* ఇంట్లో నిత్యం 3-4 గంటల పాటు పుస్తకాలు చదువుతాను
ఈనాడు, నిజామాబాద్: చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఎల్లాగౌడ్ బీఎస్ఎన్ఎల్లో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి 2007లో రిటైర్ అయ్యారు. ఈ నెల 25 నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా.. నిజామాబాద్ శివారులో బోర్గాం(పీ) కేంద్రంలో ఈయన పరీక్షలు రాస్తున్నారు. శనివారం తన కుమారుడు ఆయనను పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యానని.. ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. ‘‘చిన్నప్పుడు ఏడో తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత అనివార్య కారణాలతో మానేశాను. అనంతరం పెళ్లి, ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతలతో తీరిక ఉండేది కాదు. మనసులో చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే పదవీ విరమణ తర్వాత ఓపెన్ స్కూల్ విధానం ఎంచుకున్నాను’’ అని చెప్పారు. ఎల్లాగౌడ్ ఇంట్లో నిత్యం 3-4 గంటల పాటు పుస్తకాలు చదువుతారని ఆయన కుమారుడు పరశురాం తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.