‣ క్లర్కుల నియామకానికి ఐబీపీఎస్ ప్రకటన
కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ రెండు వారాల ముందుగానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 1557 క్లర్కుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర బ్యాంకుల నుంచి మరికొన్ని పోస్టులు కలిసే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్నవారు రాతపరీక్షలో మెరుగైన ప్రతిభ చూపాల్సివుంటుంది. వేగానికీ కచ్చితత్వానికీ ప్రాధాన్యం ఉన్న ఈ పరీక్షలో ఎలా ముందుకు సాగాలో నిపుణుల సూచనలు.. ఇవిగో!
గత ఏడాది పోస్టులతో పోలిస్తే ప్రస్తుత సంఖ్యలో భారీ వ్యత్యాసమున్నప్పటికీ ఈ ప్రక్రియ ద్వారా నియామకాలు జరిపే 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దవైన బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, ఇండియన్, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఖాళీల వివరాలను ఇంకా పేర్కొనలేదు. ఖాళీల సంఖ్యను ‘జీరో’గా, ‘నిల్’గా పేర్కొన్నవాటిల్లోనూ నియమకాలు జరిపే సమయానికి (ఏప్రిల్ 1, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు) కొన్ని పోస్టులు భర్తీ చేసే అవకాశముంది. అందువల్ల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అందువల్ల ప్రస్తుత ఖాళీల సంఖ్యను చూసి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
ముఖ్య వివరాలు
‣ మొత్తం ఖాళీలు: 1557 (ఏపీ-10, తెలంగాణ-20)
‣ విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (23.09.2020నాటికి); కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
‣ వయసు: 20- 28 సంవత్సరాలు (1.09.2020 నాటికి)
‣ ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ఆధారంగా.
‣ దరఖాస్తు విధానం: ఆన్లైన్.
‣ దరఖాస్తు చివరితేదీ: 23.09.2020
‣ దరఖాస్తు ఫీజు: రూ.175 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్); ఇతరులకు రూ.850
‣ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు: 5, 12, 13 డిసెంబరు 2020
‣ మెయిన్స్: 24.01.2021
‣ వెబ్సైట్: www.ibps.in