• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక విద్యావ్యాప్తి

    ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలుకుని బ్రిటిష్ కాలంలో భారత్‌లో విద్యాభివృద్ధి ఎలా సాగిందన్నది ఆధునిక చరిత్ర ప్రధానాంశాల్లో ఒకటి. 1813 చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏటా లక్ష రూపాయలు కేటాయించడం విద్యారంగంలో కీలక పరిణామం.. అనంతర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం విద్యావ్యాప్తికి వివిధ కమిటీలను నియమించి అనేక మార్పులు తీసుకొచ్చింది. ఆంగ్లవిద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రధానాంశం. స్వాతంత్య్రానంతరం రాధాకృష్ణన్, కొఠారి కమిషన్లు మన దేశంలో విద్యకు వన్నెలద్ది ప్రగతిపథంలో పరుగులు తీసేందుకు బాటలు వేశాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు విద్యారంగ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడం అవసరం.
భారత్‌లో 18వ శతాబ్దం నాటికి హిందూ, ముస్లిం విద్యా కేంద్రాలు కనుమరుగయ్యాయి. స్వదేశీ రాజుల పాలన అంతం కావడంతో విద్యా కేంద్రాలకు నిధుల సమస్య ఎదురైంది. 1784, ఫిబ్రవరి 21న వారన్ హేస్టింగ్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లకు రాసిన ఉత్తరంలో - ఉత్తర భారతదేశం, దక్కనులో విద్యాలయాల దుస్థితిని వివరించారు.
బెంగాల్ 1765లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం కిందకు వచ్చింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఇంగ్లండ్‌లో మాదిరిగా భారతదేశంలోనూ ప్రజలకు విద్యను అందించే బాధ్యత నుంచి వైదొలగాలని నిర్ణయించారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే భారతీయ అధికారుల కోరిక మేరకు విద్యాభివృద్ధి కోసం కొన్ని చర్యలు చేపట్టారు. 1781లో వారన్ హేస్టింగ్స్ పర్షియన్, అరబిక్ భాషల అధ్యయనం కోసం కలకత్తాలో మదరసాను స్థాపించాడు. 1791లో బెనారస్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా పనిచేసిన జొనాథన్ డంకన్ హిందూ చట్టాలు, సాహిత్యం, మతానికి సంబంధించిన అధ్యయనాల కోసం ఒక సంస్కృత కళాశాలను స్థాపించాడు. 1784లో సర్ విలియం జోన్స్ మరో ముప్పైమందితో కలిసి 'ఆసియా' విషయాల అధ్యయనం కోసం 'ఏసియాటిక్ సొసైటీ'ని స్థాపించాడు. అయితే 1829 వరకు ఇందులో భారతీయులకు ప్రవేశం కల్పించలేదు.

 

ఆంగ్ల భాషకే నిధులు
    క్రైస్తవ మిషనరీలు, మానవతావాదులు ఒత్తిడి తేవడంతో భారతదేశంలో ఆధునిక విద్యావ్యాప్తికి ఈస్ట్ ఇండియా కంపెనీ నడుం బిగించింది. 1813 చార్టర్ చట్టం విద్యాభివృద్ధికి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు కేటాయించింది. అయితే ఈ మొత్తాన్ని ఆధునిక పాశ్చాత్య విద్య కోసం ఖర్చు పెట్టాలా? లేదా భారతీయ విద్య కోసం ఖర్చు పెట్టాలా? అనే విషయంపై వాదోపవాదాలు జరిగాయి. ఈ చర్చలో పాల్గొన్న ఆంగ్లేయులు 1835లో ప్రాచ్యవాదులు, పాశ్చాత్యవాదులుగా విడిపోయారు. జేమ్స్ సూదర్‌లాండ్, జాన్ షేక్‌స్పియర్, జేమ్స్ ప్రిన్సెప్, హెన్రీ ప్రిన్సెప్‌లతో కూడిన ప్రాచ్య వర్గం అరబిక్, సంస్కృత భాషలకు ప్రాధాన్యం తగ్గించడం 1813 చట్టస్ఫూర్తికి విరుద్ధమని వాదించింది. డబ్ల్యూ.డబ్ల్యూ.బర్డ్, సి.బి.సౌండర్స్, జె.ఆర్.కాల్విన్, సి.ఇ.ట్రెవెల్యాన్‌లతో కూడిన పాశ్చాత్య వర్గం ఆంగ్ల భాషలో పాశ్చాత్య ఆధునిక విద్యను అందించడాన్ని బలపరిచింది. థామస్ బాబింగ్టన్ మెకాలే పాశ్చాత్యవాదులను సమర్థించారు. చివరికి అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ మెకాలే వాదనతో ఏకీభవించి విద్య కోసం కేటాయించిన నిధులన్నీ ఆంగ్ల భాషాభివృద్ధికే ఖర్చు చేయాలని నిర్ణయించాడు. మెకాలే ప్రతిపాదనను 1835, మార్చి 7న ఆమోదించి ఆంగ్లభాషను భారతదేశ అధికార భాషగా ప్రకటించారు.
1843-53 మధ్యకాలంలో ఉత్తర్‌ప్రదేశ్ (వాయవ్య రాష్ట్రం) లెఫ్టినెంట్ గవర్నరుగా పనిచేసిన జేమ్స్ థామ్సన్ ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టడం ద్వారా గ్రామాల్లో విద్యాభివృద్ధికి ప్రయత్నించాడు. విద్యాశాఖను ఏర్పాటు చేసి, భారతీయ పాఠశాలలను తనిఖీ చేయడం ద్వారా వాటిని అభివృద్ధి చేశాడు.

 

మాగ్నాకార్టా
     అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా ఉన్న చార్లెస్ ఉడ్ ఒక తాఖీదును 1854లో రూపొందించాడు. తర్వాత అతడిని భారతదేశ మొదటి రాజ్య కార్యదర్శిగా నియమించారు. ఆ తాఖీదునే భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించి 'మాగ్నాకార్టాగా భావిస్తారు. ప్రజలందరికీ విద్యను అందించడం, స్త్రీ విద్య, ప్రాంతీయ భాషల అభివృద్ధి, లౌకిక విద్యకు ఇది ప్రాధాన్యం ఇచ్చింది. 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఈ తాఖీదును దశలవారీగా అమలు చేశారు. బొంబాయి, మద్రాసు, బెంగాల్, వాయవ్య రాష్ట్రం, పంజాబ్‌లలో 1855లో విద్యాశాఖలను ఏర్పాటు చేశారు. తర్వాత వివిధ విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
 

హంటర్ కమిషన్
    డబ్ల్యూ.డబ్ల్యూ.హంటర్ 1882లో అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించింది. 1854 ఉడ్ తాఖీదు తర్వాత భారతదేశంలో జరిగిన విద్యాభివృద్ధిని సమీక్షించడం ఆ కమిషన్ ఏర్పాటు ఉద్దేశం. కమిషన్‌ను అప్పటి వైస్రాయి లార్డ్ రిప్పన్ నియమించాడు. ప్రాథమిక విద్య అభివృద్ధికి సూచనలను, సలహాలను సిఫారసు చేయాల్సిందిగా ఈ కమిషన్‌ను కోరాడు. కొత్తగా ఏర్పాటు చేసిన స్థానిక సంస్థలకు (జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు) ప్రాథమిక విద్య నిర్వహణను అప్పగించాలని ఈ కమిషన్ సూచించింది. ప్రభుత్వం కొన్ని కళాశాలలు, సెకండరీ పాఠశాలలను మాత్రమే నిర్వహించాలని, మిగిలినవాటి నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు వదిలి పెట్టాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులన్నింటినీ ప్రభుత్వం అమలు చేసింది.
 

 

భారత విశ్వవిద్యాలయాల చట్టం

1901 సెప్టెంబరులో లార్డ్ కర్జన్ విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయ ప్రతినిధులతో సిమ్లాలో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాడు. వైస్రాయి కార్యనిర్వాహక మండలిలో లా మెంబరు అయిన థామస్ ర్యాలీగ్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ కమిషన్‌ను నియమించారు.
 
ఈ కమిషన్ సిఫార్సుల మేరకు 1904లో భారత విశ్వవిద్యాలయాల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని అనుసరించి విశ్వవిద్యాలయాలు బోధన బాధ్యతలను స్వీకరించాయి. అంతవరకు అవి పరీక్షల నిర్వహణకు మాత్రమే పరిమితమయ్యేవి. విశ్వవిద్యాలయ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సిండికేట్లను నియమించారు. ఈ చర్యల వల్ల ఉన్నత విద్య నాణ్యత పెరిగింది. అయితే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నియంత్రణ పెరగడాన్ని జాతీయవాదులు తీవ్రంగా విమర్శించారు. 1910లో కేంద్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేశారు.
 

విద్యావిధానంపై తీర్మానం

   1906లో అభ్యుదయ భావాలు ఉన్న బరోడా రాష్ట్రం నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని పాటించాలని భారతీయ నాయకులు ఒత్తిడి చేశారు. 1910-13 మధ్య కాలంలో గోపాలకృష్ణ గోఖలే విధాన మండలిలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక విద్య బాధ్యతను తీసుకోవాలని గట్టిగా కోరారు. 1913, ఫిబ్రవరి 21న చేసిన తీర్మానం ప్రకారం ప్రభుత్వం నిర్బంధ విద్య సూత్రాన్ని తిరస్కరించింది. అయితే నిరక్షరాస్యతను నిర్మూలించడానికి అంగీకరించింది. అలాగే పేదలకు ఉచిత విద్యను అందించడానికి అన్ని రాష్ట్రాలు సత్వర చర్యలు చేపట్టాలని కోరింది.
 

శాడ్లర్ కమిషన్ (1917-19)

చెమ్స్‌ఫర్డ్ కలకత్తా విశ్వవిద్యాలయ పనితీరును సమీక్షించడానికి శాడ్లర్ కమిషన్‌ను నియమించాడు. ఈ కమిషన్ సెకండరీ విద్య, సెకండరీ విద్యాబోర్డు నియంత్రణలో ఉండాలని, డిగ్రీ కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసింది. అనంతరం 1921 నాటికి భారతదేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య 12కు పెరిగింది. కొత్తగా బెనారస్, మైసూరు, పాట్నా, అలీగఢ్, ఢాకా, లక్నో, ఉస్మానియా విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఇదే సమయంలో గాంధీజీ, లాలాలజపతిరాయ్, అనిబిసెంట్ జాతీయ విద్య ఆవశ్యకతను గుర్తించారు. ప్రస్తుత విద్యావిధానం జాతీయవాద అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయదని వాదించారు. మాతృభూమిపై ప్రేమను పెంపొందించే విద్యావిధానాన్ని రూపొందించాలని అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా కాశీ విద్యాపీఠ్, జామియా మిలియా ఇస్లామియా, బీహార్ విద్యాపీఠ్ లాంటి జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.
 

హార్టాగ్ కమిటీ నివేదిక
1928 మే లో సైమన్ కమిషన్.. సర్ ఫిలిప్ జోసెఫ్ హార్టాగ్ అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ఇండియాలో విద్య మరింతగా అభివృద్ధి చెందేందుకు గల అవకాశాలపై నివేదికను ఇవ్వాలని ఈ కమిటీని కోరింది. కమిటీ తన నివేదికలో - ప్రజలందరికీ విద్య నేర్పించే బాధ్యత ప్రధానంగా రాష్ట్రాలపై ఉంది. సెకండరీ విద్య పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఎక్కువమంది ఉత్తీర్ణులు కాకపోవడం ఇబ్బందికరంగా ఉంది. ప్రాథమిక విద్యావ్యవస్థలో మానవ వనరుల వృథా అధికంగా ఉంది. ఉపాధ్యాయుల జీతాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది - అని పేర్కొంది.
 

'బేసిక్' విద్యా విధానం
భారత ప్రభుత్వ చట్టం-1935 రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. 1937లో ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 7 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పరచింది. 1937లో గాంధీజీ తన 'హరిజన్ పత్రికలో బేసిక్ విద్య ఆవశ్యకతను వివరిస్తూ వరుసగా వ్యాసాలను ప్రచురించారు. 'కార్యక్రమాల ద్వారా నేర్చుకోవడం అనేది బేసిక్ విద్య సూత్రం. జాకీర్ హుస్సేన్ కమిటీ ఈ విధానంపై కసరత్తు చేసి సిలబస్‌ను రూపొందించింది. ఈ విధానంలో చేతితో వస్తువులను చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపాధ్యాయుల జీతం కోసం వినియోగిస్తారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం, కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేయడంతో ఈ విధానాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.
 

సార్జంట్ విద్యాప్రణాళిక
1944లో కేంద్రీయ విద్యా సలహా బోర్డు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. ఆ బోర్డుకు భారత ప్రభుత్వ విద్యా సలహాదారు సర్ జాన్ సార్జెంట్ అధ్యక్షుడు. ఈ ప్రణాళిక ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలని, 6-11 ఏళ్ల వయసు వారికి సార్వత్రిక ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలలు.. సాధారణ విద్య; సాంకేతిక-వృత్తి విద్యను నేర్పేవి అని రెండు రకాలుగా ఉండాలని సిఫార్సు చేసింది. ఇంటర్మీడియట్ కోర్సును తొలగించి ఉన్నత విద్య, కళాశాల విద్యకు చెరో సంవత్సరం కలపాలని పేర్కొంది.
 

కొఠారి కమిషన్ (1964-66)
 డాక్టర్ డి.ఎస్.కొఠారి అధ్యక్షతన భారత ప్రభుత్వం 1964 జులైలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అన్ని స్థాయుల్లో విద్యాభివృద్ధికి చేపట్టాల్సిన విధానాలను తెలియజేయాలని కమిషన్‌ను కోరింది.

 

కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు:
* అన్ని స్థాయుల్లో పని అనుభవం, సామాజిక సేవను ప్రవేశపెట్టాలి.
* నైతికవిద్యపై దృష్టి సారించాలి. సామాజిక బాధ్యతను పెంపొందించాలి.
* సెకండరీ విద్యలో వృత్తి విద్యను భాగం చేయాలి.
* అత్యున్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిమిత విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి.
* పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* వ్యవసాయ విద్య, వ్యవసాయంలో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.

 

రాధాకృష్ణన్ కమిషన్

విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి తగిన సూచనలతో ఒక నివేదికను ఇవ్వాలని కోరుతూ.. భారత ప్రభుత్వం 1948 నవంబరులో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 1949 ఆగస్టులో తన నివేదికను సమర్పించింది.
 

నివేదికలోని ప్రధాన విషయాలు
* పన్నెండు సంవత్సరాల విశ్వవిద్యాలయ పూర్వవిద్య.
* విశ్వవిద్యాలయాల పని దినాలు 180 రోజుల కంటే తక్కువ కాకూడదు. (పరీక్షలు జరిగే రోజులు మినహాయించి).
* పరీక్షా ప్రమాణాలను పెంపొందించి.. అన్ని విశ్వవిద్యాలయాల్లో పరీక్షా విధానం ఒకేలా ఉండాలి.
* విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకుల జీతాలు పెంచాలి.
* దేశంలో విశ్వవిద్యాలయాల విద్యను పర్యవేక్షించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

 

ముఖ్యాంశాలు

* 1813-53 మధ్య బెంగాల్, బీహార్, మద్రాసు ప్రెసిడెన్సీలలో అనేక పాఠశాలలు, కళాశాలలను స్థాపించారు.
* 1844లో అప్పటి గవర్నర్ జనరల్ హార్డింజ్ ఆంగ్లవిద్యను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాడు.
* 1919లో చేసిన మాంట్‌ఫర్డ్ (మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్) చట్టం ప్రకారం... మొదటిసారిగా విద్య భారతీయుల నియంత్రణలోకి వచ్చింది. ఫలితంగా అన్ని స్థాయుల్లో మునుపెన్నడూ లేని విధంగా విద్య అభివృద్ధి చెందింది.
* డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ సిఫార్సు మేరకు 1953లో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ)ను ఏర్పాటు చేశారు. దీనికి పార్లమెంటు చట్టం ద్వారా 1956లో స్వయం ప్రతిపత్తి కల్పించారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బ్రిటిష్ హయాంలో శిస్తు విధానాలు

    బ్రిటిష్ హయాంలో అమలు చేసిన భూమిశిస్తు విధానాలు భారత రైతుల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేశాయి. వ్యవసాయమే ప్రజల ప్రధాన జీవనాధారమైన రోజుల్లో.. ఆంగ్లేయుల శిస్తు విధానాలు గ్రామీణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపాయి. భారత్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 3 రకాల శిస్తు విధానాలు అమలు చేయగా.. కొద్దో గొప్పో రైతులకు భూ యాజమాన్య హక్కులను కల్పించడం మినహా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఏ విధానమూ దోహదపడలేదు. జమీందార్లకు, బ్రిటిషర్లకు మాత్రం సంపద వనరులుగా ఆ విధానాలు మారాయి. బ్రిటిష్ కాలంలోని భూమిశిస్తు విధానాలు, వాటి ప్రభావ ఫలితాలపై అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
    బ్రిటిష్‌వారు రాక ముందు భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితం. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే. వస్త్రాలు, పంచదార, నూనె పరిశ్రమలు వ్యవసాయంపై ఆధారపడి ఉండేవి. బ్రిటిష్ పాలన ప్రారంభమైన 50 సంవత్సరాలకే భూయాజమాన్యం, భూమిశిస్తు మదింపు - వసూలు పద్ధతులు స్వయం సమృద్ధిగా ఉన్న భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి.


జమీందారీ / శాశ్వత శిస్తు విధానం
ఈ విధానాన్ని బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి డివిజన్, ఉత్తర కర్ణాటకల్లో అమలు చేశారు. బ్రిటిష్ ఇండియా మొత్తం భూభాగంలో ఈ విధానం 19 శాతం అమలైంది. ఈ పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వం జమీందారులనే ఒక కొత్త తరగతిని సృష్టించి వారిని భూయజమానులుగా ప్రకటించింది. వారు భూమి శిస్తును వసూలు చేసి, అందులో 1/10 నుంచి 1/11వ వంతు తమ వాటాగా తీసుకుని, మిగిలిన మొత్తాన్ని కంపెనీ ప్రభుత్వానికి అందజేయాలి. ఈ విధానంలో జమీందారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూమిశిస్తును నిర్ణయించారు. అయితే జమీందారులు కౌలు రైతుల నుంచి వసూలు చేసే భాటక రేటును మాత్రం నిర్ణయించలేదు. దీన్ని జమీందారుల ఇష్టానికే వదలిపెట్టారు. ఈ నిర్ణయం జమీందారులు రైతులను వీలైనంత ఎక్కువగా దోచుకోవడానికి అవకాశం కల్పించింది. జనాభా, వ్యవసాయ భూమి, ధరలు పెరగడంతో జమీందారుల పరిస్థితి మెరుగుపడింది. కొత్త జమీందారుల్లో ఎక్కువమంది పాత భూయాజమాన్య తరగతికి చెందినవారు కారు. పాత జమీందారులను మోసగించిన సేవకులు, కంపెనీ ప్రభుత్వంతో సంబంధమున్న ఏజెంట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోని గుమస్తాలు, వ్యాపారులు, న్యాయవాదులు లాంటివారంతా జమీందారులుగా మారారు.
ఈ విధానంలో జమీందారులు ప్రభుత్వానికి నిర్ణీత భూమిశిస్తును క్రమం తప్పకుండా చెల్లించాలి. జమీందారులు చెల్లించాల్సిన శిస్తును పెంచే అధికారం ప్రభుత్వానికి లేదు. అలాగే ఈ శిస్తు చెల్లింపులో ఎలాంటి మినహాయింపు లేదా వాయిదా వేయడానికి అవకాశం లేదు. ఈ చర్యలు.. భూస్వాములు బీడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చి ఉత్పత్తిని పెంచడానికి, ప్రభుత్వానికి శాశ్వత ఆదాయాన్ని సమకూర్చడానికి దోహదపడతాయని కారన్ వాలీస్ వాదించాడు. అయితే జమీందారుల వారసత్వ హోదాను అంగీకరించడం ద్వారా వ్యవసాయదారుల ప్రయోజనాలను పూర్తిగా పక్కకు నెట్టేశారు. భూస్వాముల దయాదాక్షిణ్యాలపై రైతులు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కారన్ వాలీస్ అభిప్రాయాలను అతడి సలహాదారులైన జాన్ షోర్, చార్లెస్ గ్రాంట్ లాంటివారు వ్యతిరేకించారు. భూమిశిస్తు మదింపునకు ముందు సమగ్ర సర్వే చేపట్టాలని షోర్ భావించాడు. కారన్ వాలీస్ తర్వాత గవర్నర్ జనరల్ అయిన షోర్ శాశ్వత శిస్తు విధాన మొదటి దశ ఫలితాలకు సాక్షిగా నిలిచాడు. జమీందారులు భూమి నుంచి వచ్చే ఆదాయంలో అధిక భాగం అనుభవించడంతో.. కౌలుదారుల ఆర్థిక పరిస్థితి దిగజారింది. వారు పేదరికంతో సతమతమయ్యారు. సరైన ఎరువులు, విత్తనాలు వాడకపోవడంతో వ్యవసాయం దెబ్బతింది. జాతీయవాదులతోపాటు, బ్రిటిష్ విద్యావేత్తలు జమీందారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ దుస్థితిని, కౌలు రైతుల పేదరికాన్ని గుర్తించారు.


రైత్వారీ విధానం
బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన మరో భూమిశిస్తు విధానం రైత్వారీ విధానం. ఈ పద్ధతిని థామస్ మన్రో, కెప్టెన్ రీగ్ మొదట తమిళనాడులో ప్రవేశపెట్టారు. నెమ్మదిగా ఈ విధానం మహారాష్ట్ర, తూర్పు బెంగాల్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కూర్గ్‌లకు విస్తరించింది. ఈ విధానంలో రైతులకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించారు. వారు నేరుగా ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లించాలి. ఈ విధంగా రైతులకు యాజమాన్య హక్కులు లభించాయి. భూమిని కొలిచి ఉత్పత్తిని అంచనా వేయడం, ఉత్పత్తిలో 55 శాతాన్ని ప్రభుత్వ డిమాండ్‌గా నిర్ణయించడం ఈ విధానంలో ప్రధాన లక్షణాలు. ఈ విధానం కూడా క్షేత్రస్థాయిలో రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసింది. రైత్వారీ విధానంలో జమీందారులకు బదులు రైతే భూమి యజమాని అయినప్పటికీ.. రైతు పరిస్థితిని మెరుగుపరచడంలో ఈ విధానం విఫలమైంది. ప్రభుత్వం రైతుల నుంచి శిస్తు రూపంలో అధికంగా వసూలు చేయడంతో భూమి విలువ పడిపోయింది. కఠిన భూమిశిస్తు విధానం వల్ల రైతులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేయడంతో రైతులు అప్పుపై వడ్డీ మాత్రం అతి కష్టం మీద చెల్లించేవారు.
ప్రధాన లక్ష్యాలు: క్రమం తప్పకుండా భూమిశిస్తు వసూలు చేయడం, రైతుల పరిస్థితిని మెరుగుపరచడం అనేవి ప్రధాన లక్ష్యాలు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితి మారలేదు. రైతు భూమిశిస్తు చెల్లించినంత కాలం అతడిని తొలగించడానికి వీల్లేదన్నది ఈ విధానంలోని ఒక నిబంధన. అయితే అధిక భూమిశిస్తును చెల్లించడం రైతుకు ఇబ్బందికరంగా మారింది. థామస్ మన్రో భూమిశిస్తుగా నిర్ణీత మొత్తాన్ని వసూలు చేసి.. అదనంగా వచ్చే ఆదాయం రైతుకే చెందాలని భావించాడు. 1855 తర్వాత రెవెన్యూ అధికారులు భూమిశిస్తును తమ ఇష్టానుసారం నిర్ణయించారు. దీంతో వ్యవసాయ దిగుబడి తగ్గింది. వ్యవసాయదారులు అప్పుల పాలయ్యారు.


మహల్వారీ విధానం
జమీందారీ, రైత్వారీ విధానాలు పాలకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో.. వాటి స్థానంలో మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ విధానంలో భూమిశిస్తు మదింపునకు ఆధారం మహల్ లేదా ఎస్టేట్ నుంచి వచ్చే ఉత్పత్తి. ఈ మహల్‌లోని యజమానులంతా సంయుక్తంగా ప్రభుత్వానికి భూమిశిస్తు చెల్లించడానికి బాధ్యత వహించాలి. యజమానుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఎంపిక చేసిన వారి ప్రతినిధులు మహల్ నిర్వహణ, శిస్తు చెల్లింపునకు బాధ్యులుగా ఉంటారు. ఇందులో యాజమాన్య హక్కులు రైతులకు వ్యక్తిగతంగా ఉంటాయి. కానీ ప్రభుత్వానికి శిస్తు చెల్లించే బాధ్యత మాత్రం రైతులందరికీ సంయుక్తంగా ఉంటుంది. గ్రామం మొత్తం ఆ గ్రామపెద్ద ద్వారా భూమి శిస్తును చెల్లిస్తారు. ఈ విధానాన్ని మొదట ఆగ్రా, అవధ్‌లో ప్రవేశపెట్టారు. తర్వాత యునైటెడ్ ప్రావిన్స్‌లోని మిగతా ప్రాంతాలకు విస్తరించారు.
ఈ పద్ధతిలో.. జమీందారీ విధానంలో మాదిరిగా ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం సమకూరుతుంది. అలాగే రైత్వారీ విధానంలో మాదిరిగా రైతుకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి, రైతుకు మధ్య లంబార్దార్ల(మధ్యవర్తులు)ను సృష్టించినా వీరికి బెంగాల్ జమీందారుల్లా పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వలేదు. అయితే అమల్లో ఈ విధానం కూడా పెద్ద రైతులకే మేలు చేసింది. దీంతో భూస్వాములు, రైతుల మధ్య సాంఘిక, ఆర్థిక అసమానతలు పెరిగాయి. రైతుల పరిస్థితి ఆర్థికంగా బాగా దిగజారింది. రైతుల నుంచి శిస్తు ఎక్కువగా వసూలు చేశారు. దీనివల్ల వ్యవసాయం అభివృద్ధి చెందలేదు. ఇది తాత్కాలిక విధానం కావడం వల్ల స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. చివరకు ఈ విధానం గ్రామీణ సమూహాలు విచ్ఛిన్నం కావడానికి కారణమైంది.


శిస్తు విధాన ఫలితాలు
ఈ శిస్తు విధానాలు బ్రిటిష్‌వారు సృష్టించిన భూస్వాములకు శిస్తు వసూలు అధికారాన్ని కట్టబెట్టడానికి ఎక్కువ శ్రద్ధ చూపాయి. ఈ భూస్వాములు వ్యవసాయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వీరు విదేశీ పాలకుల ఏజెంట్లుగా వ్యవహరించారు. ప్రభుత్వానికి నిర్ణీత భూమిశిస్తును చెల్లించి రాజకీయంగా రక్షణ లేని, ఆర్థికంగా బలహీనులైన రైతులను దోచుకునే హక్కును పొందారు. నూతన సామాజిక తరగతులకు చెందిన భూస్వాములు, వర్తకులు, వడ్డీ వ్యాపారులకు ప్రాధాన్యం పెరిగింది. బ్రిటిష్ రెవెన్యూ విధానం 19వ శతాబ్దంలో వాణిజ్య పరమైన వ్యవసాయాన్ని పెంపొందించింది. దేశంలో జనాభా క్రమంగా పెరిగింది. దీనివల్ల భూమి మీద ఒత్తిడి పెరిగింది. కుటీర పరిశ్రమలు నాశనం కావడం కూడా దీనికి తోడైంది. బలమైన చట్టాలను ప్రవేశపెట్టడం, న్యాయస్థానాల ఏర్పాటు, కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడటం, బ్రిటిష్ వస్తువుల దిగుమతులు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో బయటి వ్యక్తుల జోక్యం బాగా పెరిగింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వయం సమృద్ధి క్రమంగా కనుమరుగైంది. గ్రామాల్లో అధికారం క్రమంగా గ్రామపెద్దల నుంచి ప్రభుత్వ ఏజెంట్ల చేతిలోకి మారింది. బ్రిటిష్‌వారి నూతన భూమిశిస్తు విధానాలు రైతులు పండించే పంట రకాలపై ప్రభావం చూపాయి. బ్రిటిష్‌వారు రాకముందు రైతులు పండించిన పంటను తమ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత భూమిశిస్తును నగదు రూపంలో చెల్లించాల్సి వచ్చింది. దీంతో రైతులు పంటను మార్కెట్‌లో విక్రయించి, వచ్చిన డబ్బుతో శిస్తు చెల్లించడం ప్రారంభించారు. గ్రామాల్లో రైతులు తమ భూమిలో పండించడానికి అనువైన ఏదో ఒక పంటను ఎన్నుకునేవారు. వీటిలో పత్తి, జనుము, గోధుమ, చెరకు, నూనెగింజలు, నీలిమందు, నల్లమందు మొదలైనవి ప్రధానంగా ఉండేవి. దీంతో భారతీయ రైతు అంతర్జాతీయ పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి దళారులపై ఆధారపడాల్సి వచ్చింది.

జమీందారీ విధానం
రాబర్ట్ క్లైవ్ 1765లో బెంగాల్‌లో దివానీ (రెవెన్యూ వసూలు) హక్కును పొందిన తర్వాత.. సంవత్సరానికి ఒకసారి భూమిశిస్తు నిర్ణయించే పద్ధతి అమల్లో ఉండేది. వారన్ హేస్టింగ్స్ దీన్ని 5 సంవత్సరాలకు మార్చాడు. అయితే మళ్లీ సంవత్సరానికి ఒకసారి నిర్ణయించే పద్ధతినే అనుసరించాడు. కారన్ వాలీస్ కాలంలో 1790, ఫిబ్రవరి 10న పది సంవత్సరాలకు ఒకసారి భూమిశిస్తును నిర్ణయించే విధానాన్ని ప్రకటించాడు. మూడేళ్ల తర్వాత ఈ విధానాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారు. తర్వాత దీన్నే 1793, మార్చి 22న 'శాశ్వత శిస్తు నిర్ణయ విధానం'గా ప్రకటించారు. ఈ పద్ధతిని మొదట బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో ప్రవేశపెట్టారు. శాశ్వత శిస్తు నిర్ణయాన్ని జమీందారులతో చేసుకోవడం వల్ల దీనికి 'జమీందారీ విధానం' అనే పేరు వచ్చింది. ఈ విధానంలో ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందారులను భూయజమానులుగా గుర్తించి, భూమిశిస్తు వసూలు చేసే అధికారాన్ని వారికి శాశ్వతంగా కట్టబెట్టింది.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సంఘ సంస్కరణోద్యమాలు

ఆనాటి సమాజంలో ఎన్నెన్నో దురాచారాలు.. సతీసహగమనం, బాల్యవివాహాలు, బహుభార్యత్వం, వితంతువులపై ఆంక్షలు, దేవదాసీ విధానం, అంటరానితనం.. ఇవన్నీ సమాజాన్ని పట్టి పీడిస్తుంటే వారి గుండె రగిలింది. కట్టుబాట్ల పేరుతో మహిళలు, అణగారిన వర్గాల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంటే.. అలాంటి దురాచారాలను రూపుమాపడానికి నడుం బిగించారు నాటి సంఘ సంస్కర్తలు. వీరి దృఢ సంకల్పానికి నాటి పాలకులు కూడా కొందరు గట్టి మద్దతు ఇవ్వడంతో చాలామేర సమాజంలో మార్పును తీసుకురాగలిగారు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతిబా ఫూలే తదితరులంతా ఈ సంఘసంస్కరణోద్యమ నిర్మాతలే.. ఇలాంటి మహానుభావులపై అధ్యయన సమాచారం పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం..
        స్వాతంత్య్రానికి పూర్వం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలైన బాల్యవివాహాలు, బహుభార్యత్వం, సతీసహగమనం, దేవదాసీ విధానం, అంటరానితనం లాంటివాటిని రూపుమాపడానికి సంఘ సంస్కర్తలు ఎంతో కృషి చేశారు. కొందరు మొగల్, బ్రిటిష్ పాలకులు కూడా ఇలాంటి ఆచారాలకు వ్యతిరేకంగా అనేక చట్టాలు చేశారు.. చర్యలు చేపట్టారు.. అక్బర్ చక్రవర్తి, పీష్వాలు సతీసహగమనంపై ఆంక్షలు విధించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్స్ కారన్ వాలిస్, మింటో, లార్డ్ హేస్టింగ్స్‌లు నాటి ప్రజల సాంఘిక, ఆచార వ్యవహారాల్లో తలదూర్చరాదని భావించినా, సతీసహగమనాన్ని సమాజం నుంచి తొలగించడానికి చర్యలు చేపట్టారు. ఈ దురాచారాన్ని ప్రోత్సహించడాన్ని, గర్భిణులు సతీసహగమనానికి పాల్పడటాన్ని నిషేధించారు. అలాగే 16 సంవత్సరాల లోపు వయసున్న వితంతువులు సతీసహగమనం చేయడాన్ని ఆపడం.. సతీసహగమనానికి సిద్ధం చేస్తున్న సమయాల్లో పోలీసులు హాజరై, బలవంతంగా ఆ దురాచారాన్ని జరపడాన్ని నిరోధించడం.. లాంటి చర్యల ద్వారా కొంత అడ్డుకట్ట వేయగలిగారు.
        రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా 1829లో అప్పటి వైస్రాయి విలియం బెంటింక్ సతీసహగమన నిషేధ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం మొదట్లో బెంగాల్ ప్రెసిడెన్సీకి మాత్రమే వర్తింపజేసినా, కొన్ని మార్పులతో 1830లో బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీల్లో కూడా అమలు చేశారు.
       బెంగాలీలు, రాజపుత్రుల్లో ఆడపిల్లలను చిన్నప్పుడే చంపేసే మరో దురాచారం ఉండేది. 1795లో రూపొందించిన బెంగాల్ రెగ్యులేషన్ - XXI చట్టం, 1804లో చేసిన రెగ్యులేషన్ చట్టం - III.. ద్వారా ఈ దురాచారాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించారు. 1870లో రూపొందించిన చట్టం పుట్టిన పిల్లల నమోదును తప్పనిసరి చేసింది.
     బ్రహ్మసమాజం వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించింది. పండిట్ ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాల కోసం పోరాడారు. ఆయన కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం 1856లో హిందూ వితంతు పునర్‌వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది. విద్యాసాగర్ బాల్యవివాహాలను, బహుభార్యత్వాన్ని వ్యతిరేకించారు. స్త్రీ విద్య కోసం పాటుపడ్డారు.
      మహారాష్ట్రలోని డి.కె.కార్వే, ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు పునర్‌వివాహాల కోసం కృషి చేశారు. ఈ లక్ష్యంతోనే వీరేశలింగం 1878లో 'రాజమండ్రి సాంఘిక సంస్కరణ సంస్థ'ను స్థాపించారు. కార్వే 1899లో పుణెలో వితంతు సదన్‌ను స్థాపించారు. 1916లో భారతదేశంలో మొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించారు. లోకహితవాదిగా ప్రసిద్ధి చెందిన గోపాల హరి దేశ్‌ముఖ్ మహారాష్ట్రలో సంఘ సంస్కరణలకు నడుం కట్టారు.
     మహదేవ గోవింద రనడే ప్రార్థన సమాజంలో ప్రముఖ సభ్యుడు. రనడే స్ఫూర్తితో గోపాల గణేష్ అగార్కర్ 1884లో పుణెలో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. రనడేను గోపాలకృష్ణ గోఖలే తన గురువుగా పేర్కొన్నారు. గోపాలకృష్ణ గోఖలే 1905లో బొంబాయిలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపింటచారు. మాతృభూమికి సేవ చేయడానికి వీలుగా భారతీయులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
      1872లో రూపొందించిన స్వదేశీ వివాహ చట్టం కనీస వివాహ వయసును బాలికలకు 14 ఏళ్లు, బాలురకు 18 ఏళ్లుగా నిర్ణయించింది. అయితే ఈ చట్టం హిందువులు, ముస్లింలు, ఇతర గుర్తింపు పొందిన మతాలవారికి వర్తించకపోవడంతో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది.
      పార్శీ సంఘ సంస్కర్త బి.ఎం.మలబారి కృషి వల్ల 1891లో ఏజ్ ఆఫ్ కన్సెన్ట్ యాక్ట్‌ను రూపొందించారు. ఈ చట్టం 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలకు వివాహం చేయడాన్ని నిషేధించింది.
     1849లో జె.ఇ.డి.బెత్యూన్ కలకత్తాలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ కలకత్తాలో 35 బాలికల పాఠశాలలు స్థాపించారు.
     1833లో బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వాన్ని నిషేధించారు. 1843లో భారతదేశంలో బానిసత్వాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించారు. 1860లో రూపొందించిన పీనల్ కోడ్ బానిస వ్యాపారాన్ని చట్ట విరుద్ధం చేసింది.
    సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో ముఖ్య సభ్యుడైన నారాయణ మల్హర్ జోషి 1911లో సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించారు. సామాన్య ప్రజలకు నాణ్యతతో కూడిన జీవితాన్ని, పనిని అందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ అనేక పాఠశాలలు, గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, బాలుర క్లబ్బులు, స్కౌట్లను స్థాపించింది. ఈ సంస్థలో మరో ముఖ్య సభ్యుడైన హృదయనాథ్ కుంజు అలహాబాద్‌లో 1914లో సేవాసమితి అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. విద్యావ్యాప్తి, సహకారం, పరిశుభ్రత, అణగారిన వర్గాల అభ్యున్నతి, నేరగాళ్లలో మార్పు తీసుకురావడానికి ఈ సంస్థ కృషి చేసింది.
    పాశ్చాత్య విద్యనభ్యసించిన దాదాభాయ్ నౌరోజీ, జె.బి.వాచా, ఎస్.ఎస్.బంగాలి, నౌరోజీ ఫిర్దోంజీ లాంటి పార్శీలు 1851లో 'రహనుమయి మజ్‌దయసనన్ సభ' అనే సంస్థను ప్రారంభించారు. పార్శీల సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం, జొరాస్ట్రియన్ మతాన్ని సంస్కరించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు. వీరు రాస్త్‌గోఫ్తార్ అనే వారపత్రికను నడిపారు.
    రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, జె.ఇ.డి.బెత్యూన్, కందుకూరి వీరేశలింగం, మహదేవ గోవింద రనడే, పడింత రమాబాయి, డి.కె.కార్వే లాంటివారు స్త్రీ విద్య, వారి అభ్యున్నతికి ఎంతో శ్రమించారు. కందుకూరి వీరేశలింగం పంతులు వివేకవర్థిని పత్రికను స్థాపించారు. 1874లో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. 1878లో దేవదాసీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.
మహదేవ గోవింద రనడే, ఆయన భార్య రమాబాయి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. రమాబాయి వితంతువుల కోసం బొంబాయి, పుణె దగ్గర ముక్తి వద్ద శారదా సదన్‌ను ప్రారంభించారు. భారతదేశంలో మొదటిసారిగా వితంతువులకు విద్యను నేర్పించిన ఘనత ఆమెకే దక్కింది. ముస్లింలలో క్వాజా అల్తాఫ్ హుస్సేన్ అలీ, షేక్ మహమ్మద్ అబ్దుల్లా, బేగం రొకియా సఖావత్ హుస్సేన్ ముస్లిం బాలికల విద్య కోసం పాటుపడ్డారు.
    మాతాజీ మహారాణి తపస్వినిగా పేరుగాంచిన గంగాబాయి దక్కన్ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ మహిళ. ఆమె కలకత్తాలో స్థిరపడి 1893లో మహాకాళి పాఠశాలను ప్రారంభించారు.
     మద్రాసు ప్రెసిడెన్సీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మొదటి వితంతువు సిస్టర్ సుబ్బలక్ష్మి. సమాజంలో ఎవరూ పట్టించుకోని బాల వితంతువులను గొప్పవారిగా తీర్చిదిద్దాలని ఆమె భావించారు. మద్రాసు ప్రెసిడెన్సీలో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 22,000 మంది వితంతువుల కోసం వితంతు శరణాలయాలు, బాలికల పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను స్థాపించారు. సుబ్బలక్ష్మి భారత మహిళల సంఘం, అఖిల భారత మహిళల సదస్సుల్లో కీలకపాత్ర పోషించారు. బాల్యవివాహాల నిరోధక బిల్లు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.
   పండిత రమాబాయి 'ఆర్య మహిళా సమాజ్‌'ను స్థాపించారు. పార్శీ మహిళలు స్త్రీ జర్తోస్తి మండల్‌ను; 1910లో అలహాబాద్‌లో సరళాదేవి చౌదరాని భారత్ స్త్రీ మహామండల్‌ను ప్రారంభించారు. ఐర్లాండుకు చెందిన స్త్రీవాద రచయిత్రి, దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలు దొరోతి జన రాజదాస 1915లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించారు. అనిబిసెంట్ దీనికి మొదటి అధ్యక్షురాలయ్యారు. ఈ సంస్థ వయోజన స్త్రీలకు విద్య, దుస్తులు కుట్టడం, ప్రాథమిక చికిత్స లాంటివాటిలో శిక్షణ ఇవ్వడానికి అనేక కేంద్రాలను స్థాపించింది. 1917లో స్త్రీలకు ఓటుహక్కు ఇవ్వాలని కోరుతూ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. స్త్రీ ధర్మ అనే పత్రికను స్థాపించారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఫర్ ఇండియా అనే సంస్థను 1925లో మెహ్రీబాయి టాటా స్థాపించారు.
   మార్గరెట్ కజిన్స్ కృషి ఫలితంగా 1927లో అఖిల భారత మహిళల సదస్సును ఏర్పాటు చేశారు. 1941లో రోష్నీ అనే పత్రికను ప్రారంభించారు. 1927లో మద్రాసు శాసనమండలికి ముత్తులక్ష్మీరెడ్డి తొలి మహిళా శాసన మండలి సభ్యురాలిగా నియమితులయ్యారు. దేశంలో వివిధ మహిళా సంఘాలు స్త్రీలకు ఓటుహక్కు ఇవ్వాలని డిమాండు చేశాయి. 1935 - భారత ప్రభుత్వ చట్టం మహిళలకు పరిమితంగా ఓటుహక్కును కల్పించింది.
పశ్చిమ భారతదేశంలో జ్యోతిరావ్ గోవిందరావ్ ఫూలే నిమ్నజాతుల కోసం పోరాడారు. ఆయన 1827లో పుణెలో జన్మించారు. జ్యోతిరావ్ 'మాలి' అనే కులానికి చెందినవారు. వీరి కుటుంబం పీష్వాలకు పూలు, దండలు సరఫరా చేయడంతో వీరు ఫూలేగా పేరుపొందారు.
   ఒకసారి బ్రాహ్మణ వివాహ ఊరేగింపులో పాల్గొన్న ఫూలేను వారంతా అవమానించారు. ఆయన నిమ్న కులాల స్త్రీల కోసం పాఠశాల నడపడాన్ని వారు వ్యతిరేకించి అడ్డుకోవడంతో పూలే ఆ పాఠశాలను మూసివేయాల్సి వచ్చింది.
ఆగ్రకులాల ఒత్తిడి వల్ల జ్యోతిబా, ఆయన భార్య ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. మతం సాకుతో బ్రాహ్మణులు మిగతా కులాలవారిని అణిచివేశారని, బానిసలుగా మార్చారని జ్యోతిబా అభిప్రాయ పడ్డారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు బలహీనవర్గాల ప్రయోజనాలను పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. నిమ్న, వెనుకబడిన కులాల సంక్షేమం గురించి పట్టించుకోనంతవరకు కాంగ్రెస్‌ను జాతీయపార్టీగా పేర్కొనలేమని స్పష్టంగా చెప్పారు. 1873లో సత్య శోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించారు. సమాజంలో బలహీనవర్గాల వారికి సామాజిక న్యాయాన్ని అందించాలన్నది దీని ప్రధాన లక్ష్యం. ఫూలే 'గులాంగిరీ', 'స్వారజనిక్ సత్యధర్మ పుస్తక్' అనే రెండు గ్రంథాలను రచించారు. అంటరానివారు, బ్రాహ్మణేతర కులాల మధ్య వ్యత్యాసం లేదన్నారు. వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు వారి గ్రంథాల సహాయంతో సామాన్యులను తక్కువ కులానికి చెందినవారిగా ప్రకటించి వారిని దోపిడీ చేశారని జ్యోతిబా భావించారు. ఫూలే అన్ని కులాలకు చెందిన పిల్లలు, స్త్రీల కోసం అనేక పాఠశాలలు, అనాథ శరణాలయాలను స్థాపించారు. 1876లో పుణె మున్సిపల్ కమిటీ సభ్యుడిగా ఫూలే ఎన్నికయ్యారు. 1888లో ఆయన్ని మహాత్మ బిరుదుతో సత్కరించారు. ఆయన చేసిన ఉద్యమ ఫలితంగా 1894లో తమకు సైన్యంలో ఎక్కువ ఉద్యోగాలు, క్షత్రియ హోదాను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సంస్కరణోద్యమాలు

    భారత్‌లో 19వ శతాబ్దంలో సమాజోద్ధరణ దిశగా రూపుదాల్చిన అనేక సంస్కరణోద్యమాలు భారతీయుల జీవన విధానంపై విశేష ప్రభావాన్ని చూపాయి. రాజా రామ్మోహన్ రాయ్, వివేకానందుడు, స్వామి దయానంద సరస్వతి, సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ లాంటి ప్రముఖులెందరో ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మూఢ సంప్రదాయాలు, అంధ విశ్వాసాలను రూపుమాపేందుకు వీరంతా కృషి చేశారు. ఫలితంగా భారతీయుల జీవన విధానంలో వచ్చిన మార్పులు తర్వాతి తరాలకు ఎంతో మేలు చేశాయి. నాటి సామాజిక, మత సంస్కరణ ఉద్యమాల చారిత్రక అధ్యయన సమాచారాన్ని చదవండి మరి!
   19వ శతాబ్దంలో ఆధునిక ఆంగ్ల విద్యావ్యాప్తి.. క్రైస్తవ మిషనరీల మత ప్రచారం.. ఐరోపాలో ప్రారంభమైన ఉదార, హేతువాద, మానవతావాద ఉద్యమాలు భారతీయులపై ప్రభావం చూపాయి. ఇవన్నీ తమ సామాజిక, మత వ్యవస్థల గురించి భారతీయులు పునరాలోచించేలా చేశాయి. ఈ ప్రభావంతో తలెత్తిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు భారతీయుల జీవన విధానాన్ని మార్చాయి. వారిలో ఐకమత్యం, దేశభక్తిని పెంపొందించాయి. భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు మొదట బెంగాల్, తర్వాత పశ్చిమ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. భారత్‌లో పునరుజ్జీవన ఉద్యమపితగా రాజా రామ్మోహన్ రాయ్‌ని పేర్కొంటారు.

 

 

బ్రహ్మ సమాజం

    బ్రహ్మ సమాజ స్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ 1772లో బెంగాల్‌లోని బర్డ్వాన్ జిల్లా రాధానగర్‌లో జన్మించారు. 1815లో ఆత్మీయసభ అనే సంస్థను స్థాపించారు. భగవంతుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే దీని ఉద్దేశం.
హిందూ మతంలోని అనేక దురాచారాలను రూపుమాపడానికి, సంస్కరించడానికి 1828లో రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆధునిక విద్యావ్యాప్తి, స్త్రీ జనోద్ధరణ కోసం విశేషంగా కృషి చేశారు. బహు భార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలను ఖండించారు. ఆయన కృషి ఫలితంగానే అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1829లో రెగ్యులేషన్ XVII ద్వారా సతీ సహగమనం చట్టవిరుద్ధమని ప్రకటించాడు. బాల్య వివాహాలు, కులవ్యవస్థలోని లోపాలపై పోరాడారు. అంటరానితనాన్ని అప్రజాస్వామ్యం, అమానుషమని పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని ఆయన గట్టిగా కోరారు.
దేవుడికి, ప్రజలకు మధ్యవర్తులుగా ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్న పురోహితుల తరగతిని రాజా రామ్మోహన్ రాయ్ నిరసించారు. రంగు, జాతి, కులాలకు అతీతంగా మానవులందర్నీ ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు. కానీ బ్రిటిష్ పాలన పట్ల మాత్రం కొంత సానుకూల వైఖరితో ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును ప్రశంసించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్య్రంపై పరిమితులు విధించడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉంచడాన్ని వ్యతిరేకించారు. కలకత్తాలో హిందూ కళాశాల స్థాపనకు ప్రయత్నించారు.
రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదును ఇచ్చిన మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ కోరిక మేరకు రాయ్ 1830లో ఇంగ్లండ్ రాజైన నాలుగో విలియం ఆస్థానానికి వెళ్లాడు. బ్రిటిష్‌వారు ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రామ్మోహన్ రాయ్ ద్వారా మొగలు చక్రవర్తి కోరాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన రాయ్ 1833, సెప్టెంబరు 27న బ్రిస్టల్ నగరంలో మృతి చెందారు.

 

'రాజా' అనంతరం..

మహర్షి ద్వారకనాథ్ ఠాగూర్, పండిట్ రామచంద్ర విద్యావాగిష్‌లు రామ్మోహన్ రాయ్ మరణానంతరం పదేళ్లపాటు బ్రహ్మ సమాజాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ద్వారకనాథ్ ఠాగూర్ పెద్ద కుమారుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మసమాజ బాధ్యతలు చేపట్టారు. దేవేంద్రనాథ్ బ్రహ్మ సమాజంలో చేరక ముందు కలకత్తా(1831)లో తత్త్వబోధిని సభను స్థాపించారు. గొప్ప రచయిత, విద్యావేత్త అయిన అక్షయ్‌కుమార్ దత్తా 1840లో తత్త్వబోధిని పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్ మిత్రా, తారాచంద్ చక్రవర్తి, పియరీచంద్ మిత్ర చేరారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి తత్త్వబోధిని అనే మాసపత్రికను బెంగాలీ భాషలో ప్రచురించారు. దేవేంద్రనాథ్ 80 మంది అనుచరులతో 1843 డిసెంబరు 21న బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా చేరారు. అలెగ్జాండర్ డఫ్ భారతీయ సంస్కృతిపై చేసిన దాడిని దేవేంద్రనాథ్ సమర్థంగా తిప్పికొట్టారు. దేవేంద్రనాథ్ రెండేళ్ల(1856-58) పాటు సిమ్లా వెళ్లారు. అక్కడ ఉన్న సమయంలోనే కేశవచంద్రసేన్ (1857లో) బ్రహ్మ సమాజంలో చేరి ఆయన కుడిభుజంగా మారారు. 1859లో యువకులతో కూడిన సంగత్ సభను స్థాపించాడు. దీని ప్రధాన ఉద్దేశం అప్పటి ఆధ్యాత్మిక, సామాజిక సమస్యల గురించి చర్చించడం.
1861లో కేశవచంద్ర సేన్ సంపాదకుడిగా ఇండియన్ మిర్రర్ అనే పక్ష పత్రికను స్థాపించారు. ఇది తర్వాతి కాలంలో భారతదేశంలో ఆంగ్లంలో ప్రచురితమైన మొదటి దినపత్రికగా పేరొందింది. క్షామం, అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో ఆయన సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బ్రహ్మ సమాజాన్ని దేశమంతా విస్తరించడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కృషి ఫలితంగా మద్రాసులో వేద్ సమాజ్, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్‌లు ఏర్పాటయ్యాయి.

 

బ్రహ్మ సమాజంలో చీలికలు

   కేశవచంద్ర సేన్ చేపట్టిన కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలు, పరదా పద్ధతి తొలగింపు లాంటి కార్యక్రమాలు పాతతరం వారికి నచ్చలేదు. దీంతో 1866లో బ్రహ్మ సమాజంలో మొదటి చీలిక ఏర్పడింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ వర్గం 'ఆది బ్రహ్మసమాజ్‌'గా, కేశవచంద్ర సేన్ వర్గం 'బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా (నవ విధాన్)'గా విడిపోయాయి.
1870లో కేశవచంద్ర సేన్ ఇంగ్లండ్ వెళ్లొచ్చాక మరింత ఉత్సాహంతో సాంఘిక సంస్కరణలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 1872లో ప్రభుత్వంతో చర్చించి బ్రహ్మ వివాహ చట్టాన్ని తీసుకురావడం ద్వారా బ్రహ్మ సమాజం నిర్వహించే వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ఆయన ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను స్థాపించారు. పాశ్చాత్య విద్యావ్యాప్తి; స్త్రీల అభ్యున్నతి, విద్యావ్యాప్తి; సామాజిక కార్యక్రమాలకు ఈ సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది.
కేశవచంద్ర సేన్ 1878లో తన కుమార్తెను కూచ్ బిహార్ పాలకుడికి ఇచ్చి వివాహం చేశారు. చట్టబద్ధంగా నిర్ణయించిన కనీస వివాహ వయసు కంటే వధూవరులిద్దరి వయసు తక్కువ. అంతేకాకుండా ఈ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇది పూర్తిగా బ్రహ్మవివాహ చట్టానికి వ్యతిరేకం. దీంతో బ్రహ్మ సమాజంలో మరో చీలిక వచ్చింది. ఆనందమోహన్ బోస్ నాయకత్వంలో సాధారణ బ్రహ్మసమాజాన్ని స్థాపించారు.
దక్షిణ భారతదేశంలో మన్నవ బుచ్చయ్య పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటివారు బ్రహ్మ సమాజ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

 

ఆర్య సమాజం

   ఆర్య సమాజ స్థాప‌కుడు స్వామి దయానంద సరస్వతి. ఆయన అసలు పేరు మూల్‌శంకర్. 1824లో గుజరాత్‌లోని మోర్వి సమీపంలోని టంకారా అనే ప్రదేశంలో జన్మించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో విరజానందుడు అనే అంధ సన్యాసి దగ్గర వేదాలు, ధర్మ శాస్త్రాలు, స్మృతులు అభ్యసించారు. దయానంద సరస్వతి 1875, ఏప్రిల్ 10న బొంబాయిలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. విరజానందుడు హిందూమతంలోని దురాచారాలను తొలగించాలని దయానందుడిని కోరారు. వేదాలకు తిరిగి వెళదాం.. మొత్తం జ్ఞానానికి వేదాలే ఆధారం.. అనేవి వీరి నినాదాలు. తర్వాతి కాలంలో పంజాబ్‌లోని లాహోర్ ఆర్య సమాజ ప్రధాన కేంద్రంగా మారింది. ఆర్య సమాజం సిద్ధాంతాలను పంజాబ్‌లో ప్రచారం చేయడంలో దయానందుడు సఫలీకృతుడయ్యాడు. అలాగే ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా కొంతవరకు ఆర్య సమాజ ప్రభావం వ్యాపించింది.
హిందూ మతంలో విగ్రహారాధన, మూఢ విశ్వాసాలకు కారణమైన పురాణాలను దయానందుడు తిరస్కరించాడు. ఆర్యసమాజం వైదిక మతాన్ని పునరుద్ధరించి, జాతీయతా భావాన్ని పెంపొందించడానికి కృషి చేసింది. పాశ్చాత్య విద్యావిధానం వ్యాప్తికి తోడ్పడింది. బాలబాలికలకు విద్యనందించడానికి ఆర్యసమాజం దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) పాఠశాలలను స్థాపించింది. చాతుర్వర్ణ విధానం జన్మ ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఉండాలని ఈ సమాజం భావించింది. సామాజిక, విద్యా రంగాల్లో స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని కోరింది. అంటరానితనం, కుల వ్యత్యాసాలు, బాల్య వివాహాలను వ్యతిరేకించింది. వితంతు పునర్వివాహాలు, కులాంతర వివాహాలను సమర్థించింది.
ఆర్య సమాజం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు వివాదాస్పదమయ్యాయి. వీటిలో మొదటిది - 1882లో దయానందుడు ప్రారంభించిన గోరక్ష ఉద్యమం. గోరక్షణ కోసం నిధులు సేకరించి, గోవులను వధించకుండా అడ్డుకోవడం లాంటి కార్యకలాపాలను చేపట్టారు. ఇది హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.
రెండోది - ఇతర మతాల్లోకి చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి దయానందుడు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీలు ఎక్కువ సంఖ్యలో హిందువులను, ముఖ్యంగా అణగారిన వర్గాలవారిని క్రైస్తవ మతంలోకి మార్చాయి. వీరిని తిరిగి హిందువులుగా మార్చడానికి చేసిందే శుద్ధి ఉద్యమం.

 

రామకృష్ణ మిషన్, మఠం

    వివేకానందుడు 1897లో పశ్చిమ బెంగాల్‌లోని బేలూరు కేంద్రంగా రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం సమాజసేవ చేయడం. దీనిద్వారా అనేక పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, అనాథ శరణాలయాలను స్థాపించి, పేద ప్రజలకు సహాయం చేశారు. ఆయన 1887లో పశ్చిమబెంగాల్‌లోని బారానగర్‌లో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీనిద్వారా తన గురువైన             రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేశారు. 1898 నుంచి రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలకు బేలూరు ప్రధాన కేంద్రం అయ్యింది.
రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ. ఆయన 1836లో పశ్చిమబెంగాల్, హుగ్లీ జిల్లాలోని కామర్‌పుకుర్ అనే గ్రామంలో జన్మించారు. మానవ సేవే మాధవ సేవ అనేది రామకృష్ణుడి నినాదం. వేదాంత, ఉపనిషత్తుల నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. రామకృష్ణుడికి సూఫీ మత గురువు ఇస్లాం మతదీక్షను అనుగ్రహించారు. కాళీమాత, కృష్ణుడు, బుద్ధుడు, సిక్కు గురువులను ఆయన పూజించేవారు. బైబిల్ పఠనాన్ని వినేవారు.
వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన కలకత్తాలో 1863లో జన్మించారు. మొదటిసారి 1881లో రామకృష్ణ పరమహంసను కలిశారు. భారతదేశం మొత్తం కాలినడకన ప్రయాణించి, ప్రజల వాస్తవ స్థితిగతులను తెలుకున్నారు.
వివేకానందుడు మానవులందరిలో దైవత్వం ఉందని, ప్రతి వ్యక్తిలోనూ శక్తి సామర్థ్యాలున్నాయని, ఎవరినీ తక్కువగా చూడరాదని బోధించారు. అనారోగ్యం కారణంగా అతి చిన్న వయసులోనే (1902) ఆయన మృతి చెందారు.

 

దివ్యజ్ఞాన సమాజం

     రష్యాకు చెందిన హెచ్.పి.బ్లావట్‌స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ 1875లో న్యూయార్క్‌లో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. వీరు 1879లో భారతదేశానికి వచ్చి, 1882లో మద్రాసు సమీపంలోని అడయార్ వద్ద దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు.
ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ లండన్‌లోని దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలిగా చేరారు. ఆమె 1893లో మనదేశానికి వచ్చి, 1907లో ఆల్కాట్ మరణం తర్వాత దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు. విశ్వమానవులందరిలో సోదర భావాన్ని పెంపొందించడం, ప్రాచీన మతాల అధ్యయనాన్ని ప్రోత్సహించడం ఈ సమాజం ప్రధాన లక్ష్యాలు.
హిందూ మతసూత్రాలను బోధించడానికి అనిబిసెంట్ 1898లో వారణాసిలో సెంట్రల్ హిందూ స్కూల్‌ను ప్రారంభించారు. తర్వాతి కాలంలో మదన్‌మోహన్ మాలవీయ కృషి ఫలితంగా ఇది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా (1916) అభివృద్ధి చెందింది.

 

అలీగఢ్ ఉద్యమం

ఉత్తర ప్రదేశ్‌లోని బరేలికి చెందిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. హేతువాదం ప్రాతిపదికగా ఇస్లాం మతాన్ని సమర్థిస్తూనే, ముస్లిం సమాజంలోని బహు భార్యత్వాన్ని, బానిస వ్యవస్థను విమర్శించారు. ముస్లింలకు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో 1875లో అలీగఢ్‌లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. అది 1920లో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది.
 

ముఖ్యాంశాలు

* రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని 1828లో స్థాపించాడు.
* మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదు ఇచ్చాడు.
* స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఆయన అసలు పేరు మూల్‌శంకర్.
* వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన 1863లో జన్మించారు. 1881లో రామకృష్ణ పరమహంసను తొలిసారి కలిశారు.
* వివేకానందుడి గురువైన రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ ఆయన 1836లో జన్మించారు.
* వివేకానందుడు రామకృష్ణ మఠం (1887), రామకృష్ణ మిషన్ (1897)లను స్థాపించాడు.
* 1875లో దివ్యజ్ఞాన సమాజాన్ని రష్యాకు చెందిన హెచ్.పి. బ్లావట్‌స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ స్థాపించారు.
* ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ 1893లో భారతదేశానికి వచ్చారు. 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ 18వ శతాబ్దపు స్థితిగతులు

భారతదేశ చరిత్రలో 18వ శతాబ్దానికి ప్రాధాన్యం ఉంది. అప్పట్లో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు ఎలా ఉండేవనేది తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ అంశంపై అడిగే ప్రశ్నలకు సులువుగా జవాబులు గుర్తించవచ్చు. ఆనాటి ఆచార వ్యవహారాలు - కట్టుబాట్లు, విద్యా వ్యవస్థ, గ్రామీణ - పట్టణ ప్రాంతాల పరిస్థితులు, ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులు.. ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం.. తదితర ఆసక్తికరమైన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం.
    భారతదేశంలో క్రీ.శ. 18వ శతాబ్దంలో రాజకీయ అస్థిరత నెలకొన్నప్పటికీ కొన్ని మార్పులతో సమాజంలోని సంప్రదాయ లక్షణాలు కొనసాగుతూనే ఉండేవి.


సాంఘిక అసమానతలు
సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన చక్రవర్తి, అధికార వర్గం విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. వీరు మద్యం, స్త్రీ, సంగీతానికి బానిసలుగా తయారయ్యారు. దిగువ స్థాయిలో గ్రామీణ పేద వ్యవసాయదారులు, చేతివృత్తులవారు ఉండేవారు. ఈ రెండు వర్గాలకు మధ్యలో చిన్న వ్యాపారులు, దిగువ తరగతి ఉద్యోగులు, పట్టణ ప్రాంతాల్లోని చేతి వృత్తులవారు ఉండేవారు. సమకాలీన ఆధారాలు లేకపోవడం, వివిధ ప్రాంతాల్లో ఆదాయం, ధరల్లో వ్యత్యాసం ఉండటంతో ప్రజల జీవన ప్రమాణాన్ని పోల్చడం సాధ్యపడటంలేదు.
ఆ కాలంనాటి హిందూ సమాజంలోని కుల వ్యవస్థ ప్రత్యేకతను సంతరించుకుంది. వివాహం, దుస్తులు, ఆహారం, వృత్తుల ఎంపికలో కుల నియమాలు తప్పక పాటించేవారు. అయితే ఆర్థిక ఒత్తిడులు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన పరిపాలనాపరమైన ఆవిష్కరణల ఫలితంగా కొందరు తమ పూర్వీకుల వృత్తులను విడిచి కొత్త వృత్తులను చేపట్టారు.


స్త్రీల జీవనం
స్త్రీలకు ఇళ్లలో గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినా సమానత్వాన్ని మాత్రం ఇవ్వలేకపోయారు. మలబార్, కొన్ని వెనుకబడిన ప్రాంతాలు మినహా మిగతా దేశంలో పితృస్వామిక సమాజం అమల్లో ఉండేది. తండ్రి లేదా పెద్ద కుమారుడ్ని కుటుంబ పెద్దగా వ్యవహరించేవారు. రాజకీయాలు, పరిపాలన విషయాల్లో కొందరు హిందూ, ముస్లిం స్త్రీలు ప్రముఖ పాత్ర వహించినప్పటికీ సాధారణ స్త్రీలకు సమాజంలో సముచిత స్థానం లభించలేదు. స్త్రీలు పరదా విధానాన్ని అవలంబించేవారు. పేద స్త్రీలు మాత్రం ఈ విధానాన్ని పాటించలేదు.
* బాల్యవివాహాలు సర్వసాధారణం. రాజకుమారులు, పెద్ద జమిందార్లు, ధనవంతుల్లో బహు భార్యత్వం ఉండేది. ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌కు చెందిన ధనిక వర్గాల్లో ఈ ఆచారం ఎక్కువ. ధనిక వర్గాల్లో వరకట్నం తీసుకోవడం సంప్రదాయం. వితంతు పునర్వివాహాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగేవి. పీష్వాలు వితంతు పునర్వివాహాలపై 'పట్టం అనే పన్ను విధించేవారు. పీష్వాలు తమ భూభాగంలో సతీసహగమనాన్ని రూపుమాపడంలో కొంత విజయం సాధించారు.


రెండు విధాల బానిసత్వం
బానిసలను ఇంటి పని, పొలం పని చేసేవారు.. ఇలా రెండు తరగతులుగా విభజించారు. యజమాని భూమిని అమ్మినప్పుడు ఆ పొలాల్లో పనిచేసే బానిసలు కొత్త యజమాని కింద పనిచేయాల్సి వచ్చేది. భారతదేశంలో బానిసత్వం ఎక్కువగా అమల్లో ఉన్నట్లు ఐరోపాకు చెందిన యాత్రికులు, పరిపాలకులు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కరవు, ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను కొంత ధరకు అమ్మేవారు. రాజపుత్రులు, ఖాత్రీలు, కయస్థ కులానికి చెందినవారు తమ ఇళ్లలో బానిస స్త్రీలను వినియోగించుకునేవారు. అమెరికా, ఐరోపా దేశాల్లోని బానిసలతో పోలిస్తే భారతదేశంలో బానిసల పరిస్థితి మెరుగ్గా ఉండేది. బానిసలను కుటుంబానికి చెందిన వారసత్వ సేవకులుగా పరిగణించేవారు. వారికి వివాహం చేసుకునే హక్కు ఉండేది. బానిసల పిల్లలను స్వేచ్ఛా పౌరులుగా గుర్తించేవారు.
ఐరోపావారి రాకతో బానిసత్వం, బానిసల వ్యాపారం కొత్త పుంతలు తొక్కింది. ఐరోపాకు చెందిన వర్తక కంపెనీలు 10 సంవత్సరాల బాలికను 5 నుంచి 15 రూపాయలకు, 16 ఏళ్ల బాలుడిని 16 రూపాయలకు, వయోజనుడైన బానిసను 15 నుంచి 20 రూపాయిలకు.. బెంగాల్, అసోం, బిహార్ మార్కెట్లలో కొని, వారిని ఐరోపా, అమెరికా మార్కెట్లలో అమ్మేవారు. ఐరోపావారు సూరత్, మద్రాసు, కోల్‌కతాల్లో అబిసీనియన్ బానిసలను కొని, ఇంటిపనికి వినియోగించినట్లు తెలుస్తోంది. క్రీ.శ. 1789 లో బానిస రవాణాను నిషేధించారు. అయితే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బానిసత్వం కొనసాగుతోంది.


విద్యకు ప్రాధాన్యం
హిందూ, ముస్లింలు విద్య నేర్చుకోవడానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. వీరు విద్యను మతంతో అనుసంధానం చేశారు. నాడియ, బెనారస్(కాశి), తీర్హుట్(మిథిల), ఉత్కల(ఒడిశా)లు సంస్కృత విద్యకు పేరుపొందిన కేంద్రాలు. ఎంతోమంది సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి కాశీకి వచ్చేవారు. అరబిక్, పర్షియన్ భాషల్లో ఉన్నత విద్యా కేంద్రాలను మద్రసాలని పిలిచేవారు. పర్షియన్ రాజభాష కావడంతో హిందూ, ముస్లింలు దీన్ని నేర్చుకునేవారు. ఖురాన్ అధ్యయనం చేయాలనుకునేవారు అరబిక్ భాషలో ప్రావీణ్యం సాధించేవారు.
ప్రాథమిక విద్య ఎక్కువగా విస్తరించింది. హిందువుల ప్రాథమిక విద్యా కేంద్రాలను పాఠశాలలని, ముస్లిం ప్రాథమిక పాఠశాలలను మక్తబ్‌లనీ పిలిచేవారు. పాఠశాలలు, దేవాలయాలు, మసీదులకు అనుబంధంగా ఉండేవి. పాఠశాలలో విద్యార్థులు చదవడం, రాయడం, అంకగణితాలను నేర్చుకునేవారు. సత్యం, నిజాయతీ, తల్లిదండ్రులపై విధేయత, మతం పట్ల విశ్వాసం మొదలైనవి పాఠశాలల్లో నేర్పించే ముఖ్యమైన విషయాలు. ఉన్నత కులాలకు చెందినవారు ఎక్కువగా చదువుకున్నప్పటికీ, తక్కువ కులాలకు చెందినవారి పిల్లలు కూడా పాఠశాలలకు హాజరయ్యేవారు. అయితే బాలికల విద్యకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.


కళలు - సాహిత్యం
కళలు, సాహిత్యానికి దిల్లీలో ఆదరణ లేకపోవడంతో కవులు, కళాకారులు కొత్తగా స్థాపించిన రాజ్యాల రాజధానులైన హైదరాబాద్, లఖ్‌నవూ(లక్నో), ముర్షీదాబాద్, జైపూర్ తదితర ప్రాంతాలకు తరలి వెళ్లేవారు. క్రీ.శ. 1784లో లఖ్‌నవూలో అసఫ్ ఉద్దౌలా మొహరం పండుగ జరుపుకోవడానికి వీలుగా గొప్ప ఇమంబరను నిర్మించాడు. ఈ భవన నిర్మాణంలో స్తంభాలు లేకపోవడం విశేషం.
మహారాజ రంజిత్ సింగ్ అమృత్‌సర్‌లోని సిక్కుల దేవాలయాన్ని పునరుద్ధరించాడు. 1725లో ఈ దేవాలయంలోని కింది సగభాగాన్ని పాలరాతితో, పై భాగాన్ని రాగితో నిర్మించి, పలుచటి బంగారంతో తాపడం చేయించాడు. అందుకే దీన్ని స్వర్ణదేవాలయంగా పిలుస్తున్నారు. భరత్‌పూర్ రాజధాని దిగ్‌లో సూరజ్‌మల్ ప్రాసాదం, ఆగ్రాలోని రాజ ప్రాసాదాలకంటే మిన్నగా స్వర్ణదేవాలయ పునర్‌నిర్మాణాన్ని ప్రారంభించినా.. దాన్ని పూర్తి చేయలేదు.
ప్రాంతీయ భాషలైన ఉర్దూ, హిందీ, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, మరాఠీ, తెలుగు, తమిళం అభివృద్ధి చెందాయి. క్రీ.శ. 18వ శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు ముద్రణ యంత్రాలను స్థాపించాయి. బైబిల్‌ను ప్రాంతీయ భాషల్లో ముద్రించాయి. బెంగాల్‌లో విలియం కేరి, వార్డ్, మార్ష్‌మాన్ లాంటి క్రైస్తవ మిషనరీలు సెరాంపూర్‌లో ముద్రణ యంత్రాన్ని స్థాపించి బెంగాలీ భాషలో బైబిల్‌ను ప్రచురించాయి.


ఆర్థిక వ్యవస్థ
క్రీ.శ. 18వ శతాబ్దం ప్రారంభంలో భారత ఆర్థిక వ్యవస్థలో గ్రామాలు సొంత పరిపాలనా వ్యవస్థను కలిగి ఉండి, స్వయం సమృద్ధితో ఉండేవి. గ్రామానికి కావాల్సిన అన్ని వస్తువులను స్వయంగా ఉత్పత్తి చేసుకునేవి. ఇవి రాజ్యానికి భూమిశిస్తును చెల్లించేవి. పాలకులు, రాజవంశాలు మారినా గ్రామీణ వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ పరిస్థితులు ఐరోపా పరిశీలకుల దృష్టిని ఆసియా గ్రామీణ వ్యవస్థ వైపు ఆకర్షించాయి.

భారతదేశంలో పట్టణ చేతివృత్తులు బాగా అభివృద్ధి చెంది, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లను ఆకర్షించాయి. అప్పట్లో భారతదేశంలోని ఢాకా, అహ్మదాబాద్, మచిలీపట్నం ప్రాంతాలు నూలు ఉత్పత్తులకు; ముర్షిదాబాద్, ఆగ్రా, లాహోర్, గుజరాత్‌లోని పలు ప్రాంతాలు పట్టు వస్త్రాలకు; లాహోర్, ఆగ్రా, కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్నితో చేసిన కార్పెట్లు, శాలువాలు, బంగారు, వెండితో చేసిన ఆభరణాలు, లోహపాత్రలు, ఆయుధాలకు విదేశాల్లో ఎక్కువ గిరాకీ ఉండేది. అంతర్గత, విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందడంతో వర్తక పెట్టుబడిదారీ వ్యవస్థ అమల్లోకి రావడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఉత్తర భారతదేశంలో జగత్‌షేర్‌లు, నగర్‌షేర్‌లు దక్షిణ భారతదేశంలో చెట్టియార్లు ఆవిర్భవించడంతో వర్తక, వాణిజ్యాలు మరింత అభివృద్ధి చెందాయి.
క్రీ.శ. 17, 18 శతాబ్దాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు పెట్టుబడిదారీ వ్యవస్థ త్వరగా అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులను కల్పించాయి. రైతుల నుంచి దోచుకున్న సంపదను భూస్వాములు తమ ఆడంబరాల కోసం వృథా చేసేవారు. ప్రభు వర్గానికి చెందినవారు మరణిస్తే వారి ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పించే చట్టాలు.. ప్రజల్లో సరైన మార్గంలో పొదుపు చేసే అలవాటు లేకపోవడం.. పొదుపు చేసిన సొమ్మును ఉత్పాదన కోసం వినియోగించక పోవడం.. రాజకీయ స్థిరత్వం లేకపోవడం.. అభివృద్ధి కాంక్ష, ముందు చూపులేని రాజ్యం.. ఇవన్నీ అభివృద్ధికి నిరోధకాలుగా ఉన్నాయి. క్రీ.శ. 18వ శతాబ్దంలో ఐరోపా వర్తక సంఘాలు భారతదేశంలో రాజకీయం, ఆర్థిక ఆసక్తితో బలంగా ఉండటం కూడా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు మళ్లడానికి కారణమైంది.

ముఖ్యాంశాలు
* సతీసహగమన దురాచారాన్ని ఎక్కువగా బెంగాల్, మధ్య భారతదేశం, రాజస్థాన్‌లలో కొన్ని ఉన్నత కులాలకు చెందినవారు మాత్రమే పాటించేవారు.
* బెంగాల్, బిహార్‌లలో సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేసే ఉన్నత విద్యా కేంద్రాలను 'చటుస్పతి అని పిలిచేవారు.
* బెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు కాశీని 'భారతదేశ ఏథెన్స్‌గా వర్ణించాడు.
* అజిమాబాద్(పాట్నా) తూర్పు భారతదేశంలో గొప్ప పర్షియన్ విద్యా కేంద్రంగా ఉండేది.
* పింక్ సిటీగా పేరుపొందిన జైపూర్‌ను సవాయి జైసింగ్ నిర్మించాడు. దీంతో సహా అయిదు నగరాల్లో ఖగోళ పరిశీలన కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాడు.
* డెన్మార్క్‌కు చెందిన జీజెన్‌బెల్గ్ తమిళ వ్యాకరణాన్ని రచించడంతోపాటు బైబిల్‌ను తమిళంలోకి అనువదించాడు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కడ‌ప‌టి మొగ‌లుల పాల‌న‌

    భారతదేశ చరిత్రలో మొగల్ సామ్రాజ్యానికి విశిష్ట స్థానం ఉంది. 300 సంవత్సరాల ఢిల్లీ సుల్తానుల పాలనను అంతమొందించడమే కాకుండా భారత ఉపఖండంలో నూతన శకం ఆరంభానికి మొగలులు నాంది పలికారు. సువిశాల సామ్రాజ్యం, పటిష్టమైన సైన్యం, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక ప్రగతిని సాధించడం ద్వారా వీరు భారతీయ సంస్కృతి ఔన్నత్యానికి దోహదపడ్డారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ కడపటి మొగలుల అధికార దాహం, విలాస జీవనం, అసమర్థ పాలనతో సామ్రాజ్యం పతనమైంది.
    ఔరంగజేబు మరణించే నాటికి(క్రీ.శ.1707) మొగల్ సామ్రాజ్య విస్తీర్ణం ఉచ్ఛ స్థితికి చేరుకుంది. 21 రాష్ట్రాలు ఉండేవి. ఔరంగజేబు మరణానంతరం మొగల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. అక్బర్ నుంచి ఔరంగజేబు వరకు నలుగురు గొప్ప మొగలులు 151 సంవత్సరాలు పరిపాలించారు. అయితే మొదటి బహదూర్‌షా నుంచి రెండో షా ఆలం వరకు 11 మంది కడపటి మొగలులు 100 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. అంటే కడపటి మొగలులు ఒక్కొక్కరూ సగటున 10 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలేకపోయారు. వ్యక్తిత్వం, సామ్రాజ్య విస్తీర్ణం తదితర అంశాల్లో ముందుతరం మొగలులకు, కడపటి మొగలులకు పోలికే లేదు.

 

మొదటి బహదూర్‌షా (1707- 1712)

   ఔరంగజేబు మరణానంతరం అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. చివరికి కాబూల్ గవర్నర్‌గా ఉన్న మువజ్జం వారసత్వ యుద్ధంలో నెగ్గి బహదూర్ షా పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు సిక్కుల గురువు గోవింద్‌సింగ్‌ను మొగలుల సర్వీసులోకి తీసుకోవడం ద్వారా సిక్కులు, మొగలులకు మధ్య ఉన్న వైరానికి తెరదించాడు. అయితే తర్వాతి సిక్కు గురువు బందా బహదూర్ మొగలులపై తిరుగుబాటు చేశాడు. బహదూర్‌షా స్వయంగా యుద్ధం చేసినప్పటికీ సిక్కులను అణిచివేయలేక పోయాడు. అదే సమయంలో మొగలుల చెరలో ఉన్న శంభాజీ కొడుకు సాహును చెర నుంచి విడిపించాడు. ఔరంగజేబు విధించిన జిజియా పన్నును రద్దు చేశాడు. మేవార్, మార్వార్ రాజ్యాల స్వాతంత్య్రాన్ని గుర్తించాడు. బుందేలు నాయకుడు ఛత్రసాల్, జాట్‌ల నాయకుడు చూరమాన్‌లను మొగల్ పరిధిలోకి తీసుకోవడం ద్వారా వారితో వైరం తొలగిపోయింది. క్రీ.శ. 1712లో బహదూర్‌షా మరణాంతరం అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. వారు తండ్రి శవానికి దహన క్రియలు చేయడం కూడా మరచి వారసత్వ యుద్ధంలో మునిగిపోయారు. చివరికి పెద్ద కుమారుడు జహందర్‌షా వారసత్వ యుద్ధంలో గెలిచాడు. 10 వారాల తర్వాత బహదూర్‌షాకు వారు అంత్యక్రియలు నిర్వహించారు.
 

జహందర్‌షా (1712 - 1713)

   వారసత్వ యుద్ధంలో జుల్ఫికర్‌ఖాన్ మద్దతుతో జహందర్‌షా విజయం సాధించాడు. ఇతడి కాలంలో జహందర్‌షా భార్య లాల్‌కున్వర్ పారిపాలనా విషయాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఆమె రక్త సంబంధీకులు రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు. మొగలుల పరువు, ప్రతిష్ఠలు దిగజారాయి. ఇతడి కాలంలో తురానీలు, ఇరానీలు, హిందుస్థానీలు అనే మూడు వర్గాలు ఉండేవి. తురానీలు సున్నీ శాఖకు చెందిన వారు కాగా, ఇరానీలు షియా శాఖకు చెందినవారు.
 

ఫరూక్‌సియార్ (1713 - 1719)

    ఇతడు జహందర్ షా సోదరుడి కుమారుడు. సయ్యద్ సోదరుల సహకారంతో సింహాసనాన్ని అధిష్టించాడు. దీనికి ప్రతిఫలంగా చక్రవర్తి సయ్యద్ అబ్దుల్లాఖాన్‌ను వజీర్‌గా, అతడి తమ్ముడు హుస్సేన్ అలీఖాన్‌ను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. ఫరూక్ సియార్ ఉత్తర్వుల మేరకు జుల్ఫికర్ ఖాన్‌ను వధించారు. సయ్యద్ సోదరులు తమ స్థానంలో వేరేవారిని చక్రవర్తి నియమించకుండా ఉండటం కోసం  బంధీలుగా ఉన్న రాకుమారులందరి కళ్లు తీయించారు. తర్వాత చక్రవర్తి, సయ్యద్ సోదరుల మధ్య తగాదా ప్రారంభమైంది. చివరికి ఫరూక్‌సియార్‌ను సయ్యద్ సోదరులు చంపేసి, రఫీ ఉద్దరజత్‌ను చక్రవర్తిగా నియమించారు. అయితే అతడు నాలుగు నెలల్లోనే మరణించాడు. తర్వాత అతడి అన్న రఫీ ఉద్దౌలాను రెండో షాజహాన్ పేరుతో సింహాసనంపై కూర్చోబెట్టారు.
 

మహమ్మద్‌షా (1719 - 1748)
    రెండో షాజహాన్ 1719 సెప్టెంబరులో మరణించాడు. అతడి స్థానంలో రౌషాన్ అక్తర్‌ను మహమ్మద్ షా అనే బిరుదుతో సయ్యద్ సోదరులు సింహాసనంపై కూర్చోబెట్టారు. నిజాం ఉల్ ముల్క్, ఇతిమద్ ఉద్దౌలా, సాదత్‌ఖాన్, మహమ్మద్‌షా తల్లి కూటమిగా ఏర్పడి సయ్యద్ సోదరులను చంపడానికి కుట్ర పన్నారు. 1720లో సయ్యద్ హుస్సేన్ అలీఖాన్, అతడి కుమారుడిని దక్కనులో చంపించారు. నెల తర్వాత అతడి సోదరుడు అబ్దుల్లా ఖాన్‌ను బంధించి విష ప్రయోగంతో హతమార్చారు. సయ్యద్ సోదరుల మరణం తర్వాత మొగల్ సామ్రాజ్య పతనం మరింత వేగవంతమైంది. మహమ్మద్‌షా వయసు సింహాసనాన్ని అధిష్టించేనాటికి 18 సంవత్సరాలు మాత్రమే. ఇతడు నిరంతరం రాజప్రసాదం నాలుగు గోడల మధ్య అంతఃపుర స్త్రీల సాంగత్యంలో గడిపాడు. విలాసాలకు బానిస కావడంతో 'రంగీలాగా పేరుగాంచాడు. ఇతడు మహమ్మద్ అమీన్‌ఖాన్‌ను వజీర్‌గా నియమించాడు. 1721లో అమీన్‌ఖాన్ మరణం తర్వాత నిజాం ఉల్‌ముల్క్‌ను ఆ స్థానంలో నియమించాడు. ఇతడు సంస్కరణల ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని ప్రయత్నించాడు. అయితే చక్రవర్తి ఇతడికి పరోక్షంగా ఇబ్బందులు కల్పించాడు. దీంతో విసిగిపోయిన నిజాం ఉల్‌ముల్క్ వజీర్ పదవిని వదలిపెట్టి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని 1724లో స్థాపించాడు. ముర్షీద్ కులీఖాన్ బెంగాల్‌లో, సాదత్‌ఖాన్ అవధ్‌లో స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. మాల్వా, గుజరాత్‌లు మొగల్ సామ్రాజ్యం నుంచి విడిపోయాయి.
 

నాదిర్షా దండయాత్ర (1738 - 1739)
    ఇరాన్ నెపోలియన్‌గా పేరు పొందిన నాదిర్షా భారతదేశంపై 1738-39లో దండయాత్ర చేశాడు. 1738లో కాబూల్, జలాలాబాద్, పెషావర్‌లను ఆక్రమించాడు. 1739లో లాహోర్ ఇతడి ఆధీనమైంది. నిజాం ఉల్‌ముల్క్, కమీరుద్దీన్, ఖాన్-ఇ-దౌరాన్, సాదత్‌ఖాన్‌లు నాదిర్షాను అడ్డుకున్నారు. ఫిబ్రవరి 1739లో కర్నాల్ వద్ద మొగల్ సైన్యం ఓడిపోయింది. ఈ యుద్ధంలో ఖాన్-ఇ-దౌరాన్ మరణించాడు. సాదత్‌ఖాన్ సలహాతో నాదిర్షా 1739, మార్చి 20న ఢిల్లీపై దండెత్తాడు. రెండు రోజుల తర్వాత నాదిర్షా మరణించాడనే వదంతులు వచ్చాయి. మొగల్ సైనికులు 700 మంది నాదిర్షా సైనికులను చంపారు. దీంతో నాదిర్షా ఆదేశం మేరకు 20,000 మంది భారతీయులను చంపారు. నాదిర్షా ఢిల్లీలో 47 రోజులపాటు ఉండి ప్రతి ఇంటినీ దోచుకున్నాడు. ప్రసిద్ధిగాంచిన నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం నాదిర్షా వశమయ్యాయి.
అహమ్మద్ షా అబ్దాలీ తొలి దండయాత్రలు
1747లో నాదిర్షా మరణానంతరం అతడి సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. అతడి ముఖ్య సైన్యాధ్యక్షుల్లో అబ్దాలీ తెగకు చెందిన అహ్మద్ అఫ్గనిస్థాన్‌కు పాలకుడిగా ప్రకటించుకున్నాడు. కాబూల్, కాందహార్‌లను ఆక్రమించి పెషావర్ చేరుకున్నాడు. తర్వాత సింధు నదిని దాటి లాహోర్, సర్‌హింద్‌లను 1748లో ఆక్రమించాడు. ఇతడి రెండో దండయాత్ర సమయంలో మహమ్మద్‌షా మరణించాడు.

 

అహమ్మద్ షా (1748 - 1754)
    మహమ్మద్ షా తర్వాత అతడి కుమారుడు అహమ్మద్ షా చక్రవర్తి అయ్యాడు. ఇతడు మహమ్మద్ షా, ఒక నర్తకికి జన్మించాడు. అహమ్మద్‌షా మద్యపానం, స్త్రీలకు బానిసై పరిపాలననంతా తన తల్లి ఉద్ధంబాయికి అప్పగించాడు. ఈ కాలంలో అవధ్ నవాబు సఫ్దర్‌జంగ్ మొగల్ సామ్రాజ్యానికి వజీరుగా వ్యవహరించేవాడు. అహమ్మద్‌షా తల్లి ఇతడిని 1753లో ఆ పదవి నుంచి తొలగించి ఇతిజం ఉద్దౌలాను వజీర్‌గా నియమించింది. ఇతడు అహమ్మద్ షాను పదవీచ్యుతుడిని చేశాడు. తర్వాత అహ్మద్‌షాను, అతడి తల్లిని బంధించాడు.
అహమ్మద్ షా కాలంలో అహమ్మద్ షా అబ్దాలీ 1749, 1752లో భారతదేశంపై రెండు సార్లు దండెత్తాడు. ఢిల్లీ పతనం కాకుండా ఉండటం కోసం మొగల్ సుల్తాన్ అహ్మద్‌షా పంజాబ్, ముల్తాన్‌లను అహ్మద్‌షా అబ్దాలీకి అప్పగించాడు. ఇతడి కాలంలో మొగలుల కోశాగారం ఖాళీ అయ్యింది.

 

రెండో అలంఘీర్ (1754 - 1759)
   అహమ్మద్ షా పదవీచ్యుతుడైన తర్వాత జహందర్ షా మనవడైన అజీజుద్దీన్ రెండో ఆలంఘీర్ బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడి కాలంలో మొగలుల సైనిక, ఆర్థిక వ్యవస్థలు బాగా దిగజారిపోయాయి. సైనికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో వారి తిరుగుబాట్లు సర్వసాధారణమయ్యాయి. ఈ సమయంలో అహమ్మద్‌షా అబ్దాలీ భారతదేశంపై 1755లో నాలుగోసారి దండెత్తాడు. ఆలంఘీర్‌ను తన వజీర్ 1759 నవంబరులో హత్య చేశాడు.
 

రెండో షా ఆలం (1759 - 1806)
   ఇతడు రెండో ఆలంఘీర్ కుమారుడు. ఇతడి అసలు పేరు అలీగౌహర్. రెండో షా ఆలం 1759లో సింహాసనాన్ని అధిష్ఠించినా, తన వజీరుకు భయపడి రాజధానిలో నివసించ లేదు. ఇదే సమయంలో అహమ్మద్ షా అబ్దాలీ భారతదేశంపై అయిదోసారి దండెత్తాడు. చివరికి ఇది మూడో పానిపట్ యుద్ధానికి (1761, జనవరి 15) దారితీసింది. ఈ యుద్ధంలో అబ్దాలీ మరాఠాలతో పాటు మొగలులను కూడా  ఓడించాడు. రెండో షా ఆలం బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, అవధ్ నవాబు షుజా ఉద్దౌలాతో కలసి 1764లో 'బక్సార్ యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడి ఓడిపోయాడు. అయితే 1772లో మరాఠాలు రెండో షా ఆలంను ఢిల్లీ సుల్తానుగా ప్రకటించుకున్నారు. అనంతరం నజీబుద్దౌలా 1788లో షాఆలం కళ్లు తీయించాడు. 1803లో బ్రిటిషర్లు ఢిల్లీని ఆక్రమించుకున్నారు. తర్వాత షాఆలం, అతడి వారసులు రెండో అక్బర్, రెండో బహదూర్‌షాలు బ్రిటిషర్ల పెన్షనర్లుగా జీవించారు. షాఆలం 1806లో మరణించాడు.
 

రెండో అక్బర్ (1806 - 1837)
ఇతడు సంఘ సంస్కర్త అయిన రామమోహన్‌రాయ్‌కి 'రాజా అనే బిరుదునిచ్చాడు. రామమోహన్‌రాయ్ బ్రిటిషర్లు మొగలు చక్రవర్తికి ఇచ్చే పెన్షన్‌ను పెంచే విధంగా వారితో మాట్లాడటానికి ఇంగ్లండ్ వెళ్లాడు.
 

రెండో బహదూర్ షా (1837 - 1857)

  ఇతడు కడపటి మొగల్ చక్రవర్తుల్లో చివరివాడు. 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఓడిపోయాడు. దీంతో అదే ఏడాది మొగలు చక్రవర్తి పదవిని బ్రిటిషర్లు నిషేధించి బహదూర్ షాను బంధించి, రంగూన్‌కు పంపారు. అతడు అక్కడే 1862లో మరణించాడు.
 

మొగలు సామ్రాజ్య పతనానికి కారణాలు

* ఔరంగజేబు కాలం నాటికి మొగల్ సామ్రాజ్యం నియంత్రించ లేనంతగా విస్తరించింది. ఈ సామ్రాజ్య విస్తరణ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించి యుద్ధాలు చేయడంతో ఖజానా ఖాళీ అయ్యింది.
* ఇతడు పరమత ద్వేషం పాటించడంతో అసంఖ్యాకులైన హిందువులతో వైరాన్ని పెంచుకున్నాడు. దీంతో జాట్లు, సిక్కులు, రాజపుత్రులు, మరాఠాలు తిరుగుబాట్లు చేశారు.
* ఇతడి దక్కను విధానం మొగలు సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమైంది.
* ఔరంగజేబు తర్వాత సింహాసనాన్ని అదిష్ఠించిన పాలకులంతా బలహీనులు కావడంతో సమస్యలను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేశారు.
* నాదిర్షా, అహమ్మద్ షా అబ్దాలి దండయాత్రలు మొగల్ సామ్రాజ్య పతనాన్ని వేగవంతం చేశాయి.
* వ్యవసాయం, వ్యాపారం కుంటుపడటంతో రైతుల పరిస్థితి దిగజారి వారంతా తిరుగుబాటు చేశారు.
* మొగల్ సైన్యం బలహీన పడటానికి మరో ప్రధాన కారణం మున్సబ్‌దారీ విధానం సక్రమంగా అమలు కాకపోవడం. ఈ విధానంలో అనేక లోపాలుండటంతో సైన్యంలో క్రమశిక్షణ కొరవడింది. సైనికులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడంతో వారు కూడా తిరుగుబాటు చేశారు.
* బ్రిటిషర్ల అధికారం పుంజుకోవడంతో మొగల్ సామ్రాజ్యం పతనమైంది. వీరు సుమారు 100 ఏళ్ల పాటు మొగలులతో పోరాడారు. చివరకు 1857లో సిపాయిల తిరుగుబాటులో మొగలులను పూర్తిగా ఓడించి చక్రవర్తి పదవిని నిషేధించారు.

 

 

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

యుద్ధాలు

    మొగలు సామ్రాజ్య పతన దశలో మరాఠాల రాజ్యం వచ్చింది. తదనంతరం మరాఠాలను అణచివేసి ఆంగ్లేయులు పాలనకు వచ్చారు. శివాజీ, ఆయన వారసుల తర్వాత కూడా మరాఠాల ప్రాబల్యం పీష్వాల పరిపాలనలో కొనసాగింది. అందుకే పీష్వా వంశస్థాపకుడైన బాలాజీ విశ్వనాథ్‌ను 'మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడు' అని పిలిచారు. ఆధునిక భారతదేశ చరిత్రలో మరాఠాల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు పీష్వాల గురించి తెలుసుకోవాలి. వారు తమ పాలన కాలంలో అనేక యుద్ధాలు చేశారు. ఈ పోరాటాలు, ఇతర పరిణామాల ఫలితంగా మరాఠా రాజ్యం ఏవిధంగా అంతరించి ఆంగ్లేయుల సామ్రాజ్యంలో విలీనమైందో అర్ధం చేసుకోవాలి.

బాలాజీ విశ్వనాథ్ (1713-20)

    బాలాజీ విశ్వనాథ్ కొంకణస్థ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతడి పూర్వికులు జంజీర రాష్ట్రంలోని శ్రీవర్థన్ ప్రాంతానికి వారసత్వంగా దేశ్‌ముఖ్‌లుగా వ్యవహరించేవారు. బాలాజీ విశ్వనాథ్ చిన్న రెవెన్యూ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1708లో సాహు ఇతడిని సేనాకార్తె పదవిలో, ఆ తర్వాత 1713లో పీష్వాగా నియమించాడు. ఇతడి కాలం నుంచి పీష్వా పదవి వారసత్వంగా మారింది. ఇతడు సాహు, తారాబాయికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో మరాఠా సర్దార్‌లను సాహు వైపు తిప్పుకోవడం ద్వారా... సాహు విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు. బాలాజీ విశ్వనాథ్ 1719లో సయ్యద్ సోదరులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫలితంగా అప్పటి మొగల్ చక్రవర్తి ఫరూక్ సియార్.. సాహును స్వరాజ్యానికి రాజుగా గుర్తించడమే కాకుండా, అతడి కుటుంబ సభ్యులందరినీ మొగలుల చెర నుంచి విడిపించాడు. అలాగే దక్కనులోని 6 మొగల్ రాష్ట్రాల నుంచి చౌత్, సర్దేశ్‌ముఖ్ పన్నులను వసూలు చేసుకునే అధికారం సాహుకు దక్కింది.

మొదటి బాజీరావు (1720-40)

బాలాజీ విశ్వనాథ్ పెద్ద కుమారుడైన బాజీరావును 20 సంవత్సరాల వయసులోనే పీష్వాగా నియమించారు. శివాజీ తర్వాత గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను పెంపొందించిన వ్యక్తిగా బాజీరావు ప్రసిద్ధి చెందాడు. ఇతడి కాలంలో మరాఠాల అధికారం తారస్థాయికి చేరుకుంది. ఇతడి కాలంలోనే మరాఠా కూటమికి బీజాలు పడ్డాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అనేక మరాఠా కుటుంబాలు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాయి. వారిలో గైక్వాడ్‌లు (బరోడా), భోంస్లేలు (నాగ్‌పూర్), హోల్కార్లు (ఇండోర్) సింధియాలు (గ్వాలియర్), పీష్వాలు (పుణే) ముఖ్యులు.
జంజీరాకు చెందిన సిద్ధీలను ఓడించిన తర్వాత, ఇతడు పోర్చుగీసు వారి నుంచి బస్సైన్, సాల్‌సెట్టి ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతడు నిజాం ఉల్‌ముల్క్‌ను భోపాల్ వద్ద ఓడించి, అతడితో 'దురాయ్ సరాయ్ సంధి' చేసుకున్నాడు. దీని ద్వారా నిజాం నుంచి మాళ్వా, బుందేల్‌ఖండ్‌లను పొందాడు. ఉత్తర భారతదేశంపై అనేక దండయాత్రలు చేయడం ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచి, భారతదేశంలో మరాఠాల అధికారాన్ని స్థాపించాడు.
* మొగలుల గురించి ప్రస్తావిస్తూ బాజీరావు ఇలా వ్యాఖ్యానించాడు 'ఎండిన చెట్టును కాండం దగ్గర నరికితే, కొమ్మలు వాటంతట అవే పడిపోతాయి'.
బాజీరావు గొప్ప సైనికుడే కాకుండా దౌత్యవేత్త, సామ్రాజ్య స్థాపకుడు. పీష్వాగా ఉన్న 20 సంవత్సరాల్లో నిరంతరం యుద్ధాలు చేస్తూ విజయాలు సాధించాడు. మొగలులతో యుద్ధంలో హిందువులైన రాజపుత్రులు, బుందేలులు, జాట్‌లను తన సహజ మిత్రులుగా గుర్తించి వారి సహకారాన్ని పొందాడు. సవాయ్ జైసింగ్, ఛత్రసాల్‌లతో మైత్రి వల్ల లబ్ది పొందాడు.


బాలాజీ బాజీరావు (1740-61)
ఇతడు నానాసాహెబ్‌గా ప్రసిద్ధిగాంచాడు. 20 సంవత్సరాల వయసులోనే పీష్వా అయ్యాడు. 1749లో సాహు మరణం తర్వాత రాజ్య వ్యవహారాలన్నీ ఇతడి ఆధీనంలోకి వచ్చాయి. సాహుకు వారసులు లేకపోవడంతో రాజారాం మనవడైన రామరాజను తన వారసుడిగా ప్రకటించాడు. అయితే బాలాజీ బాజీరావు సతారాలో రామరాజను బంధించాడు. 1752లో మొగల్ చక్రవర్తి అహ్మద్ షా, పీష్వా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం పీష్వా.. మొగల్ సామ్రాజ్యాన్ని అంతర్గత, బాహ్య విరోధుల (అహ్మద్ షా అబ్దాలీ) నుంచి కాపాడాలి. దీనికి ప్రతిగా పీష్వా వాయవ్య రాష్ట్రం నుంచి చౌత్‌ను వసూలు చేసుకోవడంతో పాటు ఆగ్రా, అజ్మీర్ రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ ఒప్పందం వల్ల మరాఠాలు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అహ్మద్ షా అబ్దాలీతో ప్రత్యక్షంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ చేతిలో మరాఠాలు ఓడిపోయారు. ఈ వార్త వినడంతో బాలాజీ బాజీరావు 1761, జూన్ 23న మరణించాడు. ఇతడి తర్వాత మాధవరావు, నారాయణరావు, సవాయ్ మాధవరావు, రెండో బాజీరావు పీష్వాలుగా వ్యవహరించారు.
బాలాజీ బాజీరావు కాలంలో మరాఠా రాజ్యం అత్యున్నత దశకు చేరుకుంది. ఇతడి కాలంలో న్యాయ పరిపాలన మెరుగుపడింది. రెవెన్యూ పరిపాలన పటిష్టమైంది. కలెక్టర్లు ఖాతాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాడు. వర్తకాభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాడు. దేవాలయాల నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చాడు. హోల్కార్లు, సింధియాలు రాజపుత్ర రాజ్యాలపై దాడి చేయడం, రఘునాథరావు జాట్‌లకు చెందిన కోటను ఆక్రమించడంతో హిందూ రాజులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలన్న ఆశయానికి విఘాతం ఏర్పడింది. పీష్వా ఢిల్లీలో రాజకీయ పరిణామాలకు అనవసర ప్రాధాన్యం ఇవ్వడం, పంజాబులో తీసుకున్న నిర్ణయాలతో అహ్మద్‌షా అబ్దాలీతో విరోధం ఏర్పడింది. ఆంగ్లేయుల సైనిక బలాన్ని, రాజకీయ ఉద్దేశాన్ని పీష్వా సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.

మూడో పానిపట్టు యుద్ధం

నాదిర్ షా తర్వాత అహ్మద్ షా అబ్దాలీ ఆప్ఘనిస్థాన్ పాలకుడయ్యాడు. మొగలు సామ్రాజ్యం బలహీనమవడంతో అబ్దాలీ కూడా భారతదేశంపై దాడి చేయాలని భావించాడు. 1758లో రఘునాథరావు అహ్మద్ షా అబ్దాలీ కుమారుడు, ఏజెంట్ అయిన తైమూరును పంజాబ్ నుంచి తరిమేశాడు. మరాఠాలు అదీనా బేగ్‌ఖాన్‌ను పంజాబ్ గవర్నరుగా నియమించారు. ఆప్ఘన్ల నుంచి పంజాబ్‌ను మరాఠాలు ఆక్రమించడం ద్వారా అహ్మద్ షా అబ్దాలీకి సవాలు విసిరారు. 1759 చివరి నాటికి అహ్మద్ షా అబ్దాలీ పెద్ద సైన్యంతో సింధు నదిని దాటి పంజాబ్‌ను ఆక్రమించాడు. అబ్దాలీని ఎదుర్కోలేక మరాఠాలు ఢిల్లీకి పారిపోయారు. ఢిల్లీకి పది మైళ్ల దూరంలోని బరారి ఘాట్ వద్ద 1760లో జరిగిన యుద్ధంలో దత్తాజి సింధియా మరణించాడు. జంకోజి సింధియా, మల్హర్ రావ్ హోల్కార్లు కూడా అబ్దాలీని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. దీంతో అబ్దాలీ ఢిల్లీని ఆక్రమించాడు.
ఉత్తర భారతదేశంలో మరాఠాల అధికారాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశంతో సదాశివరావు భావేను పీష్వా పంపాడు. భావే 1760, ఆగస్టు 22న ఢిల్లీని ఆక్రమించాడు. అబ్దాలీని ఢిల్లీ నుంచి తరిమేయాలని భావే భావించాడు. దీంతో రెండు సేనల మధ్య 1760 నవంబరులో పానిపట్టు వద్ద యుద్ధం జరిగింది. ఇరు సేనలకు ఆహార సరఫరా నిలిచిపోవడంతో శాంతి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇవి ఫలించకపోవడంతో 1761, జనవరి 14న భీకర యుద్ధం జరిగింది. ఇందులో మరాఠాలు ఓడిపోయారు. 75,000 మంది మరాఠాలు మరణించారు. ఈ యుద్ధంలో పీష్వా కుమారుడు విశ్వాస్ రావు, సదాశివరావు భావే కూడా మరణించారు.
* ప్రముఖ చరిత్రకారుడు జె.ఎన్.సర్కార్ ఈ యుద్ధం గురించి ఇలా చెప్పాడు 'మహారాష్ట్రలో కుటుంబ సభ్యులను కోల్పోని కుటుంబం లేదు. చాలా ఇళ్లు కుటుంబ పెద్దను కోల్పోయాయి. ఒక్క దెబ్బతో మొత్తం నాయకుల తరమంతా నాశనమైంది.'


మరాఠాల ఓటమికి కారణాలు
* అబ్దాలీ సైన్యం 60,000 కాగా మరాఠాల సైన్యం 45,000 మాత్రమే.
* పానిపట్టులోని మరాఠా శిబిరంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. సైన్యానికి ఆహారం, గుర్రాలకు గడ్డి దొరకలేదు.
* ఉత్తర భారతదేశంలోని ముస్లిం రాజ్యాలన్నీ అబ్దాలీకి సహాయం చేయగా మరాఠాలు ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. జాట్‌లు, రాజపుత్రులు, సిక్కులు మరాఠాలకు దూరమయ్యారు.
* మరాఠా సైన్యాధికారుల్లో అసూయ వారి ఓటమికి కారణమైంది.
* పానిపట్టు యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి.. ఆప్ఘనులతో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న వ్యక్తి కాశి రాజ పండిట్. సదాశివరావు భావే వ్యక్తిత్వంలోని లోపాలను పండిట్ దుయ్యబట్టడమే కాకుండా ఓటమికి భావేనే ప్రధాన కారణమని పేర్కొన్నాడు.


ఆంగ్లో-మరాఠా యుద్ధాలు
మరాఠాలు మొగల్ సామ్రాజ్య శిథిలాలపై తమ సామ్రాజ్యాన్ని నిర్మించగా.. ఆంగ్లేయులు మరాఠా సామ్రాజ్య శిథిలాలపై తమ సామ్రాజ్యాన్ని నిర్మించాలని భావించారు. మరాఠాలు ఇతర భారత రాజ్యాల కంటే బలమైన రాజ్యంగా ఏర్పడగా, ఆంగ్లేయులు భారతదేశంలోని ఇతర ఐరోపా వర్తక కంపెనీలపై ఆధిపత్యం సంపాదించడంలో విజయం సాధించారు. 18వ శతాబ్దం చివరి నాటికి మరాఠాలు, ఆంగ్లేయులు ప్రత్యక్ష యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆంగ్లేయ కంపెనీ అధికార బలం ముందు మరాఠా అధికారం కనుమరుగైంది.
 

మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం (1775-82)
   మరాఠా నాయకులైన మాధవరావు, రఘునాథరావు మధ్య అధికారం కోసం జరిగిన పోరును బ్రిటిషర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రఘునాథరావుకు వారి మద్దతు తెలిపారు. ఈ యుద్ధంలో మొదట బ్రిటిషర్లు మరాఠాల చేతిలో ఓడిపోయారు. గొడ్డార్డ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం కలకత్తా నుంచి అహ్మదాబాద్ చేరుకునే క్రమంలో మరాఠాలపై అనేక విజయాలు సాధించింది. ఈ యుద్ధం 1782లో జరిగిన 'సాల్బాయ్ సంధి'తో ముగిసింది. ఈ సంధి ద్వారా యథాతథ స్థితిని కొనసాగించారు. ఫలితంగా బ్రిటిషర్లు మరాఠాలతో 20 సంవత్సరాల పాటు శాంతిని నెలకొల్పారు. మరాఠాల సహాయంతో బ్రిటిషర్లు హైదర్ అలీ నుంచి తమ భూభాగాలను ఆక్రమించుకోగలిగారు.

రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం (1803-05)

  మరాఠాల అంతర్గత వ్యవహారంలో వెల్లస్లీ జోక్యం చేసుకోవడం, సైన్య సహకార విధానాన్ని మరాఠాలపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడం ఈ యుద్ధానికి కారణాలు. 18వ శతాబ్దం చివరి నాటికి అనుభవజ్ఞులైన మరాఠా నాయకులు మరణించడం, బ్రిటిషర్ల విజయావకాశాలు మెరుగుపడటం, పీష్వా రెండో బాజీరావు 1802లో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయడం లాంటి పరిణామాలు యుద్ధాన్ని ప్రోత్సహించాయి. సింధియా, భోంస్లేల ఉమ్మడి సైన్యం ఆర్థర్ వెల్లస్లీ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం చేతిలో ఓడిపోయింది. అయితే హోల్కర్లను ఓడించడంలో బ్రిటిషర్లు విఫలమయ్యారు. ఈ యుద్ధంతో కంపెనీ భారతదేశంలో తన అధికారాన్ని పూర్తిస్థాయిలో స్థాపించగలిగింది. ఈ యుద్ధం 1802, డిసెంబరు 31న జరిగిన బస్సైన్ సంధితో ముగిసింది. ఈ సంధి ద్వారా పీష్వా రూ.26 లక్షల ఆదాయాన్నిచ్చే భూభాగాలను కంపెనీకి ఇవ్వడానికి అంగీకరించాడు. అలాగే సూరత్ నగరాన్ని కంపెనీకి అప్పగించాడు. నిజాం భూభాగంలో చౌత్ హక్కును వదులుకున్నాడు.

మూడో ఆంగ్లో-మరాఠా యుద్ధం (1817-18)బ్రిటిషర్లు తమ స్వాతంత్య్రాన్ని హరించడాన్ని మరాఠాలు వ్యతిరేకించడం, మరాఠా సర్దార్‌ల పట్ల బ్రిటిష్ రెసిడెంట్లు కఠినంగా వ్యవహరించడం ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు. ఈ యుద్ధం తర్వాత పీష్వా పదవీచ్యుతుడయ్యాడు. బ్రిటిషర్లు మరాఠా భూభాగాలన్నింటినీ తమ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు. మరాఠా సర్దార్‌లు బ్రిటిషర్ల దయాదాక్షిణ్యాలపై జీవించాల్సి వచ్చింది.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కర్ణాటక యుద్ధాలు

భారతదేశానికి వర్తకం పేరుతో వచ్చిన డచ్, పోర్చుగీస్ తదితర దేశాలవారు అనేక కారణాలతో నిష్క్రమించినా మిగిలిన రెండు ప్రధాన ఐరోపా వర్తక కంపెనీల (బ్రిటిష్, ఫ్రెంచ్) మధ్య ఆదిపత్య పోరు తారస్థాయికి చేరింది. 1740 తర్వాత మన దేశంలో ఆధిపత్యం కోసం ఫ్రెంచ్, బ్రిటిషర్లు ఎన్నో యుద్ధాలకు కారకులయ్యారు. వీటిలో కర్ణాటక, ప్లాసీ, బక్సార్, మైసూర్ యుద్ధాలు ప్రధానమైనవి. వీటిపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.
   భారతదేశపు ఆగ్నేయ తీరంలోని ఆర్కాట్ రాజధానిగా సాదతుల్లా ఖాన్ స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు కర్ణాటక రాజ్యం దక్కన్‌లోని ఒక మొగల్ సుబాగా.. హైదరాబాద్ నిజాం నామమాత్రపు నియంత్రణలో ఉండేది. ఈ ప్రాంతంలో జరిగిన అంతర్యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచివారు చెరో వర్గాన్ని సమర్థించారు. చివరకు బ్రిటిషర్లు ఫ్రెంచివారిపై ఆధిపత్యం సాధించారు.

 

మొదటి కర్ణాటక యుద్ధం (1745-1748)

   ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో బ్రిటిషర్లకు, ఫ్రెంచివారికి మధ్య పోరు మొదలైంది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచి పడవలను స్వాధీనం చేసుకుంది. దానికి ప్రతీకారంగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం మద్రాసును ఆక్రమించింది. తమను ఫ్రెంచివారి నుంచి రక్షించాల్సిందిగా బ్రిటిషర్లు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ను కోరారు. ఈ మేరకు నవాబు చేసిన ఆజ్ఞలను ఫ్రెంచివారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచివారికి, అన్వరుద్దీన్‌కు మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నవాబు ఘోరంగా ఓడిపోయాడు. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగియడంతో భారతదేశంలో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య యుద్ధం కూడా ముగిసింది.
 

రెండో కర్ణాటక యుద్ధం (1749-1754)

   వారసత్వ యుద్ధ సమయంలో ఫ్రెంచివారు హైదరాబాద్‌లో ముజఫర్‌జంగ్‌కు, కర్ణాటకలో చందాసాహెబ్‌కు మద్దతు పలికారు. బ్రిటిషర్లు హైదరాబాద్‌లో నాజర్‌జంగ్‌కు, కర్ణాటకలో అన్వరుద్దీన్‌కు, తర్వాత అతడి కుమారుడు మహమ్మద్ అలీకి మద్దతిచ్చారు. 1749లో ఫ్రెంచివారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్ఠించేలా చేశారు. అయితే బ్రిటిషర్లు రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందాసాహెబ్‌ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహమ్మద్ అలీ వశమైంది.
 

మూడో కర్ణాటక యుద్ధం (1758-1763)

   ఐరోపాలో ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ల మధ్య 1756లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచి గవర్నరు కౌంట్ డి లాలీ బ్రిటిష్ జనరల్ సర్ ఐర్‌కూట్ చేతిలో ఓడిపోయాడు. ఫ్రెంచివారి స్థానంలో బ్రిటిషర్లు నిజాం సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. 1763లో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య సంధి కుదిరింది.
 

బెంగాల్ ఆక్రమణ

   మొగల్ సామ్రాజ్య పతనం తర్వాత ముర్షిద్ కులీఖాన్ బెంగాల్‌లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ముర్షిద్ కులీఖాన్ తర్వాత అతడి అల్లుడు షుజాఉద్దీన్ సింహాసనాన్ని ఆక్రమించాడు. అతడి కుమారుడు సర్ఫరాజ్ పరిపాలనాకాలంలో బీహార్ డిప్యూటీ గవర్నరు అలీవర్దీఖాన్ 1740లో బెంగాల్ నవాబుగా ప్రకటించుకున్నాడు. ఇతడి కాలంలో బెంగాల్‌పై మరాఠాలు అనేక సార్లు దండయాత్రలు చేశారు. 1751లో బెంగాల్ నవాబుకు, మరాఠాలకు మధ్య సంధి కుదిరింది. ఈ సంధి ప్రకారం బెంగాల్ నవాబు మరాఠాలకు సంవత్సరానికి రూ.12 లక్షల చౌత్ చెల్లించడానికి అంగీకరించాడు. అలీవర్దీఖాన్ 1752లో తన మనవడు సిరాజ్-ఉద్-దౌలాను తన వారసుడిగా ప్రకటించాడు. సిరాజ్ సమీప బంధువు షౌకత్ జంగ్, పిన్ని గసితి బేగం, అలీవర్ద్దీఖాన్ సోదరి భర్త, సర్వసైన్యాధ్యక్షుడైన మీర్జాఫర్‌లు బెంగాల్ సింహాసనానికి ప్రధాన పోటీదారులు. వీరిని బలహీనపరచడానికి సిరాజ్ అనేక చర్యలు చేపట్టాడు. గసితి బేగం సంపదను లాక్కున్నాడు. మీర్జాఫర్ స్థానంలో మీర్‌మదన్‌ను సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. షౌకత్ జంగ్ తిరుగుబాటును అణచివేయడమే కాకుండా అతడిని చంపేశాడు.
 

సిరాజ్-ఉద్-దౌలా బ్రిటిషర్లతో వైరం పెంచుకోవడానికి కారణాలు..
* చట్టానికి విరుద్ధంగా బ్రిటిషర్లు నవాబు ఆధీనంలోని భూభాగంలో కోటలు నిర్మించడంతోపాటు పెద్ద కందకాన్ని తవ్వడం.
* ఆంగ్లేయులు దస్తక్ / ఉచిత పాసులను అనర్హులకు కేటాయించి దుర్వినియోగం చేయడం ద్వారా నవాబు ఆదాయానికి గండికొట్టడం.
* నవాబుకు అవిధేయులు, లంచగొండులైన అధికారులకు ఆంగ్లేయులు రక్షణ కల్పించడం.
* తన పూర్వికుల్లా తాను కూడా బ్రిటిషర్లపై నియంత్రణ కలిగి ఉండాలని భావించడం.

 

ప్లాసీ యుద్ధం

   ప్లాసీ అనేది ముర్షిదాబాద్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. అక్కడ 1757 జూన్ 23న బ్రిటిషర్లకు, నవాబు సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు సిరాజ్-ఉద్-దౌలాను ఓడించాయి. నవాబు సైన్యంలోని అయిదుగురు సేనానుల్లో మీర్ మదన్, మదన్‌లాల్ మాత్రమే యుద్ధం చేశారు. మిగతా ముగ్గురు మీర్జాఫర్, యార్‌లతుఫ్ ఖాన్, రాయ్‌దుర్లబ్‌రామ్ కంపెనీ ఏజెంట్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని ప్రేక్షకపాత్ర వహించారు.
   ప్లాసీ యుద్ధం మొదట బెంగాల్‌లో, చివరికి దేశమంతటా బ్రిటిష్ వారి ఆధిపత్య స్థాపనకు దారితీసింది. భారతదేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరలింపు ప్రారంభమైంది. సిరాజ్-ఉద్-దౌలా స్థానంలో మీర్జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఆ తర్వాత మీర్‌ఖాసిం బెంగాల్ నవాబు అయ్యాడు.

 

బక్సార్ యుద్ధం (1764)
   బక్సార్ యుద్ధం 1764 అక్టోబరు 22న మేజర్ హెక్టర్ మన్రో నాయకత్వంలోని బ్రిటిష్ సేనలకు - మీర్‌ఖాసిం, అవధ్ నవాబు షుజా-ఉద్-దౌలా, మొగలు చక్రవర్తి రెండో షా ఆలం ఉమ్మడి సేనలకు మధ్య జరిగింది. బక్సార్ అనే ఈ ప్రదేశం పాట్నా నగరానికి పశ్చిమంగా 120 కి.మీ.ల దూరంలో ఉంది.
 

కారణాలు

* సార్వభౌమాధికారం కోసం బ్రిటిషర్లు - బెంగాల్ నవాబు మీర్‌ఖాసిం మధ్య పోరు.
* 1717లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను బ్రిటిషర్లు దుర్వినియోగం చేయడం.
* నవాబు బెంగాల్‌లో అంతర్గత వ్యాపారంపై అన్ని రకాల పన్నులను తొలగించడం.
* నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం.
   ఈ యుద్ధం భారతీయ పాలకుల ఓటమితో ముగిసింది. మూడు రాజ్యాల సేనల మధ్య సమన్వయం లేకపోవడమే బ్రిటిషర్ల విజయానికి ప్రధాన కారణం.

 

అలహాబాద్ ఒప్పందం

   బక్సార్ యుద్ధం తర్వాత 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో బ్రిటిష్ ఆధిపత్య స్థాపన మొదలైంది. అవధ్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారాడు. మొగలు చక్రవర్తి రెండో షా ఆలం కంపెనీ పెన్షనర్ అయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఔన్నత్యం పెరిగింది.
 

మైసూరు రాజ్యం

   తూర్పు, పశ్చిమ కనుమలకు మధ్య నెలకొన్న మైసూరు రాజ్యాన్ని ఒడయార్ వంశం పరిపాలించేది. క్రీ.శ. 1731-1734 మధ్య సర్వసైన్యాధ్యక్షుడైన దేవరాజ, సర్వాధికారి (ఆర్థికమంత్రి) ననరాజ అనే సోదరులు మైసూరు రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. మరాఠాలు, నిజాం, బ్రిటిషర్లు, ఫ్రెంచివారు మైసూరు రాజ్యంపై వరుస దాడులు ప్రారంభించారు. రెండో కర్ణాటక యుద్ధం సమయంలో ననరాజ తిరుచిరాపల్లిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఆంగ్లేయుల పక్షం వహించాడు. తర్వాత అతడు ఫ్రెంచివారి పక్షాన చేరాడు. మైసూరు రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడైన హైదర్ అలీ తిరుచిరాపల్లి దండయాత్ర సందర్భంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. క్రీ.శ. 1758 తర్వాత మరాఠాలు మైసూరుపై దండెత్తినప్పుడు హైదర్ అలీ ననరాజ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుని మైసూరు పాలకుడయ్యాడు. అయితే ఇది నచ్చని కొంతమంది హైదర్ అలీపై దండెత్తవలసిందిగా మరాఠాలను ఆహ్వానించారు. ఇందులో హైదర్ అలీ ఓడిపోయాడు. మరాఠాలు మూడో పానిపట్టు యుద్ధంలో తలమునకలై ఉన్న సమయంలో హైదర్ అలీ తన అధికారాన్ని మళ్లీ సుస్థిరం చేసుకున్నాడు.
 

'కలకత్తా చీకటి గది' ఉదంతం

   సిరాజ్-ఉద్-దౌలా 1756 జూన్‌లో ఆంగ్లేయుల ఆధీనంలోని కలకత్తాను ఆక్రమించాడు. బెంగాల్ గవర్నరు రోజర్ డ్రేక్, ఇతర అధికారులు కలకత్తా నగరం వదిలి పారిపోయారు. హాల్‌వెల్‌తో సహా అనేక మంది ఐరోపావారు నవాబుకు లొంగిపోయారు. వీరిని ఒక చిన్న గదిలో రాత్రంతా బంధించడంతో తెల్లవారేసరికి 16 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఈ సంఘటనను 'కలకత్తా చీకటి గది' ఉదంతంగా పేర్కొన్నారు. అయితే దీనికి సిరాజ్-ఉద్-దౌలా స్వయంగా బాధ్యుడు కాడు. రాబర్ట్ క్లైవ్ 1757 జనవరి 2న అడ్మిరల్ వాట్సన్ సహాయంతో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటిషర్లకు, నవాబుకు మధ్య అదే ఏడాది ఫిబ్రవరి 9న అలీనగర్ సంధి కుదిరింది. క్లైవ్ మార్చిలో ఫ్రెంచివారికి చెందిన చంద్రనగర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. సిరాజ్-ఉద్-దౌలా ఆస్థానంలోని మీర్జాఫర్, రాయ్‌దుర్లబ్‌రామ్, అమీన్‌చంద్, జగత్‌సేఠ్‌లకు నవాబు వ్యవహార శైలి నచ్చలేదు. వారు అతడిని నవాబు పదవి నుంచి తొలగించాలని కుట్రపన్నారు. అమీన్‌చంద్ ఈ విషయాన్ని బ్రిటిషర్లకు తెలియజేయడంతో వారు సిరాజ్-ఉద్-దౌలాను ఓడించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.


మైసూరు యుద్ధాలు

మొదటి మైసూరు యుద్ధం (1766-1769)
 

   మైసూరు పాలకుడు హైదర్ అలీ బ్రిటిషర్లను కర్ణాటక ప్రాంతంతోపాటు భారతదేశం నుంచి కూడా తరిమివేయాలని భావించాడు. హైదర్ అలీ వల్ల తమ సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లనుందని గ్రహించిన బ్రిటిషర్లు నిజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో బ్రిటిషర్లపై విజయం సాధించిన హైదర్ అలీ మద్రాసుకు 5 కి.మీ.ల మేర దండయాత్ర కొనసాగించాడు. 1769లో జరిగిన మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది.
 

రెండో మైసూరు యుద్ధం (1780-1784)
   మరాఠాలు 1771లో హైదర్ అలీపై దాడి చేసినప్పుడు బ్రిటిషర్లు హైదర్ అలీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. అమెరికా స్వాతంత్య్ర యుద్ధం సందర్భంగా ఇంగ్లండ్‌కు, హైదర్ అలీ మిత్రదేశమైన ఫ్రాన్సుకు మధ్య తగాదా తలెత్తింది. హైదర్ అలీ ఆధీనంలోని ఫ్రెంచి భూభాగమైన మహేను బ్రిటిషర్లు ఆక్రమించారు. ఇవే ఈ యుద్ధానికి దారితీసిన కారణాలు. 1780లో జరిగిన యుద్ధంలో కల్నల్ బైలీని హైదర్ అలీ ఓడించాడు. 1781లో పోర్టోనోవో యుద్ధంలో ఐర్ కూట్ చేతిలో పరాజయం పొందాడు. 1782లో కల్నల్ బ్రైట్ వైట్‌ను ఓడించాడు. ఈ యుద్ధం జరుగుతుండగానే హైదర్ అలీ మరణించాడు. దీంతో అతడి కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. ఈ యుద్ధం 1784లో జరిగిన 'మంగళూరు సంధి'తో ముగిసింది.
 

మూడో మైసూరు యుద్ధం (1790-1792)
   అంతర్గత సంస్కరణల ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడం.. టర్కీ, ఫ్రాన్సులకు రాయబారులను పంపడం ద్వారా వారి సహాయం పొందడానికి ప్రయత్నించడం.. బ్రిటిషర్ల మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్ రాజ్య భూభాగాలను ఆక్రమించడం.. ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు. బ్రిటిష్ సైన్యానికి స్వయంగా గవర్నరు జనరల్ కారన్ వాలిస్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాడు. 1792లో జరిగిన శ్రీరంగ పట్టణం సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగం భూభాగాన్ని బ్రిటిషర్లకు ఇవ్వడానికి అంగీకరించాడు. యుద్ధ నష్టపరిహారం కింద రూ. 3.6 కోట్లు చెల్లించడానికి అంగీకరించి రూ. 1.6 కోట్లు వెంటనే చెల్లించాడు.
 

నాలుగో మైసూరు యుద్ధం (1799)

   టిప్పు సుల్తాన్ తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, బ్రిటిష్ గవర్నరు జనరల్ వెల్లస్లీ బ్రిటిష్ సామ్రాజ్యానికి టిప్పు సుల్తాన్ నుంచి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించాలనుకోవడం ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణాలు. శ్రీరంగ పట్టణంలో జరిగిన ఈ యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడుతూ 1799 మేలో టిప్పు సుల్తాన్ మరణించాడు. గవర్నరు జనరల్ సోదరుడు సర్ ఆర్ధర్ వెల్లస్లీ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతడే 1815లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ను ఓడించాడు. టిప్పు సుల్తాన్ మరణంతో మైసూరు రాష్ట్రంలోని చాలా భూభాగాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. కొంత భూభాగానికి ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ అనే బాలుడిని రాజుగా చేసి మైసూరు రాజవంశాన్ని పునరుద్ధరించారు.
   హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ గొప్ప పరిపాలకులు. ఇద్దరూ పరమత సహనాన్ని పాటించారు. హైదర్ అలీ ఎప్పుడూ బహిరంగంగా రాజరిక బిరుదులు ధరించలేదు. ఇతడికి, రాజవంశానికి మధ్య సంబంధం మరాఠా చక్రవర్తికి, పీష్వాకు మధ్య సంబంధంలా ఉండేది. అయితే టిప్పు సుల్తాన్ మైసూరు రాజును పదవీచ్యుతుడిని చేసి 1789లో సుల్తాన్ బిరుదు ధరించాడు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌లు తమ నాణేల మీద హిందూ దేవతల బొమ్మలు ముద్రించారు. టిప్పు సుల్తాన్‌కు శృంగేరి పీఠానికి చెందిన జగద్గురు శంకరాచార్యులపై ఎనలేని గౌరవం ఉండేది. శంకరాచార్యులకు దేవాలయ మరమ్మతుల కోసం భారీగా నిధులు ఇచ్చాడు. పరిపాలనలో పాశ్చాత్య పద్ధతులను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాజుగా టిప్పుసుల్తాన్ పేరుగాంచాడు. ఇతడు స్వదేశీ, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. న్యాయ పరిపాలనలో నిష్పాక్షికంగా వ్యవహరించాడు. అధికారుల ఎంపికలో కుల, మత, సాంఘిక తారతమ్యాలు చూపకుండా ప్రతిభకు పట్టం కట్టాడు. సమకాలీన భారతదేశ చరిత్రలో వీరి పరిపాలన అందరిమన్ననలు పొందింది.

 

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బ్రిటిష్ పాలనలో రైతు ఉద్యమాలు

      బ్రిటిష్ హయాంలో పరిపాలనా విధానం గ్రామీణ భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. వ్యవసాయ రంగంలో కొత్తగా భూమిశిస్తు విధానాలు వచ్చాయి. దాంతో నూతన సామాజిక తరగతులు ఆవిర్భవించాయి. జమీందార్లు, వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి రైతులు వెళ్లిపోయారు. బ్రిటిష్ పాలన ప్రారంభమైన కొన్ని దశాబ్దాల్లోనే రైతులు అణిచివేతకు, దోపిడీకి గురయ్యారు.
భూమిశిస్తును పెంచడం, వడ్డీ వ్యాపారుల దురాగతాలు, తోటల యజమానుల దోపిడీ లాంటి వాటికి వ్యతిరేకంగా రైతులు నిరసనలు, తిరుగుబాట్లు, ఉద్యమాలు చేపట్టారు. ఇవి ప్రధానంగా భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, విదేశీయులకు వ్యతిరేకంగా జరిగాయి. ఈ ఉద్యమాలు స్థానిక సమస్యల నుంచి ఉద్భవించాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, నాయకత్వ లేమి కారణంగా ఇవి దేశవ్యాప్త ఉద్యమాలుగా అవతరించలేకపోయాయి.


ఫకీర్ సన్యాసి తిరుగుబాట్లు
బిక్షాటనతో జీవించే ఫకీర్లు, సన్యాసులకు బెంగాల్‌లో సంభవించిన తీవ్ర కరవు వల్ల ఆహారం దొరకలేదు. దీంతో సన్యాసులు బలవంతంగా ఆహారాన్ని పొందేందుకు ప్రయత్నించారు. 1770లో సంభవించిన గొప్ప కరవు తర్వాత వారు బెంగాల్‌పై దాడులు చేశారు. వీరితో పేద రైతులు, భూములు కోల్పోయిన భూస్వాములు, ఉద్యోగాలు కోల్పోయిన సైనికులు జత కలిశారు. బ్రిటిష్‌వారు ఈ తిరుగుబాట్లను అణిచివేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ తిరుగుబాటుకు మంజు షా ఫకీర్ నాయకత్వం వహించాడు.

సంతాలుల తిరుగుబాటు (1855-56)
శాంతికాముకులైన సంతాలులు మన్‌భం, బరాభం, హజారీభాగ్, మిడ్నాపూర్, బంకూర ప్రాంతాలకు చెందినవారు. శాశ్వత శిస్తు విధానం వల్ల వీరు తాము సాగుచేస్తున్న భూములను జమీందారులకు అప్పగించాల్సి వచ్చింది. జమీందారులు ఎక్కువ భాటకం డిమాండ్ చేయడంతో వారు తమ పూర్వీకులకు చెందిన ఇళ్లను వదలి రాజ్‌మహల్ కొండల ప్రాంతానికి చేరారు. అక్కడ అడవులను తొలగించి వ్యవసాయ భూమిగా మార్చారు. దీంతో దురాశపరులైన జమీందారులు ఈ భూమిని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నించారు.
   1855 జూన్‌లో సంతాలులు సిద్ధు, కన్హు సోదరుల నాయకత్వంలో తమ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని, సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని నిశ్చయించుకున్నారు. 1856 ఫిబ్రవరిలో బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు నాయకులను అరెస్ట్ చేసి, తిరుగుబాటును క్రూరంగా అణిచివేసింది. సంతాలులకు ప్రత్యేకంగా సంతాల్ పరగణాను ఏర్పాటు చేయడం ద్వారా వారిని తమ దారిలోకి తీసుకొచ్చింది.


1857 తిరుగుబాటులో రైతుల పాత్ర
అవధ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతులు జమీందారుల అణిచివేత విధానాలను పక్కనపెట్టి వారితో కలిసి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ తిరుగుబాటులో క్రియాశీలకంగా పనిచేసిన రైతుల యాజమాన్య హక్కులను రద్దు చేస్తామని అప్పటి గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించడం ద్వారా ఈ తిరుగుబాటులో రైతులు పాల్గొనకుండా చేశారు.

నీలిమందు తిరుగుబాటు (1859-60)
ఐరోపాకు చెందిన నీలిమందు తోటల యజమానులు అంతగా ఆదాయం లేని నీలిమందును కొంత భూమిలో సాగుచేయాలని తూర్పు భారతదేశంలోని రైతులను బలవంతపెట్టారు. ఎదురించిన రైతులను అపహరించడం, అక్రమంగా నిర్బంధించడం, మహిళలు.. పిల్లలపై దాడి చేయడం, పశువులను ఎత్తుకెళ్లడం, పంటలను నాశనం చేయడం లాంటి అకృత్యాలకు పాల్పడ్డారు. చివరగా 1860లో నీలిమందు పండించకూడదని రైతులు నిర్ణయించి, ఉద్యమం చేపట్టారు. నాడియా జిల్లాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అచిర కాలంలోనే బెంగాల్ మొత్తానికి వ్యాపించింది. రైతులు నీలిమందు పరిశ్రమలపై, పోలీసులపై దాడులు చేశారు. రైతులు సమ్మె చేయడమే కాకుండా న్యాయస్థానంలో కేసులు వేయడానికి కావాల్సిన సొమ్మును విరాళాల ద్వారా సేకరించారు. నీలిమందు తోటల యజమానుల ఇళ్లలో పనిచేసేవారిని బలవంతంగా వారికి సేవలందించకుండా చేశారు. నీలిమందు రైతుల ఉద్యమానికి హరీశ్‌చంద్ర ముఖర్జీ (హిందూ పేట్రియాట్ పత్రిక సంపాదకులు) మద్దతు తెలిపారు. దీన్‌బంధు మిత్ర రచించిన 'నీల్‌దర్బణ్‌'లో తోటల యజమానుల అకృత్యాలను చక్కగా వివరించారు. భారతదేశంలో ఇది మొదటి రైతుల సమ్మె. 1867-68లో బిహార్‌లోని చంపారన్‌లో ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది.

దక్కను తిరుగుబాట్లు (1874-75)
మహారాష్ట్రలోని పుణె, అహ్మద్‌నగర్ జిల్లాల్లో రైత్వారీ విధానం అమల్లో ఉండేది. ఇక్కడ భూమి శిస్తు ఎక్కువగా ఉండేది. వరుసగా కరవులు సంభవించినా రైతులు భూమిశిస్తును తప్పనిసరిగా చెల్లించాలి. అమెరికాలో అంతర్యుద్ధం కారణంగా 1860-64 మధ్యలో పత్తి రైతులు తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా లాభాలు ఆర్జించారు. అయితే 1864లో అంతర్యుద్ధం ముగియడం, ఐరోపా ఖండం నుంచి పత్తి ఎగుమతులు పునఃప్రారంభమవడంతో భారతదేశంలో పత్తి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా ఇక్కడి రైతులు అప్పు కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చింది. వడ్డీ వ్యాపారులు రుణం కోసం భూములను తాకట్టు పెట్టమని రైతులను బలవంతపెట్టారు. రుణ విముక్తి కోసం వారి మహిళల మానాన్ని ఫణంగా పెట్టాల్సి వచ్చింది.
1874లో మరాఠా రైతులు ఆరు తాలుకాల్లోని 33 ప్రదేశాల్లో తిరుగుబాట్లు చేశారు. ఈ సందర్భంగా రుణానికి సంబంధించిన పత్రాల (బాండ్ల)ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు నిరాకరించినప్పుడు మాత్రమే హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అయితే ఈ తిరుగుబాట్లను పోలీసులు, సైన్యం సహకారంతో అణిచివేశారు. ప్రభుత్వం ఈ తిరుగుబాట్ల స్వభావం, కారణాలను అధ్యయనం చేయడానికి ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగా 1879లో ఒక చట్టం చేసింది. దీని ప్రకారం రైతుల భూముల అన్యాక్రాంతంపై పరిమితులు విధించడమే కాకుండా సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను సవరించింది. రైతులు రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే నిర్బంధించడానికి, జైలుకు పంపడానికి వీల్లేకుండా చట్టం చేసింది.


రామోసీల తిరుగుబాటు
మహారాష్ట్రలోని రామోసీలు మరాఠాల పాలనలో చిన్న స్థాయి పోలీసు ఉద్యోగాలు చేసేవారు. మరాఠా రాజ్య పతనం తర్వాత వారు తిరిగి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అయితే అధిక భూమిశిస్తు వల్ల వారు ఇబ్బందుల పాలయ్యారు. 1822లో చిట్టూర్‌సింగ్ నాయకత్వంలో రామోసీలు తిరుగుబాటు చేసి మరాఠా ప్రాంతాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అనేక కోటలను నాశనం చేశారు. 1825లో వచ్చిన కరవు వల్ల 1826లో డోమాజి నాయకత్వంలో మరోసారి తిరుగుబాటు చేశారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం వారికి భూములు ఇవ్వడమే కాకుండా పోలీసు ఉద్యోగాలను ఇచ్చింది.
    1876-78లో సంభవించిన గొప్ప కరవు వల్ల పశ్చిమ భారతదేశం అతలాకుతలమైంది. దీంతో ఈ ఇబ్బందులన్నింటికీ విదేశీ పాలనే కారణమని భావించిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ప్రభుత్వం ఫాడ్కేను 1880లో అరెస్ట్ చేసింది. అతడు 1883లో జైలులోనే మరణించాడు.


పబ్నా తిరుగుబాటు
1859 చట్టం రైతులకు తాము సాగుచేసే భూమిపై స్వాధీన హక్కులను ఇచ్చింది. తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లోని శాశ్వత శిస్తు విధానం అమల్లో ఉన్న భూభాగాల్లోని జమీందారులు.. రైతులకు స్వాధీన హక్కులు లేకుండా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నించారు. దీంతో తూర్పు బెంగాల్‌లోని అనేక జిల్లాలో రైతులు జమీందారులకు వ్యతిరేకంగా 1870-1885 మధ్యకాలంలో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లకు కేంద్ర బిందువు పబ్నా జిల్లా. ఇక్కడి రైతులు జనపనార పండించి అధిక లాభాలు సంపాదించారు. వారు 1873 మేలో ఒక లీగ్‌గా ఏర్పడి జమీందారుల అన్యాయమైన డిమాండ్లను వ్యతిరేకించారు. కోర్టు ఖర్చుల నిమిత్తం విరాళాలు సేకరించడమే కాకుండా గ్రామాల్లో సమావేశాలను నిర్వహించి పన్నులు చెల్లించవద్దని రైతులను కోరారు. వీరు ప్రధానంగా న్యాయపోరాటాన్ని శాంతియుతంగా చేశారు. ఈ ఉద్యమంలో రెండు ప్రధాన లక్షణాలు..1.కిసాన్ సభ లేదా రాజకీయ పార్టీలు రైతు ఉద్యమాలు చేపట్టక ముందే వీరు ఒక గ్రూపుగా ఏర్పడి జమీందారులకు వ్యతి రేకంగా ఉద్యమించడం. 2.మెజారిటీ జమీందారులు హిందువులైనా, ముస్లిం రైతులతోపాటు హిందూ రైతులు కలిసి జమీందారులకు వ్యతిరేకంగా పోరాడటం. దీనికి ముఖ్య నాయకులు షా చంద్రరాయ్, శంభు పాల్, ఖాది మొల్లా. ఈ ఉద్యమ ఫలితంగా 1885లో ప్రభుత్వం బెంగాల్ కౌలుదారుల చట్టాన్ని చేసింది.

పాగల్ పంతి తిరుగుబాటు
వీరు తూర్పు బెంగాల్‌లోని మైమెన్‌సింగ్ జిల్లాకు చెందిన హజోంగ్, గరో తెగలకు చెందినవారు. పాగల్ పంతి తిరుగుబాటును ప్రారంభించినవాడు కరమ్ షా. ఇతడి కుమారుడైన టిపు రాజకీయ, మతపరమైన లక్ష్యాలతో ప్రభావితుడై ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. ఇతడు జమీందారులకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటుచేసి, దాడులు చేయడం ద్వారా ధనం సేకరించాడు. 1825 జనవరిలో తన సైన్యంతో జమీందారుల ఇళ్లపై దాడి చేయడంతో, వారు బ్రిటిష్ అధికారుల వద్ద ఆశ్రయం పొందారు. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడానికి టిపు డిమాండ్లను అంగీకరించింది. పాగల్ పంతి తిరుగుబాటు 1825-35 మధ్య కొనసాగింది. చివరికి సైన్యం సాయంతో ప్రభుత్వం దీన్ని అణిచివేసింది.
 

పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టం (1900)
గ్రామీణ రుణగ్రస్థత, వ్యవసాయ భూమి వ్యసాయేతర తరగతులకు అన్యాక్రాంతం కావడం 19వ శతాబ్దం చివరి భాగంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరిణామం. బెంగాల్, మహారాష్ట్రలలో రైతుల ఉద్యమాలను ఎదుర్కొన్న ప్రభుత్వం పంజాబ్‌లో అలాంటి పరిస్థితి రాకముందే రైతుల సమస్యలను పరిష్కరించాలని భావించింది. వివిధ మతాలకు చెందినవారు పంజాబ్‌లో ఉండటం, సిక్కుల వీరత్వం.. ప్రభుత్వాన్ని ఇలాంటి చర్యలు చేపట్టేలా ప్రేరేపించాయి. 1895లో భారత ప్రభుత్వం వ్యవసాయ భూమి అన్యాక్రాంతం కాకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్‌ను జారీ చేసింది. 1896-97, 1899-1900లలో సంభవించిన తీవ్ర కరవుతో సమస్య మరింత జఠిలమైంది. దీంతో 1900లో పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టాన్ని ప్రయోగాత్మక చర్యగా చేసింది. పంజాబ్‌లో ఈ చట్టం విజయవంతంగా పనిచేస్తే.. దీన్ని దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ చట్టం ద్వారా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర తరగతి వారికి అమ్మడం లేదా తాకట్టు పెట్టడాన్ని నిషేధించింది.
   కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకంజ వేసింది. గాంధీజీ రాకతో రైతుల డిమాండ్లకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రైతులను ఉద్యమంలో భాగస్వాములుగా చేసింది. గాంధీజీ నాయకత్వం వహించిన మొదటి రెండు ఉద్యమాలు రైతుల సమస్యలకు సంబంధించినవే కావడం విశేషం. ఈ రెండూ విజయవంతం కావడంతో అనంతరం గాంధీజీ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక నేతగా ఎదిగారు.


చంపారన్ సత్యాగ్రహం
19వ శతాబ్దంలో బీహార్‌లోని చంపారన్‌లో రైతులు తమ భూమిలో 3/20 భాగం నీలిమందు పండించాలని ఐరోపా తోటల యజమానులు బలవంతపెట్టేవారు. దీన్నే 'తీన్ కథియా విధానం' అని పిలిచేవారు. రాజ్‌కుమార్ శుక్లా అనే రైతు కోరిక మేరకు గాంధీజీ సత్యాగ్రహం చేపట్టారు. జిల్లాను వదిలి వెళ్లాలని ప్రభుత్వం గాంధీజీని ఆదేశించినా ఆయన భయపడలేదు. గాంధీజీ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా ప్రభుత్వం అంగీకరించింది. విచారణలో భాగంగా రాజేంద్రప్రసాద్, జె.బి.కృపలానీ వేలాది మంది రైతుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. దీంతో తీన్ కథియా విధానాన్ని రద్దు చేశారు.

ఖేదా సత్యాగ్రహం
గుజరాత్‌లోని ఖేదా జిల్లాలో పంటలు పండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. దీంతో భూమిశిస్తు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. గాంధీజీ ఇందులాల్ యాజ్ఞిక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకుల సహకారంతో ఖేదా జిల్లాలో పర్యటించి రైతులను భూమిశిస్తు చెల్లించవద్దని కోరారు. గాంధీజీ పోరాటం తర్వాత ప్రభుత్వం ఒక రహస్య ఉత్తర్వు ద్వారా పన్ను చెల్లించే స్తోమత ఉన్నవారి నుంచి మాత్రమే వసూలు చేయమని పేర్కొంది. దీంతో గాంధీజీ 1918లో ఉద్యమాన్ని నిలిపేశారు.

బార్డోలి సత్యాగ్రహం (1928)
గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో బార్డోలి గ్రామం ఉంది. ఇక్కడ గాంధీజీ అనుచరులైన మెహతా సోదరులు కున్‌బిపాటి దార్ కులస్థులతోపాటు అంటరానివారు, కాలివరాజ్ తెగకు చెందినవారి సహాయంతో రైతు ఉద్యమాన్ని కొనసాగించారు. బాంబే ప్రభుత్వం భూమిశిస్తును 22 శాతం పెంచడంతో.. మెహతా సోదరులు భూమిశిస్తు నిలుపుదల ఉద్యమాన్ని చేపట్టాలని వల్లభాయి పటేల్‌ను కోరారు. ఉద్యమంలో భాగంగా కుల సంఘాలు, ఐక్యత, సామాజిక బహిష్కరణ, భజనలులాంటి కార్యక్రమాలను చేపట్టారు. ఉద్యమం ఉద్ధృతం కావడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను రైతులకు ఇవ్వడానికి అంగీకరించింది. మాక్స్‌వెల్-బ్రూమ్‌ఫీల్డ్ విచారణ ఫలితంగా బార్డోలిలో 22 శాతానికి పెంచిన భూమిశిస్తును 6.03 శాతానికి తగ్గించారు.

మోప్లా తిరుగుబాటు
కేరళలోని మలబార్ ప్రాంతంలో మోప్లా ముస్లిం రైతులు హిందూ అగ్రకులాలకు చెందిన నంబూద్రి, నాయర్ భూస్వాములకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. ఖిలాఫత్ ఉద్యమం మోప్లాలకు అండగా నిలిచింది. కాంగ్రెస్, ఖిలాఫత్ ఉద్యమ నాయకులైన మహాదేవన్ నాయర్, గోపాల మీనన్, యాకూబ్ హసన్‌లను అరెస్ట్ చేయడంతో ఉద్యమం హింసాత్మకమైంది. 1921, ఆగస్టు 20న పోలీసులు తిరురైంగాడి మసీదుపై దాడిచేయడంతో మోప్లాలు పోలీస్ స్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలు, భూస్వాముల ఇళ్లను ధ్వంసం చేశారు. వీరు హింసాత్మక చర్యలకు పాల్పడటంతో కాంగ్రెస్ ఉద్యమానికి దూరమైంది. 1921 డిసెంబరు నాటికి అనధికారికంగా 10,000 మంది మోప్లాలు హత్యకు గురయ్యారు.

పేదరికంలోకి రైతులు..
ఆ రోజుల్లో దేశ జనాభాలో 3/4వ వంతు మంది వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడేవారు. వలస పాలన కింద వ్యవసాయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 1765లో బెంగాల్‌లో 'దివాని' (భూమి శిస్తు) అధికారాన్ని బ్రిటిషర్లు చేజిక్కించు కోవడంతో వ్యవసాయ విధానంలో సమూల మార్పులు చేశారు. ఇవి వ్యవసాయదారుల అభివృద్ధికి అనుకూలంగా లేకపోవడంతో వారంతా పేదరికానికి గురయ్యారు.
    19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో భారతదేశంలో అనేక కరవులు సంభవించడంతో చాలామంది కార్మికులు, రైతులు ఆకలిచావులకు గురయ్యారు. ఈ కాలంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో 24 చిన్న, పెద్ద కరవులు సంభవించాయి. ఇవి 28.5 మిలియన్ల మంది మరణానికి కారణమయ్యాయి. వీటిలో 1876-78, 1896-97, 1899-1900 ప్రాంతాల్లో సంభవించిన కరవులు ఎక్కువ నష్టానికి కలగజేశాయి.


కిసాన్ సభలు
20వ శతాబ్దంలో రైతు సంస్థలైన కిసాన్ సభలను ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రభుత్వం జమీందార్లకు ప్రోత్సాహకాలను ఇవ్వడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హోమ్‌రూల్ లీగ్‌లో క్రియాశీల సభ్యులైన గౌరి శంకర్ మిశ్రా, ఇంద్ర నారాయణ ద్వివేది.. మదన్‌మోహన్ మాలవ్య సహకారంతో 1918లో కిసాన్ సభలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణుడైన బాబా రామచంద్ర అవధ్‌లో జమీందారులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1920లో రైతు ఉద్యమాలు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగమయ్యాయి. మాలవ్య అవధ్ కిసాన్ సభను ప్రతాప్‌గఢ్‌లో 1920 అక్టోబరులో స్థాపించారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజపుత్రులు - సాంస్కృతిక సేవలు

          రాజపుత్రుల కాలంలో ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు సంభవించాయి. ప్రధానంగా భూస్వాములు పుట్టుకొచ్చారు. హిందూమత ప్రాబల్యం ఎక్కువైంది. ఎన్నో కులాలు ఏర్పడ్డాయి. సమాజంలో స్త్రీల పరిస్థితి దిగజారిపోయింది.
           భారతదేశ చరిత్రలో రాజపుత్ర యుగం విశిష్టమైంది. దేశభక్తి, ధైర్య సాహసాలకు పేరుపొందిన రాజపుత్రులు సమర్థ పాలనను అందించారు. వీరి కాలంలోనే భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. హిందూమతంతో పాటు ఇస్లాం మతాన్నీ ఆదరించారు. భాషా, సాహిత్యాల అభివృద్ధికి; వాస్తు కళారంగాల విస్తరణకు కృషి చేశారు.

 

పరిపాలనా విధానం
           రాజపుత్రుల రాజకీయ వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ ప్రధానమైంది. రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. రాజు సర్వాధికారి. అతడి సార్వభౌమాధికారం దైవదత్తాధికార, సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల మిశ్రమంగా ఉండేది. రాజుకు పాలనలో యువరాజు, పట్టమహిషి, మంత్రి మండలి సహాయపడేవారు. ప్రధాన రాజపురోహితుడు, జ్యోతిష్కుడు మంత్రి మండలిలో సభ్యులుగా ఉండేవారు. భుక్తి లేదా రాష్ట్ర ప్రతినిధులను రాజ ప్రతినిధులుగా పిలిచేవారు. విషయాలకు విషయపతి, గ్రామాలకు గ్రామపతి పాలకులుగా ఉండేవారు. ఉత్తర భారతదేశంలో భూస్వామ్య ప్రభువుల జోక్యం వల్ల గ్రామ స్వపరిపాలన కుంటుపడింది. కానీ ఇదే సమయంలో దక్షిణాదిన చోళుల పాలనలో గ్రామ స్వపరిపాలన చక్కగా సాగింది. రాజు సొంత సైన్యంతో పాటు భూస్వాముల సైన్యమూ రాజ్య విస్తరణలో సహాయపడేది. సైనిక సర్వీసు కేవలం రాజపుత్రులకే పరిమితమై ఉండేది. సైనిక వ్యయం అధికంగా ఉండటం వల్ల ప్రజలపై పన్ను భారం ఎక్కువగా ఉండేది. న్యాయపాలనలోనూ రాజే సర్వాధికారి. భుక్తుల్లో దండనాయకుడు న్యాయాన్ని నిర్ణయించేవాడు. రెవెన్యూ పాలనలో భూస్వాముల ఆధిపత్యం ఉండేది. భూమిశిస్తు నిర్ణయించి, వసూలు చేసే బాధ్యత వీరిదే.

సామాజిక వ్యవస్థ
           రాజపుత్ర యుగం నాటి సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు సంభవించాయి. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ జటిలమయ్యాయి. కుమ్మరి, చేనేత, కంసాలి, మంగలి, జాలరి, మేళగాడు లాంటి కులాలు, ఉపకులాలతో పాటు రాజపుత్రులనే కొత్త కులం ఆవిర్భవించింది. కాయస్థ కులం ఈ కాలంలో ఉండేది. అధికంగా శ్రమించే కులాలను అస్పృశ్యులు, అంటరానివారుగా పరిగణించేవారు. భూస్వామ్య ప్రభువులుగా వ్యవహరించే రాణాలు, సామంతులు శక్తిమంతమైన వర్గంగా ఎదిగారు. ఓడిపోయిన రాజులు, స్థానిక అధిపతులు, యుద్ధ నిపుణులు, తెగ నాయకులు ప్రత్యేక భూస్వామ్య వర్గాలుగా ఆవిర్భవించారు. రాజు వీరికి దానం చేసిన భూములను భోగ లేదా జమీ భూములు అనేవారు. ప్రభుత్వ పదవులను వంశ పారంపర్యంగా అనుభవించేవారు. ఆడపిల్ల పుట్టగానే చంపే ఆచారం ఈ యుగంలోనే ప్రారంభమైంది. బహు భార్యత్వం, పరదా పద్ధతి, జౌహార్‌, సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాల వల్ల స్త్రీల పరిస్థితి దయనీయంగా మారింది. స్త్రీలకు భూమి హక్కు ఉండేది కానీ విద్యావకాశాలు చాలా తక్కువ.

 

మత పరిస్థితులు
           రాజపుత్ర యుగంలో జైన, బౌద్ధ మతాలు క్షీణించి హిందూమతం అభివృద్ధి చెందింది. శైవ, వైష్ణవ మతాలకు ఆదరణ పెరిగింది. భక్తి ఉద్యమాల ప్రభావంతో త్రిమూర్తుల ఆరాధన ప్రాధాన్యం పొందింది. ఉత్తర భారతదేశంలో శక్తి ఆరాధన (స్త్రీ దేవతల ఆరాధన) మరింత పెరిగింది. హిందువులు స్త్రీ మూర్తిని దుర్గ, కాళీ రూపాల్లో శివుడి అర్ధభాగంగా భావించి పూజించేవారు. అనేక దేవాలయాల నిర్మాణాలు రాజపుత్ర యుగంలో హిందూమతానికి దక్కిన ఆదరణకు సాక్ష్యాలుగా నిలిచాయి.
 

ఆర్థిక పరిస్థితులు
           రాజపుత్ర యుగం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థపై ఆధారపడింది. వ్యవసాయం చేయడంలో ప్రత్యక్ష పాత్ర లేనివారు, వ్యవసాయం ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని వారసత్వ హక్కుగా అనుభవించే ఆర్థిక వ్యవస్థనే భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజంగా పేర్కొంటారు. ఈ యుగంలో అదనంగా పంటలు పండించి వాణిజ్యం చేసే ప్రయత్నాలు చేయలేదు. భూస్వామ్య ప్రభువుల ఒత్తిడి వల్ల రైతులు కనీస పంటలు పండించడమే మేలని భావించేవారు. వాణిజ్యం, నాణేల చెలామణి తగ్గిపోయాయి. రోమన్‌, ససానిడ్‌ రాజ్యాలు దెబ్బతినడంతో విదేశాల్లో భారతీయ వస్తువులకు గిరాకీ తగ్గి విదేశీ వాణిజ్యం క్షీణించింది. కోస్తా, బెంగాల్‌ ప్రాంతాల్లోని పట్టణాలు పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సంబంధాలను కొనసాగించాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే వృత్తి పనివారి సంఘాలకు (శ్రేణులు) ప్రాముఖ్యం తగ్గిపోయింది. భూమి ఇచ్చిన రాజు, సేద్యం చేసే రైతు ఇద్దరూ బలహీనపడి భూస్వామ్య ప్రభువులు బలపడ్డారు. భూమిశిస్తు కంటే అధికంగా పన్నులు చెల్లించడం వల్ల రైతులు ఆర్థికమాంద్యంలో కూరుకుపోయారు. దేవాలయ అధికారులూ రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. రాజులు, సామంతులు సైనిక వ్యయంతోపాటు దేవాలయాలు, కోటల నిర్మాణానికి, వాటి అలంకరణకు అధికంగా ఖర్చు చేసేవారు. ఈ విధానాలే అనంతర కాలంలో విదేశీయులు మనపై దాడిచేసి, దోపిడీ చేయడానికి కారణమయ్యాయి.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జైనమతం

       క్రీ.పూ. 6 వ శతాబ్దం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే మతపరమైన ఉద్యమాల అవతరణకు దోహదం చేసింది. చైనాలో కన్‌ఫ్యూజియనిజం, టావోయిజాలు, పర్షియాలో జొరాస్ట్రియనిజం అనే మతాలు ఏర్పడ్డాయి. ఈ శతాబ్దంలోనే గంగానదీ పరివాహ ప్రాంతంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు. వైదిక మతాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగింది. ఈ కాలంలో వచ్చిన మతాల్లో జైనమతం ఒకటి. ఈ మతం ఏర్పడిన విధానం, అందులోని విశేషాల గురించి పరిశీలిద్దాం.

     క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే భారతదేశంలో 62 మత శాఖలు ఉన్నట్లు చరిత్రకారుల అంచనా. వీటిలో చాలావరకు ఈశాన్య భారతదేశంలో నివసించే ప్రజల మత సంప్రదాయాలు, క్రతువుల మీద ఆధారపడినవే. ఈ కాలంనాటి మత గురువుల్లో మొదటివాడు పురాణ కశ్శపుడు. ఇతడు మంచి నడవడిక మనిషి కర్మల మీద ఎలాంటి ప్రభావం చూపదని బోధించాడు. అజీవక శాఖకు నాయకుడైన గోసాల మస్కరిపుత్ర కూడా పురాణ కశ్శపుడి వాదనతో అంగీకరించి, నియతి వాదాన్ని బోధించాడు. మరో గురువు అజిత కేశ కాంబలిన్ 'ఉచ్ఛేద వాదం' అనే భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఈ సిద్ధాంతం నుంచే లోకాయత, చార్వాక అనే మత శాఖలు ఏర్పడ్డాయి.
* మరో మతాధికారైన పకుధ కాత్యాయన భూమి, నీరు, వెలుతురు ఎలాగైతే సమూలంగా నాశనం చేయడానికి వీల్లేని అంశాలో, అదే విధంగా జీవితం, ఆనందం, విషాదం కూడా నాశనం చేయలేని అంశాలని అభిప్రాయపడ్డాడు. అతడి భావాల నుంచే వైశేషిక వాదం పుట్టిందని చరిత్రకారుల భావన. కానీ ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన మతశాఖల్లో కేవలం బౌద్ధ, జైన మతాలు మాత్రమే స్వతంత్ర మతాలుగా పేరుపొందాయి. దీంతో ఈ శతాబ్దం భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

 

జైనమతం - ఆవిర్భావం 
    జైనమత స్థాపకుడు రుషభనాథుడు. రుగ్వేదంలో రుషభనాథుడు (మొదటి తీర్థంకరుడు), అరిష్టనేమి (22 వ తీర్థంకరుడు)ల ప్రస్తావన ఉంది. రుషభనాథుడి గురించి విష్ణుపురాణం, భాగవత పురాణాల్లో పేర్కొన్నారు. వీటిలో రుషభనాథుడిని విష్ణుదేవుడి అవతారంగా వివరించారు. జైనమతంలో 24 మంది తీర్థంకరులు (ప్రవక్తలు లేదా గురువులు) ఉన్నట్లు జైనులు విశ్వసిస్తారు. అయితే మొదటి 22 మంది తీర్థంకరులకు చెందిన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. చివరి ఇద్దరు మాత్రమే చారిత్రక పురుషులు. తీర్థంకరులందరూ క్షత్రియ వంశానికి చెందినవారే కావడం విశేషం. ఇరవైమూడో తీర్థంకరుడైన పార్శ్వనాథుడు మహావీరుడి కంటే 250 సంవత్సరాల ముందు జీవించాడు. ఇతడు బెనారస్ రాజైన అశ్వసేనుడి కుమారుడు. పార్శ్వనాథుడి కాలం నాటికే జైనమతం వ్యవస్థీకృతమైనట్లు తెలుస్తోంది. వర్థమానుడి తల్లిదండ్రులు పార్శ్వనాథుడి అనుచరులుగా ఉండేవారు. చివరి తీర్థంకరుడు వర్థమానుడు.


మహావీరుడి జీవితం, బోధనలు:
     వర్థమానుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుంద గ్రామం (ప్రస్తుత బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా)లో క్రీ.పూ. 540 లో జన్మించాడు. ఇతడి తండ్రి సిద్ధార్థుడు. ఇతడు జ్ఞత్రిక తెగకు అధిపతి, తల్లి త్రిశల. ఈమె వైశాలి పాలకుడైన అచ్చవి రాజు చేతకుని సోదరి. మగధ రాజైన బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లనను వివాహం చేసుకోవడం వల్ల మహావీరుడికి మగధను పాలించిన హర్యంక వంశంతో చుట్టరికం ఏర్పడింది. మహావీరుడి భార్య యశోద. వీరి కుమార్తె అనొజ్ఞ (ప్రియదర్శన), అల్లుడు జమాలి. ఇతడే మహావీరుడి మొదటి శిష్యుడు.
* వర్థమానుడు తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత సత్యాన్వేషణ కోసం ఇంటిని వదిలిపెట్టాడు. అప్పుడు అతడి వయసు 30 ఏళ్లు. మొదటి రెండు సంవత్సరాలు పార్శ్వనాథుని మతశాఖలో సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత దాన్ని వదలి మరో 10 ఏళ్లపాటు అజీవక మతస్థాపకుడైన గోసాల మస్కరిపుత్రతో గడిపాడు. 42 ఏళ్ల వయసులో తూర్పు భారతదేశంలోని జృంభిక గ్రామంలో సాల వృక్షం కింద కైవల్యం (సంపూర్ణ జ్ఞానం) పొందాడు. అప్పటి నుంచి జినుడు, జితేంద్రియుడు (జయించినవాడు), మహావీరుడని ప్రసిద్ధి చెందాడు. ఇతడి అనుచరులను జైనులు అంటారు. ఇతడు క్రీ.పూ. 468 లో తన 72 వ ఏట రాజగృహం దగ్గర ఉన్న పావపురిలో మరణించాడు.
* మహావీరుడి మరణం తర్వాత చంద్రగుప్త మౌర్యుడి పాలనాకాలంలో తీవ్రమైన కరవు సంభవించింది. దాంతో జైన సన్యాసులు గంగాలోయ నుంచి దక్కనుకు వలస వెళ్లారు. ఈ వలస జైనమతంలో చీలికకు దారితీసింది. మహావీరుడు చెప్పినట్లు దిగంబరత్వాన్ని పాటించాలని భద్రబాహు పేర్కొన్నాడు. ఉత్తర భారతదేశంలో ఉన్న జైనులకు నాయకుడైన స్థూలభద్ర తన అనుచరులను తెల్లబట్టలు ధరించాలని కోరాడు. ఇది జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులుగా చీలిపోవడానికి కారణమైంది.


పంచ మహావ్రతాలు:
    జైనమతంలో అయిదు ముఖ్య సూత్రాలున్నాయి. వీటినే పంచ మహావ్రతాలు అంటారు. అవి. 1) అహింస, 2) సత్యం, 3) అస్తేయం (దొంగిలించకూడదు), 4) అపరిగ్రహ (ఆస్తి కలిగి ఉండకూడదు), 5) బ్రహ్మచర్యం. అంతకుముందున్న నాలుగు సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్యం అనే అయిదో సూత్రాన్ని చేర్చాడు. ఈ అయిదు సూత్రాలను సన్యాసులు కఠినంగా ఆచరిస్తే మహావ్రతులని, సామాన్య అనుచరులు ఆచరిస్తే అనువ్రతులని పిలుస్తారు. జైనమతంలో నిర్వాణం సాధించడానికి సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన అనే త్రిరత్నాలను పాటించాలి.
మహావీరుని బోధనలు: మహావీరుడు వేదాల ఆధిపత్యాన్ని ఖండించాడు. జంతు బలులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇతడు ప్రతి చిన్న వస్తువుకు ఆత్మ ఉంటుందని చెప్పాడు. అందుకే జైనులు అహింసను కచ్చితంగా పాటిస్తారు. జైనమతం దేవుడి ఉనికిని ఖండించలేదు కానీ, విశ్వం పుట్టుక, కొనసాగడానికి దేవుడే కారణం అనే వాదాన్ని తిరస్కరించింది. దేవుడికి జైనమతంలో తీర్థంకరుల కంటే తక్కువ స్థానాన్ని కల్పించారు. వీరికి వర్ణవ్యవస్థపై విశ్వాసంలేదు. అందుకే వారు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటించారు. మహావీరుడు మోక్షసాధనకు పవిత్రమైన, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని బోధించాడు. అలాగే కఠోర తపస్సు అవసరాన్ని నొక్కి చెప్పాడు.


* మొదటి జైనమత కౌన్సిల్ పాటలీపుత్రంలో క్రీ.పూ. 3 వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీనికి అధ్యక్షుడు స్థూలభద్రుడు. ఈ కౌన్సిల్‌లో జైన గ్రంథాలైన 12 అంగాలను క్రోడీకరించారు. అయితే ఈ గ్రంథాలను శ్వేతాంబరులు మాత్రమే అంగీకరించారు. రెండో జైన కౌన్సిల్ సౌరాష్ట్రలోని వల్లభిలో క్రీ.శ. 5 వ శతాబ్దంలో జరిగింది. దీనికి దేవర్ది క్సమశ్రమణ అధ్యక్షత వహించాడు. ఇందులో 12 అంగాలు, 12 ఉపాంగాలను క్రోడీకరించారు.
జైనమత వ్యాప్తి, అభివృద్ధి: మహావీరుడు, జైన సన్యాసులు సంస్కృతానికి బదులు సామాన్య ప్రజలు మాట్లాడే భాషను వాడటం, సులభమైన నైతిక నియమావళి, జైన సన్యాసుల కార్యకలాపాలు, రాజుల ఆదరణ మొదలైనవి జైనమత వ్యాప్తికి తోడ్పడ్డాయి. మహావీరుడి అనుచరులు దేశమంతటా విస్తరించారు. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు జైన సన్యానులు సింధు నది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తోంది.

* జైన సంప్రదాయం ప్రకారం అజాతశత్రువు తర్వాత మగధను పాలించిన ఉదయనుడు జైనమతాభిమాని. నంద వంశరాజులు కూడా జైనమతాన్ని పోషించారు. క్రీ.పూ. 1 వ శతాబ్దంలో ఉజ్జయిని గొప్ప జైనమత కేంద్రంగా ఉండేది. క్రీ.పూ. 4 వ శతాబ్దం చివరినాటికి భద్రబాహు ఆధ్వర్యంలో కొంతమంది జైన సన్యాసులు దక్కనుకు వలస వెళ్లారు. దీంతో మైసూరులోని శ్రావణ బెళగొల కేంద్రంగా జైనమతం దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చెందింది.


రాజుల ఆదరణ 
     చంద్రగుప్త మౌర్య జైనమతాన్ని పోషించిన వారిలో ప్రముఖుడు. భద్రబాహు దక్కనుకు వలస వెళ్లినప్పుడు, చంద్రగుప్తుడు అతడితోపాటు దక్షిణానికి వెళ్లాడు. ఇతడు ఒక కొండపై ఉన్న గుహను చంద్రగుప్తుడికి అంకితం చేయడంతోపాటు ఆ కొండకు చంద్రగిరి అని నామకరణం చేశాడు.
* క్రీ.పూ. 2 వ శతాబ్దంలో కళింగను పాలించిన ఖారవేలుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఇతడు జైనుల విగ్రహాలను ఏర్పాటుచేసి జైనమత వ్యాప్తికి కృషి చేశాడు.
* కుషాణుల కాలంలో మధురలో, హర్షవర్థనుడి కాలంలో తూర్పు భారతదేశంలో జైనమతం ప్రధాన మతంగా ఉండేది. క్రీ.శ. ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని మధుర, దక్షిణ భారత దేశంలోని శ్రావణ బెళగొల ప్రధాన జైనమత కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ లభించిన శాసనాలు, విగ్రహాలు, ఇతర కట్టడాలే ఇందుకు నిదర్శనం.
* క్రీ.శ. 5 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశానికి చెందిన గంగ, కదంబ, చాళుక్య, రాష్ట్రకూట రాజవంశాలు జైనమతాన్ని పోషించాయి.
* మాన్యఖేటను కేంద్రంగా చేసుకుని తమ పరిపాలనను సాగించిన రాష్ట్రకూటులు జైనమతంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. వారు జైన కళలు, సాహిత్యం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించారు. రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుడి కాలంలో జినసేనుడు, గుణభద్రుడు మహాపురాణం అనే గ్రంథాన్ని రచించారు. అమోఘవర్షుడు రత్నమాలిక అనే జైన గ్రంథాన్ని రచించాడు.
* క్రీ.శ. 1110 నాటికి గుజరాత్‌లో జైనమతం వ్యాప్తి చెందింది. అన్హిల్‌వారా (Anhilwara) పాలకుడు, జయసింహగా ప్రసిద్ధిచెందిన చాళుక్యరాజు సిద్ధరాజు, కుమారపాల జైనమతాన్ని ఆదరించారు. వారు జైనమతాన్ని స్వీకరించి, జైనుల సాహిత్యాన్ని, దేవాలయాల నిర్మాణ కార్యకలాపాలను ప్రోత్సహించారు. కుమారపాలుడి ఆస్థానంలోని జైనపండితుడు హేమచంద్రుడు రచించిన త్రిషష్టి సలక పురుష చరిత అనే గ్రంథం ప్రసిద్ధిచెందింది.


జైనమత పతనం: భారతదేశంలో జైనమతం పతనం కావడానికి ప్రధాన కారణం అహింసకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడమేనని చరిత్రకారుల అభిప్రాయం. అనారోగ్యం పాలైనప్పుడు మందులు వాడితే సూక్ష్మక్రిములు చనిపోతాయి కాబట్టి ఎవరూ మందులు వాడకూడదని జైనులు పేర్కొన్నారు. చెట్లు, కూరగాయల్లో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వాటికి ఎలాంటి హాని చేయకూడదని నమ్మారు. ఇలాంటి పద్ధతులు సామాన్య ప్రజలకు అంతగా నచ్చలేదు. మొదట్లో జైనమతానికి రాజులనుంచి ఆదరణ లభించినా, తర్వాతికాలంలో ఈ మతానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఢిల్లీ సుల్తానులు

  క్రీ.శ.1206లో మహ్మద్‌ఘోరీ మరణానంతరం కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత క్రీ.శ.1526 వరకు అంటే సుమారు మూడు శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు పరిపాలించాయి. వీరు సువిశాల సామ్రాజ్య స్థాపనతోపాటు ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేశారు.
 

బానిస వంశం
బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్‌ ఐబక్‌. ఇతడు క్రీ.శ.1206లో తన యజమాని మహ్మద్‌ఘోరీకి వారసులు లేకపోవడం వల్ల తన స్వాతంత్య్రాన్ని భారతదేశంలో ప్రకటించుకొని క్రీ.శ.1210 వరకు పరిపాలించాడు. ఇతడి వారసుల్లో ఇల్‌టుట్‌మిష్, రజియా సుల్తానా, ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ ప్రముఖులు. ఈ వంశాన్నే మామ్లూక్‌ వంశంగా పేర్కొంటారు. వీరు 1206 నుంచి 1290 మధ్య పరిపాలించారు.


కుతుబుద్దీన్‌ ఐబక్‌ 
    బానిసగా జీవితాన్ని ప్రారంభించిన ఐబక్‌ తన శక్తి సామర్థ్యాలతో ఘోరీ మహ్మద్‌  సేనానిగా ఎదిగాడు. తరైన్‌ యుద్ధాలు, ఘోరీ భారతదేశ దండయాత్రల్లో పాల్గొన్న ఐబక్, భారతదేశంలో ఘోరీ ప్రతినిధిగా నియమితుడయ్యాడు. ఢిల్లీని ఆక్రమించుకున్నందుకు గుర్తుగా ‘కువ్వత్‌-ఉల్‌-ఇస్లామ్‌’ అనే మసీదును నిర్మించాడు. ఘోరీ మరణానంతరం క్రీ.శ. 1206లో ఐబక్‌ స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతడి అధికారాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసిన బెంగాల్‌ పాలకుడు అలీమర్థాన్‌ను అణచివేసి ఆయన స్థానంలో మహ్మద్‌ షెరాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. ఘజనీ పాలకుడైన తాజ్‌-ఉద్దీన్‌-యల్‌డజ్‌ ఢిల్లీపై దండెత్తగా అతడిని ఓడించాడు. అజ్మీర్‌లో ‘అర్హిదిన్‌ కా జోంప్రా’ అనే మసీదును నిర్మించాడు. లాహోర్‌ను రాజధానిగా చేసుకుని పాలించాడు. తన రెండో రాజధానిగా ఢిల్లీని ప్రకటించాడు (ఢిల్లీని పూర్తి రాజధానిగా చేసింది ఇల్‌టుట్‌మిష్‌). భారతదేశంలో ఇస్లాం రాజ్యస్థాపనకు గుర్తుగా ఢిల్లీలో కుతుబ్‌మీనార్‌ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కుతుబ్‌మీనార్‌ అనేది తన గురువు కుతుబుద్దీన్‌ భక్తియార్‌ కాకి  సమాధి. ఐబక్‌ తన దానగుణం వల్ల లాక్‌భక్ష్గా పిలవబడ్డాడు. ఇతడు 1210లో లాహోర్‌లో చౌగాన్‌ (పోలో) ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించాడు. అనంతరం అతడి కుమారుడు ఆరామ్‌షా (ఆరామ్‌భక్ష్) పాలకుడయ్యాడు. 

 

ఇల్‌టుట్‌మిష్‌ (క్రీ.శ.1211 - 1236)
  ఆరామ్‌షాను పదవి నుంచి తొలగించి ఇల్‌టుట్‌మిష్‌ క్రీ.శ.1211లో సుల్తాన్‌ పదవిని చేపట్టాడు. ఇతడు ఐబక్‌ అల్లుడు. ఇతడు ఐబక్‌ మరణించే నాటికి బదయాన్‌ (బదక్షాన్‌) ప్రాంత గవర్నర్‌గా ఉన్నాడు. ఇల్‌టుట్‌మిష్‌ ఇల్బారీ తెగకు చెందినవాడు. అసలు పేరు ష్‌మ్స్‌ - ఉద్దీన్‌ - ఇల్‌టుట్‌మిష్‌. ఖలీఫా నుంచి భారతదేశ సుల్తాన్‌గా అనుమతి పత్రం పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్‌ ఇతడే. ఢిల్లీని శాశ్వత రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఘజనీ పాలకుడు తాజ్‌వుద్దీన్‌ యల్‌డజ్‌ను, ముల్తాన్‌ పాలకుడు నాసిరుద్దీన్‌ కుబాచాను ఓడించాడు. విశాల సామ్రాజ్య స్థాపన చేశాడు. చెంఘీజ్‌ఖాన్‌ నాయకత్వంలోని మంగోలుల దాడులను సమర్థంగా తిప్పికొట్టాడు. ఇతడి కాలంలోనే 40 మంది తురుష్క సర్దారుల  కూటమి చిహల్‌గనీ ఏర్పడింది. ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యంలో ‘ఇక్తా’ అనే సైనిక విధానాన్ని ప్రవేశపెట్టాడు. నాటి సైనిక రాష్ట్రాలను ఇక్తాలు, వాటి అధిపతిని ముక్తీ అని పిలిచేవారు. ఇతడు ఢిల్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా ‘హౌజ్‌-ఇ-సుల్తానీ’ అనే రాజుల స్నాన ఘట్టాన్ని నిర్మించాడు. ఐబక్‌ ప్రారంభించిన కుతుబ్‌మీనార్‌ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. టంకా అనే వెండి నాణేలు, జితాల్‌ అనే రాగి నాణేలను ముద్రించాడు.  ఇతడికి గల పరమత ద్వేషం వల్ల భిల్సా, ఉజ్జయిని దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ప్రముఖ చరిత్రకారుడు ఆర్‌.పి.త్రిపాఠీ ప్రకారం భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని నెలకొల్పినవారు ఇల్‌టుట్‌మిష్‌. తన ఆస్థానంలో మిన్హజ్‌-ఉస్‌-సిరాజ్‌ (మిన్హజుద్దీన్‌ షిరాజ్‌), తాజుద్దీన్‌ లాంటి కవులను పోషించాడు. 

 

ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ (క్రీ.శ.1266 - 1287)
     బానిసవంశ పాలకుల్లో గొప్పవాడు బాల్బన్‌. ఇతడు బానిసగా, తోటమాలిగా, నీరు మోసేవాడిగా, సేనానిగా, సర్దార్‌గా చివరకు సుల్తాన్‌గా అనేక పాత్రలను పోషించాడు. బానిసగా భారతదేశానికి వచ్చిన బాల్బన్‌ ఇల్‌టుట్‌మిష్‌ కొలువులో చేరి చిహల్‌గనీ కూటమిలో ప్రధానపాత్ర పోషించాడు. తన శక్తి సామర్థ్యాల ద్వారా ఖాస్‌దార్, అమీర్‌-ఇ-షకార్‌ లాంటి పదవులను పొందాడు. రజియా సుల్తానా మరణానంతరం బహరాంషా, మసూద్‌షా, నాసిరుద్దీన్‌ల పాలనాకాలంలో బాల్బన్‌ కీలకపాత్ర పోషించాడు. వారి నుంచి రేవరి, హాన్సీ లాంటి జాగీర్‌లను పొందాడు. నాసిరుద్దీన్‌ తన కుమార్తెను బాల్బన్‌కు ఇచ్చి వివాహం చేయడమే కాకుండా నాయబ్‌-ఐ-మీ మాలిక్‌ (ఉపప్రధాని)గా నియమించాడు. 1266లో నాసిరుద్దీన్‌ మరణించగా బాల్బన్‌ ఢిల్లీ సుల్తాన్‌ పదవిని చేపట్టాడు. బాల్బన్‌ అనేక విజయాలు సాధించాడు. పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. మంగోలుల దండయాత్రను సమర్థంగా తిప్పికొట్డాడు. అనేక పర్షియా రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. చిహల్‌గనీ కూటమిని నిర్మూలించి రాజ్యంలో శాంతిభద్రతలు నెలకొల్పాడు. బెంగాల్‌ గవర్నర్‌ టుగ్రిల్‌కాన్‌ తిరుగుబాటును అణచివేశాడు. చిహల్‌గనీ ముఠా నాయకుడు అమీర్‌ఖాన్‌ను హత్య చేయించాడు. రాచరికం దైవదత్తం (జిల్లీ - ఇల్లాహే/రాజు భగవంతుడి నీడ) అనే సిద్ధాంతాన్ని బాల్బన్‌ విశ్వసించాడు. సామాన్య ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు. 


    సుల్తాన్‌ అధికారాన్ని పెంచడానికి అనేక పర్షియన్‌ రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. వాటిలో ప్రధానమైనవి సిజ్ధా, ఫైబోస్‌/జమ్నిబోస్‌. సుల్తాన్‌ ఆస్థానంలోనికి వచ్చినవారెవరైనా అతడికి సాష్టాంగ నమస్కారం చేయాలన్నదే సిజ్ధా అర్థం. అలాగే సుల్తాన్‌ పాదాలను లేదా సింహాసనాన్ని ముద్దుపెట్టుకోవాలన్నది ఫైబోస్‌/జమ్నిబోస్‌ అర్థం. బాల్బన్‌ నిరంకుశ భావాలతో పరిపాలన చేశాడు. దివాన్‌-ఇ-అర్జ్‌ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఇమాద్‌-ఉల్‌ ముల్క్‌ను అధిపతిగా నియమించాడు.


    సైనిక వ్యవస్థలో వృద్ధాప్య పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అడువులను నరికించి, వ్యవసాయ భూములుగా మార్చిన తొలి ఢిల్లీ సుల్తాన్‌గా కీర్తించబడ్డాడు. మంగోలుల దండయాత్రలను ఎదుర్కోవడానికి రక్షణ ఏర్పాట్లు చేశాడు. లాహోర్‌ కోటను సందర్శించి దానికి మరమ్మతులు చేయించాడు. మంగోలుల దండయాత్రల వల్ల బాల్బన్‌ పెద్ద కుమారుడు మహ్మద్‌ మరణించాడు. బాల్బన్‌ అనంతరం అతడి మనుమడైన కైకూబాద్‌ చివరి బానిస సుల్తాన్‌గా పరిపాలించాడు.

 

సుల్తానా రజియా (క్రీ.శ.1236 - 1240) 
 భారతదేశాన్ని పరిపాలించిన తొలి, ఏకైక ముస్లిం మహిళ రజియా సుల్తానా. ఈమె ఇల్‌టుట్‌మిష్‌ కుమార్తె. రజియా శక్తి సామర్థ్యాలను గమనించిన ఇల్‌టుట్‌మిష్‌ తన కుమారులను (మహ్మద్, రక్నుద్దీన్‌) కాదని ఈమెను వారసురాలిగా ప్రకటించాడు. అయితే ఒక మహిళ పాలకురాలు కావడం ఇష్టం లేని ఆస్థాన సర్దారులు, సామంతులు ఆమెపై అనేక తిరుగుబాట్లు చేశారు. లాహోర్, ముల్తాన్‌ పాలకులు చేసిన తిరుగుబాట్లను రజియా సమర్థంగా అణచివేసింది. మాలిక్‌ జమాలుద్దీన్‌ యాకూత్‌ అనే అబిసీనియా దేశస్థుడిని  అశ్వదళాధిపతి (అమీర్‌- ఇ- అబూఖత్‌)గా నియమించింది. ఈ నియామకం స్వదేశీ ముస్లింలు, సర్దారుల్లో మరింత ద్వేషాన్ని పెంచింది. రజియా యొక్క సర్దార్‌ నిజామ్‌-ఉల్‌-జునైడీ భటిండా పాలకుడు అల్‌తునియాతో చేరి ఆమెను ఓడించి భటిండా కారాగారంలో బంధించారు. కానీ అవసరం తీరిన జునైడీ అల్‌తునియాను మోసం చేయడంతో అల్‌తునియా భటిండా కారాగారం నుంచి ఆమెను విడిపించి, వివాహం చేసుకుని ఇద్దరూ ఢిల్లీపైకి వస్తుండగా క్రీ.శ.1240లో ఖైతాల్‌ అనే ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఫలితంగా ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యంలో సుల్తానా రజియా శకం ముగిసింది.


* బాల్బన్‌ ఒక బానిసగా, నీటి సంచులు మోసే కూలీగా,  వేటాధికారిగా, సేనాధిపతిగా, రాజనీతిజ్ఞుడిగా, చివరికి సుల్తాన్‌గా ఎదిగాడు’’ - ప్రముఖ చరిత్రకారుడు లేన్‌పూలే

 

    క్రీ.శ.1206లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ స్థాపించిన ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యం క్రీ.శ.1526 వరకు కొనసాగింది. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాల పాలనలో భారతదేశంలో సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు; సాంస్కృతిక అంశాల్లో ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సుల్తానులు భారతదేశ చరిత్రకు, సాంస్కృతిక ప్రగతికి కృషి చేశారు.

 

పరిపాలనా విధానం

కేంద్రపాలన 
    ఢిల్లీ సుల్తానులు ఇస్లామిక్‌ సంప్రదాయ ‘షరియత్‌’ ప్రకారం భారతదేశాన్ని పరిపాలించారు. సుల్తాన్‌ను భగవంతుడి ప్రతిరూపంగా భావించి పాలించారు. వారు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్తాలు - షిక్‌లు - పరగణాలు - గ్రామాలుగా విభజించారు. కేంద్రస్థాయిలో సుల్తాన్‌ సర్వాధికారి, నిరంకుశుడు. సుల్తాన్‌కు పరిపాలనలో సహాయపడటానికి మంత్రిమండలి ఉండేది. నాడు కేంద్ర మంత్రిమండలిలో వజీర్‌ (ఆర్థికమంత్రి), దివాన్‌-ఇ-అర్జ్‌ (యుద్ధ మంత్రి), దివాన్‌-ఇ-రిసాలత్‌ (విదేశీ వ్యవహారాల మంత్రి), దబీర్‌-ఇ-మమాలిక్‌ (సమాచార మంత్రి), సదర్‌-ఉస్‌-సుదూర్‌ (ధర్మాదాయ, ధార్మిక మంత్రి), దివాన్‌-ఇ-ఖాజీ/ ఖాజీ-ఉల్‌-కుజత్‌ (న్యాయశాఖా మంత్రి) లాంటి మంత్రులు ఉండేవారు. సుల్తాన్‌కు సహాయపడటానికి నాయిబ్‌ సుల్తాన్‌ (ఉప ప్రధానమంత్రి) కూడా ఉండేవాడు. ఈ విధంగా కేంద్రంలో సుల్తాన్‌ సర్వాధికారాలు కలిగి ఉండి మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో పరిపాలించేవాడు.

 

రాష్ట్ర పాలన 
    ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలను ఇక్తాలు అనేవారు. ఇల్‌టుట్‌మిష్‌ ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్తా అధిపతిని ముక్తీ అనేవారు. ఇక్తాలు అనేవి సైనిక రాష్ట్రాలుగా పేరొందాయి. ముక్తీలు రాజు ద్వారా నియమితులై ఇక్తాల నుంచి వచ్చిన ఆదాయంలో కొంత భాగం తీసుకుని సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్‌కు సరఫరా చేయాలి. ఇక్తాల్లో ఉండే రాజ ప్రతినిధిని (గవర్నర్‌) నాయిమ్‌/వలి అని పిలిచేవారు. ముక్తీ, నాయిమ్‌తో పాటు రాష్ట్రాల్లో వజీర్, అరిజ్, ఖ్వాజీ లాంటి అధికారులు ఉండేవారు. రాష్ట్రాల్లో ఇక్తాలతో పాటు ప్రాంతాలు, సామంత రాజ్యాలు కూడా ఉండేవి. ప్రాంతాలను ఉప రాజ్యాలు అనేవారు.

 

స్థానిక పాలన
    ఢిల్లీ సుల్తానులు రాష్ట్రాలు/ప్రాంతాలు/ఇక్తాలను షిక్‌లు, పరగణాలు, గ్రామాలుగా విభజించి పరిపాలించారు. షిక్‌ల అధిపతిని షిక్‌దార్, పరగణాల అధిపతిని అమీల్, గ్రామ అధికారులను చౌదరీ, ముఖద్దమ్‌ అని పిలిచేవారు. గ్రామపాలనలో స్వయంప్రతిపత్తి ఉండేది. కొన్ని గ్రామాల్లో పట్వారీ అనే అధికారి ఉండేవాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానులు ఇస్లాం న్యాయ షరియత్‌ ప్రకారం పాలించినప్పటికీ గతంలో భారతదేశంలో ఉన్న పాలనా వ్యవస్థనే అనుసరించారని అర్థమవుతుంది. రాజు స్థానంలో సుల్తాన్‌ వచ్చాడు. అదే మంత్రిమండలి విధానం, రాజ్య విభజన విధానం, ఉద్యోగ బృంద సహకారం కొనసాగింది కానీ వారి పేర్లు మార్పు చెందాయి. 

 

రెవెన్యూ పాలన 
    ఢిల్లీ సుల్తానులు రెవెన్యూ విధానంలో అనేక నూతన మార్పులను ప్రవేశపెట్టారు. ప్రత్యేక శాఖలను రూపొందించి భూముల సర్వే, విభజన, పంట ఆధారంగా భూమిశిస్తును నిర్ణయించారు. కుతుబుద్దీన్‌ ఐబక్‌ కాలంలో పంటలో 1/10వ వంతును శిస్తుగా నిర్ణయిస్తే అల్లావుద్దీన్‌ ఖిల్జీ, మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ కాలంలో 1/2వ వంతుగా నిర్ణయించారు. కానీ ఎక్కువ మంది సుల్తానులు 1/3వ వంతునే భూమిశిస్తుగా వసూలు చేశారు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రెవెన్యూ శాఖలో అవినీతిని నిర్మూలించడానికి ప్రత్యేక అధికారులను నియమించాడు. మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘దివాన్‌-ఇ-కోహీ’ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటుచేసి రెవెన్యూ పాలనను పటిష్ఠం చేశాడు. బాల్బన్‌ తొలిసారిగా అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చాడు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ రైతు బాంధవుడిగా పేరొందాడు.


సైనిక పాలన
    ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సైనిక విధానాన్ని ‘ఇక్తా పద్ధతి’ అంటారు. ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్య ప్రగతి ఎక్కువగా సైనిక వ్యవస్థపైనే ఆధారపడి ఉండేది. ముఖ్యంగా మంగోలుల లాంటి విదేశీయుల దండయాత్రలను సమర్థంగా ఎదుర్కోవడానికి, రాజ్య విస్తరణకు సైనికశక్తి అవసరమని గుర్తించిన ఢిల్లీ సుల్తానులు సైనిక పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 

ఇల్‌టుట్‌మిష్‌ ‘ఇక్తాలు’ అనే సైనిక రాష్ట్రాలను ఏర్పాటుచేసి, వాటిపై ముక్తీలనే అధికారులను నియమించాడు. ముక్తీలు తమ అధీనంలో ఉన్న ఇక్తాల నుంచి శిస్తు వసూలు చేసి కొంతభాగాన్ని సుల్తాన్‌కు చెల్లించి, మిగిలిన దానితో సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్‌కు సరఫరా చేసేవారు. బాల్బన్‌ తన పాలనా కాలంలో దివాన్‌-ఇ-అర్జ్‌ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశాడు. సుల్తానుల కాలం నాటి సైనిక వ్యవస్థలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ అనేక మార్పులు చేపట్టాడు. 

    ఇతడు ఇక్తా పద్ధతిని రద్దుచేసి, సైనికులకు నగదు రూపంలో జీతం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ముక్తీలు చేస్తున్న అక్రమ గుర్రాల మార్పిడిని నియంత్రించడానికి గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతి (దాగ్‌)ని ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా సుల్తాన్‌ సొంత సైన్యం (సిద్ధ సైన్యం)ను రూపొందించాడు. సైనికుల్లో క్రమశిక్షణ పెంచడానికి చెహ్రా అనే హాజరుపట్టీ/మస్తరు విధానాన్ని రూపొందించాడు. తక్కువ జీతం గల సైనికులకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించడానికి మార్కెట్‌ సంస్కరణలు అమలుచేశాడు. కానీ ఫిరోజ్‌షా తుగ్లక్‌ కాలంలో ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్ధారీ పద్ధతిగా ప్రవేశపెట్టారు. సైనిక పదవులు వంశపారంపర్యం కావడంతో క్రమంగా సైనిక వ్యవస్థ నిర్వీర్యమైంది. ఫలితంగా సుల్తానుల సామ్రాజ్యం పతనమైంది. 

 

న్యాయపాలన
    సామ్రాజ్యంలో సుల్తాన్‌ అత్యున్నత న్యాయాధికారి. అతనికి న్యాయపాలనలో సాయపడటానికి ప్రధాన ఖాజీ అనే న్యాయశాఖ మంత్రి ఉండేవాడు. అదే విధంగా రాష్ట్ర, స్థానిక స్థాయిల్లోనూ న్యాయపాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామస్థాయిలో గ్రామపెద్దలే తీర్పులు చెప్పేవారు. ఇలానే ఢిల్లీ సుల్తానులు ఖురాన్, షరియత్‌ ప్రకారం న్యాయ పాలన నిర్వహించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మరింత కఠినంగా వ్యవహరించేవాడు. ‘నాకు షరియత్‌ (ముస్లిం చట్టం) తెలియదని, రాజ్య శ్రేయస్సుకు ఏది మంచిదయితే దాన్నే అమలు చేస్తానని’ బహిరంగంగా ప్రకటించాడు.


సాంఘిక పరిస్థితులు 
    అల్‌బెరూనీ, అమీర్‌ఖుస్రూ, బరౌనీ, ఇసామీ, ఇబన్‌  బటూటా వంటి సమకాలీన రచయితలు, చరిత్రకారుల రచనల ద్వారా ఢిల్లీ సుల్తానుల కాలం నాటి వివిధ పరిస్థితులను తెలుసుకోవచ్చు. నాటి సమాజంలో అధిక శాతం హిందువులే ఉన్నారు. సమాజంలో వివిధ వర్గాలు, వారి మధ్య వ్యత్యాసాలు, కుల వ్యవస్థ, ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, స్త్రీ స్థానం, సాంఘిక దురాచారాలు వంటి అంశాలను పరిశీలిస్తే నాటి సాంఘిక వ్యవస్థపై ఒక అవగాహన కలుగుతుంది. అంత వరకు పాలకులుగా ఉన్న అధిక శాతం హిందువులు మహ్మదీయుల పాలనలో పాలితులుగా మారడంతో సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముస్లింల సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, సాంఘిక దురాచారాలు భారతీయ సమాజంలో ప్రవేశించాయి. ముఖ్యంగా పరదా పద్ధతి, బహు భార్యత్వం, జౌహార్‌ వంటి సాంఘిక దురాచారాలు అధికమయ్యాయి. ఫలితంగా సమాజంలో స్త్రీకి ప్రాధాన్యం తగ్గింది. స్త్రీ విద్యకు ప్రోత్సాహం కరవైంది. అనేక నూతన వర్గాలు వెలిశాయి. పెద్దఎత్తున మత మార్పిడులు జరిగాయి. మహ్మదీయులు కులవ్యవస్థను అనుసరించారు. హిందువుల పండగలను ముస్లింలు, ముస్లింల సంప్రదాయాలను హిందువులు అనుసరించారు. నూతనంగా ఏర్పడిన ఉలేమాలు, కుట్స్, కులీనులు వంటి వర్గాలవారు అధిక పెత్తనం చెలాయిస్తూ ఆర్థికవ్యత్యాసాలకు కారణమయ్యారు.


ఆర్థిక పరిస్థితులు 
    ఢిల్లీ సుల్తానుల కాలంలో వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల రంగాల అభివృద్ధిని పరిశీలిస్తే నాటి ఆర్థిక పరిస్థితులు అర్థమవుతాయి. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఢిల్లీ సుల్తానులు అనేక చర్యలు చేపట్టారు. ఫలితంగా పట్టణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో అనేక నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆహార, వాణిజ్య పంటలకు సమాన ప్రాధాన్యం  ఇచ్చారు. నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. బంజరు భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చడానికి కృషి చేశారు. నాటి కాలంలో ఇక్తా భూములు, ఖలీసా భూములు, మదద్‌ - ఇ - మాష్‌ భూములు అనే మూడు ప్రధాన రకాలు ఉండేవి. ముక్తీల అధీనంలో ఉండే భూములు ఇక్తా భూములు. సుల్తాన్‌ అధీనంలో ఉండే భూములు ఖలీసా భూములు. వీటి నుంచి వచ్చే ఆదాయం నేరుగా ఖజానాకు చేరేది. వివిధ వర్గాలవారికి పాలకులు దానంగా ఇచ్చిన భూములను మదద్‌ - ఇ - మాష్‌ భూములు అనేవారు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ వ్యవసాయ అభివృద్ధికి నాలుగు ప్రధాన కాలువలు తవ్వించి రైతుబాంధవుడిగా పేరొందాడు. సుల్తానుల కాలంలో తోటపంటలు బాగా అభివృద్ధి చెందాయి.

    ఫలితంగా గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భూమిశిస్తుతో పాటు ఖామ్స్, జకత్, జిజియా వంటి పన్నులు వసూలు చేసేవారు. రాజ్యానికి అధిక ఆదాయం భూమిశిస్తు (ఖరజ్‌) ద్వారా సమకూరేది. కానీ ప్రజలు అధిక పన్నుల భారంతో బాధపడేవారు. పట్టణాల సంఖ్య పెరగడం, వృత్తి పనివారు అధికంగా వస్తువులు ఉత్పత్తి చేయడం, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడం అనే మూడు ప్రధాన కారణాల వల్ల పట్టణ ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. తురుష్కుల రాకతో వస్త్ర, పట్టు, కాగితం పరిశ్రమల అభివృద్ధి సాధ్యమైంది. భవన నిర్మాణ రంగంలో సాంకేతికత పెరిగింది. ఢిల్లీలో ఉన్న భవన నిర్మాణ మేస్త్రీలు ఇస్లాం రాజ్యాలున్న అన్ని దేశాల కంటే నైపుణ్యం కలవారని అమీర్‌ఖుస్రూ పేర్కొన్నాడు. చర్మ, లోహ పరిశ్రమలు, తివాచీల అల్లకం, ఆభరణాల రూపకల్పన వంటి రంగాల్లో అభివృద్ధి జరిగింది.

    వ్యవసాయ, పరిశ్రమల రంగాలతో పాటు వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి. భారతదేశం నుంచి పర్షియన్‌ సింధుశాఖ, ఎర్ర సముద్రం, ఆగ్నేయాసియా దేశాలకు వస్తువులు ఎగుమతయ్యేవి. విదేశీ వాణిజ్యంతో పాటు  దేశీయ వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. మార్వాడీలు, జైనులు, ముల్తానీలు దేశీయ వ్యాపారంలో ప్రధాన పాత్ర పోషించారు.  ముల్తానీలు చాలా ధనవంతులని, కులీన వంశస్థులకు భారీగా రుణాలు ఇచ్చే వారని బరౌనీ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. విదేశాల నుంచి భారీగా వృత్తి పని వారు వలస వచ్చేవారని ఇస్సామీ తెలిపాడు. ఎంత అభివృద్ధి జరిగినా ధనిక, కులీన వర్గాలు మాత్రమే లబ్ధి పొందాయని చెప్పొచ్చు. రైతాంగం, బానిసలు, కూలీలు, మధ్య తరగతి వర్గం అధిక పన్నుల భారంతో బాధపడేవారని సమకాలీన చరిత్రకారుల అభిప్రాయం.

 

    క్రీ.శ.1206లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ స్థాపించిన ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యాన్ని మొదట బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశాలు పరిపాలించాయి. గియాజుద్దీన్‌ తుగ్లక్‌ క్రీ.శ.1320లో చివరి ఖిల్జీ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ ఖుస్రూషాను హత్య చేయించి తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించాడు. తుగ్లక్‌ వంశ పాలన అనంతరం సయ్యద్, లోడీ వంశాలు పరిపాలించాయి. క్రీ.శ.1526లో చివరి లోడీ వంశ పాలకుడైన ఇబ్రహీం లోడీని బాబర్‌ ఓడించి మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యం అంతరించింది.


తుగ్లక్‌ వంశం (క్రీ.శ.1320-1414) 

ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌
    తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించినవారు ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌. ఇతడు తరుష్కుల్లో కరౌనా/ఖరౌనా తెగకు చెందినవాడు. అల్లావుద్దీన్‌ పరిపాలనా కాలంలో ఘియాజుద్దీన్‌ దీపాల్‌పూర్‌ వైస్రాయ్‌గా పనిచేశాడు. క్రీ.శ.1320లో చివరి ఖిల్జీ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ ఖుస్రూషాను వధించి తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించాడు. తుగ్లకాబాద్‌ అనే నగరాన్ని నిర్మించాడు. కఠిన శిక్షలను తగ్గించాడు. రైతు రుణాలను రద్దు చేశాడు. భూమిశిస్తును 1/3వ వంతుగా నిర్ణయించాడు. తన కుమారుడు జునాఖాన్‌ (మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌)ను దక్షిణ భారతదేశంపైకి పంపి యాదవ రాజ్యంపై విజయం సాధించాడు. క్రీ.శ.1323 నాటికి కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. కానీ క్రీ.శ.1325లో మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ తండ్రిని హత్యచేసి సింహాసనాన్ని అధిష్టించాడు. 

 

మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ (క్రీ.శ.1325-1351) 
    ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారాన్ని దక్షిణపథంపై నెలకొల్పిన ఏకైన ఢిల్లీ సుల్తాన్‌ మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌. ఢిల్లీ సుల్తానులందరిలో అత్యంత విద్యావంతుడు, ఉదార స్వభావం గల వ్యక్తిగా పేరొందిన ఇతడు తన చర్యల ద్వారా ‘పిచ్చి తుగ్లక్‌’గా పేరొందాడు. ఈయనను విరుద్ధ గుణాలు మూర్తీభవించిన వ్యక్తిగా సమకాలీన చరిత్రకారులు అభివర్ణించారు. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ అసలు పేరు జునాఖాన్‌. తండ్రి ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ పాలనా కాలంలో యాదవ, కాకతీయ రాజ్యాలపై దండెత్తి అపార ధనరాశులను కొల్లగొట్టాడు. వరంగల్‌/ఓరుగల్లును ఆక్రమించి దానికి సుల్తాన్‌పూర్‌ అని పేరు పెట్టాడు. క్రీ.శ.1325లో తండ్రిని హత్యచేయించి సుల్తాన్‌గా పాలనను ప్రారంభించాడు. అనేక విజయాలు సాధించడమే కాకుండా పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా గంగా, యమునా మైదానంలో భూమిశిస్తు పెంచడం, రాజధాని మార్పిడి, టోకెన్‌ కరెన్సీ ముద్రణ లాంటి సంస్కరణలు విఫలమవడంతో పిచ్చి తుగ్లక్‌గా పేరొందాడు.

 

గంగా - యమునా అంతర్వేదిలో భూమిశిస్తు పెంచడం
    గంగా - యమునా అంతర్వేది (దోవాబ్‌)లో సారవంతమైన భూములు ఉండటం వల్ల అక్కడ భూమిశిస్తును 1/2వ వంతుకు పెంచాడు. రాజ్య ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ అదే ఏడాది ఆ ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించడంతో రైతులు శిస్తు చెల్లించలేకపోయారు. అధికారులు ప్రజల పరిస్థితులను పట్టించుకోకుండా దౌర్జన్యంగా శిస్తు వసూలు చేశారు. ఆ తర్వాత సుల్తాన్‌ ప్రతిస్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ‘దివాన్‌-ఇ-కోహీ’ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. రైతులకు తక్కావీ రుణాలు (పంట రుణాలు) మంజూరు చేశాడు. బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చాడు. 

 

రాజధాని మార్పు  
మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ క్రీ.శ.1327లో రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి (దౌలతాబాద్‌) మార్చాడు. ఢిల్లీ వాయవ్య భారతదేశానికి దగ్గరగా ఉండటం వల్ల నిత్యం విదేశీ దండయాత్రలకు గురికావడం, దక్షిణపథంపై పట్టు సాధించడం లాంటి కారణాలతో రాజధానిని మార్చాడు. కానీ రాజధానిని మార్చే సమయంలో అతడు జారీచేసిన శాసనాలు ప్రజలకు బాధ కలిగించాయని సమకాలీన చరిత్రకారులు పేర్కొన్నారు. రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రజలందరినీ దౌలతాబాద్‌కు వెళ్లమని ఆదేశించాడని, వెళ్లనివారిని చిత్రహింసలకు గురిచేశాడని, ఫలితంగా ప్రజలు అతడిని మంచివాడు కాదని భావించినట్లు చరిత్రకారులు తెలిపారు. అనేక వ్యయప్రయాసల అనంతరం రాజధానిని దౌలతాబాద్‌కు మార్చినా కొంత కాలానికే క్రీ.శ.1335లో రాజధానిని ఢిల్లీకి మార్చాడు.

 

టోకెన్‌ కరెన్సీ ముద్రణ
    మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో తీవ్ర విమర్శలకు గురైంది ఈ నూతన కరెన్సీ ముద్రణ. ఇతడి పరిపాలనా కాలంలో వెండి కొరత ఏర్పడింది. ఢిల్లీ సుల్తాన్‌ రాజ్యంలో వెండి ‘టంకాలు’ అధికారిక నాణేలుగా చలామణీ అయ్యేవి. వెండి కొరత వల్ల సుల్తాన్‌ రాగి, తోలు నాణేలు ముద్రించాడని చరిత్రకారులు పేర్కొన్నారు. కరెన్సీ ముద్రణపై ఆంక్షలు జారీచేయకపోవడం, ప్రభుత్వమే కరెన్సీ ముద్రించాలనే షరతులు లేకపోవడంతో రాజ్యంలో నకిలీ నాణేల ముద్రణ అధికమైంది. నాడు దిల్లీలో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారిందని చరిత్రకారులు తెలిపారు. ఫలితంగా నాణేల చలామణి అధికమై ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సుల్తాన్‌ టోకెన్‌ కరెన్సీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో ప్రజలంతా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల బాధలను అర్థం చేసుకున్న సుల్తాన్‌ వారి వద్ద ఉన్న టోకెన్‌ కరెన్సీకి అసలు, నకిలీ అనే తేడా లేకుండా తన ఖజానాలోని వెండి టంకాలను మార్పిడి చేశాడు. ఫలితంగా ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. ఇలాంటి చర్యలతో మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ‘పిచ్చి తుగ్లక్‌గా’ పేరొందాడు. ఈ కరెన్సీ ముద్రణ వల్ల మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘ప్రిన్స్‌ ఆఫ్‌ మనీయర్‌’ (నాణేల యువరాజు)గా పేరొందాడు.


    మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సంస్కరణలు అనేక ఆదర్శ భావాలతో ఉండేవి. రాజ్య రక్షణ, రాజ్యం మధ్యలో రాజధాని ఉండాలనే ఆలోచనతోనే రాజధానిని మార్చాడు. దానివల్ల ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. తురుష్కుల నాగరికత, సంస్కృతి, సాంఘిక ఆలోచనా ధోరణి దక్షిణాదికి వ్యాపించింది. రెవెన్యూ సంస్కరణల ద్వారా వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాడు. ప్రత్యేక వ్యవసాయ శాఖ ‘దివాన్‌-ఇ-కోహీ’ని ఏర్పాటు చేశాడు. భూమిశిస్తు బకాయిలు వసూలు చేయడానికి సెంచూరియన్‌ అనే ప్రత్యేక అధికారులను నియమించాడు. క్రీ.శ.1351లో నాటి గుజరాత్‌ పాలకుడు ధాగి సుల్తాన్‌ను శిక్షించడానికి వెళ్లిన మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘థట్టా’ అనే ప్రాంతంలో మరణించాడు. అతడి మరణం గురించి పేర్కొంటూ ‘అతడి బాధ ప్రజలకు, ప్రజల బాధ అతడికి తప్పింది’ అని లేన్‌పూలే చరిత్రకారుడు తెలిపాడు. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ పాలనా కాలంలోనే దక్షిణ భారతదేశంలో విజయనగర (1336), బహమనీ (1347) సామ్రాజ్యాలు అవతరించాయి.

 

ఫిరోజ్‌షా తుగ్లక్‌ (క్రీ.శ.1351-1388)
    మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ మరణానంతరం అతడి సోదరుడు ఫిరోజ్‌షా తుగ్లక్‌ పరిపాలించాడు. ఇతడు వ్యవసాయరంగ అభివృద్ధికి అనేక కాలువలు నిర్మించి ‘రైతు బాంధవుడు’గా పేరొందాడు. తన ప్రధానమంత్రి ఖాన్‌-ఇ-జహాన్‌-మక్బూల్‌ సాయంతో పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేశాడు. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ చర్యల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టాడు. నీటిపారుదల వసతులు కల్పించాడు. యమునా నది నుంచి ఫిరోజాబాద్‌ వరకు, సట్లెజ్‌ నది నుంచి ఘఘ్గర్‌ వరకు, మాండవ నుంచి హిస్సార్‌ వరకు నీటిపారుదల కాలువలు ఏర్పాటు చేశాడు. ఆ కాలువలు నేటికీ పంజాబ్, హరియాణాల్లో నీటిని అందిస్తున్నాయి. సుమారు 23 రకాల పన్నులను రద్దు చేసి ముస్లిం మత సూత్రాల ప్రకారం ఖరజ్, ఖామ్స్, జకత్, జిజియా అనే నాలుగు ప్రధానమైన పన్నులను వసూలు చేశాడు. ఫిరోజాబాద్, జాన్‌పూర్, ఫతేబాద్, హిస్సార్‌ లాంటి నూతన పట్టణాలను నిర్మించాడు. పేదల సంక్షేమం కోసం ‘దివాన్‌-ఇ-ఖైరాత్‌’ అనే శాఖను, బానిసల సంక్షేమానికి ‘దివాన్‌-ఇ-బందగాని’ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. అదా, భిఖ్‌ అనే నూతన నాణేలను ప్రవేశపెట్టాడు. ఢిల్లీలో దారుల్‌-షఫా (దార్‌-ఉల్‌-షిఫా) అనే ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేశాడు. బాటసారులు, యాత్రికుల కోసం సుమారు 200 సరాయిల (విశ్రాంతి మందిరాలు)ను నిర్మించాడు.

    సమకాలీన చరిత్రకారుడైన షమ్స్‌ ఇ సిరాజ్‌ ఫిరోజ్‌షా తుగ్లక్‌ పాలనా వ్యవహారాల గురించి అనేక విషయాలు తెలిపాడు.  ఫిరోజ్‌షా తుగ్లక్‌ పరమత సహనాన్ని అనుసరించలేదు. అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, జిజియా పన్ను విధించాడు. బ్రాహ్మణులపై కూడా ఈ పన్ను విధించాడు. ఒరిస్సాలోని జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఇతడి ఆస్థానంలో బరౌనీ, షమ్స్‌ ఇ సిరాజ్, మహ్మద్‌ అఫీఫ్‌ లాంటి చరిత్రకారులు, కవులు; జలాలుద్దీన్‌-రూమీ లాంటి పండితులు ఉండేవారు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ రద్దు చేసిన ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్దారీ పద్ధతిగా ప్రవేశపెట్టాడు. సివిల్, మిలిటరీ ఉద్యోగాలను వంశపారంపర్యం చేశాడు. ముఖ్యంగా 1,80,000 మంది బానిసలను పోషించి ఖజానా ఖాళీ చేశాడని అఫీఫ్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. పెరిస్టా అనే చరిత్రకారుడి ప్రకారం ఫిరోజ్‌షా తుగ్లక్‌ 50 ఆనకట్టలు, 40 మసీదులు, 30 కళాశాలలను నిర్మించినట్లు తెలుస్తుంది. మీరట్, తోప్రా ప్రాంతాల్లో ఉన్న అశోక స్తంభాలను ఢిల్లీకి (ఫిరోజాబాద్‌) తరలించాడు. ఈ విధంగా అనేక ప్రజా సంక్షేమ చర్యలతోపాటు ప్రజా, హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ ‘ఫతూహత్‌-ఇ-ఫిరోజ్‌ షాహీ’ పేరుతో తన స్వీయచరిత్రను రాశాడు. ఇతడి అనంతరం రెండో ఘియాజుద్దీన్, అబూబకర్, మహ్మద్‌ బీన్‌ ఫిరోజ్, నాసిరుద్దీన్‌ మహ్మద్‌ తుగ్లక్‌ లాంటి పాలకులు పాలించారు. వీరు అసమర్థులు కావడంతో తుగ్లక్‌ వంశం పతనమైంది. చివరి తుగ్లక్‌ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ మహ్మద్‌ తుగ్లక్‌ పాలనా కాలంలోనే క్రీ.శ.1398-99లో తైమూర్‌ దండయాత్ర జరిగింది. క్రీ.శ.1414లో ఖిజీర్‌ఖాన్‌ నాసిరుద్దీన్‌ తుగ్లక్‌ను తొలగించి సయ్యద్‌ వంశ పాలనను ప్రారంభించాడు.

 

సయ్యద్‌ వంశం
    క్రీ.శ.1414-1451 మధ్య సయ్యద్‌ వంశీయులు ఢిల్లీ సుల్తానత్‌ రాజ్యాన్ని పరిపాలించారు. తైమూర్‌ ప్రతినిధి ఖిజీర్‌ ఖాన్‌ (ఖైదర్‌ ఖాన్‌) క్రీ.శ.1414లో సయ్యద్‌ వంశ పాలనను ప్రారంభించాడు. అతడి అనంతరం ముబారక్‌ షా, మహ్మద్‌ షా, అల్లావుద్దీన్‌ ఆలంషా పరిపాలించారు. ఖిజీర్‌ ఖాన్‌ కాలంలోనే గుజరాత్, మాళ్వా, జాన్‌పూర్‌ పాలకులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ముబారక్‌ షా కులీనుల చేతిలో హత్యకు గురయ్యాడు. చివరి సయ్యద్‌ వంశ పాలకుడైన అల్లావుద్దీన్‌ ఆలమ్‌షాను తొలగించి బహులాల్‌ లోడీ క్రీ.శ.1451లో లోడీ వంశ పాలనను ప్రారంభించాడు.

 

లోడీ వంశం
    క్రీ.శ.1451-1526 మధ్య ఢిల్లీని పాలించిన చివరి సుల్తానత్‌ వంశం లోడీ వంశం. లోడీ వంశపాలన ప్రారంభకుడు బహాలూల్‌ లోడీ. అతడి అనంతరం సికిందర్‌ లోడీ, ఇబ్రహీం లోడీ పరిపాలించారు. బహాలూల్‌ లోడీ వ్యక్తిత్వం గురించి అబ్దుల్లా అనే కవి ‘తారిఖ్‌-ఇ-దావుదీ’ అనే గ్రంథంలో వివరించాడు. అతడి మరణానంతరం కుమారుడైన నిజాంఖాన్‌ ‘సికిందర్‌ షా’ (సికిందర్‌ లోడీ) అనే బిరుదుతో రాజ్యపాలనకు వచ్చాడు. లోడీ వంశ పాలకుల్లో గొప్పవాడిగా పేరొందాడు. ఇతడు బిహార్, గ్వాలియర్‌ ప్రాంతాలపై విజయం సాధించాడు. ఆగ్రా నగరాన్ని నిర్మించి దాన్ని నూతన రాజధానిగా చేశాడు. వ్యవసాయాభివృద్ధికి చర్యలు చేపట్టాడు. పన్ను భారాన్ని తగ్గించాడు. ఇతడి ఆస్థాన కవి మియాన్‌ భువా ‘తిత్భీ సికిందరీ’ అనే గ్రంథాన్ని పారశీక భాషలోకి తర్జుమా చేశాడు. చివరి లోడీ వంశ పాలకుడు ఇబ్రహీం లోడీని క్రీ.శ.1526లో బాబర్‌ మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యం అంతరించింది.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మొగల్‌ యుగ విశేషాలు

భారతదేశాన్ని క్రీ.శ. 1526 నుంచి క్రీ.శ. 1858 వరకు మొగలులు పాలించారు. బాబర్‌ నుంచి ఔరంగజేబ్‌ వరకూ మొగల్‌ పాలన గొప్పగా సాగిందని చరిత్రకారులు కొనియాడారు. మొగల్‌ పాలనను ప్రారంభించింది సూర్‌ వంశానికి చెందిన షేర్షా. అతడు ప్రవేశపెట్టిన పాలనా,   రెవెన్యూ, ఆర్థిక సంస్కరణలనే అక్బర్‌ కొద్ది మార్పులతో కొనసాగించాడు. అందుకే షేర్షాను అక్బర్‌కు మార్గదర్శకుడిగా పేర్కొంటారు. 


పరిపాలనా సంస్కరణలు

కేంద్రపాలన: మొగల్‌ చక్రవర్తులు కేంద్ర, రాష్ట్ర, స్థానిక పాలనా విధానాల్లో అనేక మార్పులు ప్రవేశపెట్టి, సమర్థవంతమైన పాలనను అందించారు. కేంద్రపాలనలో చక్రవర్తే అత్యున్నతాధికారి. పౌరపాలన మొత్తం అతడి చుట్టే కేంద్రీకృతమై ఉండేది. మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో చక్రవర్తి పాలనను కొనసాగించేవాడు. షేర్షా పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని సర్కారులు - పరగణాలు - గ్రామాలుగా విభజిస్తే, కొద్దిమార్పులతో అక్బర్‌ తన సామ్రాజ్యాన్ని సుబాలు - సర్కారులు - పరగణాలు - గ్రామాలు అనే భాగాలుగా ఏర్పాటు చేశాడు. కేంద్రమంత్రి మండలిలో వకీల్‌ (ప్రధానమంత్రి), వజీర్‌ (ఆర్థికమంత్రి), మీర్‌భక్షీ (యుద్ధమంత్రి), మీర్‌-ఇ-సదర్‌ (దానధర్మాల మంత్రి), ప్రధాన ఖాజీ (న్యాయశాఖామంత్రి) పరిపాలనలో చక్రవర్తికి సహాయపడేవారు.  
 

రాష్ట్ర పాలన: షేర్షా సర్కారులు అనే రాష్ట్రాలను ఏర్పాటు చేయగా, అక్బర్‌ ‘సుబాలు’ అనే ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు. సుబా అధిపతి సుబేదార్‌. వీరి పాలన కూడా కేంద్ర పాలనను పోలి ఉండేది. సుబేదార్‌కు రాష్ట్ర పాలనలో తోడ్పడేందుకు ఫొతేదార్, పౌజ్‌దార్‌ లాంటి అధికారులు ఉండేవారు. అమీన్‌ను రాష్ట్ర రెవెన్యూ అధికారిగా, నేటి కలెక్టర్‌తో పోల్చవచ్చు. ఫొతేదార్‌ రాష్ట్ర కోశాధికారి. రాష్ట్రంలో సైనిక వ్యవహారాలు చూడటానికి ‘భక్షీ’ అనే అధికారిని నియమించారు. రాష్ట్ర గవర్నర్‌లను సిఫా-సలార్‌ అనేవారు. తర్వాతి కాలంలో సిఫా-సలార్‌ పదవి సుబేదార్‌ లేదా నజీమ్‌గా మారింది. వీరితో పాటు కాజీ, సాదర్, ముతాసిబ్‌ లాంటి ఇతర అధికారులు కూడా రాష్ట్ర పాలనలో సాయపడేవారు.

స్థానిక పాలన
మొగలుల స్థానిక పాలనలో సర్కారులు - పరగణాలు - గ్రామాలతోపాటు మహల్స్, ఠాణాలు, పట్టణాలు, ఓడరేవులు లాంటి ఇతర పాలనా విభాగాలు కూడా ఉండేవి. సర్కారు అధిపతిని పౌజ్‌దార్‌ అని, పరగణా అధిపతిని షిక్‌దార్‌ అని పిలిచేవారు. గ్రామపాలనలో పట్వారీ, చౌకీదార్, ముఖద్దమ్‌ లాంటి ఉద్యోగులు ఉండేవారు. ఇలా మొగలులు తమ కాలంలో కేంద్రం నుంచి గ్రామం వరకు సమర్థవంతమైన పాలన అందించారు.

రెవెన్యూ పాలన
మొగలుల కాలం నాటి రెవెన్యూ విధానాల్లో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. భూములను సర్వే చేయించడం, విభజించడం, శిస్తు నిర్ణయించడం లాంటి రెవెన్యూ విధానాలను అనుసరించారు. కేంద్రంలో వజీర్, సుబాలలో (రాష్ట్రాలు) దివాన్‌లు, అమీన్‌లు, సర్కారులు; పరగణాల్లో కనుంగోలు రెవెన్యూ విధులను నిర్వహించేవారు. షేర్షా భూములను కొలిపించి ఉత్తమ - మధ్యమ - అధమ అనే మూడు రకాలుగా విభజించాడు. అక్బర్‌ కాలంలో భూములను పోలజ్, పరౌటీ, చాచర్, బంజర్‌ అనే నాలుగు రకాలుగా విభజించారు. 
పండిన పంటలో 1/3 వంతు భూమి శిస్తుగా వసూలుచేసేవారు. అక్బర్‌ కాలంలో బందోబస్తు రెవెన్యూ విధానం (రైత్వారీ పద్ధతి) ప్రవేశపెట్టారు. నాటి భూమి శిస్తు విధానాన్ని జబ్తి (జాబితా) పద్ధతిగా పేర్కొంటారు. ఈ పద్ధతిలో ప్రతి 10 సంవత్సరాల సగటు పంటను లెక్కించి భూమి శిస్తు విధిస్తారు. అందుకే దీన్ని దహ్‌సాలా పద్ధతి అని కూడా పిలిచేవారు. రైతులు భూమి శిస్తును ధన, ధాన్య రూపంలో చెల్లించడానికి అనుమతించారు.

న్యాయపాలన 
మొగలుల కాలంలో చక్రవర్తే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. ఫర్మానాలు జారీ చేయడం, మరణ శిక్షలు విధించడం లాంటి విశేషాధికారాలు కూడా ఉండేవి. చక్రవర్తికి న్యాయపాలనలో సహాయపడటానికి ‘ఖాజీ’లు అనే న్యాయశాఖామంత్రులు, ఇతర ఉద్యోగులు ఉండేవారు. మహ్మదీయ మతానికి చెందిన వారైనా మొగలులు ఇతర మతాల విశ్వాసాలు, మత గ్రంథాల ప్రకారం తీర్పులు చెప్పేవారు. ముఖ్యంగా ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించడానికి అక్బర్‌ తన కాలంలో ఘరోకా-ఇ-దర్శన్‌ అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. జహంగీర్‌ ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు. సుబాలు, సర్కారులు, పరగణాల్లో కూడా ప్రత్యేక న్యాయాధికారులను నియమించి మొగలులు ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించారు.

సైనిక పాలన
మొగలుల కాలం నాటి సైనిక పద్ధతిని మున్సబ్‌దారీ పద్ధతిగా పేర్కొంటారు. ఈ విధానాన్ని అక్బర్‌ కాలంలో ప్రవేశపెట్టారు. సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో మున్సబ్‌దారులను నియమించారు. వాళ్లు సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో చక్రవర్తికి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మున్సబ్‌దారులకు వంశపారంపర్య హక్కులు లేవు. తరచూ బదిలీ అయ్యేవారు. మున్సబ్‌దార్‌ అంటే ఒక శ్రేణికి అధికారి అని అర్థం. 
అబుల్‌ ఫజల్‌ రచనల ప్రకారం నాటి మున్సబ్‌దారుల్లో సుమారు 33 తరగతులు ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 10 గుర్రాల నుంచి అధికంగా 10 వేల గుర్రాలను పోషించే 33 తరగతుల మున్సబ్‌దారులుండేవారని అబుల్‌ ఫజల్‌ రాశాడు. నాటి మున్సబ్‌దారీ విధానంలో జాత్‌ (హోదా), సవారీ (అదనపు అలవెన్స్‌) అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉండేవి. జహంగీర్‌ కాలంలో, అనంతరం షాజహాన్‌ కాలంలో మున్సబ్‌దారీ విధానంలో కొన్ని మార్పులు చేశారు. అనంతర కాలంలో మున్సబ్‌దారుల స్థానంలో జాగీర్దారులను నియమించారు. మరికొన్నిచోట్ల మున్సబ్‌దారులకే జాగీరులను కేటాయించారు.  అయితే మున్సబ్‌దారులందరూ జాగీర్దారులు కాదు. 

సామాజిక వ్యవస్థ  
మొగలుల కాలంనాటి సామాజిక వ్యవస్థ భూస్వామ్య లక్షణాలను కలిగి ఉండేదని ఆర్‌.సి. మజుందార్, రాయ్‌చౌదరి లాంటి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నాటి సమాజంలో ప్రభు, మధ్యతరగతి, సామాన్య అనే మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. ప్రభు వర్గంలో చక్రవర్తి, అంతఃపుర ఉద్యోగ బృందం; మధ్యతరగతి వర్గంలో జమీందారులు, జాగీర్దారులు, వృత్తి నిపుణులు ఉండేవారు. రైతులు, కూలీలు, కౌలు రైతులు, సేద్య బానిసలు లాంటి పేదవారు సామాన్య వర్గంలో ఉండేవారు. నాటి సామాజిక వ్యవస్థలో రైతులు, కూలీలు తీవ్రమైన దోపిడీకి గురయ్యేవారు. సమాజంలో బహుభార్యత్వం, వ్యభిచారం, సతీసహగమనం, పరదా పద్ధతి లాంటి సాంఘిక దురాచారాలు అధికంగా ఉండేవి. స్త్రీ విద్య అందుబాటులో లేదు.

 

సాంస్కృతిక వికాసం
మొగలులు తమ కాలంలో వాస్తు, కళ, విద్యా సారస్వతాల అభివృద్ధి కోసం విశేషంగా కృషిచేశారు. ముస్లిం పాలకులైనా మొగలుల్లో ఔరంగజేబ్‌ మినహా అంతా పరమత సహనం పాటించారు. లౌకిక రాజ్యంగా ఉన్న భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఔరంగజేబ్‌ చేసిన ప్రయత్నాల వల్లే మొగల్‌ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. మొగలులు దేశవ్యాప్తంగా మదర్సాలు, పాఠశాలలను స్థాపించారు. కానీ స్త్రీ విద్యాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. చక్రవర్తులు తమ ఆస్థానంలో అనేకమంది కవి పండితులను పోషించారు. రాజభాష అయిన పారశీకంతోపాటు, హిందీ, సంస్కృతం, మరాఠీ లాంటి ప్రాంతీయ భాషల్లో కూడా చక్కటి సాహిత్య సృష్టి జరిగింది. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రారంభమైన ఇండో-ఇస్లామిక్‌ మిశ్రమ సంస్కృతి మొగలుల కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, వాస్తు రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బాబర్‌ నుంచి షాజహాన్‌ వరకు వాస్తురంగంలో ఎక్కువ శ్రద్ధ చూపించారు.ఉద్యానవనాలు, మసీదులు, కోటలు, దర్గాలు, రాజప్రసాదాలు లాంటి నిర్మాణాల్లో పర్షియన్‌ - భారతీయ వాస్తు విధానాలను అనుసరించారు. బాబర్‌తో ప్రారంభమైన ఉద్యానవనాల నిర్మాణం జహంగీర్, షాజహాన్‌ల కాలంలో ఉన్నత దశకు చేరింది. షాలిమార్‌ గార్డెన్స్, మొగల్‌ గార్డెన్స్‌ ప్రఖ్యాతి గాంచాయి. అక్బర్‌ కాలంలో ఫతేపూర్‌ సిక్రీలో నిర్మించిన కట్టడాలు, షాజహాన్‌ కాలంలో నిర్మించిన ఎర్రకోట, తాజ్‌మహల్‌ నిర్మాణాలు మొగలుల వాస్తు కళాపోషణకు దర్పణాలు. అలహాబాద్‌లో అక్బర్‌ పూర్తిగా హిందూ పద్ధతిలో నిర్మించిన 40 స్తంభాల భవనం చాలా ప్రసిద్ధిచెందింది. సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన తాన్‌సేన్, బైజుబావరా, బాజ్‌బహదూర్, రూపవతి లాంటి వారిని మొగలులు ఆదరించారు. చిత్రలేఖనంలో చక్రవర్తులు సైతం ప్రావీణ్యం పొందారు. జహంగీర్‌ సూక్ష్మ చిత్రలేఖనంలో నిష్ణాతుడు. హుమయూన్‌ తన ఆస్థానంలో పర్షియన్‌ చిత్రకారులను పోషించాడు. అక్బర్‌ కాలంలో ఖ్వాజా అబ్దుల్‌ సమద్‌ నాయకత్వంలో ప్రత్యేక చిత్రలేఖన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈవిధంగా మొగలుల కాలంలో సాహిత్యం, వాస్తు కళలు వర్ధిల్లాయి.

 

ఆర్థిక వ్యవస్థ
మొగలుల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని నూతన మార్పులు సంభవించాయి. పాలకులు వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల రంగాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. అందుకే, అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ ఆర్థిక స్థితులను మెరుగుపరచడానికి మొగల్‌ చక్రవర్తులు వ్యవసాయరంగ అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధవహించారు. రాజ్యంలో భూమి మొత్తం చక్రవర్తిదే అయినప్పటికీ వాస్తవ రూపంలో దాన్ని అనేకమంది అధీనంలో ఉంచారు. భూములకు సంబంధించి ఖుద్‌కాస్త్‌లు, పాహీలు, ముజారియమ్‌లు లాంటి అనేక రకాల పేర్లు వాడుకలో ఉండేవి. రాజ్యానికి లేదా చక్రవర్తికి చెందిన సొంత భూములను ఖలీఫా భూములని, రైతులకు చెందిన భూములను ఖుద్‌కాస్త్‌ భూములని పిలిచేవారు. పాహీలు, ముజారియమ్‌లను కౌలు రైతుల భూములుగా పరిగణించేవారు. జమీందారుల అధీనంలో కూడా కొన్ని భూములు ఉండేవి. నాటి జమీందారుల్లో  స్వయం ప్రతిపత్తి ఉన్న జమీందారులు, మధ్యంతరస్థాయి జమీందారులు, ప్రాథమికస్థాయి జమీందారులు అనే మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. ఈ విధంగా మొగలుల కాలంలో వ్యవసాయ రంగంలో కొన్ని మౌలిక మార్పులు ప్రవేశపెట్టారు. రైతాంగ అభివృద్ధికి, నీటిపారుదల సౌకర్యాల కల్పనకు, శిస్తు విధింపునకు పాలకులు కృషి చేశారు. అయితే, నాటి రైతులు జమీందారుల దౌర్జన్యానికి గురయ్యేవారు. అధిక పన్నులతో సామాన్యులు బాధపడేవారు.
                     నాటి వర్తక, వాణిజ్యాలను జాతీయ, అంతర్జాతీయ వర్తకాలుగా వర్గీకరించవచ్చు. దేశంలో జరిగే జాతీయ వర్తకంతోపాటు, పశ్చిమ ఆగ్నేయాసియా దేశాలతో జరిగే విదేశీ వర్తకం కూడా బాగా అభివృద్ధి చెందింది. భారతీయ నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు పాశ్చాత్య దేశాలను ఆకర్షించాయి. లాహోర్, ముల్తాన్‌ గొప్ప రవాణా కేంద్రాలుగా రూపొందాయి. 
విశాలమైన తీరప్రాంతం సముద్ర వ్యాపారానికి తోడ్పడింది. పట్టు, నూలు వస్త్రాలు, ఆయుధాలు, వజ్రాలు, చక్కెర లాంటివి ఎక్కువగా విదేశాలకు ఎగుమతయ్యేవి. బంగారం, కర్పూరం, విలాస వస్తువులను దిగుమతి చేసుకునేవారు. భారతదేశంలో పట్టణ కేంద్రాలు అధికంగా వృద్ధి చెందటం కూడా పట్టణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కారణమైంది. చిన్నచిన్న పట్టణాలు, సరాయిలు, కాస్బాలు కూడా స్థానిక మార్కెట్లుగా మార్పు చెందడం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు లాంటి కారణాల వల్ల వర్తక, వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి.
                     నాడు గ్రామీణ చేతివృత్తులతోపాటు కుటీర పరిశ్రమలు, నూలు, పట్టు, వజ్రాలు, ఉన్ని లాంటి భారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. గ్రామీణ ప్రాంతాల్లో హస్తకళాకారుడి కుటుంబం ఉత్పత్తికి ప్రథమస్థానంగా ఉండేది. వడ్రంగం, నేత, అద్దకం, కమ్మరం లాంటి గ్రామీణ చేతివృత్తులవారు అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసి, వివిధ వర్గాల అవసరాలు తీర్చేవారు. పత్తి, నూనె గింజలు, నీలిమందు లాంటి ఉత్పత్తులు గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డాయి. కుమ్మరం, తోలు ఉత్పత్తులు పెరిగాయి. పాదరక్షలు, తోలు సంచుల తయారీ లాంటి కుటీర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేశాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన భారీ పట్టణ పరిశ్రమలు కూడా వృద్ధి చెందాయి. బెంగాల్, గుజరాత్‌ ప్రాంతాల్లో జౌళి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. బెంగాల్, కోరమాండల్‌ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే లాంగ్‌క్లాత్, మస్లిన్‌ వస్త్రాలకు ఆసియా మార్కెట్లలో అధిక గిరాకీ ఉండేది. ఇత్తడి, రాగి, వజ్రాల పరిశ్రమలు వృద్ధి చెందాయి. మొగలుల కాలంలో పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రాంతాలు చక్కెర పరిశ్రమలకు, ఢిల్లీ రాగి పరిశ్రమకు, బెనారస్‌ ఇత్తడి పరిశ్రమకు; ఢాకా, అహ్మదాబాద్, జాన్‌పూర్‌ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధికెక్కాయి. బెర్నియార్‌ అనే ఫ్రెంచి యాత్రికుడు ‘పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికే నిధి’ అని పేర్కొన్నాడు.

 

మొగల్‌ సామ్రాజ్యం - రాజకీయ చరిత్ర

బాబర్‌ క్రీ.శ.1526 లో మొగల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అనంతరం అతడి కుమారుడైన హుమయూన్, మనవడైన అక్బర్‌ చక్రవర్తి పరిపాలించారు. క్రీ.శ.1605లో అక్బర్‌ మరణానంతరం అతడి కొడుకు జహంగీర్, మనవడు షాజహాన్‌లు రాజ్యపాలన చేశారు.


జహంగీర్‌ (1606 - 27)
    జహంగీర్‌ అసలు పేరు సలీం. అక్బర్, మర్యంఉజ్‌ జమానీ (జోధాబాయ్‌) దంపతులకు అజ్మీర్‌లో జన్మించాడు. అక్బర్‌ ఇతడ్ని ముద్దుగా షేక్‌బాబా అని పిలిచేవాడు. జహంగీర్‌ గురువు అబ్దుల్‌-రహీం-ఖానీ-ఖానన్‌. జహంగీర్‌ సోదరులు మురాద్, డానియెల్‌. వీరు అక్బర్‌ కంటే ముందే చనిపోయారు. సలీం తన తండ్రి పాలనాకాలంలోనే తిరుగుబాటు చేశాడు. కానీ అక్బర్‌ అతడ్ని శిక్షించి, అనంతరం బెంగాల్‌ గవర్నర్‌గా నియమించాడు. తండ్రికి, తనకు మధ్య రాజీ కోసం ప్రయత్నించిన అబుల్‌ ఫజల్‌ను జహంగీర్‌ బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో చంపించాడు. క్రీ.శ.1605లో అక్బర్‌ మరణానంతరం జహంగీర్‌ ఆగ్రా కోటలో చక్రవర్తిగా పట్టాభిషేకం జరుపుకున్నాడు. అతడి భార్యలు మన్‌బాయ్‌ (షాబేగం), జగత్‌ గోసైన్, నూర్జహాన్‌. జహంగీర్‌ 1611లో నూర్జహాన్‌ను వివాహం చేసుకున్నాక మొగల్‌ సామ్రాజ్యంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చక్రవర్తి అయ్యాక జహంగీర్‌ ప్రజా సంక్షేమం కోసం 12 రాజశాసనాలను జారీ చేశాడు. కానీ వాటిని సమర్థవంతంగా అమలు చేయలేక పోయాడు. ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేశాడు. జహంగీర్‌ కుమారుడైన ఖుస్రూ 1606లో తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఖుస్రూకి ఆశ్రయం ఇచ్చిన సిక్కు గురువు అర్జున్‌ సింగ్‌ను జహంగీర్‌ చంపించాడు. ఫలితంగా సిక్కులతో మొగలులకు ఘర్షణలు ప్రారంభమయ్యాయి.


రాజ్య విస్తరణ
    జహంగీర్‌ బెంగాల్, మేవాడ్, కాంగ్రా, అహ్మద్‌నగర్‌ లాంటి రాజ్యాలపై దండయాత్రలు చేసి రాజ్యాన్ని విస్తరించాడు. బెంగాల్‌ పాలకుడైన ఉస్మాన్‌ఖాన్‌ (ఆఫ్గన్‌)ను ఓడించి, ఇస్లాంఖాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. అనంతరం ఖాసింఖాన్, ఇబ్రహీం ఖాన్‌లు బెంగాల్‌ గవర్నర్లుగా పనిచేశారు. 
* జహంగీర్‌ సాధించిన విజయాల్లో మేవాడ్‌ను చేజిక్కించుకోవడం అత్యుత్తమమైంది. మేవాడ్‌ (మేవార్‌) పాలకుడైన రాణా అమర్‌సింగ్‌పై 1605, 1608, 1615 సంవత్సరాల్లో దండెత్తి, చివరికి 1615 లో సంధికి ఒప్పించాడు. పంజాబ్‌ పర్వత ప్రాంతాల్లో ఉన్న కాంగ్రా ప్రాంతాన్ని సైతం జయించాడు. 
* చాంద్‌బీబీ మరణానంతరం అహ్మద్‌నగర్‌ను మాలిక్‌అంబర్‌ పాలించేవాడు. జహంగీర్‌ ఈ ప్రాంతంపై అనేకసార్లు దండయాత్ర చేశాడు. సుమారు ఏడుసార్లు మాలిక్‌ అంబర్‌ మొగల్‌ దాడులను తిప్పికొట్టాడు. చివరికి జహంగీర్‌ ఆ ప్రాంతంపై ఆధిపత్యం సాధించి, ‘దక్షిణ సుబా’ను ఏర్పాటు చేశాడు. కానీ జహంగీర్‌ పరిపాలనా కాలమంతా తిరుగుబాట్లతోనే సరిపోయింది. మొదట ఖుస్రూ, అనంతరం జుంటాముఠా, ఖుర్రం, మహబత్‌ఖాన్‌ లాంటివారు తిరుగుబాట్లు చేశారు. ఈ విధమైన అంతఃకలహాల వల్లే మొగలులు 1622 లో కాందహార్‌ను శాశ్వతంగా కోల్పోయారు. నాటి పర్షియా రాజు షా అబ్బాస్‌ కాందహార్‌ను ఆక్రమించాడు. 
* జహంగీర్‌ కాలంలో ఇంకా అనేక ముఖ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1608లో విలియం హాకిన్స్, 1615 లో సర్‌ థామస్‌ రో లాంటి ఆంగ్లేయులు ఈయన ఆస్థానాన్ని సందర్శించారు. జహంగీర్‌ అనుమతితోనే ఆంగ్లేయులు 1616 లో సూరత్‌లో తమ తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేశారు. 
* ఇతడి కాలంలో 1616లో ‘బొబ్బల ప్లేగు’ అనే వ్యాధి వ్యాపించింది. 
* మహబత్‌ఖాన్‌ అనే సేనాని జహంగీర్, నూర్జహాన్‌లను బంధించి, 1625 లో వందరోజుల పాలన చేశాడు. చివరికి 1628 లో ఖుర్రం (షాజహాన్‌) అందరినీ ఓడించి మొగల్‌ చక్రవర్తి అయ్యాడు. దీంతో జహంగీర్‌ పాలన అంతమయ్యింది.
* జహంగీర్‌ గొప్ప విజేత, పరిపాలనాదక్షుడే కాక గొప్ప కళాభిమాని. అనేకమంది కవి పండితులను, కళాకారులను పోషించాడు. ఈయన సూక్ష్మచిత్రలేఖనంలో గొప్ప నిష్ణాతుడు. ఇతడి ఆస్థానంలో బిషన్‌దాస్, మనోహర్‌ గోవర్ధన్‌ లాంటి ప్రసిద్ధ చిత్రకారులు ఉండేవారు. జహంగీర్‌ తుజ్‌కీ-ఇ-జహంగిరీ పేరుతో స్వీయచరిత్రను రాశాడు. తన తండ్రి అక్బర్‌ సమాధిని సికిందర్‌ (ఆగ్రా)లో నిర్మించాడు. కశ్మీర్‌ ఉద్యానవనాలు (షాలిమర్‌ ఉద్యానవనాలు) నిర్మించింది ఇతడే. ఈయన కాలంలో నిర్మించిన ఇతిముద్దౌలా సమాధి, జహంగీర్‌ మహల్‌ (ఆగ్రా) గొప్ప కట్టడాలుగా పేరుగాంచాయి.


నూర్జహాన్‌
    మొగల్‌ సామ్రాజ్యంలో ప్రధానపాత్ర పోషించిన వనిత నూర్జహాన్‌. ఈమె అసలు పేరు మెహరున్నీసా. మొదటి భర్త షేర్‌ అఫ్గాన్‌ ద్వారా లాడ్లీబేగం అనే కుమార్తెకు జన్మనిచ్చింది. నౌరోజ్‌ పండుగలో ఈమెను చూసిన జహంగీర్‌ వివాహం చేసుకోవాలనుకున్నాడు.1611లో అఫ్గాన్‌ మరణించాక వీరి పెళ్లి జరిగింది. మెహరున్నీసాను జహంగీర్‌ నూర్‌మహర్‌ (ఇంటి వెలుగు), నూర్జహాన్‌ (ప్రపంచ వెలుగు) అని ప్రేమగా పిలుచుకునేవాడు. వీరి వివాహం మొగల్‌ సామ్రాజ్యంలో పెను మార్పులకు కారణమైంది. గొప్ప విద్యావంతురాలు, మేధావి అయిన నూర్జహాన్‌కు అధికార దాహం కూడా ఎక్కువే. జహంగీర్‌తో వివాహం అనంతరం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తన తండ్రి ఘియాస్‌బేగ్‌ను, సోదరుడు అబుల్‌ హసన్‌ (ఆసఫ్‌ఖాన్‌)ను ఉన్నత పదవుల్లో నియమించింది. 
* తన అనుచరులందరితో ‘నూర్జహాన్‌ జుంఠా’ (జుంటాముఠా)ను ఏర్పాటు చేసింది. రాజ్యపాలనలో సర్వాధికారాలు చెలాయించేది. నాణేలపై కూడా నూర్జహాన్‌ తన పేరును ముద్రించుకుంది. తన కుమార్తె లాడ్లీబేగంను జహంగీర్‌ చిన్న కుమారుడు షహ్రియార్‌కిచ్చి వివాహం చేసి, అతడ్ని చక్రవర్తిని చేయాలని ప్రయత్నించింది. ఫలితంగా అప్పటివరకు జుంటాముఠా సభ్యుడిగా ఉన్న జహంగీర్‌ పెద్ద కుమారుడు ఖుర్రం (షాజహాన్‌) తిరుగుబాటు చేశాడు. తన భర్త జహంగీర్‌ సమాధిని లాహోర్‌లో నిర్మించింది. తండ్రి జ్ఞాపకార్థం ఇతిముద్దౌలా పేరుతో సమాధిని కట్టించింది. ఇదే షాజహాన్‌ నిర్మించిన తాజ్‌మహల్‌కు నమూనాగా పేరొందింది. 


షాజహాన్‌ (1628-58)
    జహంగీర్‌ పెద్ద కుమారుడు షాజహాన్‌. ఇతడి అసలు పేరు ఖుర్రం. తండ్రి పాలనాకాలంలో ఇతడు అనేక దండయాత్రల్లో పాల్గొన్నాడు. నూర్జహాన్‌ జుంటాముఠాలో సభ్యుడు. నూర్జహాన్‌ తన అల్లుడైన షహ్రియార్‌ను చక్రవర్తిని చేయడానికి ప్రయత్నించడంతో ఖుర్రం తిరుగుబాటు చేశాడు. 1628 నాటికి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. షాజహాన్‌ గొప్ప విజేత, పరిపాలనా దక్షుడు, సారస్వత కళాభిమాని. గొప్ప భవన నిర్మాత. ఇతడి పాలనా కాలాన్ని చరిత్రకారులు స్వర్ణయుగంగా పేర్కొంటారు.

 

మొగలుల సాహితీసేవ
    మొగలుల కాలంలో ఆస్థాన చరిత్రలతోపాటు అనువాదానికి కూడా ప్రాధాన్యం లభించింది. అక్బర్‌ మక్తబ్‌ ఖానా పేరుతో అనువాద విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కాలంలో హిందీ సాహిత్యం కూడా వికసించింది. తులసీదాస్‌ రచించిన రామ్‌ చరిత్‌ మానస్‌ ఉత్తర భారతదేశంలో ఆరాధనీయ గ్రంథమైంది. షాజహాన్‌ పెద్ద కుమారుడు దారాషికో హిందూ మహ్మదీయ మతాల సారాన్ని  మజ్‌ మాఉల్‌బహ్రెయిన్‌ పేరుతో గ్రంథస్థం చేయడం విశేషం.

ఫుతూహత్‌-ఎ-ఆలంగీరి: దీన్ని రాసింది ఈసర్‌ దాస్‌ నాగర్‌. ఇతడు ఔరంగజేబ్‌ ప్రతినిధిగా జోధ్‌పూర్‌లో పనిచేశాడు. ఔరంగజేబ్‌ మొదటి 34 ఏళ్ల పాలనా కాలపు విశేషాలు ఉన్న ఈ పుస్తకం ఆ కాలపు మొగల్, రాజపుత్రుల సంబంధాల గురించి ప్రధానంగా సాగింది.

 

నుష్కా-ఎ-దిల్‌కుషా: ఇది కూడా ఔరంగజేబ్‌ చరిత్రను తెలిపే రచనే. భీమ్‌సేన్‌ దీని రచయిత. ఇతడు మొగల్‌ మన్సబ్‌దారు దల్‌పత్‌ రావ్‌ బుందేలా దగ్గర పేష్కారుగా పనిచేశాడు. క్రీ.శ.1700 నుంచి ఔరంగజేబ్‌ సేనలు మహారాష్ట్రలో చేసిన పోరాటాల కథనం ఇందులో ప్రధానం. సమకాలీన అధికారుల అవినీతి, మొగల్‌ సేనల దాడుల వల్ల మరాఠా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ‘నుష్కాఎదిల్‌ కుషా’లో వెల్లడించాడు. అయితే ఇది కూడా సత్యాన్ని పాక్షికంగానే తెలుపుతుంది. 

 

మాసీర్‌-ఎ-ఆలంగీరి: ఔరంగజేబ్‌ 40 ఏళ్ల పాలనను సంక్షిప్తంగా అందించే ఈ పుస్తకాన్ని రాసింది మహమ్మద్‌ సాకి ముస్తాయిద్‌ ఖాన్‌. ఔరంగజేబ్‌ దండయాత్రలు, అధికారుల నియామకం, బదిలీల గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి. దీన్ని సర్‌ జదునాథ్‌ సర్కార్‌ ‘‘మొగలుల రాజపత్రం’’గా పేర్కొన్నారు. ఔరంగజేబ్‌ గురించి వివరించే మరో గ్రంథం సుజన్‌ రావ్‌ ఖత్రీ రాసిన ‘ఖులాసత్‌ఉత్‌తవారిఖ్‌’.


అనువాదాలు 

రజ్మ్‌ నామా: అంటే యుద్ధాల పుస్తకం అని అర్థం. ఇది మహాభారతానికి పర్షియా అనువాదం (తర్జుమాఎమహాభారత్‌). అనువాద బృందానికి అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూనీ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాడు. అనువాదం పూర్తయ్యాక అక్బర్‌ దీనికి చిత్రాలు కూడా గీయించాడు.

* రామాయణాన్ని అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూని, అధర్వణ వేదాన్ని హాజీ ఇబ్రహీం సర్హిందీ, లీలావతిని (గణితశాస్త్ర పుస్తకం) పైజీ, తుజుక్‌ఎబాబరీని అబ్దుల్‌ రహీం ఖాన్‌ఎఖానన్‌ పర్షియా భాషలోకి అనువదించారు. ఇవే కాకుండా రాజాస్థానంలో గజళ్లు, ఖసీదాలు తదితర కవితా ప్రక్రియలు వికసించాయి.
అక్బర్‌ కాలంలో హిందీ సాహిత్యం కూడా ఆదరణ పొందింది. అబ్దుల్‌ రహీం ఖాన్‌ఎఖానన్‌ దోహాలనే ద్విపదలను రచించాడు. నరహరి అనే పండితుడికి అక్బర్‌ ‘మహాపాత్ర్‌’ అనే బిరుదునిచ్చాడు. ప్రసిద్ధ హిందీ కవులకు ‘కవిరాయ్‌’ అనే బిరుదును ఇచ్చి గౌరవించేవారు. 
* బీర్బల్‌కు (అసలు పేరు మహేశ్‌ దాస్‌) అక్బర్‌ కవి ప్రియ అనే బిరుదు ఇచ్చాడు. రస్‌ఖాన్‌ ‘ప్రేమ్‌ వార్తికా’ అనే హిందీ కావ్యం రచించాడు. ఇది కృష్ణభక్తికి సంబంధించింది. తులసీదాస్‌ విరచిత ‘రామ్‌ చరిత్‌ మానస్‌’ ఉత్తర భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. దీన్ని ‘‘వంద మిలియన్ల హిందూస్థాన్‌ ప్రజల పాలిటి బైబిల్‌’’ అని జార్జి గ్రియర్సన్‌ ప్రశంసించాడు.


అమీర్‌ ఖుస్రూ 

కవి, చరిత్రకారుడు, సంగీత విద్వాంసుడైన అమీర్‌ ఖుస్రూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పటియాలిలో క్రీ.శ.1252లో జన్మించాడు. బాల్బన్‌ మొదలు ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ వరకు వివిధ ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలో ఉన్నాడు. పర్షియన్, హిందీ, ఉర్దూ భాషల్లో ఖుస్రూ రచనలు సాగాయి. ఈయన ఢిల్లీలోని ప్రసిద్ధ చిష్తీ సాధువు నిజాముద్దీన్‌ ఔలియా శిష్యుడు. అమీర్‌ ఖుస్రూ బిరుదు ‘‘తూతీఎహింద్‌’’  (భారతదేశపు చిలుక). అమీర్‌ ఖుస్రూ రచనా శైలిని ‘సబాక్‌ ఎ హింద్‌’ అంటారు.

* అమీర్‌ఖుస్రూ మొదటి చరిత్ర రచన కిరాన్‌ఉస్‌సాదిన్‌. ఇది మామెలుక్‌ సుల్తాన్‌ కైకుబాద్‌ కాలపు రచన. ఇక ఖజైన్‌ఉల్‌ఫుతూహ్‌లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్, చిత్తోడ్‌గఢ్, మాల్వా, దక్కన్, వరంగల్‌ దండయాత్రలు, భారతదేశం మీదికి జరిగిన మంగోల్‌ దాడుల గురించి వివరించాడు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రణథంబోర్‌ను ముట్టడించినప్పుడు, అక్కడి రాజపుత్ర స్త్రీల  ‘‘జౌహార్‌’’(మూకుమ్మడిగా చితి పేర్చుకుని మరణించడం) గురించి తెలిపాడు. ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ చరిత్రను వివరిస్తూ ‘‘తుగ్లక్‌ నామా’’ రచించాడు. అమీర్‌ ఖుస్రూ ఇతర రచనలు నూహ్‌ సిపార్, మిఫ్తా ఉల్‌ ఫుతూహ్, దేవలరాణి ఖిజిర్‌ఖానీ. 

సంగీతం విషయానికి వస్తే, అమీర్‌ ఖుస్రూ ఖవ్వాలీ ప్రక్రియను అభివృద్ధి చేశాడు. సితార్, తబలాను ఈయనే మొదటగా తయారు చేశాడని అంటారు. క్రీ.శ.1325లో మరణించిన అమీర్‌ ఖుస్రూను నిజాముద్దీన్‌ ఔలియా దర్గా ప్రాంగణంలోనే ఖననం చేశారు.

 

పద్మావత్‌: మాలిక్‌ మహమ్మద్‌ జాయసీ ప్రసిద్ధ రచన. జాయసీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోని జాయస్‌లో జన్మించాడు. మాలిక్‌ మహమ్మద్‌ జాయసీ షేర్షా కాలపు కవి. అవధీ మాండలికంలో (హిందీ) ఉన్న ఈ రచన ప్రధానంగా సూఫీ ప్రేమతత్వానికి చెందింది. ఇందులో సుప్రసిద్ధ పద్మావతి (పద్మిని) కథ ఉంది. పద్మావతి చిత్తోడ్‌ రాణా రతన్‌ సింగ్‌ భార్య. ఈమె అందం గురించి తెలుసుకున్న అప్పటి ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ చిత్తోడ్‌ను ముట్టడించాడని చెబుతారు. అయితే చరిత్రకారులు దీన్ని వ్యతిరేకించారు. చిత్తోడ్‌ గుజరాత్‌ వెళ్లే మార్గం మీద ఉండటంతో ఖిల్జీ దండయాత్ర చేశాడనేది చరిత్రకారుల వాదన.


దారాషికో: మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌ పెద్ద కొడుకు. సూఫీ మార్మికవాది. ఇతడు హిందూ, ఇస్లాం మతాలను క్షుణ్నంగా అధ్యయనం చేశాడు. రెండు మతాల సారాన్ని క్రోడీకరిస్తూ ‘‘మజ్‌ మాఉల్‌బహ్రెయిన్‌’’ (రెండు సముద్రాల సంగమం) పేరుతో పుస్తకాన్ని రాశాడు. ఇంకా కొన్ని ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించి, వాటిని ‘‘సిర్‌ఎఅక్బర్‌’’ పేరుతో సంకలనం చేశాడు. మొగల్‌ సింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరులో క్రీ.శ.1659లో ఔరంగజేబ్‌ చేతిలో దారాషికో మరణించాడు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మొగల్‌ యుగ విశేషాలు

అభ్యాస ప్రశ్నలు

1. భారతదేశ చరిత్రకు సంబంధించి అబ్దుల్‌ హమీద్‌ లాహోరీ ఎవరు?

ఎ) అక్బర్‌ కాలంలో ఒక ప్రధాన సైన్యాధికారి
బి) షాజహాన్‌ పాలనాకాలపు అధికారిక చరిత్రకారుడు.
సి) ఔరంగజేబ్‌ కాలపు కులీనుడు, అతడి సన్నిహితుడు
డి) మహమ్మద్‌ షా పాలనా కాలపు రచయిత, కవి

 
3. దక్కన్‌ సుల్తానుల చరిత్ర తెలుసుకునేందుకు ప్రధాన ఆధారం ఏది?

ఎ) తబకత్‌ఎనాసిరి           బి) ఫుతూహ్‌ఉస్‌సలాతిన్‌ 
సి) తారిఖ్‌ఎఫెరిష్తా           డి) కితాబ్‌ఉల్‌రెహ్లా


4. అక్బర్‌ కాలంలో రామాయణాన్ని పర్షియన్‌ భాషలోకి అనువదించింది ఎవరు?

ఎ) అబుల్‌ ఫజల్‌       బి) అబ్దుల్‌ ఖాదర్‌ బదాయూనీ 
సి) బీర్బల్‌                డి) పైజీ సర్హింది


5. హిందూ ఇస్లాం మతాల సారంగా పేర్కొనే ‘మజ్మాఉల్‌బహ్రెయిన్‌’ రచయిత ఎవరు?

ఎ) దారాషికో                 బి) సులేమాన్‌ షికో     
సి) అబుల్‌ ఫజల్‌         డి) అమీర్‌ ఖుస్రూ 


6. ‘తారిఖ్‌ఎముబారక్‌ షాహీ’ ఎవరి కాలపు రచన?

ఎ) ఖిల్జీలు     బి) తుగ్లక్‌లు     సి) లోడీలు     డి) సయ్యద్‌లు


7. ‘తబకత్‌ఎనాసిరి’ రచయిత ఎవరు?

ఎ) మిన్హాజుస్‌ సిరాజ్‌         బి) నాసిరుద్దీన్‌ మహమ్మద్‌ 
సి) జియావుద్దీన్‌ బరౌనీ          డి) అబ్బాస్‌ ఖాన్‌ షేర్వానీ


8. కిందివాటిలో మహమ్మద్‌ హషీం ఖాఫీఖాన్‌ రచన?

ఎ) ముంతఖాబ్‌ఉత్‌తవారిఖ్‌     బి) ముంతఖాబ్‌ఉల్‌లుబాబ్‌ 
సి) ఖులాసత్‌ఉత్‌తవారిఖ్‌         డి) షాజహాన్‌ నామా


సమాధానాలు: 1-బి;  2-ఎ;  3-సి;  4-బి;  5-ఎ;  6-డి;  7-ఎ;  8-బి.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కడ‌ప‌టి మొగ‌లుల పాల‌న‌

మాదిరి ప్రశ్నలు

1. మొదటి బహదూర్‌షాపై తిరుగుబాటు చేసిన సిక్కుల గురువు ఎవరు?
జ: బందాబహదూర్

 

2. కిందివారిలో ఛత్రసాల్ ఎవరి నాయకుడు?
ఎ) జాట్‌లు బి) రాజపుత్రులు సి) బుందేలులు డి) సిక్కులు
జ: సి(బుందేలులు)

 

3. మొదటి బహదూర్‌షా అసలు పేరు?
జ: మువజ్జం

 

4. జహందర్ షా ఎవరి మద్దతుతో మొగలు చక్రవర్తి అయ్యాడు?
జ: జుల్ఫికర్ ఖాన్

 

5. ఏ మొగల్ చక్రవర్తిని సయ్యద్ సోదరులు హతమార్చారు?
జ: ఫరూక్‌సియార్

 

6. సయ్యద్ సోదరులను ఏ మొగల్ చక్రవర్తి కాలంలో చంపేశారు?
జ: మహమ్మద్ షా

 

7. 'రంగీలా'గా పేరు పొందిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: మహమ్మద్ షా

 

8. ఏ ప్రాంతంలో నిజాం ఉల్ ముల్క్ స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించాడు?
జ: హైదరాబాద్

 

9. కింది వారిలో 'ఇరాన్ నెపోలియన్‌'గా పేరుగాంచింది ఎవరు?
ఎ) అహమ్మద్ షా అబ్దాలీ బి) మొదటి డేరియస్ సి) నాదిర్షా డి) ఇతిమద్ ఉద్దౌలా
జ: సి(నాదిర్షా)

 

10. నాదిర్షాకు, మొగల్ సైన్యానికి మధ్య 1739 ఫిబ్రవరిలో యుద్ధం ఎక్కడ జరిగింది?
జ: కర్నాల్

 

11. అహమ్మద్‌షా అబ్దాలీ ఏ తెగకు చెందినవాడు?
జ: అబ్దాలి

 

12. రెండో అలంఘీర్ అసలు పేరు?
జ: అజీజుద్దీన్

 

13. మూడో పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
జ: 1761

 

14. బ్రిటిషర్లు ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించారు?
జ: 1803

 

15. చివరి మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: రెండో బహదూర్‌షా

 

16. రామమోహన్‌రాయ్‌కు 'రాజా' అనే బిరుదు ఇచ్చిన మొగలు చక్రవర్తి ఎవరు?
జ: రెండో అక్బర్

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

యుద్ధాలు

మాదిరి ప్రశ్నలు

1. సాహు, తారాబాయికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో సాహు విజయానికి తోడ్పడిన వ్యక్తి ఎవరు?
ఎ) బాజీరావు బి) బాలాజీ విశ్వనాథ్ సి) రఘునాథరావు డి) మల్హర్ రావ్ హోల్కర్
జ: (బి)

 

2. గైక్వాడ్‌లు ఏ ప్రాంతం కేంద్రంగా పరిపాలించారు?
ఎ) బరోడా బి) నాగపూర్ సి) ఇండోర్ డి) గ్వాలియర్
జ: (ఎ)

 

3. మొదటి బాజీరావు బస్సైన్, సాల్‌సెట్టిలను ఎవరి నుంచి ఆక్రమించాడు?
ఎ) ఆంగ్లేయులు బి) పోర్చుగీసువారు సి) ఫ్రెంచివారు డి) డచ్చివారు
జ: (బి)

 

4. మొదటి బాజీరావు, నిజాం ఉల్ ముల్క్‌ను ఏ యుద్ధంలో ఓడించాడు?
ఎ) హైదరాబాద్ బి) భోపాల్ సి) నాగపూర్ డి) విజయవాడ
జ: (బి)

 

5. నానాసాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన పీష్వా ఎవరు?
ఎ) బాలాజీ బాజీరావు బి) బాలాజీ విశ్వనాథ్ సి) మొదటి బాజీరావు డి) రెండో బాజీరావు
జ: (ఎ)

 

6. 1752లో పీష్వాతో ఒప్పందం కుదుర్చుకున్న మొగలు చక్రవర్తి ఎవరు?
ఎ) మహమ్మద్ షా బి) అహ్మద్ షా సి) బహుదూర్ షా డి) ఔరంగజేబు
జ: (బి)

 

7. చివరి పీష్వా ఎవరు?
ఎ) మాధవరావు బి) నారాయణరావు సి) బాలాజీ బాజీరావు డి) రెండో బాజీరావు
జ: (డి)

 

8. బాలాజీ బాజీరావు ఎప్పుడు మరణించాడు?
ఎ) 1759 బి) 1760 సి) 1761 డి) 1762
జ: (సి)

 

9. నాదిర్ షా తర్వాత ఆఫ్ఘనిస్థాన్ పాలకుడు ఎవరు?
ఎ) తైమూరు బి) అహ్మద్ షా అబ్దాలీ సి) షేర్‌ఖాన్ డి) అదీనా బేగ్ ఖాన్
జ: (బి)

 

10. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాలకు సహకరించింది ఎవరు?
ఎ) జాట్‌లు బి) రాజపుత్రులు సి) సిక్కులు డి) ఎవరూ కాదు
జ: (డి)

 

11. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాల ఓటమికి ప్రధాన కారకుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) కాశీ రాజ పండిట్ బి) సదాశివరావు భావే సి) విశ్వాసరావు డి) మల్హర్ రావు హోల్కర్
జ: (బి)

 

12. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది?
ఎ) సల్బాయ్ బి) దురాయ్ సరాయ్ ) పాల్కేడ్ డి) బస్సైన్
జ: (ఎ)

 

13. పీష్వా రెండో బాజీరావు సైన్య సహకార ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేశాడు?
ఎ) 1800 బి) 1801 సి) 1802 డి) 1803
జ: (సి)

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మాదిరి ప్రశ్నలు  

1. కిందివారిలో స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు ఎవరు?
   ఎ) సఫ్దర్ అలీ    బి) దోస్త్ అలీ    సి) సాదతుల్లా ఖాన్    డి) అన్వరుద్దీన్
జ: సి(సాదతుల్లా ఖాన్)

 

2. కర్ణాటక రాజ్య రాజధాని ఏది?
జ: ఆర్కాట్

 

3. హైదర్ అలీ ఏ మైసూరు యుద్ధ సమయంలో మరణించాడు?
జ: రెండో

 

4. ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజ్-ఉద్-దౌలాను బంధించి చంపిన వ్యక్తి ఎవరు?
జ: మీరాన్

 

5. బక్సార్ యుద్ధ వీరుడు ఎవరు?
జ: హెక్టర్ మన్రో

 

6. చీకటి గది ఉదంతం గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరు?
జ: హాల్‌వెల్

 

7. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
జ: రాబర్ట్ క్లైవ్

 

8. టిప్పు సుల్తాన్ ఎప్పుడు మరణించాడు?
జ: 1799

 

9. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జ: మంగళూరు

 

10. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్‌కు, కుట్రదారులకు మధ్య రహస్య ఒప్పందాన్ని కుదిర్చిన వ్యక్తి ఎవరు?
జ: అమీన్‌చంద్

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సంస్కరణోద్యమాలు

మాదిరి ప్రశ్నలు

1. క్రైస్తవ మత ప్రచారకుడైన అలెగ్జాండర్ డఫ్ చేసిన హిందూ మత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టిందెవరు?
ఎ) దేవేంద్రనాథ్ ఠాగూర్              బి) కేశవచంద్ర సేన్
సి) దయానందుడు                     డి) రామ్మోహన్ రాయ్
జ: (ఎ)


2. 'వేదాంత సూత్రాలు' గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వ్యక్తి ఎవరు?
ఎ) వివేకానందుడు                  బి) వీరేశలింగం
సి) దేవేంద్రనాథ్ ఠాగూర్        డి) రాధాకాంత్ దేవ్
జ: (ఎ)


3. కామన్వెల్త్ పత్రికను స్థాపించింది ఎవరు?
ఎ) తిలక్      బి) బిపిన్‌చంద్రపాల్     సి) అనిబిసెంట్     డి) గాంధీజీ
జ: (సి)


4. శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) రామ్మోహన్ రాయ్       బి) వివేకానందుడు
సి) దయానందుడు          డి) కేశవచంద్ర సేన్
జ: (సి)


5. ఆర్య సమాజ ప్రభావం ఏ రాష్ట్రంపై ఎక్కువ?
ఎ) ఆంధ్రప్రదేశ్     బి) మహారాష్ట్ర     సి) పంజాబ్    డి) గుజరాత్
జ: (సి)


6. రామకృష్ణ పరమహంస భార్య పేరేమిటి?
ఎ) శారదాప్రియ    బి) శారదామణి     సి) శ్రీలత    డి) హర్షిత
జ: (బి)


7. కింది వారిలో పశ్చిమ భారతదేశంలో పునరుజ్జీవన పితగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు?
ఎ) ఎం.జి. రనడే    బి) బి.ఎం. మలబారి    సి) ఆర్.జి. భండార్కర్    డి) కె.టి. తెలాంగ్
జ: (ఎ)


8. ఉత్తర భారతదేశ హిందూ లూథర్‌గా ప్రసిద్ధిచెందిన వ్యక్తి ఎవరు?
ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్           బి) దయానందుడు   
సి) రాధాకాంత్ దేవ్             డి) కేశవచంద్ర సేన్
జ: (బి)


9. శ్రద్ధానందుడు గురుకుల విద్యాల యాలను ఎక్కడ ప్రారంభించాడు?
ఎ) లాహోర్       బి) బొంబాయి      సి) హరిద్వార్     డి) కలకత్తా
జ: (సి)


10. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను ఎవరు స్థాపించారు?
ఎ) దయానందుడు            బి) వివేకానందుడు
సి) కేశవచంద్ర సేన్          డి) రామ్మోహన్ రాయ్
జ: (సి)

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భ‌క్తి, సూఫీ ఉద్య‌మాలు

భారతదేశంలో మధ్యయుగంలో వచ్చిన మత ఉద్యమాలే భక్తి, సూఫీ ఉద్యమాలు. ప్రాచీనకాలం నుంచే భాగవత మతంలో భాగంగా భక్తి ఉద్యమ లక్షణాలు మన దేశంలో కనిపిస్తాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో మోక్షసాధన కోసం చేసే దైవపూజను భక్తిగా పేర్కొంటారు. భారతదేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించడంతో హిందూ- ఇస్లాం మతాలు పరస్పరం ప్రభావితం చేసుకోవడం వల్ల భక్తి, సూఫీ ఉద్యమాలు విస్తృతమయ్యాయి. ఇవి మతసామరస్యానికి, సాంఘిక సంస్కరణల ఆధ్యాత్మిక భావాల అభివృద్ధికి దోహదపడ్డాయి. నానక్, కబీర్, చైతన్యుడు లాంటి ఎంతో మంది భక్తి ఉద్యమకారులు; ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ, షేక్‌ సలీం చిస్తీ, నిజాముద్దీన్‌ ఔలియా, బాబా ఫరీద్‌ లాంటి సూఫీ తత్వవేత్తలు తమ రచనలు, బోధనలు, గీతాల ద్వారా భక్తి, సూఫీ ఉద్యమాలకు, మతసామరస్యానికి ఎంతో కృషి చేశారు.
 

‘భక్తి’ అంటే నిర్మలమైన మనస్సుతో మోక్షసాధన కోసం భగవంతుడిని ప్రార్థించడం. ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో భక్తిభావం ఉంది. ఆదిమానవుడు ముసుగులు ధరించి ప్రకృతి శక్తులను ఆరాధించడం; సింధు ప్రజలు అమ్మతల్లి, పశుపతిని పూజించడం; ఆర్యులు ఇంద్రుడిని, త్రిమూర్తులను ఆరాధించడంలో భక్తిభావం కనిపిస్తుంది. కానీ ప్రాచీనకాలంలో బ్రాహ్మణ ఆధిక్యం పెరగడం, కర్మకాండలకు ఎక్కువ ఖర్చు లాంటి కారణాల వల్ల సామాన్యులు భగవంతుడిని పూజించడానికి సాధ్యమయ్యేది కాదు. కాబట్టి జైన, బౌద్ధ మతాలు మోక్షసాధన కోసం సల్లేఖన వ్రతం, అష్టాంగ మార్గాలను ప్రబోధించాయి. గుప్తులకాలంలో వచ్చిన భాగవత మతంలో ఈ భక్తి ఉద్యమ భావాలు స్పష్టంగా ఉన్నాయి. తమిళదేశంలో క్రీ.శ.5వ శతాబ్దంలో ‘భక్తి’ అనే పదాన్ని పేర్కొన్నారు. ఆళ్వార్లు, నయనార్లు తమ బోధనలు, కీర్తనల ద్వారా భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ భారతదేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించడంతో వాస్తవంగా భక్తి, సూఫీ ఉద్యమాలు అసలైన రూపాన్ని సంతరించుకున్నాయి. మొదట్లో కేవలం సాహిత్యపరంగా ఉన్న భక్తి ఉద్యమం క్రమంగా సాంఘిక, ఆర్థిక, సంస్కరణల వైపు దృష్టి సారించింది. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యాన్ని తెచ్చింది. ముఖ్యంగా హిందూ ముస్లి మత సామరస్యాన్ని ప్రచారం చేసింది.

 

ఇస్లాం మతంలో ఉన్న ఏకేశ్వరోపాసన, సోదరభావం, కుల వ్యవస్థ లేకపోవడం లాంటి అంశాలను హిందూమతం స్వీకరించి భక్తి ఉద్యమాన్ని విస్తృతం చేసింది. యూసఫ్‌ హుస్సేన్‌ అనే చరిత్రకారుడు భక్తి ఉద్యమాన్ని రెండు దశలుగా విభజించారు. భగవద్గీత కాలం నుంచి 13వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మొదటి దశగా, 13 నుంచి 16వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని రెండో దశగా పేర్కొన్నారు. భక్తి అనే పదం తొలిసారిగా ‘శ్వేతాశ్వేతర ఉపనిషత్తు’లో కనిపిస్తుంది. భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమవడంతోనే భక్తి ఉద్యమం మొదలైందని తారా చంద్, అహ్మద్‌ నిజామి, మహ్మద్‌ ఖురేషి లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే ఇది భగవద్గీతలోని బోధనల వల్ల ప్రభావితమైందని, రామానుజాచార్యుడు, శంకరాచార్యుడు, ఆళ్వార్లు, నయనార్ల బోధనల్లో భక్తి ఉద్యమ బీజాలున్నాయని ఆర్‌.జి. భండార్కర్‌ లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు. 

 

భ‌క్తి ఉద్య‌మ‌కారులు - బోధ‌న‌లు

క్రీ.శ.6వ శతాబ్దంలో తమిళ ప్రాంతంలో ఆళ్వార్లు అనే వైష్ణవ భక్తులు, నయనార్లు అనే శైవభక్తులు తమ రచనల ద్వారా భక్తిభావాన్ని ప్రచారం చేశారు. ఆళ్వార్లు, నయనార్లు పాశురాలు, తేవరం/ తిరువాచకాలు అనే భక్తి గీతాల ద్వారా భగవంతుడిని ఆరాధించారు. అనంతరం త్రిమతాచార్యులైన శంకరాచార్యులు (అద్వైతం), రామానుజాచార్యులు (విశిష్టాద్వైతం), మద్వాచార్యులు (ద్వైతం) బోధనల్లో భక్తి ఉద్యమ ఛాయలు కనిపిస్తాయి. విష్ణువుపై అమితమైన భక్తి మోక్షసాధనకు మార్గమని రామానుజుడు బోధించారు. భాగవత మతంలోనూ ఇదే సాంప్రదాయం ఉంది. 

 

ఆదిశంకరుడు: ఈయన కేరళలోని కాలడిలో జన్మించారు. కాశీ (బెనారస్‌)కి చెందిన గోవిందయోగి బోధనలకు ప్రభావితమై, అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. భక్తి ఉద్యమానికి పునాదులు వేసి హిందూమత రక్షకుడిగా పేరొందారు. మోక్షసాధనకు జ్ఞానమార్గమే ఏకైక సాధనమని ప్రబోధించారు. శృంగేరి, బదరీ, ద్వారక, పూరీ ప్రాంతాల్లో నాలుగు మఠాలు స్థాపించారు.

 

రామానుజాచార్యులు: తమిళనాడులోని పెరంబదూర్‌లో జన్మించారు. యానప్రకాశుడు అనే గురువు ప్రభావంతో విశిష్టాద్వైత మత సిద్ధాంతాన్ని రూపొందించారు. శంకరాచార్యుల జ్ఞానమార్గాన్ని కాదని, మోక్షమార్గాన్ని ప్రబోధించారు. నిమ్నకులాల వారు దేవాలయాల్లోకి వెళ్లేలా కృషి చేశారు. కులోత్తుంగ చోళుడు ఇతడి వైష్ణవ మత ప్రచారాన్ని వ్యతిరేకించారు. దీంతో రామానుజుడు హొయసాల రాజ్యానికి వెళ్లిపోయారు. అన్ని కులాలవారు దేవుడిని చేరుకోవడానికి, పూజించానికి అర్హులే అని రామానుజుడు ప్రబోధించారు. 

ద్వైతమతాన్ని ప్రబోధించిన మద్వాచార్యుడు, ద్వైతాద్వైతాన్ని ప్రచారంచేసిన నింబార్కుడు; శుద్ధాద్వైతాన్ని ప్రబోధించిన వల్లభాచార్యులు తమ బోధనల్లో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు.

 

చైతన్యుడు: ఈయన బెంగాల్‌లో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. రాధాకృష్ణులకు పూజ చేసేందుకు అన్నివర్గాల వారు అర్హులేనని, రాగమార్గమే మోక్షమార్గానికి సాధన అని ప్రబోధించారు. ప్రేమ, భక్తి, గానం, నృత్యాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చని చెప్పారు. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనే శ్రీకృష్ణుడు/ హరి అని ప్రచారం చేశారు. 

 

రామానందుడు: ఈయన ఉత్తర భారతదేశంలో రామభక్తిని ప్రచారం చేసి, అనేక కులాల వారిని శిష్యులుగా చేర్చుకున్నారు. ఈయనకు ధర్మ(జాట్‌), సేనా(నాయి బ్రాహ్మణ), రవిదాస్‌(చర్మకారుడు), కబీర్‌(మహ్మదీయుడు)  పురుష శిష్యులు కాగా; పద్మావతి, సురస్త్రీ మహిళా శిష్యులుగా ఉన్నారు. స్త్రీలకు వైష్ణవమతంలో చేరే అవకాశాన్ని కల్పించారు. ఒకరు మరొకరి కులాన్ని అడగకూడదని, దేవుడిని ప్రార్థించే అర్హత అందరికీ ఉందని ప్రబోధించారు. 

 

భక్త కబీర్‌: భక్తి ఉద్యమకారుల్లో ఈయనకు గొప్ప పేరు ఉంది. హిందూ-ముస్లిం ఐక్యతను ప్రచారం చేసి, కులవ్యవస్థను ఖండించారు. విగ్రహారాధన, కర్మకాండలు, తీర్థయాత్రలను వ్యతిరేకించారు. రాముడు, రహీం ఒక్కటే అని, వారు ఒకే మట్టితో చేసిన రెండు కుండలని బోధించారు. కబీర్‌ రచనలను దోహాలు/ బీజక్‌లు అని, వారి శిష్యులను కబీర్‌పంథి అని పిలుస్తారు. పవిత్రమైన హృదయం లేకుండా పవిత్రనదీ స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని కబీర్‌ పేర్కొన్నారు. 


గురునానక్‌: ఈయన హిందూ-ముస్లిం ఐక్యతను చాటిన మరో ప్రముఖ భక్తి ఉద్యమకారుడు. 1469లో పంజాబ్‌లోని తాల్వండి  గ్రామంలో జన్మించారు. ఈయనే సిక్కుమతాన్ని స్థాపించారు. ఇతడి బోధనలు ఆదిగ్రంథ్‌ (అర్జున్‌ సింగ్‌ రచన)లో ఉన్నాయి. గురునానక్‌ ప్రధాన బోధనలు ‘నామ్‌ జప్నా, కీర్త్‌ కర్నా, వంద్‌ చక్నా’. అంటే భగవంతుడి నామాన్ని జపిస్తూ, భగవంతుడిని కీర్తిస్తూ అతడికి నిత్యవందనం సమర్పిస్తూ మోక్షం పొందవచ్చని ప్రబోధించారు. 

 

వారణాసికి చెందిన హరిజనుడైన రామదాసు, రాజస్థాన్‌కు చెందిన మీరాబాయి, సూరదాస్, తులసీదాస్‌ లాంటి భక్తి ఉద్యమకారులు కూడా తమ రచనల ద్వారా భక్తి ఉద్యమ భావాలను ప్రచారం చేశారు. ఉన్నత వర్గానికి చెందిన రాజపుత్ర రాణి అయిన మీరాబాయి కృష్ణుడిపై భక్తితో బ్రిజ్‌ భాషలో గీతాలు రచించారు. అవి మీరాభజనలుగా ప్రసిద్ధి చెందాయి.

 

జ్ఞానదేవుడు, నామదేవుడు, తుకారం, సమర్థ రామదాసు లాంటి మరాఠా భక్తి ఉద్యమకారులు మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. వారు రాసిన భక్తి గీతాలను అభంగాలుగా పేర్కొంటారు. మహారాష్ట్ర ధర్మగా పేరొందిన మరాఠా భక్తి మార్గానికి జ్ఞానదేవుడు పునాది వేశారు. ఈయన జ్ఞానేశ్వరి, అమృతానుభవ లాంటి గ్రంథాలను రాశారు. నామదేవుడు పండరీపురం కేంద్రంగా విష్ణుభక్తిని ప్రచారం చేశారు. ఏకనాథుడు కులవ్యవస్థను వ్యతిరేకిస్తూ, నిమ్నకులాల వారిపై సానుభూతితో గీతాలు రాశారు. అవి కీర్తనలు, భజనలుగా పేరొందాయి. జ్ఞానదేవుడి శిష్యుడైన తుకారం తన బోధనల ద్వారా మహారాష్ట్రలో జాతీయతా భావానికి పునాది వేశారు. శివాజీని అమితంగా ప్రభావితం చేసి, అతడి మత గురువుగా పేరొందినవారు సమర్థరామదాసు. ఈయన దశబోధ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు.

 

నర్సీమెహతా గుజరాత్‌ ప్రాంతంలో; శంకరదేవుడు అస్సాం ప్రాంతంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. గాంధీజీకి అత్యంత ఇష్టమైన ‘వైష్ణవ జనతో తేనో కహియే’ అనే భజన గీతాన్ని నర్సీ మెహతానే రచించారు.

 

భక్తి ఉద్యమ ప్రభావం

భక్తి ఉద్యమం భారతదేశంలోని మత, సామాజిక, ఆధ్యాత్మిక, సాహిత్య రంగాల్లో అనేక మార్పులకు కారణమైంది. మొదట్లో హిందూ-మహ్మదీయ మతాలు పరస్పర ద్వేషంతో ఉండేవి. భారతదేశం మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలన్న మహ్మదీయమతం; భారత్‌ నుంచి ఇస్లాం మతాన్ని పారదోలాలని హిందూమతం భావించాయి. కానీ అవి తమ లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. కాబట్టి కలిసిమెలిసి జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. రెండుమతాల వారు అవతలి మతంలో ఉన్న కొన్ని మంచి లక్షణాలను స్వీకరించి; భక్తి, సూఫీ ఉద్యమాలను ప్రారంభించారు. వీటి ఫలితంగానే ఇండో ఇస్లామిక్‌ సాంప్రదాయం ఏర్పడింది. పరమత సహన విధానాన్ని పాటించారు. కులమత భేదాలను ఖండించారు. విగ్రహారాధనను వ్యతిరేకించారు. 

 

రామానందుడు, భక్త కబీర్‌ హిందీభాషలో రచనలు చేశారు. నామదేవుడు, తుకారం, సమర్థ రామదాసు లాంటి వారు మరాఠీ భాషలో భక్తి సాహిత్యాన్ని సృష్టించారు. హిందూమతానికి చెందిన పండగలు, ఉత్సవాల్లో ముస్లింలు; ముస్లింల పండగల్లో హిందువులు పాల్గొని హిందూ-ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. హిందువుల్లో ఉన్న సతీసహగమన విధానాన్ని, స్వస్తిక్‌ గుర్తును వాడటం లాంటి వాటిని ముస్లింలు అనుసరించారు. ముస్లిం పండగలైన మొహర్రం, రంజాన్‌ లాంటి పండగల్లో హిందువులు పాల్గొని మత సామరస్యానికి దోహదపడ్డారు. అది నేటికీ కొనసాగుతోంది.

 

భక్తి ఉద్యమ లక్షణాలు

* ఈశ్వరుడి ఏకత్వం(ఏకేశ్వరోపాసన)పై గాఢమైన అనురక్తి ఉండటమే భక్తిఉద్యమ ప్రధాన లక్షణం. మోక్షసాధన కోసం భగవంతుడి కృపను పొందడమే భక్తుడి ప్రధాన లక్ష్యం.
* ప్రాచీన కాలం నుంచి ఉన్న పూజాపునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్ర మనసు, స్వచ్ఛమైన జీవనం, మానవత్వ విలువలు పాటించడం ద్వారా భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని ప్రచారం చేశారు.

* భక్తి ఉద్యమం సుగుణ, నిర్గుణ భావాలను పెంపొందించింది. దేవుడు అనేక రూపాలు, గుణాలతో ఉంటాడని భావించే చైతన్యుడు, సూరదాసు, శంకరదాసు, మీరాబాయి, తులసీదాసు లాంటి వారు సగుణోపాసనను ప్రబోధించారు. కబీర్, గురునానక్, దాదుదయాళ్‌ లాంటి వారు భగవంతుడు నిర్వికారుడు, సర్వాంతర్యామి, ఎలాంటి రూపం, గుణం లేనివాడని భావించారు. వీరు  నిర్గుణోపాసనను ప్రబోధించారు.

* జ్ఞానార్జనలో భక్తి ప్రధానపాత్ర పోషిస్తుందని, నిజమైన జ్ఞానం పొందాలంటే గురువు అవసరం ఎంతో ఉందని భక్తి ఉద్యమకారులు భావించారు.

* భక్తి ఉద్యమం సంస్కృత భాష, కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించింది. నిమ్నకులాలు, తరగతులకు చెందిన వ్యక్తులే ప్రధాన భక్తి ఉద్యమకారులుగా పేరొందారు. ధన్నా భగత్‌ నిమ్న కులం; కబీర్‌ దిగువ కులం; నామదేవుడు దర్జీకులం; తుకారం శూద్ర కులానికి చెందినవారు.

* బ్రాహ్మణ ఆధిక్యాన్ని, సంస్కృత భాషను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు ప్రాంతీయ భాషలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటిలోనే తమ రచనలు చేశారు. కాబట్టి భక్తి ఉద్యమకాలాన్ని ప్రాంతీయ భాషలకు స్వర్ణయుగంగా పేర్కొంటారు.

* భక్తి, సూఫీ ఉద్యమాలు హిందూ-ముస్లిం ఐక్యతను, మత సామరస్యాన్ని ప్రబోధించాయి. గురునానక్, కబీర్‌ లాంటి వారు హిందూ-ముస్లిం ఐక్యతకు ఎంతో కృషి చేశారు. మానవ ఆవిర్భావం నుంచి మనుషులను విడదీసే తేడాలేవీ లేవని, విభేదాలన్నీ మనం సృష్టించుకున్నవే అని కబీర్‌ పేర్కొన్నారు.

* భక్తి ఉద్యమకారులు ప్రేమతత్వాన్ని ఆరాధించారు. శాస్త్ర గ్రంథాలను పఠించడం వల్ల మానవులు పండితులు కాలేరని, ప్రేమించడం, ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే పండితులు అవుతారని కబీర్‌ బోధించారు.

* భక్తి ఉద్యమకారులు వృత్తి పనివారిని, హస్తకళా నిపుణులను ఆకర్షించి మత, సామాజిక వ్యవస్థల్లో ప్రజాస్వామిక, సమానత విలువలు రావాలనే లక్ష్యాలను ప్రచారం చేశారు.

* భక్తి ఉద్యమం కర్మకాండలు; ఎక్కువ ఖర్చుతో కూడిన పూజా విధానం; విగ్రహారాధనలను తీవ్రంగా వ్యతిరేకించింది.
 

సూఫీ ఉద్యమాలు
మధ్యయుగంలో భారతదేశంలోని హిందూ మతంలో భక్తి ఉద్యమం వచ్చినట్లే ఇస్లాం మతంలో సూఫీ ఉద్యమం వచ్చింది. ముస్లిం మతపెద్దలు హిందూ మతంలో ఉన్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను; యోగా విధానాలను గ్రహించి సూఫీ ఉద్యమాన్ని ప్రారంభించారు. హిందూ, ఇస్లాం మతాల సమగ్ర సంగమమే సూఫీ, భక్తి ఉద్యమాల ప్రారంభానికి ప్రధాన కారణంగా చరిత్రకారులు పేర్కొంటారు. ఉలేమాల ఆధిపత్య ధోరణిని, వారి ఖురాన్‌ వర్గీకరణను సూఫీ సన్యాసులు వ్యతిరేకించారు. ‘‘భగవంతుడ్ని (అల్లాను) ప్రేమించడమే అతడ్ని చేరుకునే ప్రధాన మార్గం’’ అని వారు బోధించారు. సూఫీలు హిందూ-ముస్లింల ఐక్యతకు పాటుపడ్డారు.


అర్థం:  క్రీ.శ. 19వ శతాబ్దంలో ‘‘సూఫీ ఇజం’’ అనే ఆంగ్ల పదం వాడుకలోకి వచ్చింది. ‘సఫా’ అనే పదం నుంచి సూఫీ ఏర్పడింది. ‘సఫా’ అంటే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన మనసు అని పండితులు వ్యాఖ్యానించారు. మరికొందరు ‘సుఫా’ అనే పదం నుంచి సూఫీ వచ్చినట్లు పేర్కొన్నారు. సుఫా అంటే మసీదు లోపల మహమ్మద్‌ శిష్యులు సమావేశం జరిపే అరుగు అని తెలిపారు. సూఫీ పదాన్ని తొలిసారి బస్రా ప్రాంతానికి చెందిన జహీజ్‌ అనే పండితుడు ఉపయోగించారు. భక్తి ఉద్యమం లాగానే పరిశుభ్రమైన మనసుతో భగవంతుడ్ని ప్రార్థిస్తే మోక్షం లభిస్తుందనేది సూఫీ ఉద్యమంలో ప్రధాన అంశం. సూఫీ బోధకులు పశ్చాత్తాపం, దేవుడిపై విశ్వాసం లాంటి ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అరేబియాలో పుట్టిన ఈ సూఫీ ఉద్యమం అరబ్బుల ద్వారా భారత దేశంలోకి ప్రవేశించి ఇక్కడి ముస్లింలను అధికంగా ప్రభావితం చేసింది.
          సూఫీలు మొదట పంజాబ్, సింధు ప్రాంతాల్లో తమ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. గుజరాత్, దక్కన్‌ బెంగాల్‌ ప్రాంతాల్లో స్థిరపడిన సూఫీ సన్యాసులు తమ బోధనల ద్వారా వీటిని మొత్తం భారతదేశానికి విస్తరింపజేశారు. సూఫీలు తొలుత పారశీక సంప్రదాయాన్ని అనుసరించి, కాలక్రమేణా భారతీయ సంప్రదాయంలోకి మారారు. హిందూ మత విశ్వాసాలను గ్రహించారు. సూఫీ సన్యాసులు, హిందూ భక్తి ఉద్యమకారులు చెప్పే విషయాలు, ఇచ్చే సమాధానాలు సామాన్య ప్రజలను ఎంతో ఆకర్షించాయి. భక్తి, సూఫీ ఉద్యమాలకు సహజీవనం, మానవత ఉమ్మడి లక్ష్యాలుగా మారాయి. సూఫీ ప్రవక్తలు ఏకాంత జీవితాన్ని గడుపుతూ, దైవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. వీరి ప్రవచనాలు, బోధనలు సంప్రదాయ విరుద్ధమైనవని ఇస్లాం మత ప్రచారకులైన ఉలేమాలు విమర్శించారు. సూఫీ ఉద్యమం మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ, సన్యాస జీవితానికి ప్రాముఖ్యం ఇచ్చింది. ఇది సామాన్య ప్రజలు, బలహీన వర్గాలను బాగా ఆకర్షించింది.


సూఫీ మతం ఆవిర్భవించడానికి కారణాలు
భారతదేశంలోకి ముస్లిం మతం ప్రవేశించాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇస్లాం రాజ్య విస్తరణలో భాగంగా ముస్లిం మతంలోనే అనేక ముఠా తాగాదాలు సంభవించాయి. ముఖ్యంగా ఇస్లాం మత పెద్ద అయిన ‘ఖలీఫా’ విషయంలో ముస్లింలకు పరస్పర విరుద్ధ భావాలు ఉన్నాయి. దీంతో వీరు సున్నీలు, షియాలు అనే రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయారు.  ‘ఖలీఫా’ను వంశపారంపర్యంగా నియమించాలని షియాలు భావిస్తే, ఎన్నుకోవాలని సున్నీలు పేర్కొన్నారు. ఢిల్లీ సుల్తానులు సున్నీలు. వీరు భారతదేశంలో తమ శాఖ వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో షియాల ప్రాబల్యం క్రమంగా క్షీణించింది. తమ ప్రాధాన్యాన్ని తిరిగి పొందడానికి షియా వర్గంవారే సూఫీ ఉద్యమాన్ని విస్తృతం చేశారు. వీరు సుల్తాన్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఓడిపోయారు. సమాజానికి సైతం దూరమయ్యారు. ఇస్లాం ఛాందసవాదులు షియా వర్గాన్ని సమాజ శత్రువులుగా ప్రచారం చేశారు. 
          సూఫీలుగా మారిన షియా వర్గంవారు మాత్రం పరమత సహన విధానాన్ని, దైవ ప్రార్థనా ప్రాధాన్యతను, మోక్షమార్గ విశిష్టతను ప్రచారం చేస్తూ హిందూ, ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. దయ, సహనం, సమత లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ బోధనలు చేశారు. ఫలితంగా సామాన్య, బలహీన వర్గాల నుంచి సూఫీలకు మద్దతు లభించింది. వీరు పీర్, షేక్‌ పేర్లతో సన్యాసుల బృందాలను ఏర్పాటు చేసి మత విశ్వాసాలు, నైతిక నియమాలను ప్రచారం చేశారు. సన్యాసం, భగవత్‌ భక్తి లాంటి ఉపనిషత్తుల్లోని ఉపదేశాలకు, సూఫీ సన్యాసుల బోధనలకు తేడా లేకపోవడంతో భారతదేశంలో సూఫీల బోధనలు, విశ్వాసాలకు ప్రాచుర్యం లభించింది.
         ఉలేమాలు, వారి అనుచరులు మతాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తమకు అనుగుణంగా మలచుకోవడం కూడా సూఫీతత్వం జన్మించడానికి కారణమైంది. ఈ వర్గాలవారు నియంత ప్రభుత్వాలకు మద్దతు తెలిపి, సుల్తాన్‌కు సహకరించినట్లు సూఫీలు పేర్కొన్నారు. తద్వారా ప్రజాస్వామ్యయుతమైన సర్వ సమానత్వాన్ని బోధించే ఇస్లాం మత సిద్ధాంతాలు భ్రష్టుపట్టాయని  విశ్వసించారు. వీరు ప్రాపంచిక సుఖాలను త్యజించి సూఫీ సంప్రదాయాలను ప్రచారం చేశారు. ఏకాంత, సన్యాస, పవిత్ర జీవనానికి ప్రాధాన్యం ఇచ్చారు. రైతులు, వృత్తి పనివారు, బలహీన, సామాన్య వర్గాలు సూఫీ బోధనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మానవత, సమానత, హేతుబద్ధత లాంటి దృక్పథాలను ప్రచారం చేసిన సూఫీ మతం భారతీయుల ఆలోచనా ధోరణులను ఎంతో ప్రభావితం చేసింది.


సూఫీ బోధకులు - బోధనలు
‣ భారతదేశంలో చిష్ఠీ సంప్రదాయానికి చెందిన ఖ్వాజా మొయినుద్దీన్‌ చిష్ఠీ సూఫీ ఉద్యమ ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈయన దర్గా అజ్మీర్‌ (రాజస్థాన్‌)లో ఉంది. చిష్ఠీలు హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. షేక్‌ హమీదుద్దీన్, షేక్‌ కుతుబుద్దీన్, భక్తియార్‌ కాకి మొదలైన చిష్ఠీ శాఖవారు సమానత్వాన్ని బోధిస్తూ, సామాన్య జీవితాన్ని గడిపారు. శాకాహారులైన వీరు స్థానిక హిందువులతో సన్నిహితంగా ఉంటూ, హిందూ-ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. రాజపోషణ, దానాలు తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. గాత్ర, వాయిద్య సంగీతాల్లో గొప్ప ఆధ్యాత్మికత ఉందని బోధించారు. వీరు ఏర్పాటు చేసిన సంగీత విభావరులు అశేష ప్రజానీకాన్ని ఆకర్షించాయి. 
‣ ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన షేక్‌ ఫరీద్‌ (బాబా ఫరీద్‌) అనే తత్వబోధకుడు అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ సూఫీ సిద్ధాంతాలను ప్రబోధించారు. ఈయన శిష్యుడైన నిజాముద్దీన్‌ ఔలియా ఘజియాపూర్‌ కేంద్రంగా సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. హజ్రత్‌ నిజాముద్దీన్‌ ఔలియా తన బోధనల ద్వారా అనేక మంది శిష్యులను పొందారు. అక్బర్‌ను ఎంతగానో ప్రభావితం చేసిన షేక్‌ సలీంచిష్ఠీ కూడా సూఫీ ఉద్యమకారుడే. అక్బర్‌ తన కుమారుడికి సలీం పేరు పెట్టడానికి ఈయనే కారణం. ఈశాన్య భారతదేశంలో ముల్తాన్‌ కేంద్రంగా సుహ్రవర్దీ/ సుహ్రవాదీ శాఖ వర్దిల్లింది. ఖ్వాజాపీర్‌ మహ్మద్, ఖ్వాజా బాకీఖిల్లా మొదలైన సూఫీ సన్యాసులు భారతదేశమంతా సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. హజరత్‌ షేక్‌ బహఉద్దీన్‌ జకారియా, బహరుద్దీన్‌ ఆరీఫ్, సయ్యద్‌ జలాలుద్దీన్‌ బుఖారీ లాంటి వారు సుహ్రవర్ది శాఖలో ఎంతో ప్రాధాన్యం పొందారు. షత్తారీ/  ఫిరదౌసియా శాఖలో హజరత్‌ షేక్‌ షరీఫ్‌ ఉద్దీన్‌; ఖాద్రీ శాఖలో హజరత్‌-షేక్‌ అబ్దుల్‌ ఖాద్రి జిలానీ; నక్షబందీ శాఖలో హజ్రత్‌ ఖ్వాజా-బాక్వీ-బిలాహ్‌ మొదలైన సన్యాసులు విశేష ప్రాచుర్యం పొందారు.


సూఫీ సంప్రదాయాలు
సూఫీ మతంలో ప్రధానంగా ఆరు రకాల చింతనా సంప్రదాయాలు అభివృద్ధి చెందాయి. అవి: చిష్ఠీ, సుహ్రవర్ది, కాద్రీ, షత్తారీ, నక్షబందీ, రేషానియా. ఇవి సూఫీ ఉద్యమ వ్యాప్తికి విశేష కృషి చేశాయి. భారతదేశంలో చిష్ఠీ, సుహ్రవర్దిలుప్రధానమైన శాఖలు. ఢిల్లీ సుల్తానుల కాలానికి ముందే ఈ సంప్రదాయాలు మనదేశంలోకి ప్రవేశించి, క్రీ.శ. 13వ శతాబ్దం నాటికి ప్రాచుర్యాన్ని పొందాయి. ధ్యానం, ఏకాంత జీవనం, భక్తిసంగీత సంకీర్ణం లాంటి అంశాలు చిష్ఠీ శాఖలోని ప్రత్యేకతలు. ప్రముఖ చరిత్రకారుడైన బరానీ అమీర్‌ఖుస్రూ ఈ శాఖకు చెందినవారే. మతంలో ఉలేమాల ఆధిపత్యాన్ని, ప్రభుత్వ జోక్యాన్ని చిష్ఠీ సన్యాసులు నిరసించారు. 
      సూఫీ ఉద్యమ వ్యాప్తిలో సుహ్రవర్ది సంప్రదాయం కూడా ప్రధాన పాత్ర పోషించింది. సూఫీ సన్యాసి షేక్‌ జకారియా ఈ శాఖకు చెందిన వారే. ఈ శాఖవారు ఎక్కువగా ముల్తాన్‌ ప్రాంతంలో జీవించేవారు. వీరు చిష్ఠీలకు భిన్నంగా ప్రభుత్వ వ్యవస్థతో సన్నిహితంగా ఉండేవారు. రాజకీయాలకు, మతానికి అవినాభావ సంబంధం ఉందని వాదించే ముస్లిం మతవాదులకూ, సుహ్రావర్ది సంప్రదాయవాదులకు భావాలు, విశ్వాసాల్లో పెద్ద తేడా లేదు. అయినప్పటికీ హిందూ, ఇస్లాం మతాల మధ్య సయోధ్య అవసరం అని ప్రచారం చేయడం వల్ల ఈ శాఖ ప్రాచుర్యం పొందింది. అనంతరకాలంలో ఖాద్రీ/ కాద్రీ సంప్రదాయం భారతదేశంలోకి ప్రవేశించింది. ఇది ఇస్లాం మతంలోని ఛాందస భావాల వైపు మొగ్గు చూపుతూనే జీవితానందాన్ని అన్ని రకాలుగా అనుభవించాలని ప్రచారం చేసింది. వీరిది ఉదారవాద సంప్రదాయంగా పేర్కొంటారు.  క్రీ.శ. 15, 16 శతాబ్దాల్లో షత్తారీ సంప్రదాయం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది భారతీయ ముస్లింల ఆలోచనలను, కర్మకాండలను సంగమించడానికి ప్రయత్నించింది. అక్బర్‌ చక్రవర్తి కాలంలో నక్షబందీ సంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది. భౌతిక ప్రపంచంలో ఒక క్రమం ఉందని, అందుకే ప్రజలంతా ఐక్యంగా ఉండాలని వీరు ప్రచారం చేశారు. 
         రేషానియా శాఖ వారు ఆత్మవైరాగ్యాన్ని ప్రబోధించారు. మత సారాంశం, అభివృద్ధే ముఖ్యమని, పైపై మెరుగులు కాదని వీరు ప్రచారం చేశారు. సూఫీ ఉద్యమం మత సామరస్యాన్ని కోరుకుంది. సూఫీ సన్యాసులు మంచి ప్రవర్తన, స్వయంకృషి, సమానత్వం లాంటి అంశాలకు తమ బోధనల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. సూఫీ మత గురువులను పీర్లుగా పిలిచేవారు. వీరు ఎలాంటి బహుమతులను స్వీకరించరు. దయ, నిరాడంబరత, సహనం, దైవంపై అపార విశ్వాసం, మోక్షసాధన లాంటి విషయాలపై అధిక విశ్వాసాన్ని ఉంచేవారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మౌర్య సామ్రాజ్యం

మాదిరి ప్రశ్నలు

1. ఇండికా గ్రంథాన్ని రాసింది ఎవరు?
1) కౌటిల్యుడు     2) మెగస్తనీస్‌      3) సెల్యూకస్‌ నికేటర్‌     4) కౌటిల్యుడు


2.  ‘యుద్ధంలో విజయం సాధించి యుద్ధాన్ని విరమించుకున్న ఏకైక చక్రవర్తి అశోకుడే’ అని ఎవరు అన్నారు?

1) ఆర్‌.ఎస్‌.త్రిపాఠి     2) లారెన్స్‌ బనియన్‌      3) హెచ్‌.జి.వెర్స్‌      4) ఉపగుప్తుడు


3. అశోకుడి బౌద్ధమత గురువు?

1) ఉపగుప్తుడు      2) కౌటిల్యుడు       3) మొగలిపుతతిస్స      4) ఎవరూకాదు


4. తొలి భారతదేశ జాతీయ చక్రవర్తిగా పేరొందింది ఎవరు?

1) ధననందుడు      2) మహాపద్మనందుడు      3) చంద్రగుప్తమౌర్యుడు        4) అశోకుడు


5. కళింగ యుద్ధం గురించి సరికానిది?
    ఎ) క్రీ.పూ. 261లో కళింగయుద్ధం జరిగింది. 
    బి) ఈ యుద్ధం గురించి 12వ శిలాశాసనంలోఉంది.
    సి) అప్పటి కళింగ పాలకుడు అనంత పద్మనాభుడు. 
    డి) అశోకుడు రాజుగా ఉన్న ఎనిమిదో సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడు.

1) ఎ, బి       2) బి, సి       3) డి మాత్రమే      4) బి మాత్రమే 


6. అశోకుడు మూడో బౌద్ధసంగీతిని నిర్వహించిన ప్రాంతం?

1) కళింగ       2) పాటలీపుత్ర       3) శ్రీనగర్‌       4) రాజగృహం 


7. శ్రీనగర్‌ను అశోకుడు నిర్మించాడని పేర్కొనే గ్రంథం ఏది?

1) రాజస్థాన్‌ కథావళి       2్శ ఇండికా       3) అర్థశాస్త్రం       4) రాజతరంగణి


8. చివరి మౌర్య వంశ పాలకుడు?

1) దశరథుడు      2) కునాలుడు      3) బృహద్రధుడు      4) జలౌకుడు


9. అమిత్రఘాత బిరుదుతో ప్రసిద్ధి చెందిన మౌర్య చక్రవర్తి ఎవరు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) బింబిసారుడు     3) అశోకుడు     4) బిందుసారుడు


10.  అశోకుడు ధర్మమహామాత్రులు అనే ఉద్యోగులను ఎందుకోసం నియమించాడు?

1) ప్రజాసంక్షేమం                 2) రహదారుల నిర్మాణం 
    3) బౌద్ధమత ప్రచారం        4) నైతిక నియమాల ప్రచారం 


11. మౌర్య సామ్రాజ్య స్థాపనలో చంద్రగుప్త మౌర్యుడికి సహాయం చేసింది ఎవరు?

1) కౌటిల్యుడు     2) విష్ణుగుప్తుడు     3) చాణుక్యుడు     4) పై అందరూ


12. అశోకుడి పేరును తెలియజేసిన శాసనం ఏది?

1) మస్కి     2) బబ్రు     3) 13వ శిలా శాసనం    4) 5వ శిలాశాసనం


13. అశోకుడి శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని చదివిన వ్యక్తి ఎవరు?

1) జేమ్స్‌ అగస్టస్‌        2) సర్‌ జాన్‌ మార్షల్‌     3) జేమ్స్‌ ప్రిన్సిఫ్‌     4) చార్లెస్‌ గ్రాంట్‌


14. మూడో బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు?

1) మొగలిపుత తిస్స     2) మహాకశ్యప     3) సబకామి     4) వసుమిత్రుడు


15. శాసన్నాల్లో ఎవరిని అశోకుడి కుమారుడిగా పేర్కొన్నారు?

1) కుణాలుడు     2) తివార     3) సబకామి     4) జలౌకుడు

 

16.  మౌర్యయుగం నాటి సమాజంలో 7 ప్రధాన కులాలు/ వర్గాలు ఉన్నాయని పేర్కొన్న గ్రంథం ఏది?
 1) కథాసరిత్సాగరం      2) అర్థశాస్త్రం      3)  ఇండికా    4) ముద్రారాక్షసం


17. సాంచీస్తూపం ఎక్కడ ఉంది?
1) మహారాష్ట్ర        2) మధ్యప్రదేశ్‌     3) ఉత్తర్‌ప్రదేశ్‌     4) ఆంధ్రప్రదేశ్‌


18. మౌర్యుల కాలంలోని తీర్థుల గురించి తెలిపింది ఎవరు?
1) మెగస్తనీస్‌        2) శూద్రకుడు       3) కౌటిల్యుడు     4) విశాఖదత్తుడు


19. భారత జాతీయ చిహ్నాన్ని ఎక్కడి నుంచి స్వీకరించారు?
1) సాంచీ        2) రాంపూర్వ     5) తక్షశిల     5) సారనాథ్‌


20. మౌర్యుల కాలం నాటి క్రిమినల్‌ న్యాయస్థానాలకు ఏమని పేరు?
1) కంఠక శోధన     2) ధర్మస్థీయ     3) సత్రిన్‌     4) రజ్జుకలు


21. మౌర్యుల కాలం నాటి రాతిస్తంభాల నిర్మాణ నిపుణులు ఏ ప్రాంతంలో శిక్షణ పొందేవారు?
1) పాటలీపుత్ర     2) తక్షశిల     3) గిర్నార్‌     4) సౌరాష్ట్ర


సమాధానాలు: 1-2; 2-3; 3-1; 4-4; 5-4; 6-2; 7-4; 8-3; 9-4; 10-4; 11-4; 12-1; 13-3; 14-1; 15-2; 16-3; 17-2; 18-3; 19-4; 20-1; 212.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పూర్వచారిత్రక యుగం (ఆదిమ చరిత్ర)

ప్రాచీనకాలం నుంచి ప్రజలు సంతోషంగా జీవించడానికి చేసిన ప్రయత్నమే చరిత్ర.
* సాధారణంగా భూమి 100 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని భావిస్తున్నారు. భూమిపై మానవుల లాంటి జీవులు, వారి పూర్వీకులు 20 లక్షల సంవత్సరాల నుంచి 30 లక్షల సంవత్సరాల మధ్య కాలంలో నివసించేవారు.
* సుమారు 5 లక్షల సంవత్సరాల నుంచి మానవుడు సాగించిన జీవిత యాత్రను 'ఆదిమ చరిత్ర' అంటారు.
* ఈ పరిణామ క్రమంలో మానవ సాంస్కృతికాభివృద్ధి, చరిత్ర 10 వేల సంవత్సరాల పూర్వం నుంచే ప్రారంభమైంది.
* ప్రపంచ భౌతికాభివృద్ధిని వర్ణించడానికి 80 కి.మీ. కాగితాన్ని ఉపయోగిస్తే దానిలో మానవ పరిణామ ప్రగతి కేవలం 10 సెం.మీ. మాత్రమేనని, ఇది ప్రపంచ వయోపరిణామంలో 10 లక్షల భాగంలో ఒకవంతు అని వర్ణించారు.
* మానవుడు వివిధ కాలాల్లో పరిసరాలను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుని క్రమంగా అభివృద్ధి చెందాడు.

ప్రపంచ మానవ చరిత్రను మూడు విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు
1) పూర్వచారిత్రక యుగం (ఆదిమ చరిత్ర): దీనికి లిఖిత ఆధారాలు లేవు. దీన్ని ప్రీ హిస్టరీ అంటారు.
2) సంధికాలపు చారిత్రక యుగం: దీన్ని ప్రోటోహిస్టరీ అంటారు. ఇది రెండు యుగాల మధ్య కాలం.
3) చారిత్రక యుగం (హిస్టారిక్ పీరియడ్): ఇది రెండు యుగాల మధ్యకాలం. దీనికి లిఖిత ఆధారాలు ఉన్నాయి.
చారిత్రక యుగాన్ని 3 భాగాలుగా అధ్యయనం చేస్తారు.
1) ప్రాచీన యుగం
2) మధ్యయుగం
3) ఆధునిక యుగం
* పూర్వ చారిత్రకయుగాన్ని తెలుసుకోవడానికి లిఖిత ఆధారాలు లేవు. దీని గురించి తెలుసుకోవడానికి 'పురావస్తు శాస్త్రం', 'మానవశాస్త్రం' తోడ్పడతాయి.


పురావస్తు శాస్త్రం
      ప్రాచీనకాలంలో మానవుడు నివసించిన ప్రాంతాలు, ఉపయోగించిన పరికరాలు, వస్తువులు, మట్టితో కప్పబడి మరుగునపడ్డాయి. పురాతత్వవేత్తలు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, అక్కడ లభించిన వస్తువులను పరిశీలించి, పరిశోధించి ఆ కాలంనాటి మానవుల జీవిత విశేషాలను తెలుసుకున్నారు. ఈ తవ్వకాలను 'ఉత్ఖాతనం' అని, వీటి గురించి వివరించే శాస్త్రాన్ని 'పురావస్తు శాస్త్రం' అని అంటారు.
* ఈజిప్టులోని పిరమిడ్లు, అప్పటి ప్రాచీన నాగరికత విశేషాలను ఉత్ఖాతనాల వల్ల అధ్యయనం చేశారు.
* భారతదేశంలోని పంజాబ్, సింధు రాష్ట్రాల్లో హరప్పా, మొహంజొదారో తవ్వకాలను అధ్యయనం చేసిన జాన్ మార్షల్ 5000 సంవత్సరాల పూర్వపు సింధులోయ నాగరికత గురించి తెలుసుకున్నారు.
* ఉత్ఖాతనల అధ్యయనం వల్ల సింధు నాగరికత ఈజిప్టు, మెసపటోమియా నాగరికతలకు సమకాలీనమైందని తెలిసింది.
* మన రాష్ట్రంలోని నాగార్జున కొండ ప్రాంతంలో లభించిన ఉత్ఖాతనాలు క్రీ.శ.3వ శతాబ్దం నుంచి ఇక్ష్వాకుల కాలంనాటి నాగరికతను తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి. ఈ విధంగా పురావస్తు శాస్త్రం ప్రాచీన కాలపు రచనకు దోహదపడుతోంది.


మానవశాస్త్రం
* మానవశాస్త్రం ప్రాచీన రచనకు ఎంతో తోడ్పడుతోంది. వివిధ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో వేలాది సంవత్సరాల కిందట జీవించిన మానవుల అస్తిపంజరాలు, పుర్రెలు, ఎముకలు, దంతాలు బయటపడ్డాయి.
* భూమి పైపొరల్లో లభించిన శిలాజాలు, గతంలో మానవుడు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ మానవ చరిత్రకు అతివిలువైన సాక్ష్యాధారాలు.
* వీటిలో ఉన్న రేడియో కార్బన్ల నిష్పత్తి కాల నిర్ణయానికి ఉపయోగపడుతోంది. మార్టిమర్‌వీలర్ వీటిని వస్తువులుగా కాకుండా 'ప్రాచీన కాలపు మనుషులు'గా వర్ణించాడు. ఈ విధంగా మానవశాస్త్రం అప్పటి చరిత్ర రచనకు మూలమైంది.


భూమిపై ప్రాణకోటి ఆవిర్భావం:
* భూమి సూర్యుడి నుంచి విడిపోయి భూగ్రహంగా ఏర్పడింది. అనేక భౌతిక మార్పులు చెందిన తర్వాత భూమి ప్రాణకోటికి నివాసయోగ్యమైంది.
* భూమి మీద మొదట 'లార్వా', ఆ తర్వాత 'ప్లాజిలెట్ట' జీవులు ఆవిర్భవించాయి. కాలక్రమంగా వృక్షజాతి, జంతుజాలం, చివరిగా మానవుడు ఉద్భవించాడు.


మానవ జీవిత పరిణామ దశలు:
1) ఆస్ట్రోఫిథికస్
2) రామాఫిథికస్
3) హోమో ఎరక్టస్
4) నియన్‌డెర్తల్ నరుడు
ఈ జాతులు మనిషి లాంటి ప్రాణులు. క్రీ.పూ.1,40,000 - 4000కు పూర్వం జీవిస్తుండేవి.
5) హోమోసేపియన్లు ఆధునిక మానవులకు పూర్వీకులు. వీరిని క్రోమాగ్నన్‌లు అని కూడా అంటారు.
* 20 వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన వీరు కొన్ని రకాల పనిముట్లను ఉపయోగించేవారు. గుహ చిత్రాలను గీసేవారు. ఈ చిత్రాలు వారి అనుభవాలను తెలియజేసేవి.
* మానవుడి నాగరికత పరిణామ క్రమం రాతియుగంతో ఆరంభమైంది. ఈ యుగాన్ని 3 దశలుగా విభజించారు.


పాతరాతియుగం
* క్రీ.పూ.2,50,000 - 1000 వరకు (సుమారుగా) ఈ యుగంలో మానవుడు గొడ్డళ్లు, కత్తులు, రాతి పనిముట్లు తయారుచేసుకొని, ఆహారం, ఆత్మరక్షణకు ఉపయోగించేవాడు. గుహల్లో నివసిస్తూ జంతవుల చర్మంతో శరీరాన్ని కప్పుకునేవాడు.
* ఆహారం కోసం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండేవాడు. అనుభవాలను చిత్రాలుగా పెద్ద రాళ్లపై గీసేవాడు.


మధ్య శిలాయుగం
* పాతరాతి, కొత్తరాతి యుగానికి మధ్య కాలాన్ని 'మధ్య శిలాయుగం' అంటారు. ఈ యుగంలో వాతావరణం మార్పు చెందడం వల్ల ఆలోచన, విచక్షణా జ్ఞానం పెరిగింది. ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుక్కున్నాడు.
* మధ్య శిలాయుగంలో మానవులు చిన్న సామాజిక వర్గాల్లో నివసించేవారు. ఫలితంగా సాంఘిక సంబంధాలు బలపడటంతో పాటు సాంఘిక నిబంధనలు ఏర్పడ్డాయి.


కొత్తరాతియుగం
* ఈ యుగంలో పరికరాలు, పనిముట్ల నాణ్యత పెరిగింది. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకుని వ్యవసాయం, పశుపోషణను ప్రారంభించాడు.
* మట్టి కుండలను కాల్చడం రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలిమెట్టుగా పరిణమించింది. చేనేత కళ ఆరంభమై క్రమంగా భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది. పత్తిపంటను పండించడం వృక్ష శాస్త్ర అభ్యసనానికి దారితీసింది. వస్తుమార్పిడి పద్ధతి వ్యాపార, వాణిజ్యాలకు మార్గదర్శకమైంది.
* ఈ విధంగా ఆధునిక శాస్త్ర విజ్ఞానాల ఆరంభం కొత్తరాతియుగంలోనే జరిగింది. మానవుడు ఆహార సేకరణ, వేటగాడి దశ నుంచి స్థిరజీవన దశకు చేరుకున్నాడు.


ఆర్థిక జీవనం
* ఈ కాలంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ ఉండటం వల్ల మిశ్రమ ఆర్థిక విధానం రూపుదిద్దుకుంది. ఆర్థిక జీవన నిర్మాణంలో స్త్రీ, పురుషులు సమాన పాత్రలు పోషించారు.
* 'చక్రాన్ని' ఆవిష్కరించడం వల్ల ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.


మతవిశ్వాసాలు
* ప్రజలు ఇతర దేవతలతో పాటు భూమిని కూడా పూజించేవారు. పూజారులను దేవతలు, మానవులకు మధ్యవర్తులుగా భావించేవారు. ఆనాటి ప్రజలు పునర్జన్మ ఉంటుందని విశ్వసించేవారు.


రాజకీయ జీవనం
* ఈ కాలంలో ప్రజలను శత్రువుల బారి నుంచి కాపాడటం పరిపాలకుల విధి. వారికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని విశ్వసించేవారు.
* ఈ యుగంలో జరిగిన పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రజలకు అన్ని రంగాల్లో ప్రయోగాత్మకమైన అనుభవాలను కలిగించాయి. ఫలితంగా ఇది శాస్త్రీయ విజ్ఞాన ప్రగతికి ఆరంభదశగా రూపొందింది.


కాంస్యయుగపు నాగరికత
* సంస్కృతి, నాగరికత అనే పదాలను విభిన్న అర్థాల్లోనే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయ పదాలుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో 'నాగరికత' అంటే సమాజంపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి ప్రభావమని, 'సంస్కృతి' అంటే లలితకళలు, తాత్వికచింతనలు అని భావిస్తున్నారు.
* అందుకే సంస్కృతి మానవులంతా కలిసి ఏర్పాటుచేసిందని, నాగరికత కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన అంశమని తెలిపారు.
* నాగరికత అంటే నగరాల్లో నివసించే సమాజ ప్రగతి. నగరాలు అభివృద్ధి చెందిన చోట నాగరికతలు వెలిశాయని అంటారు.
* పురావస్తు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడినట్లుగా క్రీ.పూ.4000 సంవత్సరాల సమీప దశను 'రాగి తగరపు యుగం' అంటారు. నాగరికతా వ్యాప్తికి మూలమైన లోహయుగపు ప్రగతిలో ఈ యుగాన్ని మొదటి దశగా వర్ణించారు.
* ఈ యుగం రాగి, తగరం వాడుకతో ఆరంభమై కంచు, ఇనుము వాడుకలోకి వచ్చే వరకు కొనసాగింది. దీన్ని మానవ చరిత్రలో ప్రముఖ ఘట్టంగా పేర్కొన్నారు.


కాంస్య యుగం
* భాష, రాత సాధనాల ఆవిర్భావంతో మొదలైన నాగరికత నగర సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు మూలమైంది. జనాభా పెరుగుదలతో పరిసరాల గురించి ఏర్పడిన పరిజ్ఞానం వల్ల ఆర్థికాభివృద్ధి జరిగింది. దీన్నే 'నాగరికతా విప్లవం' అంటారు.
* రాయడం, నేర్చుకోవడం తెలిసిన తర్వాతనే పంచాంగం, భూగోళశాస్త్రం లాంటి విజ్ఞానశాస్త్రాలు రూపొందాయి.


ప్రాచీన నాగరికతలు
* ప్రాచీన నాగరికతలన్నీ సాధారణంగా నదీ లోయల్లోనే పుట్టాయి. ప్రపంచంలోని ముఖ్య నాగరికతలైన మెసపటోమియా, ఈజిప్టు, సింధు నాగరికతలు నదీ లోయల్లోనే వ్యాపించాయి.
* ఈ నాగరికతలు ఇంచుమించుగా క్రీ.పూ.3000 సంవత్సరాల ప్రాంతంలో ఏర్పడి మానవ జీవితాన్ని వ్యవస్థీకరించడానికి దోహదం చేశాయి. ఈ సమయంలోనే ప్రపంచమంతటా లోహం వాడుకలోకి వచ్చింది.
* ఈ నాగరికతాభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచమంతటా విస్తరించింది.
* అటవీ సంపద, భూమిపై సహజ వనరులు పెరగడం వల్ల ఆదాయం పెరిగింది. దీంతోపాటు విరామ సమయం కూడా పెరగడం వల్ల, ప్రజలు కొత్త భావాలు, ఆవిష్కరణలను ప్రవేశపెట్టగలిగారు. ఈ విధంగా ప్రపంచమంతటా సాంస్కృతికాభివృద్ధి జరిగింది.


నదీలోయ నాగరికతలు
* మానవ నాగరికత టైగ్రిస్, యూప్రెటిస్ నదీలోయలైన మెసపటోమియాలో ఆరంభమైంది. ఈజిప్టు, సింధు నాగరికతలు మెసపటోమియాలోని నాగరికత కంటే భిన్నంగా ఉన్నప్పటికీ, అనేక సామాన్యమైన అంశాలు ఉండటం వల్ల ఇవి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేశాయి.
* ప్రపంచంలోని అన్ని దేశాలు, జాతులు సమష్టిగా కృషి చేసినందువల్లే ప్రపంచ నాగరికత అభివృద్ధి చెందింది.
* ఈ యుగంలో మానవుడు సాధించిన సాంస్కృతికాభివృద్ధి ఆధునిక ప్రపంచ నాగరికతలో అంతర్భాగమైంది.
* శాస్త్రీయ, సాంకేతిక, వైజ్ఞానిక పరిశోధనల వల్ల క్రమేపి సమాజంలోని మానవులంతా సమానులే అనే భావన ఏర్పడింది. ఇది ప్రజాస్వామ్య విధానాలకు మార్గదర్శకమై ఆధునిక యుగానికి నాందిపలికింది.


సామాజిక లక్షణాలు
* ఈ యుగంలో వేటగాళ్ల దశ అంతమై వ్యవస్థీకృత జీవనం మొదలైంది. రాత నేర్చుకోవడం వల్ల సమాజంలో స్థిరత్వం ఏర్పడి మానవుడి ఆలోచనలకు ఒక క్రమరూపం ఏర్పడింది. రాతికి బదులు లోహాన్ని ఉపయోగించడం వల్ల వృత్తి నైపుణ్యం పెరిగింది.
* గ్రామాల స్వయంసమృద్ధి అంతరించి పట్టణాలపై ఆధారపడాల్సి వచ్చింది. కొత్తగా కనుక్కున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల పరిశ్రమలు ఏర్పడ్డాయి.
* వ్యవసాయంలో లోహాన్ని ఉపయోగించి మెరుగైన నాగళ్లను వాడటం వల్ల పంటల సాగు విస్తృతమైంది.
* నదీమైదానాల్లో నివసించే ప్రజలు వరదలను నివారించడానికి అడ్డుకట్టలు నిర్మించారు. వరదల సమయంపై అవగాహన ఏర్పడటం వల్ల వ్యవసాయ రుతువులను గుర్తించగలిగారు.
* 'చక్రం' ఉపయోగించడం వల్ల సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.


రాజకీయ మతజీవనంపై నూతన సాంకేతిక పరిజ్ఞానపు ప్రభావం
* లోహయుగం నాటికి అభివృద్ధి చెందిన మెసపటోమియా, ఇరాన్ ప్రాంతాల వారు ఇతరులపై పెత్తనం చేసేవారు. యుద్ధంలో ఓడిపోయిన వారిని బానిసలుగా చేసుకుని తమ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించేవారు.
* నగర శిథిలాల్లో లభించిన అవశేషాలను పరిశీలించడం వల్ల, ఆ కాలంలో నగరపాలక సంస్థలుండేవని తెలుస్తోంది. వర్తకులు, భూస్వాముల సంబంధాలు వేర్వేరుగా ఉండేవి.
* మెసపటోమియా పట్టణ దేవాలయాలు పరిపాలన కేంద్రాలుగా 'పటెశి' అని పిలవబడే పూజారుల ఆధిపత్యంలో ఉండేవి. సుమేరియా పట్టణాల్లో ఈ కేంద్రాలను 'జిగ్గురాత్' అని పిలిచేవారు. నగరాన్ని రక్షించడం, ఆర్థిక సంపదను సమాజంలోని వివిధ వర్గాలకు పంచడం లాంటివి అప్పటి ప్రభుత్వ పనుల్లో ముఖ్యమైనవి.


మత జీవనం
* ఈ యుగంలోనే 'పూజారులు' అనే ప్రత్యేక వర్గం ఏర్పడింది. ముద్రలు, పచ్చబొట్లు మహిమగలవని మానవులు విశ్వసించేవారు. దేవతల చిహ్నాలను ఆయా దేవాలయాల్లో ప్రదర్శించేవారు. ప్రకృతి శక్తులను జయించడానికి మానవుడు చేసిన ప్రయత్నాలన్నీ మత విశ్వాసాల నుంచి గ్రహించినవే.
* 'దేవుడు' నగర జీవనానికి ప్రధానమైనవాడు. పూజారి ద్వారానే ఆయన ప్రజలకు సన్నిహితుడౌతాడు అని నమ్మేవారు. దేవుడికి ఆహార పానీయాలు సమకూర్చడానికే మానవుడు, సుమేరియన్లు సృష్టించబడ్డారని నమ్మేవారు.
* ఈజిప్టు సుమేరియా దేశాల్లో సూర్యుడు ప్రధాన దైవం. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని మానవుడి జనన మరణాలతో పోల్చి చూస్తూ మానవులకు పునర్జన్మ ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసించేవారు.
* సమాధుల్లో లభించిన వస్తువుల ఆధారంగా అప్పటి ప్రజలకు మరణానంతరం మరో జీవితం ఉంటుందనే నమ్మకం ఉండేదని స్పష్టమవుతోంది. నగరానికి బయట శ్మశానం ఉండేదని, అనేక పూజా కార్యక్రమాలతో అంత్యక్రియలు నిర్వహించేవారని తెలుస్తోంది.


భాషాకళల విశిష్టత
* ఈజిప్ట్‌లోని పిరమిడ్ల నిర్మాణాలను పరిశీలిస్తే కళాకారుల పనితనంతో పాటు వారిపై మత విశ్వాసాల ప్రభావం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
* రాజుల సమాధుల్లో స్త్రీలను, ధనధాన్యాలను, విలాస వస్తువులను పూడ్చిపెట్టేవారు. ఈ వస్తువులు చనిపోయిన రాజుకు ఉపయోగపడతాయని వారి నమ్మకం. కాంస్య యుగంలో ఆవిష్కృతమైన లిపి ప్రభావం వల్ల గణితం, భూగోళ, వైద్యశాస్త్రాల అభివృద్ధికి మార్గం సుగమమైంది.
* ప్రాచీన కాలంనాటి ఈజిప్షియన్లు కాలాన్ని సంవత్సరాలు, నెలలు, వారాలుగా విభజించి క్యాలెండర్‌ను రూపొందించారు. రోజుకు 24 గంటల కాలమానాన్ని నిర్ణయించారు. వారు పిరమిడ్ల నిర్మాణంలో కచ్చితమైన కొలతలను పాటించారు. ఈ ప్రయోగాలన్నీ తక్షణ అవసరాలకు మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తాయి.
* కాంస్యయుగంలో సాధించిన పరిజ్ఞానం అడవులను పెంచడానికి యుద్ధాల్లో విజయం సాధించడానికి, వ్యాపారం కొనసాగించడానికి ఉపయోగపడింది. వీటిని గమనిస్తే మానవుడు భౌతిక వనరులను, తనకు తన సంతానానికి, సుఖ సంతోషాలను కలిగించడానికి ఉపయోగించేవారు.
* ఆ కాలంనాటి శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన పదాలన్నీ మత విశ్వాసాల నుంచే ఏర్పడ్డాయి.
* కాంస్యయుగంలో వివిధ ప్రాంతాల్లోని మానవులు సాధించిన సాంకేతిక పరిజ్ఞానంలో సామాన్యమైన లక్షణాలు ఉండటం సమైక్య రాజకీయ వ్యవస్థల ఏర్పాటుకు దోహదంచేసింది.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సింధు నాగరికత

క్రీ.శ. 1921 లో జరిగిన ఒక సంఘటన భారతదేశ చరిత్రనే కాకుండా పురావస్తు శాస్త్ర గతిని కూడా మార్చేసింది. రాయ్‌బహద్దూర్ దయారాం సహాని 1921 లో ప్రసిద్ధ హరప్పా నగరాన్ని సింధునదికి ఉపనది అయిన రావి నది ఒడ్డున కనుక్కున్నారు. 1922 లో ఆర్.డి. బెనర్జీ సింధునది కుడి ఒడ్డున ఉన్న మొహంజోదారోను కనుక్కున్నాడు.
సింధు నాగరికతకు పురావస్తు శాస్త్రజ్ఞులు వివిధ పేర్లను ప్రతిపాదించారు. క్రీ.పూ. 3000 నాటి సుమేరియా నాగరికతతో హరప్పా నాగరికతకు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా దీన్ని మొదట ఇండో-సుమేరియా నాగరికతగా పిలిచారు. ఇది సింధు నది లోయలో అభివృద్ధి చెందడం వల్ల దీన్ని సింధు నాగరికత అని కూడా అంటారు. సర్ జాన్ మార్షల్ దీన్ని హరప్పా నాగరికత (లేదా) సంస్కృతిగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఏ ప్రదేశంలో ఒక నాగరికతను మొదట కనుక్కుంటారో దాని ఆధారంగా ఆ సంస్కృతికి పేరు పెట్టడం పురావస్తు శాస్త్ర సంప్రదాయం. అనేక సింధు లోయ ప్రదేశాలు హక్ర - ఘగ్గర్ నదీ ప్రాంతంలో కనుక్కోవడం వల్ల దీన్ని సరస్వతి సింధు నాగరికత అని పిలుస్తున్నారు.


* కాలం: వేద సాహిత్యం ప్రకారం క్రీ.పూ. 2000 సంవత్సరానికి ముందు భారతదేశ చరిత్ర, సంస్కృతి ఉన్నట్లు ఆధారాలు లేవు. అయితే, మొహంజోదారో, హరప్పా, చాన్హుదారో, ఇతర సింధులోయ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల ఆధారంగా క్రీ.పూ. 3200 ఏళ్లనాటి సంస్కృతి వెలుగులోకి వచ్చింది. సుమేరియా, అక్కడ్, బాబిలోనియా, ఈజిప్టు, అస్సీరియా లాంటి గొప్ప ప్రాచీన నాగరికతలకు ఏమాత్రం తీసిపోని నాగరికత హరప్పా ప్రాంతంలో ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. రేడియో కార్బన్ డేటింగ్ విధానం ద్వారా క్రీ.పూ. 2500 - 1750 మధ్య ఈ నాగరికత పరిణితి చెందే దశలో ఉన్నట్లు తెలుస్తోంది.


* భౌగోళిక వ్యాప్తి: ఈ నాగరికత ప్రస్తుత పాకిస్థాన్, వాయవ్య భారతదేశంలో ఉండేది. ఇది ఉత్తరాన జమ్మూలోని మాండ నుంచి దక్షిణాన దైమాబాద్ వరకు, తూర్పున పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని అలంఘీర్‌పూర్ నుంచి పశ్చిమాన బెలూచిస్థాన్‌లోని సుత్కాజెండర్ వరకు విస్తరించింది. పాకిస్థాన్‌లోని హరప్పా, మొహంజోదారో, చాన్హుదారో, భారత్‌లో గుజరాత్‌లోని లోథల్, రంగపూర్, సుర్కోటుడా, రాజస్థాన్‌లోని కాలిబంగన్, హరియాణాలోని బన్వాలి, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లోని అలంఘీర్‌పూర్‌లు ఈ నాగరికతకు చెందిన ప్రధాన నగరాలు. దీనికి సంబంధించి తాజాగా కనుక్కున్న ప్రదేశం గుజరాత్‌లోని ధోలవీరా. డాక్టర్ జగపతిజోషి, డాక్టర్ ఆర్.ఎస్. బిస్త్‌లు ఈ ప్రదేశంలో నిర్వహించిన తవ్వకాల్లో ప్రముఖ పాత్ర వహించారు. ఇది సింధులోయ నాగరికతకు సంబంధించిన అతిపెద్ద ప్రదేశం. హరప్పా సంస్కృతి 1.3 మిలియన్ చ.కి.మీ.ల మేర వ్యాపించి, క్రీ.పూ. 3000 - 2000 మధ్య విలసిల్లింది. ప్రపంచ నాగరికతల్లో ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించిన నాగరికతగా ఇది ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.


సామాజిక జీవనం
    హరప్పా ప్రజల సామాజిక జీవనం గురించి తెలుసుకోవడానికి ఉన్న ప్రధాన ఆధారం అక్కడి తవ్వకాల్లో లభించిన వస్తువులే. వీటికి సంబంధించిన శాసనాలు కానీ, లిఖిత ఆధారాలు కానీ లేవు. హరప్పా ప్రజల లిపి బొమ్మల లిపి. దాన్ని చదివి, అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరి సామాజిక జీవితానికి సంబంధించిన ప్రధాన లక్షణాలను కింది విధంగా వివరించవచ్చు.
* హరప్పా సంస్కృతి నాటి సమాజాన్ని ఆర్థిక హోదాను బట్టి విభజించినట్లు తెలుస్తోంది. హరప్పా నగరాలను అనేక భాగాలుగా విభజించడమే దీనికి నిదర్శనం. హరప్పా సమాజం మాతృస్వామిక సమాజమని సర్ జాన్ మార్షల్ అభిప్రాయం. ఇతడు రెండు కారణాల వల్ల ఈ అభిప్రాయానికి వచ్చాడు.
a) హరప్పా నగరాల్లో లభించిన బంకమట్టితో చేసిన బొమ్మల్లో పురుషుల కంటే స్త్రీల బొమ్మలు అధిక సంఖ్యలో ఉండటం.
b) హరప్పా ప్రజలు అమ్మతల్లిని పూజించడానికి ఎక్కువ ఇష్టాన్ని చూపించడం. దీంతోపాటు బంకమట్టితో చేసిన అమ్మతల్లి బొమ్మలు ఎక్కువ సంఖ్యలో లభించడం.
* హరప్పా ప్రజల సామాజిక జీవనంలో మరో ప్రధాన లక్షణం జంతువులను మచ్చిక చేసుకోవడం. హరప్పా ప్రజలు ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, ఒంటెలు మొదలైన జంతువులను మచ్చిక చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వ్యవసాయం, గృహ అవసరాలు, వేట మొదలైనవి హరప్పా ప్రజలు జంతువులను మచ్చిక చేసుకునేలా చేసి ఉండొచ్చు. హరప్పా ప్రజలకు గుర్రం గురించి తెలుసు. బంకమట్టితో చేసిన గుర్రపు నమూనాలు, గుర్రానికి చెందిన అవశేషాలు మొహంజోదారో, లోథల్, సుర్కోటుడాల్లో లభించాయి. అయితే హరప్పా ప్రజలు గుర్రాన్ని ఎక్కువగా ఉపయోగించలేదు. సమకాలీన సుమేరియన్లు హరప్పా ప్రజలు మచ్చిక చేసుకున్న జంతువులనే మచ్చిక చేసుకున్నారు. అయితే గుజరాత్‌లోని హరప్పా ప్రజలు వరిని పండించారు. ఏనుగులను మచ్చిక చేసుకున్నారు. కానీ, సుమేరియన్లకు వీటి గురించి తెలియదు.
* దుస్తులు, కేశాలంకరణ, ఆభరణాలు: హరప్పా సంస్కృతికి చెందిన స్త్రీ, పురుషులు దుస్తులు, కేశాలంకరణ పట్ల ఎక్కువ ఇష్టం ప్రదర్శించారు. నూలు, ఉన్నితో చేసిన దుస్తులను వాడేవారు. మొహంజోదారోలో కనుక్కున్న బంకమట్టితో చేసిన బొమ్మ ఆధారంగా హరప్పా ప్రజలకు అల్లికలు, కుట్ల గురించి అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. హరప్పా స్త్రీలు అలంకారప్రియులు. ఆ కాలంనాటి ప్రజలు కొయ్య, దంతాలతో చేసిన దువ్వెనలు, గాజులు, వివిధ ఆభరణాలను ఉపయోగించేవారు. బంకమట్టితో చేసిన బొమ్మల ఆధారంగా స్త్రీలు చేతినిండా గాజులు ధరించినట్లు తెలుస్తోంది. అందాన్ని ఇనుమడింపజేసేలా కేశాల మధ్యలో దువ్వెనలు, పువ్వులు పెట్టుకునేవారు. పురుషులకు గడ్డం క్షవరం చేసుకోవడం గురించి తెలుసు.
* స్నానపు అలవాట్లు: హరప్పా నగరంలో చాలావరకు స్నానపు ఘట్టాలను ఏర్పాటు చేశారు. మొహంజోదారోలో ప్రసిద్ధి చెందిన గొప్ప స్నాన వాటిక ఉండేది. స్నానపు గదులు ఇంటి మూలలో లేదా వరండాలో ఉండేవి. ఇది హరప్పా ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల ఉన్న అవగాహనకు నిదర్శనం.
* ఆహారం: హరప్పా ప్రజలు శాకాహారం, మాంసాహారం తినేవారు. కోడి, చేప, మాంసం, గోధుమలు, వరి మొదలైనవి వారి ఆహారంలో ప్రధానమైనవి.
* వినోదాలు: హరప్పా ప్రజలకు ఇంట్లో ఆడుకునే ఆటలైన నృత్యం, జూదం గురించి తెలుసు. అయితే వారికి రథపు పందాలు, వేట గురించి తెలియదు.
* పై లక్షణాలను బట్టి హరప్పా ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో జీవించినట్లు తెలుస్తోంది. ఉన్నతవర్గాల వారు విలాసవంతమైన జీవితాన్ని, సామాన్య ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. హరప్పా సమాజంలో అసమానతలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.


ఆర్థిక వ్యవస్థ
    హరప్పా ప్రజలది వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ. వీరు వ్యవసాయం కోసం సారవంతమైన వరద మైదానాలను ఉపయోగించేవారు. వీరికి భూమి దున్నడం తెలుసు. దీనికోసం కొయ్యతో చేసిన నాగలిని ఉపయోగించేవారు. కాలిబంగన్‌లో కనుక్కున్న నాగలితో దున్నిన చాళ్లు, బన్వాలిలో లభించిన బంకమట్టితో చేసిన నాగలి నమూనా ఇందుకు నిదర్శనం. హరప్పా ప్రజలు కాలువల ద్వారా పంటలకు నీటి పారుదల సౌకర్యం కల్పించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సింధు హరివాణం సారవంతంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రతి సంవత్సరం సింధునది వరదలకు గురికావడమే. హరప్పా ప్రజలు వరదనీటి మట్టం తగ్గుముఖం పట్టిన తర్వాత నవంబరు నెలలో విత్తనాలు వేసి, వరదలు రావడానికి ముందే ఏప్రిల్‌లో గోధుమ, బార్లీ పంటల నూర్పిడి పూర్తిచేసేవారు.
* సింధు హరివాణంలో గోధుమ, బార్లీ, పత్తి మొదలైన పంటలను, గుజరాత్, కథియవార్ ప్రాంతాల్లో వరిని పండించేవారు. హరప్పా ప్రజలు ప్రపంచంలోని మొదటిసారి వరి, పత్తి పంటలను పండించారు. గ్రీకులు క్రీ.పూ. 4 వ శతాబ్దంలో పత్తి పంటను పరిశీలించి, దానికి సింధునది పేరు మీదుగా సిండాన్ అనే పేరు పెట్టారు. లోథల్, కాలిబంగన్‌లలో జరిపిన తవ్వకాలు వరి వాడకం గురించి తెలియజేస్తున్నాయి. ధాన్యాగారాల ఏర్పాటు హరప్పా ప్రజల ప్రధాన లక్షణం. ఆహార ధాన్యాలను సులభంగా రవాణా చేయడానికి ధాన్యాగారాలను నదీ తీరాల్లో ఏర్పాటు చేసేవారు. అనేక హరప్పా నగరాల్లో ధాన్యాగారాలు ఉండటం హరప్పా ప్రజలు వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడటాన్ని తెలియజేస్తోంది.


వ్యాపారం
   హరప్పా నగరాల్లో అవసరమైన ముడిపదార్థాలు లభించనందువల్ల హరప్పా ప్రజలు భారత ఉపఖండం లోపల, ఉపఖండం బయట వర్తక సంబంధాలను నెలకొల్పారు. అంతేగాక, హరప్పా ప్రజలు తాము తయారుచేసిన వస్తువులను అమ్ముకోవడానికి కూడా వర్తక సంబంధాలు అవసరమయ్యాయి.
* ఉపఖండం లోపల వర్తకం: ఉపఖండం లోపల వర్తకం అంటే హరప్పా నగరాల మధ్య అంతర్గత వ్యాపారమే కాకుండా ఇరుగు పొరుగున ఉన్న దక్కను, దక్షిణ భారతదేశం మొదలైన ప్రదేశాలతో జరిపిన వ్యాపారం అని అర్థం. హరప్పా ప్రజలు వివిధ రకాలైన లోహాలు, విలువైన రాళ్లను వేర్వేరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. వీరు దక్షిణ భారతదేశం, అఫ్గనిస్థాన్, ఇరాన్ నుంచి బంగారం, రాజస్థాన్‌లోని ఖేత్రి గనుల నుంచి రాగి, బిహార్ నుంచి తగరం, దక్షిణ భారతదేశం, సౌరాష్ట్ర, రాజస్థాన్, దక్కనుల నుంచి విలువైన రాళ్లను దిగుమతి చేసుకునేవారు.
* రవాణా సౌకర్యాలు, వ్యాపార స్వభావం: హరప్పా కాలంనాటి ఓడరేవులు లోథల్, సుర్కోటుడా, సుక్తాజెండర్. వీరు పశ్చిమ ఆసియా దేశాలతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారం సాగించేవారు. ఎస్.ఆర్. రావు లోథల్‌లో జరిపిన తవ్వకాల్లో ప్రాచీన ఓడరేవు బయటపడింది. ఇది హరప్పా ప్రజలకు చెందిన గొప్ప సంపన్నమైన ఓడరేవై ఉండొచ్చని పరిశోధకుల అభిప్రాయం.
* మొహంజోదారోలో బయటపడిన ముద్రికలపై ఓడబొమ్మలు అంతర్జాతీయ వ్యాపారాన్ని, వ్యాపారం కోసం పడవల వాడకాన్ని తెలియజేస్తున్నాయి. హరప్పా ప్రజలకు లోహపు నాణేల వాడకం గురించి తెలియదు. బహుశా ముద్రికలను వ్యాపార చిహ్నాలుగా వాడి ఉండొచ్చు. హరప్పా ప్రజల వ్యాపారం వస్తుమార్పిడి ద్వారా జరిగింది. వారు ఉత్పత్తి చేసిన వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసి లోహాలు, ముడిసరకులను దిగుమతి చేసుకునేవారు. రవాణా కోసం పడవలు, ఎడ్లబండ్లను వినియోగించేవారు. వీరికి బలమైన చక్రాలతో కూడిన బండ్ల వాడకం గురించి తెలుసు. దీని ఆధారంగా హరప్పా ప్రజలకు కావలసినంత వ్యవసాయ మిగులు ఉండేదని, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయని, లాభదాయకమైన అంతర్గత, అంతర్జాతీయ వ్యాపారం జరిగేదని తెలుస్తోంది. వీరి కాలంలో దిగుమతుల కంటే, ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండేది.

 

ముఖ్యమైన ప్రాంతాలు
         సింధు నాగరికత దాదాపు 1000 ప్రాంతాల్లో విస్తరించింది. ఈ నాగరికత క్రీ.పూ.3000 - క్రీ.పూ.1500 మధ్య కాలం నాటిది. సింధు నాగరికత ఉత్తరాన రూపర్ (పంజాబ్) నుంచి దక్షిణాన భగత్రావ్ (గుజరాత్) వరకు సుమారు 1100 కి.మీ. వ్యాపించి ఉండేది. పశ్చిమాన సుత్కాజెండర్ (పాకిస్థాన్ సరిహద్దు) నుంచి తూర్పున అలంగీర్‌పూర్ (ఉత్తర్ ప్రదేశ్) వరకు దాదాపు 1600 కి.మీ. విస్తరించింది.

 

సింధు నాగరికత కాలంలో బయటపడిన ప్రధాన నగరాలు, వాటి ఉనికి 
1. హరప్పా: పశ్చిమ పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్)
2. మొహంజోదారో: సింధ్ - లార్కానా జిల్లా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది.)
3. చాన్హుదారో: సింధ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)
4. సుత్కాజెండర్: పాకిస్థాన్ - ఇరాన్ సరిహద్దుల్లోని బెలూచిస్థాన్‌లో ఉంది.
5. రూపర్: పంజాబ్ (భారతదేశం)
6. బన్వాలీ: హరియాణాలోని హిస్సార్ జిల్లాలో ఉంది.
7. కాలిబంగన్: రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఉంది.
8. లోథాల్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది.
9. అలంగీర్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌కు సమీపంలో ఉంది.
10. రంగపూర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది.
11. సుర్కోటుడా: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉంది.
12. ధోలవీర: ఇది ప్రస్తుతం గుజరాత్‌లో ఉంది.


సింధు నాగరికత పతనం
         సింధు నాగరికత పతనం గురించి కూడా చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్రీ.పూ.1700 నాటికి వరదల కారణంగా హరప్పా నాగరికత పతనమైంది. ఉపరితలానికి 50 నుంచి 80 అడుగుల ఎత్తులో కూడా కొన్నిచోట్ల ఇసుక మేటలు కనిపించాయి. కాబట్టి భారీ వరద సంభవించి నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉండొచ్చని చరిత్రకారుల ఊహ. అలాగే సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంతో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడ్డారనేది మరో అభిప్రాయం.
* పక్కనున్న ఎడారి విస్తరించడంతో ఇక్కడి భూములు బీడు భూములుగా మారి, సారం కోల్పోయి ఉంటాయని, ఆర్యుల దాడిలో ఈ నాగరికత నాశనమై ఉంటుందని మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బౌద్ధ మతం

* బుద్ధుడి తొలి జీవితం గురించి బౌద్ధ జాతక కథలు వివరిస్తాయి.
* బౌద్ధ మత పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకాలు పాళీ భాషలో ఉన్నాయి.
* భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం ప్రపంచ మతంగా అభివృద్ధి చెందింది.
* వినయ పీటకం బౌద్ధ సంఘ నియమ నిబంధనలను, సుత్త పీటకం బుద్ధుడి బోధనలను, అభిదమ్మ పీటకం బౌద్ధ దమ్మ వేదాంతాన్ని వివరిస్తాయి.
* బౌద్ధ మతానికి చెందిన ముఖ్య నిర్మాణాలు
1. స్తూపం
2. చైత్యం
3. విహారం
* బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.
* బౌద్ధ మతస్తుల పూజా గృహాన్ని చైత్యం అంటారు. ఇది మహాయానులకు చెందింది.
* బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలను విహారాలు అంటారు.
* స్తూప, చైత్య, విహారాలు ఒకే చోట ఉంటే దాన్ని బౌద్ధ ఆరామంగా పేర్కొన్నారు.
* బౌద్ధ ఆరామాలు నాడు ప్రసిద్ధ విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
* భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా నాగార్జున కొండ విశ్వవిద్యాలయం పేరొందింది.
* భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల, ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం నలంద.
* విహార దేశంగా పేరొందిన రాష్ట్రం బిహార్
* గాంధార, అమరావతి శిల్ప కళలు బౌద్ధ మత ప్రేరణతో అభివృద్ధి చెందాయి.
* సాంచీ స్తూపం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ దగ్గర ఉంది.
* సారనాథ్ స్తూపం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
* పిప్రావహని భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం అని పేర్కొంటారు.
* ఆంధ్రదేశం / దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపంగా భట్టిప్రోలు పేరుగాంచింది.
* బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం వల్ల బౌద్ధ మతాన్ని మధ్యేమార్గంగా పేర్కొంటారు.
* బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాన్ని ప్రతీయ - సముత్పాద సిద్ధాంతం అంటారు.
* బుద్ధుడి జననం, జ్ఞానోదయం కలగడం, మహాపరినిర్యాణం పౌర్ణమి రోజునే జరిగాయి.
* బుద్ధుడి మరణం తర్వాత బౌద్ధ మత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)
* మొదటి బౌద్ధ సంగీతి - రాజగృహం - అజాతశత్రువు కాలం - మహాకాశ్యపుడు అధ్యక్షుడు.
* రెండో బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగింది. సబకామి దానికి అధ్యక్షుడు.
* మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. మొగ్గలిపుతతిస్స అధ్యక్షుడు.
* నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కశ్మీర్/ కుందనవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు.
* మాధ్యమిక సాంప్రదాయ వాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రబోధించారు.
* మైత్రేయనాథుడు యోగాచారవాదాన్ని ప్రారంభించాడు.
* మాధ్యమికవాదాన్నే శూన్యవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదాన్ని విజ్ఞానవాదంగా కూడా పేర్కొంటారు.
* యోగాచార వాదం హీనయానానికి చెందిన వాస్తవిక వాదాన్ని పూర్తిగా తిరస్కరించి, పరమ ఆదర్శవాదాన్ని అంగీకరిస్తుంది.
* ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞాపారమితిక శాస్త్ర మహాయానుల పవిత్ర గ్రంథంగా పేరుగాంచింది.
* అసంగుడు, వసుబంధు లాంటి రచయితలు కూడా మహాయాన సంప్రదాయాన్ని అనుసరించారు.
* సూత్రాలంకార గ్రంథాన్ని రాసింది అసంగుడు.
* మహాయానులు సంస్కృత భాషలో ఉన్న సొంత త్రిపీటకాలను అభివృద్ధి చేసుకున్నారు.
* మహాయానులు వైపుల్య సూత్రాలను బుద్ధుడి ప్రకటనలుగా భావించి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* సధర్మపుండరీకం, లలిత విస్తార, వజ్రచేధిక, సుఖవతి లాంటి గ్రంథాలను పవిత్రంగా భావించి, అనుసరించారు.
* బౌద్ధ మతంలో వజ్రయానం అనే మరొక శాఖ తర్వాత కాలంలో ఏర్పడింది.
 ఇంద్రజాలిక శక్తులు పొందడం ద్వారా మోక్షం సాధించడం ఈ వాదం వారి ఆశయం.
* వజ్రయాన శాఖవారు బౌద్ధులు, బోధిసత్వుల భార్యలైన తారలను ప్రధాన దైవాలుగా భావించి పూజించారు.
* వీరు తాంత్రిక పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు (తంత్ర నిర్వహణ ద్వారా మంత్రం వల్లెవేయడం)
* పాల వంశీయులు, సేన వంశీయుల కాలంలో తూర్పు భారతదేశంలో వజ్రయాన శాఖ బాగా విస్తరించింది.
* సరాహుడు రచించిన దోహకోశ వజ్రయానానికి చెందిన ప్రసిద్ధ గ్రంథం.
* కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని ఆచరించాడు.
* గాంధార శిల్పకళ కనిష్కుడి కాలంలో మహాయాన బౌద్ధ మతం ప్రేరణతో అభివృద్ధి చెందింది.
* భాగవతుడు అంటే ఆరాధనీయమైన వారిని ఆరాధించేవ్యక్తి అని అర్థం. చాందోగ్యోపనిషత్తు కృష్ణ వాసుదేవుడిని దేవకీ పుత్రుడిగా పేర్కొంది.
* పాణిని రచన అష్టాధ్యాయిలోను, మెగస్తనీస్ ఇండికా (హెరాక్లెస్) లోను, బెస్‌నగర్ స్తంభ శాసనంలో భాగవత మత ఆరాధన గురించిన ప్రాస్తావన ఉంది.
* బెస్ నగర స్తంభ శాసనాన్ని కాశీపురానికి చెందిన శుంగరాజు భాగభద్రుడు వేయించాడు.
* బెస్ నగర స్తంభ శాసనం గ్రీకు రాయబారి హీలియో డోరస్‌ను భాగవతుడిగా పేర్కొంది.
* గుప్తుల కాలంలో భాగవత మతం అభివృద్ధి చెందింది.
* నాగులు, యక్షులు, గ్రామదేవతల ఆరాధన నుంచి బ్రాహ్మణవాదం అభివృద్ధి చెందింది.
* పంచాయతన పూజా విధానంలో గణేశుడికి అగ్రస్థానం ఇచ్చారు.
* గుప్తయుగానంతరం భాగవత మతాన్ని వైష్ణవ మతంగా పేర్కొన్నారు. అవతార సిద్ధాంతానికి అధిక ప్రాధాన్యం లభించింది.
* భాగవత మతం భగవద్గీత మీద ఆధారపడింది. వైష్ణవానికి క్రమంగా భాగవత పురాణం, విష్ణు పురాణాలు ప్రధాన గ్రంథాలుగా మారాయి.
* క్రీ.శ. 100వ సంవత్సరంలో 'శాండిల్యుడు' పంచరాత్రాలను ప్రబోధించారు. ఇందులో వాసుదేవ కృష్ణుడి కుటుంబం మొత్తాన్ని తాదాత్మ్యీకరించారు.
* కృష్ణుడి సోదరుడు సంకర్షణ, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు, కృష్ణుడి మనువడు అనిరుద్ధుడు.
* విఖాననుడు ప్రబోధించిన వైఖానన సంప్రదాయాన్ని అత్రి, మరీచి, భృగు, కశ్యపుడు అనే మహార్షులు ప్రచారం చేశారు.
* వైఖానన సంస్కార సిద్ధాంతం విష్ణువుకు చెందిన అయిదు రూపాల భావనపై ఆధారపడి ఉంది.
* బ్రహ్మ, పురుషుడు, సత్యం, అచ్యుతం, అనిరుద్ధుడు అనేవి విష్ణువు అయిదు రూపాల భావనలు.
* తిరుపతి వేంకటేశ్వరస్వామి దేవాలయం, కంచి దేవాలయాలలో సంస్కృత భాషలో పూజలు నిర్వహిస్తున్న పూజారులు వైఖాననశాఖకు చెందినవారే.
* దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తులను ఆళ్వారులు అంటారు. వీరు మొత్తం పన్నెండుమంది.
* నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ వారిలో ముఖ్యమైనవారు.
* ఆళ్వార్‌లలో ఉన్న ఏకైక మహిళ ఆండాళ్.
* ఆండాళ్ అనే తమిళ కవయిత్రి గురించి శ్రీకృష్ణ దేవరాయలు తన 'ఆముక్తమాల్యద' గ్రంథంలో ప్రస్తావించారు.
* ఆళ్వార్లు రాసిన పద్యాలు, పాటలను పాశురాలు లేదా 'ప్రబంధాలు' అంటారు.
* 'తండ్రివి నీవే ఓ పరమాత్మా! అగ్ని, నీరు, ఆకాశం నీ సృష్టేనయ్యా!' అనే పాటను నమ్మాళ్వార్ రాసి పాడారు.
* నాకేల ఇవ్వవు నీ దర్శన భాగ్యము? దాగుడు మూతలు ఏల' అని నమ్మాళ్వార్ భగవంతుడిని ప్రశ్నిస్తూ పద్యాలు రాశారు.
* శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు, త్రిమతాచార్యులు/ వైష్ణవాచార్యులుగా పేరొందారు.
* శంకరాచార్యులు 'అద్వైత' మత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. (కేరళలో జన్మించారు, 8వ శతాబ్దం.)
* 'జీవాత్మ, పరమాత్మ ఒకటే. మోక్షసాధనకు జ్ఞానమార్గం అనుసరించడం ఒక్కటే మార్గం' అని శంకరాచార్యులు ప్రబోధించారు.
* రామానుజాచార్యులు క్రీ.శ. 11వ శతాబ్దంలో విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు.
* 'విష్ణువు మీద గాఢమైన భక్తి కలిగి ఉండటమే ముక్తికి ఉన్న ఏకైక మార్గం' అని రామానుజాచార్యులు పేర్కొన్నారు.
* రామానుజాచార్యులపై ఆళ్వార్లు అధిక ప్రభావాన్ని చూపారు.
* భారతదేశంలో భక్తి ఉద్యమ ప్రారంభికుడిగా, నిమ్నకులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించిన తొలి వ్యక్తిగా రామానుజాచార్యులు పేరొందారు.
* రామానుజులు ప్రచారం చేసిన విశిష్టాద్వైతాన్ని 'శ్రీవైష్ణవం' అని పేర్కొంటారు. మధ్వాచార్యులు ద్వైత మతాన్ని, వల్లభాచార్యుడు శుద్ధా ద్వైతాన్ని, నింబార్కుడు ద్వైతాద్వైతాన్ని ప్రచారం చేశారు.
* బౌద్ధమతంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి.
* బౌద్ధమతంలో చేరిన వేశ్యగా ఆమ్రపాలిని పేర్కొంటారు.
* బుద్ధుడు అంగుళీమాలుడు అనే బందిపోటు దొంగను బౌద్ధమతంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (మంగలి) అనే వారిని బౌద్ధ సంఘంలో చేర్చుకున్నాడు.
* బుద్ధుడి తొలి శిష్యుడిగా ఆనందుడిని పేర్కొంటారు.
* బుద్ధుడి ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి.

* బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు

* బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు (శాక్యముని, తథాగతుడు, అంగీరసుడు అనేవి ఇతర పేర్లు)

* గౌతమబుద్ధుడి తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి

* బుద్ధుడు కపిలవస్తు రాజ్యానికి చెందినవాడు, శాక్య వంశస్థుడు.

* సిద్ధార్థుడు క్రీ.పూ.563లో లుంబిని వనంలో జన్మించాడు. లుంబిని ప్రస్తుతం నేపాల్‌ దేశంలో ఉంది.

* క్రీ.పూ.483లో నేటి ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుశి నగరంలో నిర్యాణం చెందాడు.

* బుద్ధుడి జీవితంలో జరిగిన 5 ప్రధాన సంఘటనలను పంచ కల్యాణాలు అంటారు.

* బుద్ధుడిని పెంచిన తల్లి - ప్రజాపతి గౌతమి

* బుద్ధుడికి 19వ ఏట యశోధరతో వివాహం జరిగింది. వారికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు.

* కపిలవస్తు నగరంలో ఒకేరోజు ఒక వృద్ధుడిని, వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని, శవాన్ని, సన్యాసిని చూసిన బుద్ధుడు పరివర్తన చెందాడు. అనంతరం తన 29వ ఏట ఇల్లు విడిచి వెళ్లాడు. దీన్నే మహాభినిష్క్రమణం అంటారు.

* బుద్ధుడి ప్రధాన గురువులు - అలరక, ఉద్ధారక

* బుద్ధుడు అలారకలామ అనే గురువు వద్ద సాంఖ్యదర్శనాన్ని నేర్చుకున్నాడు.

* రుద్రలీ రామపుత్ర అనే గురువు వద్ద యోగాభ్యాసం అధ్యయనం చేశాడు.

* బుద్ధగయలో సుజాత అనే కర్షక బాలిక బుద్ధుడికి క్షీరాన్నం (గంజి) ఇచ్చింది.

* సిద్ధార్థుడు తన 35వ ఏట 40 రోజుల ధ్యానం అనంతరం జ్ఞానోదయం పొందాడు. దీన్నే సంబోధి అంటారు.

* సిద్దార్థుడు నేటి బిహార్‌లోని గయలో రావిచెట్టు కింద 40 రోజులు తపస్సు చేశాడు.

* బుద్ధుడి తపస్సును భగ్నం చేసేందుకు మార అనే దుష్టశక్తి ప్రయత్నించగా భూదేవి వచ్చి మారను శిక్షించింది. ఈ విషయాన్నే బౌద్ధ సాహిత్యంలో భూస్పర్శముద్రగా పేర్కొన్నారు.

* బుద్ధుడి గుర్రం పేరు కంఠక. రథసారథి చెన్నడు. 

* బుద్ధుడు తన తొలి ఉపదేశాన్ని సారనాథ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) లోని జింకతోట/మృగదావనంలో తన పూర్వ సహచరులైన అయిదుగురు స్నేహితులకు బోధించాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తన అంటారు.

* బుద్ధుడి బోధనలను ఆర్య సత్యాలు(Nobel Truths) అంటారు

 ఆర్య సత్యాలు నాలుగు అవి;

1) ప్రపంచం దుఃఖమయం

2) దుఃఖానికి కారణం కోరికలు

3) దుఃఖం పోవాలంటే కోరికలు అంతమవ్వాలి

4) కోరికల అంతానికి అష్టాంగమార్గాన్ని అనుసరించాలి.

* దుఃఖ నివారణ, మోక్ష సాధనకు బుద్ధుడు చూపిన మార్గం లేదా చెప్పిన సూత్రాలే అష్టాంగ మార్గం.

* అష్టాంగ మార్గంలోని ఎనిమిది సూత్రాలు

1) సరైన జీవనం         2) సరైన వాక్కు 

3) సరైన క్రియ         4) సరైన ధ్యానం 

5) సరైన నిశ్చయం     6) సరైన దృష్టి 

7) సరైన ఆలోచన     8) సరైన శ్రమ.

 

 బౌద్ధమత గ్రంథాలను త్రిపీటకాలు అంటారు. అవి;

1) వినయ      2) సుత్త      3) అభిదమ్మ

* బుద్ధుడు, ధర్మం, సంఘంలను బౌద్ధ త్రిరత్నాలుగా పేర్కొంటారు. (గమనిక: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి)

* బౌద్ధమతంలో చేరిన తొలి మహిళ ప్రజాపతి గౌతమి.

* ఆమ్రపాలి అనే వేశ్య, అంగులీమాలుడు అనే బందిపోటు దొంగ బౌద్ధ మతంలో చేరినట్లు పేర్కొంటారు.

 బుద్ధుడు కపిలవస్తు నగరంలో ఆనందుడు, దేవదత్తుడు, ఉపాలి (మంగలి) అనే వారిని బౌద్ధ సంఘంలో  చేర్చుకున్నాడు.

* బుద్ధుడి తొలి శిష్యుడిగా ఆనందుడిని పేర్కొంటారు.

* బుద్ధుడి ప్రధాన శిష్యులు ఆనందుడు, ఉపాలి.

* బుద్ధుడి తొలి జీవితం గురించి బౌద్ధజాతక కథలు  వివరిస్తాయి.

* బౌద్ధ మతంలో పవిత్ర గ్రంథాలైన త్రిపీటకాలు పాళీభాషలో ఉన్నాయి.

* భారతదేశంలో పుట్టిన బౌద్ధమతం ప్రపంచమతంగా అభివృద్ది చెందింది.

* వినయ పీటిక బౌద్ధ సంఘ నియమ నిబంధనలను; సుత్త పీటిక బుద్ధుడి బోధనలను; అభిదమ్మ పీటిక బౌద్ధదమ్మ (బౌద్ధ ధర్మం) వేదాంతాన్ని వివరిస్తాయి.

 బౌద్ధమతానికి చెందిన ముఖ్య నిర్మాణాలు

1) స్తూపం      2)  చైత్యం      3) విహారం

* బుద్ధుడి ధాతువులపై నిర్మించిన పొడవైన స్తంభాన్ని స్తూపం అంటారు. ఇది బుద్ధుడి మహా నిర్యాణానికి ప్రతీక.

* బౌద్ధమతస్థుల పూజాగృహాన్ని చైత్యం అంటారు. ఇది మహాయానులకు చెందింది.

* బౌద్ధ భిక్షువుల విశ్రాంతి గృహాలే విహారాలు.

* స్తూప, చైత్య, విహారాలు ఒకేచోట ఉంటే దాన్ని బౌద్ధ ఆరామంగా పేర్కొంటారు. ఈ ఆరామాలు అప్పట్లో ప్రసిద్ధ విద్యాకేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.

* భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయంగా నాగార్జునకొండ విశ్వవిద్యాలయం పేరొందింది.

* భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయం తక్షశిల కాగా ప్రసిద్ధి చెందింది నలంద.

* విహార దేశంగా పేర్కొన్న రాష్ట్రం బిహార్‌.

* గాంధార, అమరావతి శిల్పకళలు బౌద్ధమత ప్రేరణతో అభివృద్ధి చెందాయి.

* మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ దగ్గర సాంచీ స్తూపం ఉంది.

* సారనాథ్‌ స్తూపం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంది.

* భారతదేశంలో అతి ప్రాచీన స్తూపంగా పేరొందింది పిప్రావహ.

* ఆంధ్రదేశం/దక్షిణ భారతదేశంలో అతిప్రాచీన స్తూపం భట్టిప్రోలు.

* బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం వల్ల బౌద్ధమతాన్ని మధ్యేమార్గంగా పేర్కొంటారు.

* బుద్ధుడి సిద్ధాంతాన్ని ప్రతీయ - సముత్పాద సిద్ధాంతం అంటారు.

* బుద్ధుడి జననం, జ్ఞానోదయం కలగడం, మహాపరి నిర్యాణం పౌర్ణమి రోజే జరిగాయి.

 బుద్ధుడి మరణానంతరం బౌద్ధమత అభివృద్ధి కోసం నిర్వహించిన సభలను బౌద్ధ సంగీతులు అంటారు. (మొత్తం నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి.)

* మొదటి బౌద్ధ సంగీతిలో వినయ, సుత్త పీటకాలను సంకలనం చేశారు.

* వినయ పీటకాన్ని ఆరామ స్మృతి అని పేర్కొంటారు. సుత్త పీటకంలో బుద్ధుడి బోధనలు ఉన్నాయి.

* రెండో బౌద్ధ సంగీతిలో బౌద్ధులు స్థవిరవాదులు/థెరవాదులు, మహాసాంఘికులుగా విడిపోయారు.

* మూడో బౌద్ధ సంగీతిలో అభిదమ్మ పీటకాన్ని సంకలనం చేశారు. (దీంతో త్రిపీటకాల సంకలనం పూర్తయ్యింది.)

* నాలుగో బౌద్ధ సంగీతిలో బౌద్ధమతం హీనయానం, మహాయానంగా విడిపోయింది.

* సభలో చర్చలు పాళీ భాషలో కాకుండా సంస్కృత భాషలో జరిగాయి.

* బుద్ధుడిని మాములు బోధకుడిగా (మనిషిగా) భావించి, విగ్రహారాధనను వ్యతిరేకించిన వర్గం హీనయానులు.

* హీనయానులు మత ప్రచారానికి, సాహిత్య రచనకు పాళీ భాషను వినియోగించారు.

* హీనయానులు స్వీయ క్రమశిక్షణ, ధ్యానం ద్వారా మోక్షం పొందవచ్చని విశ్వసించారు.

* పాళీ ధర్మశాస్త్ర గ్రంథాలైన త్రిపీటకాలను పవిత్ర గ్రంథాలుగా భావిస్తారు.(హీనయానులు)

* త్రిపీటకాల్లో అతిముఖ్యమైంది, పెద్దది - సుత్త పీటకం.

 సుత్త పీటకాన్ని అయిదు నికాయలుగా విభజించారు. అవి:

1) దీర్ఘ నికయ         2) మాధ్యమ నికయ 
3) సంయుక్త నికయ    4) అంగుత్తర నికయ    5) ఖుద్దాక నికయ

*  జాతక కథలు, దమ్మపదం లాంటి భాగాలు ఖుద్దాక నికయలో ఉన్నాయి.

*  మిళింద పన్హా గ్రంథంలో గ్రీకు రాజు మీనాండార్‌కు, బౌద్ధ సన్యాసి నాగసేనుడికి మధ్య జరిగిన చర్చల సారాంశ వివరణ ఉంది.

*  హీనయానులు మిళింద పన్హా, దీప వంశం, మహావంశం లాంటి గ్రంథాలను అనుసరించారు.

* మహాయానులు బుద్ధుడిని దైవ స్వరూపంగా భావించి విగ్రహారాధనను సమర్థించారు.

* బుద్ధుడి ప్రతిమలను పెట్టి పూజించే చైత్యాలు మహాయానులకు చెందినవి.

* మహాయానులు మత ప్రచారానికి సంస్కృత భాషను వినియోగించారు. వీరు బుద్ధులు, బోధిసత్వుల దయ, సహాయాల ద్వారానే మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

* గౌతముడు, అమితాభుడు, మైత్రేయనాథులను బుద్ధులుగా; అవలోకితేశ్వరుడు, మంజుశ్రీ, వజ్రపాణి లాంటి వారిని బోధిసత్వులుగా పేర్కొంటారు. అంటే మహాయానులు బుద్ధులు, బోధిసత్వుÄల విగ్రహాలను పూజిస్తారు.

* మహాయానంలో మాధ్యమిక వాదం, యోగాచార వాదం అనే రెండు ప్రధాన సంప్రదాయాలు ఉన్నాయి.

* మాధ్యమిక సంప్రదాయ వాదాన్ని ఆచార్య నాగార్జునుడు ప్రబోధించారు. మాధ్యమిక వాదాన్ని శూన్యవాదంగా కూడా పేర్కొంటారు.

* యోగాచార వాదాన్ని మైత్రేయనాథుడు ప్రారంభించారు. యోగాచార వాదాన్ని విజ్ఞానవాదంగా పిలుస్తారు. ఇది  హీనయానానికి చెందిన వాస్తవికవాదాన్ని పూర్తిగా తిరస్కరించి, పరమ ఆదర్శవాదాన్ని అంగీకరిస్తుంది.

* ఆచార్య నాగార్జునుడు రచించిన ప్రజ్ఞా పారమితిక శాస్త్ర మహాయానుల పవిత్ర గ్రంథంగా పేరొందింది.

* అసంగుడు, వసుబంధు లాంటి రచయితలు కూడా మహాయాన సంప్రదాయాన్ని అనుసరించారు.

* సూత్రాలంకార గ్రంథాన్ని రాసింది అసంగుడు.

* మహాయానులు సంస్కృత భాషలో ఉన్న సొంత త్రిపీటకాలను అభివృద్ధి చేసుకున్నారు.

* మహాయానులు వైపుల్య సూత్రాలను బుద్ధుడి ప్రకటనలుగా భావించి, వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

* సధర్మ పుండరీకం, లలిత విస్తార, వజ్ర ఛేదిక, సుఖవతి లాంటి గ్రంథాలను పవిత్రంగా భావించి, అనుసరించారు.

* తర్వాతి కాలంలో బౌద్ధ మతంలో వజ్రయానం అనే మరో శాఖ కూడా ఏర్పడింది. ఇంద్రజాలిక శక్తులు పొందడం ద్వారా మోక్షం పొందడం ఈ వాదం వారి ఆశయం.

* వజ్రయాన శాఖకు చెందినవారు బుద్ధుల, బోధిసత్వుల భార్యలైౖన తారలను ప్రధాన దైవాలుగా భావించి పూజిస్తారు. వీరు తాంత్రిక పూజా విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు (తంత్ర నిర్వహణ ద్వారా మంత్రం వల్లె వేయడం.)

* పాల, సేన వంశీయుల కాలంలో తూర్పు భారతదేశంలో వజ్రయాన శాఖ బాగా విస్తరించింది.

* సరాహుడు రచించిన దోహకోశ వజ్రయానానికి చెందిన ప్రసిద్ధ గ్రంథం. 

* కనిష్కుడు మహాయాన బౌద్ధాన్ని ఆచరించాడు.

* కనిష్కుడి కాలంలో మహాయాన బౌద్ధమతం ప్రేరణలో గాంధర శిల్పకళ అభివృద్ధి చెందింది.

* మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలో రాజగృహంలో మహాకాశ్యపుడి అధ్యక్షతన జరిగింది.  

* కాలాశోకుడి కాలంలో వైశాలిలో జరిగిన రెండో బౌద్ధ సంగీతికి సబకామి అధ్యక్షత వహించాడు.

* మూడో బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. అధ్యక్షుడు - మొగలిపుత్త తిస్స 

* నాలుగో బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కాశ్మీర్‌/కుందలవనంలో జరిగింది. వసుమిత్రుడు అధ్యక్షుడు

* బుద్ధుడి జననానికి ప్రతీక గుర్తు - తామరపువ్వు/ పద్మం

* బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి (మహాభినిష్క్రమణం) గుర్తు - గుర్రం

* బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం (సంబోధి)  - బోధి వృక్షం

* బుద్ధుడి తొలి ఉపదేశం (ధర్మచక్ర పరివర్తన)  - ధర్మచక్రం 

* బుద్ధుడి మరణం లేదా పరినిర్యాణం - స్తూపం

 

ఇతర మత శాఖలు

* అజీవక మతాన్ని గోశాల మస్కరిపుత్ర (మక్కలిపుత్ర/ మఖలగోసలుడు) స్థాపించాడు. ఈ మతానికి చెందిన వారు నియతి అనే విధిని విశ్వసిస్తారు. అశోక వృక్షాన్ని పూజిస్తారు. మౌర్యుల కాలంలో ఈ మతశాఖ వృద్ధి చెందింది.

* భూమి, గాలి, నీరు లాగే సంతోషం, దుఃఖం జీవితం అనేవి విధ్వంసనీయం కావని పకుధ కాత్యాయనుడు ప్రబోధించాడు. ఇతడి ప్రబోధాల నుంచి వైశేషిక సంప్రదాయం ఆవిర్భవించింది.

* శరీరం, ఆత్మ వేర్వేరు అని ప్రబోధించిన పురాణ కశ్యప ప్రభావంతో సాంఖ్యతత్వ సంప్రదాయం ఆవిర్భవించింది.

* సంపూర్ణ భౌతికవాదానికి సంబంధించిన మొదటి ప్రబోధకుడు - అజితకేశ కంబలిన్‌. ఇతడు సర్వనాశన వాదం/ ఉచ్ఛేదనాన్ని ప్రచారం చేశాడు. ఇతడి ప్రభావంతోనే చార్వాక సంప్రదాయం/లోకాయుత సంప్రదాయం తలెత్తింది.

* కృష్ణ వాసుదేవుడిని విష్ణుమూర్తిగా కొలిచే భక్తి సంప్రదాయాన్ని భాగవత మతంగా పేర్కొంటారు. భాగవతుడు అంటే ఆరాధనీయమైనవారిని ఆరాధించే వ్యక్తి అని అర్థం. చాందోగ్యోపనిషత్తు కృష్ణ వాసుదేవుడిని దేవకీ పుత్రుడిగా పేర్కొంది.

* పాణిని రచన అష్టాధ్యాయిలో, మెగస్తనీస్‌ ఇండికా (హెరాక్లెస్‌)లో, బెస్‌ నగర స్తంభ శాసనంలో భాగవత మత ఆరాధన గురించి ప్రస్తావన ఉంది.

* బెస్‌ నగర స్తంభ శాసనాన్ని కాశీపురానికి చెందిన శుంగరాజైన భాగభద్రుడు వేయించాడు.

* బెస్‌ నగర స్తంభ శాసనం గ్రీకు రాయబారి హీలియోడోరస్‌ను భాగవతుడిగా పేర్కొంది.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కుషాణులు

            భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాల్ల్లో కుషాణులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడమేకాకుండా భాష, సాహిత్యం, కళలు మొదలైనవాటిని బాగా ఆదరించారు. కుషాణుల్లో ప్రముఖుడు కనిష్కుడు. ఇతడిని రెండో అశోకుడిగా పేర్కొంటారు. కనిష్కుడి పాలన, కుషాణుల వంశం విశేషాల గురించి తెలుసుకుందాం.
            మౌర్య వంశ పతనానంతరం భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజవంశాలన్నింటిలో ప్రముఖమైంది కుషాణుల వంశం. వీరిని 'తాకారియన్లు' అని కూడా అంటారు. వీరు యూచి తెగకు చెందినవారు. మధ్య ఆసియా ఉత్తర భాగంలో చైనాకు దగ్గరగా ఉన్న గడ్డిమైదానాలకు చెందిన సంచార జాతిగా వీరిని పేర్కొంటారు. వీరు సింధూ మైదానంలోని దక్షిణ భాగంలో, గంగా మైదానంలోని ఎక్కువ ప్రాంతాల్లో తమ అధికారాన్ని నెలకొల్పారు. వీరి సామ్రాజ్యం ఆక్సస్‌నది నుంచి గంగానది వరకు, మధ్య ఆసియాలోని ఖోరసాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వరకు విస్తరించి ఉండేది.
 మధ్య ఆసియాలో ఎక్కువ భాగం, నేటి రష్యా, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో కొన్ని భాగాలు, పాకిస్థాన్, ఉత్తర భారతదేశం మొత్తం.. ఇలా అనేక ప్రాంతాలను కుషాణులు ఒకే పరిపాలన కిందికి తెచ్చారు. అందుకే వీరి పాలనలో వివిధజాతులు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఒకరితో ఒకరు కలిసి జీవించేవారు. దీని ఫలితంగా ఒక కొత్త సంస్కృతి ఉద్భవించింది.
కుషాణులు ఎక్కడ జన్మించారు అనేదానిపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
           'రాజుల పేర్లను బట్టి కుషాణులు ఇరాన్ ప్రాంతవాసులు'. - ఎఫ్.డబ్ల్యూ. థామస్
           'కుషాణుల శరీర నిర్మాణాన్ని బట్టి టర్కీస్థాన్‌కు చెందినవారు'. - కల్హనుడు
           'వీరు చైనీస్ తుర్కిస్థాన్ ప్రాంతానికి చెందినవారు'.- స్టెన్‌కోన్
* మధ్య ఆసియాలోని తొలి కుషాణ నివాస స్థలమైన 'ఖల్చయాన్‌'లో వీరి ఇతిహాస వాక్యాలున్న నాణేలు బయటపడ్డాయి. ఇవి ఖరోష్ఠి, బ్రహ్మీ లిపుల్లో ఉన్నాయి. వీటి ఆధారంగా వీరు సాంస్కృతిక, వ్యాపార కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని,ప్రాకృతం మాట్లాడిన సమూహాలు భారత ఉపఖండం అవతల జీవించి ఉండవచ్చని చెప్పవచ్చు.


కుషాణ వంశస్థాపన
   కుషాణుల్లో రెండు రాజవంశాలు కనిపిస్తాయి. మొదటిది 'కాడ్‌ఫిసెస్', రెండోది 'కనిష్క'. కుషాణ రాజ్యస్థాపకుడు కుజుల కాడ్‌ఫిసెస్. ఇతడు యూచిలోని అయిదు తెగలకు చెందిన వారిని ఏకం చేయడమే కాకుండా హిందూకుష్ పర్వతాలు దాటి కాబూల్, కశ్మీర్‌లో తన అధికారాన్ని స్థాపించాడని చైనీస్ ఆధారాన్ని బట్టి తెలుస్తుంది.
 ఇతడి తర్వాత 'విమా కాడ్‌ఫిసెస్' రాజయ్యాడు. ఇతడు బంగారు నాణేలు ముద్రించాడు. నాణేలపై శివుడి ప్రతిమ ఉంటుంది. పాశుపత శైవాన్ని అభిమానించాడు.


కనిష్కుడు
      విమా కాడ్‌ఫిసెస్ తర్వాత కనిష్కుడు అధికారంలోకి వచ్చాడు. ఇతడు కుషాణుల్లో అత్యంత ప్రముఖుడు. ఇతడి పరిపాలనలో కుషాణ వంశం అత్యున్నత స్థితికి చేరుకుంది. కనిష్కుడు సమకాలీన ప్రపంచంలో గొప్పశక్తిగా ఎదిగాడు.
* భారతదేశంలో ఇతడి అధికారం దక్షిణాన సాంచి, తూర్పున బెనారస్ వరకు విస్తరించింది.ఇతడు మధ్య ఆసియాలో కూడా విశాలమైన రాజ్యభాగాల్ని స్వాధీనం చేసుకున్నాడు.ఇతడి రాజధాని పురుషపురం (నేటి పెషావర్). మధురలో లభించిన కుషాణుల నాణేలు, శాసనాలు, నిర్మాణాలు, శిల్పాలను బట్టి ఆ నగరం కుషాణులకు రెండో రాజధానిగా ఉండేదని భావిస్తున్నారు.
* కనిష్కుడు రాజ్యాధికారాన్ని చేపట్టిన సంవత్సరం గురించి చరిత్రకారుల్లో వాదోపవాదాలున్నాయి. కానీ క్రీ.శ. 78 వ సంవత్సరంలో రాజై ఉండొచ్చన్నది దాదాపు అందరూ అంగీకరించిన విషయం.
* కనిష్కుడి బిరుదులు దేవపుత్ర, సీజర్, రెండో అశోకుడు. 'దేవపుత్ర' అనే బిరుదు చైనీయ ప్రభావంతోనో లేదా రోమ్‌లో ప్రచారంలో ఉన్న 'దివ ఫిలియస్' అనే బిరుదు ప్రభావంతోనో వచ్చి ఉండవచ్చు.
* మరణానంతరం కూడా తమకు దైవత్వం ఆపాదించుకునేందుకు వీరు తాము నిర్మించిన సమాధులకు 'దేవకుల' అని పేరు పెట్టేవారు. ఇలాంటి బిరుదులు భారతదేశంలో అరుదుగా ఉండేవి. కుషాణులు తాము భారతదేశానికి వలస వచ్చామన్న సంగతి మరిచిపోకుండా, పరాయిచోట తమ గౌరవాన్ని పెంచుకోవడానికే ఈ పద్ధతిని ఎంచుకుని ఉంటారన్నది చరిత్రకారుల భావన.
* కనిష్కుడు పరిపాలనాదక్షుడు. యుద్ధ విజేత, బౌద్ధమతాభిమాని. ఇతడికి సంబంధించిన శాసనాలు అలహాబాద్, సారనాథ్, మధుర, భాగల్‌పూర్, రావల్పిండి ప్రాంతాల్లో బయటపడ్డాయి.
* చైనా చరిత్రకారుల కథనాల ప్రకారం కనిష్కుడు 'హాన్' వంశానికి చెందిన రాకుమారిని వివాహమాడతానని అడిగాడనీ, అందువల్లనే 'హాన్' వంశానికి చెందిన 'హా-ట్సీ' చక్రవర్తి సేనాని పాం-చా-వో చేతిలో ఓడిపోయాడని ప్రచారంలో ఉంది.
* మధ్య ఆసియాలోని సిల్క్‌రూట్‌కు ప్రధాన కేంద్రాలైన 'కాష్‌ఘల్, యార్కండ్, ఖోటాన్' ప్రాంతాలను కనిష్కుడు జయించినట్లు తెలుస్తుంది. ఇతడు మధ్య ఆసియా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు.
* కనిష్కుడు అనగానే బౌద్ధమతంతో (మహాయాన) అతడికి ఉన్న సంబంధం గుర్తుకు వస్తుంది. కశ్మీర్‌లోని కుందనవనంలో నాలుగో బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు.దీనికి వసుమిత్రుడిని అధ్యక్షుడిగా, అశ్వఘోషుడిని ఉపాధ్యక్షుడిగా నియమించాడు.
* కనిష్కుడు ఈ సభను బౌద్ధమత సిద్ధాంతాలకు, అధ్యయనానికి సంబంధించిన విషయాల గురించి చర్చించడానికి ఏర్పాటు చేశాడు. కానీ ఈ సమావేశంలో బౌద్ధమతం హీనయాన, మహాయాన అనే రెండు ప్రధాన శాఖలుగా విడిపోయింది.
* ఇతడు 'కస్యవమాతంగ' నేతృత్వంలో మహాయాన బౌద్ధ మిషన్‌ను చైనాకు పంపాడు. అంతేకాకుండా ఆసియాకు కూడా మత ప్రచారకులను పంపించాడు. పెషావర్‌లో బుద్ధుడి ఒక అవశేషంపై ఇతడు అనేక అంతస్తుల కట్టడాన్ని నిర్మించాడు.
* క్రీ.శ. 7వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ ఈ స్తూపాన్ని గురించి విపులంగా వర్ణించాడు. 11వ శతాబ్దిలో 'ఆల్‌బెరూని'కూడా దీన్ని గురించి తెలిపాడు. పెషావర్‌లో జరిపిన తవ్వకాల్లో ఈ స్తూప పథకం, విహారాలు కట్టిన స్థలాలు, కొన్ని శిల్పాలు, బుద్ధుడి అవశేషాలను ఉంచిన పాత్రలు బయటపడ్డాయి.


నాణేలు..
      భారతదేశ చరిత్రలో అత్యధిక సంఖ్యలో బంగారు నాణేలను ముద్రించింది కుషాణులు. ఈ నాణేల్లోని బంగారం గుప్తులకాలం నాటి బంగారం కంటే ఎక్కువ నాణ్యమైంది.
*  వీరి నాణేలపై భాష - పారశీకం. కుజుల కాడ్‌ఫిసెస్ నాణేలపై బుద్ధ ప్రతిమ, విమా కాడ్‌ఫిసెస్ నాణేలపై శివుడు-నంది ప్రతిమ, కనిష్కుడి నాణేలపై బౌద్ధ చిహ్నాలు కనిపిస్తాయి. కానీ బౌద్ధ, భారతీయ దేవతా చిహ్నాలు లేని నాణేలే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.
కనిష్కుడి వ్యక్తిగత ఆరాధ్య దేవతలు హెరాక్లిస్, హీలియస్, సెలీనా, మద్రనాన, మిరో మొదలైనవారు. ఇది తన సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో భిన్న సంస్కృతులు, మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి ఇతడు పాటించిన మత విధానంగా చెప్పవచ్చు.


కళలు..
  కనిష్కుడు గొప్ప కళాపోషకుడు, సాహిత్యాభిమాని. ఇతడి ఆస్థాన కవులు వసుమిత్రుడు, అశ్వఘోషుడు, చరకుడు & ఆచార్య నాగార్జునుడు మొదలైనవారు.
* వసుమిత్రుడు - సంస్కృతంలో మహా విభాషశాస్త్రాన్ని, అశ్వఘోషుడు - బుద్ధచరిత (భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంస్కృత కావ్యం), సౌందర్య నందనం, శారిపుత్ర ప్రకరణం అనే సంస్కృత నాటకాలు రచించారు. (మధ్య ఆసియాలోని ఖోటాన్ ప్రాంతంలోని తవ్వకాల్లో బయటపడిన నాటకం - శారిపుత్ర ప్రకరణం). చరకుడు - 'చరక సంహిత' అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు.
* ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ రూపశిల్పి. ఇతడు సుహృల్లేఖ, రసవాదం, శూన్యవాదం, మాధ్యమిక వాదం, ప్రాజ్ఞపారమిత శాస్త్రం, ద్వాదశనికాయ శాస్త్రం, రత్నావళి రాజుపరికథ మొదలైన సంస్కృత గ్రంథాలు రచించాడు. ఇతడి బిరుదులు - ఇండియన్ ఐన్‌స్టీన్, రెండో తథాగతుడు, ఇండియన్ మార్టిన్ లూథర్, ఆంధ్ర బౌద్ధ సారస్వత అరిస్టాటిల్ మొదలైనవి.


కనిష్కుడి వారసులు
    కనిష్కుడి తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టింది హవిష్కుడు. ఇతడు క్రీ.శ. 230 వరకూ తన పరిపాలనను కొనసాగించాడు. ఇతడి బిరుదులు మహారాజ, రాజాధిరాజ, దేవపుత్ర.
* హవిష్కుడి తదనంతరం రెండో కనిష్కుడు రాజయ్యాడు. ఇతడి బిరుదు 'కైజర్'.
* కుషాణు వంశంలో చివరివాడు 'వాసుదేవుడు'. శివ, అంబ, ఉమేశ్వరుల ప్రతిమలు ఇతడి నాణేలపై కనిపిస్తాయి. వాసుదేవుడి కాలంలోనే కుషాణుల ప్రత్యేకత క్షీణించింది. అయితే వీరు భారతదేశంలోనే స్థిరపడి ఉండొచ్చని వాసుదేవుడి పేరు సూచిస్తోంది.


శిల్పకళ..
     కుషాణుల కాలంలో వాయవ్య భారతదేశంలో 'గాంధార శిల్పకళారీతి', తూర్పు భారతదేశంలో 'మధుర శిల్పకళారీతి' ఆవిర్భవించాయి.

గాంధార శిల్ప శైలి
* గ్రీకు-భారతీయ- రోమ్ శిల్పకళల సమ్మేళనమే గాంధార శిల్ప శైలి.
* ఇందులో బుద్ధుడిని తెల్లని చలువ రాయితో మలిచారు.
* ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గాంధార శైలి ఆప్ఘనిస్థాన్‌లోని బీమారన్ దగ్గరున్న 'తఖ్-ఇ-బామి' వద్ద లభించింది.
* ఈ శైలిలో ఉన్న బుద్ధ విగ్రహాలు భారతదేశంలోని కశ్మీర్, విదిశ, అమరావతి మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి.
* ఈ శైలిలో బుద్ధుడు గ్రీకుల యుద్ధదేవుడిని తలపిస్తాడు. గ్రీకుల యుద్ధ దేవుడు ఒలంపస్.
* రోమన్ల కండలు తిరిగిన శరీరం, రింగురింగుల పొడవాటి వెంట్రుకలు, పలుచని వస్త్రాలు మొదలైనవి ఈ శైలిలో ఎక్కువగా కనిపిస్తాయి.
* విగ్రహాలు గడ్డాలు, మీసాలు పెంచుకుని భారతీయ యోగుల మాదిరిగా కనిపించడం దీని ప్రత్యేకత.
* ఈ శిల్పకళ సౌందర్యానికి ప్రాముఖ్యం ఇచ్చింది కానీ ఆధ్యాత్మికతకు ఇవ్వలేదు.


మధుర శిల్ప శైలి
* మధుర శైలిలో బుద్ధుడిని ఎర్రని ఇసుకరాయితో మలిచారు.
* ఇది భారతదేశంలోనే మొట్టమొదటి శిల్పశైలి.
* ఇందులో బుద్ధుడు ధ్యానస్థితిలో ఉన్నట్లుగా రూపొందించారు.
* హిందూమతంలో భాగంగా శివుడిని పార్వతీ సమేతుడిగా, అర్ధనారీశ్వర రూపంలో తయారు చేశారు.
* ఈ శైలిలో జైన మతంలోని పార్శ్వనాథుడిని కూడా మలిచారు. ప్రస్తుతం ఈ ప్రతిమ లక్నో మ్యూజియంలో ఉంది.
* స్త్రీ ప్రతిమలైన సాలభంజికలు, యక్షణి మొదలైన వాటిని కూడా మలిచారు.
* ఈ శైలి పరమత సహనానికి నిదర్శనం.
* భారతీయులకు కోటు, బూటు, టోపీని పరిచయం చేసినవారు కుషాణులు. కనిష్కుడి శిథిల విగ్రహం మధురకు సమీపంలోని తిక్రితి లోయలో లభించింది.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్త యుగం

   గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. గుప్త రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు లాంటి చక్రవర్తులు గుప్త రాజుల్లో ముఖ్యులు. చివరి గుప్త చక్రవర్తి విష్ణుగుప్తుడి కాలంలో హూణుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం పతనమైంది. గుప్తులకాలం భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా పేరొందింది.
గుప్త యుగానికి ఆధారాలను రెండు రకాలుగా పేర్కొంటారు. అవి:
    1. పురావస్తు ఆధారాలైన శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు.
   2. సాహిత్య ఆధారాలు.


శాసనాలు
మంకువార్ బౌద్ధ శాసనం మొదటి కుమారగుప్తుడిని 'మహారాజ' బిరుదుతో పేర్కొంది. స్కంధగుప్తుడి భిలారి శాసనం హూణులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిపిన దాడులను వివరిస్తుంది. సముద్రగుప్తుడి విజయాలను వివరించే అలహాబాద్ శాసనాన్ని అతడి సేనాని (సంధి విగ్రాహి) హరిసేనుడు వేయించాడు.
* ఎరాన్ శాసనం గుప్తుల కాలంనాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తుంది. సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనం తెలుపుతుంది. ఉదయగిరి శాసనం, మెహరౌలీ (దిల్లీ) ఉక్కు స్తంభ శాసనాలు రెండో చంద్రగుప్తుడి గురించి పేర్కొంటున్నాయి.
* గుప్త యుగానికి సంబంధించి సుమారు 42 శాసనాలు లభిస్తున్నాయి. అందులో 27 శిలాశాసనాలే. మొత్తం 42 శాసనాల్లో 23 శాసనాలు ప్రత్యేక వ్యక్తుల రికార్డులైతే, మిగిలిన 19 శాసనాలు ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు.


సాహిత్యం
   మొదటి చంద్రగుప్తుడి కాలంనాటి రాజనీతి గ్రంథమైన నీతిసారాన్ని కామందకుడు రాశాడు. గుప్తుల కాలంనాటి రాజనీతి, పరిపాలనా విషయాలను ఈ గ్రంథం తెలుపుతుంది. క్రీ.శ. నాలుగో శతాబ్దంలో రాసిన 'నారదస్మృతి', 'బృహస్పతి స్మృతి' లాంటి రచనలు గుప్తుల చరిత్రను పేర్కొంటున్నాయి. విశాఖదత్తుడు రచించిన 'దేవీ చంద్రగుప్తం' నాటకం రామగుప్తుడు శక రాజైన బసన చేతిలో పొందిన ఓటమిని తెలుపుతుంది. మొదటి చంద్రగుప్తుడి విజయాలను వజ్జికుడు రచించిన 'కౌముదీ మహోత్సవం' గ్రంథం వివరిస్తుంది. గుప్తయుగం నాటి పట్టణ ప్రజల జీవిత విధానాలను, చారుదత్త, వసంతసేనల మధ్య ఉన్న ప్రేమాయణం గురించి పేర్కొంటుంది. వాయు పురాణంలో గుప్తుల చరిత్రను ఎక్కువగా వివరించారు. ఆర్య మంజుశ్రీ రాసిన 'మూలకల్ప' గ్రంథంలో గుప్తరాజుల ప్రస్తావనను అనేక శ్లోకాల్లో పేర్కొన్నారు. క్రీ.శ.672లో భారతదేశానికి వచ్చిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు చీ-లి-కిటో (శ్రీగుప్తుడు) అనే రాజు నలందా బౌద్ధ విహారంలో కొన్ని గ్రామాలను చైనా వారికి దానం చేసినట్లు తన రచనల్లో పేర్కొన్నాడు. యతి వృషభుడు అనే బౌద్ధ సన్యాసి రాసిన 'తిలస్య పన్నాటి' అనే గ్రంథం గుప్తుల కాలం నాటి బౌద్ధ మత ప్రాచుర్యాన్ని తెలుపుతుంది. రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ నాటి పరిస్థితులను తన ఫో-కువో-కి గ్రంథంలో వివరించాడు.


రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 375 - 415)

      ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. 'శకారి', 'సాహసాంక', 'విక్రమాదిత్య' లాంటి బిరుదులు పొందాడు. అన్న రామగుప్తుడిని చంపి, వదిన ధ్రువాదేవిని వివాహం చేసుకుని రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది. ఇతడి కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఫాహియాన్ పాటలీపుత్రంలో మూడు సంవత్సరాలు, తామ్రలిప్తిలో రెండు సంవత్సరాలు నివసించాడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో 'నవ రత్నాలు' అనే కవులు ఉండేవారు. వారిలో కాళిదాసు సుప్రసిద్ధుడు. రెండో చంద్రగుప్తుడు సింహం బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఉజ్జయిని బొమ్మతో నాణేలను ముద్రించి, ఉజ్జయినిని రెండో రాజధానిగా చేసుకుని పాలించాడు. వాకాటక రాజైన రెండో ధ్రువసేనుడికి తన కుమార్తె ప్రభావతీ గుప్తను ఇచ్చి వివాహం జరిపించాడు. రెండో ధ్రువసేనుడి సహాయంతో చివరి శకరాజు రుద్రసింహుడిని చంపి, 'శకారి' అనే బిరుదు పొందాడు. రెండో చంద్రగుప్తుడి సేనానియైన అమరకర దేవుడు బౌద్ధ మతాభిమాని. మంత్రి శబర వీరసేనుడు శైవ మతాభిమాని. దిల్లీలోని మెహరౌలీ ఉక్కు స్తంభాన్ని చేయించింది రెండో చంద్రగుప్తుడే. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు ఇతడే.
చివరి గుప్త చక్రవర్తులు

     మొదటి కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే యువరాజైన స్కంధగుప్తుడు హూణుల దండయాత్రను తిప్పికొట్టాడు. కానీ స్కంధగుప్తుడు రాజైన తర్వాత హూణులు గుప్త రాజ్యంపై నిరంతరం దాడులు చేయడం వల్ల కోశాగారం ఖాళీ అయ్యింది. ఇతడు హూణుల చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం పురుగుప్తుడు, రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు లాంటి రాజులు పాలించారు. చివరికి విష్ణుగుప్తుడితో గుప్త వంశం అంతమైంది.
 

పాలనా విశేషాలు
      గుప్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. విషయపతి జిల్లాలకు (విషయాలకు) అధిపతిగా, భుక్తులకు ఉపరిక అధిపతిగా ఉండేవాడు. గ్రామాధిపతిని గ్రామైక అనేవారు. అయిదుమంది సభ్యులున్న నగరసభ విషయపతికి పరిపాలనలో తోడ్పడేది. గ్రామంలో ఉండే సభను పంచ మండలం సభ అనేవారు. చక్రవర్తి మంత్రి పరిషత్తు లేదా మంత్రి మండలి సహాయంతో పరిపాలించడం వల్ల మంత్రి మండలి నాయకుడిని మంత్రి ముఖ్యుడు అనేవారు. నైతిక, ధార్మిక విషయాల్లో పురోహితుడు కీలకపాత్ర పోషించేవాడు. రాష్ట్రాలకు (భుక్తులకు) యువ రాజులను అధిపతులుగా నియమించేవారు. వారిని 'కుమారామాత్య' అనేవారు. వీరు కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవారు. మొత్తంగా గుప్తుల కాలంలో పాలన వికేంద్రీకృత పాలనగా ఉండేది.


రెవెన్యూ పాలన
     గుప్తుల కాలంలో 1/6వ వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. పన్నులను నగదు రూపంలో చెల్లించేవారు. ఫాహియాన్ తన రచనల్లో ఎక్కువగా రాచరిక భూముల గురించి ప్రస్తావించాడు. బుద్ధగుప్తుడి పహాడ్‌పూర్ శాసనం భూమిపై ప్రభుత్వానికున్న ప్రత్యేక యాజమాన్యపు హక్కును వివరిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన భూమిని 'క్షేత్రం' అనేవారు. నివాసయోగ్యమైన భూమిని 'వస్తి' , అటవీ భూమిని 'అప్రహత' , పచ్చిక బయళ్లను 'గపధసార' , బంజరు భూములను 'ఖిలం' అని పేర్కొనేవారు.
భూమి అమ్మకం రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని 'పుస్తపాల' అనేవారు. నాటి ప్రధాన న్యాయమూర్తి 'మహా దండనాయక'. ఆ కాలంలో విధించే శిక్షల గురించి ఫాహియాన్ తన రచనల్లో ప్రస్తావించాడు. మహా సేనాపతి, రణభండారిక లాంటి సైనికాధికారులు యుద్ధ సమయాల్లో ప్రధానపాత్ర పోషించేవారు. ఆ కాలంలో  యుద్ధ ఆయుధాల గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావన ఉంది. ప్రత్యేక యుద్ధమండలి కూడా ఉండేది.  పురోహితుడికి న్యాయ సమీక్ష అధికారం ఉండటం గొప్ప విషయం. మంత్రి మండలికి, చక్రవర్తికి మధ్య సంధాన కర్తగా 'కంచుకి' అనే ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించేవాడు.


ఆర్థిక విషయాలు
    గుప్తుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు సమానంగా అభివృద్ధి చెందాయి. నాటి వ్యవసాయ భూముల సర్వే విధానం గురించి ప్రభావతి గుప్త వేయించిన పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. భూముల కొలతలు, సరిహద్దు రాళ్లు వేయడం గురించి 'పహాడ్‌పూర్' శాసనం పేర్కొంటుంది. పుస్తపాల అనే అధికారి జిల్లాలో జరిగే భూ లావాదేవీలను రికార్డు చేసేవాడు. భూదానాలు అధికంగా చేయడంతో గుప్తుల కాలంలో భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఏ విధమైన పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను (అగ్రహారాలు) దానం చేసేవారు. సముద్రగుప్తుడు వేయించిన నలందా, గయ శాసనాల్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను 'ఉక్కకల్ప' మహారాజులుగా పిలిచేవారు. దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను 'దేవాగ్రహారాలు' అనేవారు. ఉక్కకల్ప మహారాజులు పుళిందభట్టు అనే గిరిజన తెగ నాయకుడికి కూడా రెండు గ్రామాలను దానం చేసినట్లు శాసన ఆధారాలు లభించాయి.
  రోమ్ దేశంతో ఎక్కువ విదేశీ వాణిజ్యం జరిపేవారు. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బరుకచ్ఛ ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. సార్థవాహులు అనే సంచార వ్యాపారులు నగరాల్లో వ్యాపారం చేసేవారు. అరేబియా, పర్షియా, ఆఫ్గానిస్థాన్ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. ఉప్పును ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది.


సాంఘిక, మత పరిస్థితులు
   వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేవి. ఛండాలురు అనే పంచమ వర్ణం ఏర్పడింది. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. అనులోమ, ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ఎక్కువ వర్ణం పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. దీనిపై నిషేధం లేదు. కానీ తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకునే ప్రతిలోమ వివాహాలను ధర్మశాస్త్రాలు నిషేధించాయి. నాటి ఎరాన్ శాసనం ప్రకారం సతీ సహగమనం ఉన్నట్లు తెలుస్తోంది. దేవదాసీ ఆచారం ప్రారంభమైంది. గుప్తుల కాలంలో వైదిక మతం/ హిందూమతాన్ని పునరుద్ధరించారు. రెండో చంద్రగుప్తుడు 'పరమ భాగవత' అనే బిరుదు ధరించాడు. సముద్రగుప్తుడు రాజ చిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. దశావతార సిద్ధాంతం గుప్తుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతం అభివృద్ధి చెందింది. స్కంధగుప్తుడి జునాగఢ్ శాసనంలో బలి చక్రవర్తి, వామనుల కథనాన్ని వివరించారు. మౌఖరీ వంశస్థుడైన అనంతవర్మబారాబర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. విష్ణుదేవుడి నరసింహ అవతారం గురించి అలీనదాన శాసనం వివరిస్తుంది. ఎరాన్‌లో వరాహ విగ్రహం కనిపిస్తుంది. గుప్తుల కాలంలో శైవ, వైష్ణవ, బౌద్ధ మతాలను సమానంగా ఆదరించారు. గుప్త చక్రవర్తులు పరమత సహన విధానాన్ని పాటించారు.


రాజకీయ చరిత్ర
    గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. చైనా యాత్రికుడు ఇత్సింగ్ తన రచనల్లో శ్రీ గుప్తుడిని చిలికిత (చీ-లీ-కిటో) మహారాజుగా ప్రస్తావించాడు. శ్రీగుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోద్గజ గుప్తుడు 'మహారాజు' బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ వాస్తవంగా గుప్త రాజ్య స్థాపకుడిగా పేరొందింది మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్ఛవీ గణానికి చెందిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. 'రాజాధిరాజ' బిరుదుతో పాలన చేశాడు. అనంతరం అతడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీ.శ.335 - 375 సంవత్సరాల మధ్య పాటలీపుత్రం రాజధానిగా పరిపాలన చేశాడు. కచ అనే యువరాజుతో వారసత్వ యుద్ధంలో విజయం సాధించి, సముద్రగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది.
     హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. దాని ప్రకారం సముద్రగుప్తుడు మొదటి ఆర్యావర్తన దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండో ఆర్యావర్తన దండయాత్ర చేసి అనేక విజయాలను సాధించాడు. ముఖ్యంగా దక్షిణదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించి, వారిని సామంతులుగా చేసుకున్నాడు. వారిలో కోసలరాజు మహేంద్రుడు, వేంగి రాజు హస్తివర్మ (శాలంకాయన రాజు), కంచి పాలకుడు విష్ణుగోపుడు (పల్లవ రాజు) ముఖ్యమైనవారు.
     ఆంగ్ల చరిత్రకారుడైన వి.ఎ.స్మిత్ సముద్రగుప్తుడిని 'ఇండియన్ నెపోలియన్' అని కీర్తించాడు. 'కవిరాజు', 'అశ్వమేధ యోగి' లాంటి బిరుదులను పొందాడు. మొదటి ఆర్యావర్తన దండయాత్రలో నాగసేనుడిని, రెండో ఆర్యావర్తన దండయాత్రలో గణపతినాగ, అచ్యుతనాగ, లాంటి నవనాగ చక్రవర్తులను ఓడించాడు. కౌశాంబి యుద్ధంలో మొదటి రుద్రసేనుడిని ఓడించి, అశ్వమేధ యాగం చేసి 'అశ్వమేధ యోగి' బిరుదు పొందాడు. ఇంకా అయిదు సరిహద్దు రాజ్యాలను, తొమ్మిది ఆటవిక రాజ్యాలను ఓడించాడు. సింహళరాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. సముద్రగుప్తుడి అనంతరం అతడి పెద్ద కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు, శక రాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నట్లు, రెండో చంద్రగుప్తుడు బసనను, రామగుప్తుడిని చంపి రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది.


నాణేలు
     గుప్తుల కాలంలో అధికంగా బంగారు నాణేలను ముద్రించారు. వీరు కుషాణుల నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారు. సముద్ర గుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణేలను ముద్రించాడు. అశ్వమేధ యాగం చేసి, 'అశ్వమేధ యోగి' బిరుదుతో కూడా సముద్రగుప్తుడు బంగారు నాణేలను ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను 'దీనార్', 'కారా', 'సువర్ణ' అని పిలిచేవారు. సముద్రగుప్తుడి నాణేల్లో ఎక్కువగా వెనుక భాగంలో లక్ష్మీదేవి బొమ్మను ముద్రించేవారు. రెండో చంద్రగుప్తుడి నాణేలపై 'మహా రాజాధిరాజ శ్రీచంద్రగుప్త' అనే బిరుదును ముద్రించారు. గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడిని పేర్కొంటారు. ఉజ్జయిని ముద్రతో నాణేలను ముద్రించింది రెండో చంద్రగుప్తుడే. రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపు పరమభాగవత, మహారాజాధిరాజు బిరుదులను, మరో వైపు గరుడి (గద్ద) బొమ్మను ముద్రింపజేసేవాడు. ఏనుగు, నెమలి, అశ్వికుడు లాంటి బొమ్మలతో కుమారగుప్తుడు నాణేలను ముద్రించాడు.

 

గుప్త యుగం - సాంస్కృతిక వికాసం

* భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. హిందూమత పునరుద్ధరణ, భాషా, సాహిత్యాల వికాసం, వాస్తు, కళారంగాలు, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి లాంటి కారణాల వల్ల గుప్త యుగాన్ని స్వర్ణయుగం అంటారు.
* కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేసి, 'ఇండియన్ షేక్‌స్పియర్‌'గా పేరొందాడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, విక్రమోర్వశీయం, మేఘసందేశం, కుమార సంభవం లాంటి రచనలు చేశాడు.
* గుప్తుల కాలంలో అధికార భాష సంస్కృతం.
* వసుబంధు అనే బాస మహాకవి 'స్వప్న వాసవదత్త' అనే గ్రంథాన్ని రాశాడు.
* వాత్సాయనుడు కామసూత్రాలను రచించాడు.
* శూద్రకుడు మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో నాటి పట్టణ జీవితాన్ని వర్ణించాడు.
* విశాఖదత్తుడు దేవీచంద్రగుప్తం, ముద్రా రాక్షసం అనే గ్రంథాలను రచించాడు.
* అమరసింహుడు తొలి సంస్కృత భాషా నిఘంటువుగా పేరొందిన 'అమరకోశం' అనే గ్రంథాన్ని రాశాడు.
* పాలకవ్యుడు హస్తాయుర్వేదం అనే పశు వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.
* కామందకుడు రచించిన నీతిశాస్త్రం గుప్తుల అర్థశాస్త్రంగా పేరొందింది.
* బెంగాల్‌కు చెందిన చంద్రగోమియా 'చంద్ర వ్యాకరణం' గ్రంథాన్ని రాశాడు.
* రామచంద్రుడు అనే కవి 'నాట్య దర్పణం' గ్రంథాన్ని రచించాడు.
* రామాయణాన్ని జైనమతానికి అనుగుణంగా రచించింది విమలుడు.
* దివాకరుడు అనే కవి న్యాయవర్త, సమ్మతి తర్కసూత్ర అనే గ్రంథాలు రాశాడు.
* పాణిని అష్టాధ్యాయి గ్రంథాన్ని, పతంజలి మహాభాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు.
* గుప్తుల కాలంలో ప్రాకృత భాషను శూరసేన (మగధ ప్రాంతం), అర్ధమగధి (బుందేల్‌ఖండ్ ప్రాంతం), మగధి (బిహార్ ప్రాంతం) లాంటి పేర్లతో పిలిచేవారు.
* వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు (వైద్యశాస్త్ర గ్రంథం).
* నవరత్నాలు - కాళిదాసు, శంఖువు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, అమర సింహుడు, వరాహమిహిరుడు, వరరుచి, ధన్వంతరి, క్షహరాటుడు.


శాస్త్ర విజ్ఞానం
* గుప్తుల కాలంలో గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి.
* గుప్తుల కాలంనాటి గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట.
* ఆర్యభట్ట రచనలు ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం, లఘు జాతకం. సూర్య సిద్ధాంతం గ్రంథంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణాలు వివరించారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పారు.
* వృత్త పరిధికి, వృత్త వ్యాసానికి సరైన π నిష్పత్తిని 22/7 గా చెప్పింది ఆర్యభట్టు.
* వరాహమిహిరుడు 'బృహత్ సంహిత' అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని గుప్తుల కాలంనాటి విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు.  వరాహమిహిరుడు పంచ సిద్ధాంతిక, బృహత్ జాతక లాంటి ఇతర రచనలు కూడా చేశాడు.
* భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుప్తుల కాలంలోనే చెప్పిన బ్రహ్మగుప్తుడు 'ఇండియన్ న్యూటన్‌'గా పేరొందాడు.  (ఖండఖాద్యక, బ్రహ్మస్ఫుటక సిద్ధాంతం అనేవి ఈయన రచనలు)
* వివిధ మందులు, ఔషధాల తయారీ విధానం గురించి వివరిస్తున్న గ్రంథం 'నవనీతకం'.
* గుప్తుల కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరొందింది ధన్వంతరి.
* ''శుశృత సంహిత'' అనే శస్త్ర చికిత్స గ్రంథాన్ని శుశృతుడు రచించాడు.
* వజ్జిక అనే రచయిత 'కౌముది మహోత్సవం' అనే గ్రంథాన్ని రాశాడు.
* గుప్తుల కాలంలో శబరుడు అనే వ్యక్తి సాంఖ్య, యోగ లాంటి దర్శనాలపై వ్యాఖ్యలు రాశాడు


గుప్తుల కాలంనాటి ప్రసిద్ధ హిందూ దేవాలయాలు
* నాచన్ కుటారా - పార్వతీదేవి దేవాలయం
* భూమ్రా - శివాలయం, మధ్యప్రదేశ్
* దేవఘడ్ - దశావతార దేవాలయం, మధ్యప్రదేశ్
* టిగావా - విష్ణు దేవాలయం, మధ్యప్రదేశ్
* బిట్టర్‌గావ్ - ఇటుకల దేవాలయం, ఉత్తర్ ప్రదేశ్
* దశావతార దేవాలయ గోడలపై రామాయణ, మహాభారత గాథలను శిల్పాలుగా చెక్కారు.
* ఉదయగిరి గుహాలయం (ఒడిశా) వద్ద వరాహ విగ్రహాన్ని చెక్కారు.
* గ్వాలియర్ సమీపంలోని పవాయి వద్ద నాట్యగత్తె, సంగీతకారిణుల విగ్రహాలు లభించాయి.
* సుల్తాన్‌గంజ్‌లో బుద్ధ విగ్రహం (కంచుతో తయారు చేసింది) ఏడున్నర అడుగుల పొడవుతో లభించింది.
* నలందాలో 18 అడుగుల ఎత్తున్న బుద్ధుడి రాగి విగ్రహం లభించింది.
* వారణాసిలో కార్తికేయ శిల్పాలు లభించాయి.
* గుప్తుల కాలంనాటి ముద్రలు ఎక్కువగా వైశాలిలో లభించాయి.
* గుప్తుల కాలంనాటి బుద్ధుడి శిల్పాలు 'తౌమ బుద్ధులు'గా పేరొందాయి.
* నాటి శిల్పాలను ఎక్కువగా చూనార్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో చెక్కారు.
* సారనాథ్ మ్యూజియంలో బుద్ధ విగ్రహం (సారనాథ్ బుద్ధుడు) యోగిముద్రలో ఉంటుంది.
* అజంతా, బాగ్ గుహల్లో గుప్తుల కాలంనాటి చిత్రలేఖనాలు లభించాయి.
* అజంతా 16వ గుహలోని 'మరణశయ్యపై రాకుమార్తె' చిత్రం గుప్తుల కాలానిదే.
* గుప్తుల శిల్పకళ మహోన్నతి పొందిన హైందవ శిల్పకళ అని విన్సెంట్ స్మిత్ పేర్కొన్నారు.
* 23 అడుగుల 8 అంగుళాల పొడవున్న మెహరౌలీ ఉక్కు స్తంభం (దిల్లీ) ఇప్పటికీ తుప్పుపట్టలేదు.
* ''బిట్టర్‌గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది'' అని పెర్సీబ్రౌన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.


హర్షవర్ధనుడు
* గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు.
* హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. ఇతడి రాజధాని స్థానేశ్వరం.
* హర్షుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు. తల్లి యశోమతి దేవి. సోదరుడు రాజ్యవర్ధనుడు. సోదరి రాజ్యశ్రీ.
* పుష్యభూతి వంశీకుల పాలన గురించి వివరిస్తున్న శాసనాలు మధుబన్, బాన్స్‌ఖేరా.
* మధుబన్ శాసనం ప్రకారం ప్రభాకరవర్ధనుడు పరమభట్టారక, మహారాజాధిరాజు అనే బిరుదులతో పాలించాడని తెలుస్తోంది.
* బాణుడి హర్షచరిత్రలో ప్రభాకరవర్ధనుడు హూణుల హరిణాలకు (జింకలకు) సింహం లాంటి వాడని పేర్కొన్నారు.
* యశోమతీదేవి భర్తతో సతీసహగమనం చేసింది.
* రాజ్యశ్రీని కనోజ్ పాలకుడైన గ్రహవర్మకు ఇచ్చి వివాహం జరిపించారు.
* గ్రహవర్మ, అతడి మిత్రుడు గౌడ శశాంకుడు కుట్రచేసి రాజ్యవర్ధనుడిని చంపారు.
* హర్షుడు అస్సాం/ కామరూప పాలకుడు భాస్కరవర్మ సహాయంతో గ్రహవర్మ, గౌడ శశాంకుడిని ఓడించాడు.
* మాళ్వారాజు దేవగుప్తుడు గ్రహవర్మను చంపి, కనోజ్‌ను ఆక్రమించాడు.
* హర్షుడు సోదరిని రక్షించి, కనోజ్ పాలకురాలిగా నియమించాడు.
* కనోజ్ ప్రజల కోరిక మేరకు హర్షవర్ధనుడు క్రీ.శ.606లో శీలాదిత్య బిరుదుతో స్థానేశ్వరం, కనోజ్‌లను కలిపి పట్టాభిషేకం చేసుకున్నాడు.
* హర్షుడి పాలనాకాలం క్రీ.శ.606 - 647
* హర్షుడి కాలంలో హుయాన్‌త్సాంగ్ అనే చైనా యాత్రికుడు అతడి రాజ్యాన్ని సందర్శించాడు.
* హుయాన్‌త్సాంగ్ రచన 'సియుకి'.
* హుయాన్‌త్సాంగ్ యాత్రికుల్లో రాజు (కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్)గా పేరొందాడు.
* హర్షుడి బిరుదులు శీలాదిత్య, రాజపుత్ర.
* హర్షుడిని నర్మదా నది యుద్ధంలో ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి.
* రెండో పులకేశి ఐహోలు శాసనంలో హర్షుడిని సకలోత్తర పథేశ్వరుడు అనే బిరుదుతో ప్రస్తావించడం కనిపిస్తుంది.
* హర్షుడు మహామోక్ష పరిషత్, కనోజ్ పరిషత్తులను నిర్వహించాడు.
* ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తన సంపదనంతా పేదలకు పంచే కార్యక్రమమే 'మహామోక్ష పరిషత్'. దీన్నే 'ప్రయాగ పరిషత్' అంటారు.
* హర్షుడు మొత్తం ఆరు మహామోక్ష పరిషత్‌లు నిర్వహించాడు. 6వ పరిషత్‌కు హుయాన్‌త్సాంగ్ హాజరయ్యాడు.
* హర్షుడు కనోజ్‌లో హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన సర్వమత సమావేశాన్ని నిర్వహించాడు. దీన్నే 'కనోజ్ పరిషత్' అంటారు.
* హర్షుడు తన రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పథక గ్రామాలుగా విభజించాడు.
* వల్లభి రాజ్య రాజు రెండో ధ్రువసేనుడిని హర్షుడు ఓడించినట్లు నౌశాసితామ్ర ఫలకం (శాసనం) తెలియజేస్తోంది.
* యుద్ధభూమిలో చక్రవర్తే సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. చక్రవర్తికి పాలనలో సహాయపడటానికి సచివులు/అమాత్యులు అనే మంత్రులను నియమించేవారు.
* హర్షుడి ప్రధానమంత్రి పేరు 'భండి'.
* యుద్ధమంత్రి - మహాసంధి విగ్రహాధికృత, సైన్యాధికారి - మహాబలాధికృత.
* గజబలాధ్యక్షుడు - కాటుక, విదేశీ కార్యదర్శి - రాజస్థానీయ.
* హర్షుడి కాలంలో రాష్ట్రాలను భుక్తులు అని, జిల్లాలను విషయాలు అని పిలిచారు.
* భుక్తి అధిపతిని ఉపరిక/గోస్త్రీ అని పిలిచేవారు.
* నాడు రహదారులు క్షేమంగా లేవని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.630లో భారతదేశానికి వచ్చి 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. (సి-యు-కి అంటే పశ్చిమ ప్రపంచ ప్రతులు)
* హర్షుడు యుద్ధం, శాంతి కళల్లో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడని ఆర్.సి. మజుందర్ పేర్కొన్నారు.
* నాటి కాలంలో మగధ వరి పంటకు ప్రసిద్ధి చెందింది.
* నాడు భూమి శిస్తు పంటలో 1/6వ వంతు ఉండేది. భూమి శిస్తును 'ఉద్రంగ' అనేవారు. భూమి శిస్తు కాకుండా మరో 18 రకాల పన్నులు వసూలు చేసేవారు.
* హర్షుడు వివిధ స్థాయుల్లో పన్ను వసూలు కోసం ఆయుక్త, భోజక, ద్రువాధికరణ, గౌల్మిక లాంటి అధికారులను నియమించాడు.
* గ్రామంలో పన్ను వసూలు కోసం అక్షపటలిక, కరణిక్ అనే ఉద్యోగులను నియమించాడు.
* వస్తువు బరువు ఆధారంగా 'తుల్యమేయ' పేరుతో అమ్మకం పన్నును వసూలు చేసేవారు.
* భారతదేశంలో వ్యవసాయ రంగంలో తొలిసారిగా నీటివేగంతో నడిచే తులాయంత్రాలను ప్రవేశపెట్టింది హర్షుడే.
* హర్షుడి కాలంలో మౌఖరీ వంశీయులు వల్లభి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశారు.
* హర్షుడు నలందా విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసినట్లు హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
* హర్షుడి ఆస్థానకవి బాణుడు హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు.
* హర్షుడు సంస్కృత భాషలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శి లాంటి గ్రంథాలు రాశాడు.
* సుభాషిత శతకం - భర్తృహరి, సూర్యశతకం - మయూరుడు. వీరు హర్షుడి ఆస్థానంలో ఉండేవారు.
* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.645లో ఉదిత అనే సహాయకుడితో చైనా చేరాడు.
* గౌడ శశాంకుడు వంగ, మగధ, ఒరిస్సాలను 'మహారాజాధిరాజ' బిరుదుతో పాలించినట్లు గంజాం శాసనం తెలుపుతోంది.
* నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాన్ని 'ధర్మఘంజ్' అనేవారు.
* ధర్మపాల, ఆర్యదేవ, శీలభద్ర లాంటి ఆచార్యులు నలందా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
* స్థిరమతి, గుణమతి లాంటి ఆచార్యులు వల్లభి విశ్వవిద్యాలయంలో పనిచేశారు.


వాస్తు, కళారంగాలు
* గుప్తుల కాలంనాటికి నగర, ద్రవిడ శైలులు రూపాంతరం సంతరించుకున్నాయి.
* గుప్తుల వాస్తు నిర్మాణంలో ప్రధానమైనవి గుహాలయాలు, దేవాలయాలు, స్తూపాలు.
* మహారాష్ట్రలోని అజంతా గుహలు, మధ్యప్రదేశ్‌లోని బాగ్ గుహలు గుప్తుల కాలంలోనే అభివృద్ధి చెందాయి.
* గుప్తుల కాలంలో సారనాథ్ (ఉత్తర్ ప్రదేశ్), రత్నగరి (ఒడిశా), మీర్‌పూర్‌ఖాన్ (సింధు) ప్రాంతాల్లో స్తూపాలను నిర్మించారు.
* మధ్యప్రదేశ్‌లోని భూమ్రాలో శివాలయాన్ని నిర్మించారు.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఢిల్లీ సుల్తానులు

మాదిరి ప్రశ్నలు

1.  బానిస వంశ స్థాపకుడు-

1) బాల్బన్‌       2) ఇల్‌టుట్‌మిష్‌       3) కుతుబుద్దీన్‌ ఐబక్‌       4) ఘోరీ మహ్మద్‌


2. ఢిల్లీని ఆక్రమించినందుకు గుర్తుగా ఐబక్‌ చేపట్టిన నిర్మాణం ఏది?

1) కుతుబ్‌మీనార్‌        2) అర్హిదిన్‌ కా జోంప్రా 
3) హౌజ్‌-ఇ-సుల్తానీ    4) కువ్వత్‌ - ఉల్‌ -ఇస్లాం


3. ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు?

1) ఇల్‌టుట్‌మిష్‌     2) ఐబక్‌     3) బాల్బన్‌     4) రజియా సుల్తానా


4. చిహల్‌గనీ కూటమి ఎవరి కాలంలో ఏర్పడింది? 

1) ఐబక్‌     2) ఇల్‌టుట్‌మిష్‌     3) రజియా సుల్తానా     4) బాల్బన్‌


5. దివాన్‌-ఇ-అర్జ్‌ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది?

1) ఇల్‌టుట్‌మిష్‌     2) బాల్బన్‌     3) కుతుబుద్దీన్‌ ఐబక్‌     4) ఎవరూ కాదు


6. లాక్‌భక్ష్ బిరుదాంకితుడైన ఢిల్లీ సుల్తాన్‌?

1) ఐబక్‌        2) బాల్బన్‌          3) ఇల్‌టుట్‌మిష్‌           4) ఆరామ్‌షా


7. ఉజ్జయినిలో మహంకాళి దేవాలయాన్ని ధ్వంసం చేయించిన పాలకుడు?

1) గజనీ మహ్మద్‌     2) ఘోరీ మహ్మద్‌     3) బాల్బన్‌     4) ఇల్‌టుట్‌మిష్‌


8. చివరి బానిస వంశపాలకుడు?

1) యల్‌డజ్‌     2) బుర్వానుద్దీన్‌     3) ఆరామ్‌షా     4) కైకూబాద్‌


9. టంకా, జితాల్‌ అనే నాణేలను ముద్రించిన పాలకుడు?

1) ఐబక్‌     2) ఇల్‌టుట్‌మిష్‌     3) బాల్బన్‌     4) రజియా సుల్తానా


10. అడవులను నరికించి, వ్యవసాయ భూములుగా మార్చిన తొలి ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌     2) కుతుబుద్దీన్‌ ఐబక్‌     3) ఇల్‌టుట్‌మిష్‌     4) అల్లావుద్దీన్‌ ఖిల్జీ


11.  కుతుబ్‌ మీనార్‌ నిర్మాణాన్ని పూర్తి చేసింది?

1)  కుతుబుద్దీన్‌ ఐబక్‌     2) ఇల్‌టుట్‌మిష్‌     3) బాల్బన్‌     4) ఆరామ్‌షా


12. చిహల్‌గనీ కూటమిని నిర్మూలించిన వారు?

1) ఇల్‌టుట్‌మిష్‌      2) బాల్బన్‌     3) సుల్తానా రజియా    4) ఎవరూ కాదు


13. చౌగాన్‌ ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) కుతుబుద్దీన్‌ ఐబక్‌    2్శ బాల్బన్‌    3) ఇల్‌టుట్‌మిష్‌     4) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ 


14.  ఢిల్లీని రాజధానిగా చేసుకుని పాలించిన సుల్తాన్‌?

1) ఐబక్‌      2) బాల్బన్‌    3) ఇల్‌టుట్‌మిష్‌     4) ఆరామ్‌ షా


15. టుగ్రిల్‌ఖాన్‌ తిరుగుబాటును అణచిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌      2) ఇల్‌టుట్‌మిష్‌    3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ     4) కుతుబుద్దీన్‌ ఐబక్‌


16. రజియా సుల్తానా తన అశ్వదళాధిపతిగా నియమించిన ‘మాలిక్‌యాకుత్‌’ ఏ దేశస్థుడు?

1) అఫ్గానిస్థాన్‌      2) టర్కీ     3) అబిసీనియా     4) పర్షియా 


17. పర్షియా దేశపు రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌? 

1) బాల్బన్‌      2) ఇల్తమష్‌     3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ     4) కుతుబుద్దీన్‌ ఐబక్‌ 


18. సుల్తాన్‌ పాదాలను లేదా సింహాసనాన్ని ముద్దు పెట్టుకోవడాన్ని ఏమంటారు?

1) సిజ్ధా         2) ఫైబోస్‌/ జమ్నిబోస్‌       3)  దాగ్‌         4) చెహ్రా 


19. మంగోలు దండయాత్రల వల్ల తన కుమారుడిని కోల్పోయిన ఢిల్లీ సుల్తాన్‌?

1) ఐబక్‌      2) ఇల్‌టుట్‌మిష్‌     3) బాల్బన్‌     4) నాసిరుద్దీన్‌ 

 

 

20. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న భూస్వాములను ఢిల్లీ సుల్తానుల కాలంలో ఏమని పిలిచేవారు? 

1) చౌదరీలు        2) ముఖద్దమ్‌లు         3) పట్వారీలు        4) కుట్‌లు/కుల్ట్‌లు
 

21. ఢిల్లీలోని భవన నిర్మాణ కార్మికుల గొప్పదనాన్ని కొనియాడిన రచయిత? 

1) అమీర్‌ ఖుస్రూ         2) అల్‌బెరూనీ        3) ఇస్సామీ       4) బరౌనీ
 

22. సుల్తానుల కాలంలో రాజ్యానికి అధిక ఆదాయాన్ని సమకూర్చిన పన్ను? 

1) జకాత్‌              2) జిజియా             3) ఖరజ్‌              4) ఖామ్స్‌ 
 

23. సుల్తాను అధీనంలో ఉన్న భూమిని ఏమని పిలిచేవారు? 

1) ఖలీసా             2) ఇక్తా           3) మదద్‌-ఇ-మాష్‌            4) జాగీర్‌    


24. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సైనిక వ్యవస్థను ఏవిధంగా పేర్కొనేవారు? 

1) మున్సబ్‌దారీ      2) ఇక్తా పద్ధతి     3) నాయంకర పద్ధతి      4) అమరనాయక పద్ధతి 
 

25. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థికమంత్రిని ఏమని పిలిచేవారు? 

1) దివాన్‌ - ఇ - అర్జ్‌       2) దివాన్‌ - ఇ - ఖాజీ     3) దివాన్‌- ఇ - వజీర్‌     4) ఇన్షా


26. సిద్ధసైన్యాన్ని రూపొందించుకున్న తొలి ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌       2) ఇల్‌టుట్‌మిష్‌     3) అల్లావుద్దీన్‌ ఆలంషా     4) అల్లావుద్దీన్‌ ఖిల్జీ
 

27. దివాన్‌ - ఇ - కోహి అనే ప్రత్యేక వ్యవసాయశాఖను ఏర్పాటు చేసినవారు? 

1) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌         2) అల్లావుద్దీన్‌ ఖిల్జీ       3) బాల్బన్‌        4) ఫిరోజ్‌షా తుగ్లక్‌
 

28. ఢిల్లీ సుల్తానుల కాలంలో గ్రామ అధికారిని ఏమనేవారు? 

1) పట్వారీ           2) చౌకీదార్‌         3) ముఖద్దమ్‌          4) పైవన్నీ
 

29. రాజపుత్ర స్త్రీలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఏమంటారు?

1) సతి పద్ధతి           2) పరదా పద్ధతి          3) షరియత్‌ విధానం          4) జౌహార్‌
 

30. ఖురాన్‌ ప్రకారం మహ్మదీయులు అందించే న్యాయపాలన? 

1) మజ్లిస్‌         2)  దివాన్‌దరి          3)  షరియత్‌          4) జిల్లీ ఇల్లాహె
 


సమాధానాలు: 1-3; 2-4; 3-1; 4-2; 5-2; 6-1; 7-4; 8-4; 9-2; 10-1; 11-2; 12-2; 13-1; 14-3; 15-1; 16-3; 17-1; 18-2; 19-3; 20-4;  21-1;  22-3;  23-1;  24-2; 25-3; 26-4; 27-1;  28-4;   29-4;  30-3.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కర్ణాటక యుద్ధాలు

భారతదేశానికి వర్తకం పేరుతో వచ్చిన డచ్, పోర్చుగీస్ తదితర దేశాలవారు అనేక కారణాలతో నిష్క్రమించినా మిగిలిన రెండు ప్రధాన ఐరోపా వర్తక కంపెనీల (బ్రిటిష్, ఫ్రెంచ్) మధ్య ఆదిపత్య పోరు తారస్థాయికి చేరింది. 1740 తర్వాత మన దేశంలో ఆధిపత్యం కోసం ఫ్రెంచ్, బ్రిటిషర్లు ఎన్నో యుద్ధాలకు కారకులయ్యారు. వీటిలో కర్ణాటక, ప్లాసీ, బక్సార్, మైసూర్ యుద్ధాలు ప్రధానమైనవి. వీటిపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.  భారతదేశపు ఆగ్నేయ తీరంలోని ఆర్కాట్ రాజధానిగా సాదతుల్లా ఖాన్ స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని స్థాపించాడు. అంతకుముందు కర్ణాటక రాజ్యం దక్కన్‌లోని ఒక మొగల్ సుబాగా.. హైదరాబాద్ నిజాం నామమాత్రపు నియంత్రణలో ఉండేది. ఈ ప్రాంతంలో జరిగిన అంతర్యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచివారు చెరో వర్గాన్ని సమర్థించారు. చివరకు బ్రిటిషర్లు ఫ్రెంచివారిపై ఆధిపత్యం సాధించారు.

మొదటి కర్ణాటక యుద్ధం (1745-1748)
ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో బ్రిటిషర్లకు, ఫ్రెంచివారికి మధ్య పోరు మొదలైంది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచి పడవలను స్వాధీనం చేసుకుంది. దానికి ప్రతీకారంగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం మద్రాసును ఆక్రమించింది. తమను ఫ్రెంచివారి నుంచి రక్షించాల్సిందిగా బ్రిటిషర్లు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ను కోరారు. ఈ మేరకు నవాబు చేసిన ఆజ్ఞలను ఫ్రెంచివారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచివారికి, అన్వరుద్దీన్‌కు మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నవాబు ఘోరంగా ఓడిపోయాడు. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగియడంతో భారతదేశంలో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య యుద్ధం కూడా ముగిసింది.

రెండో కర్ణాటక యుద్ధం (1749-1754)
వారసత్వ యుద్ధ సమయంలో ఫ్రెంచివారు హైదరాబాద్‌లో ముజఫర్‌జంగ్‌కు, కర్ణాటకలో చందాసాహెబ్‌కు మద్దతు పలికారు. బ్రిటిషర్లు హైదరాబాద్‌లో నాజర్‌జంగ్‌కు, కర్ణాటకలో అన్వరుద్దీన్‌కు, తర్వాత అతడి కుమారుడు మహమ్మద్ అలీకి మద్దతిచ్చారు. 1749లో ఫ్రెంచివారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్ఠించేలా చేశారు. అయితే బ్రిటిషర్లు రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందాసాహెబ్‌ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహమ్మద్ అలీ వశమైంది.

మూడో కర్ణాటక యుద్ధం (1758-1763)
ఐరోపాలో ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ల మధ్య 1756లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచి గవర్నరు కౌంట్ డి లాలీ బ్రిటిష్ జనరల్ సర్ ఐర్‌కూట్ చేతిలో ఓడిపోయాడు. ఫ్రెంచివారి స్థానంలో బ్రిటిషర్లు నిజాం సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. 1763లో బ్రిటిషర్లు, ఫ్రెంచివారి మధ్య సంధి కుదిరింది.

బెంగాల్ ఆక్రమణ
మొగల్ సామ్రాజ్య పతనం తర్వాత ముర్షిద్ కులీఖాన్ బెంగాల్‌లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ముర్షిద్ కులీఖాన్ తర్వాత అతడి అల్లుడు షుజాఉద్దీన్ సింహాసనాన్ని ఆక్రమించాడు. అతడి కుమారుడు సర్ఫరాజ్ పరిపాలనాకాలంలో బీహార్ డిప్యూటీ గవర్నరు అలీవర్దీఖాన్ 1740లో బెంగాల్ నవాబుగా ప్రకటించుకున్నాడు. ఇతడి కాలంలో బెంగాల్‌పై మరాఠాలు అనేక సార్లు దండయాత్రలు చేశారు. 1751లో బెంగాల్ నవాబుకు, మరాఠాలకు మధ్య సంధి కుదిరింది. ఈ సంధి ప్రకారం బెంగాల్ నవాబు మరాఠాలకు సంవత్సరానికి రూ.12 లక్షల చౌత్ చెల్లించడానికి అంగీకరించాడు. అలీవర్దీఖాన్ 1752లో తన మనవడు సిరాజ్-ఉద్-దౌలాను తన వారసుడిగా ప్రకటించాడు. సిరాజ్ సమీప బంధువు షౌకత్ జంగ్, పిన్ని గసితి బేగం, అలీవర్ద్దీఖాన్ సోదరి భర్త, సర్వసైన్యాధ్యక్షుడైన మీర్జాఫర్‌లు బెంగాల్ సింహాసనానికి ప్రధాన పోటీదారులు. వీరిని బలహీనపరచడానికి సిరాజ్ అనేక చర్యలు చేపట్టాడు. గసితి బేగం సంపదను లాక్కున్నాడు. మీర్జాఫర్ స్థానంలో మీర్‌మదన్‌ను సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. షౌకత్ జంగ్ తిరుగుబాటును అణచివేయడమే కాకుండా అతడిని చంపేశాడు.

సిరాజ్-ఉద్-దౌలా బ్రిటిషర్లతో వైరం పెంచుకోవడానికి కారణాలు
* చట్టానికి విరుద్ధంగా బ్రిటిషర్లు నవాబు ఆధీనంలోని భూభాగంలో కోటలు నిర్మించడంతోపాటు పెద్ద కందకాన్ని తవ్వడం.
* ఆంగ్లేయులు దస్తక్ / ఉచిత పాసులను అనర్హులకు కేటాయించి దుర్వినియోగం చేయడం ద్వారా నవాబు ఆదాయానికి గండికొట్టడం.
నవాబుకు అవిధేయులు, లంచగొండులైన అధికారులకు ఆంగ్లేయులు రక్షణ కల్పించడం.
* తన పూర్వికుల్లా తాను కూడా బ్రిటిషర్లపై నియంత్రణ కలిగి ఉండాలని భావించడం.

ప్లాసీ యుద్ధం
ప్లాసీ అనేది ముర్షిదాబాద్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. అక్కడ 1757 జూన్ 23న బ్రిటిషర్లకు, నవాబు సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు సిరాజ్-ఉద్-దౌలాను ఓడించాయి. నవాబు సైన్యంలోని అయిదుగురు సేనానుల్లో మీర్ మదన్, మదన్‌లాల్ మాత్రమే యుద్ధం చేశారు. మిగతా ముగ్గురు మీర్జాఫర్, యార్‌లతుఫ్ ఖాన్, రాయ్‌దుర్లబ్‌రామ్ కంపెనీ ఏజెంట్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని ప్రేక్షకపాత్ర వహించారు. ప్లాసీ యుద్ధం మొదట బెంగాల్‌లో, చివరికి దేశమంతటా బ్రిటిష్ వారి ఆధిపత్య స్థాపనకు దారితీసింది. భారతదేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరలింపు ప్రారంభమైంది. సిరాజ్-ఉద్-దౌలా స్థానంలో మీర్జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు. ఆ తర్వాత మీర్‌ఖాసిం బెంగాల్ నవాబు అయ్యాడు.

బక్సార్ యుద్ధం (1764)
బక్సార్ యుద్ధం 1764 అక్టోబరు 22న మేజర్ హెక్టర్ మన్రో నాయకత్వంలోని బ్రిటిష్ సేనలకు - మీర్‌ఖాసిం, అవధ్ నవాబు షుజా-ఉద్-దౌలా, మొగలు చక్రవర్తి రెండో షా ఆలం ఉమ్మడి సేనలకు మధ్య జరిగింది. బక్సార్ అనే ఈ ప్రదేశం పాట్నా నగరానికి పశ్చిమంగా 120 కి.మీ.ల దూరంలో ఉంది.

కారణాలు
* సార్వభౌమాధికారం కోసం బ్రిటిషర్లు - బెంగాల్ నవాబు మీర్‌ఖాసిం మధ్య పోరు.
* 1717లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను బ్రిటిషర్లు దుర్వినియోగం చేయడం.
* నవాబు బెంగాల్‌లో అంతర్గత వ్యాపారంపై అన్ని రకాల పన్నులను తొలగించడం.
నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదగా ప్రవర్తించడం.
   ఈ యుద్ధం భారతీయ పాలకుల ఓటమితో ముగిసింది. మూడు రాజ్యాల సేనల మధ్య సమన్వయం లేకపోవడమే బ్రిటిషర్ల విజయానికి ప్రధాన కారణం.

అలహాబాద్ ఒప్పందం
బక్సార్ యుద్ధం తర్వాత 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో బ్రిటిష్ ఆధిపత్య స్థాపన మొదలైంది. అవధ్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారాడు. మొగలు చక్రవర్తి రెండో షా ఆలం కంపెనీ పెన్షనర్ అయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఔన్నత్యం పెరిగింది.

మైసూరు రాజ్యం
తూర్పు, పశ్చిమ కనుమలకు మధ్య నెలకొన్న మైసూరు రాజ్యాన్ని ఒడయార్ వంశం పరిపాలించేది. క్రీ.శ. 1731-1734 మధ్య సర్వసైన్యాధ్యక్షుడైన దేవరాజ, సర్వాధికారి (ఆర్థికమంత్రి) ననరాజ అనే సోదరులు మైసూరు రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. మరాఠాలు, నిజాం, బ్రిటిషర్లు, ఫ్రెంచివారు మైసూరు రాజ్యంపై వరుస దాడులు ప్రారంభించారు. రెండో కర్ణాటక యుద్ధం సమయంలో ననరాజ తిరుచిరాపల్లిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఆంగ్లేయుల పక్షం వహించాడు. తర్వాత అతడు ఫ్రెంచివారి పక్షాన చేరాడు. మైసూరు రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడైన హైదర్ అలీ తిరుచిరాపల్లి దండయాత్ర సందర్భంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. క్రీ.శ. 1758 తర్వాత మరాఠాలు మైసూరుపై దండెత్తినప్పుడు హైదర్ అలీ ననరాజ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుని మైసూరు పాలకుడయ్యాడు. అయితే ఇది నచ్చని కొంతమంది హైదర్ అలీపై దండెత్తవలసిందిగా మరాఠాలను ఆహ్వానించారు. ఇందులో హైదర్ అలీ ఓడిపోయాడు. మరాఠాలు మూడో పానిపట్టు యుద్ధంలో తలమునకలై ఉన్న సమయంలో హైదర్ అలీ తన అధికారాన్ని మళ్లీ సుస్థిరం చేసుకున్నాడు.

'కలకత్తా చీకటి గది' ఉదంతం
సిరాజ్-ఉద్-దౌలా 1756 జూన్‌లో ఆంగ్లేయుల ఆధీనంలోని కలకత్తాను ఆక్రమించాడు. బెంగాల్ గవర్నరు రోజర్ డ్రేక్, ఇతర అధికారులు కలకత్తా నగరం వదిలి పారిపోయారు. హాల్‌వెల్‌తో సహా అనేక మంది ఐరోపావారు నవాబుకు లొంగిపోయారు. వీరిని ఒక చిన్న గదిలో రాత్రంతా బంధించడంతో తెల్లవారేసరికి 16 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఈ సంఘటనను 'కలకత్తా చీకటి గది' ఉదంతంగా పేర్కొన్నారు. అయితే దీనికి సిరాజ్-ఉద్-దౌలా స్వయంగా బాధ్యుడు కాడు. రాబర్ట్ క్లైవ్ 1757 జనవరి 2న అడ్మిరల్ వాట్సన్ సహాయంతో కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటిషర్లకు, నవాబుకు మధ్య అదే ఏడాది ఫిబ్రవరి 9న అలీనగర్ సంధి కుదిరింది. క్లైవ్ మార్చిలో ఫ్రెంచివారికి చెందిన చంద్రనగర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. సిరాజ్-ఉద్-దౌలా ఆస్థానంలోని మీర్జాఫర్, రాయ్‌దుర్లబ్‌రామ్, అమీన్‌చంద్, జగత్‌సేఠ్‌లకు నవాబు వ్యవహార శైలి నచ్చలేదు. వారు అతడిని నవాబు పదవి నుంచి తొలగించాలని కుట్రపన్నారు. అమీన్‌చంద్ ఈ విషయాన్ని బ్రిటిషర్లకు తెలియజేయడంతో వారు సిరాజ్-ఉద్-దౌలాను ఓడించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

మైసూరు యుద్ధాలు
మొదటి మైసూరు యుద్ధం (1766-1769)
మైసూరు పాలకుడు హైదర్ అలీ బ్రిటిషర్లను కర్ణాటక ప్రాంతంతోపాటు భారతదేశం నుంచి కూడా తరిమివేయాలని భావించాడు. హైదర్ అలీ వల్ల తమ సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లనుందని గ్రహించిన బ్రిటిషర్లు నిజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో బ్రిటిషర్లపై విజయం సాధించిన హైదర్ అలీ మద్రాసుకు 5 కి.మీ.ల మేర దండయాత్ర కొనసాగించాడు. 1769లో జరిగిన మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది.

రెండో మైసూరు యుద్ధం (1780-1784)
మరాఠాలు 1771లో హైదర్ అలీపై దాడి చేసినప్పుడు బ్రిటిషర్లు హైదర్ అలీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. అమెరికా స్వాతంత్య్ర యుద్ధం సందర్భంగా ఇంగ్లండ్‌కు, హైదర్ అలీ మిత్రదేశమైన ఫ్రాన్సుకు మధ్య తగాదా తలెత్తింది. హైదర్ అలీ ఆధీనంలోని ఫ్రెంచి భూభాగమైన మహేను బ్రిటిషర్లు ఆక్రమించారు. ఇవే ఈ యుద్ధానికి దారితీసిన కారణాలు. 1780లో జరిగిన యుద్ధంలో కల్నల్ బైలీని హైదర్ అలీ ఓడించాడు. 1781లో పోర్టోనోవో యుద్ధంలో ఐర్ కూట్ చేతిలో పరాజయం పొందాడు. 1782లో కల్నల్ బ్రైట్ వైట్‌ను ఓడించాడు. ఈ యుద్ధం జరుగుతుండగానే హైదర్ అలీ మరణించాడు. దీంతో అతడి కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. ఈ యుద్ధం 1784లో జరిగిన 'మంగళూరు సంధి'తో ముగిసింది.

మూడో మైసూరు యుద్ధం (1790-1792)
అంతర్గత సంస్కరణల ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడం.. టర్కీ, ఫ్రాన్సులకు రాయబారులను పంపడం ద్వారా వారి సహాయం పొందడానికి ప్రయత్నించడం.. బ్రిటిషర్ల మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్ రాజ్య భూభాగాలను ఆక్రమించడం.. ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు. బ్రిటిష్ సైన్యానికి స్వయంగా గవర్నరు జనరల్ కారన్ వాలిస్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాడు. 1792లో జరిగిన శ్రీరంగ పట్టణం సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగం భూభాగాన్ని బ్రిటిషర్లకు ఇవ్వడానికి అంగీకరించాడు. యుద్ధ నష్టపరిహారం కింద రూ. 3.6 కోట్లు చెల్లించడానికి అంగీకరించి రూ. 1.6 కోట్లు వెంటనే చెల్లించాడు.

నాలుగో మైసూరు యుద్ధం (1799)
టిప్పు సుల్తాన్ తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, బ్రిటిష్ గవర్నరు జనరల్ వెల్లస్లీ బ్రిటిష్ సామ్రాజ్యానికి టిప్పు సుల్తాన్ నుంచి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించాలనుకోవడం ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణాలు. శ్రీరంగ పట్టణంలో జరిగిన ఈ యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడుతూ 1799 మేలో టిప్పు సుల్తాన్ మరణించాడు. గవర్నరు జనరల్ సోదరుడు సర్ ఆర్ధర్ వెల్లస్లీ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతడే 1815లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ను ఓడించాడు. టిప్పు సుల్తాన్ మరణంతో మైసూరు రాష్ట్రంలోని చాలా భూభాగాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. కొంత భూభాగానికి ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ అనే బాలుడిని రాజుగా చేసి మైసూరు రాజవంశాన్ని పునరుద్ధరించారు.
   హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ గొప్ప పరిపాలకులు. ఇద్దరూ పరమత సహనాన్ని పాటించారు. హైదర్ అలీ ఎప్పుడూ బహిరంగంగా రాజరిక బిరుదులు ధరించలేదు. ఇతడికి, రాజవంశానికి మధ్య సంబంధం మరాఠా చక్రవర్తికి, పీష్వాకు మధ్య సంబంధంలా ఉండేది. అయితే టిప్పు సుల్తాన్ మైసూరు రాజును పదవీచ్యుతుడిని చేసి 1789లో సుల్తాన్ బిరుదు ధరించాడు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌లు తమ నాణేల మీద హిందూ దేవతల బొమ్మలు ముద్రించారు. టిప్పు సుల్తాన్‌కు శృంగేరి పీఠానికి చెందిన జగద్గురు శంకరాచార్యులపై ఎనలేని గౌరవం ఉండేది. శంకరాచార్యులకు దేవాలయ మరమ్మతుల కోసం భారీగా నిధులు ఇచ్చాడు. పరిపాలనలో పాశ్చాత్య పద్ధతులను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాజుగా టిప్పుసుల్తాన్ పేరుగాంచాడు. ఇతడు స్వదేశీ, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. న్యాయ పరిపాలనలో నిష్పాక్షికంగా వ్యవహరించాడు. అధికారుల ఎంపికలో కుల, మత, సాంఘిక తారతమ్యాలు చూపకుండా ప్రతిభకు పట్టం కట్టాడు. సమకాలీన భారతదేశ చరిత్రలో వీరి పరిపాలన అందరిమన్ననలు పొందింది.

 

మాదిరి ప్రశ్నలు
 

1. కిందివారిలో స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు ఎవరు?
   ఎ) సఫ్దర్ అలీ    బి) దోస్త్ అలీ    సి) సాదతుల్లా ఖాన్    డి) అన్వరుద్దీన్
జ: సి(సాదతుల్లా ఖాన్)

 

2. కర్ణాటక రాజ్య రాజధాని ఏది?
జ: ఆర్కాట్

 

3. హైదర్ అలీ ఏ మైసూరు యుద్ధ సమయంలో మరణించాడు?
జ: రెండో

 

4. ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజ్-ఉద్-దౌలాను బంధించి చంపిన వ్యక్తి ఎవరు?
జ: మీరాన్

 

5. బక్సార్ యుద్ధ వీరుడు ఎవరు?
జ: హెక్టర్ మన్రో

 

6. చీకటి గది ఉదంతం గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరు?
జ: హాల్‌వెల్

 

7. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
జ: రాబర్ట్ క్లైవ్

 

8. టిప్పు సుల్తాన్ ఎప్పుడు మరణించాడు?
జ: 1799

 

9. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జ: మంగళూరు

 

10. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్‌కు, కుట్రదారులకు మధ్య రహస్య ఒప్పందాన్ని కుదిర్చిన వ్యక్తి ఎవరు?
జ: అమీన్‌చంద్

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మధ్యయుగం - దక్షిణ భారత రాజ్యాలు

     సంగం యుగంలో తమిళ ప్రాంతంలో ప్రాచీన చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఆధిపత్యం వహించాయి. గుప్త యుగంలో తమిళ ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. రాజపుత్ర యుగంలో తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలకపాత్ర పోషించారు. క్రీ.శ.9వ శతాబ్దంలో విజయాలయుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.


నవీన చోళులు
* విజయాలయుడు క్రీ.శ.846లో పల్లవులకు సామంతులుగా ఉన్న ముత్తరాయర్లను ఓడించి, కావేరి డెల్టాపై అధికారాన్ని స్థాపించాడు.
* ఒరైయూర్‌కు చెందిన విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని, నిశుంభసూదిని దేవాలయాన్ని నిర్మించాడు.
* నవీన చోళుల రాజధాని తంజావూరు.
* విజయాలయుడి కుమారుడైన చోళ ఆదిత్యుడు చివరి పల్లవ చక్రవర్తి అపరాజిత వర్మను ఓడించి, పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు.
* మొదటి పరాంతకుడు స్థానిక స్వపరిపాలనకు ఆధారమైన ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించాడు (చోళులు స్థానిక స్వపరిపాలనా పితామహులుగా పేరు పొందారు).
* ఉత్తర మేరూర్ శాసనం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది.
* మొదటి పరాంతకుడు మధురను ఆక్రమించి, మధురైకొండ అనే బిరుదు పొందాడు.
* మొదటి పరాంతకుడి కాలంలోనే రాష్ట్రకూటులతో వైరం ఏర్పడింది. రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడు మొదటి పరాంతకుడిని క్రీ.శ.949 నాటి తక్కోలం యుద్ధంలో ఓడించాడు.
* నవీన చోళ రాజుల్లో మొదటి గొప్ప పాలకుడు మొదటిరాజరాజు (క్రీ.శ.985 - 1014).
* మొదటి రాజరాజు అసలు పేరు అరుమోలి వర్మ. తంజావూరు శాసనం ఇతడి విజయాలను వివరిస్తుంది.
* బృహదీశ్వర ఆలయాన్ని శివుడికి అంకితం చేశారు. ఈ దేవాలయాన్ని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.
* మొదటి రాజరాజు పొలోన్నరావాలో (సింహళం) శివాలయాన్ని నిర్మించాడు.
* తమిళ దేవాలయ వాస్తులో విమానాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ.
* భారతదేశ చరిత్రలో తొలిసారిగా నౌకా దండయాత్ర చేసి విదేశాలను జయించిన తొలి పాలకుడిగా రాజరాజు పేరొందాడు. (బిరుదులు జయంగొండ, చోళమార్తాండ, ముమ్మిడి చోళ)
* ఇతడు సింహళంపై (శ్రీలంక) దండెత్తి ఉత్తర సింహళాన్ని ఆక్రమించాడు.
* మాల్దీవులను ఆక్రమించాడు.
* రాజరాజు తన కుమార్తె కుందవ్వను తూర్పు చాళుక్యరాజైన విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.
* తూర్పు చాళుక్య రాజ్యంపై దాడి చేసిన కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.
* శ్రీ విజయరాజ్య పాలకుడైన శ్రీమార విజయోత్తుంగునకు నాగపట్నంలో చౌఢామణి విహార నిర్మాణానికి అనుమతి ఇచ్చింది మొదటి రాజరాజే
* మొదటి రాజరాజు అనంతరం అతడి కుమారుడు మొదటి రాజేంద్రచోళ అధికారంలోకి వచ్చాడు.
* నవీన చోళుల్లో ప్రసిద్ధిచెందిన చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు (1014 - 1044)
* మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ, కడారంకొండ, పండితచోళ లాంటి బిరుదులను పొందాడు.
* మొదటి రాజేంద్ర చోళుడు తన కుమార్తె అమ్మాంగదేవిని తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు.
* గంగానది వరకు వెళ్లి పాలవంశ రాజు మహీపాలుడిని ఓడించి, ''గంగైకొండ'' అనే బిరుదు పొందాడు.
* నౌకా దండయాత్రలు చేసి శ్రీలంక, శ్రీ విజయ రాజ్యాలను జయించాడు.
* శ్రీ విజయ రాజ్య రాజధాని కడారంను జయించి కడారంకొండ అనే బిరుదును పొందాడు.
* మొదటి రాజేంద్ర చోళుడు 'గంగైకొండ చోళపురం' అనే నూతన రాజధానిని, 1030లో గంగైకొండ చోళపురం దేవాలయాన్ని నిర్మించాడు.
* తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను వివరిస్తాయి.
* మొదటి రాజేంద్ర చోళుడు 1025లో శ్రీ విజయరాజ్య రాజు శైవేంద్రుడిని, 1029లో సింహళ రాజు మహేంద్రుడిని ఓడించాడు.
* సుమత్రా, మలయా, బోర్నియో లాంటి ప్రాంతాలను ఆ రోజుల్లో శ్రీ విజయరాజ్యంగా పిలిచేవారు.
* అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తొలి భారతీయ పాలకుడు మొదటిరాజేంద్రచోళుడు (చైనాకు వాణిజ్య రాయబారులను పంపించాడు.)
* ఎన్నాయిరం వైదిక కళాశాలను నిర్మించింది మొదటి రాజేంద్ర చోళుడు.
* మొదటి రాజేంద్ర చోళుడి అనంతరం అతడి కుమారుడు రాజాధిరాజు ''విజయ రాజేంద్ర' బిరుదుతో రాజ్యపాలన చేశాడు.
* కానీ మొదటి రాజాధిరాజు క్రీ.శ.1052 నాటి కొప్పం యుద్ధంలో మరణించాడు.
* రాజాధిరాజు అనంతరం అతడి సోదరుడు రెండో రాజేంద్రుడు పాలనకు వచ్చాడు.
* రెండో రాజేంద్రుడు క్రీ.శ.1062 నాటి కుడల సంగం యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు.
* అనంతరం వచ్చిన పాలకుడు వీర రాజేంద్రుడు, ఇతడి తర్వాత అతడి కుమారుడు అధిరాజేంద్రుడు పాలించాడు.
* రాజరాజ నరేంద్రుడి కుమారుడైన రాజేంద్రుడు ''కులోత్తుంగ చోళుడు'' అనే బిరుదుతో అధిరాజేంద్రుడి అనంతరం చోళరాజ్య పాలన చేపట్టాడు.
* కులోత్తుంగ చోళుడు చివరి తూర్పు చాళుక్య రాజైన ఏడో విజయాదిత్యుడి మరణానంతరం 'చోళ చాళుక్య రాజ్యాల'ను కలిపి పాలన ప్రారంభించాడు.
* విశాఖపట్నం నగరాన్ని నిర్మించింది కులోత్తుంగ చోళుడే.
* కళింగట్టు సరణి గ్రంథాన్ని రాసిన జయంగొండార్ కులోత్తుంగ చోళుడి ఆస్థానంలో ఉండేవాడు.
* మూడో కులోత్తుంగ చోళుడు, మూడో రాజరాజు, నాలుగో రాజేంద్రుడు చివరి చోళ చక్రవర్తులు.


ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు
* చోళులు వ్యవసాయ, వాణిజ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
* వ్యవసాయాభివృద్ధి కోసం పెద్దసంఖ్యలో చెరువులను తవ్వించారు.
* చోళులు అధికంగా భూములను వివిధ వర్గాలకు దానం చేయడం ద్వారా భూస్వామ్య వ్యవస్థ పటిష్టమైంది
* నాటి భూస్వాములను మువ్వేందవేలన్, అరయ్యార్ అని పిలిచేవారు.
* మువ్వేంద వేలన్ అంటే ముగ్గురు రాజులకు సేవలు అందించిన భూస్వామి
* అరయ్యార్ అంటే ముఖ్యుడు అని అర్థం.
* చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని శెక్కిలార్ రచించిన పెరియ పురాణం గ్రంథం వివరిస్తుంది.
* పెరియ పురాణం గ్రంథంలో ముఖ్యంగా అదనూరు అనే గ్రామంలో నివసిస్తున్న పులయులు అనే నిమ్న కులం గురించి వివరించారు.
* మొదటి రాజేంద్ర చోళుడు చైనా దేశానికి రెండు రాయబార బృందాలను పంపి రాజకీయ, వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచాడు.
* చోళుల కాలంలో ద్రవిడ/ దక్కన్ శైలి ఎంతో అభివృద్ధి చెందింది.


పుదుక్కోటి జిల్లాలోని ప్రధాన ఆలయాలు
* చోళుల ప్రారంభ ఆలయాలు పుదుక్కోటి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి.
* విజయాలయ చోళేశ్వరాలయం నార్థమలై
* నాగేశ్వరస్వామి ఆలయం కుంభకోణం
* కురంగనాథ ఆలయం శ్రీనివాస నల్లూరు
* మొదటి రాజరాజు 1009లో తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు.
* చోళుల కాలంనాటి నటరాజ కాంస్య విగ్రహం తమిళనాడులోని చిదంబరంలో ఉంది.
* చోళుల అధికార మతం శైవం. (శివారాధకులు)
* కుంభకోణం సమీపంలోని త్రిభువనంలో కంపహారేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.
* తంజావూరు జిల్లాలోని దారాసురాం వద్ద అయితేశ్వర దేవాలయాన్ని నిర్మించారు.
* సిబక చింతామణి, శివకాశీ నందమణి, కంబ రామాయణం లాంటి గ్రంథాలు ఈ కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి.
* చోళుల కాలంలో యజ్ఞాల కంటే దానాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.
* అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శంకరాచార్యుడు, విశిష్టాద్వైతాన్ని చెప్పిన రామానుజాచార్యుడు ఈ యుగంలో ప్రాచుర్యం పొందారు.
* కులోత్తుంగ చోళుడి కాలంలో నివసించిన రామానుజాచార్యులు హొయసల రాజ్యానికి వెళ్లి, వైష్ణవ మతాన్ని, విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశారు.
* దక్షిణ భారతదేశ సంస్కృతికి చోళులు ఎనలేని సేవలు అందించారు.


ళుల కాలంలో దానం చేసిన భూములు  - పేర్లు
బ్రహ్మదేయ  - బ్రాహ్మణులకు దానం చేసిన భూమి
వెల్లన్ వాగై - బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమి
దేవమేయ/ తిరునాముత్తక్కని - దేవాలయానికి దానం చేసిన భూమి
శాలభోగ - పాఠశాలలకు ఇచ్చిన భూమి
పళ్లిచ్చరిదం - జైన సంస్థలకు దానం చేసిన భూమి.


బృహదీశ్వర ఆలయం
     తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని మొదటి రాజరాజు నిర్మించాడు. కళ్యాణి చాళుక్యులను ఓడించి తెచ్చిన ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తమిళ వాస్తురీతిలో నిర్మితమైన బృహదీశ్వర ఆలయం మహోన్నతమైంది. ఈ దేవాలయ గోపురంపై అతి పెద్ద విమానాన్ని నిర్మించారు.


పరిపాలనా విశేషాలు
* చోళులు తమ సామ్రాజ్యాన్ని మండలాలు - వలనాడులు - నాడులు - గ్రామాలుగా విభజించారు.
* చోళుల పాలనలో అత్యంత విశిష్టమైంది గ్రామపాలన/ స్థానిక పాలన.
* మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూర్ శాసనం నాటి స్థానిక పాలన విశేషాలను వివరిస్తుంది.
* నాటి గ్రామాలను ''కుర్రం, కొట్టం'' అని కూడా పిలిచేవారు.
* గ్రామాల సముదాయాన్ని 'నాడు' అనేవారు. ప్రతినాడులో సుమారు 50 గ్రామాలు ఉండేవి
* నాడుల పాలన ధనవంతులైన 'వెల్లాలు' అనే రైతుల ఆధీనంలో ఉండేది.
* గ్రామాన్ని కుటుంబాలు / కుడుంబాలు అనే వార్డులుగా విభజించేవారు.
* గ్రామ కమిటీని వరియం / వారియం అనేవారు.
* గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు నిర్ణయించారు.


అర్హతలు:
   1. సొంత ఇల్లు కలిగి ఉండాలి.
   2. శిస్తు చెల్లించే సొంత భూమి కలిగి ఉండాలి.
   3. 35 - 70 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
   4. వేదాల్లోని అంశాలపై అవగాహన ఉండాలి
   5. నిజాయతీపరుడై ఉండాలి.


అనర్హతలు:
   1. గతంలో వరుసగా మూడు సంవత్సరాలు గ్రామకమిటీ సభ్యుడిగా పని చేసి ఉండకూడదు.
   2. గతంలో పని చేసి లెక్కలు చూపనివారై ఉండకూడదు.
* అర్హత ఉన్న వారందరి చీటీలను కుండలో వేసి ఒక బాలుడితో లాటరీ తీసి విజేతలను / కమిటీని ప్రకటిస్తారు.
* ఇలా ఎన్నుకున్న కమిటీని వారియం అంటారు. ప్రతి గ్రామ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు.
* వారియం మళ్లీ ఆరు ఉపకమిటీలుగా విడిపోయి వివిధ అంశాలను పరిశీలిస్తుంది.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సంఘ సంస్కరణోద్యమాలు

మాదిరి ప్రశ్నలు

1. కామన్వెల్త్ పత్రికను ఎవరు స్థాపించారు?
ఎ) తిలక్ బి) బిపిన్ చంద్రపాల్ సి) అనిబిసెంట్ డి) గాంధీజీ
జ: (సి)

 

2. యంగ్ బెంగాల్ ఉద్యమ స్థాపకుడు ఎవరు?
ఎ) ఎం.జి.రనడే బి) ఆనంద మోహన్ బోస్ సి) హెన్రీ వివియన్ డిరోజియో డి) రాధాకాంత్ దేవ్
జ: (సి)

 

3. ధర్మసభ స్థాపకుడు ఎవరు?
ఎ) రాధాకాంత్ దేవ్ బి) ఆత్మారాం పాండురంగ సి) కేశవ చంద్రసేన్ డి) హెచ్.ఎన్.కుంజూ
జ: (ఎ)

 

4. దేవ సమాజం స్థాపకుడు ...
ఎ) కె.శ్రీధరులు నాయుడు బి) శివనారాయణ అగ్నిహోత్రి సి) రాజారామ్మోహన్‌రాయ్ డి) ఎవరూకాదు
జ: (బి)

 

5. కిందివారిలో వితంతు వివాహాల కోసం కృషి చేసినవారు ఎవరు?
ఎ) విలియం బెంటింక్ బి) ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ సి) కారన్ వాలిస్ డి) మింటో
జ: (బి)

 

6. భారతదేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు?
ఎ) అన్నాదురై బి) నందమూరి తారకరామారావు సి) డి.కె.కార్వే డి) జ్యోతిబా ఫూలే
జ: (సి)

 

7. గోపాలకృష్ణ గోఖలే ఎవరిని తన గురువుగా పేర్కొన్నారు?
ఎ) గాంధీజీ బి) గోపాల గణేష్ అగార్కర్ సి) ఎం.జి.రనడే డి) బెత్యూన్
జ: (సి)

 

8. 'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ' స్థాపకుడు ఎవరు?
ఎ) గోపాల హరి దేశ్‌ముఖ్ బి) పండిత రమాబాయి సి) బి.ఎం.మలబారి డి) గోపాలకృష్ణ గోఖలే
జ: (డి)

 

9. రహనుమయ్ మజ్‌దయ్ సనన్ సభతో సంబంధం లేనివారు?
ఎ) దాదాభాయ్ నౌరోజీ బి) జె.బి.వాచా సి) ఎస్.ఎస్.బంగాలీ డి) హెచ్.ఎన్.కుంజూ
జ: (డి)

 

10. శారదా సదన్ స్థాపకులు ఎవరు?
ఎ) పండిత రమాబాయి బి) గంగాబాయి సి) సిస్టర్ సుబ్బలక్ష్మి డి) మార్గరెట్ కజిన్స్
జ: (ఎ)

 

11. మద్రాసు శాసనమండలిలో మొదటిసారి సభ్యురాలిగా నియమితురాలైన మహిళ ఎవరు?
ఎ) ముత్తులక్ష్మిరెడ్డి బి) సుబ్బలక్ష్మిరెడ్డి సి) శ్రీలతారెడ్డి డి) సమీరారెడ్డి
జ: (ఎ)

 

12. సత్యశోధక సమాజాన్ని ఎవరు స్థాపించారు?
ఎ) జ్యోతిబా ఫూలే బి) డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సి) గాంధీజీ డి) త్యాగరాజ చెట్టియార్
జ: (ఎ)

 

13. 'ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్' మొదటి అధ్యక్షురాలు ఎవరు?
ఎ) దొరోతి జన రాజదాస బి) అనిబిసెంట్ సి) మార్గరెట్ కజిన్స్ డి) లలితా చౌదరి
జ: (బి)

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మౌర్య సామ్రాజ్యం

భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం తొలి ఏకీకృత సామ్రాజ్యంగా పేరొందింది. ఈ వంశానికి చెందిన అశోకుడు తొలి జాతీయ చక్రవర్తిగా పేరు పొందాడు. మౌర్యులు సుమారు 500 సంవత్సరాల పాటు భారత దేశాన్ని సమర్థవంతంగా పాలించారు. దేశ చరిత్ర, సంస్కృతికి ఎనలేని సేవలు చేశారు. అప్పటి రాజులు చేసిన పరిపాలనా విధానాలు నేటికీ కొనసాగుతున్నాయంటే వారి పాలన ఎంత గొప్పదో తెలుస్తుంది. మౌర్యుల పరిపాలనా విధానాలు, రాజకీయ చరిత్ర, సాంఘిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులు మొదలైన అంశాలపై పోటీపరీక్షార్థులకు అవగాహన అవసరం.


రాజకీయ చరిత్ర

    మౌర్య సామ్రాజ్యాన్ని క్రీ.పూ.321లో చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. ఆయన అనంతరం బిందుసారుడు, అశోకుడు మొదలైన రాజులు పాలించారు. చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రధుడ్ని క్రీ.పూ.184లో పుష్యమిత్ర శుంగుడు ఓడించాడు. దీంతో మౌర్య సామ్రాజ్యం అస్తమించి శుంగవంశ పాలన ప్రారంభమైంది. 


చంద్రగుప్త మౌర్యుడు 

    మౌర్యవంశ సామ్రాజ్య స్థాపకుడిగా చంద్రగుప్త మౌర్యుడిని చరిత్రకారులు పేర్కొంటారు. ఈయన క్రీ.పూ.321 నుంచి 297 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి ప్రాభవం, పరిపాలనా, వంశ స్థాపన గురించి అప్పటి బౌద్ధ సాహిత్యంలో ఎక్కువ వివరాలు ఉన్నాయి. చంద్రగుప్తుడు ‘ముర’ అనే స్త్రీకి జన్మించాడని, అందువల్లే ఇతడి వంశానికి ‘మౌర్యవంశం’ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు వివరించారు. విశాఖదత్తుడు రచించిన ‘ముద్రా రాక్షసం’ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు తక్కువ కులానికి చెందినవాడని ఉంది. పాటలీపుత్ర వీధుల్లో రాసక్రీడ ఆడుతున్న చంద్రగుప్తుడిని చూసిన కౌటిల్యుడు అతడ్ని గొప్ప యోధుడిగా భావించాడు. కౌటిల్యుడి సహాయంతోనే చంద్రగుప్తుడు మౌర్యరాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుడు అనేక దండయాత్రలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 

రెండు ప్రధాన విజయాలు: ఖి. చివరి నందవంశపు రాజైన ధననందుడ్ని ఓడించి మగధను ఆక్రమించాడు. ఖిఖి. గ్రీకు పాలకుడైన సెల్యూకస్‌ నికేటర్‌ను ఓడించి వాయవ్య భారతదేశంపై ఆధిపత్యం సాధించాడు. సెల్యూకస్‌ నికేటర్‌ తన కుమార్తె హెలీనాను చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.

    మెగస్తనీస్‌ను గ్రీకు రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి సెల్యూకస్‌ నికేటర్‌ పంపాడు. మెగస్తనీస్‌ రచించిన ఇండికా గ్రంథం అప్పటి చరిత్రకు ఆధారంగా ఉంది. చంద్రగుప్త మౌర్యుడు తన చివరి పాలనా కాలంలో జైనమతాన్ని స్వీకరించి కర్ణాటకలోనిశ్రావణ బెలగోళ వద్ద సల్లేఖనవ్రతం ఆచరించి మరణించాడు. గుజరాత్‌లోని కథియవాడ్‌ ప్రాంతంలో పుష్యగుప్తుడి ఆధ్వర్యంలో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు.


బిందుసారుడు

    చంద్రగుప్త మౌర్యుడి తర్వాత అతడి కుమారుడైన బిందుసారుడు రాజ్యాన్ని పాలించాడు. ఇతడికి అమిత్రఘాత/ అమిత్రో ఖేటస్‌ అనే బిరుదులు ఉన్నాయి. బిందుసారుడు రెండు సముద్రాల మధ్య ఉన్న భూభాగాన్నంతా జయించాడని టిబెట్‌ చరిత్రకారుడైన తారానాథ్‌ పేర్కొన్నాడు. ఇతడి సామ్రాజ్యం దక్షిణ మైసూర్‌ వరకు విస్తరించి ఉంది. ఇతడి కాలంలో సిరియా రాయబారి డెమాకస్‌ భారతదేశాన్ని సందర్శించాడు. తన రాజ్యానికి తియ్యటి మద్యం, ఎండిన అత్తిపళ్లు, ఒక తర్కవాదిని పంపమని సిరియా రాజైన మొదటి ఆంటియోకస్‌ను బిందుసారుడు కోరాడు. ఈయన అజీవక మతశాఖను ప్రోత్సహించాడు. ఈ మతానికి చెందిన పింగళి వత్సలుడు బిందుసారుడి ఆస్థానంలో జ్యోతిష్యుడిగా ఉన్నాడు. ఇతడు అశోకుడు గొప్ప చక్రవర్తి అవుతాడు అని చెప్పాడు.


అశోకుడు 

    బిందుసారుడి తర్వాత అతడి కుమారుడైన అశోకుడు రాజయ్యాడు. ఇతడు క్రీ.పూ.273 లోనే రాజయినప్పటికీ, పట్టాభిషేకం క్రీ.పూ. 268లో జరిగింది. అశోకుడు క్రీ.పూ. 273 నుంచి క్రీ.పూ. 232 వరకు పాలించాడు. ఈయన దేవానాంప్రియ, ప్రియదర్శి లాంటి బిరుదులతో ప్రసిద్ధి చెందాడు. 1915లో బయటపడిన మస్కి శాసనంలో రాణ్య అశోక్‌ అనే పేరు ఉంది. మస్కి శాసనాన్నే కనగనహళ్లి శాసనంగా కూడా పేర్కొంటారు. బిందుసారుడు రాజుగా ఉన్న సమయంలో అశోకుడు మొదట ఉజ్జయినికి, తర్వాత తక్షశిలకు గవర్నర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే అతడు తక్షశిలలో జరిగిన ప్రజా తిరుగుబాటును అణిచివేశాడు. 

    అశోకుడు క్రీ.పూ. 261లో కళింగ యద్ధాన్ని చేశాడు. అప్పటి కళింగ పాలకుడైన అనంత పద్మనాభుడ్ని ఓడించి కళింగను ఆక్రమించాడు. అశోకుడి 13వ శిలాశాసనం (ధౌళి/ జౌగాడ శాసనం) కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది. దీని తర్వాతే అశోకుడు ఇకపై యుద్ధం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచంలో యుద్ధంలో గెలిచి, యుద్ధాన్ని పరిత్యజించిన ఏకైక పాలకుడు అశోకుడే అని చరిత్రకారులు వ్యాఖ్యానించారు.


బౌద్ధమత సేవ

    కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఈయన గురువుగా ఉపగుప్తుడిని పేర్కొంటారు. ఈయన బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు బబ్రూ శాసనంలో ఉంది. బౌద్ధమత ప్రచారం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రలను సింహళ (శ్రీలంక)కు పంపి మత ప్రచారం చేయించాడు. సోనా, ఉత్తర అనేవారిని బర్మాకు పంపాడు. 

    అశోకుడు బౌద్ధమత వ్యాప్తికి క్రీ.పూ. 250లో మొగలిపుతతిస్స అధ్యక్షతన పాటలీపుత్రలో మూడో బౌద్ధసంగీతిని నిర్వహించాడు. ఈ సమావేశంలోనే త్రిపీటకాల్లో ఒకటైన అభిదమ్మ పీటకాన్ని సంకలనం చేశారు. రాజ్యమంతా సుమారు 84వేల బౌద్ధ స్తూపాలు వేయించాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సాంచీస్తూపం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సారనాథ్‌ స్తూపాలను అశోకుడు వేయించాడు. భారత జాతీయ చిహ్నం అయిన సింహతలాటం సారనాథ్‌ స్తూపంనుంచే స్వీకరించారు.


ధమ్మ సిద్ధాంతం

    అశోకుడు ప్రచారం చేసిన నైతిక నియమాలను ధమ్మ సిద్ధాంతంగా పేర్కొంటారు. ఇది ఒక కొత్త జీవన విధానంగా ప్రచారం చేశాడు. ధమ్మ సిద్ధాంతాల ప్రచారం కోసం అశోకుడు ధర్మమహామాత్రులు అనే ప్రత్యేక ఉద్యోగులను నియమించినట్లు అయిదవ ప్రధాన శిలాశాసనం పేర్కొంటుంది. ఇందులోని అంశాలు ఎంతో విశాలమైనవి, మానవీయమైనవి. ప్రజాజీవనంలో శాంతి భద్రతలు, చట్టాలను గౌరవించడానికి ఈ విధానం ఎంతో తోడ్పడింది. జంతు బలులు, జాతరలను నిషేధించాడు ్బ1వ ప్రధాన శిలాశాసనం). సామాజిక సంక్షేమం అందించాలని; బ్రాహ్మణులు, శ్రామికుల పట్ల ఉదారత చూపాలని; అహింసను పాటించాలని; సేవకులు, బందీలను మానవతా దృక్పథంతో చూడాలని అశోకుడు తన ధమ్మ సిద్ధాంతంలో పేర్కొన్నాడు. 

    అశోకుడు బౌద్ధమతాన్ని రాజ్యమతంగా చేసినప్పటికీ పరమత సహన విధానాన్ని అనుసరించాడు. అజీవక మతస్థులకు అనేక దానధర్మాలు చేశాడు. కేంద్రీయపాలనను సుస్థిరంగా కొనసాగించడానికి, రాజకీయ ఐక్యతను కాపాడుకోవడానికి, అన్ని మత శాఖల మద్దతును పొందడానికి అశోకుడు ఈ ధమ్మ సిద్ధాంతాన్ని అవలంబించాడని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. 

    అశోకుడి ధమ్మ సిద్ధాంతం ఒక విశ్వమతం అని ఆర్‌ఎస్‌ త్రిపాఠి అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు. ఆర్‌జీ భండార్కర్‌ అనే భారతీయ చరిత్రకారుడు అశోకుడి ధమ్మవిధానం ఒక లౌకిక బౌద్ధ మతం అని పేర్కొన్నాడు. అందువల్లే ధమ్మవిధానం ఒక నూతన సిద్ధాంతంలా కాకుండా ఒక జీవన విధానంగా పేరొందింది.


ఇతర అంశాలు

    అశోకుడు గొప్ప పరిపాలనాదక్షుడు, భవననిర్మాతగా పేరొందాడు. అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాడు. రాజ్యమంతా రహదారులు వేయించి, రెండువైపులా చెట్లు నాటించాడు. బావులు తవ్వించి, సత్రాలను కట్టించాడు. విదేశీయులతో కూడా స్నేహపూర్వక ఒప్పందాలు చేసుకున్నాడు. సిరియా, ఈజిప్ట్, సింహళం (శ్రీలంక) లాంటి విదేశీ దేశాలు తమ రాయబారులను అశోకుడి ఆస్థానానికి పంపారు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌ను అశోకుడే నిర్మించినట్లు కల్హణుడి రాజతరంగణి గ్రంథం పేర్కొంది.


మౌర్య సామ్రాజ్య పతనం - కారణాలు

    అశోకుడి తర్వాత అతడి వారసులైన కునాలుడు, జలౌకుడు, దశరథుడు మౌర్య సామ్రాజ్యాన్ని పాలించారు. చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రధుడ్ని అతడి మంత్రి పుష్యమిత్ర శుంగుడు ఓడించి శుంగ వంశాన్ని స్థాపించాడు. దీంతో మౌర్యసామ్రాజ్యం పతనమైంది.

    అశోకుడి అనంతరం బలహీన పాలకులు రాజులు కావడం వల్ల సామ్రాజ్యం పతనమైంది. ముఖ్యంగా అశోకుడి విధానాలే సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం అని ఆధునిక చరిత్రకారులు వ్యాఖ్యానించారు. జంతుబలులు నిషేధించడం, బ్రాహ్మణుల ప్రత్యేక హక్కులను నిలిపివేయడం, బౌద్ధమతాన్ని రాజ్యమతంగా చేయడం లాంటి కారణాలతో బ్రాహ్మణులు ఎదురుతిరిగారని, కాబట్టి బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శుంగుడు తర్వాతికాలంలో మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం అయ్యాడని చరిత్రకారులు భావించారు. అది పూర్తిగా సత్యంకాదు. ఎందుకంటే అశోకుడు తన ధమ్మ విధానంలో బ్రాహ్మణుల పట్ల ప్రత్యేక ఆదరణ చూపాలని, గౌరవించాలని పేర్కొన్నాడు. అశోకుని అనంతరం వచ్చిన పాలకుల బలహీనతే సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ బలహీనమైంది. దీంతో సామంత పాలకులు స్వతంత్రులయ్యారు. సామ్రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించడం వల్ల బలహీనపడింది. దీంతో వాయవ్యం నుంచి గ్రీకులు; దక్షిణం నుంచి శాతవాహనులు దండయాత్ర చేశారు. అశోకుడు నియమించిన ధర్మమహామాత్రులు అనంతర కాలంలో సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్ల మౌర్య సామ్రాజ్యం పతనం చెందింది. రాజ ప్రతినిధుల్ని, స్థానిక అధికారుల్ని నియమించడంలో సరైన విధానాలు పాటించక పోవడం కూడా పతనానికి కారణం అయ్యింది.

 

మౌర్యయుగ విశేషాలు
భారతదేశ చరిత్రలో తొలి విశాల సామ్రాజ్య నిర్మాతలుగా మౌర్యులు పేరుపొందారు. వీరు సమర్థవంతమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. మౌర్యుల కాలంలో అనుసరించిన పాలనా విధానాలే నేటికీ కొనసాగడం విశేషం. వీరు ఆర్థిక, సామాజిక రంగాల్లో అనేక నూతన విధానాలను అమలు చేశారు. ముఖ్యంగా భారతదేశ వాస్తు, కళారంగాల అభివృద్ధికి నాంది పలికారు. అప్పటి సమకాలీన సాహిత్యం, శాసనాల్లో మౌర్యులు చేసిన విశేష సేవలకు సంబంధించిన వివరణ ఉంది.


పరిపాలనా సంస్కరణలు
    మౌర్యులు కేంద్రంలో ఉన్నతస్థాయి కేంద్రీకృత విధానాలను అనుసరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఆహారాలు - విషయాలు - గ్రామాలుగా విభజించారు. కేంద్ర పాలనలో చక్రవర్తి సర్వాధికారి. నిరంకుశ పాలన, కేంద్రీకృత విధానాలను అమలు చేసినప్పటికీ ప్రజా సంక్షేమం కోసం వీరు ప్రాజ్ఞ నిరంకుశ పాలన కొనసాగించారు. చక్రవర్తికి పరిపాలనలో సహాయం కోసం వివిధ స్థాయుల్లో ఉన్న మంత్రులు లేదా తీర్థులు ఉండేవారిని కౌటిల్యుడి అర్థశాస్త్రం వివరిస్తుంది. సన్నిదాత, సమాహర్త, దండపాల, అక్ష పటలిక లాంటి అనేక మంది మంత్రుల పేర్లు అప్పటి శాసన, సాహిత్యాలకు సంబంధించిన ఆధారాల్లో లభ్యమయ్యాయి. 

*  మౌర్య సామ్రాజ్యంలో అనేక పరిపాలనా శాఖలు ఉండేవని, ప్రతి శాఖకు సంబంధిత అధికారులు నిర్దిష్టమైన అధికారాలను చెలాయించేవారని వి.ఎ.స్మిత్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నారు.
* మౌర్యులు కేంద్ర పాలనతో పాటు రాష్ట్ర, స్థానిక పాలనా విధానాల్లోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు. అప్పట్లో రాష్ట్రాలను ఆహారాలు లేదా ప్రాంతాలుగా పిలిచేవారు. రాజ వంశీయులు లేదా యువరాజులు రాష్ట్ర పాలకులుగా నియమితులయ్యేవారు. వారిని ఆర్యపుత్రులు లేదా గవర్నర్‌లుగా పేర్కొన్నారు.
* బిందుసారుడి పాలనాకాలంలో అశోకుడు మొదట ఉజ్జయినికి, తరువాత తక్షశిలకు పాలకుడి (గవర్నర్‌/ ఆర్యపుత్ర)గా నియమితుడయ్యాడు. సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్రాలకు కుమారామాత్యులు అనే అధికారులను నియమించారు. సమర్థులు, మంచివారినే రాష్ట్రాల పాలకులుగా నియమించేవారు. కేంద్ర, రాష్ట్ర పాలనలో సమాచారాన్ని అందించడానికి గూఢచారి వ్యవస్థ ఉండేది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మౌర్యుల కాలం నాటి గూఢచారుల గురించి ప్రస్తావించాడు. 
* మౌర్యులు స్థానిక, నగర పాలనలో అనేక పరిపాలనా మార్పులు తీసుకొచ్చారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో స్థానిక పాలన బాగా వృద్ధి చెందింది. పాటలీపుత్ర లాంటి నగరాల్లో మున్సిపల్‌ పాలనా వ్యవస్థ ఉండేది. నగర పాలనకు ‘నాగరికుడు/ నగరాధ్యక్షుడు’ అనే అధికారి ఉండేవాడు. 
* కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్‌ ఇండికా గ్రంథాల్లో అప్పటి నగర పాలన గురించి అనేక విశేషాలు ఉన్నాయి. నగర పాలనకు 30 మంది సభ్యులతో కూడిన సంఘం పనిచేసేది. వారు ఆరు ప్రధాన శాఖలుగా ఏర్పడి నగర పాలనలో ఆయా విధులను నిర్వర్తించేవారు. ప్రతి జిల్లాను నాలుగు భాగాలుగా చేసి ‘స్థానికుడు’ అనే అధికారిని నియమించేవారని కౌటిల్యుడు తెలిపాడు. 
* పాలనలో చివరి భాగం గ్రామం. గ్రామాధికారిగా ‘గ్రామణి’ ఉండేవాడు. పది గ్రామాలకు కలిపి ‘గోపుడు’ అనే అధికారి ఉండేవాడు. ఈ విధంగా మౌర్యుల కాలంలో స్థానిక పాలన సమర్థవంతంగా సాగింది.


న్యాయపాలన
* కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్‌ ఇండికా గ్రంథాల్లో అప్పటి న్యాయపాలన గురించిన అంశాలు ఉన్నాయి. రాజే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. న్యాయపాలనలో మహామాత్రులు అనే న్యాయమూర్తులు సహాయపడేవారు. 
* జిల్లా స్థాయిలో న్యాయపాలన కోసం ‘రజ్జుక’లను నియమించేవారు. గ్రామస్థాయిలో గ్రామపెద్దలు తీర్పులు ఇచ్చేవారు. మౌర్యులకాలంలో సివిల్, క్రిమినల్‌ వివాదాలను పరిష్కరించేందుకు వేర్వేరు న్యాయస్థానాలు ఉండేవి. సివిల్‌ న్యాయస్థానాలను ‘ధర్మస్థీయ’, క్రిమినల్‌ న్యాయ స్థానాలను ‘కంఠక శోధన’ అని పిలిచేవారు. సివిల్‌ న్యాయమూర్తులను వ్యవహారిక, క్రిమినల్‌ న్యాయమూర్తులను ‘ప్రదేష్ట’ అనేవారు. మౌర్యుల కాలంలో శిక్షాస్మృతి కఠినంగా ఉండేదని వి.ఎ.స్మిత్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నారు.


సైనిక పాలన
*  మౌర్యుల కాలం నాటి సైనిక వ్యవస్థ గురించి సాహిత్య ఆధారాలు పేర్కొన్నాయి. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో అప్పటి సాయుధ దళాలను మూడు ప్రధాన వర్గాలుగా విభజించాడు. మొదటిది వారసత్వ దళాలు, రెండోది వేతన దళాలు, మూడోది కార్పొరేషన్ల దళాలు. 
*  సైనిక విషయాలను చూడటానికి 30 మంది సభ్యులతో కూడిన 6 కమిటీలు పనిచేసేవని మెగస్తనీస్‌ పేర్కొన్నాడు. కేంద్రస్థాయిలో సైనిక వ్యవహారాల పరిశీలనకు మహాసేనాని ఉండేవాడు. చతురంగ బలాలైన పదాతి, అశ్విక, గజ, రథ దళాలు యుద్ధంలో ప్రధానపాత్ర పోషించేవి. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఆరు లక్షల కాల్బలం, ముప్పైవేల అశ్విక దళం, తొమ్మిదివేల గజదళం, ఎనిమిది వేల రథబలం ఉన్నట్లు గ్రీకు రచనలు పేర్కొన్నాయి.
* మౌర్యులు గూఢచారి వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారం అప్పటి గూఢచారి వ్యవస్థలో సంతక్, సంచార అనే రెండు విభాగాలుండేవి. ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండే గూఢచారులను సంతక్‌ (సంజరంతకులు) అని, వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రహస్యంగా సమాచారం సేకరించే వారిని ‘సంచార’ అని పిలిచేవారు. వీరే కాకుండా ప్రజాభిప్రాయాన్ని రాజుకు నివేదికల రూపంలో అందించడానికి పులిసానులు, పతివేదకులు అనే ఉద్యోగులు ఉండేవారు.


సాంస్కృతిక వికాసం
* మౌర్యులు భాషా, సాహిత్యం, వాస్తుకళా రంగాలను ఎంతో అభివృద్ధి చేశారు. వీరి కాలంలో సంస్కృతం రాజభాషగా ఉండేది. కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని సంస్కృత భాషలోనే రాశాడు. 
* అశోకుడి శాసనాల్లో ప్రాకృత భాషను ఎక్కువగా వాడారు. అశోకుడి శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని జేమ్స్‌ ప్రిన్సిప్‌ అధ్యయనం చేశాడు. దేశీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ సాహిత్యాన్ని రచించారు. మౌర్యుల కాలంలో మెగస్తనీస్‌ గ్రీకు భాషలో రాసిన ఇండికా గ్రంథం వారి చరిత్రకు ప్రధాన ఆధారంగా ఉంది. తక్షశిల ప్రధాన విశ్వవిద్యాలయంగా ప్రఖ్యాతి చెందింది. మౌర్యుల కాలంలో విద్యా, సారస్వతాలు అభివృద్ధి చెందాయి. అశోక స్తంభాలు, రాతి ఫలకాలు, పాటలీపుత్ర లాంటి నగరాలను పరిశీలిస్తే అప్పటి వాస్తు, కళారంగాల అభివృద్ధి తెలుస్తుంది. 
* మధుర, చూనార్‌ ప్రాంతాల్లో లభించే ఇసుకరాయితో అశోక స్తంభాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. భారతదేశంలో తొలి రాతి కట్టడాలు మౌర్యుల కాలానికి చెందినవే. 
* పాటలీపుత్ర నగర నిర్మాణం, కోటగోడల నిర్మాణ కౌశలం గురించి మెగస్తనీస్‌ ఇండికాలో; సోమదేవసూరి రచించిన కథాసరిత్సాగరంలో ఎన్నో వివరాలు ఉన్నాయి. అశోక స్తంభాల్లోని శిల్ప, కళా నైపుణ్యం, ఫలకం, పద్మం, ధర్మచక్రం, పూర్ణకుంభం లాంటి ఆకృతులు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. 
* సాంచీ, సారనాథ్‌ స్తూపాలు అశోకుడి కాలంలోనే వేశారు. సారనాథ్‌ స్తంభం నుంచే భారత జాతీయ చిహ్నమైన లయన్‌ కేపిటల్‌ (సింహతలాటం)ను స్వీకరించారు. అప్పటి శిల్పకళ ఎంతో మహోన్నతమైందిగా కీర్తిపొందింది.


సాంఘిక పరిస్థితులు
మెగస్తనీస్‌ రచించిన ఇండికా గ్రంథంలో అప్పటి సాంఘిక పరిస్థితులను వివరించారు. అప్పటి  సమాజంలో ఏడు ప్రధాన కులాలు/ వర్గాలు ఉండేవి. తత్వవేత్తలు, వ్యవసాయదారులు, సైనికులు, పశు పాలకులు, వృత్తి కళాకారులు, న్యాయాధిపతులు, సలహాదారులు అనే 7 ప్రధాన కులాలు/ వర్గాలను ఇండికా గ్రంథం పేర్కొంది. సమాజంలో బ్రాహ్మణ కులానికి చెందిన తత్వవేత్తలకు అధిక ప్రాధాన్యం ఉండేది. వీరి తర్వాత వృత్తి కళాకారులకు ఎక్కువ హోదా ఉండేంది. బ్రాహ్మణులు, క్షత్రియులను ద్విజులుగా భావించేవారు. బానిస వ్యవస్థపై పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఉన్నాయి. అప్పటి సమాజంలో బానిసలు లేరని మెగస్తనీస్‌ పేర్కొన్నారు. బౌద్ధ సాహిత్యం మాత్రం మూడు రకాల బానిసలు ఉండేవారని తెలిపింది. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ బానిస వ్యవస్థ ప్రస్తావన ఉంది. అప్పటి సమాజంలో స్త్రీలకు తగినంత గుర్తింపు లేదు. బహు భార్యత్వం ఎక్కువగా ఉండేంది. దీంతో పాటు బాల్య వివాహాలు, వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలు ఉండేవి.


ఆర్థిక పరిస్థితులు
మౌర్యుల కాలంలోనూ వ్యవసాయమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. దీంతో పాటు వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి మౌర్య పాలకులు కృషి చేశారు. భూములను సర్వే చేయించి, పంటలో 1/4 నుంచి 1/6 వంతు శిస్తు విధించారు. ప్రాంతాలను బట్టి శిస్తు రేటు మారుతూ ఉండేది. వ్యవసాయానికి సాగునీటి సౌకర్యాలు కల్పించారు. చంద్రగుప్త మౌర్యుడు తన పాలనా కాలంలో సౌరాష్ట్రలో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు. అప్పటి పాలకులు పరిశ్రమల అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టారు. లోహ, వస్త్ర, కొయ్య పరిశ్రమలను అభివృద్ధి చేశారు. చేనేత, చిన్నతరహా, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. ఆయుధాలు, ఓడల తయారీ, గనుల తవ్వకం లాంటి రంగాల్లో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేది. అనేక రకాల పారిశ్రామిక వృత్తుల వారు సంఘాలుగా ఏర్పడ్డారు. వీటినే ‘శ్రేణులు’గా వ్యవహరించేవారు. లోహ పరిశ్రమతో పాటు రాతి వస్తువుల తయారీ ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది. అశోకుడి కాలంలో తయారు చేసిన రాతి స్తంభాలను పరిశీలిస్తే అప్పటి¨ రాతి ఫలకల నిర్మాణ నిపుణుల నైపుణ్యం తెలుస్తుంది. తక్షశిలలో ఈ రాతి ఫలకాల నిర్మాణ నిపుణులు శిక్షణ పొందేవారు. మధుర, కాశీ, వంగ లాంటి రాజ్యాల్లో నూలు వస్త్ర తయారీ ఎంతో అభివృద్ధి చెందింది. కుండల తయారీ మరో ప్రధాన వృత్తి పరిశ్రమగా రూపొందింది. నాటి కుమ్మరం పనిని నార్తరన్‌ బ్లాక్‌ పాలిష్‌డ్‌ వేర్‌గా పేర్కొన్నారు.

    వ్యవసాయం, పరిశ్రమలతో పాటు వర్తక, వాణిజ్యాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. దేశీయ వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ వ్యాపారం విరివిగా సాగింది. బర్మా, గ్రీకు లాంటి దేశాలతో విదేశీ వాణిజ్యం అధికంగా జరిగేది. సుగంధద్రవ్యాలు, వజ్రాలు, ముత్యాలు, నూలు వస్త్రాలు, దంతపు వస్తువులు ప్రధాన ఎగుమతులుగా ఉండేవి. గుర్రాలు, ఎరుపు పగడాలు, గాజు, నార మొదలైనవి ప్రధాన దిగుమతులు. రాజ్యంలో దేశీయ వాణిజ్యం అభివృద్ధికి రహదారులను బాగా అభివృద్ధి చేశారు. రహదారులు నిర్మించడానికి అగ్రనోమోయి అనే ప్రత్యేక అధికారులు ఉండేవారని మెగస్తనీస్‌ తను ఇండికా గ్రంథంలో వివరించాడు. 
* మౌర్యులు విధించిన సుంకాల గురించి కూడా ఇదే గ్రంథంలో వివరణ ఉంది. అమ్మకం పన్ను 1/5 వంతు ఉండేది. స్థానిక వస్తు విక్రయాల వల్ల 5%; విదేశి వస్తు విక్రయాల వల్ల 10% లాభాలు ఉండేవి.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

1857 తిరుగుబాటు

సిపాయిల సింహగర్జన!

ప్రతి భారతీయుడి ఛాతీని ఉప్పొగించే మహోజ్వల ఘట్టం ఒకటి 1857లో జరిగింది. అది ఆంగ్లేయుల అరాచక పాలనపై, అణచివేతలపై, అడ్డూ అదుపులేని అక్రమాలపై జరిగిన సామాన్యుల పోరాటం. రాజ్యాలు, సంస్థానాల ఆక్రమణలపై చెలరేగిన అంతులేని అసంతృప్తి. వివక్షపూరిత విధానాలతో విచ్చలవిడిగా సాగిన ఆర్థిక దోపిడీలపై విరుచుకుపడిన విప్లవం. మత విశ్వాసాలను మంటగలిపే శాసనాలకు వ్యతిరేకంగా సాగిన సమరం. అతి క్రూరమైన ఆంగ్లేయ అధికారులపై తూటాలు కురిపించి భారతీయ సిపాయిలు చేసిన సింహగర్జన. అదే 1857 తిరుగుబాటు. ఆధునిక భారతదేశ చరిత్రలోని ఈ అసాధారణ సంఘటనపై దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు దీనిపై పరిపూర్ణ అవగాహన పెంచుకోవాలి. 

 

1857 తిరుగుబాటు

ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక మహోజ్వల ఘట్టం. ఆనాటి వీరుల త్యాగం చరిత్రపుటల్లో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. క్రీ.శ.1757 ప్లాసీ యుద్ధం నుంచి ప్రారంభమైన బ్రిటిష్‌ కంపెనీ సామ్రాజ్యవాదం 1857 వరకు అప్రతిహతంగా సాగి, పతాకస్థాయికి చేరింది. ఈ మధ్య కాలంలో ఒకవైపు దేశంలో ఒక్కో భారత రాజ్యాన్ని కబళిస్తూ, బ్రిటిష్‌ అధికార విస్తరణ కొనసాగుతోంది. భారతీయులను అణచివేస్తూ, ఆర్థిక దోపిడీలకు పాల్పడుతున్నారు. దాంతో ఆంగ్లేయ కంపెనీ పాలన పట్ల దేశం నలుమూలలా అసంతృప్తి పెరిగిపోయింది. ఈ పరిణామం చిన్న చిన్న తిరుగుబాట్లకు దారితీయగా వాటిని కంపెనీ నిర్దాక్షిణ్యంగా తొక్కేసింది. అయితే ఆ అసంతృప్తులకు పరాకాష్ఠగా 1857 తిరుగుబాటు రగిలింది. 1857లో ఉత్తర మధ్య భారతదేశంలో ఒక బ్రహ్మాండమైన ప్రజాతిరుగుబాటు ప్రారంభమై, ఆంగ్లేయ కంపెనీని గడగడలాడించింది. మొదట ఇది సిపాయిలతో ప్రారంభమైనా, అనతికాలంలోనే దానానలంలా ఉత్తర భారతదేశాన్ని చుట్టేసింది. సిపాయిలతో పాటు, సమాజంలోని అనేక వర్గాలు, కర్షకులు, కొలువులు కోల్పోయిన సైనికులు, చేతివృత్తుల వారు, ఇలా అనేకమంది ఈ మహా ప్రచండ విప్లవంలో పాల్గొని, ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టాన్ని లిఖించారు.

 

దోపిడీ పాలనపై తిరుగుబాటు

ఆంగ్లేయ కంపెనీ అణచివేత విధానాలు, వివక్షపూరిత, దోపిడీ పాలనతో విసుగెత్తిపోయిన ప్రజానీకం చేసిన ఈ తిరుగుబాటుకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, మత, సైనిక కారణాలూ ప్రాతిపదికలయ్యాయి.

 

రాజకీయ కారణాలు 

ఆంగ్లేయ కంపెనీ అంతులేని రాజ్యాధికార దాహమే అశాంతికి, గందరగోళ, అనిశ్చిత పరిస్థితికి ప్రధాన కారణం. బక్సర్‌ యుద్ధం (1764) బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి బలమైన పునాది వేసింది. కంపెనీ భారతదేశంలో చేసిన అనేక యుద్ధాలు ముఖ్యంగా నాలుగు ఆంగ్లో- మైసూరు యుద్ధాలు, మూడు ఆంగ్లో - మరాఠా యుద్ధాలు, రెండు ఆంగ్లో - సిక్కు యుద్ధాలు, దురాక్రమణ విధానాలు భారతదేశంలోని బలమైన రాజకీయ సంస్థానాల ఘన చరిత్రకు ముగింపు పలికాయి. వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి వల్ల అనేక స్వదేశీ సంస్థానాలు తమ స్వాతంత్య్రాన్ని ఆంగ్లేయ కంపెనీకి తాకట్టు పెట్టి ఆధారిత, అసంపూర్ణ స్వతంత్ర రాజ్యాలు (డిపెండెంట్‌ స్టేట్స్‌)గా మారిపోయాయి.

డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా సతారా (1848), జైపుర్‌ (1849), సంబల్పూర్‌ (1849), భగత్‌ (1850), ఉదయపుర్‌ (1852), ఝాన్సీ (1853), నాగపుర్‌ (1854)లను అన్యాయంగా ఆక్రమించాడు. అసమర్థ పాలన అనే నెపంతో అయోధ్య రాజ్యాన్ని ఆక్రమించి, సైనికులను ఉద్యోగాల నుంచి తొలగించాడు. నానాసాహెబ్‌ పెన్షన్, మరికొంతమందికి బిరుదులు, రాజాభరణాలు రద్దు చేశాడు. భారతీయ ముస్లింల మనసు గాయపరుస్తూ మొగల్‌ చక్రవర్తి రెండో బహదూర్‌ షా తర్వాత మొగలులు ఎర్రకోటలో నివసించకూడదని ఆజ్ఞాపించాడు. ఈ పరిస్థితులు స్వదేశీ సంస్థానాధీశుల్లో అభద్రతాభావం పెంచాయి. దేశంలో రాజకీయ అశాంతి నెలకొంది. ఇలా తీవ్ర అసంతృప్తితో రగులుతున్న కొంతమంది అధికారం కోల్పోయిన జమీందారులు, పెన్షన్‌ రద్దయిన, బిరుదులు, భరణాలు కోల్పోయిన సంస్థానాధీశులు తమ పూర్వ ప్రాబల్యం పొందేందుకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటులో పాల్గొన్నారు.

 

ఆర్థిక కారణాలు 

భారతదేశాన్ని ఒక వలస రాజ్యంగా, ఇక్కడి ఆర్థిక వనరుల దోపిడీయే లక్ష్యంగా బ్రిటన్‌ పాలించింది. ఈ అరాచక పాలనలో అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా కుదేలయ్యారు. ఆంగ్లేయ కంపెనీ, స్వదేశీ సంస్థానాల్లోని అనేక మంది ఉద్యోగాలు తీసేసి వారిని తీవ్ర దుస్థితిలోకి నెట్టింది. జమీందారీ విధానం, రైత్వారీ విధానం, మహల్వారీ విధానం అంటూ రైతులపై అధిక పన్నులు విధించి, నిర్దాక్షిణ్యంగా వసూలు చేసింది. కంపెనీ పాలనలో భూస్వాములు, వడ్డీ వ్యాపారుల దోపిడీతో రైతులు బికారులుగా మారారు. ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం వల్ల, చౌకగా వస్తువులు భారత్‌కు దిగుమతి అయ్యాయి. దాంతోపాటు కంపెనీ ఇక్కడ అమలు చేసిన వివక్షపూరిత వ్యాపార విధానాలతో ఒకప్పుడు వైభవంగా విరాజిల్లిన చేతివృత్తులు, హస్తకళలు, కుటీర పరిశ్రమలు నాశనమయ్యాయి. వీరు జీవనోపాధి కోసం గ్రామాలకు తరలిపోయి వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. కరవు కాటకాలతో, అంటురోగాలతో ప్రజలు విలవిలలాడుతూ నిత్యం మరణిస్తున్నా, కంపెనీ ప్రభుత్వం ప్రజాసంక్షేమం పట్ల శ్రద్ధ వహించలేదు. విద్యావంతులైన భారతీయులకు కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంగ్లిష్‌ ప్రభుత్వోద్యోగుల అవినీతి, అక్రమాల కారణంగా కూడా దేశ ప్రజల జీవనం దుర్భరమైంది.

 

మత కారణాలు

బ్రిటిషర్ల కొన్ని చర్యలు సామాజిక, మతపరమైన అపోహలు, అనుమానాలు కలగజేసి, విపరీతమైన మానసిక అశాంతి, ఉద్రేకాలకు కారణమయ్యాయి. వారు తరచూ భారతీయులను, భారతీయ సంస్కృతిని, ఆచార వ్యవహారాలను పరిహసించేవారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు మితిమీరాయి. పైగా వీరికి 1813 చార్టర్‌ చట్టంలో మద్దతు లభించింది. ఈ చర్యలు భారతీయుల అనుమానాలను అధికం చేశాయి. సతీసహగమనం రద్దు (1829), బాల్య వివాహాలు, శిశు హత్యల నిషేధం, వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడం (1856), హిందూ మతాన్ని వీడి ఇతర మతం స్వీకరించిన వారికి తండ్రి ఆస్తిలో హక్కు కల్పించడం (1850 చట్టం) వంటి సంస్కరణలను తమ మతాచారాలను నాశనం చేసే చర్యలుగా భారతీయులు భావించారు. అలాగే డల్హౌసీ ప్రవేశపెట్టిన రైల్వే, తపాలా, టెలిగ్రాఫ్‌ లైన్లను కూడా తరతరాల భారతీయ సామాజిక వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నమని విశ్వసించారు. 

 

సైనిక కారణాలు

బ్రిటిష్‌ పాలన జాత్యహంకారంతో, వివక్షాపూరితంగా ఉండేది. కంపెనీ సైన్యంలో భారతీయ హిందూ, ముస్లిం సైనికులను ‘సిపాయి’ అని, బ్రిటిష్‌ సైనికులను ‘సోల్జర్‌’ అనేవారు. వీరి ఇరువురికి జీతభత్యాలు, పదోన్నతి మొదలైన విషయాల్లో చాలా తేడా ఉండేది. భారతీయ సైనికుడు సుబేదార్‌ స్థాయి మించి పదోన్నతి పొందేవాడు కాదు. సిపాయిలకు చాలీచాలని, నాణ్యత లేని ఆహారం పెట్టేవారు. ఎక్కువ ప్రయోజనాలు బ్రిటిష్‌ సైనికులకే ఉండేవి. లార్డ్‌ కానింగ్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు ‘సామాన్య సేవ నియుక్త చట్టం (1856)’ (జనరల్‌ సర్వీసెస్‌ ఎన్‌లిస్ట్‌మెంట్‌ యాక్ట్‌ 1856) చేసి భారతీయ సిపాయిలు సముద్రం దాటి వెళ్లి విదేశాల్లో యుద్ధం చేయాలని శాసించాడు. హిందూ సిపాయిలు దీన్ని తీవ్రంగా నిరసించారు. కారణం - సామాజికంగా ఆ రోజుల్లో సముద్రం దాటటం పాప కర్మగా నిర్ణయించి, కులం నుంచి వెలివేసేవారు. ముస్లింల ఆచారానికి విరుద్ధంగా గడ్డాలు, మీసాలు తీసివేయాలని, హిందువులు శరీరంపై కుంకుమ ధారణ చేయకూడదని శాసించాడు. ఇలాంటి అన్ని చర్యలు కంపెనీ సైన్యంలోని భారతీయ హిందూ, ముస్లిం సిపాయిల మనోభావాలను దెబ్బతీశాయి.

 

తక్షణ కారణం

1857 నాటికి బ్రిటిష్‌ పాలనపై అసంతృప్తి భారతీయ సమాజంలో నివురుగప్పిన నిప్పులా గూడుకట్టుకొని ఉంది. అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలు కావచ్చు. అసంతృప్తి లావాను బయటకు నెట్టే బలమైన శక్తి కావాలి. సరిగ్గా ఇదే సమయంలో ఇంగ్లిష్‌ ప్రభుత్వం సైన్యంలోకి కొత్తగా ఎన్‌ఫీల్డ్‌ తుపాకులను ప్రవేశపెట్టింది. వీటిలో ఉపయోగించే తూటా పై పొరను సిపాయి తన పంటితో తీసి తుపాకీలో అమర్చాల్సి వచ్చేది. ఈ తూటాల పైపొరను ఆవు కొవ్వు, పంది కొవ్వుతో చేశారన్న ఒక వదంతి ప్రచారంలోకి వచ్చింది. దాంతో అప్పటికే అసంతృప్తితో ఉడికిపోతున్న భారతీయ సిపాయిల్లో కోపం కట్టలు తెచ్చుకుంది. దీన్ని తమ మతాచారాలను భ్రష్టు పట్టించడానికి చేస్తున్న కుట్రగా భావించి తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. 1857 మార్చిలో బరక్‌పుర్‌ స్వదేశీ పదాతి దళానికి చెందిన మంగళపాండే అనే సిపాయి తూటా ఉపయోగించడానికి ఇష్టపడలేదు. ఒత్తిడి చేసిన తన పైఅధికారిని కాల్చి చంపాడు. దాంతో మంగళపాండేను ఉరితీశారు. 1857 మేలో మీరట్‌ అశ్వికదళంలో 85 మంది సిపాయిలు, కొవ్వు పూసిన తూటాలను తిరస్కరించడంతో మిలటరీ కోర్టు జైలుశిక్ష విధించింది. 1857, మే 10న మీరట్‌ సైనిక స్థావరంలో తిరుగుబాటు మొదలైంది. కొంతమంది సిపాయిలు బ్రిటిష్‌ అధికారులను కాల్చి చంపి, తమ సహచర సైనికులను జైలు నుంచి విడిపించారు. వారంతా ‘ఢిల్లీ ఛలో’ అంటూ కదం తొక్కి ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల విప్లవ ఘట్టానికి తెరతీశారు.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 యుద్ధాలు

 సంఘ సంస్కరణోద్యమాలు​​​​​​​

‣ రాష్ట్రకూటులు​​​​​​​

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015 

Posted Date : 11-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత్‌లో సంస్కరణోద్యమాలు

భారత్‌లో 19వ శతాబ్దంలో సమాజోద్ధరణ దిశగా రూపుదాల్చిన అనేక సంస్కరణోద్యమాలు భారతీయుల జీవన విధానంపై విశేష ప్రభావాన్ని చూపాయి. రాజా రామ్మోహన్ రాయ్, వివేకానందుడు, స్వామి దయానంద సరస్వతి, సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ లాంటి ప్రముఖులెందరో ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మూఢ సంప్రదాయాలు, అంధ విశ్వాసాలను రూపుమాపేందుకు వీరంతా కృషి చేశారు. ఫలితంగా భారతీయుల జీవన విధానంలో వచ్చిన మార్పులు తర్వాతి తరాలకు ఎంతో మేలు చేశాయి. నాటి సామాజిక, మత సంస్కరణ ఉద్యమాల చారిత్రక అధ్యయన సమాచారాన్ని చదవండి మరి!


19వ శతాబ్దంలో ఆధునిక ఆంగ్ల విద్యావ్యాప్తి.. క్రైస్తవ మిషనరీల మత ప్రచారం.. ఐరోపాలో ప్రారంభమైన ఉదార, హేతువాద, మానవతావాద ఉద్యమాలు భారతీయులపై ప్రభావం చూపాయి. ఇవన్నీ తమ సామాజిక, మత వ్యవస్థల గురించి భారతీయులు పునరాలోచించేలా చేశాయి. ఈ ప్రభావంతో తలెత్తిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు భారతీయుల జీవన విధానాన్ని మార్చాయి. వారిలో ఐకమత్యం, దేశభక్తిని పెంపొందించాయి. భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు మొదట బెంగాల్, తర్వాత పశ్చిమ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. భారత్‌లో పునరుజ్జీవన ఉద్యమపితగా రాజా రామ్మోహన్ రాయ్‌ని పేర్కొంటారు.

 

బ్రహ్మ సమాజం
బ్రహ్మ సమాజ స్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ 1772లో బెంగాల్‌లోని బర్డ్వాన్ జిల్లా రాధానగర్‌లో జన్మించారు. 1815లో ఆత్మీయసభ అనే సంస్థను స్థాపించారు. భగవంతుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే దీని ఉద్దేశం.
హిందూ మతంలోని అనేక దురాచారాలను రూపుమాపడానికి, సంస్కరించడానికి 1828లో రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆధునిక విద్యావ్యాప్తి, స్త్రీ జనోద్ధరణ కోసం విశేషంగా కృషి చేశారు. బహు భార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలను ఖండించారు. ఆయన కృషి ఫలితంగానే అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1829లో రెగ్యులేషన్ XVII ద్వారా సతీ సహగమనం చట్టవిరుద్ధమని ప్రకటించాడు. బాల్య వివాహాలు, కులవ్యవస్థలోని లోపాలపై పోరాడారు. అంటరానితనాన్ని అప్రజాస్వామ్యం, అమానుషమని పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని ఆయన గట్టిగా కోరారు.
దేవుడికి, ప్రజలకు మధ్యవర్తులుగా ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్న పురోహితుల తరగతిని రాజా రామ్మోహన్ రాయ్ నిరసించారు. రంగు, జాతి, కులాలకు అతీతంగా మానవులందర్నీ ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు. కానీ బ్రిటిష్ పాలన పట్ల మాత్రం కొంత సానుకూల వైఖరితో ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును ప్రశంసించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్య్రంపై పరిమితులు విధించడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉంచడాన్ని వ్యతిరేకించారు. కలకత్తాలో హిందూ కళాశాల స్థాపనకు ప్రయత్నించారు.
రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదును ఇచ్చిన మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ కోరిక మేరకు రాయ్ 1830లో ఇంగ్లండ్ రాజైన నాలుగో విలియం ఆస్థానానికి వెళ్లాడు. బ్రిటిష్‌వారు ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రామ్మోహన్ రాయ్ ద్వారా మొగలు చక్రవర్తి కోరాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన రాయ్ 1833, సెప్టెంబరు 27న బ్రిస్టల్ నగరంలో మృతి చెందారు.


'రాజా' అనంతరం..

మహర్షి ద్వారకనాథ్ ఠాగూర్, పండిట్ రామచంద్ర విద్యావాగిష్‌లు రామ్మోహన్ రాయ్ మరణానంతరం పదేళ్లపాటు బ్రహ్మ సమాజాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ద్వారకనాథ్ ఠాగూర్ పెద్ద కుమారుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మసమాజ బాధ్యతలు చేపట్టారు. దేవేంద్రనాథ్ బ్రహ్మ సమాజంలో చేరక ముందు కలకత్తా(1831)లో తత్త్వబోధిని సభను స్థాపించారు. గొప్ప రచయిత, విద్యావేత్త అయిన అక్షయ్‌కుమార్ దత్తా 1840లో తత్త్వబోధిని పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్ మిత్రా, తారాచంద్ చక్రవర్తి, పియరీచంద్ మిత్ర చేరారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి తత్త్వబోధిని అనే మాసపత్రికను బెంగాలీ భాషలో ప్రచురించారు. దేవేంద్రనాథ్ 80 మంది అనుచరులతో 1843 డిసెంబరు 21న బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా చేరారు. అలెగ్జాండర్ డఫ్ భారతీయ సంస్కృతిపై చేసిన దాడిని దేవేంద్రనాథ్ సమర్థంగా తిప్పికొట్టారు. దేవేంద్రనాథ్ రెండేళ్ల(1856-58) పాటు సిమ్లా వెళ్లారు. అక్కడ ఉన్న సమయంలోనే కేశవచంద్రసేన్ (1857లో) బ్రహ్మ సమాజంలో చేరి ఆయన కుడిభుజంగా మారారు. 1859లో యువకులతో కూడిన సంగత్ సభను స్థాపించాడు. దీని ప్రధాన ఉద్దేశం అప్పటి ఆధ్యాత్మిక, సామాజిక సమస్యల గురించి చర్చించడం.
1861లో కేశవచంద్ర సేన్ సంపాదకుడిగా ఇండియన్ మిర్రర్ అనే పక్ష పత్రికను స్థాపించారు. ఇది తర్వాతి కాలంలో భారతదేశంలో ఆంగ్లంలో ప్రచురితమైన మొదటి దినపత్రికగా పేరొందింది. క్షామం, అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో ఆయన సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బ్రహ్మ సమాజాన్ని దేశమంతా విస్తరించడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కృషి ఫలితంగా మద్రాసులో వేద్ సమాజ్, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్‌లు ఏర్పాటయ్యాయి.


బ్రహ్మ సమాజంలో చీలికలు

కేశవచంద్ర సేన్ చేపట్టిన కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలు, పరదా పద్ధతి తొలగింపు లాంటి కార్యక్రమాలు పాతతరం వారికి నచ్చలేదు. దీంతో 1866లో బ్రహ్మ సమాజంలో మొదటి చీలిక ఏర్పడింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ వర్గం 'ఆది బ్రహ్మసమాజ్‌'గా, కేశవచంద్ర సేన్ వర్గం 'బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా (నవ విధాన్)'గా విడిపోయాయి.
1870లో కేశవచంద్ర సేన్ ఇంగ్లండ్ వెళ్లొచ్చాక మరింత ఉత్సాహంతో సాంఘిక సంస్కరణలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 1872లో ప్రభుత్వంతో చర్చించి బ్రహ్మ వివాహ చట్టాన్ని తీసుకురావడం ద్వారా బ్రహ్మ సమాజం నిర్వహించే వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ఆయన ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను స్థాపించారు. పాశ్చాత్య విద్యావ్యాప్తి; స్త్రీల అభ్యున్నతి, విద్యావ్యాప్తి; సామాజిక కార్యక్రమాలకు ఈ సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది.
కేశవచంద్ర సేన్ 1878లో తన కుమార్తెను కూచ్ బిహార్ పాలకుడికి ఇచ్చి వివాహం చేశారు. చట్టబద్ధంగా నిర్ణయించిన కనీస వివాహ వయసు కంటే వధూవరులిద్దరి వయసు తక్కువ. అంతేకాకుండా ఈ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇది పూర్తిగా బ్రహ్మవివాహ చట్టానికి వ్యతిరేకం. దీంతో బ్రహ్మ సమాజంలో మరో చీలిక వచ్చింది. ఆనందమోహన్ బోస్ నాయకత్వంలో సాధారణ బ్రహ్మసమాజాన్ని స్థాపించారు.
దక్షిణ భారతదేశంలో మన్నవ బుచ్చయ్య పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటివారు బ్రహ్మ సమాజ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.


ఆర్య సమాజం
ఆర్య సమాజ స్థాప‌కుడు స్వామి దయానంద సరస్వతి. ఆయన అసలు పేరు మూల్‌శంకర్. 1824లో గుజరాత్‌లోని మోర్వి సమీపంలోని టంకారా అనే ప్రదేశంలో జన్మించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో విరజానందుడు అనే అంధ సన్యాసి దగ్గర వేదాలు, ధర్మ శాస్త్రాలు, స్మృతులు అభ్యసించారు. దయానంద సరస్వతి 1875, ఏప్రిల్ 10న బొంబాయిలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. విరజానందుడు హిందూమతంలోని దురాచారాలను తొలగించాలని దయానందుడిని కోరారు. వేదాలకు తిరిగి వెళదాం.. మొత్తం జ్ఞానానికి వేదాలే ఆధారం.. అనేవి వీరి నినాదాలు. తర్వాతి కాలంలో పంజాబ్‌లోని లాహోర్ ఆర్య సమాజ ప్రధాన కేంద్రంగా మారింది. ఆర్య సమాజం సిద్ధాంతాలను పంజాబ్‌లో ప్రచారం చేయడంలో దయానందుడు సఫలీకృతుడయ్యాడు. అలాగే ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా కొంతవరకు ఆర్య సమాజ ప్రభావం వ్యాపించింది.
హిందూ మతంలో విగ్రహారాధన, మూఢ విశ్వాసాలకు కారణమైన పురాణాలను దయానందుడు తిరస్కరించాడు. ఆర్యసమాజం వైదిక మతాన్ని పునరుద్ధరించి, జాతీయతా భావాన్ని పెంపొందించడానికి కృషి చేసింది. పాశ్చాత్య విద్యావిధానం వ్యాప్తికి తోడ్పడింది. బాలబాలికలకు విద్యనందించడానికి ఆర్యసమాజం దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) పాఠశాలలను స్థాపించింది. చాతుర్వర్ణ విధానం జన్మ ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఉండాలని ఈ సమాజం భావించింది. సామాజిక, విద్యా రంగాల్లో స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని కోరింది. అంటరానితనం, కుల వ్యత్యాసాలు, బాల్య వివాహాలను వ్యతిరేకించింది. వితంతు పునర్వివాహాలు, కులాంతర వివాహాలను సమర్థించింది.
ఆర్య సమాజం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు వివాదాస్పదమయ్యాయి. వీటిలో మొదటిది - 1882లో దయానందుడు ప్రారంభించిన గోరక్ష ఉద్యమం. గోరక్షణ కోసం నిధులు సేకరించి, గోవులను వధించకుండా అడ్డుకోవడం లాంటి కార్యకలాపాలను చేపట్టారు. ఇది హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.
రెండోది - ఇతర మతాల్లోకి చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి దయానందుడు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీలు ఎక్కువ సంఖ్యలో హిందువులను, ముఖ్యంగా అణగారిన వర్గాలవారిని క్రైస్తవ మతంలోకి మార్చాయి. వీరిని తిరిగి హిందువులుగా మార్చడానికి చేసిందే శుద్ధి ఉద్యమం.


రామకృష్ణ మిషన్, మఠం
వివేకానందుడు 1897లో పశ్చిమ బెంగాల్‌లోని బేలూరు కేంద్రంగా రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం సమాజసేవ చేయడం. దీనిద్వారా అనేక పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, అనాథ శరణాలయాలను స్థాపించి, పేద ప్రజలకు సహాయం చేశారు. ఆయన 1887లో పశ్చిమబెంగాల్‌లోని బారానగర్‌లో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీనిద్వారా తన గురువైన రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేశారు. 1898 నుంచి రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలకు బేలూరు ప్రధాన కేంద్రం అయ్యింది.
రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ. ఆయన 1836లో పశ్చిమబెంగాల్, హుగ్లీ జిల్లాలోని కామర్‌పుకుర్ అనే గ్రామంలో జన్మించారు. మానవ సేవే మాధవ సేవ అనేది రామకృష్ణుడి నినాదం. వేదాంత, ఉపనిషత్తుల నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. రామకృష్ణుడికి సూఫీ మత గురువు ఇస్లాం మతదీక్షను అనుగ్రహించారు. కాళీమాత, కృష్ణుడు, బుద్ధుడు, సిక్కు గురువులను ఆయన పూజించేవారు. బైబిల్ పఠనాన్ని వినేవారు.
వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన కలకత్తాలో 1863లో జన్మించారు. మొదటిసారి 1881లో రామకృష్ణ పరమహంసను కలిశారు. భారతదేశం మొత్తం కాలినడకన ప్రయాణించి, ప్రజల వాస్తవ స్థితిగతులను తెలుకున్నారు.
వివేకానందుడు మానవులందరిలో దైవత్వం ఉందని, ప్రతి వ్యక్తిలోనూ శక్తి సామర్థ్యాలున్నాయని, ఎవరినీ తక్కువగా చూడరాదని బోధించారు. అనారోగ్యం కారణంగా అతి చిన్న వయసులోనే (1902) ఆయన మృతి చెందారు.


 

దివ్యజ్ఞాన సమాజం
రష్యాకు చెందిన హెచ్.పి.బ్లావట్‌స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ 1875లో న్యూయార్క్‌లో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. వీరు 1879లో భారతదేశానికి వచ్చి, 1882లో మద్రాసు సమీపంలోని అడయార్ వద్ద దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు.
ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ లండన్‌లోని దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలిగా చేరారు. ఆమె 1893లో మనదేశానికి వచ్చి, 1907లో ఆల్కాట్ మరణం తర్వాత దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు. విశ్వమానవులందరిలో సోదర భావాన్ని పెంపొందించడం, ప్రాచీన మతాల అధ్యయనాన్ని ప్రోత్సహించడం ఈ సమాజం ప్రధాన లక్ష్యాలు.
హిందూ మతసూత్రాలను బోధించడానికి అనిబిసెంట్ 1898లో వారణాసిలో సెంట్రల్ హిందూ స్కూల్‌ను ప్రారంభించారు. తర్వాతి కాలంలో మదన్‌మోహన్ మాలవీయ కృషి ఫలితంగా ఇది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా (1916) అభివృద్ధి చెందింది.


అలీగఢ్ ఉద్యమం
ఉత్తర ప్రదేశ్‌లోని బరేలికి చెందిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. హేతువాదం ప్రాతిపదికగా ఇస్లాం మతాన్ని సమర్థిస్తూనే, ముస్లిం సమాజంలోని బహు భార్యత్వాన్ని, బానిస వ్యవస్థను విమర్శించారు. ముస్లింలకు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో 1875లో అలీగఢ్‌లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. అది 1920లో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది.


ముఖ్యాంశాలు
* రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని 1828లో స్థాపించాడు.
* మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ రామ్మోహన్ రాయ్‌కు 'రాజా' అనే బిరుదు ఇచ్చాడు.
* స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఆయన అసలు పేరు మూల్‌శంకర్.
* వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన 1863లో జన్మించారు. 1881లో రామకృష్ణ పరమహంసను తొలిసారి కలిశారు.
* వివేకానందుడి గురువైన రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ ఆయన 1836లో జన్మించారు.
* వివేకానందుడు రామకృష్ణ మఠం (1887), రామకృష్ణ మిషన్ (1897)లను స్థాపించాడు.
* 1875లో దివ్యజ్ఞాన సమాజాన్ని రష్యాకు చెందిన హెచ్.పి. బ్లావట్‌స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ స్థాపించారు.
* ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ 1893లో భారతదేశానికి వచ్చారు. 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత స్వాతంత్రోద్యమం - విప్లవకారులు

బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం వివిధ వర్గాల వారు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వీరిలో వామపక్షాలు, సాయుధ పోరాట భావాలున్న వారు, మితవాదులు, అతివాదులు, విప్లవ జాతీయవాదులు ఉన్నారు. భారత స్వాతంత్రోద్యమాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.
1) మితవాదుల దశ (1885-1905)
2) అతివాదుల దశ (1905-1919)
3) గాంధీయుగం (1919-1947)
* 1906 నుంచి 1920 వరకు సాగిన జాతియోద్యమ దశను ‘సమరశీల జాతీయోద్యమం’ లేదా ‘తీవ్రవాద జాతీయోద్యమం’గా పేర్కొంటారు.


మితవాదులు 
వీరు బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల విధేయత చూపారు. సమస్యలను సరైన, సంతులిత పద్ధతిలో విన్నవిస్తే ప్రభుత్వం వాటిని ఆమోదించి, పరిష్కరిస్తుందని భావించారు. రాజ్యాంగబద్ధ ఉద్యమం ద్వారా సక్రమ పద్ధతిలో, పరిమిత విమర్శలు, డిమాండ్లతో బ్రిటిష్‌వారిపై ఒత్తిడి తెచ్చి స్వాతంత్య్రాన్ని సాధించాలన్నారు.


అతివాదులు 
వీరు పూర్తిస్థాయి స్వాతంత్య్రాన్ని కోరారు. ప్రధానంగా స్వరాజ్య సాధన కోసం పోరాడారు. అతివాదులు తమ భావాలను కచ్చితంగా వ్యక్తం చేసి, ప్రజల్లో జాతీయభావాలను పెంపొందించడానికి ప్రయత్నించారు. ఉద్యమాల ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించారు.
* అతివాదుల్లో లాలా లజపతి రాయ్, బాలగంగాధర్‌ తిలక్, బిపిన్‌ చంద్రపాల్‌ ముఖ్యులు. తిలక్‌ ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని ప్రకటించారు. 
* తీవ్రవాద జాతీయవాదానికి వీరు బలమైన పునాదులు వేశారు. సమరశీల జాతీయవాదులు అతివాదులకు సమాంతరంగా సాయుధ పోరాటాలు నిర్వహించి జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించారు. కానీ వీరి విధానాలు వేరుగా ఉండేవి.


విప్లవ/ సమరశీల జాతీయవాదులు 
 సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్‌ పాలనను అంతమొందించవచ్చని వీరు భావించారు. బ్రిటిష్‌ సామ్రాజ్య వాదాన్ని, వారి సైనిక శక్తిని నిర్మూలించడానికి హింసాయుత విధానాలు అనుసరించారు.
* 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఉగ్రవాద విజృంభణకు కారణాలు ముఖ్యంగా బ్రిటిష్‌ ప్రభుత్వం అనుసరించిన అనేక హింసా విధానాలు, దమననీతి, రాజకీయ పోరాట వైఫల్యం, అతివాదుల ఆత్రుత, విప్లవకారుల వ్యక్తిత్వం.
* వీరు బ్రిటిష్‌ పరిపాలనా యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి, వారికి సహకరించిన వారిని శిక్షించారు. బ్రిటిష్‌ వారిని హతమార్చి, బాంబువాదాన్ని అనుసరించారు.
* 20వ శతాబ్దం ప్రారంభం నాటికి అనేక సమితులు, రహస్య సంఘాలను స్థాపించారు. యువకులు, విద్యార్థులను వీటిలో సభ్యులుగా చేర్చుకున్నారు. వీరికి కుస్తీ పట్టడం, ముష్ఠియుద్ధ విధానం, జపాన్‌ వారి జిటోజిట్సు, కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ మొదలైనవి నేర్పించేవారు. 
* విప్లవ కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని చందాల రూపేణ, అవసరమైతే ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసేవారు. ప్రభుత్వ ధనాగారాలను కొల్లగొట్టి డబ్బు సంపాదించడం వారి కార్యక్రమాల్లో ఒక భాగంగా ఉండేది.
* వీరు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, చైనా హాంకాంగ్, సింగపూర్, అమెరికా, కెనడా, ఫిలిప్పీన్స్, టర్కీ, ఆఫ్గనిస్థాన్‌ మొదలైన దేశాల్లో విప్లవవాద సంస్థలను ఏర్పాటు చేసి, బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించారు.
* విదేశాల నుంచి రహస్యంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చారు.
* భారతదేశంలో బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్, మద్రాస్, పంజాబ్, ఢిల్లీ మొదలైన ప్రాంతాలు విప్లవ కార్యక్రమాలకు కేంద్రాలయ్యాయి.


బెంగాల్‌ 
అరబిందో ఘోష్, అతడి సోదరుడు బరీంద్ర కుమార్‌ ఘోష్, స్వామి వివేకానంద సోదరుడు భూపేంద్రనాథ్‌ దత్తా బెంగాల్‌లో విప్లవ ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ ఉద్యమానికి ఆధ్యాత్మికతను జోడించి, భగవద్గీత సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
* 1906లో బరీంద్ర కుమార్‌ ఘోష్, భూపేంద్రనాథ్‌ దత్తా, అభినాష్‌ భట్టాచార్య కలిసి యుగాంతర్‌ అనే బెంగాలీ పత్రికను స్థాపించారు. రాజద్రోహం కింద వీరిపై అనేకసార్లు జరిమానాలు, శిక్షలు విధించారు. ప్రభుత్వం ఈ పత్రికను నిషేధించింది. 
* బిపిన్‌ చంద్రపాల్‌ స్థాపించిన ‘వందేమాతరం’ పత్రికకు అరబిందో ఘోష్‌ సంపాదకుడిగా వ్యవహరించారు. ‘సంధ్య’ పత్రికను బ్రహ్మబంద్‌ ఉపాధ్యాయ ప్రచురించారు. వీటి ద్వారా విప్లవోద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
* బంకించంద్ర ఛటర్జీ, స్వామి వివేకానంద, అరబిందో ఘోష్‌ రచనల ప్రభావం విప్లవకారులపై  ఉండేది. 
* బెంగాల్‌ యువకుల్లో ధైర్య సాహసాలు నింపి, స్వాతంత్య్రం కోసం రక్తాన్ని ధారపోయాలని బరీంద్ర కుమార్‌ ఘోష్‌ బోధించారు.
* 1902లో కలకత్తాలో సతీష్‌ చంద్రబసు, ప్రమతనాథ్‌ మిత్రా కలిసి అనుశీలన్‌ సమితిని స్థాపించారు. వీరికి బరీంద్ర కుమార్‌ ఘోష్, అతడి అనుచరులు సహకరించారు.
* ఢాకా కేంద్రంగా పులిన్‌ బెహరి దాస్‌ అనుశీలన్‌ సమితిని స్థాపించారు. దీనికి తూర్పు బెంగాల్‌లో సుమారు 500 శాఖలుండేవి. ఈ సమితులకు అరబిందో ఘోష్, సిస్టర్‌ నివేదిత సహకరించారు.
* ఈ సమితులు కలకత్తా, ఢాకా కేంద్రాలుగా పనిచేస్తూ విప్లవ సాహిత్యాన్ని పంచి, అజ్ఞాత వర్గాలను (Underground Groups) నెలకొల్పాయి. రష్యన్, ఇటాలియన్‌ రహస్య సంఘాల్లాగానే ఇవీ పనిచేశాయి. సంఘాల్లోని సభ్యులను ఇబ్బందులు పెట్టే బ్రిటిష్‌వారిని ఇవి శిక్షించేవి.
* ‘ఆత్మోన్నతి సమితి’ విప్లవ సంఘాన్ని బిపిన్‌ బెహారి గంగూలీ బెంగాల్‌లో స్థాపించారు.
* బెంగాల్‌ భాష తెలిసిన మరాఠీ స్కాలర్‌ శకరాం గణేష్‌ దేశ్‌కర్‌ బెంగాల్, మహారాష్ట్ర విప్లవకారులను ఏకం చేశారు.
* 1905లో జరిగిన బెంగాల్‌ విభజన తర్వాత ఉగ్రజాతీయవాదం మరింత పెరిగింది.
* మైమన్‌ సింగ్‌ సుహృద్, సాధనా సమితులను స్థాపించారు. 
* స్వదేశీ బాంధవ్‌ సమితి (బారిసాల్‌), బ్రాతి సమితి (ఫరీద్‌పూర్‌) అనే విప్లవ సంఘాలు వెలిశాయి.
* ఘోష్‌ సోదరులు, భూపేంద్రనాథ్‌ దత్తా, సుబోధ్‌ మాలిక్‌ ‘యుగాంతర్‌’ (జుగాంతర్‌) అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే బ్రిటిష్‌ అధికారులను చంపడం, బాంబులు తయారు చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఈ సంఘం పనిచేసింది.
* విప్లవకారులు తమ మొదటి బాంబును తూర్పుబెంగాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పుల్లర్‌పై ప్రయోగించారు. కానీ ఇది విఫలమైంది. తర్వాత 1907, డిసెంబరు 6న మిడ్నాపూర్‌ వద్ద బెంగాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రయాణిస్తున్న రైలును పేల్చేందుకు యత్నించారు. అదే నెలలో ఢాకా జిల్లా మాజీ మెజిస్ట్రేట్‌ లెన్‌ను కాల్చిచంపారు.
* కింగ్స్‌ఫోర్డ్‌ కలకత్తా మెజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు సుశీల్‌సేన్‌ అనే 15 ఏళ్ల యువకుడు వందేమాతరం అని అరిచినందుకు 16 కొరడా దెబ్బలు కొట్టించాడు. దీంతో విప్లవకారులు అతడ్ని హత్య చేయాలని భావించారు. దీన్ని పసిగట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ అధికారిని ముజఫర్‌నగర్‌ (బిహార్‌) మెజిస్ట్రేట్‌గా బదిలీచేసింది. 1908, ఏప్రిల్‌ 30న ఫోర్డ్‌ ప్రయాణిస్తున్న రైలు కోచ్‌పై ఖుదీరాం బోస్, ప్రపుల్లాచాకి అనే ఇద్దరు విప్లవకారులు బాంబులు విసిరారు. ఈ ఘటనలో బ్రిటిష్‌ అధికారి కెన్నడీ భార్య, కుమార్తె మరణించగా, కింగ్స్‌ఫోర్డ్, కెన్నడీ తప్పించుకున్నారు.
* ప్రపుల్లా చాకి ఆత్మహత్య చేసుకోగా, ఖుదీరాం బోస్‌ను అరెస్ట్‌చేసి, విచారణ అనంతరం ఉరితీశారు. వీరి త్యాగాలను బాలగంగాధర్‌ తిలక్‌ ‘కేసరి’ పత్రికలో ప్రశంసించగా, ఆయనపై రాజద్రోహ నేరం మోపి ఆరేళ్లు మాండలే జైలుకు పంపారు. 


  అలీపూర్‌ కుట్రకేసు
కలకత్తా సమీపంలోని మానిక్‌ టోలాలో విప్లవకారులు (యుగాంతర్‌ సంఘం) బాంబులు తయారుచేసే కర్మాగారాన్ని నిర్వహించారు. 1908, మేలో పోలీసులు దీనిపై దాడిచేసి కొన్ని పేలుడు పదార్థాలు, ముఖ్యమైన ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరబిందో ఘోష్‌తోపాటు మరికొందరిని ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. కేసు విచారణలో నరేంద్రనాథ్‌ గోస్వామి బ్రిటిష్‌ ప్రభుత్వ సాక్షిగా మారి పోలీసులకు సహకరించాడు. వారి రహస్యాలను బ్రిటిష్‌ వారికి చెప్పాడు. దీంతో గోస్వామిని అతడి సహచరులైన కనియలాల్‌ దత్తా,  సత్యేంద్రనాథ్‌ బోస్‌ జైల్లోనే కాల్చిచంపారు. వీరిని 1908, నవంబరు 10న ఉరితీశారు. 
* ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న అశుతోష్‌ బిస్వాస్‌ను విప్లవకారులు కాల్చిచంపారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు అరబిందో ఘోష్‌కు చిత్తరంజన్‌దాస్‌ సాయం చేశారు. అయితే బరీంద్రుడితో సహా మరికొందరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైంది. దీన్నే ‘అలీపూర్‌ కుట్రకేసు’గా పేర్కొంటారు.
* 1908, నవంబరులో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సర్‌ ఆండ్రూ ప్రేజర్‌పై హత్యాయత్నం జరిగింది.
* మొదటి ప్రపంచయుద్ధ సమయంలో (191516) జతీంద్రనాథ్‌ ముఖర్జీ ఆధ్వర్యంలో విప్లవ సంఘాలన్నీ బందిపోట్ల నిర్వహణ, హత్యలు లాంటివి చేశాయి. ఈయన ‘బాగ్‌(పులి) జతిన్‌’గా పేరొందాడు.
* రాస్‌ బిహారి బోస్‌ ఆధ్వర్యంలో బెంగాల్, పంజాబ్‌ రాష్ట్రాల్లో విప్లవ కార్యకలాపాలు కొనసాగాయి. బోస్‌ ఆధ్వర్యంలో 1912లో వైస్రాయ్‌ లార్డ్‌ హార్డింజ్‌పై బాంబు దాడికి ప్రయత్నం జరిగింది. బ్రిటిష్‌వారు బోస్‌ను వారణాసి, ఢిల్లీ, లాహోర్‌ కుట్రకేసుల్లో ఇరికించినా తప్పించుకుని జపాన్‌ చేరాడు. అక్కడ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్, ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో పని చేశాడు.
* రెండోదశ విప్లవ కార్యకలాపాలు సహాయనిరాకరణ ఉద్యమం తర్వాత ప్రారంభమయ్యాయి. ఆత్మశక్తి, సారథి లాంటి బెంగాల్‌ పత్రికల్లో గత విప్లవవాదుల సాహసాలు, త్యాగాల వ్యాసాలు ప్రచురితమయ్యాయి. అనుశీలన్‌ సమితి, యుగాంతర్‌ విప్లవసంఘాలు తమ కార్యక్రమాలను పునరుద్ధరించాయి. 
* సూర్యసేన్‌ నాయకత్వంలో అధికారులను చంపడం, బహిరంగ దోపిడీలు, బాంబుల తయారీని ప్రారంభించారు. ఇతడిని ‘మాస్టర్‌దా’గా పిలిచేవారు. ఈయన చిట్టగాంగ్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శిగా పనిచేశారు.   సేన్‌ ప్రధాన అనుచరులు అనంతసింగ్, గణేష్‌ ఘోష్, లోక్‌నాథ్‌ బాల్‌. 
* సూర్యసేన్‌ నాయకత్వంలో 1930, ఏప్రిల్‌ 18న చిట్టగాంగ్‌ ఆయుధగారంపై దాడి జరిగింది. ముగ్గురు బ్రిటిష్‌ సైనికులను హతమార్చి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ మందుగుండు తీసుకెళ్లడం మరిచారు. టెలిగ్రాఫ్‌ కార్యాలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. సేన్‌ అధ్యక్షతన విప్లవవాదులు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
* ఆంగ్ల ప్రభుత్వం ప్రతిచర్యలు ప్రారంభించగా విప్లవకారులు అడవుల్లోకి పారిపోయారు. 1930, ఏప్రిల్‌ 22న ‘జలాలాబాద్‌’ కొండపైన బ్రిటిష్‌వారికి, విప్లవకారులకు మధ్య 3 గంటల యుద్ధం జరిగింది. ఇందులో 11 మంది విప్లవకారులు; 64 మంది బ్రిటిష్‌ సైనికులు మరణించారు. బ్రిటిష్‌ ప్రభుత్వంతో సాయుధ పోరాటం సాధ్యమనే భావన ప్రజల్లో వ్యాపించింది. అనేక మంది యువకులు, స్త్రీలు ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. విప్లవకారులు ‘హిందుస్తాన్‌ రిపబ్లిక్‌ ప్రజాసైన్యం’ పేరుతో ఉద్యమాన్ని కొనసాగించారు.
* సూర్యసేన్‌ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలో ఉంటూ కార్యక్రమాలను కొనసాగించారు. 1933, ఫిబ్రవరి 16న ఈయన్ని అరెస్టు చేసి, విచారించి ఉరిశిక్ష ఖరారు చేశారు. 1934, జనవరి 12న ఉరితీశారు. చిట్టగాంగ్‌ దాడి కేసులో 14 మందికి యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్ష విధించారు.
* ఈ విప్లవోద్యమంలో స్త్రీలు కల్పన దత్‌ (మాండలే జైలు నుంచి విడుదలయ్యాక పీసీ జోషి అనే కమ్యూనిస్ట్‌ని వివాహమాడి కల్పన జోషిగా ప్రసిద్ధిపొందారు.), ప్రీతిలత వడ్డేదార్‌ (చిట్టగాంగ్‌ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో 1932, సెప్టెంబరులో  బాంబు పేల్చారు), వీణాదాస్, భగవతీ చరణ్‌ ఓహ్రా భార్య దుర్గ ఓహ్రా, సుశీల మోహన్‌ లాంటివారు పాల్గొని ప్రాణాలర్పించారు.
* 1930  33 మధ్య 20 హత్యలు, 10 చోట్ల బాంబు దాడులు, ఒక సాయుధ దోపిడి, 8 బాంబు పేలుళ్లు జరిగాయి. న్యాయ, పోలీస్‌ శాఖలకు చెందిన యూరోపియన్‌ అధికారులు ఎక్కువగా హత్యలకు గురయ్యారు.

 

ఉత్తర్‌ ప్రదేశ్‌లో విప్లవం
ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన రాజామహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ బృందావనంలో ఇండిజీనియస్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఐరోపా వెళ్లి జర్మన్‌ల సాయంతో భారత్, విదేశాల్లో సాయుధ పోరాటాలు జరిపేందుకు యత్నించి విఫలమయ్యారు.
* 1923 తర్వాత విప్లవ కార్యక్రమాలను పునరుద్ధరించారు. రాంప్రసాద్‌ బిస్మల్, జోగేశ్‌ ఛటర్జీ, సచీంద్రనాథ్‌ సన్యాల్‌ కలిసి 1924, అక్టోబరులో కాన్పూర్‌లో హిందుస్థాన్‌  రిపబ్లికన్‌ సంఘాన్ని ఏర్పాటుచేశారు. దీని శాఖలు బిహార్, ఉత్తర్‌ ప్రదేశ్, ఢిల్లీ పంజాబ్‌ లో ఉండేవి. ఇదే తర్వాతి కాలంలో హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌గా మారింది. ఈ సంఘం ‘ప్రజా విప్లవం ప్రజల కోసమే’ అనే నినాదాన్ని ప్రతిపాదించింది. బ్రిటిష్‌వారి పట్ల దౌర్జన్యం, వీర త్యాగం మొదలైన చర్యల ద్వారా ప్రజలను ప్రేరేపించడమే లక్ష్యంగా పనిచేసింది.


కకోరి కుట్ర కేసు
రాంప్రసాద్‌ బిస్మల్‌ తన 9 మంది అనుచరులతో కలిసి షహరాన్‌పూర్‌ - లక్నో మార్గంలో కకోరి రైల్వేస్టేషన్‌ వద్ద గొలుసు లాగి రైలును ఆపారు. రైల్వే ఆదాయం, నిల్వ ధనాన్ని కొల్లగొట్టేందుకు ఇలా చేశారు. అష్ఫాఖుల్లా ఖాన్‌ రైల్వే సొమ్ము ఉన్న ఇనుప పెట్టెను బద్దలు కొట్టి, ధనంతో లక్నో వెళ్లిపోయాడు.
* 40 మంది అనుమానితులపై కేసులు పెట్టి, ఏడాది విచారణ చేశారు. కొందరికి జైలుశిక్ష; నలుగురికి ఉరి; నలుగురికి ద్వీపాంతరవాస శిక్ష విధించారు. దీన్నే కకోరి కుట్ర కేసుగా వ్యవహరించారు.
* ఈ కేసులో రాంప్రసాద్‌ బిస్మల్‌ను 1926, డిసెంబరులో  ఉరితీశారు. ఈ సందర్భంగా ‘బ్రిటిష్‌ సామ్రాజ్యం పతనం కావడమే మా లక్ష్యం’ అని ఆయన నినదించారు.
* రాజేంద్ర లాహిరీని ఉరిశిక్ష; మన్మద్‌నాథ్‌ గుప్తాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ తప్పించుకున్నారు.
* చంద్రశేఖర్‌ ఆజాద్‌ నేతృత్వంలో ఉత్తర్‌ ప్రదేశ్‌లో బిజయ్‌ కుమార్‌ సిన్హా, శివ శర్మ, జైదేవ్‌ కపూర్‌; పంజాబ్‌లో భగత్‌ సింగ్, భగవతీ చరణ్‌ వోహ్రా, సుఖ్‌దేవ్‌ హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ సంఘం కార్యకలాపాలను నిర్వహించారు.
* 1928, సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఒక సమావేశం జరిగింది. ఇందులో హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ సంఘం పేరును ‘హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ సంఘం’గా మార్చారు. 


సైమన్‌ కమిషన్‌
* భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల స్వరూప స్వభావాన్ని అంచనా వేయడానికి  బ్రిటిష్‌ ప్రభుత్వం 1927, నవంబరు 8న ఒక కమిషన్‌ను నియమించింది. దీనికి జాన్‌ సైమన్‌ అధ్యక్షత వహించారు. కమిషన్‌లోని  సభ్యులంతా బ్రిటిష్‌వారే కావడంతో, దీన్ని బహిష్కరించాలని 1927, డిసెంబరులో జరిగిన మద్రాస్‌ కాంగ్రెస్‌ సభలో తీర్మానించారు.
* 1928, ఫిబ్రవరి 3న సైమన్‌ కమిషన్‌లోని సభ్యులు బొంబాయికి వచ్చారు. ‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదంతో వారిని బహిష్కరించారు. కలకత్తా, పాట్నా, లాహోర్‌లో కూడా బహిష్కరణ ఉద్యమం జరిగింది.
* 1928, అక్టోబరులో సైమన్‌ కమిషన్‌ లాహోర్‌కు వచ్చింది. వారి రాకను నిరసిస్తూ లాలా లజపతి రాయ్‌ నాయకత్వంలోని హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ సంఘం పెద్ద ఊరేగింపు నిర్వహించారు. దీన్ని చెదరగొట్టడానికి వచ్చిన బ్రిటిష్‌ పోలీస్‌ అధికారి సాండర్స్‌ లజపతి రాయ్‌ను లాఠీ దెబ్బలతో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో 1928, నవంబరు 17న రాయ్‌ మరణించారు. లజపతి రాయ్‌కు పంజాబ్‌ సింహం అనే బిరుదు ఉంది. ఈయన పంజాబీ అనే పత్రికను స్థాపించారు.


లాహోర్‌ కుట్ర కేసు
* లజపతి రాయ్‌ మరణానికి కారకుడైన సాండర్స్‌ను 1928, డిసెంబరు 17న భగత్‌సింగ్, రాజ్‌గురులు, చంద్రశేఖర్‌ ఆజాద్, సుఖ్‌దేవ్‌లు కాల్చి చంపారు. 
* బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజా భద్రతా చట్టం; కార్మిక వివాదాల చట్టం బిల్లులను కేంద్ర శాసన సభలో ప్రవేశపెట్టింది. ఆ సమయంలో భగత్‌సింగ్, బతుకేశ్వర్‌ దత్‌లు సభలోకి ప్రవేశించి బాంబులు విసిరారు.‘విప్లవం శాశ్వతంగా వర్ధిల్లాలి’ అనే భగత్‌ సింగ్‌ నినాదం ఇంక్విలాబ్‌ జిందాబాద్‌గా స్థిరపడింది. వీరిని అరెస్ట్‌ చేశారు.
* 1929, మే 7న కోర్టు విచారణ ప్రారంభమై, జూన్‌ 12తో ముగిసింది. 1930, అక్టోబరు 7న రాజ్‌గురు, సుఖ్‌దేవ్, భగత్‌సింగ్‌లకు ఉరిశిక్ష విధించారు. 1931, మార్చి 23న వారిని లాహోర్‌ జైలులో ఉరితీశారు. మహావీర్‌ తివారీ, విజయ్‌కుమార్‌ సిన్హాలకు ద్వీపాంతరవాస శిక్ష విధించారు. అనేక మందికి దీర్ఘకాల జైలుశిక్షలు వేశారు. చరిత్రలో దీన్నే లాహోర్‌ కుట్ర కేసుగా పేర్కొంటారు. జతీన్‌దాస్‌ జైల్లోనే 64 రోజులు దీక్షచేసి మరణించారు. కలకత్తాలో ఈయన అంతిమ సంస్కారానికి 6 లక్షల మంది హాజరయ్యారు. రెండు మైళ్ల పొడవున ఊరేగింపు నిర్వహించారు. వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన కరాచీలో కాంగ్రెస్‌ మహాసభ జరిగినప్పుడే ఉరిశిక్షలూ అమలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన యువకులు గాంధీజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
* లాహోర్‌లో విప్లవకారులు స్థాపించిన పెద్ద బాంబు తయారీ కర్మాగారాన్ని పోలీసులు  అసెంబ్లీ బాంబు ఘటన అనంతరం కనుక్కున్నారు. అందులో 7000 బాంబుల తయారీకి సరిపడా సామగ్రి లభించింది. షహరాన్‌పూర్‌లో మరో బాంబు తయారీ కర్మాగారాన్ని కనుక్కున్నారు.


చంద్రశేఖర్‌ ఆజాద్‌:
* చంద్రశేఖర్‌ ఆజాద్‌ 1929, డిసెంబరులో వైస్రాయ్‌ ప్రయాణిస్తున్న రైలుపై బాంబులు విసిరాడు. దాడిలో కొంత నష్టం జరిగినా వైస్రాయ్‌ తప్పించుకున్నాడు. సాయుధ పోరాటానికి ఆయుధాలు, ధనాన్ని సమకూర్చేందుకు ఆజాద్‌  1930, జులైలో ఢిల్లీలోని ఓ వ్యాపార కేంద్రంపై దాడిచేసి రూ.14,000 కొల్లగొట్టాడు.
* 1931, ఫిబ్రవరి 26న ఆజాద్‌ అలహాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూను కలిశారు. అనంతరం తన స్నేహితుడ్ని కలిసేందుకు పార్కుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు  చుట్టుముట్టి కాల్పులు జరపగా మరణించారు.

 

తిరునల్వేలి కుట్ర కేసు
* 1906లో తారకనాథ్‌ దాస్‌ మద్రాస్‌లో ‘తారకనాథ బ్రహ్మచారి’ పేరుతో సన్యాసాన్ని స్వీకరించి, ఒక రహస్య సంఘాన్ని స్థాపించారు. చిదంబర పిళ్లై న్యాయవాద వృత్తిని వదిలి, స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ, సొంతంగా ఒక స్వదేశీ నౌకా కంపెనీని స్థాపించారు.
* బిపిన్‌ చంద్రపాల్‌ 1907లో మద్రాస్, ఆంధ్రా ప్రాంతాల్లో పర్యటించి ప్రసంగాలు చేశారు. తన పర్యటనల్లో వందేమాతరం నినాదం మారుమోగింది. 
* చిదంబరం పిళ్లై ‘వివేకవాణి’ అనే తమిళ పత్రికను; నీలకంఠ బ్రహ్మచారి ‘సూర్యోదయ’, ‘ఇండియా’ అనే పత్రికలను స్థాపించారు.
* నీలకంఠ బ్రహ్మచారి, వాంచి అయ్యర్‌ మరికొందరు కలిసి ‘భారతమాత సంఘం’ అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు. కాళీ వీరి ఆరాధ్య దేవత. వాంచి అయ్యార్‌ తిరునల్వేలి కలెక్టర్‌గా ఉన్న  ఆషిని 1911, జూన్‌ 19న వాంచి అయ్యర్‌ హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం 14 మందిపై తిరునల్వేలి కుట్రకేసు పెట్టింది.


అల్లూరి సీతారామరాజు:
* 192224లో ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటు చేశారు. మన్యం తిరుగుబాటు నాయకుడిగా పితూరి జరిపారు. బ్రిటిష్‌ వారిపై గెరిల్లా యుద్ధం సాగించారు. ఈయనకు గంటందొర, మల్లుదొర, అగ్గిరాజు ప్రధాన అనుచరులు. ఆ సమయంలో మన్యం ప్రాంత అధికారిగా రూథర్‌ ఫర్డ్‌ నియమితులయ్యాడు. 1924, మే 27న జమేదార్‌ కంచుమీనన్‌ సీతారామరాజును బంధించగా మేజర్‌ గుడాల్‌ రాజును కాల్చి చంపాడు.


ఇతర కుట్ర కేసులు
* గోదావరి జిల్లాలో ప్రతివాది భయంకర వెంకటాచారి ‘ఉజ్జీవన్‌ భారత్‌ సమ్మేళన్‌’ అనే విప్లవ సంస్థను స్థాపించారు. ఆ సమయంలో ముస్తఫా అలీఖాన్, డప్పుల సుబ్బారావు అనే పోలీసు అధికారులు ప్రజలను ఇబ్బందులు పెట్టేవారు. వీరిని అంతం చేసేందుకు కె.కామేశ్వర శాస్త్రి, సి.హెచ్‌.నరసింహాచారి, ఓ.రామచంద్రయ్య తదితరులు 1933, ఏప్రిల్‌ 6, 14 తేదీల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు కాకినాడ కుట్రకేసులో భయంకరాచారికి జైలు శిక్ష విధించి అండమాన్‌ జైలుకు పంపారు. మిగతావారికి ఇతర శిక్షలు వేశారు.
* 1933, మార్చిలో 20 మంది కలసి హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీ అనుబంధ సంస్థను మద్రాస్‌లో స్థాపించారు. దీని శాఖలు ఆంధ్రాలోనూ ఉండేవి. మద్రాస్‌ కుట్రకేసు పేరుతో వీరిని బంధించి బ్రిటిష్‌ ప్రభుత్వం శిక్షలు విధించింది.
* పంజాబ్‌లో విప్లవోద్యమానికి కృషి చేసిన వారిలో అంబా ప్రసాద్‌; లాల్‌చంద్‌ హలక్‌;  ధనవత్‌రాయ్‌ ముఖ్యులు.
* అజిత్‌సింగ్‌ లాహోర్‌లోని భారతమాత సమితికి చెందినవారు. బెంగాల్‌ విప్లవకారులతో ఇతడికి సంబంధం ఉండేది. లాలా లజపతి రాయ్, అజిత్‌సింగ్‌లు 190607లో పంజాబ్‌లో రైతు ఉద్యమాన్ని చేపట్టారు.
* పంజాబ్, బెంగాల్‌ విప్లవోద్యమ సంధానకర్తగా రాస్‌ బిహారి ఘోష్‌ పనిచేశారు.
* 1904లో షహరాన్‌పూర్‌లో ఒక రహస్యసంఘాన్ని స్థాపించారు. తర్వాత రూర్కీ దీని ప్రధాన కేంద్రమైంది. లాలా హరదయాళ్‌ ఇందులో సభ్యుడిగా ఉంటూ సంఘానికి నాయకత్వం వహించారు. 1909లో ఈయన అమెరికాకు వెళ్లగా దీననాథ్, రాస్‌ బిహారీ బోస్‌లు సంఘానికి నాయకత్వం వహించారు.
* దేశంలోని మొదటి రాజకీయ హత్య 1897, జూన్‌ 22న పుణె (మహారాష్ట్ర)లో జరిగింది. ప్లేగ్‌ కమిటీ కమిషనర్‌ రాండ్‌ను హత్య చేశారు. ఇందులో చాపేకర్‌ సోదరులు (దామోదర్‌ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్, వాసుదేవ హరి చాపేకర్‌) కీలకపాత్ర పోషించారు. ఈ ఘటనలో లెఫ్టినెంట్‌ అయిరెస్ట్‌ కాల్పులకు గురయ్యారు. చాపేకర్‌ సోదరులను ఉరితీశారు.
* 1905లో శ్యామ్‌జీ కృష్ణవర్మ లండన్‌లో ‘ఇండియా హోమ్‌రూల్‌ సొసైటీ’ని స్థాపించారు. ఇది ‘ఇండియా హౌస్‌’గా ప్రసిద్ధి చెందింది.
* 1899లో నాసిక్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)లో వి.డి.సావర్కర్‌ ‘మిత్రమేళా’ను స్థాపించారు. 1904లో దీని పేరును అభినవ భారత్‌ సంఘంగా మార్చారు. 
* ఈయన తమ్ముడైన గణేష్‌ సావర్కర్‌ ఈ విప్లవ సంఘంలో కీలకపాత్ర పోషించారు. వీరి పత్రిక పేరు కల్‌. ఇది మహారాష్ట్ర నుంచి వెలువడింది.
* నాసిక్‌ కుట్ర కేస్బు1909్శలో గణేష్‌ సావర్కర్‌కు నాసిక్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ జాక్సన్‌ కాలాపాని శిక్షను విధించారు. 1909లో మదన్‌లాల్‌ ధింగ్రా లండన్‌లో కల్నల్‌ విలియం కర్జన్‌ వైలీని కాల్చిచంపాడు. గణేష్‌ సావర్కర్‌లను లండన్‌లో ఉరితీశారు.
* సచీంద్ర సన్యాల్, రాస్‌ బిహారీ బోస్‌లు వైస్రాయ్‌ లార్డ్‌ హార్డింజ్‌ - II పై ఢిల్లీలో బాంబులు విసరగా ఆయన తప్పించుకున్నాడు. దీన్నే వారణాసి కుట్ర కేసుగా పేర్కొంటారు. అనంతరం బోస్‌ జపాన్‌ వెళ్లిపోగా, సచీంద్ర సన్యాల్‌ అరెస్టయ్యాడు. ఈయన బంధీజీవన్‌ అనే పుస్తకాన్ని రాశారు.
* శరత్‌చంద్ర ఛటర్జీ రచించిన పతెర్‌ దబి నవలను బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది.
* ఆంగ్లేయ చరిత్రకారులు విప్లవకారులను కుట్రదారులుగా, హంతకులుగా, బందిపోట్లుగా పేర్కొనగా, భారతీయులు వీరిని ‘సమరశీల జాతీయవాదులు’గా వర్ణించారు.

 

విదేశాల్లో భారత విప్లవకారులు (Revolutionary movements outside India)

విదేశాల్లో స్థిరపడిన కొందరు భారతీయులు భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆయా దేశాల్లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు కొనసాగించారు. ముఖ్యంగా ఇంగ్లండ్, అమెరికా, ఫ్రాన్స్, ఆఫ్గనిస్థాన్, జర్మనీ దేశాల్లోని భారతీయులు ఈ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమాలు, విప్లవకారుల గురించి పరీక్షార్థులకు అవగాహన అవసరం.


శ్యామ్‌జీ కృష్ణవర్మ
ఈయన 1857, అక్టోబరు 4న గుజరాత్‌లోని మాండవిలో జన్మించారు. శ్యామ్‌జీ ఆర్యసమాజ్‌ స్థాపకులైన దయానంద సరస్వతి శిష్యులు. 1875లో భాటియా వర్గానికి చెందిన భానుమతిని వివాహం చేసుకున్నారు.
* కృష్ణవర్మ న్యాయవాదిగా, పత్రికా రచయితగా పనిచేశారు. బొంబయిలోని విల్సన్‌ హైస్కూల్‌లో సంస్కృతం నేర్చుకున్నారు. 1877లో కాశీ పండిట్ల నుంచి ‘పండిట్‌’ బిరుదును పొందారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మానియర్‌ విలియమ్స్‌ సాయంతో లండన్‌లో బారిస్టర్‌ పరీక్ష ఉత్తీర్ణులై, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
* 1881లో బెర్లిన్‌లో జరిగిన ప్రాచ్య సంస్కృతి అభిమానుల సమ్మేళనానికి  (Berlin Congress of Orientalists) భారత ప్రతినిధిగా కృష్ణవర్మ హాజరయ్యారు. ఇంగ్లండ్‌ నుంచి స్వదేశానికి తిరిగొచ్చాక ఉదయ్‌పూర్‌ సంస్థానంలో కౌన్సిల్‌ మెంబర్‌గా; జునాగఢ్‌ సంస్థానంలో దివాన్‌గా పనిచేశారు.
* ఈయనపై స్వామి దయానంద సరస్వతి, లోకమాన్య తిలక్‌; హెర్బర్ట్‌ స్పెన్సర్‌ రచనల ప్రభావం అధికంగా ఉండేది.
* దేశానికి స్వాతంత్య్రం రావాలని కాంక్షిస్తూ 1897లో బ్రిటన్‌ వెళ్లి అక్కడ విప్లవభావాలను ప్రచారం చేశారు.
* 1905లో లండన్‌ కేంద్రంగా ‘ద ఇండియన్‌ సోషియాలజిస్ట్‌’ అనే ఇంగ్లిష్‌ మాసపత్రికను స్థాపించారు.  
* 1905, ఫిబ్రవరి 18న లండన్‌లో ‘ఇండియన్‌ హోమ్‌ రూల్‌ సొసైటీ’ని స్థాపించారు. స్వరాజ్య సాధన కోసం ప్రజలు ఏకం కావాలనే లక్ష్యంతో ఈ సొసైటీ పనిచేసింది.
* ప్రజల్లో విప్లవభావాలను పెంపొందించడానికి, ఇంగ్లండ్‌లోని భారతీయులను ఏకం చేసేందుకు ‘ఇండియా హౌస్‌’ను ఏర్పాటు చేశారు. వి.డి.సావర్కర్, మేడం బికాజీ కామా, ఎస్‌.ఆర్‌.రానా, వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ, లాలా హర్‌దయాళ్‌ మొదలైన వారికి దీంతో సంబంధాలు ఉండేవి.
* శ్యామ్‌జీ కార్యకలాపాలపై బ్రిటిష్‌ ప్రభుత్వం నిఘా పెట్టింది. దీంతో ఆయన పారిస్‌ వెళ్లిపోయారు. తర్వాత జెనీవా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించారు. ‘ఇండియన్‌ హౌస్‌’ బాధ్యతలను వీర్‌ సావర్కర్‌కు అప్పగించారు.
* శ్యామ్‌జీ కృష్ణవర్మ 1930, మార్చి 30న జెనీవా (స్విట్జర్లాండ్‌)లో మరణించారు. ఆయన స్మారక చిహ్నాన్ని గుజరాత్‌లోని కచ్‌లో ‘క్రాంతి తీర్థ్‌’ పేరుతో ఏర్పాటు చేశారు. 1989, అక్టోబరు 4న ఈయన పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు.


మేడం బికాజీ కామా
ఈమె 1861, సెప్టెంబరు 24న బొంబయిలోని ఒక పార్శీల కుటుంబంలో జన్మించారు. 1885, ఆగస్టులో రుస్తుం కామాతో వివాహమైంది. జర్మనీ, స్కాట్లాండ్, ఫ్రాన్స్‌ మొదలైన దేశాల్లో నివసించి, చివరకు లండన్‌ చేరారు. అక్కడ శ్యామ్‌జీ కృష్ణవర్మ నిర్వహించే విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొంతకాలం దాదాభాయ్‌ నౌరోజీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు.
* యూరప్, అమెరికా, ఫ్రాన్స్‌ మొదలైన దేశాల్లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు కొనసాగిస్తూ భారత స్వాతంత్య్రం కోసం కృషి చేశారు.
* 1907, ఆగస్టు 22న జర్మనీలోని స్టట్‌గార్డ్‌లో జరిగిన ప్రపంచ సోషలిస్ట్‌ మహాసభకు హాజరయ్యారు. అక్కడ భారత జాతీయ పతాకాన్ని రూపొందించి, ఎగరేశారు. ఇలా జాతీయజెండాను విదేశాల్లో మొదటిసారి ఎగరేసిన స్త్రీగా గుర్తింపు పొందారు. ఆ జెండాలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులు ఉన్నాయి.
* 1935లో భారత్‌కు తిరిగివచ్చిన ఆమె 1936, ఆగస్టు 13న మరణించారు.


ఒబైదుల్లా
1872 మార్చి 10న సియాల్‌కోట్‌ (పంజాబ్‌)లో ‘సిక్కు ఖత్రీ’ అనే కుటుంబంలో  జన్మించారు. ఈయన పేరు ‘బూటాసింగ్‌ ఉప్పల్‌’. పదిహేనేళ్ల వయసులో ఇస్లాంను స్వీకరించి, ‘మౌలానా ఒబైదుల్లా సింధీ’గా పేరు మార్చుకున్నారు. ఈయన జాతి డైరీ (ఏన్‌ ఆటో బయోగ్రఫీ), సఫర్నామా- ఐ - కబుల్‌ అనే రచనలు చేశారు. విప్లవ చరిత్రలో ‘సిల్క్‌ లేఖల’ రచయితగా గుర్తింపు పొందారు.
* ఒబైదుల్లా తన గురువైన మహ్మద్‌ - అల్‌- హసన్‌ సలహా మేరకు ‘జమియత్‌ - ఉల్‌- అన్సార్‌’ సంస్థను స్థాపించారు. 
* బ్రిట్‌ష్‌వారిని భారత్‌ నుంచి వెళ్లగొట్టేందుకు మహ్మద్‌-అల్‌ హసన్‌ 1915లో ఒబైదుల్లాను కాబుల్‌కు పంపారు. అక్కడ రాజమహేంద్ర ప్రతాప్‌ బ్రిటిష్‌ వ్యతిరేక ప్రణాళికలు రచించారు. అవి ఒబైదుల్లాకు నచ్చడంతో జర్మనీ సహకారం కోసం ప్రయత్నించారు. 
* ఆఫ్గనిస్థాన్‌ అమీర్‌ హబీబుల్లాఖాన్‌  భారత జాతీయ కాంగ్రెస్‌తో సహకరించాలని  ఒబైదుల్లాను కోరాడు. అప్పటి జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడైన డాక్టర్‌ అన్సారీ సిఫార్సు మేరకు ఒబైదుల్లా అధ్యక్షతన కాబుల్‌లో కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాటైంది.
* బెర్లిన్‌లో ఏర్పాటుచేసిన  భారత స్వాతంత్య్ర కమిటీ  (Indian Independence Committee) కాబుల్‌కు ఒక ప్రతినిధి వర్గాన్ని పంపింది. ఇందులో రాజమహేంద్ర ప్రతాప్, అబ్దుల్‌ హఫీజ్‌ మహ్మద్‌ బర్కతుల్లా, జర్మన్‌ అధికారులు వెర్నర్‌ ఒట్టో ఒన్‌ హెన్టీగ్, ఆస్కార్‌ నీడర్‌మేయర్, ఇతర సభ్యులు ఉన్నారు.
* భారతదేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా వీరు 1915, డిసెంబరు 1న ఆఫ్గనిస్థాన్‌లో తాత్కాలిక భారత ప్రభుత్వాన్ని  (Provisional government of India) ఏర్పాటుచేశారు. ఇందులో రాజమహేంద్ర ప్రతాప్‌ ప్రెసిడెంట్‌గా, బర్కతుల్లా ప్రధానమంత్రిగా, ఒబైదుల్లా భారత వ్యవహారాలు, హోం శాఖ మంత్రిగా, దియోబంద్‌ నాయకుడు మౌలావి బషీర్‌ యుద్ధమంత్రిగా, చంపకరామన్‌ పిళ్లై విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.
* గాలిబ్‌ పాషా వీరికి సహకరించి బ్రిటిష్‌ ప్రభుత్వంపై ‘జిహాద్‌’ ప్రకటించారు.
* ఈ తాత్కాలిక ప్రభుత్వానికి చైనా, రష్యా, జపాన్, జర్మనీ మొదలైన దేశాల గుర్తింపు లభించలేదు. 
* మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ, టర్కీలు ఓడిపోవడంతో విప్లవకారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒబైదుల్లాను ఆఫ్గనిస్థాన్‌ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన మాస్కో (రష్యా), అంకారా (టర్కీ)కి వెళ్లారు. 
* 1939లో ఒబైదుల్లా భారత్‌కు తిరిగి వచ్చారు. 1944లో కాన్పూర్‌లోని దీన్‌పూర్‌ గ్రామంలో మరణించారు.


బర్కతుల్లా
ఈయన 1854, జులై 7న భోపాల్‌ (మధ్యప్రదేశ్‌)లో జన్మించారు. అసలుపేరు అబ్దుల్‌ హఫీజ్‌ మహ్మద్‌ బర్కతుల్లా. ఈయన ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడ భారత జాతీయవాదులతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. లాలా హర్‌దయాళ్, రాజమహేంద్ర ప్రతాప్‌తో కలిసి పనిచేశారు. గదర్‌ పార్టీ స్థాపకుల్లో ఒకరు. 
* 1904లో యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యోలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ హిందుస్థానీగా నియమితులయ్యారు. 
* శ్యామ్యూల్‌ లుకాస్‌ జోషితో కలిసి పాన్‌  - ఆర్యన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు.
* ‘ఇస్లాం ఫ్రెటర్నిటీ’ అనే పత్రికను ప్రచురించారు. అయితే, బ్రిటిష్‌ ప్రభుత్వ ఒత్తిడి వల్ల జపాన్‌ ప్రభుత్వం ఈ పత్రికను నిషేధించింది.
* 1914లో బెర్లిన్‌ వెళ్లి అక్కడ ఇండియన్‌ నేషనల్‌ పార్టీలో చేరారు. 
* జర్మనీలో ‘నయా ఇస్లాం’ అనే పత్రికకు  సంపాదకుడిగా పనిచేశారు.
* ఈయన 1927 సెప్టెంబరు 20న అమెరికాలో మరణించారు.
* ఈయన గౌరవార్థం భోపాల్‌ యూనివర్సిటీ పేరును 1988లో ‘బర్కతుల్లా యూనివర్సిటీ’గా మార్చారు.


రాజమహేంద్ర ప్రతాప్‌సింగ్‌
* ఈయన 1886, డిసెంబరులో ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించారు. మహమ్మదన్‌ ఆంగ్లో ఓరియంటల్‌ కాలేజ్‌  (Muhammadan Anglo-Oriental college)లో విద్యనభ్యసించారు. ఇదే యూపీలో ప్రస్తుతం ఉన్న అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ. 
* 1906లో కోల్‌కతా కాంగ్రెస్‌ సమావేశానికి హాజరై అనేకమంది నాయకులను కలిసి, స్వదేశీ ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. ఈయనపై దాదాభాయ్‌ నౌరోజీ, బాలగంగాధర్‌ తిలక్, మహారాజా ఆఫ్‌ బరోడా, బిపిన్‌ చంద్రపాల్‌ల ప్రభావం ఉండేది.
* 1909, మే 24న బృందావన్‌లో ‘ప్రేమ్‌ మహావిద్యాలయ’ను స్థాపించారు.
* బెర్లిన్‌లోని ‘ఇండియన్‌ సొసైటీ’లో చేరారు.
* 1929లో జపాన్‌లో వరల్డ్‌ ఫెడరేషన్‌ అనే మాస పత్రికను ప్రారంభించారు. ఆల్‌ ఇండియా జాట్‌ మహాసభ, ఇండియన్‌ ఫ్రీడం ఫైటర్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు.
* 1932లో మహేంద్ర ప్రతాప్‌ నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. ఈ బహుమతికి నామినేట్‌ అయిన మొదటి విప్లవకారుడు ఈయనే.
* మై లైఫ్‌ స్టోరీ పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు.
* 1940లో జపాన్‌లో ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేశారు.
* 1946లో భారతదేశానికి తిరిగి వచ్చి 1957-62 మధ్య కాలంలో ఎంపీగా పనిచేశారు. 92 ఏళ్ల వయసులో 1979, ఏప్రిల్‌ 29న మరణించారు.


గదర్‌ పార్టీ - లాలా హర్‌దయాళ్‌
* హర్‌దయాళ్‌ 1884, అక్టోబరు 14న ఢిల్లీలో జన్మించారు. పూర్తి పేరు లాలా హర్‌దయాళ్‌ సింగ్‌ మాథూర్‌. పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. 1905లో ఉపకారవేతనంపై ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేరారు. శ్యామ్‌జీ కృష్ణవర్మతో కలిసి ఐరోపా ఖండంలో బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
* లాలా హర్‌దయాళ్‌ 1913, నవంబరులో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో గదర్‌ పార్టీని స్థాపించారు. విదేశాల్లో నివసించే భారతీయులను విప్లవంలో భాగస్వాముల్ని చేయడం దీని లక్ష్యం. దీనికి అధ్యక్షులుగా సోహన్‌ సింగ్‌ భక్నా ఎన్నికయ్యారు.
* గదర్‌ పార్టీ సమావేశాలు లాస్‌ఏంజెల్స్, వియన్నా, వాషింగ్టన్, షాంఘైల్లో జరిగాయి.
* గదర్‌ పార్టీ ఉద్యమాల్లో హర్‌దయాళ్‌కు భాయ్‌ పరమానంద్, సోహన్‌ సింగ్‌ భక్నా, హర్నామ్‌సింగ్‌ సహకరించారు.
* బ్రిటిష్‌ ప్రతినిధి ఫిర్యాదుతో అమెరికన్‌ అధికారులు హర్‌దయాళ్‌ను నిర్భంధించి వలస చట్టం (Immigration Law) ప్రకారం విచారించారు. బెయిల్‌పై విడుదలైన హరదయాళ్‌ అమెరికా నుంచి జెనీవా (స్విట్జర్లాండ్‌) వెళ్లారు. అక్కడ శ్యామ్‌జీ కృష్ణవర్మ, వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ, తారక్‌నాథ్‌ దాస్, చంపక రామన్‌ పిళ్లె, చంద్ర చక్రవర్తి, బర్కతుల్లా మొదలైన వారితో కలిసి విప్లవ కార్యక్రమాలు కొనసాగించారు.
* మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యాక  గదర్‌ పార్టీకి చెందిన దాదాపు 3 వేల మంది భారతదేశానికి వచ్చారు. వీరు 1915, ఫిబ్రవరి 21ని విప్లవదినంగా ప్రకటించారు. కానీ  సరైన నాయకత్వం లేకపోవడం, వీరి సమాచారం బ్రిటిష్‌ వారికి తెలియడంతో విప్లవకారులు అరెస్టయ్యారు.
* ఆంధ్రా ప్రాంతానికి చెందిన దర్శి చెంచయ్య గదర్‌ పార్టీలో కొన్నిరోజులు పనిచేశారు.
* లాలా హర్‌దయాళ్, మరి కొందరు విప్లవకారులు భారత స్వాతంత్య్ర పోరాట నిర్వహణకు జర్మనీలోని బెర్లిన్‌లో ‘ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ కమిటీ’ని స్థాపించారు. దీనికి ఆ దేశ మద్దతును పొందారు. మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓడిపోవడంతో కమిటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
* లాలా హర్‌దయాళ్‌ అవర్‌ ఎడ్యుకేషన్‌ ప్రాబ్లం, థాట్స్‌ ఆన్‌ ఎడ్యుకేషన్, సోషల్‌ కాంక్యుస్ట్‌ ఆఫ్‌ హిందూ రేస్‌ అనే రచనలు చేశారు. ఈయన 1939, మార్చిన 4న అమెరికాలో మరణించారు.

 

వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ (1880-1937)
* ఈయన 1880లో హైదరాబాద్‌లో జన్మించారు. 
* వీరేంద్రనాధ్‌ ఛటోపాధ్యాయ సరోజినీ నాయుడికి సోదరుడు.
* ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడ వీర్‌ సావర్కర్‌తో కలిసి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
* ఛటోపాధ్యాయ బహుభాషా కోవిదుడు. తెలుగు, తమిళం, బెంగాలీ, ఉర్దూ, పర్షియన్, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిష్ణాతులు. అనంతరం ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, డచ్, రష్యన్, స్కాండినేవియన్‌ భాషలు నేర్చుకున్నారు.
* మద్రాస్, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు.
* ఇంగ్లండ్‌లో ‘తల్వార్‌’ అనే విప్లవ పత్రికలో పనిచేశారు.
* మేడం బికాజీ కామాతో కలిసి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
* 1919లో బెర్లిన్‌లో భారత విప్లవకారుల రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* బెర్లిన్‌లో స్థాపించిన ‘ఇండియా స్వాతంత్య్ర కమిటీ’కి కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
* 1920లో భారత్‌లో ఎం.ఎన్‌.రాయ్‌ కొనసాగించిన విప్లవాత్మక జాతీయవాద ఉద్యమానికి ఆర్థిక, రాజకీయ మద్దతు అందించారు.
* వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ 1921, డిసెంబరులో రాస్‌ బిహారీ బోస్‌తో కలిసి ‘ఇండియన్‌ న్యూస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌’ బ్యూరోను జపాన్‌లో ఏర్పాటు చేశారు.
* ఎం.ఎన్‌.రాయ్‌ సలహాతో ‘కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ జర్మనీ’లో చేరారు.
* 1937, జులైలో ఈయన్ను అరెస్టు చేసి సెప్టెంబరులో ఉరితీశారు.


జతిన్‌ ముఖర్జీ (1879-1915)
* ఈయన బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  బెంగాల్‌లో తిరుగుబాటు చేశారు. యుగాంతర్‌ పార్టీలో ప్రధాన నాయకుడు.
* 1906లో పులితో పోరాడి విజయం సాధించడం వల్ల ఈయన్ను బాఘ్‌ జతిన్, టైగర్‌ జతిన్‌ అని కూడా పిలుస్తారు.
* గ్రామీణ ప్రాంతాల్లో జాతీయవాదాన్ని వ్యాప్తి చేసేందుకు గ్రామ బోర్డులను ఏర్పాటు చేశారు.
* ఈయన బోలానందగిరి అనే సన్యాసి శిష్యుడు.
* బరీంద్రకుమార్‌తో కలిసి దియోఘర్‌లో బాంబు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 
* కొన్ని రోజులు యుగాంతర్‌ రహస్య సమాజం అనే సంఘానికి నాయకత్వం వహించారు.
* జిడ్డు గోపాల ముఖర్జీ ఈయన కార్యకలాపాలకు సహకరించేవారు.
* 1915, సెప్టెంబరు 10న బ్రిటిష్‌ పోలీసుల చేతిలో గాయపడిన జతిన్‌ ఒడిశాలోని బాలాసోర్‌లో మరణించారు.

 

చంపక్‌ రామన్‌ పిళ్లై (1891-1934)
* 1891, సెప్టెంబరు 15న కేరళలోని తిరువనంతపురంలో తమిళ దంపతులకు జన్మించారు.
* భారత్‌ నుంచి వెళ్లి జర్మనీలో స్థిరపడ్డారు. 
* మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీలో భారతీయ స్వచ్ఛంద సేవాదళాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఐరోపాలోని భారతీయ సైనికులను చేర్చుకునేందుకు ప్రయత్నించారు.
* లాలా హర్‌దయాళ్, తారక్‌నాథ్‌ దాస్, బర్కతుల్లాతో కలిసి బెర్లిన్‌లో భారత జాతీయ పార్టీని స్థాపించారు. 
* 1915లో ఆప్ఘనిస్థాన్‌లో రాజమహేంద్ర ప్రతాప్‌ స్థాపించిన తాత్కాలిక భారత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.
* రామన్‌ పిళ్లై వలస ప్రజల కోసం పీడిత జాతుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 


దర్శి చెంచయ్య (1890-1964)
* 1890, డిసెంబరు 28న ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో జన్మించారు. 
* చిన్నతనంలో ఈయనపై వీరేశలింగం ప్రభావం ఎక్కువగా ఉండేది. 
* ఒంగోలులో మెట్రిక్యులేషన్, చెన్నైలో బీఏ పూర్తి చేశారు. వ్యవసాయ శాస్త్రంపై మక్కువతో 1912లో అమెరికా వెశ్లారు. అక్కడ చదువుకుంటూనే గదర్‌ పార్టీలో వ్యవస్థాపక సభ్యులుగా చేరారు.
* బర్మా సరిహద్దులో ఉన్న తిరుగుబాటు దళాలకు సంధానకర్తగా వ్యవహరించారు.
* ఈయన్ను కాన్పూర్‌ కుట్రకేసులో ఇరికించాలని బ్రిటిష్‌వారు విఫలయత్నం చేశారు. 
* స్త్రీ విద్యావ్యాప్తి, వేశ్యా వృత్తి నిర్మూలనకు కృషి చేశారు. 
* ఈయన 1964, డిసెంబరు 30న మరణించారు.


అరబిందో ఘోష్‌
* విప్లవవాద జాతీయోద్యమ నాయకుల్లో అరబిందో ఘోష్‌ ప్రముఖుడు. ఈయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదివి ఐసీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఐసీఎస్‌ పదవిని నిరాకరించి, 1892లో భారతదేశానికి వచ్చారు.
* బొంబాయికి చెందిన ఇందు ప్రకాశ్‌ పత్రికలో ‘న్యూ ల్యాంప్స్‌ ఫర్‌ ఓల్ట్‌’ శీర్షికతో 1893, ఆగస్టు నుంచి 1894, మార్చి వరకు వ్యాసాలు రాశారు.
* వందేమాతరం పత్రిక నిర్వహణలో బిపిన్‌ చంద్రపాల్‌కు సహకరించారు. బెంగాల్‌లో యుగాంతర్‌ అనే దినపత్రికలో వ్యాసాలు రాశారు.
* బెంగాల్‌లో జాతీయ కళాశాలను స్థాపించారు.


మరికొందరు వ్యక్తులు..
* ఇంగ్లండ్‌లో మదన్‌లాల్‌ దింగ్రా అనే విప్లవకారుడు ‘కర్జన్‌ విళ్లై’ అనే బ్రిటిష్‌ అధికారిని హత్యచేశాడు. 1992లో భారత ప్రభుత్వం దింగ్రా పేరుమీద స్టాంప్‌ను విడుదల చేసింది.
* సావర్కర్‌ సోదరులు 1904లో అభినవ భారత్‌ మండలి  (Young India Society)ని స్థాపించారు. 
* వి.డి. సావర్కర్‌ విద్యార్థిగా ఉన్నప్పుడే 1899లో మిత్రమేళా అనే సంస్థను స్థాపించారు.

 

కోమగటమారు సంఘటన
* పంజాబ్‌లోని చాలా మంది సిక్కులు బ్రిటిష్‌ కొలంబియా (కెనడా పశ్చిమ తీరం)లో స్థిరపడ్డారు. కెనడా చట్టాల ప్రకారం భారతదేశం నుంచి నేరుగా వచ్చేవారికి ప్రవేశ అనుమతి లభించేది. 
* 1914, ఏప్రిల్‌ 14న హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న 165 మంది భారతీయులు దూరప్రాచ్యంలో వాణిజ్యవేత్త అయిన గురుదత్‌ సింగ్‌ నాయకత్వంలో కెనడాలోని వాంకోవర్‌ నగరానికి కోమగటమారు అనే జపాన్‌ నౌకలో ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో మరికొన్ని రేవు పట్టణాల్లో నివసించే భారతీయులు కూడా వారితో కలిశారు.  ఆ నౌక 376 మంది (351 మంది సిక్కులు) ప్రయాణికులతో మే 23న వాంకోవర్‌ రేవును చేరింది. కానీ అందులోని ప్రయాణికులను కెనడా ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆ నౌక తిరిగి భారతదేశానికి (కలకత్తా) రావాలని బ్రిటిష్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ నౌక కలకత్తాలోని బడ్జ్‌ - బడ్జ్‌ రేవుకు వచ్చింది.
* కోమగటమారు నౌకలోని ప్రయాణికులను గదర్‌ పార్టీకి చెందిన విప్లవకారులుగా   భావించిన బ్రిటిష్‌వారు వారిని అరెస్ట్‌ చేయాలనుకున్నారు. దీంతో బ్రిటిష్‌ పోలీసులకు, నౌకలోని ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీస్‌ కాల్పుల్లో 18 మంది మరణించగా, 202 మందిని అరెస్టు చేశారు. గురుదత్‌ సింగ్‌ గాయాలతో అక్కడి నుంచి  తప్పించుకొని పారిపోయారు.
* గదర్‌ పార్టీ పిలుపు మేరకు మనీలా, షాంఘై, హాంగ్‌కాంగ్‌ల నుంచి సిక్కులతో కూడిన తోసమరు అనే మరో ఓడ 1914, అక్టోబరు 29న కలకత్తాకు చేరింది. వీరిలో కొంతమందిని బంధించి జైలుకు పంపగా, మరికొందరు రహస్య విప్లవ కార్యకలాపాలు కొనసాగించారు.
* మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యాక ఆయుధాలు, సైనికుల మద్దతు కోసం మహ్మద్‌ బర్కతుల్లా, భగవాన్‌సింగ్, రామ్‌చంద్ర మొదలైనవారు బహిరంగ సమావేశాలు నిర్వహించి, భారత్‌లో విప్లవ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. కర్తార్‌ సింగ్‌ శరభ, రఘువర్‌ దయాల్‌ గుప్తా లాంటి వారు భారతదేశానికి వచ్చారు.
* సుమారు 8000 మంది గదర్‌ పార్టీ కార్యకర్తలు భారతదేశానికి వచ్చి విప్లవంలో  పాల్గొన్నారు. బ్రిటిష్‌ వారు వీరిని అణిచివేశారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆధునిక విద్యావ్యాప్తి

మాదిరి ప్రశ్నలు

1. విలియంకోట కళాశాలను ఎవరు స్థాపించారు?
జవాబు: వెల్లస్లీ

 

2. భారతదేశంలో విద్యాభివృద్ధికి లక్ష రూపాయిలు కేటాయించిన చట్టమేది?
జవాబు: 1813 చార్టర్ చట్టం

 

3. సంస్కృత కళాశాలల బలోపేతాన్ని వ్యతిరేకించినవారు ఎవరు?
జవాబు: రాజారామమోహన్‌రాయ్

 

4. కలకత్తాలో హిందూ కళాశాలను ఎప్పుడు స్థాపించారు?
జవాబు: 1817

 

5. వాయవ్య రాష్ట్రంలో ప్రాంతీయ భాషల ద్వారా విద్యాబోధనను ప్రోత్సహించినవారు ఎవరు?
జవాబు: జేమ్స్ థామ్సన్

 

6. బాలికల పాఠశాలల ఏర్పాటుకు కృషిచేసినవారు ఎవరు?
జవాబు: బెత్యూన్

 

7. హంటర్ కమిషన్‌ను ఎవరి కాలంలో నియమించారు?
జవాబు: రిప్పన్

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రకూటులు

రాష్ట్రకూటుల పాల‌నా కాలాన్ని ద‌క్షిణ భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఒక ముఖ్య ఘ‌ట్టంగా చ‌రిత్ర‌కారులు పేర్కొంటారు. వీరు బాదామీ చాళుక్యుల‌కు సామంతులుగా ఉండేవారు. వారు బ‌ల‌హీనులు కాగానే స్వ‌తంత్ర రాజ్యాన్ని స్థాపించారు. రాష్ట్రకూటుల త‌మ‌ను తాము ల‌ట్ట‌లూరు పుర‌వరాధీశ్వ‌రులు అని చెప్పుకున్నారు. వీరి రాజ‌ధాని కర్ణాక‌ట‌లోని మాన్య‌ఖేటం. రాష్ట్రకూట వంశానికి మూల‌పురుషుడు మొద‌టి ఇంద్ర‌రాజు(క్రీ.శ‌.696 - 710). ఈయ‌న మాన్య‌ఖేట, ప‌డ‌మ‌ర తెలంగాణ ప్రాంతాల‌ను ప‌రిపాలించాడు.
 

దంతిదుర్గుడు (క్రీ.శ.748-58): స్వతంత్ర రాష్ట్రకూట రాజ్య స్థాపకుడిగా దంతిదుర్గుడిని పేర్కొంటారు. ఈయన మహారాష్ట్ర మొత్తానికీ అధిపతిగా ఉన్నారు. మహారాజాధిరాజ, పరమ మహేశ్వర, పరమ భట్టారక బిరుదులు ఉన్నాయి. సయంగఢ్‌ శాసనం, ఎల్లోరాలోని దశావతార గుహాలయ శాసనంలో దంతిదుర్గుడి యుద్ధ విజయాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఈయన మాల్వాపై దండెత్తి జయించాడు. ఉజ్జయినిలో హిరణ్యగర్భ దానాన్ని చేసి, తన విజయాన్ని ప్రకటించాడు. 


మొదటి కృష్ణుడు (క్రీ.శ.758-72): ఈయనకు సుభత్తుంగ, అకాలవర్షుడు అనే బిరుదులు ఉన్నాయి. ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయాన్ని (ఏకశిలా నిర్మితం) నిర్మించాడు. దీని నిర్మాణం దాదాపు వందేళ్లు కొనసాగింది. దీనికి వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ గుర్తింపు లభించింది.


ధ్రువరాజు (క్రీ.శ.780-92): ఈయన పాల, ప్రతీహార వంశ రాజులను జయించాడు. తన విజయానికి గుర్తుగా గంగా - యమున తోరణాన్ని తన రాజ్య చిహ్నంగా ఏర్పాటుచేశాడు. ధ్రువరాజుకు శ్రీవల్లభ, విరూపకేళి వల్లభ, దానార్ణవ అనే బిరుదులు ఉన్నాయి.


మూడో గోవిందుడు (క్రీ.శ.793-814): ఈయన రాష్ట్రకూటుల్లో అగ్రగణ్యుడు. గోవిందుడికి ప్రభూతవర్ష, రాజాధిరాజ, రాజాపరమేశ్వర, త్రిభువనధవళి, శ్రీవల్లభ, జనవల్లభ, కీర్తినారాయణ అనే బిరుదులు ఉన్నాయి. సంజిన్‌ శాసనంలో ఈయన గొప్పతనం, విజయాల గురించి వివరణ ఉంది. ఈయన చిత్రకూటం, ఉజ్జయిని, బెంగాల్, కాళప్రియం, గంగా-యమున తీరప్రాంత మైదానాలను జయించాడు.


అమోఘవర్షుడు (క్రీ.శ.814-80): ఈయన అసలు పేరు శర్యుడు. గొప్ప కవి. కన్నడ భాషలో ‘కవిరాజ మార్గం’ అనే తొలి అలంకార గ్రంథాన్ని రచించాడు. ‘ప్రశ్నోత్తర రత్నమాలిక’ అనే కావ్యాన్ని రచించాడు. ఈయనకు ‘కవిరాజు’ అనే బిరుదు ఉంది. ఈయన కాలంలో జైనమత కవులైన మహావీర ఆచార్య ‘గణితసార సంగ్రహాన్ని’, శాత్తాయన ‘అమోఘవృత్తి’ని రచించారు. 
* అమోఘవర్షుడు మాన్యఖేట (మాల్ఖేడ్‌) నగరాన్ని నిర్మించి, దాన్ని రాష్ట్రకూట రాజధానిగా చేసుకున్నాడు. అరబ్‌ యాత్రికుడైన సులేమాన్‌ ఈయన కార్యకలాపాలను వర్ణిస్తూ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నలుగురు గొప్ప చక్రవర్తుల్లో అమోఘవర్షుడు ఒకరని ప్రశంసించాడు. 
* అమోఘవర్షుడు తన రాజ్యంలో కరవుకాటకాలు సంభవించినప్పుడు వాటిని నివారించేందుకు కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమ చేతి వేళ్లను బలిగా సమర్పించాడు.
* జైనమతాన్ని స్వీకరించి, సల్లేఖనవ్రతాన్ని ఆచరించి మరణించాడు.
* రాష్ట్రకూటుల్లో చివరి రాజు రెండో కర్కరాజు (క్రీ.శ.97273) 


పరిపాలనా విధానం
రాష్ట్రకూటులు పటిష్ఠమైన పరిపాలనా వ్యవస్థను నెలకొల్పి, ప్రజాహితంగా రాజ్యపాలన చేశారు. మొదట్లో వీరికి ఎల్లిచ్‌పూర్, ఎల్లోరా, పైఠాన్‌ నగరాలు రాజధానులుగా ఉండేవి. అమోఘవర్షుడు మాన్యఖేటాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. 
* రాజ్య పాలనలో రాజుకు సహాయంగా మంత్రులు ఉండేవారు. వీరిలో ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, కోశాధికారి, న్యాయ మంత్రి, సైన్యాధిపతి ముఖ్యులు. 
* భిన్నప్రాంతాల్లో నియమితులైన రాజోద్యోగులను ‘రాజస్థానీయ’ అనేవారు. 
* పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రం, విషయం, గ్రామాలుగా విభజించారు. రాష్ట్రానికి ‘మహాసామంత’ లేదా ‘మహామండలేశ్వర’ అనే ప్రధాన పాలనాధికారి ఉండేవారు. విషయపతి, భోగపతి అనే జిల్లా అధికారులు ఉండేవారు. పట్టణాన్ని పాలించేవారు ‘నగర పతి’. గ్రామానికి ‘గ్రామపతి’ అధిపతిగా ఉండేవారు. 
* రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. సైన్యాన్ని నిర్వహించడానికి కోసం ప్రజల నుంచి ‘పడేనాళ’ పన్నును వసూలు చేసేవారు. 
* దక్షిణ భారతదేశంలో వ్యవసాయ భూమిని ప్రత్యేకంగా ‘ఎరిపట్టి’ లేదా ‘చెరువు కట్టు భూమి’ అని పిలిచేవారు. 

 

విద్యా, సారస్వత పోషణ
రాష్ట్రకూట రాజులు విద్యాభివృద్ధి కోసం బ్రాహ్మణులకు అగ్రహారాలు, భూములను దానం చేశారు. అగ్రహారాలు, దేవాలయ ప్రాంగణాలు సంస్కృత విద్యకు కేంద్రాలుగా ఉండేవి. 
* కర్ణాటక ప్రాంతంలోని సెలోర్గిలో త్రయిపురుష దేవాలయంలో ఉన్న పెద్ద కళాశాలలో 27 వసతి గృహాలు ఉన్నట్లు సెలోత్గి శాసనం పేర్కొంది.
* జైన, బౌద్ధ మతాలు మత విద్యను బోధించేవి. మాల్ఖేడ్, నాసిక్, పైఠాన్‌ నగరాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి. 
* వేదాలు, వ్యాకరణం, జ్యోతిషం, సాహిత్యం, ధర్మశాస్త్రం, పురాణాలు మొదలైన విద్యలను అభ్యసించేవారు. 
* క్రీ.శ.779లో ధ్రువ మహారాజు ధూలియా శాసనాన్ని వేయించాడు. అందులో దాన గ్రహీతలు వేద, వేదాంగ, ఇతిహాస, పురాణ, వ్యాకరణ, మీమాంస, తర్క శాస్త్రాల్లో పండితులుగా ఉన్నట్లు పేర్కొంది. 
* సంస్కృత వ్యాకరణం సమస్త శాస్త్రాలకు మూలమని పేర్కొన్నారు. ధార్వాడ్‌ మండలంలోని భుజభేశ్వరాలయంలోని మఠానికి క్రీ.శ.975లో 50 మత్తరాల భూమిని దానంగా ఇచ్చారు. ఆ మఠంలో విద్యార్థులకు ఉచితంగా విద్య, ఆహారాన్ని అందించేవారు. ధార్వాడ్‌ మండలంలోని కౌలాస్‌ అగ్రహారంలో సంస్కృత విద్యాపీఠాన్ని ఏర్పాటు చేశారు. అందులో 200 మంది బ్రాహ్మణ కుటుంబాలు వ్యాకరణ, నీతి శాస్త్ర, సాహిత్య, పురాణ విద్యల్లో నిష్ణాతులుగా ఉండేవారు. 
* రాష్ట్రకూట రాజులు సంస్కృతం, కన్నడ భాషలను పోషించారు. రాజభాష సంస్కృతం. జైన వాజ్మయం రాష్ట్రకూట రాజ్యంలో విలసిల్లింది. హలాయుధుడు ‘కవిరహస్యం’ను మూడో కృష్ణుడి కాలంలో రచించాడు. ఇందులో సంస్కృత ధాతువుల వివరణ, కృష్ణమహారాజు ప్రశస్తి ఉంది. 
* అమోఘవర్షుడి గురువు జనసేనుడు. ఆదిపురాణ రచనను జనసేనుడు మొదలుపెట్టగా, మరో శిష్యుడైన గుణచంద్రుడు పూర్తిచేశాడు. ఆదిపురాణం జైనతీర్థంకరుల జీవిత చరిత్ర. 
* కన్నడ కవిత్రయంలో రెండోవారైన ‘పొన్న’ మూడో కృష్ణుడి ఆస్థానకవి. ఈయన శాంతి పురాణాన్ని రచించారు. 
* రాష్ట్రకూటులకు సామంతులైన వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో కన్నడ త్రయంలో మొదటి వారైన పంపకవి ఉండేవారు. ఆయన ‘ఆదిపురాణం’, ‘విక్రమార్జున విజయం’ గ్రంథాలను రచించారు. 
* సంస్కృత భాషలో మొదటి చంపూ (పద్య గద్య సంకలనం) కావ్యాన్ని త్రివిక్రమభట్టు రచించారు. ఈయన రాష్ట్రకూట రాజైన ఇంద్రుడి సమకాలీకుడు.


సామాజిక వ్యవస్థ
దక్షిణ భారతదేశంలో సామాజిక నిర్మాణం ప్రధానంగా శాస్త్రాల్లో పేర్కొన్న వర్ణాశ్రమధర్మం, చతుర్వర్ణాల విభజనను అనుసరించి ఉంది. మత, కర్మకాండల్లో బ్రాహ్మణులకు ఆధిక్యత ఉండేది. వారికి సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించారు. పన్నులతో నిమిత్తం లేకుండా రాజు నుంచి అగ్రహారాలు, బ్రహ్మదేయాలను దానాలుగా పొందారు. 
* రాష్ట్రకూటులు క్షత్రియుల్లో ‘సత్‌క్షత్రియులు’ అనే ఒక ప్రత్యేక ఉపతెగగా గుర్తింపు పొందారు. వైశ్యులు వర్తక, వ్యవసాయం పనులు చేసేవారు. వారిని ‘కోమట్లు’, ‘సేట్‌’లు అనే పేర్లతో పిలిచేవారు. 
* శూద్రులు ప్రధానంగా వ్యవసాయం, కూలీ, సైనికసేవ లాంటి వృత్తులు చేసేవారు. 
* క్రీ.శ.10వ శతాబ్దంలో రచించిన సాహిత్య గ్రంథం ‘యశస్థిలక’లో వెట్టిచాకిరీని వ్యతిరేకించారు. క్రీ.శ.11వ శతాబ్దంలో ఆంధ్రాలో ‘పంచాణం వారు’, తమిళనాడులో ‘ఇడంగై’ అనే వృత్తివిద్యల వర్గాలు ఏర్పడ్డాయి.
* వీరశైవం, ఆరాధ్యశైవం, శ్రీవైష్ణవం లాంటి నూతన మతోద్యమాలు ప్రారంభమయ్యాయి. భూస్వామ్య రైతులు వృత్తి తరగతుల వారిని పోషించారు.


వ్యాపార పరిస్థితులు
దక్షిణ భారతదేశంలోని తూర్పు, పశ్చిమ కోస్తాప్రాంతాలకు; పశ్చిమ ఆగ్నేయాసియా దేశాలకు మధ్య వ్యాపార సంబంధాలు ఉండేవి. వాటి గురించి గ్రీకు వ్యాపారి కాస్‌మస్‌ ఇండికాపీలెస్ట్స్‌ వివరించారు. మిరియాలు, యాలుకలు, ముత్యాలు ప్రధానంగా ఎగుమతి అయ్యేవి. 
* ‘మనిగారం’, ‘నానాదేశీయులు’, ‘తిస్సెవ ఆయుత్త పొన్నూరువర్‌’ లేదా ‘అయ్యవోలెపుర’, ‘500 స్వాములు’ అనేవి ఆ కాలంలో ప్రముఖ వర్తక సంఘాలు. వీరు భారతదేశంలోని అన్ని ప్రాంతాలను, పర్షియా, ఆగ్నేయాసియా దేశాలను సందర్శించారు. వీరు ప్రముఖ వర్తకుల న్యాయ సంరక్షకులు. ‘మనిగారం’ అనేది స్థానిక వర్తక సంఘం. ‘నగరం’ అంటే దక్షిణ భారతదేశంలో వ్యవస్థీకరించిన విక్రయ కేంద్రం.
* చైనా, శ్రీవిజయ దేశాలతో వ్యాపార లావాదేవీలు జరిగేవి. తూర్పు తీరంలో మహాబలిపురం, నాగపట్టణం, కావేరీపట్టణం, కృష్ణపట్టణం; పశ్చిమ తీరంలో చౌల్, సోప్రా, కాలికట్‌లు ప్రసిద్ధ రేవు పట్టణాలు.


వాస్తుకళ
రాష్ట్రకూటులు శిల్పకళకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వారు తమిళనాడు, కేరళ ప్రాంతాలను దిగువ ద్రావిడ దేశమని; ఆంధ్రా, కర్ణాటకలను ఎగువ ద్రావిడ దేశమని పిలిచేవారు. దిగువ ద్రావిడ దేశంలోని కట్టడాలను ‘ద్రావిడరీతి’ లేదా శైలిలో నిర్మించారు. ఎగువ ద్రావిడ దేశంలో కట్టిన దేవాలయాలు నగరరీతి వ్యాప్తికి చిహ్నాలుగా ఉండేవి. 
* రాష్ట్రకూటులు ఎల్లోరా గుహల్లో ఆలయాలను నిర్మించారు. దంతిదుర్గుడు మొదటి గుహలో దశావతార దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ నంది మండపం ప్రత్యేక నిర్మాణం. 
* ఎల్లోరాలోని 16వ గుహలో కైలాసనాథ ఆలయాన్ని మొదటి కృష్ణుడు నిర్మించాడు. ఈ ఆలయ గోడలు, కప్పుల కింది భాగం చిత్రలేఖనానికి ప్రసిద్ధిగాంచింది. 
* ముంబయి సమీపంలోని ఎలిఫెంటా గుహాలయాలు, పట్టడకల్‌లోని జైనదేవాలయం వీరి కాలానికి చెందినవే.


మాదిరి ప్రశ్నలు
1. రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు ఎవరు?
1) దంతిదుర్గుడు      2) నందిదుర్గుడు 
3) విక్రమార్కుడు      4) విక్రమాదిత్యుడు


2. 27 వసతిగృహాలు ఉన్న పెద్ద కళాశాలను ఏ శాసనంలో పేర్కొన్నారు?
1) మాన్యఖేట శాసనం           2) సతారా శాసనం 
3) సెలోత్గి శాసనం           4) కొల్హాపూర్‌ శాసనం


3. మాన్యఖేట నగరాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకున్న పాలకుడు ఎవరు?
1) రెండో కృష్ణుడు                  2) అమోఘవర్షుడు 
3) రెండో గోవిందుడు            4) దంతిదుర్గుడు


4. కన్నడ భాషలో మొదటి అలంకార శాస్త్ర గ్రంథమైన కవిరాజ మార్గాన్ని రచించింది ఎవరు?
1) అమోఘవర్షుడు        2) జనసేనుడు   
3) శకటాయనుడు        4) పంప


5. కన్నడ కవిత్రయంలో రెండోవారైన పొన్న ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
1) రెండో కృష్ణుడు         2) మూడో కృష్ణుడు 
3) ధ్రువుడు            4) అమోఘవర్షుడు


6. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు?
1) దంతిదుర్గుడు           2) మొదటి గోవిందుడు 
3) మొదటి కృష్ణుడు        4) మూడో కృష్ణుడు


7. కింది ఏ గ్రంథంలో వెట్టిచాకిరీ వ్యవస్థను వ్యతిరేకించారు?
1) యశస్థిలక          2) కవిరాజ మార్గం 
3) రత్నావళి            4) విక్రమార్జున విజయం


8. ఎల్లోరాలోని దశావతార దేవాలయం ఎవరి కాలానికి చెందింది?
1) రాష్ట్రకూటులు            2) చాళుక్యులు 
3) విష్ణుకుండినులు         4) పల్లవులు


సమాధానాలు: 1-1;  2-3; 3-2; 4-1; 5-2; 6-3; 7-1; 8-1.

Posted Date : 10-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

హోమ్‌ రూల్‌ ఉద్యమం

స్వరాజ్య సమరం!


బెంగాల్‌ విభజనపై జరిగిన తిరుగుబాటు భారతీయుల సంఘటిత శక్తిని చాటింది. యుద్ధకాలంలో అండగా ఉంటే సంస్కరణలు అమలు చేస్తామంటూ నమ్మించిన బ్రిటన్, మోసం చేసి వంచన వైఖరిని ప్రదర్శించింది. దాంతో పెరిగిన అసంతృప్తి మళ్లీ ఉద్యమంగా మారింది. విప్లవకారులు విజృంభిచారు. విభేదాలు విడిచి నేతలు ఏకమై పోరాడారు. కష్టనష్టాలను లెక్కచేయకుండా ప్రజలు నాయకుల వెంట నడిచారు. స్వయం పాలన కోసం దేశవ్యాప్తంగా సమరం చేశారు. వలస ప్రభుత్వం వణికిపోయింది. స్వపరిపాలనకు తలొగ్గింది.

 

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం భారత జాతీయవాద వెల్లువలో ఒక గొప్ప విప్లవ కెరటం. ‘ప్రజలు తరతరాల గాఢ సుప్తావస్థ నుంచి మేల్కొన్నారు. రాజకీయాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. మహాజర్ల (పిటీషన్‌)కు ప్రజామద్దతు ఉండాలని, తమకు కష్టనష్టాలు భరించే శక్తి ఉండాలని గుర్తించారు.’ అని గాంధీ ఆ ఉద్యమం గురించి పేర్కొన్నారు. 

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని భారతీయులు సంఘటితంగా బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులను తిరస్కరించిన మొదటి ఘట్టంగా వర్ణించవచ్చు.ఆ తర్వాత దేశ స్వాతంత్య్ర సమరంలో హోమ్‌ రూల్‌ ఉద్యమాన్ని (1916-1918) ద్వితీయ ఘట్టంగా పేర్కొనవచ్చు. బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం అనంతరం అనేక పరిస్థితులు హోమ్‌ రూల్‌ ఉద్యమానికి (స్వయం పాలన) దారితీశాయి.

 

దారితీసిన పరిస్థితులు

బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమ కాలంలో ప్రభుత్వం అనుసరించిన దమననీతి, క్రూర అణచివేత విధానాలు అంతిమంగా విప్లవ హింసావాదంగా పరిణమించాయి. సంధ్య, యుగాంతర్, కాల్, వందేమాతరం, మరాఠీ, కేసరి లాంటి పత్రికలు విప్లవవాదానికి మద్దతిచ్చాయి. చాపేకర్‌ సోదరులు, సావర్కర్‌ సోదరులు, ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి లాంటి విప్లవకారులు ఆ మార్గాన్ని అనుసరించారు. వారు విదేశాల్లో కూడా తమ కేంద్రాలను స్థాపించారు. శ్యాంజీ కృష్ణవర్మ, వి.డి.సావర్కర్, మేడం బికాజీ కామా లాంటి వారు ఐరోపాలో, లాలా హర్‌దయాళ్‌ అమెరికాలో తమ రహస్య కార్యకలాపాలను సాగిస్తూ, భారతదేశంలో విదేశీ సామ్రాజ్య శక్తులపై సాయుధ తిరుగుబాటుకు సంసిద్ధమయ్యారు.

వందేమాతర ఉద్యమం 1911లో విజయవంతంగా ముగిసిన తర్వాత, భారత జాతీయోద్యమంలో స్తబ్దత ఏర్పడింది. ఈ మధ్యలో 1914 ఆగస్టులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. గ్రేట్‌ బ్రిటన్, ఇటలీ, రష్యా, జపాన్, అమెరికా కలిసి ఒక పక్షంగా, జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, టర్కీ (తుర్కియే) లు మరో పక్షంగా యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధం (1914 - 18) వల్ల భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో కీలక మార్పులు ఏర్పడ్డాయి. యుద్ధ ప్రక్రియలో బ్రిటన్‌ భారత నాయకుల మద్దతు కోరింది.  యుద్ధానంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం భారతీయ సమస్యల పట్ల ఉదార వైఖరితో వ్యవహరిస్తుందని విశ్వసించిన కాంగ్రెస్‌ మితవాద వర్గం మద్దతుకు అంగీకరించింది. 1914లో తిలక్‌ జైలు నుంచి విడుదలయ్యారు. యుద్ధ ప్రక్రియలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే, కృతజ్ఞతగా భారతదేశానికి రాజ్యాంగ సంస్కరణలు ప్రకటిస్తారని అతివాదులు కూడా నమ్మి మద్దతు ప్రకటించారు. విప్లవకారులు మాత్రం, ఇది తమకు అందివచ్చిన అవకాశంగా భావించి, బ్రిటన్‌కు శత్రువులైన టర్కీ, జర్మనీ లాంటి దేశాల నుంచి ఆర్థిక, మిలటరీ సహాయం పొందడానికి ప్రయత్నించారు. దాంతో విప్లవకారుల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం తీవ్రమైన అణచివేత విధానాలు అవలంబించింది. విప్లవ కార్యకలాపాలను నిరోధించేందుకు 1915లో భారతదేశ రక్షణ చట్టం తీసుకొచ్చింది. దాన్ని విచక్షణారహితంగా ప్రయోగించి అనుమానితులను పెద్దసంఖ్యలో ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో బంధించింది.

 

ఒక లక్ష్యం - రెండు లీగ్‌లు 

అనిబిసెంట్‌ సహకరించడంతో కాంగ్రెస్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు తిలక్‌ వర్గానికి అనుమతి లభించింది. అనిబిసెంట్‌ ఐర్లాండ్‌ దేశస్థురాలు. ఉన్నత విద్యావంతురాలు, ఆధ్యాత్మికవేత్త, భారతీయ సంస్కృతి పట్ల అభిరుచి, ఇష్టం ఉన్న వ్యక్తి. దివ్యజ్ఞాన సమాజసేవలో భాగంగా ఆమె భారతదేశానికి వచ్చారు. సమాజం ప్రధాన కార్యాలయం మద్రాస్‌లోని అడయార్‌లో ఏర్పాటైంది. ఆమె రాజకీయాల్లో కూడా ప్రవేశించి, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1916లో కాంగ్రెస్, ముస్లింలీగ్‌ తమ వార్షిక సమావేశాల కోసం లఖ్‌నవ్‌లో సమావేశమయ్యాయి. అందులో పరస్పర సంప్రదింపుల ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది. ఈ ప్రక్రియలోనూ అనిబిసెంట్‌ ముఖ్య భూమిక పోషించారు.

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు గడిచిన తర్వాత బ్రిటన్‌కు  అందించిన సహాయ సహకారాలకు బదులుగా దేశంలో స్వపరిపాలన అమలు చేస్తుందనే భ్రమలు భారతీయులకు తొలగిపోయాయి. ఒత్తిడి చేస్తేగాని ప్రభుత్వం రాజకీయ సంస్కరణలు తీసుకురాదని నాయకులు, ప్రజలు గ్రహించారు. అయితే  అప్పటికి నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయింది. కానీ కాంగ్రెస్‌లోని రెండు వర్గాల ఐక్యత, కాంగ్రెస్‌ - ముస్లింలీగ్‌ మైత్రి మరొక రాజకీయ పోరాటానికి అనువైన వాతావరణాన్ని కల్పించాయి. దాంతో ఈ ఉద్యమాన్ని జాతీయ కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా, జాతీయ నాయకులైన బాలగంగాధర్‌ తిలక్, అనిబిసెంట్‌లు నిర్వహించారు. వీరు దేశానికి స్వయంపాలనను డిమాండ్‌ చేస్తూ 1916లో విడివిడిగా హోమ్‌ రూల్‌ లీగ్‌లు స్థాపించారు. లక్ష్యం ఒక్కటే అవడంతో రెండు లీగ్‌లూ కలిసే పనిచేశాయి.

తిలక్‌ హోమ్‌ రూల్‌ లీగ్‌: దీన్ని తిలక్‌ 1916, ఏప్రిల్‌లో పుణెలో స్థాపించాడు. ఈ లీగ్‌ మహారాష్ట్ర (అప్పటి బొంబాయి మినహా), కర్ణాటక, సెంట్రల్‌ ప్రావిన్స్‌ల్లో కార్యకలాపాలును నిర్వహించింది. తిలక్‌ తన పత్రికలు ‘మరాఠా’, ‘కేసరి’ ద్వారా హోమ్‌రూల్‌ ఉద్యమ లక్ష్యాన్ని వ్యాసాలు, వార్తల రూపంలో తెలియజేసి, ప్రజలను కార్యోన్ముఖులను చేశాడు. ఉద్యమ విశిష్టతను చాటేందుకు కన్నడ, గుజరాతీ, మరాఠి, ఇంగ్లిష్‌ భాషల్లోనూ కరపత్రాలు విడుదల చేశాడు. తిలక్‌ లీగ్‌ స్వపరిపాలనను, భాషా రాష్ట్రాలను, ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను డిమాండ్‌ చేసింది. ‘స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని సాధించి తీరుతాను’ అని తిలక్‌ ఎలుగెత్తి చాటాడు.

అనిబిసెంట్‌ లీగ్‌: అనిబిసెంట్‌ ఐర్లాండ్‌ దేశంలో నిర్వహించిన స్వపరిపాలన ఉద్యమం తరహాలో ఇక్కడ కూడా హోమ్‌ రూల్‌ లీగ్‌ (1916, సెప్టెంబరు) స్థాపించి రాజకీయ పోరాటం సాగించారు. ఆమె తన పత్రికలు ‘కామన్‌ వీల్‌’, ‘న్యూ ఇండియా’; కరపత్రాలు, సమావేశాల ద్వారా లీగ్‌ లక్ష్యాలు, కార్యాచరణ గురించి బొంబాయి, కాన్పుర్, అలహాబాద్, బెనారస్, మధుర, కాలికట్, అహ్మద్‌నగర్, లాంటి చోట్ల ప్రచారం చేశారు. అనిబిసెంట్‌ లీగ్‌ ద్వారా స్వపరిపాలనను డిమాండ్‌ చేశారు. జార్జ్‌ అరండల్‌ (లీగ్‌ కార్యదర్శి), వాడియా, ద్వారకాదాస్, శంకర్‌లాల్‌ బంకర్, ఇందూలాల్, సి.పి. రామస్వామి అయ్యర్‌ లాంటి ప్రముఖులు ఉద్యమంలో అనిబిసెంట్‌ అనుయాయులయ్యారు. ఆమె బెనారస్‌లో స్థాపించిన హిందూ కళాశాల 1916 నాటికి మదన్‌ మోహన్‌ మాలవ్య నేతృత్వంలో విశ్వవిద్యాలయంగా మారింది (1915 చట్టం ప్రకారం).

హోమ్‌రూల్‌ ఉద్యమంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. బ్రిటిష్‌ పాలకులు తమ సామ్రాజ్యవాద ధోరణిని విడనాడేందుకు ఇష్టపడలేదు. స్వపరిపాలన ఉద్యమాన్ని అణచివేయడానికి నిశ్చయించుకున్నారు. ప్రభుత్వం ఉద్యమ నేతలపై అప్రజాస్వామ్య భారతదేశ రక్షణ చట్టాన్ని ప్రయోగించింది. ఉద్యమ పత్రికలపై ఆంక్షలను విధించింది. ప్రభుత్వం 1917లో అనిబిసెంట్‌ను ఆమె అనుచరులతో కలిపి అరెస్ట్‌ చేసింది. ఈ అరెస్టును దేశం యావత్తు వ్యతిరేకించింది. అనిబిసెంట్‌ నిస్వార్థ సేవలకు గుర్తింపుగా 1917లో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, భూలాభాయ్‌ దేశాయ్, చిత్తరంజన్‌ దాస్, మదన్‌ మోహన్‌ మాలవ్య, మహమ్మద్‌ అలీ జిన్నా, లాలా లజపతిరాయ్‌ వంటి నాయకులు హోంరూల్‌ ఉద్యమాన్ని సమర్థించారు. దేశం పోరాటాలతో అట్టుడికిపోయింది. ఉద్యమ తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకుంది. 1917 ఆగస్టులో అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్‌ ‘భారతీయులకు స్వయంపాలన ప్రసాదించడం బ్రిటిష్‌ ప్రభుత్వ లక్ష్యం’ అని ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన తర్వాత అనిబిసెంట్‌ తన ఉద్యమ తీవ్రతను తగ్గించారు. తిలక్‌ కూడా ‘ఇండియన్‌ అన్‌రెస్ట్‌’ గ్రంథ రచయిత వాలెంటైన్‌ చిరోల్‌పై పరువునష్టం దావా కోసం లండన్‌ వెళ్లడంతో ఉద్యమ తీవ్రత తగ్గింది.

 

ఉద్యమ ఫలితాలు

హోమ్‌ రూల్‌ ఉద్యమం భౌగోళికంగా దేశమంతా వ్యాపించింది. విద్యార్థులు, కార్మికులు విశేషంగా పాల్గొన్నారు. మొదటిసారి అతివాదులు, మితవాదుల మధ్య; కాంగ్రెస్, ముస్లింలీగ్‌ మధ్య ఐకమత్యం ఏర్పడటంతో రాజకీయ ఉత్సాహం తొణికిసలాడింది. చివరకు ప్రభుత్వం జాతీయవాదులను సంతృప్తి పరచడానికి మాంటేగ్‌ - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలను ‘1919, భారత ప్రభుత్వ చట్టం’గా తీసుకొచ్చింది. భారతీయులు తమ డిమాండ్ల సాధనకు ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా, త్యాగాలకైనా వెనుకాడమని రుజువు చేశారు. తర్వాతి కాలంలో గాంధీజీ ప్రజాఉద్యమాలకు వీలుగా  ఈ ఉద్యమం ముందుగానే ప్రజలకు శిక్షణ ఇచ్చి సమాయత్తం చేయడంతో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది.

రచయిత: వి.వి.ఎస్‌. రామావతారం

Posted Date : 03-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలియన్‌ వాలాభాగ్‌ దురాగతం

తెల్ల రాక్షసుడి నరమేధం!


ప్రపంచానికి నాగరికత నేర్పించామని గర్వంగా ప్రగల్భాలు పలికే తెల్లదొరలు జలియన్‌ వాలాభాగ్‌లో జరిపిన నరమేధం మానవ జాతి చరిత్రలోనే మాయని మచ్చగా మిలిగిపోయింది. శాంతియుత నిరసనల్లో, పర్వదిన వేడుకల్లో పాల్గొన్న ప్రజలపై డయ్యర్‌ అత్యంత రాక్షసంగా సాగించిన దమనకాండలో వందలమంది దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. తుపాకీ గుళ్ల వర్షంతో క్షణాల్లో శవాల కుప్పలుగా మారిపోయారు. వేలమంది ప్రాణభీతితో పరుగులు పెట్టారు. హంటర్‌ కమిటీ డయ్యర్‌ను తప్పు పట్టినా, ఆంగ్లేయ సమాజం అతడిని వీరుడిగా కొనియాడి సంస్కార హీనతను చాటుకుంది. గాంధీజీ వైఖరిని, జాతీయోద్యమం తీరును గొప్ప మలుపు తిప్పిన ఈ సంఘటనపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. 

 


గోపాలకృష్ణ గోఖలే అభిమతం మేరకు గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం తిరిగి వచ్చారు. అప్పటికే ఆయన దక్షిణాఫ్రికాలో తెల్లదొరల జాత్యాహంకార పాలనకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడిన యోధుడు. భారత్‌కు చేరిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు దేశ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేటాయించారు. అనంతరం 1917-18 మధ్య చంపారన్‌లో (బిహార్‌) ఆంగ్లేయ భూస్వాముల చేతిలో బాధితులైన ఇండిగో రైతుల దుస్థితిపై, గుజరాత్‌లోని ఖేదా జిల్లాలోని బాధిత రైతుల కోసం, అహ్మదాబాద్‌లోని వస్త్ర మిల్లు కార్మికుల జీతభత్యాల పెంపు కోసం సత్యాగ్రహ పోరాటాలు చేశారు. వాటిలో విజయం సాధించి దేశ ప్రజల దృష్టి ఆకర్షించారు.


మొదటి ప్రపంచ యుద్ధ కాలం (1914-18)లో భారతీయుల సహకారం కోసం అప్పటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్‌ అనేక హామీలిచ్చాడు. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు, యుద్ధకాలంలో మాంటేగ్‌ హామీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత జాతీయవాద నాయకత్వం వీటిని మందకొడి సంస్కరణలుగా, అచేతన వ్యవస్థలుగా, నామమాత్రపు అధికారంగా విమర్శించింది. ఒక పరాయి ప్రభుత్వం తమ స్వపరిపాలన యోగ్యతను నిర్ణయించడాన్ని జాతీయ నేతలు అంగీకరించలేదు. ‘‘భారతీయులకు యోగ్యమైన సంస్కరణలు లభించే వరకు ప్రాణాలకు తెగించి పోరాడటం కంటే గత్యంతరం లేదు’’ అన్నారు గాంధీజీ. 1918, ఆగస్టులో సయ్యద్‌ హాసన్‌ ఇమాం అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశంలో స్వపరిపాలన వ్యవస్థ తప్ప మరే విధమైన పరిపాలన తమకు ఆమోదం కాదని కాంగ్రెస్‌ తేల్చిచెప్పింది. ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమై సమరశీల జాతీయవాద కార్యకలాపాలు ఉద్ధృతమయ్యాయి.


రౌలత్‌ చట్టం     

యుద్ధకాలంలో వలస ప్రభుత్వం ఒక వైపు భారతీయుల సహాయం అర్ధిస్తూనే, మరో వైపు తీవ్ర అణచివేత చర్యలకు దిగింది. ఎందరో ఉద్యమకారులను ఉరితీసింది. ఈ క్రమంలోనే దేశంలో ఆందోళనలను ఉక్కుపాదంలో అణచివేసేందుకు జస్టిస్‌ రౌలత్‌ కమిటీ నివేదిక ఆధారంగా, 1919లో "Anarchical and Revolutionary Crimes Act 1919" తీసుకొచ్చింది. దీనినే రౌలత్‌ చట్టం అంటారు. భారతీయుల తీవ్ర నిరసనలను పట్టించుకోకుండా ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ దాన్ని ఆమోదించింది. దీంతో 1919, మార్చిలో నివేదిక చట్టరూపం దాల్చింది. దేశంలో రాజకీయ ఉద్యమాలను అణచివేయడానికి, బ్రిటిష్‌ ప్రభుత్వం 1915లో తీసుకొచ్చిన ‘డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా చట్టం’ కంటే క్రూరమైన చట్టం ఇది. పౌర హక్కులను కాలరాస్తూ పోలీసులకు విశేష అధికారాలు కల్పించింది. ఏ వ్యక్తినైనా విచారణ, నేర నిరూపణ లేకుండా నిర్బంధించేందుకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. రాజకీయ సంస్కరణల రూపంలో తమకు ఆమోదయోగ్యమైన పాలనను ఆంగ్లేయలు జాతీయవాదులు భావించారు. కానీ ప్రభుత్వం రౌలత్‌ చట్టం అనే పైశాచిక అస్త్రాన్ని ప్రయోగించడంతో అందరూ హతాశులయ్యారు.అప్పటివరకు ప్రాంతీయ సమస్యలపై సత్యాగ్రహాలు జరిపిన గాంధీజీ, జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని ఈ రౌలత్‌ చట్టం కల్పించింది. భారత జాతీయోద్యమ నాయకత్వాన్ని గాంధీజీ స్వీకరించారు. రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా ‘సత్యాగ్రహ సభ’ స్థాపించి 1919, ఏప్రిల్‌ 6న దేశవ్యాప్తంగా అహింసాయుతంగా నిరసన తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ సభ సభ్యులు రౌలత్‌ చట్టాన్ని ధిక్కరించడానికి, దాని వల్ల ఎదురయ్యే పర్యవసానాలకు సిద్ధమయ్యారు. గాంధీజీ పిలుపుతో దేశం యావత్తు స్పందించి హర్తాళ్‌ పాటించింది. ప్రజల్లో రాజకీయ అసంతృప్తి వెల్లువలా పెల్లుబికింది. హిందూ- ముస్లిం ఐక్యత వికసించింది. బొంబాయి ప్రభుత్వం అప్పటికే నిషేధించిన గాంధీజీ పుస్తకాలు ‘హింద్‌ స్వరాజ్‌’, ‘సర్వోదయ’లను ఈ ఉద్యమకాలంలో వీధుల్లో పెట్టి మరీ అమ్మడం ప్రారంభించారు. ప్రజలు వాటిని ఎక్కువ ధరకు కొని, ఉద్యమానికి నిధిని సమకూర్చేవారు. ఉద్యమ కార్యాచరణలో ప్రజలు నూతనోత్సాహంతో పాల్గొన్నారు. క్రమంగా దిల్లీ, పంజాబ్‌లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో గాంధీని నిర్బంధించడంతో, ప్రజల ఆగ్రహావేశాలు ఆకాశాన్నంటాయి.


డయ్యర్‌ దమనకాండ      

రౌలత్‌ చట్ట వ్యతిరేక సత్యాగ్రహయోధులను కఠినంగా అణచివేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ సందర్భంలో జలియన్‌ వాలాభాగ్‌ (అమృతసర్‌)లో జరిగిన అమానుష సంఘటన మానవజాతి చరిత్రకే మచ్చగా మిగిలింది. నాగరికులమని ప్రకటించుకునే తెల్లదొరల వికృత స్వరూపాన్ని బహిర్గతం చేసింది. పంజాబ్‌లో ప్రసిద్ధ నాయకులు డాక్టర్‌ సత్యపాల్, సైఫుద్దీన్‌ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది. ఈ వార్తతో ప్రజలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. దాంతో ప్రభుత్వం అమృతసర్‌లో మార్షల్‌ లా విధించింది. నగరంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జనరల్‌ డయ్యర్‌కు ఇచ్చింది. ఆ రోజు ఏప్రిల్‌ 13వ తేదీ. వైశాఖీ పర్వదినం. అమృతసర్‌లోని వాలాబాగ్‌ మైదానంలో నిరసన సభకు, అలాగే వైశాఖీ వేడుకల కోసం గ్రామీణులు, పట్టణ వాసులు సమావేశమయ్యారు. డాక్టర్‌ సత్యపాల్, డాక్టర్‌ కిచ్లూలాంటి నాయకులను ప్రభుత్వం అరెస్ట్‌ చేసిందని ప్రజలంతా కోపంగా ఉన్నారు. మరోవైపు సభలకు, సమావేశాలకు అనుమతి లేదంటూ నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. ఈ సమాచారాన్ని మొక్కుబడిగా చాటింపు వేయించారు. నిషేధాజ్ఞల విషయం మైదానానికి వచ్చినవారిలో చాలామందికి తెలియదు. మైదానం చుట్టూ ఎత్తైన గోడ. ప్రవేశ, నిష్క్రమణ మార్గం ఒక్కటే ఉంది. ప్రశాంతంగా సాగుతున్న ఆ సమావేశ మైదానాన్ని జనరల్‌ డయ్యర్‌ సాయుధ దళం చుట్టుముట్టింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జన సమూహంపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. మైదానం శవాల దిబ్బలా మారిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం వందల మంది మరణించారు. వేల మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ హఠాత్పరిణామానికి దేశమంతా నివ్వెరపోయింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన ‘నైట్‌హుడ్‌’ను త్యజించారు. దక్షిణాఫ్రికాలో బోయర్ల యుద్ధం సందర్భంగా బ్రిటిషర్లు ఇచ్చిన ‘కైజర్‌’ బిరుదును గాంధీజీ త్యజించారు. శంకరన్‌ నాయర్‌ వైస్రాయ్‌ కౌన్సిల్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు.


పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య క్షుణ్ణంగా విషయ సేకరణ చేసి 92 ప్రశ్నలను సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు పంపించాడు. ఈ అమానుష సంఘటనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మొక్కుబడిగా లార్డ్‌ హంటర్‌ అధ్యక్షతన ఒక విచారణ కమిటీని నియమించింది. భారత జాతీయ కాంగ్రెస్‌ ఈ కమిటీని బహిష్కరించి, తన సొంత విచారణ కమిటీని వేసింది. అందులో గాంధీజీ, చిత్తరంజన్‌ దాస్, ఫజుల్‌ హాక్, అబ్బాస్‌ థ్యాబ్జీ, యం.ఆర్‌.జయకర్‌లు సభ్యులు. ఈ కమిటీ వందలమంది సాక్ష్యులను విచారించి, వార్తలు సేకరించి జనరల్‌ డయ్యర్, అతడి అధికారుల దమనకాండను ఎండగట్టింది. డయ్యర్‌ను శిక్షించాలని కోరింది.


హంటర్‌ విచారణ సంఘం 1920, మే 20న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పంజాబ్‌ సంఘటనలో స్థూలంగా ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని నిర్ణయించింది. పైగా డయ్యర్‌ బుద్ధిపూర్వకంగా కాల్పులు జరపలేదని, కాని అతడి నిర్ణయంలో పెద్ద పొరపాటు (Grave error of judgement) దొర్లిందని చెప్పింది. హంటర్‌ నివేదిక రాకముందే డయ్యర్‌ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. బ్రిటిష్‌ సమాజం అతడి ప్రభుభక్తిని కొనియాడింది. ‘బ్రిటిష్‌ సామ్రాజ్య పరిరక్షకుడు’ అన్న బిరుదునిచ్చి సత్కరించింది.


సామ్రాజ్యవాదం, విదేశీపాలకుల దుర్మార్గం, అరాచకత్వాన్ని ప్రజలు గమనించారు. పంజాబ్‌ దురాగతాలకు ప్రభుత్వం బాధ్యత వహించకపోవడం, బాధ్యులపై చర్య తీసుకోకపోవడం గాంధీజీని కలచివేసింది. ఆయన వైఖరిలో కూడా తీవ్ర మార్పు వచ్చింది. ఆంగ్లేయులపై, వారి పాలనా వ్యవస్థలపై ఆయన పెంచుకున్న నమ్మకం పూర్తిగా సడలిపోయింది. ఆ విధంగా జలియన్‌ వాలాబాగ్‌ సంఘటన, జాతీయోద్యమ గతిని ప్రభావితం చేసిన ముఖ్య సంఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 07-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మౌర్యుల పరిపాలనా విధానం 

 * ప్రాచీన భారతదేశంలో ఆచరణలోకి వచ్చిన మొట్టమొదటి సక్రమమైన పాలనగా మౌర్యుల పాలనను చరిత్రకారులు అభివర్ణించారు. మౌర్యుల పరిపాలనా వ్యవస్థను ‘కేంద్రీకృత ఉద్యోగస్వామ్యం’గా పేర్కొన్నప్పటికీ, రాజు నిరంకుశ అధికారాలను కలిగి ఉండేవాడు. వీరి పరిపాలన పితృస్వామిక స్వభావాన్ని కలిగి ఉంది.

* మౌర్యచక్రవర్తులు తాము స్థాపించిన విశాల సామ్రాజ్యంలో సమర్థవంతమైన కేంద్రీకృతపాలనను ప్రవేశపెట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు, జిల్లాలకు, గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించి సుస్థిరపాలనను అందించారు. వీరి పాలనను నేటికీ మనం అనుసరిస్తున్నాం.


కేంద్ర ప్రభుత్వం: రాజు కేంద్ర ప్రభుత్వంలో సర్వాధికారి. పాలనావ్యవహారాల్లో రాజుకు సహాయం చేసేందుకు అనేకమంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేసేవారు. 

* ‘‘పాలన అనేది ఒకరు చేసేది కాదు. ఒక వాహనాన్ని నడపడానికి చక్రాలు ఏ విధంగా అవసరమో, పాలన సక్రమంగా సాగేందుకు అనేకమంది ఉద్యోగులు అవసరం’’ అని కౌటిల్యుడు పేర్కొన్నాడు. 

* కేంద్ర ప్రభుత్వంలో రాజుతోపాటు రాష్ట్ర గవర్నర్లు, రాజప్రతినిధులు, మంత్రులు, వివిధ శాఖల అధిపతులు, ముఖ్య కార్యనిర్వాహకులు, గ్రామపాలనలోని ముఖ్య ఉద్యోగులు ఉండేవారు. వీరినే కౌటిల్యుడు రాజ్యానికి సంబంధించిన ‘సప్తాంగులు’ అని ప్రస్తావించాడు.


మంత్రి పరిషత్‌: పరిపాలనలో రాజుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మంత్రి పరిషత్‌ ఉండేది. రాజనీతి, విజ్ఞానం, తెలివి కలిగిన వారిని ఈ పదవికి ఎంపిక చేసేవారు.

*మంత్రి పరిషత్‌లో పురోహితుడు, సేనాపతి, యువరాజు, ఇతర మంత్రులు సభ్యులుగా ఉంటారు. దీనికి ఒక కార్యనిర్వాహక అధికారి ఉంటాడు.

*అశోకుడి మూడు, నాలుగో శిలాశాసనాల ప్రకారం, అత్యవసర సమయాల్లో మంత్రి పరిషత్‌ సమావేశం అయ్యేది. మహామంత్రి రాజుకు, మంత్రిపరిషత్‌కు వారధిగా పనిచేస్తాడని అర్థశాస్త్రం పేర్కొంది.

* ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించడం, నూతన పథకాల అమలు, వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయడం మంత్రి పరిషత్‌ విధులు.


ఉద్యోగ వ్యవస్థ: కేంద్ర ప్రభుత్వంలో 32 పాలనా శాఖలకు ఉన్నతోద్యోగులు ఉండేవారు. వీరు శాఖలకు అధ్యక్షులుగా ఉండి, సామాజిక, ఆర్థిక, పాలనా అధికారులతో సంబంధాలు కలిగి ఉండేవారు. 

మౌర్య రాజ్యంలో అక్షపటలాధ్యక్ష (గణాంకాలు), అకరాధ్యక్ష (గనులు), సువర్ణాధ్యక్ష (బంగారం), కోశాధ్యక్ష (కోశాగారం), పాణ్యాధ్యక్ష (వాణిజ్యం), కుప్యాధ్యక్ష (అటవీ ఉత్పత్తులు), ఆయుధాగారాధ్యక్ష (ఆయుధాల ఉత్పత్తి - నిర్వహణ), పౌతాధ్యక్ష (తూనికలు, కొలతలు), శుల్కాధ్యక్ష (కస్టమ్స్‌), లోహాధ్యక్ష (ఇనుము), సీతాధ్యక్ష (రాజభూములు), రథాధ్యక్ష (రథాలు), హస్తాధ్యక్ష (ఏనుగులు), ముద్రాధ్యక్ష (పాస్‌పోర్టు), పట్టణాధ్యక్ష (ఓడరేవులు), దేవతాధ్యక్ష (మత సంస్థలు), లక్షణాధ్యక్ష (నాణేల ముద్రణ), సమస్తాధ్యక్ష (వాణిజ్య, వ్యాపార, రహదారులు) మొదలైన అధ్యక్షులు ఉండేవారు. వీరంతా రాజుకు సహాయపడేవారు.

* ప్రభుత్వ ఆదాయాన్ని ధన, ధాన్య రూపంలో భద్రపరిచే అధికారిని ‘సన్నిధాత’; రెవెన్యూ వసూలు అధికారిని ‘సమాహర్త’ అనేవారు. వీరు రాజ్యంలో అత్యంత కీలకమైన స్థానాల్లో ఉండేవారు. 

* ‘తీర్థులు’ అనే ఉద్యోగులు సాధారణ మంత్రిమండలి పాలనలో తోడ్పడేవారు.

*‘యుక్త’ గణాంక అధికారి. ‘ప్రాదేశిక’ ప్రాంతాధికారి. ఇతడు ఆ ప్రాంత ప్రజాసంక్షేమ, న్యాయాధికారిగా ఉండేవాడు.

‘ప్రతివేదిక’ అనే అధికారి రాజుకు ఉపయోగపడే సమాచారాన్ని సేకరించి, అందించేవాడు. 

* అప్పటి ఆర్థిక సంవత్సరం ఆషాఢమాసం (జులై)లో ప్రారంభమయ్యేది. 

* ఆదాయంలో అధికభాగం సైన్యపోషణ, ఉద్యోగుల జీతాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు కేటాయించేవారు. 

* మంత్రి, పురోహితుడు, సేనానికి 48,000 పణాలు; మంత్రిపరిషత్‌లోని ఇతర సభ్యులకు 12,000 పణాలు; కిందిస్థాయి ఉద్యోగులకు 500 పణాలు జీతాలుగా చెల్లించేవారు.


రాజ్య విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్యులు తమ రాజ్యాన్ని జనపదాలు, ప్రదేశాలు, ఆహారాలు, విషయాలుగా విభజించారు.

* ప్రతిదశలోనూ అధికారులు పాలనను నిర్వహించేవారు. ప్రజా సమస్యలను పౌరసభ, జనపదసభల ద్వారా తెలుసుకునేవారు.

* అశోకుడి శాసనాల్లో తక్షశిల, ఉజ్జయిని, తోసలి, సువర్ణగిరి అనే నాలుగు రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. 

*రాష్ట్రాల్లోనూ కేంద్రప్రభుత్వంలో ఉన్నట్లే మంత్రులు ఉండేవారు. 

ప్రతి రాష్ట్రాన్ని కొన్ని ప్రదేశాలుగా విభజించారు. వాటి పాలనకు ప్రాదేశిక, రజ్జుక, యుక్త అనే ఉద్యోగులు ఉండేవారు. 

*‘ప్రాదేశిక’ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాజశాసనాల అమలు, శాంతిభద్రతల నిర్వహణ చేసేవాడు. రజ్జుకులు న్యాయ నిర్వహణ, పంటపొలాల సర్వే చేసి పన్నులు విధించేవారు. వీరు ప్రాదేశికుల కింద పనిచేసేవారు. 


నగర పాలన: మౌర్యుల పాలనలో నగరపాలన ప్రముఖమైంది. మెగస్తనీస్‌ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరపాలనను వివరించాడు. 

* ప్రతి నగరంలో శాంతిభద్రతల నిర్వహణకు ‘నగరిక’ అనే అధికారి ఉండేవాడు. 

* పాటలీపుత్ర నగరపాలన కోసం పరిశ్రమలు, విదేశీయుల సంక్షేమం, జనన-మరణాల నమోదు, వర్తక-వ్యాపారం, ఉత్పత్తి చేసిన సరకులపై పర్యవేక్షణ, పన్ను వసూలు అనే ఆరు ప్రధాన కమిటీలు ఉండేవి. ప్రతిదానిలో అయిదుగురు సభ్యుల చొప్పున మొత్తం 30 మంది సభ్యులు ఉండేవారు. 

* నగర పారిశుద్ధ్యం, ప్రజాహిత కార్యక్రమాలు, దేవాలయాలు - మార్కెట్ల నిర్వహణ లాంటి బాధ్యతలు ఈ కమిటీలు నిర్వహించేవి. 

* నగరపాలనలో గోప, స్థానిక అనే ఉద్యోగులు నాగరికుడికి తోడ్పడేవారు.


రెవెన్యూ విధానం: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు ‘భూమిశిస్తు’. ఈ ఆదాయం ధన, ధాన్య రూపంలో ఉండేది. భూమి శిస్తే కాకుండా గనులు, అడవులు, రహదారులు, వస్తు పన్నులు, అపరాధ రుసుముల నుంచి కూడా ఆదాయం వచ్చేది. 

* ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాజ్యంలో గిడ్డంగులు నిర్మించారు. కొన్ని బౌద్ధ క్షేత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చాడు.  

* ఆ కాలంలో భాగ, పిండాకార, కార, హిరణ్య అనే పన్నులు ఉండేవి.


గూఢచారి విధానం: అర్థశాస్త్రంలో ‘సాత్రిన్స్‌’ అనే ప్రత్యేక గూఢచారి దళాన్ని కౌటిల్యుడు పేర్కొన్నాడు. వీరిని రాజుకు చెవులు, కళ్లుగా పేర్కొంటారు. రాజ్యంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు రాజుకు చేరవేయడం వీరి విధి. 

* అనాథలు, బ్రాహ్మణులు, వితంతువులు, శూద్రస్త్రీలు, వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులను గూఢచారులుగా నియమించేవారు. 

* వీరిని నేరపరిశోధనకు, ప్రజాభిప్రాయ సేకరణకూ ఉపయోగించేవారు. 

* ఆ కాలంలోనూ డిటెక్టివ్‌ వ్యవస్థ ఉండేది. వీరిని ‘గద పురుషులు’ అనేవారు. 

గూఢచారి వ్యవస్థలో ‘సంస్థాన్‌’, ‘సంచారి’ అని రెండు భాగాలు ఉండేవి. సంస్థాన్‌ సభ్యులు సమాచారాన్ని కోడింగ్‌-డీకోడింగ్‌ రూపంలో, రహస్య భాషలో పంపేవారు. సంచారులు రాజ్యంలో తిరుగుతూ సమాచారాన్ని సేకరించేవారు. వీరు సమాచారాన్ని చేరవేసేందుకు పావురాలను వాడేవారు.


గ్రామ పాలన: మౌర్యుల పాలనలో అతిచిన్న పాలనా విభాగం గ్రామం. 

* గ్రామాల్లో ‘గ్రామిక’ అనే ఉద్యోగి పన్ను వసూలు, శాంతి భద్రతల రక్షణ చేసేవాడు. పెద్ద గ్రామాల్లో గ్రామికకు గణక, లేఖక అనే ఉద్యోగులు సాయపడేవారు. గోప ఆధీనంలో గ్రామికులు పనిచేసేవారు. ‘స్థానిక’ అనే ఉద్యోగి వంద గ్రామాలకు అధికారిగా ఉండేవాడు.


రాజు: మౌర్యుల పరిపాలనలో రాజే సర్వాధికారి. పాలన, న్యాయ విషయాల్లో అతడే అన్ని నిర్ణయాలు తీసుకునేవాడు. తనకు కావాల్సిన మంత్రి మండలి సభ్యులను రాజే స్వయంగా నియమించేవాడు.

చట్టాలను రూపొందించడం, ప్రభుత్వ నియమాలను పాటించడం, న్యాయపాలన చేయడం రాజు ప్రధాన విధి. 

* ప్రజాసంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం, రాజ్యంలో శాంతి భద్రతలు కాపాడి, ప్రజలను రక్షించడం రాజు ప్రధాన కర్తవ్యం. 

* అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాజుకు ఉండాల్సిన కొన్ని ముఖ్య లక్షణాలను వివరించాడు. వాటిలో ముఖ్యమైనవి: రాజు అయ్యే వ్యక్తి ప్రజలకు మార్గదర్శకుడిగా, ఆ రాజ్యానికి చెందినవాడై, ధర్మశాస్త్రాల్లో నిపుణుడై ఉండాలి. మంచి శరీర సౌష్ఠవం, ధైర్యం కలిగి, నిజాయతీగా రాజ్యపాలన చేయాలి. మంచి రాజకుటుంబంలో జన్మించి, ఎలాంటి అనారోగ్యానికి గురికాని వ్యక్తిని రాజుగా నియమించాలని సూచించాడు.


సైనికపాలన: మౌర్యులు సమర్థవంతమైన సైన్యాన్ని పోషించారు. రాజు సర్వసైన్యాధిపతి. 

* ప్లినీ (గైనస్‌ ప్లినియస్‌ సెకండస్‌) అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం, మౌర్య సైన్యంలో 6 లక్షల కాల్బలం, 30 వేల అశ్వదళం, 9000 ఏనుగులు, 1000 రథాలు ఉండేవి. 

* ప్లూటార్క్‌ తన రచనల్లో రాజ్యంలో 80 వేల అశ్వదళం, 2 లక్షల కాల్బలం, 8 వేల రథాలు, 6 వేల గజబలం ఉండేదని రాశాడు. 

* సైనిక నిర్వహణకు 30 మంది సభ్యులు ఉన్న 6 కమిటీలు ఉండేవని మెగస్తనీస్‌ ఇండికాలో పేర్కొన్నాడు. అవి: నావికాదళం, సైనిక రవాణా, కాల్బలం, అశ్వదళం, రథబలం, గజబలం.

* సైనికులకు జీతాలు చెల్లించేవారు. ప్రతి సైనికుడికి సైనిక దుస్తులు, ఆయుధాలు ఇచ్చేవారు. సైనికుల బాగోగుల కోసం వివిధ రకాల వ్యవస్థలు ఉండేవి. సైన్యానికి క్రమశిక్షణ, యుద్ధవిద్యలు నేర్పించడం వీరి ప్రధాన విధి. 


న్యాయపాలన: న్యాయపాలనలో రాజే న్యాయనిర్ణేత. రాజు ఆస్థానమే ఉన్నత న్యాయస్థానం.

* ఆస్తిహక్కు తగాదాల పరిష్కారానికి ‘ధర్మస్థేయ’, అపరాధ విచారణ కోసం ‘కంఠక శోధన’ అనే న్యాయస్థానాలు ఉండేవి. 

* శిక్షలు కఠినంగా అమలు చేసేవారు. అశోకుడి కాలంలో వీటిని కొంత సడలించారు. ఉరిశిక్ష అమల్లో ఉండేది. 

మరణశిక్ష, అంగవిచ్ఛేదనం లాంటివి సాధారణ శిక్షలు. అసత్యమాడటం, పన్నులు ఎగ్గొట్టడం లాంటి నేరాలు చేసేవారిని కఠినంగా శిక్షించే వాళ్లు. 18 రకాల శిక్షలు అమల్లో ఉండేవి.


ప్రజాసంక్షేమ కార్యక్రమాలు: ప్రజల సౌకర్యం కోసం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు. వీటిని ‘పబ్లిక్‌ వర్క్స్‌’ శాఖ నిర్వహించేది. 

* రహదారుల వెంట చెట్లు నాటడం; పాదచారుల కోసం 1 - 2 మీటర్లు, రథాలకు 10 మీ., ట్రంక్‌ రోడ్లకు సుమారు 20 మీ. వెడల్పుతో రోడ్లు నిర్మించారు. 

* మంచి నీరు, వైద్యశాలలు, పాఠశాలలు, దేవాలయాలు, ధార్మిక సంస్థలు, బ్రిడ్జ్‌లు, డ్యాంలు, మార్కెట్లు, విశ్రాంతి గృహాలను ప్రభుత్వమే నిర్మించేది. 

* జంతువులకు కూడా ప్రత్యేక సదుపాయాలు ఉండేవి.


నీటి పారుదల: వ్యవసాయాభివృద్ధికి పెద్ద కాలువలు, బావులు, చెరువులు నిర్మించారు. మంచినీటి సదుపాయం ఉండేది. 

నీటిని నిల్వ చేసేందుకు పెద్ద సరస్సులు ఉండేవి. 

* చంద్రగుప్త మౌర్యుడి రాష్ట్ర గవర్నర్‌ ‘పుష్యగుప్తుడు’ గిర్నార్‌లో (గుజరాత్‌) ‘సుదర్శన తటాకాన్ని’ నిర్మించాడు. అశోకుడి కాలంలో తుషాష్పా ఈ తటాకానికి మరిన్ని కాలువలు నిర్మించి నీటిపారుదలకు కృషి చేశాడు.


జనాభా లెక్కలు: ప్రపంచ చరిత్రలోనే మౌర్య రాజులు మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ నిర్వహించారు. ఈ విషయాన్ని మెగస్తనీస్, కౌటిల్యుడు పేర్కొన్నారు. 

జనన, మరణాలను పుస్తకంలో రాసేవారు. పెద్ద నగరాల్లో ‘నాగరిక’ లెక్కలు సేకరించేవాడు. విదేశీయాత్రికులు, వ్యాపారుల సమాచారాన్ని వీరు సేకరించేవారు.

Posted Date : 31-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సహాయ నిరాకరణ ఉద్యమం

భారత జాతి ధిక్కారం!

 

ఆ ఉద్యమంలో భారత జాతి చాటిన ధిక్కారం ఆంగ్లేయులను ఆశ్చర్యానికి గురిచేసింది. విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ ఉద్ధృతంగా జరిగిన పోరు దేశాన్ని మరింత బలంగా ఏకం చేసింది. జాతీయవాదులందరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది. స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. హిందూ, ముస్లింల మధ్య ఐక్యత వెల్లివిరిసింది. అన్నింటికీ మించి మొదటిసారి గాంధీజీ సారథ్యంలో సాగిన సహాయ నిరాకరణ సమరం, అహింసా మార్గంలో పోరాటాల శక్తిని నిరూపించింది. కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాలు అందులో భాగమయ్యాయి.

 

 

భారతదేశ స్వాతంత్య్ర సమర చరిత్రలో గాంధీజీ నాయకత్వంలో నిర్వహించిన ‘సహాయ నిరాకరణ ఉద్యమం (1920 - 22)’ అత్యంత స్ఫూర్తిదాయక ఘట్టం. మన జాతి ఉవ్వెత్తున ఉద్యమించి, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వణుకు పుట్టించిన ప్రజా పోరాటం. 


జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ: 1919లో ఆంగ్లేయులు చేసిన భారత ప్రభుత్వ చట్టం - 1919 ప్రజలకు నిరాశను మిగిల్చింది. అదే సమయంలో దేశంలో వ్యాపిస్తున్న తీవ్ర వ్యతిరేకతను కఠినంగా అణచి వేసేందుకు తెచ్చిన రౌలత్‌ చట్టంపైనా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. పౌర హక్కులను హరించే సైతాన్‌ చట్టంగా గాంధీజీ దానిని అభివర్ణించారు. ప్రజలంతా చైతన్యవంతులై రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పుడే దేశం విముక్తి పొందుతుందని పిలుపునిచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 6న రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం జరిగింది. హర్తాళ్లు, సమ్మెలు ఉద్ధృతంగా సాగాయి. హిందూ-ముస్లిం ఐక్యత పరిఢవిల్లింది. విదేశీ పాలన పట్ల ప్రజల్లో విముఖత వ్యక్తమైంది. 


ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. ప్రజలపై దమనకాండకు దిగింది. పంజాబ్‌ ప్రాంతం కల్లోలంగా మారింది. ప్రజా నాయకులైన డాక్టర్‌ సైౖఫుద్దీన్‌ కిచ్లూ, డాక్టర్‌ సత్యపాల్‌ల అరెస్ట్‌కు నిరసనగా అమృత్‌సర్‌ జలియన్‌వాలా బాగ్‌ మైదానంలో ఏప్రిల్‌ 13న సమావేశమైన నిరాయుధ జనసమూహంపై, సైనికాధికారి డయ్యర్‌ తన సైనికదళాలతో కాల్పులు జరిపించాడు. వందలాది మంది మరణించగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ దారుణంతో దేశ వ్యాప్తంగా భయానక వాతావరణం ఏర్పడింది. నాగరీకులమని ప్రకటించుకునే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల వికృత హింసా ధోరణి ప్రపంచానికి బహిర్గతమైంది. భారతీయ రచయితలూ, మేధావులు, మానవతావాదులు ప్రభుత్వం ఇచ్చిన గౌరవ బిరుదులూ, హోదాలను త్యాగం చేసి, సామాన్య ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఆ తీవ్ర నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం విచారణ కోసం హంటర్‌ కమిషన్‌ను నియమించింది. అది నామమాత్రంగా పని చేసి డయ్యర్‌ను ఆరోపణల నుంచి విముక్తుడిని చేసింది. కాంగ్రెస్‌ నియమించిన గాంధీ, మోతీలాల్‌ నెహ్రూ, చిత్తరంజన్‌ దాస్, జయకర్, అబ్బాస్‌ త్యాబ్జిలతో కూడిన విచారణ సంఘం సాక్ష్యాధారాలను పరిశీలించి, హింసాకాండకు డయ్యర్‌ పూర్తి బాధ్యుడని తేల్చింది. పంజాబ్‌ మారణకాండ దేశప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది.

 

ఖిలాఫత్‌ సమస్య: భారత దేశంలోని ముస్లింలు టర్కీ (ప్రస్తుత తుర్కియే) దేశాధినేత సుల్తాన్‌ను తమ మత గురువుగా (ఖలీఫా) గౌరవిస్తారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ, జర్మనీ పక్షాన చేరి, మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలకు వ్యతిరేకంగా పోరాడి ఓడింది. మిత్ర రాజ్యాలు టర్కీ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా, ఖలీఫా పదవి రద్దు చేయడానికి నిశ్చయించాయి. ఈ పరిస్థితుల్లో  టర్కీ సామ్రాజ్యానికి, ఖలీఫా వైభవానికి భంగం కలిగించవద్దని బ్రిటిష్‌ ప్రభుత్వానికి భారతీయ ముస్లింలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మౌలానా మొహమ్మద్‌ అలీ, షౌకత్‌ అలీ సోదరుల నాయకత్వంలో ఖిలాఫత్‌ కమిటీ ఏర్పడింది. హకీమ్‌ అఫ్జల్‌ఖాన్, హస్రత్‌ మొహాని, మౌలానా ఆజాద్‌ లాంటివారు ఈ కమిటీలో సభ్యులు. ఖలీఫా స్థానాన్ని భంగపరిస్తే దేశవ్యాప్తంగా ఉద్యమించాలని కమిటీ నిర్ణయించింది. 1920లో మిత్ర రాజ్యాలు టర్కీపై విధించిన షరతుల్లో ఖలీఫా పదవి పునరుద్ద్ధరణ ప్రస్తావన లేదు. దాంతో మన దేశంలోని ముస్లింలు ఖిలాఫత్‌ ఉద్యమానికి సిద్ధమయ్యారు.  


1920, మే 28న బొంబాయిలో జరిగిన సమావేశంలో గాంధీజీ సూచనతో సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ఖిలాఫత్‌ కమిటీ ఆమోదించింది. జూన్‌ మొదటి వారంలో అలహాబాదులో జరిగిన హిందూ-ముస్లింల సమావేశంలో ఆ పోరాటానికి హిందువుల సహకారాన్ని కోరుతూ కమిటీ విజ్ఞప్తి చేసింది. హిందూ-ముస్లింలను ఏకం చేయడానికి ఖిలాఫత్‌ ఉద్యమం ఒక సువర్ణావకాశమని గాంధీజీ, ఇతర కాంగ్రెస్‌ నాయకులూ భావించారు. 1920, జూన్‌లో అలహాబాదులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఖిలాఫత్‌ సహాయ నిరాకరణ ఉద్యమం జరపాలని నిర్ణయించి, ఇందుకు సారథ్యం వహించాలని గాంధీజీని కోరారు. ఈ ఉద్యమం 1920, ఆగస్టులో ప్రారంభమైంది. 1920, సెప్టెంబరులో కలకత్తాలో లాలా లజపతిరాయ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశంలో స్వరాజ్య సాధనకు సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని నిర్ణయించారు. అదే ఏడాది డిసెంబరులో సి.విజయరాఘవాచారి అధ్యక్షతన నాగ్‌పుర్‌ వార్షిక సమావేశంలో కాంగ్రెస్‌ ఆ నిర్ణయాన్ని ఆమోదించింది.

 

సహాయ నిరాకరణ ఉద్యమ కార్యక్రమం: బహిష్కరణలు, స్వదేశీ నినాదం, జాతీయ విద్య ఈ ఉద్యమంలో ప్రధాన అంశాలు. బహిష్కరణ అంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు, విదేశీ వస్తువులను బహిష్కరించడం. ప్రభుత్వం ఇచ్చిన బిరుదులు, గౌరవ పదవులను వదులుకోవడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వైదొలగడం. కేంద్ర రాష్ట్ర శాసన సభలకు జరిగే ఎన్నికలను బహిష్కరించడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం ఉద్యమంలో భాగం. జాతీయ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడం, వివాదాల  పరిష్కారం కోసం పంచాయతీల పేరుతో న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం. స్వదేశీ భావనను పెంపొందిస్తూ, ఖాదీ తయారీకి చేతులతో నూలు వడకడం. హిందూ ముస్లిం ఐక్యత, అంటరానితనం నిర్మూలన వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టడం. అహింసను సంపూర్ణంగా అమలు చేయాలని గాంధీజీ ఉద్బోధించారు. ఒక సంవత్సరంలో స్వరాజ్యం సిద్ధిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.


లక్ష్యాలు: పంజాబ్‌ దురాగతాలకు బ్రిటిష్‌ ప్రభుత్వం  క్షమాపణ చెప్పడం, స్వరాజ్యం, టర్కీ సుల్తాన్‌ పూర్వస్థితిని పునరుద్ధరించడం ఉద్యమ డిమాండ్లు.

 

ఉద్యమ గతి: 1921 - 22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ప్రజల్లో అమితమైన ఉత్సాహం వ్యక్తమైంది. విదేశీ వస్త్రాల బహిష్కరణ విజయవంతమైంది. వాటిని కుప్పలుగా పోసి వీధుల్లో తగలబెట్టారు. విదేశీ వస్త్ర దిగుమతులు పడిపోయాయి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించారు. అనేకమంది ప్రసిద్ధ న్యాయవాదులైన ఎంఆర్‌ జయకర్, ప్రకాశం పంతులు, సీఆర్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ, సైఫుద్దీన్‌ కిచ్లూ, వల్లభాయ్‌ పటేల్, రాజగోపాలచారి, అసఫ్‌ అలీ తదితరులు  తమ ప్రాక్టీస్‌లను వదులుకున్నారు. విదేశీ కోర్టులను బహిష్కరించారు. భారతదేశ సందర్శనకు వస్తున్న వేల్స్‌ రాకుమారుడి పర్యటనను ఉద్యమకారులు బహిష్కరించారు. మద్యపానాన్ని నిషేధించాలంటూ కల్లు దుకాణాల ముందు ఉద్ధృతంగా ధర్నాలు చేశారు. దాంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. తిలక్‌ స్వరాజ్య నిధి సేకరణ రూ.కోటి లక్ష్యాన్ని దాటింది. జాతీయోద్యమానికి ఖాదీ ఒక యూనిఫామ్‌గా మారిపోయింది. గాంధీజీ పిలుపుతో కార్యకర్తలు స్వచ్ఛందంగా జైళ్లకు వెళ్లడానికీ సిద్ధమయ్యారు. ఖిలాఫత్‌ నాయకులైన అలీ సోదరులతో కలిసి గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. తీవ్రరూపం దాల్సిన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఉద్యమకారులను విచక్షణారహితంగా అరెస్ట్‌ చేసింది. ఈ ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలో చీరాల - పేరాల సత్యాగ్రహం, పల్నాడులో అటవీ సత్యాగ్రహం, పెదనందిపాడులో పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగాయి.

 

చౌరీ చౌరా సంఘటన (1922): సహాయ నిరాకరణోద్యమం తారస్థాయికి చేరుకున్న సమయంలో, 1922, ఫిబ్రవరి 5న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో చోటుచేసుకున్న ఒక  సంఘటన ఉద్యమాన్ని అకస్మాత్తుగా నిలిపేసేందుకు కారణమైంది. 

ఆ గ్రామంలో ఊరేగింపుగా వెళుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. కోపోద్రిక్తులైన ప్రజలు, పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ఆ హింసాత్మక ఘటనతో గాంధీజీ ఉద్యమాన్ని వెంటనే ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యను నాటి కాంగ్రెస్‌ నాయకులు చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ 1922, ఫిబ్రవరి 12న బార్డోలీలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ గాంధీజీ నిర్ణయాన్ని ఆమోదించింది. ఉద్యమం నిలిచిపోయింది. ప్రభుత్వం గాంధీజీపై దేశద్రోహం నేరం మోపి అరెస్టు చేసింది. టర్కీలో ముస్తఫా కెమల్‌ పాషా ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగి, సుల్తాన్‌ను పదవీచ్యుతుడిని చేయడంతో ఖిలాఫత్‌ ఉద్యమం కూడా ఆగిపోయింది.


సహాయ నిరాకరణ ఉద్యమ ఫలితాలు: ఈ ఉద్యమం లక్ష్యంగా పెట్టుకున్న డిమాండ్లను సాధించలేకపోయినప్పటికీ, కొన్ని మంచి ఫలితాలను అందించింది. అప్పటి వరకు భిన్న వర్గాల ప్రజలు తమ ప్రయోజనాల కోసం బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలు సాగించారు. కానీ గాంధీజీ నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం  జాతీయోద్యమంగా మారింది. దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమనే ప్రజల కృత నిశ్చయం సంపూర్ణంగా వ్యక్తమైంది. హిందూ ముస్లిం ఐక్యతను సాధించింది. జాతీయవాద భావం, జాతీయోద్యమం దేశంలోని మారుమూల ప్రాంతాలకూ వ్యాపించాయి. తర్వాత దశలో జరిగిన శాసనోల్లంఘన, క్విట్‌ ఇండియా లాంటి ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. ప్రజల్లో బ్రిటిష్‌ సామ్రాజ్యశక్తిని ఎదిరించగలమనే ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. 

ర‌చ‌యిత‌:  వి.వి.ఎస్‌.రామావ‌తారం

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సంస్కృతి

     చరిత్ర అంటే రాజకీయ చరిత్రే కాదు.. సామాజిక, సాంస్కృతిక చరిత్ర కూడా ప్రధానం. దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1, 2, 3; ఇతర పరీక్షల సిలబస్‌లో సామాజిక సాంస్కృతిక చరిత్రకు పెద్దపీట వేసింది. గ్రూప్-1, 2 జనరల్ స్టడీస్ పేపర్‌లో ప్రకటించిన సిలబస్‌లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేరుగా రాజకీయ చరిత్రను ఎక్కడా పేర్కొనలేదు. గ్రూప్-1లో భారతదేశానికి సంబంధించి 'భారతదేశ చరిత్ర-సాంస్కృతిక వికాసం' అని, తెలంగాణకు సంబంధించి 'తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, కళలు, సాహిత్యం' అని పేర్కొన్నారు. అయితే రాజకీయ చరిత్ర నుంచి కూడా ప్రశ్నలు వస్తాయనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.
     ''సమ్యక్ కృతి సంస్కృతి.. అంటే 'చక్కగా తీర్చిదిద్దినదీ' అని అర్థం. సంస్కృతి అంటే 'సంస్కరించి నది' ఈ సంస్కరించడమనేది నాగరకత పరంగా కావచ్చు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టూబొట్టు, కళలు, సాహిత్యం.. ఇలా ఒక జాతి ప్రజల జీవన విధానమే సంస్కృతి.''
     ఒక జాతి / దేశం / ప్రజలు హీన స్థితి నుంచి మహోన్నత స్థితికి చేరడానికి చేసే ప్రయత్నమే సంస్కృతి. అంటే నాగరకత పరంగా ఆదిమ దశ నుంచి ఉన్నత స్థితికి.. సంచార స్థితి నుంచి స్థిర జీవితం గడిపే దశకు.. అవ్యవస్థీకృతమైన పాలన (ఉదా: తెగలు) నుంచి సువ్యవస్థీకృతమైన ప్రజాస్వామ్య పాలన దిశగా పయనించడానికి జరిగిన ప్రయత్నాలు.. ఈ పరిణామాలను క్రమానుగతంగా అధ్యయనం చేయడమే సంస్కృతి చరిత్ర.

 

చరిత్ర - సంస్కృతి
చరిత్ర, సంస్కృతి అనే మాటలను అనేక సందర్భాల్లో ఒకే పదబంధంగా ప్రయోగిస్తున్నారు. ఈ రెండింటికీ నిర్దిష్ట వ్యత్యాసం ఉంది. చరిత్ర కేవలం రాజకీయ చరిత్రకు (పాలకులకు) ప్రాధాన్యమివ్వగా.. సంస్కృతి ప్రజల (పాలితులు) చరిత్రను విశదీకరిస్తుంది. ప్రజల సమగ్ర విధానాన్ని చిత్రించేదే సంస్కృతి.
     20వ శతాబ్దం వరకు చరిత్రను రాజకీయ చరిత్రగానే భావించారు. ఎప్పుడైతే గతి తార్కిక భౌతికవాద దృక్పథంతో చరిత్రను అధ్యయనం చేయడం ప్రారంభమైందో.. అప్పటి నుంచి సామాజిక చరిత్రకు, సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యం పెరిగింది. మహాకవి గురజాడ అప్పారావు 'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అన్నారు. మహాకవి శ్రీశ్రీ రచించిన 'దేశ చరిత్రలు' అనే ఖండిక చరిత్రకు కొత్త భాష్యం చెప్పింది.
     'తారీఖులు, దస్తావేజులు, ఏ యుద్ధం ఎందుకు జరిగింది? ఆ ముట్టడికి అయిన ఖర్చు.. ఇవి కావోయ్ చరిత్రకు అర్థం. నైలునదీ నాగరకతలో సామాన్యుని జీవితమెట్టిది? ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు.. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. అది మోసిన బోయిలెవ్వరు?' అంటూ మహాప్రస్థానం ద్వారా చరిత్ర అధ్యయన గతిని మలుపు తిప్పారు శ్రీశ్రీ.

     భారతదేశంలో ప్రఖ్యాత చరిత్రకారులు రొమిలా థాపర్, ఎ.ఎల్.భాషమ్, డి.డి.కోశాంబి కృషి ఫలితంగా ప్రజల సామాజిక, సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనికి గతి తార్కిక భౌతిక దృష్టి, దృక్ఫథం తోడయ్యాయి. నాటి సమకాలీన సాహిత్యాన్ని కూడా ఈ ధోరణి ప్రభావితం చేసింది. తెలుగునాట అభ్యుదయ కవిత్వానికి ఇది ఆలంబనగా నిలిచింది.తెలంగాణ ప్రాంతం నుంచి మొదటి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందిన రచన కూడా ప్రజల చరిత్రే. తెలంగాణ భాష, సాంస్కృతిక ఉద్యమాల్లో ప్రధాన భూమిక పోషించిన సురవరం ప్రతాపరెడ్డి రచించిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' అనే గ్రంథానికి ఈ పురస్కారం దక్కింది. తెలుగులో మరో ప్రముఖ సాంస్కృతిక చరిత్ర గ్రంథం ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం రచించిన 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి'. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేశారు.
 

భారతీయ సంస్కృతి ప్రాతిపదిక
     సంస్కృతి రూపొందడంలో ప్రధానంగా రెండు విభిన్నమైన సిద్ధాంతాలున్నాయి. ఒకటి ఆదర్శవాద సిద్ధాంతం, మరొకటి భౌతికవాద సిద్ధాంతం.

 

ఆదర్శవాద సిద్ధాంతం
     వేద కాలంలో రుషులు దైవ ప్రేరణ / అతీంద్రియ శక్తుల వల్ల ఏర్పరచుకున్న భావాలు కాలక్రమేణా ఆర్యుల సంస్కృతికి బీజాలు వేశాయి. వీరు ఈ ఆదర్శాన్ని సింధు, గంగా నది పరిసరాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆచరించారు. వీటి మూలంగా ఏర్పడిన భావాలు, సంస్థలు వేద సంస్కృతికి ప్రధానమైన భావాలు, సంస్కృతులుగా పరిణమించాయి.

 

భౌతికవాద సిద్ధాంతం
     ఒక సంస్కృతి ప్రారంభమవడానికి భౌతిక పరిసరాలే మౌలికమైన అవసరాలు / అంశాలు. ఆదిమ దశలో పరిసర వాతావరణం, భౌతిక వనరులు, ప్రజలు ఉపయోగించిన ఉత్పాదక సాధనాలు మానవ సమష్టి జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. తద్వారా జీవితానుభవాల్లో తారసిల్లిన సిద్ధాంతాలకు, విశ్వాసాలకు స్థానం ఏర్పడి క్రమంగా నూతన సిద్ధాంతాలుగా, ప్రధానమైన భావాలుగా రూపుదిద్దుకున్నాయి.

     చారిత్రక, పురావస్తు శాస్త్ర అధ్యయనం ప్రకారం.. భౌతిక పరిసరాలు, ఆది భౌతిక సిద్ధాంతాల సమన్వయ ఫలితంగానే 'సంస్కృతి' పరిణామం చెందింది. ఈ రెండు సిద్ధాంతాల్లోనూ సంస్కృతి పరిణామ దశలో భౌతిక పరిసరాలు ప్రముఖ పాత్రను పోషించాయి. ప్రఖ్యాత చరిత్రకారుడు ఎస్.ఆబిద్‌హుస్సేన్ అభిభాషణ ప్రకారం.. భావాలు, సిద్ధాంతాలు, నమ్మకాల కంటే భౌతిక పరిసరాలు, సామాజిక పరిస్థితులే సంస్కృతి పరిణామానికి ప్రధానంగా దోహదం చేశాయి. అయితే ఈ భావాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు ఏ ఒక్క ప్రాంతానికి మాత్రమే సంబంధించినవి కావు. వాటికి వర్ణం, జాతి, భౌగోళిక ఎల్లలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఇవి స్థాపితమయ్యాయి. సంస్కృతి అనేది ఒక ప్రత్యేక ప్రాంతంలోన ేరూపుదిద్దుకుంటుంది. ప్రతి దేశంలోనూ విభిన్నమైన భావాలు, నమ్మకాలు ఉన్నప్పటికీ.. ఆయా దేశాల భౌగోళిక, సామాజిక పరిస్థితులపై అక్కడి సంస్కృతి ఆధారపడి ఉంటుంది. ఒక దేశ ప్రత్యేక సంస్కృతిలో అక్కడి భౌగోళికాంశాలు ప్రధానమైనవిగా ఉంటాయి. ఇవి భౌతిక రూపాలను ఏర్పరచడమే కాకుండా మానసిక వాతావరణం ఏర్పడేందుకు కూడా దోహదం చేస్తాయి. విభిన్న మతాలు, తాత్విక దృక్పథాలు ఉన్నప్పటికీ ఆ వాతావరణం ప్రజల మధ్య సమాన దృష్టిని, సమాన దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. ఈ జాతీయ మనస్తత్వం, మేధోసంపత్తే 'జాతీయ సంస్కృతి'కి ఆయువుపట్టు. ఈ భిన్న సంస్కృతులను జాతీయ సంస్కృతిలో భాగంగా మనం గ్రహించాలి. ప్రజలు తాము ఏ సమాజానికి చెందినా ఈ సమ్మిళిత, సమ్మిశ్రిత సంస్కృతిని తమదిగా భావించుకోవాలి. అప్పుడే 'జాతీయ సంస్కృతి' రూపొందుతుంది.
     భారతీయ సంస్కృతి ఆవిర్భవించడానికి ప్రధాన కారణాలు భారత ప్రజల మేధోసంపత్తి, వివిధ ఉద్యమాల వైజ్ఞానిక ప్రభావం, వివిధ సంస్కృతుల సమ్మేళనం. చారిత్రక పూర్వయుగంలో భారతదేశంతో ఏర్పడిన తాత్కాలిక సంబంధ బాంధవ్యాల వల్ల విదేశీయులు ఇక్కడికి వచ్చి భారత్‌ను తమ దేశంగా భావించారు. అనంతరం విప్లవాత్మక, వైజ్ఞానిక ఉద్యమాలు కాలానుగుణంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ సంస్కృతి ఏర్పడింది.
* శకులు, ఇండో గ్రీకులు తదితరుల రాక వల్ల ఒక విశిష్టమైన సంస్కృతి ఏర్పడింది.
* బౌద్ధులు, జైనుల వల్ల గాంధార శిల్పకళ, వాస్తు శైలి అభివృద్ధి చెందాయి.
     భౌతిక పరిస్థితులు, భౌతిక శక్తుల ప్రభావాలను పరిశీలిస్తే.. భారతదేశ ఆర్థిక విధానం వ్యవసాయ సంబంధమైందిగా అవతరించింది. ఈ భౌగోళిక పరిస్థితులు శాంతియుతమైన, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను ప్రోత్సహించాయి. యుద్ధం, దండయాత్రలు లాంటి విచ్ఛిన్నకర పరిస్థితులకు దారి తీయలేదు. ఈ చైతన్యమే భారతీయ సాంస్కృతిక చరిత్రలో ప్రతిబింబిస్తుంది.
     ప్రజల జీవన విధానాన్ని గమనిస్తే.. వివిధ ప్రాంతాల్లో వైవిధ్యం కనిపిస్తుంది. అలాగే విద్యావంతులైన భారతీయుల్లోనూ, భారతీయ నాగరకతలోనూ ఎన్నో సమాన లక్షణాలు కనిపిస్తాయి. అనాదిగా ఈ దేశం ఎన్నో విదేశీ దండయాత్రలకు గురైంది. ఎన్నో విధాల అనైక్యతలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ భారతీయుల్లోని ఏకత్వ, సమానత లక్షణాలు జాతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటిచెప్పాయి.

 

తాత్విక జీవన విధానం
     ప్రపంచం అంటే ఏమిటి?, రేపు - ఆ తర్వాత ఏం జరుగుతుందో అనే ఆందోళనలతో సతమతమవుతున్న ప్రజల ఆలోచనల్లో ప్రేమ, భక్తి అంకురించాయి. ఇలాంటి ఆలోచనలు మత సంబంధమైనవే కానీ తాత్విక సంబంధమైనవి కావు. అందుకే మత సంబంధమైన ఆలోచనావిధానం భారతదేశ సాంస్కృతిక జీవన విధానంలో భాగమైంది. ఈ రకమైన ఆలోచనల్లోని ఔన్నత్యం, భిన్నత్వంలో ఏకత్వమనే భావనలను భారతీయ మేధోసంపత్తి విశిష్ట లక్షణాలుగా పేర్కొనవచ్చు. ఇక్కడి ప్రజల వ్యవసాయ జీవన విధానం, భౌగోళిక పరిస్థితులు దేశ రాజకీయ నిర్మాణాన్ని, దేశాభివృద్ధిని మలచడంలో ప్రముఖపాత్ర పోషించాయి. భౌతిక, సామాజిక పరిసరాల ప్రభావం కూడా ఒక అంశమే అయినప్పటికీ.. దేశ రాజకీయ నిర్మాణంలో 'సంస్కృతి' కీలక భూమిక వహించింది. ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ భారతీయ మనస్తత్వం ఏకత్వాన్ని సాధించింది. కొన్ని అంశాలు సంఘర్షణకు పురిగొల్పినా అవి సామరస్యతను సంతరింపజేసుకుని ఒక విశిష్టమైన, మహోన్నతమైన సంస్కృతికి పునాది వేశాయి.

 

సంస్కృతి నిర్మాణం
     భారతదేశంలో చారిత్రక యుగానికి పూర్వమే ప్రసిద్ధిగాంచిన హరప్పా సంస్కృతి - సింధు నాగరకత వెల్లివిరిశాయి. వైదిక యుగం ప్రారంభంతో సువిశాల జాతీయ సంస్కృతి ఏర్పడింది. దీనిపై కొంత కాలానికి తలెత్తిన నిరసన భావాల ఫలితమే బౌద్ధ, జైన సంస్కృతుల ఆవిర్భావం. తర్వాత ఎన్నో సంఘర్షణలను తట్టుకుని భారతదేశ సాంస్కృతిక జీవన విధానం హైందవ సంస్కృతిగా పునరావిష్కృతమైంది. మళ్లీ మధ్యయుగంలో విచ్ఛిన్నకర శక్తుల ప్రభావానికి గురైనా.. మొగల్ చక్రవర్తుల హిందూ ముస్లింల సాంస్కృతిక సమ్మేళనంతో హిందుస్థానీ సంస్కృతి నిర్మాణం జరిగింది.
     దేశంలో విభిన్న మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ప్రాంతాలు, భాషలు, మనస్తత్వాలు ఉన్నాయి. గతంలో ఎంతోమంది విదేశీయులు దండయాత్రలు చేశారు. అయినా భారత జాతీయ సంస్కృతి ఏకత్వం, సామరస్యం, వసుధైక కుటుంబ భావనతో మహోన్నతమైన సంస్కృతిగా వేల ఏళ్లుగా అప్రతిహాతంగా వెలుగొందుతోంది. ఇదే భారతీయ సంస్కృతి ఔన్నత్యం, గొప్పదనం.

 

ప్రపంచ ప్రఖ్యాత నాగరకత
     ఒక జాతి సమగ్ర జీవన విధానం సంస్కృతి.. సంపూర్ణ వికాసం పొందిన తీరును చిత్రించేది సంస్కృతి చరిత్ర. వేల ఏళ్ల కిందటే భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశిష్ట నాగరకత-సంస్కృతులు విలసిల్లాయి. నదీలోయలు సాంస్కృతిక వికాస కేంద్రాలయ్యాయి. తెలుగు నేలను ఏలిన తొలి చక్రవర్తులైన శాతవాహన సంస్కృతి కూడా పవిత్ర గోదావరి తీరాన్నే విలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు ప్రవచించిన బౌద్ధ ఆధ్యాత్మిక ప్రవచనాలను కృష్ణవేణి తరంగిణులు ప్రతిధ్వనింపజేశాయి.

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

హైదరాబాదు రాజ్యంలో స్వాతంత్య్ర పోరాటం - గాంధీ పర్యటనలు

నిజాం నిరంకుశత్వంపై సత్యాగ్రహం!

  భారత స్వాతంత్రోద్యమ కాలంలో హైదరాబాదు రాజ్యంలోనూ ప్రజలు చైతన్యవంతులై కదిలారు. నిజాం నిరంకుశ పాలనపై రాజీ లేని పోరాటాలు చేశారు. గాంధీజీ సత్యాగ్రహ మార్గమే వారికి ఆయుధమైంది. ఆయన మార్గదర్శకత్వాన్ని పాటిస్తూ ఇక్కడి నాయకులు జనంలో స్వాతంత్య్రకాంక్ష రగిలించారు. సామాజిక దురాచారాలపైనా పోరాడారు. నిషేధాలకు, నిర్బంధాలకు వెరవకుండా ముందుకు సాగారు. ఈ ప్రాంతాల్లో మహాత్ముడు పర్యటించిన ప్రతిసారీ పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచారు. స్వరాజ్యనిధికి భారీగా విరాళాలు అందించారు. మరికొందరు నేతాజీతోనూ కలిసి పనిచేశారు. ఈ ముఖ్య ఘట్టాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

  హైదరాబాద్‌ నిజాం రాజ్యంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కావు. ఆ నిరంకుశ పాలన వద్దంటూ గొప్ప ప్రజాఉద్యమం సాగింది. బ్రిటిష్‌ ఆధీనంలోని భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న క్రమంలో దాని ప్రభావం హైదరాబాదు రాజ్యంపైనా ఉండేది. మరోవైపు భారత జాతీయ కాంగ్రెస్‌ పేరును సంస్థానాల ప్రజలు ఉపయోగించుకోకూడదని కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించారు. ఫలితంగా హైదరాబాదు రాజ్య కాంగ్రెస్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ సంస్థ నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాటం ప్రారంభించింది.

 

హైదరాబాద్‌ రాజ్య కాంగ్రెస్‌:  క్రీ.శ.1918లో భారత జాతీయ కాంగ్రెస్‌ శాఖగా హైదరాబాదు జిల్లా కాంగ్రెసు సంఘం ఉండేది. దీనికి వామన్‌ నాయక్‌ అధ్యక్షుడు. 1937లో సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన హరిపురలో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో దేశీయ సంస్థానాల్లో జరిగే ప్రజాందోళనలకు భారత జాతీయ కాంగ్రెస్‌ పేరు ఉపయోగించకూడదని, అలాంటి ఆందోళనల్లో జాతీయ నాయకులు పాల్గొనకూడదని తీర్మానించారు. దీంతో నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటును డిమాండు చేసేందుకు హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ను 1938, జనవరి 29న నెలకొల్పారు. రామానందతీర్థ 1938, జూన్‌ 9న ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటుచేసి, అందులో 1200 మంది సభ్యులను చేర్పించారు. 1938, సెప్టెంబరు 9న హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ సభ నిర్వహించాలనుకున్నారు. అయితే సెప్టెంబరు 8వ తేదీనే హైదరాబాదు ప్రధాని అక్బర్‌ హైదరీ ఈ సంస్థను నిషేధించాడు. స్టేట్‌ కాంగ్రెసును ఒక మత సంస్థ అని నిజాం ప్రభుత్వం వాదించింది. దీంతో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని తాత్కాలిక కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది. నిషేధం ఎత్తివేయాలని ప్రధాని అక్బర్‌ హైదరీతో మందముల నరసింగరావు చర్చలు జరిపారు. ఇందుకు నవాబు బహదూర్‌ యార్‌ జంగ్‌ (ఎంఐఎం అధ్యక్షుడు) మధ్యవర్తిగా వ్యవహరించారు. ఈ చర్చలనే సింగ్‌-జంగ్‌ చర్చలని పిలుస్తారు. ఇవి విఫలమయ్యాయి. స్టేట్‌ కాంగ్రెస్‌పై నిషేధం ఎత్తివేయడానికి సత్యాగ్రహం చేయాలన్న వీరి నిర్ణయాన్ని మహాత్మాగాంధీ ఆమోదించారు. సత్యాగ్రహం చేసేందుకు ఒక కార్యవర్గాన్ని స్టేట్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. అధ్యక్షుడిగా గోవిందరావు నానల్, కార్యదర్శిగా రామకృష్ణ దూత్, సభ్యులుగా రావినారాయణ రెడ్డి, జనార్దనరావు దేశాయి, శ్రీనివాసరావు బోరీకర్‌ వ్యవహరించారు. 18 జట్లుగా 400 మంది సత్యాగ్రహులు ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ 18 జట్లకు 18 మంది డిక్టేటర్‌లు (నాయకులు) నియమితులయ్యారు. మొదటి డిక్టేటర్‌గా స్వామిరామానంద తీర్థ, చివరి డిక్టేటర్‌గా కాశీనాథరావు వైద్య వ్యవహరించారు. ఈయన సహచరులైన రావి నారాయణరెడ్డి, రామకృష్ణ దూత్, జనార్దన్‌రావు దేశాయి, గోవిందరావు నానల్‌లు 1938, అక్టోబరు 24న రెసిడెన్సీలోని బొమ్మలబావి వద్ద సత్యాగ్రహం చేయగా పోలీసులు నిర్బంధించారు. 1938, అక్టోబరు 27న సత్యాగ్రహం చేస్తున్న రామానంద తీర్థను అదుపులోకి తీసుకున్నారు. గాంధీజీ ఆదేశాలతో ఈ సత్యాగ్రహాన్ని ఆపేస్తున్నట్టు చివరి డిక్టేటర్‌ కాశీనాథరావు వైద్య 1938, డిసెంబరు 24న ప్రకటించారు. 1939-40లో స్టేట్‌ కాంగ్రెస్‌ ప్రతినిధిగా కాశీనాథరావు వైద్య కాంగ్రెస్‌పై నిషేధం తొలగించే విషయంలో సంప్రదింపులు జరిపారు. అనేక చర్చల అనంతరం ప్రధాని చటారీ నవాబు హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌పై ఉన్న నిషేధాన్ని 1946, ఏప్రిల్‌లో తొలగించారు. 1947, మే లో రామానంద తీర్థ అధ్యక్షతన హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ అధికార సమావేశం జరిగింది. రజాకార్లు, పోలీసు దళాలను ఎదుర్కొనేందుకు సర్దార్‌ జమలాపురం కేశవరావు నాయకత్వంలో కార్యాచరణ సమితి ఏర్పాటైంది.

 

వ్యక్తి సత్యాగ్రహం: భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా వ్యక్తి సత్యాగ్రహం జరిగింది. హైదరాబాద్‌ రాజ్యం నుంచి ప్రముఖ నాయకుడైన రామానంద తీర్థ సేవాగ్రామ్‌కు వెళ్లి మహాత్మాగాంధీ అనుమతి తీసుకొని హైదరాబాదుకు తిరిగొచ్చి 1940, సెప్టెంబరు 11న వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించారు. ప్రభుత్వం ఆయనను అరెస్ట్‌ చేసి జైలు శిక్ష విధించింది. ఈ సత్యాగ్రహోద్యమంలో రామానందతో పాటు హీరాలాల్‌ కోటేచాప్రాణేశాచార్య, మోతీలాల్‌ మంత్రి, శ్రీనివాసరావు హవల్దార్, దేవరం భాయ్‌ చౌహాన్, అచ్యుతరావు దేశ్‌పాండే మొదలైనవారు అరెస్టయ్యారు.

 

క్విట్‌ ఇండియా ఉద్యమం: రామానంద తీర్థ భారత జాతీయ కాంగ్రెసు సమావేశానికి ముందు రోజు బొంబాయి వెళ్లి మహాత్మాగాంధీతో మాట్లాడి క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఆయన అనుమతి తీసుకొని హైదరాబాదు బయలుదేరారు. తీర్థ స్టేట్‌ కాంగ్రెస్‌ ఆకాంక్షలను ఒక ఉత్తరం ద్వారా డాక్టర్‌ మెల్కోటేకు పంపించి నిజాంకు పంపించమన్నాడు. అయితే నాంపల్లి రైల్వేస్టేషన్‌లో రామానంద తీర్థను నిజాం ప్రభుత్వం నిర్బంధించింది. దీంతో డాక్టర్‌ మెల్కోటే స్టేట్‌ కాంగ్రెస్‌ పక్షాన సంతకం చేసి నిజాంకు పంపగా, మెల్కోటేను కూడా ప్రభుత్వం నిర్బంధించింది. పండిత నరేంద్రజీ, హరిశ్చంద్ర హెడా, విమలాబాయి మెల్కోటే, బి.రామకృష్ణారావు, జి.రామచార్, వందేమాతరం రామచంద్రరావు, కృష్ణాదూబే (కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు) మొదలైనవారు ఈ ఉద్యమంలో అరెస్టయ్యారు. మహారాష్ట్ర పరిషత్తు కార్యదర్శి అయిన గోవింద దాసు షరాఫ్‌ను ఔరంగాబాదులో ప్రభుత్వం నిర్బంధించింది.

  హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసినందుకు పద్మజా నాయుడును ప్రభుత్వం నిర్బంధించింది. జాతీయ నాయకురాలైన అరుణా అసఫ్‌ అలీ రహస్యంగా హైదరాబాద్‌లో పర్యటించి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. ప్రజల్లో నిజాం వ్యతిరేక భావాలను తొలగించడానికి బీబీసీలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ రష్‌ బ్రూక్‌ విలియమ్స్‌ను నిజాం హైదరాబాద్‌కు పిలిపించారు. బ్రిటిష్‌ ఇండియా ప్రజల మాదిరిగా హైదరాబాద్‌ ప్రజలు కూడా రాజకీయ స్వేచ్ఛను, పౌరహక్కులను అనుభవిస్తున్నారంటూ రష్‌ బ్రూక్‌ రాసిన వ్యాసాలను వివిధ పత్రికలు, జర్నల్స్‌లో ప్రచురించారు. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ తరహా ప్రచారం ఆగిపోయింది. క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశం వెలుపల సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో హైదరాబాద్‌కు చెందిన అబిద్‌ హసన్‌ సఫ్రాని, ప్రొఫెసర్‌ సురేశ్‌ చంద్ర, అలీ సుల్తాన్‌లు చేరి జర్మనీలో సుభాష్‌ చంద్రబోస్‌తో సన్నిహితంగా ఉండి పనిచేశారు.

 

తెలంగాణలో గాంధీజీ పర్యటనలు: స్వాతంత్రోద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ తెలంగాణలో మూడు సార్లు పర్యటించారు. స్వరాజ్య నిధి వసూలు చేయడానికి, మద్యపానం, అంటరానితనం నిర్మూలనలో భాగంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం కలిగించారు.

 

మొదటి హైదరాబాదు పర్యటన: మహాత్మాగాంధీ మొదటి హైదరాబాదు పర్యటన 1929, ఏప్రిల్‌లో జరిగింది. తిలక్‌ స్వరాజ్య నిధికి విరాళాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. కృష్ణ స్వామి ముదిరాజ్‌ తన ఆంధ్ర వాలంటీరు బృందంతో వాడి రైల్వేస్టేషన్‌కు వెళ్లి గాంధీకి స్వాగతం పలికి నాంపల్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. వివేకవర్థని మైదానంలో వామన్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన సభలో గాంధీజీ ప్రసంగించారు. మాడపాటి హనుమంతరావు, మందముల నరసింగరావు, ఆర్‌.ఎస్‌.నాయక్, రాజా బన్సీలాల్, ముకుందదాస్‌ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సభ అనంతరం రూ.12 వేలు విరాళం వసూలైంది. ఇదే పర్యటనలో కృష్ణస్వామి ముదిరాజ్‌ చుడీబజారులో స్థాపించిన బాలికా హిందీ పాఠశాలను గాంధీ సందర్శించారు. 1929, ఏప్రిల్‌ 7న సుల్తాన్‌ బజారులోని ప్రేమ్‌ థియేటర్‌లో గాంధీ గౌరవార్థం మహిళా సభను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన విజయవాడకు వెళ్లారు.

 

రెండో పర్యటన: గాంధీజీ 1934, మార్చి 9న రెండోసారి హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ పర్యటనను సరోజినీ నాయుడు పర్యవేక్షించారు. హరిజన సేవాదళం ప్రధాన కార్యదర్శి రావి నారాయణరెడ్డి, ఎల్‌.ఆర్‌.దాచా, బసంతరావు, కుమారి పద్మజా నాయుడు గాంధీకి స్వాగతం పలకడానికి వెళ్లి ఆయనను వికారాబాద్‌ స్టేషన్‌లో కలుసుకున్నారు. సరోజినీ నాయుడు మొదట గాంధీకి స్వాగతం పలికి, ఆయన మెడలో ఖద్దరు నూలు హారం వేసి, తన నివాసమైన ఆబిడ్స్‌లోని గోల్డెన్‌ థ్రెషోల్డ్‌ (బంగారు గడప)కు తీసుకెళ్లారు. గాంధీతో పాటు మీర్‌ బెహద్‌ మొదలైన వారు వచ్చారు. అనంతరం గాంధీ ఆది హిందూ విద్యాలయాన్ని సందర్శించి అక్కడి నుంచి వివేకవర్థని మైదానానికి తరలివెళ్లారు. ఆ మైదానంలో హరిజన సేవక సంఘం అధ్యక్షుడైన వామన్‌ నాయక్‌ గాంధీకి స్వాగతపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గాంధీ హరిజన నిధికి ప్రజలు విరాళాలిచ్చారు. అదేరోజు సాయంత్రం సికింద్రాబాద్‌లోని కర్బలా మైదానంలో పెద్ద సభ జరిగింది. గాంధీకి బాజీ కృష్ణారావు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మొత్తం రూ.10 వేల వరకు పోగయింది.

 

మూడో పర్యటన: 1946, జనవరి చివరి వారంలో గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాల్లో పాల్గొనేందుకు మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. ఎం.ఎస్‌.రాజలింగం మద్రాసుకు వెళ్లి గాంధీతో మాట్లాడి ఆయన పర్యటనను వరంగల్‌ జిల్లాలో ఏర్పాటు చేశారు. గాంధీ తెలంగాణ పర్యటన కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో సభ ఏర్పాటు చేశారు. కృష్ణ బజాజ్, ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య, ఎం.ఎస్‌.రాజలింగం తదితరులు హాజరయ్యారు. ఈ సభలో గాంధీ ప్రసంగించారు. తర్వాత నేటి ఖమ్మం  ప్రాంతంలోని డోర్నకల్, గుండ్రాతి మడుగు, మానుకోట మొదలైన ప్రాంతాల్లో పర్యటించి ఉపన్యాసాలిచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు గాంధీకి స్వరాజ్య నిధి కోసం విరాళాలు సమర్పించారు. 1946, ఫిబ్రవరి 5న గాంధీ వరంగల్‌కు వెళ్లారు. హన్మకొండ విద్యార్థి సంఘాల వాలంటీర్లు 800 మంది ‘స్వతంత్ర భారత్‌ కీ జై’ అనే నినాదాలతో వరంగల్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. వరంగల్‌ ప్రజలను ఉద్దేశించి గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు తమ ఆభరణాలను గాంధీకి విరాళంగా ఇచ్చారు. ఆహ్వాన సంఘం పక్షాన హయగ్రీవాచారి గాంధీ హరిజన నిధికి రూ.15 వేలు, చందా కాంతయ్య రూ.5 వేలు అందజేశారు. గాంధీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల అధ్యాపకుల నుంచి సంజాయిషీ కోరింది. కొందరిపై చర్యలు తీసుకోగా, మరికొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.

 

  అరుణా అసఫ్‌ అలీ పర్యటన: భారత జాతీయ నాయకురాలైన అరుణా అసఫ్‌ అలీ వరంగల్‌ను సందర్శించి, బ్రిటిష్‌ పాలకులకు పట్టిన గతే నిజాంకు, అతడి తాబేదార్లకు పడుతుందని, స్వతంత్ర భారత్‌లో స్వతంత్ర సంస్థానాలకు తావులేదని గంభీర ప్రసంగం చేశారు. ఆమె ప్రసంగం ప్రజల్లో నూతనోత్సాహం నింపింది.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి

Posted Date : 07-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సమరశీల భావాలు - సాయుధ పోరాటాలు

ఆయుధాలు చేపట్టి.. ఆంగ్లేయులను అదరగొట్టి!

  జాతీయోద్యమ కాలంలో భారతీయులపై ఆంగ్లేయుల అరాచకాలు, అతి క్రూరమైన అణచివేతలు అధికమయ్యాయి. మన వాళ్లకు కనీస హక్కులు  లేకుండా పోయాయి. స్వేచ్ఛ ఉండేది కాదు. పరిష్కారాల కోసం మితవాదులు చేసిన పోరాటాలతో ఆశించిన ప్రయోజనాలు అందలేదు. ఆ దశలో ఉద్యమకారుల్లో అసహనం ప్రబలింది. అది సాయుధ పోరాటంగా మారింది. దేశ, విదేశాల్లో ఎంతోమంది వీరులు నిరంకుశ పాలనపై అసమాన ధైర్య సాహసాలతో అనేక రకాలుగా తిరుగుబాటు సమరాన్ని సాగించారు. కొందరు దుర్మార్గులైన ఇంగ్లిష్‌ అధికారులను తుదముట్టించారు. దొరికిపోయినవారు జైళ్లలో చిత్రహింసలు అనుభవించారు. ప్రాణాలు కోల్పోయారు. కానీ స్వాతంత్రోద్యమ గతిని మార్చి చరిత్రలో అమరవీరులై చిరస్థాయిగా నిలిచిపోయారు. 

 

  భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో విప్లవవాదులకు విశిష్ట స్థానం ఉంది. తరతరాలుగా బ్రిటిష్‌ ప్రభుత్వ వలసవాద విధానాలు భారత జాతిని ఆర్థికంగా కుంగదీశాయి. నిరుద్యోగం, ఆకలి, అనారోగ్యం దేశమంతా విలయతాండవం చేశాయి. దీనికితోడు ఆంగ్లేయుల జాత్యహంకార ధోరణి, దురుసుతనం, భారత జాతీయోద్యమాన్ని మొగ్గ దశలోనే అణచివేసేందుకు ప్రయత్నించిన తీరు కొందరు ఉద్యమకారుల్లో ద్వేషభావాన్ని పెంచాయి. కాంగ్రెస్‌ మితవాదులు సాగిస్తున్న రాజకీయ కార్యకలాపాలు, ఫలితాలు సాధించలేని వారి పోరాటశైలి పట్ల ఈ వర్గం విసుగు చెందింది. బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం కూడా దేశంలో విప్లవభావం పెరిగేందుకు దోహదపడింది. అమెరికా స్వాతంత్య్ర పోరాటం, ఇటలీ ఏకీకరణ, ఫ్రెంచ్‌ విప్లవం, చిన్న దేశమైన జపాన్‌ అతిపెద్దదైన రష్యాపై విజయం సాధించడం వంటి అంతర్జాతీయ సంఘటనలు విప్లవ భావజాలానికి ఉత్ప్రేరకాలుగా నిలిచాయి. బ్రిటిషర్ల బలప్రయోగ వ్యూహాలను అదే రీతిలో ఎదుర్కొంటేనే వారిని దేశం నుంచి సాగనంపడం సాధ్యమని సమరశీల నేతలు భావించారు. 

 

విధానాలు

విప్లవవాదులు లేదా సమరశీల జాతీయవాదులు అచంచల దేశభక్తులు. తొలి దశలో భారతదేశంలో, దేశం వెలుపలా రహస్య విప్లవ సంఘాలు, పత్రికలు స్థాపించి సదస్సులు,  సమావేశాలు నిర్వహించి, పుస్తకాలు ప్రచురించి విప్లవభావాలను ప్రచారం చేశారు. ఐరిష్‌ ఉగ్రవాదులు, రష్యన్‌ నిహిలిస్ట్‌ల నుంచి స్ఫూర్తి పొందారు. భారతీయుల పట్ల క్రూర విధానాలను అవలంబించిన ఇంగ్లిష్‌ అధికారుల హత్యలకు సిద్ధమయ్యారు. ఆంగ్లేయులను వ్యతిరేకించే దేశాల సహాయంతో సైనిక కుట్రలు చేశారు. తమ కార్యక్రమాలకు అవసరమైన నిధులు, ఆయుధాల కోసం పోలీసుస్టేషన్లు, ప్రభుత్వ ఆయుధగారాలపై దాడులకు పాల్పడ్డారు.

  బెంగాల్‌ విభజనకు ముందే విప్లవ సంఘాల స్థాపన ఉన్నప్పటికీ, బెంగాల్‌ విభజనతో ఉగ్రజాతీయవాదం పెరిగింది. బెంగాల్, మహారాష్ట్ర ప్రాంతాలు విప్లవ సంఘాల కార్యకలాపాలకు అడ్డాగా (కేంద్రంగా) మారాయి. ఈ సంస్థల్లో బరీంద్రకుమార్‌ ఘోష్, జతీంద్రనాథ్‌ బెనర్జీలు కలిసి స్థాపించిన ‘కలకత్తా అనుశీలన సమితి’, పుళిందాస్‌ స్థాపించిన ‘ఢాకా అనుశీలన సమితి’ ప్రధానమైనవి. ఇవి ఉనికిలో ఉన్నంతకాలం కేవలం మన దేశంలోని ఇతర విప్లవ సంస్థలతో పాటు ఇతర దేశాల్లోని సంస్థలతోనూ సంబంధాలను కొనసాగించేవి. సమరశీల, విప్లవవాద సిద్ధాంతాల ప్రచారంలో అవి ముందంజలో ఉండేవి.

  1905 బెంగాల్‌ విభజన తర్వాత దేశంలో అనేక తీవ్రవాద సంస్థలు పత్రికలను స్థాపించి తమ భావజాలాన్ని వ్యాప్తి చేశాయి. అలాంటి వాటిలో బెంగాల్‌లోని సంధ్య, యుగాంతర్, కాల్‌ ముఖ్యమైనవి. 1899లో సావర్కర్‌ సోదరులు మహారాష్ట్రలో ‘మిత్రమేళా’ పేరుతో రహస్య సంఘాన్ని స్థాపించారు. తర్వాత కాలంలో ఈ సంస్థ గణేష్‌ సావర్కర్‌ స్థాపించిన ‘అభినవ్‌ భారత్‌’తో కలిసి పశ్చిమ భారతంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాద కార్యక్రమాలను నిర్వహించింది. 1905లో అశ్వినీకుమార్‌ దత్త స్థాపించిన ‘స్వదేశీ బాంధవ్‌ సమితి’ బెంగాల్‌ విభజన ఉద్యమకాలంలో విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించింది. ఇలా అనేక విప్లవ సంఘాలు దేశమంతా ఏర్పాటయ్యాయి. పంజాబ్‌లో పలు రహస్య సంఘాలు అజిత్‌ సింగ్‌ నాయకత్వంలో చురుగ్గా పనిచేశాయి. తమిళ ప్రాంతంలో చిదంబరం పిళ్లై, సుబ్రమణ్య శివ తదితరులు బ్రిటిష్‌ వ్యతిరేక విప్లవ ఉద్యమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 1924లో సచింద్రనాథ్‌ సన్యాల్, జేజి ముఖర్జీ నేతృత్వంలో ‘హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’ సంస్థ ఏర్పడింది. ఆగ్రా, అలహాబాద్, బెనారస్, కాన్పుర్, లఖ్నవూల్లో శాఖలను ఏర్పాటు చేసింది. బ్రిటిషర్లపై ప్రయోగించడానికి కలకత్తాలో బాంబుల తయారీని ప్రారంభించింది. 1928లో చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఈ సంస్థ పేరును ‘హిందూస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’గా మార్చారు. 

  విప్లవ కార్యక్రమాల నిర్వహణకు విదేశాల్లో కూడా సంఘాలు/సంస్థలను భారతీయులు స్థాపించారు. అలాంటి వారిలో శ్యామ్‌జీ కృష్ణవర్మ, వి.డి.సావర్కర్, లాలా హర్‌దయాళ్‌ ముఖ్యులు. బ్రిటిష్‌ పాలకుల సొంతగడ్డ లండన్‌లోనే ఇండియా హౌస్‌ను శ్యామ్‌జీ కృష్ణవర్మ స్థాపించారు. ది ఇండియన్‌ సోషియాలజిస్ట్‌ పత్రికనూ స్థాపించారు. వీర్‌ సావర్కర్‌ కూడా లండన్‌లోనే తన తోటి భారతీయ విద్యార్థులను ప్రేరేపించి ఆంగ్లేయుల వ్యతిరేక పోరాటానికి ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన గ్రంథం ‘ఫస్ట్‌ వార్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌’ 1857 సిపాయిల తిరుగుబాటు స్వభావాన్ని విశ్లేషిస్తుంది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను అండమాన్‌లోని సెల్యూలర్‌ జైలులో నిర్బంధించి చిత్రహింసలు పెట్టింది. యూరప్‌లో భారత స్వాతంత్య్ర కాంక్షను ప్రచారం చేసిన వీర వనిత భికాజీ రుస్తుం కామా.

  అమెరికాలోని శాన్‌ప్రాన్సిస్కోలో 1913లో ‘గదర్‌ పార్టీ’ ఆవిర్భవించింది. లాలా హర్‌దయాళ్, భాయ్‌ పరమానంద, సోహన్‌ సింగ్, మహమ్మద్‌ ఇక్బాల్, భగవాన్‌ సింగ్, కర్తార్‌ సింగ్, అబ్దుల్‌ హఫీజ్, మహమ్మద్‌ బర్కతుల్లా తదితర పంజాబీయులు ఇందులో కీలక సభ్యులు. ఆయుధాలను సేకరించి, యువతకు శిక్షణ ఇచ్చి, ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేయడం ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం. పంజాబ్, తూర్పు ఆసియా దేశాల్లో గణనీయంగా అనుచరులను సిద్ధం చేసింది. బెంగాల్‌లో రాస్‌ బిహారీ బోస్‌ ఈ సంస్థ నాయకుడు. అయితే ఈ రహస్యాలను తెలుసుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం వారిని క్రూరంగా అణచివేసింది. వీరేంద్రనాథ్‌ చటోపాధ్యాయ్, భూపేంద్రనాథ్‌ దత్త తదితరులు 1915లో ‘బెర్లిన్‌ కమిటీ’ని స్థాపించి బ్రిటిషర్ల అకృత్యాలను ఐరోపా దేశాల్లో ఎండగడుతూ, సాయుధ పోరాటానికి కార్యకర్తలను తయారుచేశారు. 1915లో మహేంద్ర ప్రతాప్, బర్కతుల్లా తదితరులు కాబూల్‌లో ‘ప్రొవిజనల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఫ్రీ ఇండియా’ను నెలకొల్పారు.

  ఆంగ్లేయుల సామ్రాజ్యవాద దాష్టీకాలకు, సాయుధ పోరాటంతో జవాబు చెప్పి, వారిని దేశం నుంచి తరిమికొట్టడం ఈ విప్లవకారుల ప్రధాన లక్ష్యం. భారతీయుల పట్ల క్రూరంగా వ్యవహరించిన బ్రిటిష్‌ అధికారులను హత్య చేయడం వంటి కార్యక్రమాలను చాపేకర్‌ సోదరులైన దామోదర్‌ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్‌ ప్రారంభించారు. వీరు పుణెలో ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్రిటిష్‌ అధికారులైన రాండ్, ఆయన మిలిటరీ సహాయకుడు లెఫ్టినెంట్‌ ఐరెస్ట్‌ను 1897లో కాల్చి చంపారు.  పరమక్రూరుడిగా పేరు పొందిన బెంగాల్‌ లఫ్టినెంట్‌ గవర్నర్‌ ఫుల్లర్‌ హత్యకు 1907లో ‘అనుశీలన సమితి’ కార్యకర్తలు చేసిన ప్రయత్నం విఫలమైంది. 1908లో ముజఫర్‌పుర్‌ న్యాయమూర్తి కింగ్స్‌ ఫోర్డ్‌ ప్రయాణిస్తున్న వాహనంపై ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి బాంబు విసిరారు. 1912లో అప్పటి రాజప్రతినిధి లార్డ్‌ హార్డింజ్‌ దిల్లీలో ఏనుగుపై ఊరేగింపుగా వస్తుండగా రాస్‌ బిహారి బోస్, సచింద్ర సన్యాల్‌లు బాంబు విసిరారు. కానీ హార్డింజ్‌ త్రుటిలో తప్పించుకున్నాడు.

  సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లో జరిగిన ‘సైమన్‌ గో బ్యాక్‌’ ఉద్యమానికి లాలా లజపతి రాయ్‌ నాయకత్వం వహించారు. పోలీస్‌ అధికారి సాండర్స్‌ కొట్టిన లాఠీ దెబ్బలకు లజపతి రాయ్‌ మరణించారు. ఇందుకు ప్రతిగా భగత్‌సింగ్, ఆజాద్, రాజ్‌గురులు 1928లో సాండర్స్‌ను హత్య చేశారు.

  నిధులు, ఆయుధాల కోసం 1920 నాటికి పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ ఆయుధ గిడ్డంగులపై స్వాతంత్రోద్యమ విప్లవకారులు చేసిన దాడులు వెయ్యికి పైగా ఉండవచ్చని అంచనా. ఆంధ్రాలో విశాఖ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోలీస్‌స్టేషన్లకు ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి చేసేవాడు. బాంబులు తయారు చేస్తున్నారనే కారణంతో కలకత్తాలో 1908లో అనేకమంది విప్లవకారులను ప్రభుత్వం అరెస్టు చేసింది. దీనినే అలీపూర్‌ కుట్ర కేసు అంటారు. 1925లో కకోరి రైలు దోపిడీ కేసులో రాంప్రసాద్‌ బిస్మిల్, రోషన్‌ సింగ్, రాజేంద్ర లాహిరి, అష్ఫాక్‌ ఉల్లాలను ఉరి తీశారు. 1930లో సూర్యసేన్‌ నాయకత్వంలో చిట్టగాంగ్‌ విప్లవకారులు ప్రభుత్వ ఆయుధగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భగత్‌ సింగ్, బి.కె.దత్‌లు ‘అప్రజాస్వామిక’ ప్రజా రక్షణ బిల్లును నిరసిస్తూ కేంద్ర శాసనసభలోకి బాంబులు విసిరారు. దాంతో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు 1931, మార్చి 23న లాహోర్  సెంట్ర‌ల్ జైలులో ఉరిశిక్ష విధించారు.

  ఒకవైపు గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్‌ అహింసాయుత రాజ్యాంగబద్ధ రాజకీయ పోరాటం చేస్తుంటే, మరోవైపు జరుగుతున్న విప్లవ సాయుధ పోరాటాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వేలమందికి జీవిత ఖైదు, మరణ శిక్షలు విధించినప్పటికీ విప్లవ యోధుల్లో ధైర్యం సడలలేదు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడానికి వారు అవలంబించిన విధానాలకు పెద్దగా ప్రజామోదం లేనప్పటికీ, స్వాతంత్రోద్యమ గతిని మార్చడంలో గణనీయమైన పాత్ర పోషించారు. అచంచల దేశభక్తి, దేశం కోసం మరణానికి కూడా భయపడని మనోధైర్యం, త్యాగాలు, స్వతంత్ర పోరాట చరిత్రలో వారికి విశిష్ట స్థానం కల్పించాయి.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 16-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శాసనోల్లంఘన ఉద్యమం

 స్వరాజ్య సాధనలో శాసన ధిక్కారం!

 

  పౌర హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమం సత్యాగ్రహం రూపంలో తెలిపే శాంతియుత నిరసనల శక్తిని లోకానికి చాటింది. స్వరాజ్య సాధన లక్ష్యంగా బ్రిటిష్‌ శాసనాలను ధిక్కరించి ఉజ్జ్వల సమరంగా సాగింది.  ఆ సమయంలో సంపూర్ణ స్వాతంత్య్రమే అంతిమ ధ్యేయమని నెహ్రూ వంటి నాయకులు ఇచ్చిన పిలుపు భారతీయులను చైతన్యవంతం చేసింది. ఉప్పు తయారీపై తెల్లవారి గుత్తాధిపత్యాన్ని ఎదిరిస్తూ దండి దారిపట్టిన మహాత్ముడికి జనం అపూర్వ నీరాజనాలు పలికారు. ఫలితంగా కాంగ్రెస్‌ డిమాండ్లకు ఆంగ్లేయులు తలొగ్గాల్సిన పరిస్థితులు తలెత్తాయి. 

 

  ఇరవయ్యో శతాబ్దం రెండో దశకం చివరి సంవత్సరాలు స్వాతంత్రోద్యమ చరిత్రలో గొప్ప మైలురాళ్లు. సైమన్‌ కమిషన్‌ భారతదేశ పర్యటనను భారతీయులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ కమిషన్‌ తన పని తాను చేసుకొని ఇంగ్లండ్‌ వెళ్లిపోయింది. కానీ సైమన్‌ బహిష్కరణ ఉద్యమం రూపంలో బ్రిటిష్‌ ప్రభుత్వ నిరంకుశ పరిపాలనను భారతజాతి తిరస్కరించింది. స్వయంపాలిత రాజ్యాంగం కావాలనే ఆకాంక్షను ముక్తకంఠంతో వ్యక్తం చేసింది. అంతకు ముందే భారత రాజ్య కార్యదర్శి లార్డ్‌ బిర్కెన్‌హెడ్‌ ‘‘వివిధ జాతులు, మతాలు ఉన్న భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరా?’’ అని భారతీయులకు సవాలు విసిరాడు. ఆ విధంగా ఎవరైనా రూపొందిస్తే తాను ఆమోదింపజేస్తానని ప్రకటించాడు.

 

నెహ్రూ నివేదిక - 1928: బిర్కెన్‌హెడ్‌ విసిరిన సవాలును భారత జాతీయ నాయకులు స్వీకరించారు. ముఖ్య రాజకీయ పార్టీలు, నాయకులు కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించాలనుకున్నారు. ఇందుకోసం దిల్లీ, పుణెలలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. మోతీలాల్‌ అధ్యక్షతన ఒక ఉపసంఘం ఏర్పాటైంది. ఛైర్మన్‌గా మోతీలాల్‌ నెహ్రూ, ముఖ్య సభ్యులుగా సర్‌ అలీ ఇమామ్, తేజ్‌ బహదూర్‌ సప్రూ, సుభాష్‌ చంద్రబోస్‌ ఉన్నారు. కొంతకాలానికి ఎంఆర్‌ జయకర్, అనీబిసెంట్‌ ఈ కమిటీలో చేరారు. మోతీలాల్‌ కుమారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ కమిటీ తయారుచేసిన నివేదికనే నెహ్రూ నివేదిక అంటారు. దీన్ని చట్టపరమైన శైలిలో రాశారు. భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్‌ స్టేటస్‌) నిర్ద్వంద్వంగా ఇవ్వాలని ఈ నివేదిక పేర్కొంది. ఇతర ముఖ్యమైన అంశాల్లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి, కార్యనిర్వాహక మండలి శాసనసభలకు బాధ్యత వహించడం, వయోజన ఓటింగ్‌ వంటివి ఉన్నాయి. పౌరుల ప్రాథమిక హక్కుల ప్రాధాన్యాన్ని గుర్తించిన కమిటీ నివేదికలో ఆ అంశాన్ని పొందుపరిచింది.

 

ముస్లిం లీగ్‌ అభ్యంతరాలు: కలకత్తాలో 1928, డిసెంబరులో జరిగిన అఖిలపక్ష సమావేశం నెహ్రూ నివేదికను ఆమోదించలేదు. మహమ్మద్‌ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లింలీగ్‌ 14 డిమాండ్లను ప్రతిపాదించింది. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు, కేంద్ర శాసనసభలో మూడో వంతు స్థానాలు, బెంగాల్, పంజాబ్‌ రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన  సీట్ల కేటాయింపు వంటివి ముస్లింలీగ్‌ డిమాండ్లు. ఫలితంగా అఖిలపక్ష సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.

 

  అనంతరం 1928లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో అధినివేశ ప్రతిపత్తి ఇవ్వకపోతే సంపూర్ణ స్వరాజ్యం స్థాపిస్తామని బ్రిటిష్‌ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నాటి సమావేశంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌లు సైతం అధినివేశ ప్రతిపత్తిని వ్యతిరేకించారు. అయితే గాంధీజీ వారిని సమన్వయపరిచారు. ఒక ఏడాదిలోగా బ్రిటిష్‌ ప్రభుత్వం అధినివేశ ప్రతిపత్తి ఇవ్వకపోతే సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటాన్ని, దాని సాధనకు శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించారు.

 

  ఇదే సమయంలో దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి. 1929లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంక్షోభాన్ని సృష్టించింది. రైతులు, కార్మికుల్లో అశాంతి తలెత్తి బ్రిటిషర్లపై తీవ్ర అసంతృప్తికి దారితీసింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిర్వహించిన బార్డోలీ సత్యాగ్రహం రైతులను సంఘటితం చేసింది. విప్లవవాదులైన భగత్‌సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్‌ల కార్యక్రమాలు, సాండర్స్‌ హత్య, సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీపై బాంబు దాడి మొదలైనవి భారతీయుల్లో ధైర్యాన్ని పెంచాయి. దేశసేవలో నిమగ్నత, త్యాగబుద్ధి, కర్తవ్యం వంటి సుగుణాలను విప్లవవాదులు భారతీయుల్లో పెంచి, భారత స్వాతంత్య్రోద్యమాన్ని చైతన్యం చేశారు. సహాయ నిరాకరణోద్యమం తర్వాత గాంధీజీ చేపట్టిన కార్యక్రమాలైన అస్పృశ్యతా నివారణ, మహిళాభ్యుదయ పద్ధతులు, మద్యపాన నిషేధం, కుష్ఠు నివారణ వంటివి గాంధీ నాయకత్వం పట్ల నమ్మకాన్ని పెంచాయి.

 

లాహోర్‌ కాంగ్రెస్‌ (1929) - పూర్ణ స్వరాజ్‌ తీర్మానం:  లాహోర్‌లో 1929, డిసెంబరులో రావి నది ఒడ్డున పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశం నూతన, సమరశీల రాజకీయ చైతన్యానికి, నిర్ణయాలకు కేంద్రమైంది. సంపూర్ణ స్వరాజ్యమే అంతిమ ధ్యేయమని, దాన్ని సాధించడానికి ఎన్నో త్యాగాలకు సిద్ధపడాలని నెహ్రూ ఇచ్చిన పిలుపు భారతీయులను ఉత్తేజపరిచింది. 1929, డిసెంబరు 31న లాహోర్‌ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని అధ్యక్ష స్థానంలో ఉన్న నెహ్రూ ఆవిష్కరించారు. 1930, జనవరి 26న సంపూర్ణ సాతంత్య్ర దినంగా సంబరాలు జరపాలని నిర్ణయించారు. పూర్ణ స్వరాజ్య లక్ష్యాన్ని సాధించడానికి కాంగ్రెస్‌వాదులు తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేయాలని, వచ్చే ఎన్నికల్లో పాల్గొనరాదని తీర్మానించారు. స్వాతంత్య్ర సాధనకు ఉద్యమం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించాలనే విషయాల్లో కాంగ్రెస్‌ గాంధీజీకి పూర్తి స్వేచ్ఛ, అధికారం ఇచ్చింది. అయితే గాంధీజీ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇవ్వాలనుకున్నారు. 11 డిమాండ్లతో కూడిన పత్రాన్ని నాటి భారత గవర్నర్‌ జనరల్‌ (వైస్రాయ్‌) ఇర్విన్‌కు సమర్పించారు. వాటిని అంగీకరిస్తే శాసనోల్లంఘన ఉద్యమాన్ని వాయిదా వేస్తానని ప్రకటించారు.

  * గాంధీ డిమాండ్లలో మద్యపాన నిషేధం, రూపాయికి పూర్వపు మారకపు రేటు ఇవ్వడం, భూమి శిస్తు తగ్గింపు, సైనిక వ్యయం తగ్గింపు, సివిల్‌ ఉద్యోగుల వేతనాల తగ్గింపు, ఉప్పుపై పన్ను రద్దు, విదేశీ వస్త్రాలపై పన్ను విధించడం, రాజకీయ ఖైదీల విడుదల, సీఐడీ శాఖ రద్దు వంటివి ఉన్నాయి. అయితే ఈ డిమాండ్లను లార్డ్‌ ఇర్విన్‌ తిరస్కరించారు. దీంతో శాసనోల్లంఘన ఉద్యమం అనివార్యమైంది. గాంధీజీ ప్రజలతో ‘‘ప్రభుత్వం ఎలాంటి హింసాయుత విధానం అనుసరించినా హింసకు ప్రతి హింస చెయ్యను’’ అని ప్రతిజ్ఞ చేయించారు. శాసనోల్లంఘన ప్రారంభ కార్యక్రమంపై పలువురు నాయకులు పలు విధాలుగా చెప్పినప్పటికీ, గాంధీజీ తన అంతర్వాణి ప్రకారం ఉప్పుపై పన్ను నిరాకరణతో ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు.

 

శాసనోల్లంఘన ప్రారంభం (1930): ఉప్పు భారతీయులందరికీ నిత్యావసర ఆహార పదార్థం. అయితే ఉప్పు తయారీపై ప్రభుత్వానికే గుత్తాధిపత్యం ఉండేది. పౌరులెవరూ దీన్ని తయారు చేయకూడదు. దానిపై పన్ను కూడా ఉంది. దీన్ని భారతీయులందరూ తప్పనిసరిగా వినియోగించడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువగానే ఉంది. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాలని నిర్ణయించిన తర్వాత తగిన మార్గనిర్ణయం చేయమంటూ గుజరాత్‌ భౌగోళిక పరిస్థితులు బాగా తెలిసిన సర్దార్‌ పటేల్‌ను గాంధీజీ కోరారు. 1930, మార్చి 12న గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో బయలుదేరారు. గాంధీజీకి ఆయన సతీమణి కస్తూర్బా తిలకం దిద్ది, స్వయంగా వడికిన నూలు దండ వేశారు. ప్రార్థనా గీతం తర్వాత యాత్ర ప్రారంభమైంది. దారిపొడవునా స్వాగతాలు హోరెత్తాయి. సత్యాగ్రహులు రోజూ నిర్దేశించిన మైళ్లు నడవాలి, నిత్యం రాట్నం వడకాలి, ప్రార్థన చేయాలి, డైరీ రాయాలి, స్వయం వంట, సాధారణ భోజనం వంటి మార్గనిర్దేశాలు ఉన్నాయి. ఈ మహత్తర యాత్రను, గాంధీని ప్రత్యక్షంగా చూసేందుకు దారి పొడవునా జనం బారులు తీరేవారు. మహా నాయకుడిగా గాంధీజీ ముందు నడుస్తుంటే సత్యాగ్రహులు ఆయన్ను అనుసరించేవారు. దారిలో గ్రామం వస్తే చిన్న సభ జరిగేది. గాంధీ ప్రసంగించేవారు. ఈ యాత్ర అంతా అద్భుత దృశ్యం. నిర్ణయించిన విధంగా యాత్ర గుజరాత్‌ తీరంలో ఉన్న ‘దండి’ గ్రామం చేరింది. 1930, ఏప్రిల్‌ 6న ఉప్పు తయారు చేయడంతో ఒక మహా ప్రజా ఉద్యమానికి (శాసనోల్లంఘన ఉద్యమం) తెరలేచింది.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 31-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పల్లవులు


* కె.పి.జైశ్వాల్‌ అనే చరిత్రకారుడు ‘‘ఉత్తర భారతదేశానికి గుప్తులు ఎలాగో, దక్షిణ భారతదేశానికి పల్లవులు అలాంటివారు’’ అని వ్యాఖ్యానించారు.


చారిత్రక ఆధారాలు

*వివిధ శాసనాలు, సాహిత్యాలు పల్లవుల చరిత్రకు ముఖ్య ఆధారాలుగా ఉన్నాయి.

* మొదటి మహేంద్రవర్మ తిరుచిరాపల్లి, మందగపట్టు, కుడుమియామలై శాసనాలు; మొదటి నరసింహవర్మ బాదామి శాసనం; నందివర్మ ఉదియేందిర శాసనం, మంచికల్లు, మైదవోలు శాసనాలు వీటిలో ముఖ్యమైనవి. 

* ఇవేకాకుండా పల్లవులకు సమకాలికులైన బాదామి చాళుక్యరాజు రెండో పులకేశి వేయించిన ఐహోల్‌ శాసనం; గాంగ వంశీయుల శాసనాలు కూడా పల్లవుల చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.

*పల్లవ మహేంద్రవర్మ రచించిన ‘మత్తవిలాస ప్రహసనం’; దండి ‘దశకుమార చరిత్ర’, ‘కావ్యదర్శనం’; భారవి కిరాతార్జునీయం వీరి చరిత్రను తెలుపుతున్నాయి. 

*తమిళంలో ఆళ్వార్లు, నాయనార్లు రచించిన గ్రంథాలు (దేవారం); తిరునాళ్వార్‌ రచించిన ‘కురళ్‌’; సింహళ బౌద్ధగ్రంథాలైన దీపవంశం, మహావంశం; హుయాన్‌త్సాంగ్‌ సి-యు-కి గ్రంథాలు పల్లవుల చరిత్రకు ప్రధాన ఆధారాలు. 

* పల్లవుల కట్టడాలు, నాణేలు, శిల్పాలు మొదలైనవి పురావస్తు ఆధారాలుగా ఉన్నాయి. కంచి, మహాబలిపురంలోని కట్టడాలు, వైకుంఠ పెరుమాళ్‌ దేవాలయంలో నిర్మించిన శిల్పాలు పల్లవుల కాలం నాటి వాస్తు, శిల్పకళను తెలుపుతున్నాయి.


పుట్టుపూర్వోత్తరాలు

* పల్లవుల పుట్టుపూర్వోత్తరాల గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. 

* ‘‘పల్లవుల వంశోత్పత్తి భారతదేశ చరిత్రలోని నిగూఢ రహస్యాల్లో ఒకటి’’ - వి.ఎ.స్మిత్‌

*‘‘పర్షియా నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన పార్థియన్లే పల్లవులు’’ 

                                                                                                                                                                                                                                                                                                                                                                  - లూయీరైస్, డూబ్రె, వెంకయ్య 

*‘‘అశోకుడి శాసనాల్లో పేర్కొన్న పాలర్లు లేదా పుళిందులే పల్లవులు’’ - సత్యనాథ్‌ అయ్యర్‌ 

* ‘‘పల్లవులు వాకాటక వంశ శాఖకి చెందినవారు’’ - కె.పి.జైశ్వాల్‌ 

*‘‘పల్లవ పదం తొండై పదానికి సంస్కృతీకరణ. వీరు తొండైమండలానికి చెందినవారు’’ 

                                                                                                                                                                                                                                                                                                                                                                     - కృష్ణస్వామి అయ్యంగార్‌

*సింహళ బౌద్ధగ్రంథం ‘మహావంశం’లో కృష్ణానదీ తీరంలో ‘పల్లవబోగ్గ’ అనే ప్రదేశం గురించి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పల్నాడు. ఇక్కడే తొలి పల్లవ శాసనాలైన మంచికల్లు, మైదవోలు లభించాయి. కాబట్టి పల్లవులు ఆంధ్రులని కొంతమంది చరిత్రకారుల వాదన.

*మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పల్లవులు మొదట పల్నాడులో నివసించారు. తర్వాత తొండైమండలం (తమిళనాడు)కి వలస వెళ్లి అక్కడ నాగవంశీయులతో వైవాహిక సంబంధాలు ఏర్పర్చుకుని స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించారు. 

*‘మణిమేఖలై’ అనే తమిళ కావ్యంలోని కథ ఆధారంగా చోళ-నాగ వంశానికి జన్మించిన వారు పల్లవులని తమిళనాడుకి చెందిన చరిత్రకారులు పేర్కొన్నారు. 

* పురాణాలు ఆంధ్రులను, పల్లవులను కలిపి పేర్కొన్నాయి.

* రాజశేఖర కవి రచించిన ‘భువనకోశం’లో వాయవ్య సరిహద్దుల్లో పహ్లవులు, దక్షిణాన పల్లవులు ఉన్నట్లు ఉంది.

*పల్లవ రాజవంశం ఒక్కటే అయినప్పటికీ చరిత్రకారులు దీన్ని నాలుగు వర్గాలుగా విభజించారు. 

1. ప్రాకృత శాసన పల్లవులు       2. సంస్కృత శాసన పల్లవులు 

3. మహా పల్లవులు                 4. కడపటి పల్లవులు

* వీరిలో మొదటి రెండు వర్గాలను ప్రాచీన పల్లవులని, మిగిలిన వారిని నవీన పల్లవులు లేదా బృహత్‌ పల్లవులని పేర్కొన్నారు.

నవీన పల్లవులు

* వీరినే మహా పల్లవులు లేదా బృహత్‌ పల్లవులు అంటారు. వీరు క్రీ.శ. 575 నుంచి క్రీ.శ.897 మధ్య రాజ్యాన్ని పాలించారు. నవీన పల్లవుల వంశానికి మూల పురుషుడు సింహ విష్ణువు.

సింహ విష్ణువు  

*ఇతడు క్రీ.శ. 575 నుంచి క్రీ.శ.600 వరకు రాజ్యపాలన చేశాడు.

*ఇతడు చోళ మండలాన్ని జయించి, తన రాజ్యాన్ని కావేరి నది వరకు విస్తరింపజేశాడు. 

*కలభ్ర, చోళ, పాండ్య, కేరళ రాజ్యాలను ఓడించాడు. ‘కంచి’లో పల్లవ రాజ్యాన్ని బలోపేతం చేశాడు. 

*ఇతడి ఆస్థానంలో ‘భారవి’ అనే కవి ఉండేవాడు. భారవి ‘కిరాతార్జునీయం’ అనే గ్రంథాన్ని రచించాడు. 

* ఇతడికి ‘అవని సింహ’ అనే బిరుదు ఉంది.

మొదటి మహేంద్రవర్మ

* ఇతడు క్రీ.శ. 600 నుంచి క్రీ.శ. 630 వరకు రాజ్యపాలన చేశాడు

* సింహ విష్ణువు కుమారుడు ‘మొదటి మహేంద్రవర్మ’. ఇతడు మొదట జైన మతాభిమాని. ‘అప్పార్‌’ బోధనల వల్ల శైవమతాన్ని స్వీకరించారు. 

* పల్లవ రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణా నది వరకు విస్తరించి బాదామి చాళుక్యులు, పాండ్యులతో వైరాన్ని ప్రారంభించాడు. 

*మొదటి మహేంద్రవర్మ పాండ్యులను ఓడించి కావేరి నదీ ప్రాంతంలోని డెల్టా భూములను ఆక్రమించాడు. 

* క్రీ.శ. 630లో రెండో పులకేశి ఇతడిపై దండెత్తాడు. దీన్ని ‘పుల్లలూరు యుద్ధం’గా పేర్కొంటారు. ఈ యుద్ధంలో పులకేశి మహేంద్రవర్మను ఓడించి, పల్లవ రాజ్యంలోని ఉత్తర ప్రాంతాలను ఆక్రమించాడు.  ఈ యుద్ధం జరిగిన కొద్దికాలానికే మహేంద్రవర్మ మరణించాడు. 

ఇతర విశేషాలు

* మహేంద్రవర్మ సంగీత విద్వాంసుడు, చిత్రకారుడు. వాస్తు, శిల్పానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 

*మహేంద్రవర్మ ‘మత్తవిలాస ప్రహసనం’ అనే గ్రంథాన్ని రచించాడు. ‘రుద్రాచార్యుడి’ దగ్గర సంగీతం నేర్చుకున్నాడు.

*పుదుక్కొట సమీపంలోని కుడుమియామలైలో ఇతడు శిలాశాసనం వేయించాడు. ఇందులో  గోడపై చెక్కిన గణపతి విగ్రహంతోపాటు వీణపై సాధన చేయడానికి అవసరమైన సంగీత పాఠాలు ఉన్నాయి. 

* ఇతడు ‘భగవదజ్జుక’ అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. 

* మహేంద్రవాడి, మామండూర్, దళవానూర్‌లో చెరువులు తవ్వించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. 

* మహేంద్రవర్మ దక్షిణ భారతదేశంలో ద్రావిడ వాస్తు శిల్పకళారీతులకు నాంది పలికాడు. 

* ఇతడి కాలంలోనే కొండలను తొలిచి ఆలయాలు నిర్మించే పద్ధతి ప్రారంభమైంది. ఇటుక, కలప, లోహాలతో సంబంధం లేకుండా ఆలయాలు నిర్మించేవారు. తిరుచిరాపల్లి, చెంగల్పట్టు, మల్లవరం, మామండూర్, దళవానూర్‌లోని గుహాలయాలు ఇతడి కాలంనాటివే. 

* సిత్తన్న వాస గుహల్లోని వర్ణచిత్రాలు ఇతడి కాలానికి చెందినవే. 

* ఇతడికి విచిత్ర చిత్రుడు, చిత్రకార పులి, గుణభర, అవనీ భాజన, సత్యసంధి, పరమ మహేశ్వర అనే బిరుదులు ఉన్నాయి.


మొదటి నరసింహవర్మ

*ఇతడు క్రీ.శ. 630 నుంచి క్రీ.శ.668 వరకు రాజ్యపాలన చేశాడు.

*ఇతడు మొదటి మహేంద్రవర్మ కుమారుడు. నరసింహవర్మ తన తండ్రిని ఓడించిన రెండో పులకేశిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అతడిపై దండెత్తి ‘మణిమంగళ యుద్ధం’లో ఓడించి, వధించాడు. బాదామి, వాతాపిలను నాశనం చేశాడు.

*ఈ యుద్ధంలో సింహళరాజు ‘మారవర్మ’ నరసింహవర్మకు సహాయం చేశాడు.

*ఈ విజయాలకు చిహ్నంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ అనే బిరుదులు పొందాడు.

* నరసింహవర్మ సేనాని ‘చిరుతొండ పరంజ్యోతి’.


ఇతర విశేషాలు

*మొదటి నరసింహవర్మ తన తండ్రి ప్రారంభించిన వాస్తు, శిల్ప కళారీతులను కొనసాగించాడు.

* తండ్రి పేరు మీద సముద్ర తీరాన ‘మామల్లపురం’ లేదా ‘మహాబలిపురం’ అనే రేవు పట్టణాన్ని నిర్మించాడు. ఇది విదేశీ వ్యాపారానికి, సముద్రయానానికి ఉపయోగపడింది.

*చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ ‘కంచి’ని దర్శించి, దీని గురించి తన రచనల్లో వర్ణించాడు. మామల్లపురం కంచికి 10 కి.మీ. దూరంలో ఉందని, కంచిలో 100 బౌద్ధారామాలు, 10 వేల మంది బౌద్ధ బిక్షువులు, 80కి పైగా హిందూ దేవాలయాలు ఉన్నట్లు పేర్కొన్నాడు.

* ఏకశిలా నిర్మితమైన ఏడు రాతి రథాలను (seven pagodas) నరసింహవర్మ మహాబలిపురంలోనే నిర్మించాడు.

*ఇతడి చివరి దశలో రెండో పులకేశి కుమారుడైన మొదటి విక్రమాదిత్యుడు పల్లవ రాజ్యంపై దండెత్తి, నరసింహవర్మను ఓడించి చాళుక్య ప్రాంతాలను తిరిగి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ యుద్ధంలో విక్రమాదిత్యుడికి గంగ దుర్వినీతుడు సాయం చేశాడు.

* నలందా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పనిచేసిన ‘ధర్మపాలుడు’ కంచి నగరానికి చెందినవాడని కొంతమంది చరిత్రకారుల భావన.

ప్రాచీన పల్లవులు

*ప్రాచీన పల్లవుల గురించి తెలుసుకోవడానికి 20 శాసనాలు ఉన్నాయి. వీటిలో నాలుగు శాసనాలు ప్రాకృతంలో, మిగిలినవి సంస్కృతంలో ఉన్నాయి. అయితే ప్రాచీన పల్లవుల గురించి పూర్తి సమాచారం ఇంకా లభ్యం కాలేదు.

* ప్రాచీన పల్లవ వంశానికి మూల పురుషుడు ‘వీరకూర్చవర్మ’ (క్రీ.శ. 285310). ఇతడు నాగరాజు కుమార్తెను వివాహం చేసుకుని ఇక్ష్వాకులను జయించాడు. వీరకూర్చవర్మ కంచిని రాజధానిగా చేసుకుని పాలించాడు.

*వీరకూర్చవర్మ తర్వాత అతడి కుమారుడు శివస్కందవర్మ (క్రీ.శ. 310335) రాజ్యపాలన చేశాడు. ఇతడు వాజపేయ, అశ్వమేధ యాగాలు చేశాడు. ఇతడికి ‘ధర్మమహారాజాధిరాజు’ అనే బిరుదు ఉంది. ఇతడు ప్రాచీన పల్లవుల్లో గొప్పవాడు.

*శివస్కందవర్మ తర్వాత త్రిలోచన పల్లవుడు రాజ్యపాలన చేశాడు. ఇతడు శ్రీశైల పర్వతానికి చుట్టుపక్కల ఉన్న అడవులను నరికించి, వాటిని నివాసయోగ్యంగా మార్చాడు. అక్కడ బ్రాహ్మణులకు అగ్రహారాలు నిర్మించాడు. త్రిలోచనుడి కాలంలో కరికాల చోళుడు తొండైమండలంపై దాడిచేసి ఇతడ్ని ఓడించి, బానిసగా చేసుకున్నాడని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.

* త్రిలోచనుడి తర్వాత మొదటి కుమార విష్ణువు, బుద్ధవర్మ, రెండో కుమార విష్ణువు, మొదటి సింహవర్మ, స్కందవర్మ, నందివర్మ రాజ్యాన్ని పాలించారు.

* ప్రాచీన పల్లవుల్లో చివరివాడు ‘నందివర్మ’. ఇతడి కాలంలో ‘కలభ్రులు’ దండెత్తి దక్షిణ భారతదేశాన్ని జయించారు. వీరి గురించి పూర్తి సమాచారం లేదు. నందివర్మతో ప్రాచీన పల్లవ వంశం అంతమైంది.
 

Posted Date : 15-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత జాతీయవాద రాజకీయాలు

స్వరాజ్య కాంక్షను రగిలించిన రాజకీయం!

 


  త్యాగాలతో కూడిన భారతీయుల పోరాటాలు, నిజాయతీ నిండిన రాజకీయాలు తెల్లవారిని ఆలోచనలో పడేశాయి. వారిలోని ఉదారత్వాన్ని మేల్కొలిపాయి. తదనంతర కాలంలో దేశంలో పాలనకు మూలమైన ఒక చట్టాన్ని చేయడానికి ప్రేరణగా మారాయి. ఆ కొత్త చట్టం కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతగా ప్రభావం చూపలేకపోయిన ముస్లింలీగ్‌ అవకాశవాద చర్యలతో ఆంగ్లేయుల వైపు చేరింది. బలవంతంగా భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగిన బ్రిటన్‌ నియంతృత్వ పోకడలను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా నిరసించారు. మంత్రి పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. వైఖరి మార్చుకున్న వైస్రాయ్, ముస్లిం లీగ్‌ వైపు మొగ్గు చూపి ప్రత్యేక దేశ విభజన డిమాండ్లను ప్రోత్సహించాడు. సంగ్రామ కాలంలో సంభవించిన పరిణామాలతో రగిలిన స్వాతంత్య్రకాంక్ష తర్వాతి దశ జాతీయోద్యమంపై అత్యంత ప్రభావాన్ని ప్రదర్శించింది.

 


  గాంధీజీ నాయకత్వంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత జాతి చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. మనవాళ్ల ప్రగాఢ స్వాతంత్య్రాభిలాషను విభిన్న నిరసనలతో ప్రదర్శించింది. స్వాతంత్య్రం కోసం భారతీయులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని లోకానికి తెలియజేసింది ఈ క్రమంలో బ్రిటిషర్లలో కొంత ఉదారవాద చైతన్యం వచ్చింది. శాసనోల్లంఘన ఉద్యమం, నైతిక విలువలతో కూడిన గాంధీజీ రాజకీయాల వల్ల ఆంగ్లేయ ప్రభుత్వంలోనూ కొంత మార్పును తీసుకొచ్చింది. అయినా రాజ్యాంగ సంస్కరణల విషయమై ప్రతిష్టంభన ఏర్పడింది. ఇంతలో సైమన్‌ కమిషన్‌ నివేదిక, మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో వచ్చిన సూచనలు కలిపి 1933లో ఒక శ్వేతపత్రంగా వెలువడ్డాయి. ఈ సూత్రాలను పరిశీలించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడానికి లార్డ్‌ లిన్‌లిత్‌గో నాయకత్వంలో పార్లమెంట్‌ జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటిష్‌ పార్లమెంట్‌ ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. స్వాతంత్య్రం వచ్చే వరకు ఆ చట్టంలోని అంశాలే భారతదేశ పాలనకు ప్రాతిపదికలయ్యాయి. ఆ తర్వాత అవే రాజ్యాంగ రచనకు మార్గదర్శకాలుగా మారాయి.

 


భారత ప్రభుత్వ చట్టం-1935 ముఖ్యాంశాలు: * ఈ చట్టం అఖిల భారత సమాఖ్య (ఫెడరల్‌) వ్యవస్థను ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య నిర్దిష్ట అధికార విభజన చేసింది. దీని ద్వారా ప్రభుత్వ అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించి అవశిష్ట అధికారాలను వైస్రాయ్‌-గవర్నర్‌ జనరల్‌కు కట్టబెట్టింది.

 


* కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్ర శాసనసభ (సెంట్రల్‌ లెజిస్లేచర్‌), రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రాల శాసనసభలు (ప్రొవిన్షియల్‌ లెజిస్లేచర్‌) చట్టాలను చేస్తాయి. ఇక ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర శాసనసభలు చట్టాలను చేయవచ్చు. ఈ విధంగా రూపొందించిన కేంద్ర, రాష్ట్రాల చట్టాల మధ్య వైరుధ్యం ఉంటే కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది. 

 


* కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక ఫెడరల్‌ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల శాసనసభలను ద్విశాసన సభలుగా రూపొందించింది. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్‌ల నియంత్రణలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని (అటానమీ) కల్పించింది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. 

 


* భారత ప్రభుత్వ చట్టం-1858 ద్వారా భారత రాజ్య కార్యదర్శికి సలహాలను ఇవ్వడానికి లండన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా కౌన్సిల్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ చట్టానికి జాతీయోద్యమ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. 

 


* భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగంలోని అనేక అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించింది. 

 


భారత ప్రభుత్వ చట్టం-1935 కింద ఎన్నికలు: బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాల్లో ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ వివరణాత్మకమైంది, సుదీర్ఘమైంది. 1937, ఏప్రిల్‌ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కానీ ఈ చట్టంలోని సమాఖ్య వ్యవస్థ ఆచరణలోకి రాలేదు. రాష్ట్రాలకు సంబంధించిన భాగం మాత్రమే అమలైంది. ఈ చట్టం ప్రకారం 1937లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ముస్లింలీగ్‌ అతికష్టం మీద ఇతర పార్టీల సహాయంతో రెండు రాష్ట్రాల్లో గెలిచింది. అధిక సంఖ్యాక ప్రజలు కాంగ్రెస్‌ను బలపరుస్తున్నారని తేటతెల్లం కావడం ఆ పార్టీకి మింగుడు పడలేదు.* ఈ చట్టంలో పొందుపరిచిన అత్యంత ముఖ్యమైన అంశం ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తి’. దీని ద్వారానే మొదటిసారిగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పాలనాంశాలన్నింటినీ మంత్రుల అధికార పరిధిలోకి బదిలీ చేశారు. రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణ చాలా వరకు తగ్గింది. గవర్నర్లను రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన అధిపతులుగా పరిగణించారు. బొంబాయి, మద్రాసు, సెంట్రల్‌ ప్రావిన్స్, ఒరిస్సా, యునైటెడ్‌ ప్రావిన్స్, బిహార్, వాయవ్య సరిహద్దు రాష్ట్రం, అస్సాంలలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు కొలువుతీరాయి. ఈ ప్రభుత్వాలు తమకున్న పరిధిలో ప్రజల స్థితిగతులు మార్చడానికి, పౌర హక్కులు కల్పించడానికి కృషి చేశాయి. పత్రికలపై ఆంక్షల తొలగింపు, కొన్ని సంస్థలపై బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన బహిష్కరణలను ఎత్తివేయడంతో పాటు రాజకీయ ఖైదీలను విడుదల చేశాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించి ప్రజానుకూల శాసనాలను తీసుకొచ్చాయి. ఖాదీని ప్రోత్సహిస్తూ హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టాయి. పారిశ్రామికవేత్తలు, కార్మికుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పాయి. మంత్రులు వేతనాలు, ఖర్చులను తగ్గించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు నిజాయతీతో వ్యవహరించిన కాంగ్రెస్‌ మంత్రివర్గాలు ప్రజాసేవలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి.

 


రెండో ప్రపంచ యుద్ధం

 
  జర్మనీ నియంత హిట్లర్‌ రాజ్య విస్తరణ కాంక్షతో పోలెండ్‌పై యుద్ధం ప్రకటించడంతో 1939, సెప్టెంబరులో రెండో ప్రపంచ సంగ్రామం మొదలైంది. బ్రిటన్, ఫ్రాన్స్‌లు పోలెండ్‌కు మద్దతుగా జర్మనీతో తలపడాల్సి వచ్చింది. జర్మనీ, ఇటలీ, జపాన్‌ ఒక వైపు; బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా మరో వైపు యుద్ధానికి దిగాయి.  మన జాతీయ నాయకులు, కేంద్ర శాసనసభ సభ్యులెవరినీ సంప్రదించకుండానే బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి దింపింది. నాజీ, ఫాసిస్ట్‌ వంటి ప్రపంచ నియంతృత్వ శక్తులతో పోరాటానికి కాంగ్రెస్‌ నాయకులు సుముఖంగానే ఉన్నప్పటికీ, భారతదేశంలో బ్రిటన్‌ అవలంబిస్తున్న పద్ధతుల పట్ల విముఖత చూపారు. దేశంలో రాజ్యాంగబద్ధ అసెంబ్లీ, కేంద్రంలో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు వంటి కనీస షరతులను ఆమోదిస్తేనే బ్రిటన్‌ యుద్ధ ప్రయత్నాలకు సహకరిస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనలను రాజప్రతినిధి లిన్‌లిత్‌గో తోసిపుచ్చాడు. ఈ ఏకపక్ష ధోరణికి నిరసనగా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. మరోవైపు మహమ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలోని ఇండియన్‌ ముస్లింలీగ్‌ మాత్రం బ్రిటిష్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపింది. 1939, డిసెంబరు 22ను ముస్లింలీగ్‌ ‘విమోచన దినం’గా నిర్వహించింది.

 


ప్రత్యేక పాకిస్థాన్‌ డిమాండ్‌ 


  రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రాజీనామా చేయడంతో వైస్రాయ్‌ వైఖరిలో మార్పు వచ్చింది. ముస్లిం లీగ్‌ వైపు మొగ్గు చూపుతూ, దాని డిమాండ్లను బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రారంభించింది. దాంతో కాంగ్రెస్‌కు బద్ధ శత్రువుగా ముస్లింలీగ్‌ మారింది. 1940, మార్చిలో లాహోర్‌లో జరిగిన ముస్లింలీగ్‌ సమావేశంలో హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులు అనే ఒక అశాస్త్రీయ సిద్ధాంతాన్ని జిన్నా ప్రచారం చేశాడు. ఈ సమావేశంలోనే ముస్లింలీగ్‌ మొదటిసారిగా ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం ‘పాకిస్థాన్‌’ కావాలని తీర్మానం జరిగింది. యుద్ధ కాలంలో భారతదేశ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. రెండో ప్రపంచ సంగ్రామం హోరుగా సాగుతున్న సమయంలోనే, ఐరోపా వలస రాజ్యాల్లో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికి ప్రజా పోరాటాలు పుంజుకున్నాయి. ఆ విధంగా రెండో ప్రపంచ యుద్ధం భారతదేశంలో తదుపరి స్వాతంత్య్ర పోరాట గతిని అనూహ్యంగా మార్చేసింది.

 


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం
 

Posted Date : 08-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారత రాజకీయాలు ఆగస్టు ఆఫర్‌ (1940), క్రిప్స్‌ మిషన్‌ (1942)

 దిగివచ్చిన తెల్లదొరలు!

 


బ్రిటిష్‌ సామ్రాజ్య ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిన రెండో ప్రపంచ యుద్ధం భారతీయులకు మంచి అవకాశాన్ని అందించింది. ముప్పు ముంచుకు రావడంతో మన నాయకుల మద్దతు కోసం తెల్లవారు దిగివచ్చారు. రాజ్యాంగాన్ని స్వయంగా రాసుకునే హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వయం ప్రతిపత్తికి ఒప్పుకున్నారు. కానీ పూర్తి అధికారాలను బదిలీ చేయడానికి అంతగా ఇష్టపడని ఆంగ్లేయులు చేసిన ప్రతిపాదనలు, రాయబారాలు ఆఖరికి విఫలమయ్యాయి. కానీ ఈ పరిణామాలన్నీ ప్రజల్లో జాతీయ భావం, స్వరాజ్య సంకల్పం మరింత పటిష్ఠమయ్యేందుకు దోహదపడ్డాయి. మరో మహోద్యమానికి అందరూ సంసిద్ధులయ్యేందుకు సాయపడ్డాయి.

 

జర్మనీ నాజీ నియంత హిట్లర్‌ సామ్రాజ్యకాంక్ష రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. జర్మనీ, జపాన్, ఇటలీ, హంగేరీ, రొమేనియా, బల్గేరియా లాంటి దేశాలు అక్ష రాజ్య కూటమిగా; బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాలు మిత్ర రాజ్య కూటమిగా యుద్ధంలో హోరాహోరీగా తలపడ్డాయి. జాతీయ కాంగ్రెస్‌తో లేదా కేంద్ర శాసనసభకు ఎంపికైన సభ్యులతో కనీసం సంప్రదించకుండా యుద్ధంలో బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం భాగస్వామి కావడాన్ని భారతీయులు వ్యతిరేకించారు. తదనంతర పరిణామాల్లో బ్రిటన్‌ యుద్ధ చర్యలను వ్యతిరేకిస్తూ, బ్రిటిష్‌ ఇండియా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాజీనామాలు చేశాయి. ఐరోపా, ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి భారతీయుల సహాయ సహకారాలు అత్యంత అవసరమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లండ్‌ క్లిష్ట పరిస్థితిని గమనించిన భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. యుద్ధ లక్ష్యాలను బ్రిటన్‌ స్పష్టంగా ప్రకటించాలని, కేంద్రంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం తొలుత ఉదాసీనంగా ఉన్నప్పటికీ, తర్వాత పరిస్థితులు మారిపోవడంతో భారతీయుల సహకారం కోసం నాటి వైస్రాయ్‌ లార్డ్‌ లిన్‌లిత్‌ గో ద్వారా 1940, ఆగస్టు 8న ఒక ప్రకటన చేయించింది. దీనినే ఆగస్టు ప్రతిపాదన (ఆగస్టు ఆఫర్‌) అంటారు.


ఆగస్టు ప్రతిపాదన ముఖ్యాంశాలు: * జాతి జీవన పోరాటంలో నిమగ్నమై ఉన్న సమయంలో రాజ్యాంగ సమస్యలు పరిష్కారం కావని, యుద్ధానంతరం భారతీయులు తమ ఆశయాలు, ఆశలకు అనుగుణంగా రాజ్యాంగ రచన చేసుకునే విధంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

* అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలకు భంగం కలిగించే లేదా వారు అంగీకరించని అంశాలతో కూడిన ఏ రాజ్యాంగమైనా బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఆమోదనీయం కాదని ప్రకటించారు. 

* యుద్ధానంతరం భారతదేశానికి డొమినియన్‌ ప్రతిపత్తి కల్పిస్తూ ఒక బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

* యుద్ధ సమయంలో తాత్కాలిక చర్యగా రాజప్రతినిధి (వైస్రాయ్‌) కార్యనిర్వహణ మండలిలో భారతీయ ప్రతినిధులకు అవకాశం కల్పిస్తారు.
* యుద్ధకాలంలో బ్రిటిష్‌ ఇండియా, భారత రాజ్యాల ప్రతినిధులతో కూడిన ఒక యుద్ధ సలహా మండలి ఏర్పాటవుతుంది.


ఆగస్టు ప్రతిపాదన విశిష్టత: మొదటిసారిగా భారతీయులకు తమ రాజ్యాంగాన్ని రాసుకునే హక్కు కల్పించింది. కానీ ఈ ప్రతిపాదనలు భారతీయుల ప్రధాన డిమాండ్‌ అయిన స్వయంపాలనను నెరవేర్చలేదు. అల్పసంఖ్యాక వర్గాల పట్ల శ్రద్ధ పేరుతో, భారతీయులకు అధికార బదిలీ నిలుపుదల చేసే అంతరార్థం వ్యక్తమైంది. ఈ ప్రతిపాదనలు అధిక సంఖ్యాక భారతీయులకు ఆశాభంగం కలిగించాయి. దాంతో వైస్రాయ్‌ ప్రతిపాదనలను జాతీయ కాంగ్రెస్‌ తిరస్కరించింది.


రెండో ప్రపంచ యుద్ధ పురోగతి: ఐరోపా యుద్ధరంగంలో హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ కూటమి రెచ్చిపోయింది. పశ్చిమ దేశాల్లో అనూహ్య విజయాలు సాధించింది. ఫ్రాన్స్‌ ఉత్తర, ఆగ్నేయ ప్రాంతాలను ఆక్రమించింది. రష్యాపై దాడి చేసింది. తూర్పు యూరప్‌ రాజ్యాలు హిట్లర్‌కు లొంగిపోయాయి. ఆసియా యుద్ధరంగంలో జపాన్‌ వీరవిహారం చేసింది. ఆగ్నేయాసియాలోని బ్రిటన్‌ వలస రాజ్యాలైన ఫిలిప్పీన్స్, ఇండోచైనా, ఇండొనేసియా, మలేసియాలను ఒక్కొక్కటిగా జపాన్‌ సైన్యం ఆక్రమించి, బర్మాలోకి ప్రవేశించింది. యుద్ధం దాదాపు భారతదేశపు ముంగిట్లోకి వచ్చేసింది. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యానికి అంతిమ ఘడియలు సమీపించాయని ఆందోళన కలిగించింది. పెర్ల్‌ హార్బర్‌ దీవుల్లో అమెరికా నౌకా శ్రేణిపై జపాన్‌ మెరుపుదాడి చేసింది. ఈ పరిణామాలు బ్రిటన్, దాని మిత్ర రాజ్యాలకు మింగుడు పడలేదు. జపాన్‌ సేనల విజృంభణను నిలువరించేందుకు భారతీయుల సహకారం అవసరమని అమెరికా, రష్యా భావించాయి. దాంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్‌ భారతదేశంలో రాజకీయ సంస్కరణల కోసం బ్రిటిష్‌ ప్రధాని చర్చిల్‌పై ఒత్తిడి తెచ్చాడు. బ్రిటిష్‌ ఇండియా అభివృద్ధి నిరోధక రాజకీయాలకు విన్‌స్టన్‌ చర్చిల్‌ మద్దతు, ప్రోత్సాహం ఉండేవి. కానీ యుద్ధకాలం నాటి స్థితి భిన్నంగా ఉంది. భారత్‌లో ప్రజాభిప్రాయాన్ని తమకు అనువుగా మలుచుకోవడానికి బ్రిటిషర్లు కొన్ని సానుకూల చర్యలు చేపట్టక తప్పలేదు. అందులో భాగమే సర్‌ స్టాఫోర్డ్‌ క్రిప్స్‌ రాయబారం (1942).


క్రిప్స్‌ మిషన్‌: భారత నాయకులతో సంప్రదింపులు జరపడానికి బ్రిటన్‌ ప్రభుత్వం క్రిప్స్‌ను రాయబారిగా పంపింది. 1942, మార్చిలో అతడు సంప్రదింపులు ప్రారంభించాడు. కాంగ్రెస్‌ తరఫున జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు.


క్రిప్స్‌ ప్రతిపాదనలు: * యుద్ధానంతరం భారతదేశానికి డొమినియన్‌ ప్రతిపత్తి కల్పిస్తారు. భారత్‌కు కామన్‌వెల్త్‌ నుంచి వైదొలిగే హక్కు కూడా ఉంటుంది.

* యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగం రూపొందించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది. 

* కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి సిద్ధపడని రాష్ట్రాలు లేదా రాష్ట్రం వేరే యూనియన్‌గా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. స్వదేశీ సంస్థానాలకు కూడా కొత్త రాజ్యాంగానికి కట్టుబడి ఉండటానికి, లేకపోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. 

* బ్రిటిష్‌ ప్రభుత్వం పూర్తి అధికారాన్ని బదిలీ చేయడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను చర్చించడానికి రాజ్యాంగ పరిషత్తు, బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక  ఒప్పందం కుదుర్చుకోవాలి.

* నూతన రాజ్యాంగం సిద్ధమయ్యే లోపు తాత్కాలికంగా దేశ రక్షణ విషయాలపై బ్రిటిష్‌ ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. వైస్రాయ్‌ అధికారాలు యథాతథంగా ఉంటాయి.


క్రిప్స్‌ ప్రతిపాదనల్లో డొమినియన్‌ ప్రతిపత్తి కల్పించి భారత యూనియన్‌ ఏర్పాటు చేయడం, కామన్‌వెల్త్‌ నుంచి విడిపోయే హక్కు ఉండటం మంచి విషయాలే. కానీ భారత యూనియన్‌ నుంచి బ్రిటిష్‌ రాష్ట్రాలు, స్వదేశీ సంస్థానాలు విడిపోయే అవకాశం ఇవ్వడం ప్రమాదకర అంశం. వివిధ భారతీయ ప్రతినిధుల ప్రాతినిధ్యంతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకావాలని, దాని రాజ్యాంగబద్ధ అధిపతిగా మాత్రమే రాజప్రతినిధి ఉండాలనేది భారతీయుల కోరిక. అందుకే కాంగ్రెస్‌ ఈ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.  ప్రత్యేక పాకిస్థాన్‌ గురించి స్పష్టత లేదంటూ ముస్లింలీగ్‌ కూడా వ్యతిరేకించింది. మిగిలిన రాజకీయ పక్షాలు కూడా వివిధ కారణాలతో అసంతృప్తిని వెల్లడించాయి. క్రిప్స్‌ ప్రతిపాదనలను ‘పతనం అవుతున్న బ్యాంకు పేరిట అనంతర తేదీతో ఇచ్చిన బ్యాంకు చెక్కు వంటిది’ అని గాంధీ విమర్శించారు. భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయడానికి బ్రిటిషర్లలో ఉన్న తీవ్ర అయిష్టతే క్రిప్స్‌ ప్రతిపాదనలు, అతడి రాయబారం విఫలమవడానికి ప్రధాన కారణం.


రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1940 ఆగస్టు ప్రతిపాదనలు, 1942 క్రిప్స్‌ ప్రతిపాదనలు విఫలం కావడంతో భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి, నైరాశ్యం ఆవహించాయి. ఇంతలోనే ప్రపంచ యుద్ధం భారతదేశం గుమ్మం వరకు చేరింది. భారతీయులు తమకు శత్రువులు కాదని, అక్కడున్న ఆంగ్లేయులే తమ లక్ష్యమని జపాన్‌ స్పష్టం చేసింది. ఇలాంటి స్థితిలో మన దేశానికి యుద్ధ ప్రమాదం తప్పించాలంటే బ్రిటిషర్లు భారత్‌ నుంచి వెళ్లిపోవాలని గాంధీజీ తన ‘హరిజన్‌’ పత్రికలో రాశారు. భారత జాతీయోద్యమంలో మరో చారిత్రాత్మక ఘట్టం ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమానికి నాంది పలికారు.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 20-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్తయుగం - పాలకులు

గుప్తవంశ స్థాపకుడు 

‘శ్రీగుప్తుడు’. ఇతడు క్రీ.శ. 4వ శతాబ్దంలో రాజ్యపాలన చేసినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇతడి కుమారుడు ‘ఘటోత్కచ గుప్తుడు’. ఇతడి కొడుకు మొదటి చంద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు మరణించాక సముద్రగుప్తుడు రాజ్యపాలన చేశాడు.


రామగుప్తుడు 

* సముద్రగుప్తుడి తర్వాత అతడి కుమారుడు ‘రామగుప్తుడు’ గుప్త సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇతడి కాలంలో శకులు గుప్త సామ్రాజ్యంపై దండెత్తారు. ఈ యుద్ధంతో రామగుప్తుడి రాజ్యంతో పాటు భార్య ధ్రువాదేవిని శకులు హస్తగతం చేసుకున్నారు. 

* ఈ సమయంలో రామగుప్తుడి సోదరుడు ‘రెండో చంద్రగుప్తుడు’ శకరాజును హతమార్చి ధ్రువాదేవిని కాపాడి, రాజ్యాధికారం చేపట్టాడు.


రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 380-414)  

* ఇతడి పాలనలో రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుంది. ఇతడు యుద్ధాలు, వివాహ సంబంధాల ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. రెండో చంద్రగుప్తుడికి విక్రమాదిత్య అనే బిరుదు ఉంది. రెండో చంద్రగుప్తుడి తండ్రి సముద్రగుప్తుడు. తల్లి ‘దత్తాదేవి’. 

* భార్యలు: ధ్రువాదేవి, కుబేరనాగ. కుమారులు: కుమారగుప్తుడు, గోవిందగుప్తుడు. కుమార్తె: ప్రభావతి గుప్త. 

* ఇతడు తన కుమార్తెను వాకాటకరాజు రెండో రుద్రసేనుడికిచ్చి వివాహం చేశాడు. రుద్రసేనుడు మరణించాక రెండో చంద్రగుప్తుడు వాకాటకులపై అధికారం చెలాయించాడు. 

కుబేరనాగ నాగవంశానికి చెందింది. ఈమెను వివాహం చేసుకోవడం ద్వారా నాగరాజుల సాయంతో మధ్య భారతదేశంలో తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు.

* కదంబవంశ రాజు కుంతలదేశ రాజ్యాధిపతి ‘కుకుత్సవర్మ’ కుమార్తెను రెండో చంద్రగుప్తుడు వివాహం చేసుకున్నట్లు కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.


దండయాత్రలు: పశ్చిమ భారతదేశాన్ని పాలిస్తున్న శకక్షాత్రపులతో ఇతడికి వైరం ఉండేది. రెండో చంద్రగుప్తుడు శకరాజు రుద్రసింహుడ్ని ఓడించి, వారి వంశాన్ని పూర్తిగా అంతం చేసి, ‘శకారి’, ‘సహాసాంక’ అనే బిరుదులు పొందాడు.

* శకులపై విజయానికి గుర్తుగా వెండి నాణేలు ముద్రించాడు. దానికి ఒకవైపు గరుడ బొమ్మ, రెండోవైపు ‘పరమభాగవత’, ‘మహారాజాధిరాజ’ అనే బిరుదులు ముద్రించాడు. ఇవేకాక పులిని చంపుతున్నట్లున్న బొమ్మను ముద్రించిన నాణేలూ విడుదలచేశాడు. 

* హర్షచరిత్ర, దేవీచంద్రగుప్తం గ్రంథాలు సైతం శకులపై రెండో చంద్రగుప్తుడి విజయాలను తెలుపుతున్నాయి. శకులపై విజయం తర్వాత ఇతడు ‘ఉజ్జయిని’ని రెండో రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు.

* రెండో చంద్రగుప్తుడి సేనాని ‘అమరక దేవుడు’. ఇతడు రాజు విజయాలపై అనేక శాసనాలు వేయించాడు. 

* మెహ్రౌలి శాసనంలో ఇతడు వంగరాజ్య కూటమిని అణచి, సప్తసింధూనదిని దాటి బాక్ట్రియా రాజ్యాన్ని జయించాడని ఉంది. 


ఇతర విశేషాలు: ఇతడు సింహం బొమ్మ ఉన్న బంగారు నాణేలను జారీ చేశాడు. దీంతో ఇతడు ‘సింహవిక్రమ’ అనే బిరుదు పొందాడు. 

* చంద్రగుప్తుడికి దేవగుప్తుడు లేదా దేవరాజు, దేవశ్రీ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఇతడు వైష్ణవ భక్తుడు. శకులపై విజయం సాధించాక ఇతడు ఐరోపా, ఆఫ్రికా ఖండాలతో వర్తక, వాణిజ్యం చేశాడు.

రెండో చంద్రగుప్తుడి కాలంలో చైనా యాత్రికుడు ‘ఫాహియాన్‌’ భారతదేశంలో పర్యటించి (క్రీ.శ.399-414) ఇతడి ఆస్థానంలో మూడేళ్లు ఉండి, సంస్కృతం నేర్చుకున్నాడు. 

* చంద్రగుప్తుడి ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే సుప్రసిద్ధ సంస్కృత కవులు ఉండేవారు. 

* ప్రఖ్యాత కవి, నాటకకర్త ‘కాళిదాసు’ ఇతడి ఆస్థానంలోని వారే. అమరసింహుడు, వరరుచి, భేతాళభట్టు, క్షపణికుడు, శంకు లాంటి కవులు నవరత్నాల్లోని ప్రముఖులు.


మొదటి కుమారగుప్తుడు (క్రీ.శ. 414-455) 

రెండో చంద్రగుప్తుడి తర్వాత మొదటి కుమారగుప్తుడు రాజయ్యాడు. ఇతడు అశ్వమేథయాగం చేసి, దానికి గుర్తుగా బంగారు నాణేలు విడుదలచేశాడు. 

* ఇతడికి ‘మహేంద్రాదిత్య’ అనే బిరుదు ఉంది. ఇతడు ‘కార్తికేయుడ్ని’ పూజించాడు. కార్తికేయ ప్రతిమ ఉన్న నాణేలు ముద్రించాడు.

ఇతడు పుష్యమిత్రులతో యుద్ధం చేసి, వారిని ఓడించాడు.

ఇతడి రాజ్యంలో బౌద్ధ, శైవ, సూర్య, విష్ణు ఆరాధనలు జరిగేవి. కుమారగుప్తుడి చివరి దశలో పుష్యమిత్రులు మళ్లీ దండెత్తగా, అతడి కొడుకైన స్కందగుప్తుడు వారిని ఓడించినట్లు ‘బిత్రి’ శాసనంలో ఉంది.


చివరి గుప్తపాలకులు 

* స్కందగుప్తుడి తర్వాత అతడి తమ్ముడు పురుగుప్తుడు కొద్దికాలం రాజ్యపాలన చేశాడు. 

* ఇతడి పాలనా కాలంలో గుప్తరాజ్యంలోని పశ్చిమభాగం వేరుపడింది. 

* స్కందగుప్తుడి తర్వాత రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు, నరసింహగుప్తుడు, మూడో కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు రాజ్యపాలన చేశారు. 

* వీరి కాలంలో కేంద్రపాలన పటుత్వం తగ్గింది. సరిహద్దు ప్రాంతాల్లోని రాజులు, సామంతులు వీరిని ధిక్కరించారు. 

* నరసింహగుప్తుడి కాలంలో హూణులు ‘తోరమానుడి’ నాయకత్వంలో దండెత్తి పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్, సౌరాష్ట్ర, మాళ్వాలను జయించారు.

* ఎరాన్‌ యుద్ధంలో భానుగుప్తుడు హూణులను ఓడించాడని కొన్ని శాసనాల్లో ఉంది. నరసింహగుప్తుడి కాలంలో మళ్లీ హూణులు దాడిచేయగా, వారికి కప్పం కట్టాడని హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు. 

చివరి గుప్తచక్రవర్తి ‘విష్ణుగుప్తుడు’ లేదా ‘జీవగుప్తుడు’. ఇతడు క్రీ.శ. 550లో నామమాత్ర అధికారంలో ఉండగా క్రీ.శ.7వ శతాబ్దం నాటికి కనౌజ్‌ పాలకుడైన హర్షవర్ధనుడు గుప్తసామ్రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. 


గుప్తసామ్రాజ్య పతనానికి కారణాలు

* స్కందగుప్తుడి తర్వాత వచ్చిన పాలకులంతా బలహీనులు, అసమర్థులు. వీరు ఇతర రాజ్యాలపై దండెత్తలేదు. రాజ్యంలో జరిగే తిరుగుబాట్లని అణచలేకపోయారు.

* మొదటి కుమారగుప్తుడి తర్వాత అధికారం కోసం వారసుల మధ్య అంతర్గత కలహాలు, యుద్ధాలు ప్రారంభమయ్యాయి. మొదటి కుమారగుప్తుడు తన వారసుడిగా పురుగుప్తుడ్ని ప్రతిపాదించగా, రెండో కుమారగుప్తుడు దీన్ని వ్యతిరేకించాడు. ఇదే వారసత్వ యుద్ధానికి కారణమైంది.

నరసింహగుప్తుడి కాలంలో చైనాకి చెందిన హూణులు తోరమానుడు, మిహీరకులుడి నాయకత్వంలో దండయాత్రలు చేశారు. వీరిని ఎదుర్కోవడానికి అతడు మందసోర్‌ పాలకుడు యశోధర్ముడి సహాయం తీసుకున్నాడు. ఈ యుద్ధంలో నరసింహగుప్తుడు ఓడిపోయి, హూణులకు కప్పం చెల్లించాడు. ఈ దండయాత్రలు రాజకీయంగా, ఆర్థికంగా గుప్తసామ్రాజ్యానికి నష్టాన్ని కలిగించాయి. 

* చివరి గుప్తరాజుల పాలనాకాలంలో అనేక సామంత రాజ్యాలు స్వాతంత్య్రం ప్రకటించుకోగా, మరికొందరు తిరుగుబాటు చేశారు. 


ఉదా: పుష్యభూతి వంశస్థులు మొదట తిరుగుబాటు చేయగా, మందసోర్‌ పాలకుడు యశోధర్ముడు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. కనౌజ్‌లో ‘మౌఖరి’ వంశస్థులు, గుజరాత్‌లో మైత్రక తెగ పాలకుడు భట్టారకుడు, పశ్చిమ మాళ్వా పాలకులు, బెంగాల్‌లో గౌడ పాలకులు తమను తాము స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. వీరిని గుప్తపాలకులు అణచలేకపోయారు. 

* చివరి గుప్తులు రెండువర్గాలుగా విడిపోయారు. ఒకవర్గం ‘మగధను’ కేంద్రంగా చేసుకుని పాలించగా, రెండోవర్గం ‘మాళ్వా’ కేంద్రంగా గుప్తరాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ అనైక్యతకు కారణమైంది. 

* గుప్తపాలకులు హిందూ మతాభిమానులు. అయితే బుధగుప్త, తథాగతగుప్త, బాలాదిత్యగుప్త బౌద్ధమతాభిమానులు. వీరు సైనిక శక్తిని నిర్లక్ష్యం చేశారు. దీంతో విదేశీ దాడులను, స్థానిక తిరుగుబాట్లను, స్వాతంత్య్రం ప్రకటించుకున్న సామంతులను ఎదుర్కోలేకపోయారు.

* పరిపాలనా వ్యవస్థలో లోపాలు, భూదానాలు, భూస్వామ్య వ్యవస్థ గుప్తుల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీశాయి.


స్కందగుప్తుడు (క్రీ.శ. 455-467)

* స్కందగుప్తుడు పుష్యమిత్రులు, హూణులు, వాకాటకులతో యుద్ధాలు చేసి విజయం సాధించాడు. ఇతడికి ‘విక్రమాదిత్య’ అనే బిరుదు ఉంది.

* కుమారగుప్తుడి తర్వాత స్కందగుప్తుడు రాజైనట్లు ‘ఆర్యమంజుశ్రీ మూలకల్ప’ అనే గ్రంథంలో ఉంది. 

* ఆర్‌.జి.భండార్కర్‌ అనే చరిత్రకారుడు పురుగుప్తుడు, స్కందగుప్తుడు ఒకరే అని పేర్కొన్నారు. డాక్టర్‌ ఆర్‌.జి.బసక్‌ అభిప్రాయం ప్రకారం కుమారగుప్తుడి తర్వాత పురుగుప్తుడు, స్కందగుప్తుడు రాజ్యాన్ని పంచుకుని పాలించారు. 

* ఆర్‌.కె.ముఖర్జీ అనే చరిత్రకారుడు స్కందగుప్తుడ్ని ‘దిగ్విజయుడు’, ‘ధర్మవిజయుడు’ అని కీర్తించాడు. 

* ఐరోపా, ఆసియా ఖండాల్లో హూణులను ఓడించిన ఏకైక వ్యక్తి స్కందగుప్తుడని కె.పి.జైస్వాల్‌ పేర్కొన్నారు.


గుప్తుల పరిపాలనా విధానం

వీరు దాదాపు మొత్తం ఉత్తర భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుని పరిపాలించారు. ఫాహియాన్‌ రచనలు, కౌటిల్యుడి అర్థశాస్త్రం, కామాందకుడి నీతిసారం, శాసనాలు, నాణేలు గుప్తుల పాలనను తెలుపుతున్నాయి. గుప్తులు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, సుస్థిర పాలనను అందించి, రాజకీయ ఐక్యతను సాధించారు.


కేంద్ర ప్రభుత్వం: గుప్తరాజులు ప్రాచీన హిందూ శాస్త్రాలకు అనుగుణంగా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశారు. కేంద్ర ప్రభుత్వంలో రాజే సర్వాధికారి. 

* రాజును ప్రజలు దైవంగా భావించేవారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా గుప్తులు రాజ్యపాలన చేశారు.

* రాజరికం వంశపారంపర్యంగా వచ్చేది. రాజు నిరంకుశుడిగా ఉండేవాడు. 

* పాలనలో రాజుకు సహకరించడానికి మంత్రిమండలి ఉండేది. 

* కామాందకుడి నీతిసారంలో ‘మంత్రవికల్ప ప్రకరణం’ అనే ఒక అధ్యాయం ఉంది. అందులో మంత్రి పరిషత్‌ విధులు, కార్యక్రమ నిర్వహణ విధానం గురించి వివరించారు. 

* మంత్రిమండలిలో మహాప్రధాన అమాత్య, సచివ, కుమారామాత్య, సంధివిగ్రహ, మహిదంత నాయక, రణభాండాగారిక లాంటి ఉద్యోగులు ఉండేవారు. 

*  రాజుకు, మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా కంచుకి వ్యవహరించేవాడు. 

* జాతి, కుల, మత బేధాలు లేకుండా శక్తి, సామర్థ్యాల ఆధారంగా ఉద్యోగులను నియమించేవారు.

* గుప్తరాజులకు పరమదేవత, పరమభట్టారక, మహిరాజాధిరాజ, పృథ్విపాల, చక్రవర్తి లాంటి బిరుదులు ఉండేవి. 

* వివిధ పాలనా అంశాల్లో రాజుకి తోడ్పడటానాకి ఉపారిక, దశపరాధిక, చేరోద్ధారనిక, దండిక, దండపాషిక, గౌల్మిక, క్షేత్ర, ప్రాంతపాల, కొట్టపాల, అంగరక్షక, అయుక్తక, వియుక్తక, రజక అనే వివిధ రకాల ఉద్యోగులు ఉండేవారు.

* గుప్తచక్రవర్తులు వారసులను ముందుగానే ప్రకటించేవారు. 

* మంత్రిమండలి నిర్ణయాలను ‘అమాత్య’ ద్వారా రాజుకు తెలిపేవారు. అన్ని విషయాల్లో తుది నిర్ణయం రాజుదే. 


రాష్ట్రపాలన: గుప్తులు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ‘భుక్తులు’గా విభజించారు. భుక్తికి అధికారి ‘ఉపరిక’. ఇతడు సాధారణంగా యువరాజు లేదా రాజకుటుంబ సభ్యుడై ఉండేవాడు.

*ఉపరికకు పాలనలో సాయం చేయడానికి బాలాధికరనిక, దండపాషిక, వినయస్థితిస్థాపక లాంటి ఉద్యోగులు ఉండేవారు. 

* భుక్తిని (రాష్ట్రాలు) మళ్లీ విషయాలుగా విభజించారు. విషయాలు అంటే జిల్లాలు. దీనికి అధికారి విషయపతి. ఇతడికి సలహాలు ఇచ్చేందుకు కొందరు సభ్యులున్న సంఘం ఉండేది. దీన్ని ‘అధికారణ’ అనేవారు.  

* దీనిలో నగరశ్రేష్ఠి (పట్టణవర్తక సంఘం పెద్ద), ప్రథమకాలికుడు (కార్మిక శ్రేణి అధ్యక్షుడు), సార్ధవాహుడు (వర్తక సంఘం అధ్యక్షుడు), ప్రథమ కాయస్తుడు (లేఖకుల పెద్ద), పుస్తపాల (పత్ర సంరక్షకుడు) ఉండేవారు. 

* నగరభుక్తి, పండ్ర వర్ధనభుక్తి, అహిక్షత్రభుక్తి, తీరభుక్తి, ఉత్తరమండలభుక్తి లాంటివి గుప్తుల పాలన కింద ఉండేవి. 

* పట్టణపాలనకు ‘నగరసభ’ ఉండేది. పట్టణ వ్యవహారాలు వృత్తి సంఘాలు, శ్రేణుల అధీనంలో ఉండేవి. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వీరి ప్రధాన విధులు. 


గ్రామపాలన: గుప్తులు ప్రతి విషయాన్ని గ్రామాలుగా విభజించారు. గ్రామికుడు గ్రామానికి పెద్ద. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడటం ఇతడి ప్రధాన బాధ్యత. 

* గ్రామపాలనలో గ్రామాధ్యక్షుడికి సలహాలు ఇచ్చేందుకు పెద్దలతో కూడిన ‘పంచమండలసభ’ ఉండేది. కొన్ని గ్రామాల సముదాయాన్ని ‘విత్తి’ అంటారు. 

* గ్రామానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జోక్యం ఉండేది కాదు. గ్రామాలు స్వయంప్రతిపత్తిగా ఉండి, అధికార వికేంద్రీకరణను సూచించేవి.


న్యాయపాలన: చక్రవర్తి అత్యున్నత న్యాయాధికారి. గ్రామస్థాయి నుంచి కేంద్రస్థాయి వరకు న్యాయవ్యవస్థ ఉండేది. ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయకుడు అనేవారు. 

* ఫాహియాన్‌ తన రచనల్లో శిక్షలు కఠినంగా ఉండేవి కాదని, ఉరిశిక్షలు లేవని రాశాడు. అంగచ్ఛేదనం శిక్షాస్మృతిలో ఉంది.

గుప్తరాజులు పౌర, నేర విభాగాలుగా న్యాయవ్యవస్థను విభజించారు. ఆస్తి తగాదాలు, వారసత్వ వివాదాలు పౌరన్యాయ చట్టంలో పొందుపరచారు. క్రిమినల్‌ వ్యవహారాలు నేరవిభాగం కింద ఉండేవి. 

* నేరం చేసినప్పుడు శిక్షల కంటే ఎక్కువగా జరిమానాలు విధించేవారు.  దీనివల్ల న్యాయవ్యవస్థ అంత పటిష్ఠంగా లేదని తెలుస్తోంది. 

* దేశద్రోహం, రాజద్రోహం చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించేవారు. మరణదండన తప్పనిసరి అయినప్పుడు ఏనుగులతో తొక్కించి చంపేవారు. 

* కొన్ని కులాలకు ప్రత్యేక శిక్షలు, చట్టాలు ఉండేవి. 

* గుప్తుల కాలంలో నారద, యజ్ఞవల్క్య, బృహస్పతి స్మృతులను రూపొందించారు.


సైనికపాలన: గుప్తుల సైన్యంలో గజ, అశ్వ, రథ పదాతి దళాలు ఉండేవి. నౌకాదళం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

* వీరు సైన్యం కోసం సామంతులపై ఆధారపడ్డారు. ఈ కారణం వల్లే చివరి గుప్త పాలకుల కాలంలో తిరుగుబాట్లను అణచలేకపోయారు. 

* సైనికరంగంలో సేనాపతి, మహాసేనాపతి, బలాధికృత, మహాబలాధికృత, దండనాయక, సంధివిగ్రహక, గోప్య అనే ఉద్యోగులు ఉండేవారు.

గజదళాధిపతిని ‘మహాపీలుపతి’ అని, అశ్వదళాధికారిని ‘భటాశ్వపతి’ అని, సైనికులకు జీతభత్యాలు చూసే అధికారిని ‘రణభాండాగారికుడు’ అని పిలిచేవారు. 

* యుద్ధవ్యూహాన్ని మహాబలాధికృత రూపొందించేవాడు. మహాసేనాధిపతి యుద్ధభూమిలో సైన్యాన్ని నడిపేవాడు. 

సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడి కాలంలో సైన్యం పటిష్ఠంగా ఉండేది.

Posted Date : 28-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గుప్తులకాలం నాటి పరిస్థితులు

సామాజిక పరిస్థితులు

* ఫాహియాన్‌ రచనలు, స్మృతి గ్రంథాలు, కాళిదాసు నాటకాలు - కావ్యాలు, అప్పటి నాణేలు, శిల్పకళ, చిత్రలేఖనం గుప్తుల కాలంనాటి సామాజిక పరిస్థితులను తెలుపుతున్నాయి.

* చైనా యాత్రికుడు ఫాహియాన్‌ రెండో చంద్రగుప్తుడి ఆస్థానాన్ని సందర్శించి, అప్పటి పరిస్థితులను తన రచనల్లో వివరించాడు. వీటి ప్రకారం ఎక్కువ మంది పట్టణాల్లో నివసించేవారు, ప్రజల్లో అధికులు శాకాహారులు, మద్యం సేవించేవారు కాదు. ధర్మ, వైద్యశాలలు ఉండేవి.

* గుప్తులకాలంలో సమాజంలో వర్ణవ్యవస్థ ఉండేది. కులవ్యవస్థను కఠినంగా అమలు చేశారు. రాజు కులవ్యవస్థకు భంగం కలగకుండా చూసుకునేవాడు. 

కుల వ్యవస్థను కాపాడేందుకు రాష్ట్రస్థాయిలో ‘అభియదత్త’ అనే ఉద్యోగి ఉండేవాడు. 

* బ్రాహ్మణులకు సమాజంలో మంచి గౌరవం ఉండేది. వీరు వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారు.

  * సమాజంలో వివిధ వృత్తులు ఉండేవి. వైశ్యులు వ్యాపారం చేసేవారు. శూద్రులు అన్ని రకాల పనులను నిర్వర్తించేవారు. అంటరానివారిని హీనంగా చూసేవారు. బానిస వ్యవస్థ, వెట్టిచాకిరి ఉండేవి.

కుటుంబానికి తండ్రి పెద్దగా వ్యవహరించేవాడు. వివాహ వ్యవస్థ అమల్లో ఉంది. 

* యుక్త వయసు కంటే ముందే స్త్రీలకు వివాహం చేసేవారు. బహుభార్యత్వం, సతీసహగమనం ఉండేవి. క్రీ.శ. 510 నాటి ‘ఎరాన్‌’ శాసనంలో ఈ విషయాలు ఉన్నాయి. 

* దేవదాసీలు, నర్తకీమణులకు సంఘంలో మంచి ఆదరణ ఉండేది. ఉన్నత కులాల్లోని స్త్రీలకు మాత్రమే విద్యావకాశాలుండేవి. 

ఉజ్జయినిలోని మహంకాళీ ఆలయంలో దేవదాసీలు ఉన్నట్లు కాళిదాసు రచనల ద్వారా తెలుస్తోంది. 

ఆస్తిహక్కు వంశపారంపర్యంగా ఉండేది. ప్రజలు కర్మసిద్ధాంతాన్ని పాటించేవారు. బ్రాహ్మణులకు వేదాలు, మంత్రాల్లో ప్రవేశం ఉంది. వీరికి అగ్రహారాలుండేవి. భూములు, గోవులను దానంగా స్వీకరించేవారు. 

* ‘‘ప్రజలు నీతిమంతులు, అహింసా విధానం పాటించేవారు, దొంగతనాలులేవని’’ ఫాహియాన్‌ తన రచనల్లో రాశాడు. 

చదరంగం, వేట, కోడి - పొట్టేళ్ల పందేలు, పాచికలాట, సంగీతం, నృత్యం ప్రధాన వినోదాలు.

సమాజంలో శైవ, వైష్ణవ శాఖలుండేవి. ప్రజలు విష్ణువు, శివుడు, కార్తికేయుడు, గణపతి, లక్ష్మీ, పార్వతి, దుర్గ, భవానీ మొదలైనవారిని పూజించేవారు.


ఆర్థిక పరిస్థితులు 

* గుప్తులకాలం నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రజలు పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందారు.

* గుప్త రాజులు నదులకు ఆనకట్టలు కట్టి, చెరువులు తవ్వించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. బంజరు భూములకు సాగునీరు అందించారు.

మౌర్యుల కాలంలో సౌరాష్ట్రలోని గిర్నార్‌ దగ్గర నిర్మించిన సుదర్శన తటాకాన్ని స్కందగుప్తుడు మరింత అభివృద్ధి చేశాడు.

* బావులు, చెరువుల నుంచి ‘పారశీక నీటి చక్రం’ (Persian Wheel) ద్వారా నీటిని పొలాలకు మళ్లించేవారు. 

ప్రజలు ఎక్కువగా దానధర్మాలు చేసేవారని ఫాహియాన్‌ పేర్కొన్నాడు. 

బ్రాహ్మణులకు, ప్రభుత్వ ఉద్యోగులకు భూములను విరివిగా దానం చేసేవారు. ఇది భూస్వామ్య వ్యవస్థకు కారణమైంది. భూస్వాములు ప్రజలపై అధికారం చెలాయించేవారు. 

* వరి, గోధుమ, అల్లం, కూరగాయ పంటలు పండించేవారు.

* నూలు, పట్టువస్త్రాల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. వీటిని విదేశాలకు ఎగుమతి చేసేవారు. రాగి, ఇనుము, కంచు మొదలైన లోహాలతో వివిధ రకాలైన పరికరాలను తయారుచేసేవారు. 

రెండో చంద్రగుప్తుడు ఢిల్లీ సమీపంలోని ‘మెహరౌలి’ వద్ద ఇనుప స్తూపాన్ని నిర్మించాడు. ఇది నేటికీ తుప్పు పట్టలేదు. ఇది ఆనాటి శాస్త్ర సాంకేతికతకి నిదర్శనం.

* వృత్తి పనివారు సంఘాలు (శ్రేణులు)గా ఏర్పడి, అనేక కుటీర పరిశ్రమలను స్థాపించారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు శిక్షణా కేంద్రాలు ఉండేవి. ఈ సంఘాలు ఆ కాలంలో బ్యాంకులుగా పనిచేశాయి. వీటిని ‘నిగమాలు’ అనేవారు. కొన్ని నిగమాలు కలసి ఒక బృహత్‌ సంఘంగా ఏర్పడ్డాయి. శ్రేణులు తమ లాభాల్లో కొంత భాగాన్ని ప్రజోపయోగ కార్యకలాపాలకు వెచ్చించేవారు. శ్రేణి పెద్దను శ్రేష్ఠి అనేవారు.

*ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. రైతులు తమ పంటలో 1/6 వంతు భాగాన్ని  భూమిశిస్తుగా చెలించేవారు. ఇవి ధన, ధాన్యరూపంలో ఉండేవి.

ఎగుమతి, దిగుమతి సుంకాలు, వర్తక సుంకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభించేది. 

* అడవులు, గనులు, నాణేల ముద్రణ ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. 

‘‘ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఆదాయం సమకూరేది. దీన్ని రాజు పరిమితంగా ఖర్చు చేసేవాడు. ఇదే గుప్తుల అభివృద్ధి సాధనకు కారణం’’ అని కామందకుడు తన ‘నీతిసారం’లో పేర్కొన్నాడు.


వర్తక-వాణిజ్యం 

* గుప్తులకాలంలో స్వదేశీ, విదేశీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. వీరు ‘రోమ్‌’ దేశంతో ఎక్కువగా వ్యాపార సంబంధాలు సాగించారు. ముఖ్యంగా సిల్కు, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేవారు.

* గంగా, యమున, నర్మదా నదుల ద్వారా నౌకాయానం బాగా అభివృద్ధి చెందింది. 

* ఆగ్నేయాసియా దేశాలతో ‘తామ్రలిప్తి’ (బెంగాల్‌) ఓడరేవు ద్వారా వ్యాపారం జరిగింది.

చేతివృత్తులు, వృత్తిసంఘాలు పట్టణ కేంద్రాల్లో ముఖ్యపాత్ర వహించాయి. 

* పశ్చిమాన ‘బరుకచ్చ’, తూర్పున ‘తామ్రలిప్తి’ ఓడరేవులు వర్తకంలో ప్రధానపాత్ర పోషించాయి. 

* రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, నీలిమందు, ఔషధాలు, దంతపు వస్తువులు ఎగుమతి చేసేవారు. బంగారం, వెండి, రాగి, మేలుజాతి అశ్వాలను దిగుమతి చేసుకునేవారు. 

దేశంలోని పెద్ద నగరాలన్నింటినీ రహదారులతో అనుసంధానం చేశారు. ఇది వాణిజ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. 

* బౌద్ధారామాలు, సంఘాలు వ్యాపారులకు ఆవాసాలుగా ఉండేవి. 

* ఉజ్జయిని, కాశీ, ప్రయాగ, మధుర, వైశాలి, గయ అప్పటి ప్రముఖ వర్తక కేంద్రాలు.

* బౌద్ధ సంఘాల పెద్దలు వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వీరు వర్తకులకు వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. అప్పుపై వడ్డీ సంవత్సరానికి 20% ఉండేది. 

* గుప్తులు భారతదేశంలో అధిక సంఖ్యలో బంగారు నాణేలు చలామణిలోకి తెచ్చారు. బంగారం, రాగి, వెండి, నాణేలు ముద్రించారు. ఇవి మారకంగా ఉపయోగపడ్డాయి. 

* గుప్తులకాలం నాటి బంగారు నాణేలను ‘రూపక’ అంటారు. పశ్చిమ ప్రాంతంలో వెండి నాణేలు, తూర్పు ప్రాంతంలో బంగారు నాణేలు లభించాయి.

* ఒక బంగారు నాణెం విలువ 15 వెండి నాణేలకు సమానం. ఫాహియాన్‌ ప్రకారం ‘కౌరీలు’ (గవ్వలు) కూడా మారకపు ద్రవ్యంగా ఉండేవి. 


మతపరిస్థితులు 

* గుప్తుల కాలంలో బౌద్ధమతం క్షీణదశకు చేరుకుని, బ్రాహ్మణ మతం ఆధిక్యం పొందింది. ఇది హిందూమత పునరుద్ధరణకు కారణమైంది.

* భక్తిమార్గానికి గుప్తుల కాలంలో ప్రాధాన్యం పెరిగింది. విగ్రహారాధనకు ప్రాధాన్యం ఉండేది. భాగవత మతం విస్తృత ప్రచారం పొందింది.

* రాజులు, ప్రజలు యజ్ఞయాగాదులు నిర్వహించారు. సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు అశ్వమేధయాగాలు చేశారు. 

* విష్ణుమూర్తి దశావతారాలు, రామాయణ, మహాభారతాలు ప్రాధాన్యం పొందాయి. భగవద్గీత హిందువులకు పవిత్ర గ్రంథం అయ్యింది. 

* గుప్తులు అనేక దేవాలయాలను నిర్మించారు. పురాణ పఠనం, పుణ్యక్షేత్రాల దర్శనం, దానధర్మాలు చేయడం లాంటివాటిని పుణ్యకార్యాలుగా భావించారు. 

* రాజులే కాదు, సామాన్యులు కూడా ధనం సేకరించి దేవాలయాలు నిర్మించారు. 

* విదేశీయులు కూడా వైష్ణవ మతాన్ని స్వీకరించారు. శకులు, యవనులు, కుషాణులు వీరిలో ముఖ్యులు. 

* గుప్తులకాలంలో బుద్ధుడ్ని దశావతారాల్లో ఒకడిగా భావించారు. దీంతో బౌద్ధమతం ఆదరణ కోల్పోయింది.


శైవ-పాశుపతం 

* గుప్తులకాలంలో ప్రజలు శైవమతాన్నీ ఎక్కువగా ఆచరించారు. ఈ మతంలోని పాశుపతశాఖ ఎక్కువ ప్రజాదరణ పొందింది. 

* క్రీ.శ.38081 నాటి మధుర శాసనంలో ‘లకులీస పాశుపతం’ గురించి ఉంది. 

* మొదటి కుమారగుప్తుడి శాసనంలో అయోగ్య బ్రాహ్మణులు క్రతువులు, మతసాహిత్యంలో నిష్ణాతులు అని ఉంది. ఈ శాసనం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కరీమదండలో లభించింది. 

* ఆ కాలంలో సూర్యుడ్ని కూడా ఎక్కువ మంది ఆరాధించేవారు. వారి మత గురువులను ‘మాఘలు’ అనేవారు.


షడ్‌దర్శనాలు 

భారత తత్వశాస్త్ర ముఖ్య లక్షణాలుగా షడ్‌దర్శనాలను పేర్కొంటారు. అవి: న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత. ఇవి గుప్తుల కాలంలో ఉండేవి.

పురాణాలు, ధర్మశాస్త్రాలు రాయడంలో, సాంఘిక చట్టాలను పవిత్రంగా చేయడంలో ఇవి సహకరించాయి.

* గుప్తుల కాలంలోనే హిందూ మత పునరుద్ధరణ జరిగింది. యజ్ఞాలు, కర్మకాండల నిర్వహణ ఎక్కువైంది. 

దేవతలకు రూపాలిచ్చి విగ్రహాలను ప్రతిష్ఠించడం ఈ కాలంలోనే ప్రారంభమైంది.


బౌద్ధ - జైన మతం

* గుప్త పాలకులు వైదికమతాన్ని ఆచరించినప్పటికీ జైన, బౌద్ధ మతాల పట్ల సహనభావం ప్రదర్శించారు. 

* హిందువులు, బౌద్ధులు పరస్పర మైత్రితో జీవించారని ఫాహియాన్‌ తన రచనల్లో పేర్కొన్నాడు.

* గుప్త పాలకులు బౌద్ధులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదరించారు. ఉదాహరణకు సముద్రగుప్తుడు వసుబంధుడ్ని (అభిధర్మకోశ గ్రంథకర్త, విజ్ఞానవాద స్థాపకుడు) ఆదరించగా, రెండో  చంద్రగుప్తుడు తన సేనానిగా అమరకదేవుడ్ని నియమించాడు. 

* కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇది క్రీ.శ. 5వ శతాబ్దిలో బౌద్ధ అధ్యయన కేంద్రంగా ఆవిర్భవించింది. వల్లభి విశ్వవిద్యాలయం కూడా ఈ కోవకు చెందిందే. 

నలంద, సారనాథ్, మధుర, పాటలీపుత్రం మొదలైన ప్రాంతాల్లో గుప్తులకాలంలో కొన్ని జైన, బౌద్ధ విగ్రహాలను ప్రతిష్ఠించారు. 

* కపిలవస్తు, కుశినగరం, గయలో బౌద్ధమతం క్షీణదశలో ఉన్నట్లు ఫాహియాన్‌ రాశాడు. 

క్రీ.శ.453లో వల్లభిలో జైనమత పెద్దలు సమావేశమై జైన గ్రంథాలను క్రోడీకరించారు. మధుర, వల్లభి శ్వేతాంబర శాఖకు కేంద్రంగా ఉండేవి.


భాగవత తత్వం

* మౌర్యుల తర్వాతి కాలంలో భాగవత మతం ఆవిర్భవించింది. వీరికి విష్ణువు ప్రధాన ఆరాధ్య దైవం. ఇతడి రూపాలే నారాయణుడు, వాసుదేవుడు. తర్వాతి కాలంలో ఈ ముగ్గురూ కలసి భాగవత మత తత్వం ఆవిర్భవించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. 

* భక్తి, అహింస ఈ మతంలో ప్రధాన అంశాలు. 

* భగవద్గీత, విష్ణుపురాణం, విష్ణుస్మృతి భాగవత తత్వాన్ని చర్చించాయి. 

* సామాజిక వ్వవస్థకు హాని జరిగితే విష్ణువు తగిన రూపంలో అవతరించి, ధర్మాన్ని రక్షిస్తాడని సామాన్య ప్రజలు నమ్మారు. 

*క్రీ.శ.6 వ శతాబ్ది నాటికి విష్ణువును  త్రిమూర్తుల్లో ఒకరుగా ఆరాధించారు. 

* ఈ శాఖలోనూ విగ్రహారాధన, దేవాలయ నిర్మాణం, భక్తిభావం, పండుగలు జరుపుకోవడం లాంటివి ఉండేవి.

* భాగవతం వల్ల మహాయాన బౌద్ధమత శాఖకు ఆదరణ తగ్గింది. 

Posted Date : 28-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

క్విట్‌ ఇండియా ఉద్యమం (1942)

ప్రజలే సారథులై.. పోరాట యోధులై!


 

రెండో ప్రపంచ యుద్ధం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. అది తప్పిపోవాలంటే ఆంగ్లేయులు దేశాన్ని వదిలి వెళ్లాలని గాంధీజీ డిమాండ్‌ చేశారు. అప్పటికే ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ‘విజయమో.. వీర స్వర్గమో’ అంటూ మహాత్ముడు ఇచ్చిన పిలుపుతో మరింత విజృంభించారు. అప్రమత్తమైన బ్రిటిష్‌ ప్రభుత్వం నేతలందరినీ అరెస్టు చేసింది. అయినా జనంలో రగిలే అసంతృప్తి జ్వాలలు ఆరలేదు, అదుపులోకి రాలేదు. నింôకుశ నిర్బంధాలను ధిక్కరించి, నాయకత్వం లేకపోయినా ప్రజలే సారథులై, పోరాట యోధులై పెద్ద ఎత్తున ఉద్యమించారు. క్విట్‌ ఇండియా నినాదం దేశమంతా మారుమోగింది. అణచివేతకు ప్రభుత్వం ప్రజలపై దమనకాండను సాగించింది. తిరగబడిన ఉద్యమకారులు సర్కారు ఆస్తులను ధ్వంసం చేశారు. యుద్ధం ఆగిపోవడంతో ఉద్యమం ఉద్ధృతి తగ్గింది. కానీ సంపూర్ణ స్వాతంత్య్రమే భారతీయుల ఉక్కు సంకల్పమనే వాస్తవం తెల్లవారి తలకెక్కింది. 

 

దేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో క్విట్‌ ఇండియా ఉద్యమం జాతికి స్ఫూర్తినిచ్చిన మహోజ్వల ఘట్టం. 1942, ఆగస్టులో గాంధీ ఈ ఉద్యమానికి పిలుపునివ్వడానికి అనేక పరిస్థితులు ప్రేరేపించాయి. తక్షణం అధికార బదిలీ జరగాలనే కాంగ్రెస్‌ డిమాండ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నిరాకరించింది. రాజకీయ సంస్కరణల కోసం భారత నాయకులతో సంప్రదింపులు సాగించిన అనంతరం క్రిప్స్‌ చేసిన ప్రతిపాదనలు భారతీయులను మెప్పించలేకపోయాయి. క్రిప్స్‌ రాయబారం విఫలమైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దేశంలో ఆహార పదార్థాల కృత్రిమ కొరత ఏర్పడింది. ధరలు ఆకాశాన్నంటాయి. కష్టకాలంలో ప్రభుత్వం వహించిన నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజాజీవితం దుర్భరంగా మారింది. మరోవైపు యుద్ధంలో అక్షరాజ్య కూటమి తరఫున జపాన్‌ సైన్యం ఆసియా ఖండంలో విజృంభించింది. ఆంగ్లేయులను మలయా, సింగపూర్, బర్మాల నుంచి తరిమేసి బంగాళాఖాతంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జపాన్‌ సైన్యం భారత్‌ పొరుగు దేశమైన అప్పటి బర్మాలోకి ప్రవేశించింది. ఆ యుద్ధాగ్ని జ్వాలలు భారతదేశాన్నీ తాక వచ్చనే భయం ప్రజల్లో వ్యాపించింది.

 

1942లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను, ప్రజల ఆగ్రహావేశాలను గాంధీ గ్రహించారు. భారతదేశం సురక్షితంగా ఉండాలంటే బ్రిటిషర్లు ఈ దేశాన్ని వదిలివెళ్లడం ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వానికి తన ‘హరిజన’ పత్రిక ద్వారా సూచించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 1942, జులై 14న వార్దాలో సమావేశమై ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చించి ‘క్విట్‌ ఇండియా’ తీర్మానాన్ని ఆమోదించింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై ఆ తీర్మానాన్ని ధ్రువీకరించింది. అహింసాయుతంగా, గాంధీ నాయకత్వంలో పోరాడాల్సిందిగా ఈ తీర్మానం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ప్రభుత్వం దమననీతికి పాల్పడి ఉద్యమ నాయకులను అరెస్ట్‌ చేస్తే, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రగాఢంగా కోరుకునే ప్రతి భారతీయుడు ఉద్యమస్ఫూర్తితో స్వయంగా కార్యక్రమం రూపొందించుకోవాలని కోరింది.


   బొంబాయిలోని గోవలియ ట్యాంక్‌ మైదానంలో (క్రాంతి మైదానం) ఆగస్టు 8న గాంధీజీ ఉపన్యసిస్తూ స్వాతంత్య్రానికి తక్కువైంది ఏదీ అంగీకరించడం కుదరదని స్పష్టం చేశారు. దానికోసం ఒక మంత్రం ఉపదేశించారు. అదే ‘విజయమో.. వీరస్వర్గమో’ (డూ ఆర్‌ డై), దేశాన్ని విముక్తి చేయడమో లేదా ఆ ప్రయత్నంలో మరణించడమో ఏదో ఒకటి జరగాలని ఉద్వేగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటిష్‌ ప్రభుత్వ ఆజ్ఞలను అహింసాయుతంగా ధిక్కరించాలని చెప్పారు. అయితే ఈ ఉద్యమ నిర్వహణ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అప్పటికి ఇంకా ఖరారు చేయలేదు. క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఫార్వర్డ్‌ బ్లాక్, జయప్రకాష్‌ నారాయణ్, అచ్యుత్‌ పట్వార్దన్, రామ్‌ మనోహర్‌ లోహియా మొదలైనవారు స్థాపించిన కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ వంటి రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఇండియన్‌ ముస్లింలీగ్, కమ్యూనిస్ట్‌ పార్టీ ఉద్యమంలో పాల్గొనలేదు. తర్వాత ముస్లింలీగ్‌ ‘డివైడ్‌ అండ్‌ క్విట్‌’ అని డిమాండ్‌ చేసింది.


ప్రభుత్వ చర్య: బొంబాయిలో కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా తీర్మానం చేసిన వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్‌ని నిషేధించింది. అదే రోజు రాత్రి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులపై విరుచుకుపడి 24 గంటల్లోనే దాదాపుగా అందరినీ నిర్బంధించింది. గాంధీజీతో పాటు కస్తూరిబా గాంధీని అరెస్ట్‌ చేసి పూనాలోని ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో నిర్బంధించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా ఆజాద్, పట్టాభి సీతారామయ్య, ఆచార్య కృపలానీ మొదలైనవారు అహ్మద్‌నగర్‌ కోటలో బందీలయ్యారు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పట్నాలో అరెస్టయ్యారు.


ప్రజా ప్రతిఘటన: 1942, ఆగస్టు 9 నాటికి దాదాపు నాయకులంతా అరెస్టయ్యారు. అప్పటికే బ్రిటిషర్ల నిరంకుశ, అణచివేత విధానాలతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. నిక్షిప్తంగా ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఉద్యమ నాయకులను ప్రభుత్వం నిర్బంధించినా, ప్రజలే ఉద్యమాన్ని నిర్వహించారు. అందుకే క్విట్‌ ఇండియా గొప్ప ప్రజా ఉద్యమంగా మారింది. అయితే ప్రజల ముందు ఒక స్పష్టమైన అజెండా లేదు. గాంధీ జైలులో నిర్బంధంలో ఉండటంతో ఎలాంటి మార్గదర్శకత్వం చేయలేకపోయారు. తొలి దశలో చాలాచోట్ల నిరసనలు, హర్తాళ్లు, శాంతియుత సమావేశాలు నిర్వహించారు. దిల్లీ, బొంబాయి, కాన్పుర్, లఖ్‌నవూ, నాగ్‌పుర్, బెంగళూరు, మద్రాసు, అహ్మదాబాద్‌ లాంటి ప్రముఖ నగరాలు, పట్టణాల్లో మహిళలు, విద్యార్థులు, కార్మికులు, మధ్యతరగతి వారు, చేతివృత్తులవారు క్విట్‌ ఇండియా నినాదంతో నిరసన ప్రదర్శనలు చేశారు. పోలీసులతో, సైన్యంతో ఘర్షణకు దిగారు. ఉద్యమానికి బొంబాయి కేంద్రంగా మారింది. దేశంలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా ఉక్కు కార్మికులు జాతీయ ప్రభుత్వం ఏర్పడే వరకు విధుల్లో చేరేది లేదంటూ సమ్మె చేశారు. ప్రజాజీవనం స్తంభించింది. క్విట్‌ ఇండియా ఒక్కటే ఉద్యమకారులందరి డిమాండ్‌గా మారింది.


ప్రభుత్వ చర్య - ప్రతిచర్య: ప్రభుత్వం ఈ ప్రజా ఉద్యమాన్ని బలప్రయోగంతో అణచివేయాలని నిశ్చయించింది. అరెస్టులు, జరిమానాలు, ప్రజల వ్యక్తిగత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, లాఠీఛార్జీలు, నిరాయుధులపై కాల్పులు జరపడం ఈ ఉద్యమకాలంలో నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ దమనకాండ ప్రజల ఆగ్రహావేశాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. హింసకు ప్రతిహింసను సృష్టించింది. ఉద్యమం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. విద్యార్థులు విద్యాసంస్థలను బహిష్కరించారు. కార్మికులు, స్త్రీలు, చేతివృత్తులవారు రోడ్డుపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ప్రభుత్వ ఆస్తులు వారి లక్ష్యమయ్యాయి. టెలిగ్రాఫ్‌ లైన్‌లు తెగిపడ్డాయి. రైల్వే లైన్‌లు ధ్వంసమయ్యాయి. పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు తగలబడ్డాయి. ఉద్యమకారులకు కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ నాయకులు అరుణా అసఫ్‌ అలీ, అచ్యుత్‌ పట్వార్దన్, జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితరులు తెరచాటు సహాయం అందించారు. విప్లవభావాలతో ఉన్న నాయకులు మిడ్నపూర్‌లోని తామ్రలుక్, మహారాష్ట్రలోని సతారా, ఒరిస్సాలోని తాల్చేరు లాంటి చోట్ల రహస్య పోటీ ప్రభుత్వాలను ఏర్పాటుచేశారు. ఉద్యమం ప్రారంభమైన మూడు నెలల్లో బ్రిటిష్‌ ప్రభుత్వం క్రూర విధానాలతో అణగదొక్కింది. యథావిధిగా సమాజంలోని ఉన్నత వర్గాలు, అధికార గణం ప్రభుత్వానికి విధేయులుగా మిగిలారు. ప్రభుత్వ హింసాకాండ తారస్థాయికి చేరింది. అధికారిక లెక్కల ప్రకారం 10 వేల మందికి పైగా కాల్పుల్లో మరణించగా, 60 వేలకు పైగా అరెస్టయ్యారు. ఈ ఉద్యమంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ప్రభుత్వం గాంధీని నిందించింది. దీంతో ఆయన తన ఆత్మశుద్ధికి 21 రోజులు నిరాహార దీక్ష చేశారు. తర్వాత గాంధీజీ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. యుద్ధంలో మిత్ర రాజ్యాల విజయం వల్ల ఉద్యమం ఉద్ధృతి తగ్గింది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి మూలకారణమైన రెండో ప్రపంచ యుద్ధం, దాని ప్రధాన కారకుడైన హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో పరిసమాప్తమైంది.

 

ఉద్యమ ప్రాముఖ్యం: ఉద్యమ ప్రారంభంలోనే ప్రముఖ నాయకులంతా అరెస్ట్‌ అయినప్పటికీ ప్రజలే ఉద్యమానికి నాయకత్వం వహించి దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమేనని ప్రభుత్వానికి చాటారు. ఈ మహా ప్రజాఉద్యమాన్ని ప్రభుత్వం నిరంకుశ విధానాలతో అణచివేసినప్పటికీ, ప్రజల్లో గొప్ప రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. కాంగ్రెస్‌ విధానాల పట్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసం ఏర్పడింది. చిరకాలంగా ప్రభుత్వ ఎజెండాగా ఉన్న ‘డొమినియన్‌ ప్రతిపత్తి’ ఆగస్టు ఉద్యమంలో ఆహుతైంది. ప్రజల నినాదమైన సంపూర్ణ స్వాతంత్య్రం తప్ప మరేదీ అంగీకారం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. ఉవ్వెత్తున ఎగసిన తిరుగుబాటు పాలకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది.స్వాతంత్య్రాన్ని భారతదేశ గుమ్మంలోకి తీసుకొచ్చింది.

 

నోట్‌: క్విట్‌ ఇండియా నినాదాన్ని మొదటిసారి రూపొందించినవారు యూసుఫ్‌ మెహర్‌ అలీ. ఈయన 1942 నాటి బొంబాయి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 04-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బోస్‌ ప్రత్యక్ష పోరాటం (సుభాష్‌ చంద్రబోస్‌ - భారత జాతీయ సైన్యం)

 సాహసవీరుడి స్వతంత్ర సమరం!

నేతాజీ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతుంది. జాతి మొత్తం పులకిస్తుంది. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరి, ఆయన నిర్ణయాలతోనే నిర్మొహమాటంగా విభేదించి బోస్‌ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి, స్వతంత్ర భారతావని ఒక్కటే మనకు స్వర్గమని చాటి, ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకొని ఆంగ్లేయులతో యద్ధం చేశాడు. ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. ఎనిమిది దేశాల గుర్తింపు పొందిన సమాంతర భారత ప్రభుత్వాన్ని స్థాపించాడు. దేశ స్వాతంత్య్ర సమరాన్ని అంతర్జాతీయ వేదికలకు చేర్చి, బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేశాడు. ఆయన సాహసాలు, తెగింపు, త్యాగాలు దేశ ప్రజల్లో స్వాతంత్య్రకాంక్షను తీవ్రంగా రగిలించాయి. ప్రతి పోటీ పరీక్షలో ప్రశ్నలుగా వచ్చే ఈ అధ్యాయంపై అభ్యర్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 

పరాయి పాలనలో మగ్గుతున్న భారతమాత దాస్యశృంఖలాలను తెంచడానికి సాయుధ పోరాటమే ఉత్తమ మార్గమని సిద్ధాంతీకరించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌. విజయసాధన కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తియుక్తులను, సర్వస్వాన్ని ఫణంగా పెట్టిన త్యాగశీలి. ఉన్నత విద్యావంతుడైన బోస్, చిత్తరంజన్‌ దాస్‌ స్థాపించిన బెంగాల్‌ జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా, కలకత్తా నగర మేయర్‌గా విధులు నిర్వర్తించాడు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చాడు.

సుభాష్‌ చంద్రబోస్‌ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైన చిత్తరంజన్‌ దాస్‌ ప్రభావితం చేశారు. 1921లో బ్రిటన్‌ వేల్స్‌ రాకుమారుడి భారతదేశ పర్యటనను నిరసిస్తూ బోస్‌ ప్రదర్శనలు నిర్వహించాడు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నిర్భయంగా వ్యవహరించేవాడు. చౌరిచౌరాలో జరిగిన ఒక హింసాయుత సంఘటన నేపథ్యంలో గాంధీజీ 1922, ఫిబ్రవరి 5న ఉద్ధృతంగా సాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపేశారు. ఆ నిర్ణయాన్ని బోస్‌ తప్పుబట్టాడు. ఉద్యమాన్ని నిలిపేయడాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించాడు. ఆ తర్వాత చిత్తరంజన్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ స్వరాజ్య పార్టీ (1922) స్థాపన, దాని నిర్వహణలో సహాయం అందించాడు. 1935 భారత ప్రభుత్వ చట్టం పట్ల కూడా విముఖత వ్యక్తం చేశాడు. అలాంటి చర్యలను ఆమోదిస్తే స్వాతంత్య్ర పోరాట స్వభావంలో ఏ అభివృద్ధి ఉండదని స్పష్టం చేశాడు.

1938లో భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన (ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు) గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో ఉన్న హరిపురా గ్రామంలో జరిగింది. అందులో ఆయన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని లోపభూయిష్టమైన ఫెడరల్‌ వ్యవస్థతో పాటు ఇంకా అనేక అంశాలను విమర్శించాడు. స్వదేశీ సంస్థానాలతో సహా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్ర సాధనే లక్ష్యమని ఆ సమావేశం ఉద్ఘాటించింది. 1939లో నేటి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పుర్‌ జిల్లా త్రిపురిలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశ అధ్యక్ష పదవికి బోస్‌ పోటీ చేశాడు. గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్యపై విజయం సాధించి, కాంగ్రెస్‌లో తన పలుకుబడి నిరూపించుకున్నాడు. తర్వాత గాంధీజీతో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించాడు. అది కాంగ్రెస్‌లోనే అంతర్భాగంగా పనిచేస్తుందని ప్రకటించాడు. 1940లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ మహాసభ నాగ్‌పుర్‌లో జరిగింది. 

రెండో ప్రపంచ యుద్ధం: 1939 చివర్లో యుద్ధం ప్రారంభమైంది. గాంధీజీ బోధించిన అహింసాయుత విధానాల పట్ల కొంతమంది నాయకుల్లో భ్రమలు తొలగిపోవడం మొదలైంది. స్వాతంత్య్ర సాధనకు సాయుధ పోరాటమే మార్గమని, అవసరమైతే విదేశీ సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. వారిలో సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు. యుద్ధకాలంలో ఆయన దేశమంతా పర్యటించాడు. గాంధీజీ అహింసా విధానం, నెహ్రూ మిత్ర రాజ్యాల కూటమి అనుకూల విధాన భావనలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని, వలసవాద విధానాలను బహిరంగంగా విమర్శించాడు. యుద్ధ ప్రక్రియలో బ్రిటిషర్లకు, భారతీయులు సహకరించకూడదని సూచించాడు. దేశప్రజలకు తీవ్రవాద సిద్ధాంతాలు నూరిపోస్తున్నాడనే నెపంతో 1940లో ప్రభుత్వం బోస్‌ను అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత విడుదల చేసి గృహనిర్బంధంలో ఉంచింది. స్వాతంత్య్ర పిపాసకుడైన బోస్‌ 1941లో గృహనిర్బంధం నుంచి చాకచక్యంగా తప్పించుకొని పెషావర్, కాబూల్‌ మీదుగా జర్మన్‌ నగరం బెర్లిన్‌ చేరాడు. రెండో ప్రపంచయుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ వ్యతిరేకులైన హిట్లర్, రిబ్బన్‌ ట్రాప్‌ లాంటి జర్మన్‌ నాయకులతో సంప్రదింపులు జరిపి సహాయం కోరాడు. బెర్లిన్‌ రేడియో ద్వారా భారతీయులకు సందేశం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. జర్మనీ నుంచి ఆశించినంత సహాయం లభించకపోవడంతో అక్కడి నుంచి జపాన్‌ చేరాడు.


జపాన్‌లో బోస్‌: అగ్రరాజ్య కూటమిలో సభ్య దేశమైన జపాన్, జర్మనీ పక్షాన ఆగ్నేయాసియాలో రెండో ప్రపంచ యుద్ధంలో వీరవిహారం చేసింది. ఆ దేశ సేనల ధాటికి బ్రిటిష్‌ వలస రాజ్య సైన్యాలు విలవిలలాడాయి. జపాన్‌ సైన్యం మలయాలో బ్రిటిష్‌ సైన్యాన్ని ఓడించింది. భారత బ్రిటిష్‌ సైన్యాధికారి కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ జపాన్‌ సైన్యానికి తలవంచాడు. అతడితో పాటు లొంగిపోయిన భారత-బ్రిటిష్‌ సైనికులు యుద్ధఖైదీలయ్యారు. ఈ భారతీయ యుద్ధఖైదీలు సహా కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ను ఒప్పించి, అతడి నేతృత్వంలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి 1942లో ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని జపాన్‌ సైనికాధికారులు ఏర్పాటు చేశారు. భారతీయ విప్లవ పోరాట నాయకుడు రాస్‌ బిహారీ బోస్‌ అప్పటికే జపాన్‌ నగరం టోక్యోలో ఉన్నాడు. జపనీయుల మద్దతుతో సైన్యాన్ని సిద్ధం చేయడంలో సాయం చేశాడు. ‘ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌’ను స్థాపించి, దానికి నాయకత్వం వహించాల్సిందిగా రాస్‌ బిహారీని కోరారు. ఆగ్నేయాసియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా మాతృదేశ దాస్య విముక్తి కోసం ఆయనకు మద్దతు తెలిపారు. అన్నివిధాలుగా ఆగ్నేయాసియా తన కార్యకలాపాలకు అనువుగా ఉందని రాస్‌ బిహారీ భావించాడు. భారత జాతీయ సేన, జపాన్‌ ప్రభుత్వాల ద్వారా భారత స్వాతంత్య్ర పోరాటానికి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు సాధించే బాధ్యత తీసుకున్నాడు. ఆ సమయంలో జపాన్‌కు చేరిన సుభాష్‌ చంద్రబోస్, అక్కడి ప్రధాని టోజో, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు. టోజో ప్రోత్సాహం లభించింది. ఇదంతా సొంత వ్యక్తిత్వం, అంతర్జాతీయంగా తన సిద్ధాంతాలకు ఉన్న గౌరవంతోనే నేతాజీ సాధించారు.


భారత జాతీయ సైన్యం: సుభాష్‌ చంద్రబోస్‌కు జపాన్‌ ప్రోత్సాహం లభించడంతో ఆయన 1943, జులైలో రాస్‌ బిహారీ బోస్‌ నుంచి భారత స్వాతంత్య్ర సమితి (ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌) బాధ్యతలను, కెప్టెన్‌ మోహన్‌ సింగ్‌ నుంచి భారత జాతీయ సైన్యం బాధ్యతలను (ఐఎన్‌ఏ) స్వీకరించాడు. ఆ తర్వాత ఐఎన్‌ఏ పేరును ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’గా మార్చాడు. ఈ సైన్యంలోకి ఆగ్నేయాసియాలోని భారతీయులు, మలయా, సింగపూర్, బర్మాలో బందీలుగా ఉన్న భారతీయ సైనికులు చేరారు. భారత జాతీయ సైన్యాన్ని అయిదు రెజిమెంట్లుగా విభజించారు. వాటికి గాంధీ రెజిమెంట్, నెహ్రూ రెజిమెంట్, ఆజాద్‌ రెజిమెంట్, ఝాన్సీ రెజిమెంట్, బోస్‌ రెజిమెంట్‌ అని పేర్లు పెట్టారు. ఝాన్సీ రెజిమెంట్‌కు లక్ష్మీ సెహగల్‌ నాయకత్వం వహించారు. ఆ సైన్యానికి బోస్‌ కఠినమైన శిక్షణ ఇచ్చాడు. ‘నాకు రక్తపు బొట్టు ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని ఉద్రేకపూర్వకంగా ప్రజలను జాతిపోరాటంలో ఉత్తేజితులను చేశాడు.

సుభాస్‌ చంద్రబోస్‌ 1943, అక్టోబరు 21న సింగపూర్‌లో ‘ఆజాద్‌ హింద్‌’ తాత్కాలిక ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటును ప్రకటించాడు. ప్రభుత్వాధినేతగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆర్థికమంత్రిగా ఎ.సి.ఛటర్జీ, ప్రచార సారథిగా ఎస్‌.ఎ.అయ్యర్‌ వ్యవహరించారు. సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా ఎనిమిది దేశాలు అధికారికంగా గుర్తించాయి. ఆ దేశాలన్నీ ఎక్కువగా రెండో ప్రపంచ యుద్ధంలో అక్ష రాజ్య కూటమికి చెందినవే. అప్పటికే తమ అధీనంలో ఉన్న అండమాన్‌ నికోబార్‌ దీవులను బోస్‌ ప్రవాస ప్రభుత్వానికి జపాన్‌ బదిలీ చేసింది. బోస్‌ వాటికి షహీద్‌ దీవులు (అండమాన్‌), స్వరాజ్య దీవులు (నికోబార్‌) అని నామకరణం చేశాడు. తర్వాత నేతాజీ మాతృదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించాడు. సైన్యాన్ని బర్మా వైపు నడిపించాôడు. తన ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని, లీగ్‌ను, భారత జాతీయ సేన కమాండ్‌ను రంగూన్‌కు (బర్మా) తరలించాడు. జపాన్‌ సైనికులతో పాటు బోస్‌ సేన భారతదేశ ఈశాన్య ప్రాంతాలవైపు దూసుకొచ్చింది. మౌడాక్, కోహిమాలను స్వాధీనం చేసుకుంది. కోహిమాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. జపాన్‌ సైన్యం, భారత జాతీయ సైన్యం అప్రతిహతంగా ముందుకు సాగుతున్న సమయంలో ప్రతికూల వాతావరణంతో ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌కు ఎదురైన వ్యతిరేక ఫలితాల ప్రభావం భారత జాతీయ సైన్యంపై పడింది. సైనిక సామగ్రి, మందుగుండు, ఆయుధాలు, నిధులు, ఆహారం సరఫరా నిలిచిపోయాయి. ఇంఫాల్‌ వద్ద భారత జాతీయ సైన్యం ఓటమి చవిచూసింది. 1945లో బోస్‌ జపాన్‌ విమానంలో పైగాస్, ఫార్మోసా మీదుగా టోక్యో బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు జపాన్‌ రేడియో ప్రకటించింది. మహావీరుడిని కోల్పోయిన భారత జాతి దుఃఖసాగరంలో మునిగిపోయింది. సుభాస్‌ చంద్రబోస్‌ రచనల్లో ఒకటి ఇండియన్‌ స్ట్రగుల్‌. అసంపూర్ణంగా ఉన్న ఆయన ఆత్మకథ ‘యాన్‌ ఇండియన్‌ పిలిగ్రిమ్‌’. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో భారత జాతీయ సేనకు ప్రత్యేక స్థానం ఉంది.  దేశ స్వాతంత్య్ర సమస్యను బ్రిటిష్‌ ఇండియా పరిధి దాటించి అంతర్జాతీయ వేదిక మీదకు భారత జాతీయ సేన విజయవంతంగా తీసుకెళ్లింది. భారతదేశ స్వాతంత్య్రాన్ని, బోస్‌ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా ఎనిమిది దేశాలు అధికారికంగా గుర్తించడం గొప్ప పరిణామం. దీనివల్ల బ్రిటిషర్లపై ఒత్తిడి పెరిగింది. భారతదేశ జాతీయసేన మత సామరస్యానికి, భారత జాతి సహజీవనానికి ప్రతీక. భారత జాతీయ సైనికుల వీరోచిత కార్యకలాపాలు, ధైర్యసాహసాలు, త్యాగనిరతి, దేశప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాయి. బ్రిటిష్‌ సైన్యంలోని భారతీయుల వైఖరిలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. దేశ స్వాతంత్య్ర సాధన వేగవంతమైంది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 18-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రైతులు, గిరిజనుల తిరుగుబాట్లు            

ఆధునిక భారతదేశ చరిత్ర

ఆంగ్లేయులపై తిరగబడిన అన్నదాతలు.. అడవి బిడ్డలు!

ఆంగ్లేయులు అడుగు పెట్టడంతోనే భారతదేశంలో అలజడులు మొదలయ్యాయి. సుభిక్షంగా, స్వయంసమృద్ధితో సాగిపోతున్న సమాజం చిన్నాభిన్నమైంది. అరాచక భూమి శిస్తు విధానాలతో అన్నదాతలు అల్లాడిపోయారు. అడవుల్లోకి చొరబడి వనరులు కొల్లగొట్టడంతో గిరిజనుల జీవన విధానం, విశ్వాసాలకు విఘాతం కలిగింది. అడవి బిడ్డలపై వలస పాలకుల అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. దీంతో సంప్రదాయ విధానాల్లో జీవనం సాగించే రైతులు, తెగల ప్రజల్లో విప్లవాత్మక ధోరణులు పెరిగి తిరుబాట్లకు దారితీసింది. బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేసిన ఆ పోరాటాల వివరాలు, నాయకత్వం వహించిన యోధుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


1. రైతులు, గిరిజనుల తిరుగుబాటుకు కారణాలు?

1) రాజకీయ కారణాలు      2) ఆర్థిక కారణాలు      3) గిరిజనుల అసంతృప్తి     4) పైవన్నీ

జవాబు: పైవన్నీ


2. ప్రకటన-A: భారతదేశ రాజులు వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. 

ప్రకటన-B: ఈస్టిండియా కంపెనీ వారు వ్యవసాయ భూములపై నిర్దాక్షిణ్యంగా శిస్తు వసూలు చేశారు.

జవాబు: ప్రకటన A, B లు సరైనవి



3.  ప్రకటన-A: వలస పాలనలో చేతివృత్తులవారు జీవనోపాధి కోల్పోయారు. 

 కారణం- R: ఇంగ్లండ్‌లోని పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులు భారతదేశానికి దిగుమతి చేసుకోవడం.

జవాబు: ప్రకటన A కి కారణం R సరైన వివరణ.


4.  కిందివాటిని జతపరచండి.

రాష్ట్రాలు   -    గిరిజన తెగలు 

1) మహారాష్ట్ర     ఎ) కోలి

2) గుజరాత్‌      బి) నాయక్‌ 

3) ఒడిశా        సి) ఖోండ్‌ 

4) బిహార్‌      డి) సంతాలీలు

జవాబు: 1-ఎ; 2-బి; 3-సి; 4-డి


5.  బ్రిటిష్‌వారు చేసిన అటవీ చట్టాలకు సంబంధించి సరికానిది?

జవాబు: గిరిజనుల ఆదాయం పెంచాయి.


6.     నరబలి, శిశుహత్య అనాదిగా ఉన్న గిరిజన జాతి?

జవాబు: ఖోండ్‌ 


7.  బిహార్‌లోని సంతాలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?

జవాబు: 1855-56  


 


8.     తమల్‌ గిరిజన తెగ ఉన్న ప్రాంతం?

జవాబు:  ఛోటానాగ్‌పుర్‌    


9.     1857 తిరుగుబాటు సమయంలో పలమౌ, రాంచీ, హజారీ బాగ్‌ వద్ద ఉన్న ‘చిరో’ తెగ గిరిజనులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు?

జవాబు: పితాంబర్‌

10. ‘బిల్‌’ గిరిజన తిరుగుబాటుకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) ఇది 1817 - 19 మధ్య జరిగింది.

బి) ఈ తిరుగుబాటు మార్కోస్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌ కాలంలో జరిగింది.

సి) పశ్చిమ కనుమల్లోని ఖాందేశ్‌ ప్రాంతంలో ఉంటారు. 

డి) వీరికి సహాయం చేసినవారు పీష్వా రెండో బాజీరావు.

జవాబు: ఎ, బి, సి, డి 


11. రమోసే తెగ వారు చిత్తూర్‌ సింగ్‌ నాయకత్వంలో ఎప్పుడు తిరుగుబాటు చేశారు?

జవాబు: 1822 


12. రమోసే తెగవారు ప్రధానంగా దాడులు చేసిన ప్రాంతం?

జవాబు: సతారా 


13. కోల్‌ గిరిజనులు తిరుగుబాటు చేసిన సంవత్సరం?

జవాబు: 1831 - 32   


14. సిర్దార్‌ అంటే

జవాబు:  గిరిజన నాయకుడు  

 


15. కోల్‌ తిరుగుబాటు ఏ ప్రాంతం కేంద్రంగా జరిగింది?

జవాబు: రాంచీ    


16. కిందివాటిలో భిన్నమైంది?

 జవాబు: బెవార్‌ 


17. 1845లో బ్రిటిష్‌వారు స్థాపించిన ‘మెరియా ఏజెన్సీ’ ప్రధాన ఉద్దేశం?


జవాబు: నరబలులు, ఆడ శిశువుల హత్యలను అరికట్టడం


18. సంతాల్‌ తిరుగుబాటు ఏ గవర్నర్‌ జనరల్‌ చివరి కాలంలో జరిగింది?

జవాబు: లార్డ్‌ డల్హౌసీ


19. సంతాల్‌ తిరుగుబాటుకు నాయకుడు?

1) సిధు    2) కన్హూ    3) 1, 2   4) బిర్సా

జవాబు:  1, 2  


20. కోల్‌ తిరుగుబాటుకు సంబంధించి సరైంది?

ఎ) ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.

బి) ఈ తిరుగుబాటుకు నాయకుడు బుద్ధో భగత్‌.

జవాబు: బి మాత్రమే   


 

21. అహోమ్‌ తిరుగుబాటుకు ప్రధాన కారణం?

జవాబు: అస్సాంలో బ్రిటిష్‌ వారు అవలంబించిన వ్యవసాయ విధానాలు


22. విశాఖపట్నంలో గిరిజన తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?

జవాబు: 1832  


23. విశాఖపట్నం గిరిజన తిరుగుబాటును పరిగణించి సరైనవి గుర్తించండి.    

ఎ) ఈ తిరుగుబాటు కాశీపురం, పాయకరావుపేట, పాలకొండ జమీందారీలలో జరిగింది.

బి) తిరుగుబాటు అణచివేయడానికి నియమితుడైన అధికారి జార్జి రుస్సెల్‌.

సి) 1839లో ప్రభుత్వం XXIV చట్టం చేసింది.

డి) గిరిజనులు పితూరీల రూపంలో తిరుగుబాట్లు చేశారు.

జవాబు: ఎ, బి, సి, డి 


24. ప్రకటన-A: 1917లో మద్రాసు ప్రభుత్వం ది ఏజెన్సీ ట్రాక్ట్స్‌ ఇంటరెస్ట్‌ అండ్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ను రూపొందించింది.

ప్రకటన-B ఈ చట్టం గిరిజనుల భూములను గిరిజనేతరులకు ఇవ్వడం అనే సంప్రదాయాన్ని రద్దు చేసింది.

జవాబు:  ప్రకటన A, B లు సరైనవి   


25. గోండు ఉద్యమానికి సంబంధించి సరైనవి?

ఎ) దీని నాయకుడు కొమురం భీం.

బి) దీని నినాదం జల్, జంగిల్, జమీన్‌.

సి) ఈ తిరుగుబాటు తంత్రం గెరిల్లా పోరాటం.

జవాబు: ఎ, బి, సి   


26. ఖాసీ జయంతియా కొండల్లో బ్రిటిష్‌ వారు వేసే రోడ్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు?

జవాబు: ఖాసీ 


27. కుకీ తిరుగుబాటు జరిగిన ప్రాంతం?

జవాబు: మణిపుర్‌  

 

28. రంప ఏజెన్సీ అధిపతి మన్సబ్‌దార్‌కు సహాయపడినవారు?

జవాబు: ముత్తాదార్లు   


29. 1835లో మరణించిన రంప మన్సబ్‌దారు?

జవాబు:రామ భూపతిదేవ్‌  


30. రంపా తిరుగుబాటును అణచివేసేందుకు వచ్చిన రెవెన్యూ బోర్డు సభ్యుడు?

జవాబు: సల్లెవన్‌  

 


31. గిరిజనులు మాహువా చెట్ల పూలను దేనికి ఉపయోగిస్తారు?

1) తినడానికి    2) మద్యం తయారీకి      3) 1, 2      4) అలంకరణకు

జవాబు: 1, 2  



32. కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) ఒడిశాలోని ఖోండ్‌లు సామూహిక వేటకు వెళతారు. 

బి) మధ్యప్రదేశ్‌లోని బైగాలు ఉత్తమ వేటగాళ్లు.

జవాబు: ఎ, బి సరైనవి


33. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

ఎ) పంజాబ్‌ - వాన్‌ గుజ్జర్లు - ఆవులను మేపేవారు 

బి) కులూ - గద్దీలు - గొర్రెలు మేపేవారు

సి) కశ్మీర్‌ - బకర్వాలాలు - మేకల కాపరులు

డి) ఆంధ్రప్రదేశ్‌ - లంబాడీలు - పందులను పోషిస్తారు

జవాబు: డి మాత్రమే   


34. గిరిజన పంట కాలాలను జతపరచండి.

1) జేత్‌     ఎ) కుత్కి పక్వానికి వస్తుంది 

2) కార్తిక్‌    బి) కొత్త బెవార్‌లకు వెళ్లేవారు

3) కౌర్‌     సి) విత్తడం ప్రారంభిస్తారు

4) మాగ్‌    డి) బీన్స్‌ పక్వానికి వస్తుంది

జవాబు:  1-సి; 2-ఎ; 3-డి; 4-బి


35. నైషి తెగ గిరిజనులు ఉన్న ప్రాంతం?

జవాబు: అరుణాచల్‌ ప్రదేశ్‌ 


36. బిర్సా ముండా ఎప్పుడు మరణించారు?

జవాబు: 1900 


37. బిర్సా ముండాకు సంబంధించి సరికానిది?

జవాబు: బిర్సాను 1897లో అరెస్ట్‌ చేశారు.

 

38. గడ్కరి తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జవాబు:  కొల్హాపుర్‌


39. ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియా మిలిటెంట్‌ నేషనలిజమ్‌’ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు: వాసుదేవ బల్వంత్‌ పాడ్కే 


40. భూగాన్‌ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది?

జవాబు: ఒరిస్సా 


41. ఖాసిస్‌ తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జవాబు: మేఘాలయ


42. బాలగంగాధర్‌ తిలక్‌ గురువు ఎవరు?

జవాబు: వాసుదేవ బల్వంత్‌ పాడ్కే


43. భిల్లుల తిరుగుబాటుకు (1818 - 36) నాయ‌క‌త్వం వ‌హించిన‌వారు?

జవాబు: సేవారం

 

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కుల వ్యవస్థను ధిక్కరించి.. మానవత్వాన్ని చాటిచెప్పి!


భక్తి - సూఫీ ఉద్యమాలు

 



మత సహనాన్ని, ఐకమత్యాన్ని ప్రోత్సహిస్తూ సాగిన సామాజిక సంస్కరణల పోరాటం భక్తి ఉద్యమం. ఏకేశ్వరోపాసనకు, వైయక్తిక భక్తికి ప్రాధాన్యం ఇచ్చింది. కుల ఆధారిత శ్రేణులను తిరస్కరించింది. మతాలు, కులాల సరిహద్దులు దాటి విభిన్న సమూహాల భారతీయ సమాజం ఆవిర్భవించడానికి దోహదపడింది. మధ్యయుగంలో సంభవించిన ఈ పరిణామాల్లో హిందూ ముస్లిం మతాలు పరస్పరం ప్రభావితమై భక్తి, సూఫీ ఉద్యమాలు మొదలయ్యాయి. మత సామరస్యం, సాంఘిక సంస్కరణలు, ఆధ్యాత్మిక భావజాల వ్యాప్తికి ఉపకరించాయి. అదే సమయంలో హిందూ మతంలోని శైవులు, వైష్ణవుల మధ్య విభేదాలు తలెత్తాయి. సామాజిక కట్టుబాట్లను సమూలంగా మార్చిన ఈ ఉద్యమాల లక్షణాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. నాటి భక్తి ఉద్యమకారులు, సూఫీ తత్వవేత్తల విశేషాలు, వారి బోధనలు, గీతాలు, రచనలు, వ్యాఖ్యలు, ప్రాంతాలవారీ సంఘటనలు, అప్పటి ఆలయాల విశేషాల గురించి అవగాహన పెంచుకోవాలి.     ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1.    భక్తి ఉద్యమాన్ని రెండు భాగాలుగా విభజించిన చరిత్రకారుడు?

1) ఆర్‌.ఎస్‌.శర్మ       2) త్రిపాఠి   

3) యూసఫ్‌ హుస్సేన్‌      4) నీలకంఠ శాస్త్రి

 


2.     ‘భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభమవడం వల్లే భక్తి ఉద్యమం మొదలైంది’ అని అన్న చరిత్రకారుడు?

1) తారాచంద్‌       2) అహ్మద్‌ నిజామి  

3) ఖురేషి       4) పైవారంతా

 


3.     ‘భక్తి ఉద్యమం భగవద్గీతలోని బోధనల వల్ల ప్రభావితమైంది’ అని అన్న చరిత్రకారుడు?

1) ఆర్‌.జి.భండార్కర్‌       2) ఆర్‌.ఎస్‌.శర్మ 

3) త్రిపాఠి    4) నీలకంఠ శాస్త్రి

 


4.     కిందివాటిలో భక్తి ఉద్యమ లక్షణాలు గుర్తించండి.

ఎ) ముక్తి సాధన కోసం భగవంతుడి కృపను పొందడం.

బి) పవిత్రమైన మనసు, జీవనం, మానవత్వం, భక్తి లాంటివి అనుసరించడం. 

సి) ఏకేశ్వరోపాసన, సుగుణోపాసన, నిర్గుణోపాసనలను బోధించడం.

డి) కులవ్యవస్థను, పూజారుల పెత్తనాన్ని వ్యతిరేకించడం.

1) ఎ, బి, సి           2) ఎ, బి, డి    

3) బి, సి, డి        4) పైవన్నీ 

 


5.     వేద ప్రమాణం అంగీకరించి, అనుసరించినవారు?    

1) బౌద్ధులు     2) జైనులు 

3) బ్రాహ్మణులు     4) పైవారందరూ

 


6.     హిందూ మతం అనే పదం సింధూ నది పేరు మీద వచ్చింది. ఇది ఎప్పటి నుంచి వాడుకలో ఉంది?

1) 1000 ఏళ్ల క్రితం నుంచి  2) క్రీ.శ.1000 నుంచి 

3) క్రీ.పూ.1000 నుంచి      4) క్రీ.శ.2000 నుంచి

 


7.  హిందూ మతంలో కొన్ని ముఖ్య లక్షణాలు ఎప్పటి నుంచి రూపుదిద్దుకున్నాయి?

1) క్రీ.శ.1000       2) క్రీ.శ.500 

3) క్రీ.శ.200           4) క్రీ.శ.700

 


8.     ‘విష్ణువునే పరమాత్మ అని, విశ్వాన్ని సృష్టించాడని, అతిశక్తిమంతుడని, అన్నీ తెలిసినవాడని’ విశ్వసించినవారు?

1) హిందువులు     2) బ్రాహ్మణులు 

3) శైవులు     4) భాగవతులు

 


9.     రాముడు, కృష్ణుడి రూపాలు ఎన్నేళ్లకు పూర్వమే ప్రచారంలో ఉన్నాయి?

1) 2000  2) 1000  3) 5000  4) 4000

 


10. పశ్చాత్తాపం ద్వారా పవిత్రులుగా మారడం, కోరికలను నియంత్రించడం, ధ్యానం చేయడం అనే భావనలను ప్రచారం చేసినవారు?

1) బౌద్ధులు     2) జైనులు 

3) తత్త్వవేత్తలు     4) పైవారంతా

 


11. 2000 ఏళ్ల క్రితం నాటి కృష్ణాలయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారు?

1) మధ్యప్రదేశ్‌ - విదిశ         2) మధ్యప్రదేశ్‌ - బింభేట్కా

3) ఉత్తర్‌ప్రదేశ్‌ - విదిశ    4) ఉత్తర్‌ప్రదేశ్‌ - వారణాసి

 


12. 2000 ఏళ్ల కిందటి ప్రముఖ శైవక్షేత్రం చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఉంది? 

1) శ్రీకాళహస్తి     2) మల్లాం 

3) రేణిగుంట     4) గుడిమల్లాం

 


13. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ బౌద్ధమత స్తూపాలున్న ప్రాంతం?

1) అమరావతి      2) జగ్గయ్యపేట, భట్టిప్రోలు 

3) నాగార్జున కొండ   4) పైవన్నీ 

 


14. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి.    

ఎ) బుద్ధుడి జన్మ వృత్తాంతం గురించి తెలిపే కథలు - జాతక కథలు 

బి) శివుడు/విష్ణువు గురించి తెలిపే కథలు - పురాణాలు

1) ఎ, బి సరైనవి     2) ఎ, బి సరికానివి 

3) ఎ సరైంది     4) బి సరైంది 

 


15. తమిళనాడులో భక్తి ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం? 

1) క్రీ.శ.500      2) క్రీ.శ.550  

3) క్రీ.శ.1000     4) 550 సంవత్సరాల కిందట 

 


16. తమిళనాడులో ప్రారంభమైన భక్తి ఉద్యమం విధానాల్లో సరైనవి?

ఎ) వీరు శివుడు, విష్ణువు ఆరాధకులు.

బి) దేవుడి మీద నమ్మకం లేని బౌద్ధ, జైన మతాలను వ్యతిరేకించారు.

సి) వీరి ప్రధాన ఉద్దేశం దేవుడి సన్నిధానం పొందడమే.

డి) వీరు కుల, మత భేదాలు లేకుండా దేవుడిని పూజించారు.

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, సి       

3) బి, డి         4) ఎ, సి, డి

 


17. క్రీ.శ.1100లో భక్తి ఉద్యమకారులు దేవుడిని స్తుతిస్తూ రాసిన పాటలు ఏ భాషలో ఉన్నాయి?

1) తెలుగు     2) తమిళం 

3) ప్రాకృతం     4) తెలుగు, తమిళం 

 


18. ఆళ్వార్లు మొత్తం 12 మంది. వీరు ఎవరి భక్తులు? 

1) శివుడు     2) విష్ణువు 

3) బుద్ధుడు     4) వర్ధమానుడు

 


19. ఆళ్వార్లు అల్లి పాడిన పద్య మాలికలను ఏమంటారు? 

1) పాశురాలు     2) తేవారం 

3) తిరువాచకం     4) పైవన్నీ 

 


20. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి. 

ఎ) ఆళ్వారుల్లో ప్రముఖులు - పెరియాళ్వారు, నమ్మాళ్వారు

బి) ఆళ్వారుల్లో మహిళ - పెరియాళ్వారు కుమార్తె ఆండాళ్‌

సి) సృష్టి, దాగుడుమూతలు అనే పద్యమాలికలను అల్లింది - నమ్మాళ్వారు 

డి) ఆండాళ్‌ గురించి వివరించే గ్రంథం - ఆముక్త మాల్యద

1) ఎ, బి, డి         2) ఎ, బి, సి     

3) ఎ, బి, సి, డి        4) ఎ, సి, డి

 


21. నాయనార్లు శివభక్తులు. వీరు ఎంతమంది?

1) 12     2) 68    3) 65      4) 36

 


22. కిందివారిలో నాయనార్లను గుర్తించండి.

1) అప్పర్, సంబంధర్‌     2) సుందర్‌ 

3) మాణిక్య వాచకర్‌      4) పైవారంతా

 


23. నాయనార్లలో ప్రముఖ మహిళలు?

1) కరైక్కాలమ్మ      2) ఆండాళ్‌     

3) అరయ్యార్‌       4) కరైక్కాలమ్మ, అరయ్యార్‌ 

 


24. నాయనార్లు శివుడి గురించి పాడిన కీర్తనలు?    

1) తేవారం       2) తిరువాచకం   

3) తేవారం, తిరువాచకం     4) పాశురాలు

 


25. కింది వాక్యాలను పరిశీలించి సమాధానం గుర్తించండి.     

ఎ) ‘భయంలేదు మాకు’ అనే తేవారం కూర్చినవారు - అప్పర్‌ 

బి) ‘పరమశివా, నిను భజియింతుము’ అనే తేవారం కూర్చినవారు - మాణిక్య వాచకర్‌ 

1) ఎ సరికాదు     2) ఎ సరైంది     

3) ఎ, బి సరైనవి     4) ఎ, బి సరికావు

 


26. అత్యంత ప్రభావవంతమైన భక్తి ఉద్యమకారుల్లో ప్రముఖుడు?

1) శంకరాచార్యులు     2) రామానుజాచార్యులు 

3) బసవన్న     4) నింబార్కుడు

 


27. ప్రభావవంతమైన భారతీయ తత్త్వవేత్తల్లో ఒకరైన శంకరాచార్యుల గురించి సరైనవి?

ఎ) ఈయన క్రీ.శ.8వ శతాబ్దంలో కేరళలో జన్మించారు.

బి) బ్రహ్మ మాత్రమే పరమసత్యం అని బోధించారు. 

సి) అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు.

డి) ఈయన ప్రభావం ఉత్తర భారతదేశంలో అధికంగా ఉంది.

1) ఎ, బి, సి, డి         2) ఎ, బి, సి  

3) బి, సి, డి        4) ఎ, సి, డి

 


28. రామానుజాచార్యులు ఏ శతాబ్దానికి చెందినవారు?

1) 10వ    2) 11వ   3) 12వ    4) 13వ  

 


29. కిందివాటిలో రామానుజాచార్యులకు సంబంధించి సరైన అంశాలు-

ఎ) ఈయనపై అళ్వారుల ప్రభావం అధికంగా ఉంది.

బి) ఈయన విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారం చేశారు.

సి) ఈయన గురువు యాదవ్‌ ప్రకాశ్‌. రామానుజాచార్యులు 120 ఏళ్ల వయసులో సమాధి అయ్యారు. 

డి) సంపూర్ణ ఏకేశ్వరోపాసనను ఇతను వ్యతిరేకించారు. నిమ్నకులాల వారికి ఆలయార్చనలో స్థానం కల్పించారు.

1) ఎ, బి, సి, డి       2) ఎ, సి    

3) బి, సి, డి        4) ఎ, బి, సి

 


30. మధుర సమీపంలోని బాజ్రోలో ఆశ్రమం స్థాపించి రాధాకృష్ణుల భక్తిని ప్రచారం చేసిన నింబార్కుడు ఎవరికి సమకాలీనుడు?

1) శంకరాచార్యులు     2) రామానుజాచార్యులు  

3) బసవన్న      4) ఆనందుడు  

 


31. గొప్ప విష్ణుభక్తుడు; బ్రహ్మసూత్రాలు, రుగ్వేదంలోని తొలి భాగాలకు దశోపనిషత్తులు, భగవద్గీతకు భాష్యాలు లాంటి 35 గ్రంథాలను రచించినవారు?

1) మధ్వాచార్యుడు     2) రామానుజాచార్యులు 

3) శంకరాచార్యులు     4) బసవన్న 

 


32. దక్షిణ భారతదేశానికి చెందిన వైష్ణవ మత ప్రచారకుడు, కాశీలో జన్మించి కృష్ణభక్తిని ప్రచారం చేసిన ప్రముఖ భక్తి ఉద్యమకారుడు?

1) వల్లభాచార్యులు     2) రామానుజాచార్యులు 

3) శంకరాచార్యులు     4) బసవన్న

 


33. ఉత్తర భారతదేశానికి చెందిన భక్తి ఉద్యమ ప్రవక్తల్లో మొదటివారు?

1) రామానందుడు     2) వల్లభాచార్యులు 

3) శంకరాచార్యులు     4) బసవన్న 

 


34. గంగానది తీరప్రాంతంలో ప్రచారానికి రామానందుడు ఏ భాషను ఉపయోగించారు?

1) సంస్కృతం    2) హిందీ   

3) ప్రాకృతం     4) తెలుగు

 


35. ‘ఆనంద భాష్యం’ గ్రంథాన్ని ఎవరు రచించారు?

1) వల్లభాచార్యులు          2) రామానందుడు     

3) రామానుజాచార్యులు      4) ఆనందుడు

 


36. స్త్రీలకు వైష్ణవ మతంలో చేరే అవకాశం కల్పించిన వ్యక్తి? 

1) రామానందుడు     2) కబీర్‌ 

3) నింబార్కుడు     4) అప్పర్‌ 

 


37. వీరశైవ భక్తి ఉద్యమాన్ని బసవన్న ఏ శతాబ్దంలో ప్రచారం చేశారు?

1) 10వ   2) 11వ   3) 12వ   4) 13వ 

 


38. బసవన్న వీరశైవాన్ని కర్ణాటకలో ప్రచారం చేసే సమయంలో అతడి సహచరులు? 

1) అల్లమ ప్రభువు     2) అక్క మహాదేవి 

3) కరైక్కాలమ్మ     4) అల్లమ ప్రభువు, అక్క మహాదేవి

 

 


సమాధానాలు

13; 24; 31; 44; 53; 62; 72; 84; 91; 104; 111; 124; 134; 141; 152; 161; 174; 182; 191; 203; 212; 224; 234; 243; 253; 261; 272; 282; 291; 302; 311; 321; 331; 342; 352; 361; 373; 384.

 


 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 06-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

‘ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు!’

భక్తి - సూఫీ ఉద్యమాలు

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

మధ్యయుగ భారతదేశంలో హిందువులను భక్తి ఉద్యమం, ముస్లింలను సూఫీ ఉద్యమం ప్రభావితం చేశాయి. వీటి పరస్పర ప్రేరణలతో మిశ్రమ సంస్కృతి ఆవిర్భవించింది. భక్తి ఉద్యమంలో సాధువులు దేవతలను ఆరాధిస్తూ భజనలు చేస్తే, సూఫీ సన్యాసులు భక్తిని ప్రోత్సహించేందుకు ఖవ్వాలీ వంటి సంగీత ప్రక్రియలను ఆచరించారు. ప్రేమ, ఆరాధనలతో భగవంతుడిని చేరుకోవచ్చు అన్నదే రెండు ఉద్యమాల అంతరార్థం.  మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు, వర్ణ భేదాలను ఉద్యమకారులు వ్యతిరేకించారు. సమాజంలో చైతన్యాన్ని, మార్పును తెచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాలను వ్యాప్తి చేసిన ప్రముఖులు, వారి రచనలు, ప్రసిద్ధ బోధనలు, నాటి పరిస్థితుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

1.    ‘ధనవంతులు శివుడికి గుడి కడతారు. పేదవాడిని నేనేం చేస్తాను’ అని అన్నదెవరు?

1) అల్లమ ప్రభువు     2) రామానందుడు

3) బసవన్న     4) నింబార్కుడు


2.     పండరీపురంలో ఉన్న దేవుడు ఎవరు?

1) రాముడు     2) విఠలుడు

3) శివుడు     4) సాయిబాబా


3.     ‘ఇతరుల బాధను అర్థం చేసుకునేవాళ్లే వైష్ణవులు’ అని అన్నదెవరు?

1) నామ్‌దేవ్‌     2) నర్సీ మెహతా 

3) తుకారాం     4) ఏకనాథ్‌


4.     మరాఠీ భాషలో రాసిన భక్తి గేయాలను ఏమంటారు?

1) తేవారం 2) పాశురం 3) అభంగ్‌ 4) పైవన్నీ


5.     ‘విపరీతంగా అసహ్యానికి గురైన వాడిని, దెబ్బలు తిన్నవాడిని చూసి..’ అనే ఈ భక్తి గీతం రచించినవారు?

1) సంత్‌ తుకారాం     2) ఏకనాథ్‌ 

3) నామ్‌దేవ్‌     4) జ్ఞానేశ్వర్‌


6.     ‘మమ్మల్ని నిమ్నకులంలోని వాడిని చేసింది నువ్వే యథార్థానికి’ అని అన్నవారు?

1) చోఖామేళుడు     2) కర్మమేళుడు 

3) నామ్‌దేవ్‌     4) నందనార్‌


7.     ‘ప్రపంచాన్ని వదిలివేసి నిరాకార పరమ సత్యాన్ని ధ్యానించాలి’ అని చెప్పినవారు?

1) సిద్ధులు     2) యోగులు 

3) నాథపంథీలు     4) పైవారంతా


8.     ముస్లిం మార్మిక సాధువులుగా పేరొందినవారు?

1) సున్నీలు     2) షియాలు 

3) సూఫీలు     4) వహబీలు


9.     ఏకేశ్వరోపాసన కచ్చితంగా పాటించాలని, ప్రపంచాన్ని వేరేవిధంగా చూడటానికి హృదయానికి శిక్షణ ఇవ్వొచ్చని విశ్వసించినవారు?

1) సున్నీలు 2) షియాలు 3) సూఫీలు 4) సిద్ధులు


10. కింది జతలను పరిశీలించి సరైనదాన్ని గుర్తించండి.

ఎ) రక్స్‌ - నృత్యం చేయడం

బి) సామా - పాడటం

సి) జిక్ర్‌ - ఒక నామాన్ని/సూత్రాన్ని జపించడం

1) ఎ, బి, సి    2) బి    3) సి    4) బి, సి


11. సూఫీ గురువుల పరంపరను ఏమంటారు?

1) తరీకాను      2) వారసత్వం 

3) సిల్‌సిలా     4) పైవన్నీ


12. కిందివాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి.

సూఫీమత గురువులు ప్రాంతాలు
ఎ) మొయినుద్దీన్‌ చిష్టీ అజ్మీర్‌
బి) కుతుబుద్దీన్‌ భక్తియార్‌ కాకి ఢిల్లీ
సి) బందనవాజ్, గిసుదరాజ్‌ గుల్బర్గా
డి) నిజాముద్దీన్‌ ఔలియా ఢిల్లీ

1) డి సరైంది      2) బి, డి సరైంది

3) ఎ, బి, సి, డి సరైనవి   4) ఏదీకాదు


13. సూఫీ మత గురువులు సమావేశాలు జరిపే ప్రాంతాన్ని ఏమంటారు?

1) ఖాన్‌కాహ్‌     2) ధర్మశాల 

3) ఖాన్‌కాహ్, ధర్మశాల      4) దర్గా


14. సూఫీమత గురువుల సమాధులు ఏ పేరుతో ప్రసిద్ధి చెందాయి? 

1) మసీదు  2) మదర్సా  3) దర్గా  4) పైవన్నీ


15. మహాభాగవతాన్ని రచించిన పోతన నివసించిన బమ్మెర గ్రామం ఏ ప్రాంతానికి సమీపంలో ఉంది?

1) వరంగల్‌     2) నల్గొండ 

3) విజయవాడ     4) హైదరాబాద్‌


16. బమ్మెర పోతన ఏవిధంగా ప్రసిద్ధి చెందారు?

1) గొప్పకవి     2) సహజ కవి 

3) తెలుగు కవి     4) పైవన్నీ


17. తాళ్లపాక అన్నమాచార్యులకు సంబంధించి సరైన వాక్యాలు?

1) ఇతను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు.

2) పదకవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందారు.

3) ఈయన కీర్తనల్లో నైతికత, ధర్మం, నిజాయతీ వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.

4) ఈయన శ్రీ వేంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు రాశాడని అన్నమాచార్య జీవితచరిత్రము ద్వారా తెలుస్తుంది.

1) 1, 2, 3, 4    2) 2, 3, 4    

3) 2, 4    4) 1, 3, 4


18. చైతన్య మహాప్రభు ఏ ప్రాంతానికి చెందినవారు?

1) బిహార్‌     2) ఉత్తర్‌ప్రదేశ్‌ 

3) బెంగాల్‌     4) మధ్యప్రదేశ్‌


19. చైతన్య మహాప్రభు గురించి సరికాని అంశం?

1) ఈయన శైవసాధువు, సంఘసంస్కర్త.

2) భగవద్గీత, భాగవత పురాణాల ఆధారంగా భక్తి ప్రచారం చేశాడు.

3) భక్తితో నాట్యం చేయడాన్ని వ్యాప్తి చేశాడు.

4) హరేకృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారం చేశాడు.

1) 1, 2    2) 2, 4    

3) 1 మాత్రమే    4) 3 మాత్రమే


20. కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవారు? 

1) 15వ శతాబ్దం     2) 16వ శతాబ్దం 

3) 17వ శతాబ్దం     4) 18వ శతాబ్దం


21. కంచర్ల గోపన్నకు సంబంధించి సరికాని వాక్యం?

1) ఈయన శ్రీరాముడి భక్తుడు, కర్ణాటక సంగీతంలో కీర్తనలు రాశాడు.

2) తెలుగు భాషలో ప్రముఖ వాగ్గేయకారుడు.

3) దాశరథి శతకం రచించాడు.

4) దాశరథి శతకంలో 1008 పద్యాలున్నాయి.


22. భగవంతుడిని రామాకృతిలో భావన చేసిన రామచరిత మానస్‌ అనే కావ్యాన్ని రచించినవారు?

1) రామదాసు     2) కంచర్ల గోపన్న 

3) తులసీదాస్‌     4) మీరాబాయి


23. రామచరిత మానస్‌ ఏ భాషలో ఉంది?

1) బెంగాలీ 2) మరాఠి 3) అవధి 4) సంస్కృతం


24. నామ్‌ఘర్‌ అనే భగవన్నామస్మరణ, జపధ్యాన మందిరాలను ఏర్పాటు చేసినవారు?

1) తులసీదాస్‌     2) సూర్‌దాస్‌ 

3) రామదాసు     4) శంకరదేవుడు


25. కిందివారిలో అస్సామీ భాషలో నాటకాలు రాసినవారు?

1) శంకరదేవుడు     2) సూర్‌దాస్‌ 

3) తులసీదాస్‌     4) చైతన్య మహాప్రభు


26. మీరాబాయి ఎవరి శిష్యురాలు?

1) రవిదాసు     2) సూర్‌దాస్‌ 

3) తులసీదాస్‌     4) దాదు దయాళు


27. మీరాబాయి భజన గీతాలు నేటికీ ఏ రాష్ట్రంలో జనబాహుళ్యంలో ఉన్నాయి?

1) రాజస్థాన్‌     2) గుజరాత్‌ 

3) మహారాష్ట్ర     4) 1, 2 


28. మధ్యయుగ కాలంలో ప్రముఖ సంఘ, మత సంస్కర్త అయిన కబీర్‌కు సంబంధించి సరైంది?

1) ఇతను కాశీ/వారణాసి సమీపంలో నివసించారు.

2) ఈయన రామానందుడి శిష్యుడు, విప్లవభావాలు కలిగినవాడు.

3) ఈయన బోధనలు ప్రధాన మత సంప్రదాయాల సంపూర్ణ, తీవ్ర తిరస్కరణలపై ఆధారపడ్డాయి.

4) సంచార భజన బృందగాయకులు పాడుతూ వచ్చే సాఖీల పదాల ద్వారా ఈయన భావనలను మనం తెలుసుకోగలుగుతున్నాం.

1) 1, 2, 3, 4  2) 2, 3, 4  3) 1, 3, 4  4) 2, 4


29. ‘‘అన్ని జీవుల్లోనూ ఉండే ఓ అల్లా-రామ్, దయ ఉంచు నీ దాసులమీద శ్రీ ప్రభు’’ అని తెలిపినవారు?

1) తులసీదాస్‌     2) కబీర్‌ 

3) రామానందుడు     4) గురునానక్‌


30. ‘‘హిందూ, ముస్లిం ఇద్దరూ సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలు అని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొదటి సంఘ సంస్కర్త కబీర్‌’’ అని అన్న చరిత్రకారుడు ఎవరు?

1) కె.ఎస్‌.లాల్‌     2) ఆర్‌.ఎస్‌.త్రిపాఠి 

3) రోమిల్లా థాఫర్‌    4) ఆర్‌.డి.బెనర్జీ


31. గురునానక్‌ ఎక్కడ జన్మించారు?

1) తాల్వాండి     2) కర్తార్‌పూర్‌ 

3) లాహోర్‌     4) నాసిక్‌


32. కులం, స్త్రీ పురుష భేదంతో నిమిత్తం లేకుండా అనుచరులు కలిసి భోజనం చేసే వంటశాలను ఏమంటారు? 

1) లంగర్‌  2) ధర్మశాల  3) ఖాన్‌కాహ్‌ 4) 1, 2 


33. గురునానక్‌కు సంబంధించిన వాక్యాలను పరిశీలించి సమాధానం గుర్తించండి.

1) నామ్‌ అంటే సరైన ఆరాధన.

2) దాన్‌ అంటే ఇతరుల సంక్షేమం. 

3) ఇస్నాన్‌ అంటే మంచి నడవడిక.

4) సమాజం పట్ల దృఢమైన నిబద్ధతతో క్రియాశీలకమైన జీవనం గడపాలి.

1) 1, 2    2) 2, 3, 4    

3) 1, 2, 3, 4    4) 1, 3, 4


34. గురునానక్‌ జన్మించిన సంవత్సరం?

1) 1469  2) 1494  3) 1538  4) 1479 


35. గురునానక్‌కు జ్ఞానోదయం అయిన సంవత్సరం? 

1) 1469  2) 1494  3) 1538  4) 1479


36. గురునానక్‌ అధ్యయనం చేసిన భాషలు? 

1) పర్షియా 2) హిందీ 3) పంజాబీ 4) పైవన్నీ 


37. గురునానక్‌ బోధనలున్న గ్రంథం? 

1) ఆదిగ్రంథ్‌     2) గురుగ్రంథ సాహెబ్‌

3) 1, 2     4) నానక్‌ గ్రంథ్‌


38. వైష్ణవ ఉద్యమ ప్రచారకుడైన చైతన్యుడు ఏ విధంగా పేరు పొందారు?

1) శ్రీ గౌరంగ     2) శ్రీ విజయ    

3) శ్రీ తనయ     4) శ్రీ ఆళ్వారు


39. చైతన్యుడు బెంగాలీ భాషలో రచించిన పుస్తకం?

1) గీతానందం     2) శిక్షఅస్తక్‌ 

3) శిక్షసమాచార్‌     4) కృష్ణమంత్రం 


40. మీరాబాయి కృష్ణుడిపై రచించిన కీర్తనలు ఏ భాషలో ఉన్నాయి?

1) బ్రిజ్‌ 2) మరాఠీ 3) గుజరాతీ 4) సంస్కృతం


41. తులసీదాస్‌ రచించిన గ్రంథాలు?

1) రామచరిత మానస్‌     2) గీతావళి 

3) వినయ పత్రిక     4) పైవన్నీ


42. రాధాకృష్ణుల భక్తుడు అయిన సూర్‌దాస్‌ ప్రముఖ రచనలు?

1) సుర్‌సరావళి     2) సాహిత్యరత్న 

3) సుర్‌సాగర్‌     4) పైవన్నీ


43. మహాత్మాగాంధీకి ఇష్టమైన ‘‘వైష్ణవ జనతో తేనో కహియే’’ అనే భజనను రచించినవారు? 

1) శంకరదేవుడు     2) తులసీదాసు 

3) నర్సీమెహత     4) చైతన్య మహాప్రభు


44. ‘సూఫీయిజం’ అనే ఆంగ్ల పదం వాడుకలోకి వచ్చిన శతాబ్దం?

1) 16వ శతాబ్దం     2) 17వ శతాబ్దం 

3) 18వ శతాబ్దం     4) 19వ శతాబ్దం


45. భారతదేశంలో ప్రధానమైన సూఫీ మత శాఖ?

1) చిస్తి 2) నక్షాబందీ 3) సుహ్రవర్ది 4) సిల్‌సిలా


46. మొగలుల కాలంలో ఎన్ని సిల్‌సిలాలు ఉన్నట్లు అబుల్‌ ఫజల్‌ తన ఐనీ అక్బరీలో పేర్కొన్నాడు? 

1) 12        2) 1      3) 14     4) 15


47. ఢిల్లీ సుల్తానుల కాలం నుంచి వర్ధిల్లిన సిల్‌సిలా? 

1) సుహ్రవర్ది 2) చిస్తి 3) ఖాద్రీ 4) నక్షాబందీ

 


సమాధానాలు


1-3; 2-2; 3-2; 4-3; 5-1; 6-2; 7-4; 8-3; 9-3; 10-1; 11-3; 12-3; 13-3; 14-3; 15-1; 16-2; 17-1; 18-3; 19-2; 20-3; 21-4; 22-3; 23-3; 24-4; 25-1; 26-1; 27-4; 28-1; 29-2; 30-1; 31-1; 32-4;  33-3; 34-1; 35-2; 36-4; 37-3; 38-1; 39-2; 40-1; 41-4; 42-4; 43-3; 44-4; 45-1; 46-3; 47-1. 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 11-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చంద్రగిరి పర్వతాల్లో బాహుబలి!

జైన మతం

 


భారతదేశంలో పుట్టిన జైన మతం ఎంతో విశిష్టమైంది. అనుసరించే వారికి విప్లవాత్మక జీవన విధానాన్ని పరిచయం చేసింది. అహింసే పరమ ధర్మమని ప్రపంచానికి చాటి చెప్పింది. నైతిక, ఆధ్యాత్మిక శాంతికి బాటలు వేసింది. ప్రారంభంలో ఒక వెలుగు వెలిగినప్పటికీ మత విధానాల్లోని కఠిన నియమాలు, ఆచరణ సాధ్యం కాని అహింస కారణంగా ప్రజాదరణకు నోచుకోలేదు. చివరికి మైనారిటీ మతంగా మిగిలిపోయింది. మనుషుల సహజ ఆలోచనా ధోరణిని, ప్రాపంచిక దృక్పథాన్ని సమూలంగా మార్చగలిగే ఈ మతం ఆవిర్భావం, ఆచరణ విధానాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. జైనుల ఆరాధ్యనీయులు, వారి జీవిత విశేషాలు, మత గ్రంథాలు, పవిత్ర స్థలాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.     వర్ధమాన మహావీరుడు ఒక

1) బ్రాహ్మణుడు    2) క్షత్రియుడు  

3) వైశ్యుడు      4) శూద్రుడు


2.     కిందివాటిలో సరికానిది?

1) జైనమతం భారతదేశంలో మొదటి ప్రాచీన మతం.

2) జైనమత గురువులను తీర్థంకరులు అంటారు.

3) తీర్థాంకరులు అంటే జీవనస్రవంతిని దాటడానికి వారధి నిర్మించేవారు.

4) మొత్తం తీర్థంకరులు 24 మంది.


3.     కిందివాక్యాల్లో రిషభనాథుడి గురించి సరైనవి.

ఎ) మొదటి తీర్థంకరుడు, ఇతడి ప్రస్తావన రుగ్వేదంలో ఉంది.

బి) దక్షిణ భారతదేశంలోని అస్మక అనే ప్రాంతానికి చెందినవారు.

సి) ఇతడి చిహ్నం - వృషభం.

డి) ఇతడి కుమారులు భరతుడు, బాహుబలి; కుమారై బ్రాహ్మీ.

1) ఎ, బి, సి, డి      2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి      4) ఎ, డి


4.     కిందివాటిలో పార్శ్వనాథుడికి సంబంధించి సరైనవి.

ఎ) 23వ తీర్థంకరుడు.

బి) వర్ధమాన మహావీరుడి కంటే 250 సంవత్సరాలు పూర్వం జీవించాడు.

సి) ఇతడి చిహ్నం - సర్పం.

డి) కాశీరాజు అశ్వసేన, వామల దేవి కుమారుడు.

1) ఎ, బి, సి      2) ఎ, బి, సి, డి  

3) బి, డి      4) ఎ, సి, డి


5.     వర్ధమాన మహావీరుడికి సంబంధించి సరైనవి?

ఎ) ఇతడు 24వ తీర్థంకరుడు.

బి) వైశాలీ సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు.

సి) వర్థమానుడు జ్ఞాత్రిక వంశానికి చెందిన క్షత్రియుడు.

డి) తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల.

1) ఎ, బి       2) ఎ, బి, సి, డి  

3) ఎ, బి, డి      4) బి, సి, డి


6.     వర్ధమాన మహావీరుడు 42 ఏళ్ల వయసులో జ్ఞానోదయం పొందిన ప్రాంతం, నది వరుసగా?

1) జృంభిక - రుజపాలిక      2) జృంభిక - నర్మదా నది

3) జృంభిక - కుశి నది       4) వైశాలి - రుజపాలిక


7.     వర్ధమాన మహావీరుడి బిరుదులు, వాటి అర్థాల్లో సరికానిది?

1) జిన ఎ) కోరికలు జయించినవాడు
2) మహావీరుడు బి) ఇంద్రియాలపై నియంత్రణ ఉన్నవాడు
3) నిర్గందుడు సి) బంధాలు లేనివాడు
4) కేవలి డి) సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి  4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి


8.     కిందివాటిలో పంచవ్రతాల్లో లేనిది?

1) అహింస      2) బ్రహ్మచర్యం  

3) తపస్సు      4) అపరిగ్రహం


9.     జైనమత పంచవ్రతాల్లో వర్ధమానుడు చేర్చింది?

1) అస్తేయ      2) అపరిగ్రహం 

3) బ్రహ్మచర్యం       4) సత్యం


10. వర్ధమాన మహావీరుడి దృష్టిలో ‘ఆత్మకర్మ నుంచి విముక్తి పొందే స్థితి’ అంటే ఏమిటి?

1) కేవల (కైవల్య) స్థితి      2) గొప్ప స్థితి  

3) ఆనంద స్థితి      4) పైవన్నీ 


11. కిందివాటిలో త్రిరత్నాల్లో లేనిది?

1) సమ్యక్‌ క్రియ       2) సమ్యక్‌ జ్ఞానం

3) సమ్యక్‌ దృష్టి        4) సమ్యక్‌ విశ్వాసం


12. కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) సల్లేఖన వ్రతం: ఆహార పానీయాలు తీసుకోకుండా కఠిన ఉపవాస దీక్ష ద్వారా మరణం

బి) ప్రయోగ పద్ధతి: ప్రవహించే నీటిలో మునిగి మరణం

1) ఎ, బి సరైనవి  2) ఎ సరైంది, బి సరికాదు

3) ఎ, బి సరికావు      4) ఎ సరికాదు, బి సరైంది


13.    జైనమత గ్రంథాలను ఏమంటారు? అవి ఏ భాషలో ఉన్నాయి?

       గ్రంథం             భాష
1) అంగాలు - అర్థమాగధ 2) అంగాలు - హిందీ
3) త్రిరత్నాలు - అర్థమాగధ 4) త్రిరత్నాలు - హిందీ

 
14. కిందివారిలో దిగంబరులు, శ్వేతాంబరుల నాయకులు వరుసగా?

1) స్థూలబాహు - భద్రబాహు      2) భద్రబాహు - స్థూలబాహు

3) స్థూలబాహు - చంద్రగుప్తుడు     4) భద్రబాహు - చంద్రగుప్తుడు


15. జైనమత సమావేశాలు, అవి జరిగిన ప్రాంతాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) మొదటి సమావేశం క్రీ.పూ. 3వ శతాబ్దంలో పాటలీపుత్రలో జరిగింది.

బి) రెండో సమావేశం క్రీ.శ. 5/6వ శతాబ్దంలో వల్లభి గుజరాత్‌లో జరిగింది.

1) ఎ, బి సరైనవి      2) ఎ, బి సరికావు

3) ఎ సరైంది, బి సరికాదు   4) ఎ సరికాదు, బి సరైంది


16. కిందివాటిలో సరైనవి?

ఎ) గోమఠేశ్వరుడు అంటే బాహుబలి.

బి) ఇది ఏకశిల విగ్రహం.

సి) ఈ విగ్రహం కర్ణాటకలోని శ్రావణ బెళగోళ వద్ద ఉంది.

డి) ఈ విగ్రహం ఎత్తు 57 అడుగులు.

1) ఎ, సి       2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి      4) ఎ, బి, సి, డి


17.    గోమఠేశ్వరుడి విగ్రహం ఏ పర్వతాల్లో ఉంది?

1) ఆరావళి పర్వతాలు      2) చంద్రగిరి పర్వతాలు

3) కైలాస పర్వతాలు       4) వారాహి పర్వతాలు


18. జైనులు పూజించే స్త్రీ దేవతా విగ్రహం, అది ఉన్న ప్రదేశం?

1) విద్యాదేవిన్‌ - శ్రావణ బెళగోళ     2) సరస్వతి - బాసర

3) విద్యాదేవిన్‌ - దిల్వారా ఆలయం     4) సరస్వతి - కొలనుపాక


19. దిల్వారా దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌      2) రాజస్థాన్‌  

3) మధ్యప్రదేశ్‌      4) మహారాష్ట్ర


20. దిల్వారా అనే జైన ఆలయం ఉన్న కొండలు?

1) చంద్రగిరి కొండలు  2) మౌంట్‌ అబూ కొండలు

3) బ్రహ్మగిరి కొండలు  4) కైలాసగిరి కొండలు


21. పరిశిష్ట పర్యన్‌ అనే గ్రంథం ఎవరు రచించారు?

1) స్థూలబాహు      2) భద్రబాహు  

3) హేమచంద్ర      4) సుదర్శన్‌


22. జైన అశోకుడిగా పేరు పొందిన రాజు?

1) అశోకుడు       2) సంప్రతి   

3) చంద్రగుప్తుడు      4) ఖారవేలుడు


23. ఒడిశాలోని ఉదయగిరి, ఖండగిరి/స్కంధగిరి వద్ద జైన క్షేత్రాలు నిర్మించిన రాజు?

1) రుద్రదమనుడు      2) చాముండరాయ

3) ఖారవేలుడు       4) చంద్రగుప్తుడు


24. జైనమతంలోని శ్వేతంబరులు, దిగంబరుల గురించి ప్రస్తావించిన చైనా యాత్రికుడు?

1) పాహియాన్‌      2) హుయాన్‌త్సాంగ్‌

3) 1, 2       4) కన్ఫ్యూషియస్‌


25. పంచవత్రాల్లో ‘అపరిగ్రహం’ అంటే ఏమిటి?

1) ఆస్తిని దొంగిలించకూడదు.  

2) అవసరానికి మించి ఆస్తి కలిగి ఉండకూడదు.

3) 1, 2  4) ఆస్తిని జైన గుడికి అప్పగించాలి.


26. జైనమత మొదటి సమావేశానికి అధ్యక్షుడు?

1) స్థూలబాహు      2) భద్రబాహు

3) దేవరధి       4) వర్ధమానుడు


27. కిందివాటిలో అజీవక మతం గురించి సరైనవి?

ఎ) దీని స్థాపకుడు గోశాల మక్కరిపుత్ర.

బి) దీనికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు.

సి) ఇతడి సిద్ధాంతం ‘ఉద్బేదవాదం’.

డి) బిందుసారుడు ఈ మతాన్ని స్వీకరించారు.

1) ఎ, సి, డి      2) ఎ, బి, సి, డి  

3) ఎ, బి, డి      4) ఎ, డి


28. చార్వక మతస్థాపకుడు?

1) అజిత కేశకంబలి      2) మక్కలి గోశాల

3) వర్ధమానుడు       4) బృహస్పతి


29. జైనకల్ప సూత్రం రచించినవారు?

1) స్థూలబాహు      2) బాహుబలి    

3) భద్రబాహు       4) భరతుడు


30. జైనుల ప్రథమ తీర్థంకరుడు రిషభనాథుడు ఎక్కడ నిర్యాణం చెందాడు?

1) శ్రావణ బెళగోళ  2) కైలాస శిఖర పర్వతం

3) సారనాథ్‌      4) గయ


31. రిషభనాథుడి గురించి ఇతిహాసం, పురాణాల్లో ఏ అవతారం అని పేర్కొన్నారు? 

1) బ్రహ్మ   2) శివ   3) విష్ణు   4) ప్రజాపతి


32. జైనమత గ్రంథాల ప్రకారం 24 మంది తీర్థంకరుల కులం?

1) బ్రాహ్మణులు      2) క్షత్రియులు  

3) శూద్రులు      4) వైశ్యులు


33. పార్శ్వనాథుడు జైనమతంలో చేర్చిన సిద్ధాంతం/ సిద్ధాంతాలు?

1) అహింస, సత్యం       2) అపరిగ్రహం   

3) అస్తేయం      4) పైవన్నీ


34. రిషభనాథుడు, వర్ధమాన మహావీరుల చిహ్నాలు వరుసగా?

1) సింహం, పాము      2) పాము, సింహం  

3) ఎద్దు, సింహం      4) సింహం, ఎద్దు


35. సాద్వాదం అంటే?

1) హిందూమత వేదాంతం 2) జైనమత వేదాంతం

3) బౌద్ధమత వేదాంతం      4) క్రైస్తవమత వేదాంతం


36. అనేకాంతవాదం అంటే?

1) జైనమతంలోని నాలుగు సిద్ధాంతాలు 

2) జైనమతంలోని రెండు సిద్ధాంతాలు

3) బౌద్ధమతంలోని మూడు సిద్ధాంతాలు

4) జైనమతంలోని అయిదు సిద్ధాంతాలు


37. ఏ రాష్ట్రకూట రాజు సల్లేఖన వ్రతం చేసి మరణించారు?

1) దంతిదుర్గుడు       2) అమోఘవర్షుడు  

3) నాలుగో ఇంద్రుడు      4) రెండో కృష్ణుడు


38. రాజస్థాన్, గుజరాత్‌లలో ఎక్కువగా ఉన్న మతం?

1) జైనం  2) బౌద్ధం  3) అజీవకం  4) క్రైస్తవం


39. సల్లేఖన వ్రతం ఏ మతానికి చెందింది?

1) హిందూ  2) జైన   3) బౌద్ధ  4) చార్వాక


40. జైన మతస్థులు వాసుదేవుడికి దగ్గరి చుట్టంగా ఎవరిని భావిస్తారు?

 1) రిషభనాథుడు 2) అరిష్టనేమి 3) పార్శ్వనాథుడు      4) మహావీరుడు

 


సమాధానాలు

1-2, 2-1; 3-1; 4-2; 5-2; 6-1; 7-1; 8-3; 9-3; 10-1; 11-3; 12-1; 13-1; 14-2; 15-1; 16-4; 17-2; 18-3; 19-2; 20-2; 21-3; 22-2; 23-3; 24-2; 25-2; 26-1; 27-2; 28-1; 29-3; 30-2; 31-3; 32-2; 33-4; 34-3; 35-2; 36-2; 37-3; 38-1; 39-2; 40-3.

 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


గ‌ద్దె న‌ర‌సింహారావు

Posted Date : 26-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 బ్రిటిష్‌ ఇండియాలో విద్యా విధానం

 సనాతన విద్యకు సంస్కరణలు! 

బ్రిటిష్‌ వలస పాలనలో భారతీయ విద్యావ్యవస్థ సనాతనం నుంచి ఆధునికతను సంతరించుకుంది. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు, సమాజ నియమాలు, చట్టాలను అర్థం చేసుకోవడానికి బ్రిటిషర్లు విద్యాసంస్థలను, ఆంగ్ల బోధనను ఇక్కడ ప్రారంభించారు. యూనివర్సిటీలను నెలకొల్పారు. దాంతో సరికొత్త భారత మేధావి వర్గం పుట్టుకొచ్చింది. వారు  సామ్రాజ్యవాద పోకడలను, ఆర్థిక దోపిడీని అర్థం చేసుకున్నారు. ఆంగ్లేయుల అరాచకాలను ఎదిరించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని మన వాళ్లలో పెంపొందించేందుకు కృషి చేశారు.  అప్పట్లో ఏర్పాటు చేసిన విద్యా విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ పరిణామక్రమంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.  భారతీయుల విద్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం ఏ మేరకు బాధ్యత తీసుకుంది, ఎప్పుడెప్పుడు ఎలాంటి సంస్కరణలను అమలు చేసిందో తెలుసుకోవాలి. 


భారతదేశంలో బ్రిటిష్‌ పరిపాలన ప్రారంభానికి ముందు విద్య సంప్రదాయ విధానంలో ఉండేది. విద్యాకేంద్రాలుగా హిందువులకు గురుకులాలు, దేవాలయాలు వ్యవహరిస్తే, ముస్లింలకు పర్షియన్‌ మదర్సాలు ఉండేవి. ఈ విద్యాసంస్థలు, మదర్సాలు ఎక్కువగా రాజ కుటుంబీకులు/వారి ఉన్నత ఉద్యోగులు/సుల్తానులు, జమీందారులు, కులీన కుటుంబాల పోషణలో ఉండేవి. హిందూ విద్యాసంస్థల్లో పురాణ ఇతిహాసాలు, ప్రాచీన సాహిత్యం, ఖగోళం, గణితం, వైద్యం, తత్వం లాంటివి పాఠ్యాంశాలుగా ఉండేవి. మత/నైతిక విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చేవారు. బ్రాహ్మణులు ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు.


18వ శతాబ్దం చివరినాటికి ఈ సంప్రదాయ విద్యావిధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించడం ప్రారంభించడంతో  స్వదేశీ సంస్థానాలు బలహీనపడ్డాయి. వాటి ప్రభావం వారి ఉద్యోగ బృందం మీద కూడా పడింది. విద్యావ్యవస్థలకు పోషణ కరవైంది. బ్రిటన్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం తో ఇంగ్లండ్‌కు కేవలం ముడిసరకులు సరఫరా చేసే వలసప్రాంతంగా మన దేశం మారింది.తమ ఫ్యాక్టరీల్లో తయారుచేసిన వస్తువులకు మంచి విపణిగా ఈ దేశాన్ని బ్రిటిషర్లు  మార్చడంతో ఇక్కడి కుటీర పరిశ్రమలకు ఆదరణ కరవైంది. దీంతో దేశంలో వృత్తివిద్యలు కూడా దెబ్బతిన్నాయి. స్థూలంగా చెప్పాలంటే దేశీయ విద్యావ్యవస్థ విదేశీయుల పాలనలో క్షీణించింది.


బక్సర్‌ (1764) యుద్ధం తర్వాత బెంగాల్‌ రాజ్యాధికారం ఆంగ్లేయుల హస్తగతమైంది. కొంతమంది బ్రిటిష్‌ అధికారులు, యూరోపియన్, క్రైస్తవ మిషనరీల ప్రసక్తి తప్ప తొలిదశలో భారతదేశంలో విద్య కోసం చేసిన కృషి గురించి సరైన వివరాలు అందుబాటులో లేవు. వారెన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు (1772-85) 1781లో కలకత్తాలో ముస్లింల కోసం ఒక మదర్సా స్థాపించారు. 1782లో జోనాథన్‌ డంకన్‌ కలకత్తాలో ఒక సంస్కృత పాఠశాల నెలకొల్పారు. హేస్టింగ్స్, అతడి తోటి అధికారులు హాల్‌హెడ్, జోనాథన్‌ డంకన్‌ ప్రాచ్య విద్య పట్ల మక్కువ చూపారు. ఈ దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తెలుసుకోవడం కూడా అవసరమని భావించారు. ఆ ప్రయత్నంలో హాల్‌హెడ్‌ మనుస్మృతిని జెంటూలాస్‌ అనే పేరుతో అనువాదం చేశాడు. మరుగున పడిన భారతీయ సంస్కృతిని వెలికితీయడానికి అప్పటి కంపెనీ న్యాయాధికారి విలియం జోన్స్‌ 1784లో రాయల్‌ ఆసియాటిక్‌ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంను జోన్స్, మరొక కంపెనీ అధికారి చార్లెస్‌ విల్కిన్స్‌ భగవద్గీతను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. తర్వాత అనేక ప్రసిద్ధ ప్రాచీన సంస్కృత గ్రంథాలను కంపెనీ సేవలో భారతదేశానికి వచ్చిన పలువురు ఆంగ్లేయులు ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. లార్డ్‌ వెల్లస్లీ పరిపాలనా కాలంలో కలకత్తాలోని విలియమ్స్‌ కోటలో కంపెనీ అధికారులకు పరిపాలనలో తర్ఫీదు ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో భారతీయ సంస్కృతి, న్యాయం, భౌగోళిక శాస్త్రం, తత్వం కూడా బోధించేవారు. బ్రిటిషర్లు తమ పాలన కోసమే ఈ దేశ సంస్కృతిని అధ్యయనం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దాని వల్ల భారతదేశ సాంస్కృతిక వైభవం వెలుగులోకి వచ్చింది. ఈ దశలో బెంగాల్‌లోని కొన్ని యూరోపియన్‌ క్రైస్తవ మిషనరీలు కూడా మనదేశంలో విద్యాభివృద్ధికి తోడ్పడ్డాయి. విలియం క్యారీకి చెందిన బాప్టిస్ట్‌ మిషన్‌ బెంగాల్‌లో అనేక చోట్ల ప్రాథమిక పాఠశాలలను స్థాపించింది. పోర్చుగీసు వారు అచ్చు యంత్రాన్ని మనకు పరిచయం చేశారు. క్రైస్తవ మిషనరీలు బైబిల్‌ను ప్రాంతీయ భాషల్లోకి అచ్చువేయడం ద్వారా భారతదేశంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ వాడకం విస్తృతమైంది. రాజా రామ్మోహన్‌ రాయ్, రాధాకాంత్‌ దేవ్, డేవిడ్‌ హేర్‌ లాంటి వారి కృషి వల్ల కొన్ని విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. 1817లో రాజా రామ్మోహన్‌ సహాయంతో, డేవిడ్‌ హేర్‌ కలకత్తాలో ఆంగ్లో వేదిక్‌ స్కూల్‌ స్థాపించాడు. రామ్మోహన్‌ రాయ్‌ వేదాంత కళాశాలను ఏర్పాటు చేశాడు.


కంపెనీ పాలనలో స్పష్టమైన విద్యా విధానం 1813 చార్టర్‌ చట్టంతో ప్రారంభమైంది. ఈ చట్టం భారతదేశంలో విద్యాభివృద్ధికి రూ.లక్ష కేటాయించాలని సూచించింది. కానీ ఆ మొత్తం ప్రాచ్య విద్య కోసమా లేదా పాశ్చాత్య విద్యాభివృద్ధి కోసమా అనే వాదనలు తలెత్తాయి. దాంతో ఈ నిధిని చాలా కాలం ఉపయోగించలేదు. వాదనలు విలియం బెంటింక్‌ కాలం (1828-35) వరకు నడిచాయి. బెంటింక్‌ చొరవతో అతడి కార్యనిర్వాహకవర్గ న్యాయ సభ్యుడు లార్డ్‌ మెకాలే ఆ పీటముడిని విప్పాడు. అతడి సూచన మేరకు బెంటింక్‌ 1835లో భారతీయ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమంలో సాహిత్యం, లెక్కలు, సైన్స్, తర్కం, తత్వం లాంటి పాశ్చాత్య విషయాలను బోధించాలని నిర్ణయం తీసుకున్నారు. భారతీయుల విద్య గురించి బ్రిటిష్‌ ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం విద్యారంగంలో ఒక చారిత్రక సంఘటన.

లార్డ్‌ డల్హౌసీ పదవీ కాలంలో భారతదేశంలో విద్యాభివృద్ధికి తగిన సూచనలు చేయడానికి ప్రభుత్వం సర్‌ చార్లెస్‌ ఉడ్‌ను నియమించింది. ఆయన సూచనలను ‘ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854’ అంటారు.

అందులోని ముఖ్యాంశాలు:

* ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖ ఏర్పాటు

* ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం

* ప్రాంతీయ భాషల్లో బోధన

* విద్యను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, యూనివర్సిటీ విద్యాలయాలుగా విభజించడం; మద్రాసు, బొంబాయి, కలకత్తాలలో విశ్వవిద్యాలయాల స్థాపన

* ఉపాధ్యాయ శిక్షణ

* బాలికా విద్యకు ప్రోత్సాహం

* విద్యారంగంలో ఔత్సాహికులకు ప్రభుత్వ ప్రోత్సాహం లాంటి అంశాలతో ఉడ్స్‌ డిస్పాచ్‌ ఆధునిక విద్యావ్యవస్థకు పటిష్ఠమైన పునాది వేసింది.


ఉడ్స్‌ డిస్పాచ్‌ తర్వాత చెప్పుకోదగిన విద్యారంగ సంస్కరణలు లార్డ్‌ రిప్పన్‌ గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా ఉన్నప్పుడు జరిగాయి. ఉడ్స్‌ డిస్పాచ్‌ 1854 సూచించిన విధానాలు, వాటి అమలు తీరును పరిశీలించడానికి విలియం హంటర్‌ కమిషన్‌ (1882)ను లార్డ్‌ రిప్పన్‌ నియమించాడు. ఇది బ్రిటిష్‌ ఇండియాలో విద్యా విధానాన్ని సమీక్షించడానికి నియమించిన మొదటి కమిషన్‌.


హంటర్‌ నివేదిక ముఖ్యాంశాలు:  

* ప్రాథమిక, మాధ్యమిక విద్యను విస్తరించాలని, దాని నిర్వహణ బాధ్యత కొత్తగా ఏర్పడిన స్థానిక సంస్థలకు అప్పగించాలని సూచించింది.

* మతాలకు అతీతంగా లౌకిక బోధన జరగాలని పేర్కొంది. ప్రభుత్వేతర సంస్థలు విద్యాసంస్థలను స్థాపించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని, మాధ్యమిక విద్యతో పాటు వృత్తి విద్య నేర్పించాలని, స్త్రీ విద్యకు ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది.


రిప్పన్‌ తర్వాత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జన్‌ పదవీకాలంలో థామోస్‌ రాలి కమిషన్‌ (1902)ను నియమించాడు. దీనినే విశ్వవిద్యాలయాల కమిషన్‌ అంటారు. విశ్వవిద్యాలయాల పాలనా వ్యవహారాలను సమీక్షించడానికి దీన్ని నియమించారు. ఈ కమిషన్‌ సూచనల ప్రాతిపదికగా 1904 విశ్వవిద్యాలయాల చట్టం రూపొందింది. దాని ప్రకారం విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులను ప్రభుత్వమే నియమిస్తుంది. సెనెట్‌లో ఎన్నుకున్న సభ్యుల సంఖ్య తగ్గి, అధికార సభ్యుల సంఖ్య పెరిగింది. ఈ చట్టం కారణంగా విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ పెత్తనం పెరిగింది.


విద్యా సంస్కరణల్లో మరొక మైలురాయి హార్టోగ్‌ కమిటీ నియామకం. ఈ కమిటీని లార్డ్‌ ఇర్విన్‌ (1926-31) గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు నియమించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని సూచించింది. 1934లో నియమించిన సప్రూ కమిటీ వృత్తి విద్య ఆవశ్యకతను గుర్తించి ప్రాముఖ్యం ఇవ్వమని సూచించింది. 1944లో లార్డ్‌ వేవెల్‌ పదవీ కాలంలో సార్జెంట్‌ కమిటీని నియమించారు.

ఆధునిక భారతదేశంలో 20వ శతాబ్ద ప్రథమార్ధానికి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ విశ్వభారతితో సహా అలీగఢ్, ఉస్మానియా, ఆంధ్ర, ఢాకా, లఖ్‌నవూ, దిల్లీ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించారు. 1916లో ఆచార్య డి.కె.కార్వే పూనాలో స్త్రీలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. అనేక వృత్తిపరమైన అంటే వైద్య, న్యాయ వ్యవసాయ, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పాటై బ్రిటిష్‌ ఇండియా ప్రజల విద్యాభివృద్ధికి ఎంతో కృషిచేశాయి.


ఆధునిక విద్యనభ్యసించిన విద్యావంతులు బ్రిటిషర్ల పాలన నిజ స్వరూపాన్ని గుర్తించగలిగారు. ఈ దేశ ఆర్థిక వెనుకబాటుకు పరాయి పాలనే కారణమని, వారి వివక్షా పూరిత విధానాలు, నిరంతర ఆర్థిక దోపిడీని ఆకళింపు చేసుకున్నారు. సామ్రాజ్యవాద శక్తులను ఎదిరించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని భారతీయులకు ఈ ఆధునిక విద్యే అందించిందనడంలో ఎంత మాత్రం సందేహం అవసరం లేదు. 

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

 

Posted Date : 28-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మధుర శిల్పకళలో జ్ఞాన చక్రం!

మౌర్యానంతర యుగం

 

 

మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత భారత ఉపఖండంలో అనేక కొత్త శక్తులు ఆవిర్భవించాయి. విదేశీయుల దండయాత్రలు మొదలయ్యాయి. శకులు, కుషాణులు, గుప్తులు, శాతవాహనులు పాలకులుగా అవతరించి సామ్రాజ్యాలను స్థాపించారు.  మౌర్యుల క్షీణత నుంచి గుప్తుల పెరుగుదల వరకు ‘మౌర్యుల అనంతర యుగం’గా వ్యవహరించే కాలంలో చోటుచేసుకున్న రాజకీయ, సాంస్కృతిక మార్పులను అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో శుంగ, కణ్వ వంశాల పాలనాశైలి, వివిధ రంగాల్లోని నాటి ప్రముఖులు, వెలువడిన గ్రంథాలు, ఆదరణ పొందిన కళలు, వాటి ప్రత్యేకతల గురించి అవగాహన పెంచుకోవాలి.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

1.    కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.

ఎ) భరద్వాజ గోత్రానికి చెందిన పుష్యమిత్రశుంగ శుంగ వంశాన్ని స్థాపించాడు.

బి) శుంగ వంశంలో గొప్పవాడు అగ్నిమిత్ర.

సి) పుష్యమిత్రుడు అశ్వమేధ యాగం నిర్వహించాడు.

డి) పుష్యమిత్రుడు హిందూమత అభిమాని.

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, సి 

3) ఎ, సి, డి        4) ఎ, బి, డి 


2.     కిందివాటిని పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి.

ప్రకటన - A: పుష్యమిత్రుడి కుమారుడు అగ్నిమిత్రుడు, విదర్భ రాకుమారి మాళవికల ప్రేమ గురించి రాసినవారు కాళిదాసు.

ప్రకటన - B: శుంగ వంశంలో చివరివాడైన ‘భాగభద్ర’ను చంపి కణ్వ వంశాన్ని స్థాపించినవాడు వాసుదేవ కణ్వ.

1) ప్రకటనలు A, Bలు సరైనవి   

2) ప్రకటనలు A, Bలు సరికానివి 

3) ప్రకటన A సరైంది కాదు B సరైంది    

4) ప్రకటన A సరైంది, B సరైంది కాదు


3. నాలుగో బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడైన వసుమిత్రుడి వంశం?    

1) శుంగ  2) కణ్వ  3) కుషాణు  4) పార్థియన్లు


4. కిందివాటిలో సరైంది?

ఎ) శుంగవంశ రాజైన భాగవతుడి ఆస్థానంలోని ఇండో గ్రీకు రాయబారి హెలియోడోరస్‌.

బి) హెలియోడోరస్‌ భాగవత మతం స్వీకరించినట్లు తెలిపే శాసనం బేస్‌నగర్‌ శాసనం.

సి) హెలియోడోరస్‌ విదిశ సమీపంలోని విష్ణు దేవాలయం వద్ద గరుడధ్వజం నిర్మించాడు.

డి) బేస్‌నగర్‌ శాసనంలో ప్రస్తావించిన శుంగ వంశ రాజు భాగభద్రుడు.

1) ఎ, బి, సి, డి     2) ఎ, సి, డి  

3) ఎ, బి, డి      4) ఎ, డి 


5.     కణ్వ వంశానికి చెందిన నలుగురు రాజులు 45 ఏళ్లు పరిపాలించారు. వారిని వరుసక్రమంలో అమర్చండి.

ఎ) వాసుదేవ కణ్వ        బి) సుశర్మ     

సి) నారాయణ           డి) భూమిమిత్ర

1) ఎ, సి, బి, డి         2) డి, సి, బి, ఎ        

3) ఎ, బి, సి, డి          4) ఎ, డి, బి, సి 


6. కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) బాక్ట్రియా అంటే - హిందూకుష్‌ - ఆక్సస్‌ -  హీరట్‌ల మధ్య ఉన్న ప్రాంతం.

బి) భారతదేశంపై దాడి చేసి, ఆక్రమించిన బాక్ట్రియా రాజు డెమిట్రియస్‌.

సి) ఇండో-గ్రీకుల కాలంలో మొదటి చారిత్రక నాణేలను ముద్రించారు.

డి) డెమిట్రియస్‌ గ్రీకు ఖరోష్టి లిపి ఉన్న నాణేలను జారీ చేశాడు.

1) ఎ, బి, డి       2) ఎ, బి, సి  

3) ఎ, సి, డి       4) ఎ, బి, సి, డి


7. ఇండో - గ్రీకు రాజుల్లో అగ్రగణ్యుడు ఎవరు?

1) మీనాండర్‌           2) డెమిట్రియస్‌         

3) హెలియోడోరస్‌         4) అలెగ్జాండర్‌


8. కిందివాటిలో సరికానివి?

ఎ) ఇండో-గ్రీకు రాజు అయిన మీనాండర్‌ రాజధాని పెషావర్‌.

బి) మీనాండర్‌ విజయాల గురించి పేర్కొన్నవారు స్ట్రాబో, ప్లూటార్క్, జస్టిన్‌.

సి) మీనాండర్‌ ఆస్థానంలోని ప్రముఖ బౌద్ధ మత పండితుడు నాగసేనుడు.

డి) నాగసేనుడు, మీనాండర్‌ మధ్య జరిగిన చర్చల గురించి తెలిపే గ్రంథం మిళింద పన్హా.    

1) ఎ, డి     2) ఎ మాత్రమే   

3) డి మాత్రమే          4) ఎ, సి


9. ‘మిళింద పన్హా’ అనే గ్రంథం ఏ భాషలో ఉంది?

1) సంస్కృతం 2) పాళీ  3) హిందీ  4) బెంగాలీ


10. కిందివాటిలో సరైంది?

ప్రకటన-A: శకులకు మరొక పేరు - సింథియన్‌లు. వీరు తొకారియన్‌ అనే తెగకు చెందినవారు.

ప్రకటన-B: గ్రీకుల దాడులను ఎదుర్కోలేక బోలాన్‌ కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు.

1) ప్రకటనలు A, B లు సరికావు               2) ప్రకటన A సరైంది, B సరైంది కాదు

3) ప్రకటనలు A, B లు సరైనవి        4) ప్రకటన B సరైంది, A సరైంది కాదు


11. క్షహరాటుల్లో గొప్పవాడైన నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు?    

1) శ్రీముఖుడు       2) గౌతమీపుత్ర శాతకర్ణి  

3) రెండో శాతకర్ణి       4) హాలుడు


12. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) పార్ధియన్‌ రాజులను పహ్లవులు అని కూడా అంటారు.

బి) పార్ధియన్‌లలో గొప్పవాడు గోండోపెర్నెస్‌.

సి) గోండోపెర్నెస్‌ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన క్రైస్తవ సన్యాసి సెయింట్‌ థామస్‌.

డి) గోండోపెర్నెస్‌ శాసనం పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉంది.

1) ఎ, డి         2) ఎ, బి, డి    

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, సి


13. కుషాణుల వంశ స్థాపకుడు, రాజధానిని వరుసగా గుర్తించండి.    

1) కనిష్కుడు - పురుషపురం        2) పెషావర్‌ - వీమాకాడ్‌ కాడ్‌ఫిసెస్‌ 

3) కుజుల కాడ్‌ఫిసెస్‌ - పురుషపురం        4) కనిష్కుడు - పెషావర్‌


14. కిందివాటిలో వీమాకాడ్‌ ఫిసెస్‌ బిరుదులు?

1) సర్వలోకేశ్వర        2) మహేశ్వర   

3) కుమార       4) 1, 2 


15. కిందివాటిలో వీమాకాడ్‌ ఫిసెస్‌కు సంబంధించి సరైనవి?

ఎ) వీమాకాడ్‌ ఫిసెస్‌ శివుడిని ఆరాధించాడు.

బి) వీమాకాడ్‌ ఫిసెస్‌ జారీ చేసిన నాణేలపై శివుడి ప్రతిమ ఉంది.

సి) వీమాకాడ్‌ ఫిసెస్‌ నాణేలపై ప్రముఖంగా కనిపించే బొమ్మ నంది.

డి) వీమాకాడ్‌ ఫిసెస్‌ కుషాణు వంశంలో గొప్పవాడు.

1) ఎ, బి, సి, డి       2) బి, సి, డి   

3) ఎ, బి, డి       4) ఎ, బి, సి


16. కిందివాటిలో కనిష్కుడి బిరుదులు గుర్తించండి.

1) దేవపుత్ర       2) సీజర్‌   

3) రెండో అశోకుడు        4) పైవన్నీ


17. కిందివాటిలో అశ్వఘోషుడి రచనలు గుర్తించండి.

1) బుద్ధచరితం     2) సౌందర నందనం 

3) శారిపుత్ర ప్రకరణం     4) పైవన్నీ


18. కనిష్కుడి ఆస్థాన వైద్యుడు?

1) శంకు       2) చరకుడు     

3) ధన్వంతరి        4) పతాంజలి


19. ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బుద్ధిజం’గా ఏ గ్రంథాన్ని పిలుస్తారు?

1) బుద్ధచరితం        2) సుహృల్లేఖ    

3) వినయ పీఠిక        4) మహావిభాష శాస్త్రం


20. కిందివాటిలో నాలుగో బౌద్ధమత సమావేశానికి సంబంధించి సరైనవి?

ఎ) ఈ సమావేశం క్రీ.శ.1000లో జరిగింది.

బి) ఈ సమావేశం కశ్మీర్‌ వద్ద జరిగింది.

సి) ఈ సమావేశానికి ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు.

డి) ఈ సమావేశం నిర్వహించినవారు కనిష్కుడు.

1) ఎ, బి, సి, డి         2) ఎ, బి, సి   

3) బి, సి, డి       4) ఎ, సి, డి 


21. కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

ప్రతిపాదన A: గాంధార శైలిని ఇండో-గ్రీకు శైలి అని కూడా పిలుస్తారు.

కారణం R: గాంధార కళాశైలి గ్రీకు రోమన్‌ సంప్రదాయం వల్ల ప్రభావితమైంది.

1) A, R లు రెండూ సరైనవి,  Aకి R సరైన వివరణ కాదు 

2) A సరైంది, R సరైంది కాదు

3) A సరైంది కాదు,  R సరైంది

4) A, R లు సరైనవి, Aకి R సరైన వివరణ


22. కనిష్కుడు బౌద్ధమతం స్వీకరించడానికి ప్రధాన కారకుడు?

1) వసుమిత్రుడు     2) అశ్వఘోషుడు 

3) నాగార్జునచార్య     4) ఆనందుడు


23. గాంధార శిల్పకళను ఆదరించిన కుషాణు రాజు?

1) వీమా కాడ్‌ఫిసెస్‌        2) కుజుల కాడ్‌ఫిసెస్‌

3) కనిష్కుడు       4) పైవారందరూ 


24. గాంధార శిల్పకళ లక్షణాలను గుర్తించండి.

ఎ) ఉంగరాల జుట్టు       బి) వాస్తవికత

సి) సున్నితమైన పనితనం    డి) సరైన కొలతలు

1) ఎ, బి, సి, డి       2) ఎ, సి, డి

3) ఎ, బి, సి        4) ఎ, డి


25. గాంధార శిల్పకళ అభివృద్ధి చెందిన ప్రాంతం?

1) తక్షశిల, దాని పరిసర ప్రాంతాలు

2) పాటలీపుత్రం దాని పరిసర ప్రాంతాలు

3) సువర్ణగిరి దాని పరిసర ప్రాంతాలు

4) వైశాలి దాని పరిసర ప్రాంతాలు


26. మధుర శిల్పకళ లక్షణాన్ని గుర్తించండి.

ఎ) ఈ శిల్పకళ కౌసంభి, ప్రయాగ, మధురల వద్ద వ్యాప్తి చెందింది.

బి) ఇది పూర్తి స్వదేశీ శైలి.

సి) తల వెనుక భాగంలో జ్ఞాన చక్రం ఉంటుంది.

డి) అలంకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

1) ఎ, సి, డి      2) ఎ, బి, సి, డి    

3) సి, డి        4) బి, సి, డి 


27. అమరావతి శిల్పకళకు సంబంధించి సరైనవి?

ఎ) శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలానికి చెందింది.

బి) తెల్లని పాలరాయిని ఉపయోగించారు.

సి) అమరావతి, నాగార్జున కొండ, జగ్గయ్యపేట ప్రముఖ కేంద్రాలు.

డి) బౌద్ధం ప్రకృతి అంశం

1) ఎ, బి, సి, డి       2) బి, డి  

3) ఎ, బి, డి      4) ఎ, బి, సి


28. ఏ కుషాణు చక్రవర్తి పేదలకు భోజన సామగ్రిని పంచడానికి ఖర్చుల నిమిత్తం ఒక నిధిని ఏర్పాటు చేశాడు?

1) కనిష్కుడు      2) హువిష్కుడు

3) కుజుల కాడ్‌ఫిసెస్‌      4) వీమా కాడ్‌ఫిసెస్‌


29. ప్రాచీన భారతదేశంలో ఏ వంశ రాజు ‘దేవపుత్ర’ అనే బిరుదును పొందాడు?

1) మౌర్య       2) గుప్త 

3) హోయసాల        4) కుషాణు


30. కుషాణుల రాజధాని?

1) పాటలీపుత్రం     2) పురుషపురం 

3) శ్రీవస్తి      4) ఉజ్జయిని


31. కిందివాటిలో సరికానిది?

1) బృహత్కథ - గుణాఢ్యుడు    2) గాథాసప్తశతి - హాలుడు

3) హర్షచరిత్ర - హర్షవర్ధనుడు        4) రాజశేఖర చరిత్ర - మల్లన


32. భారతదేశంలో బంగారు నాణేలు ముద్రించి అమల్లోకి తెచ్చిన రాజులు?

1) మౌర్యులు        2) గుప్తులు     

3) ఇండో-గ్రీకులు          4) కుషాణులు


33. కనిష్కుడి ఆస్థాన వైద్యుడు?

1) నాగార్జునుడు  2) శుశ్రుతుడు       

3) చరకుడు   4) వాగ్భటుడు


34. కిందివాటిలో సరైంది?

ఎ) చోళుల రాజధాని - తంజావూర్‌; రాజచిహ్నం - పులి

బి) పాండ్యుల రాజధాని - మధురై; రాజచిహ్నం - చేప

సి) చేర రాజుల రాజధాని - వంజి; రాజచిహ్నం - ధనుస్సు

1) ఎ సరైంది, బి, సి సరైనవి కావు        2) ఎ, బి, సి సరైనవి

3) ఎ, బి సరైనవి సి సరికానిది         4) ఎ, బి, సి సరికానివి


35. నేచురల్‌ హిస్టరీ గ్రంథ రచయిత?

1) మెగస్తనీస్‌   2) మీనాండర్‌      3) ప్లీనీ       4) మార్కోపోలో


36. ‘లీలావతి పరిణయం’ అనే గ్రంథం రాసినవారు?

1) హాలుడు   2) శర్వవర్మ  3) కుతూహలుడు    4) సోమదేవుడు


37. సంగమయుగంలో ప్రధాన దేవుడు?

1) అగ్ని   2) వరుణుడు   3) ప్రకృతి    4) మురుగన్‌


38. ఖారవేలుడి వంశం?

1) శాక్య      2) ఛేధి      3) జ్ఞాత్రిక       4) కుషోణు


39. ఖారవేలుడి శాసనం ఏమిటి?

1) కళింగ       2) హాథిగుంఫా      3) నాసిక్‌       4) నానాఘాట్‌


40. బాక్ట్రియాను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు?

1) బాలీ 2) బాల్క్‌  3) శకులు  4) కాబూల్‌


41. కనిష్కుడు శకయుగాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? 

1) క్రీ.శ.76   2) క్రీ.శ.78     3) క్రీ.శ.87    4) క్రీ.శ.67 

 


సమాధానాలు

1-3; 2-4; 3-1; 4-1; 5-3, 6-4; 7-1; 8-2; 9-2; 10-3; 11-2; 12-3; 13-3; 14-4; 15-4, 16-4; 17-4; 18-2; 19-4; 20-3; 21-4; 22-2; 23-3; 24-1; 25-1; 26-2; 27-1; 28-2; 29-4; 30-2;31-3; 32-3, 33-3; 34-2; 35-3, 36-3; 37-4; 38-2; 39-2; 40-2; 41-2. 


రచయిత: గద్దె నరసింహారావు

 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 09-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అతడే అత్యంత వివాదాస్పద చక్రవర్తి!

ఢిల్లీ సుల్తానుల యుగం

 

మధ్యయుగంలో మూడు శతాబ్దాల పాటు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని కొందరు సుల్తానులు సువిశాల సామ్రాజ్యాన్ని  పాలించారు. వీరిలో అయిదు వంశాల పాలకులు ఉన్నారు.  వారంతా భారత ఉపఖండాన్ని ఏకం చేయడంలో విఫలమైనప్పటికీ, మంగోలుల దురాక్రమణలను అడ్డుకున్నారు. దేశంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. సాంస్కృతిక వికాసానికి కృషి చేశారు. ఆ పాలకుల వంశ క్రమం, ప్రత్యేకతలు, స్థానికంగా తీసుకొచ్చిన మార్పులు, నిర్మించిన పట్టణాలు, కట్టడాలు, వాటి విశేషాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. సుల్తానుల పాలనాపరమైన ప్రయోగాలు వికటించిన తీరు, పతనానికి దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవాలి.

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

1.    ‘ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన ఇస్లాం రాజవంశాలు వరుసగా-

ఎ) బానిస  బి) సయ్యద్‌   సి) ఖిల్జీ  డి) తుగ్లక్‌

1) ఎ, బి, సి, డి      2) ఎ, సి, డి, బి   

3) ఎ, బి, డి, సి        4) డి, బి, ఎ, సి


2. భారతదేశంలో బానిస వంశ స్థాపకులు?

1) కుతుబుద్దీన్‌ ఐబక్‌       2) బాల్బన్‌

3) ఇల్‌-టుట్‌-మిష్‌       4) రజియా సుల్తానా


3.     బానిస వంశంలో ఖలీఫా ద్వారా గుర్తింపు పొందిన చక్రవర్తి?

1) ఐబక్‌       2) బాల్బన్‌       

3) ఇల్‌-టుట్‌-మిష్‌       4) రజియా సుల్తానా


4. బానిస వంశ పాలనా కాలం?

1) క్రీ.శ.1206 - 1290      2) క్రీ.శ.1206 - 1285

3) క్రీ.శ.1192 - 1290       4) క్రీ.శ.1206 - 1526


5. ఖిల్జీ వంశ స్థాపకుడు?

1) అల్లావుద్దీన్‌ ఖిల్జీ       2) జలాలుద్దీన్‌ ఖిల్జీ 

3) ఫిరోజ్‌ షా ఖిల్జీ       4) మహ్మద్‌ ఖిల్జీ


6. తుగ్లక్‌ వంశ స్థాపకుడు?

1) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌      2) ప్రిన్స్‌ జునాఖాన్‌

3) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌      4) మహ్మద్‌ తుగ్లక్‌


7. సయ్యద్‌ వంశ స్థాపకుడు?

1) ఖిజిర్‌ ఖాన్‌         2) ఫిరోజ్‌ ఖాన్‌

3) మహ్మద్‌ ఖాన్‌       4) బహాలాల్‌ లోడీ


8. లోడీ వంశ స్థాపకుడు?

1) ఖిజిర్‌ ఖాన్‌       2) ఇబ్రహీం లోడీ  

3) మహ్మద్‌ ఖాన్‌      4) బహలూల్‌ ఖాన్‌ లోడీ


9. కుతుబుద్దీన్‌ ఐబక్‌ పరిపాలనా కాలం?

1) క్రీ.శ.1192 - 1206    2) క్రీ.శ.1206 - 1210   

3) క్రీ.శ.1191 - 1210      4) క్రీ.శ.1206 - 1226


10. ఐబక్‌పై తిరుగుబాటు చేసిన బెంగాల్‌ ప్రాంత పాలకుడు?    

1) అలీ మర్ధాన్‌       2) మహ్మద్‌ షేరాన్‌  

3) 1, 2       4) ఉద్దీన్‌ షా


11. ఐబక్‌పై తిరుగుబాటు చేసిన గజినీ రాజ్యాధినేత?

1) గజినీ మహ్మద్‌     2) షబుక్తజీన్‌  

3) అలప్తజీన్‌        4) తాజ్‌ - ఉద్దీన్‌ - యల్‌డజ్‌


12. 1210లో ఐబక్‌ ‘చౌగాన్‌’ ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి పడి మరణించిన ప్రాంతం?

1) లాహోర్‌  2) ఢిల్లీ  3) అజ్మీర్‌  4) యల్‌డజ్‌


13. లాఖ్‌ బక్ష్గా పేరొందిన ఢిల్లీ సుల్తాన్‌?

1) ఇల్‌-టుట్‌-మిష్‌       2) బాల్బన్‌

3) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌     4) కుతుబుద్దీన్‌ ఐబక్‌


14. కుతుబుద్దీన్‌ ఐబక్‌ నిర్మాణాలు?

1) కుతుబ్‌మినార్‌    2) ఢిల్లీలోని కువ్వత్‌ - ఉల్‌-ఇస్లాం

3) అజ్మీర్‌లోని అర్హదిన్‌ - కాండోప్పా మసీదు    4) పైవన్నీ


15. ఇల్‌-టుట్‌-మిష్‌ ఏ తెగకు చెందినవాడు?

1) ఖురేషి       2) ఇల్బారీ    

3) ఇస్లాం       4) మంగోలియా


16. అల్లావుద్దీన్‌ ఖిల్జీ సంస్కరణల్లో సరైనవి?

ఎ) గుర్రాలకు ముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు.

బి) ధరలు నియంత్రించి సైనికులకు నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చాడు.

సి) మార్కెటింగ్‌ సంస్కరణల పర్యవేక్షణ కోసం మాలిక్‌-యాకూబ్‌ అనే అధికారిని నియమించాడు.

డి) ఖిల్జీ ప్రారంభించిన ధరలు నియంత్రించే శాఖ దివాన్‌-ఇ-రియాఫత్‌

1) ఎ, బి, సి, డి       2) ఎ, బి, సి 

3) బి, డి            4) బి, సి, డి


17. అల్లావుద్దీన్‌ ఖిల్జీ సైనికులకు చెల్లించిన జీతం టంకాల్లో?

1) 234    2) 432   3) 324   4) 215


18. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మార్కెటింగ్‌ సంస్కరణలను మధ్యయుగ సమకాలీన చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా వర్ణించినవారు?

1) డి.ఎస్‌.డే       2) ఆర్‌.ఎస్‌.శర్మ

3) ఆర్‌.ఎస్‌.త్రిపాఠి      4) ఆర్‌.డి.బెనర్జీ


19. అల్లావుద్దీన్‌ ఖిల్జీ నిర్మాణాలు?

1) సిరికోట      2) అలయ్‌ దర్వాజా

3) కుతుబ్‌మినార్‌ గేట్‌ వే     4) పైవన్నీ


20. అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఆస్థానంలోని ఘాజా మాలిక్‌ ఏ ప్రాంతానికి వైస్రాయ్‌గా పనిచేశాడు?

1) దీపాల్‌పుర్‌     2) బెంగాల్‌   

3) ఢిల్లీ       4) తుగ్లకాబాద్‌


21. తుగ్లకాబాద్‌ అనే పట్టణాన్ని నిర్మించినవారు?

1) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌      2) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌

3) అల్లావుద్దీన్‌ తుగ్లక్‌      4) ఘియాజుద్దీన్‌ బరౌనీ


22. 1323లో వరంగల్‌పై దాడి చేసిన ఘియాజుద్దీన్‌ కుమారుడు?

1) ప్రిన్స్‌ జునాఖాన్‌       2) మాలిక్‌ కపూర్‌  

3) నస్రత్‌ ఖాన్‌       4) పైఅందరూ


23. వరంగల్‌కు ఢిల్లీ సుల్తానులు మార్చిన పేరు?

1) దౌలతాబాద్‌       2) సుల్తాన్‌పుర్‌   

3) ఓరుగల్లు       4) హనుమకొండ


24. ‘ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ను మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ హత్య చేసి సింహాసనం అధిష్ఠించాడు’ అని అన్న సమకాలీన చరిత్రకారుడు?

1) ఇసామీ 2) పెరిస్టా 3) బరౌనీ 4) అబుల్‌ ఫజల్‌


25. అత్యంత వివాదాస్పద చక్రవర్తిగా పేరుగాంచిన మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ఆస్థానంలో ఉన్న చరిత్రకారులు?

ఎ) బరౌనీ     బి) ఇసామీ 

సి) ఇబన్‌ బటూట     డి) పెరిస్టా

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, డి   

3) బి, డి        4) బి, సి, డి


26. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ఆలోచన విధానాన్ని, సంస్కరణలను ప్రశంసించిన సమకాలీన చరిత్రకారులు?

1) లేన్‌పూల్‌       2) హబీబుల్లా   

3) కె.ఎ.నైజామీ       4) పైఅందరూ


27. మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సంస్కరణల్లో ముఖ్యమైనవి?

ఎ) రాయచూర్‌ - అంతర్వేది, దోబ్‌ ప్రాంతాల్లో భూమి శిస్తు పెంచడం

బి) రాజధాని నగరం దిల్లీ నుంచి దేవగిరికి మార్చడం

సి) రాగి నాణేలు ముద్రించడం

డి) ప్రిన్స్‌ ఆఫ్‌ మనీయర్స్‌గా పేరుపొందడం

1) ఎ, సి, డి       2) ఎ, బి, డి   

3) ఎ, బి, సి, డి       4) సి, డి


28. కింది వాక్యాలను చదివి సమాధానం గుర్తించండి.

ఎ) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ వ్యవసాయదారులను ప్రోత్సహించడానికి దివాన్‌-ఇ-కోహీ అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు.

బి) 60 వేల చదరపు మైళ్ల బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చారు.

1) ఎ మాత్రమే సరైంది 2) ఎ, బి సరికావు

3) ఎ, బి సరైనవి     4) బి సరైంది, ఎ సరికాదు


29. మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ రాజధాని మార్పు చేసిన సంవత్సరం (ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కి)

1) 1327  2) 1328  3) 1332  4) 1330


30. 1351లో గుజరాత్‌లోని థట్టా వద్ద అనారోగ్యంతో మరణించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌    2) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ 

3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ        4) ఫిరోజ్‌ షా తుగ్లక్‌


31. షరియత్‌ ప్రకారం రాజ్యపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్‌-

1) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌      2) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌

3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ         4) ఫిరోజ్‌ షా తుగ్లక్‌


32. ఫిరోజ్‌ షా తుగ్లక్‌ అభివృద్ధి చేసిన నీటిపారుదల వసతులు-

1) యమునా నది నుంచి ఫిరోజాబాద్‌కు కాలువ

2) సట్లెజ్‌ నది నుంచి ఘాఘర్‌ వరకు కాలువ

3) మాండవ నది నుంచి హిస్సార్‌ వరకు కాలువ

4) పైవన్నీ


33. ఫిరోజ్‌ షా తుగ్లక్‌ పేదల సంక్షేమం కోసం స్థాపించిన శాఖ?

1) దివాన్‌-ఇ-ఖైరాత్‌     2) దార్‌-ఉల్‌-షిఫా

3) దివాన్‌-ఇ-కోహి     4) పైవన్నీ


34. కిందివాటిలో ఫిరోజ్‌ షా తుగ్లక్‌కు సంబంధించి సరైంది?

ఎ) దార్‌-ఉల్‌-షిఫా అనే వైద్యశాలను నిర్మించాడు.

బి) యాత్రికుల సౌకర్యార్థÄం 200 సరాయిలు నిర్మించాడు.

సి) బానిసల కోసం అనేక ఏర్పాట్లు చేశాడు.

డి) ఒరిస్సాపై దాడి చేసి జ్వాలాముఖి ఆలయాన్ని దోచుకున్నాడు.

1) ఎ, బి, సి, డి     2) ఎ, బి, సి   

3) బి, డి మాత్రమే     4) బి, సి మాత్రమే


35. ఫిరోజ్‌ షా తుగ్లక్‌ జారీ చేసిన వెండి, రాగి మిశ్రమ లోహాలు?

1) అధా    2) బిఖ్‌   3) 1, 2    4) ఫారా


36. చివరి తుగ్లక్‌ సుల్తాన్‌?

1) దౌలత్‌ ఖాన్‌     2) ఫిరోజ్‌ షా 

3) ఖిజిర్‌ ఖాన్‌     4) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌


37. సయ్యద్‌ వంశంలో చివరివాడు?

1) అల్లావుద్దీన్‌ ఆలమ్‌ షా     2) ఫిరోజ్‌ షా

3) ముబారక్‌ షా          4) ఫరీద్‌


38. లోడీ వంశంలో చివరివాడు?

1) బహులాల్‌     2) సికిందర్‌ 

3) ఇబ్రహీం లోడీ     4) ఫిరోజ్‌ షా


39. బాబర్‌ను భారతదేశంపై దాడి చేయమని ఆహ్వానించింది?

1) పంజాబ్‌ గవర్నర్‌ దౌలత్‌ ఖాన్‌  2) ఇబ్రహీం మామ ఆలంఖాన్‌

3) ఇబ్రహీం లోడీ     4) 1, 2


40. ఢిల్లీ సుల్తానుల పతనానికి కారణాల్లో సరైనవి?

ఎ) సైన్యంలో క్రమశిక్షణ లేకపోవడం

బి) తైమూర్‌ దండయాత్రలు

సి) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ విధానాలు

డి) అధిక పన్నుల భారం

1) ఎ, బి, సి, డి        2) సి, డి    

3) ఎ, సి, డి        4) బి, సి, డి


41. ఢిల్లీ సుల్తానులు రాష్ట్రాలను ఎలా విభజించారు?

1) ఇనాము  2) ఇక్తా  3) నాడు  4) నాయంకర


42. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాజ్య విభాగాలు వరుసగా గుర్తించండి.    

ఎ) రాజ్యం     బి) ఇక్తా       సి) షిక్‌     

డి) పరగణ     ఇ) గ్రామం

1) ఎ, బి, సి, డి, ఇ    2) బి, డి, సి, ఎ, ఇ

3) సి, డి, బి, ఎ, ఇ    4) ఇ, సి, ఎ, బి, డి


43. ఢిల్లీ సుల్తానుల కాలంలో పరగణాల స్థాయిలో ఉన్న ఉద్యోగులు-

1) అమీను             2) మున్సిఫ్, కనుంగో

3) కారూకన్, కోశాధికారి     4) పై అందరూ


44. ‘ఢిల్లీ సుల్తానుల కాలంలో నీరు పుష్కలంగా ఉండి, సారవంతమైన ప్రాంతాల్లో రైతులు ఏడాదికి మూడు పంటలు పండించారు.’ అని అన్న చరిత్రకారుడు ఎవరు?

1) అల్‌ బేరూనీ      2) అమీర్‌ ఖుస్రూ 

3) ఇబన్‌ బటూటా    4) ఇసామీ


45. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ముఖ్య వ్యాపార కేంద్రాలు-

1) ముల్తాన్, లాహోర్‌    2) దేవగిరి, ఢిల్లీ    

3) సింధ్‌       4) పైవన్నీ



సమాధానాలు

1-2; 2-1; 3-3; 4-1; 5-2; 6-3; 7-1; 8-4; 9-2; 10-1; 11-4; 12-1; 13-4; 14-4; 15-2; 16-1; 17-1; 18-1; 19-4; 20-1; 21-2; 22-1; 23-2; 24-1; 25-1; 26-4; 27-3; 28-3; 29-1; 30-2; 31-4; 32-4; 33-1; 34-1; 35-3; 36-1; 37-1; 38-3; 39-4; 40-1; 41-2; 42-1; 43-4; 44-3; 45-4.


రచయిత: గద్దె నరసింహారావు 
 

 

 

 

‘భూమండలంపై భగవంతుడి నీడ!’

మధ్యయుగంలో సుమారు నాలుగు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తానులు సంప్రదాయ షరియాను అనుసరిస్తూ, పరిపాలనలో ఎన్నో మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంతర్గత కలహాల మధ్యనే హిందూ రాజ్యాలపై నిరంతరం దాడులు, దోపిడీలు కొనసాగించారు. భారతావనిపై మంగోలుల దండయాత్రలను సమర్థంగా నిలువరించారు. వీరి పాలనలో చోటుచేసుకున్న పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రాజ్యాధికారం చేపట్టిన మొదటి మహిళగా, ముస్లిం పాలకురాలిగా చరిత్రలో నిలిచిపోయిన రజియా సుల్తానా, నిరంకుశుడిగా ముద్రపడిన బాల్బన్, మార్కెటింగ్‌ సంస్కరణలకు ఆద్యుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ, దేశంలో ముస్లిం పాలనకు పటిష్ఠ పునాదులేసిన ఇల్‌-టుట్‌-మిష్‌Ã తదితరుల గురించి వివరంగా తెలుసుకోవాలి.

 


 

1.    ‘భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారం నెలకొల్పింది ఇల్‌-టుట్‌-మిష్‌’ అని అన్నది?

1) ఈశ్వర ప్రసాద్‌         2) ఆర్‌.పి.త్రిపాఠి  

3) నీలకంఠ శాస్త్రి          4) ఆర్‌.డి.బెనర్జీ


2.    1217 నాటికి ఇల్‌-టుట్‌-మిష్‌ అధికారం విస్తరించిన ప్రాంతాలు?

1) ఢిల్లీ                                     2) ముల్తాన్, సింధ్‌

3) ఉచ్, గ్యాలియర్, మాళ్వా     4) పైవన్నీ


3. 1229లో భారతదేశపు తొలి ముస్లిం సుల్తాన్‌గా మిష్‌ను గుర్తించిన ఖలీఫా?

1) ఖలీఫా వాలిద్‌                       2) ఖలీఫా ఉమ్మయ్యద్‌    

3) ఖలీఫా-అల్‌-మస్తాన్‌-బిల్హ      4) ఖలీఫా మహమ్మద్‌


4.     ‘ఢిల్లీలో వాస్తవంగా ముస్లిం రాజ్యాధికారాన్ని స్థాపించింది ఇల్‌-టుట్‌-మిష్‌’ అని అన్నది?

1) ఆర్‌.ఎస్‌.శర్మ           2) ఆర్‌.పి.త్రిపాఠి  

3) ఈశ్వర ప్రసాద్‌         4) ఆర్‌.డి.బెనర్జీ


5.     మంగోల్‌ నాయకుడు చంఘీజ్‌ఖాన్‌ ప్రమాదాన్ని చాకచక్యంగా తప్పించుకున్న ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌        2) ఇల్‌టుట్‌మిష్‌  

3) ఐబక్‌            4) అల్లావుద్దీన్‌ 


6.     కుతుబ్‌ మినార్‌ నిర్మాణం ప్రారంభించిన, పూర్తిచేసినవారు వరుసగా?

1) బాల్బన్‌-ఇల్‌ టుట్‌ మిష్‌       2) ఐబక్‌-ఇల్‌ టుట్‌ మిష్‌

3) ఐబక్‌ - రజియా సుల్తానా       4) ఐబక్‌ - అల్లావుద్దీన్‌


7.     ‘చిహల్‌ గని’ అనే 40 మంది సర్దారుల ముఠా ఎవరి కాలంలో ఏర్పడింది?

1) కుతుబుద్దీన్‌             2) ఇల్‌టుట్‌మిష్‌  

3) రజియా సుల్తానా      4) బాల్బన్‌


8.     తాజుద్దీన్, మెన్హజ్‌- ఉస్‌ - సిరాజ్‌లు ఏ ఢిల్లీ సుల్తాన్‌ పోషణలో ఉన్నారు?

1) ఐబక్‌                       2) ఇల్‌టుట్‌మిష్‌  

3) రజియా సుల్తానా     4) బాల్బన్‌


9.     ఇల్‌టుట్‌మిష్‌ ముద్రించి వాడుకలోకి తెచ్చిన నాణేలు?

1) వెండి టంకా               2) రాగి జిటాల్‌ 

3) బంగారు శతమానం     4) 1, 2


10. ‘ఇల్‌టుట్‌మిష్‌ భారతదేశంలో బానిస వంశ అధికారాన్ని వాస్తవంగా నెలకొల్పిన సుల్తాన్‌’ అని అన్నది?

1) ఈశ్వరీ ప్రసాద్‌       2) ఆర్‌.ఎస్‌.శర్మ   

3) ఆర్‌.పి.త్రిపాఠి      4) ఆర్‌.డి.బెనర్జీ


11. భారతదేశ చరిత్రలో మొదటి మహిళా పాలకురాలు?

1) రుద్రమదేవి             2) మనుబాయి   

3) రజియా సుల్తానా      4) ఇందిరా గాంధీ


12. రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన సంవత్సరం?

1) 1236      2) 1326     3) 1623     4) 1240


13. రజియా సుల్తానా పరిపాలనను వ్యతిరేకించినవారు?

1) చిహాల్‌గనీలు       2) సర్దారులు   

3) సయ్యద్‌లు       4) ఖలీఫాలు


14. రజియా సుల్తానా అధికారం అంతం చేయడానికి ప్రయత్నించినవారు?

1) లాహోర్‌ రాష్ట్ర పాలకుడు మాలిక్‌-అల్లాఉద్దీన్‌-జైనీ

2) ముల్తాన్‌ రాష్ట్ర గవర్నర్‌ మాలిక్‌-ఇజాఉద్దీన్‌-క్రన్జన్‌

3) హాన్సీ రాష్ట్ర పాలకుడు మాలిక్‌-సఫీ-ఉద్దీన్‌          4) పైవారంతా.


15. రజియా సుల్తానా పారిపోయిన ప్రాంతం?

1) ఢిల్లీ    2) లాహోర్‌     3) భటిండా      4) ముల్తాన్‌


16. బాల్బన్‌ పరిపాలనా కాలం?

1) 1226 - 1287      2) 1266 - 1287  

3) 1266 - 1278      4) 1267 - 1287


17. బాల్బన్‌ మధ్య ఆసియాలోని ఏ తెగకు చెందినవాడు?    

1) మంగోల్‌     2) ఖురేషి     3) ఇల్బారీ    4) మొగల్‌


18. ‘చిహాల్‌గనీ ముఠా’లో కీలకపాత్ర పోషించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌            2) ఆలం షా  

3) బహరాం షా       4) పైవారంతా


19. 1260లో ఢిల్లీపై మంగోల్‌ దాడులను తిప్పికొట్టింది?    

1) బాల్బన్‌            2) ఆలం షా   

3) బహరాం షా       4) పైవారంతా


20. ఘియాజుద్దీన్‌ బాల్బన్‌కు సంబంధించిన సరైన వాక్యాలు?

ఎ) 1230లో సామాన్య నీరు మోసే కూలీగా జీవితం ప్రారంభించాడు.

బి) 1233 నాటికి మిష్‌ ప్రోత్సాహంతో ఖాస్‌దార్‌ పదవి పొంది రజియా కాలంలో అమీర్‌ - ఇ- షికార్‌ హోదా పొందాడు.

సి) బానిస వంశ రాజు అయిన నాసిరుద్దీన్‌ కుమార్తెను వివాహం చేసుకున్నాడు.

డి) నాసిరుద్దీన్‌ కాలంలో నాయబ్‌-ఇ-మమాలిక్‌ (ఉపప్రధాని)గా పనిచేశాడు.

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, సి  

3) బి, సి                  4) బి, సి, డి


21. చిహల్‌గని ముఠాతో ప్రముఖ నాయకుడిగా వ్యవహరించి తను రాజు అయిన తరువాత చిహల్‌గని వ్యవస్థను నిర్మూలించినవారు?

1) ఆమీర్‌ ఖాన్‌            2) నాసిరుద్దీన్‌ 

3) బాల్బన్‌                  4) షేర్‌ఖాన్‌


22. ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించిన బానిస రాజు?

1) ఇల్‌-టుట్‌-మిష్‌           2) బాల్బన్‌    

3) ఐబక్‌                           4) రజియా సుల్తానా


23. ‘నియాబత్‌-ఇ-ఖుదాయి (కింగ్‌ ఈజ్‌ ది వైస్‌ రిజెన్సీ ఆఫ్‌ గాడ్‌ ఆన్‌ ఎర్త్‌) ‘‘రాజు భూమండలంపై భగవంతుని నీడ’ అని అభిప్రాయపడినవారు?

1) ఇల్‌టుట్‌మిష్‌            2) బాల్బన్‌  

3) ఐబక్‌                          4) రజియా సుల్తానా 


24. బాల్బన్‌ తన కుమారుడు బుగ్రాఖాన్‌కు రాజరికానికి సంబంధించి ఏమని బోధించాడు?

1) రాజరికం దైవదత్తం            2) రాజరికం నిరంకుశత్వానికి ప్రతిబింబం  

3) రాజరికం ప్రజాదీవెన          4) రాజరికం అంటే రాజ్యంపై అధికారం


25. బాల్బన్‌ రాజదర్బారులో ఆచరణలో ఉంచిన పర్షియా సుల్తానుల విధానం?

1) జమిన్‌బోస్‌                2) పాయిబోస్‌  

3) 1, 2                            4) రాజును చూసిన వెంటనే ధనం ఇవ్వడం.


26. బహిరంగ ప్రదేశాల్లో నవ్వని ఢిల్లీ సుల్తాన్‌?

1) అల్లావుద్దీన్‌                2) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌    

3) బాల్బన్‌                      4) ఐబక్‌ 


27. చెలామణిలో ఉన్న నాణేలపై ఖలీఫా పేరు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌                   2) మహ్మద్‌ బీన్‌ ఖాసీమ్‌ 

3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ      4) ఐబక్‌


28. బానిస వంశంలో చివరి రాజు?

1) కైకుబాద్‌             2) మహ్మద్‌   

3) బాల్బన్‌              4) జలాలుద్దీన్‌


29. బాల్బన్‌ కాలంలో జలాలుద్దీన్‌ ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశాడు?

1) బెంగాల్‌     2) సమారా     3) అవద్‌    4) ఉజ్జయిని


30. జలాలుద్దీన్‌ ఖిల్జీ అధికారుల్లో ప్రముఖులు?

1) మాలిక్‌ ఫక్రుద్దీన్‌          2) ఖ్వాజా ఖతర్‌ 

3) గర్షాన్స్‌ మాలిక్‌             4) పైవారంతా


31. అల్లావుద్దీన్‌-ఖిల్జీ దేవగిరిపై దాడి చేసిన సంవత్సరం?

1) 1260       2) 1270       3)1280      4) 1290


32. మార్కెటింగ్‌ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌                     2) అల్లావుద్దీన్‌ ఖిల్జీ   

3) ఇల్‌-టుట్‌-మిష్‌         4) ఐబక్‌


33. 1297లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్‌పై దాడికి వీరిని పంపారు?

1) ఉల్గూఖాన్‌              2) నస్రత్‌ఖాన్‌   

3) 1, 2                       4) జాఫర్‌ మఖాన్‌


34. 1297లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్‌పై దాడి చేసే సమయంలో ఆ ప్రాంత పాలకుడు, వంశం వరుసగా?

1) కర్ణదేవుడు-వాఘేల             2) కర్ణదేవుడు-చహమాను

3) భీమదేవుడు-వాఘేల           4) భీమదేవుడు- చహమాను

 

35. అల్లావుద్దీన్‌ ఖిల్జీకి సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) 1298లో ఉల్గూఖాన్, నస్రత్‌ ఖాన్‌ నేతృత్వంలోని సైన్యం రణతంబోర్‌ ప్రాంతంపై దాడి చేసింది.

బి) ఈ యుద్ధంలో అల్లావుద్దీన్‌ విజయం సాధించాడు. ఉల్గూఖాన్, రాణాహం వీరుడు మరణించారు.

సి) 1303లో అల్లావుద్దీన్‌ మేవాడ్‌ రాజు రాణా రతన్‌ సింగ్‌పై దాడి చేశాడు.

డి) సుమారు 7 నెలల తర్వాత ఖిల్జీ చిత్తోడ్‌ను ఆక్రమించాడు.

1) ఎ, బి, సి, డి          2) బి, సి, డి    3) ఎ, బి         4) ఎ, బి, సి


36. అల్లావుద్దీన్‌ ఖిల్జీ చిత్తోడ్‌ అనే ప్రాంతానికి పెట్టిన పేరు?

1) ఖిజరాబాద్‌            2) పద్మపురం  

3) దౌలతాబాద్‌         4) ఖిల్జిపుర్‌


37. అల్లావుద్దీన్‌ ఖిల్జీకి సమకాలీనులు అయిన దక్షిణ భారతదేశ రాజులు కానివారు?

1) దేవగిరి - యాదవులు    2) ద్వార సముద్రం - హోయసాలులు

3) మధురై - పాండ్యులు        4) విజయనగరం - విజయనగర రాజులు


38. దక్షిణ భారతదేశ దండయాత్రలకు నేతృత్వం వహించిన అల్లావుద్దీన్‌ ప్రతినిధి?

    1) ఉల్గూఖాన్‌      2) నస్రత్‌ఖాన్‌ 

    3) మాలిక్‌ కపూర్‌     4) జాఫర్‌ మఖాన్‌


39. కిందివాటిలో ఖిల్జీకి సంబంధించి సరైనవి?

    ఎ) 1313లో దేవగిరి రాజ్యంపై దాడి చేసి రామచంద్ర దేవుని ఓడించాడు.

    బి) 1308లో రెండో ప్రతాపరుద్రుడు ఓడి ఖిల్జీకి కప్పం చెల్లించడానికి అంగీకరించారు.

    సి) హోయసాల రాజు అయిన మూడో వీర బల్లాలుడు ఓటమిపాలై ఖిల్జీకి కప్పం చెల్లించాడు.

    డి) పాండ్య రాజ్యంలో జరిగిన అంతర్యుద్దంలో  పాల్గొన్నారు.

    1) బి, డి                        2) బి, సి, డి   

    3) ఎ, బి, సి, డి             4) ఎ, బి, సి


40. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాజ్య సరిహద్దులను జత చేయండి.

   

1) ఉత్తరం ఎ) ముల్తాన్‌
2) దక్షిణం బి) ద్వార సముద్రం
 3) తూర్పు సి) సోనార్‌గర్‌ 
4) పశ్చిమం డి) థట్టా

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి    4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


41. అల్లావుద్దీన్‌ ఖిల్జీ పరిపాలనా సంస్కరణలకు సంబంధం లేనిది?

ఎ) సంపన్న సర్దారుల జాగీర్లను రద్దు చేశాడు

బి) హిందువులపై ఆంక్షలు తొలగించాడు

సి) మద్యం, మత్తు పదార్థాలు నిషేధించాడు

డి) సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు

1) బి, సి    2) సి    3) బి     4) బి, డి 



సమాధానాలు

12; 24; 33; 41; 52; 62; 72; 82; 94; 101; 113; 121; 131; 144; 153; 162; 173; 181; 191; 201; 213; 222; 232; 242; 253; 263; 271; 281; 292; 304; 314; 322; 333; 341; 351; 361; 374; 383; 393; 401; 413. 

 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...
 

Posted Date : 06-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సత్యాన్ని తెలుసుకోవడమే సరైన దృష్టి!

బౌద్ధమతం
 

ప్రాచీనకాలంలో భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తూర్పు ఆసియా అంతటా విస్తరించిన బౌద్ధమతం విశిష్టమైనది. బుద్ధుడు బోధించిన ధర్మసూత్రాలే బౌద్ధమతానికి మూలాధారం. మానవత్వం, యథార్థవాదాల కలయిక అయిన బౌద్ధం మానవులంతా సమానమేనని, చేసే పనుల్లో మంచి చెడుల ఆధారంగానే ఒకరి స్థానం నిర్ణయమవుతుందని చాటి చెప్పింది. బుద్ధుడి చరిత్రను, జననం నుంచి నిర్యాణం వరకు ముఖ్య సంఘటనలన్నింటినీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. మన దేశంలో బౌద్ధమత ఆనవాళ్లు, మత వ్యాప్తికి కృషి చేసిన వ్యక్తుల గురించి అవగాహన పెంచుకోవాలి.

 

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1. శుద్ధోదనుడి వంశం, అతడి రాజధానిని గుర్తించండి.

1) జ్ఞాత్రిక - కపిలవస్తు     2) శాక్య - కపిలవస్తు 

3) శాక్య - వైశాలి     4) జ్ఞాత్రిక - వైశాలి

 

2. గౌతమ బుద్ధుడు మొదటిసారిగా బోధన చేసిన ప్రాంతం?

1) సారనాథ్‌ - బుద్ధగయ  2) నేపాల్‌ - మృగదావనం

3) సాంచి - జింకలవనం 4) సారనాథ్‌ - మృగదావనం

 

3. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు.

బి) బుద్ధుడు క్రీ.పూ.483లో లుంబిని వనంలో జన్మించాడు.

సి) బుద్ధుడి తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి.

డి) మాయాదేవి కోలీయ వంశానికి చెందిన అంజనుడి కుమార్తె.

1) ఎ, బి, సి, డి       2) బి, సి, డి     

3) ఎ, సి, డి          4) ఎ, బి, డి 

 

4. ‘శుద్ధోదనుడు, మాయాదేవిలకు జన్మించిన బాలుడు (సిద్ధార్థుడు) గొప్పయోగి అవుతాడు’ అని చెప్పిన జోతిష్యుడు-

1) అసిత         2) ఉపగుప్తుడు 

3) నాగార్జునుడు     4) మహాకాత్సాయునుడు

 

5. బుద్ధుడు క్రీ.పూ. 483లో కుశీనగరంలో మరణించాడు. ఆయనకు అప్పుడు ఎన్నేళ్లు?

1) 60    2) 75     3) 85     4) 80 

 

6. కిందివాటిలో సరికానిది?

1) సిద్ధార్థుడు జన్మించిన ఏడు రోజులకు మాయాదేవి క్షయ వ్యాధితో మరణించింది.

2) సిద్ధార్థుడిని పెంచిన తల్లి గౌతమీ ప్రజాపతి.

3) సిద్ధార్థుడికి 29 ఏళ్ల వయసులో యశోధర అనే కన్యతో వివాహమైంది.

4) సిద్ధార్థుడు, యశోధరల కుమారుడు రాహులుడు.

 

 

7. కిందివాటిని పరిశీలించి సమాధానం గుర్తించండి.

ఎ) మహాభినిష్క్రమణం - 29 ఏళ్ల వయసులో బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లిపోవడం

బి) ధర్మచక్రపరివర్తనం - బుద్ధుడి మొదటి బోధన

1) ఎ, బి రెండూ సరైనవి     2) ఎ సరైంది, బి సరికాదు

3) ఎ సరికాదు, బి సరైంది 4) ఎ, బి రెండూ సరికానివి

 

8. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానం గుర్తించండి.

ఎ) అలారకరామ - సిద్ధార్థుడికి యోగ విద్యలు నేర్పాడు.

బి) ఉద్దకరామపుత్ర - సిద్ధార్థుడికి ప్రవచనాలు బోధించాడు.

1) ఎ సరైంది, బి సరికాదు    2) ఎ, బి లు సరైనవి

3) ఎ, బి లు సరికావు     4) ఎ సరికాదు, బి సరైంది

 

9. బుద్ధుడికి ఉన్న మరో పేరు-

1) అంగీరసుడు         2) తథాగతుడు    

3) శాక్యముని          4) పైవన్నీ

 

10. కిందివారిలో బౌద్ధమతంలో చేరిన ప్రముఖులు, వారి వృత్తులను జత చేయండి.

1) ఉపాలి ఎ) వేశ్య
2) ఆమ్రపాళి బి) వైశ్యుడు
3) అంగుళీమాల సి) నిమ్నకులం (మంగళి)
4) అనాథ పిండకుడు డి) గజదొంగ, హంతకుడు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ     4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

 

11. బుద్ధుడి బోధనలైన ఆర్య సత్యాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) ప్రపంచమంతా దుఃఖమయం    

బి) దుఃఖానికి కారణం కోరికలు

సి) కోరికలను జయించాలి 

డి) అష్టాంగ మార్గం అనుసరించాలి

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి, డి 

3) ఎ, సి          4) ఎ, బి, సి

 

12. బౌద్ధమతంలోని త్రిపీఠకాల్లో లేనిది-

1) వినయ పీఠిక        2) సుత్త పీఠిక

3) అభిదమ్మ పీఠిక      4) ధర్మ పీఠిక

 

13. కింది సంఘటనలు, చిహ్నాలను జతపరచండి.

1) సిద్ధార్థుడి పుట్టుక ఎ) కమలం 
2) బుద్ధుడి మొదటి బోధన బి) చక్రం
3) బుద్ధుడి జ్ఞానోదయం సి) బోధి వృక్షం
4) బుద్ధుడి మరణం డి) స్తూపం

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి 4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

 

14. కిందివాటిని జతచేయండి.

1) సరైన దృష్టి ఎ) సత్యాన్ని తెలుసుకోవడం
2) సరైన ఉద్దేశం బి) మనసును చెడు నుంచి విడిపించడం
3) సరైన ప్రసంగం సి) ఇతరులను బాధ పెట్టకపోవడం
4) సరైన క్రియ డి) ఇతరుల మంచి కోసం పనిచేయడం

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి       2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి   4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

 

15. కిందివాటిని జతచేయండి.

1) సరైన జీవితం ఎ) జీవితాన్ని గౌరవించడం
2) సరైన కృషి బి) చెడును ఎదిరించడం
3) సరైన ఏకాగ్రత సి) ధ్యాన సాధన
4) సరైన బుద్ధి డి) ఆలోచనలు నియంత్రించడం

1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి       2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి   4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

 

16. బౌద్ధమతానికి చెందిన త్రిరత్నాల్లో లేనిది?

1) బుద్ధుడు 2) జ్ఞానం 3) ధర్మం  4) సంఘం

 

17. బౌద్ధమతంలో బోధనలు ప్రధానంగా ఏ భాషలో ఉన్నాయి?    

1) పాళి  2) సంస్కృతం  3) మగది  4) అవధి

 

18. కిందివాటిని పరిశీలించి, సరైన సమాధానం గుర్తించండి.

ఎ) వినయ పీఠిక - ఉపాలి

బి) సుత్త పీఠిక - ఆనందుడు

సి) అభిదమ్మ పీఠిక - మొగలి పుత్తతిస్సా

1) ఎ, బి, సి        2) ఎ, బి    

3) ఎ మాత్రమే      4) ఏదీకాదు 

 

19. కిందివాటిలో సుత్త పీఠికలో భాగం కానిది-

1) మధ్యమ నికాయ     2) సంయుక్త నికాయ

3) అంగత్త నికాయ     4) కౌశిక నికాయ

 

20. కిందివాటిని జతపరచండి.

బౌద్ధ సమావేశాలు అధ్యక్షులు
1) ఒకటో సమావేశం ఎ) మహాకశ్యప
2) రెండో సమావేశం బి) వసుమిత్రుడు
3) మూడో సమావేశం సి) తిస్సా
4) నాలుగో సమావేశం డి) సబాకామి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి       2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి   4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి

 

21. కిందివాటిలో మహాయాన బౌద్ధమతానికి సంబంధించి సరైంది?

ఎ) మహాసాంఘిక మహాయానంగా మారింది.

బి) వీరు బుద్ధుడిని దేవుడిగా, అవతార పురుషుడిగా భావిస్తారు.

సి) మహాయాన సిద్ధాంతకర్త ఆచార్య నాగార్జునుడు.

డి) వీరు సంస్కృత భాష ద్వారా ప్రచారం చేశారు.

1) ఎ, బి, సి, డి       2) ఎ, సి, డి    

3) ఎ, బి, డి        4) ఎ, డి

 

22. కిందివాటిలో హీనయాన బౌద్ధానికి సంబంధించి సరైనవి?

ఎ) వీరు బుద్ధుడిని గురువుగా ఆరాధిస్తారు.

బి) వీరి బోధనలు ప్రాకృత భాషలో ఉన్నాయి. 

సి) సిద్ధార్థుడే బుద్ధుడి ఆఖరి జన్మ అని నమ్ముతారు.

డి) క్రతువులను నిరాకరిస్తారు.

1) ఎ, బి       2) ఎ, బి, సి, డి  

3) ఎ, సి, డి     4) ఎ, బి, డి 

 

23. కిందివాటిని జతచేయండి.

1) స్తూపం ఎ) అస్తికలపై నిర్మించిన స్తూపాలు
2) ధాతుగర్భిత స్తూపం బి) సన్యాసుల వస్తువులపై నిర్మించేవి
3) పారిభోజక స్తూపం సి) అర్ధచంద్రాకార నిర్మాణం
4) ఉద్దేశిక స్తూపం డి) ఎలాంటి వస్తువులు లేకుండా నిర్మించేవి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి       2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ   4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి

 

24. ప్రపంచంలో అతి పెద్ద స్తూపం?

1) సాంచి       2) సారనాథ్‌   

3) బోరోబుదుర్‌       4) అమరావతి

 

25. బుద్ధుడి జన్మవృత్తాంతం గురించి తెలిపే కథలు?

1) పురాణాలు       2) ధర్మసూత్రాలు   

3) జాతక కథలు       4) ఇతిహాసాలు

 

26. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానం గుర్తించండి.

ఎ) అమరావతి స్తూపాలను కనుక్కున్నది కల్నల్‌ మెకంజీ.

బి) అమరావతి స్తూప శిథిలాలు కొన్ని లండన్‌లో, మరికొన్ని మద్రాసులో ఉన్నాయి.

సి) అజంతా, ఎల్లోరా శిల్పాలకు ప్రేరణ బౌద్ధమతం.

డి) అమరావతి స్తూపంలో నలగిరి ఏనుగును బుద్ధుడు శాంతపరిచినట్లు ఉంది

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి, డి   

3) ఎ, సి, డి       4) ఎ, సి 

 

27. బౌద్ధమత ఆచరణకు సంబంధించి కిందివారిలో భిన్నమైనవారు?

1) అశోకుడు        2) బిందుసారుడు   

3) అజాత శత్రువు       4) కాలాశోకుడు

 

28. కిందివాటిలో ఆచార్య నాగార్జునుడికి సంబంధించి సరైనవి?

ఎ) విదర్భలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.

బి) ఇతడిని రెండో తథాగతుడు, ఇండియన్‌ ఐన్‌స్టీన్‌ అంటారు.

సి) మాధ్య‌మిక వాదం, శూన్యవాదం బోధించాడు.

డి) ఇతడి గ్రంథాల్లో ప్రముఖమైనవి సుహృలేఖ, రసరత్నాకర.

1) ఎ, డి          2) ఎ, సి, డి    

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, సి 

 

29. నాలుగో బౌద్ధ సమావేశం నిర్వహించినవాడు కనిష్కుడు. అయితే దీనికి ఉపాధ్యక్షులు ఎవరు?

1) నాగార్జునాచార్య        2) అశ్వఘోషుడు   

3) వసుమిత్రుడు       4) 1, 2

 


సమాధానాలు

1-2; 2-4; 3-3; 4-1; 5-4; 6-3; 7-1; 8-2; 9-4; 10-2; 11-2; 12-4; 13-1; 14-1; 15-2; 16-2; 17-1; 18-1; 19-4; 20-3; 21-1; 22-2; 23-2; 24-3; 25-3; 26-2; 27-2; 28-3; 29-4. 

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 24-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బానిసలు కనిపించని మహాజనపదం!

మగధ సామ్రాజ్యం

 

 

ప్రాచీన భారతదేశంలోని మహాజనపదాల్లో ప్రముఖ రాజ్యం మగధ. పాటలీపుత్రం రాజధానిగా మౌర్యులు, గుప్తుల పాలనలో శక్తిమంతమైన సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. వ్యవసాయం, వాణిజ్యం, సైనిక రంగాల్లో ప్రగతితో అత్యంత సంపన్న ప్రాంతంగా దేశ వైభవాన్ని నలుదిశల్లో చాటింది. బౌద్ధ, జైన మతాల వ్యాప్తికి కేంద్ర స్థానంగా నిలిచిన మగధ విశేషాలన్నీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా పరాక్రమంలో అజేయంగా, ప్రజాసంక్షేమంలో ఆదర్శంగా నిలిచిన మౌర్యుల గురించి పోటీ పరీక్షార్థులు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మౌర్య సామ్రాజ్యం ఆవిర్భావం, విస్తరణ తీరు, నాటి పాలనా విధానాలు, అశోకుడి ఔన్నత్యం, శాశ్వతంగా నిలిచిపోయిన అతడి కీర్తి తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.    కిందివాటిలో చంద్రగుప్త మౌర్యుడు నంద రాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా ఉన్న గ్రంథం?

1) కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’         2) విశాఖదత్తుడి ‘ముద్రారాక్షసం’

3) పతంజలి ‘మహాభాష్యం’   4) మాడలీన్‌ ‘స్లేడ్‌’


2.     మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించి సరైనవి?

ఎ) క్రీ.పూ.321లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

బి) ఈయన మొరియా తెగకు చెందినవాడు.

సి) జైన, బౌద్ధ మత గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియులు.

డి) పురాణాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడిది శూద్రవంశం.

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి, డి   

3) ఎ, బి, సి       4) ఎ, డి


3.     కింద ఇచ్చిన రచయితలు, గ్రంథాలను జతపరచండి.

1) ప్లీనీ ఎ) ఇండికా
2) ప్లూటార్క్‌ బి) ది లైన్స్‌  
3) టాలమీ సి) నేచురల్‌ హిస్టరీ
4) మెగస్తనీస్‌ డి) జాగ్రఫీ

1) 1-ఎ 2-బి, 3-సి, 4-డి      2) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి      4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి


4.     కిందివాటిలో అశోకుడి గురించి తెలుసుకోవడానికి ఆధారమైన స్వదేశీ గ్రంథాలు, వాటి రచయితలను జతపరచండి.

    రచయితలు       గ్రంథాలు
1) విశాఖదత్తుడు ఎ) రాజతరంగిణి
2) హేమచంద్ర బి) పరిశిష్ట పర్వన్‌
3) సోమదేవుడు సి) ముద్రారాక్షసం
4) కల్హణుడు డి) కథాకవితాసాగరం

1) 1-ఎ 2-బి, 3-సి, 4-డి    2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి

3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ    4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి


5.     కౌటిల్యుడి అర్థశాస్త్రానికి సంబంధించి సరైనవి ఏవి?

ఎ) కౌటిల్యుడిని చాణుక్యుడు, విష్ణుగుప్తుడు అని అంటారు.

బి) సంస్కృతంలో రాసిన అర్థశాస్త్రం 1905లో తంజావూర్‌ వద్ద దొరికింది. దీన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు ఆర్‌.శ్యామశాస్త్రి.

సి) అర్థశాస్త్రం అనే గ్రంథంలో 15 అధికరణలు, 180 ప్రకరణలు ఉన్నాయి.

డి) మౌర్యుల కాలంలోని ధర్మస్థేయ అనే పౌర న్యాయస్థానం; కంఠక శోధన అనే క్రిమినల్‌ న్యాయస్థానాల గురించి దీనిలో ఉంది.

1) ఎ, బి, సి        2) ఎ, బి, సి, డి

3) ఎ, బి, డి       4) ఎ, సి, డి


6. ఇండికా గ్రంథానికి సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి.    

ఎ) గ్రీకు దేశానికి చెందిన సెల్యూకస్‌ నికేటర్‌ రాయబారి అయిన మెగస్తనీస్‌ ఈ గ్రంథాన్ని రచించారు.

బి) ప్రస్తుతం ఈ గ్రంథం అందుబాటులో లేదు.

సి) ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడి సైనిక వ్యవస్థ గురించి ఉంది.

డి) మెగస్తనీస్‌ ప్రకారం మగధలో బానిస వ్యవస్థ లేదు.

1) ఎ, బి, సి, డి 2) ఎ, సి  3) ఎ, సి, డి 4) ఎ, బి, డి 


7. జునాగఢ్‌ శాసనం ఎవరు వేయించారు?

1) అశోకుడు       2) చంద్రగుప్త మౌర్యుడు   

3) రుద్రదమనుడు     4) బిందుసారుడు


8.     చంద్రగుప్త మౌర్యుడికి సెల్యూకస్‌ నికేటర్‌తో జరిగిన యుద్ధంతో సంబంధం లేనిది?

1) వీరి మధ్య క్రీ.పూ.305లో యుద్ధం జరిగింది.

2) వీరి మధ్య క్రీ.పూ.303లో సంధి జరిగింది.

3) సెల్యూకస్‌ నికేటర్‌ రాయబారిగా మెగస్తనీస్‌ పాటలీపుత్రంలో చాలాకాలం ఉన్నాడు.

4) చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్‌ నికేటర్‌కు 5000 ఏనుగులు ఇచ్చాడు.


9.     సంగమ సాహిత్యం అంటే?

1) చోళ సాహిత్యం       2) పాండ్య సాహిత్యం   

3) చేర సాహిత్యం      4) పైవన్నీ


10. బిందుసారుడి గురించి సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) బిందుసారుడిని ‘అమిత్రఘాత’ అంటారు.

బి) బిందుసారుడు అజీవక మతం ఆచరించాడు.

సి) ఈయనకు సిరియా రాజు ఒకటో యాంటి యోకస్‌తో సంబంధాలు ఉండేవి.

డి) సిరియా రాజు రాయబారి డైమోకస్‌ మౌర్యుల ఆస్థానంలో ఉండేవాడు.

1) ఎ, బి, డి      2) ఎ, బి, సి, డి

3) బి, సి       4) ఏదీకాదు


11. బిందుసారుడి కాలంలో అతడి ఆస్థానంలో ఉన్న సిరియా రాయబారి?

1) స్ట్రాబో 2) హెరిడోటస్‌     3) డైమోకస్‌    4) ప్లీనీ


12. బిందుసారుడి కాలంలో తక్షశిల వద్ద జరిగిన తిరుగుబాటును అణచివేయడానికి వెళ్లిన యువరాజు?

1) సుశిమా       2) మహేంద్ర   

3) అశోకుడు       4) బృహద్రదుడు


13. కిందివాటిలో అశోకుడికి సంబంధించి సరైనవి?

ఎ) అశోకుడి పేరును శాసనాల్లో దేవానాంప్రియ, ప్రియదర్శి అని పేర్కొన్నారు.

బి) ఈయన పేరుతో ఉన్న శాసనం కర్ణాటకలోని మస్కి వద్ద ఉంది.

సి) టిబెట్‌ చరిత్రకారుడు తారానాథ్‌ ప్రకారం అశోకుడు ఒక వైశ్య స్త్రీకి జన్మించాడు.

డి) అశోకుడు అంటే శోకించలేనివాడు అని అర్థం.

1) ఎ, డి       2) ఎ, బి, సి, డి    

3) బి, సి, డి       4) ఎ, బి, సి 


14. ‘చార్లెమేన్, కాన్‌స్టాంటన్‌ గురించి తెలిసిన వారి కంటే అశోకుడి గురించి తెలిసిన వారే ఎక్కువ’ అని ఎవరు అన్నారు?

1) ప్లీనీ        2) హెచ్‌.జి.వెల్స్‌  

3) టాలమీ      4) ప్లూటార్క్‌


15. కిందివాటిలో కళింగ యుద్ధానికి సంబంధించి సరైనవి గుర్తించండి.

ఎ) కళింగ అంటే నేటి ఒడిశా ప్రాంతం.

బి) 13వ శిలాశాసనం ఈ యుద్ధం గురించి తెలుపుతుంది.

సి) అశోకుడు రాజైన ఎనిమిదేళ్లకు ఈ యుద్ధం చేశాడు.

డి) కళింగ యుద్ధంలో మృతులు 1,00,000 మందికి పైగా కాగా, బంధీలైనవారు 1,50,000 మంది.

1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి 3) ఎ, సి 4) బి, డి 


16. అశోకుడి ధర్మ సూత్రాల్లో లేనిది?

ఎ) తల్లిదండ్రుల పట్ల విధేయత ఉండాలి.    బి) పెద్దలను గౌరవించాలి.

సి) ఇతర మతాలను దూషించరాదు.    డి) విగ్రహారాధన చేయవచ్చు.

1) సి, డి 2) సి మాత్రమే  3) డి మాత్రమే 4) ఎ, డి


17. ధర్మప్రచారం, శాసనాల్లోని అంశాలను చదివి వినిపించడానికి అశోకుడు ఎవరిని నియమించాడు?

1) అమాత్యులు           2) ధర్మాధ్యక్షులు

3) ధర్మమహామాత్రులు      4) పైవారందరూ


18. అశోకుడికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

ఎ) కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతం స్వీకరించాడు.

బి) ఈయన బౌద్ధమతాన్ని ఈజిప్ట్, శ్రీలంక, గ్రీసు, సిరియా దేశాల్లో వ్యాప్తి చేశాడు.

సి) అశోకుడి తరఫున బౌద్ధమత ప్రచారం చేసినవారు మహేంద్ర, సంఘమిత్ర.

డి) అశోకుడిని ప్రభావితం చేసిన బౌద్ధమత సన్యాసి ఆచార్య నాగార్జునుడు.

1) ఎ, బి       2) డి మాత్రమే   

3) బి, డి       4) ఎ మాత్రమే


19. మౌర్యుల తర్వాత మగధలో స్థాపించిన రాజవంశం, స్థాపకుడు? 

1) కాణ్వా - సుశర్మ       2) శుంగ - పుష్య మిత్ర 

3) పుష్యభూతి - హర్షవర్ధన     4) గుప్త - గుప్తుడు


20. అశోకుడి ఏ శాసనాలు సంగమ యుగం గురించి వివరిస్తాయి?

1) 2, 13  2) 2, 14     3) 1, 6      4) 7, 8


21. మగధ సామ్రాజ్య పరిపాలనకు సంబంధించి సరికానిది?

ఎ) మగధకు ప్రధాన రాజధాని పాటలీపుత్రం.

బి) పాటలీపుత్రం, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను చక్రవర్తి ప్రత్యక్షంగా పరిపాలించేవారు.

సి) మగధలో నాలుగు ప్రాదేశిక రాజధానులున్నాయి. అవి తక్షశిల, తోసలి, సువర్ణగిరి, ఉజ్జయిని.

డి) ప్రాదేశిక రాజధానులను పరిపాలించేవారు సామంతులు.

1) ఎ, బి, సి  2) డి   3) బి, డి   4) ఎ, డి 


22. మగధలో గ్రామాల వర్గీకరణను జతపరచండి.

1) సీత ఎ) సైనికులను పంపించే గ్రామాలు
2) ఆయుధేయ బి) రాజుకు, ప్రభుత్వానికి చెందిన భూములున్న గ్రామం
3) పరిహారిక సి) పన్ను మినహాయింపు ఇచ్చిన గ్రామాలు
4) కుప్య డి) ముడి పదార్థాలను సరఫరా చేసే గ్రామాలు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి

3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి      4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి


23. అశోకుడి ఏ శిలాశాసనం బోస్రో -ఫెడాన్‌ పద్ధతిలో రాసి ఉంది?

1) ఎర్రగుడి మైనర్‌ రాక్‌ ఈడిక్ట్‌     2) లంపక రాక్‌ ఈడిక్ట్‌ 

3) షాబజోగిరి రాక్‌ ఈడిక్ట్‌    4) మాన్‌షేరా రాక్‌ ఈడిక్ట్‌


24. మెగస్తనీస్‌ తన గ్రంథంలో తెలియజేసిన పెద్దరాచబాట ఏ ప్రాంతాలను కలుపుతుంది?

1) ఇండస్‌ - పాటలీపుత్రం            2) పాటలీపుత్రం - ప్రయాగ 

3) ప్రయాగ - ఉజ్జయిని 4) పాటలీపుత్రం - తక్షశిల 


25. అశోకుడి స్తంభ శాసనంలో అతిదీర్ఘమైనది?

1) 7వ    2) 6వ    3) 5వ    4) 4వ 


26. ఇండికా గ్రంథం ప్రకారం మగధ సామ్రాజ్యంలోని కులాలు ఎన్ని?

1) 4     2) 5     3) 6     4) 7


27. మౌర్యుల కాలంలో రాజు గుత్తాధిపత్యం కింద లేని అంశం?

1) గనులు, అడవులు           2) చేపల పరిశ్రమ

3) మద్యం, జలరవాణా     4) వధశాలలు, జూద గృహాలు


28. అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు?

1) శాసనాల ద్వారా      2) ప్రాకృతం ఉపయోగించడం ద్వారా

3) విదేశాలకు భిక్షువులను పంపడం ద్వారా     4) పైవన్నీ

 

29. కిందివాటిలో సరికానిది?

1) మౌర్యుల కాలం నాటి వెండి నాణెం పణం.

2) చంద్రగుప్త మౌర్యుడు చివరి రోజుల్లో శ్రావణబెళగొళ వద్ద ఉన్నాడు.

3) చక్రవర్తి క్షేత్రం అనే పదం ఉన్న గ్రంథం అర్థశాస్త్రం.

4) చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన ప్రముఖ గ్రీకు రాజు అలెగ్జాండర్‌.


30. మౌర్య సామ్రాజ్య పతనానికి కారణాలు?

ఎ) బలహీనులైన వారసులు             

బి) అశోకుడి అహింసా విధానం

సి) మౌర్య సామ్రాజ్యం పట్ల బ్రాహ్మణ వ్యతిరేకత   

డి) విదేశీ దండయాత్రలు

1) ఎ, బి, డి         2) ఎ, బి, సి     

3) ఎ, బి, సి, డి       4) ఎ, డి మాత్రమే


31. కిందివారిలో చంద్రగుప్త మౌర్యుడి మనుమడు?

1) బింబిసారుడు      2) బిందుసారుడు

3) అశోకుడు        4) కనిష్కుడు


32. ఒకనాటి మగధ సామ్రాజ్యం ఈ ప్రాంతాల మధ్యలో విస్తరించింది?

1) నేటి అఫ్గానిస్థాన్‌ నుంచి దక్షిణాన ఆంధ్ర, తూర్పున బెంగాల్‌ వరకు 

2) నేటి అఫ్గానిస్థాన్‌ నుంచి దక్షిణాన తమిళనాడు, తూర్పున ఒడిశా వరకు

3) నేటి అఫ్గానిస్థాన్‌ నుంచి దక్షిణాన కర్ణాటక, తూర్పున బెంగాల్‌ వరకు

4) నేటి అఫ్గానిస్థాన్‌ నుంచి దక్షిణాన కర్ణాటక, తూర్పున అస్సాం వరకు


33. పెద్ద పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అని అంటారు. వాటి రాజులను ఏమంటారు?

1) రాజులు    2) పెద్దరాజులు   

3) చక్రవర్తులు    4) సామంతులు


34. భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తుల్లో ఒకరు-

1) చంద్రగుప్తుడు    2) రెండో చంద్రగుప్తుడు    

3) చంద్రగుప్త మౌర్యుడు    4) కనిష్కుడు


35. కిందివాటిలో మగధ సామ్రాజ్యంలో భాగం కాని ప్రాంతం-

ఎ) హిందూకుష్‌ పర్వతాలు, థార్‌ ఎడారి 

బి) గుజరాత్, గంగా నదీ లోయలు

సి) మధ్య భారత్‌ అడవులు, కృష్ణా, తుంగభద్ర, గోదావరి లోయలు

డి) కావేరి నది తీరప్రాంతం

1) ఎ, డి            2) బి మాత్రమే 

3) డి మాత్రమే       4) సి, డి


36. మగధ సామ్రాజ్యంలో అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు

ఎ) గంగా, కష్ణా నదీ లోయలు       బి) మాళ్వా, గుజరాత్‌

సి) పంజాబ్‌      డి) హిందూకుష్‌ పర్వతాలు

1) ఎ, బి, సి, డి          2) బి, సి, డి      

3) ఎ, బి, సి      4) డి మాత్రమే


37. మగధ రాజధాని పాటలీపుత్రం, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను నియంత్రించేది ఎవరు?

1) చక్రవర్తి  2) రాజు 3) గవర్నర్‌ 4) యువరాజు


38. కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.  

ఎ) చక్రవర్తికి సమాచారం చేరవేసేవారు - వేగులు

బి) చక్రవర్తి నుంచి సమాచారం తెచ్చేవారు - దూతలు

సి) చక్రవర్తికి పరిపాలనలో సహాయపడేవారు - మంత్రులు, రాజకుటుంబీకులు

డి) ప్రాదేశిక రాజధానులను పరిపాలించేవారు - గవర్నర్‌లు

1) ఎ, బి, సి, డి     2) సి, డి

3) డి మాత్రమే     4) ఏదీకాదు


39.   మగధ సామ్రాజ్యంలో ప్రాదేశిక రాజధాని కానిది-

1) తక్షశిల     2) ఉజ్జయిని 

3) సువర్ణగిరి     4) చంప


40. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలోని కౌటిల్యుడి మరో పేరు- 

1) చాణక్యుడు          2) విష్ణుగుప్తుడు          

3) రాధ గుప్తుడు         4) 1, 2


41. ‘ఇండికా’ గ్రంథ రచయిత మెగస్తనీస్‌ ఏ దేశానికి చెందినవాడు?

1) ఆస్ట్రియా 2) పర్షియా 3) గ్రీకు 4) రోమన్‌


42.. కింది వాక్యాలు పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి.

ఎ) బంగారం అధికంగా దొరికే ప్రాంతం - తక్షశిల

బి) విదేశీ వస్తువులు ఎక్కువగా దొరికే ప్రాంతం - సువర్ణగిరి.

సి) వ్యాపారులు, సైన్యం ప్రయాణించడానికి రహదారి మార్గాలున్నాయి.

డి) రాజులు ఆటవిక తెగల జీవితాల్లో అంతగా జోక్యం చేసుకునేవారు కాదు.

1) ఏదీకాదు          2) ఎ, బి, డి 

3) ఎ, బి, సి, డి            4) ఎ, బి, సి


43. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని అంశాలు?

ఎ) రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి

బి) రాజు రాజ్యాన్ని కుట్రలు, కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి

సి) రాజు ప్రజల వద్ద నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి

డి) భారత ఉపఖండంలో లభించే వనరులు ఏమిటి

1) ఎ, బి, సి, డి      2) ఎ, బి, సి      

3) బి, సి           4) ఎ మాత్రమే


44. మౌర్య వంశ స్థాపకుడు ఎవరు? 

1) బిందుసారుడు     2) చంద్రగుప్త మౌర్యుడు 

3) రిపుంజయుడు     4) బింబిసారుడు  


45. అశోకుడు తన శాసనాలను ఏ భాషలో, ఏ లిపిలో వేయించాడు?

1) బ్రాహ్మీ-ప్రాకృత     2) ప్రాకృత-బ్రాహ్మీ

3) బ్రాహ్మీ-సంస్కృత     4) సంస్కృత-సంస్కృత


46. ప్రపంచ చరిత్రలో యుద్ధాల్లో విజయం తర్వాత వాటికి స్వస్తి పలికిన ఒకే ఒక రాజు?

1) బిందుసారుడు      2) అశోకుడు    

3) కనిష్కుడు      4) కాలాశోకుడు


47. అశోకుడు చక్రవర్తి అయ్యాక ఎన్నేళ్లకు కళింగ యుద్ధం చేశాడు?

1) 7      2) 8     3) 9     4) 6 


48. ‘దమ్మ’ ఏ భాషా పదం?

1) ప్రాకృత      2) సంస్కృత 

3) తమిళ     4) హిందీ


49. కిందివాటిలో సరికాని వాక్యం?

ఎ) అశోకుడి ధర్మ/దమ్మలో దేవతలకు జంతుబలులు అధికం.

బి) తండ్రి పిల్లలకు నేర్పినట్లు అశోకుడు ప్రజలకు బోధించాడు.

సి) బుద్ధుడి బోధనలకు ప్రభావితుడు అయ్యాడు.

డి) తన సందేశాలను రాతి స్తంభాలపై చెక్కించాడు.

1) బి మాత్రమే    2) ఎ మాత్రమే

3) ఎ, డి    4) ఎ, బి


50. కిందివాటిలో అశోకుడు బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయని దేశం?

1) పర్షియా      2) ఈజిప్టు  

3) సిలోన్‌      4) సిరియా
 

 


సమాధానాలు


1-2; 2-2; 3-2; 4-3; 5-2; 6-1; 7-3; 8-4; 9-4; 10-2; 11-3; 12-3; 13-2; 14-2; 15-1; 16-3; 17-3; 18-2; 19-2; 20-1; 21-2; 22-2; 23-1; 24-4; 25-1; 26-4; 27-4; 28-4. 29-4; 30-3; 31-3; 32-3; 33-3; 34-3; 35-3; 36-3; 37-1; 38-1; 39-4; 40-4; 41-3; 42-3; 43-1; 44-2; 45-2; 46-2; 47-2; 48-1; 49-1; 50-4;  


రచయిత: గద్దె నరసింహారావు 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

Posted Date : 27-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తొలి సమాజంలో ఆ కానుకలపై హక్కులు ఆడవారికే!

తొలి సమాజం - మతోద్యమాలు

 

భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే సనాతన సంస్కృతి వర్ధిల్లి హిందూ మతం విస్తరించింది. అనంతరం అభ్యుదయభావాలతో కూడిన బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించాయి. పురాతన ధర్మంలోని లోపాలను, వర్ణం, మత ఆధారిత వివక్షలను ప్రశ్నించాయి. ఈ పరిణామ క్రమాన్ని, సమాజంలో వచ్చిన మార్పులను అభ్యర్థులు తెలుసుకోవాలి. గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుల జీవిత విశేషాలు, వారి బోధనలు, మతవ్యాప్తి పద్ధతులు, సంబంధిత ప్రాంతాల గురించి సమగ్ర అవగాహన పెంచుకోవాలి.

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1. సత్యాన్వేషణకు స్థిరనివాసం లేకుండా ఒక గ్రామం నుంచి మరొక గ్రామం; ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉండేవారిని ఏమంటారు?

1) పరివ్రాజకులు        2) భిక్షువులు    

3) తిరిగేవాళ్లు       4) పైవారందరూ


2. కిందివారిలో పరివ్రాజకులు కానివారు?

1) మక్కలి గోసల        2) అజిత కేశకంబలి

3) కౌటిల్యుడు        4) గౌతమ బుద్ధుడు


3. ‘పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచన ఎలా’ .... అని అన్వేషణ చేసినవారు?

1) వర్ధమాన మహావీరుడు    2) అజిత కేశకంబలి

3) బుద్ధుడు             4) గోసల


4. ‘పాపాల నుంచి విముక్తిని పొందడానికి శరీరాన్ని కఠోర శ్రమకు గురిచేయాలి’ అని చెప్పినవారు-

1) వర్ధమాన మహావీరుడు     2) కంబలి     

3) బుద్ధుడు         4) గోసల


5. ‘ప్రపంచమంతా దుఃఖమయం.. దుఃఖాన్ని జయించడం ఎలా’ అని అన్నదెవరు?

1) వర్ధమాన మహావీరుడు   2) అజిత కేశకంబలి

3) గౌతమ బుద్ధుడు         4) మక్కలి గోసల


6. గౌతమ బుద్ధుడు ప్రబోధించిన మార్గం?

1) ప్రారంభ మార్గం        2) మధ్యేమార్గం

3) అంతిమ మార్గం        4) బోధనలు


7. బుద్ధుడి అనుచరులు అతడి బోధనలను ఏ పేరుతో సంకలనం చేశారు?

1) గ్రంథాలు       2) బోధనలు  

3) త్రిపీఠకాలు       4) పంచవ్రతాలు


8. క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఆర్యులు ఏ ప్రాంతమంతటా విస్తరించారు?

1) మధ్య భారతదేశం   2) ఉత్తర భారతదేశం

3) దక్షిణ భారతదేశం   4) నైరుతి భారతదేశం


9. క్రీ.పూ.6వ శతాబ్దంలో 60 మత శాఖలు ఉన్నాయని పేర్కొన్న చరిత్రకారులు?

1) ఆర్‌.డి.బెనర్జీ      2) సర్‌ జాన్‌ మార్షల్‌

3) నీలకంఠ శాస్త్రి      4) రోమిల్లా థాపర్‌


10. పురుష సూక్తంలో ప్రజాపతి దేహం నుంచి నాలుగు వర్ణాలు ఆవిర్భవించినట్లు ఉంది. వాటిలో తప్పుగా జత చేసింది? 

1) బ్రాహ్మణులు తల    2) క్షత్రియులు దేహం

3) వైశ్యులు పొట్ట 4) శూద్రులు పాదాలు


11. గోత్రం అనే పదం ఏ కులం నుంచి పుట్టింది?    

1) బ్రాహ్మణ  2) క్షత్రియ  3) వైశ్య  4) శూద్ర


12. గోత్రం అనే పదం ఏ జంతువుకు సంబంధించింది?

1) ఆవు   2) ఎద్దు   3) పులి   4) పాము


13. మనుస్మృతిలో ఎన్ని రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి?    

1) 7     2) 8      3) 6      4) 4


14. కిందివాటిలో తొలి సమాజ కాలానికి సంబంధించి తప్పుగా ఉన్న వాక్యం?

ఎ) రక్త సంబంధీకులను వివాహం చేసుకునే ఆచారం ఉండేది కాదు.

బి) కులం కుటుంబాలను, వంశం పుట్టుకను తెలియజేస్తుంది.

సి) పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉండేది.

డి) కన్యాదానం చేయడం ఆచారంగా ఉండేది.

1) బి మాత్రమే       2) ఎ మాత్రమే

3) బి, డి         4) ఎ, డి


15. బహు భార్యత్వం ఉండటాన్ని ఏమంటారు?

1) పాలిగమీ       2) పాలియాండ్రి

3) ఎండోగమీ       4) ఎక్సోగమీ


16. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) తొలి సమాజ కాలంలో పుట్టుకను బట్టి వర్ణం నిర్ణయమవుతుంది.

బి) తొలి సమాజ కాలంలో వర్ణ ధర్మాలను బట్టి సివిల్, క్రిమినల్‌ శిక్షల్లో హెచ్చుతగ్గులు ఉండేవి.

సి) శూద్రులు ద్విజులకు బానిసలుగా, కూలీలుగా ఉండేవారు.

డి) తొలి సమాజాల కాలంలో వర్ణ ధర్మాలను బట్టి గౌరవం, పదవులు ఉండేవి కావు

1) ఎ, బి, సి, డి      2) బి, సి, డి   

3) ఎ, బి, సి       4) ఎ, సి, డి


17. తొలి సమాజ కాలంలో వ్యవసాయదారులుగా పురోగమించిన వర్ణం? 

1) వైశ్యులు       2) శూద్రులు   

3) క్షత్రియులు       4) బ్రాహ్మణులు


18. తొలి సమాజ కాలంలో పురుషులు, స్త్రీలు ఎన్ని పద్ధతుల్లో ఆస్తిని కలిగి ఉండేవారు (వరుసగా)?

1) 6 - 7   2) 7 - 6   3) 8 - 7   4) 8 - 6


19. తొలి సమాజ కాలంలో వివాహ సందర్భంలో స్త్రీకి ఇచ్చే కానుకలపై ఎవరికి హక్కు ఉండేది?    

1) భర్తకు              2) స్త్రీకి మాత్రమే 

3) భార్యాభర్తలిద్దరికీ       4) స్త్రీ తల్లిదండ్రులకు


20. స్త్రీలు బయట సమూహం నుంచి వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు?

1) ఎండోగమీ       2) పాలియాండ్రి  

3) పాలిగమీ       4) ఎక్సోగమీ


21. బౌద్ధమత గ్రంథాల ప్రకారం క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఎన్ని మతాలుండేవి?

1) 60     2) 62     3) 63    4) 363


22. ‘ఏదీ మానవుడి చేతిలో లేదు జరగాల్సింది జరిగి తీరుతుంది’ అని చెప్పినవారు?

1) బుద్ధుడు         2) వర్ధమాన మహావీరుడు   

3) మక్కలి గోసల     4) ఆరుణి


23. పురాణ కశ్యపుడు ఏ వ్యక్తికి గురువు?

1) మక్కలి గోసల       2) వర్ధమానుడు   

3) బుద్ధుడు       4) ఉద్దాలక


24. కర్మ సిద్ధాంతాలను నమ్మని మతం?

1) హిందూ       2) ఇస్లాం   

3) అజీవక        4) బౌద్ధ, జైన


25. లోకాయుతులు లేదా చార్వాకుల మత శాఖ స్థాపకుడు?

1) బృహస్పతి       2) అజిత కేశకంబలి 

3) పకుద కాత్యాయన       4) గౌతముడు


26. ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించిన మతం-

1) బౌద్ధమతం       2) జైనమతం       

3) చార్వకమతం       4) హిందూమతం


27. లోకాయుత మత ప్రధాన ప్రచారకుడు

1) చార్వాకుడు       2) బృహస్పతి   

3) గోసల       4) అజితకేశ కంబలి


28. లోకాయుతులు చెప్పిన వాస్తవిక భౌతిక వాదం ఏ శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది?

1) భూగోళశాస్త్రం       2) గణితశాస్త్రం   

3) సామాన్య విజ్ఞానశాస్త్రం    4) పౌరశాస్త్రం


29. రుగ్వేద శ్లోకాల్లో ప్రస్తావించిన జైనమత తీర్థంకరులు?

1) వృషభనాథుడు, వర్ధమానుడు       2) వర్ధమానుడు, పార్శ్వనాథుడు

3) వృషభనాథుడు, అరిష్టనేమి   4) అరిష్టనేమి, వర్ధమానుడు


30. కిందివాటిని జతపరచండి.

1) ఒకటో తీర్థంకరుడు ఎ) వర్ధమాన మహావీరుడు
2) రెండో తీర్థంకరుడు బి) అరిష్టనేమి
3) 23వ తీర్థంకరుడు సి) వృషభనాథుడు
4) 24వ తీర్థంకరుడు డి) పార్శ్వనాథుడు
  ఇ) అజితనాథుడు

1) 1-సి, 2-ఇ, 3-డి, 4-ఎ     2) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ

3) 1-ఇ, 2-బి, 3-డి, 4-ఎ     4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ


31. కిందివాటిలో సరికానిది?

ఎ) వర్ధమాన మహావీరుడు క్రీ.పూ.450లో జన్మించాడు.

బి)  వర్ధమాన మహావీరుడు కుంద గ్రామంలో జన్మించాడు.

సి) వర్ధమాన మహావీరుడి తండ్రి సిద్ధార్థుడు.

డి) వర్ధమాన మహావీరుడి వంశం జ్ఞాత్రిక.

1) ఎ, సి      2) ఎ, డి   

3) ఎ మాత్రమే       4) సి మాత్రమే


32. మహావీరుడు ఇంటి నుంచి వెళ్లే సమయానికి అతడి వయసు ఎన్నేళ్లు?

1) 29     2) 40    3) 30    4) 39 


33. వర్ధమాన మహావీరుడు ఎన్నేళ్లు తపస్సు చేశాడు?

1) 29     2) 10    3) 12    4) 7


34. వర్ధమాన మహావీరుడు 42 ఏళ్ల వయసులో కైవల్యాన్ని పొందిన ప్రాంతం?

1) కుందగ్రామం - వేపవృక్షం     2) జృంభిక గ్రామం - సాలవృక్షం

3) కుశీనగరం - మర్రివృక్షం 4) పావపురి - రావివృక్షం


35. వర్ధమాన మహావీరుడి (జైనమతం) పంచ వ్రతాల్లో లేనిది?

1) అస్తేయా, అపరిగ్రహ     2) జీవహింస చేయరాదు 

3) అసత్యం ఆడరాదు     4) బ్రహ్మచర్యం పాటించరాదు


36. జైన మతానికి చెందిన త్రిరత్నాల్లో లేనిది?

1) సరైన క్రియ     2) సరైన నమ్మకం 

3) సరైన జ్ఞానం     4) సరైన శీలం


37. మహావీరుడు ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించాడు. దీన్ని ఏమంటారు?

1) మధ్యేమార్గం     2) సామ్యవాదం 

3) స్వాదవాదం     4) తపస్సు


38. మహావీరుడి శిష్యుల సంఖ్య?

1) 9     2) 10     3) 11     4) 12


39. మహావీరుడి శిష్యులను ‘గాంధారులు’ అని అంటారు. వారిలో ముఖ్యమైనవాడు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) సధాకర శాస్త్రి 

3) తులసీదాస్‌     4) ఆర్య సుధారామన్‌


40. వర్ధమాన మహావీరుడి తర్వాత జైన మతం కింది ఏ విధంగా విడిపోయింది?

1) తీర్థంకరులు - దిగంబరులు     2) శ్వేతంబరులు - గాంధారులు

3) శ్వేతంబరులు - దిగంబరులు     4) శ్వేతంబరులు - తీర్థంకరులు


41. ‘సృష్టిలో ఉన్న ప్రతివాటికి ఆత్మ ఉంటుంది’ అని బోధించిన మతం-    

1) బౌద్ధం  2) హిందూ  3) జైనం  4) అజవిక


42. జైనమత సమావేశాలు జరిగిన ప్రాంతాలు, వాటి అధ్యక్షులను పరిశీలించి సమాధానం ఎంపిక చేయండి.

ఎ) ఒకటో సమావేశం - పాటలీపుత్రం - స్థూల భద్ర

బి) రెండో సమావేశం - వల్లభి - దేవార్ధి క్షమాశ్రమణ

1) ఎ సరైంది, బి సరికాదు         2) బి సరైంది, ఎ సరికాదు

3) ఎ, బిలు రెండూ సరైనవి     4) ఎ, బిలు రెండూ సరికావు


43. జైనమత ప్రచారానికి సహాయం చేసిన మగధ రాజు?

1) చంద్రగుప్త మౌర్యుడు     2) ఆరో బిందుసారుడు

3) అజాత శత్రువు     4) మహాపద్మనందుడు


44. జైనమతాన్ని పోషించిన ప్రముఖ రాజవంశీయులు?

1) కళింగ, గాంగులు  2) కదంబులు, చాళుక్యులు 

3) రాష్ట్ర కూటులు    4) పైవారందరూ


45. జైనమతంలో చేరిన సామాజిక వర్గం?

1) వ్యవసాయదారులు     2) వ్యాపారులు 

3) దళితులు     4) క్షత్రియులు

 

46. జైనమతంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు?

ఎ) గిర్నార్‌ (రాజ్‌గిరి)             బి) మౌంటు అబు (మధుర) 

సి) చంద్రగిరి (భువనేశ్వర్‌)       డి) శ్రావణ బెళగొళ (కర్ణాటక)

1) ఎ, బి, సి, డి     2) డి మాత్రమే 

3) బి, డి మాత్రమే     4) సి మాత్రమే


47. ఏ భాష వల్ల ప్రాంతీయ భాషలు ఆవిర్భవించాయి?

1) సంస్కృతం     2) ప్రాకృతం 

3) ద్రావిడం     4) తెలుగు


48. ‘శూరసేన’ అనే భాష నుంచి ఉద్భవించిన భాష?

1) మరాఠి     2) మలయాళం 

3) తమిళం     4) గుజరాతీ


49. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) సిద్ధార్థ గౌతముడు - బౌద్ధ మత స్థాపకుడు

బి) బుద్ధుడి తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోదనుడు

సి) బుద్ధుడి భార్య యశోధర, కుమారుడు రాహులుడు

డి) బుద్ధుడు కపిలవస్తు రాజ్య వంశానికి చెందినవాడు

1) ఎ, బి, సి, డి    2) బి, సి, డి 

3) సి, డి     4) ఎ, బి, సి


50. బుద్ధుడికి సంబంధించిన కింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి.

ఎ) రోగిని చూడటం     బి) వృద్ధుడిని చూడటం 

సి) సన్యాసిని చూడటం    డి) మృతదేహం చూడటం

1) ఎ, బి, సి, డి       2) బి, సి, ఎ, డి       

3) బి, ఎ, సి, డి       4) బి, ఎ, డి, సి


51. బుద్ధుడు ఇంటి నుంచి వెళ్లే సమయానికి అతడికి ఎన్నేళ్లు?

1) 29     2) 30    3) 40    4) 19


52. బుద్ధుడు 35 ఏళ్ల వయసులో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. అతడు, ఎన్నేళ్లు తపస్సు చేశాడు?

1) 7      2) 9     3) 8    4) 6 1/2


53. బుద్ధుడి జనన మరణాల వరుస క్రమం-

1) క్రీ.పూ. 563 - క్రీ.పూ. 463        2) 563 సంవత్సరాల క్రితం - 463 సంవత్సరాల క్రితం

3) క్రీ.పూ. 563 - క్రీ.పూ. 483       4) క్రీ.శ. 483 - క్రీ.శ. 563


54. బుద్ధుడి జనన - మరణ ప్రాంతాలు వరుసగా    

1) కుశీ నగరం - లుంబినీ వనం  2) లుంబినీ వనం - కుశీ నగరం

3) లుంబినీ వనం - గయ    4) కుశీ నగరం - పావపురి


55. బుద్ధుడి జన్మ వృత్తాంతాలను గురించి తెలిపే కథలు?

1) పురాణాలు     2) అరణ్యకాలు 

3) జాతక కథలు     4) త్రిపీఠకాలు


56. కిందివాటిలో తప్పుగా జత చేసింది?

1) బుద్ధుడి జననం - తామర పుష్పంలో ఎద్దు

2) బుద్ధుడి మహాభినిష్క్రమణం - గుర్రం

3) బుద్ధుడి మహాపరినిర్వాణం - స్తూపం 

4) బుద్ధుడి మహాపరినిర్వాణం - చక్రం


57. కిందివాటిలో గౌతమ బుద్ధుడి బోధనలకు సంబంధించి సరైనవి?

ఎ) బుద్ధుడు వేదాలు, బ్రాహ్మణ ఆధిక్యతను ప్రశ్నించాడు.

బి) జంతు బలులను ప్రోత్సహించాడు.

సి) వర్ణ, వర్గ వ్యవస్థను వ్యతిరేకించాడు.

డి) భగవంతుడు ఉన్నాడా లేడా? అనే ప్రశ్న వ్యర్థమని బోధించాడు.

1) ఎ, బి, సి, డి     2) బి, సి, డి  

3) ఎ, సి, డి     4) ఎ, బి, సి


58. బుద్ధుడు బోధించిన ఆర్య సత్యాలు ఎన్ని?

1) 8     2) 6     3) 4     4) 12


59. దుఃఖాన్ని నిరోధించడానికి బుద్ధుడు బోధించిన మార్గం? 

1) ఆర్యసత్యాలు     2) అష్టాంగ మార్గం 

3) యోగ     4) బోధన మార్గం


60. కిందివాటిలో అష్టాంగ మార్గంలో లేనిది?

1) సరైన దృష్టి     2) సరైన వాక్కు 

3) సరైన ధ్యానం     4) సరైన జ్ఞానం


సమాధానాలు

1-4; 2-3; 3-1; 4-1; 5-3; 6-2; 7-3; 8-2, 9-4; 10-3; 11-1; 12-1; 13-2; 14-1; 15-2; 16-1; 17-2; 18-2, 19-2; 20-4; 21-2; 22-3; 23-1; 24-3; 25-1; 26-3; 27-1; 28-3, 29-1; 30-1; 31-3; 32-3; 33-3; 34-2; 35-4; 36-1; 37-3; 38-3, 39-4; 40-3; 41-3; 42-3; 43-1; 44-4; 45-2; 46-1; 47-2; 48-1, 49-1; 50-4; 51-1; 52-1; 53-3; 54-2; 55-3; 56-4; 57-3; 58-3, 59-2; 60-4.

 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 27-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఎగువ పెరుందారం.. దిగువ సిరుందారం!

చోళులు

 

 

మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసి సుదీర్ఘకాలం పాలించిన రాజవంశీయుల్లో చోళులకు ప్రముఖ స్థానం ఉంది. కావేరి నది పరీవాహక ప్రాంతాన్ని కేంద్రంగా ప్రారంభించి, రాజ్యాన్ని ఖండాంతరాలకు విస్తరించిన ఘనత వీరిది. దేశంలోని గొప్ప సామ్రాజ్యాలలో ఒకటిగా చోళనాడు వెలిగింది. ఈ పాలకులు ప్రాచీన కళలు, సంస్కృతిని పరిరక్షించి భావితరాలకు అందించారు. గ్రామ స్థాయి నుంచే వ్యవస్థీకృత పాలనను అందించడమే కాకుండా అద్భుతమైన   ఆలయాలను నిర్మించి చరిత్రకెక్కారు. చోళుల చరిత్ర, రాజ్యం పరిధి, పరిపాలనా విధానం,   పాలనా విభాగాలు, వారి విజయాలను తెలియజేసే శాసనాల గురించి పోటీపరీక్షలు రాసేవారు చదువుకోవాలి. నాటి సామాజిక పరిస్థితులు, సంస్కృతీ సాహిత్యాల వికాసంతో పాటు చోళుల్లో గొప్ప రాజులు, వీరికి పాండ్యులు, హోయసాలులతో ఉన్న వైరంపై అవగాహనతో ఉండాలి.

 


1.  ప్రాచీన చోళుల గురించి ఆధారాలు ఏవి?

1) అశోకుడి శాసనాలు    2) సంగమ సాహిత్యం 

3) 1, 2    4) గుప్తుల శాసనాలు


2.     9వ శతాబ్దంలో చోళ రాజ్య స్థాపకుడు ఎవరు?

1) రాజరాజ చోళ          2) రాజేంద్ర చోళ 

3) విజయాలయ చోళ       4) కులోత్తంగ చోళ


3.     ప్రవచనం (ఎ): మొదటి రాజరాజ చోళ రాజధాని తంజావూరు.

ప్రవచనం (బి): మొదటి రాజేంద్ర చోళ రాజధాని గంగైకొండ చోళపురం.

1) ప్రవచనాలు ఎ, బి లు సరైనవి.    2) ప్రవచనాలు ఎ, బి లు సరికానివి.

3) ప్రవచనం ఎ సరైంది, బి సరికాదు.     4) ప్రవచనం ఎ సరికాదు, బి సరైంది.


4.     ఆగ్నేయ ఆసియా దేశాలు, గంగానది లోయ వరకు రాజ్యం విస్తరించిన రాజు?

1) మొదటి రాజేంద్రచోళ   2) మొదటి రాజరాజచోళ 

3) విజయాలయ చోళ     4) కులోత్తంగ చోళ


5.     తంజావూరు వద్ద బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు?

1) మొదటి రాజరాజచోళ  2) మొదటి రాజేంద్ర చోళ

3) విజయాలయ చోళ      4) మొదటి పరాంతక


6.     కిందివాటిలో సరైంది?

ఎ) చోళుల కాలంనాటి మంత్రిమండలి - ఊడంకుట్టం

బి) చోళుల కాలంలో ప్రభుత్వంలో పెద్ద అధికారి - ఓలైనాయగన్‌

సి) చోళుల కాలంలో ఉన్నత అధికారులు - పెరుందారం

డి) చోళుల కాలంలో దిగువస్థాయి అధికారులు - సిరుందారం

1) ఎ, బి, సి, డి      2) ఎ, బి, సి   

3) బి, సి, డి       4) ఎ, సి, డి


7.     మండలం, వలనాడు, నాడు అనేవి ఏ రాజుల కాలంనాటి విభాగాలు?

1) పాండ్యులు       2) చోళులు    

3) చేర      4) కాకతీయ


8.     చోళుల కాలంనాటి పరిపాలన గురించి తెలిపే శాసనం?

1) తంజావూరు శాసనం           2) ఉత్తర మేరూర్‌ శాసనం

3) గంగైకొండ చోళపుర శాసనం     4) పైవన్నీ


9. చోళుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యుడు (కుదువోలై)కి ఉండాల్సిన అర్హతలు

ఎ) 35 - 70 ఏళ్ల మధ్యలో ఉండాలి    బి) సొంత భూమి ఉండాలి

సి) సొంత ఇల్లు ఉండాలి   డి) వేదాలు, ధర్మ శాస్త్రాలు తెలిసి ఉండాలి

1) ఎ, బి, సి       2) ఎ, బి, సి, డి  

3) బి, సి, డి       4) ఎ, సి, డి


10. చోళుల కాలం నాటి భూదానాలను జత చేయండి.

1) దేవదాన     ఎ) దేవాలయ నిర్వహణ భూమి    

2) శాలభోగ     బి) జైన మతస్థుల భూమి

3) వెల్లన్‌వాగై    సి) బ్రాహ్మణేతరుల భూమి

4) పల్లించ్చందం  డి) పాఠశాల నిర్వహణ భూమి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి        2) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి

3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి       4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి


11. చోళుల పరిపాలన విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.

ఎ) వలనారులు      బి) నాడులు   

సి) మండలాలు       డి) కుర్రాలు 

1) ఎ, బి, డి, సి       2) సి, డి, బి, ఎ   

3) ఎ, బి, సి, డి       4) డి, బి, ఎ, సి


12. కిందివాటిని జతచేయండి. 

1) ఉర్‌ ఎ) ఒక పట్టణ సభ
2) సభ బి) చెరువు భూమి
3) నగరం సి) సాధారణ గ్రామ, సాధారణ సభ 
4) ఎరివత్తి డి) బ్రాహ్మణుల సాధారణ సభ
  ఇ) పచ్చిక భూమి

1)  1-బి, 2-సి, 3-ఎ, 4-డి       2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ

3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి   4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి


13. చోళులు రాజకీయ వివాహ సంబంధాలను ఎవరితో కొనసాగించేవారు? 

1) మధురైకి చెందిన పాండ్యులతో    2) బాదామికి చెందిన చాళుక్యులతో

3) వేంగికి చెందిన చాళుక్యులతో  4) కల్యాణికి చెందిన చాళుక్యులతో


14. ఏ రెండు రాజ్యాలను కులోత్తంగుడు విలీనం చేశాడు?

1) చోళ - తూర్పు గంగుల రాజ్యాలు     2) పల్లవ - చోళ రాజ్యాలు

3) చోళ - తూర్పు చాళుక్య రాజ్యాలు    4) చోళ - పాండ్య రాజ్యాలు


15. కిందివాటిలో రాజేంద్ర చోళుడి బిరుదు?

1) గంగైకొండ       2) సింగలాంతక 

3) రాజాధిరాజ        4) పైవన్నీ


16. చోళుల ఆలయాల్లో కనిపించే ముఖ్య లక్షణం?

1) స్తంభాలు       2) విమానాలు   

3) గోపురాలు       4) విగ్రహాలు 


17. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. 

ఎ) చోళ రాజుల బిరుదులు ‘చక్రవర్తిగల్‌’.

బి) చోళుల మొదటి రాజధాని తంజావూరు, రెండోది గంగైకొండ చోళపురం.

1) ఎ, బి లు సరైనవి        2) ఎ, బి లు సరికావు

3) ఎ సరైంది, బి సరికాదు       4) ఎ సరికాదు, బి సరైంది


18. సింహళాన్ని జయించి 12 వేల మంది ఖైదీలను తీసుకొచ్చి వారితో కావేరి నది ఆనకట్ట నిర్మించినవారు?

1) మొదటి రాజేంద్ర చోళ   2) కరికాల చోళుడు   

3) మొదటి రాజరాజ చోళ       4) మొదటి పరాంతక చోళ 


19. పరాంతకుడికి సంబంధించి సరైనవి గుర్తించండి. 

ఎ) ఇతడు క్రీ.శ.907లో రాజ్యానికి వచ్చాడు.

బి) ఇతడు పాండ్యరాజు అయిన నాలుగో జయసింహుడిని ఓడించాడు. 

సి) పరాంతకుడి బిరుదు వీరచోళ.

డి) పరాంతకుడి సవతి సోదరుడు కన్నర దేవుడు. 

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, సి     

3) ఎ, బి, డి          4) ఎ, సి, డి 


20. సింహళంలోని ఉత్తర భాగాన్ని జయించి దానికి ‘ముమ్మడిచోళ మండలం’ అని నామకరణం చేసిన చోళ రాజు?

1) మొదటి రాజేంద్ర చోళ 2) మొదటి రాజరాజ చోళ

3) పరాంతకుడు       4) కరికాలుడు


21. రాజేంద్ర చోళుడు అనేక ప్రాంతాలపై దాడి చేసి విగ్రహాలు తెచ్చి తన ఆలయంలో ప్రతిష్ఠించాడు. విగ్రహాలు, అవి తెచ్చిన రాజ్యాలను జతచేయండి.

1) నిలబడిన సూర్యుడి విగ్రహం   ఎ) పశ్చిమ చాళుక్యులు

2) నంది, వినాయకుడి   బి) తూర్పు చాళుక్యులు విగ్రహాలు     

3) కాళీమాత విగ్రహం   సి)     బెంగాల్‌

4) భైరవుడి విగ్రహం    డి) ఒడిశా

1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ     2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి     4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి


22. ప్రకటన (A): రాజేంద్రచోళ కాలంలో చోళ - చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి.

కారణం (R): క్రీ.శ.1016, 1033, 1037లలో మొదటి రాజేంద్ర చోళుడు చైనాకు రాయబారులను పంపాడు.

1) ప్రకటన A కి కారణం R సరైంది.    2) ప్రకటన A కి కారణం R సరికాదు. 

3) ప్రకటన A  సరైంది, R సరికాదు.  4) ప్రకటన A సరికాదు, R సరైంది.


23. పాండ్యరాజు అయిన కులశేఖరుడు రాజు కావడానికి కారణమైనవాడు?

1) మొదటి రాజాధిరాజ    2) రెండో రాజాధిరాజ 

3) రాజేంద్ర చోళ           4) రాజరాజు


24. ప్రకటన (A): చోళ రాజ్యం ‘చోళ మండలం’ అనే పేరుతో పాండ్య రాజ్యంలో రక్షిత రాజ్యంగా మారిపోయింది.

కారణం (R): జటావర్మ సుందరాపాండ్యుడు చోళరాజ్యం ఆక్రమించడం.

1) ప్రకటన Aకి కారణం R సరికాదు.    2) ప్రకటన Aకి కారణం R సరైంది.

3) ప్రకటన A సరైంది, కారణం R సరికాదు.  4) ప్రకటన A సరికాదు, కారణం R సరైంది.


25. కిందివాటిలో సరికాని జత?

ఎ) అధిగరైగళ్‌ - రాజుకి సలహా ఇచ్చే సభ

బి) పెరుంఓరమ్‌ - తక్కువ తరగతికి చెందిన ఉద్యోగులు

సి) సిరున్‌తరమ్‌ - ఎక్కువ వర్గానికి చెందిన ఉద్యోగులు  డి) రాజగురు - పెద్ద పురోహితుడు

1) ఎ, బి   2) సి, డి   3) బి, సి    4) ఎ, డి


26. రాజ్యంలోని సైనిక స్థావరాలు, రాజ సైనికుల పేర్లకు సంబంధించి సరైంది.

1) కైక్కోలార్‌ - కడగమ్‌  2) కడగమ్‌ - కైక్కోలార్‌

3) కడగమ్‌ - కోల్కార్‌   4) నాయగమ్‌ - కైక్కోలార్‌


27. కిందివాటిలో సరైన సమాధానం గుర్తించండి.    

ఎ) వరిన్‌ పోట్టగమ్‌ - భూమిశిస్తు రికార్డులు (చోళుల కాలం)

బి) తిరుమందరబలై - రాజు నోటి నుంచి వెలువడిన ప్రతి ఆజ్ఞను లిఖిత రూపంలో రాసేవారు

1) ఎ సరైంది, బి సరికాదు 2) ఎ సరికాదు, బి సరైంది

3) ఎ, బి సరైనవి      4) ఎ, బి సరికానివి


28. చోళుల కాలంనాటి వెల్లాల కులస్థుల బిరుదులు?

1) మువ్వేంద వెలెన్‌     2) అరయ్యార్‌       

3) 1, 2           4) రాజాధిరాజ


29. చోళుల కాలం నాటి వరియమ్‌ అనే కమిటీల గురించి తెలిపే శాసనం?

1) తంజావూరు శాసనం 2) శ్రీనివాసనల్లారు శాసనం 

3) ఉత్తరమేరూర్‌ శాసనం 4) కావేరిపట్టణం శాసనం


30. కిందివాటిని జతపరచండి. (చోళుల దేవాలయాలు)

1) బాలసుబ్రమణ్య ఆలయం    ఎ) కుంభకోణం

2) నారీశ్వరస్వామి ఆలయం    బి) తొండయానాడు

3) ఆదిల్లేశ్వర ఆలయం        సి) కన్ననూర్‌

4) నుందలేశ్వర ఆలయం      డి) తిరుక్కట్టలై

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ      4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ


31. చోళుల కాలం నాటి దేవాలయాలు?

1) పూజా కేంద్రాలు          2) సామాజిక, సాంస్కృతిక కేంద్రాలు

3) ఆర్థిక కేంద్రాలు    4) పైవన్నీ



సమాధానాలు

1-3; 2-3; 3-1; 4-1; 5-1; 6-1; 7-2; 8-2; 9-2; 10-2; 11-4; 12-3; 13-4; 14-3; 15-1; 16-3; 17-1; 18-2; 19-1; 20-2; 21-2; 22-1; 23-2; 24-2; 25-3; 26-2; 27-3; 28-3; 29-2; 30-2; 31-4.

 


రచయిత: గద్దె నరసింహారావు 
 

Posted Date : 08-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తొమ్మిది పొరల నగరం.. మృతులదిబ్బ! 

ప్రాచీన నాగరికత, సంస్కృతులు

 

 

క్రీస్తు పూర్వమే భారతదేశంలో నాగరికత వర్ధిల్లింది. ప్రాచీన శిలాయుగం నుంచే ఇక్కడ మనుషుల సంచారం ఉంది. వేల సంవత్సరాలుగా వ్యవసాయం, పశుపోషణ, పరదేశీయులతో వాణిజ్యంతో పాటు ప్రకృతి ఆరాధన, కళలకు ప్రాధాన్యం కొనసాగుతోంది. ఆ పరిణామక్రమం, ఉపఖండంలో తొలి నాగరిక సమాజాలు విలసిల్లిన ప్రాంతాలు, నేటికీ ఉన్న ఆనాటి ఆనవాళ్ల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సింధూ నాగరికత వెలుగుచూసిన ప్రాంతాలు, అక్కడి ప్రజల జీవనవిధానం, నగర నిర్మాణాల తీరు, హరప్పా, మొహంజోదారో వంటి ప్రసిద్ధ ప్రాంతాల విశేషాలు, అక్కడి సంస్కృతులతో పాటు దేశవ్యాప్తంగా ప్రాచీన మానవుడి గుర్తులు ఉన్న ప్రదేశాల గురించి అవగాహన కలిగి ఉండాలి.


1.    ఎ) ప్రాచీన శిలాయుగం మానవుడి పనిముట్లు రాజస్థాన్, గుజరాత్, బిహార్, దక్షిణ భారతదేశంలో లభించాయి?

బి) నవీన శిలాయుగం మానవుడి పనిముట్లు భారతదేశమంతటా లభించాయి.

1) ఎ, బి లు సరైనవి కావు 2) ఎ, బి లు సరైనవి 

3) బి సరైంది కాదు ఎ సరైంది 4) బి సరైంది


2.     సూక్ష్మ రాతి పనిముట్లు లభించిన ‘గుడియం’ గుహలున్న రాష్ట్రం?

1) ఝార్ఖండ్‌     2) జమ్ము-కశ్మీర్‌ 

3) తమిళనాడు     4) మధ్యప్రదేశ్‌


3.     చనిపోయిన వారిని దహనం చేసే ఆచారం కలిగిన ప్రాంతం?

1) మక్రాన్‌ దక్షిణ ప్రాంతం     2) నాల్‌ ఉత్తర ప్రాంతం 

3) జోల్‌ పశ్చిమ ప్రాంతం   4) పైవన్నీ


4.     పరిమళ ద్రవ్యాలను కుర్ణీ సంస్కృతి ప్రజలు ఏ ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు?

1) మెసపటోమియా     2) పర్షియా 

3) ఈజిప్టు     4) రోమన్‌


5.     కిందివాటిలో సరికాని జత? 

ఎ) నెల్లూరు జిల్లా - పురాతన రాతి గొడ్డలి 

బి) జమ్ము-కశ్మీర్‌ - రాతితో చెక్కిన పరికరాలు

సి) ముచ్చట్ల చింతమాను గవి గుహ - రాతి పరికరాలు 

డి) చింతకుంట - ఆదిమానవుడు చిత్రించిన చిత్రాలు

1) ఎ, బి, డి   2) బి      3) సి   4) బి, సి


6.     కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లాలో చింతకుంట గ్రామం ఉంది.

బి) చింతకుంట గ్రామం వద్ద 200పైగా చిత్రాలున్నాయి.

సి) 200 పైగా చిత్రాల్లో పది ఎరుపు రంగులో ఉన్నాయి.

డి) ఈ ప్రాంతంలో జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల బొమ్మలు లేవు.

1) ఎ, బి, సి, డి  2) ఎ, బి, డి 3) బి, సి    4) ఎ, బి 


7.     నిశ్చితం (A): 12,000 ఏళ్ల కిందట ఆదిమానవుడు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. 

కారణం (R): 12,000 సంవత్సరాల కాలంలో వాతావరణంలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోయాయి.

1) A, R లు సరైనవి. A కు R సరైన వివరణ కాదు

2) A, R లు సరైనవి. A కు R సరైన వివరణ. 

3) A సరైంది కాదు, R సరైంది. 4) A సరైంది, R సరైంది కాదు


8.    కిందివాటిని జతపరచండి. 

1) మహారాష్ట్ర ఎ) నవస
2) మధ్యప్రదేశ్‌ బి) నంద్రా
3) ఆంధ్రప్రదేశ్‌ సి) బేతంచర్ల
4) తమిళనాడు డి) గుడియం
ఇ) రామ్‌గఢ్‌  

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    2) 1-బి, 2-సి, 3-ఇ, 4-ఎ

3) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-డి    4) 1-ఎ, 2-ఇ, 3-సి, 4-డి


9.     కిందివాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి.

ఎ) 9000 ఏళ్ల కిందట బెలూచిస్థాన్‌ వద్ద వ్యవసాయం చేశారు.

బి) 5000 ఏళ్ల కిందట దక్షిణ భారతదేశంలో జంతు పోషణ జరిగింది.

సి) 6000 ఏళ్ల కిందట కశ్మీర్‌ వద్ద వ్యవసాయం చేశారు.

డి) 5000/4000 ఏళ్ల కిందట బిహార్‌ వద్ద వ్యవసాయం చేశారు.

1) డి     2) సి     3) బి, సి    4) ఎ 


10. పాకిస్థాన్‌లోని పశ్చిమ పంజాబ్‌ ప్రాంతంలో హరప్పా నాగరికతను కనుక్కున్న సంవత్సరం?    

1) 1921  2) 1922  3) 1923  4) 1924 


11. కిందివాటిలో సింధూ నాగరికత సరిహద్దులకు సంబంధించి సరికానిది? 

ఎ) ఈ నాగరికత దక్షిణ సరిహద్దు - గుజరాత్‌లోని భగట్రావ్‌ 

బి) ఈ నాగరికత ఉత్తర సరిహద్దు - పంజాబ్‌లోని రూపర్‌ 

సి) ఈ నాగరికత పశ్చిమ సరిహద్దు - సుట్కాజందూర్‌ 

డి) ఈ నాగరికత తూర్పు సరిహద్దు - ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌

1) ఎ, బి     2) బి, డి        3) ఎ    4) డి 


12. ఇటీవల జరిపిన తవ్వకాల ఆధారంగా సింధూ నాగరికత ఏ ప్రాంతాలకు విస్తరించిందని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు? 

ఎ) మహారాష్ట్రలోని నవస, దైమాబాద్‌ బి) జమ్ము-కశ్మీర్‌లోని శ్రీనగర్‌ 

సి) జమ్ము-కశ్మీర్‌లోని మండ    డి) మహారాష్ట్రలోని దైమాబాద్‌

1) ఎ, బి, సి, డి 2) ఎ, సి    3) సి, డి  4) ఎ, సి, డి 


13. సింధూ నాగరికతలో ప్రధానమైన రెండు నగరాలు?

1) పంజాబ్‌లోని హరప్పా, హరియాణాలోని ఒనవాలీ 

2) గుజరాత్‌లోని లోథాల్, పంజాబ్‌లోని హరప్పా

3) సింధూలోని మొహంజోదారో, రాజస్థాన్‌లోని కాలీభంగన్‌ 

4) సింధూలోని మొహంజోదారో, పంజాబ్‌లోని హరప్పా


14. కిందివాటిలో సింధూ నాగరికతకు సంబంధించి సరైన వాక్యం?

1) ఈ నాగరికత 2400 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది.

2) ఈ నాగరికత  క్రీ.శ.4600 లో 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది.

3) ఈ నాగరికత 4600 ఏళ్ల కిందట 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది.

4) ఈ నాగరికత క్రీ.పూ.4600 లో 900 సంవత్సరాల పాటు వర్ధిల్లింది.


15. సిటాడెల్‌ (దుర్గం) లేని సింధూ నాగరికత నగరం?    

1) కాలీభంగన్‌     2) చన్హుదారో

3) మొహంజోదారో     4) హరప్పా


16. సింధూ నాగరికత లిపిని తొలిసారిగా, పూర్తిగా కనుక్కున్న సంవత్సరాలు వరుసగా?    

1) 1835, 1923     2) 1835, 1925 

3) 1858, 1923     4) 1853, 1923


17. సింధూ నాగరికత లిపికి సంబంధించిన కింది అభిప్రాయాల్లో సరైనవి?    

ఎ) ఇది ద్రవిడ లిపికి చెందింది.

బి) ఈ లిపి ప్రోటో ద్రవిడ లిపి.

సి) ఈ లిపి సుమేరియన్‌ లిపి అని కొందరి అభిప్రాయం. 

డి) ఇది సంస్కృత లిపి అని కొందరి అభిప్రాయం.

1) ఎ, బి  2) ఎ, డి 3) ఎ, బి, సి, డి  4) బి, సి


18. సింధూ నాగరికత లిపిని ప్రోటో ద్రవిడ భాష అని అన్నవారు?    

1) సర్‌ జాన్‌ మార్షల్‌     2) మధుసూదన్‌ మిశ్రా 

3) ఆచార్య మహాదేవన్‌     4) ఆర్‌.డి.బెనర్జీ


19. కిందివాటిలో సింధూ నాగరికత నగర నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాలు?

ఎ) నగర నిర్మాణ ప్రధాన వీధులు ఉత్తర - దక్షిణానికి ఉన్నాయి. 

బి) గ్రిడ్‌ పద్ధతిలో రహదారులు నిర్మించారు.

సి) లోతట్టు ప్రాంతాల్లో గుహలు, ఎత్తయిన వేదికలపై నిర్మాణాలు ఉన్నాయి.

డి) గృహాల ప్రధాన ద్వారాలు ప్రధాన రహదారికి కాకుండా ఉప వీధుల్లో ఉండేవి.

1) ఎ, బి, సి  2) ఎ, బి, సి, డి      3) బి, సి, డి    4) సి


20. సింధూ నాగరికతను కనుక్కున్న సర్‌ జాన్‌ మార్షల్‌ ఏ దేశానికి చెందినవారు?

1) బ్రిటన్‌   2) జర్మనీ  3) ఫ్రాన్స్‌  4) భారత్‌ 


21. హరప్పా నాగరికతలో వాడిన ఇటుకలు ఏ ఆకారంలో ఉండేవి?

1) L      2)  T       3)  S  4) పైవవ్నీ


22. హరప్పాను మొదటిసారిగా కనుక్కున్నవారు? 

1) ఆర్‌.డి.బెనర్జీ     2) దయారాం సహాని 

3) ఎమ్‌.జి.మజుందార్‌     4) నీలకంఠ శాస్త్రి


23. కిందివాటిలో ఏ నగరం 9 పొరలతో కూడి ఉంది, దీన్ని మృతుల దిబ్బ అని కూడా అంటారు?

1) కాలీభంగన్‌     2) హరప్పా 

3) బన్వాలీ     4) మొహంజోదారో 


24. ప్రత్యేక పర్వదినాల సమయంలో పతాకాలు కట్టి ఊరేగింపులు జరిపిన ప్రజలు?

1) ఆర్యులు     2) సింధూ ప్రజలు 

3) పర్షియన్లు    4) గ్రీకులు 


25. సింధూ ప్రజలు ఏ జాతికి చెందినవారు? 

1) మెడిటరేనియన్‌     2) మంగోలాయిడ్స్‌ 

3) ఆలోఫెన్, ప్రొటో-ఆస్ట్రలాయిడ్స్‌  4) పైవన్నీ 


26. సింధూ ప్రజల ప్రధాన వృత్తి?

1) వ్యవసాయం        2) పశుపోషణ 

3) వ్యవసాయం, పశుపోషణ     4) వ్యాపారం


27. సింధూ ప్రజలు వరి పండించిన ఆనవాళ్లు లభించిన ప్రాంతం? 

1) కాలీభంగన్‌     2) రంగపుర్‌ 

3) హరప్పా     4) రూపర్‌


28. సురోకోతోడా వద్ద లభించిన ఎముకలు గుర్రానివి కాదు, గాడిదవి అని అభిప్రాయపడినవారు? 

1) సర్‌ జాన్‌ మార్షల్‌     2) రొమిల్లా థాపర్‌ 

3) ఆర్‌.డి.బెనర్జీ    4) దయారాం సహాని  


29. కిందివాటి సరికాని జత?

ఎ) రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసిన ఖనిజం - రాగి  

బి) కర్ణాటక నుంచి దిగుమతి చేసిన ఖనిజం - బంగారం 

సి) అఫ్గానిస్థాన్‌ నుంచి దిగుమతి చేసిన ఖనిజం - వెండి 

డి) హరప్పా ప్రజలు మారకం కోసం తయారుచేసిన నాణేలకు వాడిన ఖనిజం - బంగారం 

1) బి, డి    2) ఎ    3) డి     4) పైవన్నీ 


30. సింధూ ప్రజలు ఎవరితో వ్యాపారం నిర్వహించారు?

1) ఇరాన్‌ - గ్రీకు - అఫ్గానిస్థాన్‌ 2) ఇరాన్‌ - ఈజిప్టు - మెసపటోమియా 

3) ఇరాన్‌ - అఫ్గానిస్థాన్‌ - మెసపటోమియా 4) ఈజిప్టు - ఇరాన్‌


31. మెసపటోమియా గ్రంథంలో పేర్కొన్న వ్యాపార కేంద్రాలు?    

1) దిల్‌మన్‌   2) మకన్‌  3) టెగ్రిస్‌  4) 1, 2


32. సింధూ నాగరికతలో ప్రధాన దేవతలు?

1) పశుపతి  2) అమ్మతల్లి 3) 1, 2 4) ఇంద్రుడు 


33. సింధూ నాగరికతలో గడ్డం ఉన్న పూజారి విగ్రహం లభించిన ప్రాంతం?

1) హరప్పా      2) మొహంజోదారో  

3) లోథాల్‌     4) కాలీభంగన్‌ 


34. సింధూ నాగరికతలో నగ్నంగా నాట్యభంగిమలో ఉన్న విగ్రహాన్ని ఏ లోహంతో తయారుచేశారు?

1) రాగి   2) బంగారం   3) కంచు  4) వెండి 


35. సింధూ నాగరికతలో ఏ ప్రాంతంలో పూసల తయారీ జరిగింది?

1) చన్హుదారో - కాలీభంగన్‌     2) అలంఘీపుర్‌ - లోథాల్‌ 

3) చన్హుదారో - లోథాల్‌     4) హరప్పా - లోథాల్‌ 


36. సింధూ నాగరికత ప్రజలు ప్రధానంగా పూజించిన చెట్లు?

1) రావి   2) వేప   3) మర్రి   4) పైవన్నీ


37. హరప్పా నాగరికత ఏ శాస్త్ర అభివృద్ధికి దోహదపడింది? 

1) ఖగోళ శాస్త్రం     2) వైద్య శాస్త్రం 

3) గణిత శాస్త్రం     4) జీవశాస్త్రం


 

సమాధానాలు

1-2; 2-3; 3-1; 4-1; 5-3; 6-4; 7-4; 8-1; 9-2; 10-1; 11-4; 12-3; 13-4; 14-3; 15-2; 16-4; 17-3; 18-3; 19-2; 20-1; 21-1; 22-2; 23-4; 24-2; 25-4; 26-1; 27-1; 28-2; 29-3; 30-3; 31-4; 32-3; 33-2; 34-3; 35-3; 36-4; 37-3.

 

 

రచయిత: గద్దె నరసింహారావు 

Posted Date : 16-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రాచీన నాగరికత,  సంస్కృతులు

అరణ్యకాలు.. బ్రాహ్మణాలకు అనుబంధాలు!

 ప్రాచీన నాగరికత, సంస్కృతులకు భారతదేశం పుట్టిల్లు. మనిషి ఆవిర్భావం అనంతరం ప్రారంభ నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికత ఇక్కడ వర్ధిల్లింది. ఆ తర్వాత ఆర్యుల వలసలతో వైదిక సమాజం, సంస్కృతి విస్తరించాయి. ఈ క్రమంలోనే జాతి, రాజ్యం, శాసనాలు, నియమాలు రూపుదిద్దుకున్నాయి. దేవతా పూజలు, కుల వ్యవస్థ, పితృస్వామిక సమాజం లాంటి కట్టుబాట్లు, అలవాట్లు స్థిరపడ్డాయి. హరప్పా నాగరికత మొదలు తొలి వేద, మలి వేద కాలాల్లో సమాజ గమనం, జీవనశైలి, మనుషుల నడవడిక, కాలానుగుణంగా జరిగిన మార్పులను పరీక్షార్థులు తెలుసుకోవాలి. నాటి పరిస్థితులపై, వేదాలు, ఉపనిషత్తుల్లోని ముఖ్యాంశాలపై అవగాహన పెంచుకోవాలి.



1.   నిశ్చితం (ఎ): ప్రాచీన కాలం ప్రజలు అవసరమైతే తప్ప జంతు వేట చేసేవారు కాదు.

కారణం (ఆర్‌): ఈ కాలం నాటి ప్రజలు జంతువులను పవిత్రంగా పూజించేవారు.

1) ఎ కి ఆర్‌ సరైన వివరణ కాదు.     

2) ఎ, ఆర్‌ లు విరుద్ధ వాక్యాలు.

3) ఎ కి ఆర్‌ సరైన వివరణ.          

4) ఎ సరికాదు, ఆర్‌ సరైంది.

 

 

2.  కిందివాటిలో భింబెట్కా వద్ద ఉన్న వర్ణచిత్రం-

1) అడవి దున్న    2) అడవి పంది 

3) ఎద్దు     4) ఆవు

 

 

3.     కింది వాక్యాలు పరిశీలించి భిన్నమైన దాన్ని కనుక్కోండి.

ఎ) వేట - సేకరణ (ఆదిమానవుడు) సమాజం వారి మత విధానాలు తెలుసుకునేందుకు చెంచు జాతి మత విధానాలు అధ్యయనం చేయాలి.

బి) ఈ సమాజం వారు చనిపోయినవారితో వారి సమాధుల్లో కొన్ని వస్తువులు ఉంచే ఆచారం కలిగి లేరు.

సి) చెంచులు నృత్యాలు చేసేవారు.

డి) చెంచులు మైసమ్మ/ గంగమ్మను పూజించారు.

1) డి    2) ఎ, బి    3) బి    4) ఏదీకాదు 

 

 

4.  చెంచు జాతి పూజించిన దేవతలు?

1) మల్లికార్జున స్వామి - శ్రీశైలం  

2) నరసింహస్వామి - అహోబిలం 

3) శివుడు - గుడిమల్లం      

4) 1, 2 

 

 

5.  భక్త కన్నప్ప కథ ఉన్న తమిళ ‘పెరియ పురాణం’ ఏ శతాబ్దం నాటిది?

1) 11వ   2) 12వ   3) 13వ   4) 14వ 

 

 

6.   కాల్చిన బంకమట్టి విగ్రహం మెహర్‌ నగర్‌లో ఉంది. అది ఎన్ని వేల సంవత్సరాల నాటిది?

1) 4600  2) 6400  3) 3000  4) 5000

 

 

7.   దక్కను ప్రాంతంలో బూడిద దిబ్బలను మండించిన పశుపోషకులు, ఆ మంటలను ఏ సమయాల్లో మండించారు?

1) సంక్రాంతి  2) హోలీ  3) దీపావళి 4) పైవన్నీ 

 

 

8.     కిందివాటిలో సరికాని వాక్యం?

ఎ) మహారాష్ట్రలో పశుపోషకులను ‘ధంగర్‌’ అని అంటారు. 

బి) కర్ణాటకలో పశుపోషకులను ‘కురుబ’, ఆంధ్రాలో ‘కురుమ’ అంటారు.

సి) తొలి వ్యవసాయదారులు, పశుపోషకులు ఒకే విధమైన మత విధానాలు అవలంభించలేదు.

డి) మహారాష్ట్ర పశుపోషకులు విఠోభాను, ఆంధ్ర, కర్ణాటకలో రేణుకామాత, ఎల్లమ్మ మొదలైన దేవతలను పూజించారు.

1) ఎ    2) డి      3) బి, సి    4) సి 

 

 

9.   5000 ఏళ్ల నాటి కుండ పాత్రలున్న ముండిగాక్‌ ఏ ప్రాంతంలో ఉంది? 

1) ఇరాన్‌   2) ఇరాక్‌    3) అఫ్గానిస్థాన్‌    4) ఈజిప్ట్‌

 

 

10. వేదాల్లో ప్రాచీనమైన రుగ్వేదం ఎన్ని వేల ఏళ్ల కిందట సంకలనం చేశారని అంచనా?

1) క్రీ.పూ.3500     2) 3500 ఏళ్ల కిందట

3) క్రీ.శ.3500       4) 7000 సంవత్సరాల కిందట 

 

 

11. వేదకాలంలో ప్రధాన దేవతలు?

1) అగ్ని  2) ఇంద్రుడు  3) సోమలత 4) పైవన్నీ

 

 

12. ‘‘ఓ నదులారా! పర్వతాల నుంచి జలజలా కిందికి దిగిరండి.....’’ ఈ శ్లోకం పాడింది ఎవరు?

1) వశిష్టుడు     2) ఉద్దాలక ఆరుణి 

3) యాజ్ఞవల్క్యుడు     4) విశ్వామిత్రుడు

 

 

13. కిందివాటిలో సరైన వాక్యాలు-

ఎ) హిందూకుష్‌ పర్వతాలు - యమున నది మధ్యన నివసించిన ఆర్యులు మలివేదకాలపు ఆర్యులు.

బి) ఆర్య తెగల మధ్య యుద్ధాలు జరిగేవి కావు.

సి) గంగా - యమున నదుల మధ్య ఉన్న ఆర్యులు వరి, గోధుమ పంటలు పండించారు.

డి) మలి వేదకాలంలో స్త్రీలకు స్వాతంత్య్రం అంతరించింది.

1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి 3) సి, డి 4) ఎ, బి, సి

 

 

14. ‘ఆర్య’ అనే పదం నుంచి ‘ఆర్యులు’ అనే పదం వచ్చింది - ‘ఆర్య’ అనేది ఏ భాషా పదం?     

1) తమిళం 2) మరాఠి 3) సంస్కృతం 4) బెంగాలీ 

 

 

15. రుగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?     

1) 1028  2) 1208  3) 1820  4) 1802 

 

 

16. కిందివాటిలో సరికాని జత?

ఎ) రుగ్వేదం - గాయత్రి మంత్రం 

బి) సామవేదం - భారతీయ సంగీతం 

సి) యజుర్వేదం - క్షుద్రపూజలు

డి) అధర్వణ వేదం - మంత్రతంత్రాలు 

1) ఎ, సి     2) సి మాత్రమే   

3) డి మాత్రమే    4) ఎ, సి, డి

 

 

17. కిందివాటిని జతపరచండి.

1) గంధర్వ వేదం  ఎ) సంగీతం 

2) బ్రాహ్మణాలు    బి) మంత్రాలను సంప్రదాయబద్ధంగా వివరిస్తాయి

3) అరణ్యకాలు     సి) ఉత్సవాలు, త్యాగాలను వివరిస్తాయి  

4) ఉపనిషత్తులు  డి) బ్రాహ్మణాలకు అనుబంధాలు

                            ఇ) పూజా విధానాలు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ         

2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 

3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి         

4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

 

 

18. కిందివాటిలో వేదాంగాల్లో లేనిది?

1) శిక్ష   2) కల్ప  3) అలంకారం  4) చంధస్సు

 

 

19. వేదాంగాల్లో ప్రధానమైంది?

1) శిక్ష   2) కల్ప   3) వ్యాకరణ   4) నిరుక్త 

 

 

20. షట్‌ దర్శనాలు రచయితల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. 

ఎ) న్యాయదర్శనం - గీతముడు 

బి) సాంఖ్యదర్శనం - కపిలుడు

సి) ఉత్తరమీమాంస - జైమని 

డి) వైశేషిక దర్శనం - కనడ రుషి 

1) బి, సి   2) సి, డి     3) డి    4) సి 

 

 

21. వేదాలు ‘నాలుగు’ అయితే, ఉపవేదాలు ఎన్ని?

1) 2     2) 4        3) 5        4) 6

 

 

22. తొలివేద ఆర్యులు నివసించిన ప్రాంతంలో లేని నది?    

1) యమున   2) సరస్వతి   3) జీలం    4) సట్లెజ్‌ 

 

 

23. దశరాజు యుద్ధంలో విజయం సాధించినవారు?

1) దశరథుడు     2) ధర్మరాజు 

3) సుధాముడు   4) దుర్యోధనుడు 

 

 

24. తొలివేద కాలంలో రాజును రాజన్‌ అని పిలవగా, మలివేదంలో రాజు కింది బిరుదులను కలిగి ఉన్నాడు..

1) రాజవిశ్వజనన్‌     2) ఏకరాట్‌ 

3) సామ్రాట్‌     4) పైవన్నీ 

 

 

25. వేదకాలంలో రాజస్వేచ్ఛను ఎదుర్కొనే సంస్థలు? 

1) సభ    2) సమితి    3) 1, 2   4) గ్రామసభలు 

 

 

26. వేదకాలం నాటి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించింది?

1) బంగారం  2) వెండి  3) గోవులు   4) పంటలు

 

 

27. కిందివాటిలో తప్పుగా ఉన్న వాక్యాలు?

ఎ) వేదకాలంలో పితృసామ్య వ్యవస్థ అమల్లో ఉంది. 

బి) బహుభార్యత్వం అమల్లో ఉండేది కాదు. 

సి) బాల్యవివాహాలు, సతీసహగమనం రుగ్వేద కాలంలో అమల్లో ఉండేవి.

డి) వేదకాలంలో రథాల పోటీ, గుర్రపు స్వారీ, పాచికలు, సంగీతం లాంటి వినోద కార్యక్రమాలు ఉండేవి. 

ఇ) రుగ్వేద కాలంలో స్త్రీలకు సభ, సమితిలో సభ్యత్వం ఉండేది.    

1) ఎ, సి, డి 2) సి, డి, ఇ  3) బి, సి, ఇ     4) బి, సి 

 

 

28. శూద్రులను గురించి ప్రస్తావించిన రుగ్వేదంలోని అధ్యాయం? 

1) 10     2) 18     3) 1     4) 21

 

 

29. రుగ్వేదంలో ఇంద్రుడు - యుద్ధదేవుడు కాగా, వాతావరణ దేవుడు ఎవరు?

1) అగ్ని     2) వాయుదేవుడు 

3) సోమలత     4) ఇంద్రుడు 

 

 

30. మానవుడికి, దేవతలకు మధ్య వారధిగా ఏ దేవుడిని పిలుస్తారు? 

1) అగ్ని  2) సోమలత  3) ఇంద్రుడు  4) అదితి 

 

 

31. ‘శతపథ బ్రాహ్మణం’లో ఆర్యులు ఏ ప్రాంత మైదానాలకు విస్తరించారని పేర్కొన్నారు?     

1) వాయవ్య సింధు మైదానం 

2) తూర్పు సింధు మైదానం 

3) తూర్పు గంగా మైదానం     

4) పైవన్నీ 

 

 

32. మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరం (సుమారుగా) ?

1) క్రీ.శ.950     2) క్రీ.పూ.950     

3) 950 ఏళ్ల కిందట    4) 1950 ఏళ్ల కిందట 

 

 

33. జనక మహారాజు ఆస్థానంలో ఉన్న ప్రముఖ రుషి- 

1) విశ్వామిత్రుడు     2) వశిష్టుడు 

3) సుధాముడు     4) యాజ్ఞవల్క్యుడు 

 

 

34. మలి వేదకాలంలో ప్రధానంగా చేసిన యాగాలు-

1) రాజసూయ     2) అశ్వమేధ 

3) వాజపేయీ     4) పైవన్నీ 

 

 

35. మలి వేదకాలంలో విరివిగా వాడుకలోకి వచ్చిన లోహం?

1) రాగి  2) ఇనుము  3) వెండి  4) కంచు

 

 

36. ‘మలి వేద కాలంలో కూతురిని భారంగా    చూసేవారు’ అని పేర్కొన్నది?

1) ఐతరేయ బ్రాహ్మణం    2) శతపత బ్రాహ్మణం 

3) కఠోపనిషత్తు    4) మాండకోపనిషత్తు

 

 

37. ‘వైశ్య, శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదు’ అని చెప్పిన గ్రంథం?

1) ఐతరేయ బ్రాహ్మణం     2) శతపత బ్రాహ్మణం

3) కఠోపనిషత్తు          4) మాండకోపనిషత్తు

 

 

38. మలివేద కాలంలో ప్రధాన దేవతలు? 

1) త్రిమూర్తులు     2) ఇంద్రుడు 

3) అగ్ని     4) పైవారందరూ 

 

 

39. గ్రీకులు - ఆర్యులకు ఏ విషయంలో సామ్యం ఉంది?

1) పరిపాలన     

2) ప్రకృతి శక్తుల ఆరాధన 

3) భోజనపు అలవాట్లు     

4) వస్త్రధారణ

 

 

40. కిందివాటిని జత చేయండి. 

1) సింధు  ఎ) హైడాస్టస్‌ 

2) రావి      బి) పరుష్ని 

3) సట్లెజ్‌   సి) షటుద్రి 

4) అసిక్ని   డి) చినాబ్‌ 

                 ఇ) విపాస్‌

1) 1-బి, 2-డి, 3-ఇ, 4-సి      2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 

3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి      4) 1-సి, 2-ఎ, 3-డి, 4-ఇ

 

 

41. గోత్రం అనే పదం మొదటిసారిగా వాడిన వేదం? 

1) సామవేదం     2) రుగ్వేదం 

3) అధర్వణవేదం     4) యజుర్వేదం 

 

 

42. రుగ్వేద కాలంలో ప్రముఖ కవయిత్రులు?

1) అపల, ఘోష     2) విశ్వవర 

3) లోపాముద్ర     4) పైవారంతా

 

 

43. 3000 ఏళ్ల కిందట నిర్మించిన సమాధులైన రాక్షస గుళ్లు ఏ ప్రాంతంలో ఉన్నాయి?

1) దక్కను భారతదేశం   2) కశ్మీర్‌ 

3) ఈశాన్య భారత0దేశం  4) పైవన్నీ


 

 

సమాధానాలు


1-3; 2-2; 3-3; 4-4; 5-2; 6-4; 7-4; 8-4; 9-3; 10-2; 11-4; 12-4; 13-3; 14-3; 15-1; 16-2; 17-3; 18-3; 19-2; 20-4; 21-2; 22-1; 23-3; 24-4; 25-3; 26-3; 27-4; 28-1; 29-4; 30-1; 31-3; 32-2; 33-4; 34-4; 35-2; 36-1; 37-2; 38-1; 39-2; 40-2; 41-3; 42-4; 43-4.

 

 


రచయిత: గద్దె నరసింహారావు  

Posted Date : 30-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్య నాగరికత

సనాతన భారతీయతకు సమున్నత మూలాలు!


ఆధునిక భారతీయ సంస్కృతికి అనాది కాలంలోనే ఆర్య నాగరికత పునాదులు వేసింది. నాడు ప్రభవించిన వేద సాహిత్యం సామాజిక నిర్మాణానికి, వర్ణ, కుల వ్యవస్థలకు మూలమై నిలిచింది. ప్రకృతికి దైవత్వాన్ని జోడించి వేదాలు శ్లోకాలుగా, ఆచారాలుగా, తాత్విక బోధనలుగా మార్గనిర్దేశం చేశాయి.  ఆధ్యాత్మిక, సాంస్కృతిక నైతికతలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించాయి. కాలాతీతమైన జ్ఞానాన్ని పంచాయి. వాటిని శక్తిమంతమైన వాఙ్మయ రూపంలో ఆర్యులు తరతరాలకు అందించారు. ఈ నేపథ్యంలో ఆ విశిష్ట నాగరికత మూలాలు, వేదాలు, ఉపనిషత్తుల సారాంశాలు, వాటి అనుబంధ సాహిత్యాల విశేషాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.


సింధు నాగరికత అనంతరం ఉత్తర భారతదేశంలో ఆర్య నాగరికత వర్ధిల్లింది. ఇది క్రీస్తు పూర్వం సుమారు 1500 నుంచి 600 వరకు కొనసాగింది. సింధు నాగరికత, సంస్కృతి మాదిరిగానే ఆర్య నాగరికత, సంస్కృతులు కూడా భారతీయ సమాజంపై ప్రగాఢ ముద్ర వేశాయి. ఆర్య అనే పదం ఉత్తముడు, ఉన్నతుడు, పూజ్యుడు అనే అర్థాలు ఇస్తుంది. ఆర్య నాగరికత లేదా వేద నాగరికతను నిర్మించినవారు నార్డిక్‌ తెగకు చెందినవారని చరిత్రకారుల అభిప్రాయం. వీరి జన్మస్థలం గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ తన గ్రంథం ‘ద ఆర్కిటిక్‌ హోమ్‌ ఇన్‌ ద వేదాస్‌’లో ఆర్యుల జన్మస్థలం ఉత్తర ధ్రువ ప్రాంతమని పేర్కొన్నారు. ఆర్యులు ఐరోపా ఖండ వాసులని విలియం జోన్స్‌ చెబితే, మధ్య ఆసియా ప్రాంత వాసులని మాక్స్‌ముల్లర్‌ అన్నారు. 


ఎక్కువమంది చరిత్రకారుల ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా నుంచి భారత దేశానికి వలస వచ్చి, స్థానిక జాతులను ఓడించి, క్రీ.పూ.1500 నాటికి భారతదేశ పశ్చిమోత్తర ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడి నుంచి క్రమక్రమంగా మధ్య భారతదేశంలోకి వ్యాపించి స్థిర నివాసాలను ఏర్పరచుకుని వ్యవసాయ, వాణిజ్యాలు సాగించి తమదైన నాగరికత సంస్కృతులను స్థాపించారు. వీరిది గ్రామీణ సంస్కృతి. అందుకే ఆ కాలం నాటి పురావస్తు ఆధారాలు ఎక్కువగా లభ్యం కాలేదు. అయినప్పటికీ ఆర్య నిర్మితమైన అద్భుతమైన వాఙ్మయం వారి చరిత్రకు ఆధారంగా నిలిచింది. వేద వాఙ్మయం సాయంతో ఆర్య నాగరికత, సంస్కృతులను, ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు. ఆర్య నాగరికత కాలాన్ని రెండు దశలుగా విభజించి అధ్యయనం చేస్తారు. అవి రుగ్వేద నాగరికత కాలం (సుమారు క్రీ.పూ.1500 నుంచి క్రీ.పూ. 1000 వరకు), మలివేద కాలం (క్రీ.పూ.1000 నుంచి క్రీ.పూ. 600 వరకు).


వేద సాహిత్యం: వేదం అనే పదం విద్‌ అనే ధాతువు నుంచి ఉద్భవించింది. దీని అర్థం జ్ఞానం. వేదాలు సాక్షాత్తు భగవంతుడే ప్రవచించాడని, మానవ నిర్మితాలు కావన్నది నమ్మకం. అందుకే వేదాలను ‘అపౌరుషేయాలు’ అంటారు. వేద సాహిత్యాన్ని ప్రధానంగా శ్రుతి సాహిత్యం, స్మృతి సాహిత్యాలుగా విభజిస్తారు. వేదాలు నాలుగు అవి.. రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. వీటినే వేద సంహితలు అని కూడా అంటారు. వీటి అనుబంధ గ్రంథాలు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఇవన్నీ శ్రుతి సాహిత్యాలు. ఇక వేదాంగాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు స్మృతి సాహిత్యం కిందకు వస్తాయి.

రుగ్వేదం: వేదాల్లో ప్రాచీనమైంది. ఇందులోని సూక్తాలు లేదా శ్లోకాలు వివిధ ప్రకృతి శక్తులకు దైవత్వం ఆపాదించి చేసిన ప్రార్థనలు. మొత్తం 10 మండలాలుగా విభజించి, 1028 సూక్తాలతో ఉంది. ఈ గ్రంథంలో రెండో మండలం నుంచి ఏడో మండలం వరకు మూలమని,   మిగతావి తర్వాత చేసిన చేర్పులని చరిత్రకారుల అభిప్రాయం. ఏడో మండలంలో దశ రాజ గణ యుద్ధం, పదో మండలంలో భారతీయ సామాజిక వ్యవస్థ మూలమైన ‘పురుషసూక్త శ్లోకం’ ఉంది. క్రీ.పూ. 1500 - 1000 సంవత్సరాల మధ్య నాటి ‘సప్త సింధు ప్రాంతం’లో ఆర్యులు సంచరించారు (ఆధునిక  అఫ్గానిస్థాన్‌ తూర్పు ప్రాంతం, పంజాబ్, హరియాణా ప్రాంతాలు). పశుపోషక, సంచార జీవితాన్ని ప్రతిబింబింపజేసే తొలి ఆర్యుల గురించి ముఖ్య సమాచారాన్ని రుగ్వేదం అందిస్తుంది. రుగ్వేద పండితుడిని ‘హోత్రి’ అంటారు.

సామ వేదం: సామన్‌ అంటే శ్రావ్యం అని అర్ధం. రుగ్వేదంలోని సూక్తాలను ఏ విధంగా ఉచ్చరించాలో సామవేదం చెబుతుంది. సామవేద పండితుడిని ఉద్ఘాత్రి అంటారు. ఇందులో భారతీయ శాస్త్రీయ సంగీత మూలాలున్నాయి.

యజుర్వేదం: పద్య, గద్య సంకలనం. ఈ గ్రంథంలో వివిధ శ్లోకాలు, మత క్రతువుల నిర్వహణ కోసం రూపొందించినవి ఉన్నాయి. యజుర్వేదాన్ని పఠించే పండితుడిని ‘అధ్వార్యు’ అంటారు. యజుర్వేదం శ్వేత యజుర్వేదం, కృష్ణ    యజుర్వేదం అని రెండు రకాలు.

అధర్వణ వేదం: దీనినే బ్రహ్మ వేదం అంటారు. మతేతర విషయాలైన వైద్యం, క్షుద్రవిద్యలు, యుద్ధ విద్యలు లాంటివి ఇందులో ఉన్నాయి. కొన్ని ఆర్యేతర విశ్వాసాలు కూడా ఉండటం గమనిస్తే ఈ గ్రంథంపై అనార్యుల ప్రభావం కనిపిస్తుంది. అధర్వణ వేదం పఠించే పండితుడిని ‘బ్రాహ్మణ’ అంటారు.


బ్రాహ్మణాలు: బ్రాహ్మణాలు అనేవి సంహితలకు వ్యాఖ్యాన రూప గ్రంథాలు. ఇవి గద్య రూపంలో, వేద సంహితకు అనుబంధంగా ఉండి, యజుర్వేదంలో చెప్పిన క్రతువుల నిర్వహణ విధానాన్ని తెలియజేస్తాయి. ఇందులో పాలకులు నిర్వర్తించే రాజసూయ, అశ్వమేధ, వాజపేయ లాంటి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఉన్నాయి. ఇవి మోక్ష సాధనకు కర్మ మార్గాన్ని బోధిస్తాయి. ఒక్కో సంహితకు కొన్ని బ్రాహ్మణాలు అనుబంధంగా ఉంటాయి.

ఉదా: రుగ్వేదానికి ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం; సామ వేదానికి తాండ్యమాహ బ్రాహ్మణం, జైమిని బ్రాహ్మణం; యజుర్వేదానికి శతపథ బ్రాహ్మణం, తైత్తరీయ బ్రాహ్మణం అనుబంధాలు.

అరణ్యకాలు: ఇవి బ్రాహ్మణాల చివరి భాగాలు. ఇవి కూడా బ్రాహ్మణాల మాదిరిగానే కర్మవిధుల్ని ప్రస్తావిస్తాయి. కానీ వీటిలో కర్మల భౌతిక భాగం ఉండదు. కర్మల వెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి అరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.

ఉపనిషత్తులు: ‘ఉపనిషత్‌’ అనే పదం ‘ఉపనిషాద్‌’ అనే ధాతువు నుంచి పుట్టింది. దీనికి అర్థం గురువు చుట్టూ విద్యార్థులు చేరి జ్ఞానమార్జించడం. ‘ఉప’ అంటే గురువు సమీపంలో, ‘ని’ అంటే నిష్ఠతో   శ్రవణం చేసినవారికి అజ్ఞానం నశించి, ‘షత్‌’ అంటే పరమాత్మ ప్రాప్తి చేకూరడం అని అర్థం. ఇవి పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానం, జన్మ, పునర్జన్మ, మోక్షం, పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి వివరించేవి. ఉపనిషత్తులు అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ ఇంతవరకు 108 మాత్రమే   లభ్యమయ్యాయి. ఇవి కూడా వేద సంహితలకు అనుబంధంగా ఉంటాయి.

ఉదా: రుగ్వేదానికి ఐతరేయ, కౌశతకి ఉపనిషత్తులు; సామ వేదానికి చాందోగ్య, కేనా ఉపనిషత్తులు; యజుర్వేదానికి కదా ఉపనిషత్తు, బృహదారణ్య ఉపనిషత్తులు; అధర్వణ వేదానికి ముండకా, మాండూక్య ఉపనిషత్తులు అనుబంధాలుగా ఉన్నాయి.


వేదాంగాలు: వేదాంగాలు ఆరు. ఇందులో మొదటిది ‘శిక్ష’. వేదాల్లో స్వరం ప్రధానం. ఇది వేదాన్ని ఉచ్ఛరించాల్సిన పద్ధతిని బోధిస్తుంది. రెండోది ఛందస్సు అంటే గణ విభజన. మూడోది నిరుక్తం అంటే పద వ్యుత్పత్తి శాస్త్రం. నాలుగోది వ్యాకరణం, అయిదు జ్యోతిషం (వేదాల్లో చెప్పిన యజ్ఞాలు చేయడానికి కాల నిర్ణయం చాలా ముఖ్యం. ఆ కాల నియమాలు జ్యోతిషంలో ఉంటాయి), ఆరోది కల్పసూత్రాలు. ఈ ఆరు గ్రంథాలూ వేదపఠనానికి, వేదాలను అర్థం చేసుకోవడానికి, వేద జ్ఞానం సమాజ హితం కోసం ఉపయోగించడానికి మార్గాన్ని సూచిస్తాయి.

ఉపవేదాలు: మొత్తం నాలుగు. అవి ధనుర్వేదం - యుద్ధ విద్యకు, ఆయుర్వేదం - వైద్య విద్యకు, గాంధర్వ వేదం - గాన విద్యకు, శిల్ప వేదం - శిల్ప కళకు సంబంధించినవి. ఇవన్నీ మత ప్రసక్తి లేని దైనందిన జీవితానికి సంబంధించిన విషయాలతో ఉన్న గ్రంథాలు.


ఇతిహాసాలు: వాల్మీకి మహర్షి రాసిన శ్రీ మద్రామాయణం, వ్యాసుడు రచించిన మహాభారతం ఇతిహాసాలు. ఆర్య సంస్కృతి దక్షిణాదికి వ్యాపించిన విధానాన్ని ‘శ్రీ మద్రామాయణం’, ఉత్తర దేశ సార్వభౌమాధికారం కోసం ఆర్య గణాలు తమలో తాము జరిపిన పోరాటాలను ‘మహాభారతం’ తెలియజేస్తాయి. 

క్రీ.పూ. 1500-600 మధ్య కాలానికి సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణం కోసం ప్రత్యేకంగా గ్రంథాలు లేవు. దాంతో నాటి ఉత్తర భారతంలో ఆర్యుల జీవన విధానాన్ని, సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి వేద సాహిత్యమే ఆధారంగా నిలిచింది.



 


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం 

Posted Date : 03-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

దక్కన్, దక్షిణ భారతదేశం

పిశాచాలను ఆరాధించిన ప్రాచీన తమిళులు!

ప్రాచీన భారతదేశంలో దక్షిణాదిన ఆవిర్భవించి, విస్తరించిన రాజ్యాలెన్నో చరిత్రపై చెరగని ముద్ర వేశాయి. ప్రగతిÄ, పాలనాదక్షతల్లో తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలిచాయి. ఉత్తరాది ప్రభావాన్ని నిరోధించి, దక్కన్‌ సంస్కృతి అభివృద్ధికి, ద్రవిడ భాషల వికాసానికి పునాదులు వేశాయి. తెలుగు నేలపై శాతవాహనులు, తమిళనాట చోళులు, పాండ్యులు ఆర్థిక, సాంస్కృతిక, వాణిజ్య రంగాల్లో అద్భుత విజయాలు సాధించి అజేయులుగా నిలిచారు. నాటి సామాజిక పరిస్థితులు, ఆచార వ్యవహారాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. దక్షిణ ప్రాంతాలను పాలించిన రాజవంశాల క్రమం, సమకాలీనుల్లో గొప్ప పాలకులు, వారి మధ్య ఉన్న సంబంధాలపై అవగాహన పెంచుకోవాలి.

 

1.  దక్కను భౌగోళిక సరిహద్దులను ఏ సంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన ‘భారతదేశ చరిత్ర సమావేశం’లో నిర్ణయించారు?

1) 1954    2) 1945   3) 1964    4) 1974

 

 

2. సంగమ యుగంలోని తమిళ రచనల్లో ప్రముఖ వ్యాకరణ గ్రంథమైన ‘తొల కప్పియం’ను రచించింది.

1) తిరుక్కురల్‌    2) తొలకప్పియర్‌   

 3) తిరువళ్లువార్‌   4) నందనార్‌

 

 

3.  తమిళ దేశానికి బైబిల్‌ లాంటి ‘తిరుక్కురల్‌’ అనే గ్రంథాన్ని రచించినవారు?

1) తిరువళ్లువార్‌      2) పెరియాళ్వార్‌  

3) సంబంధర్‌      4) నందనార్‌

 

 

4.  కిందివాటిని జత చేయండి.

1) మొదటి మహేంద్రవర్మ  a) మత్త విలాస ప్రహసనం

2) భారవి    b) దశకుమార చరిత్ర

3) దండి     c) కిరాతార్జునీయం

4) అమోఘవర్షుడు   d) కవిరాజు మార్గం

                   e) మానసోల్లాసం

1) 1-A, 2-B, 3-C, 4-D

2) 1-E, 2-D, 3-C, 4-A

3) 1-A, 2-C, 3-B, 4-D

4) 1-E, 2-C, 3-B, 4-D


 

 

5.     రెండో పులకేశి, హర్షవర్ధనుడిపై విజయాన్ని తెలిపే శాసనం-

1) నాసిక్‌      2) నానాఘాట్‌  

3) ఐహోల్‌ శాసనం    4) అలహాబాదు శాసనం

 

 

6.  చోళుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరించే శాసనం?

1) ఉత్తర మేరూరు శాసనం - రాజేంద్రచోళ  

2) ఉత్తర మేరూర్‌ శాసనం - రాజరాజు

3) మహాబలిపురం శాసనం - మొదటి పరాంతకుడు   

4) ఉత్తర మేరూర్‌ శాసనం - మొదటి పరాంతకుడు

 

 

7.  ‘సంగం’ అనే పదం మొదటిసారిగా ఏ భిక్షువుల గురించిన విషయాల్లో వాడారు?

1) హిందూ - జైన    2) బౌద్ధ - శైవ  

3) జైన - బౌద్ధ      4) సిక్కు - జైన

 

 

8.  ‘సంగం’ అనే పదానికి తమిళంలో సమాన అర్థం కలిగిన పదం?

1) కన్నడ్‌  2) కూడల్‌  3) కన్నన్‌  4) కూడిక

 

 

9. తమిళంలో కవిపండిత పరిషత్‌ను ఏమంటారు?

1) సంగం     2) సమాజం 

3) కూటమి     4) సంఘం

 

 

10. తమిళనాడులో ‘సంగం’ అనే పదాన్ని త్రిపుత్తూరు   తిరుత్తనందంలో వాడినవారు?

1) తిరునావక్కరసు      2) కూడల్‌  

3) తొలకప్పియర్‌      4) నమ్మాళ్వార్‌

 

 

11. సంగం వాజ్మయంలోని స్వతంత్ర రాజ్యాలు?

1) చోళ  2) చేర  3) పాండ్య  4) పైవన్నీ

 

 

12. మెగస్తనీస్‌ ఇండికా గ్రంథంలో పేర్కొన్న సంగమ రాజ్యాలు?

1) చోళ   2) చేర  3) పాండ్య  4) పైవన్నీ

 

 

13. కింది రాజ్యాలు, సరిహద్దుల్లో సరైన దాన్ని గుర్తించండి.

1) చోళ రాజ్యం - ఆర్కాట్‌ నుంచి తిరుచునాపల్లి వరకు

2) చేర రాజ్యం - ఉత్తరాన కొచ్చిన్‌ నుంచి దక్షిణాన తిరువళ్లూరు వరకు

3) పాండ్య రాజ్యం - పుదుక్కోట నుంచి కన్యాకుమారి వరకు

1) 1, 2       2) 3 మాత్రమే   

3) 1, 2, 3      4) 1, 3, 4 

 

 

14. చేర రాజ్యానికి రాజధాని?

1) ఉరయూర్‌    2) వంజి  

 3) మధురై      4) మహాబలిపురం

 

 

15. పాండ్య రాజ్యానికి రాజధాని?

1) మధురై     2) ఉరయూర్‌  

 3) వంజి      4) మహాబలిపురం

 

 

16. ప్రాచీన చోళుల్లో గొప్పవాడు?

1) మొదటి పరాంతకుడు    

2) మొదటి రాజేంద్రుడు 

3) కరికాల చోళుడు      

4) రాజరాజ చోళుడు

 

 

17. పూహర్‌ (కావేరి పట్టణం) అనే నూతన రాజధానిని, కావేరి నదిపై ఆనకట్టను నిర్మించిన చోళరాజు?

1) మొదటి పరాంతకుడు     2) మొదటి రాజేంద్రుడు      3) కరికాల చోళుడు    4) రాజరాజ చోళుడు

 

 

18. చేర రాజుల్లో గొప్పవాడు, యుద్ధవీరుడు?

1) నెడుంజెరల్‌      2) అడన్‌  

3) ఉదయం జెరల్‌      4) కుట్టువన్‌

 

 

19. అధిరాజు, ఇమయవిరంజన్‌ పరమేశ్వర అనే బిరుదులున్న చేర రాజు?

1) నెడుంజెరల్‌ అడన్‌      2) ఉదయం జెరల్‌  

3) కుట్టువన్‌      4) సెంగుట్టవన్‌

 

 

20. చేర వంశానికి చెందిన నెడుంజెరల్‌ సోదరుల్లో ప్రముఖులు?

1) కుట్టువన్‌     2) సెంగుత్తవన్‌  

3) 1, 2      4) ఉదయం జెరల్‌

 

 

21. మనగుడి మరుదున్, నక్కీరార్‌ అనే కవులు ఏ చేర రాజు గురించి కొనియాడారు?

1) నెడుంజెరల్‌      2) సెంగుట్టవన్‌  

3) ఉదయంజెరల్‌      4) కుట్టువన్‌

 

 

22. సంగం యుగం కాలం నాటి కులవ్యవస్థలో సరైంది?

1) వనం, వరైని      2) తుడియం  

3) కడంబన్‌      4) పైవన్నీ

 

 

23. ప్రాచీన తమిళులు ప్రధానంగా ఎవరిని ఆరాధించారు?

1) ప్రకృతి శక్తులు       2) సర్పాలు  

3) పిశాచాలు      4) పైవన్నీ

 

 

24. ప్రాచీన తమిళులు ఆరాధించిన శైవ దేవతలు-

1) శివుడు      2) వినాయకుడు  

3) సుబ్రహ్మణ్యస్వామి      4) 1, 3

 

 

25. తమిళ వ్యాకరణ గ్రంథం?

1) కురల్‌      2) పెరియ పురాణం 

3) తొలకప్పియం      4) పైవన్నీ

 

 

26. కురల్‌ (నైతిక విలువలు) అనే ప్రసిద్ధ కావ్యాన్ని ఎవరు రచించారు?

1) తిరువళ్లువార్‌      2) కుట్టువన్‌  

3) సెంగుట్టవన్‌      4) ఆండాళ్‌

 

 

27. కిందివాటిని జత చేయండి.

1) హాలుడు    a) రసరత్నావళి

2) గుణాఢ్యుడు     b) లీలావతి

3) కుతూహలుడు      c) బృహత్కథ

4) నాగార్జునుడు       d) గాథాసప్తసతి

                 e) కాతంత్ర వ్యాకరణం

1) 1-A, 2-C, 3-E, 4-D

2) 1-D, 2-C, 3-B, 4-A

3) 1-A, 2-B, 3-C, 4-D

4) 1-D, 2-C, 3-E, 4-A

 

 

28. చివరి కణ్వపాలకుడైన సుశర్మ నుంచి సింహాసనం స్వాధీనం చేసుకున్న శాతవాహన రాజు?

1) మొదటి శాతకర్ణి      2) గౌతమీపుత్ర శాతకర్ణి  

3) శ్రీముఖుడు       4) హాలుడు

 

 

29. శకరాజు అయిన నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు?

1) మొదటి శాతకర్ణి      2) రెండో శాతకర్ణి  

3) గౌతమీపుత్ర శాతకర్ణి      4) శ్రీముఖుడు

 

 

30. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం?

1) నానాఘాట్‌       2) మ్యాకదోని  

3) నాసిక్‌      4) అమరావతి

 

 

31. గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు?

1) ఆగమ నిలయ      

2) క్షత్రియ దర్పమాన మర్దన  

3) త్రిసముద్రలోయ పీతవాహన   

4) పైవన్నీ

 

 

32. శాతవాహనులు తమ రాజ్యాన్ని ....... అనే రాష్ట్రాలుగా విభజించారు.

1) వాడలు 2) రాష్ట్రాలు 3) సభాలు 4) ఆహారాలు

 

 

33. శాతవాహనుల కాలంనాటి న్యాయాధికారులను ఏమంటారు?

1) రజకులు      2) న్యాయవాధీశులు  

3) ప్రదేశి       4) సంచారక్‌

 

 

34. శాతవాహనుల కాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు?

1) 4      2) 6      3) 3     4) 8

 

 

35. శాతవాహనుల కాలం నాటి ప్రధాన వర్తక స్థావరాలు?

1) ఫైథాన్‌   2) నాసిక్‌    3) ధాన్యకటకం    4) పైవన్నీ

 

 

36. శాతవాహనులు, రోమన్ల మధ్య వర్తకం గురించి వివరించిన గ్రంథం?

1) లీలావతి  2) పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సి  

3) గాథాసప్తసతి      4) సుహృలేఖ

 

 

37. శాతవాహనుల చరిత్రకు ప్రధాన ఆధారమైన అమరావతి స్తూపం ఏ నది ఒడ్డున ఉంది?

1) గోదావరి  2) పెన్నా  3) కృష్ణా  4) శబరి

 

 

38. కాంచీపురం పల్లవులకు సంబంధించి సరైంది.    

ఎ) ఈ పల్లవులు బాదమీ చాళుక్యులకు, మధురై పాండ్యులకు సమకాలీనులు.

బి) తమిళ, కన్నడ ప్రాంతాలను పరిపాలించారు.

సి) కావేరి, తుంగభద్ర డెల్టాలపై అధికారం సాధించారు.

డి) వీరి కాలంలో తమిళ, కన్నడ భాషల్లో అనేక రచనలు వచ్చాయి.

1) ఎ, బి, సి, డి     2) ఎ, సి, డి

3) సి, డి      4) బి, సి

 

 

39. పల్లవుల్లో అత్యంత బలవంతుడు సింహ విష్ణు కుమారుడైన మహేంద్రవర్మ - రెండో పులకేశి మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది?

1) క్రీ.శ.710   2) క్రీ.శ.610   

3) క్రీ.శ.510   4) క్రీ.శ.410

 

 

40. మహేంద్రవర్మ ఆస్థానంలో ఉన్న ప్రముఖ శైవ కవి?

1) అప్పార్‌     2) నందనర్‌ 

3) సంబంధర్‌      4) మాణిక్య వాచకర్‌

 

 

41. ‘మత్త విలాస ప్రహసనం’ అనే గ్రంథాన్ని రచించింది?

1) మహేంద్రవర్మ     2) సింహ విష్ణువు 

3) అప్పార్‌     4) రెండో పులకేశి

 

 

42. పల్లవ రాజు అయిన మహేంద్రవర్మ బిరుదులు?

1) మత్త విలాస      2) విచిత్ర చిత్త 

3) చిత్రకారపులి     4) పైవన్నీ

 

 

43. బాదామి చాళుక్య రాజు అయిన రెండో పులకేశిని ఓడించిన పల్లవ రాజు?

1) వీరకుర్చ వర్మ    2) మహేంద్ర వర్మ 

3) సింహ విష్ణువు    4) మొదటి నరసింహ వర్మ

 

 

44. బాదామి చాళుక్యరాజు అయిన రెండో పులకేశి ఓడిపోయిన యుద్ధం?

1) మణిమంగల యుద్ధం    2) పుల్లలూరి యుద్ధం

3) తపతి నది యుద్ధం    4) కావేరినది యుద్ధం

 

 

45. కింది వాటిలో సరైంది-

ఎ) సోమదేవసూరి రచించిన గ్రంథం - నీతి వాక్యామృతం

బి) మూడో సోమేశ్వరుడి రచన - మానసోల్లాసం

1) ఎ, బి       2) సి, డి  

3) బి మాత్రమే      4) ఎ మాత్రమే 


సమాధానాలు

1-2; 2-2; 3-1; 4-3; 5-3; 6-4; 7-3; 8-2; 9-1; 10-1; 11-4; 12-4; 13-3; 14-2; 15-1; 16-3; 17-3; 18-3; 19-1; 20-3; 2-11; 22-4; 23-4; 24-4; 25-3; 26-1; 27-2; 28-3; 29-3; 30-3; 31-4; 32-4; 33-1; 34-1; 35-4; 36-2; 37-3; 38-1; 39-2; 40-1; 41-1; 42-4; 43-4; 44-1; 45-1. 

Posted Date : 25-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత దేశంలో బ్రిటిష్‌ సంస్కరణలు

‘అభిరుచులను.. విలువలను మార్చేందుకే ఆంగ్లవిద్య’ 

 

 

భారతదేశంలో బ్రిటిష్‌ వలసవాద పాలన సృష్టించిన అనర్థాల్లో విద్యాపరంగా చేపట్టిన సంస్కరణలకు దీర్ఘకాలిక ప్రాధాన్యం ఉంది. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ, స్వావలంబనకు దోహదపడే భారతీయ విద్య వెన్ను విరిచిన వలస పాలకులు, దాని స్థానంలో న్యూనతా భావాన్ని పెంచే విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పరిణామం దేశంలో అనేక సామాజిక, సాంస్కృతిక మార్పులకు దారితీసి, భారత జాతిని బలహీనం చేసింది. ఆ క్రమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులు, వచ్చిన మార్పుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. వలస పాలకులకు నాటి భారతదేశంపై, ఇక్కడి ప్రజలపై ఉన్న అభిప్రాయాలతో పాటు భారతీయ గ్రంథాలు, సాహిత్యం మరుగున పడకుండా జాతీయ నాయకులు చేసిన కృషిని గుర్తుంచుకోవాలి.

 

1. విలియం జోన్స్‌ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు?

1) 1783  2) 1784  3) 1873  4) 1825


2. కిందివాటిలో విలియం జోన్స్‌కి సంబంధించి సరైన వాక్యాలు?

ఎ) కంపెనీ స్థాపించిన సుప్రీంకోర్టులో జోన్స్‌   జూనియర్‌ జడ్జిగా నియమితులయ్యారు.

బి) జోన్స్‌ బహుభాషావేత్త.

సి) గ్రీకు, లాటిన్‌ భాషలను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశారు.

డి) పర్షియన్, అరబిక్‌ భాషలను స్నేహితుల నుంచి నేర్చుకున్నారు.

1) ఎ, డి        2) ఎ, సి  

3) ఎ, బి, సి, డి      4) ఎ, బి, డి


3. విలియం జోన్స్‌ అధ్యయనం చేసిన భారతీయ గ్రంథాలు-

1) న్యాయ శాస్త్రం        2) తత్వ శాస్త్రం  

3) రాజనీతి శాస్త్రం, అంకగణితం  4) పైవన్నీ


4. భారతీయ సాహిత్యం పరిశోధించడంలో ప్రావీణ్యం పొందిన ప్రముఖులు?

1) హెన్రీథామస్‌ కోల్‌బ్రూక్‌ 2) నథానియల్‌ హాల్హెడ్‌ 3) 1, 2      4) రాబర్ట్‌ క్లైవ్‌


5. ‘ఏషియాటిక్‌ సొసైటీ’, ‘ఏషియాటిక్‌ రిసెర్చ్‌’ అనే పత్రికలు ప్రారంభించినవారు?

1) కోల్‌బ్రూక్‌       2) హాల్హెడ్‌    

3) విలియం జోన్స్‌        4) విలియం బెంటిక్‌


6. విలియం జోన్స్, కోల్‌బ్రూక్‌ల అభిప్రాయాలకు సంబంధించి సరైనవి-

ఎ) విలియం జోన్స్, హెచ్‌.టి.కోల్‌బ్రూక్‌లకు పాశ్చాత్య, ప్రాచీన భారత సంస్కృతి పట్ల గౌరవం లేదు.

బి) భారతీయ నాగరికత పురాతన కాలంలోనే  అత్యున్నత శిఖరాలు అధిరోహించింది.

సి) భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి దాని ప్రాచీన ఆధ్యాత్మిక, న్యాయశాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేయాలి.

డి) ప్రాచీన గ్రంథాలు హిందూ, ఇస్లాం వాస్తవమైన ఆలోచనలు, చట్టాలను బహిర్గతం చేయగలవు.

1) ఎ, బి, సి, డి       2) ఎ, సి, డి    

3) ఎ, బి, సి        4) బి, సి, డి 


7. అరబిక్, పర్షియన్, ఇస్లామిక్‌ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి కలకత్తాలో ఆంగ్లేయులు    మదర్సాను స్థాపించిన సంవత్సరం?

1) 1871  2) 1781  3) 1891  4) 1791


8. మదర్సా అనేది ఏ భాషా పదం?

1) ఉర్దూ       2) అరబిక్‌   

3) పారశిక       4) పాళీ


9. ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి బెనారస్‌ హిందూ కళాశాలను స్థాపించిన సంవత్సరం?

1) 1781       2) 1771   

3) 1791        4) 1891


10. 1830లో రిచర్డ్‌ వెస్ట్‌ మాకోట్‌ ఎవరి స్మారక చిహ్నాన్ని స్థాపించాడు?

1) విలియం బెంటిక్‌       2) వారన్‌ హేస్టింగ్స్‌   

3) కారన్‌ వాలిస్‌       4) రాబర్ట్‌ క్లైవ్‌


11. 1830లో రిచర్డ్‌ వెస్ట్‌ మాకోట్‌ నిర్మించిన స్మారక చిహ్నం ఎక్కడ ఉంది?

1) కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్‌         2) ఢిల్లీలోని మ్యూజియం

3) లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియం  4) పుణెలోని మ్యూజియం


12. మున్షి అంటే ఎవరు?

1) పర్షియన్‌ చదవగలవారు        2) పర్షియన్‌ రాయగలవారు    

3) పర్షియన్‌ బోధించగలవారు     4) పర్షియన్‌ చదవగల, రాయగల, బోధించగలవారు


13. ఆసియా భాష, సంస్కృతంలో పాండిత్యం ఉన్న  వారిని ఏమంటారు?

1) తీరవాదులు        2) ప్రాచ్యవాదులు    

3) విదేశీయులు        4) పండితులు


14. ‘ఆంగ్లేయులు భారతీయుల హృదయంలో స్థానం పొందడానికి, వారిని సంతోషపెట్టడానికి వారు కోరుకున్నది ఇవ్వకూడదు, వారు కోరుకున్నది బోధించకూడదు’ అని అన్నది?

1) కారన్‌ వాలిస్‌         2) మెకాలే     

3) జేమ్స్‌ మిల్‌        4) కానింగ్‌


15. 1830లో థామస్‌ బాబింగ్టన్‌ మెకాలే అభిప్రాయంలో సరైంది.

ఎ) భారత దేశం ఒక అనాగరిక దేశం.

బి) ఇంగ్లండ్‌ సాధించిన విజ్ఞానం భారత దేశపు ఏ శాస్త్ర జ్ఞానంతోనూ సరిపోల్చలేనంత గొప్పది.

సి) ఇండో అరబిక్‌ సాహిత్యం యూరప్‌లోని మంచి గ్రంథాలయం ఒక అరలోని సాహిత్యంతో     సరిపోదు.

డి) భారతదేశ సాహిత్యం ఆచరణాత్మకం కానిది.

1) ఎ, బి, డి      2) ఎ, బి, సి   

3) ఎ, బి, సి, డి         4) బి, సి, డి


16. ఆంగ్ల భాష బోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆంగ్లేయుడు?

1) కానింగ్‌        2) జేమ్స్‌ మిల్‌    

3) మెకాలే           4) రాజా రామ్‌మోహన్‌ రాయ్‌


17. ‘భారతీయులకు యావత్‌ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యం చదవడానికి ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానం అవసరం’ అని అన్నది?

1) విలియం బెంటిక్‌   2) రాజా రామ్‌మోహన్‌ రాయ్‌    

3) మెకాలే       4) కానింగ్‌


18. ‘భారత ప్రజలను నాగరికులుగా చేయడానికి, వారి అభిరుచులు, విలువలు, సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి’ అన్నది ఎవరు?

1) కానింగ్‌           2) లార్డ్‌ మెకాలే    

3) విలియం బెంటిక్‌     4) రాజా రామ్‌మోహన్‌ రాయ్‌


19. ‘అవి అంధకార మందిరాలు. ఆ సంస్థలు వాటంతటవే శిథిలావస్థకు చేరి అంతర్థానమవుతాయి.’ అని ఏ సంస్థల గురించి పేర్కొన్నారు?

1) కలకత్తా మదర్సా         2) బెనారస్‌ సంస్కృత కళాశాల   

3) ఢిల్లీలోని విశ్వవిద్యాలయం      4) 1, 2


20. ‘ఉడ్స్‌ డిస్పాచ్‌’ను ఈస్ట్‌ ఇండియా కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1856       2) 1855   

3) 1854       4) 1852


21. ఉడ్స్‌ డిస్పాచ్‌లోని ఆచరణాత్మక ప్రయోజనాలు ఏమిటి?

1) ఆర్థికపరమైన ప్రయోజనం      2) నైతిక విలువలు మెరుగుపరచడం    

3) స్వతంత్ర సాధనకు ప్రోత్సాహం  4) 1, 2


22. ఉడ్స్‌ డిస్పాచ్‌ను అమలు చేస్తూ ఆంగ్లేయులు తీసుకున్న చర్యలను గుర్తించండి.

ఎ) విద్యా విషయాలు నియంత్రించడానికి విద్యా శాఖను ఏర్పాటు చేశారు.

బి) విశ్వవిద్యాలయాల విద్యావ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

సి) కలకత్తా, మద్రాసు, బొంబాయిలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు.

డి) పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టారు.

1) ఎ, సి, డి 2) ఎ, బి, సి 3) బి, డి 4) ఎ, బి, సి, డి


23. సెరాంపుర్‌ మిషనరీ స్థాపించడంలో సాయపడింది?

1) మెకాలే     2) విలియం జోన్స్‌     

3) విలియం క్వారీ    4) జేమ్స్‌ మిల్‌


24. ఎప్పటి వరకు ‘ఈస్టిండియా కంపెనీ’ భారత దేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది?

1) 1812  2) 1813   3) 1814  4) 1815


25. సెరంపుర్‌ వద్ద ప్రింటింగ్‌ ప్రెస్, కళాశాల స్థాపించిన సంవత్సరాలు వరుసగా..

1) 1810, 1813     2) 1800, 1813

3) 1800, 1818    4) 1813, 1818


26. విలియం ఆడమ్స్‌ 1830లో పర్యటించిన ప్రాంతాలు?

1) బెంగాల్‌ 2) బిహార్‌ 3) రాజస్థాన్‌ 4) 1, 2


27. విలియం ఆడమ్స్‌ నివేదికలోని అంశాలు గుర్తించండి.

ఎ) బెంగాల్, బిహార్‌లలో లక్ష పాఠశాలలు ఉన్నాయి.

బి) ఒక్కో పాఠశాలలో 20 కంటే తక్కువ, 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు.

సి) పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల సంఖ్య 20 లక్షలకు పైగా ఉంది.

డి) ఈ విద్యా సంస్థలను సంపన్నులు లేదా స్థానిక సమాజం స్థాపించాయి.

1) ఎ, బి, సి, డి      2) బి, సి, డి     3) ఎ, బి, డి         4) ఎ, బి, సి


28. ఫ్రాంకోయిస్‌ సోల్విన్‌ ఏ దేశానికి చెందినవారు?

1) ఇంగ్లండ్‌         2) ఫ్రాన్స్‌    

3) డచ్‌         4) డెన్మార్క్‌


29. బొంబాయిలో విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తి నింపడానికి 1908, జనవరి 15న ప్రసంగించినవారు?

1) అరవింద ఘోష్‌           2) బాలగంగాధర్‌ తిలక్‌    

3) బిపిన్‌ చంద్రపాల్‌      4) లాలా లజపతి రాయ్‌


30. ‘వలసవాద విద్య భారతీయుల్లో న్యూనతాభావాన్ని సృష్టించింది’ అని అన్నదెవరు?

1) రవీంద్రనాథ్‌ ఠాకుర్‌       2) బాలగంగాధర్‌ తిలక్‌     

3) గాంధీజీ             4) సుభాష్‌ చంద్రబోస్‌


31. భారతీయుల ఘనతను, ఆత్మ గౌరవాన్ని కాపాడే విద్యను కోరుకున్నవారు?

1) గాంధీజీ         2) ఠాకుర్‌    

3) అరబింద ఘోష్‌        4) సుభాష్‌ చంద్రబోస్‌


32. కిందివాటిలో పాశ్చాత్య విద్య గురించి మహాత్మా గాంధీ అభిప్రాయం కానిది-

1) బోధనామాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలి.

2) ఆంగ్లంలో విద్య భారతీయులను కుంగదీసింది.

3) పాశ్చాత్య విద్య మౌఖిక జ్ఞానం కంటే చదవడం, రాయడం పైనే అధిక దృష్టి సారించింది.

4) పాశ్చాత్య విద్య నిజజీవిత అనుభవాలు, ఆచరణాత్మక జ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది.


33.    రవీంద్రనాథ్‌ ఠాకుర్‌ శాంతినికేతన్‌ను ఎప్పుడు స్థాపించారు?

1) 1901  2) 1902  3) 1903   4) 1905


34. ‘సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక   అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది’ అని అన్నది?

1) గాంధీజీ         2) ఠాకుర్‌    

3) గోపాలకృష్ణ గోఖలే      4) అరవింద ఘోష్‌


35. విద్యా చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం?

1) 1870   2) 1880   3) 1890  4) 1780


36. రగ్బి అనే ప్రైవేట్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసినవారు?

1) థామస్‌ జాఫర్‌             2) థామస్‌ ఆర్నాల్డ్‌

3) థామస్‌ గిబ్స్‌        4) థామస్‌ మన్రో

 

సమాధానాలు

1-1, 2-3, 3-4, 4-3, 5-3, 6-4, 7-2, 8-2, 9-3, 10-2, 11-1, 12-4, 13-2, 14-3, 15-3, 16-3, 17-3, 18-2, 19-4, 20-3, 21-4, 22-4, 23-3, 24-2, 25-3, 26-4, 27-1, 28-3, 29-1, 30-3, 31-1, 32-4, 33-1, 34-2, 35-1, 36-2.  

Posted Date : 31-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు

భూమి దున్నడం ప్రకృతి విరుద్ధం.. నేరం!

ఆదిమ జీవనం నుంచి స్థిర జీవనానికి మారే   పరిణామ క్రమంలో మనిషి, మొదట జంతువులను మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత వ్యవసాయం చేశాడు. ఆ విధంగా పశుపోషణను ప్రధాన వృత్తిగా, జీవనాధారంగా మలచుకున్న జాతులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఆధునిక యుగంలో ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వలస పాలన ప్రారంభమైన తర్వాత వీరికి కష్టకాలం వచ్చింది. అప్పటి వరకు అడవుల్లో, మైదానాల్లో, స్వేచ్ఛగా, ఎలాంటి హద్దులు లేకుండా సంచార జాతులుగా సాగుతున్న వీరి జీవనంపై నియంత్రణలు మొదలయ్యాయి. సాగు భూములు పెంచి పన్నులు రాబట్టుకునే చట్టాల కారణంగా మేత భూములు తగ్గాయి. దీంతో పశుపోషకులు చాలా వరకు వ్యవసాయదారులుగా మారారు. ఈ అంశాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. వివిధ ఖండాల్లో ప్రధాన పశుపోషక జాతులు, వారి విశ్వాసాలు, జీవన విధానం, మన దేశంలో రాష్ట్రాల వారీగా పశుపోషణ ప్రధానాధార జాతులు, వాటి ప్రత్యేకతలను తెలుసుకోవాలి.


1. పర్వత ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయళ్లను ఏమంటారు?

1) గద్వాల్‌     2) గడ్వాల్‌    

3) బుగ్వాల్‌     4) పైవన్నీ


2. జమ్ము-కశ్మీర్‌లోని గిరిజన జాతులు ప్రధానంగా....

1) గుజ్జర్‌ బకర్వాల్‌     2) కోలు    

3)  గోండ్‌     4) లంబాడి


3. కశ్మీర్‌కు చెందిన పశుపోషకులు ఏ పేరుతో సమూహాలుగా ఏర్పడి ప్రయాణం సాగిస్తారు?

1)  కపిల     2) గద్వాల్‌    

3) కానుగ     4) పైవన్నీ


4. హిమాచల్‌ ప్రాంతానికి చెందిన ‘గడ్డి పోషకులు’ (పశు పోషకులు) ఏప్రిల్‌లో ఎక్కడ విడిది చేసేవారు?

1)  లాహుల్‌     2) స్పితి    

3) 1, 2    4) లాహూర్‌


5. గడ్వాల్, కుమయాన్‌ ప్రాంతాల్లోని గుజ్జర్‌లు శీతాకాలంలో ఏ శుష్క అటవీ ప్రాంతాలకు వలస వెళ్లేవారు?

1)  బాబర్‌  2) ఖాదర్‌  3) టెరాయి  4) బుగ్వాల్‌


6. కులు ప్రాంతంలోని ‘గడ్డీలు’ వేటిని మేపుతారు?

1)  గొర్రెలు     2)  ఆవులు    

3) పందులు     4) గాడిదలు


7. ధంగర్లు ఏ రాష్ట్రానికి చెందిన పశుపోషక జాతి?

1)  రాజస్థాన్‌     2) గుజరాత్‌    

3) మహారాష్ట్ర     4) ఆంధ్రప్రదేశ్‌


8. ధంగర్లు సాధారణంగా ఏ పనులు చేస్తారు?

1)  గొర్రెల కాపరులు     2) కంబళ్లు నేస్తారు

3) గేదెలను పెంచుతారు     4) పైవన్నీ


9. మహారాష్ట్రలోని ధంగర్లు జొన్న పంట కోత తరువాత ఏ తీరానికి వలస వెళతారు?

1)  కెనరా తీరం         2) కొంకణ్‌ తీరం

3) మలబార్‌ తీరం      4) కచ్‌ తీరం


10. కిందివాటిలో సరైనవి?

ఎ) ఖరీఫ్‌ - వర్షాకాలపు పంట. సెప్టెంబరు, అక్టోబరుల మధ్య కోతకు వస్తుంది.

బి) రబీ - వసంతకాలపు పంట. మార్చి తరువాత కోతకు వస్తుంది.

1) ఎ, బి లు సరైనవి     2) ఎ సరైంది, బి సరికాదు

3) ఎ, బి లు సరికావు    4) ఎ సరికాదు, బి సరైంది


11. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని పశుపోషకులను గుర్తించండి.

1) గొల్ల   2) కురుమ  3) కురుబ  4) పైవన్నీ


12. బంజారాలు ఏ రాష్ట్రాల్లోని పశుపోషక సమాజం?

1) ఉత్తర్‌ప్రదేశ్‌     2) పంజాబ్, రాజస్థాన్‌

3) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర   4) పైవన్నీ


13. ‘రైకాలు’ నివసించే ప్రాంతం?

1) రాజస్థాన్‌     2) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర    

3) గుజరాత్‌     4) పైవన్నీ


14. 19 వ శతాబ్దం తొలినాళ్లలో మైసూర్‌లోని గొల్లలను కలిసిన బుచనన్‌ రాసిన అంశంలో సరైంది గుర్తించండి.

ఎ) గొల్లలు అడవులకు దగ్గరగా ఉన్న చిన్న గ్రామాల్లో నివసిస్తున్నారు.

బి) కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ పాల ఉత్పత్తులను దగ్గరలోని పట్టణాల్లో అమ్ముతారు.

సి) సాధారణంగా ప్రతి కుటుంబంలో 7 నుంచి 8 మంది యువకులు ఉంటారు.

డి) యువకుల్లో కొందరు పశువులను మేతకు తీసుకెళ్లేవారు.

1) ఎ, బి, సి, డి    2) ఎ, బి, డి సరైనవి

3) ఎ, బి, సి సరైనవి    4) ఎ, డి సరైనవి


15. పశ్చిమ రాజస్థాన్‌ బాలోత్ర సంతలో ఏం అమ్ముతారు?

1) ఒంటెలు     2) గుర్రాలు    

3) గాడిదలు     4) 1, 2


16. ‘‘పశువుల మేతకు ఉపయోగపడే అడవులు ఏ ఇతర పనులకు ఉపయోగపడవు. కలప, ఇంధనం లాంటి శాస్త్రీయ ఉత్పత్తులు లభించవు.’’ అని అన్నవారు?

1) హెచ్‌.ఎస్‌.డాల్టన్‌     2) హెచ్‌.ఎస్‌.గిబ్సన్‌

3) హెచ్‌.టి.కోల్‌బ్రూక్‌     4) డెట్రిచ్‌


17. వలస పాలన పశుపోషకుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది?

ఎ) వలస ప్రభుత్వం పచ్చిక బయళ్లను వ్యవసాయ భూములుగా మార్చడం.

బి) 19వ శతాబ్దం మధ్యకాలానికి అటవీ చట్టాలు అమల్లోకి తీసుకురావడం.

సి) చేతివృత్తులు, పశుపోషకుల పట్ల ప్రభుత్వం అపనమ్మకం.

డి) ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం వీలైనన్ని పన్నులు విధించడం.

1) ఎ, బి, సి    2) బి, సి, డి    

3) ఎ, సి, డి    4) ఎ, బి, సి, డి


18. వలస తెగల చట్టాన్ని భారతదేశం ఎప్పుడు ఆమోదించింది?

1) 1871  2) 1872  3) 1873  4) 1875


19. కిందివాటిని జత చేయండి. 

రాష్ట్రం       గిరిజన జాతి

1)మహారాష్ట్ర    ఎ) డాంగ్రాలు

2) మధ్యప్రదేశ్‌    బి) బంజారాలు

3) ఆంధ్రప్రదేశ్‌    సి) కురుమ

4) గుజరాత్‌    డి) మాల్దారీలు

1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి 

2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 

4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ


20. వలసవాద ప్రభుత్వం చేసిన చట్టాలతో పశుపోషకులు ఎలా మారారు?

ఎ) పశువుల సంఖ్యను తగ్గించుకున్నారు.

బి) కొందరు పశుపోషకులు కొత్త పచ్చిక బయళ్లు వెతుక్కున్నారు.

సి) ధనవంతులైన పశుపోషకులు భూములు కొనుగోలు చేసి స్థిర జీవనానికి మారారు.

డి) కొందరు పశుపోషకులు భూమిని సాగు చేస్తూ వ్యవసాయదారులుగా మారారు.

1) ఎ, సి, డి సరైనవి    2) ఎ, బి, సి సరైనవి

3) ఎ, బి, సి, డి సరైనవి    4) ఎ, బి, డి సరైనవి


21. ప్రపంచంలో సగం పశుపోషక జనాభా నివసించే ఖండం?

1) ఆసియా    2) ఆఫ్రికా    

3) దక్షిణ అమెరికా    4) ఆస్ట్రేలియా


22. ఆఫ్రికాలోని పశుపోషక సమాజంవారు?

1) బిడౌన్లు, బెర్బర్లు    2) మసాయి, సోమాలి

3) బోరాన్, టర్కానా    4) పైవన్నీ


23. ‘భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధం, నేరం’ అని భావించే జాతి?

1) మసాయి     2) సోమాలి 

3) బెర్బర్లు     4) పైవారంతా


24. మసాయి తెగ వారు ప్రధానంగా నివసించే ప్రాంతాలు?

1) దక్షిణ కెన్యా    2) టాంజానియా    3) 1, 2    4) ఏదీకాదు


25. వలస చట్టాలు ఆఫ్రికాలోని ప్రజలను ప్రభావితం చేసిన విధానాన్ని గుర్తించండి.

1) మేత భూమి అంతమైంది

2) సరిహద్దులను మూసేశారు

3) పచ్చిక బయళ్లు ఎండిపోయాయి   

4) పైవన్నీ


26. వలస పాలనకు ముందు మసాయి తెగవారి భూములు ఎక్కడ విస్తరించాయి?

1) దక్షిణ కెన్యా నుంచి ఉత్తర టాంజానియా వరకు

2) ఉత్తర కెన్యా నుంచి ఉత్తర టాంజానియా వరకు

3) ఉత్తర కెన్యా నుంచి దక్షిణ టాంజానియా వరకు

4) తూర్పు కెన్యా నుంచి తూర్పు టాంజానియా వరకు


27. ఆఫ్రికాలో 1885లో ఏర్పడిన అంతర్జాతీయ సరిహద్దులు?

1) బ్రిటిష్‌ - కెన్యా      2) బర్మన్‌ - టంగ్వానిక 

3) 1, 2      4) బ్రిటిష్‌ - ఆఫ్రికా


28. టాంజానియా బ్రిటిష్‌ ఆధీనంలోకి ఎప్పుడు వచ్చింది?

1) 1917    2) 1919    3) 1918   4) 1920


29. సంబూరు జాతీయ ఉద్యానవనం, సెరెంగెటి ఉద్యానవనం ఉన్న ప్రాంతాలు వరుసగా?

1) టాంజానియా, కెన్యా    2) కెన్యా, టాంజానియా

3) ఉగాండా, కెన్యా    4) టాంజానియా, ఉగాండా


30. మా-సాయి (మసాయి) అంటే?

1) దేశ ప్రజలు      2) నా ప్రజలు  

3) గ్రామ ప్రజలు     4) అందరూ


31. ‘కావోకారాండ్‌’ అనే గిరిజన జాతి ఉన్న ప్రాంతాలు?

1) నమీబియా      2) నైరుతి ఆఫ్రికా 

3) 1, 2      4) దక్షిణ ఆఫ్రికా


32. ఆఫ్రికా ప్రజలను వలస పాలకులు ఏ శతాబ్దం నుంచి నియంత్రించారు?

1) 17వ   2) 18వ   3) 19వ   4) 20వ


33. భారతదేశంలో వలస ప్రభుత్వం నేరస్థ తెగల చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది?

1) 1873   2) 1871  3) 1901  4) 1842


34. ప్రపంచంలోనే సగం పశుపోషక జనాభా నివసించే ఖండం?

1) ఆసియా      2) ఆఫ్రికా   

3) దక్షిణ అమెరికా    4) ఆస్ట్రేలియా


35. మసాయి తెగ ఏ పర్వతాల్లో జీవనం సాగిస్తుంది?

1) ఆల్ఫేన్స్‌      

2) హిమాలయ పర్వతాలు  

3) రాకీ పర్వతాలు, కిలిమంజారో పర్వతాలు  

4) యూరల్‌ పర్వతాలు 


36. సంబూర జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది?

1) మధ్య ఆసియా    2) దక్షిణ ఆఫ్రికా 

3) కెన్యా      4) టాంజానియా


37. పర్యాటక రంగం నుంచి గత ఏడాది 240 మిలియన్లు కెన్యా షిల్లింగుల ఆదాయాన్ని పొందిన జాతీయ ఉద్యానవనం?

1) పంచ్‌ మర్ష    2) గ్రేట్‌ నికోబార్‌ 

3) కాలిడో     4) అంబొగ్సాలి


38. 19వ శతాబ్దంలో తూర్పు ఆఫ్రికాలోని బ్రిటిష్‌ వలస పాలకులు వ్యవసాయాన్ని విస్తరించే దిశగా ఏ సమూహాలను ప్రోత్సహించారు?

1) అటవిక సమూహాలను      

2) ఝూం వ్యవసాయదారులను  

3) స్థానిక రైతుల సమూహాలను 

4) గ్రామాధికారులు


39. భారతీయ వ్యవసాయానికి సంబంధించిన కమిషన్‌ నివేదిక? రచయిత: గద్దె నరసింహారావు

ఎ) హెచ్‌.ఎస్‌. గిబ్బన్‌ నివేదిక

బి) రాయల్‌ కమిషన్‌ నివేదిక

1) ఎ సరైంది, బి సరికాదు    

2) ఎ, బి సరికావు

3) బి మాత్రమే సరైంది    

4) బి సరికాదు


సమాధానాలు

1-3, 2-1, 3-1, 4-3, 5-1, 6-1, 7-3, 8-4, 9-2, 10-1, 11-4, 12-4, 13-1, 14-1, 15-4, 16-2, 17-4, 18-1, 19-3, 20-3, 21-2, 22-4, 23-1, 24-3, 25-4, 26-2, 27-3, 28-2, 29-2, 30-2, 31-3, 32-3, 33-2, 34-2, 35-3, 36-3, 37-4, 38-3, 39-3.


 

Posted Date : 13-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రుగ్వేద, మలివేద యుగాలు

ఆర్య జీవన వేదం.. భారత సంస్కృతీ సౌధం!

 

 

గ్రామీణ జీవనం, ప్రకృతి ఆరాధన, వృత్తి ఆధారిత వర్ణాలు, సరళమైన ఆచారాలతో రుగ్వేద కాలం సాగింది. దురాచారాలు లేవు. వితంతు వివక్ష లేదు. వివాహం పవిత్రంగా ఉండేది. ఏకపత్నీవ్రతాన్ని ఆచరించారు. స్త్రీలకు పురుషులతో సమాన గౌరవం ఉంది. కానీ మలివేద కాలానికి విరుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్ణం దృఢమైన గోడగా మారిపోయింది. బాల్య వివాహాలు, బహుభార్యత్వం ప్రబలిపోయాయి. నిర్దిష్ట మతవిధానం రూపొందింది. అంతిమంగా ఆనాటి సమాజాల్లోని బహుముఖ దృక్పథాలు మిళితమై, సమున్నత భారతీయ సంస్కృతి ఆవిర్భవించింది. ఈ అంశాలు, పరిణామాలపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 



రుగ్వేద, మలివేద యుగాలు


క్రీ.పూ. 1500 నుంచి 600 వరకు వర్ధిల్లిన ఆర్య నాగరికత, సంస్కృతుల ప్రతిష్ఠాపనాకాలం ఒక సుదీర్ఘ ప్రయాణంగా సాగింది. కొన్ని పరిణామాల దృష్ట్యా ఈ యుగాన్ని రుగ్వేద, మలివేద కాలాలుగా అధ్యయనం చేస్తారు. రుగ్వేద ఆర్యులు ప్రధానంగా పశుపోషణపై ఆధారపడిన సంచారజీవులు. మలివేద ఆర్యులు ఉత్తర భారతదేశంలో వ్యవసాయం చేపట్టి, స్థిరజీవనం ఏర్పరుచుకున్నారు. రెండు దశల్లో వారు సంచరించిన భౌగోళిక ప్రాంతాల్లో, రాజకీయ, సామాజిక, ఆర్థిక మత విశ్వాసాల్లో గొప్ప భిన్నత్వం ఉన్నప్పటికీ వారి సంస్కృతి, నాగరికత, జీవన విలువలు రెండు దశల్లోనూ ఒకే విధంగా ఉన్నాయి.


ఆర్యులు సంచరించిన భౌగోళిక ప్రాంతాలు:   ఆర్యులు సంచరించిన ప్రాంతాన్ని ‘సప్త సింధు ప్రాంతం’గా రుగ్వేదం పేర్కొంది. అది సింధు నది, దాని ఉపనదులు, సరస్వతి నదుల పరీవాహక ప్రాంతం. ఆధునిక అఫ్గానిస్థాన్‌లోని తూర్పు ప్రాంతం, భారత్, పాకిస్థాన్‌లలో విస్తరించిన పంజాబ్, హరియాణాలను సప్త సింధు ప్రాంతంగా చరిత్రకారులు నిర్ణయించారు. రుగ్వేద అనంతర వేదసాహిత్యం ప్రకారం ఆర్యులు తూర్పు వైపు ప్రయాణించి గంగా యమునా మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ ‘ఆర్యావర్తం’లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. నేటి తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తర బిహార్‌ ప్రాంతాలే నాటి ఆర్యావర్తం అని చరిత్రకారులు నిర్ధారించారు.


వేదకాలం నాటి రాజకీయ పరిస్థితులు:  రుగ్వేద రాజ్యానికి మూలం పితృక్రమానుగత కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబ పెద్దను ‘కులాపా’ అని పిలిచారు. అనేక కుటుంబాలు ఒక గ్రామం. అనేక గ్రామాలు ఒక ‘విస్‌’. అనేక విస్‌లు కలిసి ఒక ‘జన’ అంటే తెగ లేదా సమూహం ఏర్పడింది. దీనికి ‘రాజన్‌’ అధిపతిగా ఉండి ధర్మకర్తగా విధులు నిర్వర్తించేవాడు. అతడికి సహాయం చేసేందుకు పురోహిత, సేనాని, గ్రామిణి ఉండేవారు. ఆర్య తెగల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. ‘పరుషిణి’ నది ఒడ్డున ఆర్య తెగల మధ్య జరిగిన ‘దశరాజ గణ యుద్ధం’ను రుగ్వేదం ప్రస్తావించింది. తెగ రక్షణ, తెగ సంపద అయిన గోవుల రక్షణ, తెగ సంక్షేమం కోసం మత విధులు నిర్వర్తించడం రాజన్‌ విధులు. రాజన్‌ అధికారాలను నియంత్రించడానికి సభ, సమితి, విధాత, గణ అనే ప్రజాసభలు ఉండేవి. ఆనాటికి వ్యవస్థీకృత పన్నుల విధానం లేదు. రాజన్‌ విధుల నిర్వహణకు తెగలోని ప్రజలు ‘బాలి’ అనే స్వచ్ఛంద పన్ను చెల్లించేవారు.


క్రీ.పూ.900 నాటికి ఇనుము వాడకం మొదలవడం ఈ మహాప్రస్థానంలో ముఖ్య పరిణామం. ఈ లోహ పరిజ్ఞానం ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలపై పెద్ద ప్రభావం చూపింది. దృఢమైన ఇనుప పనిముట్లతో అడవులు నరికి అధిక భూమిని సాగులోకి తెచ్చారు. దీంతో అధికోత్పత్తి జరిగి, మిగులు ఉత్పత్తి వాణిజ్యానికి దారితీసింది. వ్యాపార కూడళ్లు ఏర్పడి పట్టణాలుగా అభివృద్ధి చెందాయి. రాజన్‌ పన్నులు (భాగ) విధించడం ప్రారంభించడంతో అతడి వద్ద సంపద పెరిగింది. దాంతో సైన్యాన్ని, ఉద్యోగ బృందాన్ని పెంచాడు. మలి వేదకాలం సాహిత్యం రత్నిన్‌లు (మంత్రులు), భాగ దూగ (పన్నులు వసూలుచేసే అధికారి), సంగ్రహిత్రి (కోశాధికారి) లాంటి అనేక ఉద్యోగులను ప్రస్తావించింది. వ్యవసాయం అభివృద్ధి చెంది ఆర్యులు స్థిరనివాసం ఏర్పరచుకోవడంతో భూమితో అనుబంధం పెరిగింది. భూమి కోసం ఆర్య, ఆర్యేతర తెగల మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి. రాజు అశ్వమేధ, అనారంభ, వాజపేయి మొదలైన విస్తృత క్రతువులు నిర్వహించేవాడు. రాజు అధికారాలు పెరిగి ప్రజాసభలు నియంత్రణ కోల్పోయాయి. రాజ్యాలు పెద్దవి కావడంతో ప్రాంతీయ పాలన ప్రారంభమైంది. ఆ విధంగా రుగ్వేదకాలం నాటి తెగల రాజకీయ వ్యవస్థ, మలివేద కాలానికి గొప్ప రాచరిక వ్యవస్థగా మారింది.


సామాజిక పరిస్థితులు:  పితృక్రమానుగత కుటుంబవ్యవస్థ ఆర్య సమాజానికి మూలం. గోధుమ, బార్లీ, పాలు, పాలతో చేసిన పదార్థాలు, మాంసం, చేపలు ప్రజల ముఖ్య ఆహారాలు. నూలు, ఉన్నితో చేసిన వస్త్రాలను, వివిధ రకాల ఆభరణాలను ధరించేవారు. వివాహాన్ని పవిత్ర బంధంగా భావించేవారు. ప్రజలు సాధారణంగా ఏకపత్నీవ్రతులు. వితంతు వివాహాలను నిషేధించలేదు. పరదా వ్యవస్థ, బాల్యవివాహాలు, సతి వంటి దురాచారాలు లేవు. పురుషుడితో సమానంగా స్త్రీ నాటి ప్రజాసభల కార్యకలాపాల్లో పాల్గొనేది. స్త్రీలలో గొప్ప పండితులు ఉండేవారు. ఆపాల, విశ్వవర, ఘోష వంటి స్త్రీలు రుగ్వేదంలోని కొన్ని శ్లోకాలను సంకలనం చేశారు. రుగ్వేద ఆర్యులు నిరక్షరాస్యులు. ఆ కాలం నాటికి లిపి ఏర్పడలేదు. రుగ్వేద కాలంలో వృత్తి ప్రాతిపదికగా ఆర్య సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలతో కూడిన చాతుర్వర్ణ వ్యవస్థగా ఏర్పడింది. వృత్తి, వర్ణం మార్చుకునే వెసులుబాటు ఉండేది. అయితే మలివేద కాలం నాటికి చాతుర్వర్ణ వ్యవస్థ దృఢమైన గోడలు నిర్మించుకొంది. వర్ణం అనువంశికంగా మారింది. రుగ్వేద కాలంలో వృత్తికి వర్ణాన్ని నిర్ణయించగా, మలివేదకాలంలో పుట్టుక వర్ణాన్ని నిర్ణయించింది. మొదటి మూడు వర్ణాలను ‘ద్విజులు’గా పిలిచేవారు. వీరికి విద్యాభ్యాసానికి ముందు ఉపనయన ప్రక్రియ ఉంటుంది. వేద అభ్యసనమే నాటి ప్రధాన విద్య. ఇది ద్విజులకే పరిమితం. బాల్య వివాహాలు, పర్దా వ్యవస్థ, బహు భార్యత్వం వంటి ఆచారాలు అధికమయ్యాయి. వితంతు వివాహాలను నిరాకరించారు. రాజకీయ, ప్రజాసభల్లో స్త్రీ స్థానం కోల్పోయింది. వేదసాహిత్యం ఎనిమిది రకాల వివాహాలను గుర్తించి అందులో బ్రహ్మ, ప్రజాపత్య, దైవ, అర్స వివాహాలను ఆమోదించింది. అసుర, గాంధర్వ, రాక్షస, పైశాచిక వివాహాలను తిరస్కరించింది. తెగల జీవన విధానం మలివేదకాలం చివరినాటికి సంక్లిష్ట వర్ణవ్యవస్థగా మారిపోయింది.


ఆర్థిక పరిస్థితులు: రుగ్వేద ఆర్యులు ప్రధానంగా గ్రామీణ జీవితం గడిపారు. ముఖ్య వృత్తి పశుపోషణ. వ్యవసాయం కూడా చేసేవారు. గోవులు వారి సంపద. ఆవు, ఎద్దు, గుర్రం, గాడిద, కుక్క వంటి జంతువులను మచ్చిక చేసుకున్నారు. వడ్రంగం, చర్మకార, చేనేత, లోహపు పనులు వృత్తులుగా మారాయి. ప్రధానంగా కుండలు, ఆయుధాలు, రథాలు చేసేవారు. రుగ్వేద కాలంలో వ్యవసాయం పరిమితంగా ఉండేది. గోధుమ, బార్లీ ప్రధాన పంటలు. నువ్వులు, పత్తి కూడా పండించేవారు. ఆనాటి వ్యాపారాన్ని అనార్య జాతుల వారు నిర్వహించేవారు. వస్తుమార్పిడి విధానం అనుసరించేవారు. గోవు కూడా ద్రవ్య యూనిట్‌గా చెలామణి అయ్యేది. వెండి, బంగారం వంటి లోహాలను ‘ఆయాస్‌’ అని పిలిచేవారు. గుర్రాలు, ఎడ్ల బళ్లు, ఎద్దులు రవాణా సాధనాలు. మలివేద కాలంలో గోధుమ, బార్లీతో పాటు వరి కూడా ప్రధాన పంటగా మారింది. లోహ పరిజ్ఞానం పెరిగి ఇనుము వాడకం ఎక్కువైంది. వ్యవసాయాభివృద్ధి జరిగి ఆర్యులు, సంచార జీవితం వదిలి స్థిర జీవనానికి అలవాటు పడ్డారు. వ్యాపారాభివృద్ధితో అనేక వృత్తులు ఏర్పడి పట్టణాలు వెలిశాయి (హస్తినాపురం, అహిచ్ఛత్రం, తక్షశిల, కౌశాంబి మొదలైనవి).


మత పరిస్థితులు: రుగ్వేద ఆర్యులు ప్రకృతి శక్తులకు దైవత్వాన్ని ఆపాదించి ప్రార్థించారు. ఆ కాలంలో 33 మంది దేవతలను ఆరాధించారు. వీరిని రుగ్వేదం అంతరిక్ష దేవతలు (సూర్య, వరుణ), వాతావరణ దేవతలు (ఇంద్ర, రుద్ర), భూలోక దేవతలు (అగ్ని, పృథ్వి)గా వర్ణించింది. రుగ్వేద  దేవతల్లో ముఖ్యులు ఇంద్రుడు, అగ్ని, సోమ. ఈ కాలం నాటికి విగ్రహారాధన, ఆలయాలు లేవు. తొలి ఆర్యులు సంపద (గోవులు), సంతానం, ఆరోగ్యం కోసం భగవంతుడిని ప్రార్థించారు. వీరి ఆరాధనలో ప్రార్థనలు, క్రతువులు ముఖ్య భాగం. ప్రకృతి శక్తుల ఆరాధనతో కూడిన సరళమైన మతవిధానం ఉండేది. మలివేద కాలంలో ఆర్యుల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు మత పరిస్థితులను ప్రభావితం చేశాయి. ఇంద్రుడు, అగ్ని, సోమ వంటి రుగ్వేద దేవతల స్థానంలో త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) ప్రాధాన్యం పెరిగింది. క్రతువులు, యాగాలు, యజ్ఞాలు, కర్మకాండలు పెరిగాయి. గృహస్థు ఆచరించే సరళమైన ప్రార్థనల్లో సంక్లిష్ట తంతు ప్రవేశించింది. పురోహిత వర్గం ప్రాముఖ్యం పెరిగింది. మరణం తర్వాత ఏమిటనే ఆసక్తి పెరిగింది. ఆత్మ, పరమాత్మ, కర్మ, జన్మ, పునర్జన్మ వంటి విషయాలు ఆర్యుల ఆలోచనల్లో ప్రముఖ స్థానం ఆక్రమించాయి.  మోక్ష సాధన జీవిత లక్ష్యం అయ్యింది. దానిని సాధించడానికి కర్మ, తపస్య, జ్ఞాన మార్గాలు ఏర్పడ్డాయి. మలివేద కాల తత్వచింతన ‘షడ్దర్శనాలు’గా రూపొందింది. అవి 1) సాంఖ్య (స్థాపకుడు - కపిల) 2) యోగ (పతంజలి) 3) న్యాయ (గౌతమ) 4) వైశేషిక (కణాద) 5) పూర్వ మీమాంస (జైమిని) 6) ఉత్తర మీమాంస (బాదరాయణ). షడ్డర్శనాలు భారతీయ తత్వశాస్త్రానికి పునాదులు.

 


ప్రకృతి ఆరాధనతో కూడిన రుగ్వేద ఆర్యుల మత విధానం మలివేదకాలం చివరి నాటికి విభిన్న దృక్పథాలతో కూడిన ఒక నిర్దిష్ట మత విధానంగా పరిణామం చెందింది. భిన్న సంస్కృతీ స్రవంతులు, బహుముఖ దృక్పథాలు మిళితమై భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మహోన్నత భారతీయ సంస్కృతికి పునాదులు పడ్డాయి.

 ‘‘రుగ్వేద కాలంలో వృత్తి ప్రాతిపదికగా వర్ణాలు ఉండేవి. వృత్తిని, వర్ణాన్ని మార్చుకునే వెసులుబాటు ఉండేది.’’

‘‘మలివేద కాలం నాటికి చాతుర్వర్ణ వ్యవస్థ దృఢమైన గోడలను నిర్మించుకుంది. వర్ణం అనువంశికంగా మారింది. పుట్టుక వర్ణాన్ని నిర్ణయించింది.’’

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 14-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

క్రీ.పూ. ఆరో శతాబ్దంలో భిన్న మతాల ఆవిర్భావం

(జైనమతం)

నైతిక నడవడిక  నేర్పిన ధర్మం!

 



వేదసంస్కృతి, జీవన విధానంలోని అహేతుక అంశాలను, బ్రాహ్మణాధికత్యను ప్రశ్నిస్తూ భారత గడ్డపై జైన, బౌద్ధ  మతాలు ఆవిర్భవించాయి. వర్ణవ్యవస్థను, సంక్షిష్ట మతాచారాలను నిరసించి అభ్యుదయ భావాలను, నైతిక విలువలను బోధించాయి. సామాన్యుడు ఆచరించేందుకు కష్టతరంగా ఉన్న వైదిక సంప్రదాయాలు ఎందుకంటూ ఆలోచనలు రేకెత్తించి, అందరినీ ఆకర్షించి విస్తృత జనాదరణ పొందాయి. అహింస, నైతికతతో కూడిన సరళ జీవనానికి మార్గం చూపాయి. ఆరో శతాబ్దంలో మతపరమైన అశాంతి నుంచి పుట్టిన అభ్యుదయవాదంగా ప్రసిద్ధికెక్కిన ఈ పరిణామాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. జైన మతం విస్తరించిన తీరు, భారతీయ సంస్కృతిని పరిపుష్టం చేసిన విధానంతో సహా, వర్ధమాన మహావీరుడి        త్రిరత్నాలపై సమగ్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. 

 



ప్రాచీన భారతదేశ చరిత్రలో క్రీ.పూ.ఆరో శతాబ్దం విప్లవాత్మక పరిణామాలకు నాంది పలికింది. నాటి సమాజంలో నెలకొన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు మత ఉద్యమాలకు నేపథ్యమై, తర్వాతి కాలంలో భారతీయ సమాజాన్ని ప్రగాఢంగా ప్రభావితం చేశాయి.


క్రీ.పూ. ఆరో శతాబ్దం నాటికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలతో కూడిన వర్ణవ్యవస్థ దృఢంగా మారింది. వర్ణాల మధ్య వ్యత్యాసం పెరిగిపోయింది. కులవ్యవస్థ రూపుదిద్దుకుంది. ఆర్యావర్తంలో ఆర్యగణాలు స్థిర జీవనానికి అలవాటుపడి, భూమితో అనుబంధం ఏర్పరచుకుని రాజ్యాలు స్థాపించాయి. ఆనాటి ఉత్తర భారతదేశం 16 మహాజనపదాలతో (షోడశ మహాజనపదాలు - అంగ, అవంతి, అశ్మక, చేది, గాంధార, కురు, కాశి, కాంభోజ, కోసల, మగధ, మత్య, మల్ల, పాంచాల, శూరసేన, వత్స, వజ్జి) ఉన్నట్లు ప్రాచీన మతసాహిత్యం తెలియజేస్తోంది. వీటి మధ్య ఐకమత్యం లేదు. నిరంతరం కలహించుకునేవి.


జనపదాల్లో ఉద్యోగ బృందాలు పెరిగి పాలనా వ్యవస్థ ఏర్పాటైంది. ఆర్థిక రంగంలో పెనుమార్పులు వచ్చాయి. ఇనుము ఉపయోగంలోకి రావడంతో అడవులను నరికి వ్యవసాయ యోగ్యం చేశారు. అధిక పంటలు వాణిజ్యానికి దారితీసి, వాణిజ్య కూడళ్లు ఏర్పడ్డాయి. అవి పట్టణాలు (శ్రావస్తి, కౌశంబి, వైశాలి, పాటలీపుత్రం, కాశి, అహిచ్ఛత్రం తదితరాలు)గా రూపొందాయి. దీనిని రెండో పట్టణీకరణ దశ అంటారు. వృత్తులు, వృత్తిపనివారు పెరిగారు. పాలకుడు బలవంతుడయ్యాడు. ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. వ్యాపారుల ప్రాముఖ్యత పెరిగి, శ్రేణులుగా ఏర్పడ్డారు. లిపి రూపుదిద్దుకోవడం ఆ కాలంలోనే మొదలైంది.


ఆనాటి ఉత్తర భారతదేశంలో ప్రధానంగా రెండు అంశాలు ప్రబలమయ్యాయి. ఒకటి ఆర్యగణాల మధ్య అనైక్యత. రెండోది మతపరమైన అశాంతి. క్రీ.పూ.ఆరో శతాబ్దం నాటికి వైదిక మతం సంక్లిష్టంగా మారింది. వైదిక క్రతువుల నిర్వహణ సామాన్య గృహస్థుడికి భారంగా మారింది. పురోహిత వర్గ ప్రాబల్యం, కర్మకాండలు, జంతుబలులు పెరిగాయి. సంస్కృతం/విద్య కొద్దిమందికే (ద్విజులు) అందుబాటులో ఉండేది. మోక్ష సాధన ఒక్కటే ఆర్యుల జీవిత లక్ష్యంగా మారింది. అయితే మోక్షసాధన మార్గాల (కర్మ మార్గం, తపస్య మార్గం, జ్ఞాన మార్గం) విషయంలో గందరగోళం నెలకొంది. సాంఘిక, ఆర్థిక అంతరాలు, కట్టుబాట్లు కఠినతరమయ్యాయి. వైశ్యుల ఆర్థిక పరిస్థితి మెరుగై సామాజికంగా ఉన్నతి స్థానాన్ని ఆశించారు.. క్షత్రియులు కూడా సమాజంలో బ్రాహ్మణాధిక్యతను నిరసించారు. మతం విషయంలో అశాంతి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సంస్కర్తలు ముందుకొచ్చి హేతుబద్ధమైన మోక్షమార్గాన్ని అన్వేషిస్తూ, ప్రజలకు సరళమైన మతాన్ని అందించేందుకు ప్రయత్నించారు. అనేక నూతన మతాలను స్థాపించారు. వాటిలో వర్ధమానుడు స్థాపించిన జైన మతం, సిద్ధార్థుడు స్థాపించిన బౌద్ధ మతం భారతీయ సమాజంపై ప్రగాఢ ముద్రలు వేశాయి.


జైన మతం:  జైన మతవిశ్వాసాల ప్రకారం 24 మంది తీర్థంకరులు ఈ మతాన్ని స్థాపించారు. తీర్థంకరుడు అంటే ‘జీవితం అనే నదిని దాటేందుకు వంతెన లాంటివాడు’. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు, రెండో తీర్థంకరుడు అజితనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమానుడు. చివరి ఇద్దరు చారిత్రక పురుషులు. 


23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు: క్రీ.పూ.8వ శతాబ్దంలో కాశీ రాజు అశ్వసేనుడు, రాణి విమల దంపతుల కుమారుడు. తల్లిదండ్రుల మరణాంతరం ఆయన సంసార జీవితాన్ని వదిలి, సత్యాన్వేషణ కోసం అడవులకు వెళ్లి ధ్యానం చేసి జ్ఞానం పొందాడు. తాను గ్రహించిన సత్యాలు 1) సత్య 2) అహింస 3) అస్తేయ (అనుమతి లేకుండా ఇతరుల సొత్తు పొందకపోవడం) 4) అపరిగ్రహ (అవసరానికి మించి సంపద కూడబెట్టడంపై ఆసక్తి లేకపోవడం) లను ప్రచారం చేశాడు.


24వ తీర్థంకరుడు వర్ధమానుడి తొలి జీవితం: జాంత్రిక తెగకు చెందిన రాజు సిద్ధార్థుడు, లిచ్ఛవీ వంశానికి చెందిన త్రిషాల దంపతులకు క్రీ.పూ.540వ సంవత్సరంలో కుంద గ్రామంలో వర్ధమానుడు జన్మించాడు. తన 30వ ఏట రాజప్రాసాదాన్ని వదిలి సత్యాన్వేషణలో అడవులకు వెళ్లాడు. ఆరేళ్లపాటు మక్కలి గోసల అనే సన్యాసితో సంచరించాడు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. గోసల అజ్విక మతాన్ని స్థాపించాడు. అప్పటి నుంచి ఆరేళ్లపాటు వర్ధమానుడు అడవుల్లో కఠోర ధ్యానం చేసి, రిజుపాలిక నది ఒడ్డున జృంబికా గ్రామంలో జ్ఞానం పొందాడు. తిరిగి రాజ్యానికి వచ్చి ప్రజలకు తాను గ్రహించిన విషయాలను బోధించాడు. మహాజనపదాల్లో (మగధ, మల్ల, వత్స, కోసల మొదలైనవి) పర్యటించి, ప్రజల వాడుక భాష (అర్ధ మాగధి)లో సరళంగా బోధనలు చేసి ఆకట్టుకున్నాడు. ఇతడి బిరుదులు ‘నిర్గ్రంధ’ (సకల బంధాలు తెంచుకొన్నవాడు), అరిహంత (మోక్షాన్ని పొందినవాడు), ‘జీన’ (ఇంద్రియాలను జయించినవాడు), మహావీర మొదలైనవి.


మహావీరుడి బోధనలు: 24వ తీర్థంకరుడు అయిన వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని సంస్కరించి వ్యాప్తిలోకి తెచ్చాడు. పార్శ్వనాథుడు బోధించిన సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహలను బోధిస్తూ వాటికి బ్రహ్మచర్యాన్ని జోడించాడు. ఆత్మ పరిశుద్ధంగా ఉండటం మోక్షానికి (కైవల్యం) అవసరమని బోధించాడు. ఈ విశ్వ సృష్టి వెనుక ఏ మహత్తర దైవశక్తి లేదని, అది తనంతట తానుగా ఆవిర్భవించి, నిర్వహణలో ఉన్న ఒక భౌతిక చర్య అని బోధించాడు. వేదాల సాధికారతను, మోక్ష మార్గాలుగా వైదిక సిద్ధాంతాలను తిరస్కరించాడు. సృష్టిలో ప్రతి జీవికి, అజీవికి ఆత్మలు ఉన్నాయని, వాటిని బాధిస్తే, కర్మ రూపంలో ఆత్మ తిరిగి జన్మ, పునర్జన్మ పొందుతూనే ఉంటుందని, జన్మ రాహిత్యానికి దూరమవుతుందని బోధించాడు. కఠోరమైన అహింసాచరణ ద్వారా ఆత్మను పునీతం చేసుకోవచ్చని చెప్పాడు. ఆత్మ జన్మరాహిత్య స్థితి పొందాలంటే మానవుడు మూడు క్రియలు నిర్వర్తించాలని ఉద్బోధించాడు. జైన మతంలో వీటిని ‘త్రిరత్నాలు’ అంటారు. అవి: సమ్యక్‌ విశ్వాస్‌ (తీర్థంకరులపై విశ్వాసం ఉండటం), సమ్యక్‌ జ్ఞాన్‌ (తీర్థంకరుల బోధనల పట్ల సమగ్ర అవగాహన), సమ్యక్‌ క్రియ (జైనమత పంచ మహావ్రతాలు ఆచరించడం). వీటిని ఆచరించి జన్మ రాహిత్య స్థితి అయిన ‘కేవల’ స్థితిని పొందవచ్చని ఉద్బోధించాడు. జైన మతవ్యాప్తికి సంఘాన్ని స్థాపించాడు. ఇందులో స్త్రీ, పురుషులు ఇద్దరూ సభ్యులే. అశోకుడి కాలంలో జైన మతాన్ని నిర్గ్రంధుల మతంగా వ్యవహరించేవారు. జైన మత సాహిత్యాన్ని తొలిదశలో 14 పర్వాలుగా పేర్కొన్నారు. తర్వాత ఆరో శతాబ్దిలో వల్లభిలో జరిగిన రెండో జైన సమావేశంలో పన్నెండు అంగాలుగా (ద్వాదశ) రూపొందించారు. 


జైన మతం ఎదుగుదలకు కారణాలు: వర్ధమాన మహావీరుడితో పునఃస్థాపితమైన జైన మతం కొద్దికాలానికే గొప్ప మతంగా ఎదిగింది. తొలిదశలో మహావీరుడి విలక్షణ వ్యక్తిత్వం, సరళమైన మత సిద్ధాంతాలు ప్రజలను అతడి బోధనల వైపు ఆకర్షించాయి. మహావీరుడి బోధనలను శిష్యులు (గణాచారలు) చిత్తశుద్ధితో ప్రజల్లోకి తీసుకెళ్లడం, సంస్కృతాన్ని వదిలి ప్రజల వాడుక భాషలో బోధనలు చేయడం, అనేకమంది రాజులు (చంద్రగుప్త మౌర్యుడు, కళింగ పాలకుడు చేది వంశ రాజు ఖారవేలుడు, రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు మొదలైన వారు) జైన మతాన్ని ప్రోత్సహించడంతో గొప్ప మతంగా ఎదిగింది. మహావీరుడి కాలంలో గంగా లోయ ప్రాంతానికి పరిమితమైన మతం ఆ తర్వాత మాళ్వ, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు వ్యాపించింది.


భారతీయ సంస్కృతికి జైన మత సేవ: భారతీయ పరిణామ దశలో జైనమతం అద్వితీయ పాత్ర పోషించింది. ఆ కాలం నాటికి జంతుబలులు, క్రతువులతో నిండిన వైదిక మత స్థానంలో అహింసను పరమ ధర్మంగా బోధిస్తూ, సత్యం, అస్తేయ, అపరిగ్రహ లాంటి సద్గుణాలతో కూడిన నైతిక విలువలను పెంపొందించి ఆత్మ సంస్కారం కలిగించింది. మానవ జాతి మనుగడకు అత్యవసరమైన అహింసను ఒక తత్వంగా రూపొందించింది. జైనమతం గుజరాతీ, రాజస్థానీ, మరాఠీ, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల అభివృద్ధికి తోడ్పడింది. జైనమత క్షేత్రాలైన రాజగృహ, వైశాలి, పవపురి, శ్రావణ బెళగొళ, అబూ కొండలు; ఖారవేలుడు కళింగలో నిర్మించిన ఉదయగిరి, స్కందగిరి గుహలు; మైసూరు, శ్రావణ బెళగొళ వద్ద ఉన్న బాహుబలి విగ్రహాలు జైనమత వాస్తు, శిల్పకళకు ప్రసిద్ధి. చంద్రగుప్తు మౌర్యుడి సమకాలికుడు బద్రబాహుడు రాసిన ‘కల్పసూత్ర’ గ్రంథం, కుందాచార్యుడి ‘సమయసార, ప్రవచన సార’, 12వ శతాబ్దంలో హేమచంద్రుడు రాసిన ‘పరిశిష్టపర్వం’, జినసేనుడు రాసిన ‘హరివంశ పురాణం,’ రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు రాసిన ‘కవిరాజ మార్గ, ప్రశ్నోత్తర రత్నమాలిక’ లాంటి గ్రంథాలు, పండితుల వ్యాఖ్యానాలు జైనమతానికి పరిపుష్టి చేకూర్చడమే కాకుండా, భారతీయ సంస్కృతికి నైతికతతో కూడిన నిండుతనాన్ని తెచ్చాయి.



రచయిత: వి.వి.ఎస్‌. రామావతారం 

Posted Date : 26-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  బ్రిటిష్‌ ఇండియా పాలనా వ్యవస్థ పరిణామక్రమం

ఆంగ్లేయుల పాలనలో మూడు మూలస్తంభాలు! 

వ్యాపారం కోసం భారతదేశంలో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ, ఇక్కడి సంస్థానాల అనైక్యతను, పాలకుల కలహాలను   స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. ఆధునిక ఆయుధ పాటవంతో సంస్థానాలను ఒక్కొక్కటిగా జయిస్తూ సామ్రాజ్యాన్ని విస్తరించింది. బెంగాల్‌తో మొదలుపెట్టి మొత్తం భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకుంది. ఈ క్రమంలో బ్రిటిష్‌ కంపెనీకి, ఆ తర్వాత బ్రిటిష్‌ రాణికి పాలనలో సహకరించిన ముఖ్యమైన మూడు మూలస్తంభాల వంటి సివిల్‌ సర్వీసులు, సైన్యం, పోలీసు వ్యవస్థల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వాటిని రూపొందించిన విధానం, అందులో క్రమానుగతంగా చేసిన మార్పులు, వలస దోపిడీ నిరాటంకంగా కొనసాగేందుకు కారణమైన స్థానిక పరిస్థితులతో పాటు భారతీయ ఉద్యోగులతోనే భారత ప్రజలను నియంత్రించి, దోచుకున్న తీరును అర్థం చేసుకోవాలి.


ఇంగ్లిష్‌ ఈస్టిండియా కంపెనీ చరిత్రలో ప్లాసీ, బక్సర్‌ యుద్ధాలు మైలురాళ్లు. కంపెనీ 1757లో బెంగాల్‌ నవాబు సిరాజ్‌ ఉద్‌-దౌలాతో ప్లాసీ యుద్ధం చేసింది. ఆ తర్వాత 1764లో స్థానిక రాజ్యాల సమాఖ్యతో అంటే మొగల్‌ చక్రవర్తి రెండో షా ఆలం, అయోధ్య (అవధ్‌) నవాబు షుజా ఉద్‌-దౌలా, మీర్‌ ఖాసీంతో బక్సర్‌ యుద్ధంలో తలపడింది. ఈ విజయాల అనంతరం షా ఆలం, షుజాలతో కంపెనీ కుదుర్చుకున్న అలహాబాదు సంధి (1765) భారతదేశంలో ఇంగ్లిష్‌ కంపెనీ స్వరూప స్వభావాలను సమూలంగా మార్చేసింది. బెంగాల్‌లో రాజ్యాధికారాన్ని స్థాపించడానికి ముందు కంపెనీ భారతదేశంలో ఒక వ్యాపార సంస్థ మాత్రమే. బక్సర్‌ యుద్ధం తర్వాత కంపెనీ బెంగాల్‌ ప్రాంతంలో రాజకీయాధికారాన్ని చేపట్టింది. దీనితోనే భారతదేశంలో సామ్రాజ్యవాద చరిత్రకు శ్రీకారం చుట్టింది. బెంగాల్‌లో సాగించిన విచ్చలవిడి దోపిడీ సొమ్మును ఈ దేశపు సంస్థానాలను జయించడానికి వినియోగించి అచిరకాలంలోనే సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఆ విధంగా జయించిన ప్రాంతాల పరిపాలన నిర్వహణ కోసం ఉద్యోగ బృందాన్ని నియమించుకోవాల్సిన అవసరం ఇంగ్లిష్‌ కంపెనీకి ఏర్పడింది. 1757-1857 మధ్య కాలంలో కంపెనీ లాభాలను వృద్ధి చేసుకుంటూ, సామ్రాజ్యవాదాన్ని అమలుపరుస్తూ అధికారాన్ని మరింత పటిష్టం చేసుకుంది. వందేళ్లలో కంపెనీ ప్రభుత్వ పరిపాలనా విధానం తరచూ మార్పులకు గురైంది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో బ్రిటిష్‌ మహారాణి కంపెనీ పాలనను రద్దు చేసి భారతదేశ పాలనా బాధ్యతలను నేరుగా చేపట్టింది. మహారాణి పాలనలో భారతదేశ పాలనావ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆంగ్లేయుల పరిపాలనా సౌధానికి 


1) సివిల్‌ సర్వీసులు (సైనికేతర ప్రభుత్వ శాఖలు) 


2) సైన్యం 


3) పోలీస్‌ వ్యవస్థలు మూడు మూల స్తంభాలుగా నిలిచాయి.

 

సివిల్‌ సర్వీసులు 


భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఇంగ్లిష్‌ కంపెనీ, ఇంగ్లండ్‌ నుంచి తక్కువ జీతంతో తెచ్చుకున్న ఉద్యోగ బృందంతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేది. ఈ ఉద్యోగులకు ప్రైవేటు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఉండేది. బక్సర్‌ యుద్ధం తరువాతి పరిణామాల వల్ల బెంగాల్‌ రాజ్యాధిపత్యం కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే ఉద్యోగ బృందమే పాలనా బాధ్యతలు కూడా చూసేది. అప్పటికే కంపెనీ అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ రెగ్యులేటింగ్‌ చట్టం-1773 ద్వారా ఉద్యోగుల అవినీతిని నివారించడానికి ప్రయత్నం చేసినా, కొంతవరకే సఫలీకృతుడయ్యాడు. భారతదేశంలో ‘సివిల్‌ సర్వీస్‌’కు మూల పురుషుడు అప్పటి బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కారన్‌ వాలీస్‌. సమర్థులైన ఆంగ్లేయులను ‘కోవెనెంటేడ్‌’ అధికారులుగా ఉన్నత పదవుల్లో నియమించాడు. లంచగొండితనాన్ని రూపుమాపడానికి అధికారుల జీతాలను గణనీయంగా పెంచాడు. ప్రైవేట్‌ వ్యాపారం నిషేధించాడు. కేవలం అనుభవం (సీనియారిటీ) ఆధారంగా పదోన్నతి కల్పించాడు. పరిపాలనలో ఉద్యోగులుగా ఆంగ్లేయులకే అవకాశం ఇచ్చాడు. కారన్‌ వాలిస్‌ కాలం నుంచి ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌లో భారతీయులకు స్థానం దక్కలేదు. సంవత్సరానికి 500 పౌండ్ల జీతం మించి అందే అన్ని పైపదవులకు ఆంగ్లేయులనే నియమించాలని 1793లో అధికారిక విధానంగా ప్రకటించి అమల్లోకి తెచ్చారు. ఇదే విధానం సైన్యం, పోలీసు న్యాయవ్యవస్థలకూ వర్తిస్తుంది. తర్వాత బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీ, సివిల్‌ సర్వీసుల్లో మరికొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు. యువకులైన బ్రిటిష్‌ అధికారులకు ఇక్కడి భాషలు, సంప్రదాయాలు, పరిపాలనా విషయాలపై శిక్షణ ఇవ్వడం కోసం కలకత్తాలోని ఫోర్ట్‌ విలియమ్స్‌ (కోట)లో కళాశాల ఏర్పాటు చేశాడు. అనంతరం కంపెనీ డైరెక్టర్లు లండన్‌ సమీపంలో హెయిలీబరీ వద్ద తూర్పు ఇండియా కళాశాలను స్థాపించడంతో వెల్లస్లీ ఏర్పాటు చేసిన కళాశాల కొద్దికాలమే నడిచింది.


1853 వరకు సివిల్‌ సర్వీస్‌ నియామకాలన్నీ కంపెనీ డైరెక్టర్ల చేతుల మీదుగా సాగాయి. కంపెనీకి చెందిన ఆర్థిక, రాజకీయ ప్రత్యేక హక్కులను పార్లమెంటు తొలగించినప్పటికీ, ఈ ఉద్యోగ నియామక హక్కులను వదులుకోవడానికి కంపెనీ యాజమాన్యం నిరాకరించింది. అయితే భారతదేశంలో నానాటికీ పెరుగుతున్న విద్యావంతుల అసంతృప్తిని గమనించి బ్రిటిష్‌ ప్రభుత్వం, భారతదేశపు సివిల్‌ సర్వీస్‌లో అన్ని నియామకాలు పోటీ పరీక్ష ద్వారా జరగాలని శాసిస్తూ చార్టర్‌ చట్టం-1853ని ఆమోదించింది. భారత ప్రభుత్వ చట్టం-1858, భారతదేశ పరిపాలనలో అనేక సమూల మార్పులకు కారణమైంది. తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం 1861లో ‘ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ చట్టం’ తీసుకొచ్చింది. అయినప్పటికీ సివిల్‌ సర్వీసుల్లో భారతీయులు ప్రవేశించకుండా ఆంగ్లేయులు ఆ పోటీ పరీక్షలు ఇంగ్లండ్‌లో నిర్వహించడం, పరీక్షలకు వయసు పరిమితిలో తరచూ హెచ్చుతగ్గులు చేయడం లాంటి అనేక అవరోధాలు సృష్టించారు. 1863లో సత్యేంద్రనాథ్‌ ఠాగూర్‌ సివిల్‌ సర్వీస్‌కి ఎంపికైన మొదటి భారతీయుడు. అనంతర కాలంలో లార్డ్‌ డఫ్రిన్‌ రాజప్రతినిధి (వైస్రాయ్‌)గా ఉన్నకాలంలో 1886లో అచిన్సస్‌ కమిషన్‌ వేశారు. ఈ కమిషన్‌ సివిల్‌ సర్వీసులో కోవెనేటెట్, నాన్‌-కోవెనేటెడ్‌’ అనే పదాలు తొలగించింది. సివిల్‌ సర్వీస్‌లను ‘ఇంపీరియల్‌ ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌’, ‘ప్రొవిన్షియల్‌ సివిల్‌ సర్వీస్‌’, ‘సబార్డినేట్‌ సివిల్‌ సర్వీస్‌’గా విభజించింది. గరిష్ఠ వయసు పరిమితిని 23 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించింది. 1919లో మాంటేగ్‌ ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల్లో భారతదేశంలో సివిల్‌ సర్వీస్‌ పరీక్ష నిర్వహించడానికి అంగీకరించింది. 1924లో నియమించిన ‘లీ కమిషన్‌’ సివిల్‌ సర్వీసులకు సంబంధించి అనేక ప్రతిపాదనలు చేసింది. వాటిలో ముఖ్యమైనవి 


1) సివిల్‌ సర్వీస్‌ల ప్రత్యక్ష నియామకాల్లో భారతీయులకు 50% కేటాయించడం. 


2) 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సివిల్‌ సర్వీస్‌ల పరీక్షలు నిర్వహించడానికి ఇండియాలోనే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేయడం. 


 మొదటగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 1926లో సర్‌ రోజ్‌ బర్కర్‌ అధ్యక్షతన ఏర్పడింది. భారత ప్రభుత్వ చట్టం-1935 ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ప్రొవిన్షియల్‌ సర్వీస్‌ కమిషన్‌లను స్థాపించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఫెడరల్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌గా రూపొందింది. ఇది యువకులు, ఉత్సాహవంతులు, సమర్థులను అధికారులుగా ఎంపికచేస్తూ, ప్రశంసనీయమైన సేవలను అందిస్తోంది.


సైన్యం 


భారతదేశంలో బ్రిటిష్‌ పాలనకు రెండో మూల స్తంభం సైన్యం అని చెప్పవచ్చు. ఇది మూడు పనులు నిర్వర్తించింది. 


1) విదేశీ దాడుల నుంచి బ్రిటిష్‌ ఇండియా రక్షణ 


2) స్వదేశీ సంస్థానాలను ఓడించడం 


3) ఆంతరంగిక తిరుగుబాట్లను అణచివేయడం.


కంపెనీ పాలనలో/మహారాణి పాలనలో సైన్యంలో భారతీయుల సంఖ్య ఎక్కువే. కానీ ఉన్నత పదవులన్నీ ఆంగ్లేయులకే కేటాయించేవారు. సైనిక పాలనలో జాతి వివక్ష ఎక్కువగా పాటించేవారు. జీతభత్యాలు, సదుపాయాలు, కట్టుబాట్లు, క్రమశిక్షణ, పదోన్నతి తదితర అనేక విషయాల్లో బ్రిటిష్‌ సైనికుడికి, భారతీయ సిపాయికి వ్యత్యాసం ఉండేది. అయినా భారతీయ సిపాయిలు తాము జీతం తీసుకుంటున్న ఆంగ్లేయులకు విశ్వాసపాత్రులుగా ఉండేవారు. డల్హౌసీ కాలంలో ఆర్టిలరీ విభాగాన్ని మీరట్‌కి తరలించారు. 1879లో లార్డ్‌ లిట్టస్‌ ‘ఆర్మీ రీ ఆర్గనైజేషన్‌ కమిషన్‌‘ను నియమించాడు. 1895 నాటికి సైన్యాన్ని పంజాబ్, మద్రాస్, బెంగాల్, బొంబాయి అని నాలుగు విభాగాలు చేసి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆధీనంలో ఉంచారు. సంఖ్యా బలం తక్కువగా ఉన్నా, ఆంగ్లేయులు స్వదేశీ సంస్థానాలను జయించారంటే, భారతీయుల్లో అప్పటికి ఆధునిక జాతీయభావాలు నెలకొనలేదు. అందుకే బిహారీ మహారాష్ట్రులను; అయోధ్య వాసి పంజాబీని ఓడించడానికి సంశయించలేదు.


పోలీస్‌ వ్యవస్థ


ఇది మూడో మూల స్తంభం. బ్రిటిషర్లు బెంగాల్‌ను జయించిన తొలిదశలో, జమీందారులు పోలీస్‌ విధులు నిర్వర్తించేవారు. కారన్‌ వాలిస్‌ జమీందారుల నుంచి పోలీస్‌ విధులు తొలగించి, అమలులో ఉన్న వ్యవస్థను ఆధునీకరించి రెగ్యులర్‌ పోలీస్‌ వ్యవస్థను నెలకొల్పాడు. శాంతిభద్రతల రక్షణ పోలీసుల బాధ్యత. బెంగాల్‌ రాజ్యంలో కొన్ని గ్రామాలకు ‘ఠాణా’ అనే అనే సర్కిల్‌ను స్థాపించాడు. అందులో ‘దరోగ’ అనే పోలీస్‌ అధికారిని నియమించాడు. ఠాణాలు నిర్వహించడానికి ప్రతి జిల్లాకు ఒక పర్యవేక్షణ అధికారి ‘సూపరింటెండెంట్‌’ను నియమించాడు. పోలీస్‌ దళం అప్పటి సమాజానికి ప్రమాదకరంగా ఉన్న ‘దగ్గులు’, ‘పిండారీలు’ను అణచివేసింది. లార్డ్‌ క్యూరిజోస్‌ పదవీకాలంలో పోలీస్‌ వ్యవస్థ సమర్థతను పెంచడానికి సూచనల కోసం ప్రేజర్‌ కమిషన్‌ను నియమించాడు. ప్రతి రాష్ట్రంలో సీఐడీ వ్యవస్థను ఏర్పరచాలని, ఉన్నత విద్యావంతులైన భారతీయులను పోలీస్‌ ఉన్నత అధికారులుగా నియమించాలంటూ ఈ కమిషన్‌ చేసిన ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాయి. అయితే పోలీస్‌ వ్యవస్థ కూడా బ్రిటిష్‌ సామ్రాజ్యకారులను కొమ్ము కాస్తూ, ఎక్కువగా భారతీయులను పీడించడమే పనిగా పెట్టుకుంది. స్వాతంత్రోద్యమకారులను, స్వాతంత్రోద్యమాన్ని కఠినంగా అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఒక పావుగా వాడుకుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే బ్రిటిష్‌ ఇండియా చరిత్రలో పాలనా మూలస్తంభాలైన సివిల్‌ సర్వీస్‌లు, సైన్యం, పోలీసువ్యవస్థ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి, వలసవాద విధానాలకు అనుగుణంగానే పనిచేశాయి.

 


 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

 

Posted Date : 08-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బౌద్ధ మతం  

  (క్రీ.పూ. ఆరో శతాబ్దం-భిన్నమతాల ఆవిర్భావం)  

గుణగణాలే  మోక్షసాధనాలు!

ప్రాచీన భారతదేశంలో పుట్టి అచిరకాలంలోనే అశేష ప్రజాదరణ పొందిన బౌద్ధమతం భారతీయ సంస్కృతిని విశేషంగా ప్రభావితం చేసింది. హైందవ సంస్కృతిలోని లోపాలను ప్రశ్నించి, సంస్కరించి, పరిపుష్టం చేసింది. ఆచరణీయ అహింసా వాదాన్ని పరిచయం చేసి ఆమోదయోగ్యంగా మలిచింది. సమానత్వం, శాంతియుత జీవనం, అహింస, వ్యక్తిగత గుణగణాలకు ప్రాధాన్యమిచ్చింది. సరళమైన మత నియమాలను బోధించి, ఆసియా దేశాల్లో విస్తరించింది. కోరికలే అన్ని చింతలకు కారణమని, వాటిని అదుపులో ఉంచుకోవాలనే గొప్ప తత్వాన్ని మానవాళికి బోధించిన బౌద్ధం పుట్టుక, విస్తరణ తీరును పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి. పురోగామి ధోరణులున్న ఈ మతంలో క్రమానుగతంగా సంభవించిన మార్పులు, భిన్న అభిప్రాయాలతో ఏర్పాటైన శాఖల గురించి అవగాహన పెంచుకోవాలి.

క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో ఆవిర్భవించిన మతాల్లో బౌద్ధం అత్యధిక ప్రజాదరణ పొంది ఆసియా ఖండ మతంగా ఎదిగింది. బౌద్ధ మత స్థాపకుడు సిద్ధార్థుడు. ఆయన శాక్యవంశ రాజు శుద్ధోదనుడు, రాణి మాయాదేవి దంపతులకు హిమాలయ ప్రాంతంలోని లుంబినివనంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో, పినతల్లి గౌతమి దగ్గర పెరిగాడు. యుక్తవయసులో యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు రాహులుడు. సిద్ధార్థుడికి చిన్నప్పటి నుంచి ప్రాపంచిక విషయాలపై అనురక్తి లేదు. అంతఃపురానికే పరిమితమయ్యాడు. బౌద్ధ మత ఆధారాల ప్రకారం సిద్ధార్థుడు ఒకరోజు కపిలవస్తు నగరంలో పర్యటిస్తుండగా నాలుగు దృశ్యాలు 

1) వృద్ధుడు 

2) వ్యాధిగ్రస్తుడు  

3) శవం 

4) సర్వసంగ పరిత్యాగి అయిన ఒక యోగిని చూశాడు. మొదటి మూడు దృశ్యాలు మానవ జీవిత సత్యాలను ఆవిష్కరించి, సిద్ధార్థుడి మనసుపై ప్రగాఢముద్ర వేశాయి. జీవితం అశాశ్వతం, దుఃఖమయం అని గ్రహించాడు. సత్యాన్వేషణ కోసం కుటుంబ బంధాలను విడిచిపెట్టి తన 29వ ఏట అడవులకు ప్రయాణమయ్యాడు. ఈ సంఘటనను బౌద్ధమతంలో ‘మహాభినిష్క్రమణ’ అంటారు. తొలిదశలో సిద్ధార్థుడు ఇద్దరు వేదపండితులైన అలారా కలామ, ఉద్దక రామపుట్టలను ఆశ్రయించి ధ్యాన విధానం అభ్యసించాడు. ఆ తర్వాత ఉరువేళ చేరి, శరీరాన్ని శుష్కింపజేసుకుని ధ్యానంలో గడిపాడు. అనంతరం ‘గయ’ (ప్రస్తుత బిహార్‌ రాష్ట్రంలో ఉంది) చేరుకుని, రావి చెట్టు కింద 49 రోజులు కఠిన నియమాలతో ధ్యానంలో మునిగిపోయాడు. వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం సిద్ధించింది.


బోధనలు: జ్ఞానం పొందిన సిద్ధార్థుడు, సారనాథ్‌ వద్ద జింకల వనానికి చేరుకొని, తన పూర్వ సహాధ్యాయులు ఒప్పన, బాడిగ, అస్సాగి, మహనామా, కొండనలను ఉద్దేశించి తొలి ప్రసంగం చేశాడు. తాను గ్రహించిన సత్యాలను వివరించాడు. అవి 

1) ప్రపంచం చింతలతో నిండి ఉంది 

2) కోరికలే చింతలకు మూలకారణం 

3) కోరికలను జయించినప్పుడే చింతలు తొలగుతాయి 

4) దానిని సాధించడానికి ‘అష్టాంగమార్గం’ ఆచరించాలి.


అష్టాంగమార్గం: 

1) సమ్యక్‌ వాక్కు 

2) సమ్యక్‌ క్రియ 

3) సమ్యక్‌ జీవనం 

4) సమ్యక్‌ శ్రమ 

5) సమ్యక్‌ ఆలోచన 

6) సమ్యక్‌ ధ్యానం 

7) సమ్యక్‌ నిశ్చయం 

8) సమ్యక్‌ దృష్టి. 

దీనినే ‘మధ్యేమార్గం’ అని కూడా అంటారు. అష్టాంగ మార్గం ఆచరించడం ద్వారా జన్మరాహిత్యం/నిర్వాణం/మోక్షం పొందుతారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని బౌద్ధమత సాహిత్యంలో ‘ధర్మచక్ర ప్రవర్తన’ అని పిలుస్తారు. బుద్ధుడి మూల బోధనలు ధర్మచక్ర ప్రవర్తనలో ఉన్నాయి. సిద్ధార్థుడిని ప్రజలు బుద్ధుడు, శాక్యముని, తథాగతుడు అని సంబోధించారు. ఆయన తన బోధనల్లో భగవంతుడి ఉనికి గురించి, ఆత్మ గురించి ప్రస్తావించలేదు. శీలవంతమైన జీవితం గడపడం ద్వారా నిర్వాణం (మోక్షం) పొందవచ్చని, దానికి జంతు హింసతో కూడిన యజ్ఞయాగాదులు మార్గం కాదని తెలిపాడు. ప్రతి వ్యక్తి దయ, దాతృత్వం, జాలి, కృతజ్ఞత వంటి ఉత్తమ గుణాలను పెంపొందించుకోవాలన్నాడు. అసత్యం చెప్పకూడదని, జీవహింస చేయకూడదని, భూతదయ కలిగి ఉండాలని బోధించాడు. సమాజంలోని కులవ్యవస్థను నిరసించి సమానత్వాన్ని చాటాడు. వైదిక మతంలోని కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను అంగీకరించాడు. జీవితమంతా, బోధనలు చేస్తూ తన 80వ ఏట క్రీ.పూ.483లో కుశీనగరం వద్ద మహాపరినిర్వాణం చెందాడు.


బౌద్ధమత గ్రంథాలు: పాళీ భాషలో రాసిన సుత్త పిటక, వినయ పిటక, అభిదమ్మ పిటక (త్రిపిటకాలు) బౌద్ధమత గ్రంథాలు. బౌద్ధ తాత్విక చింతనను ‘ప్రతిథ్య సముత్పాద సిద్ధాంతం’ అంటారు. 


బౌద్ధ మతం ఎదుగుదలకు కారణాలు:  తొలిదశలో బుద్ధుడి విలక్షణ వ్యక్తిత్వం, సరళమైన మత సిద్ధాంతాలను వాడుక భాషలో (పాళీ) బోధించడంతో ప్రజలు ఆకర్షితులయ్యారు. అనేకమంది రాజులు (అశోకుడు, కనిష్కుడు, హర్షుడు, ధర్మపాలుడు తదితరులు) బౌద్ధ మతానికి ప్రోత్సాహం అందించారు. ఈ కారణాలతో బౌద్ధం అచిరకాలంలోనే గొప్ప మతంగా ఎదిగింది. బుద్ధుడి కాలంలో గంగానది లోయ ప్రాంతానికి పరిమితమైన మతం, ఆ తర్వాత భారతదేశంలో, ఆసియా ఖండంలో ప్రముఖ మతంగా విస్తరించింది.


బౌద్ధ సంగీతులు: బౌద్ధ సంఘ సమావేశాలను సంగీతి అంటారు. ప్రాచీన భారతదేశ చరిత్రలో నాలుగు బౌద్ధ సంగీతులు జరిగాయి. ః మొదటి సంగీతి బుద్ధుడి మహాపరినిర్వాణం చెందిన క్రీ.పూ.483లో, హార్యాంక వంశ రాజు అజాతశత్రు కాలంలో రాజగృహ నగరంలో జరిగింది. మహాకశ్యపుడు అధ్యక్షత వహించాడు. ఈ సమావేశ ఫలితంగా బుద్ధుడి బోధనలను ‘సుత్త పిటక’గా ఆనందుడు; బౌద్ధ మఠం, భిక్షువుల నియమావళిని ‘వినయ పిటక’గా ఉపాలి సంకలనం చేసి గ్రంథస్థం చేశారు. ః సరిగ్గా వందేళ్ల తర్వాత రెండో బౌద్ధ సంగీతి వైశాలి నగరంలో, సభకామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం మఠ నియమావళిపై ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. దీంతో బౌద్ధ సంఘం మొదటిసారి స్థావిర్‌ వాదులు (మార్పు కోరని వారు), మహా సాంఘికులు (మార్పు కోరేవారు) అనే రెండు శాఖలుగా విడిపోయింది. ః మూడో సంగీతిని అశోకుడి కాలంలో క్రీ.పూ.257వ సంవత్సరంలో నిర్వహించారు. అప్పటికే మతంలో వచ్చిన అనేక చీలికలు, భేదాభిప్రాయాలు నివారించడానికి, మతాన్ని సంఘటితపరచడానికి మొగలిపుత్త తిస్స అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సుత్త పిటక, వినయ పిటకలపై వ్యాఖ్యానం రూపంలో పాళీ భాషలో ‘అభిదమ్మ పిటక’ రూపుదిద్దుకుంది. సమావేశానంతరం అశోకుడు బౌద్ధ మతవ్యాప్తికి విదేశాలకు ప్రతినిధులను పంపాడు. అందులో భాగంగా తన కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రలను సింహళ దేశానికి పంపాడు. 


* నాలుగో బౌద్ధ సంగీతి క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో కుషాణు రాజు కనిష్కుడి కాలంలో, వసుమిత్రుడి అధ్యక్షతన జరిగింది. ఇందులో సంఘంలో నెలకొన్న భేదాభిప్రాయాలు నివారించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఈ సమావేశానంతరం బౌద్ధ సంఘం హీనయాన, మహాయాన శాఖలుగా విడిపోయింది. సుత్త పిటక, వినయ పిటకలపై వ్యాఖ్యానం ‘మహా విభాష శాస్త్ర’ అనే గ్రంథంగా సంస్కృతంలో వెలువడింది.


బౌద్ధ మత ప్రధాన శాఖలు: పరిణామ క్రమంలో బౌద్ధమతం అనేక శాఖలుగా ఏర్పడింది.


1) హీనయాన మతం: వీరు బుద్ధుడి బోధనలనే మోక్ష మార్గం (నిర్వాణం)గా ఆచరిస్తారు. విగ్రహారాధనను విశ్వసించరు. బుద్ధుడి జీవితంలో సంఘటనలను గుర్తుల రూపంలో ఆరాధిస్తారు. ఉదా: అశ్వం (మహాభినిష్క్రమణ), బోధి వృక్షం (జ్ఞానం పొందడం), చక్రం (ధర్మచక్ర ప్రవర్తన), స్తూపం (మహాపరినిర్వాణం).


2) మహాయాన మతం: బుద్ధుడు, అతడి వెనుక జన్మలైన బోధిసత్వుల భౌతిక రూపాలను విగ్రహాల రూపంలో ఆరాధిస్తారు. ఈ శాఖలో రెండు ప్రధాన తాత్విక చింతనలున్నాయి. అవి మాధ్యమిక వాదం (నాగార్జునుడు), యోగకార (మైత్రేయనాథుడు)


3) వజ్రయాన మతం: క్రీ.శ.8వ శతాబ్దంలో బెంగాల్‌లో పాల వంశ రాజుల కాలంలో బౌద్ధంలో వచ్చిన మరో శాఖ వజ్రయానం. మంత్ర, తంత్ర శక్తుల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని వీరి విశ్వాసం.


బౌద్ధం క్షీణతకు కారణాలు: వైదిక మతానికి తిరిగి ప్రోత్సాహం లభించడం, మహాయాన మతానికి, వైదిక మత విధానాలకు పెద్దగా తేడా లేకపోవడం, భిక్షువుల్లో పెరిగిన అనైతికత, బౌద్ధ మఠాలు అసాంఘిక కార్యకలాపాలకు స్థావరాలు కావడం, సంస్కృతానికి మతంలో ప్రాముఖ్యం ఇవ్వడం, ముస్లిం దండయాత్రలు వంటి అనేక కారణాలతో బౌద్ధ మతం 13వ శతాబ్దం నాటికి భారతదేశంలో ప్రజాదరణ కోల్పోయింది.


బౌద్ధం భారతీయ సంస్కృతికి చేసిన సేవ: అనంతమైన భారతీయ సంస్కృతీ పరిణామ దశలో బౌద్ధ మతం అమోఘమైన పాత్ర నిర్వహించింది. వైదిక మత సిద్ధాంతాలను ప్రభావితం చేసింది. మానవ సమానత్వాన్ని ప్రబోధించింది. సంక్లిష్ట మత వ్యవస్థను సరళీకృతం చేసింది. వ్యక్తి గుణగణాలకు, సచ్ఛీలతకు ప్రాధాన్యం ఇచ్చి మతంలో నైతికతను జొప్పించింది. ఆచరణీయ అహింసా సిద్ధాంతాన్ని అందించింది. ఆహారపు అలవాట్లలో శాకాహారులు, మాంసాహారులు అనే మార్పు తెచ్చింది. బౌద్ధ మత పండితులు అనేకమంది (నాగార్జునుడు, అశ్వఘోషుడు, అసంగుడు, దిగ్‌నాగుడు, ధర్మకీర్తి తదితరులు) మత సాహిత్యాన్ని, సిద్ధాంతాలను పరిపుష్టం చేశారు. బౌద్ధ సంఘాలు, విశ్వవిద్యాలయాలు (నలంద, వల్లభి) విద్యావ్యాప్తికి తోడ్పడ్డాయి. భారతీయ సంస్కృతికి - స్తూపం, చైత్యం, విహారం రూపంలో విలక్షణమైన వాస్తును బౌద్ధం అందించింది. మతంలో విగ్రహారాధనను ప్రవేశపెట్టి గాంధార, మధుర, అమరావతి శైలుల రూపంలో అపురూప శిల్పకళను అందించింది. ప్రాంతీయ భాషల అభివృద్ధికి తోడ్పడింది. విదేశాలతో సత్సంబంధాలను నెలకొల్పి, భారతీయ సంస్కృతీ వైభవాన్ని, ప్రపంచ శాంతి ఆవశ్యకతను చాటి చెప్పింది.
 


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం 

Posted Date : 13-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  మౌర్యుల  పూర్వయుగం

(క్రీ.పూ.6వ శతాబ్దం - అనంతర రాజకీయ పరిస్థితులు)

గణ రాజ్యాలే మహా సామ్రాజ్యాలై!

ప్రాచీన భారతదేశంలో మలివేద ఆర్యులు గంగా మైదాన ప్రాంతానికి  వలసవచ్చి స్థిరపడటంతో చిన్నచిన్న గణతంత్ర రాజ్యాలు ఏర్పాటయ్యాయి. వ్యవసాయ వృద్ధి, ఇనుము వినియోగం కారణంగా ఆర్థిక, సైనిక వనరులు పోగుపడటం, బలవంతులైన పాలకుల కారణంగా రాజ్యకాంక్ష రగిలి రాజ్యాలు విస్తరించాయి. ఈ పరిణామంలో మగధ పాలకులు తొలి మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి ఉపఖండంలో రాజకీయ ఏకీకరణకు నాంది పలికారు. నాటి గణ రాజ్యాలు, పరిధి, వాటన్నింటిపై మగధ పాలకులు ఆధిపత్యం సాధించేందుకు అనుకూలించిన పరిస్థితులు, ఈ క్రతువులో భాగమైన పాలక వంశాలు, గొప్ప పాలకులు, వారు అనుసరించిన    విధానాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. మౌర్య వంశ పాలనకు ముందు ఉన్న పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకోవాలి.


ప్రాచీన భారతదేశ రాజకీయ చరిత్రలో క్రీ.పూ.6వ శతాబ్దం అనంతర కాలం ప్రాముఖ్యమైంది. ఈ యుగ రాజకీయ పరిస్థితుల అధ్యయనానికి ప్రధాన ఆధారాలు ఆనాటి బౌద్ధ, జైన సాహిత్యం. వాటి ప్రకారం నాటి రాజకీయాలకు గంగ, యమున మైదానాలు ప్రధాన కేంద్రాలని, ఉత్తర భారతదేశంలో 16 మహాజనపదాలు (షోడశ మహాజనపదాలు) ఉండగా, అందులో 14 రాచరిక వ్యవస్థ ఉన్న రాజ్యాలు, 2 గణతంత్ర రాజ్యాలని తెలుస్తోంది. అంగుత్తర నికాయ (సుత్త పిటక) లాంటి పురాతన బౌద్ధ గ్రంథాలు 16 మహాజనపదాల గురించి పేర్కొన్నాయి. ఈ షోడశ మహాజనపదాలు నిరంతరం, పరస్పరం కలహించుకుంటూ ఉండేవి. మలివేద యుగంలో ఇనుము వాడకంలోకి రావడంతో దానితో పనిముట్లు చేసి  అడవులు నరికి అధిక భూమిని సాగులోకి తెచ్చారు. వ్యవసాయ మిగులు వాణిజ్యానికి దారితీసి వ్యాపార కూడళ్లు ఏర్పడి పట్టణాలుగా వృద్ధి చెందాయి. ప్రజలకు భూమితో అనుబంధం ఏర్పడింది. సంచార జీవనం వదిలి స్థిరజీవనానికి అలవాటుపడ్డారు. క్రమంగా వివిధ వృత్తులు   ఏర్పడ్డాయి. రాజు పన్నులు (భాగ) వసూలు చేసి ఆర్థికంగా, సైనికంగా బలవంతుడయ్యాడు. ఇలాంటి పరిస్థితులే ప్రాదేశిక రాజ్య (మహాజనపదాలు) ఆవిర్భావానికి దారితీశాయి.


షోడశ మహాజనపదాలు: అంగ, అస్సక (అస్మక), అవంతి, ఛేది, గాంధార, కాశీ, కాంభోజ, కోసల, కురు, మగధ, మల్ల, మత్స్య, పాంచాల, శూరసేన, వజ్జి, వత్స. ఈ మహాజనపదాలు ప్రధానంగా ఎగువ మధ్య గంగా మైదానాల్లో, గంగ - యమున, వాటి అంతర్వేదిలో ఏర్పడ్డాయి. ఇందులో మగధ, కాశి, కోసల, అవంతి, వత్స రాజ్యాలు శక్తిమంతమైనవి.


1) అంగ: రాజధాని చంపనగరం. గంగానది ఒడ్డున ఉంది. గొప్ప  వాణిజ్యకేంద్రం. మగధను పాలించే బింబిసారుడు అంగను జయించి  మగధలో కలిపాడు.


2) అస్సక: దక్షిణ భారతదేశంలో ఉంది. ఇందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలు భాగంగా ఉండేవి. అస్సకుల రాజధాని పొటానా లేదా పొటాలి. ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బోధన్‌ అని నిర్ధారించారు.


3) అవంతి: మాల్వా ప్రాంతం. రాజధాని ఉజ్జయిని. అవంతి, కోసల, మగధ రాజ్యాల మధ్య తరచూ సంఘర్షణలు జరిగేవి. శిశునాగ వంశ కాలంలో మగధ అవంతిని జయించింది.


4) ఛేది: బుందేల్‌ఖండ్‌ ప్రాంతం (మధ్యప్రదేశ్‌). రాజధాని సుక్తిమతి.


5) గాంధార: భారత ఉపఖండ వాయవ్య ప్రాంతంలో (ప్రస్తుత పాకిస్థాన్‌లోని రావల్పిండి-పెషావర్‌ ప్రాంతం)లో ఉంది. రాజధాని తక్షశిల గొప్ప విద్యాకేంద్రం.


6) కాశీ: తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌. వారణాసి (వరుణ, అసి నదుల సంగమ ప్రాంతం) రాజధాని. కోసల రాజ్యం దీన్ని జయించింది.


7) కాంభోజ: భారత ఉపఖండ వాయవ్య ప్రాంతంలో (ప్రస్తుత పాకిస్థాన్‌) ఉంది. రాజధాని రాజపుర.


8) కోసల: ప్రస్తుత అయోధ్య ప్రాంతం. రాజధాని మొదట అయోధ్య, తర్వాత శ్రావస్తి. సరయు నది అయోధ్యను ఉత్తర దక్షిణాలుగా విభజిస్తుంది. కోసల, మగధ రాజ్యాల మధ్య దీర్ఘకాలం సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. చివరకు కోసల రాజ్యాన్ని మగధ ఆక్రమించింది.


9) కురు: పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, మీరట్, స్థానేశ్వర్‌ ప్రాంతం.   రాజధాని ఇంద్రప్రస్థం/హస్తినాపురం.


10) మగధ: నేటి పట్నా, గయా, షహబాద్‌ జిల్లాలున్న ప్రాంతం. షోడశ మహాజనపదాలలో మహాశక్తిమంతమైన రాజ్యం. గంగ సొన్, గంఢక్‌ నదుల సంగమంలో ఉంది. క్రీ.పూ.6వ శతాబ్దిలో హర్యంక వంశం పాలనలో ఉంది. మగధను పాలించిన రాజవంశాలు, మగధను మహా సామ్రాజ్య స్థాయికి తీసుకెళ్లాయి.


11) మల్ల సమాఖ్య: కుశీనగర రాజధాని. బుద్ధుడి మహాపరినిర్వాణం తర్వాత మగధలో కలిసిపోయింది.


12) మత్స్య: ప్రస్తుత రాజస్థాన్‌లోని జైపుర్‌ ప్రాంతం.   రాజధాని విరాట్‌ నగరం.


13) పాంచాల: పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్, ఫరూఖాబాద్‌ జిల్లాల ప్రాంతం. గంగానది ఈ రాజ్యాన్ని రెండు  భాగాలుగా విభజిస్తుంది. దీని రాజధాని అహిచ్ఛత్రము.


14) శూరసేన: యమునా నది తీరాన ఉంది. రాజధాని మధుర.


15) వజ్జి: ఇది తొమ్మిది గణరాజ్యాల సమాఖ్య. ప్రతి తెగకు ప్రభుత్వం, రాజధాని ఉండేవి. వజ్జి సమాఖ్యకు రాజధాని వైశాలి.


16) వత్స: యమునా నదికి దక్షిణంగా ఉంది. రాజధాని కౌశాంబి.


క్రీ.పూ. 6వ శతాబ్దం నుంచి గంగ యమునా మైదానాల ఆక్రమణకు మహాజనపదాలు ఒకదాంతో మరొకటి సంఘర్షణకు దిగేవి. ఈ పోరాటంలో ప్రధానంగా మగధ, అవంతి, కాశి, కోసల, వజ్జి రాజ్యాలు చురుగ్గా పాల్గొన్నాయి. పరస్పర వైరాలతో బలహీనమైన ఈ జనపదాలన్నింటినీ మగధ జయించి, ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్దింది. ఈ ఘనత క్రీ.పూ.6వ శతాబ్ది నుంచి 4వ శతాబ్ది వరకు మగధను పాలించిన హర్యంక, శిశునాగ , నంద వంశాలది. రాజ్యకాంక్షతో రగిలిన ఆ వంశాల రాజులు మగధను ఒక సామ్రాజ్య శక్తిగా తీర్చిదిద్దారు.


మగధ మహాజనపదం విజృంభణకు కారణాలు:  

1) హర్యంక, శిశునాగ, నంద వంశాల్లో బింబిసారుడు, అజాతశత్రువు, శిశునాగుడు, మహాపద్మనందుడు లాంటి రాజులు రాజ్యకాంక్షతో మగధ మహాజనపదాన్ని గొప్ప సామ్రాజ్యశక్తిగా తీర్చిదిద్దడానికి నడుం బిగించారు.

2) భౌగోళికంగా సొన్, గండక్, గంగ, గోగ్రా నదుల మధ్య ఉండి, విదేశీ దండయాత్రలకు దూరంగా ఉండటం.

3) గంగ, దాని ఉపనదుల ప్రవాహంతో సారవంతమైన భూములు ఏర్పడి, వ్యవసాయాభివృద్ధి జరగడం. 4) మగధ ప్రాంతం ఖనిజాల పుట్టిల్లు. ఇనుము కనుక్కోవడం, దాంతో అనేక    పనిముట్లు తయారుచేసి అడవులు నరికి, అధిక వ్యవసాయ భూమి సాగులోకి తేవడం, అధిక ఉత్పత్తి జరిగి, వ్యాపారవాణిజ్యాలు వృద్ధి చెందడం.5) పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతో ఆర్థికంగా బలపడటం, తద్వారా అధికార బృందం, సైనిక శక్తి పెరిగి రాజ్యవిస్తరణకు దారితీయడం.


హర్యంక వంశం (క్రీ.పూ. 544-430): ఈ వంశంలో ముఖ్య రాజులు బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు. మగధ ఔన్నత్యానికి పునాదులు వేసింది బింబిసారుడు. రాజ్యవ్యాప్తికి వైవాహిక సంబంధాలను ఒక మార్గంగా ఎంచుకుని కోసల, లిచ్ఛవి, మాద్ర రాకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాలతో తన పలుకుబడిని పశ్చిమాన పంజాబ్‌ నుంచి తూర్పున బెంగాల్‌ వరకు విస్తరించాడు. తూర్పున ఉన్న అంగ రాజ్యంపై దండెత్తి బ్రహ్మదత్తుడిని ఓడించాడు. గాంధార, అవంతి రాజులు అతడితో మైత్రి ఏర్పరచుకున్నారు. బింబిసారుడి రాజ్యం 80 వేల గ్రామాలతో ఉండేదని; బుద్ధుడికి, మహావీరుడికి ఇతడు సమకాలికుడని, బింబిసారుడిని చంపి అతడి కుమారుడు అజాతశత్రువు రాజు అయ్యాడని జైన, బౌద్ధ గ్రంథాలు పేర్కొంటున్నాయి. బింబిసారుడి రాజధాని రాజగృహం.


అజాతశత్రువు: తండ్రి మాదిరిగా గొప్ప సామ్రాజ్యకాంక్ష కలిగినవాడు. దిగ్విజయ యాత్రలతో రాజ్యవిస్తరణ చేశాడు. కోసల రాజైన ప్రసేనజిత్తుడిని, లిచ్ఛవిలను ఓడించాడు. మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలోనే జరిగింది. తండ్రిని చంపినందుకు అజాతశత్రువు పశ్చాత్తాపపడినట్లు బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. అనంతరం వచ్చిన ఉదయనుడు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఆ తర్వాతి రాజులు కూడా పితృహంతకులు అవడంతో, వారి అకృత్యాలు భరించలేక మంత్రి శిశునాగుడి ఆధ్వర్యంలో ప్రజలు తిరుగుబాటు చేసి, శిశునాగుడిని రాజుగా చేశారు.


శిశునాగ వంశం (క్రీ.పూ. 430-364): వంశ స్థాపకుడు శిశునాగుడు. అవంతి, వత్స, కోసల రాజ్యాలను మగధలో విలీనం చేశాడు. ఇతడి గొప్ప విజయం అవంతిని జయించడం. తర్వాత కాలఅశోకుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడి హయాంలోనే రెండో బౌద్ధ సంగీతి జరిగింది.


నంద వంశం (క్రీ.పూ. 364-324): నంద వంశ స్థాపకుడు మహాపద్మనందుడు. ఇతడు క్షత్రియేతరుడు. కాశీ, పాంచాల, మిథిల, కురు, అస్మక రాజ్యాలను జయించి ఉత్తరాన సట్లెజ్‌ నుంచి దక్షిణాన గోదావరి వరకు మగధ రాజ్యాన్ని విస్తరించి మొదటి భారత సామ్రాజ్య నిర్మాతగా చరిత్రకెక్కాడు. ఇతడి తర్వాత తొమ్మిది మంది నంద రాజులు అసమర్థులు. ఆఖరి రాజైన ధననందుడు అలెగ్జాండర్‌ సమకాలికుడు. గ్రీకులు ధన  నందుడిని అగ్రేమ్స్‌ అని పిలిచారు. అతడి నిరంకుశ పాలన, పన్నుల భారం, ప్రజల అసంతృప్తి వల్ల చంద్రగుప్త మౌర్యుడు, తన గురువు చాణుక్యుడి సహాయంతో నంద వంశం పాలనను నిర్మూలించాడు. పాటలీపుత్ర సింహాసనంపై మౌర్యుల పాలన ప్రారంభమై భారత ఉపఖండాన్ని రాజకీయంగా ఒకే పాలనా ఛత్రం కిందకి తెచ్చారు. ఈ పరిణామంతో భారతదేశ చరిత్ర మహా సామ్రాజ్య యుగం వైపు ప్రయాణించింది.

 


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం 

Posted Date : 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మౌర్యుల చరిత్రకు ఆధారాలు

(ప్రాచీన భారతదేశ మహా సామ్రాజ్య యుగం)

గతకాల ఘనతకు సజీవ సాక్ష్యాలు!


 

ఆధునిక యుగంలోనూ ఆచరిస్తున్న, ఇప్పటికీ ఆదర్శనీయమైన  అనేక పాలనా విధానాలను, సంస్కృతీ సంప్రదాయాలను, వర్తక వాణిజ్యాలను క్రీస్తు పూర్వమే మౌర్యులు అమలు చేసినట్లు పలు రకాల ఆధారాలు తెలియజేస్తున్నాయి. అర్థశాస్త్రం సహా  పలు రచనలు అప్పటి పరిపాలనను కళ్లకు కట్టినట్లు వివరిస్తే, అశోకుడి రాతి శాసనాలు అతడు ప్రబోధించిన, ప్రచారం చేసిన ధర్మాలకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ రెండు రకాల ఆధారాలు ప్రాచీన భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యాల ఆవిర్భావ ఘట్టాలను పునర్నిర్మించడానికి అవసరమైన అమూల్య సమాచారాన్ని అందించాయి. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు అధ్యయనం చేయాలి. మహోజ్వల మౌర్యశకం నాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. 

 

 


ప్రాచీన భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్య యుగం మౌర్యులతో ప్రారంభమైంది. ఈ కాలానికి సంబంధించి చారిత్రక రచనలు స్వల్పంగా ఉండటంతో చరిత్రకారులు సాహిత్య, పురావస్తు ఆధారాలతో నాటి చరిత్రను వివరించారు. మహోజ్వల ఘట్టం - పాటలీపుత్రం రాజధానిగా మౌర్య సామ్రాజ్య స్థాపన, ఆ వంశ రాజుల చరిత్ర వెలుగులోకి వచ్చాయి. ఈ వంశంలో ముఖ్య రాజులు చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూ. 321-298), బిందుసారుడు (క్రీ.పూ. 298-273), అశోకుడు (క్రీ.పూ. 269-231), చివరి రాజు బృహద్రదుడు (క్రీ.పూ.191-184). మొదటిసారిగా మౌర్యుల పాలనలో భారత ఉపఖండమంతా ఒక రాజకీయ ఛత్రం కింద ఏకీకృతమైంది.క్రీ.పూ. 321 నుంచి క్రీ.పూ. 184 వరకు పాటలీపుత్రం కేంద్రంగా భారతదేశాన్ని పాలించిన మౌర్యవంశ చరిత్రకు సంబంధించిన అనేక సాహిత్య, పురావస్తు ఆధారాలు లభించాయి. 


సాహిత్య ఆధారాలు


అర్థశాస్త్రం: మౌర్యవంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడి గురువు, ప్రధాని కౌటిల్యుడు/చాణక్యుడు ఈ గ్రంథ రచయిత. 6000 శ్లోకాలతో 150 అధ్యాయాలుగా రచించిన ఈ గ్రంథం గొప్ప రాజనీతి, పాలనా శాస్త్రం. ప్రజల సంతోషమే రాజు సంతోషమని, రాజు సంక్షేమం ప్రజల సంక్షేమంలోనే ఉందని రాచరిక ప్రభుత్వ లక్ష్యాన్ని నిర్దేశించిన గ్రంథం అర్థశాస్త్రం. చంద్రగుప్త మౌర్యుడి పరిపాలనా విధానాన్ని, నాటి రాజనీతిని తెలుసుకోవడానికి; మౌర్యుల కాలంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను గ్రహించడానికి ప్రధాన ఆధారం. 


ముద్రారాక్షసం: గుప్తుల కాలం నాటి సంస్కృత నాటకం, విశాఖదత్తుడు రచయిత. ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడికి, నందవంశపు రాజు ధననందుడికి మధ్య జరిగిన సంఘర్షణను రచయిత తెలియచేశాడు. చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ఏ విధంగా నంద రాజులను నిర్మూలించి, మగధ సింహాసనాన్ని అధిష్టించాడో ఈ గ్రంథం వివరిస్తుంది. 


పురాణాలు: ఇవి పద్దెనిమిది ఉన్నాయి. అష్టాదశ పురాణాలు అంటారు. వీటిని సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినట్లుగా చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ పురాణాల్లో కొన్ని రాజ వంశాల పట్టిక/వంశావళి ఉన్నాయి. ఉదాహరణకు గరుడ, వాయు, విష్ణు పురాణాల్లో మౌర్య వంశ పట్టిక ఉంది.       


పరిశిష్ట పర్వం: హేమచంద్ర ఈ గ్రంథ రచయిత. ఈయన క్రీ.శ. 12వ శతాబ్ది చాళుక్యవంశ రాజు కుమారపాలుడి ఆస్థాన పండితుడు. ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు జైన మతం స్వీకరించిన విధానాన్ని, దక్షిణాదిలో అంటే ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెళగోళకు వెళ్లి ‘సల్లేఖన వ్రతాన్ని’ ఆచరించి కేవల స్థితి పొందిన తీరును వివరించింది. 


ఇండిక: ఈ గ్రంథ రచయిత మెగస్తనీసు. ఇతడు చంద్రగుప్తుడి ఆస్థానంలోని గ్రీకు రాజు సెల్యూకస్‌ నికేటర్‌ రాయబారి. ‘ఇండిక’లో పాటలీపుత్ర పరిపాలనకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. మౌర్య సామ్రాజ్య సామాజిక, రాజకీయ పరిస్థితుల అధ్యయనానికి ఇది ఉపయోగపడింది.


దీపవంశ, మహావంశ: ఇవి ప్రాచీన యుగ శ్రీలంక గ్రంథాలు. వీటిలో అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికి చేసిన కృషి గురించి ఉంది. 


చైనా దేశపు బౌద్ధ యాత్రికుల రచనలు: ఫాహియాన్‌ (రెండో చంద్రగుప్తుడి కాలంలో), హుయాన్‌త్సాంగ్‌ (హర్షుడి కాలంలో) భారత దేశంలో బౌద్ధ మత క్షేత్రాల సందర్శనకు వచ్చిన యాత్రికులు. వరుసగా వీరు రచించిన ఫు-కువో-కి, సి-యు-కి గ్రంథాలు మౌర్యుల చరిత్రకు ఆధారాలు. 


ఇతర రచనలు: బౌద్ధ జాతక కథలు, బద్రబాహుడు రాసిన కల్పసూత్ర గ్రంథం కూడా ఆనాటి సాంఘిక, మత పరిస్థితుల అవగాహనకు ఆధారంగా ఉంది. అలెగ్జాండర్‌ సేనానులైన నియార్కస్, అరిష్టబ్యులస్‌లు మౌర్యుల కాలంనాటి పరిస్థితులను తమ రచనల్లో ప్రతిబింబిపజేశారు. ఈజిప్టు రాజు టాలమీ ఫిలడెల్ఫస్‌-II తమ దేశం తరఫున డయానీషియస్‌ను బిందుసారుడి కొలువులో ఉంచాడు. ఈయన రచనలు కూడా మౌర్య చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి. 



శాసన ఆధారాలు

భారతదేశ చరిత్రలో మొదటగా శాసనాలు వేయించిన రాజు అశోకుడు. తన రాచరిక సిద్ధాంతాలను ప్రకటించడానికి, నైతికతను ప్రబోధించడానికి ఈయన శాసనాలను జారీ చేశాడు. శాసనాలు వేయించడంలో అశోకుడికి పర్షియన్‌ చక్రవర్తి డేరియస్‌ స్ఫూర్తి అని చరిత్రకారుల అభిప్రాయం. దేశవ్యాప్తంగా ఉన్న అశోకుడి శాసనాలను మొదటిసారిగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగి జేమ్స్‌ ప్రిన్సెప్‌ 19వ శతాబ్ది ప్రథమార్ధంలో కనుక్కున్నాడు. బ్రాహ్మి లిపి, ప్రాకృత భాషలో ఉన్న వీటిని (పశ్చిమోత్తర దిక్కులో ఉన్న మంషెహర, షెహేబ్జాగిరి చోట్ల తప్ప) ప్రిన్సెప్‌ అధ్యయనం చేసి అవి మౌర్య చక్రవర్తి అశోకుడివని 


ప్రకటించాడు. వాటి అర్థాన్ని వివరించి చరిత్ర గతినే మార్చివేశాడు. అశోకుడి శాసనాలు ప్రాథమికంగా మూడు రకాలు. అవి: 1) లఘు శిలా శాసనాలు  2) బృహత్‌ శిలా శాసనాలు 3) స్తంభ శాసనాలు. ఇవి అశోకుడి వ్యక్తిగత విషయాలు, సామ్రాజ్య ఎల్లలు, బౌద్ధమతం పట్ల ఆయనకు ఉన్న అనురక్తి, ‘దమ’ పాలనా సూత్రాలను తెలియజేస్తున్నాయి. అశోకుడు తన శాసనాల్లో ‘దేవనాం ప్రియ’, ‘ప్రియదర్శి రాజ’, ‘మగధ రాజన్య’ లాంటి బిరుదులతో; పురాణాల్లో అశోక వర్ధనుడిగానూ పేరు గాంచాడు. పాటలీ పుత్రం, తక్షశిల, సువర్ణగిరి, వైశాలి, కౌశాంబి పట్టణాల గురించి అశోకుడి శాసనాల్లో ఉన్నాయి.


లఘు శిలా శాసనాలు: ఈ శాసనాల ద్వారా అశోకుడి వ్యక్తిగత విషయాలు, ‘దమ’ విధానం తెలుస్తున్నాయి. అశోకుడి ‘దమ’ సర్వమతాలకు ఆమోదయోగ్యమైన నైతిక నియమావళి. లఘు శిలా శాసనాలు రూపనాథ్‌ (మధ్యప్రదేశ్‌), సహస్రం (బిహార్‌) మస్కి, గోవిమఠ్, సిద్ధాపుర్, జతింగా రామేశ్వర్‌ (కర్ణాటక), ఎర్రగుడి (ఆంధ్రప్రదేశ్‌) ప్రాంతాల్లో ఉన్నాయి. 


బబ్రు శిలాశాసనం: రాజస్థాన్‌లోని భైరత్‌ పట్టణంలో లభించింది. దీన్ని కోల్‌కతాలోని మ్యూజియంలో భద్రపరిచారు. ఈ శిలా శాసనంలో బౌద్ధ మత త్రిరత్నాలైన ‘బుద్ధుడు, ధర్మం, సంఘం’పట్ల అశోకుడు గౌరవ విశ్వాసాలు ప్రకటించిన తీరు గురించి ఉంది. 


పద్నాలుగు బృహత్‌ శిలా శాసనాలు: ఈ శాసనాలు అశోకుడి ప్రభుత్వ సిద్ధాంతాలను, పౌరులు పాటించాల్సిన నైతిక విలువలను ప్రకటిస్తున్నాయి. బృహత్‌ శిలాశాసనాలు కాల్సి (ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌), గిర్నార్‌ (గుజరాత్‌), సోపార (మహారాష్ట్ర), దౌలీ, జౌగడ (ఒడిశా), ఎర్రగుడి (ఆంధ్రప్రదేశ్‌), షాహబ్జగిరి, షెహేబ్జాగిరి (ప్రస్తుత పాకిస్థాన్‌)లలో లభించాయి.  

 ఒకటో శిలాశాసనంలో జంతుబలి, విందులు, వినోదాలను నిషేధించారు. 

 రెండో శిలాశాసనంలో మనుషులు, జంతువుల ఆరోగ్య సంరక్షణకు వైద్య సదుపాయాల గురించి ఉంది.

 మూడో శిలాశాసనంలో అశోకుడు బ్రాహ్మణులకు, శ్రామణులందరికీ సమానమైన గౌరవం ఇచ్చినట్లు తెలుస్తోంది.

 నాలుగో శిలాశాసనంలో అశోకుడి ధర్మవిధానం గురించి ప్రధానంగా జంతువుల పట్ల ఆదరణ, బంధువుల పట్ల ప్రేమ, అహింస పాటించాలని పేర్కొంది.

 అయిదో శిలా శాసనంలో అశోకుడు ధర్మ మహామాత్యులు అనే అధికారులను నియమించినట్లు తెలుస్తోంది.

 ఆరో శిలాశాసనంలో అశోకుడు అన్ని సమయాల్లో అంటే అంతఃపురంలో ఉన్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు అధికారులు ప్రజా సమస్యలను తమకు నివేదించవచ్చని ప్రకటించినట్లు ఉంది. ఈ శిలాశాసనంలో ప్రజలందరూ తన బిడ్డలే అని అశోకుడు పేర్కొన్నాడు. 

 ఏడో శిలా శాసనం సమాజంలోని అన్ని వర్గాల మధ్య సామరస్యం అవసరమని చాటుతోంది.

 ఎనిమిదో శిలా శాసనంలో అశోకుడు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలకు తీర్థయాత్రలు చేసినట్లు ఉంది  

 తొమ్మిదో శిలాశాసనంలో క్రతువుల పట్ల అశోకుడి వ్యతిరేకత తెలుస్తోంది.

 పది, పదకొండు శిలాశాసనాలు ‘దమ’ను, దాని ఫలితాలను వివరిస్తాయి.

 పన్నెండో శిలాశాసనం మత సహనానికి ప్రాముఖ్యత ఇచ్చింది.

 పదమూడోది అన్నిటికంటే పెద్ద శిలా శాసనం. ఇదే కళింగ శాసనం. కళింగ యుద్ధం, అశోకుడి మనసుపై దాని ప్రభావం గురించి తెలియజేస్తుంది.

 పద్నాలుగో శిలాశాసనం దేశవ్యాప్తంగా ఉన్న శాసనాల ఉద్దేశాన్ని తెలుపుతుంది.


స్తంభ శాసనాలు: అశోకుడు అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారుతున్న పెద్ద శిలా స్తంభాలను వేయించి వాటిపై శాసనాలను ప్రకటించాడు. స్తంభ శాసనాలను అలహాబాదు, మీరట్, సోపార, లావుర్యా నందంగర్, నెగ్లి సాగర్, రామపూర్వ, రూమిన్‌ డై మొదలైన చోట్ల కనుక్కున్నారు. శిలా శాసనాల మాదిరిగానే ఈ స్తంభ శాసనాలు - ధర్మం, ధర్మాచరణ, జీవహింస, జంతు హింసను పరిమితం చేసే చర్యలు, అశోకుడు ధర్మ వ్యాప్తికి చేసిన ప్రయత్నాల గురించి తెలియజేస్తున్నాయి. మౌర్యుల కాలం నాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులను వివరిస్తున్నాయి.  


ఈ ఆధారాలతోపాటు మౌర్యుల నాటి పంచ్‌ మార్క్‌ నాణేలు, కుండలు, పురావస్తు కట్టడ అవశేషాలు (సాంచి, సారనాథ్, బర్హుట్, తక్షశిల మొదలైనవి) కూడా మౌర్యుల చరిత్ర రచనకు ఉపయోగపడ్డాయి. ఈ విధంగా పుష్కలంగా లభిస్తున్న సాహిత్య, పురావస్తు ఆధారాలతో ఘనమైన మౌర్య సామ్రాజ్య చరిత్రను వీలైనంత సమగ్రంగా చరిత్రకారులు పునర్నిర్మించే ప్రయత్నం చేశారు. అర్థవంతమైన, అమూల్యమైన వివరాలను అందించడంలో చాలా వరకు సఫలీకృతులయ్యారు.



రచయిత: వి.వి.ఎస్‌ రామావతారం

Posted Date : 27-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌