ఈ రైల్వే ఉద్యోగాలకు ఎంపికైతే.. పోస్టును బట్టి ప్రొడక్షన్ యూనిట్, వర్క్షాప్, జనరల్ సర్వీస్, క్యారేజ్ అండ్ వ్యాగన్, ప్రింటింగ్ ప్రెస్, డీజిల్ షెడ్, ట్రాక్ మెషిన్, టెలీకమ్యూనికేషన్ సిస్టమ్, సిగ్నల్ సిస్టమ్ వంటి వివిధ డిపార్ట్మెంట్లలో ఆపరేటర్, ఫిట్టర్, డ్రైవర్, పెయింటర్ పోస్టులతోపాటు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల్లో విధులు నిర్వర్తించాల్సివుంటుంది. నెల జీతం రూ.35,000 నుంచి రూ.40,000 వరకు వస్తుంది.
ఎవరు అర్హులు?
* పదోతరగతి తర్వాత ఐటీఐ పూర్తి చేసినవారు, 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసినవారు
* పాలిటెక్నిక్ పూర్తిచేసిన తర్వాత 3 సంవత్సరాల ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు
* మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ పూర్తిచేసినవారు
* చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ పోస్టులకు అనర్హులు.
వయః పరిమితులు: జనరల్ కేటగిరీవారు 18-30 సంవత్సరాల మధ్యవారై ఉండాలి
ప్రథమ కంప్యూటర్ ఆధారిత పరీక్ష: అభ్యర్థులు ఏ రైల్వే జోన్కు దరఖాస్తు చేయాలో నిర్ణయించుకుని, ఆయా రైల్వే వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు పూర్తిచేసి, ఫీజు చెల్లించాలి. ఏదైనా ఒక రైల్వే జోన్కు మాత్రమే అప్లై చేయాలి. ఒక అభ్యర్థి ఒక దరఖాస్తును మాత్రమే పూర్తి చేయాలి.
ఎంపిక ప్రక్రియ: అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ), టెక్నిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసినవారు మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయినవారికి రెండో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. మొదటి పరీక్షలోని మార్కులు క్వాలిఫయింగ్ మార్కులు మాత్రమే. రెండో పరీక్షలోని మార్కుల ఆధారంగా టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేస్తారు.
ఏఎల్పీ పోస్టుకు దరఖాస్తు చేసినవారికి రెండో సీబీటీ తర్వాత కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ను నిర్వహిస్తారు. రెండో సీబీటీలో వచ్చిన మార్కుల్లో 70%, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చిన వాటిల్లో 30% మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
పరీక్ష జరగడానికి 3 నెలల సమయం ఉంది. రోజువారీ వీలైనంత ఎక్కువ సమయం సన్నద్ధత కోసం వెచ్చించటం సముచితం. ఎక్కువ ప్రశ్నలను సాధన చేస్తూ ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు!
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (ఏఎల్పీ/ టెక్నిషియన్)
అరిథ్మెటిక్, మేథమేటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అంశాల నుంచి 75 ప్రశ్నలు ఇస్తారు. 60 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, తప్పు సమాధానానికి 1/3 రుణాత్మక మార్కులున్నాయి.
జనరల్ కేటగిరీవారు 40%, ఓబీసీ, ఎస్సీవారు 30%, ఎస్టీ వారు 25% కనీస అర్హత మార్కులు పొందాలి.
రెండో సీబీటీ: (ఏఎల్పీ/టెక్నిషియన్)
మొదటి సీబీటీలో క్వాలిఫై అయిన వారిలో, పోస్టుల ఆధారంగా 15 రెట్ల మంది అభ్యర్థులను రెండో సీబీటీకి అర్హులుగా నిర్ణయిస్తారు. పార్ట్- ఎ, పార్ట్- బి పరీక్షలుంటాయి. రెండు పరీక్షలను 2.30 గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
పార్ట్ - ఎ: మేథమేటిక్స్, అరిథ్మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, బేసిక్ సైన్స్, ఇంజినీరింగ్ (టెక్నికల్) సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి.
పార్ట్ - బి: డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ వారు నిర్ణయించిన ట్రేడ్ సిలబస్ ఆధారంగా 75 ప్రశ్నలు ఇస్తారు. 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఇందులో 35% అర్హత మార్కులు సాధిస్తే చాలు. మొత్తం మెరిట్ మార్కుల్లో పార్ట్- బిని పరిగణించరు.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఎల్పీ పోస్టులకు మాత్రమే)
రెండో సీబీటీలో క్వాలిఫై అయినవారిలో పోస్టుల సంఖ్య ఆధారంగా 8 రెట్ల మందికి కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతీ టెస్ట్ బ్యాటరీలో 42 మార్కులు రావాలి. ఈ పరీక్ష సైకాలజీ టెస్ట్ లాంటిది.
- సుధీర్ చక్రవర్తి చాగంటి, Sreedhar's CCE