Asked By: ఎస్. వినితాగౌడ్
Ans:
బీఎస్సీ (ఎంబీజడ్సీ)లో మీరు చదువుతున్న మైక్రో బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ... మూడు సబ్జెక్టుల్లో ఎంఎస్సీ చదవొచ్చు. ఇవేకాకుండా ప్లాంట్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, యానిమల్ బయాలజీ, బయోటెక్నాలజీల్లో కూడా పీజీ చదివే అవకాశం ఉంది. పరిశోధనా రంగంపై ఆసక్తి ఉంటే లైఫ్సైన్స్ సబ్జెక్టుల్లో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పీహెచ్డీ, బోధనా రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేయొచ్చు. ఇక ఉద్యోగావకాశాల విషయానికొస్తే.. బయోటెక్ కంపెనీల్లో, ఫార్మా కంపెనీల్లో, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల్లో, బయో మెడికల్ కంపెనీల్లో, ఆగ్రో బేస్డ్ పరిశ్రమల్లో, బెవరేజ్ ఇండస్ట్రీలో, పర్యావరణ పరిశోధన సంస్థల్లో, మెడికల్ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో, యూనివర్సిటీ/ కళాశాల ప్రయోగశాలల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. బీఎస్సీ విద్యార్హతతో పొందే ఉద్యోగాలకు వేతనాలు ఆకర్షణీయంగా ఉండవు. ఏదైనా సబ్జెక్టులో పీజీ చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎన్.ఆర్. చంద్రశేఖర్
Ans:
అగ్రికల్చర్ బీఎస్సీ చేసినవారికి ఎంఎస్సీలో అగ్రికల్చర్, హార్టికల్చర్ చదివే అవకాశం ఉంటుంది. ఎంఎస్సీ అగ్రికల్చర్లో ప్లాంట్ జెనెటిక్స్, ప్లాంట్ సైన్స్, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ప్లాంట్ బ్రిడింగ్, ప్లాంట్ పెతాలజీ, అగ్రికల్చర్ మైక్రోబయాలజీ, సీడ్సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంటమాలజీ, నెమటాలజీ, ఆగ్రానమీ... లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఎంఎస్సీ హార్టికల్చర్లో వెజిటబుల్ క్రాప్స్, ఫ్రూట్సైన్స్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఫర్ హార్టికల్చర్ క్రాప్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్ ఆర్కిటెక్చర్, ప్లాంటేషన్ సైన్సెస్, మెడిసినల్ అండ్ ఆరోమెటిక్ క్రాప్స్.. లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్సీ అగ్రికల్చర్/ హార్టికల్చర్ చదవాలంటే, ఐసీఏఆర్ నిర్వహించే ఏఐఈఈఏ పీజీ ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించాలి. ఒకవేళ మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటే అగ్రిబిజినెస్లో ఎంబీఏ చేసే అవకాశం కూడా ఉంది. ఎంబీఏ చేయడానికి ఐఐఎంలు నిర్వహించే క్యాట్ పరీక్షలో మంచి స్కోర్ సంపాదించాలి. అగ్రికల్చర్ బీఎస్సీ చదివినవారికి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలు రాయవలసి ఉంటుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, వ్యవసాయ కళాశాలల్లో, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో, ఐసీఏఆర్ అనుబంధ పరిశోధనా సంస్థల్లో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో, విత్తన తయారీ కేంద్రాల్లో, ఫుడ్ టెక్నాలజీ కంపెనీల్లో, ఎరువుల తయారీ కంపెనీల్లో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, బ్యాంకుల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సందీప్రెడ్డి
Ans:
ఎంబీఏలో మార్కెటింగ్ చదివినవారికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. దశాబ్దకాలంగా పెరిగిన దేశీయ, బహుళజాతి వ్యాపార సంస్థల విస్తరణ, సోషల్ మీడియా వినియోగం, ఆన్లైన్ రిటెయిల్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, డిజిటల్ మార్కెటింగ్ లాంటి అంశాల వల్ల మార్కెటింగ్ విభాగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి. ఎంబీఏ మార్కెటింగ్ చదివినవారికి సేల్స్ మేనేజ్మెంట్, బ్రాండ్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ లాంటి విభాగాల్లో కొలువులు లభిస్తాయి. మీరు డిగ్రీలో చదివిన ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్, ఫార్మా సంబంధిత రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, రిటెయిలింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, హెల్త్కేర్, రియల్ ఎస్టేట్, టూరిజం, స్పోర్ట్స్ రంగాల్లో కూడా మార్కెటింగ్ చదివినవారికి ఉద్యోగావకాశాలు అధికం.
ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న స్టార్టప్ సంస్థల్లోనూ మార్కెటింగ్ నిపుణుల అవసరం చాలా ఉంది. ఎంబీఏ మార్కెటింగ్ చదివినవారికి మొదట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ లాంటి ఉద్యోగాలు లభిస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు వేతనాలు ఆకర్షణీయంగా లేనప్పటికీ, మీ పని తీరు, అనుభవాన్ని పట్టి భవిష్యత్తులో మెరుగైన వేతనాలు లభిస్తాయి. మీకు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో మార్కెటింగ్ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: డి. అశోక్
Ans:
మీరు బీఏలో మూడో సబ్జెక్ట్గా చదువుతున్న ఆర్థికశాస్త్రంతో ప్రత్యేకించి ఉద్యోగాలు ఉండవు. కానీ డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకూ మీరు అర్హులే. ఎకనామిక్స్లో నాలుగు సంవత్సరాల బీఏ ఆనర్స్ కానీ, రెండు సంవత్సరాల పీజీ కానీ చదివితే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువుంటాయి. బీఏ తరువాత మంచి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివితే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎంఏ ఎకనామిక్స్ చదివినవారు యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ పరీక్షకు అర్హులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఇండియన్ ఎకనామిక్ సర్వే లాంటి సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగం పొందవచ్చు. పీజీలో ఎకనామిక్స్ చదివితే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో, స్వచ్ఛంద సంస్థల్లో, పరిశోధన, బిజినెస్ అనలిటిక్స్, బోధన, వ్యాపార పత్రికారంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎంఏ ఎకనామిక్స్ చదివినవారు ఎకనమిస్ట్గా, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్గా, క్రెడిట్ అనలిస్ట్గా, రిస్క్ అనలిస్ట్గా, ఫైనాన్సియల్ అనలిస్ట్గా, ఎకనమిక్ కంటెంట్ రైటర్గా పనిచేయవచ్చు. డేటా సైన్స్, ఆక్చూరియల్ సైన్స్, ఇన్సూరెన్స్ల్లో సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సులు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వీటితో పాటు ఎంఎస్ ఎక్సెల్, ఎస్పీఎస్ఎస్, జమోవి, బ్లూస్కై స్టాటిస్టిక్స్, ఈ వ్యూస్, ఆర్ ప్రోగ్రామింగ్, పైతాన్ లాంటి సాఫ్ట్వేర్లపై పట్టు సాధిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: యు. నాగేంద్రకుమార్
Ans:
- బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్) చదివిన తరువాత ఈ మూడు సబ్జెక్టుల్లో దేంట్లోనైనా ఎంఎస్సీ చేసే అవకాశం ఉంది. నిమ్సెట్ కానీ, ఐసెట్ కానీ రాసి ఎంసీఏ కూడా చేయవచ్చు. ఎంఎస్సీ డేటాసైన్స్ కూడా చేయొచ్చు. క్యాట్/ ఐసెట్ రాసి ఎంబీఏ కూడా చేయవచ్చు. కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ కోర్సు గురించి కూడా ఆలోచించవచ్చు. ఆక్చూరియల్ సైన్స్లో పీజీ చదివే అవకాశం కూడా ఉంది. ఇటీవల కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ లాంటి కోర్సులు చేస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీఎస్సీ డిగ్రీ పూర్తయ్యాక బీఈడీ కూడా చేయవచ్చు.
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: nayudupalli
Ans:
మీ విద్యార్హత, ఉద్యోగానుభవంతోపాటు, భవిష్యత్ ప్రణాళికకు అనుగుణంగా ఏ కోర్సు చేయాలో నిర్ణయించుకోండి. మైక్రోసాఫ్ట్ పవర్ బీఐ అనేది ఒక డేటా విజువలైజేషన్ సాఫ్ట్వేర్. ఇది ముఖ్యంగా బిజినెస్ ఇంటలిజెన్స్ కోసం ఉపయోగపడే ప్రముఖ సాధనం. డేటా సైన్స్/ బిజినెస్ అనలిటిక్స్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పవర్ బీఐలో శిక్షణ పొందాక ప్రముఖ ఐటీ కంపెనీల్లో, బిజినెస్ అనలిటిక్స్ కంపెనీల్లో పవర్ బీఐకి సంబంధించిన డేటా అనలిస్ట్, డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ హోదాల్లో సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వేతనం పొందవచ్చు.
ఈ రంగంలో రాణించాలంటే బీఎస్సీ ( డేటా సైన్స్/ మేథమ్యాటిక్స్/ స్టాటిస్టిక్స్)/బీసీఎ/ బీటెక్/ ఎంసీఏ/బీబీఏ (బిజినెస్ అనలిటిక్స్)/ ఎంబీఏ (బిజినెస్ అనలిటిక్స్) లాంటి విద్యార్హతలు అవసరం. ఇక మ్యూల్సాఫ్ట్ విషయానికొస్తే, ఇది అప్లికేషన్, డేటా, డివైస్లను ఇంటిగ్రేషన్ చేసే సాఫ్ట్వేర్. మ్యూల్సాఫ్ట్లో ఎనీపాయింట్ ప్లాట్ ఫామ్ అనేది ముఖ్యమైంది. దీన్ని ఉపయోగించి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ డెవలపర్స్ వివిధ రకాల అప్లికేషన్లు వృద్ధి చేస్తారు. మ్యూల్సాఫ్ట్లో శిక్షణ పొందినవారు ప్రముఖ ఐటీ కంపెనీల్లో మ్యూల్సాఫ్ట్కు సంబంధించి ఎనీపాయింట్ ప్లాట్ ఫామ్ అప్లికేషన్ డెవలపర్స్, ఇంటిగ్రేషన్ మేనేజర్, డెవలపర్, మాడ్యూల్ లీడ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ లాంటి ఉద్యోగాలు, ఏడాదికి రూ. 4 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వేతనంతో పొందే అవకాశం ఉంది. మ్యూల్సాఫ్ట్ సాఫ్ట్వేర్ ద్వారా మంచి ఉద్యోగం పొందాలనుకొంటే- బీసీఎ/ బీటెక్/ ఎంసీఏ లాంటి విద్యార్హతలు అవసరం. పైన చెప్పిన పవర్ బీఐ, మ్యూల్సాఫ్ట్లకు సంబంధించిన ఉద్యోగాల్లో అభ్యర్థుల ఉద్యోగానుభవాన్ని బట్టి ఎక్కువ వేతనం పొందే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: నర్సింగ్
Ans:
- మీరు అడిగిన ఐడీపీ కోర్సు అంటే ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం. దీనిలో ఒక డిగ్రీ కోర్సు, మరో పీజీ కోర్సు కలిపి అందిస్తారు. దీనివల్ల కలిగే లాభం ఏంటంటే- సంప్రదాయ పద్ధతిలో ఒకదాని తరువాత ఒకటి చదివితే పట్టే సమయం కంటే, ఐడీపీ కోర్సుకు ఒక సంవత్సరం తక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు బీటెక్ కోర్సు కాలవ్యవధి 4 సంవత్సరాలు, ఎంటెక్ కాలవ్యవధి 2 సంవత్సరాలు. ఐడీపీ కోర్సులో బీటెక్, ఎంటెక్లకు కలిపి 5 సంవత్సరాలే పడుతుంది. జేఎన్టీయూ (హైదరాబాద్)లో ఐడీపీ పద్దతిలో బీటెక్ + ఎంటెక్, బీటెక్+ఎంబీఏలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఒక్కో కోర్సులో 12 లేదా 18 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎంసెట్లో అత్యున్నత ప్రతిభ కనపర్చినవారికే ఈ కోర్సులో ప్రవేశాలు లభిస్తాయి. ఐడీపీలో బీటెక్, ఎంటెక్ చదివిన తరువాత, మళ్ళీ ఎంటెక్ చదవాల్సిన అవసరం లేదు. ఆసక్తి ఉంటే ఎంబీఏ చేసే అవకాశం ఉంది. ఐడీపీలో బీటెక్, ఎంటెక్ చదివాక మరో స్పెషలైజేషన్లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్ చేయాలనుకొంటే, గేట్ పరీక్ష రాసి ప్రవేశం పొందవచ్చు. జేఎన్టీయూ (హైదరాబాద్)లో క్యాంపస్ సెలక్షన్లు ఉన్నాయి. ఆ ప్రాంగణ నియామకాల్లో మీరు ఉద్యోగం పొందగలరా లేదా అనేది మీ విషయ పరిజ్ఞానం, భావ ప్రకటన సామర్థ్యం, ఆ కోర్సులో వచ్చిన మార్కుల శాతంపై ఆధారపడి ఉంటుంది.
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: nayudupalli
Ans:
పదేళ్ళ క్రితం పూర్తి చేసిన బీఎస్సీ, ఎంసీఏ విషయపరిజ్ఞానం ఎంతవరకు మీకు గుర్తుంది అనే అంశం, మీరు ఏరంగంలో స్థిరపడాలో నిర్ణయిస్తుంది. కొంతకాలం స్కూల్ టీచర్గా పనిచేశారన్నారు. కానీ ఏ సబ్జెక్టులు బోధించారో చెప్పలేదు. మీరు బీఎస్సీలో చదివిన మూడు సబ్జెక్టుల్లో మీకిష్టమైన సబ్జెక్టులో పీజీ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఎంసీఏ కూడా చదివారు కాబట్టి, కంప్యూటర్ రంగంలో స్థిరపడాలనుకొంటే- అందుకు సంబంధించిన కోర్సులు నేర్చుకొనే ప్రయత్నం చేయండి. మీరు ఎంసీఏ చేసినప్పటికీ, ఇప్పటికీ సాఫ్ట్వేర్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాంటి రంగాలకు చాలా డిమాండ్ ఉంది. ఆ రోజుల్లో సీ, సీ ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎంత ప్రాచుర్యంలో ఉండేవో, ఇప్పుడు జావా, ఆర్ ప్రోగ్రామింగ్, పైతాన్ లాంటి సాఫ్ట్వేర్లు కూడా అంతే ప్రాచుర్యంలో ఉన్నాయి. మీరు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్లాలనుకొంటే కనీసం ఒక సంవత్సరం పాటు వివిధ కంప్యూటర్ కోర్సులు నేర్చుకోండి. ఒకవేళ మీరు మేనేజ్మెంట్్/ అడ్మినిస్టేషన్ ఉద్యోగాలు చేసివుంటే ఎంబీఏ చేయవచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి మళ్ళీ స్కూల్ టీచర్గా కెరియర్ కొనసాగించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: nayudupalli
Ans:
డిగ్రీ తరువాత, బీఎస్సీలో మీరు ప్రస్తుతం చదువుతున్న బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ చేసే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీలు బీఎస్సీ బీజడ్సీ అర్హతతో బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రో బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఇమ్యునాలజీ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చేయటానికి అనుమతిస్తున్నాయి. పీజీ తరువాత నెట్/ సెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ కళాశాలల్లో బోధనావకాశాలు ఉంటాయి. మీరు పీజీలో చదివిన సబ్జెక్టులో పీహెచ్డీ కూడా చేయొచ్చు. పీహెచ్డీ చేసిన తరువాత బోధనా రంగంపై ఆసక్తి ఉంటే విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం, పరిశోధన రంగంపై ఆసక్తి ఉంటే కేంద్ర/ రాష్ట్ర/ ప్రైవేటు పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.
బీఎస్సీ పూర్తి చేశాక ప్రైవేటు ఫార్మా, బయోటెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయవచ్చు. బీఎస్సీ బీజడ్సీ తరువాత ఆసక్తి ఉంటే మెడికల్ రెప్రజెంటేటివ్ ఉద్యోగం ఎంచుకునే వీలుంది. పోటీపరీక్షలు రాయాలనే ఆసక్తి ఉంటే డిగ్రీ అర్హత ఉన్న అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలువుల కోసం సన్నద్ధం కావొచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే బీఎస్సీ అయిన వెంటనే బీఈడీ కూడా చేయవచ్చు. డిగ్రీ తరువాత బీఈడీ చేసి పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా, పీజీ తరువాత బీఈడీ చేసి కేంద్రీయ పాఠశాలల్లో పీజీ టీచర్గా స్థిరపడవచ్చు. మీరు డిగ్రీలో చదివిన ఇంగ్లిష్, తెలుగు/ హిందీల్లో పీజీ చేయవచ్చు. డిగ్రీ తరువాత మూడు సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సులో, జర్నలిజంలో పీజీలో, ఎంబీఏలో కూడా చేరవచ్చు. కొన్ని యూనివర్సిటీల్లో బీఎస్సీ విద్యార్హతతో ఆంత్రొపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ లాంటి సబ్జెక్టుల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎ. బుచ్చయ్య
Ans:
ఎంఏ ఇంగ్లిష్ కోర్సుకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ పీజీతో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఆంగ్లం బోధించవచ్చు. ఎంఏ ఇంగ్లిష్ తరువాత నెట్/ సెట్ పరీక్షలో ఉత్తీర్ణులయితే డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. ఈ భాషలో పీహెచ్డీ చేసి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం పొందవచ్చు. ఎంఏ ఇంగ్లిష్తో పాటు బీఈడీ చేసి పాఠశాలల్లో ఇంగ్లిష్ టీచర్ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. ప్రైవేటు రంగంలో కంటెంట్ రైటర్లుగా, స్పోకెన్ ఇంగ్లిష్ సంస్థల్లో ఇన్స్ట్రక్టర్గా, అనువాదకునిగా, ఎడిటర్గా, కాపీ రైటర్గా, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా, టెక్నికల్ రైటర్గా విభిన్న ఉద్యోగావకాశాలు ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్