Post your question

 

    Asked By: మనోహర్‌బాబు

    Ans:

    జర్నలిజం కోర్సు విదేశాల్లో చాలా యూనివర్సిటీల్లో ఉంది. వీటిలో యూనివర్సిటీ ఆఫ్‌ ఆమ్‌స్టర్‌డామ్, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, ది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌- ఆస్టిన్, నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ - మాడిసన్, మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, న్యూయార్క్‌ యూనివర్సిటీ ముఖ్యమైనవి. ఇవే కాకుండా- ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, హాంకాంగ్‌ల్లో కూడా ప్రముఖ విశ్వవిద్యాలయాలు జర్నలిజం కోర్సును అందిస్తున్నాయి. ఉద్యోగావకాశాల విషయానికొస్తే జర్నలిజం చదివినవారు జర్నలిస్ట్, కంటెంట్‌ క్రియేటర్, రేడియో జాకీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ ప్రొఫెషనల్, కాలమిస్ట్, ఎడిటర్, క్రిటిక్, కాపీ రైటర్, ఫిల్మ్‌ మేకర్‌..ఇలాంటి హోదాల్లో ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు. ఇవే కాకుండా బోధన, అడ్వర్‌టైజింగ్, బ్రాడ్‌ కాస్టింగ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ రంగాల్లోనూ వివిధ రకాలైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: అమూల్య

    Ans:

    ధ్యానం అనేది యోగాలో ఒక భాగం. వివిధ యోగా రూపాలైన హఠ యోగం, కర్మ యోగం, భక్తి యోగం, రాజయోగాల్లో హఠ యోగాన్ని ఎక్కువగా అభ్యసిస్తారు. ఇందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 భాగాలుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు విశ్వవిద్యాలయాలు యోగాలో రెగ్యులర్‌ మాస్టర్‌/ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం)లో ఎంఏ /పీజీ డిప్లొమా, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (తిరుపతి)లో ఎమ్మెస్సీ /పీజీ డిప్లొమా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు)లో పీజీ డిప్లొమా (రెగ్యులర్‌/ పార్ట్‌ టైమ్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: డి.రామకృష్ణ

    Ans:

    వీటిలో మీకు ఏది బాగా ఇష్టమో నిర్ధరణకు రండి. రెండింటిలో ఉన్న లాభనష్టాలను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. మిత్రులు, కౌన్సెలర్లు సలహాలు మాత్రమే ఇవ్వగలరు. నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ముందుగా సీనియర్‌ దగ్గర పనిచేసి సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టే విషయానికొస్తే- సీనియర్‌ దగ్గర పనిచేస్తే, వృత్తిలో మెలకువలు నేర్చుకొని భవిష్యత్తులో సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకొని మంచి న్యాయవాదిగా రాణించే అవకాశాలుంటాయి. దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే, మీరు సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టినప్పుడు, మొదట్లో మీరు జూనియర్‌ లాయర్‌ అని కేసులు ఎక్కువగా రాకపోయే అవకాశం ఉంది. లాయర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల పోటీ కూడా ఎక్కువే. మీరు లాయర్‌గా స్థిరపడటానికి చాలా సమయం పట్టవచ్చు. కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది కానీ, మీరు వ్యక్తిగతంగా కేసుల్ని వాదించి పేరు తెచ్చుకొనే అవకాశాలు తక్కువ. మీరు వాదించిన కేసుల్లో విజయం సాధించినా, ఆ విజయం మీరు పనిచేసే సంస్థకే చెందుతుంది. ఉదాహరణకు కొంత అనుభవం గడించి మీరే సొంతంగా కంపెనీ పెట్టడమా, జీవితకాలం ఏదో ఒక కంపెనీలో వేతనానికి పనిచేయడమా అనేది వ్యక్తిగత నిర్ణయం. కెరియర్లో రిస్క్‌ తీసుకోగల్గటం, ఉద్యోగ భద్రత, పరిమిత జీతం, అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు, ఎక్కువ ఆదాయం అనే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. ఏది సరైందో ఆలోచించి నచ్చిన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: పి.కార్తీక్‌

    Ans:

    సివిల్స్‌ రాయడానికి జనరల్‌ కేటగిరికి చెందినవారికి 32 సంవత్సరాలు నిండేవరకు గరిష్ఠంగా 6 అవకాశాలు, ఓబీసీ కేటగిరికి చెందినవారికి 35 ఏళ్లు నిండేవరకు 9 అవకాశాలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరి వారికి 37 ఏళ్లు నిండేవరకు అపరిమిత అవకాశాలుంటాయి. అదేవిధంగా జనరల్‌/ ఓబిసీ‡/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల దివ్యాంగులకు 42 సంవత్సరాలు నిండేవరకు 9 అవకాశాలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరి దివ్యాంగులకు 42 సంవత్సరాలు నిండేవరకు అపరిమిత అవకాశాలుంటాయి. ముందుగా, పై వాటిలో మీ కేటగిరికి ఎన్ని అవకాశాలున్నాయో తెలుసుకోండి. మీరు సివిల్స్‌ నిర్ణయాన్ని 28వ ఏట తీసుకున్నారు కాబట్టి, ఇప్పటినుంచి కనీసం నాలుగేళ్లు.. అంటే 32 సంవత్సరాలు నిండే వరకు మరో ఆలోచన లేకుండా, సివిల్స్‌ సన్నద్ధత మీదే దృష్టి పెట్టాలి. సివిల్స్‌లో కొన్ని వందల ఉద్యోగాలకు లక్షల మంది దరఖాస్తు చేస్తారు. కాబట్టి, పోటీ చాలా ఎక్కువ.
    సివిల్స్‌ రాయాలనే నిర్ణయం తీసుకొనేముందు..
    1) మీకు సివిల్స్‌ తప్ప మరే ఉద్యోమూ చేయలేనంత బలమైన ఇష్టం ఉందా?
    2) వచ్చే నాలుగేళ్ల పాటు మీ ఆర్థిక అవసరాలు ఎలా తీర్చుకుంటారు?
    3) ఒకవేళ సివిల్స్‌ సాధించడంలో విఫలమైతే మీముందు ఏ ప్రత్యామ్నాయాలున్నాయి?
    4) జయాపజయాలతో సంబంధం లేకుండా సివిల్స్‌ లక్ష్యంతో కొన్నేళ్లపాటు ప్రయాణించగల ఓపిక ఉందా?
    5) కొన్ని సంవత్సరాలపాటు రోజుకు కనీసం 15 గంటలు చదవగలిగే సామర్థ్యం మీకుందా?. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోండి.
    సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించడమనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. అతి కొంతమంది మాత్రమే మొదటి ప్రయత్నంలో విజయం సాధిస్తే, మరికొంతమంది రెండు/మూడు/నాలుగో ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు. చాలామంది అభ్యర్థులు తమకు అర్హత ఉన్న అవకాశాలన్నీ పూర్తయినా విజయం సాధించలేకపోతున్నారు. కానీ సివిల్స్‌కు సన్నద్ధమైనవారు ఇది కాకపోయినా ఇతర పోటీ పరీక్షల్లో విజయ సాధించి మెరుగైన ఉద్యోగాలు పొందగల్గుతున్నారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: దీపిక

    Ans:

    ఎంబ్రియాలజిస్టులు పునరుత్పత్తి అంచనాలు, సంతానోత్పత్తి పరిశోధన, సంతానోత్పత్తి పద్ధతుల అధ్యయనంపై దృష్టి పెడతారు. ముఖ్యంగా పిండ సంరక్షణలో నైపుణ్యంతోపాటు పునరుత్పత్తి సమస్యల చికిత్సకు నూతన ఆవిష్కరణలు చేస్తారు. గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉన్న రోగులకు కౌన్సెలింగ్, చికిత్సలో వైద్యులతో కలిసి పని చేస్తారు. ఎంబ్రియాలజిస్ట్‌ అవ్వాలంటే క్లినికల్‌ లాబొరేటరీ పద్ధతులపై లోతైన జ్ఞానం, పునరుత్పత్తి శాస్త్రంపై అవగాహన అవసరం. ఈ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు బీఎస్సీలో బయొలాజికల్‌ సైన్స్‌/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్‌ చదవాలి. బీఎస్సీ తరువాత ఎంబ్రియాలజిలో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ చేసే ప్రయత్నం చేయండి. ఈ కోర్సులు అందుబాటులో లేకపోతే ఎమ్మెస్సీలో మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్‌ లాంటి కోర్సులు చేసి, ఎంబ్రియాలజీ సంబంధిత క్లినికల్‌ ల్యాబ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసి, ఆ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకోండి. మనదేశంలో ఎంబ్రియాలజీ రంగంలో ఉన్నత విద్యకు అవకాశాలు ఎక్కువగా లేవు. మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్‌ /యానిమల్‌  బయాలజీ / రిప్రొడక్టివ్‌ బయాలజీల్లో ఎంబ్రియాలజీకి సంబంధించిన అంశాల్లో  పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌ రిసెర్చ్‌ కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. మీకు ఆసక్తి ఉంటే విదేశాల్లోనే పీజీ, పీహెచ్‌డీ చేసే ప్రయత్నం చేయండి. ఎంబ్రియాలజీ కోర్సులు చదివినవారికి సంతాన సాఫల్య కేంద్రాల్లో, క్లినికల్‌ లాబొరేటరీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సీహెచ్‌.విజయ్‌శంకర్‌

    Ans:

    మీరు బీఏలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. పీజీలో ఏ సబ్జెక్టు చదవాలనుకొంటున్నారు? ‘లా’ కోర్సులో చేరేది ఎందుకోసం? పది సంవత్సరాల తరువాత మీరు ఏ స్థాయిలో ఉండాలనుకొంటున్నారు? మీ స్వల్పకాలిక/ దీర్ఘకాలిక కెరియర్‌ ఆశయాలేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకొనే ప్రయత్నాలు చేయండి. మీరు ‘లా’ రెగ్యులర్‌గా చదువుతూ, పీజీ కోర్సును దూరవిద్యలో చేయొచ్చు కానీ, దానివల్ల మీకు ఏం ఉపయోగం అనేది కూడా ఆలోచించండి. ‘లా’ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరినప్పుడు వేరేవి చదవకుండా, న్యాయవిద్య మీదే శ్రద్ధ పెడితే విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ మీరు చదవాలనుకొంటున్న పీజీ కోర్సు, భవిష్యత్తులో మీ న్యాయవాద వృత్తికి ఉపయోగమని భావిస్తే పీజీ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది న్యాయవాదులు పీజీ చేయకుండానే బీఏ/ బీకాం/ బీఎస్సీతో పాటు ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ మాత్రమే చదివి న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నారని గుర్తించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: ఎం.అజయ్‌ కుమార్‌

    Ans:

    తెలుగు నుంచి ఇంగ్లిషుకు, ఇంగ్లిషునుంచి తెలుగుకు అనువాదాలు చేసే ఉద్యోగ, వ్యాపార సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ అనువాదాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత కూడా తక్కువే! కనీసం రెండు భాషల్లో ప్రావీణ్యం ఉండి, వాటి వ్యాకరణంపై మంచి పట్టువుండి, సృజనాత్మకత, అనువాదాలపై ఆసక్తి ఉంటే అనువాదాలు చేయటం కష్టమేమీ కాదు. మొదట్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ అనుభవం పెరిగేకొద్దీ మెలకువలు పెంపొందించుకోవచ్చు.
    ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే గూగుల్‌ ట్రాన్స్‌లేషన్, ఇతర ఆన్‌లైన్‌ ట్రాన్సలేషన్‌ సేవలు అందుబాటులో లేని సమయాల్లో అనువాదకులకు చాలా డిమాండ్‌ ఉండేది. ప్రభుత్వ సంస్థల్లో అనువాదకులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి.  అనువాదంలో నైపుణ్యం ఉన్నవారికి అడ్వర్‌టైజింగ్‌ రంగంలో, పత్రికా, సాహిత్య రంగాల్లో, లీగల్‌ పరంగా ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయి. మీకు ఈ రంగంలో చదవాలనే ఆసక్తి ఉంటే ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. కానీ, ఈ అవకాశాలు కూడా పరిమిత విద్యాసంస్థల్లోనే అందుబాటులో ఉన్నాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: నరసింహారావు

    Ans:

    ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్ష్యాలను సాధించగల సామర్థ్యం ద్వారా మాత్రమే విజయాన్ని కొలుస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ, జీవితంలో ఎదుగుదల కోసం వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడం అవసరం. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అంటే వ్యక్తిత్వాన్ని రూపొందించే నైపుణ్యాలను పెంపొందించడంపై మరింత దృష్టి పెట్టడం. ఇతరుల వ్యక్తిత్వాలను మెరుగుపరుస్తూ స్వీయ అవగాహన పొందే మెలకువలను ఎవరికి వారే స్వయంగా నేర్చుకోవడంలో వ్యక్తిత్వ వికాస కోచ్‌ సహాయపడతారు. అందుకు అవసరమైన వ్యూహాలను ప్రయోగిస్తారు. వ్యక్తి సామాజిక నైపుణ్యాలు, ఉత్పాదకత, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, పాజిటివ్‌ థింకింగ్, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ పెంపొందించడంపై దృష్టి పెడతారు. అదేసమయంలో లక్ష్యాలను నిర్దేశించుకోడానికీ, వాటి సాధనకూ మార్గదర్శకాలను అందిస్తారు. వ్యక్తుల బలాలు, బలహీనతలు, అవకాశాలు, ఇబ్బందులు గుర్తించడంలో సహాయపడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జీవిత సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలపై సలహాలు ఇస్తారు.
    కోచ్‌గా రాణించాలంటే ఈ రంగంపై విపరీతమైన ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, నెట్‌ వర్కింగ్‌ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్, సహానుభూతి, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ఎంతో ఓపిక, దృఢమైన వ్యక్తిత్వం అవసరం. ముందుగా సైకాలజీ, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, స్వీయ చరిత్రలు చదవండి. వీలుంటే సైకాలజీలో పీజీ చేయండి. కౌన్సెలింగ్‌ సైకాలజీలో డిప్లొమా కూడా చేయండి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోర్సులను ఆన్‌  లైన్‌లో చేయండి. సంబంధిత కోచ్‌ దగ్గర అప్రెంటిస్‌గా చేరి ఈ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకొని, విశ్వసనీయత గల సంస్థ నుంచి సర్టిఫికేషన్‌ పొందే  ప్రయత్నం చేయండి. సరైన నైపుణ్యాలు లేకుండా ఈ రంగంలో ప్రవేశించకూడదని మర్చిపోవద్దు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


     

    Asked By: దుర్వ బిల్లా

    Ans:

    సాధారణంగా ఎవరైనా రెండు డిగ్రీలు ఒకే సమయంలో చేస్తే, అందులో కచ్చితంగా ఒకటి దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చేసి ఉంటారు. కానీ, మీరు రెండు రెగ్యులర్‌ డిగ్రీలను ఒకే సమయంలో, రెండు వేర్వేరు రాష్ట్రాలనుంచి చేశారు. ఇది ఎలా సాధ్యం అయింది? ఈ రెండు డిగ్రీల్లో మీరు ఏ డిగ్రీని రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి, నిర్దేశిత హాజరుతో పూర్తిచేశారు? ఒకే సమయంలో రెండు డిగ్రీలు, రెండు రాష్ట్రాల్లో చేసినట్లు మీరు దరఖాస్తులో రాస్తే, ఆ విషయం మీ ఉద్యోగావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకని మీరు నిజాయతీగా చేసిన డిగ్రీతో మాత్రమే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. రెండో డిగ్రీ విషయం పూర్తిగా మర్చిపోండి. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల ప్రకారం రెండు రెగ్యులర్‌ డిగ్రీలను ఒకే సమయంలో చేసే అవకాశం ఉంది. కానీ మీరు డిగ్రీలు చదువుతున్న రెండు కళాశాలల పని సమయాలు వేర్వేరుగా ఉండాలి. రెండు కళాశాలల్లో కూడా నిర్దేశిత హాజరు శాతం కచ్చితంగా ఉండాలి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉండాలంటే, యూజీసీ నిబంధనలను పాటిస్తూ మీ ఉద్యోగ ప్రయత్నాలు/ఉన్నత విద్యను కొనసాగించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: అపర్ణ

    Ans:

    విశ్వభారతి యూనివర్సిటీ, శాంతినికేతన్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ డిగ్రీలో డిజైన్‌-సిరామిక్స్‌ అండ్‌ గ్లాస్, డిజైన్‌-టెక్స్‌టైల్, గ్రాఫిక్‌ ఆర్ట్‌ (ప్రింట్‌ మేకింగ్‌), హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్, పెయింటింగ్, స్కల్‌ప్చర్‌ స్పెషలైజేషన్లు ఉంటాయి. అక్కడ చదవాలంటే ముందుగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే దేశవ్యాప్త ప్రవేశపరీక్ష రాయాలి. దానిలో మెరుగైన ర్యాంకు సాధించి, విశ్వభారతి యూనివర్సిటీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించే ప్రాక్టికల్‌/రిటెన్‌ టెస్ట్, వైవా వోస్‌ పరీక్షకు హాజరు అవ్వాలి.
    ప్రాక్టికల్‌/రిటెన్‌ టెస్ట్‌ రెండు గంటల వ్యవధిలో ఉంటుంది. వైవా వోస్‌ పరీక్షకు వెళ్ళేప్పుడు విద్యార్ధులు గతంలో వేసిన చిత్రాలు/ పెయింటింగ్‌లు/ చెక్కిన శిల్పాలు/ తీసిన డాక్యుమెంటరీలు తీసుకొని వెళ్ళాలి. ఎన్టీఏ పరీక్షలో వచ్చిన మార్కులకు ప్రాక్టికల్‌/రిటెన్‌ టెస్ట్, వైవా వోస్‌ల్లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారుచేసి ప్రవేశాలు చేపడతారు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌