ఉపాధ్యాయ ఉద్యోగానికి తొలి మెట్టు అయిన టెట్లో మెరుగైన మార్కులు ఎలా సాధించాలో తెలుసుకుందాం...
ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు, మునిసిపల్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎన్సీటీఈ (జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి) నిబంధనల మేరకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. డి.ఇడి./ బి.ఇడి./ లాంగ్వేజి పండిట్ కోర్సుల్లో, దీనికి సమానమైన అర్హత కోర్సుల్లో ఉత్తీర్ణత పొందినవారు, గతంలో ఏపీటెట్ ఉత్తీర్ణత పొందినవారు కూడా తమ స్కోరును పెంచుకోవటానికి ఈ టీఎస్-టెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. 1 నుంచి 5 తరగతులకు బోధించటానికి అభ్యర్థులు పేపర్-1 రాయాల్సివుంటుంది. 6 నుంచి 8 తరగతులకు బోధించటానికి అర్హత పొందాలనే అభ్యర్థులు పేపర్-2 రాయాల్సివుంటుంది.
ఇవి పాటిస్తే మేలు
వివిధ సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై అవగాహన ఉండటం టెట్ అభ్యర్థులకు అవసరం.
* విభాగాల వారీ ప్రాథమిక అంశాలతో సన్నద్ధత ప్రారంభించాలి.
* తర్వాత పాఠ్యాంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.
* సరైన ప్రణాళిక, సమయపాలన అవసరం.
* గత ఏపీ టెట్, సెంట్రల్ టెట్లకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించాలి.
* పరీక్షల్లో ఏయే భావనలపై ప్రశ్నలడగవచ్చో గుర్తించాలి.
* అర్థవంతంగా అవగాహన ఏర్పరచుకోవాలి.
* సాధారణ పరీక్షల్లో ఎక్కువగా జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు కనబడతాయి. అయితే టెట్లో జ్ఞాన సంబంధ ప్రశ్నలకేగాక అవగాహన, అనుప్రయుక్తం, నైపుణ్యానికి చెందిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చేలా సన్నద్ధత ఉండాలి.
* సిలబస్ చదవడం పూర్తయిన తర్వాత మాదిరి పరీక్షలు రాయాలి.
* నమూనా ప్రశ్నలను అధ్యాయాలవారీగా అభ్యాసం చేయాలి.
* పరీక్షకు కనీసం 10 రోజుల ముందు నుంచి మాదిరి ప్రశ్నపత్రాలను సమయాన్ని అనుసరించి సాధన చేయాలి. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుచున్నామో గమనించాలి. ఆ పరీక్షల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలి.
* సొంతంగా నోట్సు తయారుచేసుకుంటే పరీక్షల ముందు సమయం ఆదా అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. పునశ్చరణ సులువు అవుతుంది.
* కేవలం అకాడమీ పుస్తకాలనేగాక, నిర్ణీత సిలబస్ మేరకు పాఠ్యాంశాలనూ అధ్యయనం చేయాలి.
* అభ్యర్థులు సులువుగా భావించిన విషయాలకు తక్కువ వ్యవధినీ, కష్టంగా అనిపించే అంశాలకు ఎక్కువ వ్యవధిని కేటాయించుకోవాలి.
* సాధనకు తోడు సమయపాలన పాటిస్తే విజయం తథ్యం.
టెట్ సిలబస్ మొత్తాన్ని పరిశీలిస్తే పదో తరగతి వరకు అభ్యసించిన కంటెంట్, డి.ఇడి./బి.ఇడిలో అభ్యసించిన సైకాలజీ, మెథడాలజీ విభాగాల నుంచే ఎక్కువ అంశాలు గోచరిస్తాయి. కాబట్టి గతంలో అభ్యసించినవి పునరావలోకనం చేయాలి.
టెట్లో జ్ఞాన సంబంధ ప్రశ్నలకే కాకుండా అవగాహన, అనుప్రయుక్తం, నైపుణ్యానికి చెందిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చేలా సన్నద్ధమై ఉండటం అవసరం.
టెట్లో పేపర్-1 లేదా పేపర్-2లో జనరల్ అభ్యర్థులు 60%, బీసీ అభ్యర్థులు 50%, ఎస్సీ, ఎస్టీ, differently abled 40% మార్కులు కనీసం పొందితేనే ఉత్తీర్ణత పొందినట్లు పరిగణిస్తారు.
ఎన్సీటీఈ నిబంధనల మేరకు టెట్లో ఉత్తీర్ణత సాధించినవారికిలభించే టీఎస్-టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్... పరీక్ష తేదీ నుంచి ఏడు సంవత్సరాల వరకూ చెల్లుబాటుతో (వ్యాలిడిటీ) ఉంటుంది.
* టెట్ స్కోరుకు టీచర్ రిక్రూట్మెంట్ రాతపరీక్షలో 20% వెయిటేజి ఇస్తారు.
* టెట్ సిలబస్ మొత్తాన్ని పరిశీలిస్తే పదో తరగతి వరకు అభ్యసించిన కంటెంట్, డి.ఇడి./బి.ఇడి.లో అభ్యసించిన సైకాలజీ, మెథడాలజి విభాగాల నుంచే ఎక్కువ అంశాలు గోచరిస్తాయి. కాబట్టి గతంలో అభ్యసించిన విషయాలను పునరావలోకనం చేయాలి.
1) డి.ఇడి., బి.ఇడి., తెలుగు అకాడమీ విద్యా మనోవిజ్ఞానం, బోధనా పద్ధతులు.
2) CCE, NCF-2005, RTE-2009 ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్స్.