• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గేమింగ్‌ రంగానికి ఉజ్జ్వల భవిత

ఆసక్తికరమైన ఇతివృత్తం, చిక్కని కథనానికి సాంకేతిక ఇంద్రజాలాన్ని జోడిస్తే భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ‘బాహుబలి’ చిత్ర అఖండ విజయం చాటిచెప్పింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ (వీఎఫ్‌ఎక్స్‌) విశ్వరూపాన్ని ప్రదర్శించడంలో హాలీవుడ్‌కు దీటుగా నిలిచిన చిత్రమది. బాహుబలికన్నా ముందే హైదరాబాద్‌ నగరం వీఎఫ్‌ఎక్స్‌ నైపుణ్యానికి పేరుమోసింది. ఇక్కడే టైటానిక్‌, అవతార్‌, ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌ గోల్డ్‌ కంపెనీ నిర్మించిన బాలల యానిమేషన్‌ సిరీస్‌- ‘ఛోటా భీమ్‌’ దేశదేశాల్లో జయభేరి మోగించింది. నేడు తెలుగు, తమిళం, హిందీలతోపాటు పలు భారతీయ భాషా చిత్రాలు ఇక్కడి వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోల ప్రతిభను ఉపయోగించుకొంటున్నాయి. హాలీవుడ్‌ స్టూడియోలకు హైదరాబాద్‌తో పాటు ముంబయి, చెన్నై, బెంగళూరులలోని వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు వీడియో ఎడిటింగ్‌ పనులు చేసిపెడుతున్నాయి. చలనచిత్ర పరిశ్రమతోపాటు వెబ్‌సైట్లు, యాప్‌ల రూపకల్పన, గేమింగ్‌ తదితర విభాగాలకూ వీఎఫ్‌ఎక్స్‌ సేవలు అవసరం. ఆత్మనిర్భరత లక్ష్యసాధన కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘భారత్‌లో తయారీ’, ‘డిజిటల్‌ ఇండియా’ కార్యక్రమాలు భారత్‌లో వీఎఫ్‌ఎక్స్‌ రంగం వృద్ధికి గొప్ప ఊతమిస్తున్నాయి.  

వ్యాపార విజృంభణ

కొవిడ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు, వ్యాపారాలు దెబ్బతిన్నా గేమింగ్‌ రంగం మాత్రం వినియోగదారులను పెంచుకొంది. లాక్‌డౌన్‌లతో జనం, ముఖ్యంగా యువత, చిన్నపిల్లలు ఇంటిపట్టునే ఉండటం- మొబైల్‌, ఆన్‌లైన్‌ క్రీడలకు గిరాకీని పెంచింది. కొవిడ్‌ వల్ల వ్యక్తులకే కాకుండా, కంపెనీలకూ ఆదాయాలు తగ్గిన మాట నిజం. నిరుడు వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌, గేమింగ్‌ రంగం ఎనిమిది శాతం క్షీణతను చవిచూసినా, ఈ ఏడాది మళ్ళీ 15శాతం వృద్ధిరేటును అందుకొన్నట్లు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధి వీరేన్‌ ఘోష్‌ చెబుతున్నారు. ఈ రంగంలో ఇలా అందివస్తున్న అవకాశాల్ని హైదరాబాద్‌ సద్వినియోగం చేసుకొంటోంది. గత మూడేళ్లలో 10 కొత్త వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు, 45 గేమింగ్‌ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయని తెలంగాణ ఐ.టి., పరిశ్రమల మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. భాగ్యనగరంలో నాలుగు రోజులపాటు కొనసాగే ‘ఇండియా జాయ్‌ 2021’ ప్రదర్శన ప్రారంభమవుతున్న సందర్భంగా ఆయన పలు విశేషాలు పంచుకున్నారు. నగరంలో 20 కంపెనీలు వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్‌ రంగాలలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాయని, దాదాపు 40 నిర్మాణ సంస్థలు 30,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. కొవిడ్‌ వల్ల ఆలస్యమైన ఇమేజ్‌ టవర్‌ నిర్మాణాన్ని 2023 ప్రథమ త్రైమాసికానికల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల ఈ టవర్‌లో అనేక వీఎఫ్‌ఎక్స్‌ గేమింగ్‌, మల్టీమీడియా కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.

అంతర్జాలం, మొబైల్‌ ఫోన్ల వాడకం, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటం వంటి అలవాట్లు నానాటికీ పెరిగిపోతున్నందువల్ల- వీడియో గేమింగ్‌ మార్కెట్‌ అంతకంతకూ ఆదరణ పొందుతూ విస్తరిస్తోంది. ఇందులో డౌన్‌లోడ్‌ చేసుకోగలిగే అంశాలు, సరికొత్త తరహా ఉపకరణాలు విరివిగా అందుబాటులోకి రావడమూ ఈ రంగం విజృంభణకు కారణమే. దీంతో సహజంగానే వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌ నిపుణుల అవసరం పెరుగుతోంది. భారత్‌లోని 138 కోట్ల జనాభాలో మూడింట రెండువంతులమంది 35 ఏళ్లలోపువారే. ఈ వయోవర్గం వీడియో గేమ్స్‌ మార్కెట్‌కు బంగారు గని వంటిది. భారత్‌లో ఆంగ్ల భాష మాట్లాడేవారు చాలా ఎక్కువ. ఇక్కడ సాంకేతిక నిపుణులకు కొదవలేదు. అందువల్ల వీడియో గేమింగ్‌ మార్కెట్‌ నుంచి భారీగా లబ్ధి పొందే సత్తా భారత్‌కు ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మన యువత గేమ్‌ డెవలపర్లుగా, వీఎఫ్‌ఎక్స్‌ యానిమేటర్లుగా రాణించే నైపుణ్యాన్ని సంపాదించాలి. వీఎఫ్‌ఎక్స్‌ యానిమేటర్లు చలనచిత్ర పరిశ్రమలో, టీవీ రంగంలో, వీడియో గేమ్స్‌లో ఉపాధి, వ్యాపార అవకాశాలు పొందే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి, వాణిజ్య ప్రకటనల రంగాల్లోనూ వీరికి అవకాశాలు పుష్కలం. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వంటి అంతర్జాతీయ ఓటీటీ వేదికలతోపాటు జాతీయ, ప్రాంతీయ సంస్థల్లోనూ యానిమేటర్లకు ఉపాధి లభిస్తుంది.

పెరుగుతున్న ఉపాధి అవకాశాలు

గేమింగ్‌ పరిశ్రమకు గేమ్‌ ఇంజినీరింగ్‌, గేమ్‌ డిజైన్‌, గేమ్‌ ఆర్ట్‌, గేమ్‌ టెస్టింగ్‌, గేమ్‌ రైటర్లు, గేమ్‌ ప్రొడ్యూసర్లు తదితర నిపుణులు అవసరమవుతారు. వీరికి సాంకేతిక డిప్లొమాలు, డిగ్రీలతోపాటు కళా నైపుణ్యమూ అవసరమే. ఇంకా ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ నిపుణులకూ అవకాశాలు పుష్కలం. నేడు రాక్‌స్టార్‌, ఎలెక్ట్రానిక్‌ ఆర్ట్స్‌, యూబిసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ గేమింగ్‌ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. క్వాలీ, శ్ల్పాష్‌ డామేజ్‌ వంటి బ్రిటన్‌ కంపెనీలు భారతీయ నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. గడచిన రెండేళ్లలో ఒక్క కర్ణాటకలోనే 70 గేమింగ్‌ అంకుర సంస్థలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఎలెక్ట్రానిక్‌ ఆర్ట్స్‌ కార్యాలయంలో 700 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. సీనియర్‌ గేమ్‌ ప్రాడక్ట్‌ ఇంజినీర్‌, కంటెంట్‌ ఆర్టిస్టులకు ఈ సంస్థలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారతదేశంలో 300కుపైగా యానిమేషన్‌ స్టూడియోలు ఉన్నాయి. అవి 15,000కు పైగా యానిమేషన్‌ నిపుణులను నియోగిస్తున్నాయి. అమెరికా, ఐరోపాలకు చెందిన స్టూడియోలు భారత్‌ నుంచి పొరుగు సేవలు పొందుతున్నందువల్ల యానిమేషన్‌ నిపుణులకు గిరాకీ మరింత పెరగడం ఖాయం. యువత కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు ప్రత్యేక విధానాలను, పాఠ్య ప్రణాళికలను చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి ఐఐటీ-బాంబేలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న వినూత్న రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యువతరం వేగంగా కదలాలి.  

భారీ పరిమాణం...

భారత్‌లో 2015లో యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ రంగాల వ్యాపార పరిమాణం తక్కువగానే ఉన్నా, 2019 నాటికి అది సుమారు రూ.9,620 కోట్లకు చేరింది. 2024కల్లా మూడు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందని అంచనా. అంతేకాదు, ఈ రంగం 2024కల్లా 75,000 నుంచి 1,20,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, సీఐఐ సంయుక్త నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా వినోద పరిశ్రమలో వీడియో గేమ్స్‌ రంగమే అతి పెద్ద విభాగం. 2020 చివరి నాటికే ప్రపంచ గేమింగ్‌ రంగం పరిమాణం సుమారు రూ.12 లక్షల కోట్లకు చేరుకోగా, అందులో పెద్ద వాటాను చేజిక్కించుకునే సత్తా భారత్‌కు ఉంది. 2019లో భారతీయ గేమింగ్‌ రంగ పరిమాణం రూ.14,000 కోట్లు; 2024కల్లా అది రూ.62,000 కోట్లకు పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

- కైజర్‌ అడపా
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విదేశీ భాషలు.. విశేష అవకాశాలు!

‣ జ్ఞాపకశక్తి మెరుగుకు కొన్ని ఆసనాలు

Posted Date : 19-11-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌