• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆర్మీ పాఠశాలల్లో బోధనకు సిద్ధమా!

136 స్కూళ్లలో 8700 ఖాళీల భర్తీకి ప్రక్రియ ప్రారంభం

ఆర్మీ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా మొత్తం 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ విభాగాల్లో అన్ని సబ్జెక్టులూ కలుపుకుని 8700 ఖాళీలు ఉన్నాయి. స్క్రీనింగ్‌ పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఇందులో సాధించిన స్కోరుతో సంబంధిత పాఠశాలలవారీ ప్రకటన వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.

ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) ఆధ్వర్యంలో సైనిక పాఠశాలలు నడుస్తున్నాయి. ఇక్కడ సీబీఎస్‌ఈ బోధన ఉంటుంది. స్క్రీనింగ్‌ టెస్టులో సాధించిన స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ఈ వ్యవధిలోగా ఆర్మీ పాఠశాలల ప్రకటనలు వెలువడినప్పుడు స్క్రీనింగ్‌ టెస్టు మార్కులతో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఇంటర్వ్యూ, ఇతర పరీక్షలు నిర్వహించి, విధుల్లోకి తీసుకుంటారు.

ఎంపిక ఇలా...

మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో ముఖాముఖి ఉంటుంది. మూడో దశలో టీచింగ్‌ స్కిల్స్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీపై పరీక్ష ఉంటుంది. వీటిని సెలక్షన్‌ కమిటీ పరిశీలిస్తుంది. భాషోపాధ్యాయులకైతే ఎస్సే, కాంప్రహెన్షన్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 15 మార్కులు కేటాయించారు. స్క్రీనింగ్‌లో అర్హత సాధించినవారికే రెండు, మూడో దశలు ఉంటాయి. టీజీటీ, పీజీటీ పోస్టులకు ఎంపిక కావడానికి సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అయితే ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్ష రాసుకోవడానికి సీటెట్‌ లేదా టెట్‌ అవసరం లేదు.

పరీక్ష విధానం

పీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి పార్ట్‌-ఎ పరీక్ష ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. వీటిని మూడు సెక్షన్లలో అడుగుతారు. సెక్షన్‌ ఎలో జనరల్‌ అవేర్‌నెస్, మెంటల్‌ ఎబిలిటీ, కాంప్రహెన్షన్‌ల నుంచి 28 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ బిలో వర్తమానాంశాల నుంచి 28 ప్రశ్నలు జాతీయ, అంతర్జాతీయ, భారత్‌కు ప్రాధాన్యం ఉన్న అంశాల నుంచి అడుగుతారు. సెక్షన్‌ సిలో 24 ప్రశ్నలు బోధన విధానం, ఎన్‌ఈపీ, ఇన్ఫోటెక్‌ విభాగాల్లో ఉంటాయి.

టీజీటీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్‌ ఎతోపాటు పార్ట్‌ బి రాయాలి. ఈ విభాగంలో 120 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు.

టీజీటీ పరీక్షలో పార్ట్‌ బిలో 4 సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్‌ ఎలో సంబంధిత సబ్జెక్టు నుంచి 42 ప్రాథమిక ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ బిలో మరో 42 ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టులోనే మధ్యమ స్థాయిలో ఉంటాయి. ఈ రెండు సెక్షన్లలోని ప్రశ్నలూ ఆరు నుంచి పదో తరగతి సిలబస్‌ నుంచే ఉంటాయి. సెక్షన్‌ సిలో 12 ప్రశ్నలు కఠిన స్థాయిలో ఉంటాయి. వీటిని ఇంటర్‌ సిలబస్‌ నుంచి అడుగుతారు. సెక్షన్‌ డిలో 24 ప్రశ్నలు డిగ్రీ సిలబస్‌ నుంచి కఠినస్థాయిలో వస్తాయి. 

పీజీటీ పరీక్షలో పార్ట్‌ బిలో 3 సెక్షన్ల నుంచి ప్రశ్నలుంటాయి. సెక్షన్‌ ఎలో 42 ప్రశ్నలు ఇంటర్‌ సిలబస్‌ నుంచి ప్రాథమిక స్థాయిలో వస్తాయి. సెక్షన్‌ బిలో మరో 42 ప్రశ్నలు ఇంటర్‌ సిలబస్‌ నుంచే మధ్యమ స్థాయి కాఠిన్యతతో అడుగుతారు. సెక్షన్‌ సిలో 36 ప్రశ్నలు పీజీ సిలబస్‌ నుంచి కఠిన స్థాయిలో ఉంటాయి. 

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే వస్తాయి. అన్ని పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ఆయా విభాగాల్లో 50 శాతం మార్కులు సాధిస్తేనే అర్హులవుతారు. పరీక్షపై అవగాహన నిమిత్తం మాక్‌ టెస్టును నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి ఆసక్తి ఉన్నవారు రాసుకోవచ్చు.

అర్హత..

పీజీటీ పోస్టులకు: పీజీ, బీఎడ్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత

టీజీటీ పోస్టులకు: గ్రాడ్యుయేషన్, బీఎడ్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత

పీఆర్‌టీ పోస్టులకు: గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఎడ్‌ లేదా రెండేళ్ల ఎడ్యుకేషన్‌ డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత

వయసు: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి. బోధనలో అయిదేళ్ల అనుభవం ఉంటే 57 ఏళ్లలోపువాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 28 వరకు స్వీకరిస్తారు

పరీక్ష ఫీజు: రూ.385

స్క్రీనింగ్‌ పరీక్ష: ఫిబ్రవరి 19, 20 తేదీల్లో  

అడ్మిట్‌ కార్డులు: ఫిబ్రవరి 10 నుంచి లభిస్తాయి.

ఫలితాలు: ఫిబ్రవరి 28న వెలువడతాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌/ సికింద్రాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.awesindia.com/
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జవాబుదారీతనం నేర్చుకో... పెంచుకో!

‣ గ్రూప్‌-4 ఉద్యోగం సాధించండి... ఇలా!

‣ బాలికలకు ఉపకారవేతనాలు

‣ క్లాట్‌ మార్గంలో నాణ్యమైన న్యాయవిద్య!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-01-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌