Post your question

 

    Asked By: హరికృష్ణ

    Ans:

    టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్ని రెగ్యులర్‌ పద్ధ్దతిలో చదివితేనే వృత్తి నైపుణ్యాలు మెరుగవుతాయి. ఒకవేళ, మీరు ప్రస్తుతం అదే రంగంలో పనిచేస్తూ, విద్యార్హతలు పెంచుకోవాలనుకొంటే కరస్పాండెన్స్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌/ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులు ఉపయోగపడతాయి. సాధారణంగా టౌన్‌ ప్లానింగ్‌లో పీజీ కోర్సులను ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలు బీఆర్క్‌ చదివినవారికి మాత్రమే రెగ్యులర్‌ పద్దతిలో అందిస్తున్నాయి. అతికొద్ది విద్యాసంస్థలు మాత్రమే టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) పీజీ డిప్లొమా ఇన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంని  అందిస్తోంది. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, దిల్లీ.. సిటీ అండ్‌ మెట్రోపాలిటన్‌ ప్లానింగ్‌నూ, ఐఐటీ ఖరగ్‌పూర్‌.. అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్స్‌లో, ఐఐటీ రూర్కీ.. ఇంట్రడక్షన్‌ టు సర్వీసెస్‌ ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులను ‘స్వయం’ పోర్టల్‌ ద్వారా అందిస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని ప్రైవేటు/ విదేశీ యూనివర్సిటీలు కూడా టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత పూర్తిగా తెలుసుకొని ప్రవేశం విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ది గ్లోబల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, నాగాలాండ్‌లో అర్బన్‌ ప్లానింగ్‌లో ఎమ్మెస్సీ ప్రోగ్రాం దూరవిద్య ద్వారా అందుబాటులో ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: బి.చరణ్‌

    Ans:

    మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమాను 88.85 శాతంతో పూర్తిచేసి బీటెక్‌ చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు బీటెక్‌ని కూడా కనీసం 70 శాతం మార్కులతో పూర్తి చేయండి. ఆ తరువాత విదేశాల్లో ఎంఎస్‌ చేయడానికి అవసరమైన జీఆర్‌ఈ, టోఫెల్‌/ ఐఈఎల్‌ టీఎస్‌ లాంటి పరీక్షల్లో కూడా మంచి స్కోరు పొందండి. అప్పుడు మీ మొత్తం విద్యార్హతల్లో ఒక్క పదో తరగతిలోనే తక్కువ స్కోరు ఉంటుంది కాబట్టి, మీ ఎంఎస్‌ అడ్మిషన్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మంచి విదేశీ యూనివర్సిటీ నుంచి మంచి పర్సెంటే జ్‌తో ఎంఎస్‌ పూర్తి చేసి, ఆ కోర్సుకు సంబంధించిన విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పొందినట్లయితే, మీ ఉద్యోగాన్వేషణలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
    గతంలో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతూ, వర్తమానంలో చదువుతున్న కోర్సును అశ్రద్ధ చేస్తూ, భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోకండి. విదేశీ యూనివర్సిటీలు, విదేశీ ఉద్యోగ సంస్థలు ఒక అభ్యర్థికి విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించేప్పుడు మార్కుల కంటే ఎక్కువగా వ్యక్తిత్వం, ప్రేరణ, భవిష్యత్‌ ప్రణాళికలు, పోటీ పరీక్షలో వచ్చిన స్కోర్లు, రిఫరెన్స్‌ లెటర్స్, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్, ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌.. ఇవన్నీ మూల్యాంకనం చేసి అడ్మిషన్‌/ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పదో తరగతిలో మీకు తక్కువ మార్కులు వచ్చాయన్నది పక్కన పెట్టి, ఇప్పుడు చదువుతున్న కోర్సుపై శ్రద్ధ పెట్టండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎస్‌.పవన్‌

    Ans:

    మీరు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్‌ ఏ సంవత్సరంలో తీసుకున్నారో చెప్పలేదు. డీఆర్‌ బీఆర్‌ఏఓయూలో 2017 నుంచి సీబీసీఎస్‌ (చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం)ను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో డిగ్రీ పూర్తయ్యాక, అదనపు కోర్సును చదివే వెసులుబాటు లేదు. 2017కి ముందు అడ్మిషన్‌ తీసుకొన్నవారికి ఈ వెసులుబాటు ఉండేది. సీబీసీఎస్‌ పథకం మొదలై దాదాపు ఏడు సంవత్సరాలు అయింది కాబట్టి, ప్రస్తుతం అదనపు సబ్జెక్టు చదివే అవకాశం లేదు. ఏదైనా ప్రైవేటు యూనివర్సిటీని  సంప్రదించి ఇలాంటి వెసులుబాటు ఇస్తారేమో కనుక్కోండి. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక, కల్పించే వెసులుబాట్లు పాత విద్యార్థులకు వర్తింపచేస్తారా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేము. మరింత సమాచారం కోసం డీఆర్‌ బీఆర్‌ఏఓయూలో స్టూడెంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ను సంప్రదించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: జె.శ్రీనివాస్‌

    Ans:

    బీసీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే ఇంటర్మీడియట్‌లో కచ్చితంగా మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలన్న నిబంధన ఉండేది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా, బీసీఏ ప్రోగ్రాం లో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ, బీసీఏ చదవాలంటే ప్లస్‌ టూలో మ్యాథ్స్‌ చదవాలన్న నిబంధన అమల్లో ఉంది. చాలా ప్రైవేటు యూనివర్సిటీల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా బీసీఏ చదివే అవకాశం ఉంది. ఇటీవల చాలా ప్రైవేటు యూనివర్సిటీలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ బీసీఏ ప్రోగ్రాంలో కూడా ఇంటర్‌ ఏ సబ్జెక్టుతో చదివినా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్‌ లాంటి ప్రోగ్రాంలు మాత్రమే ఏఐసీటీఈ పరిధిలో ఉండేవి. ఈ విద్యా సంవత్సరం నుంచి బీబీఏ, బీసీఏ ప్రోగ్రాంలను కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకనుంచి ఏఐసీటీఈ వారు నిర్థ్ధరించిన విద్యార్హతలతోనే  బీసీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది.
    జాతీయ విద్యావిధానం- 2020 ప్రకారం ఏఐసీటీఈ చాలా విద్యార్హతలను సమీక్షిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది. అందులో భాగంగా 29 ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్స్‌లో 10 ప్రోగ్రామ్స్‌కి ఇంటర్‌లో మ్యాథ్స్‌ కోర్సును చదివి ఉండాలన్న నిబంధనను మినహాయించారు. ఈ  మినహాయింపు ఇచ్చినవాటిలో కంప్యూటర్‌ సైన్స్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్‌ ఏమీ లేవు. మీరు బీసీఏ ప్రోగ్రాంకు అర్హులా? కాదా అనే విషయం తెలియాలంటే ఈ విద్యా సంవత్సరం డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్లు వచ్చేవరకు వేచి ఉండండి. చివరిగా ఇంజనీరింగ్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి ప్రొఫెషనల్‌/ టెక్నికల్‌ కోర్సులు చదవాలంటే మ్యాథమెటిక్స్‌ ప్రావీణ్యం చాలా అవసరం. అవకాశం ఉంటే, గణితంలో బ్రిడ్జి కోర్సు చేసి నైపుణ్యాలు పెంచుకోండి.
    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా, బీసీఏ ప్రోగ్రాంలో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ, బీసీఏ చదవాలంటే ప్లస్‌ టూలో మ్యాథ్స్‌ చదవాలన్న నిబంధన అమల్లో ఉంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: శ్రీనివాస్‌

    Ans:

    ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఎంసీఏ (మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే డిగ్రీ లేదా ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మాత్రం ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా ఎంసీఏలో చేరవచ్చు. కానీ అలాంటి విద్యార్థులు ఎంసీఏ మొదటి సంవత్సరం సబ్జెక్టులతో పాటు, మ్యాథమెటిక్స్‌ను బ్రిడ్జ్‌ కోర్సుగా చదివి ఉత్తీర్ణత సాధించాలి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎంసీఏ ప్రోగ్రాం విద్యార్హతలను ఏఐసీటీఈ ఇంకా ప్రకటించలేదు. జాతీయ విద్యావిధానం - 2020 పూర్తి స్థాయిలో  అమల్లోకి వస్తే ఏ డిగ్రీ చదివినవారైనా, ఏ పీజీ ప్రోగ్రాంలో అయినా ప్రవేశం పొందే వీలుంటుంది. కానీ, అంతకంటే ముందు ఇంటర్మీడియట్, డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇంటర్‌/ డిగ్రీలో మ్యాథ్స్‌ చదవనివారు ఎంసీఏ చదవడానికి అవకాశం ఉందో, లేదో తెలియాలంటే ఈ విద్యా సంవత్సరం ఐసెట్‌/ నిమ్‌సెట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్లు వచ్చేవరకు వేచి ఉండండి. ఇంజినీరింగ్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి ప్రొఫెషనల్, టెక్నికల్‌ కోర్సులకు మ్యాథ్స్‌లో ప్రావీణ్యం చాలా అవసరం. కాబట్టి గణితంలో బ్రిడ్జి కోర్సు చేసి.. నైపుణ్యాలు పెంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: ఐశ్వర్య

    Ans:

    ఆంధ్రా యూనివర్సిటీకి న్యాక్‌ గ్రేడింగ్‌ ఆధారంగా యూజీసీ గ్రేడ్‌ వన్‌ అటానమస్‌ హోదా కల్పించారు. దీనివల్ల యూనివర్సిటీకి కొత్త కోర్సుల రూపకల్పనకు అవసరమైన స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఏదైనా యూనివర్సిటీ నిర్వహించే దూరవిద్య, ఆన్‌లైన్‌ ప్రోగ్రాంలకు యూజీసీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) అనుమతి తప్పనిసరి. సాధారణంగా, ప్రభుత్వ యూనివర్సిటీలు జారీచేసే డిగ్రీల విషయంలో నియామక సంస్థలకు ఎలాంటి అనుమానాలూ ఉండవు. ఏదైనా పోటీ పరీక్షకు డిగ్రీ అనేది ఒక విద్యార్హత మాత్రమే. రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభపైనే మీ ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. మీరు యూనివర్సిటీ నుంచి డెబ్‌ జారీ చేసిన అనుమతి పత్రాన్ని తీసుకొని భద్రపర్చుకోండి. భవిష్యత్తులో ఏదైనా ఇంటర్వ్యూలో అవసరం అయితే ఉపయోగపడవచ్చు. మీరు ప్రస్తుతం చదువుతున్న ఆన్‌లైన్‌ ఎంఏతో పీహెచ్‌డీ, ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌లతో పాటు అన్ని పోటీ పరీక్షలకూ అర్హులవుతారు. జాతీయ విద్యావిధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక రెగ్యులర్, డిస్టెన్స్, ఆన్‌లైన్‌ డిగ్రీలు అన్నింటికీ ఒకే రకమైన గుర్తింపు ఉండే అవకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: అశోక్‌ యాదవ్‌

    Ans:

    మీరు డిప్లొమాలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. గత సంవత్సరం వరకు నీట్‌ రాయాలంటే, ఇంటర్మీడియట్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కచ్చితంగా చదివి ఉండాలి. కానీ, జాతీయ విద్యావిధానం- 2020లో భాగంగా ఈ సంవత్సరం నుంచి నీట్‌ విద్యార్హతల్లో కొంత వెసులుబాటు కల్పించాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వారు నిర్ణయించారు. అందులో భాగంగా.. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదివివుంటే, ఆ తర్వాత గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి అదనపు సబ్జెక్ట్‌గా బయాలజీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించినవారినీ నీట్‌కు అనుమతించాలని నిర్ణయించారు. ఇలాంటి విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదవాలంటే, వారి విద్యార్హతలు నిర్థÄరిస్తూ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వారు జారీ చేసే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ అవసరం. నీట్‌ 2024 నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు మాత్రమే ప్రామాణికంగా తీసుకొని మీ అర్హతను నిర్థÄరించుకోండి. మీరు డిప్లొమాలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివివుంటే, ఆ డిప్లొమాని, ఇంటర్మీడియట్‌కు సమానంగా ప్రభుత్వం గుర్తించి ఉంటే, మీరు నీట్‌ రాయడానికి అర్హులు అవుతారు. ఒకవేళ, మీరు డిప్లొమాలో బయాలజీ చదివి ఉండకపోతే, దాన్ని అదనపు సబ్జెక్ట్‌గా చదివి, నీట్‌కి అర్హత సాధించండి. మీ ప్రస్తుత విద్యార్హతలతో నీట్‌ రాయడానికి అర్హత లేకపోతే, ఇంటర్మీడియట్‌ని బైపీసీతో పూర్తి చేసి  నీట్‌కి సన్నద్ధం కండి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం నీట్‌ పరీక్ష రాయడానికి గరిష్ఠ వయః పరిమితి లేదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వంశీకృష్ణ

    Ans:

    సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించేముందు మీరు కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలైన ఆపరేటింగ్‌ సిస్టమ్, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, కోడింగ్‌లతో పాటు ఎంఎస్‌ ఆఫీస్‌పై పట్టు సాధించాలి. బీకాం చదివినవారు సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించాలంటే చాలా రకాల కోర్సులు చదివే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా- బిజినెస్‌ అనలిటిక్స్, డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఎస్‌క్యూఎల్‌ డీబీఏ, సిక్స్‌ సిగ్మా, డిజిటల్‌ మార్కెటింగ్, వెబ్‌ డిజైనింగ్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, గ్రాఫిక్‌ డిజైన్, హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌ వర్కింగ్, వీఎఫ్‌ఎక్స్‌ అండ్‌ యానిమేషన్, ఐఓఎస్‌ డెవలప్‌మెంట్, ఎస్‌ఏపీ, ఈఆర్‌పీ లాంటి వాటికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు వివిధ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ కూడా నేర్చుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పైన పేర్కొన్నవాటిల్లో నచ్చిన కోర్సు ఎంచుకని, కనీసం ఒక సంవత్సరం పాటు కృషి చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎస్‌.రవిశంకర్‌

    Ans:

    మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలో మీరు ఆపరేషన్స్‌ ఇంజనీర్‌గా పనిచేసిన కాలంలో మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ లాంటి వివిధ అంశాలపై అవగాహన పొంది ఉంటారు. ఇప్పుడు మీరు సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌సీఎం) రంగంలోకి వెళ్లాలనుకోవడం సరైన నిర్ణయమే. ఎస్‌సీఎంకు సంబంధించిన ప్రొక్యూర్‌మెంట్, వేర్‌ హౌసింగ్, రవాణా, పంపిణీ లాంటి వివిధ విభాగాలతో మీరు పరోక్షంగా పనిచేస్తూనే ఉండివుంటారు. ఈ రంగాలతో ఉన్న పరిచయం, ప్రావీణ్యం మీరు మెరుగైన సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌గా రూపుదిద్దుకోవడానికి    తోడ్పడతాయి. 
    సర్టిఫికేషన్‌ కోర్సుల విషయానికొస్తే- ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎంఐటీ, మిషిగన్‌ యూనివర్సిటీలు సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌లో వివిధ కోర్సులు అందిస్తున్నాయి. అమెరికన్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఇన్వెంటరీ కంట్రోల్‌ సొసైటీ (ఏపీఐసీఎస్‌).. సర్టిఫైడ్‌ సప్లై చైన్‌ ప్రొఫెషనల్‌ (సీఎస్‌సీపీ) కోర్సునూ, అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌.. సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ (సీపీఎల్‌ఎస్‌)నూ, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌.. సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ (సీపీఎస్‌ఎం)నూ అందిస్తున్నాయి. వీటితో పాటు కోర్స్‌ ఎరా, ఎడెక్స్, యుడెమీ, ఎన్‌పీటెల్,  స్వయం లాంటి ఆన్‌లైన్‌ అభ్యాస వేదికల్లో కూడా ఈ కోర్సులు చేసే అవకాశం ఉంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎల్‌.సంతోష్‌

    Ans:

    ఫిజియోథెరపీ ప్రోగ్రాంలో ఎప్పుడు చేరారు? హాజరు శాతం ఎంత ఉంది? మొదటి సెమిస్టర్‌ పరీక్షలు రాశారా? రాస్తే ఎన్నింటిలో ఉత్తీర్ణత సాధించారు? రెండో సెమిస్టర్‌ కు ప్రమోట్‌ అయ్యారా? ఏ కారణంతో కోర్సును వదిలివేయాల్సి వచ్చింది? ఇలాంటి సమాచారం లేకుండా మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. సాధారణంగా, ఏదైనా రెగ్యులర్‌ డిగ్రీ మధ్యలో వదిలేస్తే, తగిన కారణాలు చూపించి అదే కళాశాలలో రీ అడ్మిషన్‌ తీసుకోవాలి. ఆ తరువాత అదే యూనివర్సిటీ పరిధిలో, మీరు చేరాలనుకొంటున్న కాలేజీలో ఏవైనా సీట్లు ఖాళీగా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి.  మీరు ప్రస్తుతం చదువుతున్న కళాశాల, చదవబోయే కళాశాల ప్రిన్సిపల్‌లు ఇద్దరూ అనుమతిస్తే, సంబంధిత యూనివర్సిటీ నియమాలకు  లోబడి మిమ్మల్ని బదిలీ చేసే విషయంలో యూనివర్సిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ముందుగా మీరు మీ యూనివర్సిటీకి వెళ్లి సంబంధిత అధికారులను సంప్రదించి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌