‣ 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా/ డిగ్రీ పూర్తిచేసిన అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా నియమించవచ్చు.
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (జేఐవో) గ్రేడ్-2/ టెక్నికల్ పోస్టులు మొత్తం 797 ఉన్నాయి. అభ్యర్థులు డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ అప్లికేషన్స్ పాసవ్వాలి) లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఫిజిక్స్/ మేథమెటిక్స్ సబ్జెక్టులతో పాసవ్వాలి) లేదా బీసీఏ అర్హత ఉండాలి. వయసు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.500. ఎంహెచ్ఏ వెబ్సైట్ లేదా ఎన్సీఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయొచ్చు.
ఎంపిక ఎలా?
ఇది మూడు దశల్లో జరుగుతుంది. టైర్-1లో ఆన్లైన్ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 25 శాతం ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్టుల నుంచి 75 శాతం ప్రశ్నలు ఇస్తారు. టైర్-2లో భాగంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ టెక్నికల్ టెస్ట్కు 30 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. టైర్-3లో ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్కు 20 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు తగ్గిస్తారు. టైర్-1 సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను స్కిల్టెస్ట్, ఇంటర్వ్యూలకు ఎంపికచేస్తారు. టైర్-1లో అన్ రిజర్వుడ్ అభ్యర్థులు 35 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఓబీసీ-34, ఎస్సీ/ఎస్టీ-33, ఈడబ్ల్యూఎస్-35 శాతం మార్కులు పొందాలి. టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షల తేదీ, సమయం, ప్రదేశాలను.. అభ్యర్థుల ఈమెయిల్ ఐడీకి తెలియజేస్తారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ వెబ్సైట్ను చూస్తుండాలి.
సన్నద్ధత
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (జేఐఓ) పోస్టుకు సంబంధించిన గత ఐదేళ్ల ప్రశ్నపత్రాలు సమాధానాలతోపాటుగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని సాధన చేస్తే సందేహాలు తొలగి, అవగాహన పెరుగుతుంది. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని సన్నద్ధతను మెరుగుపరుచుకోవచ్చు.
‣ పరీక్షకు ముందు అందుబాటులో ఉన్న విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే టైమ్టేబుల్ వేసుకుని దాన్ని క్రమం తప్పకుండా పాటించడం ఎంతో అవసరం.
‣ డిప్లొమా, డిగ్రీలో చదివిన సబ్జెక్టుల నుంచి 75 శాతం ప్రశ్నలు వస్తాయి. అందువల్ల పాఠ్యాంశాలపె పట్టు సాధించాలి. అవన్నీ చదివినవే అయినప్పటికీ వాటిని పునశ్చరణ చేసుకోవాలి.
‣ అభ్యర్థులను టైర్-1లో సాధించిన మార్కుల ఆధారంగానే స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలకు ఎంపికచేస్తారు. కాబట్టి దీంట్లో కనీసార్హత మార్కులు సాధించడానికి ప్రయత్నించాలి.
‣ పరీక్ష వ్యవధి 2 గంటలు కాబట్టి ఆ నిర్ణీత సమయంలోనే పాత ప్రశ్నపత్రాలను పూర్తిచేయడానికి ప్రయత్నించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 23.06.2023
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్లో: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణలో: హైదరాబాద్/ సికిందరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్.
వెబ్సైట్: https://www.mha.gov.in/en
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీ, బీటెక్తో వాయుసేనలో ఉన్నతోద్యోగం
‣ ఇంటర్తో ఆర్మీలో చదువు.. ఆపై ఉద్యోగం
‣ ఎస్ఎస్బీలో 1,656 ఉద్యోగాలు