• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సైనిక కొలువుకు సులువు దారి!

ఏఐఎస్‌ఎస్‌ఈఈ - 2024 నోటిఫికేషన్‌ వివరాలు



రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి సైనిక్‌ స్కూళ్లు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అక్కడే చదువుకోవచ్చు. అలాగే విద్యతోపాటు త్రివిధ దళాలకు కావాల్సిన నైపుణ్యాలనూ సొంతం చేసుకోవచ్చు. ఈ సంస్థల్లో వ్యక్తిగత క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉంటుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ) - 2024తో దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు భర్తీ చేస్తారు. 


దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 33 సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయి.  వీటిలో ప్రవేశానికి పరీక్ష తప్పనిసరి. దీన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. అలాగే కొత్తగా ప్రారంభమైన 19 సంస్థల్లో ఆరో తరగతిలోనే విద్యార్థులను చేర్చుకుంటారు. వీటికి సైనిక్‌ స్కూల్‌ సొసైటీ నిబంధనలు జారీ చేస్తుంది. కొత్తగా ప్రారంభమైన ప్రతి పాఠశాల కనీసం 40 శాతం సీట్లను ఆల్‌ ఇండియా మెరిట్‌ లిస్టు ప్రకారం భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యం.. ఇలా పలు విభాగాల్లో ఈ స్కూళ్లు నడుస్తున్నాయి. అందువల్ల ఫీజు ఒకేలా ఉండదు. 


ప్రయోజనాలెన్నో 

ప్రభుత్వ పరంగా జరుగుతోన్న ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ శాతం రక్షణ రంగంలోనే ఉంటున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సులతోపాటు సీఏపీఎఫ్‌లోకివచ్చే.. బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ.. తదితర విభాగాల్లో క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎక్కువ నియామకాలు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఉంటాయి. యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ వీటిలో అత్యంత ముఖ్యమైనది. అలాగే ఆర్మీలో గ్రూప్‌ ఎక్స్, వై. నేవీలో సెయిలర్‌-ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ. ఎయిర్‌ ఫోర్స్‌లో ఎయిర్‌ మెన్‌ టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలు ఇంటర్‌ విద్యార్హతతో భర్తీ చేస్తున్నారు. 


ఈ ప్రకటనలన్నీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వెలువడుతున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు హైస్కూల్‌ నుంచే సరైన శిక్షణ పొందితే సులువుగా విజయం సాధించగలరు అందువల్ల ఈ పరీక్షల్లో సైనిక్‌ పాఠశాల నేపథ్యం ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది విజయవంతమవుతున్నారు. ఈ స్కూళ్ల పర్యవేక్షణ రక్షణ రంగంలో ఉన్నత స్థాయిలో పనిచేసినవారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇక్కడ చదువుతోపాటు క్రీడలు, క్రమశిక్షణ, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యమిస్తారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలవుతుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి బాలికలూ దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిదిలో చేరడానికి బాలురే అర్హులు. పరీక్షలో ప్రతిభ, మెడికల్‌ టెస్టులతో విద్యార్థులను ఎంపిక చేస్తారు.


పరీక్ష ఇలా 

ఆరో తరగతికి: పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 125 ప్రశ్నలు వస్తాయి. సీబీఎస్‌ఈ ఐదో తరగతి సిలబస్‌ నుంచి వీటిని అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మ్యాథ్స్‌ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. జీకే (సైన్స్, సోషల్‌) 25, లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌/తెలుగు/ హిందీ.. ఇలా నచ్చిన భాష ఎంచుకోవచ్చు) 25, ఇంటెలిజెన్స్‌ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. తెలుగు మాధ్యమంలోనూ పరీక్ష రాసుకోవచ్చు. 


తొమ్మిదో తరగతికి: 400 మార్కులకు ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు వస్తాయి. సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి సిలబస్‌ నుంచి వీటిని అడుగుతారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. మ్యాథ్స్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇంగ్లిష్, ఇంటెలిజెన్స్, జనరల్‌ సైన్స్, సోషల్‌ సైన్స్‌ ఒక్కో విభాగం నుంచీ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. 


రెండు తరగతుల ప్రవేశాలకు సంబంధించి పరీక్ష సిలబస్‌ వివరాలు ప్రకటించారు. సబ్జెక్టులవారీ ఆ పాఠ్యాంశాలను చదువుకుంటే సరిపోతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. వాటికి సమాధానాలను ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి. పరీక్షలో అర్హత సాధించడానికి సబ్జెక్టులవారీ కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే మొత్తం మీద 40 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో విజయవంతమైనవారిని ఆరు, తొమ్మిదో తరగతుల్లో చేర్చుకుంటారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.  


సీట్లు.. ఫీజు 

మొత్తం సీట్లలో 67 శాతం ఆ సైనిక్‌ స్కూల్‌ ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారికి దక్కుతాయి. కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో 78, తొమ్మిదిలో 22 సీట్లు ఉన్నాయి. కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో 105, తొమ్మిదిలో 10 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లోని 67 శాతం సీట్లకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చు. సైనిక స్కూళ్లలో చేరిన విద్యార్థులు ఫీజు చెల్లించాలి. బోధన, వసతి, భోజనం అన్నీ కలిపి ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలు అవసరమవుతాయి. అయితే మెరిట్‌ విద్యార్థులు, అల్పాదాయ వర్గాలకు రాష్ట్రాలు స్కాలర్‌షిప్పు అందించడం లేదా ఫీజు మినహాయించడం చేస్తున్నాయి. కొత్తగా ప్రారంభమైన ఆదానీ వరల్డ్‌ స్కూల్‌ నెల్లూరులో ఆరో తరగతిలోకి 80 సీట్లు కేటాయించారు.


ఏయే అర్హతలు?   

ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. అలాగే మార్చి 31, 2024 నాటికి వయసు 10 నుంచి 12 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2012 - మార్చి 31, 2014 మధ్య జన్మించినవారు అర్హులు. తొమ్మిదిలో చేరాలనుకున్నవారు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుండాలి. వయసు మార్చి 31, 2024 నాటికి 13 నుంచి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2009 - మార్చి 31, 2011 మధ్య జన్మించినవారు అర్హులు. 


దరఖాస్తులు: డిసెంబరు 16 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.


పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.500. మిగిలిన అందరికీ రూ.650.


పరీక్ష తేదీ: జనవరి 21  


పరీక్ష కేంద్రాలు:

ఏపీలో.. అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్‌. 


వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/AISSEE/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!

‣ శ్రద్ధగా.. ఆసక్తిగా విందాం!

‣ నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

‣ ఆన్‌క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌

Posted Date : 14-11-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌