* పదిలో 492 మార్కులు సాధించిన విద్యార్థిని
* ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నై, న్యూస్టుడే: ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా కోరడాచ్చేరి ప్రభుత్వ బాలిక మహోన్నత పాఠశాలలో బాలా-సుధా దంపతుల కుమార్తె దుర్గాదేవి 10వ తరగతిలో 500కు గాను 492 మార్కులు సాధించి.. పాఠశాలలో మొదటిస్థానం, జిల్లా స్థాయిలో రెండోస్థానంలో నిలిచింది. తండ్రి మెకానిక్. దుర్గాదేవి మాట్లాడుతూ.. విద్యుత్ సౌకర్యం లేకుండా ఏళ్లుగా తాము గుడిసెలో ఉంటున్నామని తెలిపింది. ఛార్జింగ్ లైట్, కొవ్వొత్తి వెలుగులోనే చదివానని పేర్కొంది. గతంలో విద్యుత్ కనెక్షన్ ఉన్నా.. బిల్లు కట్టే స్తోమత లేకపోవడంతో చాలా ఏళ్ల కిందటే తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కనెక్షన్ ఇవ్వాలని ఇటీవల ఆమె ప్రభుత్వానికి విన్నవించింది. విషయం తెలుసుకున్న తిరువారూర్ ఎమ్మెల్యే పూండి కలైవానన్, విద్యుత్ అధికారులు.. నేరుగా విద్యార్థిని ఇంటికి వెళ్లి పరిశీలించారు. మూడు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కనెక్షన్ ఇచ్చారు. వైద్యురాలు కావడమే తన లక్ష్యమని దుర్గాదేవి పేర్కొన్నారు.