• facebook
  • twitter
  • whatsapp
  • telegram

'పది' మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం

ఏపీలో 1,058, తెలంగాణలో 961 ఖాళీలు



నియామక పరీక్ష ఏదీ రాయనవసరం లేకుండా.. పదో తరగతి మార్కుల ప్రతిభతోనే ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 30,041 ఖాళీలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,058, తెలంగాణలో 961 పోస్టులు భర్తీ చేస్తారు. అవకాశం వచ్చినవారు బ్రాంచి పోస్టు మాస్టర్, అసిస్టెంట్‌ బ్రాంచి పోస్టు మాస్టర్, డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు. పోస్టును బట్టి సుమారు రూ.15,000 నుంచి రూ.20,000 వేతనం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


జీడీఎస్‌ ప్రకటన ఈ సంవత్సరం మేలో వెలువడింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్నవారు అదే రిజిస్టర్‌ నంబర్‌ నమోదు చేసుకోవచ్చు. కొత్తగా వివరాలు నింపాల్సిన అవసరం లేదు. ఈ పోస్టుల్లో చేరినవారికి మూలవేతనం (బేసిక్‌ పే)తో పాటు కరవు భత్యం (డియర్‌నెస్‌ అలవెన్సు)ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో 42 శాతం డీఏ అమలవుతోంది. దీని ప్రకారం..


బ్రాంచి పోస్టు మాస్టర్‌ (బీపీఎం)కు రూ.12,000 మూలవేతనంతోపాటు ఇందులో 42 శాతం అంటే రూ.5040 డీఏ కూడా దక్కుతుంది. అంటే మొదటి నెల నుంచే వీరు రూ.17040 వేతనం అందుకోవచ్చు. దీంతోపాటు ఇతర ప్రోత్సాహకాలూ ఉంటాయి. ప్రతి ఆరు నెలలకు ఒక డీఏ, ఏటా ఇంక్రిమెంట్‌ వేతనంలో కలుస్తుంది. 


అసిస్టెంట్‌ బ్రాంచి పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌లకు రూ.పదివేల మూలవేతనంతోపాటు రూ.4200 డీఏ దక్కుతుంది. వీరు విధుల్లో చేరిన మొదటి నెల నుంచి రూ.14,200 వేతనం, ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చు. 


వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ఏబీపీఎం/డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్‌ చెల్లిస్తారు. స్వల్పమొత్తంలో హెచ్‌ఆర్‌ఏ కూడా దక్కుతుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌/ స్మార్ట్‌ఫోన్‌ లాంటివి పోస్టల్‌ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్‌ తొక్కడం రావాలి. ఈ పోస్టుల్లో అవకాశం వచ్చినవారు రోజుకు సుమారు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. 


విధులిలా..

బ్రాంచి పోస్టు మాస్టర్‌ (బీపీఎం): వీరు బ్రాంచి కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పోస్టల్‌కు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచిని నడిపించాలి. పోస్టల్‌ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.


అసిస్టెంట్‌ బ్రాంచి పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం): ఈ విధులు నిర్వర్తించేవాళ్లు స్టాంపులు/స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ, ఇండియన్‌ పోస్టు పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, పోస్టల్‌కు సంబంధించిన ఇతర వ్యవహారాలు చక్కబెట్టాలి. బ్రాంచి పోస్టు మాస్టర్‌ సూచించిన విధులు నిర్వర్తించాలి. తపాలా పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి. 


డాక్‌ సేవక్‌: వీరు ముఖ్యంగా ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాల బాధ్యత వీరిదే. బీపీఎం, ఏబీపీఎం సూచించిన విధులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్, పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చక్కబెట్టాలి. 


ఎంపిక

అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌తో నియామకాలుంటాయి. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తోన్నదానికి ఆప్షన్‌-1 తర్వాత దానికి ఆప్షన్‌-2...ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ఈమెయిల్‌/పోస్టు ద్వారా అందుతుంది. 


కటాఫ్‌ 

గత నోటిఫికేషన్‌ (మే, 2023)లో ఏపీలో 118, తెలంగాణలో 96 ఖాళీలకు గానూ జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ.. ఇలా అన్ని విభాగాల్లోనూ పదో తరగతిలో వంద శాతం మార్కులు పొందినవారికే అవకాశం దక్కింది. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటమే దీనికి కారణం. అంతకుముందు మాత్రం జనరల్, ఓబీసీ విభాగాల్లో సుమారు 95 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 93 శాతం మార్కులు పొందినవారికి అవకాశం దక్కింది. ఈసారి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జనరల్, ఓబీసీలైతే 96, ఎస్సీ, ఎస్టీలు 94 శాతం మార్కులు పొందితే అవకాశం దక్కవచ్చు. 


ముఖ్య వివరాలు..

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవాలి.

వయసు: ఆగస్టు 23, 2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.    

ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారంతా రూ.వంద చెల్లించాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 23

వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ 'క్యాట్‌ 2023' సన్నద్ధత ఇలా..

‣ తండ్రి కష్టం.. తనయ విజయం

‣ ఇంటర్‌తో కేంద్ర కొలువులు

‣ 'నాసా' మెచ్చిన కుర్రాడు!

Posted Date : 09-08-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌