* పిటిషన్లు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి జారీ చేసిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో 2(కె), రూల్ 5.2(ఎ)లను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ కె.సుజయ్పాల్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కనీస, గరిష్ఠ వయోపరిమితితోపాటు, తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకే అవకాశం కల్పించేలా.. ప్రాక్టీస్ చేస్తున్న బార్ అసోసియేషన్ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధన సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం విభేదించింది. కనీస వయసు 23గా పేర్కొనడం వల్ల న్యాయశాస్త్రంలో పట్టా పొందినవారు నష్టపోతున్నారనడానికి వీల్లేదని తెలిపింది. పట్టా పొందిన వెంటనే జ్యుడిషియల్ సర్వీసుల్లోకి రావాలన్న నిబంధన ఏమీ లేదని పేర్కొంది. గరిష్ఠ వయోపరిమితికి సంబంధించిన విషయంలోనూ నిబంధనలు సబబేనంది. నిబంధనల రూపకల్పన యజమాని విచక్షణాధికారంపై ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు తరఫున సీనియర్ న్యాయవాది హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ నిబంధనలకు సంబంధించి ఇటీవల బొడుగుల బ్రహ్మయ్య కేసులో ఇదే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, అందువల్ల జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. హైకోర్టు అంటే తెలంగాణ హైకోర్టు, దాని పరిధిలోని సబార్డినేట్ కోర్టులన్న వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ పిటిషన్లను కొట్టివేసింది. జూనియర్ సివిల్ జడ్జిల పోస్టుల భర్తీకి ఏప్రిల్ 10న హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.