Post your question

 

    Asked By: సీహెచ్‌. లక్ష్మయ్య

    Ans:

    సాధారణ డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతూ సివిల్స్‌కు సన్నద్ధం కావచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలన్న లక్ష్యం బలంగా ఉంటే ఏ కోర్సులో చేరినప్పటికీ విజయం సాధించవచ్చు. సోషల్‌ సైన్సెస్‌లో డిగ్రీ చేస్తూ సివిల్స్‌కు సన్నద్ధమయితే హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, సోషియాలజీ, ఆంత్రొపాలజీ, రూరల్‌ డెవలప్‌మెంట్ లాంటి సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహన ఉంటుంది. ఆ తరువాత, మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేస్తే, అదే సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకొని సివిల్స్‌ పరీక్ష రాయవచ్చు. సాధారణ డిగ్రీకి  బదులుగా, ఇంజినీరింగ్‌ డిగ్రీ చేస్తే ఎకాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలపై అవగాహన వస్తుంది. ఇంజినీరింగ్‌ కోర్సు చదవడం వల్ల లాజికల్‌ థింకింగ్, అనలిటికల్‌ థింకింగ్, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌ చేసిన చాలామంది అభ్యర్ధులు సివిల్స్‌లో సోషల్‌ సైన్స్, లిటరేచర్‌ సబ్జెక్టులను ఆప్షనల్‌గా తీసుకొంటున్నారు. ఈ రెండు రకాల డిగ్రీలకూ కొన్ని అనుకూలతలూ, ఇబ్బందులూ ఉన్నాయి. ఒకవేళ సివిల్స్‌ సాధించలేకపోతే, సాధారణ డిగ్రీ చదివినవారికంటే, ఇంజినీరింగ్‌ చదివినవారికి వేరే ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది. పత్రికా పఠనంతోపాటు ఎడిటోరియల్‌ పేజీల్లో వచ్చే వ్యాసాలను చదివి సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోండి. . - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి. సతీశ్‌కుమార్‌

    Ans:

    ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు టెక్నికల్‌ సబ్జెక్టులపై పట్టు ఉన్నప్పటికీ, జనరల్‌ స్టడీస్‌ విషయానికొస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే, యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌లో ప్రశ్నల స్థాయి కొంత కఠినంగా ఉంటుంది. కానీ, కనీసం రెండు సంవత్సరాలపాటు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయితే ఉత్తీర్ణత కష్టమేమీ కాదు. చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ చదివే సమయంలో ఈఎస్‌ఈలోని చాలా టాపిక్స్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. ప్రిలిమినరీలో సమయ నిర్వహణ చాలా ముఖ్యం. సిలబస్‌నూ, పాత ప్రశ్నపత్రాలనూ పరిశీలించి, మీ ప్రస్తుత విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసుకొని సన్నద్ధత మొదలుపెట్టండి. ఇక మెయిన్స్‌ ఇంజినీరింగ్‌లో రాసిన పరీక్షలకు పూర్తి విభిన్నం. ముఖ్యంగా ప్రశ్నలు కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్‌లను పరీక్షించేవిధంగా ఉంటాయి. మీరు ఉద్యోగం చేస్తూనే ఈ పరీక్ష రాయాలనుకొంటున్నారు కాబట్టి, ఉద్యోగాన్నీ, ప్రిపరేషన్‌ సమయాన్నీ సమన్వయం చేసుకొనేలా ప్రణాళికను తయారు చేసుకోండి. వీలుంటే ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టండి. ప్రామాణిక పుస్తకాలనుంచి నోట్స్‌ రాసుకొని, కనీసం రోజుకు 10 గంటలు చదివితే ఐఈఎస్‌ సాధించాలనే మీ కలను సాకారం చేసుకోవచ్చు! - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎస్‌.ప్రమీల

    Ans:

    క్రమం తప్పకుండా వార్తా పత్రికలూ, సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాలూ చదువుతూ మంచి నోట్స్‌ తయారు చేసుకోండి. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన ప్రామాణిక వార/పక్ష/ మాస పత్రికలను కూడా చదవండి. ఇంటర్‌నెట్‌లో వర్తమానాంశాలను క్రోఢీకరించి అందించే వివిధ వెబ్‌సైట్లను సందర్శించి అక్కడ ఉన్న సమాచారాన్ని మీ నోట్సుతో సరిపోల్చి, నోట్స్‌ మెరుగుపర్చుకోండి. వీటితో పాటుగా ఇండియా ఇయర్‌ బుక్, మనోరమ ఇయర్‌ బుక్, ఎకనమిక్‌ సర్వే, మాతృభూమి ఇయర్‌ బుక్, కురుక్షేత్ర పత్రిక, యోజన, ప్రత్యోగిత దర్పణ్‌ కూడా తప్పకుండా చదవండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సీహెచ్‌. హారిక

    Ans:

    డిగ్రీ తరువాత కనీసం రెండు సంవత్సరాలు పూర్తిగా సివిల్స్‌ పరీక్షకి సన్నద్ధం అయినట్లయితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. పీజీ చదువుతూ కూడా సివిల్స్‌కి సన్నద్ధం అవ్వొచ్చు. మెయిన్స్‌లో మీరు ఎంచుకోబోయే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లో పీజీ చేసినట్లయితే, మీ విజయావకాశాలు మెరుగవుతాయి. ఇటీవల ఉన్నత విద్యారంగంలో వస్తున్న సంస్కరణల ఫలితంగా డిగ్రీలో సైన్స్‌ చదివినప్పటికీ పీజీలో సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులు కూడా చదివే అవకాశం ఉంది. రెండు సంవత్సరాలు పీజీ చేసిన తరువాత సివిల్స్‌కి ప్రయత్నిస్తే, పోటీ పరీక్షల్లో/ ఇంటర్వ్యూలో మెరుగైన ప్రతిభని కనపర్చవచ్చు. ఒకవేళ మీరు సివిల్స్‌ పరీక్షలో నెగ్గలేకపోతే, పీజీ అర్హతతో ఉన్నత విద్య/ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: ఎస్‌. హర్ష

    Ans:

    విద్యుత్‌ శాఖలో ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి సన్నద్ధం కావడం కొంత కష్టమే! కానీ, సివిల్స్‌పై మీకున్న ఇష్టం ఈ కష్టాన్ని అధిగమించి లక్ష్యాన్ని అందుకొనేలా చేయవచ్చు. ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి సిద్ధం అవ్వాలంటే కనీసం మూడు సంవత్సరాలపాటు ప్రణాళికాబద్ధంగా చదవాలి. మీరు వేరే ఊళ్లలో ఉంటే.. ముందుగా హైదరాబాద్‌కి బదిలీపై కానీ, డెప్యుటేషన్‌పై కానీ రండి. మీ ఆఫీస్‌ పని సమయం రోజుకి 7 గంటలుంటే రోజుకు 5 గంటల చొప్పున ప్రిపరేషన్‌కి కేటాయించండి. రెండు సంవత్సరాల పాటు సెలవు దొరికే అవకాశం ఉంటే రోజుకు కనీసం 12 గంటల సమయాన్ని సన్నద్ధతకు కేటాయించి మీ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు.
    ముందుగా యూపీఎస్‌సీ ప్రకటన పూర్తిగా చదివి మీ వయసు, సామాజిక నేపథ్యాలనుబట్టి ఎన్ని అవకాశాలున్నాయో తెలుసుకోండి. అందుకు తగ్గట్లుగా ప్రణాళికల్ని సిద్దం చేసుకోండి. ప్రిలిమ్స్‌ కోసం అవసరమైన మెటీరియల్‌ని సమకూర్చుకోండి. గతంలో సివిల్స్‌ సాధించినవారినీ, ప్రస్తుతం సివిల్స్‌ రాస్తున్నవారినీ సంప్రదించి వారి అనుభవాలు తెలుసుకోండి. యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న సివిల్స్‌ విజేతల విజయగాథలను చూసి, వారి ప్రిపరేషన్‌ పద్ధతుల గురించి అవగాహన పెంచుకోండి. ఆప్షనల్‌ని ఎంచుకొన్నాక అందుకు సంబంధించిన సిలబస్, పాత ప్రశ్నపత్రాల్ని జాగ్రత్తగా పరిశీలించండి. ప్రామాణిక పుస్తకాలను సేకరించండి. మంచి కోచింగ్‌ సెంటర్‌లో కనీసం ఏడాది శిక్షణ తీసుకొనే ప్రయత్నం చేయండి. అలా కుదరని పక్షంలో ఏదైనా ప్రముఖ శిక్షణ సంస్థ నుంచి ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకోండి. వార్తాపత్రికలు, జనరల్‌ స్టడీస్, ఆప్టిట్యూడ్‌లకు సంబంధించిన పుస్తకాలను నిరంతరం చదువుతూ, నోట్సు తయారు చేసుకోండి. ఈ సన్నద్ధత, మెయిన్స్‌ పరీక్షలో వ్యాసాలు రాయడానికి బాగా ఉపకరిస్తుంది. ముందే చెప్పినట్లు- కనీసం రెండు, మూడు సంవత్సరాల పాటు గట్టి పట్టుదలతో కృషి చేస్తే, ఐఏఎస్‌ అవ్వాలనే మీ కలను నిజం చేసుకోవడం సాధ్యం అవుతుంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Bandla

    Ans:

    సిలబస్ ప్రకారం ముందుగా ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉన్న తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ ప్రచురించిన జనరల్ స్టడీస్ పుస్తకాలు చదవచ్చు.  పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ తెలుగు మీడియంలో లభిస్తోంది. ఆధునిక భారత దేశ చరిత్ర - బిపిన్ చంద్ర, మధ్యయుగ చరిత్ర - కృష్ణారెడ్డి,  అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు, జాగ్రఫీ-తెలుగు అకాడమీ, భారతీయ సమాజం - తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగకరం.

    ఎథిక్స్ అండ్ ఆప్టిట్యూడ్ కోసం మేజర్ పబ్లికేషన్ పుస్తకాలు, యోజన మ్యాగజీన్ లు, ప్రముఖ తెలుగు దినపత్రికలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తాజా బడ్జెట్ లు, సర్వేలు - ఇవన్నీ తెలుగు మీడియంలో లభిస్తున్నాయి.

    కావాల్సిన పుస్తకాలు సేకరించుకున్న తర్వాత సిలబస్ ప్రకారం అధ్యాయాలను చూసుకొని చదువుకోవాలి.

    ఈనాడు-ప్రతిభ వెబ్ సైట్ లో రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటాయి. వాటినీ వినియోగించుకోవచ్చు. ఇంకా అనేక రకాల గైడెన్స్ ఆర్టికల్స్ కూడా రెగ్యులర్ గా అప్ డేట్ అవుతుంటాయి. వాటినీ రిఫరెన్స్ కి ఉపయోగించుకోవచ్చు.

     

    https://pratibha.eenadu.net/jobs/article/specialstories/upsc/civil-services-exam/telugu-medium/comprehensive-strategy-for-civils-prelims/2-1-1-1-22040000499

    https://pratibha.eenadu.net/jobs/index/upsc/civil-services-exam/telugu-medium/2-1-1-1

    https://pratibha.eenadu.net/jobs/article/specialstories/upsc/civil-services-exam/telugu-medium/education/2-1-1-1-22040000506

    Asked By: ఎ. వీరభద్రం

    Ans:

    వైద్యవిద్యార్థులు ఐఏఎస్‌ ఆఫీసర్లు కావడం సాధ్యమే. 1980వ సంవత్సరంలోనే మన తెలుగువారైన డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ సివిల్స్‌ పోటీలో అఖిల భారత స్థాయి 4వ ర్యాంకుతో ఐఏఎస్‌ సాధించారు. 2021లో వరంగల్‌కి చెందిన డాక్టర్‌ శ్రీజ అఖిల భారత స్థాయిలో 20వ ర్యాంకుతో ఐఏఎస్‌ సాధించారు. ఎంబీబీస్‌ చదువుతూ యూపీఎస్‌సీ పరీక్ష రాయడం కుదరదు. యూపీఎస్‌సీ పరీక్ష రాయాలంటే ఏదైనా డిగ్రీ పూర్తవ్వాలి. కానీ, మీరు ఎంబీబీఎస్‌ చదువుతూనే, యూపీఎస్‌సీ పరీక్షకు సన్నద్ధంకండి. ప్రణాళికాబద్ధ్దమైన  శిక్షణ, కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా కచ్చితంగా ఐఏఎస్‌ సాధించగలరు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: Dasari

    Ans:

    There is no specific group that is useful for Civil Services examinations. Any degree holder can apply. Any degree to a limited extent is useful for those examinatins. If you are aiming at IAS, you need to get an comprehensive idea on examination pattern, syllabus etc. and accordingly preparation.