది విదేశీ విద్యపై మోజు పడుతూనే ఉన్నారు. మీకు ప్రతిభ, విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలుంటే ఎక్కడైనా ఉద్యోగం పొందవచ్చు. డిగ్రీల ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు పొందే రోజులు పోయాయి. మారుతున్న పరిస్థితుల్లో డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం, వ్యక్తిత్వం, భావప్రకటనా సామర్థ్యం, సృజనాత్మకత, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, ప్రోగ్రామింగ్, కోడింగ్, కృత్రిమ మేధపై అవగాహన లాంటివి మంచి ఉద్యోగం పొందడానికి దోహదపడుతున్నాయి.ఇవి దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సాయి సంకీర్తన, హైదరాబాద్
Ans:
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లో మైక్రో బయాలజీతో పాటు ఇతర పీజీ ప్రవేశాలు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)- పీజీ స్కోరు ఆధారంగా జరుగుతాయి. జులై 2024లో విద్యాసంవత్సరం మొదలవుతుంది.
సీయూఈటీ నోటిఫికేషన్ ఇటీవలే వెలువడింది. ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 24 వరకు స్వీకరిస్తారు. పరీక్షలు మార్చి 11 నుంచి 28 వరకు రోజూ 3 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. సీయూఈటీలో సాధించిన స్కోరుతో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లో, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలూ, డీమ్డ్ యూనివర్సిటీలూ, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ చదువుకోవచ్చు.
మైక్రోబయాలజీ పీజీ కోర్సును అందించే దేశంలోని ఇతర ప్రముఖ విద్యాసంస్థలు..
* పాండిచ్చేరి యూనివర్సిటీ
* దిల్లీ యూనివర్సిటీ
* మదురై కామరాజ్ యూనివర్సిటీ
* యూనివర్సిటీ ఆఫ్ కోల్కతా
* ప్రెసిడెన్సీ యూనివర్సిటీ
* అమృత యూనివర్సిటీ
* ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: అశోక్
Ans:
బీఎస్సీ (బీజడ్సీ) చదివినవారు వైద్య/ ఆరోగ్య రంగానికి సంబంధించి పీజీలో బయోకెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్, మాలిక్యులర్ బయాలజీ, లైఫ్ సైన్సెస్, హ్యూమన్ జెనెటిక్స్, బయో థెరప్యూటిక్స్, బయో మాలిక్యులర్ ఫిజిక్స్, జీనోమ్ టెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, సిస్టమ్స్ బయాలజీ, టిష్యూ సైన్స్ లాంటి కోర్సులు చేయవచ్చు. మీకు మేనేజ్మెంట్ రంగంపై ఆసక్తి ఉంటే ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్, హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సుల గురించి ఆలోచించవచ్చు. ఇవేకాకుండా అడ్వాన్స్డ్ కోర్సులైన స్టెమ్ సెల్ టెక్నాలజీ, ట్రాన్స్లేషనల్ ఇమ్యునాలజీ, ట్రాన్స్లేషనల్ న్యూరోసైన్స్, క్లినికల్ వైరాలజీ లాంటి కోర్సులు కూడా చదివే అవకాశం ఉంది. మీ ఆసక్తిని బట్టి ఏది చదవాలో నిర్ణయించుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: జి.హరి
Ans:
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారం ఎల్ఎల్బీ ప్రోగ్రాంను ఈవెనింగ్ కాలేజీ/ దూరవిద్య/ పార్ట్ టైం ద్వారా చదవడం కుదరదు. ఎల్ఎల్బీ డిగ్రీ చదవాలన్న కోరిక బలంగా ఉంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి విరామాన్ని ఇవ్వండి. లాసెట్లో మెరుగైన ర్యాంకు పొంది రెగ్యులర్గానే చదవండి. కొంతమంది ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే రెగ్యులర్గా ఎల్ఎల్బీ చదివే ప్రయత్నం చేస్తున్నారు. అలా పొందిన ఎల్ఎల్బీ డిగ్రీతో ఉపాధి పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: వి.భాను
Ans:
ప్రస్తుతం ఉన్న ఉద్యోగ మార్కెట్లో డిగ్రీతో పాటు అదనంగా పొందిన నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. ఏదైనా డిగ్రీ చదువుతూ, ఆ డిగ్రీకి సంబంధించిన ఇతర కోర్సులు నేర్చుకోవడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదు. ఎంసీఏతో పాటు హ్యాకింగ్లో శిక్షణ పొందడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ఎథికల్ హ్యాకింగ్పై పట్టున్నవారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆ కోర్సులో శిక్షణ పొందినవారికి డిమాండ్ ఉంది. కానీ మీరు రెగ్యులర్గా చదవబోయే ఎంసీఏను అశ్రద్ధ చేయకూడదు. రెండింటినీ సమన్వయం చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అదే సమయంలో హ్యాకింగ్లో మెలకువలను కూడా నేర్చుకొని, అందులో సర్టిఫికేషన్ పొందితే పేరున్న సంస్థలో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం లభిస్తుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: నితీష్ రెడ్డి
Ans:
బీఎస్సీలో మీరు చదువుతున్న మూడు సబ్జెక్టులకూ మంచి భవిష్యత్తు ఉంది. మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవడానికి బయోటెక్నాలజీ, బయో ఫార్మాస్యూటికల్ రిసెర్చ్, ఫుడ్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్సెస్, క్లినికల్ రిసెర్చ్, జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సెల్ బయాలజీ, ఇమ్యునాలజీ, కంప్యుటేషనల్ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, హెల్త్ కేర్, జీనోమిక్స్, పబ్లిక్ హెల్త్, బయో స్టాటిస్టిక్స్, వైరాలజీ, బయో ఎథిక్స్ లాంటి సబ్జెక్టుల్లో సర్టిఫికెట్/ డిప్లొమా/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులు చేయొచ్చు. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే మెడికల్ కోడింగ్ ఉద్యోగాల వృద్ధి రేటు కొంత మెరుగ్గానే ఉండటం వల్ల ఆ రంగంలో అవకాశాలు ఎక్కువ. కానీ కొంతకాలానికి మీరు చేస్తున్న ఉద్యోగంలో వైవిధ్యం లేదని ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మీరు ఏ రంగంలోకి వెళ్ళాలి అనేది పూర్తిగా మీ అభిరుచి, ఆసక్తి, దీర్ఘకాలిక ఆశయాలను పరిగణనలోకి తీసుకుని, సరైన కోర్సును ఎంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్