* ఎస్ఐ/కానిస్టేబుల్స్: మెయిన్స్ వ్యూహం
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో తొలి దశ అయిన ప్రిలిమ్స్ ముగిసింది; శారీరక దృఢత్వ పరీక్షలకు రంగం సిద్ధమవుతోంది. ఆపై జరిగే మెయిన్స్ చాలా ముఖ్యం. దీనిలో నెగ్గాలంటే మూస విధానం పనికిరాదు. వివిధ అంశాలను సమకాలీన సామాజిక అంశాలతో పోల్చి చదవాలి. ఈ తరహాలో ఇప్పటినుంచే సన్నద్ధత ఆరంభిస్తే విజయ పథంలో కొనసాగుతున్నట్టే!
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి డిసెంబరు 17 నుంచి 35- 40 పనిదినాల్లో శారీరక దార్ఢ్య పరీక్షలను (పీఈటీ) నిర్వహించబోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డ్డి జిల్లాల్లో నాలుగు చోట్ల, వరంగల్లో రెండు చోట్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, సంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఒకచోట గ్రౌండ్లో పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించినవారు అక్టోబరు 29 నుంచి నవంబరు 18 అర్థరాత్రి వరకూ ఆన్లైన్ దరఖాస్తు అప్లోడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే శారీరక దార్ధ్య పరీక్షకు అనుమతి ఇస్తారు. ఎస్సై - కానిస్టేబుల్ పోస్టులకు ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు. అర్హత సాధించినవారు మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష మూడు దశల్లోనే ప్రధాన ఘట్టం. అందువల్ల పకడ్బందీ ప్రణాళికను వేసుకుని, సన్నద్ధమవ్వాలి.
ఎస్ఐ మెయిన్స్ పరీక్ష విధానం
ఎస్సై మెయిన్స్ తుది పరీక్షలో 4 పేపర్లను రాయాల్సి ఉంటుంది. పేపర్-1: జనరల్ ఇంగ్లిష్, పేపర్-2: తెలుగు/ ఉర్దూ, పేపర్-3: అరిథ్మెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, పేపర్-4: జనరల్ స్టడీస్.
పేపర్-1: జనరల్ ఇంగ్లిష్: దీనిలో ఉండే పార్ట్ - ఎ, బిలను మొత్తం 3 గంటల సమయంలో పూర్తిచేయాల్సివుంటుంది. టెన్త్ ప్రామాణిక స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు.
పార్ట్-ఎ: గ్రామర్పై 50 బహుళైచ్చిక ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు. దీనికి 45 నిమిషాలు కేటాయిస్తారు. 1/4వ వంతు నెగిటివ్ మార్కు విధానాన్ని ఈసారి ప్రవేశపెట్టారు.
పార్ట్ -బి: డిస్క్రిప్టివ్ విధానంలో 75 మార్కులకు ప్రశ్నలుంటాయి. 2.15 గంటల సమయం ఇస్తారు. ప్రెస్సీ రైటింగ్, లెటర్స్, రిపోర్ట్స్, ఎస్సై టైప్, టాపికల్ పారాగ్రాఫ్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
పేపర్ - 2 తెలుగు /ఉర్దూ: తెలుగు లేదా ఉర్దూను ఎంపిక చేసుకోవచ్చు. దీనిలో కూడా రెండు భాగాలుంటాయి. దీన్ని కనీస అర్హత పరీక్షగా మాత్రమే నిర్వహిస్తారు. అయితే పార్ట్ ఎ,బిలలో ఓసీ అభ్యర్థులు 40%, బీసీ అభ్యర్థులు 35%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30% కనీస క్వాలిఫయింగ్ మార్కులు తెచ్చుకోని పక్షంలో మిగతా రెండు పేపర్లను పరిగణించరు.
పార్ట్-ఎ: తెలుగు / ఉర్దూ పదజాలం, వ్యాకరణం, లాంగ్వేజీ స్కిల్స్, కాంప్రహెన్షన్పై బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి.50 ప్రశ్నలు, 25 మార్కులు. 45 నిమిషాల సమయం ఉంటుంది. నెగెటివ్ మార్కు 1/4 వ వంతు ఉంటుంది.
పార్ట్-బి: తెలుగు/ ఉర్దూ పేపర్ను డిస్క్రిప్టివ్ విధానంలో 75 మార్కులకు ఇస్తారు. 2.15 గంటల సమయంలో ప్రెస్సీ రైటింగ్, లెటర్ రైటింగ్, రిపోర్ట్స్, రీడింగ్, కాంప్రహెన్షన్ ప్రశ్నలు రాయాల్సివుంటుంది.
జనరల్ స్టడీస్కు ప్రాధాన్యం
ప్రధాన పరీక్షలో పేపర్- 3 అరిథ్మెటిక్, రీజనింగ్; పేపర్- 4 జనరల్ స్టడీస్ అత్యంత ప్రధానమైనవి. దీనిలో పేపర్ - 4 జనరల్ స్టడీస్ది గణనీయమైన కీలక పాత్ర. దీనిలో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు:
1. కరెంట్ అఫైర్స్: 30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, సమకాలీన అంశాలు, సదస్సులు, ముఖ్యమైన ఒప్పందాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రధానంగా గడిచిన ఆరు నెలలు ముఖ్యం. వర్తమానం, భవిష్యత్తులో జరగబోయే ఒప్పందాలు, సమావేశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.
2. జనరల్ సైన్స్: 25- 30 ప్రశ్నలు వస్తున్నాయి. ప్రధానంగా నిత్యజీవితంలో వస్తున్న శాస్త్ర సాంకేతిక మార్పులు, జన్యు సంబంధ అంశాలు, వ్యాధులు, పర్యావరణ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు ఇస్తున్నారు. అందుకే భౌతిక, రసాయన మార్పులు, అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధన, నూతన పోకడలపై దృష్టి కేంద్రీకరించాలి.
3. భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం: 30 ప్రశ్నల వరకు వస్తున్నాయి. ప్రధానంగా ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్రపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. దీనిలో సింధునాగరికత కాలం నుంచి మౌర్యులు, గుప్తులు, దిల్లీ సుల్తానులు, మొగలుల గురించి ఎక్కువగా చదవాలి. ఈ మధ్య అత్యంత కఠినంగా క్రమానుగత, అవరోహణ, ఆరోహణ విధానంలో ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల వీటిపై విషయ వివరణ, విశ్లేషణ అవగాహన అవసరం.
4. తెలంగాణ, భారతదేశ భూగోళం: 30- 35 ప్రశ్నల వరకు రావొచ్చు. భౌగోళిక, నైసర్గిక అంశాలు, నదీవ్యవస్థ, శీతోష్ణస్థితి, నీటిపారుదల, వ్యవసాయం, రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు, పర్యాటక రంగం, మృత్తికలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఎక్కువగా జతపరచమనే విధానంలో అడుగుతున్నారు. 31 జిల్లాలతో కూడిన తెలంగాణపై ప్రశ్నలు వస్తున్నాయి.
5. భారత ఆర్థిక వ్యవస్థ: 15- 20 ప్రశ్నలు వస్తున్నాయి. ప్రధానంగా ప్రణాళికలు, లక్ష్యాలు, వృద్ధి, పన్నులు, జాతీయాభివృద్ధి, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘం, జీఎస్టీ వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
6. భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ: 25 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. ప్రధానంగా రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, హైకోర్టు, రాజ్యాంగ సవరణలు, పార్టీలు, సుప్రీంకోర్టు తీర్పులు, కేసులు, న్యాయ సమీక్షపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి.
7. తెలంగాణ చరిత్ర - తెలంగాణ ఉద్యమం: అత్యధికంగా దీనినుంచి 30- 40 ప్రశ్నలు వస్తున్నాయి. ప్రధానంగా శాతవాహనులు, కాకతీయులు, చోళులు, ఇక్ష్వాకులతో పాటు నిజాం సంస్కరణలు, పరిపాలనా విధానాలపై, శిలాశాసనాలు, ప్రాచీన కట్టడాలు, గ్రంథాలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. 1948- 2014 మధ్య జరిగిన మూడు దశల ఉద్యమం గురించి విద్యార్థులు తెలుసుకోవాల్సి ఉంటుంది.
8. మూర్తిమత్వ పరీక్ష: 5- 10 ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థుల, గుణగణాలనూ, లక్షణాలనూ, మానసిక, మూర్తిమత్వ సామర్థ్యం, ప్రజ్ఞ వంటివి పరీక్షిస్తారు. నైతిక విలువలు, లింగ వివక్షత, బలహీన వర్గాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.
కానిస్టేబుల్ తుది పరీక్ష
ఎస్ఐ పరీక్ష సన్నద్ధతకు పేర్కొన్న అంశాలన్నీ కానిస్టేబుల్ తుది పరీక్ష (మెయిన్స్) లో ఉంటాయి. అదనంగా చూడాల్సినవి...
జనరల్ ఇంగ్లిష్: దీనిలో దాదాపు 20 మార్కుల వరకు ప్రశ్నలు వస్తున్నాయి. ప్రధానంగా యాంటనిమ్స్. సిననిమ్స్, ఆర్టికల్స్, వర్బ్స్, యాడ్జెక్టివ్స్, పారాజబ్లింగ్స్, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్స్, రీడింగ్ కాంప్రహెన్షన్స్, జనరల్ గ్రామర్పై ప్రశ్నలు అడుగుతున్నారు.
అరిథ్మెటిక్- రీజనింగ్: దీనిలో 60 ప్రశ్నల వరకు వస్తాయి.
జనరల్ నాలెడ్జ్: ఇందులో 120 ప్రశ్నల వరకు వస్తాయి. జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, చరిత్ర - తెలంగాణ ఉద్యమం, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, మూర్తిమత్వ పరీక్ష వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.