‣ దరఖాస్తుకు గడువు ఆగస్టు 15
కేంద్ర సాయుధ దళాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్లతోపాటు దిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదలైంది. డిగ్రీ విద్యార్హతతో 1876 పోస్టులకు పోటీ పడొచ్చు. ఆన్లైన్ పరీక్ష, పీఎస్టీ, పీఈటీ వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. శిక్షణ అనంతరం విధుల్లో చేరిన మొదటి నెల నుంచే రూ.60 వేల వేతనం అందుకోవచ్చు.
జాతీయ స్థాయిలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లతోపాటు దిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ల ఖాళీల భర్తీకి ఎస్ఎస్సీ దాదాపు ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపినవారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ల్లో దేశవ్యాప్తంగా విధులు నిర్వర్తించవచ్చు. దిల్లీ పోలీస్ పోస్టులకు అవకాశం వచ్చినవారు దిల్లీలోనే సేవలు అందించవచ్చు.
ఈ పోస్టులకు సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం బాగా తక్కువ. ఇదొక్కటే ప్రతికూలత. వీరు ఆకర్షణీయ వేతనం, తక్కువ వ్యవధిలో పదోన్నతులు అందుకోవచ్చు. ముందు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో విజయవంతమైనవారికి పేపర్-2 రాయడానికి అవకాశమిస్తారు.పేపర్-1, 2 రెండింటిలోనూ వచ్చిన మార్కులు కలిపి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం అర్హులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఎలాంటి సమస్యలూ లేనివారికి శిక్షణకు తీసుకుంటారు.
శిక్షణ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్లకు లెవెల్-6 రూ.35,400 మూల వేతనం లభిస్తుంది. డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులతో వీరు సుమారు రూ.60 వేల జీతం పొందవచ్చు. 10-15 ఏళ్ల సర్వీస్తో ఇన్స్పెక్టర్ హోదాకు, అనంతరం అనుభవం, ప్రతిభ ప్రాతిపదికన అసిస్టెంట్ కమాండెంట్, డెప్యూటీ కమాండెంట్, కమాండెంట్, సీనియర్ కమాండెంట్ స్థాయికి చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ పోస్టులకు సన్నద్ధమవుతున్నవారు ఈ పరీక్షను ఎదుర్కోవడం కొంత సులువే.
ఆన్లైన్ పరీక్ష
ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ వీటిలో ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. సెక్షన్ల వారీ కటాఫ్ ఉంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 200 మార్కులకు పేపర్-2 నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. రెండు పేపర్లలోనూ తప్పు సమాధానానికి 1/3 మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హతకు ప్రతి పేపర్లోనూ జనరల్ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ 25 శాతం, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు పొందాలి. అర్హుల జాబితా నుంచి విభాగాల వారీ మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తారు. ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే 4 నుంచి 10 మార్కులు అదనంగా పొందవచ్చు.
పీఈటీ
పురుషులు వంద మీటర్ల దూరాన్ని 16, మహిళలు 18 సెకన్లలో చేరుకోవాలి. 1.6 కి.మీ. పరుగును పురుషులు 6.5 నిమిషాల్లో, 800 మీటర్లను మహిళలు 4 నిమిషాల్లో పూర్తిచేయాలి. పురుషులు 3 ప్రయత్నాల్లో ఒక్కసారైనా 3.65 మీటర్ల దూరానికి దూకాలి. మహిళలు 3 ప్రయత్నాల్లో కనీసం ఒకసారి 2.7 మీటర్ల దూరం అధిగమించాలి. హైజంప్లో పురుషులు 1.2 మీటర్ల ఎత్తుకు 3 ప్రయత్నాల్లో ఒకసారైనా ఎగరాలి. మహిళలు 0.9 మీటర్ల ఎత్తుకు చేరుకోవాలి. పురుషులు షాట్పుట్ 3 ప్రయత్నాల్లో 16 ఎల్బీఎస్ (సుమారు 7.257 కి.గ్రా.) గుండు/దిమ్మను 4.5 మీ. దూరానికి విసరాలి. మహిళలకు షాట్పుట్ మినహాయించారు. పీఈటీకి మార్కులు లేనప్పటికీ, నిర్దేశిత లక్ష్యాలు పూర్తిచేస్తేనే పేపర్-2కు అవకాశం ఉంటుంది.
ప్రశ్నలు ఏ విభాగాల్లో?
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: క్లాసిఫికేషన్, ఎనాలజీ, డేటా సఫిషియన్సీ, పజిల్స్, ఆల్ఫాబెట్స్ (వర్డ్ టెస్టు), వెన్ డయాగ్రామ్స్, సిరీస్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, మిస్సింగ్ నంబర్, కోడింగ్ డీకోడింగ్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్ అంశాలను చదవాలి.
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్: సైన్స్ అండ్ టెక్నాలజీ, వర్తమాన వ్యవహారాలు (జాతీయ, అంతర్జాతీయ), హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీలకు ఎక్కువ ప్రాధాన్యముంది.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: డేటా ఇంటర్ప్రెటేషన్, ట్రిగనోమెట్రీ, సింప్లిఫికేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, జామెట్రీ, ఆల్జీబ్రా, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, మిక్స్చర్ ప్రాబ్లమ్స్, నంబర్ సిస్టమ్ బాగా చదవాలి.
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: వొకాబ్యులరీ (క్లోజ్ టెస్టు, సిననిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్, ఇడియమ్ మీనింగ్), ఇంగ్లిష్ గ్రామర్ (ఎర్రర్ స్పాటింగ్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, యాక్టివ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్), రీడింగ్ కాంప్రహెన్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
సన్నద్ధత ఎలా?
‣ ప్రకటనలో సిలబస్ వివరాలు పేర్కొన్నారు. వాటిని క్షుణ్నంగా చదవాలి. తొలిసారి ఈ పరీక్ష రాస్తున్నవారు ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి.
‣ పాత ప్రశ్నపత్రాలను నిశితంగా గమనించాలి. ప్రతి విభాగంలోనూ అన్ని అంశాల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల సిలబస్ మొత్తం చదవడం తప్పనిసరి. ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలాంటి వాటికి అధిక సమయం కేటాయించి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.
‣ పాత ప్రశ్నపత్రాల నుంచి.. ప్రశ్నలు ఏ స్థాయిలో వస్తున్నాయి, సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలు మరింత లోతుగా అధ్యయనం చేయాలి, వేటికి ఎంత సమయం కేటాయించాలో స్పష్టత వస్తుంది.
‣ పరీక్షకు ముందు కనీసం 10 నమూనా పరీక్షలు రాయాలి. ఫలితాలు విశ్లేషించుకుని, సన్నద్ధతలో మార్పులు చేసుకోవాలి.
‣ సెక్షన్లవారీ కటాఫ్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి విభాగంలోనూ కనీస మార్కులు పొందడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. కష్టమైన విభాగాలకు అదనపు సమయాన్ని కేటాయించుకోవాలి.
‣ ముందు పేపర్-1ను అధిక ప్రాధాన్యంతో చదవాలి. ఈ పరీక్ష తర్వాత ఉన్న వ్యవధిని ఫిజికల్ టెస్టులు, పేపర్-2 కోసం వెచ్చించాలి.
‣ పేపర్-2 మొత్తం ఆంగ్ల విభాగం నుంచే ఉంటుంది. ఇందులో సాధించిన మార్కులు విజయాన్ని నిర్ణయిస్తాయి. అందువల్ల దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంగ్లంపై పట్టు తప్పనిసరి.
‣ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో జవాబులు గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. ఈ విభాగంలో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధిస్తే పరీక్షలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతారు.
‣ వర్తమాన వ్యవహారాల్లో విజయానికి జనవరి 2023 నుంచి వివిధ రంగాల్లో జాతీయం, అంతర్జాతీయంగా జరుగుతోన్న ముఖ్య పరిణామాలను నోట్సు రాసుకోవాలి. అవార్డులు, పురస్కారాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, పుస్తకాలు-రచయితలు, తాజా పరిశోధనలు, క్రీడలు, రక్షణ, సైబర్ సెక్యూరిటీ అంశాలు బాగా చదవాలి.
పుస్తకాలు: ఒక్కో విభాగం నుంచి ఒక పుస్తకాన్నే ఎక్కువ సార్లు చదివితే ప్రయోజనం. ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ - టాటా మెక్ గ్రాహిల్స్ లేదా చాంద్ పబ్లికేషన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్- ఆర్.ఎస్.అగర్వాల్, జనరల్ నాలెడ్జ్ - లూసెంట్స్ తీసుకోవచ్చు.
ముఖ్య సమాచారం..
ఖాళీలు: 1876. వీటిలో సీఏపీఎఫ్ల్లో 1714 ఉన్నాయి. (సీఆర్పీఎఫ్ 818, బీఎస్ఎఫ్ 113, ఐటీబీపీ 63, సీఐఎస్ఎఫ్ 630, ఎస్ఎస్బీ 90. దిల్లీ పోలీస్.. పురుషులకు 109, మహిళలకు 53).
అర్హత: ఏదైనా డిగ్రీ
వయసు: ఆగస్టు 1, 2023 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. ఆగస్టు 2, 1998 ఆగస్టు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంది.
శారీరక ప్రమాణాలు: పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీలైతే పురుషులు 162.5, మహిళలు 154 సెం.మీ. చాలు. ఊపిరి పీల్చిన తర్వాత కనీసం 85 సెం.మీ, పీల్చక ముందు 80 సెం.మీ. ఛాతీ విస్తీర్ణం పురుషులకు ఉండాలి
ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 15 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు: అక్టోబరులో నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఏపీ.. గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం. తెలంగాణ.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.
వెబ్సైట్: https://ssc.nic.in/
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 పీవో, ఎస్వో కొలువులు
‣ కెరియర్ కౌన్సెలింగ్కు ఉచిత సలహాలివిగో..
‣ ఎయిర్పోర్ట్స్ అథారిటీలో 342 ఉద్యోగాలు
‣ కోర్సు ఎంపికకు.. కౌన్సెలింగ్ ముఖ్యం