Post your question

 

    Asked By: ఎం. రత్నకుమార్‌

    Ans:

    కొద్దికాలంగా సైబర్‌ సెక్యూరిటీకి ప్రాధాన్యం పెరగడం వల్ల ఉద్యోగ మార్కెట్లో ఈ రంగానికి డిమాండ్‌ బాగా ఉంది. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు సాఫ్ట్‌వేర్‌ రంగంతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ రంగాల్లోనూ విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. మీరు ఐటీ ప్రొఫెషనల్‌గా ఏ విభాగంలో పనిచేస్తున్నారో తెలియజేయలేదు. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న స్పెషలైజేషన్‌కూ, సైబర్‌ సెక్యూరిటీకీ ఏదైనా సంబంధం ఉందేమో చూడండి. దాన్ని ఆధారంగా చేసుకొని సైబర్‌ సెక్యూరిటీ రంగంలో మీకున్న ఉపాధి అవకాశాలను అంచనా వేసుకోండి. మీరు యుడెమి, క్లౌడ్‌ ఎరాల నుంచి పూర్తిచేసిన కోర్సులు ఈ రంగంపై అవగాహన కల్పించడానికి ఉపయోగపడతాయి కానీ, ఉద్యోగం సంపాదించి సైబర్‌ సెక్యూరిటీ రంగంలో స్థిరపడటానికి పెద్దగా ఉపకరించకపోవచ్చు.
    సైబర్‌ సెక్యూరిటీ అనేది విశాలమైన పరిధి ఉన్న విభాగం. మీరు ఇందులో ఏ ఉద్యోగం చేయాలనుకొంటున్నారో నిర్ణయం తీసుకొని దానికి కావాల్సిన విద్యార్హతలు, మెలకువల గురించి తెలుసుకోండి. వాటిలో శిక్షణ పొందండి. సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌గా పనిచేయడానికి ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలతో పాటు సైబర్‌ సెక్యూరిటీలో శిక్షణ అవసరం. ఈ రంగంలో ప్రవేశించాలంటే సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ నైపుణ్యాలు, విభిన్న సెక్యూరిటీ స్పెషలైజేషన్లలో అనుభవం, భావప్రకటనా నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, డేటాను విశ్లేషించడం లాంటివి ఎంతో అవసరం. వీటితో పాటు విండోస్, యునిక్స్, లినెక్స్, ఫైర్‌ వాల్స్, నెట్‌ వర్క్‌ సెగ్మెంటేషన్, నెట్‌ వర్క్‌ యాక్సెస్‌ కంట్రోల్, డీఎన్‌ఎస్, రూటింగ్, ప్రాక్సీ సర్వీసెస్, థర్డ్‌ పార్టీ ఆడిటింగ్, క్లౌడ్‌ రిస్క్‌ అసెస్మెంట్‌ మెథడాలజీలో కనీస పరిజ్ఞానం అవసరం.
    కోర్సుల విషయానికొస్తే..
    సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీలను సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్, ఎథికల్‌ హ్యాకర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్, క్లౌడ్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్, సైబర్‌ ప్రో ట్రాక్‌ల్లో మీ అవసరానికి తగినట్లుగా ఎంచుకోండి. పైన చెప్పిన విభాగాల్లో శిక్షణానంతరం సైబర్‌ సెక్యూరిటీ రంగంలో నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఇంజినీర్, సైబర్‌ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్, సైబర్‌ సెక్యూరిటీ మేనేజర్, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అనలిస్ట్‌ లాంటి ఉద్యోగాల్లో స్థిరపడొచ్చు.
    - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌. అశోక్‌

    Ans:

    సీఎస్‌ఐఆర్‌ / యూజీసీ నెట్‌ (లైఫ్‌సైన్సెస్‌) పరీక్ష కోసం ఎకాలజీ (పీటర్‌ స్టిలింగ్‌), ప్లాంట్‌ ఫిజియాలజీ (టైజ్, జైగర్‌), మాలిక్యులర్‌ అండ్‌ సెల్‌ బయాలజీ (హార్వే లోడిష్‌), జెనెటిక్స్‌ (బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌), మాలిక్యులర్‌ బయాలజీ (కార్ప్స్‌), ఇమ్యునాలజీ (ఇవాన్‌ రోట్టిస్‌), ఇమ్యునాలజీ (క్యూబీ), బయోకెమిస్ట్రీ (లెహింగర్‌), బయోకెమిస్ట్రీ (వోట్‌), బయోకెమిస్ట్రీ (స్ట్రైయర్‌), డెవలప్‌మెంటల్‌ బయాలజీ (గిల్బర్ట్‌) పుస్తకాలను చదవండి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నపత్ర నమూనాను పూర్తిగా అర్థం చేసుకోండి. ప్రతి విభాగానికీ నిర్దిష్ట సంఖ్యలో ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ అధ్యయనం చేయండి. పైన చెప్పిన పుస్తకాల నుంచి ఆసక్తి ఉన్న విభాగాల్లో మాదిరి ప్రశ్నలు, సమాధానాలు తయారుచేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం సంసిద్ధులు కండి. రుణాత్మక మార్కులుంటాయి కాబట్టి కచ్చితంగా జవాబులు తెలిసిన ప్రశ్నలనే రాయండి.సీఎస్‌ఐఆర్‌ / యూజీసీ నెట్‌కు రోజుకు 6 గంటలు చొప్పున కనీసం 6నెలలు నిరాటంకంగా చదివితే అనుకూల ఫలితం సొంతమవుతుంది.- ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కె. చంద్రశేఖర్‌

    Ans:

    ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది విద్యార్ధులు మంచి ఉద్యోగం పొందడం ఎలా అనే ఆలోచిస్తున్నారు తప్ప తామే ఒక సంస్థను ప్రారంభించి పదిమందికీ ఉద్యోగాలు కల్పించాలని అనుకోవట్లేదు. అతి తక్కువమంది మాత్రమే ఈ దిశలో ఆలోచిస్తున్నారు. కంపెనీ (సంస్థ) స్థాపించి ఉపాధి కల్పించాలనే మీ ఆశయం అభినందనీయం. ఒక కంపెనీ స్థాపించి దాన్ని విజయవంతంగా నడిపించాలంటే ప్రేరణ, అభిరుచి, స్వీయ క్రమశిక్షణ, రిస్క్‌ తీసుకోగల సామర్ధ్యం, సృజనాత్మక ఆలోచనలు, పట్టుదల, ప్రణాళిక, నిరంతర అధ్యయనం లాంటి లక్షణాలుండాలి.

    మొదటిగా ఏ రంగంలో అడుగు పెట్టాలో స్పష్టత ఉండాలి. ఒకప్పటి లాగా బ్యాంకుల చుట్టూ మూలధనం గురించి తిరగవలసిన పని లేదు. మీ ఆలోచన నచ్చి, అది లాభసాటిగా ఉందనుకుంటే ఏంజిల్‌ ఇన్వెస్టర్స్, క్రౌడ్‌ ఫండింగ్‌ లాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సంస్థను స్థాపించడం, దాన్ని లాభాల బాట పట్టించడం అనేది కోర్సుల ద్వారా మాత్రమే నేర్చుకునేది కాదు. కానీ కోర్సులు చదవితే కంపెనీ వ్యవస్థాపకుడికి కావలసిన విషయ పరిజ్ఞానాన్ని పొందవచ్చు.

    ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో కోర్సుల విషయానికొస్తే ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, అహ్మదాబాద్‌ వారు రెండు సంవత్సరాల పీజీ కోర్సు అందిస్తున్నారు. ప్రముఖ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో (ఐఐఎం, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఐటీ మేనేజ్‌మెంట్‌ స్కూల్స్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల బిజినెస్‌ స్కూల్స్, నార్సీమోంజి, సింబయాసిస్, ఎండీఐ, నిర్మా మొదలైనవి) రెండు సంవత్సరాల పీజీ చేస్తూ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సబ్జెక్టును ఐచ్ఛికంగా ఎంచుకొని కంపెనీ (సంస్థ) స్ధాపించడానికి కావలసిన మెలకువలు నేర్చుకోండి. అవకాశం ఉంటే రెండు, మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసి సొంతంగా ఒక సంస్థను ప్రారంభించొచ్చు.

    నేషనల్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైసెస్, హైదరాబాద్‌ వారు కూడా ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో వివిధ శిక్షణ ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, హైదరాబాద్‌ వారు స్వల్పకాలిక కోర్సులను అందిస్తున్నారు. ఇవే కాకుండా చాలా విశ్వవిద్యాలయాల ఆంత్రప్రెన్యూర్‌షిప్‌  విభాగాలు కూడా ఈ రంగంలో శిక్షణ తరగతులు, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఇంక్యుబేటర్‌లనూ, హబ్‌లనూ ప్రారంభించాయి. ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌లను అందుబాటులో ఉంచాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని కంపెనీని స్థాపించాలన్న మీ కలను సాకారం చేసుకోండి.
    - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎల్‌. సాయికుమార్‌

    Ans:

    జావా ఆధారిత అప్లికేషన్‌ల డిజైన్, డెవలప్‌మెంట్, నిర్వహణల బాధ్యత చూసేవారిని జావా డెవలపర్‌ అంటారు. జావా డెవలప్‌మెంట్‌లో కెరియర్‌ని ఎంచుకోవాలంటే బేసిక్‌ జావా, అడ్వాన్స్‌డ్‌ జావా ప్రోగ్రామింగ్‌ సంపూర్ణంగా నేర్చుకోవాలి. దీనిలో ఉద్యోగం సంపాదించాలంటే  జావా సర్వర్‌ పేజెస్‌ అండ్‌ సర్వ్‌లెట్స్, వెబ్‌ ఫ్రేమ్‌ వర్క్స్, సర్వీస్‌ ఓరియంటెడ్‌ ఆర్కిటెక్చర్‌/ వెబ్‌ సర్వీసెస్‌ హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ లాంటి వెబ్‌ టెక్నాలజీలు, ఎక్స్‌ఎంఎల్, జేఎస్‌ఓఎన్‌ లాంటి మార్క్‌ అప్‌ లాంగ్వేజెస్, ఆబ్జెక్టివ్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ లాంటి ప్రాధమిక నైపుణ్యాలు అవసరం.
    వీటితో పాటు అడ్వాన్స్‌డ్‌ నైపుణ్యాలైన ఏఐ అండ్‌ మెషిన్‌ లర్నింగ్, బ్లాక్‌ చెయిన్, పైతాన్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, హడూప్, బిగ్‌ డేటా, మొబైల్‌ టెక్నాలజీస్, అడ్వాన్స్‌డ్‌ జావా స్క్రిప్ట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ అయిన యాంగ్యులర్, రియాక్ట్‌లతో పాటు స్ప్రింగ్‌ బూట్‌/మైక్రో సర్వీసెస్‌లో అవగాహన ఉంటే మంచి జావా డెవలపర్‌గా రాణిస్తారు.
    జావాతో పాటు MySQL లాంటి డేటా బేస్‌ లాంగ్వేజ్‌ కూడా నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. జావా ప్రోగ్రామింగ్‌పై పూర్తి పరిజ్ఞానానికి పైన చెప్పిన నైపుణ్యాలు కూడా తోడైతే జావా డెవలపర్‌గా, అప్లికేషన్‌ డెవలపర్‌ జావాగా, పైతాన్‌ డెవలపర్‌ గా, జావా ప్రోగ్రామర్‌ అనలిస్ట్‌గా, జావా ఆర్కిటెక్ట్‌గా ప్రముఖ సాఫ్ట్‌వేర్‌/ వ్యాపార సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనంతో మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు.
    - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ. లక్ష్మారెడ్డి

    Ans:

    పదో తరగతి విద్యార్హతతో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జనరల్‌ డ్యూటీ, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో గ్రామీణ్‌ డాక్‌ సేవక్, భారత రైల్వేలో హెల్పర్, భారత సైన్యంలో, వైమానిక దళం, నౌకా దళం, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లలో, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ రంగ సంసల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, హాస్పిటల్స్‌లో అటెండర్‌ లాంటి ఉద్యోగాలతో పాటు ఆర్‌టీసీలో బస్‌ కండక్టర్‌ ఉద్యోగాలకు కూడా టెన్త్‌ సరిపోతుంది. ఈ అర్హతతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే ప్రభుత్వ వాహనాల డ్రైవర్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. ఇటీవలికాలంలో పైన చెప్పిన ఉద్యోగాలను చాలావరకు పొరుగు సేవల ద్వారా తాత్కాలికంగా ఒప్పంద పద్ధతిలో నియమిస్తున్నారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ఇంటర్మీడియట్‌ విద్యార్హత. పదో తరగతి తరువాత ఐటీఐ కానీ, పాలిటెక్నిక్‌ కానీ, ఇంటర్మీడియట్‌ కానీ, డిగ్రీ కానీ చదివితే మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులవుతారు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. అమూల్య.

    Ans:

    చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ)ను ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎంఏ) అందిస్తోంది. సీఎంఏ, సీఏ రెండూ ప్రొఫెషనల్‌ కోర్సులే. ఇవి ఫైనాన్స్, అకౌంటింగ్‌కు సంబధించిన రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తాయి. సీఏ కోర్సు అకౌంటింగ్, టాక్సేషన్, ఆడిటింగ్‌ రంగాల్లో అవకాశాలు కల్పిస్తే, సీఎంఏ కోర్సు కాస్టింగ్, అకౌంటింగ్‌లో అవకాశాలను అందిస్తుంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు రెండు కోర్సులకూ సమాన ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రైవేటు, బహుళజాతి సంస్థలు ఈ రెండు కోర్సుల్లోనూ ఉపాధిని కల్పిస్తున్నాయి. సొంతంగా ప్రాక్టీస్‌ చేయదలిస్తే సీఏ కోర్సు పూర్తిచేసినవారికి కాస్త ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ కోర్సులను పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇన్‌కమ్‌ టాక్స్, ఆడిట్‌ విభాగాల్లో కూడా ఉద్యోగాలున్నాయి. ఈ రెండు కోర్సుల్లో దాదాపుగా 80 శాతం సిలబస్‌ సమానం కాబట్టి ఒకే సన్నద్ధతతో రెండూ పూర్తి చేసుకోవచ్చు. ఈ రెండు కోర్సులతోపాటు కంపెనీ సెక్రటరీ కోర్సును కూడా పరిగణనలోకి తీసుకుని, ఈ మూడింటిలో ఏవైనా రెండు పూర్తి చేస్తే భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌
     

    Asked By: సుమాంజలి

    Ans:

    మీరు సీఏ ఇంటర్మీడియట్‌ పరీక్షకు సిద్దమవుతున్నారు కాబట్టి సీఏ ఫైనల్‌ పూర్తయ్యేవరకు ఎలాంటి ఉద్యోగ ఆలోచనలూ లేకుండా శ్రద్ధతో చదివి సీఏ ఫైనల్‌ని విజయవంతంగా పూర్తి చేయండి. ఒకవేళ మీరు సీఏ ఇంటర్మీడియట్‌తోనే చదువు ఆపేయాలనుకొంటే, దాంతో పాటు డిస్టెన్స్‌ లేదా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీ కామ్‌ డిగ్రీనీ పూర్తిచేయండి. ఇటీవలే యూజీసీ వారు సీఏ (ఫైనల్‌)ని పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీకి సమానంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు ఉద్యోగమార్కెట్‌లో సీఏ ఇంటర్మీడియట్‌ని అనధికారికంగా గ్రాడ్యుయేషన్‌కు సమానంగా గుర్తిస్తున్నారు. అధికారికంగా మాత్రం ఎలాంటి ఉత్తర్వులూ లేవు. ప్రభుత్వరంగ బ్యాంకులతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ సీఏ ఫైనల్‌ పూర్తిచేయడం కనీస అర్హత. మీరు సీఏ ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తరువాత, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా ఆరు సబ్జెక్టులు పూర్తిచేసి బీకామ్‌ డిగ్రీని పొందవచ్చు. సీఏ పూర్తి చేశాక ప్రభుత్వరంగ సంస్థల్లో, బ్యాంకుల్లో, బహుళజాతి, అంతర్జాతీయ సంస్థల్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు పొందవచ్చు. సీఏ ఇంటర్‌తో కూడా మీరు చాలా ప్రైవేటు రంగ సంస్థల్లో,  ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలకు అర్హులవుతారు. సీఏతో పాటుగా జి.ఎస్‌.టి., ఈఆర్‌పీ, వివిధ దేశాల టాక్స్‌ సిస్టమ్‌ల్లో ప్రత్యేక శిక్షణ పొందితే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. త్రివేణి

    Ans:

    బీఎస్‌సీ (బీజడ్‌సీ) చదివిన తరువాత బోటనీ/ జువాలజీ/ కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ జెనెటిక్స్‌/ మైక్రో బయాలజీ/ బయో ఇన్ఫర్మాటిక్స్‌/ ఇమ్యునాలజీలో పీజీ చేసి పరిశోధన వైపు వెళ్ళవచ్చు. ముందుగా మీరు ఏ సబ్జెక్టులో పీజీ చేయాలనుకొంటున్నారో, ఏ యూనివర్సిటీలో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకోవాలి. ఎంచుకున్న యూనివర్సిటీల వెబ్‌సైట్ల ద్వారా ప్రవేశ పరీక్షల వివరాలను తెలుసుకోవాలి. సాధారణంగా అన్ని విశ్వవిద్యాలయాలూ ప్రవేశ పరీక్షల ద్వారానే ప్రవేశాలను పూర్తి చేస్తున్నాయి. ఆయా విశ్వవిద్యాలయాల గత సంవత్సర ప్రవేశ పరీక్షల పరీక్షపత్రాలను పరిశీలించి పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోండి. పీజీ పూర్తి చేశాక, యూజీసీ- సీఎస్‌ఐఆర్‌ నిర్వహించే జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌/ నెట్‌లో కానీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్‌ పరీక్షలో కానీ ఉత్తీర్ణత సాధించాలి. ఏదైనా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలో ప్రవేశం పొంది, పరిశోధన చేయండి. పీహెచ్‌డీ తర్వాత ఇంకా పరిశోధన కొనసాగించాలనుకొంటే, విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో పోస్ట్‌ డాక్టొరల్‌ రిసెర్చ్‌ని కూడా చేయవచ్చు. కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఐదు  సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సునూ అందిస్తునాయి. మీకు ఆసక్తి ఉంటే ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను సందర్శించి మరిన్ని వివరాలను తెలుసుకోండి. - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. కోటేశ్వర్, ఆదిలాబాద్‌

    Ans:

    పర్యావరణ శాస్త్రం (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌)లో పీజీ చదవాలనే మీ నిర్ణయం అభినందనీయం. మీరు ఈ కోర్సు చదవడానికి అర్హులే. దీన్ని మన దేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, కాకతీయ, శ్రీవేంకటేశ్వర, ఆంధ్ర, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంది. దూరవిద్య ద్వారా కూడా చదవవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ యూనివర్సిటీ, డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలు మాత్రమే ఎంఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సును దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. రెగ్యులర్‌గా చదవడానికి ఆయా యూనివర్సిటీల ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం పొందవచ్చు. దూరవిద్యలో చదవాలనుకుంటే ఆ విశ్వవిద్యాలయాల ప్రవేశ ప్రకటన వెలువడినపుడు దరఖాస్తు చేసి ప్రవేశం పొందవచ్చు.
    ఎంఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో బోటనీ, ఎకాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, జాగ్రఫీ, పర్యావరణం, వాతావరణం లాంటివి బోధిస్తారు. ఈ కోర్సు చదివినవారికి ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెంట్‌గా, ఎన్విరాన్‌మెంటల్‌ అటార్నీగా, సస్టెయినబిలిటీ స్పెషలిస్ట్‌గా, ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్ట్‌గా, పొల్యూషన్‌ కంట్రోల్‌ నిపుణుడిగా, పర్యావరణ విధాన నిపుణుడిగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల్లో ఉపాధి అవకాశాలున్నాయి. ఈ కోర్సుకు విదేశాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇదే సబ్జెక్టులో పీహెచ్‌డీ చేసి బోధన రంగంలో ఉపాధి పొందవచ్చు. -
    ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: బి. పూజిత

    Ans:

    ఎంఏ ఇంగ్లిష్‌ చదివిన తరువాత ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నవారికి ఇంగ్లిష్‌ బోధించే అధ్యాపకులుగా ఉద్యోగం పొందవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్‌లో కానీ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్లెట్‌లో కానీ ఉత్తీర్ణత సాధించి, డిగ్రీ చదువుతున్న వారికి ఆంగ్లం బోధించే అధ్యాపకులుగా ఉద్యోగం పొందవచ్చు. ఏదైనా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి యూనివర్సిటీలో అధ్యాపకులుగా చేరవచ్చు. ఎంఏ ఇంగ్లిష్‌ చదివాక బీఈడీ చేసి కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టవచ్చు. భాషపై మంచి పట్టు సాధించి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ సంస్థల్లో బోధకునిగా స్థ్టిరపడవచ్చు, లేదా స్వయంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ సంస్థను ప్రారంభించవచ్చు. ఆంగ్లంతో పాటు మరో భాషలో ప్రావీణ్యం సంపాదించి అనువాదకులుగా స్థిరపడవచ్చు. మీ భాషాజ్ఞానానికి సృజనాత్మకత తోడైతే వాణిజ్య ప్రకటనల రంగంలో కంటెంట్‌ రైటర్‌గా మంచి అవకాశాలుంటాయి. విదేశాల్లోనూ ఇంగ్లిష్‌ భాష బోధించడానికి చాలా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ప్రచురణ, పత్రికా రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. టెక్నికల్‌ రైటర్‌గా, కంటెంట్‌ రైటర్‌గా, స్టూడెంట్‌ కౌన్సిలర్‌గా కూడా విధులు నిర్వర్తించవచ్చు.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌