జంతుశాస్త్రం ద్వితీయ సంవత్సరం పాఠ్యాంశాలన్నీ మానవ ఇతివృత్తం ఆధారంగానే ఉంటాయి. దీనిలో ఉండే మానవుడి అభివృద్ధి, పరిణామం, జన్యుశాస్త్రం లాంటి విషయాలు విద్యార్థికి ఆసక్తిని కలిగిస్తాయి. సీనియర్ ఇంటర్లో విద్యార్థి పాఠానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివితే ప్రాక్టికల్స్ను సులువుగా చేయవచ్చు. సిలబస్ ప్రకారం ప్రణాళికను రూపొందించుకొని చదివితే మంచి మార్కులు పొందవచ్చు.
యూనిట్లవారీగా వెయిటేజి
IB. శ్వాసించడం - వాయువుల వినిమయం: 2 + 4 + 4 మార్కులు
IIA. శరీర ద్రవాలు - ప్రసరణ
} 2 + 2 + 4 + 8 మార్కులు
IIB. విసర్జక పదార్థాలు, వాటి విసర్జన
IIA. కండర - అస్థిపంజర వ్యవస్థ
} 2 + 4 + 8 మార్కులు
IIIB. నాడీ నియంత్రణ, సమన్వయం
IVA. అంతస్రావక వ్యవస్థ,
రసాయన సమన్వయం} 2 + 2 + 4 + 4 + 4 మార్కులు
IVB. రోగ నిరోధక వ్యవస్థ
VA. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
} 4 + 4 + 8 మార్కులు
VB. ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం
VI. జన్యుశాస్త్రం: 2 + 2 + 4 + 8 మార్కులు
VIII. అనువర్తిత జీవశాస్త్రం: 2 + 2 + 4 + 4 మార్కులు
సిలబస్ విశ్లేషణ
జంతుశాస్త్రం ద్వితీయ సంవత్సరం ప్రశ్నపత్రం విభాగం - సి లో 4 వ్యాసరూప సమాధాన ప్రశ్నలను (8 మార్కులు) అడుగుతారు. ఇందులో రెండు ప్రశ్నలకే సమాధానాలు రాయాలి. ఒక్కోదానికి 6 మార్కులు; పటాలు గీసి, భాగాలు గుర్తిస్తే 2 మార్కులు ఇస్తారు. పై పాఠ్యాంశాలను పరిశీలిస్తే IIA, VA, VI యూనిట్ల నుంచి 8 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ యూనిట్లనే ఎక్కువగా చదవడం, పటాలను ప్రాక్టీస్ చేయడం మంచిది. IB, IIB, IIIB యూనిట్ల నుంచి ఒకసారి మాత్రమే 8 మార్కుల ప్రశ్నలను అడిగారు. కాబట్టి వీటిపై కూడా దృష్టి సారించాలి.
విభాగం - బి లో 12 ప్రశ్నలు ఇచ్చి 6 ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. 6 ప్రశ్నలను ఛాయిస్ కింద వదిలివేయవచ్చు. 4 మార్కుల ప్రశ్నల్లో పటం ఉంటే సమాధానానికి 3 మార్కులు, పటం గీసి భాగాలు గుర్తిస్తే 1 మార్కు ఇస్తారు. పూర్తిగా పటం ఉన్న ప్రశ్నయితే పటానికి 3 మార్కులు, భాగాలను గుర్తించినందుకు 1 మార్కు చొప్పున ఇస్తారు.
2021 వార్షిక పరీక్షల్లో మూత్రపిండం నిలువుకోత, వెన్నుపాము అడ్డుకోత పటాల్లో ఒకటి కచ్చితంగా 4 మార్కుల ప్రశ్నగా వచ్చే అవకాశం ఉంది. సరైన మెలకువలు పాటిస్తూ పటాలు, వాటి భాగాలను సాధన చేస్తే పూర్తి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది.
విభాగం - ఎ లో 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఒకటి/రెండు వాక్యాల్లో రాయాలి. ఛాయిస్ ఉండదు. రెండు మార్కుల ప్రశ్నలు దాదాపు ప్రతి యూనిట్ నుంచి వస్తున్నాయి. కాబట్టి అన్ని యూనిట్లలోని ప్రశ్నలు, ఇంతకు ముందు పరీక్షల్లో అడిగిన ప్రశ్నలపై దృష్టి సారించాలి.
విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినవి
* ఒత్తిడి, ఆందోళన, భయాన్ని అధిగమించాలంటే చదివిన పాఠ్యాంశాల మీద పట్టు సాధించాలి.
* ప్రతి పాఠ్యాంశాన్ని వీలైనంతవరకు పునశ్చరణ చేయాలి.
* పునశ్చరణ సమయంలో అతిముఖ్యమైనవి, ముఖ్యమైనవి, సాధారణమైనవిగా పాఠ్యాంశాలను విభజించి సొంత నోట్స్ తయారు చేసుకోవాలి.
* సమయపాలన పాటించాలంటే వీలైనన్ని మాక్ టెస్ట్లు రాయాలి.
* ఏకధాటిగా చదవకుండా మధ్యలో 20 నిమిషాల పాటు విరామం తీసుకోవడం ద్వారా చదివిన పాఠ్యాంశాలు సులువుగా గుర్తుంటాయి.
* పరీక్ష సమయంలో ప్రశ్నపత్రం ఇవ్వగానే సానుకూలంగా ఆలోచించి కఠినమైన ప్రశ్నలు అందరికీ కఠినమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
* రాత్రంతా మెలకువగా ఉండి చదవడం వల్ల ప్రయోజనం ఉండదు. వీలైనంత త్వరగా (రాత్రి 10 గంటల్లోపు పడుకొని, ఉదయం 3 గంటలకు లేవాలి) లేచే ప్రయత్నం చేయండి. కఠినమైన అంశాలు ఉదయం చదవడం వల్ల ఎక్కువగా గుర్తుంటాయి.
* పరీక్ష సమయంలో సులభమైన/మీకు బాగా వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ముందుగా రాయండి. దీనివల్ల పేపర్ దిద్దే ఎగ్జామినర్కు మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
* అవసరమైన మేరకే సమాధానాలు రాయండి. బాగావచ్చని సమాధానాలు ఎక్కువ రాయడం కూడా పొరపాటే.
* సమాధానాలు రాస్తున్నప్పుడు మధ్యలో గుర్తురాకపోతే దానికి సరిపడా ఖాళీ వదిలి, మరో సమాధానం రాయండి.
* ఒక విభాగానికి సంబంధించిన సమాధానాలన్నీ ఒకేచోట రాయడం మంచిది.
* సమాధాన పత్రాన్ని 10 నిమిషాల ముందే పూర్తిచేసి రాసిన జవాబులను రీవెరిఫికేషన్ చేసుకోవాలి (విభాగం, క్రమసంఖ్య, పటాలు, లేబిలింగ్).