ప్రధాన పరీక్షలో పేపర్ - 4 జనరల్ స్టడీస్ అత్యంత ప్రధానమైంది. ఈ పేపర్లోని ప్రతి అంశాన్ని వర్తమానాంశాలతో జోడిస్తూ చదవాలి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై పట్టు సాధించాలి.
ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు
కరెంట్ అఫైర్స్: 30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, సమకాలీన అంశాలు, సదస్సులు, ముఖ్యమైన ఒప్పందాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రధానంగా గడిచిన ఆరు నెలలు ముఖ్యం. వర్తమానం, భవిష్యత్తులో జరగబోయే ఒప్పందాలు, సమావేశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.
జనరల్ సైన్స్: 25- 30 ప్రశ్నలు వస్తున్నాయి. ప్రధానంగా నిత్యజీవితంలో వస్తున్న శాస్త్ర సాంకేతిక మార్పులు, జన్యు సంబంధ అంశాలు, వ్యాధులు, పర్యావరణ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు ఇస్తున్నారు. అందుకే భౌతిక, రసాయన మార్పులు, అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధన, నూతన పోకడలపై దృష్టి కేంద్రీకరించాలి.
భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం: 30 ప్రశ్నల వరకు వస్తున్నాయి. ప్రధానంగా ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. దీనిలో సింధునాగరికత కాలం నుంచి మౌర్యులు, గుప్తులు, దిల్లీ సుల్తానులు, మొగలుల గురించి ఎక్కువగా చదవాలి. ఈ మధ్య అత్యంత కఠినంగా క్రమానుగత, అవరోహణ, ఆరోహణ విధానంలో ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల వీటిపై విషయ వివరణ, విశ్లేషణ అవగాహన అవసరం.
తెలంగాణ, భారతదేశ భూగోళం: 30- 35 ప్రశ్నల వరకు రావొచ్చు. భౌగోళిక, నైసర్గిక అంశాలు, నదీవ్యవస్థ, శీతోష్ణస్థితి, నీటిపారుదల, వ్యవసాయం, రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు, పర్యాటక రంగం, మృత్తికలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఎక్కువగా జతపరచమనే విధానంలో అడుగుతున్నారు. 31 జిల్లాలతో కూడిన తెలంగాణపై ప్రశ్నలు వస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ: 15- 20 ప్రశ్నలు వస్తున్నాయి. ప్రధానంగా ప్రణాళికలు, లక్ష్యాలు, వృద్ధి, పన్నులు, జాతీయాభివృద్ధి, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘం, జీఎస్టీ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
భారత రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థ: 25 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. ప్రధానంగా రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, హైకోర్టు, రాజ్యాంగ సవరణలు, పార్టీలు, సుప్రీంకోర్టు తీర్పులు, కేసులు, న్యాయ సమీక్షపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి.
మూర్తిమత్వ పరీక్ష: 5- 10 ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థుల, గుణగణాలనూ, లక్షణాలనూ, మానసిక, మూర్తిమత్వ సామర్థ్యం, ప్రజ్ఞ వంటివి పరీక్షిస్తారు. నైతిక విలువలు, లింగ వివక్షత, బలహీన వర్గాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.