‣ ఇంటర్ అర్హతతో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన విడుదల
ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు ఉచితంగా బీటెక్ చదువుకుని ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. నేవీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన వెలువడింది. ఎంపికైతే చాలు.. ఇంజినీరింగ్ విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనం అన్నీ పైసా చెల్లించకుండానే లభిస్తాయి. కోర్సు పూర్తయిన వెంటనే సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే లక్ష రూపాయలు వేతనంగా అందుతుంది. జేఈఈ మెయిన్స్లో సాధించిన ర్యాంకు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు!
ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారు నేవీ 10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జేఈఈ మెయిన్లో ర్యాంకు పొంది ఉండడం తప్పనిసరి. అందులో సాధించిన ర్యాంకుతో మెరిట్ ప్రకారం వచ్చిన దరఖాస్తులను మదింపు చేస్తారు. ఖాళీలకు అనుగుణంగా కొంతమందిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీరికి సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ)... బెంగళూరు, భోపాల్, కోల్కతా, విశాఖపట్నంల్లో ఎక్కడైనా మార్చి నుంచి ఏప్రిల్ లోపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం 5 రోజుల పాటు ఇవి రెండు దశల్లో కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్-1 పరీక్షలో భాగంగా ఇంటలిజెన్స్ టెస్టు, పిక్చర్ పెర్సెప్షన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికే మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్-2 ఇంటర్వ్యూలు చేపడతారు. దీనిలో భాగంగా సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. వీటిలో విజయవంతమైనవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ నిలిచినవారిని తుది నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్ఎస్బీలో సాధించిన మెరిట్ ప్రకారం అర్హులకు అవకాశం కల్పిస్తారు.
శిక్షణ ఇలా..
ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జూన్ 2022 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్ నేవల్ అకాడెమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్ అప్లైడ్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు...అన్నీ ఉచితంగా అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
అనంతరం వీరిని సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు. చేరిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ లేదా ఎడ్యుకేషన్ బ్రాంచ్ కేటాయిస్తారు. వీరికి లెవెల్ 10 మూలవేతనం అంటే రూ.56,100 అందుతుంది. మిలటరీ సర్వీస్ పే కింద రూ.15,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ సమయంలో అన్నీ కలుపుకుని గరిష్ఠంగా రూ.లక్ష వరకు వేతనరూపంలో అందుకోవచ్చు. దీంతోపాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్ సామగ్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు..మొదలైన రాయితీలెన్నో పొందవచ్చు. 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు లభిస్తాయి.
ఎవరు అర్హులు?
ఖాళీలు: మొత్తం 35. వీటిలో 30 ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్లోనూ 5 ఎడ్యుకేషన్ బ్రాంచ్లో ఉన్నాయి.
విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్ ఇంగ్లిష్లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్-2021లో అర్హత సాధించినవారై ఉండాలి. వివాహం కాని పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
వయసు: జనవరి 2, 2003 - జులై 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 8
వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
*************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష తుది సన్నద్ధత ఎలా?
‣ నచ్చని సబ్జెక్టుపై మక్కువ పెరగాలంటే?
‣ కోర్సులు.. కొలువులపై సలహాలే వృత్తిగా..!
‣ ఆసాంతం స్ఫూర్తితో అలాగే సాగాలంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.