అభివృద్ధి భావనలు
అభివృద్ధి, ప్రగతికి సంబంధించిన భావనలు అనాది నుంచీ మనకు పరిచయమే. మనందరం... పిల్లలను ఎలా పెంచాలి? వారిని ఏ పాఠశాలలో చదివించాలి? వారి భవితకు బంగారు బాట ఎలా వేయాలి? అని ఆలోచిస్తుంటాం. అలాగే ప్రభుత్వాలకు... దేశం ఎలా ఉండాలి? అందరికీ మౌలిక వసతులు ఎలా సమకూర్చాలి? ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలంటే ఏం చేయాలి? అనే అభిప్రాయాలు ఉంటాయి. ఇలా ప్రజలు, ప్రభుత్వాలు (నాయకులు) ప్రతిరోజూ వివిధ రకాల కోరికలు, ఆకాంక్షలతో సతమతమవుంటారు. ఒకరికి అభివృద్ధిగా తోచింది మరొకరికి విధ్వంసంగా అనిపించవచ్చు. ప్రస్తుత సమాజంలో వివిధ వర్గాల ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
వివిధ వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారు?
భూమిలేని గ్రామీణ కార్మికులు ఎక్కువ రోజుల పని దొరకాలనీ, కూలీ రేట్లు పెరగాలనీ కోరుకుంటారు. తమ పిల్లలను మంచి పాఠశాలలో చదివించాలనీ, గ్రామంలో సర్పంచ్ లేదా సభ్యుడిగా ఎన్నిక కావాలనీ భావిస్తారు.
ధనిక రైతు తన పొలంలో పండిన పంటలకు అధిక ధరలు లభించాలనీ, తక్కువ ధరకే కూలీలు దొరకాలనీ, రైతు రుణమాఫీ వర్తించాలనీ, పిల్లలు విదేశాల్లో చదివి స్థిరపడాలని భావిస్తాడు.
పై అంశాలను పరిశీలిస్తే అభివృద్ధి, ప్రగతిపై అందరికీ ఒకే భావన లేదని స్పష్టమవుతోంది. ఒక్కొక్కరి కోరికలు ఒక్కో విధంగా ఉంటాయి. ఒక్కోసారి ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పర విరుద్ధమైన కోరికలుండవచ్చు. అదే విధంగా ఎక్కువ విద్యుత్ కోసం పారిశ్రామిక వేత్తలు మరిన్ని ఆనకట్టలు కట్టాలని అనుకుంటారు. కానీ వాటివల్ల భూములు ముంపునకు గురై, నిర్వాసిత ప్రజల జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. అలా కాకుండా గిరిజనులు పెద్ద ఆనకట్టలు కట్టడాన్ని వ్యతిరేకించి తమ భూములకు సాగునీటిని అందించేలా చిన్న చెక్డ్యాములు లేదా కుంటలను కోరుకోవచ్చు.
అభివృద్ధి ఎవరికి?
తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలోని కుడంకుళంలో మత్స్యకారుల ఆవాస ప్రాంతాలున్న ప్రశాంత సముద్ర తీరంలో భారత ప్రభుత్వం అణువిద్యుత్ కేంద్రాన్ని స్థాపించింది. దీనికి వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు నిరసన చేశారు. అణువిద్యుత్ కేంద్ర నిర్మాణ ప్రధానోద్దేశం నిరంతరంగా పెరుగుతున్న దేశ విద్యుచ్ఛక్తి అవసరాలను తీర్చడానికే అయినప్పటికీ, అక్కడి ప్రజలు వారి భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. దేశాలను రేడియోధార్మిక వినాశక ప్రమాదాల నుంచి రక్షించాలని అక్కడి ప్రజలంతా కోరుకుంటున్నారు. శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఉద్యమకారుల పక్షాన నిలబడి దీన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం మాత్రం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించి ఉద్యమాలకు అతీతంగా నిర్మాణాన్ని కొనసాగిస్తోంది.
పేలిన గ్యాస్ పైప్లైన్ - స్థానికుల నిరసన:
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలోని 'నగరం'లో జరిగిన ''గ్యాస్ పైప్ పేలిన సంఘటన"లో పలువురు మృత్యువాత పడ్డారు. అనేకమంది గాయాలపాలయ్యారు. దేశాభివృద్ధికి ఖనిజ వనరులను పైకి తీయడం, వాటిని సద్వినియోగ పరచడం మంచిదే. కానీ దాన్ని సరైన మార్గంలో ఉపయోగించకపోవడం దురదృష్టకరం. తుప్పుపట్టిన పైపులను తొలగించలేదని, గెయిల్ (GAIL: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు. ఎవరి నిర్లక్ష్యం అయితేనేం చాలా మంది ప్రాణాలు గాలిలో కలసిపోవడంతో, అక్కడి ప్రజలు నిరసనకు దిగారు. నివాస ప్రాంతాల నుంచి గ్యాస్పైపులైన్లను తొలగించాలని కోరుతున్నారు.
ఈ రెండు సంఘటనల వల్ల అభివృద్ధి, విధానాల్లో వ్యత్యాసాలుండటం సహజమేనని అర్థమవుతుంది.