Asked By: టి.సునీల్కుమార్
Ans:
ఎన్సీహెచ్ఎం - జేఈఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్)లో మెరుగైన ర్యాంకు సాధించినవారికి బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)లో ప్రవేశం లభిస్తుంది. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంవత్సరానికి ఒకసారి ఇంగ్లిష్/హిందీ మీడియాల్లో నిర్వహిస్తుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎన్సీహెచ్ఎం- జేఈఈ నోటిఫికేషన్ ఇటీవలే విడుదలయింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 27 ఏప్రిల్. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం ఈ కోర్సులో చేరడానికి గరిష్ట వయః పరిమితి లేదు.
ఎన్సీహెచ్ఎం - జేఈఈలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్లో 30 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్లో 30 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో 30 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్లో 60 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్షన్లో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. మీకు హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ రంగంపై ఆసక్తి ఉంటే నిరభ్యంతరంగా ఈ పరీక్ష రాయవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ సరళి ప్రకారం బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చేస్తే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీరు బీఎస్సీ (కంప్యూటర్స్) కోర్సు పూర్తిచేసి ఐదేళ్లు అయింది కాబట్టి, డిగ్రీలో చదివిన కంప్యూటర్ సబ్జెక్టులను మరొక్కసారి పూర్తిగా చదివి, ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) / ఎమ్మెస్సీ (డేటా సైన్స్) /ఎంసీఏ లాంటి పీజీ కోర్సులు చేయొచ్చు. మీకు ఎంబీఏ మీద ఆసక్తి ఉంటే ఎంబీఏ (బిజినెస్ అనలిటిక్స్) గురించీ ఆలోచించండి. ముందుగా మీరు ‘ఆర్’, ‘పైతాన్’ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లపై గట్టి పట్టు సాధించండి. ఆ తరువాత ఆసక్తి ఉన్న రంగానికి సంబంధించిన సాఫ్ట్వేర్లను ప్రైవేటుగా నేర్చుకొని మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: బి. మూర్తి
Ans:
సాంకేతిక (టెక్నికల్) కోర్సులంటే- కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, బయో మెడికల్, కెమికల్, ఏరోనాటికల్, ఆప్టోమెట్రీ, మెడికల్ టెక్నాలజీ లాంటివి. ఒకవేళ మీ ఉద్దేశం ఇంజినీరింగ్ కోర్సులయితే మాత్రం మనదేశంలో ఏ యూనివర్సిటీ కూడా బీటెక్/ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సును దూరవిద్యలో అందించటం లేదు. ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ ఇంజినీరింగ్కు సంబంధించిన సర్టిఫికెట్/ డిప్లొమా/ పీజీ డిప్లొమా కోర్సులు మాత్రం చాలా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో చేరాలంటే ఇంటర్/ డిగ్రీలో మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్త్రీ/ ఇంజినీరింగ్ చదివివుండాలి. మీరు కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / డేటా సైన్స్ సంబంధిత సర్టిఫికెట్/ డిప్లొమా/పీజీ డిప్లొమా కోర్సులు చేయాలనుకుంటే మాత్రం ప్రభుత్వ/ఓపెన్/ ప్రైవేటు యూనివర్సిటీలు కంప్యూటర్ అప్లికేషన్స్/ డేటా సైన్స్లాంటి కోర్సుల్ని దూరవిద్య/ ఆన్లైన్లో అందిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: రాజు, నెల్లూరు
Ans:
- విస్తృత అవకాశాలు అందించే మేటి కోర్సుల్లో ఎకనామిక్స్ ఒకటి. పేరున్న సంస్థల్లో ఎంఏ ఎకనామిక్స్ చదివినవారు కెరియర్ పరంగా దూసుకెళ్లవచ్చు. అయితే ఇలాంటి వాటిలో ప్రవేశానికి బాగా శ్రమించడం తప్పనిసరి. ఎంఏ ఎకనామిక్స్లోనూ ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కాలంలో క్వాంటిటేటివ్ ఎకనామిక్స్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఎస్ఐ- కోల్కతా, దిల్లీల్లో ఈ కోర్సు అందిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో సీటు కేటాయిస్తారు. ఈ సంస్థల్లో అవకాశం వచ్చినవాళ్లు ప్రతినెల రూ.8000 స్టైపెండ్ అందుకోవచ్చు. ఎకనామిక్స్ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పరిశోధకులు, విశ్లేషకులు, ఆర్థిక సలహాదారు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, వెంచర్ క్యాపిటలిస్ట్, ఆడిటర్, స్టాక్ బ్రోకర్, బిజినెస్ జర్నలిస్ట్ తదితర హోదాలతో ఉద్యోగాలు పొందవచ్చు. పీజీ అనంతరం పీహెచ్డీతో బోధన రంగంలో రాణించవచ్చు. ఎకనామిక్స్ పీజీతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా నిర్వహిస్తోన్న ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ (ఐఈఎస్) పరీక్ష రాసుకోవచ్చు. ఎంపికైనవారు గ్రూప్ ఎ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తారు. అలాగే రిజర్వ్ బ్యాంకులో గ్రేడ్ బి పోస్టుల్లో కొన్నింటికి పీజీ ఎకనామిక్స్ అర్హతతో పోటీ పడవచ్చు.
జాతీయ స్థాయిలో మేటి సంస్థలు
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూదిల్లీ; దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూదిల్లీ; హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ; జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, న్యూదిల్లీ; గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్, పుణే; మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎంఎస్ఈ), చెన్నై; బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి; ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రిసెర్చ్ (ఐజీడీఆర్), ముంబయి; సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ (సీడీఎస్), తిరువనంతపురం; బిట్స్ - పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్ల్లో ఆనర్స్ విధానంలో ఎమ్మెస్సీ ఎకనామిక్స్ కోర్సు అందిస్తున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (బేస్), బెంగళూరు ఎమ్మెస్సీ ఎకనామిక్స్ కోర్సు అందిస్తోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నమూనాలో దీన్ని రూపొందించారు. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, మరికొన్ని సంస్థలు సీయూసెట్ పీజీలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తున్నాయి. మిగిలినవాటికి ఆ సంస్థలు నిర్వహించే పరీక్షలు విడిగా రాసుకోవాలి. ఆంధ్రా, ఉస్మానియా, ఎస్వీయూ, ఆచార్య నాగార్జున... పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు తెలుగు రాష్ట్రాల్లో ఎకనామిక్స్ కోర్సు అందిస్తున్నాయి. పీజీ సెట్లతో ప్రవేశం పొందవచ్చు. ఐఐటీ దిల్లీ, రవుర్కెలాలు ఎమ్మెస్సీ ఎకనామిక్స్ కోర్సు అందిస్తున్నాయి. ఐఐటీలు నిర్వహించే జామ్తో ప్రవేశం లభిస్తుంది.
Asked By: కె.పవన్కుమార్
Ans:
డిజిటల్ మార్కెటింగ్లో ఉద్యోగం పొందాలంటే మార్కెటింగ్, కంప్యూటర్ గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. దీంట్లో రాణించాలంటే.. గూగుల్ డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, వెబ్ ఎనలిటిక్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, మార్కెటింగ్ ఆటోమేషన్, వెబ్ డిజైనింగ్ లాంటి కోర్సులను ఆఫ్లైన్/ ఆన్లైన్లో చేయాలి. మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఎనలిటిక్స్ రంగంపై ఆసక్తి ఉంటే గూగుల్ ఎనలిటిక్స్, గూగుల్ యాడ్ మేనేజర్, గూగుల్ యాడ్స్, హబ్ స్పాట్, మెయిల్ మోడొ, జీటీ మెట్రిక్స్, బిట్లీ, హూట్ సూట్, కేన్వా, గెట్ రెస్పాన్స్, బజ్ సుమో లాంటి టూల్స్ నేర్చుకోవాలి. పీజీ విషయానికొస్తే.. ఎంబీఏలో మార్కెటింగ్/ డిజిటల్ మార్కెటింగ్/ మార్కెటింగ్ ఎనలిటిక్స్ స్పెషలైజేషన్ చదివితే డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: గణేష్
Ans:
బయోటెక్నాలజీలో పీజీ కోర్సు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లో, ప్రైవేటు కళాశాలల్లో ఉంది. తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ఎన్ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో.. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ/ అనంతపురం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సు చదివే అవకాశం ఉంది. బయోటెక్ పీజీ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. సీడ్, బయోటెక్ కంపెనీలు, వ్యవసాయ పరిశోధన సంస్థలు, పుడ్ పరిశ్రమలు, బయో ప్రాసెసింగ్, ఫార్మా, కెమికల్ కంపెనీలు, ఎన్విరాన్మెంటల్ రిసెర్చ్ సంస్థల్లో, బోధన రంగంలో ఉద్యోగావకాశాలుంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: మనోజ్
Ans:
విదేశాల్లో క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్లో పీజీ చేయాలనుకోవడం మంచి ఆలోచన. ఇటీవలికాలంలో చాలా విదేశీ యూనివర్సిటీల్లో స్కాలర్షిప్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. మనదేశం నుంచి విదేశాల్లో పీజీ చేస్తున్నవారిలో దాదాపు 90 శాతం మందికి పైగా స్కాలర్షిప్లు లేకుండానే అడ్మిషన్లు పొందుతున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత రెండో సెమిస్టర్ నుంచి ఏదో ఒకరకమైన ఆర్థిక సహాయాన్ని పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి సెమిస్టర్లో కనీసం 3 జీపీఏ సాధిస్తే స్కాలర్షిప్/ అసిస్టెన్స్షిప్లు అందుబాటులో ఉంటాయి. విదేశీ యూనివర్సిటీల్లో, ప్రత్యేకించి భారతీయ విద్యార్ధులకంటూ స్కాలర్ షిప్లు అందుబాటులో ఉండవు. ప్రతిభ ఉన్న విదేశీ విద్యార్ధులకు స్కాలర్ షిప్లు లభిస్తాయి. అలాకాకుండా మనదేశం నుంచి ప్రముఖ విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఛారిటబుల్ ట్రస్ట్లు స్కాలర్షిప్లను అందిస్తున్నాయి. వాటిలో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్, జేఎన్ టాటా ఎండోమెంట్, ఆగాఖాన్ ఫౌండేషన్ ముఖ్యమైనవి.
విదేశాల్లో ఫోరెన్సిక్ సైన్స్ పీజీ కోర్సుల విషయానికొస్తే- జాన్ జేె కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్, మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ ఫీల్డ్, సామ్ హోస్టన్ స్టేట్ యూనివర్సిటీ, వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూ హావెన్, యూనివర్సిటీ ఆఫ్ అలబామా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్, యూనివర్సిటీ పిట్స్బర్గ్, సదరన్ ఇలినాయిస్ యూనివర్సిటీల్లో చదివేవారికి మెరిట్ స్కాలర్షిప్లను సంబంధిత విశ్వవిద్యాలయాలు అందిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: జి.మధులిక
Ans:
బయోటెక్ కంపెనీలో మీరు ఏ విభాగంలో పనిచేస్తున్నారో చెప్పలేదు. ఒకవేళ పరిశోధన రంగంలో పనిచేస్తూ కనీసం రెండు నాణ్యతా పరిశోధన పత్రాలు ప్రచురించివుంటే పీహెచ్డీ చేసే విషయం గురించి ఆలోచించవచ్చు. అలా కాకపోతే ముందుగా మంచి విదేశీ విశ్వవిద్యాలయంలో పీజీ చేయడానికి ప్రయత్నించండి. ఇతర దేశాల్లో పరిశోధన చేయాలంటే ముందుగా పరిశోధనాంశాన్నీ, అందుకు తగ్గ యూనివర్సిటీనీ, సరైన గైడ్నూ ఎంచుకోవాలి. పీజీ చేస్తూనే ఆ పీజీ అడ్మిషన్ని పీహెచ్డీ అడ్మిషన్గా మార్చుకొనే అవకాశం ఉంది. మీరు ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ రంగంలో పీజీ/ పీహెచ్డీ చేయాలనుకొంటున్నారు కాబట్టి- విదేశాల్లో ఆ రంగంలో అత్యుత్తమ పరిశోధన ఉన్న యూనివర్సిటీని ఎంచుకొని, అక్కడి ప్రవేశ విధానం తెలుసుకోండి. అంతకంటే ముందు మనదేశంలో ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ రంగంలో పరిశోధన చేస్తున్న ప్రొఫెసర్లను సంప్రదించి వారి మార్గదర్శకత్వంలో ఏదైనా పరిశోధన ప్రాజెక్టులో చేరటం మంచిది. పరిశోధనకు సంబంధించిన ప్రాధమిక మెలకువల్లో శిక్షణ పొంది విదేశాల్లో పీజీ/ పీహెచ్డీ ప్రవేశానికి ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎస్.నరసయ్య
Ans:
- యూఎస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎంఎస్ చేయడానికి చాలా యూనివర్సిటీల్లో అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనవి.. స్టాన్ఫోర్డ్, కొలంబియా, నార్త్ ఈస్టర్న్, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా, యూనివర్సిటీ ఆఫ్ మియామి, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి, లారెన్స్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ యూనివర్సిటీ, కార్నెగి మెలన్ యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జ్ పోర్ట్, స్టీవెన్స్ ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ విశ్వవిద్యాలయాల వెబ్సైట్లకు వెళ్లి కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి. కోర్సు ఫీజు, ఉద్యోగావకాశాలు లాంటి విషయాలను ఆధారంగా చేసుకొని సరైన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోండి. దానికి ముందు అక్కడ చదివిన, చదువుతున్నవారితో మాట్లాడి పూర్తి అవగాహన ఏర్పడ్డాకే నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: జి.నాగలక్ష్మి
Ans:
విదేశాల్లో పరిశోధన చేయాలంటే.. అక్కడి యూనివర్సిటీల్లో పీజీ చేసి ఉండటం శ్రేయస్కరం. ముందుగా పరిశోధనా అంశాన్ని, అందుకు తగిన యూనివర్సిటీని, సరైన గైడ్ని ఎంచుకోవాలి. విదేశాల్లో అడ్మిషన్ విధానం, పరిశోధన పద్ధతులు మనకంటే భిన్నంగా ఉంటాయి. అక్కడి పరిస్థితులపై అవగాహన ఏర్పర్చుకోవాలి. కనీసం రెండు పరిశోధనా పత్రాలు మంచి జర్నల్స్లో ప్రచురించి ఉంటే, మీ అబ్బాయి పీహెచ్డీ అడ్మిషన్ సులువు అవుతుంది. చాలామంది విదేశాల్లో పీజీలో చేరి, రెండో సంవత్సరంలో ఆ పీజీ అడ్మిషన్ని పీహెచ్డీ అడ్మిషన్గా మార్చుకుంటారు. పరిశోధనలో ముఖ్యమైన విషయం - మనం పరిశోధన చేయాలనుకుంటున్నవారి నమ్మకం పొందటం. ఆ నమ్మకం వ్యక్తిగత పరిచయం, ప్రచురించిన పరిశోధనపత్రాల నాణ్యత, పీజీ చదివిన విశ్వవిద్యాలయ అంతర్జాతీయ ర్యాంకింగ్, ఇక్కడి ప్రొఫెసర్లు ఇచ్చే రికమెండేషన్ లెటర్స్ వల్ల వస్తుంది. అవకాశం ఉంటే మీ అబ్బాయిని మనదేశంలోనే ఏదైనా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో మంచి పరిశోధన నేపథ్యం ఉన్న ప్రొఫెసర్ దగ్గర ప్రాజెక్ట్లో చేరి, పరిశోధన మెలకువలను నేర్చుకోమని చెప్పండి. నాణ్యమైన పరిశోధనపత్రాలను ప్రచురించి, విదేశాల్లో మంచి యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశం పొందేలా ప్రోత్సహించండి. అలా కుదరని పక్షంలో ప్రముఖ విదేశీ యూనివర్సిటీలో పీజీ చేయమని చెప్పండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: శ్రద్ధ
Ans:
మీరు సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదవాలంటే, ఎన్టీఏ నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ-పీజీ) రాయాలి. గత సంవత్సరం నుంచే అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ అడ్మిషన్ల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్/ మే నెలల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో నోటిఫికేషన్ రావొచ్చు. మీరు తరచుగా cuet.nta.nic.in వెబ్సైట్ సందర్శిస్తూ.. ఎంట్రన్స్ సమాచారాన్ని తెలుసుకోండి. ఈ పరీక్షలో మీరు సాధించిన మార్కుల ఆధారంగా పీజీ అడ్మిషన్లు నిర్వహిస్తారు. నమూనా కోసం గత సంవత్సరపు ప్రవేశ పరీక్ష పత్రాన్ని పరిశీలించండి. దేశవ్యాప్తంగా పరీక్ష రాసే అభ్యర్థులతో పోటీ పడాలి కాబట్టి, ఇప్పటినుంచే సన్నద్ధం కండి. గత సంవత్సరంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించినప్పటికీ, ప్రవేశాలను యూనివర్సిటీలు విడివిడిగా నిర్వహించుకున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో కేంద్రీకృత కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రవేశ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించి, మీకు నచ్చిన యూనివర్సిటీలను ఆప్షన్లుగా పెట్టుకోండి. సాధారణంగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశాల్లో రాష్ట్రాల వారీగా రిజర్వేషన్లు ఉండవు. సొంత రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశానికి కూడా దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన అభ్యర్థులతో సమానంగా పోటీ పడాలి. ఏదైనా కారణం వల్ల, ఈ విద్యా సంవత్సరానికి కేంద్రీకృత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు నిర్వహించకపోతే... మీకు నచ్చిన యూనివర్సిటీలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్