‣ 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్
దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి కారణం పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో వీరి పాత్ర కీలకం. రాష్ట్రానికి చెందిన పోలీసులే కాకుండా వివిధదేశ భద్రతా బలగాలు ఈ విధులు నిర్వహిస్తుంటాయి. ప్రత్యేక సందర్భాలు, సంఘటనలు, విపత్తులసమయంలో ఈ పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగుతుంటాయి. వీటిలో ఉద్యోగాల భర్తీని కేంద్ర హోంశాఖ ఆదేశాలతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) చేపడుతుంది. తాజాగా ఆయా బలగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఖాళీలను భర్తీ చేయడానికి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా మొత్తం 25,271 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఖాళీలను భర్తీ చేయనుంది.
విభాగాల వారీగా బోర్డర్ పోలీస్ ఫోర్స్(బీఎస్ఎఫ్)-7,545, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)-8,464, సశస్త్ర సీమబల్(ఎస్ఎస్బీ)-3,806, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)-1,431, అసోం రైఫిల్(ఏఆర్)-3,785, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్ఎస్ఎఫ్)-240 పోస్టులు ఉన్నాయి. అసోం రైఫిల్స్లో రైఫిల్మెన్(జనరల్ డ్యూటీ) మినహా మిగతా వాటిలో కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) విధులు నిర్వహించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతకు వీటిలో చేరడానికి ఇది చక్కటి అవకాశం. విభాగాలను బట్టి జీతం రూ.21,400 నుంచి రూ.69,100 వరకు అందుతుంది.
మహిళలకు ప్రాధాన్యం
కేంద్ర భద్రతా బలగాల్లో మహిళా భాగస్వామ్యం పెంచేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈమేరకు ప్రస్తుత నోటిఫికేషన్లో పోస్టులను కేటాయించారు. అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకుంటే కేంద్ర భద్రతా బలగాల్లో ధీర వనితలుగా రాణించవచ్చు.
ఇదీ అర్హత
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 1, 2021 నాటికి పదో తరగతి ఉత్తీర్ణత సాధిస్తే చాలు. వయసు ఆగస్టు 1, 2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంది.
ఎంపిక ఇలా..
అర్హులైన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఉంటుంది. అందులో ప్రతిభ ప్రదర్శించిన వారిని షార్ట్ లిస్ట్ చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ) నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు ఉంటాయి. అదే సమయంలో అభ్యర్థి విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. అనంతరం తుది ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు ఫీజు రూ.100 చెల్లించాలి. దరఖాస్తులకు ఆగస్టు 31, 2021 తుది గడువు. సెప్టెంబర్ 2, 2021 లోపు ఫీజు చెల్లించాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
కాకినాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
పరీక్షలో ఏముంటుంది?
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 90 నిమిషాల పరీక్షలో 100 ప్రశ్నలకు 100 మార్కులు. ఇందులో మొత్తం నాలుగు విభాగాలుంటాయి. పార్ట్ఎ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు, 25 మార్కులు), పార్ట్బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ (25 ప్రశ్నలు, 25 మార్కులు), పార్ట్సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (25 ప్రశ్నలు, 25 మార్కులు), పార్ట్డి ఇంగ్లి/ హిందీ (25 ప్రశ్నలు, 25 మార్కులు). అన్ని ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో వస్తుంది. పరీక్షలో రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి పావు(0.25) మార్కు కోత విధిస్తారు.
సిలబస్.. ప్రిపరేషన్
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: ఇందులో సృజనాత్మకత, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండేలా ఆలోచించడం వల్ల సులువుగా సమాధానాలను కనుక్కోవచ్చు. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్, ఆప్టిట్యూట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు అధికశాతం అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పాటియల్ విజువలైజేషన్, స్పాటియల్ ఓరియంటేషన్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషిప్ కాంసెప్ట్స్, అరిథ్మెటికల్ రీజనింగ్, ఫిగరల్ క్లాసిఫికేషన్, అరిథ్మెటిక్ నంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, కోడిండ్ అండ్ డీకోడింగ్ తదితర అంశాలనుంచి వస్తాయి.
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలో అభ్యర్థికి జనరల్ నాలెడ్జ్పై ఉన్నసామర్థ్యాన్ని పరిశీలిస్తారు. భారతదేశం, పొరుగు దేశాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అలాగే ఆటలు, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయాలు, రాజ్యాంగం, పరిశోధనలు తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వర్తమాన అంశాలు, ఎస్సే ప్రశ్నలకు సంబంధించి పత్రికలను చదవాలి. అంశాలను గుర్తుంచుకోవడం కోసం నోట్సు రాసుకోవాలి. ఇందులోని పలు ప్రశ్నలు ఇటీవల జరిగిన పరిణామాల ఆధారంగా అడుగుతారు. అందుకే పత్రికల్లో వచ్చిన నిపుణుల అభిప్రాయాలు, గుర్తింపు పొందిన సంస్థలు విడుదల చేసిన నివేదికలను చదివితే ఇచ్చిన ప్రశ్నలకు సమాధాలు సులభంగా రాయవచ్చు.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్: ఇందులో అభ్యర్థికి గణితంపై ఎంత పట్టు ఉందో పరిశీలిస్తారు. సంఖ్యా వ్యవస్థలు, సంఖ్యల గణన, దశాంశాలు, భిన్నాలు, సంఖ్యల మధ్య సంబంధం, అంకగణితం, శాతాలు, నిష్పత్తి-సగటు, వడ్డీ, లాభం-నష్టం, తగ్గింపు, కొలత, సమయం-దూరం, నిష్పత్తి-సమయం, సమయం-పని తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. పదో తరగతి ప్రామాణికమైన ప్రశ్నలే వస్తాయి. ఆయా పాఠ్యపుస్తకాల్లోనే సమస్యలను సాధన చేయాలి. గణితం విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే సాధనే కీలకం. వివిధ పద్ధతుల్లో సాధిస్తే.. ఏ పద్ధతిని పరీక్షలో ఉపయోగించాలో బోధపడుతుంది. దీని ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలను సాధించవచ్చు.
ఇంగ్లిష్/ హిందీ: ఇంగ్లిష్ గ్రామర్ నియమాలు తెలిస్తే ఈ విభాగంలో సమాధానాలను గుర్తించవచ్చు. ఎర్రర్ లొకేషన్, సెంటెన్స్ అరేంజ్మెంట్, సెంటెన్స్ కరెక్షన్, ఒకాబులరీ, యాంటనిమ్స్, సిననిమ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. కాంప్రహెన్షన్ నుంచీ ప్రశ్నలు అడుగుతారు. తక్కువ సమయంలో ఇచ్చిన సమాచారాన్ని చదివి అందులో ముఖ్యమైన సమచారాన్ని గుర్తించుకోవాలి. దీని ద్వారా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలకు గుర్తించడం సులభం అవుతుంది. నిత్యం ఆంగ్ల పత్రికలు ద్వారా కాంప్రహెన్షన్పై పట్టు పెంచుకోవచ్చు. ఎడిటోరియల్, బిజినెస్, స్పోర్ట్స్ పేజీలు చదివితే ఒకాబులరీ, గ్రామర్, కరెంట్ అఫైర్స్తోపాటు ఆంగ్ల భాషను నేర్చుకోవచ్చు. ఇక హిందీ విభాగంలో పరీక్ష రాయాలనుకుంటే బేసిక్స్ తెలిస్తే చాలు.
దేహ దార్ఢ్య పరీక్ష
అభ్యర్థులకు పరుగు పోటీ నిర్వహిస్తారు. పురుషులు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పూర్తి చేయాలి. మహిళలు 8.1/2 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో భాగంగా పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్ల పొడవు ఉండాలి. ఇందులో కొన్ని ప్రాంతాల వారికి మినహాయింపు ఉంటుంది.
వెబ్సైట్: https://ssc.nic.in/