ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఎన్.ఆర్.ఐ./ ఎన్.ఆర్.ఐ. స్పాన్సర్డ్ కోటాలో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్ట్టికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు విడుదల చేశాయి. కొన్ని సడలింపులు, సీట్ల సంఖ్య పెంపుతో పాటు అందుబాటు ఫీజుతో ఎన్.ఆర్.ఐ./ఎన్.ఆర్.ఐ. స్పాన్సర్ కోటాలో సీట్లను భర్తీ చేయనున్నారు.
ఏపీఈఏపీసెట్లో ఆశాజనకమైన ర్యాంకు సాధించలేకపోయిన విద్యార్థులూ, వివిధ కారణాలతో సెట్ రాయనివారు కూడా నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయుల పిల్లలతో పాటు వారు సిఫారసు చేసిన, బంధుత్వం కలిగిన విద్యార్ధులు ఈ కోటాలో ప్రవేశం పొందవచ్చు.
‣ బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చరల్ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిషు సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి.
‣ బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిషు సబ్జెక్టులు చదివి ఉండాలి.
ప్రవేశం పొందాలనుకున్న విద్యార్థులకు కనీస వయసు 2022 డిసెంబరు 31 నాటికి 17 సంవత్సరాలు, గరిష్ఠ వయసు 22 సంవత్సరాలు ఉండాలి. విశ్వవిద్యాలయ గుర్తింపు ఉన్న కళాశాలల్లోని మొత్తం సీట్లలో 15 శాతం సీట్లు ఎన్.ఆర్.ఐ. కోటాలో భర్తీ చేస్తారు.
ఉద్యాన విశ్వవిద్యాలయంలో..
2022-23 సంవత్సరానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఎన్.ఆర్.ఐ./ఎన్.ఆర్.ఐ. స్పాన్సర్డ్ కోటాలో కేటాయించిన 47 సీట్ల భర్తీకి ప్రకటన వెలువడింది. దరఖాస్తుకు సెప్టెంబరు 12వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సెమిస్టర్కు 1750 యూఎస్ డాలర్లు, ప్రవేశం పొందే సమయంలోనే రెండు సెమిస్టర్లకు రుసుములు చెల్లించాలి. వీటిని అదనంగా విశ్వవిద్యాలయ సాధారణ ఫీజు చెల్లించాలి. విశ్వవిద్యాలయం సూచించిన నిబంధనలు, అర్హతలు కలిగిన అభ్యర్థులు పూరించిన దరఖాస్తులను ‘రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వెంకట్రామన్నగూడెం, వెస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు పంపాలి. https://drysrhu.ap.gov.in/ వెబ్సైట్ నుంచి పూర్తి వివరాలు పొందవచ్చు.
ఫీజు, దరఖాస్తు విధానం
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్.ఆర్.ఐ. కోటా ద్వారా సీటు సాధించిన విద్యార్థులు సెమిస్టర్కు 2500 అమెరికన్ డాలర్ల ట్యూషన్ ఫీజుతో పాటు సాధారణ విద్యార్థులు చెల్లించే ఫీజు చెల్లించాలి. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆసక్తి ఉన్నవారు http://www.angrau.ac.in/ వెబ్సైట్ సందర్శించి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తుపత్రం, ఎన్.ఆర్.ఐ. వీసా, పాస్పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, అఫిడివిట్లను ఆగస్టు 25 లోపు ‘రిజిస్ట్రార్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం, లాం, గుంటూరు, 522034’ చిరునామాకు పంపించాలి.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్ డిగ్రీ