* లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐపై ఇంటర్న్షిప్
* స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర వెల్లడి
గచ్చిబౌలి, న్యూస్టుడే: చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. దీని సాధనలో ఇంజినీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారికి కృత్రిమ మేధ(ఏఐ)పై ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్చంద్ర మాట్లాడారు. శతసహస్ర యాగం పేరిట లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ వేసవిలో ఏఐపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మొదటి బ్యాచ్లో పదివేల మందికి శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే రెండో బ్యాచ్ ప్రారంభిస్తామన్నారు. ట్రిపుల్ఐటీ హైదరాబాద్, ఓజోన్టెల్ కమ్యూనికేషన్స్, మెటా, టాస్క్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాల్గొనే విద్యార్థులు తెలుగు చాట్జీపీటీని తయారు చేసేందుకు అవసరమైన డేటా సేకరిస్తారన్నారు. ఇంటర్న్షిప్లో ఒక్కో విద్యార్థి కనీసం 50 మందిని కలిసి తమ ప్రాంతాల మాండలీకాలలో ఉన్న భాషా సంపదను డాక్యుమెంట్ చేస్తారని వివరించారు. ఇందులో పాల్గొనే విద్యార్థులు కృత్రిమ మేధ ఆధారంగా సాఫ్ట్వేర్ రూపొందించేలా నిష్ణాతులైన వారు తర్ఫీదు ఇస్తారని తెలిపారు. నెల రోజులపాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు చెప్పారు. పాల్గొనేందుకు ఆసక్తి గల అభ్యర్థులు వివరాల కోసం https://swecha.org/summer-of-ai వెబ్సైట్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో ఓజోన్టెల్ కమ్యూనికేషన్స్ సీటీఓ చైతన్య చొక్కారెడ్డి, స్వేచ్ఛ కార్యదర్శి ప్రవీణ్చంద్ర పాల్గొన్నారు.