• facebook
  • whatsapp
  • telegram

Dost notification: దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

డిగ్రీ కళాశాలల్లో 4,49,449 సీట్ల భర్తీ

ఆరో తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి మే 3న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దీనిని విడుదల చేశారు. మొత్తం 1,066 డిగ్రీ కళాశాలల్లో 4,49,449 సీట్ల భర్తీకి తొలిదశ రిజిస్ట్రేషన్లు మే 6న ప్రారంభమై 3 విడతల్లో కొనసాగుతాయని, జులై 8 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైనవారు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం తమ హాల్‌టికెట్‌ నంబర్‌తో దోస్త్‌ వెబ్‌సైట్‌ https://dost.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తారు.


మూడు దశల్లో సీట్ల కేటాయింపు

డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి తొలిదశ రిజిస్ట్రేషన్లు మే 6వ తేదీన ప్రారంభమై 25 వరకు కొనసాగుతాయి. రూ.200 రుసుం చెల్లించి విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మే 15 నుంచి 27 వరకు వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలి. జూన్‌ 3న దోస్త్‌ మొదటి దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్‌ 4-10 మధ్యలో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలి.

రెండో దశ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 4 నుంచి జూన్‌ 13 వరకు నిర్వహిస్తారు. రూ.400 రుసుంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. జూన్‌ 4 నుంచి జూన్‌ 14 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశముంటుంది. జూన్‌ 18న సీట్ల కేటాయింపు జరుపుతారు. జూన్‌ 19-24 మధ్యలో కళాశాలల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలి.

మూడో దశ రిజిస్ట్రేషన్లు జూన్‌ 19 నుంచి 25 వరకు జరగనున్నాయి. రూ.400 రుసుంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. జూన్‌ 19 నుంచి 25 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశమిస్తారు. జూన్‌ 29న మూడోదశ సీట్ల కేటాయింపు జరుపుతారు. జూన్‌ 29-జులై 3 మధ్యలో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలి.

జూన్‌ 29-జులై 5 మధ్యలో డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులంతా కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి. జులై 1 నుంచి కళాశాలల్లో పునరుశ్చరన జరుగుతుంది. జులై 8 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభించనున్నారు.



డిగ్రీ కోర్సులకు పెరిగిన ఆదరణ

డిగ్రీ కోర్సులకు ఇంజినీరింగు కోర్సులతో సమానాదరణ లభిస్తోందని, ఉపాధి అవకాశాలు ముమ్మరంగా కల్పించేందుకు కొత్త కోర్సుల ప్రారంభానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బుర్రా వెంకటేశం తెలిపారు.



అందుబాటులో కొత్త డిగ్రీ కోర్సులు

ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాలతో పాటు టీఎస్‌బీటీఈటీ పరిధిలోని డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో బీఏ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, డీఫార్మసీ, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌ కోర్సులు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి బీకాం ఫైనాన్స్‌తో పాటు బీఎస్సీ బయో మెడికల్‌ సైన్స్‌, బీఏ స్పెషల్‌, బీఏ పబ్లిక్‌ పాలసీ వంటి కొత్త కోర్సులు రానున్నాయి.



     నోటిఫికేషన్‌    


 


Some more information

   "From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.