ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్లో ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో చేరడం ద్వారా విద్యార్థులకు ప్రముఖ ఎంఎన్సీలలో మెరుగైన ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, యాప్ డెవలెప్మెంట్ (ఫుల్ స్టాక్) స్పెషలైజేషన్లతో పరిశ్రమ కోసం సిద్ధమయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దే ఈ కోర్సు కాలవ్యవధి 16 నెలలు. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో అందుబాటులో ఉంది. ఆన్లైన్లో చదివే వారు ఫీజుగా రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆఫ్లైన్లో క్యాంపస్కు వచ్చి చదివేవారు రూ.3 లక్షల ఫీజుతోపాటు హాస్టల్, మెస్ ఛార్జీలు కట్టాలి. దరఖాస్తు చేసిన విద్యార్థులకు వారు ఈ ప్రోగ్రామ్కి నప్పుతారో లేదో తెలుసుకునేందుకు ముందు రెండు వారాలపాటు ‘కంప్యుటేషనల్ థింకింగ్’ క్లాసులు జరుగుతాయి. అనంతరం ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో నెగ్గిన వారికి ప్రవేశం లభిస్తుంది.
‣ కొత్త తరహా విద్యావిధానాలతో ఈ కోర్సు వినూత్నంగా ఉంటుంది. ప్రతి విద్యార్థికీ మెంటర్ ఉండటమే కాక, చిన్న చిన్న గ్రూపులుగా క్లాసులు జరుగుతాయి. విద్యార్థి తాను ఎప్పుడు సిద్ధమయ్యాడని భావిస్తే అప్పుడే పరీక్ష రాసే వీలుంటుంది. మొత్తం ప్రోగ్రాం టాపిక్స్ వారీగా ఉంటుంది. ఒక టాపిక్లో ‘ఏ’ గ్రేడ్ సాధిస్తేనే మరొకటి చదివేందుకు విద్యార్థి అప్గ్రేడ్ అవుతాడు. మొత్తం మూడు సెమిస్టర్లు ఉంటాయి. అదనంగా మరో సెమిస్టర్ ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది. అమెజాన్, మెడ్ప్లస్, హెచ్ఎస్బీసీ, పేటీఎం, అమెరికన్ ఎక్స్ప్రెస్, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు ప్రాంగణ ఎంపికల ద్వారా ఈ విద్యార్థులను తమ సంస్థల్లోకి ఆహ్వానిస్తున్నాయి.
తరగతుల ప్రారంభం: ఆగస్టు, 2022 నుంచి...
అర్హత: బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి. మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్లో పీజీ చేసిన వారూ అర్హులే.
ఇతర వివరాలకు: https://www.msit.ac.in/
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్ చదివినా.. గెలుపు ఆర్ట్స్తోనే!
‣ మేనేజ్మెంట్ విద్యలో ప్రపంచస్థాయి బోధన