• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు

సీడీఎస్‌ఈ 2024 (2) వివరాలు


సాధారణ డిగ్రీతోనే ఉన్న అత్యుత్తమ ఉద్యోగాలు కావాలా? అయితే సీడీఎస్‌ఈ రాస్తే సరి! రక్షణ రంగంలో మేటి కొలువులు ఆశించేవారు రాయాల్సిన పరీక్షా ఇదే. ఈ అవకాశం దక్కినవారు ప్రతి నెలా స్టైపెండ్‌ అందుకుంటూ శిక్షణ పొందవచ్చు. ఆ వెంటనే లెవెల్‌-10 హోదాతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్సుల్లో విధులు నిర్వర్తించవచ్చు. మెరుగైన ప్రతిభావంతులు ఫైటర్‌ పైలట్‌గానూ అవతరించవచ్చు. ఇటీవలే వెలువడిన సీడీఎస్‌ఈ 2024(2) వివరాలు...


రక్షణ రంగంలో అత్యున్నత ఉద్యోగాలు ఆశించేవారికి కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) దారి చూపుతుంది. దీన్ని ఏడాదికి రెండుసార్లు యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. దేశ రక్షణలో భాగం కావాలనే ఆసక్తి, యూనిఫాం పోస్టులంటే ప్రత్యేక అభిమానం, అత్యున్నత ఉద్యోగాలే లక్ష్యంగా ఉన్న పట్టభద్రులు సీడీఎస్‌ఈపై గురి పెట్టవచ్చు. క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నందున నిబద్ధతతో కృషిచేస్తే కొద్ది ప్రయత్నాల్లోనే విజయాన్ని అందుకోవచ్చు. గత ఫలితాల ప్రకారం పరీక్ష, ఇంటర్వ్యూలలో 45 శాతం మార్కులు పొందినవారు తప్పనిసరిగా ఏదో ఒక సర్వీసుకు ఎంపికవుతున్నారు.  


  పరీక్షలో..  

దీన్ని 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌కు వంద చొప్పున ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ విభాగాల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. మ్యాథ్స్‌లో వంద, మిగిలిన రెండు పేపర్లలోనూ 120 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు దానికి కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. ఇంగ్లిష్‌ విభాగం మినహా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షలో అర్హతకు ప్రతి పేపర్‌లోనూ కనీస మార్కులు (20 లేదా 25 శాతం) పొందాలి. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఓటీఏ) పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు.


  ప్రశ్నలడిగే విభాగాలు?   

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌: ఈ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. అరిథ్‌మెటిక్‌ (నంబర్‌ సిస్టమ్, ఎలిమెంటరీ నంబర్‌ థియరీ), ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్‌ నుంచి వీటిని అడుగుతారు.

ఇంగ్లిష్‌: కాంప్రహెన్షన్, ఎర్రర్స్‌ అండ్‌ ఒమిషన్స్, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్, జంబుల్డ్‌ సెంటెన్స్, సెంటెన్స్‌ కరెక్షన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌.. నుంచి ప్రశ్నలు సంధిస్తారు. అభ్యర్థి ఆంగ్ల భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో పరీక్షిస్తారు. 

జనరల్‌ నాలెడ్జ్‌: ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడినవే ఉంటాయి. రోజువారీ పరిశీలనల ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం. సైన్స్, టెక్నాలజీల్లో తాజా మార్పులపై ప్రశ్నలు వస్తాయి. భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం అంశాల్లో అభ్యర్థి అవగాహననూ పరీక్షిస్తారు.


 సన్నద్ధత..  

మ్యాథ్స్‌: 8, 9, 10 తరగతుల గణితం పాఠ్య పుస్తకాలు బాగా చదవాలి. యూజీ/ ఇంటర్మీడియట్‌ స్థాయిలో గణిత నేపథ్యం ఉన్నవారు ఈ పేపర్‌ను సులువుగానే ఎదుర్కోవచ్చు. ఆర్ట్స్‌ విద్యార్థులు ఈ విభాగంలో మెరుగైన మార్కుల కోసం అదనంగా సమయం కేటాయించాలి. ప్రాథమికాంశాలు అధ్యయనం చేసి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధనచేస్తే మ్యాథ్స్‌వారితో సమానంగా పోటీపడవచ్చు.  

జనరల్‌ నాలెడ్జ్‌: భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులకు ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 తరగతుల పుస్తకాలు ఉపయోగపడతాయి. లూసెంట్‌ లేదా అరిహంత్‌ జీకే పుస్తకాల్లో ఏదైనా చదివితే సరిపోతుంది. సైన్స్‌ విభాగంలోని ప్రశ్నలకు ఎన్‌సీఈఆర్‌టీ 6-10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు శ్రద్ధగా చదవాలి.  

ఇంగ్లిష్‌: ప్రశ్నలన్నీ హైస్కూల్‌ ఆంగ్ల పాఠ్యపుస్తకాల స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల 8,9,10 తరగతుల పుస్తకాల్లోని వ్యాకరణాంశాలపై దృష్టి సారించాలి. అనంతరం వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

పేపర్లవారీ సిలబస్‌ వివరాలు ప్రకటించారు. వాటిని పరిశీలించి, ఆ అంశాలనే బాగా చదవాలి.

ప్రాథమిక స్థాయి సన్నద్ధత పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి వీటిని పొందవచ్చు. వీటి ద్వారా.. విభాగాలవారీ ప్రశ్నలు ఏ తరహాలో వస్తున్నాయి, చదవాల్సిన అంశాలు, సన్నద్ధత ఎలా ఉండాలో అర్థమవుతుంది.

పరీక్షకు నెల ముందు నుంచి వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. వీటిని మూల్యాంకనం చేసి, ఫలితాలు విశ్లేషించాలి. ఎక్కడ తప్పుచేస్తున్నారు, ఏ అంశాల్లో వెనుకబడ్డారో గమనించి, వాటికి అధిక ప్రాధాన్యమివ్వాలి. తర్వాత పరీక్షల్లో గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. 

రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి, తెలియని ప్రశ్నలు వదిలేయాలి. ఎక్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నల దగ్గర ఆగిపోకుండా.. పరీక్ష చివరలో, సమయం మిగిలితేనే ప్రయత్నించాలి.    

‣ పరీక్షకు పది రోజుల ముందు నేర్చుకున్న అంశాలన్నీ పునశ్చరణ చేసుకోవాలి. 


  ఇంటర్వ్యూ   

పరీక్షతో సమానంగా ఈ విభాగానికీ 300 మార్కులు ఉన్నాయి. ఓటీఏ పోస్టులకే దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఐదు రోజులపాటు కొనసాగే ముఖాముఖిలో రెండు దశలుంటాయి. స్టేజ్‌-1లో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి విశ్లేషించమంటారు. దీనిద్వారా అభ్యర్థి జ్ఞాన నైపుణ్యం, అవగాహన సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఈ విభాగంలో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2లో భాగంగా ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. సైకాలజీ టెస్టులతోపాటు పలు ఇతర అంశాల్లో అభ్యర్థిని పరిశీలిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్‌ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.

   శిక్షణ  

అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్‌ ప్రకారం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (ఓటీఏ) వీటిలో ఎందులోనైనా అవకాశం పొందుతారు. ఏ విభాగంలో చేరినా శిక్షణలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్‌ మిలటరీ అకాడెమీ దేహ్రాదూన్‌లో 18 నెలల శిక్షణ ఉంటుంది. నేవల్‌ అకాడెమీలో చేరినవాళ్లకు సుమారు 18 నెలలు కేరళలోని ఎజిమాలలో శిక్షణ ఇస్తారు. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీకి ఎంపికైనవారికి 18 నెలలు పైలట్‌ శిక్షణ బీదర్, ఎలహంక, హాకీంపేటల్లో ఉంటుంది. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో 11 నెలలు శిక్షణలో పాల్గొనాలి. వీరు మద్రాస్‌ విశ్వవిద్యాలయం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని అందుకోవచ్చు. 

 ఉద్యోగంలో...  

శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెఫ్టినెంట్, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది. పేర్లలో తేడా ఉన్నా ఈ మూడూ సమాన హోదా (లెవెల్‌ 10) ఉద్యోగాలే. వీరికి రూ.56,100 మూలవేతనం. మిలటరీ సర్వీస్‌ పే కింద అదనంగా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు రూ.25 వేలు ఫ్లయింగ్‌ అలవెన్సు అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలతో మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. రెండేళ్ల సర్వీస్‌తో ఆర్మీలో కెప్టెన్, నేవీలో లెఫ్టినెంట్, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ హోదాలు సొంతం చేసుకోవచ్చు. ఆరేళ్లు విధుల్లో కొనసాగితే మేజర్‌/ లెఫ్టినెంట్‌ కమాండర్‌/ స్క్వాడ్రన్‌ లీడర్‌ గుర్తింపు లభిస్తుంది. 13 ఏళ్ల అనుభవంతో ఎయిర్‌ ఫోర్సులో వింగ్‌ కమాండర్‌ కావచ్చు. అదే నేవీలో కమాండర్, ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా పొందవచ్చు. ఆ తర్వాత ప్రతిభతో పై స్థాయికి చేరుకోవచ్చు. భవిష్యత్తులో సంబంధిత విభాగాలకు అత్యున్నతాధికారి, త్రివిధ దళాలకు అధిపతీ కావచ్చు.

  కటాఫ్‌ ఇలా   

2023(1): రాత పరీక్షలో 300కు గానూ ఐఎంఏ 132, ఐఎన్‌ఏ 122, ఏఎఫ్‌ఏ 142, ఓటీఏ 101 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. తుది ఎంపికలో (పరీక్ష+ ఇంటర్వ్యూ) 600కు ఐఎంఏ 257, ఐఎన్‌ఏ 247, ఏఎఫ్‌ఏ 266, ఓటీఏ మెన్‌ 181 ఓటీఏ విమెన్‌ 184 మార్కుల వరకు అవకాశం లభించింది. 

2022(2): రాత పరీక్ష 300కు: ఐఎంఏ 126, ఐఎన్‌ఏ 118, ఏఎఫ్‌ఏ 136, ఓటీఏ 98 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. తుది ఎంపికలో (పరీక్ష+ ఇంటర్వ్యూ)600కు.. ఐఎంఏ 249, ఐఎన్‌ఏ 248, ఏఎఫ్‌ఏ 258, ఓటీఏ మెన్‌ 180, ఓటీఏ విమెన్‌ 179 వరకు అవకాశం పొందారు. పోస్టులు, ప్రశ్నపత్రం కఠినత్వం బట్టి కటాఫ్‌లో మార్పులు ఉంటాయి. 45 శాతం మార్కులతో ఏదో ఒక సర్వీస్‌కు ఎంపికవ్వొచ్చు.

  విద్యార్హత   

మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఎయిర్‌ ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండాలి. ఓటీఏ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీలకు జులై 2, 2001 - జులై 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ పోస్టులకు జులై 2, 2001 - జులై 1, 2005 మధ్య జన్మించాలి. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు జులై 2, 2000 - జులై 1, 2006 మధ్య జన్మించిన వారు అర్హులు.

ఖాళీలు: 459. విభాగాల వారీ.. ఐఎంఏ-100, ఐఎన్‌ఏ-32, ఏఎఫ్‌ఏ-32, ఓటీఏ మెన్‌-276, ఓటీఏ విమెన్‌-19. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు: జూన్‌ 4 

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారికి రూ.200. 

పరీక్ష తేదీ: సెప్టెంబరు 1  

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Posted Date : 28-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.